రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, అక్టోబర్ 2021, బుధవారం

 


సిడ్ ఫీల్డ్ 


సిడ్ ఫీల్డ్ ..సినిమా రంగంలో ఈ పేరు వినని దర్శకులు / రచయితలూ వుండరు. పండిత భాషలో , గ్రంధాల్లో  గుంభనంగా వుండి పోయిన స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని సులభ భాషలో ఔత్సాహికులకి కరతలామలకం చేసిన స్క్రీన్ ప్లే పండిట్ సిడ్ ఫీల్డ్.. నేడు స్క్రిప్ట్ రచనలో విప్లవాత్మక మార్పులు ఎలా చోటు చేసుకుంటున్నాయో ఆసక్తి కరంగా చెప్పుకొచ్చారు. చదవండి.. 

         ప్రపంచవ్యాప్తంగా నేను నిర్వహిస్తున్న స్క్రీన్ ప్లే కోర్సుల్లో, వర్క్ షాపుల్లో భాగంగా వేలకొద్దీ  స్క్రీప్లే లని చదివి వుంటాను. కచ్చితంగా ఎన్ని వేలు అన్నది చెప్పలేను, లెక్క వేయడం ఏనాడో మానేశాను. కానీ నేనే దేశంలో, ఏ నగరంలో పర్యటించినా అంతటా నాకొకే ప్రశ్న ఎదురవుతూంటుంది. పదేపదే ఈ ప్రశ్నే వేస్తూంటారు : సర్వసాధారణంగా స్క్రిప్టు రచయితల్లో  మీరు గమనించిన కామన్ లోపం ఏమిటనేది ఆ ప్రశ్న. కామన్ గా వుండే లోపాలు అనేకం వున్నాయి. హీరో పాత్రకి లక్ష్యం లేకపోవడం దగ్గర్నుంచీ, సెకండ్ యాక్ట్ లో స్ట్రక్చర్ పరమైన బలహీనతలు, బలమైన ముగింపులూ లేకపోవడం వరకూ అనేకం ఉంటున్నాయి. అయితే ఒక్క లోపం మాత్రం ప్రాంతాల కతీతంగా  కొట్టొచ్చినట్టూ  ఉంటోంది. అదేమిటంటే ఏ దేశంలోనైనా చాలా మంది రచయితలు కథని డైలాగుల ద్వారా నడిపించేస్తున్నారు. పాత్రల ఆలోచనల్ని, ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ నీ డైలాగులతోనే వివరించేస్తున్నారు.


          నిజమే, కొన్ని కథల్ని బట్టి ఈ విధానం తప్పక పోవచ్చు. 500 డేస్ ఆఫ్ సమ్మర్’  లాంటి రోమాంటిక్ కామెడీల్లో ఎంత నాన్ లీనియర్ గా కథ ఉన్నప్పటికీ యాక్షన్ ని చూపించడం, దృశ్యాలు ముందుకు కదలడం- డైలాగుల ద్వారానే జరగవచ్చు. ఈ సినిమాలో ప్రేమికుల మధ్య వున్న రిలేషన్ షిప్ కిచ్చిన డెప్త్ ప్రేక్షకుల్ని కట్టి పడేసే ఎమోషనల్ త్రెడ్ లా వుంటుంది. 


          నేడు స్టయిల్ పరంగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నవలా రచయితలు ఉపయోగించే క్రియేటివ్ టూల్స్ ని సినిమాల్లో వాడుకోవడం పెరిగిపోతోంది. పాయింటాఫ్ వ్యూ, మెమరీ, వాయిసోవర్ నేరేషన్, ఫ్లాష్ బ్యాక్స్ వగైరా క్రియేటివ్ టూల్స్ నవలా రంగం నుంచి దిగుమతి అయిపోతున్నాయి. దీంతో సమకాలీన స్క్రీన్ ప్లేల రూపు రేఖలే మారిపోతున్నాయి.


          ఇదే అంశం ఈ మధ్య నేనొక మిత్రుణ్ణి అనుకోకుండా ఓ కేఫెలో కలుసుకున్నప్పుడు చర్చ కొచ్చింది. చాలా కాలం తర్వాత కలుసుకోవడం వల్ల యోగ క్షేమాలు మాటాడుకున్నాం. తను టీవీ షోస్ కి రాస్తున్నట్టు చెప్పాడు. నేను నా వృత్తిలో భాగంగా గత రెండేళ్లుగా నాన్ స్టాప్ గా దేశాలు పట్టుకు తిరుగుతున్నా నన్నాను. ఐతే దేశ దేశాల్లో స్క్రీన్ ప్లే రైటింగ్ లో తేడాలేమైనా గమనించావా అని అడిగాడతను. ఇవ్వాళ్ళ అంతర్జాతీయంగా స్క్రీన్ ప్లే సాంప్రదాయ రచన నుంచి చాలాదూరం ప్రయాణించి వికాసం పొందు తోందని చెప్పాను. నేను సందర్శించిన ఏ దేశ నగరంలో నైనా బ్రెజిల్, కైరో, మాడ్రిడ్, మనీలా, మెక్సికో సిటీ, ముంబాయి, సింగపూర్, వియన్నా.. ఎక్కడైనా, భాష ఏదైనా - స్క్రీన్ ప్లేలని బొమ్మల ద్వారానే చెప్తున్నారని వివరించాను.  విజువల్ గా స్క్రీన్ ప్లేలు చాలా పరిణామం చెందుతున్నాయనీ, వాటి రూపం, నిర్వహణ, ఖండికలుగా వేర్పడి వుంటున్నాయనీ చెబుతూ,  ఈ క్రమంలో ముంబాయిలో  మై నేమ్ ఈజ్ ఖాన్అనే హిందీ సినిమాకి స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పని చేసిన అనుభవం గురించి కూడా చెప్పాను. ఈ ఇండియన్ ఫిలిం స్క్రిప్ట్ ని నా శిష్యుడే రాశాడు. ఈ కథ మన హృదయాల్లో మానవతని తడుముతుంది. దీంతో ఇది భాషలకి, దేశీయతలకీ, సంస్కృతులకీ అతీతంగా సార్వజనీనంగా ఉండిపోయింది. ఈ కథ ఫ్లాష్ బ్యాక్స్ తో, మెమరీస్ తో జీవితంలోకి హీరో ప్రయాణం లాగా వుంటుంది. అయితే ఇందులో హీరో పాత్ర ఇంకా బాగా వ్యక్త మవడానికి వాయిసోవర్ నేరేషన్ ని ప్రవేశ పెట్టమని సలహా నిచ్చాను. ఇందువల్ల ఎక్కువ వివరణలు ఇచ్చే అవస్థ తప్పుతుంది. కాకపోతే వాయిసోవర్ నేరేషన్ ప్రవేశ పెట్టడం వల్ల,  చాలా వరకూ స్టోరీ లైన్ ని రీ స్ట్రక్చర్ చేయాల్సి వచ్చింది - ముఖ్యంగా బిగినింగ్ లో.  ఐతే దీని ఇంపాక్ట్ మొత్తం సినిమా మీద చాలా  బాగా పనిచేసింది! 


          నేను వాయిసోవర్ నేరేషన్ ని ఎందుకు సిఫార్సు చేశానంటే, స్క్రీన్ రైటింగ్ లో ఒక సింపుల్ రూలుంది : యాక్షన్ ని క్యారక్టర్ డ్రైవ్ చేయాలి, లేదా క్యారక్టర్ ని యాక్షన్ డ్రైవ్ చెయ్యాలని.  500సమ్మర్ డేస్’, ‘షాషాంక్ రెడెంప్షన్’, ‘జూనో’  వంటి సినిమాల్లో యాక్షన్ ని క్యారక్టర్ డ్రైవ్ చేస్తుంది. లిటిల్ మిస్ సన్ షైన్’ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘ది లుక్ అవుట్’  లలో క్యారక్టర్ ని యాక్షన్ డ్రైవ్ చేయడాన్ని గమనించ వచ్చు. 


