రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, అక్టోబర్ 2021, ఆదివారం

1070 : రైటర్స్ కార్నర్

     సినిమా రచయితలు పాత మూస వాసనలు వెదజల్లకుండా ఎలా వుండాలి, ఏం రాయాలి, ఎలా రాయాలి, ఎలా మెలగాలి, ఎలా ఎదగాలి వగైరా తెలుసుకోవడానికి కూడా బద్ధకించే రోజులిక లేవు. థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యాక వారం వారం విడుదలవుతున్న సినిమాలు పాత మూస సుగంధాలతో, రాయడం చేతకాని దుర్గుణాలతో బుకింగ్స్ ని గుల్ల చేస్తున్న పరిస్థితుల్లో, గ్లోబల్ -పానిండియా- ఓటీటీ అంటూ గొప్ప మాటలు మాట్లాడుకోవడం హాస్యాస్పదంగానే వుంటుంది. ముందు పాత మూస వాసనలతో నువ్వెంత గ్లోబల్ -పానిండియా- ఓటీటీయో చెప్పవయ్యా బాబూ అని ప్రశ్నిస్తే ఏం చెప్తారు. ఇంకా పాత మూస ఫార్ములాల అండతో దబాయిస్తారా? దాంతో లేజీ రైటింగ్ చేసుకుంటూ ఇలాగే కాలం గడిపేస్తారా? ఆత్మపరిశీలన చేసుకోవడం ఉత్తమం.

       సిద్ధార్థ్ సింగ్- గరిమా వాహల్ లు బాలీవుడ్ జంట రచయితలు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు రాస్తారు. బ్రదర్స్, పద్మావత్, బాజీరావ్ మస్తానీ, పల్ పల్ దిల్ కే పాస్, జబరియా జోడీ, టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథ, బత్తీ గుల్ మీటర్ చాలూ, రామ్ లీలా, కబీర్ సింగ్, యానిమల్ మొదలైన సినిమాలకి పని చేశారు. దుకాన్, యే సాలీ ఆషిఖీ అనే రెండు సినిమాలకి దర్శకత్వం వహిస్తున్నారు. వీరి పని విధానంలోకి తొంగి చూస్తే తాజాదనంతో కూడిన రైటింగ్ కి సంబంధించి అన్ని ప్రశ్నలకీ సమాధానాలు దొరుకుతాయి. అవేమిటో చూద్దాం....

1. మీరు ఎలా చెప్పి కథల్ని  ఒప్పిస్తారు?  
        ముందు ఒక లైనుగా ఐడియా చెప్పి కన్విన్స్ చేయగల్గాలి. ఒక లైనుగా  కన్విన్స్ చేయకపోతే ఇంకేం చేసీ కన్విన్స్ చేయలేం. ఒక లైనులో ఐడియా చెప్పకలేక పోతే అవతలి వాళ్ళ టైమ్ వేస్ట్ చేసినట్టే. ఒక లైనులో ఐడియా చెప్పగానే అవతలి వాళ్ళు ఎక్సైట్ అయి,ఇంకా ఇంకా చెప్పమనేట్టు వుండాలి. ఇలా జరిగితే స్క్రిప్టు ఓకే అవడానికి దారి పడినట్టే.

2. డైలాగు రచనకి పూర్వమున్నంత ఆదరణ ఇప్పుడున్నట్టు లేదు. దీని గురించి ఏం చెప్తారు?
       అన్ని క్రాఫ్ట్స్ లో కంటే డైలాగు రచనని చాలా తేలిక బావంతో చూస్తున్న రోజులివి. డైలాగులకి రిపీట్ ఆడియెన్స్ తో బాటు, కథని సరళతరం చేసే, స్క్రీన్ ప్లేకి బలాన్ని చేకూర్చే శక్తి వుండేది ఒకప్పుడు. ఇప్పుడా శక్తి అవసరం లేదంటున్నారు. డైలీ చిట్ చాట్ లాగా వుంటే చాలంటున్నారు. డైలాగు డైలాగులా అన్పించకూడదని అంటున్నారు. మరి డైలాగ్స్ కి నిర్వచనమేమిటో చెప్పమంటే చెప్పలేరు. సింపుల్ లైనులాగా వుండేదే డైలాగు అంటున్నారు. కానీ ప్రేక్షకులు సినిమాని డైలాగులతో గుర్తు పెట్టుకుంటారని మేం భావిస్తాం. రిచ్ డైలాగులున్న సినిమాని మర్చిపోలేరు. సింపుల్ లైన్లతో పని జరిగిపోయినా, అవి మెమరబుల్ గా వుండవు. మా ఉద్దేశంలో మెమరబుల్ ఫిలాసఫీని తేలికైన భాషలో చెప్పేదే సింపుల్ లైను.

3. యానిమల్ లో రణబీర్ కపూర్, అనిల్ కపూర్ లు నటిస్తున్నారు. కబీర్ సింగ్ తీసిన సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. కబీర్ సింగ్ కి మీరే డైలాగులు రాశారు. ఇప్పుడు యానిమల్ కి మీరెలా డిఫరెంట్ గా రాస్తున్నారు?
       సినిమాటిక్ డైలాగుల్నిఆదరించే దర్శకులు కొందరైనా వున్నారని మా నమ్మకం. ఆ వర్గంలో సందీప్ తప్పకుండా ఒకరు. యానిమల్ కథ ఆయన చెప్పగానే ఉద్వేగానికి లోనయ్యాం. ఇందులో డైలాగుల ద్వారానే కథ చెప్పాలి. మేం రాసిన సినిమాలకి డిఫరెంట్ టోన్స్ నీ, డిఫరెంట్ లోకాల్నీ సృష్టించాం. బ్రదర్స్ లో కేథలిక్ కుటుంబాన్ని, జెర్సీలో పంజాబీ సామాజిక వాతావరణాన్ని. అలా యానిమల్లో సింపుల్ లైన్లతో బాటు స్పెషల్ లైన్లు కలిసిపోయిన ప్యాకేజీగా ఇచ్చాం. సినిమాటిక్ టోన్ నీ, సింప్లిసిటీనీ సవాలుగా తీసుకుని బ్యాలెన్స్ చేశాం. డైలాగుల్లో ప్రత్యేక మానసిక స్థితి కనబడాలన్నారు సందీవ్. ఆ మేరకు నిగూఢ మానసిక స్థితిని ప్రతిబింబించాం.

4. మీరు వివిధ జానర్లకి రాశారు. మీ వర్కింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి?
       నిజానికి మా ప్రతీ స్క్రిప్టు డిఫరెంట్ ప్రాసెస్సే. రామ్ లీలాలో షేక్స్ పియర్ రాసిన రోమియో జూలియెట్ ప్రేమ కథని వయోలెంట్ గా మార్చి రాశాం. ఆ ప్రకారం స్క్రీన్ ప్లేని, డైలాగుల్నీ, పాటల్నీ ప్రాసెస్ చేశాం. స్క్రిప్టు ప్రతీ లెవెల్లో దాని టోన్, కథాలోకం, పాత్రలు మొదలైనవి చాలా రీసెర్చిని డిమాండ్ చేశాయి. ఈ ప్రాసెస్ లో బాగంగా నిజ జీవిత వ్యక్తుల్నీ, వాళ్ళ మ్యానరిజమ్స్ నీ తెలుసుకోవడం నిత్య కార్యక్రమమై పోయింది. ఈ ప్రాసెస్ నే ఆయా కథలు డిమాండ్ చేసే వాటికీ అమలు చేస్తాం. మేం రాసే పాటలూ  స్క్రీన్ ప్లేల్లోంచే పుడతాయి కాబట్టి, ఆ లిరిక్స్ సిట్యూయేషనల్ గా, యూనివర్సల్ గా వుండేట్టు చూస్తాం.

5. రచయితలుగా సినిమా నిర్మాణంలో మీరెంత వరకు భాగం పంచుకుంటారు?
       మేం రాసిన ప్రతీ స్క్రిప్టు షూటింగులో మేమున్నాం. టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథ మా ఐడియానే  కాబట్టి, రీసెర్చిలో, రైటింగ్ లో కూలీల్లాగా శ్రమించాం. షూటింగులో, ఎడిటింగులో వున్నాం. ఇదంతా మేం దర్శకత్వం వహించడానికి తోడ్పడింది. దుకాన్ సబ్జెక్టు గుజరాత్ నేపధ్యంలో అద్దె గర్భాలతో వ్యాపారం గురించి. యే సాలీ  ఆషిఖీ  ఉత్తరప్రదేశ్ లో ఆనర్ కిల్లింగ్స్ గురించి. ఇండియాని కథల గనిగా మేం భావిస్తాం. తవ్వి చూస్తే ఆణిముత్యాలే దొరుకుతాయి. ఈ కథల్ని కనుగొనడం, రీసెర్చి చేయడం, వెండితెర మీద ప్రాణం పోయడం - ఇదంతా మాకు అమితానందాన్నిచ్చే ప్రాసెస్.   

