రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, నవంబర్ 2021, మంగళవారం

1074 : రివ్యూ


 రచన- దర్శకత్వం : టీజే జ్ఞానవేల్
తారాగణం సూర్య, ప్రకాష్ రాజ్, రావు రమేష్,, మణికంఠన్, జీషా విజయన్, లిజోమోల్ జోసీ తదితరులు.
సంగీతం: సీన్ రోల్డన్, ఛాయాగ్రహణం : ఎస్ ఆర్ కదీర్
బ్యానర్: 2డి ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సూర్య, జ్యోతిక
విడుదల :  నవంబర్ 2,  2021, అమెజాన్ ప్రైమ్

***

         సంవత్సరం లాక్ డౌన్ పరిస్థితుల్లో సూర్య సూరరై పొట్రు తో ఓటీటీ ప్లాట్ ఫామ్ కెళ్ళింతర్వాత, ఈ సంవత్సరం లాక్ డౌన్ లేకపోయినా తర్వాతి సినిమా జై భీమ్ తోనూ తిరిగి ఓటీటీకే వెళ్ళడం ఓ టాపిక్ గా వుంది తమిళనాడులో. వెంట వెంటనే ఈ రెండూ నిజవ్యక్తుల మీద తీసిన సినిమాలు కావడం ఇంకా హాట్ టాపిక్ అయింది. జై భీమ్ ని తనూ జ్యోతిక కలిసి నిర్మించడం ఇంకో టాపిక్. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ కాదు. టైటిల్ ని బట్టే సామాజిక వాస్తవిక కథా చిత్రమని అర్ధమవుతోంది. స్టార్ గా ఇలాటి సమాంతర సినిమా బాధ్యతలు మీదేసుకుని నిర్మించడం- అందులోనూ ఓటీటీ ద్వారా తమిళ తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో అందించడం, సూర్య తన స్టార్ డమ్ ని పునర్నిర్వచించుకుంటున్న వైనాన్ని తెలుపుతోంది.

        స్టార్లు సామాజిక బాధ్యత ఫీలైనప్పుడే జై భీమ్ లాంటి రియలిస్టిక్ ప్రయత్నాలు సవినయంగా చేస్తారు- కాసేపు ఫ్యాన్స్ కోరికల్ని పక్కన బెట్టి. ఈ దీపావళికే రేపు 4వ తారీఖున సూపర్ స్టార్ రజనీకాంత్ పండగ కుటుంబ సినిమా అన్నాతే (పెద్దన్న) తో థియేటర్ల మీద దండెత్తుతూంటే, తనేమో సూర్య ఇంటి పట్టునే ముందు జై భీమ్ చూసుకుని వెళ్ళమన్నట్టు ఓటీటీ లోంచి పిలుపు నిస్తున్నాడు. కానీ ఇది పండగ మూడ్ కి వ్యతిరేకమైన చాలా సీరియస్ సినిమా. దీన్ని చూడాలంటే మనసు రాయి చేసుకోవాలి. పండగంటే మన ఆనందాలే కాదు, ఇతరుల ఆక్రందనలు కూడా. రెండూ అనుభవించాలి. ఏమిటా ఆక్రందనలు? ఎవరివా ఆక్రందనలు? ఓసారి చూసి వద్దాం... 

కథ

     ఓ గిరిజన ప్రాంతంలో రాజన్న (మణికందన్) పాములు పట్టే వాడుగా వుంటాడు. ఒక రోజు వూళ్ళో రాజకీయనాయకుడి ఇంట్లో పాము జొరబడితే వెళ్ళి పట్టుకుంటాడు. రాజన్న భార్య చిన్నతల్లి (లీజోమోల్ జోసీ) తో, ఓ కూతురితో ఆనందంగా గడుపుతూంటాడు. ఇంతలో రాజకీయ నాయకుడి ఇంట్లో నగలు పోయాయని కంప్లెయింట్ వస్తే, ఆ రోజు పాము పట్టడానికి వచ్చిన రాజన్నే ఈ పనిచేసి వుంటాడని పట్టుకెళ్ళి కొడతారు పోలీసులు. తనకి తెలియదన్నా విపరీతంగా కొట్టి గాయపరుస్తారు. రాజన్న కోసం భార్య వస్తే తప్పించుకుని పారిపోయాడని చెప్తారు. ఇక దిక్కు తోచని చిన్నతల్లి నాల్గు చోట్ల చెప్పుకుని, ఎక్కడా లాభం లేక లాయర్ చంద్రు (సూర్య) దగ్గరి కెళ్తుంది. కేసు సానుభూతితో విన్న చంద్రు, హైకోర్టులో రాజన్న ఆచూకీ గురించి హేబియస్ కార్పస్ కేసు వేస్తాడు.

        ఇప్పుడీ కేసు సీరియస్ గా చేపట్టిన చంద్రుకి రాజకీయంగా ఎలాటి సవాళ్ళు ఎదురయ్యాయి? కేసు వాపసు తీసుకోవాలని చిన్న తల్లి మీద పోలీసులు ఎలాటి కుట్రలు చేశారు? అసలు రాజన్న ఏమయ్యాడు? ఈ కేసులో చంద్రు న్యాయం సాధించగల్గాడా? ఏ ఏ వృత్తి నైపుణ్యాలు ప్రయోగించి గెలిచాడు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ.

ఎలావుంది కథ

      తమిళనాడు కడలూర్ జిల్లాలో బుట్టలు అల్లే కురుంబర్ గిరిజన తెగకి చెందిన 4 కుటుంబాలు ఇరవై ఏళ్ళకి పైగా అక్కడ నివాసముండేవి. ఆ కుటుంబాల్లో రాజకన్ను  కుటుంబం ఒకటి. వీరు పంట కోతల సమయంలో చుట్టు పక్కల పొలాల్లో కూలీకి వెళ్ళే వాళ్ళు. ఇలా వుండగా, 1993 లో ఓ రోజు గోపాల పురం అనే వూరికి కూలీ కెళ్ళారు. అక్కడ కూలీ పూర్తి చేసుకుని డబ్బులూ ధాన్యాలతో తిరిగొచ్చేశారు. ఇంతలో ఆ వూళ్ళో ఒకింట్లో నగలు దొంగతనం జరిగాయని పోలీసులకి ఫిర్యాదు అందింది. పోలీసులు రాజకన్నుని పట్టుకెళ్ళి దొంగతనం మోపి చిత్రహింసలు పెట్టారు. రాజకన్ను భార్య పోలీస్ స్టేషన్ కెళ్ళి అడిగితే, తప్పించుకుని పారిపోయాడని చెప్పారు.

        దీన్ని నమ్మని ఆమె పై పోలీసు అధికారుల్నీ, కలెక్టర్నీ కూడా కలిసింది. ఫలితం లేకపోవడంతో కమ్యూనిస్టు పార్టీ నాశ్రయించింది. రాజకన్నుని పోలీసులే కొట్టి చంపేశారని కమ్యూనిస్టు పార్టీ ఆందోళన చేపట్టింది. ఇది కూడా నిష్ఫలమవడంతో లాయర్ చంద్రు సాయం చేస్తాడని చెప్పారు పార్టీ నేతలు. రాజకన్ను భార్య లాయర్ చంద్రుని కలిసి చెప్పుకుంది. అతను హైకోర్టు లాయర్. మానవ హక్కుల కేసుల్ని ఫీజులు తీసుకోకుండా వాదిస్తాడు.

        చంద్రు హేబియస్ కార్పస్ కేసు వేయడంతో విచారణ చేపట్టిన హైకోర్టు, మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. బాధితురాలి కుటుంబానికి 3 సెంట్ల భూమి, 2.65 లక్షల నగదు తాత్కాలిక సాయంగా అందించాలని.  తర్వాత హైకోర్టు ఆదేశాలందుకుని దర్యాప్తుకి దిగిన పోలీసులు ఒక పడవలో దొరికిన మృతదేహం రాజకన్నుతో సరిపోలడాన్ని రిపోర్టు చేశారు. దీంతో రాజకన్ను అదృశ్య కేసు హత్య కేసు గా నమోదై తాజాగా విచారణ కొనసాగింది. చిట్టచివరికి 13 ఏళ్ళ తర్వాత 2006 లో, కడలూర్ కోర్టులోనూ, ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనూ విచారణ పూర్తయి తీర్పు వెలువడింది. కేసులో మొత్తం 12 మందిని దోషులుగా నిర్ధారించారు. అందులో డిఎస్పీ, ఇన్స్ పెక్టర్, అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్, ఒక డాక్టర్ కూడా వున్నారు. వీళ్ళందరికీ జైలు శిక్షలు పడ్డాయి. రాజకీయ పార్టీల నుంచి అనేక బెదిరింపులూ వేధింపులూ ఎదుర్కొంటూనే కేసు పోరాడి విజయం సాధించాడు లాయర్ చంద్రు. అతను ప్రస్తుతం రిటైర్డ్ హైకోర్టు జడ్జి. 75 ఏళ్ళ రాజకన్ను  భార్య జీవించే వుంది.

        ఈ ఉదంతమంతా కొన్ని మార్పులతో  జైభీమ్ కథగా తెరకెక్కింది. ఇది 2016 లో వెట్రిమారన్ టెర్రిఫిక్ తీసిన విశారనై ని గుర్తు చేస్తుంది. ఇది కూడా మానవ హక్కుల ఉల్లంఘన కేసు ఆధారంగానే తీశారు. 1983 లో గుంటూరులో నల్గురు తమిళనాడు వలస కూలీల్ని దొంగతనం కేసులో ఇరికించి పోలీసులు చిత్ర హింసలు పెడుతూంటే, దీని వెనుకున్న కొన్ని రాజకీయ రహస్యాలు బయట పడకూడదని, చెన్నై పోలీసులు వాళ్ళని పట్టుకెళ్ళి లాకప్ డెత్తులూ, ఎన్కౌంటర్లూ చేసి చేతులు దులుపు కున్నారు.

