రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, జూన్ 2021, బుధవారం

1042 : రివ్యూ


నాయాట్టు (మలయాళం)
దర్శకత్వం : మార్టిన్ ప్రకట్
తారాగణం : కెంచకో బొబన్
, జోజు జార్జి, నిమీషా సజయన్, యమ గిల్గమేష్, జాఫర్ ఇడుక్కి తదితరులు
రచన : షాహీ కబీర్, సంగీతం : విష్ణు విజయ్
, ఛాయాగ్రహణం : షైజు  ఖాలిద్
బ్యానర్ : గోల్డెన్ కాయిన్ మోషన్ పిక్చర్
, మార్టిన్ ప్రకట్ ఫిలిమ్స్
నిర్మాతలు : రంజిత్
, పి ఎం శశిధరన్, మార్టిన్ ప్రకట్
విడుదల : ఏప్రెల్ 8
, 2021, నెట్ ఫ్లిక్స్
***

కథ
ప్రవీణ్ మైకేల్ (కొంచాకో బొబన్) పోలీసుద్యోగంలో చేరతాడు. అదే స్టేషన్లో సునీత (నిమీషా సజయన్) పని చేస్తూంటుంది. మణియన్ (జోజు జార్జి) ఏఎస్సైగా వుంటాడు. సునీత, మణియన్ దళితులు. మణియన్ కూతురికి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తూ ఆమె అందులో పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ వుంటాడు. ఒక రోజు సునీత బంధువు, దళిత పార్టీ కార్యకర్త బిజూ అనే అతను, పోలీస్ స్టేషన్లో బీభత్సం సృష్టిస్తాడు. ఏఎస్సై మణియన్ లాకప్ లోవేస్తే ఫోన్లు చేయించుకుని విడుదలై పోతాడు. పార్టీ కార్యకర్తలు పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు.

        ఇంకో రోజు మణియన్, ప్రవీణ్ లు ఒక పెళ్ళికి హాజరై బాగా తాగుతారు. జీపు డ్రైవ్ చేయడానికి మణియన్ మేనల్లుడు రాహుల్ ని తెచ్చుకుంటాడు. అదే జీపులో సునీత ఎక్కుతుంది. దారి మధ్యలో యాక్సిడెంట్ జరుగుతుంది. జీపు డ్రైవ్ చేసిన రాహుల్ పారిపోతాడు. ఆ యాక్సిడెంట్ లో దళిత పార్టీ కార్యకర్త జయన్ చనిపోతాడు. దీంతో దళిత ఆందోళన చెలరేగుతుంది. ఆ నియోజక వర్గంలో ఉప ఎన్నిక వుంది. 50 వేల దళిత ఓట్లున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాక్సిడెంట్ చేసిన సిబ్బందిని అరెస్ట్ చేయమని ఆదేశిస్తాడు ముఖ్యమంత్రి జయప్రకాష్ (జాఫర్ ఇడుక్కి).


        దీంతో ప్రవీణ్, మణియన్, సునీత ముగ్గురూ పారిపోతారు. వాళ్ళని పట్టుకోవడానికి ఎస్పీ అనూరాధ (యమ గిల్గమేష్) తో టీంని నియమిస్తాడు డిజిపి. వేట మొదలవుతుంది. దొరక్కుండా ప్రదేశాలు మారుస్తూ పరారీలో వుంటారు ముగ్గురూ. ఇలా ఎక్కడిదాకా ఎంతకాలం పరుగుదీశారు? అనూరాధ టీం వాళ్ళని పట్టుకోగలిగిందా? మధ్యలో తలెత్తిన వూహించని పరిణామమేమిటి? చేయని నేరానికి నేరస్థులుగా ముద్రపడిన పోలీసులు ముగ్గురూ, ముఖ్యమంత్రి ఓట్ల రాజకీయానికి కెలా బలయ్యారు? ... ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

      ఇది  2011 లో కేరళలో జరిగిన ఉదంతం. నల్గురు పోలీసులు ఒక టాక్సీలో పెళ్ళికి వెళ్ళి వస్తూంటే యాక్సిడెంట్ జరిగి ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆగ్రహం పెల్లుబికింది. ఆ నల్గురు పోలీసుల మీద ఎస్సీ ఎస్టీ చట్టం కింద, హత్య కేసు కింద అరెస్టు చేయమని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నల్గురూ అజ్ఞాతంలో కెళ్ళిపోయి బెయిల్ కోసం ప్రయత్నించారు. 100 రోజుల తర్వాత సుప్రీం కోర్టులో బెయిలు లభించింది. ఇప్పుడు పదేళ్ళు గడిచిపోయినా కేసు ఇంకా తేలలేదనేది వేరే సంగతి.

        ఈ ఉదంతాన్ని తీసుకుని సినిమా కనుగుణంగా కల్పన చేశాడు రచయిత షాహీ కబీర్. ఈయన సెలవులో వున్న పోలీసు. పోలీసు శాఖ పనితీరు ప్రత్యక్షంగా తెలుసు గనుక ఆ అనుభవంతో ప్రొఫెషనల్ గా రచన చేశాడు. పాలకులు తమ రాజకీయావసరాల కోసం అవసరమైతే పోలీసుల్ని సైతం ఎలా బలి చేయగలరో చెప్పాలనుకున్నాడు రచయిత.     

ఇది మ్యాన్ హంట్ థ్రిల్లర్ జానరైనా రెగ్యులర్ కమర్షియల్ హీరోయిజంతో వుండదు. హీరోయిజం లేని రియాలిస్టిక్ అప్రోచ్ తో వుంటుంది. నేరంలో ఇరుక్కున్న హీరో అసలు నేరస్థుణ్ణి పట్టుకుని నిర్దోషిగా బయటపడే రొటీన్ టెంప్లెట్ ని బ్రేక్ చేసి, కమర్షియల్ సినిమా ఇలా కూడా తీయవచ్చని పరిస్థితి- పాత్ర సంబంధాన్ని తారుమారు చేసి చూపించాడు.     

వాస్తవ జీవితంలో చూస్తే పరిస్థితిని జయించే హీరోయిజాలు మాత్రమే వుండవు. ఆ హీరోయిజాలు పరిస్థితుల్ని ఎదుర్కొలేని నిస్సహాయ స్థితీ కూడా వుంటుంది. ఇంతకాలం మనల్ని మనం మభ్య పెట్టుకుంటూ తియ్యటి హీరోయిజాల సినిమాలు ఆనందిస్తూ వచ్చాం. కాస్త తేడాగా చేదు వాస్తవాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత సినిమా షోకిల్లా రాయుళ్ళుగా ఇకపై మనకుంటుంది.

 ***
        కమర్షియల్ కి, రియాలిస్టిక్ కి మధ్య విభజన రేఖ చైనా సరిహద్దు లాగా చెరిగి పోతున్న ప్రస్తుత వినోద కాలమాన పరిస్థితుల్లో, సినిమా కథా రచనా నిర్వచనాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఇక ఏర్పడుతోందేమో. ఈ దిశగా మేధోమధనం జరగాలి.  సిట్టింగ్ రూమ్స్ కాక చితికి పోతున్న స్టోరీస్ కి ప్రయోగ శాలలు కావాలిప్పుడు. సైంటిస్టుల్లా కూర్చుని బుర్రకి పనిచెప్పే ప్రొఫెషనల్స్ కావాలి. స్టార్ సినిమాల్ని వదిలేస్తే, మిగిలిన వాటి సృజనాత్మక స్వేచ్ఛకి తలుపులు బార్లా తెరిచి పెట్టేసి వున్నాయిప్పుడు. కానీ దురదృష్టమేమిటంటే, తెలుగులో ఇలాటి నిర్వచనాలు మార్చే సినిమాలు కనుచూపు మేరలో కూడా వచ్చే సూచనలు లేకపోవడం. ఎవరైనా మేకర్ ఇలాటి ప్రయత్నమేదో చేసినా ఇంకా మూస కథల్నే కోరుకునే, లేదా మేకర్ ప్రయత్నాన్ని మూసగా మార్చేసే, మూస మనసులే ఇంకా బిజినెస్ మోడల్ మారిన ఈ రోజుల్లోనూ రాజ్యమేలుతున్నాయి.

        నాయాట్టు (వేట) ని చూస్తే ఇది కథ కాదు. జీవితంలో కథలుండవు, గాథలే వుంటాయి. గాథల్ని సినిమాలుగా తీస్తే ఆడవు గనుక కథగా మార్చి తీస్తారు. ఐతే గాథలా వున్న నిజ సంఘటనని అనుకోకుండా గాథగానే తీసి విజయం సాధించారు నాయాట్టు తో. ఇది ఇంకో ప్రత్యేకత.

        అయితే దళిత కోణంలో చేసిన ఈ గాథ కాన్సెప్ట్ పరంగా డొల్ల అని చెప్పక తప్పదు. ఎత్తుకున్న దళిత కోణాన్ని నిజాయితీగా చెప్పలేక అపహాస్యం చేసిన వరస కన్పిస్తుంది. గాథ అయివుండీ, యాంటీ క్లయిమాక్సుతో మ్యాన్ హంట్ థ్రిల్లర్ గా నిలబడిన రచన, కాన్సెప్ట్ పరంగా చొరవ చూపలేక చతికిల బడిందని ఒప్పుకోవాలి.        