          నా దృష్టి కొచ్చినంత వరకూ స్క్రీన్ ప్లే రచన ఇప్పుడు చాలా వికాసం పొందింది. ఇది ఒకరకంగా విప్లవం కూడా! ఒకసారి ఎటోన్మెంట్’  లో చూడండి, ‘వాంటేజ్ పాయింట్’, ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్లలో చూడండి..ఈ విప్లవకర ధోరణిని మీరు బాగా గమనిస్తారు. ఇప్పుడు రిలీజవుతున్న దాదాపు ప్రతీ సినిమాలో వాయిసోవర్లు, సబ్ టైటిల్సు, ఫ్లాష్ ప్రెజెంట్ లు, ఇంటర్వ్యూలు, ఇంకా ఇతర మల్టీ మీడియా ప్రెజెంటేషన్ ఎలిమెంట్లూ అనేకం ఉంటున్నాయి...

***


 

         
          



 

 

18, అక్టోబర్ 2021, సోమవారం

1066 : రివ్యూ


రచన - దర్శకఠ్వం : ఆకర్ష్ ఖురానా
తారాగణం : తాప్సీ పన్నూ
, ప్రియాంశూ పన్యూలీ, అభిషేక్ బెనర్జీ, సుప్రియా పాఠక్, మనోజ్ జోషి తదితరులు
కథ : నందా పెరియసామి
, రచయితలు : అనిరుద్ధ గుహ, లీషా బజాజ్, కణికా థిల్లాన్, సంగీతం : అమిత్ త్రివేది, ఛాయాగ్రహణం : నేహా పిఎం
బ్యానర్ : ఆరెస్ విపి మూవీస్
, మ్యాంగో పీపుల్ మీడియా నెట్వర్క్
నిర్మాతలు : రోనీ స్క్రూవాలా
, నేహా ఆనంద్, ప్రంజల్ ఖందియా
విడుదల : 15 అక్టోబర్ 2021
, జీ5
***

        స్పోర్ట్స్ డ్రామాలు ఒక పంథాలో వస్తూంటాయి. క్రీడల్లో విజయాలు సాధించడం గురించి. బయోపిక్ లు కూడా ఇదే పంథాలో వస్తూంటాయి. కానీ క్రీడాకారిణుల పట్ల వివక్ష, అణిచివేత, అవమానం, వాళ్ళ జెండర్ నే ప్రశ్నార్ధకం చేసే నియమ నిబంధనలు లాంటి శరాఘాతాల్ని దృష్టికి తెచ్చే స్పోర్ట్స్ డ్రామాలు అరుదు. ఇలా బలౌతున్న క్రీడాకారిణులెందరో వున్నారు. వీళ్ళ కథలు ప్రచారం పొందడం లేదు. సినిమాలు అసలే రావడం లేదు. ఇలాటి వాళ్ళ కథల్ని తమిళనాడులో గుర్తించి ఒక రచయిత దర్శకుడి దృష్టికి తెచ్చాడు. దీన్ని సినిమాగా మల్చి రష్మీ రాకెట్ గా తీశాడు వెబ్ సిరీస్ దర్శకుడు ఆకర్ష్ ఖురానా. ఇలాటి సినిమాలకి పెట్టింది పేరైన తాప్సీ పన్నూ టైటిల్ పాత్ర పోషించింది.  

        ఓ అర్ధరాత్రి పోలీసులు క్రీడా సంఘం లేడీస్ హాస్టల్లోకి జొరబడి, రష్మీ వీరా (తాప్సీ పన్నూ) ని లాక్కెళ్ళి లాకప్ లో వేస్తారు. ఇది సంచలన వార్తవుతుంది. రష్మీ వీరా గురించి రకరకాల కథనాలు ప్రచారమవుతూంటాయి. ఎవరీ రష్మీ వీర? ఒక అమ్మాయి అయిన రష్మీ వీరాని రూల్స్ కి విరుద్ధంగా అర్ధరాత్రి, అదీ మగ పోలీసులు లాక్కెళ్ళి ఎందుకు లాకప్ లో వేశారు? ఏం చేసిందామె?

  చిన్నప్పట్నుంచీ మగ రాయుడులా తిరుగుతూంటుంది రష్మీ. గుజరాత్ లోని భుజ్ లో తల్లిదండ్రులు (సుప్రియా పాఠక్, మనోజ్ జోషి) లతో వుంటుంది. మగపిల్లల్ని ఎడాపెడా కొడుతుంది. అయితే పరుగు పెట్టడం మొదలెడితే రాకెట్ లా దూసుకుపోతుంది. పది సెకన్లలో 80 మీటర్లు రన్నింగ్ చేస్తుంది. ఇది చూసి ఆశ్చర్య పోతారందరూ. దీంతో ఆమెని క్రీడల వైపు ప్రోత్సహిస్తారు తల్లిదండ్రులు. పెద్దయి జిల్లా స్థాయి, అంతర్రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయాలు సాధిస్తుంది. దీంతో క్రీడా సంఘం ఆమెని ఆసియా క్రీడలకి ఎంపిక చేస్తుంది. కెప్టెన్ గగన్ ఠాకూర్ (ప్రియాంశూ పన్యూలీ) ఆమెకి శిక్షణ నిస్తాడు. ఆసియా క్రీడల్లో మూడు మెడల్స్ సాధించి సంచలనం సృష్టిస్తుంది.

        అయితే ఇతర క్రీడాకారిణుల కంటే ఈమె తేడాగా వుందని క్రీడా సంఘం నుంచి అందుకున్న ఆదేశాలతో వైద్య పరీక్షలు చేపడతారు. ఆ పరీక్షల్లో ఆమెలో టెస్టోస్టిరాన్ (పురుష హార్మోన్)  వుండాల్సిన స్థాయి కంటే అధికంగా వుందని తేలుతుంది. దీంతో ఈమె ఆడపిల్లే కాదనీ, క్రీడాకారిణిగా పాల్గొనేందుకు అనర్హురాలనీ నిషేధిస్తుంది క్రీడా సంఘం. క్రీడా సంఘాన్ని ఏమార్చిందని అర్ధరాత్రి లాకప్ లో వేసి, మెడల్స్ ని వెనక్కి తీసుకుంటారు.

        ఇప్పుడేం చేసింది రష్మీ అన్నది మిగతా కథ. ఇక్కడ్నుంచి సెకండాఫ్ కోర్టు రూమ్ డ్రామాగా వుంటుంది. ఈ కథని తమిళ దర్శకుడు, రచయిత నందా పెరియ సామి అందించాడు. ఇది ఏ వొక క్రీడాకారిణి బయోపిక్ కాదు. అథ్లెట్స్ గురించి భాగ్ మిల్కా భాగ్’, పాన్ సింగ్ తోమర్ లాంటి బయోపిక్స్ వచ్చాయి. పరుగుల రాణి అశ్వనీ నాచప్ప గురించి తెలుగులో అశ్వని అని బయోపిక్ వచ్చింది. అయితే రష్మీ రాకెట్ ఇలాటి బయోపిక్ కాదు. దేశ విదేశాల్లో ఇందరో ఇలాటి వివక్షకి గురవుతున్న క్రీడాకారరిణుల కథగా దీన్ని తీసుకోవాలి. పెరియ సామి తమిళనాడులోని  కొన్ని గ్రామాల్లో తను చూసిన కొందరు క్రీడలపై ఆసక్తిగల అమ్మాయిల జీవితాల్ని స్టోరీ ఐడియాగా దర్శకుడు ఆకర్ష్ ఖురానాకి అందిస్తే, దీనిమీద విస్తృత రీసెర్చి చేసి సినిమా కథ చేశాడు ఖురానా.

