రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, మార్చి 2021, శనివారం

1031 : స్క్రీ. టిప్స్


       1967 లో సాక్షిఅనే తొలి కళాత్మక ప్రయత్నం చేసినప్పుడే బాపుగారి నేపధ్యం చిత్ర లేఖనం. అలా చిత్రకారుడు చలన చిత్ర కారుడైనప్పుడు ఆ సృజనాత్మకతకి వయస్సే మీదపడదేమో? ‘ముత్యాల ముగ్గుతీసి నలభై ఆరేళ్ళు కావొస్తున్నా ముదిమితనం అంటనే లేదు. మళ్ళీ ఒక్కసారి ఆన్ లైన్లో చూస్తే, ఏ విభాగంలో ఇది నేటి కాలానికి వెనుకబడింది? కథా కథనాలా? మాటలా? సంగీత  సాహిత్యాలా? నటనలా? చిత్రీకరణలా? ఏదీ కాలదోషం పట్టని అసమాన సృజనలే. అసలే మేకప్పూ లేని నటీ నటులతో వాస్తవిక కథాచిత్రాల నడక నడుస్తూనే, కమర్షియల్ గా సూపర్ సక్సెస్ కావడం దీనికే చెల్లింది.

        ఇంకో దశాబ్ద కాలంలో ఆర్టు సినిమాల చెలామణి చరమాంకం కొస్తుందనగా,  బాపు భవిష్యద్దర్శనం చేసినట్టు అప్పుడే (1975లో) ఈ ముందుకాలపు కమర్షియలార్టునిచ్చారు. ఉత్తరాదిన ఆర్టు సినిమాల ఉద్యమం ముగిశాక, వాటి స్థానాన్ని భర్తీ చేస్తూ ఆతర్వాత బాలీవుడ్ లో క్రాసోవర్ సినిమాల పేరుతో వచ్చినవన్నీ, నేటికీ వస్తున్నవీ, ముత్యాలముగ్గుటైపు కమర్షియలార్టు సినిమాలే.

        ముత్యాలముగ్గుఅనగానే రావుగోపాలరావు మెదలడం సహజం. కానీ ముత్యాలముగ్గుఅంటే కేవలం రావుగోపాలరావు క్లాసిక్ విలనీ మాత్రమే కాదు, బహు సుందరమైన కుటుంబ గాథ కూడా. ఒక శోకనాశన జానకీ వృత్తాంతం. ఆధునిక రామాయణం. ఉత్తర రామాయణం. విడిపోయిన తల్లిదండ్రుల కోసం పిల్లల గేమ్ ప్లాన్!

        శ్రీధర్, సంగీతలు భార్యాభర్తలు. బాధితురాలు భార్యే. బాధకుడు డబ్బుకోసం ఏమైనా చేసే కాంట్రాక్టర్ రావుగోపాలరావు. అప్పుడా తమ తల్లి అవస్థ చూడలేక కవలలిద్దరూ సదరు కాంట్రాక్టరు దురాగతాన్ని నిరూపించి, పునీతురాలిగా తిరిగి తల్లిని కన్నతండ్రితో కలిపి సుఖాంతం చేసే వృత్తాంతమే.

1. ఏదో ఒకటి ఎంచుకో
     సినిమా కథని ఆసక్తిగా మొదలెట్టాలంటే రెండు మార్గాలున్నాయంటాడు సిడ్ ఫీల్డ్. ఏదైనా ఒక సంఘటనతో యాక్షన్ దృశ్యాల్ని చూపడం, లేదా పాత్ర ద్వారా కథని వివరిస్తూ పోవడం. బాపుగారు తన మూడంకాల స్క్రీన్  ప్లేకి ఈ రెండో విధానాన్నే ఎంచుకున్నారు. శ్రీధర్ పాత్ర ద్వారా జమీందారు అయిన తండ్రి కాంతారావుని, ఆయన అక్కగార్ని, ముక్కామలని, అతడి మోడరన్ కూతుర్ని, అక్కడి ఉద్యోగి అల్లు రామలింగయ్యని, శ్రీధర్ స్నేహితుడ్నీ చకచకా పరిచయం చేసేసి- ఆ స్నేహితుడి చెల్లెలి పెళ్ళికి శ్రీధర్ ని పంపించేసి, ఆ పెళ్ళికూతురి రూపంలో సంగీతాని చూపిస్తారు.