నటనలు - సాంకేతికాలు

     తారాగణంలో ఎక్కువగా గుర్తుండి పోయే నటన ఎస్పీ అనూరాధగా నటించిన యమ గిల్గమేష్ ది. ఇంతకంటే అచ్చం రియలిస్టిక్ నిజ జీవిత పోలీసుని నటించడం చూడం. కమర్షియల్ పోలీసు పాత్రల్లా క్రూరత్వంతో కేకలేస్తూ విరుచుకుపడే ఓవరాక్షన్ కాదు. అసలు క్రూరత్వముండదు, విరుచుకు పడడముండదు. ఆమె ఫేసు చూస్తేనే పోలీసు ఫేసు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కేరళకి చెందిన ఆర్టిస్టు. రియలిస్టిక్ సినిమాల్లో నటించే కమర్షియల్ ఆర్టిస్టులు రియలిస్టిక్ నటన ఈమెని చూసి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈమె ఇరుక్కునేలా డిజిపి బ్లాక్ మెయిల్ చేసేప్పుడు ఈమె కనబర్చే రియాక్షన్, ముగింపులో నిందితుల్ని కోర్టుకి తరలిస్తున్నప్పుడు గిల్టీగా చూసే చూపూ మరువ లేనివి. యమ రియలిస్టిక్ ఈమె.

        కొంచాకో బొబన్ పూర్తిగా పోలీసు పాత్రని డౌన్ ప్లే చేశాడు. అతను కొత్తగా పోలీసు శాఖలో చేరాడు గనుక సిన్సియర్ గా పనిచేయాలని భావించి కష్టాల్లో పడతాడు. ఈ విషయం మీదే ఇతడికీ ఏఎస్సై పాత్ర జోజు జార్జికీ పడదు. అలాగే ఇంకో పోలీసు సునీతగా నటించిన నీమీషా సజయన్ చివర్లో జోజు జార్జి పట్ల విధేయతతో, మానాన్న నేరస్థుడు అనే దుఖభారం అతడి కూతురి కుండ కూడదన్న భావంతో, తను బలి అవడానికి సిద్ధపడుతూ చెప్పే మాటలు పాత్రని పై స్థాయికి తీసికెళ్తాయి. నైతిక విజయం ఈ బాధిత పోలీసుల వైపే వుంది. అయినా వీళ్ళ భవిష్యత్తు ఓట్ల రాజకీయాధికారం చేతిలో వుంది.  

        ఏఎస్సైగా జోజు జార్జి పాత్రకీ పరిపూర్ణత వుంది- అది విషాదాంతమైనా. తను నేరస్థుడు కాదని కూతురికి నిరూపించేందుకు ఒకే ఒక్క మార్గంతో ఈ విషాదాంతం. ఇంకా చట్టానికి దొరక్కుండా పారిపోతూ వుండడం నిర్దోషిత్వాన్ని నిరూపించదు. లొంగి పోవడమూ నిరూపించదు. అయితే ఒక పని చేయవచ్చు. సహజమైన ఆ పని చేయకపోవడం పాత్ర చిత్రణ లోపమే. నేర కథ లోప రహితంగా వుండాల్సిన అవసరముంది.

        ఈ గాథలో విలన్ ఎవరు? ముఖ్యమంత్రే. ఈ పాత్రలో జాఫర్ ఇడుక్కి విలన్ లక్షణాలు ప్రదర్శించకుండా కూల్ గా వుంటాడు. క్యాజువల్ గా ఓట్ల మీద దృష్టితో ఒక్కో ఆదేశం ఉలిక్కిపడేలా ఇస్తూంటాడు. రేపే పోలింగ్ అన్నప్పుడు డిజిపి రిస్కు తీసుకుని రచించిన ఫేక్ డ్రామా, పోలింగ్ అయ్యాక బెడిసి కొడితే, ఓట్లు పడ్డాక నువ్వెలా చస్తే నాకేంటనే ధోరణిలో డీజీపీనే ఇరికిస్తూ చేతులు దులుపుకునేలాంటి  - కూల్ నెస్ మాటున కరుడుగట్టిన క్రూర మనస్తత్వం వుందే - ఇది ఇడుక్కి నటనని చెబుతుంది.

***
        ఇది మ్యాన్ హంట్ థ్రిల్లరైనా పాత్రలతో, నటనలతో చీకటి వెలుగుల హ్యూమన్ డ్రామా వల్ల దేశీయ జీవితంతో రాణించింది. దేశీయ జీవితం లేని థ్రిల్లర్ కట్ అండ్ పేస్ట్ కథనమవుతుంది. కమర్షియల్ సినిమాలు ఆర్టిఫిషియల్ గా వున్నాయని, రియలిస్టిక్ సినిమాల్ని ఆర్టిఫిషియల్ గా చుట్టి పారేయడం ఇక కుదరదు. ఆర్గానిక్ గానే  రూపొందించాలి.

        థ్రిల్లర్ కేవలం థాట్స్ తో వుంటే, ఎమోషన్ లేని ఒట్టి యాక్షన్ రియాక్షన్ల కథనమే జొరబడుతుంది. థాట్ కి ఎదురు థాట్ ఇచ్చే పాత్రల మధ్య సంఘర్షణతో ఫేక్ కథనం అన్నమాట. థాట్స్ క్షణికమే. థాట్స్ తో పుట్టే ఎమోషన్స్ జీవిత కాలమెక్కువ. అతను మంచివాడు అని ఇప్పుడు పుట్టిన థాట్,  అతను మంచివాడు కాదు అనే థాట్ గా రేపు మారిపోవచ్చు. కానీ అతను మంచి వాడు అని థాట్ రాగానే పుట్టిన ఎమోషన్, కాదని థాట్ రాగానే వెంటనే మారిపోదు. టైమ్ తీసుకుంటుంది. రోజులు పట్టొచ్చు. థాట్ కి నిలకడ తక్కువ, ఎమోషన్ కి నిలకడ ఎక్కువ. ఇది ప్రశ్నిస్తుంది. నిన్న మంచోడన్నావ్  కదా, ఇప్పుడు కాదంటావేంటని కన్విన్స్ కాలేక వుండిపోతుంది. తర్వాత్తర్వాత చల్లబడుతుంది. 

ఇలా మనిషన్నాక ఎమోషన్ లేని థాట్స్ వుండవు. సినిమాల్లో ఎమోషన్ లేని థాట్స్ తో యాక్షన్ రియాక్షన్ల కథనం చేసినప్పుడు అది డీప్ గా టచ్ చేయదు ఆడియెన్స్ కి. పైపైన థ్రిల్ చేస్తుందంతే. ప్రస్తుత సినిమా ఈ టైపులో లేదు. ముఖ్యమంత్రి ఒక థాట్ చేస్తే ఆ నెగెటివ్ ఎమోషన్ ప్రభావం వెన్నాడుతుంది. బాధితులైన పోలీసు పాత్రలు ఇంకో థాట్ చేస్తే ఆ పాజిటివ్ ఎమోషన్ అంతే వెన్నాడుతుంది. ఇలా పాజిటివ్ - నెగెటివ్ ఎమోషన్ల ఇంటరాక్షన్ కథనంతో, ఈ మ్యాన్ హంట్ థ్రిల్లర్ బలమైన హ్యూమన్ డ్రామా అవుతోంది.

***
        సాంకేతికంగా కూడా దేశీయ జీవితం కనబడుతుంది- ఫారిన్ లుక్ వుండదు. ఆర్గానిక్ గా వుంటుంది. కెమెరా ఫారిన్ దే కావచ్చు, దాని పనితనం దేశీయ పౌరసత్వం తీసుకుంది. దీంతో ఫారిన్ సినిమా చూస్తున్నట్టుగాక (థ్రిల్లర్ అనగానే ఫారిన్ సినిమా అన్పించేలా చుట్టేయక పోతే తెలుగు మనసూరుకోదు కదా, తెలుగు మల్లెల మనసే ఫారినోడి కొక్కోరోక్కో పుంజు) మన సినిమా చూస్తున్నట్టే వుంటుంది. మలయాళీ, బెంగాలీ మేకర్ల నుంచి మన సినిమాలు తీయడం నేర్చుకోవాల్సిన అవసరం ఇకనైనా వుందేమో తీవ్రంగా ఆలోచించాలి. తెలుగు మేకర్లు మలయాళ సినిమాలు తెగ చూసేస్తూ వుంటారు. ఎందుకు చూస్తారో, ఏం తెలుసుకుంటారో తెలీదు మల్లెల మనసుతో. పనిలోకి దిగితే మాత్రం ఫారినోడి కోడి పుంజులే. విసుగు లేకుండా చికెన్ మేళా కోరస్.

        నేపథ్య సంగీతం, సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కడ ఎలా ఎప్పుడు, ఎంత మేర వాడితే మిస్టీరియస్ ఫీలింగ్ క్రియేటవుతుందో- అక్కడ అలా అప్పుడు, ఆ మేర వాడి ఫలితాల్ని సాధించారు. ఈ థ్రిల్లర్ ఆడియో థీమ్ ఒకటే : మిస్టరీ ఫీల్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని మిస్టీరియస్ వాతావరణం ఈ కథలో ఇమిడి వుండడంతో. గాథకి మిస్టీరియస్ ఫీలే కదా వుండాలి.

