రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, డిసెంబర్ 2021, సోమవారం

1107 : సంక్షిప్త స్క్రీన్ ప్లే సంగతులు

       పుష్ప -1 లో అల్లు అర్జున్ మైనర్ విలన్ సునీల్ ఠారెత్తేలా, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివాఫైర్! అని రెండు సార్లు ధనా ధన్ మని నాటు రైఫిల్ని ఫైర్ చేసిసి గట్టి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చేస్తాడు. బెస్ట్ డైలాగ్ క్యారక్టర్ పరంగా. బెస్ట్ డ్రామా క్యారెక్టర్ గ్రోత్ పరంగా. బెస్ట్ కథనం క్యారక్టర్ ఆర్క్ పరంగా. బెస్ట్ బ్యాంగ్ క్యారక్టర్ లో దట్టించిన ఫైర్ పరంగా. ఫ్లవర్లో ఫైర్. ఫైర్ ఇన్ ది బ్లడ్. బర్నింగ్ ఫైర్. వైల్డ్ ఫైర్. మ్యాడ్ ఫైర్. ఇంటిపేరు లేని అవమాన భారంతో పుష్పరాజ్ ది యూత్ ఆన్ రైజింగ్ ఫైర్ ఎట్సెట్రా ఎట్సెట్రా.

        తే క్యారక్టర్లో ఇంత ఫైర్ వుండి కూడా కథలో ఫైర్ మిస్సయ్యిందని అసంతృప్త టాక్ చక్కర్లు కొట్టింది. క్యారక్టర్లో వున్న ఫైర్ ఏమిటి? ఎక్కడ్నుంచి పుట్టింది? క్యారక్టర్ జర్నీచూస్తే మూడు  పాయలుగా వుంది. ఒక పాయ ఇంటి పేరు పెట్టుకోనివ్వని అన్యాయాన్ని ఫీలయ్యే పర్సనల్ పాయ; ఇంకో పాయ హీరోయిన్ తో ప్రేమతో రోమాంటిక్ పాయ; మరింకో పాయ ఎర్ర చందనం స్మగ్లింగ్ తో ప్రొఫెషనల్ పాయ. ఈ త్రీవే క్యారక్టర్ జర్నీలో ప్రధాన జర్నీ అయిన ప్రొఫెషనల్ పాయ, కూలీవాడు అయినప్పటికీ బిజినెస్ మైండ్ తో ఒక గ్రోత్ ని చూపిస్తూ, పవర్ఫుల్ గా వుంది.

        అయితే క్యారక్టర్లో ఫైర్ పుట్టడానికీ, దాంతో ఇలా ప్రొఫెషనల్ గోల్ తీసుకోవడానికీ  కారణమైన ఇంటి పేరు సమస్య సమస్యేనా అంటే అలా అన్పించదు. తన తండ్రి మొదటి భార్యకి పుట్టిన వాడు-  అంటే పుష్పకి అన్న అయిన వాడు - ఇంటి పేరు పెట్టుకోకూడదని బెదిరిస్తూంటే, తగ్గేదేలే ...అని ఇంటిపేరే కాదు, కులం పేరు కూడా గ్రాండ్ గా పెట్టుకు తిరగొచ్చు పుష్ప. ఎవరూ అడ్డుకోవడానికి లేదు. పైగా అన్న కూడా వూళ్ళో పెద్ద మోతుబరేం కాదు పుష్ప లొంగి వుండడానికి. అతను ఓ మధ్యతరగతి జీవి మాత్రమే.       

కనుక ఇదో సమస్యే అన్పించదు కుంగి పోవడానికీ, యాంగ్రీ యంగ్ మాన్ అవడానికీ. ఒక వేళ ఎవరికి పుట్టాడో తెలియక పోతే, ఆ సూటిపోటి మాటలకి కుంగి పోవచ్చు, యాంగ్రీ యంగ్ మాన్ అవతారం దాల్చ వచ్చు. కసితో రిచ్ గా ఎదగాలని అనుకున్న గోల్ కూడా తీసుకోవచ్చు. ఎవరికి పుట్టాడో తెలిసింతర్వాత త్రిశూల్ లో అమితాబ్ బచ్చన్ లాగా, మొదటా తల్లికా భార్య స్థానం కల్పించడానికి భూమ్యాకాశాలు ఏకం చేయాల్సిందే.

        కాబట్టి ఇంటి పేరు గురించి ఫైర్ పుట్టడం ఇంటలెక్ట్ గా పాత్ర కన్ఫ్యూజన్నేతెలుపు తోంది. ఇప్పుడొచ్చే కమర్షియల్ సినిమాల్లో పాత్ర చిత్రణల్ని లోతుగా పరికిస్తే ఏ పాత్రా నిలబడదు. కనుక రివ్యూలో కన్విన్స్ చేయని మిగతా రెండు పాయల్ని వదిలేసి, ప్రొఫెషనల్ పాయనే పైపైన తీసుకుని పవర్ఫుల్ క్యారక్టర్ అనాల్సి వచ్చింది - కూలీ అయినప్పటికీ తనకున్న సమస్ఫూర్తితో కూడిన బిజినెస్ మైండ్ సెట్ దృష్ట్యా.

        అయితే పాత్ర చిత్రణ కాదు పుష్ప లో ప్రధాన సమస్య. అది సెకండరీ. ప్రైమరీ ఏమిటంటే, అసలు సినిమాని రెండు భాగాలు చేసినప్పుడు మొదటి భాగం ఇలా తీయడమే. కథలో మిస్సింగ్ ఫైర్ మిస్టరీ అంతా ఇక్కడే వుంది...

రెండు భాగాల రౌండప్

ఏమిటా మిస్టరీ? కథలో ఫైర్ వుండాలంటే అసలంటూ కథ వుండాలి కదా? మొదటి భాగంలో కథ వుందా? లేనప్పుడు ఫైర్ వుండే అవకాశమే లేదు. పుష్ప లాగే రెండు భాగాల సినిమాలున్నాయి. వాటిలో మొదటి భాగంలో కథ తప్పకుండా వుంటుంది. రెండో భాగంలో ఎలాగూ వుంటుంది. అవి ఫ్లాప్ కాలేదు. ఎందుకంటే మొదటి భాగంలో కూడా కథ వుంది కాబట్టి. అసలు రెండు భాగాలుగా ఎందుకు, ఒకే బారెడు సినిమాగా విడుదల చేద్దామని చేసిన ప్రయోగాలూ వున్నాయి. మన దేశం లో అలాటివి రెండే వచ్చాయి. రెండూ హిందీలో  షో మాన్ రాజ్ కపూర్ నుంచే వచ్చాయి. సంగం (1964), మేరా నామ్ జోకర్ (1970). సంగం నిడివి మూడు గంటల 58 నిమిషాలు. దీనికి రెండు ఇంటర్వెల్స్ ఇచ్చారు. మేరా నామ్ జోకర్ నిడివి నాలుగు గంటల 14 నిమిషాలు. దీనికీ రెండు ఇంటర్వెల్స్ ఇచ్చారు. రెండూ మ్యూజికల్ హిట్సే, క్లాసిక్స్ కూడా. అన్నేసి గంటలు కూర్చుని చూశారు అప్పటి ప్రేక్షకులు రెండు ఇంటర్వెల్స్ ఎంజాయ్ చేస్తూ.

        తెలుగులోనే దానవీర శూర కర్ణ నిడివి చూసినా మూడు గంటల 46 నిమిషాలు! ఎన్టీఆర్ దీన్ని రెండు భాగాలు చేసి విడుదల చేయలేదు. తమిళంలో 2005 లోనే వచ్చిన తవమాయి తవమిరిందు మూడు గంటల 40 నిమిషాలుంది. హిందీలో లగాన్ తెలిసిందే- మూడు గంటల 44 నిమిషాలు, ఒక రొటీన్ మసాలా  ఖతర్నాక్ కూడా మూడు గంటల 43 నిమిషాలకి గానీ తెమలలేదు. మొహబ్బతే మూడు గంటల 36 నిమిషాలు, సలామే ఇష్క్ మూడు గంటల 35 నిమిషాలు, జోధా అక్బర్ మూడు గంటల 34 నిమిషాలూ చూడాల్సిందేననీ ఆర్డరేశాయి. ఇవన్నీ ఈ రెండు దశాబ్దాల్లో వచ్చిన కొత్త సినిమాలే.

        పుష్ప ని కూడా ఒకే పెద్ద కథగా చేసి రెండు ఇంటర్వెల్స్ తోనో లేదా, ఒకే పూర్తి నిడివి తోనో విడుదల చేయడం ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. అయితే రెండు భాగాలుగా చేసినప్పుడు హాలీవుడ్ లో ఎలా చేశారో తెలుసుకోవాలి. సీక్వెల్స్ వేరు. వాటిలో దేనికా పూర్తి కథ వుంటుంది. పెద్ద కథ వేరు. పెద్ద కథ వుంటే దాన్ని సగానికి విరిచి రెండుగా విడుదల చేయాల్సిందే. పెద్ద నవలలతో తీసినప్పుడు రెండుగానే విడగొట్టారు హాలీవుడ్ లో. హారీ పోటర్ గానీ, గాన్ విత్ ది విండ్ గానీ రెండు భాగాలుగానే విడుదల చేశారు. మరి  నవలలు కాకుండా తీసినప్పుడు ఏం చేశారు?