దుకాన్ కోసం ఎన్నోసార్లు గుజరాత్ లోని ఆనంద్ కెళ్ళాం. అక్కడి ఫీల్ ని పట్టుకోవడం కోసం. అక్కడి సామాజికార్ధిక పరిస్థితుల అవగాహన కోసం. దుకాన్ స్క్రిప్టు నాల్గేళ్ళుగా ప్రాసెస్ లో వుంది. గుజరాత్ లో నవరాత్రి సందర్భంగా పాడుకునే పాటల్ని, సంగీతాన్నీ రీసెర్చి చేశాం. ఇలాటి కథ సినిమాగా రాలేదు గనుక, శూన్యం లోంచి సృష్టించాలీ గనుక, ఈ మాత్రం కాలం తీసుకుంటుంది.

       అలాగే ఉత్తరప్రదేశ్ లో ఆనర్ కిల్లింగ్స్ గురించి యే సాలీ ఆషిఖీ కి రీసెర్చి చేశాం.  కొన్నేళ్ళుగా దేశంలో ఆనర్ కిల్లింగ్స్ 700 శాతం పెరిగి పోయాయి. నిజ జీవితంలో ప్రేమికు లెదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్ని చూపించ దల్చుకున్నాం. అసలు ఆనర్ కిల్లింగ్ పద బంధమే ఎంత వరకు కరెక్టో ప్రశ్నిస్తున్నాం. ఆనర్ కిల్లింగ్స్ అంటే పరువు హత్యలనే అర్ధం వస్తుంది. పరువునా హత్య చేస్తున్నది? ఇది అర్ధవంతంగా వుందా? పరువుని హత్య చేయడమేమిటి?

6. రచయితలకి గుర్తింపు లభించే దిశగా పరిస్థితులు మారతాయంటారా? అప్పట్లో సలీం -జావేద్ ల రాకతో రచయితలకి గుర్తింపూ పారితోషికాలూ పెరిగాయి. ఆ కాలం మళ్ళీ తిరిగొస్తుందా?
        ఇప్పుడు ఫర్వా లేదు. అయితే ఇంకా లభించాల్సిన స్థాయిలో గుర్తింపు లభించాలని అనుకుంటున్నాం. మేం ట్రైలర్స్ లో కూడా మా పేర్లు వేసేలా పోరాడేం. చాలా తక్కువ మంది నిర్మాతలే ఎలాగో  పోస్టర్స్ లో, ఫస్ట్ లుక్స్ లో పేర్లు వేస్తున్నారు. సలీం -  జావేద్ లు ప్రారంభంలో పెయింటర్స్ కి డబ్బులిచ్చి, తాము రాసిన సినిమాల వాల్ పోస్టర్ల మీద తమ పేర్లు రాయించుకునే వాళ్ళట ముంబాయి వీధులన్నీ తిప్పి. రచయితలకి గుర్తింపు కోసం పోరాడినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. అసలు సినిమా తీయాలంటేనే మొదట నియమించుకునేది రచయితని. రచయిత అడుగు పెట్టే వరకూ తెల్ల కాగితాలు తెల్ల కాయితాల్లాగే వుంటాయి.

7. మీరు సంజయ్ లీలా భన్సాలీ సినిమాలకి పని చేశారు. ఆయన సినిమాలకీ, ఇతర దర్శకుల సినిమాలకీ మీరు స్క్రిప్టులు రాయడంలో చూపించే తేడా ఏమిటి?
        సంజయ్ లీలా భన్సాలీ మాస్టర్ మైండ్. సినిమా మేకింగ్ పట్ల లోతైన అవగాహన ఆయనకుంది. రైటింగ్, ఎడిటింగ్, డిజైన్, ఆర్ట్, కెమెరా వర్క్ వగైరా. రైటింగ్ అంటే ఆయనకి చాలా పిచ్చి. మేం రాసిన ఒక లైన్ నచ్చితే, సింగిల్ స్క్రీన్ థియేటర్లో  ప్రేక్షకులెలా కేరింతలు కొడతారో, అలా గట్టిగా అరిచేస్తారు. ఆయనంత క్యాలిబర్ వున్న దర్శకులతో మేమింకా పని చేయాల్సి వుంది.

8. ఆయనతో వుండే డిఫరెంట్ ప్రాసెస్ ని మీరెలా తీసుకుంటారు? షూటింగ్ సమయాల్లో కూడా ఆయన మార్పు చేర్పులు చేస్తూంటారు కదా?
        ఆయనలా చేస్తారనేది దురభిప్రాయం మాత్రమే. నిజానికి ఆయన పని విధానంతో మా ప్రాసెస్ కలిసిపోయి వుంటుంది. రచయితలుగా మేము మా స్క్రిప్టుల్ని మార్పు చేర్పులకి అనువుగానే వుండేట్టు ఫ్లూయిడ్ గా రాస్తాం. ఆమూలాగ్రం సబ్జెక్టు మీద పట్టు వుంటేనే ఇది సాధ్యమవుతుందని అనుకుంటాం.

9. మీరు కమర్షియల్ స్క్రిప్టు రాస్తున్నప్పుడు జెండర్ రోల్స్ ప్రాధ్యాన్యంతో రాజీ పడకుండా వుండ గల్గుతారా? పురుషాధిక్యతకి , పితృస్వామ్య పంథాకి మీ రచనల్లో అవకాశం లేకుండా చూడగలరా?
        రచయితలు వాళ్ళ దృక్పథంలోంచి, అనుభవాల్లోంచి, పెంపకం లోంచీ, చూస్తున్న కళ్ళద్దాల్లోంచీ రాస్తారు. మేం జెండర్ రోల్స్ ని స్థాపించడానికి ఎప్పుడూ ప్రయత్నించం.సహజంగానే బలమైన, దృఢాభిప్రాయం కల్గిన స్త్రీ పాత్రల వైపే మొగ్గుతాం. ఆధునిక సమాజంలో ఫెమినిజంతో ప్రబలంగా నెలకొన్న దురవగాహన పట్ల పౌరులుగా మాకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. పురుషాధిక్యత నిర్వచనం పట్ల కూడా. రామ్ లీలా, టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథాల్లో బలమైన స్త్రీ పాత్రలే ఉదాహరణలు. శతాబ్దాల పితృస్వామ్య పెత్తనం పట్ల స్త్రీల నరనరాల్లో ఇంకిన వ్యతిరేకతనే ఈ పాత్రలు ప్రతిబింబిస్తాయి.

10. పాటల రచయితలకి ఎలాటి గుర్తింపు లభిస్తోందని మీరనుకుంటున్నారు?
        ప్రస్తుత పరిస్థితి అసంతృప్తి కరంగానే వుంది. గీత రచయితల కంటే గాయకులకీ, సంగీత దర్శకులకీ ఎక్కువ గుర్తింపు లభిస్తోంది. గీత రచన కళా కాదు, కవిత్వమూ కాదు. మ్యూజిక్ వేదికల మీద సంగీత దర్శకుడి పేరే వినిపిస్తుంది. గీత రచయితలు, గాయకులు, సంగీత దర్శకులూ కలిస్తేనే పాట పుడుతుందని గుర్తిస్తేనే పరిస్థితి మారుతుంది. గీత రచయిత రాయకుండా ఏం పాట పుట్టిస్తారు. అసలు గీత రచయితల కన్నా స్క్రిప్టుని అర్ధం జేసుకునే వాళ్ళు సమస్త సినిమా నిర్మాణపు శాఖల్లో వుండరని ఈ తరం దర్శకులు మర్చి పోతున్నారు. కుచ్ తో లోగ్ కహేంగే, సందేశే ఆతే హై- వంటి ఆనాటి పాటలే చూడండి- స్క్రిప్టుని అర్ధం జేసుకుంటేనే వాటినలా రాయగలరు కదా. సిట్యూయేషనల్ సాంగ్స్ అంటే ఏమిటో కూడా చరిత్రలోంచి నిర్మాతలు తెలుసుకోవడం లేదు. వాటి స్థానంలో హిట్ నంబర్స్ పెట్టాలనుకుంటారు. సిట్యూయేషనల్ సాంగ్స్ ని కూడా హిట్ నంబర్స్ లా పాటల రచయితలు రాయగలరని తెలుసుకోవడం లేదు. తెలుసుకుని నమ్మాలి మరి.