  స్త్రీలలో టెస్టోస్టెరాన్ మోతాదుకి మించి వుండడాన్ని హైపర్ ఆండ్రోజనిజం అంటారు. దీనివల్ల స్త్రీత్వానికి ఏ లోటూ రాదు. కానీ క్రీడారంగంలో ఇదొక బహిష్కరణాస్త్రంగా మారింది అంతర్జాతీయంగానూ. ఇలా బహిష్కరణలకి గురైన క్రీడాకారిణుల వ్యక్తిగత, సామాజిక జీవితాలు కూడా దెబ్బతిన్నాయి. మనదేశం నుంచి గోల్డ్ మెడలిస్ట్ దుతీ చంద్, విదేశానికి చెందిన ఒలింపిక్స్ ఛాంపియన్ సెమెన్యా ఇలాటి బాధితుల్లో కొందరు.

        క్రీడాకారిణులకి లైంగిక వేధింపులు ఎలాగూ తప్పడంలేదు. దంగల్’, చక్ దే ఇండియా’, మేరీ కోం ఈ విషయాన్ని దృష్టికి తెచ్చాయి. కానీ అసలు నువ్వు ఆడదానివే కాదన్న కొత్త రూపం తొడిగిన వివక్షని దృష్టికి తెస్తున్న సినిమా ఇదే.

        మెడల్స్ వెనక్కి తీసుకుని రష్మీని బహిష్కరించడంతో, అరెస్టు చేయడంతో, స్వచ్ఛందంగా ఒక లాయర్ అభిషేక్ బెనర్జీ ముందుకొచ్చి బెయిల్ మీద విడిపిస్తాడు. కానీ స్వగ్రామం వెళ్ళిన రష్మిని అక్కడ వెలివేస్తారు. దీంతో తిరిగి వచ్చేస్తుంది. దీని మీద న్యాయపోరాటం చేయాలని కేసు వేస్తాడు లాయర్.

     సెకండాఫ్ అంతా కోర్టులో న్యాయపోరాటం గురించి. టెస్టోస్టెరాన్ మోతాదు ఎక్కువున్నంత మాత్రాన ఆడది ఆడది కాకుండా పొదన్న వాదాన్ని శాస్త్రీయ ఆధారాలతో నిరూపించడం ఈ సెకండాఫ్ కథ. ఇందులో క్రీడాసంఘం బోర్డు సభ్యుడి కుట్ర ప్రధానంగా వుంటుంది. తన కూతురికి విజయం దక్కలన్న ఉద్దేశం పెట్టుకుని రష్మిని రచ్చకీద్చాడు అతను. రష్మి ఆడది కాదు కాబట్టే మగ పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారన్న వాదాన్ని కూడా లాయర్ ఓడిస్తాడు.

        అయితే రష్మీ ఆడదేనని శాస్త్రీయ ఆధారాలతో కేసు నిరూపించగల్గుతున్నా, ఇంకా బలంగా జడ్జీ నమ్మాలన్నట్టు సినిమాటిక్ చేశారు. సెకండాఫ్ లో తనకి శిక్షణ నిచ్చిన కెప్టెన్ గగన్ ఠాకూర్ నే రష్మీ పెళ్లి చేసుకోవడం, గర్భవతి కావడం- ఇది చూపించి రష్మీ ఆడదేనని జడ్జికి లాయర్ విన్నవించడం, జడ్జి అనుకూలంగా తీర్పు ఇవ్వడం వగైరా...ఇలా అందరు బాధితురాళ్ళకి సాధ్యమవుతుందా?

        ఫస్టాఫ్ తాప్సీ ప్రతీ సీనుని నిలబెట్టింది. క్రీడాకారిణిగా, బాధితురాలిగా. పాత్ర లోపలి పొరల్లోకి తలదూర్చి సమస్యని కళ్ళకి కట్టింది. రాకెట్ లా పరుగుదీసే దృశ్యాలు సరే. ఇలాటి విలక్షణ సినిమాలకి తను బ్రాండ్ నేమ్ అని మరోసారి నిరూపించుకుంది. సెకండాఫ్ న్యాయపోరాటంలో ఆమెకి పనిలేదు. కోర్టు ప్రొసీడింగ్స్ ని చూస్తూ కూర్చోవడమే. సెకండాఫ్ కోర్టు సీన్లు అభిషేక్ బెనర్జీవే. అతడి మీదే కథ. లాయర్ పాత్రని అతను అత్యంత బలంగా, సహజంగా పోషించాడు.

        వెబ్ సిరీస్ దర్శకుడు ఆకర్ష్ ఖురానా ఒక వినూత్న స్పోర్ట్స్ డ్రామాని రియలిస్టిక్ సినిమాగా అందించాడు. పాత్రల తీరుతెన్నులు, నటింపజేయడాలు, దృశ్యాల చిత్రీకరణ ఏదీ రియలిస్టిక్ జానర్ నుంచి పక్కకి జారకుండా ప్రతిభ కనబర్చాడు. అమిత్ త్రివేదీ సంగీతంలో పాటలు కొన్ని గుజరాతీ ట్యూన్ లో సందర్భానుసారం వుంటాయి. సినిమా నిడివి రెండు గంటలే వుండడం హాయి గొల్పే అంశం.
సికిందర్    


15, అక్టోబర్ 2021, శుక్రవారం

1065 : రివ్యూ

 

 రచన = దర్శకత్వం : బొమ్మరిల్లు భాస్కర్
తారాగణం : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా, ఆమని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అమిత్ తివారీ, పోసాని, జయప్రకాష్ తదితరులు
సంగీతం :  గోపీ సుందర్,  ఛాయాగ్రహణం : ప్రదీష్ వర్మ
బ్యానర్ : జిఎ 2 పిక్చర్స్
నిర్మాతలు : బన్నీ వాసు, వాసూ వర్మ

విడుదల : అక్టోబర్ 15, 2021
***
         మధ్య హలో’, మిస్టర్ మజ్నూ లాంటి రెండు రోమాంటిక్ కామెడీల తర్వాత మరో రోమాంటిక్ కామెడీ /డ్రామా తో వచ్చాడు అక్కినేని అఖిల్. నటించిన అయిదు సినిమాలతో యంగ్ స్టార్ గా నిలదొక్కుకునేందుకు విఫలయత్నం చేస్తూ వచ్చిన అఖిల్ కి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ హిట్టవడం చాలా అవసరం. ప్రేమ సినిమాల సెగ్మెంట్ లో మడి గట్టుకున్న తెలుగు సినిమాలకి, ఇంకా హిట్టవడానికి విషయం ఏమీ మిగలని పరిస్థితుల్లో ఈ రిస్క్ తీసుకున్నాడు అఖిల్. ఓ ఎనిమిదేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, మళ్ళీ రోమాన్స్ తోనే అదృష్టాన్ని పరీక్షించుకుందా మనుకున్నట్టుంది. గీతా ఆర్ట్స్ వంటి అగ్ర బ్యానర్, అక్కినేని నాగార్జున వారసుడు, పూజా హెగ్డే లాంటి ట్రెండింగ్ స్టార్ కాంబినేషన్లు సమకూర్చుకుని హిట్టవ్వడానికి సన్నద్ధమయ్యాడు పండక్కి. మరి ఈ అవకాశాన్ని నిలబెట్టుకున్నాడా లేదా ఓసారి చూద్దాం...

కథ

    ఎన్నారై హర్ష (అక్కినేని అఖిల్) న్యూయార్క్ లో మంచి జాబ్ లో సెటిలై, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుని, డాలర్లు వెనకేసుకుని, ఇక పెళ్ళి  చేసుకోవడానికి అన్ని అర్హతలతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా హైదారాబాద్ వస్తాడు. అతను ఇక్కడ వుండే ఇరవై రోజుల్లో అమ్మాయిని చూసి, పెళ్ళి చేసేసి పంపాలన్న టైట్ షెడ్యూల్ వేసుకుని వుంటారు కుటుంబ పరివారం. రోజుకో అమ్మాయిని చూసేలా 20 మంది అమ్మాయిలతో పెళ్ళి చూపులేర్పాటు చేస్తారు. రకరకాల అమ్మాయిల్ని చూస్తూంటాడు. విభా (పూజా హెగ్డే) అనే అమ్మాయి జాతకం కలవలేదని రిజెక్ట్ చేస్తారు పరివారం. కానీ ఆ ఫోటోలో విభా హర్షకి నచ్చుతుంది. వాళ్ళింటికి వెళ్ళి చూద్దామనుకుంటే ఆమె తండ్రి సుబ్బు (మురళీ శర్మ) తో గొడవ వస్తుంది.