స్క్రీన్ ప్లే సంగతులు

     దొంగని పోలీసులు వేటాడ్డం సాంప్రదాయ కథనం. పోలీసుని పోలీసే వేటాడ్డం సాంప్రదాయం మీద తిరుగుబాటు కథనం. రోల్ రివర్సల్ తో ఈ తిరుగుబాటు. జరిగిన ఒక ఉదంతంలోంచి కొత్త అయిడియా ఆవిర్భావం. పోలీసుల్ని పోలీసులే వేటాడే ఐడియా. రోగ్ పోలీసుని పోలీసులు వేటాడ్డం వేరు. న్యాయంగానే వుంటుంది. మంచి పోలీసుని పోలీసులు వేటాడి బలిపశువు చేయడం అన్యాయంగానే వుంటుంది. ఇలాటి ఉదంతాలు అరుదుగా జరుగుతాయి. ఇటీవలే ముంబాయిలో జరిగింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా వ్యవస్థకి ఎంతో ఇష్టుడైన, అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేసి పాపులరైన, ఏసీపీ సచిన్ వజే చివరికి జైలు పాలయ్యాడు. ముఖేష్ అంబానీ ఇంటి ముందు 'కారులో బాంబులు' కేసులో కారు ఓనర్ని చంపాడన్న ఆరోపణలతో జైల్లో వేసి సీబీఐ కి అప్పజెప్పారు!

        ఉదంతాన్ని ఉదంతం లాగే తీస్తే కథ అన్పించుకోదు, గాథ కూడా అన్పించుకోదు. ఉత్తమ జర్నలిస్టు న్యూస్ రిపోర్టింగ్ అన్పించుకుంటుంది. బలిపశువులున్న ఉదంతాన్ని వీరత్వమున్న ముగింపుగా మార్చి తీస్తే ఓవరాక్షన్ అన్పించుకుంటుంది. ఉదంతంలోని సారాన్ని సారం లాగే వుంచి, బాధిత పాత్రల్ని బాధితులుగానే కొనసాగించి, అది ఏ న్యాయ అన్యాయాల్ని చెబుతోందో, దాన్ని ప్రేక్షకుల చర్చకి వదిలేయడం కథ కాకపోవచ్చు గానీ, గాథ అవుతుంది స్ట్రక్చర్ లో వుంటే. గాథల ముగింపులు ఆనందింప జేయవు, ఆలోచింప జేస్తాయి.

        మన దేశంలో గాథ తీయాలనుకుని గాథ కుండే నిర్మాణంతో శాస్త్రీయంగా గాథలు తీసే వాళ్ళు లేరు. కథలే తెలుసు, గాథలనేవి వుంటాయని తెలిస్తేగా. కథలనుకుని స్ట్రక్చర్ లేకుండా తీస్తే అవి మిడిల్ మటాష్ తో గాథలు కాని గాథలై ఫ్లాపవుతున్నాయి.నాయాట్టు కూడా కథ - గాథ తేడాలు తెలిసి, గాథగా గాథ నియమాలు తెలిసి తీశారనుకోలేం. కథగానే తీస్తూంటే / రాస్తూంటే అది తెలియకుండానే ఏదో స్ట్రక్చర్లో వున్న గాథై పోయిందని మాత్రం నమ్మకంగా చెప్పొచ్చు.  

***
        ఇంతకీ ఇది స్ట్రక్చర్లో వున్న గాథెలా అయింది? బిగినింగ్ అరగంటకి పోలీసులు ముగ్గురూ యాక్సిడెంట్ చేసి పారిపోయే సంఘటన ప్లాట్ పాయింట్ వన్నై, తర్వాత మిడిల్ టూ చివర, ఆ పోలీసులు ముగ్గురూ పోలీసులకి దొరికిపోయే సంఘటన ప్లాట్ పాయింట్ టూ అయి, కథలాగే త్రీయాక్ట్ స్ట్రక్చర్లో వున్న గాథయింది. బాధిత పోలీసులకి గోల్ లేకపోవడంతో గాథయింది. బాధిత పాత్రలు పాసివ్ కావడంతో గాథయింది. ఇలా గోల్ లేకపోయినా, పాసివ్ పాత్రలైనా, గాథగా నిలబడ్డానికి కారణం - గోల్ లేకుండా, పాసివ్ లా అన్పిస్తున్న పరారీలో వున్న పోలీసు పాత్రలు, నిజానికి పాసివ్ రియాక్టివ్ పాత్రలు కావడం.      

  యాక్టివ్ పాత్ర తెలుసు, పాసివ్ పాత్ర తెలుసు, పాసివ్ రియాక్టివ్ ఏమిటి? ఎన్టీఆర్ నటించిన అశోక్ లో విలన్ జరిపే దాడుల్ని ఎన్టీఆర్ ప్రతీసారీ తిప్పి కొడుతూ తప్పించుకోవడమే చేస్తాడు. చూస్తే గొప్ప యాక్షన్ కొరియోగ్రఫీయే కన్పిస్తుంది. ఎన్టీఆర్ పాత్ర బయోగ్రఫీ కన్పించదు. అది యాక్టివ్ యాక్షన్ కాదు. విలన్ చేస్తున్న దాడులకి రియాక్ట్ అయి, తిప్పికొట్టి తప్పించుకునే పాసివ్ ప్రొఫైల్ని విలన్ కి ప్రకటించుకోవడం. దీంతో యాక్టివ్ విలన్ ఇంకిన్ని దాడులు చేస్తూ పోవడం. వాటిని తిప్పికొడుతూ ఎన్టీఆర్ పాసివ్ రియాక్టివ్ స్వభావం వెల్లడించుకుంటూ పోవడం.
 
        ఇదే ఎన్టీఆర్ యాక్టివ్ పాత్రయితే, పరిస్థితిని తన చేతుల్లోకి తెచ్చుకుని, వ్యూ హాత్మకంగా పైచేయి సాధించి, తనే ఫస్ట్ హేండ్ దాడులు చేస్తూ, విలన్ని ఆత్మరక్షణలో పడేస్తాడు. తను ఆత్మ రక్షణ చేసుకునే పాసివ్ రియాక్టివ్ పాత్రవడు. పాసివ్ రియాక్టివులు కథలకి పనికిరావు, ఫ్లాపవుతాయి. అశోక్ హిట్ కాలేదు.

        నాయాట్టు లో ముఖ్యమంత్రి, డిజిపి, ఎస్పీ, సిబ్బందీ ఒకవైపు, బాధిత పోలీసులు ముగ్గురూ మరోవైపు. ఈ బాధిత పోలీసులు ప్రధాన పాత్రలు, ముఖ్యమంత్రీ డీజీపీ ఎస్పీ వాళ్ళ సిబ్బందీ ప్రత్యర్ధి పాత్రలు. ఈ రెండు పక్షాల మధ్య స్క్రీన్ ప్లే మిడిల్ విభాగంలో వుండాల్సిన సంఘర్షణతో కూడిన, యాక్షన్ రియాక్షన్ల పోరాటమే వుంది. ఇందుకూ గాథగా బలం చేకూరింది. ఇక పట్టుకోవడానికి ప్రత్యర్ధి పక్షం, తప్పించుకోవడానికి ప్రధాన పక్షం. పాసివ్ రియాక్టివ్ పాత్రల్లాగా ఎత్తుకు పైయెత్తు వేస్తూ ప్రధాన పాత్రలు తప్పించుకుంటూనే వుంటారు. తమ ముఖ్యమంత్రే, నమ్మిన తమ పోలీసు శాఖే, ఐనా తమ మీదే కుట్ర చేస్తూంటే, కింది స్థాయి పోలీసులైన తామింకేం చేయగలరు. అలాగెలా వుంటారు, ప్రధాన పాత్రలన్నాక గెలిచితీరాలని వాదిస్తే, అది కల్పనల కమర్షియల్ కథవుతుంది. వాస్తవిక కథ ఉన్నదున్నట్టు చూపిస్తుంది. హాలాహల్ అనే హిందీ వాస్తవికతలో హీరో అయిన ఎస్సై ని చంపేస్తారు చివరికి. పెద్దసార్ల ముందు మాట వినని అతనెంత.

        కనుక నాయాట్టు పోలీసులు ముగ్గురూ ఇక తప్పించుకోలేక, ప్లాట్ పాయింట్ టూలో బ్రేకుపడి దొరికిపోతారు. స్ట్రక్చర్ లో ప్లాట్ పాయింట్ టూ అనేది సమస్యకి పరిష్కార ఘట్టమని తెలిసిందే. ఇలా పోలీసులు ముగ్గురూ దొరికిపోవడంతో ప్రత్యర్ధుల సమస్య పరిష్కారమైంది. పరిష్కారమైందా? కాలేదు, తిరగబడింది. దొరికిపోయిన ముగ్గురూ పోలీసుల్లో ఒకడు ఉరేసుకుని!
        ఏఎస్సై మణియన్ కూతురి పట్ల దిగులుతో ఉరేసుకుని చనిపోతాడు.  

***

      పోలింగ్ దగ్గర పడుతోంటే ఏదో వొకటి చేయాలన్న ముఖ్యమంత్రి ఇచ్చిన అల్టిమేటంకి, ఫేక్ అరెస్టులు చూపిస్తాడు డిజిపి. ఓ ముగ్గురికి ముసుగులేసి, పారిపోయిన పోలీసులు దొరికి పోయినట్టు మీడియాకి చూపిస్తాడు. అసలు పోలీసులు ఎప్పుడు దొరికినా కవర్ చేసుకోవచ్చనుకుంటాడు. ముఖ్యమంత్రి కూడా ఇక దళిత ఓట్లు తమకే పడతాయనుకుంటాడు. కానీ అటు ఎస్పీ టీం పోలీసులు ముగ్గుర్నీ పట్టుకుంటే, మణియన్ మృతదేహంగా కన్పిస్తాడు. దీంతో డిజిపి ప్లాను రివర్స్ కొట్టింది. ఈ చావుని డిజిపి మీద తోసేస్తాడు ముఖ్యమంత్రి. ఇలా డైనమిక్స్ కూడా ఈ గాథ కథనానికి బలాన్నిచ్చాయి.