11. గత కొన్ని సంవత్సరాలుగా కంటెంట్ ఈజ్ కింగ్ అనే మాట బాగా వాడుకలో వుంది. ఇప్పుడు ఓటీటీల యుగంలో దీని ప్రాముఖ్యం ఏమైనా పెరిగిందంటారా?
          మార్పు తప్పకుండా కన్పిస్తోంది. అయితే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోలాగా కాకుండా, హిందీలో కంటెంట్ ప్రధాన సినిమాలు గాక, స్టార్ ప్రధాన సినిమాలే వుంటున్నాయి. ఓటీటీ దండయాత్రతో కంటెంట్ ప్రధాన సినిమాల వైపు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నా, దీన్నంది పుచ్చుకుని బాలీవుడ్ లో కంటెంట్ ప్రధాన సినిమాలు రావడానికి ఇంకా సమయం పడుతుంది.

12. కంటెంట్ కి ప్రాముఖ్యాన్నిచ్చి నిర్మాతలు వివిధ ప్లాట్ ఫామ్స్ ని ప్రయత్నిస్తున్నారు. కొన్ని సార్లు ఇది లీగల్ సమస్యల్ని తెచ్చి పెడుతోంది. కొన్ని సినిమాలని, వెబ్ సిరీస్ నీ మనోభావాల పేరుతో బ్యాన్ చేయాలంటూ, బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నారు. దీని గురించేమంటారు?
          సృజనాత్మక స్వేచ్ఛనేది ఆఫ్ ది రికార్డుగా హైసొసైటీ సంభాషణల్లోనే వుంటోంది. ప్రతీ క్రియేటర్ వెనుకా సెన్సార్ భూతం కూడా పొంచి వుంటోంది. అధికారంలో వున్న వాళ్ళకి విమర్శని స్వీకరించే మనస్తత్వం లేదు, సెటైర్ ని గౌరవించే సంస్కృతీ లేదు. అసహిష్ణుతే వారి స్వభావంగా మారింది. సినిమాల మీద పెరిగిపోతున్న లీగల్ కేసుల్ని చూస్తే, భావ స్వేచ్ఛ ప్రాథమిక హక్కని కాదు, ప్రాథమిక పోరాటమని పోరాడాల్సిన సమయం వచ్చింది.

13.
ఇటీవల కాలంలో చాలా రీమేకులు, సీక్వెల్సులు, నిజ సంఘటనలతో తీసిన సినిమాలూ  వస్తున్నాయి. ఈ ట్రెండ్ లో కొత్త రచయితలకి తమదైన ఒరిజినల్ కంటెంట్ ఇచ్చుకునే అవకాశాలేమైనా వున్నాయంటారా?
        ఒరిజినల్ కంటెంట్ వైపు మేం గట్టిగా నిలబడతాం. దీనికోసం ఎంతైనా పోరాడతాం, ఎన్ని అడ్డంకులైనా దాటుతాం. రీమేకులతో నిర్మాతలు సేఫ్ గా ఫీలవుతారు. ఒక కొత్త ఐడియాకి ఏదైనా రిఫరెన్సు పాయింటు వున్నా మొగ్గు చూపుతారు. పూర్తిగా ఒరిజినల్ కంటెంట్ అనేసరికి ప్రోత్సాహం అంతగా వుండడం లేదు. ఓటీటీల్లో వుంటోంది. అక్కడ ఒరిజినల్ కంటెంట్ కి అవకాశాలెక్కువ, కొత్త రచయితలకి ప్లాట్ ఫామ్స్ కూడా పెరుగుతున్నాయి. 

14. రచయితలకి కనీస గౌరవ మివ్వడం లేదని ఆరోపణలున్నాయి. ఈమధ్య రైటర్స్ కీ, మేకర్స్ కీ మధ్య ఘర్షణలు తలెత్తిన సందర్భాలూ వున్నాయి. దీనిపై మీరేమంటారు?  
        సినిమాకి మొట్ట మొదట నియమించుకునేది రచయితనే. దర్శకుడే రచయిత కూడా కానప్పుడు మేకింగ్ అన్ని దశల్లో మేం తోడ్పాటుగా వుండాలని ఫీలవుతాం. ఎందుకంటే అనుకున్నదొకటి, తీసిందొకటి కాకుండా వుండాలని. కానీ దురదృష్టమేమిటంటే, స్క్రిప్టు పూర్తయి, కాస్టింగ్ ఫైనలయ్యాక, రచయితతో పని లేదని  తలుపు లేసేస్తారు. తమ కోసం పని చేసిన రచయిత విలువని గుర్తించడానికీ, ఇంకేమైనా ఇన్ పుట్స్ తీసుకోవడానికీ, పేరు కూడా వేయడానికీ ఇక మనసొప్పదు. పైసలు తీస్కో, పని చేస్కో, చెక్కేస్కో- ఇదీ వాళ్ళు నమ్మే విధానం. రచయితనే వాడు క్లోజుడు డోర్ హీరో. గది నిండా కూర్చున్న ప్రొడక్షన్ మనుషుల్ని ఒప్పించి చప్పట్లు అందుకుంటాడు. వాణ్ణి గనుక  బయటికి తోసేశాక బయటేమీ వుండదు, చప్పట్లు కొట్టే ప్రేక్షకులూ వుండరు.

        కానీ ఓటీటీ పుణ్యమాని పరిస్థితులు మారుతున్నాయి. వెబ్ సిరీస్ లో రైటరే షో రన్నర్. వెబ్ సిరీస్ నుంచి దర్శకుణ్ణి తీసిపారెయ్యొచ్చు గానీ  రచయితని తొలగించలేరు, పేరు వేయకుండానూ వుండ లేరు.

15. లాబీయింగ్, బంధుప్రీతి, కనెక్షన్స్ వంటి పవర్ డైనమిక్స్ మీ కెరీర్ కి అడ్డు పడలేదా?
        అడ్డుపడ్డాయి. మా సబ్జెక్టులతో నిర్మాతలు సినిమాల్ని ఎనౌన్స్ చేస్తే, పవర్ఫుల్ వ్యక్తులు రంగంలోకి దిగి వాటిని ఆపు చేయించిన అనుభవాలూ మాకున్నాయి. మాకు క్యాంపులూ గాడ్ ఫాదర్లూ లేకపోయినా, మెరిట్ ని, పనిని నమ్మాం. చాలా నిర్మాణ సంస్థలకి స్క్రిప్టు పనులు చేసి వున్న అనుభవంతో, ఏం జరిగినా మంచి రచనకి ఎప్పుడూ తీసివేయలేని విలువ వుంటుందని గ్రహించాం. అయితే మేమెప్పుడైతే దర్శకత్వానికి పూనుకున్నామో, అప్పుడొక కొత్త సినిమా పరిశ్రమ మాకు ఆవిష్కారమైంది. ఐడియా కొనుగోలు దగ్గర్నుంచీ స్క్రిప్టు తీసుకోవడం వరకూ, కాస్టింగ్ నుంచీ మిగతా ప్రొడక్షన్ వరకూ దేనికీ మెరిట్ బేసిస్ గా వుండదని అర్ధమయింది. ఎవరితో ఎక్కువ ర్యాపో వుంటే వాళ్ళే ప్రాజెక్టులోకి వచ్చేస్తారన్న మాట.


16. టాలెంట్ కంటే నెట్వర్కింగ్ ముఖ్యమంటారా?
        నెట్వర్కింగ్ చాలా చాలా ముఖ్యం. కొంత కాలం తర్వాత టాలెంట్ అప్రధానమైపోతుంది. ఎంత కాలం వుంటామన్నది టాలెంట్ ని బట్టి వుంటుంది. కానీ నిర్మాతల్ని ఎలా వెళ్ళి కలవ గల మన్నది తెలిసిన వాళ్ళతో నెట్వర్కింగ్ మీద ఆధారపడి వుంటుంది. ఇక్కడ ప్రతి వొక్కరూ స్క్రిప్టు పట్టుకుని తిరుగుతూంటారు, వినిపించాలని. నెట్వర్కింగ్ లేనిది ఎవరూ వినరు. కొందరు బండ మనుషులుంటారు. వాళ్ళు  రోజుల తరబడి ప్రొడక్షన్ ఆఫీసుల ముందుకూర్చునే వుంటారు. ఆఖరికి చూసి చూసి ఎప్పుడో పిలుపొస్తుంది లోపలి నుంచి.