        విభా స్టాండప్ కమెడియన్ గా ప్రోగ్రాములు చేస్తూ, ఒక క్యారక్టర్ కి సుబ్బు అని తన తండ్రి పేరే పెట్టి పెళ్ళి - సంసారం జోకులతో నవ్విస్తూంటుంది. ఆమెని కలుసుకుంటాడు. కానీ తను అడిగే ప్రశ్నలకి ఆమె చెప్పే సమాధానాలు వింటే మతిపోయి, ఆమె ఏమిటో అర్ధం జేసుకోలేకపోతాడు. ఇతడికి పెళ్ళీ కాపురం ప్రేమ గురించి అవగాహన లేదని ఆమె తిరస్కరిస్తుంది. దీంతో డీలా పడ్డ హర్ష తిరిగి న్యూయార్క్ వెళ్ళిపోతాడు.

        ఇప్పుడీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలెలా తొలిగాయి? హర్షకి అవగాహన లేకపోతే ఆమెకున్న మానసిక సమస్యేమిటి? అదెలా తొలగింది? ఆమె ప్రేమని ఇంకెలా పొందాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

      మొదటే చెప్పుకున్నట్టు, వచ్చిన తెలుగు ప్రేమ సినిమాలనే తిప్పితిప్పి అదే తీస్తే వచ్చే సమస్యే ఈ కథతోనూ వచ్చింది. కాకపోతే దీన్ని రెండు తెలుగు సినిమాల్ని కలిపి తీసినట్టున్నారు. ఈ దర్శకుడిదే ఆరెంజ్’, ఇంకో దర్శకుడి షాదీ ముబారక్. ఆరెంజ్ లో రామ్ చరణ్ ది తనకేం కావాలో తెలియని కన్ఫ్యూజ్ పాత్ర అయినట్టు, ఇక్కడ అఖిల్ తోనూ కన్ఫ్యూజుడు పాత్రే. ఇక గత మార్చిలోనే వచ్చిన షాదీ ముబారక్ లో ఒక రోజు జరిగే వరస పెళ్ళి చూపుల ట్రాక్ వున్నట్టు, ఇక్కడ ఇరవై రోజులకి వరస పెళ్ళి చూపుల ట్రాక్ వుంది.

        హీరోయిన్ పూజా హెగ్డే పాత్ర వేసిన ప్రశ్నలతో అఖిల్ సమస్యలో పడ్డం కాన్ఫ్లిక్ట్ నేర్పరిస్తే, దాంతో అతను పొరాడి తనని ప్రూవ్ చేసుకునే కథ ప్రారంభించకుండా, ఫస్టాఫ్ రోమాంటిక్ కామెడీని సెకండాఫ్ పెద్దల జోక్యంతో రోమాంటిక్ డ్రామాగా మార్చెయ్యడంతో, కథకి ఒక అర్ధం పర్ధం లేకుండా, సీరియస్ క్లాసులు పీకీ, పీకించుకునే ఉపన్యాసంలా మారింది ముగింపు సహా.

        అక్కినేని నాగార్జున ఈ సినిమా అయినా అఖిల్ ని సక్సెస్ బాటలో నడిపించాలన్న ఆతృతతో వున్నట్టు వార్తలొచ్చాయి. సినిమాలో కొన్ని మార్పు చేర్పులు చేయించినట్టు కూడా వార్తలొచ్చాయి. ఇంత చేసినా ఫలితం మాత్రం ప్రశ్నగానే మిగిలింది. ఫ్రేమల్ని, పెళ్ళిల్ని నేటి ఆర్ధిక ప్రపంచం నిర్వచిస్తూంటే, ఇంకా ప్రేమ కథల్ని కాలం తీరిన టెంప్లెట్లు పెట్టుకుని తీస్తే చూసే కాలం పోయింది. థియేటర్ వెలుపల ఫ్రేమల్లో యువత ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలు వేరే వున్నాయి. వాటితో ఎంటర్ టైన్ చేయాలి. అంతేగానీ బయటి పరిస్థితికి థియేటర్లోపల చూపిస్తున్న పరిస్థితికీ ఏ సంబంధం లేకపోతే, పాత డ్రామాలే చూపిస్తే, చూసే ఓపిక వుండాలనుకోవడం అత్యాశే అవుతుంది. 
 
నటనలు -సాంకేతికాలు

     మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కమ్ లవర్ బాయ్ గా అఖిల్ ఆద్యంతం ఫ్రెష్ గా కనిపిస్తాడు. సెకండాఫ్ లో గడ్డంతో కన్పిస్తాడు. సెకండాఫ్ రోమాంటిక్ డ్రామా అయినందుకేమో. ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ సంబంధాలు హోమ్లీగా నటించాడు. పూజా హెగ్డేతో రోమాంటిక్ సీన్లు ఫస్టాఫ్ లో నిలబెట్టాడు. సెకండాఫ్ కథ  సీరియస్ కాబట్టి ఫస్టాఫ్ ఫన్ రోమాన్స్ వుండదు. రోమాన్సే వుండదు. ఆమె కంటబడకుండా సీక్రెట్ గా కథ నడిపిస్తూంటాడు. ఈ సీన్లన్నిట్లో నటనలో ఈజ్ వుంది. ఇంప్రూవయాడు. సాంగ్స్ లోనూ ఆకట్టుకుంటాడు. కథెలా వున్నా, పాత్రెలా వున్నా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

        పూజా హెగ్డే పాత్ర కేవలం గ్లామర్ కోసమే కాకుండా, ఫస్టాఫ్ లో అఖిల్ ని కవ్విస్తూ ఎంటర్ టైన్ చేయడం కోసమే కాకుండా, అతడికి ఆమె విసిరే ప్రశ్నలతో, తర్వాత బయట పడే మానసిక సమస్యతో విషయమున్న పాత్రే పోషించింది. కానీ ఫస్టాఫ్ రోమాంటిక్ కామెడీ కాస్తా జానర్ మారిపోయి సెకండాఫ్ రోమాంటిక్ డ్రామా కావడంతో, పూర్తిగా పాసివ్ - విషాద పాత్రగా మారిపోయి, యూత్ అప్పీల్ కి గండి కొట్టేసింది.

        ఇక అటు వైపు, ఇటు వైపు కుటుంబ సభ్యుల పాత్రల్లో అఖిల్ కి జయప్రకాష్, ఆమని, అజయ్, ఇంకా చాలా మంది వుండగా, పూజాకి మురళీ శర్మ, ప్రగతి వుంటారు.

        ఈ సినిమాకి హైలైట్ గోపీ సుందర్ సంగీతంలో పాటలు. ముఖ్యంగా లెహరాయీ అనే హిందీ పదంతో పాట, గుచ్చే గులాబీ అనే ఇంకో పాట చిత్రీకరణ సహా బావున్నాయి. రోమాంటిక్ కథకి ఆ వాతావరణపు ఆహ్లాదానిచ్చే ఛాయాగ్రహణాన్నిచ్చాడు ప్రదీష్ వర్మ. ఎడిటింగ్ మార్తాండ్ వెంకటేష్. ఔట్ డోర్- ఇండోర్ లొకేషన్స్ రిచ్ గా వున్నాయి. ప్రొడక్షన్ విలువలు టాప్ క్లాస్.