        కూతురు జీవితాంతం తండ్రి నేరస్థుడన్న మచ్చ మోయకూడదన్న భావంతో, కూతురికి వీడియో పెట్టి ఉరేసుకుంటాడు మణియన్. తను నేరస్థుడు కాదని కూతురికి చెప్పుకుంటాడు. శవాన్ని ముందు చూసిన సహ పోలీసు ప్రవీణ్ కి ఈ వీడియో దొరుకుతుంది. దీంతో కేసులోంచి బయటపడొచ్చను కుంటాడు. ఎస్పీ అనూరాధ వచ్చి సెల్ ఫోన్ లాక్కోవడంతో ఈ ఒక్క ఆశా ఆవిరై పోతుంది. ఇలా మిగిలిన ప్రవీణ్, సునీతలు అరెస్ట్ అవుతారు. పోలీసులు కోర్టుకి తీసికెళ్తూంటే ఓపెన్ ఎండ్ గా ముగుస్తుంది.

***

        అయితే కొన్ని ప్రధానమైన లాజికల్ (కామన్ సెన్సు) లోపాలు లేకపోలేదు. ప్లాట్ పాయింట్ వన్ లో ఇది కొట్టొచ్చి నట్టుంటుంది. బాగా రాత్రి వేళ ముగ్గురు పోలీసులు జీపులో పోతున్నప్పుడు నిర్జన ప్రదేశంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు, ముగ్గురూ అక్కడ్నుంచి ఉడాయించి, తెలియనట్టు వుండిపోవచ్చు. సన్నివేశం చూస్తూంటే ఇలా అన్పించేలా వుంది. మణియన్ వదిలేసి పోదామనే అంటాడు. ప్రవీణ్ మృతుణ్ణి హాస్పిటల్ కి తీసికెళ్దామనే అంటాడు. ఇంతలో ఒక దళిత పార్టీ వాడు అటుగా పోతూ చూసేసరికి హాస్పిటల్ కే తీసికెళ్ళి ఇరుక్కుని, అక్కడ్నించి పారిపోతారు సునీత సహా. ఇలా ఈ ఘట్టంలో లోపాల్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు.   

        జీపు డ్రైవ్ చేసింది మణియన్ మేనల్లుడు రాహుల్. అతను పారిపోతాడు. అప్పుడు జీపుని హాస్పిటల్ కి ప్రవీణ్ డ్రైవ్ చేస్తాడు. చిట్ట చివరికి అరెస్టయ్యాక, జీపు డ్రైవ్ చేసింది రాహులని ప్రవీణ్ అంటే, స్టీరింగ్ మీద ప్రవీణ్ వేలిముద్రలున్నాయని పై అధికారి నోర్మూయిస్తాడు. జీపుని ప్రవీణ్ హాస్పిటల్ కి డ్రైవ్ చేస్తే, రాహుల్ వేలిముద్రలు చెడిపోయి, ప్రవీణ్ వేలి ముద్రలే పడతాయన్న లాజిక్ ని తీసి అవతల పెట్టేశారు.

        ఉరేసుకున్న మణియన్ కూడా చేయాల్సిన అసలు పని చేయకుండా, కూతురికి వీడియో పెట్టి చనిపోవడం కూడా లాజిక్ కి అడ్డుపడే వ్యవహారమే. అసలు జరిగింది విన్నవించుకుంటూ అతను సోషల్ మీడియాలో వీడియో పెట్టి వుంటే, అది వైరల్ అయి ప్రజా మద్దతు లభించే అవకాశముండేది.

చివరికేమిటి

      మ్యాన్ హంట్ థ్రిల్లర్ జానర్ గాథగా కొన్ని లోపాలతో చీకటి వెలుగుల హ్యూమన్ డ్రామాగా థ్రిల్ చేసే మాట నిజమే, అయితే కాన్సెప్ట్ పరంగా అసందర్భంగా వుంది. దళిత కాన్సెప్ట్ తీసుకుని అర్ధం లేని గాథ చేశారు. దళిత వర్సెస్ దళిత వర్సెస్ దళిత అన్నట్టు పాత్రల్ని ఎడాపెడా వాడేశారు. యాక్సిడెంట్ చేసిన పోలీసుల్లో ఇద్దరు దళితులు, యాక్సిడెంట్ లో చనిపోయిన వాడూ దళితుడు, యాక్సిడెంట్ చేసిన దళితులున్న పోలీసుల్ని పట్టుకోవాలని రచ్చ రచ్చ చేసేదీ దళిత పార్టీ! ఇలావుంది బలాబలాల సమీకరణ. ఒక సామాజిక వర్గం మీద అదే సామాజిక వర్గాన్ని ప్రయోగిస్తే సామాజిక వర్గ గాథ అవుతుందా. తమ వాణ్ణి యాక్సిడెంట్ చేసిన తమ సామాజిక వర్గాన్ని పోలీసులు పట్టుకుంటే, హుర్రే అని అదే సామాజిక వర్గం అధికార పార్టీకి ఓట్లు గుద్దేసి గెలిపించేస్తుందా? ఏం చెప్పాలనుకున్నారు? దళితులు వర్సెస్ దళితేతరులుగా విజాతి బలాబలాల సమీకరణగా చేసి, ఈ గాథ ఎందుకు చెప్పలేకపోయారు? ఇదీ చివరికి మిగిలే ప్రశ్న.

సికిందర్  

 

26, మే 2021, బుధవారం

1041 : సందేహాలు - సమాధానాలు

 Q : కుల వివక్షపై సినిమాలు తీస్తున్న దర్శకులు నేటి సమాజంలోని వివక్షను చూపించకుండా దశాబ్దాల కిందటి కాలం ఎందుకు ఎంచుకుంటున్నారు? ఉదా: కర్ణన్, అసురన్, పలాస, ఉప్పెన. కాంటెంపరరీ వివక్ష కథలు చెప్పవచ్చు కదా?

మహేష్ రెడ్డి, రైటర్
A : పాయింటే. ఫలానా ఆ రోజుల్లో ఇలా జరిగిందని ఇలాటి సినిమాలు తీయడం కంటే సమకాలీనంగా చెబుతూ తీస్తే వివాదాలొస్తాయని కావచ్చు. కానీ సమకాలీనంగా కె. విశ్వనాథ్ సప్తపది తీశారు, ముత్యాల సుబ్బయ్య ఎర్రమందారం తీశారు. ఆ మధ్య ఒక అసోసియేట్ కోసం సమకాలీన కథే చేశాం. అయితే కుల వివక్ష గురించి కాక ఈర్ష్య గురించి. దీనికి సామాజికార్ధిక చారిత్రక నేపథ్యాల్ని విస్తృతంగా రీసెర్చి చేసి. ఇది కమర్షియలే  అయినా ఎంటర్ టైనర్ గా కూడా వుంటుంది. దీనికి పెద్ద బడ్జెట్, పెద్ద హీరో అవసరం. ఎన్నేళ్ళు  పడుతుందో తెలీదు. కుల వివక్ష సినిమాలు పీరియెడ్ మూవీస్ గా తీసినా అణిచివేత గురించే వుంటున్నాయి. కర్ణన్ లో కుల వివక్ష కూడా కనిపించదు. అలాటి పరిస్థితుల్లో ఎవరితోనైనా పోలీసులలాగే ప్రవర్తిస్తారు. కర్ణన్ లో ఆ వ్యక్తి తలపాగా తీయలేదని పగ పెంచుకుని అదంతా చేశాడు పోలీసు అధికారి. ఆ వ్యక్తి స్థానంలో ఇంకే కులం వాడున్నా పోలీసులతో అదే జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా ఒక కులంతో ఇలా జరిగినట్టు కర్ణన్ లో చూపించారు. ఒకసారి ఒక పోలీసు అధికారికి పరిచయం చేయడానికి ఒక కొత్త దర్శకుణ్ణి పిలిపించాం. అతను చాలా లేటుగా, పైగా బ్లాక్ స్పెక్ట్స్ పెట్టుకుని స్టయిలుగా వచ్చేసరికి, ముందు స్పెక్ట్స్ తీసేయమని మనం చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఆ అధికారి చూసే చూపులకి చెంప ఛెళ్ళు మనే దేమో! ఇలాటి పరిస్థితిని ఆహ్వానించడానికి కులమే అవసరం లేదు. కొందరి ముందు కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి వుంటుంది. కర్ణన్ లో కులాన్ని ఆపాదించారుగానీ, నిజానికది ప్రోటోకాల్ సమస్య.