        ప్రారంభంలోనే చాలా ఆసక్తి రేపే ఘట్టం. హీరోయిన్ పెళ్ళవుతోంటే హీరో రావడం! ...ఇలాంటి ప్రారంభంతోనే ఆ మధ్య కాలం వరకూ అదేపనిగా చాలా సినిమా లొచ్చాయి. ఇప్పుడు కూడా కొంచెం మార్పుతో తెల్లవారితే గురువారం వచ్చింది. ఇది ముత్యాలముగ్గుపెట్టిన భిక్షే. ఈ ప్రారంభ ఘట్టంలోనే సంగీత పెళ్లి చెడిపోయి, శ్రీధర్ ఆపద్ధర్మంగా ఆమెనే చేసుకోవాల్సిరావడంతో, టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్ అమాంతం పెరిగి, కథకి గట్టి ముడి పడిపోతుంది ఆదిలోనే. ఇదంతా కేవలం ఎనిమిది సీన్లలోపే జరిగిపోతుంది.

        రిచర్డ్ గెర్ నటించిన విజయవంతమైన సినిమా అన్ ఫెయిత్ ఫుల్’ (2002) లో ఐదవ సీనుకల్లా కథ ముడి పడిపోతుంది. ఇలాటి క్లుప్తీ కరించిన కథనాలే అసలు సిసలు సినిమా కథనాలవుతాయి. ముత్యాలముగ్గుఈ సెక్షన్ లో అపూర్వంగా నిలబడుతుంది. దర్శకుడు బాపూ- ఈ కథా, సంభాషణలూ రాసిన రచయిత రమణా, ముత్యాలముగ్గుని భావి తరాలకి రిఫరెన్స్ గైడ్ లా అందించారు . ఏ కథైనా సరదాగా మొదలై, సంక్షుభితంగా మారి, తిరిగి శాంతి సామరస్యాలు స్థాపించే మూడంకాల నిర్మాణంలోనే  వుంటుంది. ఆనందంగా సాగుతున్న శ్రీధర్-సంగీతల వైవాహిక జీవితంలోకి రావుగోపాల రావుని ప్రవేశపెట్టి సంక్షుభితం చేస్తారు బాపు. కడుపుతో వున్న సంగీత శీలమ్మీద నిందపడి వీధి పాలవుతుంది.

2. రస భంగం మానుకో!

          ఫస్టాఫ్ లో ఇలా విడదీయడం సులభమే. సెకండాఫ్ లో కథనానికి ఔచిత్య భంగం కలక్కుండా తిరిగి కలపడమే పెద్ద సమస్య. అంటే ఫస్టాఫ్ ఏ రస ప్రధానంగా సాగిందో సెకండాఫ్ అదే రస ప్రధానంగా సాగాలి. ఇప్పుడు ఈ చౌరాస్తా నుంచీ కథ ఎటువైపు వెళ్ళాలి? పిల్లలు పుట్టి రావడానికి ఇంకా చాలా టైముంది. సంగీత మీద పడ్డ నింద తొలగించేందుకు కథకి ఉపయోగపడే సాధనాలు వాళ్ళే.  వాళ్ళు దూకాల్సిన కార్య క్షేత్రంలోకి ముందుగానే ఇంకో పాత్రని పంపి కథ నడిపించడం కోరి (సెకండాఫ్) గండాన్ని తెచ్చుకోవడమే.

     పోనీ శ్రీధర్-సంగీతల ఎడబాటు తాలుకూ బాధల్ని వాళ్లిద్దరి మీదా  చిత్రీకరిస్తూ కాలక్షేపం చేద్దామా అంటే అదీ సుడిగుండంలో పడేస్తుంది. పైగా  రసభంగం కల్గిస్తూ శోక రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరి పిల్లలు పుట్టి వచ్చేవరకూ కథ ఎలా నడపాలి? మొదట్నించీ చూస్తే  ఈ కథ అద్భుత రస ప్రధానంగానే నడుస్తూ వచ్చింది. ఈ అద్భుత రసాన్నే ఇక ముందూ కొనసాగించాల్సి వుంటుంది. అప్పుడే కథకి ఏకసూత్రత చేకూరుతుంది.  అందుకని ఈ అద్భుతరస స్రవంతికి  ఒక సాధనంగా ఉంటూ వస్తున్న  రావుగోపాలరావు అండ్ గ్యాంగు ని పోస్ట్ మార్టం చేసే పని చేపట్టారు సిద్ధహస్తులైన బాపూ-రమణలు దిగ్విజయంగా!