చివరికేమిటి   

             తన పెళ్ళి కథ రాహుల్ రవీంద్రన్, చిన్మయి లకి మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా చెప్తాడు అఖిల్. ఫస్టాఫ్ లో ముప్పావు గంట వరస పెళ్ళి చూపుల ట్రాక్ వుంటుంది. ఈ ట్రాక్ మధ్య లోంచే పూజా హెగ్డే తో ట్రాక్ మొదలై, ఇది వరస పెళ్ళి చూపుల ట్రాక్ తో కలగలిసిపోయిన మంచి ఎంటర్ టైనర్ ప్యాకేజీలా వుంటుంది క్రియేటివిటీ. పెళ్ళి చూపుల్లో అఖిల్ చేతగాని మాటలు పెడర్ధాలుగా, ద్వంద్వార్ధాలుగా తేలి, ఆ అమ్మాయిలతో కోర్టు కేసుకి దారితీయడం మాత్రం అసహజంగా వుంటుంది. కోర్టులో దీన్ని కామెడీ చేసి నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ వరస పెళ్ళి చూపుల ట్రాకు అంతా కోర్టు కేసుగా ముగిసే మినీ కథగా తీర్చిదిద్దారు. ఇది కూడా బావుంది. పెళ్ళి చూపుల్లో అఖిల్ చేతగాని మాటలు, అప్పుడప్పుడు తను అడిగిన ప్రశ్నలకి పూజా చెప్పినవే కావడం అతడెంత ఇమ్మెచ్యూర్ క్యారెక్టరో కూడా ఎస్టాబ్లిష్ అవడానికి తోడ్పడ్డాయి. ఇది కూడా బావుంది.

        ఇక తర్వాత పూజా హెగ్డేతో ఫైనల్ సీనుగా, ఇంటర్వెల్లో ఆమె అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోవడం కాన్ఫ్లిక్ట్ ని ఏర్పాటు చేస్తుంది. జాబ్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇల్లూ ఏర్పాటు చేసుకుని పెళ్ళికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్పించు కోవడం కాదు, పెళ్ళి తర్వాత కలిసి జీవించడం ఎలా చెప్పు?- అన్న ఆమె ప్రశ్నకి ఇమ్మెచ్యూర్ సమాధానాలు చెప్పి దొరికిపోతాడు. దీంతో ముఖం చెల్లక న్యూయార్క్ తిరిగి వెళ్ళిపోతాడు.

        ఇక్కడే సెకండాఫ్ కి గండి పడింది. హీరో హీరోయిన్లు విడిపోవడం రోమాంటిక్ కామెడీ జానర్ లక్షణం కాదు. రోమాంటిక్ కామెడీల్లో వాళ్ళిద్దరూ పరస్పరం ప్రత్యర్ధులే కాబట్టి విడిపోకుండా, నువ్వెంతంటే నువ్వెంతని ఇగోల పోరాటం ప్రారంభిస్తారు. ఈ పోరాటం మాని ఏ వొకరు వెనక్కి తగ్గి విడిపోయినా, అది ఏడ్పించే రోమాంటిక్ డ్రామాకి దారి తీస్తుంది. ఇక్కడ జరిగిందిదే.  

        ఈ కాన్ఫ్లిక్ట్ దగ్గర అఖిల్ నిలబడక పోవడంతో, గోల్ తీసుకుని తన ఇగోతో ఆమెతో తేల్చుకునే మొండితనానికి పోక పోవడంతో, సెకండాఫ్ కథ తన చేతుల్లో లేక, పెద్దవాళ్ళ  చేతుల్లో దారితప్పి ఎలా పడితే అలా సాగే రోమాంటిక్ డ్రామాగా- సీరియస్ గా మారిపోయి, కష్టపడి నిలబెట్టిన ఫస్టాఫ్ నంతా నిష్ప్రయోజనం చేసేసింది.

సికిందర్    
       

 

 

14, అక్టోబర్ 2021, గురువారం

1064 : రివ్యూ


 రచన- దర్శకత్వం : అజయ్ భూపతి

తారాగణం : శర్వానంద్, సిద్ధార్థ్, అదితీ రావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయెల్, జగపతి
బాబు
, రావురమేష్ తదితరులు
సంగీతం : చేతన్ భరద్వాజ్
, ఛాయాగ్రహణం : రాజ్ తోట
బ్యానర్ : ఏకే ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : సుంకర రామబ్రహ్మం
విడుదల : అక్టోబర్ 14
, 2021

***

        తొలి సినిమా ఆరెక్స్ 100 తో హిట్ సాధించిన దర్శకుడు అజయ్ భూపతి రెండో సినిమా కోసం మూడేళ్ళూ  స్టార్స్ చుట్టూ తిరిగి మొత్తానికి శర్వానంద్, సిద్ధార్థ్ లతో మహా సముద్రం తీశాడు. శర్వానంద్ కి గత నాలుగు వరస పరాజయాల తర్వాత  మహాసముద్రం తో ఒక హిట్ అవసరం. ఇక దాదాపు పదేళ్ళ తర్వాత తమిళ హీరో సిద్ధార్థ్ తెలుగులో నటించిన సినిమా ఇది. మరో పక్క ఇద్దరు గ్లామర్ హీరోయిన్లు అదితీ రావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయెల్ లు. ఇన్ని ఆకర్షణలున్న మహా సముద్రం పండక్కి విడుదలవడం కలెక్షన్స్ కి సానుకూలాంశం. మరి ఇన్ని పాజిటివ్స్ వున్న ఈ మల్టీ స్టారర్ పండగ మూడ్ ని మరింత ఆహ్లాదకరంగా మార్చుతుందో లేదో చూద్దాం...

కథ

  వైజాగ్ లో శర్వానంద్ (అర్జున్), విజయ్(సిద్ధార్థ్) లు ప్రాణ స్నేహితులు. అర్జున్ చిన్న వ్యాఫారం చేసుకోవాలనుకుంటాడు. సిద్ధార్థ్ ఎస్సై పరీక్ష రాస్తాడు. డాన్స్ స్కూలు నడిపే మహా(అదితీ రావ్ హైదరీ) తో ప్రేమలో వుంటాడు. అర్జున్ లా చదివే స్మిత (అనూ ఇమ్మాన్యుయెల్) తో ప్రేమలో పడతాడు. వైజాగ్ లో చుంచు మామ (జగపతి బాబు) సముద్రం మీద బతికే స్మగ్లర్. ఇతడి ప్రత్యర్ధులు ధనుంజయ్ (గరుడ రామ్) అతడి అన్న  గూని బాబ్జీ (రావు రమేష్). ఒక రోజు విజయ్ ధనుంజయ్ తో ఘర్షణ పడి చంపేస్తాడు. దీంతో చుంచు మామా వూరొదిలి పారిపొమ్మంటాడు. విజయ్ మహాని కూడా వదిలేసి పారిపోతాడు. కానీ బతికే వున్న ధనుంజయ్ చంపడానికి మహా మీదికొస్తే అర్జున్ అతడ్ని చంపేస్తాడు. దీంతో ఇక గూని బాబ్జీని ఎదుర్కోవాలంటే స్మగ్లర్ గా మారిపోవాలని అర్జున్ మీద ఒత్తిడి తెస్తాడు చుంచు మామ.

        ఇప్పుడు విజయ్ ఏం చేశాడు? స్మగ్లర్ గా మారాడా? విజయ్ ఏమయ్యాడు? ఇంట్లోంచి తండ్రి వెళ్ళ గొడితే మహా ఏమైంది? అర్జున్ ప్రేమిస్తున్న స్మిత ఏమైంది? ఈ సమస్యలన్నీ అర్జున్ ఎలా పరిష్కరించాడు? ఇదీ మిగతా కథ...