Q : నేను కథ రాసేటప్పుడు ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతున్నాను. ప్రతీ కథతో ఇలాగే జరిగి ఆపేస్తున్నాను. ఎందుకిలా జరుగుతోంది? నేనేం చేయాలి?
బిందు కుమార్, అసోసియేట్  
A : అసలు కథకి తీసుకున్న ఐడియాతో కనెక్ట్ కాకపోతే ఇక దేంతోనూ కనెక్ట్ కాలేరు. ముందు మీ ఐడియాల క్వాలిటీ ఏమిటో పరిశీలించుకోండి. ఐడియాలో స్పార్క్ వుంటే ఆలోచనలు వాటికవే స్పార్క్ అయి లాక్కెళతాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి చేరడం రొటీన్, సాధారణ ఐడియా. బిల్ గేట్స్ కాలేజీ డ్రాపవుట్ అయితే, మన హీరో బిల్ గేట్స్ ని తలదన్నేలా హై స్కూల్ డ్రాపవుట్ గా, హై స్కిల్స్ తో సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరడం స్పార్క్ వున్న ఐడియా. ఈ కథ రాయడంలో థ్రిల్ వుంటుంది. అసాధారణ ఐడియాల్లో స్పార్క్, దాంతో థ్రిల్ వుంటాయి. అసాధారణ ఐడియాలతో కూడా కనెక్ట్ కాలేక పోతే, మీరు మనస్ఫూర్తిగా సినిమాల్లోకి రావాలనుకున్నారో లేదో ఆత్మ పరిశీలన చేసుకోండి.

Q :  'నెయిల్ పాలిష్ 2021' కథావస్తువుకు, 'దీవాన్గీ 2002 కథావస్తువుకు తేడా ఏమిటి? ఇంకో ప్రశ్న, అమ్మాయిలకు మాత్రమే నేషనల్ క్రష్ అనే బిరుదు ఎందుకు ఇస్తారు? అబ్బాయిలకు ఎందుకు కాదు?

ఎంఆర్, రైటర్
A : రెండూ స్ప్లిట్ పర్సనాలిటీతో హత్య చేయడం గురించే. కాకపోతే, మొదటి దానిలో అది నిజంగా స్ప్లిట్ పర్సనాలిటీ. అంతేగాకుండా ఒక న్యాయ సమస్యతో కోర్టు రూమ్ డ్రామా. రెండోదానిలో ఆ స్పిల్ట్ పర్సనాలిటీ నటన. రెండో ప్రశ్నకి, మేల్ నేషనల్ క్రష్ అవార్డులు కూడా వున్నాయి. విజయ్ దేవరకొండ మేల్ నేషనల్ క్రష్ -2021.

***

 

 

23, మే 2021, ఆదివారం

1040 :రివ్యూ


 రచన- దర్శకత్వం : జిస్ జాయ్

తారాగణం : కొంచాకో బొబన్, సిద్దిఖ్, అనార్కలీ నాజర్, వినయ్ ఫోర్ట్, ముఖేష్ తదితరులు
కథ:బాబీ- సంజయ్
, సంగీతం : విలియం ఫ్రాన్సిస్, పాటలు : ప్రిన్స్ జార్జి, ఛాయాగ్రహణం : బహుళ్ రమేష్
బ్యానర్ : మ్యాజిక్ ఫ్రేమ్స్
నిర్మాత : లిస్టిన్ స్టీఫెన్
విడుదల : మార్చి 19
, 2021, అమెజాన్ : మే 19, 2019
***

         ఫీల్ గుడ్ సినిమాల మలయాళ దర్శకుడు జిస్ జాయ్ తనకి మాత్రమే జాయ్ వుంచుకుని, ప్రేక్షకులకి నస పంచే పథకం పెట్టుకున్నట్టుంది. ఈ ఫీల్ గుడ్ నస లైటర్ వీన్ ప్రేమ సినిమాల పేరుతో గతంలో తెలుగులో అనుభవించిందే. మళ్ళీ ఇన్నాళ్ళకి మలయాళ రూపం తొడిగి ఫీల్ గుడ్- ఫీల్ గుడ్- ఫీల్ గుడ్- అంటూ రెచ్చగొడుతోంది. నస ఫీల్ గుడ్ ఎలా అవుతుందో అర్ధం గాదు. ఇండియన్ ఫీల్ గుడ్ సినిమా అంటేనే నస. సినిమా లక్షణాలని పీకి పారేసి, పిప్పిని విప్పి చూపించే నసోపాఖ్యానం. ఫీల్ గుడ్ అంటున్న దర్శకుణ్ణి హాలీవుడ్ లో నిర్బంధించి, ముందు బేసికల్ గా సినిమాని ఫీలయ్యేలా సానబట్టాలి- ఎన్టీఆర్ నిప్పులాంటి మనిషి లో కత్తికి సాన మీ కత్తికి సాన సాంగేసి. 

       ‘మోహన్ కుమార్ ఫ్యాన్స్ ఒక పరిపూర్ణ నస పురాణం. షార్ట్ ఫిలింకి సరిపోయే కథని రెండు గంటలు తీస్తూ పోతూ వుంటే, బడ్జెట్ దాటి నానేసిన నసే అవుతుంది. షార్ట్ ఫిలిం కథగా కూడా అర్ధముండాలి. కథకి ఐడియానే నెగెటివ్ గా వుంటే పాజిటివ్ ఫలితాలు కూడా రావు. గుర్తింపు రావడం వేరు, నన్ను గుర్తించండీ అని అడుక్కోవడం వేరు. అవార్డులనేవి వరించి వస్తాయి. వెంటపడి వేటాడితే వచ్చేవి అవార్డు లన్పించుకోవు. డబ్బిచ్చి చేయించుకున్న సన్మానాలవుతాయి. అవార్డు కోసమే నటించాను, నాకు అవార్డు రావాలని ప్రకటించుకుంటే చులకనై పోవడం తప్ప మరేం వుండదు. సినిమా హిట్టవ్వాలని ప్రేక్షకుల్ని అడుక్కుంటూ ప్రచారం చేసుకుంటే అర్ధముంది గానీ, అవార్డు అడుక్కోవడమేమిటి.

        కానీ ఈ పనే చేస్తాడు మోహన్ కుమార్ (సిద్ధీఖ్) అనే మాజీ హీరో. ముప్ఫై ఏళ్ళ క్రితం ఇతను మమ్ముట్టి, మోహన్ లాల్ ల రాకతో తెరమరుగయ్యాడు. మళ్ళీ ఇప్పుడు అద్భుత పాత్ర నటించి వార్తల కెక్కాడు. ఈ నేపథ్యంలో ఉత్తమ నటుడి జాతీయ అవార్డు ఆశిస్తాడు. ఇందుకు ఆ సినిమా తీసిన నిర్మాత ప్రకాష్ (ముఖేష్), డ్రైవర్ కృష్ణన్ ఉన్ని (కొంచాకో బొబన్) ఇంకా మరికొందరు సిబ్బందీ, మోహన్ కుమార్ కూతురు శ్రీ రంజని (అనార్కలీ నాజర్ -  వీళ్ళే మోహన్ కుమార్ ఫ్యాన్స్) నడుం కడ్తారు. ఇక అవార్డు ఎలా వచ్చిందీ, రావడానికి వీళ్ళేం చేశారు, వచ్చాక ఏం జరిగిందీఈ మొత్తం రెండు గంటల సినిమాలో ఓ అరగంట కథ మాత్రమే.

***

        మోహన్ కుమార్ పాత్రలో ఆ పాత్రెలా వున్నా సిద్ధీఖ్ చాలా డీసెంట్ గా నటించాడు. ఈ సినిమా పేరు చెబితే తన నటనే మెదిలేలా ఫీల్ గుడ్ గా నటించాడు (ఈ సినిమాలో అన్ని పాత్రలూ ఫీల్ గుడ్ గా మనం ఫీలయ్యి తీరాలని కంకణం కట్టుకున్న పాత్రలే, నటనలే-  కథ ఓ కథలా లేకున్నా). అయితే సిద్దీఖ్ అవార్డు ఆశిస్తున్న సినిమాలో అసలెలా నటించాడో మనం చూసేందుకు సరైన అవకాశం కల్పించలేదు దర్శకుడు. ఆ నటించిన సినిమా థియేటర్లో వేసి చూపిస్తూంటే ఆ మినియేచర్ బొమ్మ స్పష్టంగా కనపడదు. అదేదో వైడ్ స్క్రీన్ మీద చూపిస్తే చూసి తెలుసుకునే వాళ్ళం.

        ఇక మోహన్ కుమార్ పాత్రలో సిద్ధీఖ్ చేసేదేమీ వుండదు. అవార్డు సంగతి ఇతర పాత్రలు చూసుకుంటాయి. తను అవార్డు కోసం ఎదురు చూస్తూ ఇంట్లో పాత వస్తువులతో ఆ రోజుల్ని నెమరేసుకోవడం, కాఫీ తాగడం, పార్టీలు చేసుకోవడం వంటివి మాత్రమే చేస్తూంటాడు. తను ముప్ఫై ఏళ్ళ తర్వాత గుర్తింపుకోసం నటించి అవార్డు కోరుకుంటున్నాడు. అదే సమయంలో కూతురు శ్రీ రంజని గాయనిగా ప్రయత్నిస్తోంది. అలాంటప్పుడు తను నటిస్తున్న సినిమాలో ఆమె చేత పాడించ వచ్చుగా. పాడించి వుంటే అవార్డు తనకి కాకుండా ఆమెకి వచ్చి - ఈ ట్విస్టుకి పుత్రికోత్సాహం కలిగేది కదా. ఒకసారి బాలీవుడ్ లో గాయకుడు కిషోర్ కుమార్ కి ఫిలిం ఫేర్ అవార్డు వస్తుందనుకున్నారు. కొడుకు అమిత్ కుమార్ కొచ్చింది!    
   