        దీనికి సింపుల్ గా అర్ధమయ్యేందుకు క్వెంటిన్ టరాంటినో తీసిన కిల్ బిల్ రెండు భాగాలు (2003, 2004) తీసుకుందాం. దీని ఎడిటింగ్ లో నిడివి చూసి రెండుగా విడగొట్ట మన్నాడు నిర్మాత హార్వే వీన్ స్టీన్ (ఇతను 2018 మీటూ వివాదాల్లో శిక్షపడి జైలు పాలయ్యాడు పాపం). అలాగే టరాంటినో కిల్ బిల్ ని రెండు భాగాలుగా విడగొట్టాడు. మొదటి భాగం గంటా 51 నిమిషాలు, రెండో భాగం రెండు గంటల 17 నిమిషాలు (రెండు భాగాలు కలిపి నిడివి నాలుగు గంటల 8 నిమిషాలు).

        మొదటి భాగం విడగొట్టినప్పుడు అందులో కథ వుంది. కథంటే స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగం. అంటే సెకండ్ యాక్ట్. అంటే ప్రధాన పాత్రకి ప్రత్యర్ధి పాత్రతో సంఘర్షణ మొదలై పోవడమన్న మాట. అంటే కథ మొదలై పోవడమన్న మాట.

        ఇది హీరోయిన్ ఉమా థర్మాన్ ప్రతీకార కథ. ఒక కిల్లింగ్ స్క్వాడ్ లో పని చేస్తున్న ఈమె ఆ స్క్వాడ్ బాస్ బిల్ అనే వాడి చేత గర్భం ధరిస్తుంది. దాంతో బిడ్డ కోసం తానీ వృత్తి మానేయా లనుకుంటుంది. ఇది చెప్తే బిల్  చంపేస్తాడు గనుక పారిపోయి వేరే నగరంలో ఇంకొకర్ని ప్రేమించి పెళ్ళి చేసుకోబోతూంటుంది. అప్పుడు బిల్ గ్యాంగ్ తో సహా ఊడిపడి ఆ పెళ్ళి  వేడుకలో మారణ కాండ సృష్టిస్తాడు.  చావుబతుకుల్లో వున్న ఉమా ని వదిలేసి వెళ్ళిపోతాడు. నాల్గేళ్ళూ  కోమాలో వున్న ఉమా కోలుకున్నాక- గర్భంలో వున్న తన బిడ్డ ఏమయ్యిందో అర్ధంగాక తల్లడిల్లుతుంది. పెళ్ళి వేడుకలో పెళ్ళి  కొడుకు సహా తన వాళ్ళందర్నీ చంపేసిన బిల్ మీద - అతడి గ్యాంగ్ మీదా పగ పెంచుకుని ఒకొక్కర్నీ చంపడం మొదలెడుతుంది.

        బిల్ ని చేరుకోవాలంటే అనుచరుల్ని అడ్డు తొలగించుకుంటూ పోవాలి. అలా చేసుకుంటూ పోతూ, బిల్ సమాచారం గురించి సోఫీ అనే అనుచరురాల్ని హింసించి  వెళ్ళి పోతుంది. అప్పుడు  గాయపడ్డ సోఫీని బాస్ బిల్ వచ్చి అడుగుతాడు - దాని కూతురు బతికుందని దానికి తెలుసా?- అని. ఈ క్లిఫ్ హేంగర్ సీనుతో, లేదా ట్రిగ్గర్ పాయింటుతో మొదటి భాగం ఎండ్ అవుతుంది.

        కిల్ బిల్ హీరోయిన్ గా నటించిన ఉమా థర్మాన్ ఉత్తమ నటిగా ఆస్కార్ కి నామినేట్ అయింది. అంతే గాకుండా ఎంపైర్ మ్యాగజైన్ 100 గొప్ప సినిమా పాత్రలు జాబితాలో ఒకటిగా ఆమె నటించిన ఈ  బ్రైడ్ పాత్రని నమోదు చేసింది. ఇది మామూలు విషయం కాదు- ఒక యాక్షన్ మూవీ పాత్రకి టరాంటినో ఈ స్థాయి పాత్ర చిత్రణ చేయడం.

        విషయానికొస్తే, మొదటి భాగం ముగింపు వూహించని మలుపుతో వుంది. కథా ప్రారంభంలో హీరోయిన్ కోమాలోకి జారుకున్నప్పుడు అండ విచ్ఛిత్తి జరిగి వుంటుందని నమ్మించిన పాయింటు కాస్తా తిరగబెట్టి - కూతురు పుట్టి విలన్ అయిన తండ్రి దగ్గరే పెరుగుతున్నట్టు వెల్లడి కావడం రెండో భాగానికి అంతులేని ఆసక్తిని దోచి పెట్టింది. మొదటి భాగం ముగింపుగా గుండెల్ని కెలికే హ్యూమన్ ఇంట్రెస్ట్ క్రియేటయ్యింది. హ్యూమన్ ఇంటరెస్ట్ ని మించిన యూనివర్సల్ ఎమోషన్ లేదు. ఈ ముగింపు వెంటాడుతూనే వుంటుంది రెండో భాగం వచ్చేవరకూ. మనం అప్పట్లో సికిందరాబాద్ సంగీత్ థియేటర్లో చూసినప్పుడు అక్కడే బయట కూర్చుండి పోయాం - టరాంటినో విసిరిన తురుపు ముక్కకి తెప్పరిల్ల లేక.

గొయ్యి కాదు, గో ఎహెడ్ మాత్రమే
ఇప్పుడు హీరోయిన్ పాత్ర పట్ల ఎంత సానుభూతి ఏర్పడింది....కూతురు పుట్టి బతికే వుందన్న విషయం ఆమెకి తెలియదు! ఆ కూతురు తను చంపబోయే తండ్రి దగ్గరే వుంది. ఇక రేపు తండ్రి ఆడబోయే గేమ్ ఏమిటి? ఇలా రెండో భాగంలో రంగానికి - రణానికి ఎంత క్యూరియాసిటీ క్రియేటయ్యింది...ఇలా కథలో హిడెన్ ట్రూత్ ని బయటికి లాగి రెండు భాగాలుగా విభజించాడు టరాంటినో. కూతురు పుట్టడమే గాక బతికుందనేది కథలో హిడెన్ ట్రూత్. గొప్ప కథల్లో హిడెన్ ట్రూత్ మహిమ గురించి స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ ఓ చాప్టరే రాశాడు. టరాంటినో మొదటి భాగం ముగింపులో క్లిఫ్ హేంగర్ మూమెంట్ ని, లేదా ట్రిగ్గర్ పాయింటునెలా సృష్టించాడు? హిడెన్ ట్రూత్ నుపయోగించుకునే!

        ఇక రెండో భాగం కథేమిటో దాని జోలికి పోనవసరం లేదు. అందులో ఎలాగూ మొదటి భాగంలో హిడెన్ ట్రూత్ తో ఉత్సుకత రేపుతూ ఆపిన కథే వుంటుంది. అసలు మొదటి భాగంలో వున్నది  కథెలా అయిందన్నదే పుష్ప గురించి చెప్పుకోవడాని కవసరం. కిల్ బిల్ మొదటి భాగం ప్రారంభంలో పాత్రల పరిచయాలతో, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనతో, సమస్య ఏర్పాటుతో - ఈ మూడు ప్లాటింగ్ టూల్స్ తో బిగినింగ్ - అంటే ఫస్ట్ యాక్ట్ లో జరగాల్సిన బిజినెస్ అంతా కూడా వుంది.

        ఇక హీరోయిన్ కోమాలోంచి తేరుకుని బిల్ ని చంపాలని గోల్ ని తీసుకోవడంతో, నాల్గో ప్లాటింగ్ టూల్ నుపయోగించుకుని ప్లాట్ పాయింట్ వన్ కూడా ఏర్పడింది. అంటే ప్రధాన పాత్రయిన హీరోయిన్ కి యాంటీగా, ప్రత్యర్ధి పాత్రయిన బిల్ ఎస్టాబ్లిష్ అయిపోయాడు మొదటే. ఇదంతా ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతంతో ఇక మిడిల్ - అంటే సెకండ్ యాక్ట్ తో బిల్ ని చంపే గోల్ తో కథ ప్రారంభమై పోయింది...కథ అనేది గోల్ తోనే పుట్టి సెకండ్ యాక్ట్ లోనే వుంటుంది. ఫస్ట్ యాక్ట్ లో వుండేది కథ కాదు, ఉపోద్ఘాతం మాత్రమే. కథకి తయారీ మాత్రమే. కథ వుండేది సెకండ్ యాక్ట్ లోనే. థర్డ్ యాక్ట్ అంటే ఎండ్ విభాగంలో వుండేది కూడా కథ కాదు. అది సెకండ్ యాక్ట్ లో వున్న కథకి ముగింపు మాత్రమే. ఈ తేడాలు గుర్తించ గల్గితేనే ఏ యాక్ట్ తాలూకా యాక్ట్ బిజినెస్ ని వేర్వేరుగా రాసి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి న్యాయం చేయగలం.