        ఈ నిజ కథా చిత్రం కూడా మానవ హక్కుల దుస్థితిని దృశ్యీకరిస్తుంది. విశారనై’, జై భీమ్ రెండిట్లోనూ బాధితులు ఏ దిక్కూ లేని బడుగు జనాలే. న్యాయం కోసం వాళ్ళు చేసే ఆక్రందనలే. వీళ్ళతో ముందూ వెనుకా చూడకుండా పోలీసులు పాల్పడే అకృత్యాలే. ఏ దోలా డ్యూటీ పూర్తవడానికి ఈజీ టార్గెట్లు గా కన్పించే వీళ్ళని నిలువునా బలి చేయడాలే. ఇలా పోలీసులు పాల్పడే  మానవ హక్కుల ఉల్లంఘనల మీద అనేక సినిమాలు వివిధ భాషల్లో వచ్చి వుంటాయి. కానీ విశారనై అంత పచ్చిగా ఇంకోటి రావడం ఇప్పుడు  జై భీమ్ రూపంలోనే. చాలా పచ్చిగా, గగుర్పాటు కల్గించేదిగా. పోలీసు రెండో ముఖాన్నినిర్మొహమాటంగా విప్పి చూపించే వాస్తవిక సినిమాలివి. దేశంలో ఇంకెవరూ  ప్రయత్నించని స్థాయిలో ఈ రెండు పచ్చి వాస్తవికాలు తమిళంలోనే ప్రయోజనాత్మకంగా వచ్చాయి.

        విశారనై తో లాగే జై భీమ్ తో కూడా పోలీసులేం నీతి తెలుసుకుంటారో గానీ- ఎవరో రాజకీయ నాయకుల కోసం ఇలాటి దుశ్చర్యలకి పాల్పడితే - ఆ రాజకీయనాయకులే దృశ్యంలోకే రాకుండా, కేసుతో సంబంధం లేకుండా ఎక్కడో వుంటారు- పోలీసులు కటకటాల వెనక్కి వెళ్ళి ఏడ్వడమే.

         విశారనై కి  మూడు జాతీయ అవార్డులు లభించడంతో బాటు, ఆస్కార్ అవార్డులకి ఎంపిక కూడా అయి సంచలనం సృష్టించింది. అయితే హద్దుల్లేని హింస చూపించిన కారణంగా ఆస్కార్ నామినేషన్ కి నోచుకోకుండా ఎంపిక దగ్గరే ఆగిపోయింది. దేశంలో ఇంకే సినిమా చూపించనంత హింసతో పోలీసుల అకృత్యాల్ని చూపించాడు వెట్రిమారన్. వాస్తవంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన ఏ స్థాయిలో జరుగుతోందో నిజాన్ని ప్రజలకి తెలియజేయకపోతే ఈ కథల్లో సదరు బాధితులకి న్యాయం చేసినట్టవదు. ఈ కథల్లో  జరిగినట్టు ఎక్కడైనా ఎవరికైనా జరగవచ్చన్న హెచ్చరిక వీటిలో  ప్రధానంగా వుంది.

        ఆల్రెడీ ఇలాటి కథగా విశారనై వచ్చేశాక, తను చూపించిన తేడా ఏమిటనేది జైభీమ్ దర్శకుడు జ్ఞానవేల్ ముందుండే ప్రశ్న. దీనికి - అడవి మృగాల కంటే పట్టణ మనిషే గిరిజన జీవితాలకి అత్యంత ప్రమాదకరమని దీటైన సమాధానమిచ్చేలా విషయం చెప్పాడు. అయితే ఈ కథ కోర్టు రూమ్ డ్రామా జానర్ కావడంతో, సహజంగానే అలాటి టెంప్లెట్ రొటీన్ దృశ్యాల పరంపరకి లోనవక తప్పలేదు.

నటనలు- సాంకేతికాలు

   ‘సూరరై పొట్రు లో ఏర్ డెక్కన్ వ్యవస్థాపకుడు  కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ బయోపిక్ నటించిన సూర్య, ఈసారి నాటి లాయర్, నేటి రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రుగా నటించాడు. తన రెగ్యులర్ కమర్షియల్ హంగూ ఆర్భాటాలూ అన్నీ తీసి పక్కన పెట్టాడు. కెప్టెన్ గోపీనాథ్ గా నటించినప్పుడు మాత్రం అన్ని మసాలాలూ కలిపి రెగ్యులర్ సూర్య లాగే నటించాడు. లాయర్ చంద్రుగా నటనలో వ్యాపార ధోరణిని పక్కన పెట్టేసి, తనకో హీరోయిన్ వుండాలన్న ఆలోచనే చేయకుండా, మానవ హక్కుల కార్యకర్త పాత్ర అత్యంత సహజ ధోరణిలో పోషించాడు. బాధిత పాత్ర చిన్నతల్లి తో అతడి ఔదార్యం చూసినా, ఒక సమయంలో ఆగ్రహం చూసినా, అలాగే కోర్టు దృశ్యాల్లో వృత్తితత్వంతో కూడిన వాద ప్రతివాదాల ధోరణి చూసినా- నటుడిగా తనని తాను పరీక్షించుకునే అవకాశంగానే దీన్ని తీసుకున్నాడు. ఈ పరీక్ష సునాయాసంగా నెగ్గేశాడు.

        రెండో ముఖ్య పాత్ర చిన్నతల్లిగా లిజోమోల్ జోసీ ఒక వండర్. గిరిజనురాలి పాత్రలో రంగూ హంగూ అచ్చం సరిపోయి, ఆమె నటి అని చెప్తే తప్ప తేడా గుర్తించలేనంత ప్రాంతీయత కలగలిసిపోయి కనిపిస్తుంది. పాత్ర నిడివీ ఎక్కువే. సంఘర్షణా చూసినా సూర్య పాత్రతో సమానమే. ఆమె పాత్ర తీరుకి, న్యాయ పోరాటానికీ ముక్తాయింపుగా మట్టిలో తేమ వుంది, రేయికో వెన్నెలుంది అని అర్ధవంతమైన పాట రాశాడు కవి.

        ఇక ప్రకాష్ రాజ్, రావు రమేష్ పాత్రలు  రెండూ రెండు ధృవాలు. ప్రకాష్ రాజ్ సూర్యకి సహకరించే, హూందాగా మాట్లాడే  ఉన్నత పోలీసు అధికారైతే, రావు రమేష్ సూర్యని వ్యతిరేకించే, వ్యంగ్యంగా మాట్లాడే పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇద్దరూ ఈ వాస్తవిక సినిమాకి ఓ నిండుదనాన్ని తెచ్చారు.

        రాజన్నగా నటించిన మణికందన్ తప్పకుండా ఉత్తమ నటుడవుతాడు. తొలి సన్నివేశాలు వదిలేసి తర్వాత చూస్తే, ఎప్పుడు చూసినా పోలీస్ టార్చర్ తో గావు కేకలే. గావు కేకలేయడం కూడా నటనేనా అంటే, ఒక కేక ఇంకో కేకలా అన్పించకుండా వేయడం కష్టమైన నటనే. సూర్య లాయర్ పాత్ర అసిస్టెంట్ గా జీషా విజయన్ నటించింది. ఇంకా 205 మంది సహాయ నటీనటులున్నారు.

        సాంకేతికంగా 1990 లనాటి వాతావరణ సృష్టి ప్రదర్శిస్తున్నట్టుగాక, సన్నివేశాల్లో సంలీనమైపోయి వుంటుంది. కళాదర్శకత్వం కే కదీర్. టార్చర్, యాక్షన్ దృశ్యాల కొరియోగ్రాఫర్ అన్బీరవ్. ఛాయాగ్రహణం ఎస్ఆర్ కదీర్, సంగీతం సీన్ రోల్డన్ (కర్ణాటక సంగీత కారుడు రాఘవేంద్ర రాజా రావు), కూర్పు ఫీలోమిన్ రాజ్...వీళ్ళందరూ గిరిజన తత్వాన్ని యావత్తూ రంగరించేశారు. సూర్య స్టార్ హవా కోసం ఎక్కడా ప్రయత్నించ లేదు. కాకపోతే నిడివి రెండు గంటల 44 నిమిషాలు చాలా ఎక్కువ.

చివరికేమిటి


     మధ్య మధ్యలో బాధితుల ఫ్లాష్ బ్యాక్స్ తో, సాక్షుల మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో ఈ కథ నడిపారు. త్రీయాక్ట్స్ స్ట్రక్చర్లో కాల నియమాలు పాటిస్తూ వేగవంతమైన కథనం చేశారు. కాకపోతే మొత్తం కలిపి నిడివి ఎక్కువై పోయింది. మొదటి పాతిక నిమిషాలు సూర్య లేకున్నా, మణికందన్ పాత్రతో కాలమే తెలియనంత వేగంగా అడవిలో గిరిజన జీవన నేపథ్యాన్ని ఏర్పాటు చేసేసి, అతను అరెస్టయి, భార్య న్యాయ సహాయం కోసం సూర్య దగ్గరి కొచ్చే మొదటి మలుపు వరకూ లీనియర్ కథనమే నడుస్తుంది.

       ఏం జరిగిందో చెప్పు, ఎక్కువ చెప్పకు అని సూర్య ఆమెతో అనడంతో, ఆమె ఫ్లాష్ బ్యాక్ లో జరిగింది చెప్పుకొస్తుంది. ఎక్కువ చెప్పకు అని డైలాగు రాసి, ఎక్కువ కంటే ఎక్కువన్నర ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటూ వెళ్లిపోయాడు కథకుడు. ఎక్కువ చెప్పకు అని సూర్య కథకుడికి చెప్పి వుండాల్సింది. ఈ ఎక్కువ చెప్పడం వల్లే రెండు గంటల 44 నిమిషాలు పట్టింది. ఇది రియలిస్టిక్ సినిమా ధర్మం కాదు.

        ఈ ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ టార్చర్ చూపిన విధం రెగ్యులర్ మాస్ సినిమాల్లోలాగా లేదు. రెగ్యులర్ మాస్ సినిమాల్లో టార్చర్ ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక్కడ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఎవరైనా పోలీసులు ఈ టార్చర్ ఐడియాలు ఇచ్చారా అన్నట్టు షాకింగ్ గా వుంటాయి. దీని తర్వాత సూర్య హైకోర్టులో కేసు వేయడంతో మొదలవుతుంది కోర్టు రూమ్ డ్రామా. దీని ఆధారంగానే మిగతా సెకండాఫ్ కథ.

        కోర్టు రూమ్ డ్రామా టెంప్లెట్ తెలిసిందే. ఒక కోర్టు సీను, తర్వాత బయట ఒక రిలీఫ్ సీను, మళ్ళీ కోర్టు సీను, బయట ప్రత్యర్ధులతో ఒక యాక్షన్ సీను, మళ్ళీ కోర్టు సీను...ఇలా లోపలా బయటా సీన్లు నడుస్తూంటాయి. చూసి చూసి వున్న ఈ టెంప్లెట్ ని దర్శస్కుడు బ్రేక్ చేసి వుండాల్సింది.