17. ఓ పదేళ్ళుగా పరిశ్రమలో వుంటున్న కళాకారులుగా మీరు ఏఏ సమస్యలకి పరిష్కారాలు కోరుకుంటున్నారు?  
        ఫెమినిజం, సామాజికాంశాలు, రాజకీయ చిత్ర పటం, భావ స్వేచ్ఛ, పర్యావరణ పరిరక్షణ - వీటిని గురించి బలంగా ఫీలవుతాం. సినిమా పరిశ్రమలోని ప్రతీ శాఖలో లింగ భేదం లేకుండా సమాన చెల్లింపులు, పలుకుబడిని చూసి కాక మెరిట్ తో గుర్తించి ప్రోత్సహించడం, ఒరిజినల్ కంటెంట్ కి సపోర్టుగా వుండడం, తెర వెనుక పనిచేసే వారందరికీ సమానంగా క్రెడిట్స్ ఇవ్వడం, స్త్రీ పురుష పాత్రల్ని దైవాంశ సంభూతులన్నట్టు గాక సహజసిద్ధ వాస్తవిక చిత్రణలతో చూపడం, బయోపిక్స్ లో చీకటి కోణాల్ని కూడా చూపిండం, కొత్త తరహా స్క్రిప్టులకీ, కొత్తగా వచ్చే మేకర్లకీ సమానావకాశా లివ్వడం, లైటింగ్ సిబ్బంది, స్టంట్ మెన్లు, ఇతర టెక్నీషియన్లంలందరికీ మంచి సౌకర్యాలు కల్పించడం, వీటన్నిటితో బాటూ లాబీయింగ్ లేని, బంధు ప్రీతి లేని, స్వేచ్ఛాయుత సినిమా పరిశ్రమని మేం కోరుకుంటున్నాం.   

18. మీరు ప్రారంభించిన ఫాస్టర్ క్లాస్ వీడియోల గురించి చెప్పండి. ఈ ఐడియా వెనుక ఉద్దేశమేమిటి?
        స్క్రిప్టులు రాయడంలో వుండే ఫన్, పిచ్చి తనం, వెర్రి వేషాలు హైలైట్ చేయడం మా ఉద్దేశం. రచనా ప్రక్రియ రోమాన్స్ లాంటిదని చెప్పడమే మా ఫాస్టర్ క్లాస్ ఐడియా వెనకున్న ఉద్దేశం. మామూలుగా రచనలు చేయడం ఒంటరి జీవితాన్ని, అధిక శ్రమనీ డిమాండ్ చేసే శుష్క వ్యవహారమనే భావముంది. మేం దీన్ని ఫన్ గా మార్చి, వీలైనంత మందిని ఇటువైపు ఆకర్షితులయ్యేట్టు చేయాలని ప్రయత్నిస్తున్నాం. రాయడం గురించి కేవలం టిప్స్ ఇచ్చి వూరుకోవడం లేదు.

19. కొత్త రచయితల్లో మీరు కోరుకునే దేమిటి?
        హాస్యప్రియత్వం. కథ రాయడానికి అనేక పద్ధతులుంటాయి. అయితే సీరియస్ సామాజిక సమస్యల్ని కూడా హాస్యాయుతంగా చెప్ప వచ్చన్నది మేం తెలుసుకున్న నిజం. టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథాని డాక్యుమెంటరీగానే తలపోశాం. అది కాస్తా హాస్యంతో సింపుల్ కథగా, ఫన్ రైడ్ గా తయారైంది.

—ఏజెన్సీస్ 
fast class video

 

23, అక్టోబర్ 2021, శనివారం

1069 : రివ్యూ


 

రచన - దర్శకత్వం: సాయికృష్ణ ఎన్రెడ్డి
తారాగణం: సునీల్, సుహాస్, దివ్య శ్రీపాద, శ్రీవిద్య మహర్షి, చాందిని రావు, రుణ్,, తరుణ్ కివీష్ కౌటిల్య తదితరులు.
కథ: సందీప్ రాజ్, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం : వెంకట్ ఆర్. శాఖమూరి
నిర్మాతలు: ప్రదీప్ , మ్యా చౌదరి
విడుదల: అక్టోబర్ 22, 2021 (జీ 5)
***

        కొత్త టాలెంట్ తో మరో రియలిస్టిక్ మూవీ జీ5 లో ఈ రోజు విడుదలైంది. కలర్ ఫోటో కి కథ ఇచ్చిన రచయితల్లో ఒకరైన సందీప్ రాజ్ కథతో, సాయికృష్ణ ఎన్రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ హెడ్స్ అండ్ టేల్స్ తీసి స్ట్రీమింగ్ కిచ్చేశాడు. ఫిలాసఫిక్ టచ్ తో ఓ ముగ్గురమ్మాయిల కథ చెప్పాలని ప్రయత్నం. రోమాంటిక్ కామెడీల్లోనైతే అమ్మాయిల్ని ఎలా చూపించినా చెల్లిపోవచ్చు గానీ, సీరియస్ రియలిస్టిక్ జానర్లో కూడా ఇలాగే చూపిస్తే చెల్లుతుందా? బొమ్మా బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యీ అని పాత పాట. ఈ టాస్ వేసినప్పుడు ఈ కొత్త టాలెంట్ గెలిచారో లేదో చూద్దాం...

కథ

    రిపోర్టర్ రఘురాం దేవుడ్ని (సునీల్) ఇంటర్వ్యూ చేస్తూంటాడు. బిగ్ బ్యాంగ్ గురించి, కోవిడ్ మహమ్మారి గురించీ కామెడీగా చెప్తాడు దేవుడు. ఈ దేవుడు ముగ్గురమ్మాయిల కథ కూడా చెప్పుకొస్తాడు. అలివేలు మంగ(దివ్య శ్రీపాద), శృతి (చాందిని రావు), అనీషా (శ్రీవిద్య )ల జీవితాల గురించి చెప్తాడు. వీళ్ళు ముగ్గురూ కర్మ సిద్ధాంతానికి ప్రతీకలు. అలివేలు మంగ కానిస్టేబుల్. బార్లో పనిచేసే ఆమె భర్తతో సమస్య వస్తుంది. అతను బార్లో చేసిన ఒక నష్టానికి డబ్బు కట్టాల్సి వచ్చి మంగ మెడలో వున్న నగ ఇమ్మని వేధిస్తూంటాడు.

        అనీషా సినిమా హీరోయిన్ అవ్వాలని ప్రయత్నిస్తూంటుంది. ఆమెకి వేశ్యగా నటించే అవకాశం వస్తుంది. వేశ్యాగా నటిస్తే చంపుతానని బెదిరిస్తూంటాడు ఆమెతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న బాయ్ ఫ్రెండ్, దీంతో ఆమె పోలీస్ స్టేషన్ కెళ్ళి కానిస్టేబుల్ మంగ రక్షణ కోరుతుంది. శృతికి కూడా బాయ్ ఫ్రెండ్ తో సమస్యలుంటాయి. ప్రతీ బొమ్మకీ మగాడు బొరుసు మగాడు అన్నమాట. ఆ మగాళ్ళు  టార్చర్ పెట్టే మృగాలు. వీళ్ళతో ఈ ముగ్గురి జీవితాలేమ య్యాయన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ
    ఆడవాళ్ళ స్వాతంత్ర్యం- మగాళ్ళ స్వార్ధం అనే పాయింటు ఈ సినిమా కాన్సెప్ట్. కాలం మారినా మగాడు మారడు. మారాలనుకుంటున్న ఆడదానితో అదే పెత్తనం. దీనికి పరిష్కారమేమిటి? ఇదే చెప్పారు ఈ కథలో. అయితే చెప్పడంలో పట్టుగానీ, నేర్పుగానీ కనిపించవు. పాత్రల మధ్య సరైన సంఘర్షణ, భావోద్వేగాలూ లేకపోవడం కాన్సెప్ట్ ని నీరుగార్చింది. పరిష్కారాల్ని అంత తేలికగా చెప్పేశారు. అన్నీ సమస్యలకీ సులువైన పరిష్కారాలుంటాయి గానీ, ఇది తెలుసుకోక కష్టాలు పెంచుకుంటామని చెప్పారు. ముగ్గురి కథల్లో సమస్యలే సరిగ్గా చూపించనప్పుడు, పరిష్కారాలు ఇంతే బలహీనంగానే, సులువుగానే నే కదా వస్తాయి.