        ఇక మిడిల్లో హీరోయిన్ బిల్ అనుచరుల్ని చంపే వేట సోఫీ అనే అనుచరురాలి దగ్గరాగుతుంది. సోఫీని హింసించి బిల్ గురించిన సమాచారం తీసుకుని వెళ్ళిపోతుంది హీరోయిన్. అప్పుడు గాయాలతో వున్న సోఫీని బిల్ అడుగుతాడు- దాని కూతురు బతికుందని దానికి తెలుసాని. దీంతో మొదటి భాగం ముగుస్తుంది. అంటే హీరోయిన్ సోఫీని హింసించి బిల్ సమాచారం తీసుకోవడం ప్లాట్ పాయింట్ టూ అనీ, దీంతో సెకండ్ యాక్ట్ అంటే మిడిల్  ముగిసిందనీ, బిల్ వచ్చి కూతురు బతికుందని దానికి తెలుసాని అడగడం థర్డ్ యాక్ట్ అంటే ఎండ్ విభాగమనీ అనిపిస్తుంది. దీంతో మొదటి భాగంలో త్రీ యాక్ట్స్ తో సమగ్ర స్ట్రక్చర్ లో కథ వున్నట్టు తేలిందనీ అనిపిస్తుంది.

        జాగ్రత్తగా ఆలోచించాలి. కన్ఫ్యూజ్ అవకూడదు. ప్లాట్ పాయింట్ టూ అనేది ప్లాట్ పాయింట్ వన్ కి విలోమంగా వుంటుంది. ప్లాట్ పాయింట్ వన్ కీ, ప్లాట్ పాయింట్ టూకీ మధ్య సెకండ్ యాక్ట్ లోనే కథ వుంటుంది. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర గోల్ తీసుకుని కథ ప్రారంభించిన ప్రధాన పాత్ర, ప్లాట్ పాయింట్ టూ దగ్గర కథని గల్లంతు చేసుకుంటూ గొయ్యిలో పడుతుంది. మళ్ళీ కోలుకుని పరిష్కారాన్ని దొరక బుచ్చుకుని థర్డ్ యాక్ట్ లోకి- అంటే ఎండ్ లోకి వెళ్ళిపోతుంది విజయ పతాక నెగరేస్తూ. ఇదీ మొత్తం స్క్రీన్ ప్లేకీ వుండే యూనివర్సల్ స్ట్రక్చర్.

        ఇప్పుడు పైన హీరోయిన్ సోఫీని పట్టుకుని గొయ్యిలో పడలేదు. కుయ్యోమంటోన్న సోఫీ దగ్గర బిల్ సమాచారం లాక్కుంది. అంటే ఇది ప్లాట్ పాయింట్ టూ కాదు. ఇంటర్వెల్ కి దారితీసే పించ్ వన్ సన్నివేశం. అప్పుడు బిల్ వచ్చి - దాని కూతురు బతికుందని దానికి తెలుసా అనడం ఇంటర్వెల్ అయింది.

భాగాల అసమ తూకం - పుష్ప కి శరాఘాతం  

'కిల్ బిల్ రెండు భాగాలు కలిపి మొత్తం ఒకే పెద్ద కథగా వూహించి చూద్దాం. చూసి నప్పుడు రెండు భాగాలూ కలిపిన పూర్తి కథ స్క్రీన్ ప్లేలో ఇంటర్వెల్ దగ్గర మార్క్ చేసి మొదటి భాగాన్ని కట్ చేశాడని అర్ధమవుతుంది. అంటే ఫస్ట్ యాక్ట్ పూర్తి చేసేసి సెకండ్ యాక్ట్ నడి మధ్య కథని ఆపాడన్న మాట. ప్లాట్ పాయింట్ వన్ నుంచీ ఈ ఇంటర్వెల్ వరకూ మిడిల్ వన్ అంటారు. ఇక రెండో భాగంలో ఇంటర్వెల్ తర్వాత నుంచి సెకండ్ యాక్ట్ మిడిల్ టూ, థర్డ్ యాక్ట్ తో ఎండ్ వుంటాయన్న మాట.

        అంటే ఫస్ట్ యాక్ట్ + మిడిల్ వన్ కలిపి మొదటి భాగంగానూ, మిడిల్ టూ + థర్డ్ యాక్ట్ కలిపి రెండో భాగంగానూ సమతూకంతో బ్యాలెన్స్ చేశాడు. ఇందువల్ల మొదటి భాగం చూసినప్పుడు కథే చూసినట్టు వుంటుంది. కథని సస్పెన్సుతో (హిడెన్ ట్రూత్) తో మధ్యలో ఆపినట్టుంటుంది. కథ లేని ఉపోద్ఘాతమే (ఫస్ట్ యాక్ట్) చూసినట్టుండదు.

        పుష్ప లో  జరిగిందిదే... అసమ తూకంతో కథే లేని ఉపోద్ఘాతం. ఫస్ట్ యాక్ట్ మాత్రమే చూపి ముగించడం. ఇందుకే కథ లో ఫైర్ మిస్సయ్యిందన్న టాక్ వ్యాపించింది. చివరి 20 నిమిషాల్లో మాత్రమే పుష్పకి ప్రధాన ప్రత్యర్ధిగా ఫవాద్ ఫాజిల్ దిగుతాడు. అంతవరకూ ఇద్దరు మైనర్ విలన్లతో (అజయ్ ఘోష్, సునీల్) సుదీర్ఘంగా సినిమా నడుస్తూ వుంటుంది. అదంతా ఫస్ట్ యాక్టే. ప్రధాన ప్రత్యర్ధి ఫవాద్ తో పుష్పకి కాన్ఫ్లిక్ట్ ఏర్పడి గోల్ తీసుకునే వరకూ చూపించిందంతా ఫస్ట్ యాక్ట్ ఉపోద్ఘాతమే, కథ కాదు. కథంటే ప్రధాన పాత్ర, ప్రత్యర్ధి పాత్రల మధ్య సిగపట్లే, మరోటి కాదు.

        పుష్ప లో అసలు విలన్ గా చివరి 20 నిమిషాల్లో ఫవాద్ ఎంటరవడం ప్లాట్ పాయింట్ వన్ కాదు, కథా ప్రారంభమూ కాదు. ఇంకా అతడి పాత్ర పరిచయం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలతో కూడిన ఫస్ట్ యాక్ట్ పూర్తి కానే లేదు. పుష్పకి గోల్ ఏర్పాటూ కాలేదు. ఫవాద్ తో ముగింపులో మాత్రమే సంఘర్షణకి బీజం వేసే సమస్యా స్థాపన జరిగి, పుష్పకి గోల్ ఏర్పాటయ్యింది. అంటే ముగింపులో ప్లాట్ పాయింట్ వన్ వచ్చిందన్న మాట. అంటే మొత్తంగా ఫస్ట్ యాక్ట్ మాత్రమే చూపించి మొదటి భాగం ముగింఛారన్న మాట. మిస్సింగ్ ఫైర్ మిస్టరీ అంతా ఇక్కడుందన్న మాట! విషయం సెకండ్ యాక్ట్ లోనే పడకపోతే కథ లేదు, ఫైరూ లేదు. ప్రేక్షకులు చూసిందంతా కథలేని ఫస్ట్ యాక్ట్ మాత్రమే.  

        ముగింపు కూడా ఇద్దరి సవాళ్ళూ ప్రతి సవాళ్ళు అన్నట్టు రొటీన్ గా, ఫ్లాట్ గా బలహీనంగా- హోప్ లెస్ గా వుంది. పుష్పకి బ్రాండింగ్ (ఇంటి పేరు) లేకపోవడాన్ని పెద్ద ఇష్యూ చేస్తూ ఫవాద్ అవమానించడం, దీనికి అహం దెబ్బతిని పోయి పుష్ప గోల్ తీసుకోవడం, ఈ వ్యాసం ప్రారంభంలో చెప్పుకున్న కారణాలతో ఒప్పించేదిగా మాత్రం లేదు. హ్యూమన్ ఇంట్రెస్ట్ వున్న ఏదైనా హిడెన్ ట్రూత్ తో శక్తివంతమైన క్లిఫ్ హేంగర్ మూమెంటూ, ట్రిగ్గర్ పాయింటూ ఏర్పాటు చేసి వుంటే, మొదటి భాగం సర్ప్రైజ్ చేయడమే గాక - రెండో భాగం కోసం ప్రేక్షకులు థియేటర్లోనే ధర్నా చేసేటట్టుండేది! ఇలాగే జరుగుతుంది... 'కిల్ బిల్' మొదటి భాగం ముగింపు చూసి ప్రేక్షకులకి ఎంత పిచ్చెక్కిందంటే, రెండో భాగం చూడాలి- కొత్త కథతో రెండోభాగం వెంటనే చూడాలి- అంటూ  టరాంటినోని ఫోన్ కాల్స్ తో ఉక్కిరి బిక్కిరి చేసేశారు!