        ఒక రిలీఫ్ సీన్లో చిన్నతల్లి భర్తతో తల్చుకునే రోమాంటిక్ సీను వేసి పాట కూడా పెట్టారు. ఈ కోర్టు రూమ్ డ్రామా మొదటి దశలో రాజన్న అదృశ్యం గురించే వాదోప వాదాలుంటాయి. సూర్య ఇన్వెస్టిగేషన్లో రాజన్న గురించి అసలు నిజం తెలియడం రెండో దశ. ఈ దశ కోర్టు రూమ్ డ్రామాలో మెడికల్ సాక్ష్యాల పరిశీలన వుంటుంది. తర్వాత పోలీసుల వాదనతో మూడో దశ వుంటుంది. ఈ దశలో సాక్షులుగా పోలీసులతో నడుస్తుంది. ఈ మొత్తం వాదోపవాదాల్లో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో రాజన్న అరెస్టు దగ్గర్నుంచీ చివరి వరకూ ఏమేం జరిగాయో దృశ్యాలు వస్తూంటాయి.

        మొత్తంగా చూస్తే ఇదొక  మిస్టరీ  కథ. మిస్టరీని తేల్చే లాజిక్స్, ఇల్లాజిక్స్ ల సంఘర్షణ. ఏకాగ్రతతో ఫాలో అయి చూస్తే వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. అంతర్లీనంగా న్యాయంకోసం ఆక్రందన ఈ ఇన్వెస్టిగేషన్ కథనానికి జీవం పోస్తుంది. అయితే చివర కోర్టు తీర్పూ, అందులో చేసిన వ్యాఖ్యలూ బలహీనంగా లేకుండా చూసుకోవాల్సింది. దర్శకుడు జ్ఞానవేల్ కి రచించి చిత్రీకరించడంలో రియలిస్టిక్ జానర్ మీద మంచి పట్టు వుందనేది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం. కొత్త దర్శకులు చాలా నేర్చుకోవచ్చు. తెలుగులో ఇలా తీస్తారో లేదో అనేది దేవుడెరుగు.

       

—సికిందర్   

 

30, అక్టోబర్ 2021, శనివారం

1073 : రివ్యూ

 

రచన - దర్శకత్వం : లక్ష్మీ సౌజన్య
తారాగణం : నాగశౌర్య
, రీతూ వర్మ, మురళీ శర్మ, నదియా, జయప్రకాష్, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు
సంగీతం : విశాల్ చంద్ర శేఖర్
, ఛాయాగ్రహణం : పి. వంశీ, విష్ణు శర్మ
బ్యానర్ : సితార ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ
విడుదల : అక్టోబర్ 29
, 2021

***

        కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్యతో నాగశౌర్య ప్రేమ కథతో దీపావళి ప్రేక్షకుల హృదయాల్లో కాకర పువ్వొత్తులు వెలిగించడానికి వచ్చాడు. పెళ్ళిచూపులు ఫేమ్ రీతూ వర్మ గ్లామర్ తోడయ్యింది. దీనికి పేరున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ తోడ్పాటునందించింది. ఇన్ని హంగులతో ఏమిటి కొత్త దర్శకురాలు అందిస్తున్న ప్రేమ కథ? ఇది చూద్దాం...

కథ

    ఫారిన్ నుంచి ఆకాష్ (నాగశౌర్య) హైదారాబాద్ వస్తాడు. అతను ఆర్కిటెక్ట్. హైదారాబాద్ లో భూమి (రీతూ వర్మ) ఒక స్టార్ట్ అప్ కంపెనీ నడుపుతూ వుంటుంది. ఆమె చాలా కఠినంగా వుంటుంది. ఎవరితోనూ సరిగా మాట్లాడదు. ఆమె కంపెనీకి ఆకాష్ డిజైన్ చేసి ఇస్తాడు. ఈ క్రమంలో ఆమెని ఆకర్షించాలని ప్రయత్నిస్తాడు. ప్రేమించాలనీ చూస్తాడు.  ఆమె ఇవేవీ ఒప్పుకోదు. ఆమె తల్లి (నదియా)మాత్రం సంబంధాలు చూస్తూంటుంది. భూమికి పెళ్ళి ఇష్టముండదు. కారణం చెప్పదు. ఇంతలో భూమి, ఆకాష్ లు విడిపోయే సంఘటన జరుగుతుంది. ఏమిటా సంఘటన? ఎందుకు విడిపోయారు? ఎలా కలుసుకున్నారు? ఇదీ మిగతా కథ...

ఎలావుంది కథ

    ప్రేమికులు విడిపోయి కలుసుకునే రోటీన్ తెలుగు ప్రేమ సినిమా కథ. ఒక మాటతో తేలిపోయే సమస్యకి సాగదీస్తూ పోయే కథ. అసలు చెప్పాలనుకున్న పాయింటేమిటంటే, తల్లిదండ్రులు కొడుకులకి పెళ్ళి చేసుకోవడానికి చాలినంత సమయమిస్తారు, అదే కూతుళ్ళ విషయంలో తొందర పెడతారెందుకు, మానసికంగా సిద్ధంగా వున్నారో లేదో తెలుసుకోరెందుకు - ఇదీ చెప్పాలనుకున్న పాయింటు, కథ.

        హీరోయిన్ తండ్రి (మురళీ శర్మ) ఈ పాయింటు రైజ్ చేయడానికి సెకండాఫ్ లో సగం వరకూ సమయం పట్టింది. అంటే సకాలంలో కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు కాని మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. ఇలా ఫస్టాఫ్ నుంచీ సెకండాఫ్ లో సగం వరకూ ఈ పాయింటు వచ్చే దాకా ఏమీ జరగదు, అంటే కథే మొదలు కాదు. ఈ పాయింటుతో కథ మొదలయ్యాక కూడా ఏం చేయాలో అర్ధంగాక, ఫ్లాష్ బ్యాక్, కామెడీ ట్రాక్, పాటలూ వంటి వాటిని భర్తీ చేశారు. కథ కాని, కథే లేని కథతో సినిమా తీసిన  దర్శకురాలి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమా కథా మూలాల గురించి నెట్లో రెండు టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున మన్మథుడు’, జగపతి బాబు ప్రవరాఖ్యుడు రెండూ కలిపితే వరుడు కావలెను కాలం చెల్లిన కథ అని.

నటనలు – సాంకేతికాలు
      పాత్ర నటించడం కంటే (నటించడానికి పాత్రలో ఏముందని) ఫ్యాషన్ పెరేడ్ చేస్తున్నట్టు స్టయిలిష్ కాస్ట్యూమ్స్ తో నాగశౌర్య చేసిన ప్రదర్శన దీపావళికి హోమ్లీగా, కనువిందుగా వుంది.  రీతూ వర్మ పాత్రకే కథ వుంది, దాంతో పాత్రకి కొంత బలమూ వుంది. మోస్ట్ ఎలిజిబుల్ బేచిలర్ లో పూజా హెగ్డే పాత్రకి లాగా. ఈ నేపథ్య బలంతో స్ట్రిక్టు ఆఫీసు బాస్ గా చక్కగా నటించింది. తల్లిగా నటించిన నదియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సెకండాఫ్ కామెడీ ట్రాకు నడిపించిన సప్తగిరి కథలేని సినిమాకి కాస్త దిక్కు. కానీ వెన్నెల కిషోర్ కామెడీ మోస్ట్ ఎలిజిబుల్ బేచిలర్ లో లాగే మరోసారి విఫలమైంది.

        ఈ సినిమాలో రెండు పాటలు క్యాచీగా వుంటూ హిట్టయ్యాయి. మిగిలిన పాటలు- దిగు దిగు నాథ తో పాటు ఏవరేజి. ఇక విజువల్స్, నిర్మాణ విలువలూ ఫ్రెష్ గా రోమాంటిక్ ఫీల్ ని సరఫరా చేసేలా వున్నాయి-  ఈ ఫీల్ కథా కథనాలతో లేకపోయినా. 

చివరికేమిటి

     పాతబడిన రొటీన్ కథ, అందులోనూ సెకండాఫ్ సగం వరకూ కథేమిటో  తెలియని కథ కాని కథ. ఫస్టాఫ్ ముప్పావుగంటా హీరోహీరోయిన్ల కలుసుకోవడాలు, ముచ్చట్లాడు కోవడాలూ తప్ప ఏమీ జరగని విసుగు. ఆ తర్వాత హీరోహీరోయిన్లు విడిపోవడమనే ఒక మలుపుతో రిలీఫ్ పొందినా, సెకండాఫ్ లో షరా మామూలే. కాలేజీ ఫ్లాష్ బ్యాక్ ఒక పెద్ద విఫలమైన సృజనాత్మకత. పైన చెప్పుకున్న అసలు పాయింటు వచ్చి మళ్ళీ మనకి హుషారు వచ్చినా, ఆ పాయింటు కూడా ఎటూ కదలక మొరాయించడం. సప్తగిరి వచ్చి కామెడీ ట్రాకుతో లేపడం. ఇంకెలాగో కథని ముగించడం. హుషారు తెప్పించేలా వుండాల్సిన ప్రేమ సినిమాలు ఇలా ఓల్డేజీ హోమ్ లో వున్నట్టు ఎందుకుంటున్నాయో ప్రశ్నించుకుంటే బావుంటుంది. దీనికి సినిమా సమీక్షకుడు గణేశ్ రావూరి మాటలు రాశాడు. కానీ ఫ్రెష్ గా వున్న మాటలు విషయం లేని  ఇంత పురాతన కథని ఏం ఆదుకుంటాయి.

—సికిందర్


29, అక్టోబర్ 2021, శుక్రవారం

1072 : రివ్యూ


దర్శకత్వం : అనిల్ పాదూరి
తారాగణం: ఆకాష్ పూరీ
, కేతికా శర్మ, రమ్యకృష్ణ, మకరంద్  దేశ్ పాండే, ఉత్తేజ్, సునైనా
రచన : పూరీ జగన్నాథ్
, సంగీతం : సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం : నరేష్
బ్యానర్స్ : జగన్నాథ్ టూరింగ్ టాకీస్
, పూరీ కనెక్ట్స్
నిర్మాతలు : పూరీ జగన్నాథ్
, ఛార్మీ
విడుదల : అక్టోబర్ 29
, 2021
***

        పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీని మళ్ళీ పూరీ లాంచ్ చేశారు. మూడేళ్ళ క్రితం మహెబూబా తో లాంచ్ చేస్తే వచ్చిన ఫలితం సరిపోక పోగా, ఇప్పుడు రోమాంటిక్ తో తిరిగి ఇంకో లవర్ బాయ్ గా కొడుకుని చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నానికి అనిల్ పాదూరి అనే కొత్త దర్శకుడికి అవకాశం కల్పించారు. ఆకాష్ పూరీలో నటుడున్నాడు. కానీ పూరీ మార్కు హీరో కాదు. తనేమిటో అతను సపరేట్ గా చూపించుకుంటే కనీసం మూడో లాంచింగ్ అయినా ఆకాశయానం చేస్తుంది. మరి ఈ రెండో లాంచింగ్ ఆకాశ మార్గం పట్టలేదా? ఎలా? చూద్దాం...