        ఇదీ సరైన సెకండాఫ్ కథనానికి మార్గం! ఇదే సూత్రం! ఏ రసప్రధానంగా కథ ప్రారంభమై దాని ఆలంబనగా కొనసాగుతోందో, అదే రస స్రవంతిని పట్టుకుని ఇంటర్వెల్ చౌరస్తా నుంచీ దారితప్పకుండా సాగి పోవడమే దిశ-దశ-సమస్తం కూడా! ఇలా రంగ్ దే లో వుందా?

3. ఆత్మిక దాహం తెలుసుకో

   సరేఎవరీ రావుగోపాలరావు అండ్ గ్యాంగులో దొంగలుఓ అమాయకురాలి కాపురాన్ని చెడగొట్టిన రావుగోపాలరావుముక్కామలఅల్లురామలింగయ్యనూతన్ ప్రసాద్ లు- అనే ఈ దుష్ట చతుష్టయం బతుకుల్లో చీకటి కోణాలేమిటి?...అనే సెకండ్ ట్రాక్ ఓపెన్ చేసివాళ్లకి వాళ్ళు వెన్నుపోట్లు పొడుచుకునే ఆత్మవినాశక చర్యలతో టైం అండ్ టెన్షన్ థియరీకి న్యాయం చేస్తూ అమాంతం కథనంలో టెంపో- దాంతోబాటు కొత్త సస్పెన్సూ సృష్టించేశారు!

        చేసిన పాపం చావదనే కదాసృష్టిలో ప్రతిదీ బూమరాంగ్ అవుతుంది. మంచి చేస్తే మంచీచెడు చేస్తే చెడూ చుట్టూ తిరిగి తిరిగి మనకే వచ్చి ఠపీమని తగుల్తుంది. ఈ దుష్ట చతుష్టయం ధనదాహంతో సంగీతని వనవాసం పట్టించినప్పుడుసృష్టి చూస్తూ ఊరుకోదుగా. సృష్టెప్పుడూ హెచ్చు తగ్గుల్ని సమతూకం చేసే దిశగానే కదుల్తూంటుంది. సంగీతకి ఆ స్థాయిలో అన్యాయం చేసి హెచ్చిపోయిన కీచకుల అదృష్టాల్ని ఛిన్నాభిన్నం చేసిఆ నష్టపరిహారం సంగీతకి ఇప్పించడం సృష్టి ధర్మం కదా?

మొన్నెవరో అడిగారు. మీరు కొన్ని కథల్ని పురాణాల ఆధారంగా ఎలా వివరిస్తున్నారని. కళారంగంలో వుండాలంటే ఆస్తికత్వంతో, నాస్తికత్వంతో అన్నిటితో ఎంతో కొంత వుండాలిగా. కళలు పోరాటాల నుంచి ఎంత పుట్టాయో, స్పిరిచ్యువాలిటీ నుంచీ అంతే పుట్టాయి. స్పిరిచ్యువాలిటీ నుంచీ వచ్చేవి ఆత్మిక దాహాన్ని తీరుస్తాయి. ఈ కథలో ఈ ఫిలాసఫీ ఎంచక్కా ఇమిడిపోయి, సంగీత పాత్ర పట్ల ప్రేక్షకులకి ఎనలేని సానుభూతేర్పడుతుంది.

4. కాస్త శాస్త్రం చూడు

    ఇలా సాగుతూండగాసంగీతకి పుట్టిన కవలలు తల్లిదండ్రుల్ని కలిపే అధ్యాయం మొదలౌతుంది. వీళ్ళ చేత ఈ పని ఎలా చేయించాలి?  ఇది మిలియన్ రీళ్ల ప్రశ్న! ఎవరికీకథని ఉదాత్తంగా చెప్పాలని సమకట్టిన వాళ్ళకే. ఇందుకు ముందుగా శాస్త్రం తెలియాలి.

     కృతయుగంలో మనుషులు సత్వర ఫలితాలు పొందేందుకు ధ్యానం చేసే వాళ్లట. త్రేతాయుగంలో యాగాలు చేశారనిద్వాపరయుగంలో అర్చనద్వారా పొందారనీఇక కలియుగంలో జ్ఞాన శూన్యులైన అల్పులు అధైర్య పడకుండా సంకీర్తన ద్వారా సత్వర ఫలితాలు పొందవచ్చనీ  సూత మహర్షి చెప్పాడు. అల్పులైన పిల్లల చేత బాపుగారు ఈ పనే చేయించారు!

        రామాలయంలో ఒకర్నీ, రావుగోపాలరావు ఇంట మరొకర్నీ పడేసి, సంకీర్తనలతో మస్కాలు కొట్టిస్తూ స్వకార్యం పూర్తి చేయించారు. అక్కకేమో ఆంజనేయుడితో ఫాంటసీ, తమ్ముడికేమో కోతితో ప్రాక్టికాలిటీ! తత్ఫలితంగా రావుగోపాలరావు చాప కిందికి నీళ్ళొచ్చేయడం!