ఎలావుంది కథ

      అనుకోని పరిస్థితుల్లో దుష్టుడ్ని చంపేసిన హీరో ఆత్మ రక్షణకి తానే దుష్టుడుగా మారడం, ప్రాణ మిత్రులైన ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారడం, ప్రేమించిన అమ్మాయి గురించి ఇద్దరు హీరోల మధ్య అపార్ధాలు రేగడం, ఘర్షణ, త్యాగం...ఈ టెంప్లెట్స్ అన్నీ పెట్టుకుని తయారు చేసిన కథ ఇది. సముద్రం మీద స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ టెంప్లెట్ దీనికి జోడింపు. పాత్ర చిత్రణలు, లాజిక్, కామన్ సెన్సు వంటి వాటికి దూరంగా వున్న కథ. పాత్రల్ని బట్టి కథలో సముద్రమంత లోతైన డెప్త్ వున్నా, పైపై కథనంతో నడిపేసిన కథ. రెండు మూడు చోట్ల తప్ప మాస్ చేత కేరింతలు కొట్టించడంలో అంత కమర్షియల్ గా లేని కథ. పాత్రల్నిఎస్టాబ్లిష్ చేసిన తీరు మాస్ కి ఉత్కంఠ రేపుతూ కూర్చోబెట్ట గల్గింది. కానీ ఆ పాత్రల్ని నడిపిన తీరుతో రెండున్నర గంటల పాటు అదే ఉత్కంఠని రేపదు.

నటనలు- సాంకేతికాలు

   నాలుగు వరస పరాజయాల తర్వాత శర్వానంద్ కి మహాసముద్రం అనే కమర్షియల్ మాస్ యాక్షన్ టెర్రిఫిక్ నటనని ప్రదర్శించే అవకాశాన్నిచ్చిన పాత్ర ఇది. ఫస్టాఫ్ అతను కదలకుండా కూర్చో బెట్టేస్తాడు. తల్లితో ఒక కుటుంబం, కొన్ని విలువలు, స్నేహితుడి పట్ల విశ్వాసం, ప్రేమించిన అమ్మాయితో ఆమె నిర్ణయాల్ని గౌరవిస్తూ సత్సంబంధాలు...ఇవన్నీ వున్న పాత్రతో ప్రేక్షకులకి దగ్గరవుతాడు. ఇంటర్వెల్ కి ముందు గరుడ రామ్ గ్యాంగుతో యాక్షన్ సీను, సెకండాఫ్ లో రావు రమేష్ గ్యాంగుతో  యాక్షన్ సీన్లూ ఇవన్నీ విజృంభించి చేస్తాడు. అనూ ఇమ్మాన్యుయెల్ తో ఒక రోమాంటిక్ సాంగ్ తో అలరిస్తాడు. సిద్ధార్థ్ తో ఒక బ్రోమాన్స్ సాంగ్ కూడా ఓకే.

        కానీ సెకండాఫ్ లో పాత్ర బలహీన పడడంతో కథా పరంగా సెకండాఫ్ ని నిలబెట్టలేని నిస్సహాయ స్థితిలో పడిపోతాడు. కారణ మేమిటంటే, పాత్రకి గోల్ లోపించడం. దీంతో ఏ సమస్య వచ్చి పడితే దానికి అప్పటికప్పుడు రియాక్షనిచ్చి వూరుకునే పాసివ్ రియాక్టివ్ పాత్రగా వుండడం. సమస్యలకి మూలమేమిటో దాన్ని తానుగా పెకిలించి వేసే గోల్ తో యాక్టివ్ పాత్రగా లేకపోవడం. యాక్టివ్ పాత్ర లేని మూల్యం చాలా చెల్లించుకోవాల్సి వచ్చింది. స్టార్ సినిమాలకిది మామూలే.

        ఇక సాఫ్ట్ రోల్స్ వేసే సిద్ధార్థ్ ఈసారి నెగటివ్ గా రఫ్ పాత్ర వేశాడు. ఇందులో ఎక్కడా తేలిపోకుండా రాణించాడు. ఫస్టాఫ్ లో అసలు ఎస్సై కావాలని ఎందుకనుకున్నాడో రివీల్ చేస్తూ అసలు స్వరూపం బయట పెడుతూ మాంచి కిక్కిస్తాడు. కానీ ఇంటర్వెల్ ముందు పారిపోయి ఆ కిక్కుని నీరుగార్చేస్తాడు. ఐదేళ్ళ కాలం తర్వాత క్లైమాక్స్ ముందు తిరిగి వచ్చి శర్వానంద్ కి ప్రాణ శత్రువుగా మారే ఫార్ములా పోషించడం కూడా సరిపెట్టుకున్నా, చివరికి ఇచ్చుకునే అరిగిపోయిన ఫార్ములా ముగింపుని మాత్రం సరిపుచ్చుకోలేం. ఈ పని షోలే లో అమితాబ్ బచ్చన్ ఎప్పుడో చేశాడు. కానీ జయబాధురి జీవితం అప్పుడు కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది. సిద్ధార్థ్ తన పాత్ర ద్వారా ప్రేమించిన ఆదితీ రావ్ హైదరీకి రాడికల్ ముగింపు నిద్దామనుకున్నాడు గానీ, నిజానికి తనకీ శర్వానంద్ కీ మధ్య ఆటబొమ్మలా వున్న అదితీకి వ్యక్తిత్వాన్నిస్తూ, ఆమె నిర్ణాయానికి వదిలేస్తే రాడికల్ ముగింపయ్యేది.

      అదితీ రావ్ హైదరీ పాత్రకి తగ్గ నటనతో ఒక సెక్షన్ని ఆకట్టుకోవచ్చుగానీ, అసలు పాత్రేమిటన్నదే ప్రశ్న. అంత వైభవంగా డాన్స్ స్కూలు నడుపుతూ సిద్ధార్థ్ కి డబ్బు సాయం కూడా చేస్తూ వుండిన తను, సిద్ధార్థ్ పారిపోగానే శర్వా పంచన చేరి, అతడింట్లో దీనంగా జీవించడమేమిటో అర్ధం గాదు. పైగా సెకండాఫ్ లో కథని మెలికలు తిప్పడం.

        పోతే లా చదివే అమ్మాయి పాత్రలో అనూ ఇమ్మాన్యుయెల్ కూడా కథలోంచి నాల్గేళ్ళ పాటు వెళ్ళిపోతుంది. హైదారాబాద్ లో లాయర్ గా మారి సెకండాఫ్ లో తిరిగొస్తుంది. ఈ నాల్గేళ్ళూ  కాంటాక్ట్ వుండదు. ఇవేం ప్రేమలో అర్ధంగాదు. కథకుడి సౌలభ్యం కోసం ఒకవైపు అదితిని వదిలేసి సిద్ధార్థ్ వెళ్ళి పోయాడు, మరోవైపు శర్వాని  వదిలేసి అనూ వెళ్ళిపోయింది.

        విలన్లుగా మాత్రం విచిత్ర పాత్రల్లో, తెలుగు నేటివిటీతో జగపతి బాబు, రావు రమేష్ లు తమ సీన్లని తాము బాగా దున్నేసుకున్నారు వేరే కమెడియన్లు అవసరం లేకుండా.

        చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగున్నా, పాటల విషయంలో వెనుకబడ్డాడు. మొదటి బ్రోమాన్స్ సాంగ్ తప్ప మిగిలిన సాంగ్స్ క్యాచీగా ఇవ్వలేకపోయాడు. హెవీగా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరుకి, పాటల్ని లైట్ మ్యూజిక్ తో ఇస్తే కదా కాంట్రాస్ట్ వస్తుంది. అప్పట్లో ఇళయరాజా ఇదే పాటించే వాడు కదా.