కథ

   గోవాలో వాస్కోడిగామా అలియాస్ వాస్కో (ఆకాష్ పూరీ) చిన్నప్పుడు పోలీస్ ఇన్స్ పెక్టరైన తండ్రి తో బాటు తల్లి గ్యాంగ్ వార్ లో చనిపోతే, నానమ్మ మేరీ (రమాప్రభ) పెంపకంలో పెరిగి రౌడీ అవుతాడు. ఇతడ్ని రోడ్రిగ్స్ అనే డ్రగ్ మాఫియా గ్యాంగ్ లో చేర్చుకుని ప్రత్యర్ధి శాంసన్ మీద దాడులకి ఉపయోగించుకుంటూ వుంటాడు. మరో వైపు వాస్కో ఇన్స్ పెక్టర్ జాన్ (ఉత్తేజ్) చెల్లెలు మోనికా (కేతికా శర్మా) ని పిచ్చిగా ప్రేమిస్తూ ఆమె వెంట పడతాడు.

        ఇలా వుండగా, రోడ్రిగ్స్ ని చంపేసి తనే మాఫియా లీడరవుతాడు వాస్కో. శాంసన్ డ్రగ్స్ కొట్టేసి రెచ్చగొడతాడు. ఒక ఇన్స్ పెక్టర్ని కాల్చి చంపేస్తాడు. దీంతో వాస్కోని పట్టుకోవడానికి ఏసీపీ రమ్యా గోవాల్కర్ (రమ్యకృష్ణ) వేట మొదలుపెడుతుంది. ఈమెనుంచి తప్పించుకుంటూ, మోనికా ప్రేమ కోసం ప్రయత్నిస్తూ, మరోవైపు పగబట్టిన శాంసన్ ని ఎదుర్కొంటూ  పోరాటం మొదలెట్టిన వాస్కో, చివరి కేమయ్యాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    కొడుకు ఆకాష్ ని ఇతర మాస్ యాక్షన్ హీరోలకి దీటుగా నిలబెట్టాలన్న వ్యూహంతో, బిగ్ హీరోలు చేయాల్సిన కథని ఆకాష్ లేత భుజాల మీద ప్రయోగాత్మకంగా మోపి చూశారు. ఇందులో నూటికి నూరు శాతం చతికిలబడ్డారు. ఈ ప్రయత్నంలో ఏదైనా ఫ్రెష్ యాక్షన్ కథైనా చూసుకోకుండా, ఇతర హీరోలతో తను ఎన్నోసార్లు వాడేసిన అదే ఔట్ డేటెడ్ మాఫియాల కథని రీసైక్లింగ్ చేసి, ఫ్రెష్ ఆకాష్ లేత రెక్కల మీదేసి ఆకాశంలోకి ఎగరేయాలని చూశారు. దీంతో రోమాంటిక్ టైటిల్ తాలూకు రోమాన్స్ కూడా జాడ లేకుండా పోయింది. అవసరానికి మించిన సాంగ్స్ లో మాత్రమే సెక్సీగా రోమాన్స్ మిగిలింది.

        ఈ గందరగోళంలో ప్రేమ గొప్పదా, మోహం గొప్పదా కూడా చర్చించాలనుకున్న పాయింటు కూడా చితికిపోయింది. మోహమే గొప్పదని చెప్పడం పూరీ ఉద్దేశం. కానీ మోహమే గొప్పదని హీరో ప్రూవ్ చేయాలనుకుంటే, ప్రేమకి ప్రత్యర్ధిగా వున్న ఏసీపీ రమ్యదే గెలుపుగా చూపించడ మెందుకు? ప్రేమ బలానికి ప్రత్యర్ధులు తలొంచుతారేమో గానీ, ఉత్త మోహమే వుంటే అంతు చూస్తారనా? పాయింటు తిరగ బడినట్టుంది. కొన్ని శాశ్వత విలువలుంటాయి. అవి ఏ కాలంలోనూ మారవు. వాటిని విరిచి ఇంకేదో చెప్పాలని చూస్తే కుదరదేమో? ప్రేమే బలమైనదన్న శాశ్వత విలువ గురించే చెప్పాలేమో ఒకవేళ? మోహం గురించే చెప్పాలనుకున్నప్పుడు, టైటిల్ రోమాంటిక్ అని గాకుండా లస్ట్ అని వుంటే సరిపోవచ్చు. ఆకాష్ మొహంలో నటించగల నేర్పు వుంది, కానీ ఇలాటి పాత్రల్లో కాదు.

నటనలు - సాంకేతికాలు

     ఆకాష్ గురించి చెప్పాలంటే అతడి వాయిస్ ఎసెట్. వయసుకు మించి వాయిస్ లో గాంభీర్యం వుందన్పించేలా. అయితే వాయిస్ ఇంత బలంగా వుందని భారీ మాఫియా పాత్ర మీద వేస్తే లేత వయసు విలవిల్లాడి పోయింది. ఈ మాఫియా హీరోయిజం అతి అయిపోయింది. పదుల సంఖ్యలో గ్యాంగ్స్ ని చితక్కొట్టడం ఓవరాక్షనై పోయింది. ఇలా అతడ్ని మాఫియా మాస్ యాక్షన్ హీరోగా ఎస్టాభ్లిష్ చేస్తూ, పంచ్ డైలాగులతో, మందు పాటతో, హీరోయిన్ తో పది నిమిషాలకో అడల్ట్ సాంగ్స్ తో, పూర్తి ఆల్ రౌండర్ గా చూపించాలన్న ప్రయత్నం తొందరపాటు తనమే అయింది.

        ఇదంతా చూపించే ప్రయత్నంలో రోమాంటిక్ హీరోగా కాస్త ఫీల్ తో చూపించడం మర్చేపోయారు. అలాగే కామెడీ కూడా చేయగలడని నిరూపించేందుకు కామెడీ సీన్లు ఎందుకనో వేయలేదు. రోమాంటిక్ హీరోగా మొదలైన వాడు లస్ట్ పెంచుకుని బీస్ట్ గా మారినా, చెప్పాలకున్న మోహం పాయింటుకి తగ్గట్టు వుండేదేమో పాత్ర. మాఫియాల్ని ఎత్తేసి, లస్ట్ తో బీస్ట్ గా మారిన ఆకాష్, రమ్యకృష్ణకి సవాలుగా మారినట్టు సింపుల్ కథగా చూపించి వుంటే,రోమాంటిక్ బతికి బయటపడే అవకాశాలు ఆకాశమంత వుండేవేమో.

        హీరోయిన్ కేతికా చాలా చాలా మైనస్ గ్లామపరంగానూ. కేవలం ఎక్స్ పోజింగ్ వరకే ఆమె రేంజి. ఇంతే ఆమె గురించి చెప్పుకోగల్గేది.

        టెక్నికల్ గా చూస్తే, దర్శకత్వం పూరీ ఘోస్ట్ డైరెక్షన్ చేసినట్టుగా వుంది. పేరుకి కొత్త దర్శకుడి సినిమా గానీ, చూస్తే పూరీ తీసిన సినిమాలాగే వుంది యాక్షన్ సీన్స్ సహా. ఇందులో ప్రేమో మోహమో ఏదీ సరిగా లేనప్పుడు అరడజను పాటలు పెట్టేశారు. అయితే డైలాగ్ వెర్షన్ చాలా లౌడ్ గా వుంది. ప్రేమ కథ- లస్ట్ కథ ముగింపు కూడా కాస్త చల్లబడకుండా, అరుపులతో బీభత్సంగా వుంటే - లస్టో బీస్టో అనికూడా అన్పించకుండా ఈ సెకండ్ లాంచింగ్ కూడా వేస్టయి పోయింది.

చివరికేమిటి

    రమ్య కృష్ణ పాత్ర వాయిసోవర్ తో ప్రారంభమవుతుంది. ఆమె ఆకాష్ వాస్కోడిగామా జీవితం గురించి చెప్తూంటే ఫ్లాష్ బ్యాక్ లో కథ వస్తూంటుంది. పూరీ మార్కు అదే టెంప్లెట్ కథ. లవ్ ట్రాక్ కాసేపు, మాఫియా ట్రాక్ కాసేపు మారుతూ వస్తూంటాయి. ఇవేవీ ఆసక్తికరంగా వుండవు. పూరీ సినిమా లంటే అవే మాఫియాలు, అవే లవ్ ట్రాకులు. సుమారు గంటకి ఆకాష్ ఇన్స్ పెక్టర్ ని చంపేశాక, ఫ్లాష్ బ్యాక్ పూర్తయి, రమ్యకృష్ణ ఇన్స్ పెక్టర్ని చంపిన  ఆకాష్ ని పట్టుకునే వేట ప్రారంభిస్తుంది.

        సెకండాఫ్ లో ఈ వేటతో బాటు, బతికున్న మాఫియాకి ఆకాష్ మీద వున్న పగతో కూడిన యాక్షన్ మొదలైపోయి- రోమాంటిక్ -లస్ట్ - బీస్ట్- ఫీస్ట్ అన్నీ సఫా అయిపోతాయి. ప్రేమ జంట మీద ఎక్కడా సానుభూతి కురిపించే సీన్లు ఫస్టాఫ్ లో కూడా వుండవు. ఆ తాలూకు భావోద్వేగాలూ వుండవు. ఎంత మోహమైనా ఆ మోహం తాలూకు కదిలించే సంభాషణాలూ వుండవు. నిడివి రెండు గంటలుండడ మొక్కటే ఊరట!