5. ఎలా ముగిస్తావ్

       ఇప్పుడు ఈ మజిలీకి చేరిన కథని ఎలా ముగించడంమళ్ళీ శాస్త్రమే! సృష్టికర్త ఈ సృష్టిని ఎలా ఉపసంహరిస్తాడుబ్రహ్మ పురాణం ఏం చెప్తోందిత్రివిధాలుగా సృష్టి ఉపసంహారం జరగవచ్చంది. నైమిత్తికంప్రాకృతికంఆత్మీంద్రికం...మొదటిదాంతో పంచభూతాలు ఒకదాన్నొకటి మింగేసుకుని ఆకాశం శూన్యమైపోతుంది. రెండోదాంతో ప్రకృతి పరమాత్మలో కలిసిపోతుంది. మూడో ప్రక్రియలో మానవాళి మోక్షమార్గం ద్వారా జరుగుతుంది.

  సినిమాలో ఆల్రెడీ వెన్నుపోట్లతో తెగ కలహించుకుంటున్న దుష్ట చతుష్టయం కీచులాటలన్నిటినీ,  ఇక పతాక స్థాయికి చేర్చి, పంచ మహాభూతాల్లా ఒకర్నొకరు మింగేసుకునే నైమిత్తిక ముగింపునే ఇచ్చారు చాలా టెర్రిఫిక్ చిత్రీకరణతో! అప్పుడంతా  ఆకాశం శూన్యమైపోయినట్టు శ్మశాన నిశ్శబ్దం! తిరిగి తాజాగా సృష్టి మొదలైనట్టూ...శ్రీధర్-సంగీతల కాపురం.

***

        డైరెట్రూపైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ ఆకాశంలోసూర్యుడు నెత్తురు గడ్డలా లేడూమాసిపోయిన మూస పాత్రలుడైలాగులుయాక్టింగులూ మర్డరై పోయిన దృశ్య మయ్యా ఇదీ. డైరెట్రు అన్నాక కాస్తంత కళా పోసనుండాలయ్యా. ఉత్తినే కాపీకొట్టి కాలరెగరేస్తే డైరెట్రుకీదిగిపోయిన బ్యాట్రీకీ తేడా ఏటుంటది?’

        ‘ముత్యాలముగ్గు’ లో రావు గోపాలరావు ఫేమస్ విలనీ రీమిక్స్ అయిందని పై డైలాగు చూసి వాటి కోసం ఎవరైనా మార్కెట్లో పరుగులు దీస్తే, అంతకన్నా  కర్సయిపోవడం’ వుండదు! అది యాభైలో సగం పన్నెండున్నర’ బాపతు అమాయకత్వమవుతుంది. పై నివేదన నేటి అభిరుచిగల ప్రేక్షకుడి/ప్రేక్షకురాలి ఆవేదనే కావొచ్చు. ముత్యాలముగ్గు’ ని చూసిన కళ్ళతో నేటి సినిమాల్ని చూడలేకపోతున్న రోదనే కావొచ్చు. వాస్తవమెప్పుడూ కఠినం గానే వుంటుంది. ముత్యాలముగ్గు’ దీన్ని గుర్తు చేస్తూనే వుంటుంది.

సికిందర్


25, మార్చి 2021, గురువారం

1030 : టిప్స్

        చిన్న సినిమాకి దానిదైన సొంత జీవితం ప్రత్యేకంగా వుంటుంది. పెద్ద సినిమాల ఛాయల్ని దగ్గరికి కూడా రానివ్వదు. పెద్ద సినిమాలన్నీ ఒకే పోతలో పోసినట్టున్నా చెల్లిపోవచ్చు. చిన్న సినిమాలకి ఏ కథకా కథగా యూనిక్ క్రియేషన్ వుంటుంది. ఇదే వాటిని నిలబెడుతుంది. అదే సమయంలో చిన్న సినిమా ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్ట్రక్చర్ ని పాటిస్తే కథా కథనాలే కాదు, ప్రధాన పాత్ర ననుసరించి ఇతర పాత్రలు, పాత్ర చిత్రణలు, వాటి ప్రయాణాలు, చెప్పాలనుకున్న పాయింటూ సమస్తం ప్రభావ శీలంగా అర్ధవంతంగా వస్తాయి.         