        ముగ్గురమ్మాయిల్లో ఎవరి సమస్యా ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే బలంతో లేకపోవడం, పాత్ర చిత్రణల్లో స్థిరత్వం లేకపోవడం కేవలం 83 నిమిషాలే వున్న ఈ ఫిమేల్ డ్రామాని కూడా నిలబెట్టలేకపోయాయి. ముగ్గురి కథల్లో ఏ వొక్కరి కథకీ సహేతుక పరిష్కారం లేదు.

నటనలు - సాంకేతికాలు

     ముగ్గుర్లో కానిస్టేబుల్ మంగగా నటించిన దివ్య మాత్రం నటనతో స్కోరు చేస్తుంది. ఆమె పాత్ర  కొంతలో కొంత సానుభూతి పొందేలా వుండడం నటించడానికి స్కోపు నిచ్చింది. పాత్ర తెలంగాణా మాట్లాడుతుంది. మిగిలిన ఇద్దరికీ పాత్రలతో బాటు నటనలూ సరిగ్గా లేవు, ఒక్క నటిగా సీఐగా నటించినప్పుడు మాత్రం శ్రీవిద్య బావుంటుంది. ఇంకెవరికి సరైన పాత్రలున్నాయంటే, భర్త పాత్ర, బాయ్ ఫ్రెండ్స్ పాత్రలు నటించిన ముగ్గురికీ ఎక్కువసేపు పాత్రల్లేవు. వున్న ఆ కాసేపు అంతంత మాత్రం. ఇక  తలరాతలు రాసే దేవుడిగా నటించిన సునీల్ కామెడీతో లాగించేశాడు. కానీ ఆ తలరాతలకి దేవుడిగా ముగింపు ఎలా ఇవ్వాలో తేల్చుకోలేకపోయాడు. బొమ్మా బొరుసాట ప్రారంభించి తేల్చలేక - ఏదో అయ్యిందనిపించి బుక్కైపోయాడు. ఇక కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ ది పంచ్ డైలాగులతో అర్ధం లేని అతిధి పాత్ర.

        ఈ కథ ఎక్కువ భాగం రాత్రి జరుగుతుంది. హైదారాబాద్ రాత్రి దృశ్యాలు బాగా చూపించాడు కెమెరామాన్ శాఖమూరి. మణిశర్మ సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా బలంగా వుంది. కానీ బలహీన కథకి బలమైన సంగీతం ఏం ఉద్ధరిస్తుంది. సినిమా ఫస్టాఫ్ మాత్రం కథ ప్రారంభం కాక కంటిన్యూటీ వుండని సీన్లతో బాగా నస పెట్టేస్తుంది. సెకండాఫ్ లో బలహీన ఫిమేల్ డ్రామా ఓపికని తెగ పరీక్షిస్తుంది. ఓటీటీలో ఈ సినిమాని మాస్ చూడకపోవచ్చు. క్లాస్ వర్గం చూడాలంటే ఈ క్రియేటివిటీ, కంటెంట్ సరిపోతాయా?

—సికిందర్
(దీనిపై సమగ్ర విశ్లేషణ సోమవారం)

22, అక్టోబర్ 2021, శుక్రవారం

1068 : రివ్యూ

రచన, కూర్పు, ఛాయాగ్రహణం, దర్శకత్వం : రేవంత్ కోరుకొండ‌
తారాగణం : సంధ్యారాజు, క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్‌, ఆదిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌ తదితరులు
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : రేవంత్ కోరుకొండ
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియెషన్స్
, నిశృంఖల ఫిలిమ్స్
నిర్మాతలు : దిల్ రాజు
, సంధ్యా రాజు
విడుదల : అక్టోబర్ 22
, 2021

***

        ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్యా రాజు నటించిన నాట్యం దిల్ రాజు సహ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొత్త దర్శకుడు రేవంత్ కోరుకొండ దీన్ని రూపొందించాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు దీనికి చేసిన ప్రచారం ఓ యెత్తు. దీంతో ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది. మరి ఈ హైప్ కంతటికీ న్యాయం చేసేలా వుందా ఈ మూవీ? చూద్దాం...


 కథ
        నాట్యం అనే గ్రామంలో సితార (సంధ్యారాజు) కి నాట్యమంటే ప్రాణం. గురువు (ఆదిత్యా మీనన్) చెప్పిన కాదంబరి అనే నర్తకి కథ విని, అలా నాట్యం చేయాలని నేర్చుకుంటుంది. ఆ నాట్యం ద్వారా కాదంబరి కథ చెప్పాలని కలలు గంటుంది. ఇంతలో రోహిత్ (రోహిత్ బెహ‌ల్‌) అనే అతడితో వ్యవహారం ఆమెని వూళ్ళోంచి వెలి వేసేలా చేస్తుంది. అతడితో కలిసి సిటీకి చేరిన సితార తిరిగి వూళ్ళో ఎలాగైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సంకల్పిస్తుంది. మరి ఆ లక్ష్యం నెర వేరిందా, ఎలా నెర వేరిందనేది మిగతా కథ.

ఎలా వుంది కథ

   నాట్యకళ గురించి ఈ రోజుల్లో సినిమా తీయడం సాహసమే. ఇందుకు ముందు అభినందించాలి నిర్మాతల్ని, దర్శకుడ్ని. దర్శకుడు గతంలో దీన్ని షార్ట్ ఫిలిమ్ గా తీశాడు. తర్వాత ఇప్పుడు సినిమాగా తీశాడు. ఇందులో ప్రధాన పాత్ర సీతారగా నటించిన ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్యారాజు, రాంకో ఇండస్ట్రీస్ ఛైర్మన్ పిఆర్ వెంకట్రామ రాజు కుమార్తె మాత్రమే గాకుండా, సత్యం రామలింగ రాజు కోడలు కావడం విశేషం. దీంతో సినిమాకి హైప్ వచ్చింది. ఆమె డా. వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెయ్యికి పైగా నాట్య ప్రదర్శన లిచ్చారు. నిశృంఖల పేరుతో నాట్యకళా శాల నిర్వహిస్తూ ఉచితంగా నాట్యం నేర్పుతున్నారు. అయితే ఇదే తను నటించిన మొదటి సినిమా కాదు. 2017 లో మలయాళ కేర్ఫుల్ (యూటర్న్ రీమేక్) లో నటించారు.

        నాట్యం కథ ద్వారా దేవాలయాల్లో గతించిన నాట్య ప్రదర్శనల సాంప్రదాయ ప్రాముఖ్యం గురించి చెప్పడం ఉద్దేశం. కానీ చెప్పిన విధానం ఈ మంచి ఉద్దేశానికి సహకరించలేదు. దీనికి ప్రస్తుత కాలంలో హీరోతో ప్రేమ కథ, ఇంకోవైపు గతం తాలూకు కాదంబరి ఫ్లాష్ బ్యాక్ కలిపి చేసిన ప్రయత్నం కలిసిరాలేదు. కాదంబరి కథతో నాట్యం చేస్తే చనిపోతారనే మూఢనమ్మకాన్ని తొలగించడం హీరోయిన్ లక్ష్యం. ఈ లక్ష్యం బాగానే వున్నా, కొత్త దర్శకుడి అనుభవ రాహిత్యంతో పూర్తిగా అభాసుపాలైంది. తను కె. విశ్వనాధ్ సినిమాల అభిమానినని చెప్పుకుంటూ, ఆ అభిమానాన్ని ఇలా చాటుకోవడం మాత్రం అమెచ్యూరిష్ గా వుంది. ఇంతకంటే దీని గురించి చెప్పుకోవడానికి లేదు.

నటనలు - సాంకేతికాలు


        నటిగా కంటే నాట్యకారిణిగా సంధ్యారాజు రాణించారు. ఆమె చేసిన నాట్యాలు వండర్ఫుల్. క్లయిమాక్స్ నాట్యం ఇంకా వండర్ఫుల్. నాట్యాలకి కి సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్ లు కూడా ప్రాణం పోశారు. అయితే పాత్ర నటించడం మాత్రం ఆమెకి సాధ్యం కాలేదు. నాట్యకారిణికి నటన ఎందుకు రాదనేది పెద్ద ప్రశ్న. నాట్యంలో ప్రదర్శించే హావభావాలు నటనలో ఎందుకు ప్రదర్శించలేరు? ఈ విషయంలో ఎందుకో ఆమె పూర్తిగా విఫలమయ్యారు. పైగా హీరో గా నటించిన రోహిత్ బెహ‌ల్‌ తో రోమాన్స్ పెట్టారు. దర్శకుడి చేతిలో ఈ రోమాంటిక్ ట్రాక్ ఎంత సిల్లీగా వుందో, హీరోతో బాటు ఆమె నటనా అంత సిల్లీగా వుంది. హీరో నటన నేర్చుకోవడానికి ఈ సినిమాలో నటించినట్టు అనిపిస్తాడు. అదేం నటనో అర్ధంగాదు.  