—సికిందర్
 

26, అక్టోబర్ 2021, మంగళవారం

      ప్రపంచంలో మొదటి స్క్రీన్ ప్లే పుస్తకాన్ని సినిమా రచయితలు రాయలేదు. దర్శకులు రాయలేదు. ఎడిటర్లూ సినిమాటోగ్రాఫర్లూ రాయలేదు. నిర్మాతలు కూడా రాయలేదు. వీళ్ళెవరూ తర్వాతెప్పుడూ రాయలేదు. మొదటి స్క్రీన్ ప్లే పుస్తకాలని సినిమాల్ని అధ్యయనం చేసే పండితులు రాశారు. సినిమా పుస్తకాలకి సంబంధించి దీనికి మార్కెట్ వుంటుందని కనిపెట్టి స్క్రీన్ ప్లే పుస్తకాలు రాయడం ప్రారంభించారు. అప్పుడు కనిపెట్టిందే  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని. నాటక రచన పుస్తకాల్లోంచి, అరిస్టాటిల్ పోయెటిక్స్ నుంచీ విషయాన్ని తెలుసుకుని, సినిమా కథా రచనకి అంటే స్క్రీన్ ప్లేకి, త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ అనే దాన్ని అలా ఏర్పర్చారు. అలా వాడుకలోకి వచ్చిందే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. అంటే స్క్రీన్ ప్లే ని నాటక రచయితల్లాగా రాయాలన్న భావాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారన్న మాట. ఇక్కడే సమస్య వచ్చి పడింది.  

        ర్వాత ఆధునిక స్క్రీన్ ప్లే పండితులు ఎవరొచ్చినా స్క్రీన్ ప్లేలని త్రీ యాక్ట్స్  స్ట్రక్చర్ అనే చట్రంలో పెట్టేసి, అందులోనే కథ చెప్పాలని చెబుతూ వస్తున్నారు. రచయిత రాసే స్క్రీన్ ప్లే రచన వరకూ ఇది ఓకే. స్క్రీన్ ప్లేలు రాసి నిర్మాతలకి పంపేది కొత్తా పాతా రచయితలే కాబట్టి, రచయితలుగా స్క్రీన్ ప్లేలని అలాగే రాయగలరు. నాటక రచయితల్లానూ రాయొచ్చు. కాబట్టి రచయితలకి అలాగే భోదిస్తూ వస్తున్నారు. తర్వాత ఆ స్క్రీన్ ప్లేలకి దర్శకులు నియమితులయ్యాక, వాళ్ళు చిత్రీకరించడానికి ఎలా వుండాలో అలా మార్చుకుంటారు. కాబట్టి ఇక్కడ కూడా సమస్య లేదు. సమస్య ఎక్కడొచ్చిందంటే, తెలుగులో దర్శకులవ్వా లనుకుంటున్న వాళ్ళూ, దర్శకులై పోయిన వాళ్ళూ ఎవరి స్క్రిప్టులు వాళ్ళే రాసుకుంటున్నప్పుడు - వచ్చిపడింది సమస్య!

        రాసేవాడు తీయలేడు, తీసేవాడు రాయలేడని ఒకప్పుడుండేది. ఈ తీసేవాడు రాయలేడనే దాన్ని ఇప్పుడు నిజం చేస్తున్నారేమో. కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వాలు చూస్తూంటే ఇది స్పష్టమవుతోంది. చదవడం కోసం రాస్తున్నామనుకుని రాసేసి తీస్తున్నారు. కానీ సినిమా స్క్రిప్టు అచ్చేసి చదువుకోవడానికి కాదు, సినిమా తీసి చూసుకోవడానికి. అంటే సినిమా స్క్రిప్టు రైటింగ్ గురించి కాదు. రైటింగ్ గురించి అయితే కేవలం రచయిత చూసుకోగలడు. రాసి దాన్ని సినిమాగా తీసుకునే దర్శకుడికి సినిమా స్క్రిప్టు మేకింగ్ గురించి వుంటుంది. కథ మాటలు స్క్రీన్ ప్లే అని వేసుకోవచ్చుగాక, రచయితగా ఫీలవకుండా మేకర్ గా ఫీలై రాయాల్సి వుంటుంది. మేకర్ గా ఫీలైనప్పుడు సీన్లు తీసే విధంగా రాస్తారు. ప్రేక్షకులు చూసే విధంగా మేకింగ్ చేస్తారు.

కానీ ఎలా రాస్తున్నారో చూద్దాం- తండ్రీ కొడుకుల సంభాషణ :   
        కొడుకు : నాన్నా, మళ్ళీ నన్ను కొట్టి లంచ్ బాక్స్ లాక్కున్నారు నాన్నా!
        తండ్రి : ప్రిన్సిపాల్ తో మాట్లాడతాన్లేరా.
        కొడుకు : ఒకసారి మాట్లాడావ్ ఏం జరిగింది? ఏం జరగలేదు. నన్ను మళ్ళీ కొట్టి లంచ్       బాక్స్ లాక్కున్నారు పోరగాళ్ళు!
        తండ్రి : ప్రిన్సిపాల్ వాళ్ళని పనిష్ చేస్తానన్నాడుగా, చూద్దాంలే.
        కొడుకు :  మేం కొట్టలేదంటే ప్రిన్సిపాల్ నమ్మాడు నాన్నా!

        వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్ధమవుతూనే వుంది. అయితే అవసరానికి మించి మాట్లాడేసుకుంటున్నారు. ఎందుకు అవసరానికి మించి మాట్లాడుకుంటున్నారు? ఏం జరిగిందో ప్రేక్షకులకి తెలియాలని. ఇది అసహజంగా లేదూ? పాత్రలు ఒకరి బ్యాక్ గ్రౌండ్ గురించి ఇంకొకరికి తెలిసి వున్నట్టయితే అంత పూస గుచ్చినట్టు, మరొకరికి తెలియాలనుకున్నట్టు  మాట్లాడుకోరు. ఇక్కడ స్కూల్లో దెబ్బలు తింటున్న కొడుకు బ్యాక్ గ్రౌండ్ గురించి తండ్రికి ఆల్రెడీ తెలుసు. అలాగే ప్రిన్సిపాల్ తో మాట్లాడానంటున్న తండ్రి బ్యాక్ గ్రౌండ్ గురించి కొడుక్కీ తెలుసు.  

ఈ నేపథ్యంలో ఎలా మాట్లాడు కుంటారు?
        కొడుకు : మళ్ళీ కొట్టేశారు నాన్నా!
        తండ్రి : ప్రిన్సిపాల్ తో మాట్లాడతాలేరా!
        కొడుకు : మొన్న మాట్లాడేవుగా ఏమైంది? ఇదా!  

        ఇప్పుడు అసలేం జరిగిందో పాత్రలకి తెలుసు, మనకి తెలీదు. వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో మనకి తెలీదు. మరి తెలిసేలా ఎలా చేయాలి? స్కూలు నుంచి వచ్చిన కొడుకు బట్టలు చిరిగి, ముక్కు రక్తం కారుతూ వుంటే, చేతిలో సొట్టలు పడ్డ ఖాళీ లంచ్ బాక్స్ కూడా వుంటే, చూడగానే అర్ధమైపోతుంది ఏం జరిగిందో, దేని గురించి మాట్లాడుకుంటున్నారో.

        ఇది స్టోరీ రేటింగ్ కాదు, సినిమాకి కావాల్సిన స్టోరీ మేకింగ్. అంటే విజువల్ రైటింగ్. కారుతున్న రక్తం, చిరిగిన బట్టలు, సొట్టలు పడ్డ లంచ్ బాక్స్ చూపిస్తూ, పరస్పరం వాళ్ళ బ్యాక్ గ్రౌండ్స్ తెలిసిన నేపథ్యంలోంచి మాట్లాడిస్తూ విజువల్ గా రాస్తే, అది స్టోరీ మేకింగ్ అవుతుంది. సినిమా స్క్రిప్టుకి కావాల్సింది స్టోరీ మేకింగే. స్టోరీ మేకింగ్ విజువల్ రైటింగ్ కళ మీద ఆధారపడి వుంటుంది.

స్టోరీ మేకింగ్ చేస్తే త్రీయాక్ట్ స్ట్రక్చర్ ఎలా వుంటుందో చూద్దాం...
        (బిగినింగ్) : ఆనందంగా గడుపుతున్న కుటుంబాలు, బిజీగా వున్న వ్యాపార కేంద్రాలు, ఆడుకుంటున్న పిల్లలూ, పని చేసుకుంటున్న ఉద్యోగులూ.  
        (ప్లాట్ పాయింట్ వన్, మిడిల్) :  వరద ముంచుకొచ్చి అల్లకల్లోలం, కుటుంబాలు కొట్టుపోవడం, వ్యాపారాలు మునిగిపోవడం...
        (ప్లాట్ పాయింట్ టూ, ఎండ్) : హృదయ విదారక దృశ్యాలు, నిరాశ్రయులైన కుటుంబాలు, ఏడుస్తున్న పిల్లలూ, ఆకలీ...
        ఉపసంహారం : ప్రభుత్వ సహాయం, బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించడం, నస్జ్టపరిహారాలు ప్రకటించడం...    

        స్టోరీ మేకింగ్ అంటే సంఘటనలతో కథ చెప్పడం. సంఘటనలకి తగ్గ విజువల్స్ తో రైటింగ్ చేయడం. పాత్రల మాటలతో కథ చెప్పడం కాదు. ఇలా రచయిత చెప్తాడు, మేకర్ కాదు. మేకర్ మంచి మేకర్ అవాలంటే తాను రచయితనని మర్చి పోవాలి. యాడ్ ఫిలిమ్ మేకింగ్ లో రచయితలుగా ఫీలవరు. మేకర్ గా ఫీలవుతూ విజువల్స్ తో మేకింగ్ చేస్తారు. విజువల్ మీడియా ఈజ్ నాట్ ప్రింట్ మీడియా. ప్రింట్ మీడియాని తక్కువ చేయడం కాదు. ఈ వ్యాసం రాయడం ప్రింట్ మీడియానే. ఇది తక్కువ రకం పని అనుకుంటే రాయకుండా పడుకోవడమే.

        నాటకాలు రాయడం, నవలలు రాయడం, కథలు రాయడం పూర్తిగా వేరు. కానీ సినిమా కథ రాయడమంటే ఇదేననుకుని స్క్రిప్టులు రాసేస్తున్నారు. సాహిత్యంలా స్క్రిప్టులు రాసేస్తున్నారు. కొందరి స్క్రిప్టులు వ్యాసాల్లా వుంటున్నాయి. ఇందుకే స్క్రిప్టుల క్వాలిటీ అడుగంటి, బడ్జెట్ వృధా అవుతోంది. డైలాగులతో సాహిత్యంలాగా సీన్లు రాస్తే, ఆ నిడివికి బడ్జెట్ పెరుగుతుంది. అదే విజువల్స్ తో స్టోరీమేకింగ్ చేస్తే సీను నిడివి తగ్గి బడ్జెట్ తగ్గుతుంది. పది డైలాగులు చేసే పనిని ఒక్క విజువల్ షాట్ చేస్తుంది.