        ఐతే పైన చెప్పిన హిడెన్ ట్రూత్ ట్విస్టు పుష్ప ఫస్ట్ యాక్ట్ ముగింపు కివ్వకూడదు.  
కిల్ బిల్ లో లాగా ట్విస్ట్ అనేది కథకి (మిడిల్ విభాగానికి) ఇవ్వాలే గానీ ఉపోద్ఘాతానికి
కాదు.

—సికిందర్ 

   

19, డిసెంబర్ 2021, ఆదివారం

1108 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం : ప్రశాంత్ మురళీ పద్మనాభన్  
తారాగణం : మమతా మోహన్ దాస్
, శిజోయ్ వర్ఘీస్, నేహా సక్సేనా, రాహుల్ దేవ్ శెట్టి, రాహుల్ మాధవ్, తదితరులు
సంగీతం : రాహుల్ రాజ్
, ఛాయాగ్రహణం : ఆంటోనీ జో
బ్యానర్ : లాల్ బాగ్ సెలెబ్రిటీ
, రెడ్ కార్పెట్ ఫిలిమ్స్
నిర్మాత : రాజ్ జహరియా
విడుదల : డిసెంబర్ 18
, 2021 (జీ 5)
***

          జీ5 లో మలయాళ మర్డర్ మిస్టరీ లాల్ బాగ్ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. లాల్ అంటే హిందీలో ఎరుపు రంగు, బాగ్ అంటే తోట. బెంగుళూరుని సిటీ ఆఫ్ గార్డెన్ అని పిలుస్తారు. లాల్ బాగ్ టైటిల్ కి గార్డెన్ సిటీ ఆఫ్ సిన్స్  అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఇది మర్డర్ మిస్టరీ గనుక హత్యతో ఎర్ర బారిన తోట అనే అర్ధంలో లాల్ బాగ్ అని టైటిల్ పెట్టారు. బెంగుళూరు నేపథ్యంలో జరిగే ఈ కొత్త మలయాళ మర్డర్ మిస్టరీ ఎలా వుందో చూద్దాం...

        బెంగుళూరులో టామ్ (శిజోయ్ వర్ఘీస్), సారా (మమతా మోహన్ దాస్) లు తమ కుమార్తె పుట్టిన రోజు వేడుక జరుపుకున్న తెల్లారి టామ్ చనిపోయి కనిపిస్తాడు. సారా కంప్లెయింట్ చేయడంతో పోలీసు అధికారి డిసిపి గణేష్ హెగ్డే (రాహుల్ దేవ్ శెట్టి) విచారణ ప్రారంభిస్తాడు. పుట్టిన రోజుకి  హాజరైన ఏడుగురితో పాటు సారాని ప్రశ్నిస్తూ- ఇది హత్యా, ఆత్మహత్యా లేదా సహజ మరణమా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూంటాడు. పోస్ట్ మార్టం లో విష ప్రయోగం జరిగినట్టు తేలుతుంది. దీంతో సహజ మరణం అనుమానం తొలగిపోయి ఈ విష ప్రయోగం హత్యా, ఆత్మ హత్యా అన్న కోణం లో విచారణ దిశ మారుస్తాడు. విచారణలో విస్మయం కల్గించే నిజాలు బయటపడుతూంటాయి.

        ప్రధాన అనుమానితుల్లో టామ్ స్నేహితులు, సహోద్యోగులతో బాటు భార్య సారా కూడా వుంటుంది. సారా రాసుకున్న డైరీలో టామ్ తో అంత మంచి సంబంధాలు లేవని వెల్లడవుతుంది. డిసిపి హెగ్డే విచారణ కొనసాగిస్తూ పోతూంటే చివరికి దోషి ఎవరో నిర్ధారణ అవుతుంది. ఎవరా దోషి? ఎందుకు, ఎలా టామ్ ని చంపాల్సి వచ్చింది? ఇది చిట్ట చివర్లో మనకు తెలుస్తుంది.

చివరికి తేలే మర్డర్ మిస్టరీ అంటే ఎండ్ సస్పెన్సే అయుంటుంది. ఇది ఎండ్ సస్పెన్స్ కథే. అందువల్ల థ్రిల్ వుండదు. సస్పెన్స్ మొదటి నుంచీ వుంటుంది. ఈ సస్పెన్స్ తేలేవరకూ చివరి వరకూ వేచి వుండాలి. అంతవరకూ ప్రశ్నలు జవాబుల విచారణ థ్రిల్ లేకుండా, యాక్షన్ లేకుండా సాగే డైలాగులతో నడిచే కథనాన్ని ఓపిగ్గా చూస్తూ వుండాలి. దోషి ఎవరో ఇంటర్వెల్ కైనా ఆడియెన్స్ కి రివీల్ చేసేసి, ఆ దోషిని పోలీసులు ఎలా పట్టుకుంటారన్న యాక్షన్ తో, థ్రిల్ తో నడిపి వుంటే ఎండ్ సస్పెన్స్ తో కలిగే విసుగు తొలగిపోయి ఇంట్రెస్టింగ్ గేమ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళం.

        బోలెడు అనుమానితులున్నారు. వాళ్ళని అనుమానించడానికి తగిన బలమైన మోటివ్స్ లేకుండా ఫ్లాట్ గా ఈ కథ వుంటుంది. ఫ్లాట్ గా వున్న కథలో లోపాన్ని కవర్ చేయడాని కన్నట్టు మధ్య మధ్యలో సారా -టామ్ ల జీవితం గురించి ఫ్లాష్ బ్యాక్స్ చూపిస్తూ పోయారు. చిట్ట చివరికి దోషిని రివీల్ చేసినప్పుడు అదైనా షాకింగ్ గా వుండదు. అదీ ఫ్లాట్ గా తేలిపోయింది.

        సారా నర్సు అన్నప్పుడు, డైరీలో భర్తతో సంబంధాలు సరిగా లేవని తెలిసినప్పుడు రెండు సందేహాలు వస్తాయి. భర్తతో సంబంధాలు సరిగా లేవని డైరీలో రాసుకుంటూ ఆ డైరీని భర్తకి కనబడేట్టు టేబుల్ పైనే పెడుతుందా? డిసిపి ఈ ప్రశ్న వేసి వుంటే ప్రధాన నిందితురాలు తనే అవుతుంది. పైగా తను నర్సు. పాయిజన్స్ గురించి తనకే ఎక్కువ తెలిసి వుండాలి. మోటివ్ కోసం డైరీలో రాసుకున్న విషయాలే సాక్ష్యంగా వున్నాయి. అసలు భర్త సెల్ ఫోన్ ని సీజ్ చేసి చెక్ చేసి వుంటే మిస్టరీ ఎప్పుడో వీడిపోయేది.

సారాగా మమతా మోహన్ దాస్ నీటైన నటనని  ప్రదర్శించింది. క్యారక్టర్ డెప్త్ ఆమె పాత్రకే వుంది. ఇతర అనుమానిత పాత్రలకి ఇలాటి కథకి అవసరమైన డెప్త్, షేడ్స్ లేకపోవడంతో వాళ్ళు అనుమానితులుగానే కనిపించరు ఒక్క డిసిపికి తప్ప. భర్త పాత్రలో శిజోయ్ వర్ఘీస్ కూడా నీటుగానే నటించాడు. పాత్రలన్నీ నీటుగానే కన్పిస్తాయి డిసిపిగా రాహుల్ దేవ్ శెట్టితో బాటు. నీటుగా వుండే మనుషులు నగర అలవాట్లతో బయటపడకుండా ఎలాటి పనులు చేస్తారో చెప్పడం దర్శకుడి ఉద్దేశం కావచ్చు. కానీ కథ లోతుల్లోకి వెళ్ళకుండా బలహీన పాత్రచిత్రణలు చేయడంతో మిస్టరీ కూడా నిలబడలేక పోయింది.  

        విజువల్ క్వాలిటీ ప్రత్యేకాకర్షణగా మాత్రం వుంది. బెంగుళూరు సిటీ నైట్ సీన్స్ కళాత్మకంగా వున్నాయి. ఇండోర్స్ లో ఎక్కువ సాగే సీన్స్ కి కూడా కెమెరామాన్ ఆంటోనీ జో స్టయిలిష్ లుక్ తెచ్చాడు. అలాగే రాహుల్ రాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు విజువల్స్ కి చైతన్యాన్ని నింపింది. కానీ  కంటెంట్ ఇలా వుంటే ఏం లాభం. ఇలాటి కాలం చెల్లిన మర్డర్ మిస్టరీ కథలతో ఇంకా సినిమాలు తీయడం దర్శకుల కదో ఆనందం!

—సికిందర్


17, డిసెంబర్ 2021, శుక్రవారం

1106 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : సుకుమార్
తారాగణం : అల్లు అర్జున్
, రశ్మికా మందన్న, అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్, అజయ్ ఘోష్, ధనుంజయ్ తదిరతులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
, ఛాయాగ్రహణం : మిరోస్లా కూబా
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ ఎర్నెని
, వై. రవిశంకర్
విడుదల : డిసెంబర్ 17
, 2021

***

        ల్లు అర్జున్ రెండు భాగాల పుష్ప మొదటి భాగం పుష్ప -ది రైజ్ విడుదలైంది. ఈ నెల నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత విడుదలైన భారీ బడ్జెట్ మాస్ మూవీ ఇదే. అల్లు అర్జున్- సుకుమార్ల కాంబినేషన్ తిరిగి దశాబ్దం తర్వాత రావడంతో ఎంత బావుందో చూద్దాం...