   రాజ్ తోట కెమెరా వర్క్ వైజాగ్ సముద్రానికి, లొకేషన్స్ కి, సముద్రపు వివిధ మూడ్స్ కి విజువల్ గా హైస్కోరు చేసింది. దర్శకుడి కథా కథనాలు మాత్రం ఈ విజువల్స్ తో పోటీపడలేక పోయాయి.
    ఈ రెండో సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి హెవీ మల్టీ స్టారర్ కి సాహసించడం బావుంది గానీ, మహా సముద్రం లాంటి హై కాన్సెప్ట్ సబ్జెక్టుకి ఇంకా ఇన్ పుట్స్ అవసరం. సముద్రం మీద స్మగ్లర్ల బ్యాక్ డ్రాప్ లో చెడిన స్నేహాల మధ్య ప్రేమ కథ చెప్తున్నప్పుడు ఆ ప్రేమ కథ ఒక్కటే హైలైట్ అవ్వాల్సింది కాలేదు. దీంతో ప్రేమ కథ కాలేక, స్మగ్లింగ్- మాఫియా కథ కాలేక వూగిసలాడింది.

        రమేష్ సిప్పీ రిషీ కపూర్, డింపుల్ కపాడియా, కమల హాసన్ లతో సాగర్ అనే చాలా లైటర్ వీన్ సూపర్ హిట్ ప్రేమ కథ తీసినప్పుడు, సాగరమంత లోతైన మెచ్యూరిటీతో తీసి సక్సెస్ అయ్యాడు.  

సికిందర్ 

13, అక్టోబర్ 2021, బుధవారం

1063 : రివ్యూ

రచన - దర్శకత్వం : సురేష్ ఉత్తరాది
తారాగణం : నవీన్ చంద్ర
, గాయత్రీ సురేష్, అదితి, క్రిష్ సిద్దిపల్లి, రాజారవీంద్ర
సంగీతం : జువెన్ సింగ్
, ఛాయాగ్రహణం : ఎస్ కె భూపతి  
నిర్మాతలు : కె కళ్యాణ్
, ఎన్ దుర్గా ప్రసాద్ రెడ్డి, డాక్టర్ ఏ భాస్కర్ రావు
విడుదల : అక్టోబర్ 8
, 2021

***

        ప్రేమ కథల్ని కొత్తగా చెప్పాలనుకుని కొత్త దర్శకులు ప్రయత్నించడం మంచిదే. రెండే రకాల ప్రేమ కథలతో గత రెండు దశాబ్దాలుగా అదేపనిగా తీసిందే తీసి ప్రేమంటేనే విరక్తి పుట్టించాక, ఈ మధ్య అలాటి కొత్త బైరాగి దర్శకుల తాకిడి దాదాపు తగ్గిపోయి ప్రాణాలు హాయిగా వున్నాయి. ఇతర పనులు చేసుకోగల్గుతున్నాం. ఈ సినిమాలతో ప్రేక్షకులకి ఉపయోగం లేదు గానీ నిర్మాణంలో ఎందరికో ఉపాధి కల్పిస్తూంటాయి. ఈ కార్మిక  సేవకే వీటిని అలా వుండనివ్వాలి తప్ప కళా సేవకి కాదు. కళా సేవ కూడా చేస్తూ నేను లేని నా ప్రేమ కథ లాంటివి అప్పుడప్పుడు వస్తూంటే చిన్న సినిమా బతికే వుందని ఒక సంకేతం వెళ్తుంది.

        యితే ఆ సంకేతం ఎంత బలంగా వెళ్ళి ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకుంటుందనేదే సమస్య. ఇందుకే చిన్న సినిమా బేషరతుగా అన్ని విభాగాల్లో బలంగా వుండాలంటారు. మరి అంత బలంగా ప్రస్తుత కొత్త దర్శకుడి ప్రేమ కథేమైనా  వుందా లేదా చూద్దాం...

కథ

   ఆ వూళ్ళో నాట్యమంటే ఇష్టమున్న రాధ (గాయత్రీ సురేష్) సామాజిక కార్యకర్త రామ్ (నవీన్ చంద్ర) తో ఏకపక్ష ప్రేమలో వుంటుంది. రామ్ కి వసుధ అని ఒక ఫ్రెండ్ వుంటుంది. ఇంకో వూళ్ళో కృష్ణ (క్రిష్ సిద్ధిపల్లి) అనే అతను వుంటాడు. ఇతడికో గర్ల్ ఫ్రెండ్ వుంటుంది. ఇతను శబ్ద తరంగాల మీద పరిశోధన చేస్తూంటాడు. ఐన్ స్టీన్ పదార్ధానికి వినాశం లేదని చెప్పాడు కాబట్టి, విశ్వం లో శబ్ద తరంగాల రూపంలో నిక్షిప్తమైన ఒక పదార్ధాన్ని అన్వేషిస్తూంటాడు. ఆ పదార్ధం కాశ్మీరు సమస్యకి పరిష్కారం. కాశ్మీర్ సమస్యని పరిష్కరించాలంటే దాని సమస్యా మూలాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. అది తెలిసిన వాళ్ళు నెహ్రూ, జిన్నా, కాశ్మీరు రాజు అనీ, వాళ్ళ సంభాషణలు శబ్ద తరంగాల రూపంలో విశ్వంలో ఎక్కడో వుంటాయనీ పరిశోధన చేస్తూంటాడు.

        ఇటు రాధ చదువుతున్న కాలేజీ లెక్చరర్ (రాజా రవీంద్ర) ఒక ఫంక్షన్ లో హామ్ రేడియోని పరిచయం చేసి దాన్ని రాధకి బహుమతిగా ఇస్తాడు. ఆమె దాన్ని ట్యూన్ చేస్తూంటే ఒక రోజు కృష్ణ విశ్వంలోకి పంపుతున్న ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతుంది. ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలెడతారు. అప్పుడు కృష్ణకి ఏమర్ధమవుతుందంటే, తను 1983 కాలంలో  వున్న అమ్మాయితో కనెక్ట్ అయ్యాడని. ఈ విషయమే ఆమెకి చెప్పి, తను 2020 లో వున్నానంటాడు. ఆమె నమ్మలేకపోతుంది. రామ్ కి చెప్తుంది.

        తను 1983 లో, కృష్ణ 2020 లో వున్నారు. మరి రామ్ ఏ కాలంలో వున్నాడు? ఈ ముగ్గురి మధ్య వున్న సంబంధమేమిటి? వీళ్లతో వసుధ పాత్రేమిటి? ఆమె ఎవరికి ఏమవుతుంది? చివరికి నల్గురూ ఏమయ్యారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

       టైమ్ ట్రావెల్ జానర్ కథ ఇది. కృష్ణ అనే అతను కాలంలో 1947 లోకి ప్రయాణించి కాశ్మీర్ సమస్యని పరిశీద్దామనుకుని చేసే ప్రయత్నం, మధ్యలో 1983 దగ్గర రాధ అనే అమ్మాయితో కనెక్టయితే ఏం జరిగిందన్నది ప్రేమ కథగా చేసి చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు సురేష్. ఆలోచన కొత్తదే.

        గత మార్చి లోనే ప్లేబ్యాక్ అని ఇలాగే భిన్న కాలాల్లో పాత్రల్ని కనెక్ట్ చేస్తూ తెలుగులోనే వచ్చింది గానీ కథ వేరు. ప్రస్తుత ప్రేమ కథ ప్రేమ కథగానే వుండక కుటుంబ కథగానూ బయటపడే విషయంతో వుంటుంది. టైమ్ ట్రావెల్ తో కుటుంబ కథ అనగానే రాబర్ట్ జిమెకిస్ 1985 క్లాసిక్ బ్యాక్ టు ది ఫ్యూచర్ గుర్తుకొస్తుంది. ఇందులో కీచులాడుకునే తల్లిదండ్రుల్ని భరించలేని కుర్రాడు టైమ్ మెషీన్ లో తల్లిదండ్రుల టీనేజీ కాలంలో కెళ్లి, వాళ్ళ కీచులాటలకి కారణాన్ని అక్కడ, ఆ టీనేజీ వయసులో తొలగించి తిరిగొస్తాడు. సైకలాజికల్ గా చెప్పాలంటే ఇది సైకో థెరఫీకి కథా రూపం. హిప్నాటిస్టులు కూడా హిప్నాటిజంతో గతంలోకి  తీసికెళ్ళి మానసిక సమస్యల్ని మరమ్మత్తు చేయడం తెలిసిందే.