        ఇక గురువుగా  ఆదిత్యామీనన్ చిన్న పాత్ర వేస్తే, భానుప్రియ, శుభలేఖ సుధాకర్ లు కూడా రెండు చిన్న పాత్రలేశారు. క్లయిమాక్స్ లో కమల్ కామరాజు నాట్యం బావుంది. ప్రొడక్షన్  రిచ్ గా అనిపించేలా ఖర్చు పెట్టారు గానీ, దర్శకుడే ఛాయాగ్రహణం, కూర్పు కూడా నిర్వహించడంతో టెక్నికల్ గా పూర్ గా వుంది.

        ఫస్టాఫ్ కథ ఎత్తుగడ బావుంది, ఓ ఇరవై నిమిషాల పాటు క్లయిమాక్స్ బావుంది. మధ్యలో కథాకథనాలు, నటనలు, దర్శకత్వం మాత్రం సహనాన్ని పరీక్షిస్తాయి. యువదర్శకుడు ఇంత పాత మోడల్లో ఎలా తీస్తాడా అన్పించేలా!

—సికిందర్
     

20, అక్టోబర్ 2021, బుధవారం

1067 : ఫ్లాష్ బ్యాక్ సంగతులు


 "Don't tell the reader about the past until he or she cares about the future. A flashback should not stop a movie just to provide exposition. A flashback should move the story forward”  – David Trottier, The Walt Disney Company screenplay developer

    కొం పొలం కథ ఫ్లాష్ బ్యాక్ గా ప్రారంభించడంలో గల దోషాన్ని తెలియజేస్తూ  దీని మీద వివరంగా రాయమన్నారు ఒక దర్శకుడు. అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో రాస్తున్నాం. కొండపొలం కథ హీరో సివిల్ సర్వీసుల ఇంటర్వ్యూకి హాజరవడంతో ప్రారంభమవుతుంది. ఇంటర్వూలో అతను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్టు కోరుకోవడానికి కారణం చెప్తాడు. తను గొర్రెల కాపరి కొడుకు, నల్లమల అడవుల్లో స్వీయ శిక్షణ పొందాడు ... ఇలా చెప్పుకుపోతూంటే అధికారికి నమ్మకం కలగదు. తన కథ రెండు గంటలు చెప్తేగానీ అర్ధంగాదని అంటాడు హీరో... ఆ కథ ఫ్లాష్ బ్యాకుగా ప్రారంభమవుతుంది.

        లా ప్రారంభించడంతో హీరో ఎవరో, అతడి జీవితమేమిటో ముందే కథ తెలిసిపోతోంది కదాని దర్శకుడన్నారు. ఫ్లాష్ బ్యాక్ కాకుండా లీనియర్ కథగా చేసి వుంటే పాత్ర, దాని కథ, గోల్ క్రమానుగత సస్పెన్స్ తో చూసేలా చేసేవన్నారు. నిజమే, సినిమాలో చూపించిన విధంగా, అతను ఫారెస్ట్ ఆఫీసర్ కాబోతున్నాడని ముందే చెప్పేసి, దాని తాలూకు ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించడంతో, అన్నీ తెలిసిపోతూ పేలవంగానే ప్రారంభమయింది కథ. కథ ఎత్తుగడ ఆసక్తి పుట్టించేలా వుండాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించారు.

        ఈ ఫ్లాష్ బ్యాక్ సినిమా చివరంటా సాగి ఇంటర్వూ దగ్గర కొచ్చి ముగుస్తుంది. ఇలా తన కథ చెప్పుకొచ్చిన హీరో, చివరి వాక్యాలు చెప్పి, ఫారెస్ట్ ఆఫీసర్ గా పోస్టులో చేరిపోయి  శుభం వేస్తాడు. ఫారెస్ట్ ఆఫీసరవుతాడని ప్రారంభంలోనే తెలిసిపోయింది. తెలిసిపోయిన దాన్నే చివర్లో చూపించడం దేనికి? ఇందులో డైనమిక్స్ ఏమున్నాయి?

        వాస్తవానికి ఈ కథ అడవుల్లో ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కొనే గొర్రెల పెంపకం దార్ల కథ. తన తండ్రి పడుతున్న ఈ కష్టాల్ని తండ్రి వెంట వుంటూ కళ్ళారా చూసిన హీరో, ఈ కష్టాల్ని ఎలా తీర్చాలని గాక, స్మగ్లర్ల బారి నుంచి అడవుల్ని కాపాడాలన్న వేరే ఆశయం ఎత్తుకుని ఫారెస్ట్ ఆఫీసరవుతాడు!

        అంటే స్టోరీ కాన్సెప్ట్ డిమాండ్ చేస్తున్న ఆశయం ఒకటైతే హీరో చేసిందొకటి. ఇలా స్టోరీ అయిడియానే ఫ్రాక్చరైంది. కథ డిమాండ్ చేస్తున్న ప్రధాన ఆశయం గొర్రెల పెంపకందార్ల సమస్యల సంబంధించిన పరిష్కారం జరగనే లేదు. ఇది దారి తప్పిన ముగింపు. కథగా కూడా ఇది సమగ్రంగా లేదు. నల్లమల్ల అడవులంటే కేవలం ఒక పులి, గొర్రెల పెంపకందార్లు, స్మగ్లర్లు మాత్రమే అన్నట్టు చూపించారు. కానీ ఇంకా గిరిజనులు కూడా వుండాలి, ఇతర వన్యప్రాణులూ, మరీ ముఖ్యంగా ఫారెస్ట్ శాఖ సిబ్బందీ వుండాలి అడవన్నాక. వన్య ప్రాణుల్ని, ఫారెస్టు సిబ్బందినీ  అలా వుంచుదాం. అన్నీ బాధలు పడుతున్న గొర్రెల పెంపకం దార్లకి ఆసరా ఇచ్చే విధంగా గిరిజన పాత్రలు లేకపోవడం ఈ కథ రీసెర్చి రాహిత్యాన్ని తెలుపుతోంది.

        ఇక్కడొక సమాచారం చూద్దాం :  "గొర్రెల మేకల పెంపకం దార్లను నల్లమల అడవుల్లో మేపుకు అనుమతి ఇవ్వాలి. గిద్దలూరు నియోజకవర్గంలో 2లక్షల గొర్రెలు మేకలు ఉన్నాయి. ఈ వృత్తిని నమ్ముకొని గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, బెస్తవారి పేట, కంభం, అర్ధవీడు మండలాల్లో 5వేల కుటుంబాలు జీవనాధారం సాగిస్తున్నారు. వేసవిలో మేత లేక, నీరు లేక ఇతర ప్రాంతాలకు, అడవులకు వలసలు వెళ్తున్నారు. అక్కడ అనేక సమస్యలకు గురవుతున్నారు. గ్రామాల్లో నీటి సమస్యకి, మేత సమస్యకి ప్రభుత్వం పరిష్కారం చూపగలిగితే వలసలు ఆగుతాయి.

        "తొలకరి లో వర్షాలు పడితే నల్లమల అడవుల్లో పచ్చిక పెరుగుతుంది. అక్కడ మేపుకునే విధంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. అడవిలో మేతకు వెళ్తే  అటవీ అధికారులు గొర్రెల కాపరులను కొడుతూ, వారి దగ్గర ఆహార పదార్థాలను, పొట్టేళ్ళను లాక్కొని తీసుకెళుతున్నారు....

        "ప్రతి గ్రామానికి వేసవిలో గొర్రెల మేకల పెంపకం దార్లకు నీటి తొట్లను, అలాగే గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో కనీసం 10 ఎకరాల పొలాన్ని కల్పించాలి. గొర్రెల పెంపకం దార్లు అంటే సమాజానికి బలమైన ఆహారం ఇచ్చే వారు. అటువంటి వారికి ప్రభుత్వం తగిన ప్రాతినిధ్యం కల్పించాలే తప్ప వారిని హింసకు గురి చేయడం సరికాదు..."