కథ

పుష్ప అలియాస్ పుష్పరాజ్ (అల్లు అర్జున్) ఇంటిపేరు లేని, ఫలానా తండ్రికి పుట్టానని చెప్పుకోలేని పరిస్థితుల్లో పెరిగి, శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ లో కూలీగా చేరతాడు. పోలీసుల బారి నుంచి స్మగ్లింగ్ ని తప్పించగల నేర్పుతో సిండికేట్ లీడర్ కొండారెడ్డి (అజయ్ ఘోష్) మెప్పుపొంది, చిన్న షేర్ తో భాగస్థుడవుతాడు. కొండారెడ్డి ఈ సరుకు సిండికేట్ సుప్రీమ్ మంగళం శీను (సునీల్) కి చేరవేస్తే, శీను చెన్నైలో ఇంటర్నేషనల్ స్మగ్లర్ మురుగన్ కి అమ్మి ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు.

        ఇలా వుండగా పుష్ప పాల వ్యాపారం చేసే శ్రీవల్లి (రశ్మికా మందన్న) తో ప్రేమలో పడతాడు. ఈ ప్రేమ వ్యవహారాలు సాగిస్తూండగా, శీను చెన్నైలో ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న విషయం పుష్పకి తెలుస్తుంది. ఇది కొండారెడ్డికి చెప్తే, వెళ్ళి శీనుని ఎక్కువ డబ్బు డిమాండ్ చేయమంటాడు కొండా రెడ్డి. అలా వెళ్ళిన పుష్పకి శీను దగ్గర వాటాలు కుదరక, నేరుగా మురుగన్ కే సరుకు అమ్ముకుంటామని సవాలు చేస్తాడు. దీంతో శీనుతో ఘర్షణ ప్రారంభంవుతుంది...

        ఈ ఘర్షణ ఎక్కడికి దారితీసింది? ఈ ఘర్షణలో మంగళం శీను ఏమయ్యాడు? అతడ్ని భార్య దాక్షాయణి (అనసూయ) ఎందుకు శిక్షించింది? పుష్పకి కొండా రెడ్డి తోనే శతృత్వం ఎందుకు రగిలింది? కొండారెడ్డి ఏమయ్యాడు? పుష్పతో నిశ్చితార్ధం ఆగిపోయిన శ్రీవల్లి ఏమైంది? ఈ మొత్తం వ్యవహారంలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫవాద్ ఫాజిల్) పాత్రేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
గ్యాంగ్ స్టర్ జానర్లో రెగ్యులర్ టెంప్లెట్ కథ. పరిస్థితుల బాధితుడైన సామాన్యుడు నేర ప్రపంచంలోకి ప్రవేశించి బాస్ కింద పని చేస్తూ, బాస్ స్థానాన్నే ఆక్రమించి లీడర్ గా ఎదిగే రొటీన్ కథ. పుష్ప- ది రైజ్ అని టైటిల్ లోనే కథ తెలుస్తోంది. ఇటీవలే రోమాంటిక్ లో కూడా ఈ టెంప్లెట్ నే వాడారు. పైగా పుష్ప రెండు భాగాల కథ కావడంతో ఈ మొదటి భాగమంతా రైజ్ గురించే వుంటుంది. రెండు భాగాలు కలిపి స్ట్రక్చర్ చూసినప్పుడు రైజ్ తో బిగినింగ్ భాగమే ఇప్పుడు చూస్తాం. రెండో భాగంలోనే మిడిల్, అంటే కథని  చూడగలం. దాని ఎండ్ తో ముగింపూ చూడగలం.

        కాబట్టి ఈ మొదటి భాగం రాబోయే రెండో భాగానికి ఉపోద్ఘాతం మాత్రమే. బాహుబలి రెండు భాగాల కథ కూడా ఈ విభజనతోనే వుంటుంది. అందుకని కథని ఆశించకుండా రెండో భాగంలో కథకి ఉపోద్ఘాతాన్నీ, పాత్రల పరిచయాన్నీ మాత్రమే ఈ మొదటి భాగంలో చూడాల్సి వుంటుంది. ఇంకో దృష్టితో చూస్తే కాన్ఫ్లిక్ట్ లేదు కాబట్టి ఇది గాథలా కూడా వుంటుంది. ఈ మొదటి భాగం చివర్లో వచ్చే ఎస్పీ షెకావత్ పాత్రతో కాన్ఫ్లిక్ట్ రెండో భాగంలోనే ప్రారంభమవుతుందన్న మాట. అంటే అదే కథ, అసలు కథ అవుతుంది.

నటనలు - సాంకేతికాలు

అల్లు అర్జున్ పాత్రలో అల్లు అర్జున్ కాకుండా పాత్ర మాత్రమే కన్పించేలా చేసే అపూర్వ నటన ఇది. ఇలాటి డీ గ్లామ్ పాత్ర ఒప్పుకోవడం నటుడుగా ఎదగడానికే. పైగా పానిండియా ప్రేక్షకులకి, ఇతర పరిశ్రమల వర్గాలకీ తనేమిటో చెప్పుకునే అవకాశం. భాష, యాస, భంగిమ (మహాసముద్రం లో రావురమేష్ గూని పాత్రలా ఎడం భుజం పైకి లేచి వుండే అవకరం) ఒక సర్ప్రయిజ్ ప్రెజెంటేషన్. కూలీ అంటే బయట మనకి కన్పించే కూలివాడే అతడిలో కన్పిస్తాడు. పేరు చెప్పక పోతే అల్లు అర్జున్ అని తెలియడం కష్టం. ఒక స్టార్ గా ఆర్ట్ సినిమా పాత్రని గా కమర్షియల్ సినిమాలో చూపించి ఒప్పించడం సాహసమే.

        ఈ మొదటి భాగమంతా ది రైజ్ అని టైటిల్లో వున్నట్టు పాత్ర ఎదుగుదల గురించే. ఈ ఎదుగుదల క్రమాన్ని శరీర భాష కూడా క్యారీ చేస్తుంది మొదటి సీను నుంచీ చివరి వరకూ  తగ్గేదే లే... అన్న ఊత పదంతో. కూలీ వాడుగా కన్పించే మొదటి సీను నించీ కాలు మీద కాలేసుకుని కూర్చునే అలవాటు వుంటుంది. ఈ శరీర భాష ఎదగాలన్న మనస్తత్వాన్ని పట్టిస్తూంటుంది. యజమాని ఐదు లక్షలు జీతమిస్తా నంటే, నాల్గు శాతం పర్సెంటేజీ  ఇమ్మంటాడు. అలా తీసుకుంటే లక్ష తగ్గుతుందంటే ఫర్వాలేదంటాడు. ఐదు లక్షలు జీతం తీసుకుంటే యజమాని కింద కూలీ వాడుగా వుంటాడు. లక్ష తగ్గినా పర్సెంటేజీ తీసుకుంటే పార్టనర్ అవుతాడన్న బిజినెస్ మైండ్ అతడిది. మొదటి పేమెంటుతో కారు కొనేసుకుని కూలీ కొస్తాడు. ఇలా క్యారక్టర్ ఆద్యంతం చాలా యాక్టివ్ గా, మాస్ ప్రేక్షకుల్ని ఎడ్యుకేట్ చేసేలా, కలర్ఫుల్ గా వుంటుంది. ఇందుకు దర్శకుడు సుకుమార్ ని మెచ్చుకోవాలి. క్యారక్టరైజేషనంటే ఏమిటో చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో చూస్తాం.

        పాటల్లో కూడా స్టెప్పు లేస్తూ రెగ్యులర్ అర్జున్ కన్పించడు. స్వాతిముత్యం లో కమల్ హాసన్ రాధికతో డ్యూయెట్ లో ఎలా చేస్తాడో- అర్జున్ ఎడం  భుజం పైకి లేచి వుండే అవకరంతో అలా గమ్మత్తుగా కన్పిస్తాడు. సెకండాఫ్ లో తన గ్రూప్ సాంగ్ లోకూడా అవకారాన్ని మెయింటెయిన్ చేస్తాడు. రష్మికతో రెండు డ్యూయెట్లలో,  సమంతాతో ఐటెమ్ సాంగ్ లో కూడా రెగ్యులర్ అర్జున్ కన్పించడు. ఇక యాక్షన్ సీన్స్ చెప్పాల్సిన పనిలేదు. సెకండాఫ్ లో చావుకి దగ్గరై చేతులు కట్టేసిన నిస్సహాయ స్థితిలో, ఆవకరాన్ని మెయింటెయిన్ చేస్తూ వాటర్ స్కీముతో యాక్షన్ సీను సినిమాలో వైరల్.హీరోయిన్ రశ్మికతో రూరల్ రోమాన్స్ కూడా సెకండాఫ్ వరకూ ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ మూవీ విషయమున్న క్యారక్టర్ తో అల్లు అర్జున్ ఒన్ మాన్ షో ఎలాటి ఓవరాక్షన్ లేకుండా.