        ప్రస్తుత కథ ముక్కోణ ప్రేమ కథ. ఇందులో 1983లో రాధ ఆ ప్రేమ దక్కించుకోలేని బాధతో వున్నప్పుడు, 2020 లో వుంటూ ఆమెతో కనెక్ట్ అయిన కృష్ణ చేయాల్సింది ఆమెకి సైకో థెరఫీనే. ఇది చేయకుండా ఆమె పుణ్యాన ఆ కాలంలో తన తల్లిదండ్రులతో మాట్లాడగల్గిన తను, దానికే జన్మ ధన్యమైనట్టు ఫీలై, ఆమెని గాలి కొదిలేసి ముగించడం పాత్రోచితంగా లేదు.

        పదార్ధానికి వినాశం లేదన్నారు గానీ రూపం మారవచ్చు. పదార్ధమంటే శక్తి. శక్తి ఏ రూపం ధరిస్తే ఆ పదార్ధం. కాబట్టి శక్తికి వినాశం లేదు గనుక పదార్ధమూ నశించదు. అందుకని కాశ్మీరు గురించి నెహ్రూ, జిన్నా, కాశ్మీరు రాజు ఏం మాట్లాడుకున్నారో ఆ శబ్ద తరంగాలు విశ్వంలో వుండే వుంటాయని ఈ కథ ప్రతిపాదన. శబ్దం కూడా శక్తియే. పదార్ధం నుంచి శక్తి రూపంలో వెలువడే వైబ్రేషనే శబ్దం. పదార్ధం ఏ రూపం మార్చుకుంటే ఆ రకమయిన అణువులతో వైబ్రేషన్ ప్రసారమవుతుంది.

        మనం మాట్లాడుకునే మాటల వైబ్రేషన్స్ గాలిలోని అణువుల ద్వారా ప్రయాణించి అన్ని  వైపులా ప్రసరిస్తాయి. దారిలో ఏ అవరోధముంటే దాన్ని తాకి ఆ శక్తి రూపంలోకి మారిపోతాయి. గోడలుంటే గోడల్ని తాకి గోడల శబ్దంగా ప్రతిధ్వనిస్తాయి. గదిలో తివాచీ, సోఫాలు లాంటి మెత్తని ఉపరితలాలుంటే వాటిలోకి మిళితమై పోతాయి. కాబట్టి నెహ్రూ, జిన్నా, కాశ్మీర్ రాజు మాట్లాడుకున్న మాటల తరంగాలు మాట్లాడుకున్న చోటే ఫినిష్ అయిపోతాయి. అవే తరంగాల రూపంలో అలాగే విశ్వంలో పడి వుండవు. పైగా శూన్యంలో శబ్దం ప్రయాణించదు, వాయు మండలంలోనే ప్రయాణిస్తుంది.

        ఇక కాశ్మీరు సమస్యకి మూల కారకులు జిన్నా, కాశ్మీరు రాజులతో బాటు, మౌంట్ బాటెన్ కూడా. వీళ్ళు కంపు చేసిన చరిత్ర లోంచి 55 శాతం కాశ్మీరు భూభాగమైనా లాక్కొచ్చారు నెహ్రూ, పటేల్ లు.

నటనలు- సాంకేతికాలు

    ఇది రాధ పాత్ర చెప్పుకునే ఆమె కథ. ఈ పాత్ర నటించిన గాయత్రి కాలానికి తగ్గట్టు పాత్రకి సరిగ్గా సరిపోయింది- రూప స్వరూప లావణ్యాలతో, ముఖభావాలతో, మాటతీరుతో, డ్రెస్ సెన్స్ తో, నాట్య కళతో. అమాయక పాత్ర. కథ వుంటేనే పాత్రలు నిలబడతాయి.

        ఉద్యమ కార్యకర్తగా, ప్రేమలో పడని పాత్రగా నవీన్ చంద్ర కథతో పాటు వుంటాడు, కథగా కాదు. ఆ మేరకే నటన వుంటుంది. కాశ్మీరు పరిశోధన చేసే పాత్రలో క్రిష్ కథ నడపే పాత్రగా వుంటాడు. నటన కాస్త అతిగా కూడా వుంటుంది. గర్ల్ ఫ్రెండ్ గా అదితి ఎక్స్ ట్రోవర్ట్ పాత్ర. రెండు మూడు సీన్లలో లెక్చరర్ గా రాజారవీంద్ర.

        పాత్రల పేర్లు రామ్, రాధ, కృష్ణ, వసుధ అని వాటి మధ్య సంబంధాల్ని తెలపడానికన్నట్టుఅమెచ్యూరిష్ రైటింగ్ గా వున్నాయి. రామ్ పక్కన రాధని చూసిన లెక్చరర్, ఆమెని సీతా అని పిలవడం మరీ చాదస్తపు స్క్రిప్టు రచనగా వుంది. యూత్ సినిమా అన్నప్పుడు యూత్ అప్పీల్ లేకపోతే కష్టం. పాటలు మెలోడీ ప్రధానంగా వున్నాయి. సాంకేతికంగా బడ్జెట్ కి తగ్గట్టు వుంది.

చివరికేమిటి

     టైమ్ ట్రావెల్ జానర్ ప్రేమ కథని  సైన్స్ ఫిక్షన్ చేయకుండా ప్రేమ కథే ప్రధానంగా సగటు ప్రేక్షకుడికి అర్ధమయ్యేట్టు తీశారు. ఫస్టాఫ్ లో హీరోయిన్ హామ్ రేడియోతో సెకండ్ హీరోతో కనెక్ట్ అయినప్పుడు గానీ హీరోయిన్ 1983 లో వున్నట్టు తెలీదు. ఇలా ఫస్టాఫ్ లో కథనం రీఫ్రెష్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ట్రాక్ ప్రశ్నల్ని రేకెత్తించేలా సాగుతూ, ఫస్ట్ హీరోని ముందుకు తెస్తూ, ఇంటర్వెల్ కి కథనం మరో ప్రశ్నతో రీఫ్రెష్ అవుతుంది.

        ఇలా సెకండాఫ్ లో కూడా మరో మూడు సార్లు కథనం రీఫ్రెష్ అవుతూ ప్రశ్నల్ని రేకెత్తించే మలుపులతో బలంగా మారుతుంది. కథనమంటే ప్రశ్నలు రేకెత్తించి జవాబులివ్వడమనే చైతన్యం కాబట్టి, ఇక్కడ ఇది భిన్నకాలాల్లో సాగే సమాంతర కథకి కుదిరింది. ఇలా కథనం రీఫ్రెష్ అవుతూ కూర్చోబెట్టే సినిమాలు ఎక్కడొస్తున్నాయి గనుక. ప్రేమ కథ కాస్తా కుటుంబ కథగా మలుపు తిరిగి చిక్కుముడి వేయడం, ఆ ముడి విప్పి మళ్ళీ ప్రేమ కథగా మారడం ఇవన్నీ సస్పెన్సుని కూడగట్టుకుని సాగుతూంటాయి సెకండాఫ్ లో.  

        అయితే రచన, దర్శకత్వం, మేకింగ్ మరింత యూత్ ఓరియెంటెడ్ గా, మార్కెట్ యాస్పెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని వుంటే, సినిమా ఇలా అనామకంగా వచ్చి వెళ్లిపోయేది కాదు. పబ్లిసిటీ పరంగా కూడా సినిమాకి డిజిటల్ ప్రెజెన్స్ లేదు. రివ్యూలు సరే, ఎక్కడా కన్పించవు. సినిమా వివరాల గురించి ఒక వీకీపీడియా పేజీని కూడా క్రియేట్ చేసుకోలేకపోతే, సినిమాఎందుకు రిలీజ్ చేయడమనేది ప్రశ్న. కథలో ప్రశ్నలున్నట్టు పబ్లిసిటీలో కూడా ప్రశ్నలుండా లనుకున్నారేమో?

సికిందర్