స్ట్రక్చర్ వల్ల కాన్సెప్ట్ దానికదే లోతుపాతుల్లోకి వెళ్ళిపోతుంది. స్ట్రక్చరే పట్టని స్క్రిప్టుతో చిన్న సినిమా చెత్త బుట్ట దాఖలవుతుంది. బుట్ట దాఖలయ్యే సినిమాలే మెట్ట వ్యవసాయం చేస్తున్నాయి. చినుకు పడదు, చిల్లులు మాత్రం పడుతూంటాయి నిర్మాత జేబుకి. 

        రామ్ సింగ్ చార్లీ స్ట్రక్చర్ లో వున్న అర్ధవంతమైన కథ, కథనమూ. కథనంలో దృశ్యాల అల్లిక చాలా సార్లు మెస్మరైజ్ చేస్తుంది. ఉదాహరణకి వూరికెళ్ళి పోయిన హీరోయిన్ పాత్ర కజ్రీ అక్కడెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టు కన్పిస్తుంది. తీరా ఇటు ఓపెన్ చేస్తే భర్త పాత్ర రామ్ సింగ్ తోనే మాట్లాడుతున్నట్టు దృశ్యం థ్రిల్ చేస్తుంది. ఇంకో దృశ్యంలో బార్ దగ్గర ఒకడు అదే పనిగా వెక్కిరిస్తూంటే, పొట్టి లిల్లీపుట్ చూసి చూసి లాగిపెట్టి లెంపకాయ కొడతాడు. లెంపకాయ తిన్నవాడు పరమ కోపంగా చూస్తాడు. అంతే, దృశ్యం కట్ అయిపోతుంది. తర్వాతి దృశ్యంలో రామ్ సింగ్ ఇంటికి పరుగెత్తు కొచ్చి డబ్బులన్నీ తీసుకుని పరిగెడతాడు. 

        ఈ దృశ్యమేంటో కూడా అర్ధం గాకుండానే ఇదీ కట్ అయిపోతుంది. దీని తర్వాతి దృశ్యంలో  గాయపడిన లిల్లీపుట్ హాస్పిటల్లో పడి వుంటాడు. అక్కడికి డబ్బుతో వచ్చేస్తాడు రామ్ సింగ్. ఇలా మొదటి దృశ్యంతో సస్పెన్స్ క్రియేట్ చేసి, రెండో దృశ్యంతోనూ సస్పెన్స్ క్రియేట్ చేసి, రెండిటి అర్ధాలూ మూడో సీన్లో స్పష్టం చేస్తాడు దర్శకుడు. ఇదీ దృశ్య మాలిక అంటే. రొటీన్ మెలోడ్రామాని తొలగించే ఈ మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ కథనపు టెక్నిక్ వల్ల కథ చెడకుండా సినిమా నిడివి, షూటింగ్ సమయం, బడ్జెట్ ఎంతో ఆదా అయ్యాయి. దీన్ని గుర్తించి తెలుగులో ఎవరైనా పాటిస్తారా? సందేహమే. ఇలా కథని బట్టి దానిదైన యూనిక్- పర్సనలైజుడు డైనమిక్స్ తో కథనం చిన్న సినిమాకే సాధ్యమవుతుందని గమనించాల్సి వుంటుంది.

సికిందర్ 

 

23, మార్చి 2021, మంగళవారం

1030 : బాక్సాఫీసు


      త శుక్రవారం విడుదలైన నాల్గు సినిమాల పరిస్థితి అత్యంత దయనీయంగా వుంది. దేనికీ సరైన ప్రేక్షకులు లేరు. ఎంత అట్టహాసంగా పబ్లిసిటీ  చేసినా ప్రేక్షకులు స్పందించలేదు. ముఖ్యంగా మంచు విష్ణు -కాజల్ అగర్వాల్ లు నటించిన బిగ్ బడ్జెట్ మోసగాళ్ళు భారీ షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరు స్టార్స్ ని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. ఇక మరో క్రేజ్ వున్న హీరో కార్తికేయ చావు కబురు చల్లగా ని కార్తికేయ కోసం కూడా థియేటర్లకి వెళ్లలేదు యూత్. పోతే సాయికుమార్ కుమారుడు ఆది నటించిన  శశి సంగతి కూడా ఇంతే. చివరగా మరో మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ తేజ్ ఈ కథలో పాత్రలు కల్పితం  కనిపించకుండా గల్లంతయింది.