        రశ్మిక రెగ్యులర్ టెంప్లెట్ పాత్రలో రూరల్ క్యారక్టర్ గా ఓకే. విలన్ గా కమెడియన్ సునీల్ కూడా ప్రయోగం చేశాడు. మంగళం శీను పాత్రలోని క్రూరత్వాన్ని కూల్ గా పోషించి సక్సెస్ అయ్యాడు. అజయ్ ఘోష్ కూడా ఓకే. మంగళం శీను భార్యగా అనసూయ ఫస్టాఫ్ అంతా బ్యాక్ గ్రౌండ్ లో వుంటూ సెకండాఫ్ లో షాకింగ్ షేడ్ చూపిస్తుంది. ఇక చివరి ఇరవై నిమిషాల్లో ఎస్పీగా వచ్చే మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ సైకో పాత్రలా ఏం చేయబోతున్నాడో సస్పెన్స్ ని క్రియేట్ చేస్తాడు. రెండున్నర గంటల ఈ సుదీర్ఘ ఉపోద్ఘాతానికి రిలీఫ్ గా సెంట్రల్ ఎట్రాక్షన్ అవుతాడు తన యాక్టింగ్ స్కిల్స్ తో.

        సాంకేతికంగా అడవుల నేపథ్యంలో ఎర్ర చందనం చెట్ల నరికి వేత, స్మగ్లింగ్, యాక్షన్ సీన్స్ మొదలైనవి ఉన్నతంగా వున్నాయి. కాకపోతే దేవీశ్రీ ప్రసాద్ బిజీఎం పూర్ క్వాలిటీ తో వుంది. రసూల్ పోకుట్టి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా హైలైట్ కావు. రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ ల యాక్షన్ కొరియోగ్రఫీ కథ లోనేని థ్రిల్ ఎలిమెంట్ ని భర్తీ చేస్తాయి. మొత్తం ప్రొడక్షన్ డిజైన్ కి విజువల్ క్వాలిటీతో కెమెరాలో బంధించాడు  మిరోస్లా కూబా. దేవీశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలన్నీ బావున్నాయి. వైరల్ అయిన సమంతా ఐటెమ్ సాంగ్ మాత్రం చిత్రీకరణలో అంత కిక్కిచ్చేలా లేదు.

        పుష్ప ఈ మొదటి భాగం కథ ప్రారంభంకాని మొదటి భాగం లాగే తీయడం వల్ల విషయపరంగా చెప్పుకో దగ్గది కాదు. అల్లు అర్జున్ పాత్రే ఈ సినిమా, కథ కాదు. కథ కోసం రెండో భాగం చూడాలి. విషయపరంగా ఈ మొదటి భాగాన్నే నిలబెట్టే క్రియేటివ్ యాస్పెక్ట్ కి అవకాశమున్నా దాన్ని ఉపయోగించుకోలేదు. సినిమాని రెండుగా విడగొట్టడంతో రిజల్టూ  రేటింగ్స్ కూడా అలాగే వస్తున్నాయి...పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్! అన్న డైలాగు కంటెంట్ కి కూడా వర్తించక పోవడంతో.

—సికిందర్

13, డిసెంబర్ 2021, సోమవారం

1105 : రివ్యూ!

 

రచన - దర్శకత్వం : సుజనా రావు
తారాగణం : శ్రియా శరన్‌
, నిత్యా మీనన్‌, ప్రియాంకా జ‌వల్క‌ర్, శివ కందుకూరి, బిత్తిరి సత్తి తదితరులు 
సంగీతం : ఇళయరాజా, ఛాయాగ్రహణం : వీఎస్ జ్ఞాన శేఖర్
బ్యానర్స్ : క్రియా ఫిలిం కార్పొరేషన్
, కాళీ ప్రొడక్షన్స్
నిర్మాతలు  : కె రమేష్
, పి వెంకీ, వీఎస్ జ్ఞాన శేఖర్
విడుదల : డిసెంబర్‌
10, 2021
***

          త మూడు నెలలుగా ముగ్గురు కొత్త యువ దర్శకురాళ్ళు తెలుగు వెండితెర మీది కొచ్చారు : గౌరీ రోణంకి (పెళ్ళి సందడి), లక్ష్మీ సౌజన్య (వరుడు కావలెను), సుజనా  రావు (గమనం). తొలి ఇద్దరివీ కమర్షియల్ ప్రయత్నాలైతే, సుజనా రావుది సామాజిక స్పృహతో ఆఫ్ బీట్ ప్రయత్నం. ఆహ్వానించ దగ్గది. ఇలాటి ప్రయత్నాలకి పాపులర్ నటులు, సాంకేతికులు తోడైతే ప్రేక్షకుల్లోకి వెళ్ళే అవకాశాలెక్కువ వుంటాయి. గమనం కి శ్రియా శరణ్, నిత్యా మీనన్, సుహాస్, చారు హాసన్, బిత్తిరి సత్తిలతో బాటు, రచయిత సాయినాధ్ బుర్రా, సంగీత దర్శకుడు ఇళయ రాజా, ఛాయా గ్రాహకుడు జ్ఞాన శేఖర్ ల వంటి ప్రముఖుల సమ్మేళనంతో ప్యాకేజీ ట్రెండీగా వుంది. తెల్లారి పోయిన ఆర్ట్ సినిమాలని  బాలీవుడ్ స్టార్స్ తో తీసి ట్రెండ్ లో కి తీసుకొచ్చి- క్రాసోవర్ సినిమా అనే కొత్త కేటగిరీని సృష్టించిన శ్యామ్ బెనెగల్ బాట ఎవరికైనా మంచిదే.

        బాటలో కొత్త యువ దర్శకురాలు సామాజిక స్పృహతో హైదరాబాద్ లో వరదలు అనే ఇంత వరకూ ఎవరూ ప్రయత్నించని యూనిక్ కాన్సెప్ట్ ని తీసుకుంది. ఈ మధ్య నూటొక్క జిల్లాల అందగాడు’, కొండపొలం’, అద్భుతం’, స్కై లాబ్’, లక్ష్య ...ఇవి కూడా యూనిక్ కాన్సెప్టులే. ఇవన్నీ కూడా పాత మూస ఫార్ములా ధోరణులతో కాన్సెప్టులకి అన్యాయం చేసి అపజయాల సంఖ్య పెంచినవే. గమనం కూడా ఇదే బాటలో వెళ్ళిందా, బెనెగల్ తరహా సమ్మోహనకర ప్యాకేజీ వుండి కూడా? యూనిక్ అంటేనే అసాధారణమైన, అరుదైన, ప్రత్యేకమైన అని అర్ధం. ఈ అర్ధాన్ని గమనం అయినా నిలబెట్టుకుందా? లేక ఆకాశం నుంచి దిగివచ్చినా మన తెలుగు సినిమాల కాన్సెప్టులింతే, గమ్యమింతే అన్పించుకుందా? ఈ ప్రశ్నలకి ఏమని సమాధానం చెబుతోందో చూద్దాం...

కథ

హైదరాబాద్ లో మూడుగా విభజించి చూపించిన జీవితాలవి...మొదటిది, ఆమె కమల (శ్రియ) అని వినికిడి లోపమున్న వివాహితురాలు. చిన్న కూతురుతో వుంటుంది. భర్త గల్ఫ్ లో టాక్సీ నడుపుతూ వుంటే, తను బస్తీలో బట్టలు కుడుతూ జీవనం సాగిస్తూంటుంది. భర్త వచ్చేలోగా వినికిడి సమస్యకి వైద్యం చేయించుకుని, భర్త తెచ్చే డబ్బుతో చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశతో వుంటుంది.

        రెండోది, నగరంలో ఇంకో చోట అలీ (శివ కందుకూరి) అనే యువకుడు తాత (చారు హాసన్) తో వుంటాడు. మెడిసిన్ చదివే ఇతను తాత మాట వినక, క్రికెటరై దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కృషి చేస్తూంటాడు. అక్కడే జారా(ప్రియాంకా జవల్కర్‌) అనే పెద్దింటి యువతి వుంటుంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటే పెద్దలు ఒప్పుకోరు. జారా పారిపోయి అలీ దగ్గరికి వచ్చేస్తుంది పెళ్ళి చేసుకోవాలని.

        మూడోది, మరింకో చోట మురికి వాడలో ఇద్దరు వీధి బాలలుంటారు. చిత్తు కాగితా లేరుకుని బ్రతుకుతూంటారు. ఈ ఇద్దర్లో ఒకడికి పుట్టిన రోజు ఘనంగా జరుపుకోవా లనుంటుంది. అందుకు కేక్ కొనేందుకు, మట్టి వినాయకుల విగ్రహాలమ్మి డబ్బు పోగేస్తూంటారు.