        మన హీరోకి ఈ సమస్యలు, పరిష్కారాలు కన్పించ లేదేమో. కళ్ళముందున్న కుటుంబ సంరక్షణ వదిలేసి అటవీ సంరక్షణకి కంకణ బద్ధుడై అధికారి అయిపోయాడు! ఇలా ఐడియా దశలోనే ఈ కథ విఫలమైన దృష్టాంతమిది. ఐడియాని రీసెర్చి చేసి, ఐడియా దశలోనే అందులో కథ వుందా, గాథ వుందా, లేక ఈ సినిమాలో వున్నట్టు వివిధ పాయింట్లతో ఎపిసోడిక్- డాక్యుమెంటరీ కథనముందా పరిశీలించుకోక పోవడం దెబ్బ కొట్టింది.

2.
        సరే, ఫ్లాష్ బ్యాక్కొద్దాం. ఈ సినిమాని పూర్తిగా ఫ్లాష్ బ్యాకుగానే చూస్తాం. ఫ్లాష్ బ్యాక్ అనేది కథ అవదు. కథంటే పాత్ర ప్రెజెంట్ టైమ్ ని చూపించేది. ఫ్లాష్ బ్యాక్ పాస్ట్ టైమ్ అవుతుంది. హీరో ఇంటర్వ్యూ సీన్లు ప్రెజెంట్ టైమే కాబట్టి ఇదే కథ. ఫ్లాష్ బ్యాక్ అనేది పాత్ర పాస్ట్ టైమ్ లో వెల్లడయ్యే సమాచారం. లేదా జ్ఞాపకం. అంటే ప్రెజెంట్ టైమ్ లో చెప్తున్న కథకి అవసరమైన సమాచారాన్ని అందించే రీసోర్స్ మాత్రమేనాన్న మాట ఫ్లాష్ బ్యాక్.

        ఫ్లాష్ బ్యాకులు రెండు రకాలు. అప్పుడప్పుడు సందర్భానుసారం వచ్చే మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు, ఒకే ఫుల్ లెన్త్ తీసుకునే లాంగ్ ఫ్లాష్ బ్యాకులు. మొదటిది అకేషనల్, రెండోది స్ట్రక్చరల్. మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులకి స్ట్రక్చర్ వుండదు. అవసరం లేదు కూడా. అవి బిట్లు బి‌ట్లుగా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఇమిడి వుంటాయి గనుక. లాంగ్ ఫ్లాష్ బ్యాక్ తానే ఒక స్ట్రక్చరై వుంటుంది. ఎందుకంటే మొదలు, చివర బెత్తెడు కథే వుంటుంది కాబట్టి, ఓ పూర్తి నిడివి కథంత స్పేస్ ని లాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఆక్రమిస్తుంది కాబట్టి దానికి కథ కుండే స్ట్రక్చర్ అత్యవసరం. అంటే కథకి ఎలాగైతే బిగినింగ్- మిడిల్- ఎండ్ లతో కూడిన త్రీయాక్ట్ స్ట్రక్చర్, ప్లస్ ఒకే కాన్ఫ్లిక్ట్ వుంటుందో అలాగన్న మాట. కొండ పొలం లాంగ్ ఫ్లాష్ బ్యాక్ కి ఇలా స్ట్రక్చరే లేదు. ఒకే కాన్ఫ్లిక్ట్  లేదు. వివిధ పాయింట్లతో (కష్టాలతో) కూడిన వివిధ కాన్ఫ్లిక్టులు వచ్చిపోతూంటాయి -  స్టార్ట్ అండ్ స్టాప్ డాక్యుమెంటరీ- ఎపిసోడిక్ కథనం లాగా. ఇలా ఫ్లాపయిన టైగర్ హరిశ్చంద్ర’, ఆటోనగర్ సూర్య లాంటివి లాగా. ఒకే సెంట్రల్ కాన్ఫ్లిక్ట్, దాంతో సంఘర్షణా అనే కథా లక్షణాన్ని కోల్పోతూ. 

3.
        ఇలా లాంగ్ ఫ్లాష్ బ్యాక్ ముందు, కొండపొలం లో వున్నట్టు మొదలు, చివర వుండే బెత్తెడు కథకి స్ట్రక్చర్ అవసరపడదు. కానీ ఫ్లాష్ బ్యాక్ ని ప్రారంభించే ట్రిగర్ పాయింట్ ఒకటి ముందున్న కథకి హుక్ లా వుండాలి. ఇది కొండపొలం లో లేక సాదాగా, పేలవంగా  ప్రారంభమయింది ఫ్లాష్ బ్యాక్.

        ట్రిగర్ పాయింట్ ఎలా వుంటుందో చూద్దాం - సినిమా కథలో ఫ్లాష్ బ్యాక్ అవసరం ఎంతవరకన్నది పాత్ర కేర్పడే అవసరాన్నిబట్టి వుంటుంది. సినిమా కథ పాత్ర లోంచే పుడుతుంది కాబట్టి ఫ్లాష్ బ్యాక్ అవసరం కూడా పాత్రలోంచే పుట్టాలి. ఫ్లాష్ బ్యాక్ అంటే పాత్ర జ్ఞాపకాల దొంతరే కాబట్టి. ఆ జ్ఞాపకాల తుట్టెని కదిపే ఎమోషనల్ లీడ్ వుండాలి. పరిస్థితి తీవ్రత, డిమాండ్ ఎమోషనల్ లీడ్ నిస్తాయి. కొండపొలం లోలాంటి బలహీన పరిస్థితి ఫ్లాష్ బ్యాక్ ని అస్సలు డిమాండ్ చేయదు.

        శ్రీనివాస రెడ్డి నటించిన జయమ్ము నిశ్చయమ్మురా లో స్క్రీన్ ప్లే ప్రారంభమే హీరో సముద్రం దగ్గర నిలబడి ఎమోషనల్ గా చూడడం  హీరోకి సంబంధించినంత వరకూ తీవ్ర పరిస్థితే కావచ్చు. అది ప్రేక్షకులు  ఫీలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అతను ఏ మానసిక స్థితిలో వున్నాడో ఇంకా ఆ ప్రారంభ సీనులోనే ప్రేక్షకులకి మెంటల్ మేకప్ తెలీదు. ఇక అతను మెళ్ళో తాయెత్తు తెంపి సముద్రంలోకి విసిరేస్తే దానికి కూడా ప్రేక్షకులు స్పందించలేరు. అదేమీ హీరోయిన్ తాళిబొట్టు తెంపి పారెయ్యడ మంత తీవ్ర సంఘటన కాదు - ఆ ఒక్క చర్యతో ప్రేక్షకులకి కుతూహలం పుట్టించడానికి. 

        అసలు తెంపింది  తాయెత్తు అని కూడా అప్పటికి ప్రేక్షకులకి తెలీదు, తర్వాత కథలో తెలుసుకుంటారు. కనుక  ‘జయమ్ము నిశ్చయమ్మురాలో ఇలా ఈ సీను విషయం లేని సీనుగా తేలుతోంది. విషయంలేని  సీనుతో స్క్రీన్ ప్లే ప్రారంభాన్ని ముడి వేయడం కుదరనట్టే, ఫ్లాష్ బ్యాకుకీ ఇంధనం ఇవ్వడం కుదరదని ఇక్కడ సోదాహరణంగా గమనించవచ్చు. అంటే ప్రారంభ సీనే కనెక్ట్  అవకుండా తేలిపోతూ, పాసివ్ మూడ్ లోకి నెట్టేస్తోందన్న మాట ప్రేక్షకుల్ని! 

4.
        అందుకని హీరో పాత్ర కొంత డెవలప్ అయ్యాకే ఫ్లాష్ బ్యాక్ లో కెళ్ళాలి. యే దిల్ హై ముష్కిల్లో హీరో పాత్ర డెవలప్ అయ్యాకే ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. డెవలప్ అవడం వర్తమానంలో జరిగేది. అంటే  ప్రెజెంట్ టైమ్. వర్తమానంలో ఈ హీరో ఒక సింగర్ అని అతడి చేతే అన్పిస్తారు. సింగర్ గా ఎలా స్ట్రగుల్ చేసి ఈ రేంజికి వచ్చాడో పరిచయం చేస్తారు. అప్పుడు తనకి పరిచయమైన అమ్మాయిలతో ప్రేమలు ఎలాగెలా కొనసాగాయో చెప్పిస్తూ  ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టిస్తారు అతడి పాయింటాఫ్ వ్యూలోనే.