        నాల్గు సినిమాలకి దర్శకులు కొత్త వాళ్ళే. మోసగాళ్ళు కైతే అమెరికన్ దర్శకుడు! మోసగాళ్ళు శుక్ర శని ఆదివారం మూడు రోజులూ ఓవర్సీస్ కలుపుకుని అతి కష్టంగా కోటీ 32 లక్షలు వసూలు చేయగల్గింది. దీని బడ్జెట్ 50 కోట్లు! దీని ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్లు అని అంటున్నారు. బయ్యర్లకి భారీ నష్టం. నిర్మాతకి 20 కోట్లయినా  థియేటర్ కలెక్షన్లు రావాలి. ఇది అసాధ్యం.


        చావుకబురు చల్లగా బడ్జెట్ 9  కోట్లు. వసూళ్లు ఓవర్సీస్ కలుపుకుని 3 కోట్లు. భారీ నష్టం. శశి బడ్జెట్ 6 కోట్లు. వసూళ్ళు 34 లక్షలు. ఇక ఈ కథలో పాత్రలు కల్పితం అంకెలు లేవు. మోసగాళ్ళు’, చావుకబురు చల్లగా’, శశి  ఈ మూడూ 11 నుంచి 21 శాతం మాత్రమే ఆక్యుపెన్సీతో ప్రదర్శనలకి నోచుకున్నాయి.


        ఓటీటీల్లో విభిన్న కంటెంట్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు, తెలుగు సినిమాల కంటెంట్ గురించి తెలిసిందే కాబట్టి తప్పించుకు తిరుగుతున్నారని అర్ధం జేసుకోవాలి. జాతిరత్నాలు ని తప్పించుకోలేక పోతున్నారు. రెండో వారం కూడా ఓవర్సెస్ సహా స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.


***

22, మార్చి 2021, సోమవారం

1029 : సందేహాలు -సమాధానాలు

Q : మీ‌ బ్లాగు మొదటి సారి నిన్ననే చూసాను. నాదొక సందేహం. కథ చేస్తున్నపుడు కథలో లోటు పాట్లు అనేవి ఎలా తెలుస్తాయి? వివరించ గలరు. మంచి పుస్తకం సజెస్ట్ చేయగలరు.
మణి కుమార్
A :  రైటర్ అవాలనుకుప్పుడు ముందు రైటింగ్ నేర్చుకోవడం మీద పూర్తి దృష్టి పెట్టాలి. కథలు తర్వాత ఆలోచించ వచ్చు. సిడ్ ఫీల్డ్ పుస్తకం కొనుక్కున్నానన్నారు. బేసిక్స్ నేర్చుకోవడానికి అదొక్కటి చాలు. జోసఫ్ క్యాంప్ బెల్ భారీ గ్రంథం ఎందుకు కొన్నారు. అది హయ్యర్ స్టడీస్. బేసిక్సే నేర్చుకోకుండా హయ్యర్ స్టడీస్ దేనికి. ఏమర్ధమవుతుందని. ఏది పడితే అది కొనకండి. హాయిగా సిడ్ ఫీల్డ్ పుస్తకం ముందు పెట్టుకుని, 'శివ' సినిమా చూస్తూ స్ట్రక్చర్ ని స్టడీ చేయండి చాలు. ఒక ఆర్నెల్ల పాటు దీని మీదే వుండండి. అప్పుడా తర్వాత  కథలు  రాయడం నేర్చుకోవచ్చు. ఇంకేమీ చదవక్కర్లేదు, ఉన్నమతి పోతుంది. ఆర్ట్ ఫీల్డ్ అలాటిది. నాలెడ్జి ఎక్కువైపోతే ఎవరికీ అర్ధంగాని మేధావులై పోయి ఎవరికీ అర్ధం గాని కథలు చెప్తారు.

Q : సినిమాలకి ఐడియాలు బాగున్నా, సినిమాలు ఎందుకు ఫేయిల్ అవుతూ ఉంటాయి?  కొంచెం వివరించగలరు.
ఏపీజే, అసోసియేట్

A :  ఐడియాలు బావున్నాయని ఎలా తెలుస్తోంది? ఏం చూసి ఐడియా బావుందని అనుకుంటారు? ఏమిటి దాని సైన్సు? ఐడియాకి షీల్డుగా ముగ్గురు సెక్యూరిటీ గార్డు లుంటారు. 1. మార్కెట్ యాస్పెక్ట్, 2. ఆర్గ్యుమెంట్, 3. స్ట్రక్చర్. మార్కెట్ యాస్పెక్ట్ అది వేడి వేడిగా అమ్ముడుబోయే ఐడియాయేనా చూస్తుంది. అమ్ముడుబోయేదైతే దాని పొటెన్షియల్ ఏ స్థాయిలో వున్నదీ చూస్తుంది - లోకలా, గ్లోకలా? నాంది’, మోసగాళ్ళు వంటి ఐడియాలు గ్లోకల్ గా వెళ్లగల ఐడియాలైతే, లోకల్ స్థాయిలో తీసేశారు.