        అందుకని మేకర్ రచయితగా అస్సలు ఫీలై రాయకూడదు. మేకర్ మెకానిక్ లాంటి వాడు. రచయితగా ఫీలైతే రాయడంలో పడిపోయి ఇతర క్రాఫ్ట్ ని మర్చిపోతాడు. మేకర్ గా ఫీలైతే రాస్తున్న దాంట్లో ఇతర క్రాఫ్ట్స్ ని కూడా వూహిస్తూ, మెకానిక్ లా వాటిని కథలో బిగించుకు పోతూ, ఎక్కడికక్కడ బడ్జెట్ ని కుదిస్తూ స్టోరీ మేకింగ్ చేస్తాడు. కొండపొలం లో హీరో ఏమవుతాడో ముందే చెప్పేశాక, అలా ఫారెస్ట్ ఆఫీసర్ అవడమే చివర్లో చూపిస్తే, ఈ చివరి సీను బడ్జెట్ వృధాతప్ప కథగా కల్గించిన రసోత్పత్తి ఏమీ లేదు.

        విజువల్స్ బ్రహ్మాండంగా వున్నాయని, కెమెరా వర్క్ అద్భుతమనీ అంటూంటారు. ఇది సినిమా భాష కాదు. అది విజువల్ రైటింగ్ తో కూడిన కెమెరా వర్క్ కాదు, స్టోరీ మేకింగ్ కాదు. కెమెరా షాట్స్ తో కథ చెప్తేనే మంచి కెమెరా వర్క్ అవుతుంది. కేవలం అద్భుత దృశ్యాలు కెమెరా వర్క్-  సినిమాటోగ్రఫీ కాదు. అదొట్టి ఫోటోగ్రఫీ. స్క్రీన్ ప్లే పండితులు రచయితలకి/మేకర్లకి కెమెరాతో కథెలా చెప్పాలో నేర్పకుండా, పెయింటింగ్ ఎలా వేయాలో కష్టపడి నేర్పుతున్నారు. అదే నమ్మి నట్టేట మునుగుతున్నారు మేకర్లు. మేకర్లోంచి మేకల్లాంటి రచయితల్ని బలి ఇస్తే తప్ప మెరికల్లాంటి మూవీ మేకర్స్ అవలేరు.

—సికిందర్ 
 

24, అక్టోబర్ 2021, ఆదివారం

1070 : రైటర్స్ కార్నర్

     సినిమా రచయితలు పాత మూస వాసనలు వెదజల్లకుండా ఎలా వుండాలి, ఏం రాయాలి, ఎలా రాయాలి, ఎలా మెలగాలి, ఎలా ఎదగాలి వగైరా తెలుసుకోవడానికి కూడా బద్ధకించే రోజులిక లేవు. థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యాక వారం వారం విడుదలవుతున్న సినిమాలు పాత మూస సుగంధాలతో, రాయడం చేతకాని దుర్గుణాలతో బుకింగ్స్ ని గుల్ల చేస్తున్న పరిస్థితుల్లో, గ్లోబల్ -పానిండియా- ఓటీటీ అంటూ గొప్ప మాటలు మాట్లాడుకోవడం హాస్యాస్పదంగానే వుంటుంది. ముందు పాత మూస వాసనలతో నువ్వెంత గ్లోబల్ -పానిండియా- ఓటీటీయో చెప్పవయ్యా బాబూ అని ప్రశ్నిస్తే ఏం చెప్తారు. ఇంకా పాత మూస ఫార్ములాల అండతో దబాయిస్తారా? దాంతో లేజీ రైటింగ్ చేసుకుంటూ ఇలాగే కాలం గడిపేస్తారా? ఆత్మపరిశీలన చేసుకోవడం ఉత్తమం.

       సిద్ధార్థ్ సింగ్- గరిమా వాహల్ లు బాలీవుడ్ జంట రచయితలు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు రాస్తారు. బ్రదర్స్, పద్మావత్, బాజీరావ్ మస్తానీ, పల్ పల్ దిల్ కే పాస్, జబరియా జోడీ, టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథ, బత్తీ గుల్ మీటర్ చాలూ, రామ్ లీలా, కబీర్ సింగ్, యానిమల్ మొదలైన సినిమాలకి పని చేశారు. దుకాన్, యే సాలీ ఆషిఖీ అనే రెండు సినిమాలకి దర్శకత్వం వహిస్తున్నారు. వీరి పని విధానంలోకి తొంగి చూస్తే తాజాదనంతో కూడిన రైటింగ్ కి సంబంధించి అన్ని ప్రశ్నలకీ సమాధానాలు దొరుకుతాయి. అవేమిటో చూద్దాం....

1. మీరు ఎలా చెప్పి కథల్ని  ఒప్పిస్తారు?  
        ముందు ఒక లైనుగా ఐడియా చెప్పి కన్విన్స్ చేయగల్గాలి. ఒక లైనుగా  కన్విన్స్ చేయకపోతే ఇంకేం చేసీ కన్విన్స్ చేయలేం. ఒక లైనులో ఐడియా చెప్పకలేక పోతే అవతలి వాళ్ళ టైమ్ వేస్ట్ చేసినట్టే. ఒక లైనులో ఐడియా చెప్పగానే అవతలి వాళ్ళు ఎక్సైట్ అయి,ఇంకా ఇంకా చెప్పమనేట్టు వుండాలి. ఇలా జరిగితే స్క్రిప్టు ఓకే అవడానికి దారి పడినట్టే.

2. డైలాగు రచనకి పూర్వమున్నంత ఆదరణ ఇప్పుడున్నట్టు లేదు. దీని గురించి ఏం చెప్తారు?
       అన్ని క్రాఫ్ట్స్ లో కంటే డైలాగు రచనని చాలా తేలిక బావంతో చూస్తున్న రోజులివి. డైలాగులకి రిపీట్ ఆడియెన్స్ తో బాటు, కథని సరళతరం చేసే, స్క్రీన్ ప్లేకి బలాన్ని చేకూర్చే శక్తి వుండేది ఒకప్పుడు. ఇప్పుడా శక్తి అవసరం లేదంటున్నారు. డైలీ చిట్ చాట్ లాగా వుంటే చాలంటున్నారు. డైలాగు డైలాగులా అన్పించకూడదని అంటున్నారు. మరి డైలాగ్స్ కి నిర్వచనమేమిటో చెప్పమంటే చెప్పలేరు. సింపుల్ లైనులాగా వుండేదే డైలాగు అంటున్నారు. కానీ ప్రేక్షకులు సినిమాని డైలాగులతో గుర్తు పెట్టుకుంటారని మేం భావిస్తాం. రిచ్ డైలాగులున్న సినిమాని మర్చిపోలేరు. సింపుల్ లైన్లతో పని జరిగిపోయినా, అవి మెమరబుల్ గా వుండవు. మా ఉద్దేశంలో మెమరబుల్ ఫిలాసఫీని తేలికైన భాషలో చెప్పేదే సింపుల్ లైను.

3. యానిమల్ లో రణబీర్ కపూర్, అనిల్ కపూర్ లు నటిస్తున్నారు. కబీర్ సింగ్ తీసిన సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. కబీర్ సింగ్ కి మీరే డైలాగులు రాశారు. ఇప్పుడు యానిమల్ కి మీరెలా డిఫరెంట్ గా రాస్తున్నారు?
       సినిమాటిక్ డైలాగుల్నిఆదరించే దర్శకులు కొందరైనా వున్నారని మా నమ్మకం. ఆ వర్గంలో సందీప్ తప్పకుండా ఒకరు. యానిమల్ కథ ఆయన చెప్పగానే ఉద్వేగానికి లోనయ్యాం. ఇందులో డైలాగుల ద్వారానే కథ చెప్పాలి. మేం రాసిన సినిమాలకి డిఫరెంట్ టోన్స్ నీ, డిఫరెంట్ లోకాల్నీ సృష్టించాం. బ్రదర్స్ లో కేథలిక్ కుటుంబాన్ని, జెర్సీలో పంజాబీ సామాజిక వాతావరణాన్ని. అలా యానిమల్లో సింపుల్ లైన్లతో బాటు స్పెషల్ లైన్లు కలిసిపోయిన ప్యాకేజీగా ఇచ్చాం. సినిమాటిక్ టోన్ నీ, సింప్లిసిటీనీ సవాలుగా తీసుకుని బ్యాలెన్స్ చేశాం. డైలాగుల్లో ప్రత్యేక మానసిక స్థితి కనబడాలన్నారు సందీవ్. ఆ మేరకు నిగూఢ మానసిక స్థితిని ప్రతిబింబించాం.

4. మీరు వివిధ జానర్లకి రాశారు. మీ వర్కింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి?
       నిజానికి మా ప్రతీ స్క్రిప్టు డిఫరెంట్ ప్రాసెస్సే. రామ్ లీలాలో షేక్స్ పియర్ రాసిన రోమియో జూలియెట్ ప్రేమ కథని వయోలెంట్ గా మార్చి రాశాం. ఆ ప్రకారం స్క్రీన్ ప్లేని, డైలాగుల్నీ, పాటల్నీ ప్రాసెస్ చేశాం. స్క్రిప్టు ప్రతీ లెవెల్లో దాని టోన్, కథాలోకం, పాత్రలు మొదలైనవి చాలా రీసెర్చిని డిమాండ్ చేశాయి. ఈ ప్రాసెస్ లో బాగంగా నిజ జీవిత వ్యక్తుల్నీ, వాళ్ళ మ్యానరిజమ్స్ నీ తెలుసుకోవడం నిత్య కార్యక్రమమై పోయింది. ఈ ప్రాసెస్ నే ఆయా కథలు డిమాండ్ చేసే వాటికీ అమలు చేస్తాం. మేం రాసే పాటలూ  స్క్రీన్ ప్లేల్లోంచే పుడతాయి కాబట్టి, ఆ లిరిక్స్ సిట్యూయేషనల్ గా, యూనివర్సల్ గా వుండేట్టు చూస్తాం.