        ఈ మూడు చోట్లా జీవితాలిలా వుండగా, నగరంలో భారీ వర్షాలు కురిసి వరదలొచ్చేస్తాయి. వరదలకి ప్రాణాలతో బాటు కలలు, ఆశలూ కల్లోలితమవుతాయి. ఇందులోంచి ఎలా బయటపడి జీవితాల్ని తిరిగి గాడిలో పెట్టుకున్నారనేది మిగతా కథ. ఈ మిగతా కథలో  అలీ తాతతో బాటు, అలీ మిత్రుడు అబ్దుల్లా (సుహాస్), అలీ కోచ్ (రవి ప్రకాష్), జారా తండ్రి (సంజయ్ స్వరూప్), గాయని శైలపుత్రి (నిత్యా మీనన్) మొదలైన వ్యక్తులెక్కడ కనెక్ట్ అయ్యారనేది కూడా చూడొచ్చు.

ఎలా వుంది కథ 

గత వారమే విడుదలైన కుప్పకూలే స్కై లాబ్ యూనిక్ కథ లాగే, హైదరాబాద్ లో వరద ముప్పుతో ఇది కూడా డిజాస్టర్ జానర్ యూనిక్ కథ. స్కైలాబ్ లాగే డిజాస్టర్ జానర్ ఎలిమెంట్స్ తో కథ చేసుకోని కథ. అలాగని వరద ముప్పులో సర్వైవల్ (జీవన్మరణ పోరాటం) జానర్ ఎలిమెంట్స్ తో  కూడా చేయని కథ. పోనీ ఒక సామాజిక స్పృహతో ఆర్ట్ లేదా ఆఫ్ బీట్ మూవీయా అంటే అలా కూడా ఈ కథాంగాలు వుండవు. అన్ని కథా లక్షణాలూ తీసేసి- వరదలొచ్చాయి, ఇందులోంచి ఎలా బయట పడ్డారూ అన్న డాక్యుమెంటరీ మాత్రపు ప్రయత్నంగా యూనిక్ కథ మిగిలింది. పేరుప్రతిష్టల్ని తెచ్చి పెట్టే యూనిక్ కథ ఇలా సింహాసనం నుంచి జారిపోగా, ఈ డాక్యుమెంటరీ శైలి కథనం మొదట్నుంచీ  మూడుగా విభజించి చూపించిన జీవితాల చిత్రీకరణల్లో కన్పిస్తూ వస్తుంది. ఈ డాక్యుమెంటరీ కథనమే మొత్తం కథకొక అల్లిక, మెలికలు, ముడులు లేకుండా చేసింది. అసలు దేనితో ఏం చేస్తున్నామో తెలుసుకోకుండా రాసేసి తీసేస్తే ఇలాగే వుంటుందేమో. ఈ కథ కూడా పైన చెప్పుకున్న ఇటీవలి నాల్గు సినిమాల యూనిక్ కాన్సెప్టుల బాటలోనే బుట్ట దాఖలైపోయింది. 

        మూడుగా విభజించి చూపించిన జీవితాలతో మూడు కథలు. అంటే మూడు విడివిడి కథల ఒక ఆంథాలజీ అన్నమాట. అంటే హైపర్ లింక్ స్టోరీ. ఈ మూడు కథల్ని హైపర్ లింకుగా కూడా ఎక్కడా కలపను కూడా లేదు. అంటే ఆంథాలజీ కూడా కాకుండా పోయింది. ఇప్పుడు కావాలంటే 2020 హైదారాబాద్ వరద దృశ్యాలు చూసేందుకు యూట్యూబ్ లో బోలెడు వున్నాయి. సినిమా దేనికి చూడాలి. అలాటి వార్తా ప్రసారం లేదా డాక్యుమెంటరీ కాదు కదా సినిమా కథంటే. 

        కథ కాలేదు కాబట్టి కాన్ఫ్లిక్ట్ లేదు. వరదల్ని చూపిస్తే అది పాత్రలకి ఎదురైన కాన్ఫ్లిక్ట్ అవదు. ప్రకృతి దాని మానాన అది సర్దుబాటు చేసుకోవడం. ప్రకృతి వరదలతో దాని సర్దు బాటు బిజినెస్ లో అదుంటే, దీన్ని ఎదుర్కొంటూనే పాత్రల మధ్య పుట్టేది కాన్ఫ్లిక్ట్. ప్రకృతి సర్దుబాటు నేపథ్యంలో పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ లేకపోతే పాలగుమ్మి పద్మరాజు రాసిన గాలివాన కథ లేదు, కొరియన్ పారసైట్ మూవీ కూడా లేదు. టైటానిక్ డిజాస్టర్ మూవీ డిజాస్టర్ గురించే కాదు కదా? అదో అమరమైన ప్రేమ కథ కూడా.

పాలగుమ్మి పద్మరాజు గారి సుప్రసిద్ధ కథ గాలివాన ఆయన జీవితంలో జరిగిందే. దాన్ని ఆయన వార్తలా రాసి వుంటే కథయ్యేది కాదు. ఆ అనుభవం లోంచి వర్షపు రాత్రి పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ తో ఆ గొప్ప కథని సృష్టించారు. ఒక డబ్బున్న ఉన్నతాదర్శాల వ్యక్తి, తను అసహ్యించుకునే బిచ్చగత్తెతో వర్షపు రాత్రి చిక్కుకుని, ఆమె వల్ల తన ఉన్నతాదర్శాల్లోని డొల్లతనాన్ని తెలుసుకునే -  సోషల్ కామెంట్ చేసే కథ. 1951 లో రాసిన ఈ కథని ఆయన అనువాదం చేసి పంపితే న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో ద్వితీయ బహుమతి పొంది, అనేక భాషల్లో అనువాదమైన ప్రపంచ స్థాయి కథ.

 సూరజ్ కా సాత్వా ఘోడా’ అనే ప్రసిద్ధ నాల్గు కథల ఆంథాలజీలో శ్యామ్ బెనెగల్ కూడా ప్రేమకి సంబంధించి ఇదే చెప్పారు- సామాజికార్ధిక వర్గ పోరాట పునాదులున్న ప్రేమలే మంచి ప్రేమ కథలవుతాయని. గమనం దర్శకురాలి సామాజిక స్పృహకీ సామాజికార్ధిక కారణాలు కలగలిసిన కాన్ఫ్లిక్ట్ చూపించాలి నిజానికి.


        పాలగుమ్మి కథ లాగా ఆసియా ఖండం నుంచే వెళ్ళిన కొరియన్ మూవీ పారసైట్ లో కూడా వరదలు నగరాన్ని ముంచెత్తే కథే. ఆ వరదల్లో బయటపడే ఒక్కో పాత్ర నిజ రూపాలతో, వర్గ తారతమ్యాల సోషల్ కామెంట్ చేస్తుందీ 2019 ఆస్కార్ అవార్డు పొందిన సినిమా కథ. ఆసియా ఖండం నుంచి వెళ్ళిన ఈ రెండూ అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. గమనం లో హైదరాబాద్ వరదలకి కారణం పేరుకు పోయిన డ్రెయిన్లు, కబ్జా చేసిన చెరువులూ అని మీడియా రిపోర్టు చేసిన కారణమే చెప్పి సరిపెట్టడంతో, అవార్డులకి ఎదిగే అవకాశాన్ని కోల్పోయిన  డాక్యుమెంటరీ అయిందీ యూనిక్ కాన్సెప్ట్.

        ఈ కబ్జాదార్లయిన ధనిక పాత్రల్ని కూడా సృష్టించి- పేద పాత్రలతో కాన్ఫ్లిక్ట్ వల్ల ఏం నేర్చుకున్నారో సోషల్ కామెంట్ చేసి వుంటే అర్ధవంతమైన సామాజిక కథయ్యేది. వరదలతో ప్రకృతి కాదు విలన్. ప్రకృతిని ఆటంకపర్చే సామాజిక శక్తులు విలన్లు. విలన్లు లేకుండా బాధితుల అపసోపాలే చూపిస్తే కథవదు. కథంటే రెండు వైరి వర్గాల మధ్య డ్రమెటిక్ క్వశ్చన్ - ఆ క్వశ్చన్ తో కాన్ఫ్లిక్ట్ - దానికి ముగింపూ. డ్రామాకే అవకాశం లేని డాక్యుమెంటరీలో ఇవి సాధ్యం కావు. సినిమాకి కావాల్సింది డాక్యుమెంటరీలూ గాథలూ కావు, కథలే. బాధితులే తప్ప బాధకుల్ని చూపించక పోవడం వల్ల, పెట్టుబడిదారీ పక్షమేమో కథకురాలన్న అనుమానం కూడా వచ్చేలా వుంది.  