        ఇక ఆర్గ్యుమెంట్. ఇది కథకి సంబంధించి. అనుకున్న ఐడియాలో కథే వుందా, లేక గాథ వుందా చూస్తుంది. గాథ వుంటే సినిమాకి పనికిరాదు. ఐడియాలో ఆర్గ్యుమెంట్ కనిపిస్తే కథకి పనికొస్తుంది.

        చివరిది స్ట్రక్చర్. ఇది ఐడియాలో కన్పిస్తున్న కథకి స్ట్రక్చర్ వుందా చూస్తుంది. అందులో బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాలు కన్పిస్తున్నాయా చూస్తుంది. ఈ మూడూ నిర్దుష్టంగా వుంటే ఐడియా పనికొచ్చే ఐడియా అవుతుంది. మార్కెట్ యాస్పెక్ట్ + ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ = ఐడియా.      

 Q : రీసెంట్ గా జాతి రత్నాలు సినిమా చూశా. అసలు లాజిక్ లు ఏవీ పట్టించుకోకుండా కేవలం నటులను, వాళ్ళు చేసే కామెడీనీ నమ్ముకుని సినిమా తీశారు. అది పెద్ద హిట్ అయింది. ఇలా ప్రతిసారీ జరుగుతుందా? లేదా లక్ అనుకోవాలా? ఇలా స్ట్రక్చర్ గురించి పట్టించుకోకుండా తీసిన సినిమాలు హిట్ అవుతుంటే, ఇంక స్ట్రక్చర్ అని ఎక్కడైనా మాట్లాడితే వాళ్లు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి సినిమా సక్సెస్ వల్ల ఎవరికి నష్టం? ఎవరికి లాభం? కేవలం క్రియేటివ్ గా ఆలోచించి సక్సెస్ కొడితే సరిపోతుందా? ఇక స్ట్రక్చర్ ను పక్కన పెట్టాల్సిందేనా?
రమేష్, అసిస్టెంట్

A : పాయింటేమిటంటే, జాతిరత్నాలు లో కథే లేదు, లేనప్పుడు స్ట్రక్చర్ ప్రసక్తి ఎక్కడొస్తుంది. అందుకని  ఇలా కథే లేకుండా, మైండ్ లెస్ కామెడీగా, స్టాండప్ కమెడియన్ జోకులతో, జాతి రత్నాలు లాగా తీస్తూ వుంటే హిట్టవుతాయా అనడిగితే ఏం చెప్పాలి. సాంప్రదాయేతరంగా ఏది ఎలా హిట్టయిందని అన్పిస్తే, దాన్ని అలా తీయాలన్పిస్తే, తీయడమే. ఆపే వాళ్ళెవరూ లేరు.

        కథే లేని జాతిరత్నాలు లో స్ట్రక్చర్ చర్చ దేనికి? స్ట్రక్చర్ మీకు తెలిస్తే ఎక్కడా వాదన పెట్టుకోక మీ పని మీరు సైలెంట్ గా చేసుకుపోండి. స్ట్రక్చర్ ని పక్కన పెట్టాల్సిందేనా అని డిఫెన్స్ లో పడిపోతే స్ట్రక్చర్ నేర్చుకునే పని పెట్టుకోకండి. ఫ్లాపవుతున్న 90% సినిమాలూ స్ట్రక్చర్ వల్లే ఫ్లాపవుతున్నాయా? ఈ వారం తాజాగా ఫ్లాపయిన నాల్గూ స్ట్రక్చర్ వల్లే ఫ్లాపయ్యాయా? ఫిలిమ్ స్కూల్స్ లో స్ట్రక్చర్ పాఠాలు ఇక అవసరం లేదా? లక్షలకి లక్షలు బైట్స్ తో హాలీవుడ్ నుంచి స్ట్రక్చర్ వ్యాసాలు వెలువడుతూంటాయి. వాళ్ళు అనవసరంగా కష్టపడుతున్నారా? ఏ హాలీవుడ్ సినిమాల నుంచి కాపీకొడుతున్నారో అవి స్ట్రక్చర్ తో వుండే సినిమాలు కావా? కాబట్టి వాదోపవాదాలు అనవసరం. ఒకటి నిజం. అసిస్టెంట్స్ స్థాయిలో ఇప్పుడు స్ట్రక్చర్ స్పృహ పెరుగుతోంది. వీళ్ళని నిర్మాతలు, హీరోలు ప్రోత్సహించే రోజులొస్తే బావుంటుంది. స్ట్రక్చర్ విశ్వసనీయత గురించి అనవసర సందేహాలు వద్దు.