5. రచయితలుగా సినిమా నిర్మాణంలో మీరెంత వరకు భాగం పంచుకుంటారు?
       మేం రాసిన ప్రతీ స్క్రిప్టు షూటింగులో మేమున్నాం. టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథ మా ఐడియానే  కాబట్టి, రీసెర్చిలో, రైటింగ్ లో కూలీల్లాగా శ్రమించాం. షూటింగులో, ఎడిటింగులో వున్నాం. ఇదంతా మేం దర్శకత్వం వహించడానికి తోడ్పడింది. దుకాన్ సబ్జెక్టు గుజరాత్ నేపధ్యంలో అద్దె గర్భాలతో వ్యాపారం గురించి. యే సాలీ  ఆషిఖీ  ఉత్తరప్రదేశ్ లో ఆనర్ కిల్లింగ్స్ గురించి. ఇండియాని కథల గనిగా మేం భావిస్తాం. తవ్వి చూస్తే ఆణిముత్యాలే దొరుకుతాయి. ఈ కథల్ని కనుగొనడం, రీసెర్చి చేయడం, వెండితెర మీద ప్రాణం పోయడం - ఇదంతా మాకు అమితానందాన్నిచ్చే ప్రాసెస్.   

దుకాన్ కోసం ఎన్నోసార్లు గుజరాత్ లోని ఆనంద్ కెళ్ళాం. అక్కడి ఫీల్ ని పట్టుకోవడం కోసం. అక్కడి సామాజికార్ధిక పరిస్థితుల అవగాహన కోసం. దుకాన్ స్క్రిప్టు నాల్గేళ్ళుగా ప్రాసెస్ లో వుంది. గుజరాత్ లో నవరాత్రి సందర్భంగా పాడుకునే పాటల్ని, సంగీతాన్నీ రీసెర్చి చేశాం. ఇలాటి కథ సినిమాగా రాలేదు గనుక, శూన్యం లోంచి సృష్టించాలీ గనుక, ఈ మాత్రం కాలం తీసుకుంటుంది.

       అలాగే ఉత్తరప్రదేశ్ లో ఆనర్ కిల్లింగ్స్ గురించి యే సాలీ ఆషిఖీ కి రీసెర్చి చేశాం.  కొన్నేళ్ళుగా దేశంలో ఆనర్ కిల్లింగ్స్ 700 శాతం పెరిగి పోయాయి. నిజ జీవితంలో ప్రేమికు లెదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్ని చూపించ దల్చుకున్నాం. అసలు ఆనర్ కిల్లింగ్ పద బంధమే ఎంత వరకు కరెక్టో ప్రశ్నిస్తున్నాం. ఆనర్ కిల్లింగ్స్ అంటే పరువు హత్యలనే అర్ధం వస్తుంది. పరువునా హత్య చేస్తున్నది? ఇది అర్ధవంతంగా వుందా? పరువుని హత్య చేయడమేమిటి?

6. రచయితలకి గుర్తింపు లభించే దిశగా పరిస్థితులు మారతాయంటారా? అప్పట్లో సలీం -జావేద్ ల రాకతో రచయితలకి గుర్తింపూ పారితోషికాలూ పెరిగాయి. ఆ కాలం మళ్ళీ తిరిగొస్తుందా?
        ఇప్పుడు ఫర్వా లేదు. అయితే ఇంకా లభించాల్సిన స్థాయిలో గుర్తింపు లభించాలని అనుకుంటున్నాం. మేం ట్రైలర్స్ లో కూడా మా పేర్లు వేసేలా పోరాడేం. చాలా తక్కువ మంది నిర్మాతలే ఎలాగో  పోస్టర్స్ లో, ఫస్ట్ లుక్స్ లో పేర్లు వేస్తున్నారు. సలీం -  జావేద్ లు ప్రారంభంలో పెయింటర్స్ కి డబ్బులిచ్చి, తాము రాసిన సినిమాల వాల్ పోస్టర్ల మీద తమ పేర్లు రాయించుకునే వాళ్ళట ముంబాయి వీధులన్నీ తిప్పి. రచయితలకి గుర్తింపు కోసం పోరాడినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. అసలు సినిమా తీయాలంటేనే మొదట నియమించుకునేది రచయితని. రచయిత అడుగు పెట్టే వరకూ తెల్ల కాగితాలు తెల్ల కాయితాల్లాగే వుంటాయి.

7. మీరు సంజయ్ లీలా భన్సాలీ సినిమాలకి పని చేశారు. ఆయన సినిమాలకీ, ఇతర దర్శకుల సినిమాలకీ మీరు స్క్రిప్టులు రాయడంలో చూపించే తేడా ఏమిటి?
        సంజయ్ లీలా భన్సాలీ మాస్టర్ మైండ్. సినిమా మేకింగ్ పట్ల లోతైన అవగాహన ఆయనకుంది. రైటింగ్, ఎడిటింగ్, డిజైన్, ఆర్ట్, కెమెరా వర్క్ వగైరా. రైటింగ్ అంటే ఆయనకి చాలా పిచ్చి. మేం రాసిన ఒక లైన్ నచ్చితే, సింగిల్ స్క్రీన్ థియేటర్లో  ప్రేక్షకులెలా కేరింతలు కొడతారో, అలా గట్టిగా అరిచేస్తారు. ఆయనంత క్యాలిబర్ వున్న దర్శకులతో మేమింకా పని చేయాల్సి వుంది.

8. ఆయనతో వుండే డిఫరెంట్ ప్రాసెస్ ని మీరెలా తీసుకుంటారు? షూటింగ్ సమయాల్లో కూడా ఆయన మార్పు చేర్పులు చేస్తూంటారు కదా?
        ఆయనలా చేస్తారనేది దురభిప్రాయం మాత్రమే. నిజానికి ఆయన పని విధానంతో మా ప్రాసెస్ కలిసిపోయి వుంటుంది. రచయితలుగా మేము మా స్క్రిప్టుల్ని మార్పు చేర్పులకి అనువుగానే వుండేట్టు ఫ్లూయిడ్ గా రాస్తాం. ఆమూలాగ్రం సబ్జెక్టు మీద పట్టు వుంటేనే ఇది సాధ్యమవుతుందని అనుకుంటాం.

9. మీరు కమర్షియల్ స్క్రిప్టు రాస్తున్నప్పుడు జెండర్ రోల్స్ ప్రాధ్యాన్యంతో రాజీ పడకుండా వుండ గల్గుతారా? పురుషాధిక్యతకి , పితృస్వామ్య పంథాకి మీ రచనల్లో అవకాశం లేకుండా చూడగలరా?
        రచయితలు వాళ్ళ దృక్పథంలోంచి, అనుభవాల్లోంచి, పెంపకం లోంచీ, చూస్తున్న కళ్ళద్దాల్లోంచీ రాస్తారు. మేం జెండర్ రోల్స్ ని స్థాపించడానికి ఎప్పుడూ ప్రయత్నించం.సహజంగానే బలమైన, దృఢాభిప్రాయం కల్గిన స్త్రీ పాత్రల వైపే మొగ్గుతాం. ఆధునిక సమాజంలో ఫెమినిజంతో ప్రబలంగా నెలకొన్న దురవగాహన పట్ల పౌరులుగా మాకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. పురుషాధిక్యత నిర్వచనం పట్ల కూడా. రామ్ లీలా, టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథాల్లో బలమైన స్త్రీ పాత్రలే ఉదాహరణలు. శతాబ్దాల పితృస్వామ్య పెత్తనం పట్ల స్త్రీల నరనరాల్లో ఇంకిన వ్యతిరేకతనే ఈ పాత్రలు ప్రతిబింబిస్తాయి.

10. పాటల రచయితలకి ఎలాటి గుర్తింపు లభిస్తోందని మీరనుకుంటున్నారు?
        ప్రస్తుత పరిస్థితి అసంతృప్తి కరంగానే వుంది. గీత రచయితల కంటే గాయకులకీ, సంగీత దర్శకులకీ ఎక్కువ గుర్తింపు లభిస్తోంది. గీత రచన కళా కాదు, కవిత్వమూ కాదు. మ్యూజిక్ వేదికల మీద సంగీత దర్శకుడి పేరే వినిపిస్తుంది. గీత రచయితలు, గాయకులు, సంగీత దర్శకులూ కలిస్తేనే పాట పుడుతుందని గుర్తిస్తేనే పరిస్థితి మారుతుంది. గీత రచయిత రాయకుండా ఏం పాట పుట్టిస్తారు. అసలు గీత రచయితల కన్నా స్క్రిప్టుని అర్ధం జేసుకునే వాళ్ళు సమస్త సినిమా నిర్మాణపు శాఖల్లో వుండరని ఈ తరం దర్శకులు మర్చి పోతున్నారు. కుచ్ తో లోగ్ కహేంగే, సందేశే ఆతే హై- వంటి ఆనాటి పాటలే చూడండి- స్క్రిప్టుని అర్ధం జేసుకుంటేనే వాటినలా రాయగలరు కదా. సిట్యూయేషనల్ సాంగ్స్ అంటే ఏమిటో కూడా చరిత్రలోంచి నిర్మాతలు తెలుసుకోవడం లేదు. వాటి స్థానంలో హిట్ నంబర్స్ పెట్టాలనుకుంటారు. సిట్యూయేషనల్ సాంగ్స్ ని కూడా హిట్ నంబర్స్ లా పాటల రచయితలు రాయగలరని తెలుసుకోవడం లేదు. తెలుసుకుని నమ్మాలి మరి.

11. గత కొన్ని సంవత్సరాలుగా కంటెంట్ ఈజ్ కింగ్ అనే మాట బాగా వాడుకలో వుంది. ఇప్పుడు ఓటీటీల యుగంలో దీని ప్రాముఖ్యం ఏమైనా పెరిగిందంటారా?
          మార్పు తప్పకుండా కన్పిస్తోంది. అయితే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోలాగా కాకుండా, హిందీలో కంటెంట్ ప్రధాన సినిమాలు గాక, స్టార్ ప్రధాన సినిమాలే వుంటున్నాయి. ఓటీటీ దండయాత్రతో కంటెంట్ ప్రధాన సినిమాల వైపు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నా, దీన్నంది పుచ్చుకుని బాలీవుడ్ లో కంటెంట్ ప్రధాన సినిమాలు రావడానికి ఇంకా సమయం పడుతుంది.