        అవార్డు ఆశిస్తున్న సిద్ధీఖ్ ఎవరో హేళన చేస్తూంటే కొడతాడు. ఇది వైరల్ అవుతుంది. తర్వాత అయ్యే తతంగాన్నిఫీల్ గుడ్ గా దాటవేశాడు దర్శకుడు. సత్యజిత్ రే తీసిన నాయక్ లో సినిమా నటుడుగా నటించిన ఉత్తమ్ కుమార్, ఒక పార్టీలో ఇలాగే ఎడాపెడా కొట్టి వార్తల కెక్కుతాడు. అయితే ఈ సంఘటన అవార్డు తనకి ప్రకటించాక, అది తీసుకోవడానికి ప్రయాణ మయే ముందు జరుగుతుంది. కాబట్టి అవార్డుకి ప్రమాదముండదు.

        సిద్దీఖ్ సీన్ వేరు. అవార్డుకి అప్లయి చేశాక కొట్టి సీన్ క్రియేట్ చేస్తాడు. ఈ స్టోరీ బీట్ ని దర్శకుడు డైల్యూట్ చేశాడు ఫీల్ గుడ్ పథకం కోసం. లేకపోతే, అలా కొడితే, అది వైరల్ అయి సమసిపోవడం కాదు, అతడి అవార్డుకి వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ అయ్యేది. అవార్డు కమిటీకి ట్యాగ్ అయి అవార్డు గల్లంతయ్యేది. ఈ అనివార్య కథనాన్ని ఫీల్ గుడ్ కోసం దాటేశాడు దర్శకుడు. ఫీల్ గుడ్ అంటే కామన్ సెన్సు, లాజిక్ వదిలె య్యాలన్న మాట. 

        అసలింకో బుర్ర బద్దలు చేసుకున్నా అర్ధం గాని ఫీల్ గుడ్ సంగతేమిటంటే, క్రోనాలజీ... సినిమా విడుదలయింది, జాతీయ అవార్డుకి అప్లయి చేశారు, తర్వాత సినిమా శతదినోత్సవం కూడా అయ్యింది. ఇక అవార్డు నందుకునే శుభకార్యం కోసం ఎదురు చూపులు. ఈ సంవత్సరం ఇచ్చే అవార్డులకి ఈ సంవత్సరం ఎలా అప్లై చేసి ఎదురు చూస్తారు. ఈ సంవత్సరం తీసిన సినిమాకి ఈ సంవత్సరమే జాతీయ అవార్డు వస్తుందా -ఇలా వుంది ఫీల్ గుడ్ కథ!

        కూతురు శ్రీరంజని పాత్రలో కొత్త నటిగా పరిచయమైన అనార్కలీ నాజర్ సింగర్ పాత్రలో ఒక ఆడిషన్ ఇచ్చాక ఇక  ప్రయత్నాలుండవు. వాణీ జయరామ్ ని సుమధురంగా ఆలపించిన ఆమెని మెచ్చుకుని వదిలేస్తాడు సంగీతదర్శకుడు. ఇక ఆ తర్వాత ఆమె కథలో ఏం చేయాలో తెలీక అన్నట్టు ఆందోళనగా కనిపిస్తూ, ఫాదర్ సెంటి మెంటుతో ఫీల్ గుడ్ సన్నివేశాల్లో పాలు పంచుకోవడానికి సెటిలై పోతుంది. ఆ హీరో అయిన ఫాదర్ కి తన అవార్డే గానీ, ఈమె సింగింగ్ స్ట్రగుల్ అస్సలు పట్టదు.

***

       కారు డ్రైవర్ గా కొంచాకో బొబన్ ఇంకో ఫీల్ గుడ్ నమూనా. ఇతనసలు సిద్దీఖ్ నటించిన సినిమా కంపెనీ కారు డ్రైవర్. సిద్దీఖ్ తో వుంటాడు. ఇతడికి సింగర్ నవ్వాలని కోరిక. ఆడిషన్ లో జేసుదాస్ ని కమనీయంగా గానం చేసిన ఇతణ్ణి కూడా సంగీత దర్శకుడు మెచ్చుకుని వదిలేస్తాడు. ఇక ఇతను సిద్దీఖ్ తో ఫీల్ గుడ్ సన్నివేశాల్లో పాలు పంచుకోవడం కోసం నమ్మిన బంటుగా సెటిలై పోతాడు. ఇతనే కాదు, ఇంకో రైటర్ వుంటాడు. ఇతను కథలు వినిపిస్తూ ట్రయల్స్ లో వుంటాడు. ఇంకో యంగ్ స్టార్ వుంటాడు. ఇతడికి ప్రైవసీ లేకుండా సోషల్ మీడియాతో డిస్టర్బ్ చేసే సీన్లూ, వాళ్ళకి బుద్ధి చెప్పే ఇతడి మెసేజిలూ వుంటాయి. ఇంకో దర్శకుడు వుంటాడు. ఇతను సినిమా తీసే దృశ్యాలుంటాయి... శ్రీరంజనితో మొదలుకొని ఇవన్నీ సబ్ ఫ్లాట్స్. టచ్ చేసి అసంపూర్ణంగా వదిలేసిన సబ్ ఫ్లాట్స్. పిసరంత మోహన్ కుమార్ అసలు కథకి, ఈ సబ్ ఫ్లాట్స్ తో సినిమా భర్తీ.

        ఈ సబ్ ఫ్లాట్స్ ఆంతర్యమేమిటా అంటే, దర్శకుడు పూర్వం డబ్బింగ్ ఆర్టిస్టు, తర్వాత లిరిక్ రైటర్, ఆ తర్వాత దర్శకుడయ్యాడు. ఇందుకేనేమో ఈ సబ్ ఫ్లాట్స్ వేసి తన బయోపిక్ ని చూసుకునే ముచ్చట తీర్చుకున్నాడు ఫీల్ గుడ్ గా. ఇంతటితో వదల్లేదు, సినిమాలో దర్శకుడి పాత్ర తనే నటించాడు! ఇంకో ముచ్చట కూడా బలవంతంగా ఇరికించాడు - సింగర్ ప్రయత్నాలు చేసే కొంచాకో బొబన్ ఏడని సిద్ధీఖ్ నిర్మాతని అడుగుతాడు. డాన్స్ ప్రాక్టీసు చేస్తున్నాడని నిర్మాత చెప్తాడు. అతను డాన్సర్ కూడానా అని సిద్దీఖ్ న  అనేసరికి- జామ్మని పాట వచ్చేస్తుంది. కొంచాకో బొబన్ విరగదీసి డాన్స్ పాటేసుకుంటాడు (ఫోటో చూడండి)!  

***

    ఫీల్ గుడ్ కోసం కష్టాలు ఇట్టే తీరిపోతూంటాయి. అవార్డు కోరుకుంటున్న మోహన్ కుమార్ ఫ్యాన్స్ కి రేపే అప్లికేషను ఆఖరు తేదీ అని తెలీదు. దాంతో ఉరుకులు పరుగులు. ఇందులో ఆటంకాలు. ఆటంకం ఎదురైన ఘట్టంలోనే ఎవరో ఒక ఆపద్బాంధవుడు / బాంధవురాలు ప్రత్యక్షమై ఆదుకోవడం! జీవితం జీవించడం చాలా ఈజీ. ఎందుకంటే ఇలా డీఫాల్టుగా మనల్ని ఆదుకునేస్తూ వుంటారు సూపర్ మేన్లు. డోంట్ వర్రీ, లైఫ్ ఈజ్ ఇలాటి ఫీల్ గుడ్ మూవీ.

        ఫీల్ గుడ్ కోసం ఆరు పాటలు. సిద్దీఖ్ కి గుండె పోటు వచ్చినా కూడా పాటే. మొదటి గంట సినిమా సబ్ ఫ్లాట్స్ నిండిపోయి ఎటు పోతోందో అర్ధం గాదు. ఇంటర్వెల్ ముందు అవార్డుకి అప్లయి చేసే ఉరుకులు పరుగులతో కాసేపు అసలు కథ చూపించాడు. సెకండాఫ్ మళ్ళీ సబ్ ఫ్లాట్స్ వేసుకుని, అరగంట తర్వాతే మిగతా అసలు కథ చూపించాడు. గుండెపోటు ఎపిసోడ్. ఇక్కడ ట్విస్టు ఏమిటంటే, అవార్డుకి ఢిల్లీకి అప్లికేషన్ పంపినప్పుడు నిర్మాత అఫిడవిట్ మిస్సయిందిట. ఇక అప్లికేషన్ అడ్మిట్ అవదు. అందుకని గుండెపోటుతో హాస్పిటల్లో చేరిన తమ హీరో గార్ని నమ్మిస్తూ అవార్డు వచ్చినట్టు డ్రామా సృష్టిస్తారు. చాలా ఇల్లాజికల్ డ్రామా. ఇంతకంటే ఫీల్ బ్యాడ్ డ్రామా వుండదు.

        లైటర్ వీన్ ఫీల్ గుడ్ తెలుగు ప్రేమ సినిమాలు మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేతో వుండేవి. కాసేపు బిగినింగ్, చివర్లో ఎండ్ విభాగంలో కథా దాని ముగింపూ తప్ప, మిడిల్ వుండేది కాదు. ఇదే ఇక్కడ చూడొచ్చు. గుండె పోటు ఎపిసోడ్ తో ఎండ్ విభాగం వచ్చేస్తుంది. ఇందులో అర్ధం పర్ధం లేని ట్విస్టులు. ఈ ట్విస్టులతో ప్రేక్షకుల్ని ఫూల్స్ చేస్తూ పోతాడు. విషయం తేల్చడానికి ఒకటే నస పెడతాడు ఎండ్ లో కూడా. ఈ ఫీల్ గుడ్ నసతో కథ దాని కథా లక్షణాలు కోల్పోయి దిక్కులేనిదై పోయింది.