        ఇతనెందుకు ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టుకున్నాడు? ఆ పరిస్థితి ఏమొచ్చింది? ఇతను మొదలెట్టుకోలేదు, పరిస్థితి డిమాండ్ అలా చేసింది. ఆ పరిస్థితి ఇంటర్వ్యూ ఇవ్వడం. ఇంటర్వ్యూ ఇవ్వడమనే పరిస్థితి, అవసరం, డిమాండ్ వగైరా అతడి చేత ఫ్లాష్ భ్యాక్ ప్రారంభించేలా చేసింది. కనుక ఈ స్క్రీన్ ప్లే ప్రారంభ సీనుకి అర్ధం, బలం, సపోర్టూ వగైరా చక్కగా ఏర్పడుతూ,  ఫ్లాష్ బ్యాక్ పట్ల కుతూహలం కూడా పుట్టించడానికి కారణమయ్యింది. దేనికీ కారణం కాని సీను ఒక సీనే కాదు.   
            ఫ్యాక్షన్ సినిమాల్లో కూడా గంటన్నర సేపు హీరో వర్తమానమంతా చూపించి, అప్పుడు ఎక్కడ్నించో వచ్చిన  కొత్త పాత్రని ప్రవేశ పెట్టి, అతను హీరోని గుర్తుపట్టేలా చేసి,  ‘బాబూ నువ్విక్కడున్నావా?’ లాంటి డైలాగుతో తో ఆశ్చర్యపోయేలా చేసి, ప్రేక్షకులకి కుతూహలం పుట్టిస్తారు. ఇంతసేపూ వర్తమానంలో ఇంత సాత్వికంగా కన్పిస్తున్న హీరో ఈ హీరో కాడా? ఇంకెవరోనా? ఐతే ఎవరు? ఎక్కడ్నించి వచ్చాడు? ఎందుకొచ్చాడు? ఆ ఫ్ల్లాష్ బ్యాక్ కథాకమామిషేమిటి....అన్నవి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది.

        ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన కథ అంటే- మెయిన్ స్టోరీ కాదు. అది మెయిన్ స్టోరీకి కావలసిన సందర్భంలో, కావాల్సిన సమాచారాన్ని తవ్వి అందించే వనరు మాత్రమే. జస్ట్ డేటా బ్యాంక్. బాబూ నువ్విక్కడ వున్నావా?’  అని హీరోని చూసి పాత్ర ఆశ్చర్య పడ్డప్పుడు, ఆ బాబు ఇక్కడున్న కారణాన్ని తెలిపే గత సమాచారాన్ని అందిస్తూ ఓపెన్ అయ్యేదే  ఫ్లాష్ బ్యాక్ అనే డేటా బ్యాంక్- కాల్ సెంటర్- సమాచార కేంద్రం ఏదైనా. ఈ సమాచారాన్ని గంటల తరబడీ ఇస్తూ కూర్చోలేరు, బోరు కొడుతుంది.  ఫ్యాక్షన్ సినిమాల్లో అరగంటకి మించి ఫ్లాష్ బ్యాక్స్ వుండవు.

సరైన ట్రిగర్ పాయింటు లేకుండా ఫ్లాష్ బ్యాక్ ప్రారంభిస్తే విఫలమవుతుందనే దానికి అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్ లో కూడా చూడొచ్చు. ఈ కథని నాన్ లీనియర్ గా ఫ్లాష్ బ్యాక్స్ చేసి చెప్పారు. ఓపెనింగ్ బ్యాంగ్ గా బావుంటుందనుకుని ఫీలైనట్టున్నారు, అనసూయ హీరోతో లిఫ్ట్ లో ఇరుక్కునే సీను ముందే చూపించేస్తూ సినిమా ప్రారంభించారు. కథాక్రమంలో డెవలప్ అయి దాని సమయంలో అది రావాల్సిన ఈ ప్లాట్ పాయింట్ వన్ సీనుతో ఓపెనింగే వేయడంతో, ఇప్పుడే కథేమిటో తెలిసిపోయింది! ఇలా ప్రారంభంలోనే  లిఫ్ట్ సీను వేసి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్స్ చూపించడంతో ముందేం జరుగుతుందో కథ తెలిసిపోవడమేగాక, ఈ సీను తర్వాత ఫ్లాష్ బ్యాక్స్ వల్ల  ఏ సస్పెన్సూ కూడా లేకుండా పోయింది. ఇంటర్వెల్లో వేయాల్సిన లిఫ్ట్ సీను అనాలోచింతంగా సినిమా ఓపెనింగ్ లో వేసేస్తూ ఘోరమైన పొరపాటు చేసి - సినిమా మొత్తాన్నీ నీరు గార్చేశారు.

        ఇలా కాకుండా, దీని ఒరిజినల్  ఎలివేటర్ బేబీ లో లీనియర్ గానే కథ చెప్పాడు. దీనివల్ల ముందేం జరుగుతుందో తెలీదు. డిజాస్టర్ జానర్ మూవీ కథనం ఇలాగే వుంటుంది. లీనియర్ గా హీరో కథ, హీరోయిన్ కథా చూపించుకుంటూ వెళ్ళి, లిఫ్ట్ లో ఇరికించి అప్పుడు ఇంటర్వెల్  బ్యాంగ్ ఇచ్చాడు. దీని నిడివి గంటన్నర కూడా లేదు కాబట్టి, తెలుగులో చూపించిన హీరో హీరోయిన్ల పూర్వరంగమే ఇందులో ఎక్కువ నస పెట్టకుండా చప్పున ముగిసిపోతుంది.

5.
        లాంగ్ ఫ్లాష్ బ్యాక్ ని ప్రారంభించే కొన్ని ఉత్తమమైన ట్రిగర్ పాయింట్స్ ని ఇప్పుడు చూద్దాం -  టైటానిక్ లో చూస్తే, సెర్చి బృందం మునిగిన టైటానిక్ నౌకలో విలువైన వజ్రం అన్వేషణలో సముద్ర గర్భం లోంచి సేఫ్ ని పైకి తీసి తెర్చినప్పుడు, అందులో ఒకమ్మాయి చిత్రపటం దొరుకుతుంది. ఆ చిత్రపటాన్ని చూస్తూ గత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది వృద్ధురాలు. ఆ చిత్రపటంలో వున్నది తనే. ఏమిటి తన ప్రేమ కథ? ఆ ప్రేమ తనకి దక్కిందా లేదా? దక్కక పోతే జీవితాంతం ఇలాగే వుండి పోయిందా? ఆందోళనా, ఆతృతా కల్గించే ఈ ప్రశ్నలే ఫ్లాష్ బ్యాకుని ప్రేరేపించే ట్రిగర్ పాయింటు.

        నోట్ బుక్ లో చూద్దాం. హాస్పిటల్లో ఒక వృద్ధుడు వృద్ధురాలైన పేషెంట్ కి నోట్ బుక్ లోంచి ప్రేమ కథ విన్పిస్తూంటే ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. దీనికి ముందు కొంత కథ వుంటుంది హాస్పిటల్లోనే. ఆ దృశ్యాలు ఇక్కడ వర్ణించలేం గానీ, ఆ నోట్ బుక్ లో ఎవరి ప్రేమ కథ, ఎవరి జ్నాపకాలు రాశి వున్నాయీ అన్న ట్రిగర్ పాయింటుతో ఫ్లాష్ బ్యాక్ ఇగ్నైట్ అవుతుంది.

‘సిటిజన్ కెన్ లో చూద్దాం. ఒక పత్రికాధిపతి చనిపోతూ రోజ్ బడ్ అనే మాట చెప్పి చనిపోతాడు. ఈ రోజ్ బడ్ అనే మాట ట్రిగర్ పాయింట్. దీంతో ఇదేమిటో తెలుసుకోవాలని రిపోర్టర్ పాత్ర ప్రారంభించేదే లాంగ్ ఫ్లాష్ బ్యాక్.

        ఇలా లాంగ్ ఫ్లాష్ కి సస్పెన్సుతో కూడిన ట్రిగర్ పాయింట్ చాలా అవసరం. కొండ పొలం కథని లాంగ్ ఫ్లాష్ బ్యాక్ లో చెప్పాల్సిన అవసరమే లేదు. దాన్ని కథ లక్షణాలతో త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో కూర్చి, లీనియర్ కథనంగా చెప్తేనే డైనమిక్స్ తో కూడిన ఉత్కంఠ రేపొచ్చు.

 —సికిందర్