12. కంటెంట్ కి ప్రాముఖ్యాన్నిచ్చి నిర్మాతలు వివిధ ప్లాట్ ఫామ్స్ ని ప్రయత్నిస్తున్నారు. కొన్ని సార్లు ఇది లీగల్ సమస్యల్ని తెచ్చి పెడుతోంది. కొన్ని సినిమాలని, వెబ్ సిరీస్ నీ మనోభావాల పేరుతో బ్యాన్ చేయాలంటూ, బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నారు. దీని గురించేమంటారు?
          సృజనాత్మక స్వేచ్ఛనేది ఆఫ్ ది రికార్డుగా హైసొసైటీ సంభాషణల్లోనే వుంటోంది. ప్రతీ క్రియేటర్ వెనుకా సెన్సార్ భూతం కూడా పొంచి వుంటోంది. అధికారంలో వున్న వాళ్ళకి విమర్శని స్వీకరించే మనస్తత్వం లేదు, సెటైర్ ని గౌరవించే సంస్కృతీ లేదు. అసహిష్ణుతే వారి స్వభావంగా మారింది. సినిమాల మీద పెరిగిపోతున్న లీగల్ కేసుల్ని చూస్తే, భావ స్వేచ్ఛ ప్రాథమిక హక్కని కాదు, ప్రాథమిక పోరాటమని పోరాడాల్సిన సమయం వచ్చింది.

13.
ఇటీవల కాలంలో చాలా రీమేకులు, సీక్వెల్సులు, నిజ సంఘటనలతో తీసిన సినిమాలూ  వస్తున్నాయి. ఈ ట్రెండ్ లో కొత్త రచయితలకి తమదైన ఒరిజినల్ కంటెంట్ ఇచ్చుకునే అవకాశాలేమైనా వున్నాయంటారా?
        ఒరిజినల్ కంటెంట్ వైపు మేం గట్టిగా నిలబడతాం. దీనికోసం ఎంతైనా పోరాడతాం, ఎన్ని అడ్డంకులైనా దాటుతాం. రీమేకులతో నిర్మాతలు సేఫ్ గా ఫీలవుతారు. ఒక కొత్త ఐడియాకి ఏదైనా రిఫరెన్సు పాయింటు వున్నా మొగ్గు చూపుతారు. పూర్తిగా ఒరిజినల్ కంటెంట్ అనేసరికి ప్రోత్సాహం అంతగా వుండడం లేదు. ఓటీటీల్లో వుంటోంది. అక్కడ ఒరిజినల్ కంటెంట్ కి అవకాశాలెక్కువ, కొత్త రచయితలకి ప్లాట్ ఫామ్స్ కూడా పెరుగుతున్నాయి. 

14. రచయితలకి కనీస గౌరవ మివ్వడం లేదని ఆరోపణలున్నాయి. ఈమధ్య రైటర్స్ కీ, మేకర్స్ కీ మధ్య ఘర్షణలు తలెత్తిన సందర్భాలూ వున్నాయి. దీనిపై మీరేమంటారు?  
        సినిమాకి మొట్ట మొదట నియమించుకునేది రచయితనే. దర్శకుడే రచయిత కూడా కానప్పుడు మేకింగ్ అన్ని దశల్లో మేం తోడ్పాటుగా వుండాలని ఫీలవుతాం. ఎందుకంటే అనుకున్నదొకటి, తీసిందొకటి కాకుండా వుండాలని. కానీ దురదృష్టమేమిటంటే, స్క్రిప్టు పూర్తయి, కాస్టింగ్ ఫైనలయ్యాక, రచయితతో పని లేదని  తలుపు లేసేస్తారు. తమ కోసం పని చేసిన రచయిత విలువని గుర్తించడానికీ, ఇంకేమైనా ఇన్ పుట్స్ తీసుకోవడానికీ, పేరు కూడా వేయడానికీ ఇక మనసొప్పదు. పైసలు తీస్కో, పని చేస్కో, చెక్కేస్కో- ఇదీ వాళ్ళు నమ్మే విధానం. రచయితనే వాడు క్లోజుడు డోర్ హీరో. గది నిండా కూర్చున్న ప్రొడక్షన్ మనుషుల్ని ఒప్పించి చప్పట్లు అందుకుంటాడు. వాణ్ణి గనుక  బయటికి తోసేశాక బయటేమీ వుండదు, చప్పట్లు కొట్టే ప్రేక్షకులూ వుండరు.

        కానీ ఓటీటీ పుణ్యమాని పరిస్థితులు మారుతున్నాయి. వెబ్ సిరీస్ లో రైటరే షో రన్నర్. వెబ్ సిరీస్ నుంచి దర్శకుణ్ణి తీసిపారెయ్యొచ్చు గానీ  రచయితని తొలగించలేరు, పేరు వేయకుండానూ వుండ లేరు.

15. లాబీయింగ్, బంధుప్రీతి, కనెక్షన్స్ వంటి పవర్ డైనమిక్స్ మీ కెరీర్ కి అడ్డు పడలేదా?
        అడ్డుపడ్డాయి. మా సబ్జెక్టులతో నిర్మాతలు సినిమాల్ని ఎనౌన్స్ చేస్తే, పవర్ఫుల్ వ్యక్తులు రంగంలోకి దిగి వాటిని ఆపు చేయించిన అనుభవాలూ మాకున్నాయి. మాకు క్యాంపులూ గాడ్ ఫాదర్లూ లేకపోయినా, మెరిట్ ని, పనిని నమ్మాం. చాలా నిర్మాణ సంస్థలకి స్క్రిప్టు పనులు చేసి వున్న అనుభవంతో, ఏం జరిగినా మంచి రచనకి ఎప్పుడూ తీసివేయలేని విలువ వుంటుందని గ్రహించాం. అయితే మేమెప్పుడైతే దర్శకత్వానికి పూనుకున్నామో, అప్పుడొక కొత్త సినిమా పరిశ్రమ మాకు ఆవిష్కారమైంది. ఐడియా కొనుగోలు దగ్గర్నుంచీ స్క్రిప్టు తీసుకోవడం వరకూ, కాస్టింగ్ నుంచీ మిగతా ప్రొడక్షన్ వరకూ దేనికీ మెరిట్ బేసిస్ గా వుండదని అర్ధమయింది. ఎవరితో ఎక్కువ ర్యాపో వుంటే వాళ్ళే ప్రాజెక్టులోకి వచ్చేస్తారన్న మాట.


16. టాలెంట్ కంటే నెట్వర్కింగ్ ముఖ్యమంటారా?
        నెట్వర్కింగ్ చాలా చాలా ముఖ్యం. కొంత కాలం తర్వాత టాలెంట్ అప్రధానమైపోతుంది. ఎంత కాలం వుంటామన్నది టాలెంట్ ని బట్టి వుంటుంది. కానీ నిర్మాతల్ని ఎలా వెళ్ళి కలవ గల మన్నది తెలిసిన వాళ్ళతో నెట్వర్కింగ్ మీద ఆధారపడి వుంటుంది. ఇక్కడ ప్రతి వొక్కరూ స్క్రిప్టు పట్టుకుని తిరుగుతూంటారు, వినిపించాలని. నెట్వర్కింగ్ లేనిది ఎవరూ వినరు. కొందరు బండ మనుషులుంటారు. వాళ్ళు  రోజుల తరబడి ప్రొడక్షన్ ఆఫీసుల ముందుకూర్చునే వుంటారు. ఆఖరికి చూసి చూసి ఎప్పుడో పిలుపొస్తుంది లోపలి నుంచి.

17. ఓ పదేళ్ళుగా పరిశ్రమలో వుంటున్న కళాకారులుగా మీరు ఏఏ సమస్యలకి పరిష్కారాలు కోరుకుంటున్నారు?  
        ఫెమినిజం, సామాజికాంశాలు, రాజకీయ చిత్ర పటం, భావ స్వేచ్ఛ, పర్యావరణ పరిరక్షణ - వీటిని గురించి బలంగా ఫీలవుతాం. సినిమా పరిశ్రమలోని ప్రతీ శాఖలో లింగ భేదం లేకుండా సమాన చెల్లింపులు, పలుకుబడిని చూసి కాక మెరిట్ తో గుర్తించి ప్రోత్సహించడం, ఒరిజినల్ కంటెంట్ కి సపోర్టుగా వుండడం, తెర వెనుక పనిచేసే వారందరికీ సమానంగా క్రెడిట్స్ ఇవ్వడం, స్త్రీ పురుష పాత్రల్ని దైవాంశ సంభూతులన్నట్టు గాక సహజసిద్ధ వాస్తవిక చిత్రణలతో చూపడం, బయోపిక్స్ లో చీకటి కోణాల్ని కూడా చూపిండం, కొత్త తరహా స్క్రిప్టులకీ, కొత్తగా వచ్చే మేకర్లకీ సమానావకాశా లివ్వడం, లైటింగ్ సిబ్బంది, స్టంట్ మెన్లు, ఇతర టెక్నీషియన్లంలందరికీ మంచి సౌకర్యాలు కల్పించడం, వీటన్నిటితో బాటూ లాబీయింగ్ లేని, బంధు ప్రీతి లేని, స్వేచ్ఛాయుత సినిమా పరిశ్రమని మేం కోరుకుంటున్నాం.   

18. మీరు ప్రారంభించిన ఫాస్టర్ క్లాస్ వీడియోల గురించి చెప్పండి. ఈ ఐడియా వెనుక ఉద్దేశమేమిటి?
        స్క్రిప్టులు రాయడంలో వుండే ఫన్, పిచ్చి తనం, వెర్రి వేషాలు హైలైట్ చేయడం మా ఉద్దేశం. రచనా ప్రక్రియ రోమాన్స్ లాంటిదని చెప్పడమే మా ఫాస్టర్ క్లాస్ ఐడియా వెనకున్న ఉద్దేశం. మామూలుగా రచనలు చేయడం ఒంటరి జీవితాన్ని, అధిక శ్రమనీ డిమాండ్ చేసే శుష్క వ్యవహారమనే భావముంది. మేం దీన్ని ఫన్ గా మార్చి, వీలైనంత మందిని ఇటువైపు ఆకర్షితులయ్యేట్టు చేయాలని ప్రయత్నిస్తున్నాం. రాయడం గురించి కేవలం టిప్స్ ఇచ్చి వూరుకోవడం లేదు.

19. కొత్త రచయితల్లో మీరు కోరుకునే దేమిటి?
        హాస్యప్రియత్వం. కథ రాయడానికి అనేక పద్ధతులుంటాయి. అయితే సీరియస్ సామాజిక సమస్యల్ని కూడా హాస్యాయుతంగా చెప్ప వచ్చన్నది మేం తెలుసుకున్న నిజం. టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథాని డాక్యుమెంటరీగానే తలపోశాం. అది కాస్తా హాస్యంతో సింపుల్ కథగా, ఫన్ రైడ్ గా తయారైంది.

—ఏజెన్సీస్ 
fast class video