సికిందర్  

20, మే 2021, గురువారం

1039 : రివ్యూ


 దర్శకత్వం : రమేష్ రాపర్తి 
తారాగణం : అనసూయా భరద్వాజ్, విరాజ్ అశ్విన్, మౌనికా రెడ్డి, వివా హర్ష, అనీష్ కురువిల్లా, అన్నపూర్ణమ్మ తదితరులు
కథ : రమేష్ రాపర్తి, నియీ అఖిన్ మోలయాన్  ఛాయాగ్రహణం : ఆర్ సురేష్
బ్యానర్ : జస్ట్ ఆర్డినరీ ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు :  మాగుంట శరత్ చంద్రా రెడ్డి, బొమ్మిరెడ్డి తారకా నాథ్
విడుదల : ఆహా, మే  7, 2021

***

        కోవిడ్ -2 తో తిరిగి థియేటర్ల ప్రదర్శనలు నిలిచి పోవడంతో సినిమాలకి ఓటీటీల అవసరం తప్పడం లేదు. ఓటీటీ సీను ఇప్పుడు మారింది. బడ్జెట్ కూడా చేతికి రానంతగా రైట్స్ నిర్ణయిస్తున్నారని వినికిడి. నాణ్యత లేని సినిమాలు తీసి ఓటీటీలతో లాభపడ్డమే దీనికి కారణం. ఒకప్పుడు శాటిలైట్ సినిమాలతో ఇదే చేసి బహిష్కృతులయ్యారు. గుణాత్మకంగా మేకర్లలో మార్పు వస్తేగానీ మంచి రోజులు వచ్చేలా లేవు.

      ఈ క్రమంలో కోవిడ్ రెండో విడత తాకిడిలో మొదటి ఓటీటీ విడుదలగా థాంక్యూ బ్రదర్ ప్రేక్షకుల ముందు కొచ్చింది. అయితే గత సంవత్సరం ఇదే పరిస్థితుల్లో లేనంతగా భయం నీడన ఇప్పుడు మనుషులు జీవిస్తున్నారు. రెండో విడత తీవ్రత అలా వుంది. వాతావరణంలో ధైర్యాన్ని నింపే వైబ్రేషన్స్ లేవు. ధైర్యాన్ని నింపే, లేదా భయాన్ని మరిపించే వైబ్రేషన్స్ తో కూడిన కంటెంట్ నివ్వడం ఇప్పుడు సినిమాల కవసరం. థాంక్యూ బ్రదర్ ఈ పని చేయగల్గీ చేయలేకపోయింది.  దీన్ని నైజీరియన్ మూవీ ఎలివేటర్ బేబీ (2019) కి రీమేక్ గా తీసినట్టు తెలుస్తోంది. రమేష్ రాపర్తి కొత్త దర్శకుడుగా పరిచయమయ్యాడు. అనసూయా భరద్వాజ్ ప్రధాన పాత్ర పోషించింది. విరాజ్ అశ్విన్ ఇంకో ప్రధాన పాత్ర పోషించాడు. ఇతను గత సంవత్సరం మనసా నమః అనే షార్ట్ ఫిలిం లో నటించి పరిచయమయ్యాడు. 

        కథలో వీళ్ళిద్దరూ అపరిచితులు. ప్రియ (అనసూయ) గర్భవతి. భర్త చనిపోయాడు. అతను పని చేసిన కంపెనీ నుంచి చెక్కు తీసుకోవడానికి ఓ అపార్ట్ మెంటు కొస్తుంది. అభి (విరాజ్) బాగా డబ్బున్న ఆవారా బ్యాచి. అదే అపార్ట్ మెంటుకి ఒక పని మీద వస్తాడు. ఇద్దరూ పని ముగించుకుని వెళ్తూ లిఫ్ట్ లోకి ప్రవేశిస్తారు. ఆ లిఫ్ట్ మధ్యలో పాడయి ఆగిపోతుంది. ఆమెకి నొప్పులు ప్రారంభమై ఏం చేయాలో అర్ధంగాదు. ఇప్పుడేమిటన్నది మిగతా కథ.

***

    ఈ నైజీరియన్ కథని తెలుగుకి మార్చినప్పుడు అలవాటు చొప్పున అదే మూసకి పాల్పడ్డారు. పాడిందే పాడరా అన్నట్టు... ఔటాఫ్ బాక్స్ ఐడియాలకి కూడా మూస టెంప్లెట్లు వాడేస్తే ఏం చేస్తాం. కాలం, కాలంతో బాటు ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తున్న మార్పులూ గమనించే ఆసక్తి లేక, ఇలా పాత నమూనాలే చూపిస్తూ కూర్చోవడం.


        ఇద్దరు అపరిచితుల్ని లిఫ్ట్ లో ఇరికించిన ఈ కథకి ఫ్లాష్ బ్యాక్స్ తో పూర్వరంగం ఏర్పాటు చేశారు. ఫస్టాఫ్ మొత్తం ఈ మూస ఫ్లాష్ బ్యాక్స్ సహన పరీక్ష పెడతాయి. పైగా ఇది హీరో కథయినట్టు, కొత్త హీరోకి అనసూయకి మించి 40 నిమిషాల ఫ్లాష్ బ్యాక్! ఈ ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి చనిపోయిన హీరో, రెండో పెళ్ళి చేసుకున్న తల్లి మాట వినక, ఫ్రెండ్స్ తో తాగుడు పార్టీలతో ఆవారాగా గడుపుతాడు. బాగా డబ్బున్న వాడే అయినప్పటికీ ఏ పనీ చేయకపోతే గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తుంది. తల్లి వొత్తిడి కూడా పెరిగేసరికి, ఇక ఏదైనా పని చూసుకోవాలని ఒక ప్రపోజల్ తో తండ్రి పాత మిత్రుడ్ని కలవడానికి అపార్ట్ మెంట్ కెళ్తాడు. ఎన్నోసినిమాల్లో చూసి చూసి వున్న ఆవారా హీరో ఫస్టాఫే ఇక్కడా దర్శనమిస్తుంది. ఇంతకన్నా విషయం లేదు ఫస్టాఫ్ లో. ఫస్టాఫ్ స్క్రిప్టంతా బడ్జెట్ వృధా అని తెలిసిపోతోంది.

        మరో వైపు కాసేపే అనసూయ ఫ్లాష్ బ్యాక్. ఈమెది దిగువ మధ్య తరగతి కుటుంబం. భర్త వుంటాడు. తల్లి వుంటుంది. కంపెనీలో పని చేస్తున్న భర్త చనిపోతాడు. తను గర్భవతి. భర్త తాలూకు డబ్బులు తీసుకోవడానికి హీరో వెళ్ళిన అపార్ట్ మెంట్ కే  వెళ్తుంది. ఇద్దరూ అక్కడ లిఫ్ట్ ఆగిపోయి అందులో ఇరుక్కుంటారు.

***

        ఈ కథని నాన్ లీనియర్ గా ఫ్లాష్ బ్యాక్స్ చేసి చెప్పడంతోనే కొంపమునిగింది. దర్శకుడు ఓపెనింగ్ బ్యాంగ్ గా బావుంటుందనుకుని ఫీలైనట్టు, లిఫ్ట్ లో ఇరుక్కునే సీను ముందే చూపించేస్తూ సినిమా ప్రారంభించాడు. కథాక్రమంలో డెవలప్ అయి దాని సమయంలో అది రావాల్సిన ఈ ప్లాట్ పాయింట్ వన్ సీనుతో ఓపెనింగ్ వేయడంతో, ఇప్పుడే కథేమిటో తెలిసిపోయింది! ఇలా ప్రారంభంలోనే  లిఫ్ట్ సీను వేసి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్స్ చూపించడంతో ముందేం జరుగుతుందో కథ తెలిసిపోవడమేగాక, ఈ సీను తర్వాత ఫ్లాష్ బ్యాక్స్ వల్ల  ఏ సస్పెన్సూ కూడా లేకుండా పోయింది. ఇంటర్వెల్లో వేయాల్సిన లిఫ్ట్ సీను అనాలోచింతంగా సినిమా ఓపెనింగ్ లో వేసేస్తూ ఘోరమైన పొరపాటు చేసి - సినిమా మొత్తాన్నీ నీరు గార్చేశాడు.

        ఇలా కాకుండా, ఎలివేటర్ బేబీ లో లీనియర్ గానే కథ చెప్పాడు. దీనివల్ల ముందేం జరుగుతుందో తెలీదు. డిజాస్టర్ జానర్ మూవీ కథనం ఇలాగే వుంటుంది. లీనియర్ గా హీరో కథ, హీరోయిన్ కథా చూపించుకుంటూ వెళ్ళి, లిఫ్ట్ లో ఇరికించి అప్పుడు ఇంటర్వెల్  బ్యాంగ్ ఇచ్చాడు. దీని నిడివి గంటన్నర కూడా లేదు కాబట్టి, తెలుగులో చూపించిన హీరో హీరోయిన్ల పూర్వరంగమే ఇందులో ఎక్కువ నస పెట్టకుండా చప్పున ముగిసిపోతుంది.