నటనలు- సాంకేతికాలు     

నిస్సందేహంగా సీనియర్ నటి శ్రియది వినికిడి లోపమున్న పాత్రలో చూడదగ్గ నటనే. ఏ సీనులో కూడా కమర్షియలేతర రియలిస్టిక్ నటనని గుండెలోతుల్లోంచి ప్రదర్శించకుండా వదిలి పెట్టలేదు. అయితే సన్నివేశ బలం, భావోద్వేగ బలం లేకపోవడం వలన జీవం లేని నటనయింది. కథ వుంటేగా ఇవి వుండడానికి. తను లీడ్ క్యారక్టర్ కూడా కాలేదు. తను బట్టలు కుడితేనే కాదు, అల్లికలతో కథని కూడా కుట్టాలి. కుట్టాలంటే లీడ్ క్యారక్టరవాలి. కార్యకర్త కావాలి. డిజాస్టర్ / సర్వైవల్ జానర్ కూడా కాదు కాబట్టి ఇవి కాలేదు. తనది ఎపిసోడ్ క్యారక్టర్. ఎపిసోడ్ కి పరిమితమైన క్యారక్టరైనా ఒక మినీ కథయినా కావాలి. కూతురితో ఈ మినీ కథ చేయొచ్చు. వినికిడి లోపమున్న ఇలాటి ఏ తల్లికైనా ముందు తన కూతురి గొంతు వినాలనుంటుంది. ఇది చాలు మినీ కథకి. కూతురి గొంతు వినడం కోసమే చికిత్స చేయించుకోవాలని సంకల్పం వుంటే, తీరా వర్ష బీభత్సంలో ఓ పిడుగు పడి డ్రమెటిక్ గా వినికిడి శక్తి వచ్చేసి వుంటే, ఆ సంబరంతో కూతురి గొంతు వినాలనుకుంటే... కూతురి గొంతు పోవాలి అదే పిడుగుపాటు భయంతో. ఇది మనకొచ్చిన ఐడియా కాదు. 1972 లో మనోజ్ కుమార్ సూపర్ హిట్ షోర్ నుంచి కాపీ కొట్టాం.

        షోర్ లో మనోజ్ కుమార్ కొడుకు యాక్సిడెంట్ లో మూగవాడై పోతాడు. అతడికి గొంతు తెప్పించి మాటలు వినాలని వైద్యం కోసం నానా పాట్లు పడి విజయం సాధిస్తే, పని చేస్తున్న కర్మాగారంలో తన చెవులు పోతాయి...దీన్ని ఉదాహరణ చెప్పడానికే తీసుకున్నాం, కాపీ కొట్టాలని కాదు.

        స్కైలాబ్ తో నిత్యామీనన్, ఇప్పుడు గమనం తో శ్రియ - తాము యూనిక్ కథలని నీరుగార్చే పాత్రల్ని ఒప్పుకుంటున్నామని ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు వాళ్ళ నటనలకి సార్ధకత వుంటుంది. మిగిలిన పాత్రల్లో తెలిసిన నటీనటులున్నారంటే ఏదో వున్నారంతే. వీళ్ళందరి మధ్య ఇద్దరు స్లమ్ పిల్లల కథ తమిళ సినిమా లోనిదేనేమో.


2016 లో వెట్రి మారన్ ‘విసారనైకి’ కి దర్శకత్వం వహించి దేశ విదేశాల్లో పేరు గడించక మునుపు - 2015 లో ‘కాక ముట్టై’ కి నిర్మాతగా వ్యవహరించి అంతే పేరు ప్రతిష్టలూ  పొందాడు. కాకపోతే దీనికి సహ నిర్మాతగా హీరో ధనుష్ వున్నాడు. ధనుష్వెట్రి మారన్ ల అండదండలతో కెమెరా మాన్ మణికందన్ దర్శకుడుగా మారిబాలల చలన చిత్రం ‘కాకముట్టై’ తీసి అంతర్లీనంగా గ్లోబలైజేషన్ స్వరూపాన్ని తేటతెల్లం చేశాడు. ‘కాకముట్టై’ (కాకి గుడ్డుని ఇద్దరు స్లమ్ పిల్లల గ్లోబల్ కోరికల కథగా తీశాడు.

        ఈ పిల్లలకి పిజ్జా కొనుక్కు తినాలని కోరిక. దానికి డబ్బుల కోసం చాలా కష్టపడతారు. తీరా కొనుక్కుని పిజ్జా ముక్క నోట్లో పెట్టుకుంటే - థూ, దీనికంటే స్టవ్ మీద ముసలి నానమ్మ వేసే బియ్యప్పిండి దిబ్బ రొట్టే ది బెస్ట్ అన్పిస్తుంది! అవసరం లేని గ్లోబల్ ఉత్పత్తుల మీద గురి చూసి సోషల్ కామెంట్ ఇది. దీనికి దేశ విదేశాల్లో 21 అవార్డు లొచ్చాయి. 2 కోట్ల బడ్జెట్ కి 12 కోట్ల బాక్సాఫీసూ వచ్చింది.

గమనం లో స్లమ్ పిల్లలు బర్త్ డేకి కేక్ కొనాలని ఆరాటపడతారు. ఇది కాకతాళీయమో కాపీనో దర్శకురాలే చెప్పాలి. అయితే తమిళంలో కేకుతో కాకుండా పిజ్జాతో కథ చేయడం- దిబ్బ రొట్టె కాంట్రాస్ట్ తో సామాజిక స్పృహ అయింది. గమనం లో ఇలాటిది కాలేదు. అసలీ కేకుతో బర్త్ డేలు మన కల్చర్ కాదని పిల్లలు చివరికి గుర్తించి, పుట్టిన రోజుకి శుభ్రంగా స్నానం చేసి గుడి కెళ్ళి గంట కొడితే, కాంట్రాస్ట్ తో ముచ్చటైన సోషల్ కామెంట్ అయ్యేది.

        మరో మూడు పేర్లూ బాక్సాఫీసు అప్పీలుగా వున్నాయి - ఇళయరాజా (సంగీతం), వీఎస్ జ్ఞాన శేఖర్ (ఛాయాగ్రహణం), బుర్రా సాయినాథ్ (మాటలు). నటీనటుల్లాగే ఈ ముగ్గురూ కూడా బాక్సులో విషయం లేకపోవడం వల్ల ప్రశ్నార్థకంగా మిగిలారు తమ ప్రతిభా పాటవాలతో.

చివరికేమిటి

ఫస్టాఫ్ సమయమంతా మూడు కథల పాత్రల్ని ఎస్టాబ్లిష్ చేయడానికే తీసుకున్నా పాత్రలు ఇంకా సరిగ్గా ఎస్టాబ్లిష్ కావు. భావోద్వేగాలు కనిపించని ఈ కథలు, పాత్రలు  నిదానంగా సాగడంతో ఫస్టావ్ ఓపికని పరీక్షిస్తుంది. సెకండాఫ్ వరదల్లో కష్టాలతో సాగుతుంది. ఫస్టాఫ్ లో కథలు, పాత్రలు సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడంతో, ఈ సెకండాఫ్ లో భావోద్వేగాల్లేని పాత్రల స్ట్రగుల్ తో ఆడియెన్స్ కనెక్ట్ కష్టమైపోతుంది. ఇలా సెకండ్ యాక్ట్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడంతో, ఆకస్మికంగా వచ్చే థర్డ్ యాక్ట్ సైతం ఆకట్టుకునే పరిస్థితి వుండదు. ఇలా స్క్రీన్ ప్లే ఏ యాక్ట్ లోనూ దాని బిజినెస్ జరగని పరిస్థితి ఈ సినిమాలోనే మొదటిసారిగా చూస్తాం. డాక్యుమెంటరీ చేస్తే యాక్ట్స్ సహజంగానే వుండవు.

        చివరిగా,దివ్యాంగుల్ని విషాద పాత్రలుగా చూపించే ఫార్ములా ఇక పోయింది. వాళ్ళని కూడా సాధారణ పౌరులుగానే సమానంగా ట్రీట్ చేసే సంస్కారాన్ని సమాజాలు గుర్తించాయి. పత్రికా భాష కూడా వికలాంగులు నుంచి దివ్యాంగులుకి మారింది. 2012 లో బర్ఫీ లో రణబీర్ కపూర్ మూగ చెవిటి పాత్ర ఫార్ములాని బ్రేక్ చేస్తూ హిలేరియస్ క్యారక్టర్ గా పాపులర్ అయింది. పాత్ర తన లోపాలతో బాధపడే విషాద పాత్రగా వుండదు. అలా చూపించే కుసంస్కారానికి పోలేదు.

        డిసెంబర్ 6 న దివ్యాంగుల సాధికారత అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా రాష్ట్రపతి స్టేజి దిగి అవార్డులు అందించడం తీవ్ర విమర్శలకి దారితీసిన ఉదాహరణ వుంది. రాష్ట్రపతి అలా స్టేజి దిగి రావడం దివ్యాంగులని అవమానించడమే అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి సమక్షంలో కెళ్ళి అవార్డులు అందుకునేందుకు తాము ముందుగానే డ్రెస్ రిహార్సల్స్ చేశామని, ఇందుకోసం హైడ్రాలిక్ లిఫ్ట్ కూడా ఉపయోగించామని, ఆ రిహార్సల్స్ అంతా వృధా అయిందనీ  దివ్యాంగులు చెప్పుకుని బాధ పడ్డారు. ఇలాంటి చర్యలతో తమని మరోమారు దివ్యాంగుల్ని చేయవద్దని విన్నవించుకున్నారు. ఆలోచనల్లో మార్పు రావాలని కోరారు. సామాజిక స్పృహతో సామాజిక కథకి ఇదవసరమే.

—సికిందర్