***

   ఇక లిఫ్ట్ లో ఇరుక్కున్నాక సెకండాఫ్ మరీ బలహీనంగా వుంది. ఆమె నొప్పుల బాధ, అతడి మొండి తనం. ఈ కథకి అనసూయా భరద్వాజ్ ప్రధాన పాత్ర కాదని ఎందుకనో నిర్ణయించారు. బాక్సాఫీసు అప్పీల్ గురించి ఆలోచించకుండా కొత్త వాడైన విరాజ్ అశ్వినే కథానాయకుడనుకున్నారు. అందుకే ఫస్టాఫ్ లో 40 నిమిషాల పాటూ అతడితో వృధా ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ లో ఆవారాగా, మానవత్వం లేకుండా వున్న అతను మారడం గురించిన కథ అనుకున్నారు కాబట్టి, అతనే కథానాయకుడయ్యాడు. ఒక మొండివాడు, ఆవారా మంచివాడుగా ఎలా మారాడన్నది ఈ కథతో చెప్పాలనుకున్న అతి పురాతన మూస విషయం. ఇది ఈ రోజుల్లో వర్కౌటయ్యే ఐడియాయేనా? అతను మారితే ఎవరిక్కావాలి, మారకపోతే ఎవరిక్కావాలి. సెల్ ఫోన్ చేతిలో వున్న నేటి యూత్ ప్రోయాక్టివ్ కథ కావాలి గాని. ఇలా ఇరుక్కున్న పరిస్థితిలో మాతృత్వం ప్రమాదంలో వుందని హీరో రెస్పాండ్ అయి ఒక్క మెసేజ్ కొడితే, పోలోమని వందమంది యూత్ మాతృత్వం కోసం వచ్చేసి లిఫ్ట్ లోంచి కాపాడతారు. ఇంత స్పష్టంగా అపాయంలో మాతృత్వం కనపడుతోంటే, ఇంకెవరో హీరో మారడం గురించి కథేమిటి బాక్సాఫీసు వ్యతిరేకంగా? హీరో మారితే ఎవరిక్కావాలి, మారకపోతే ఎవరిక్కావాలి. అతగాడి సొంత జీవితం ఎవరికవసరం.

        గత సంవత్సరం లాక్ డౌన్ లో ఢిల్లీ శివారులో హోటల్ నడవక ముసలాయన ఒకాయన వాపోతూంటే, వీడియో తీసి పోస్ట్ చేశాడొక యూత్. అంతే, అది వైరల్ అయి నిమిషాల్లో వందలాది  యూత్ ఎక్కడెక్కడ్నించో వచ్చేసి, కోలాహలంగా హోటల్లో ఉన్నదంతా తినేసి, గల్లా పెట్టె పట్టనంత డబ్బులు వేసి వెళ్ళారు. యూత్ నెట్వర్క్ ని తక్కువ అంచనా వేయకూడదు. యూత్ తో ఇన్స్పైర్ అయి కథ చేయాలి. సాయం చేయడానికి సెల్ ఫోన్ యూత్ ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటున్న కాలమిది. ఇందుకు దాహరణలు కోకొల్లలు.

        ఈ లిఫ్ట్ కథ కి లాక్ డౌన్ కాలాన్ని నేపథ్యంగా పెట్టారు. అందువల్ల ఆపరేటర్, మెకానిక్ ఎవరూ అందుబాటులో లేనట్టు చూపించారు. ఒకరంటే ఒకరికి పడని ఆ రెండు పాత్రల మధ్య అనవసర ఘర్షణ, అనవసర క్యారక్టర్ ఎనాలిసిస్ లు చూపించారు. ఇదికాదు కావాల్సింది. కావాల్సింది భయాన్ని పోగొట్టే డిజాస్టర్ మేనేజ్ మెంట్. హీరో కొన్ని కాల్స్ చేసి వుంటే, నొప్పులు పడుతున్న ఆమె కోసం  అంబులెన్స్ వస్తుంది, డాక్టర్లు వస్తారు, వైద్య సిబ్బంది, పోలీసులూ వస్తారు, యూత్ సరే, వాళ్ళ హీరోయిజం ఎలాగూ వుంటుంది. ఇలా లాక్ డౌన్లో అందరూ మనతో వుంటారని ధైర్యం చెప్పే నేటి ఆశాజనక కథ కావాలిగానీ, ఎవరో హీరో మంచివాడుగా మారి చివరికి చిటికెడు సాయం చేసిపోయే కాలం చెల్లిన కథ ఎవరిక్కావాలి.

***

        ఎలివేటర్ బేబీ' లో పాలనా వ్యవస్థ మీద విమర్శలు గుప్పించడం వుంటుంది. లిఫ్ట్ కథకి వీటితో సంబంధమేమిటాని సినిమా మీద ఒక నైజేరియన్ రివ్యూ చదివితే విషయం అర్ధమైంది. నైజేరియూలో పాలనా వ్యవస్థ ఎలా వుంటుందో ఆ రివ్యూకర్త రాసుకొచ్చాడు. అక్కడ ఏ శాఖా ఏదీ పట్టించుకోదు. రోడ్లు, కరెంటు, నీరు వంటి మౌలిక సదుపాయాలు  అడ్డగోలుగా వుంటాయి. ఏ శాఖ వాడూ దేన్నీపట్టించుకోడు. రిపేరుకు రమ్మంటే ఏడాది కొస్తాడు. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కడో టిఫిను తింటూ వుంటాడు. కరెంటు పోతే, పోతే పోయిందను కుంటాడు. ప్రజలకి నానా ఇక్కట్లు, టెన్షన్. ఇలాటి పాలనా యంత్రాంగం వల్లే కథలో లిఫ్ట్ లో ఇరుక్కుని నానా పాట్లు పడ్డారన్న మాట. నైజేరియన్ లిఫ్ట్ కథకి ఇదీ నేపథ్యం. సహజ నేపథ్యం. అందుకని లిఫ్ట్ లో ఇందుకు తగ్గట్టు టెన్షన్ తో కూడిన వ్యవస్థ బాధిత డ్రామా. నైజేరియన్ దర్శకులు అక్కడి పాలనా యంత్రాంగం ప్రస్తావన లేకుండా సినిమాలు తీయలేరని రివ్యూలో రాసుకొచ్చాడు.

         తెలుగు రీమేక్ కథకి ఈ నేపథ్యం వుండే అవకాశం లేదు. మన పాలనా యంత్రాంగం లంచాలతో దివ్యంగానే నడుస్తూ వుంటుంది. దీనికి లాక్ డౌన్ నేపథ్యంతో చెక్  పెట్టి, బైటి సాయాన్ని మూసేసి కథ నడిపారు. ఇది బెడిసికొట్టింది. సెల్ ఫోన్ చేతిలో వున్న హీరో అలా వూరికే కూర్చోడు. లాక్ డౌన్ అంటే పరస్పరం సహించుకోవడమని ఉజ్వలమైన కథ నడిపించగలడు యూత్ నెట్వర్క్ తో, పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ.  

***

      ఈ కథ డిజాస్టర్ జానర్ మూవీ కథగా వుండాల్సింది. టవరింగ్ ఇన్ఫెర్నో, ది డే ఆఫ్టర్ టుమారో, ఇండిపెండెన్స్ డే, ట్విస్టర్, కంటేజియన్... ఇలా ఏ డిజాస్టర్ మూవీ తీసుకున్నా ఒకే టెంప్లెట్లో వుంటాయి. ఈ టెంప్లెట్ ని మార్చి ఇంకో విధంగా చేయలేరు. ముందుగా పాత్రల ప్రశాంత జీవితాలు, వాటి కలలు, ప్రమాద సూచనలు, ప్రమాదం, కలల భగ్నం, ప్రాణాల కోసం ప్రమాదంతో పోరాటం, విజయం, తిరిగి ప్రశాంతత... ఈ జానర్ బీట్స్ తోనే వుంటాయి.


        అనసూయ పాత్ర కథగా చేసి ఆమె జీవితం చూపించుకొస్తూ, గర్భంలో వున్న బిడ్డ కోసం కోవిడ్ బారిన పడకుండా ఆమె జాగ్రత్తలు చూపిస్తూ, లాక్ డౌన్ టైమ్ లో తప్పనిసరై హాస్పిటల్ కెళ్ళి లిఫ్ట్ లో ఇరుక్కుని బయటపడే ప్రమాద సూచనలు చూపిస్తూ, ఇంకో చోట హీరోతో భౌతిక దూరం గురించి గొడవపడడం చూపిస్తూ, హీరో ఎవరో చెప్పకుండా ఫ్రెండ్స్ తో కాలక్షేపం చూపిస్తూ, అపార్ట్ మెంట్లో ఆమెనీ హీరోనీ లిఫ్ట్ లో ఇరికించి, ఇప్పుడేమిటి?’ అన్న డ్రమెటిక్ క్వశ్చన్ తో పైన చెప్పుకున్న డిజాస్టర్ మేనేజిమెంట్ రియలిస్టిక్ కథగా  నడపకుండా, ఉపయోగం లేని మూస కథ చేశారు. హీరో ఎవరనేది, అతడి సమస్యలేమిటన్నది చివర్లో చెప్పవచ్చు. దేర్ విల్ బి బ్లడ్ హాలీవుడ్ మూవీలో హీరో ఎవరనేది ఏ తగిన సమయంలో (టైమింగ్), దేంతో ముడిపెట్టి చెబితే కథకి కిక్ వస్తుందో, ఆ తగిన సమయం సెకండాఫ్ లో వరకూ చెప్పలేదు. దీంతో సెకండాఫ్ లో ఇంకో కొత్త కథా లోకం ఆవిష్కృతమైంది. లక్షల మంది కోసం తీసే సినిమా కథ అనేది బహుళ కోణాల్లో ఆలోచించాల్సిన డైనమిక్స్ తో కూడిన కాసుల రూపం.

సికిందర్