Q : కరోనా తరువాత ఆడియన్స్ కేవలం కామెడీలు, బలమైన ఎమోషన్స్ మాత్రమే కోరుకుంటున్నారు అనిపిస్తుంది ఈ మధ్య వచ్చిన సినిమాలు చూస్తుంటే. కరోనా తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఏమైనా మారింది అంటారా? వీటి గురించి మీ విశ్లేషణ చెప్పండి.
రవి, పి, అసోసియేట్

A : కామెడీలూ ఎమోషన్లూ ఎప్పుడూ వుండేవే గానీ, ఇప్పుడు నానాజాతి సస్పెన్స్ థ్రిల్లర్లు వెల్లువెత్తుతున్నాయి. ఓటీటీల్లో గ్లోబల్ కంటెంట్ కి ఎక్స్ పోజ్ అవుతున్న యూత్ థియేటర్స్ లో అలాటివి కోరుకుంటున్నారు. వయోలెంట్ అడల్ట్ మూవీస్, రోమాంటిక్ సస్పెన్స్ మూవీస్. మేకర్లు ఈ జానర్స్ ని అర్ధం జేసుకోకుండా ఏవిటేవిటో లేకి సస్పెన్స్ థ్రిల్లర్లు టోకున తీసేస్తున్నారు. కాలంతో కలిసివచ్చిన అవకాశంతో, యూత్ కోరుకుంటున్న కంటెంట్ ని క్వాలిటీతో అందించకుండా, ఆ మధ్య కాలం వరకూ విసుగెత్తించిన రోమాంటిక్ కామెడీలు తీసి పడేసి నట్టు, చీప్ సస్పెన్స్ థ్రిలర్లతో ఆసక్తిని చంపేస్తున్నారు. సమస్య ఎక్కడొచ్చిందంటే, మేకర్లకి లిమిటెడ్ జానర్లే తెలుసు. ఆ ఒకటి రెండు లిమిటెడ్ జానర్లే ప్రేక్షకులు చూడాలనుకుంటారు. ఎందుకు చూస్తారు, ఓటీటీ చూస్తారు.

Q : ఒక ఐడియా అనుకొని దాన్ని కథగా మలచాలి అనుకున్నప్పుడు అందుకోసం ఏమైనా మినిమం టైం పీరియడ్ పెట్టుకోవాలా? లేక ఐడియా మీద ఎక్కువ రోజులు పని చేయాలా? ఎందుకంటే ఒక్కోసారి ఎన్నిరోజులు ఆలోచించినా కథ రెడీ అవదు. అప్పుడు అరే ఈ ఐడియా మిస్ అవుతున్నామే అనుకుంటాం. ఒక్కోసారి ఐడియా బాగున్నా ఆ సమయానికి మనం కథ చేయలేకపోతాం. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? దీని గురించి వివరించగలరు.
వీడియార్, అసోసియేట్

A : పైవొక ప్రశ్నకి చెప్పిన విధంగా, ఐడియా నిర్దుష్టంగా కుదిరే వరకూ ఎన్ని రోజులైతే అన్ని రోజులు కుస్తీ పట్టాల్సిందే. ఐడియాగా కుదరనిది కథగా కుదరదు. బిందువుగా తెలియనిది సింధువుగా తెలియదు. ఎన్ని రోజులాలోచించినా కథ రెడీ అవడం లేదంటే ముందుగా ఐడియాని ఆలోచించక పోవడం వల్లే. ఐడియా ఆధారంగా బిగినింగ్ మిడిల్ ఎండ్ లతో సుస్పష్టమైన 20 పేజీల ( రైటింగ్ లో 50 పేజీలు) సినాప్సిస్ సిధ్ధం చేసుకోక పోవడం వల్లే. చేసే పని సిస్టమాటికల్ గా చేస్తే అయోమయం వుండదు.

Q : విడుదల అయిన 10 రోజుల్లోపే ఓటీటీ లోకి వచ్చిన గాలి సంపత్ అనే సినిమా చూశాను.  అసలు జానర్ మర్యాదను మంట కలిపి చాలా నిర్లక్ష్యంగా చేసిన స్క్రిప్టు అది అనిపించింది సినిమా చూస్తే. మీకు కుదిరితే అన్ని జానర్ మర్యాదల గురించి మా కోసం ఒక పిడిఎఫ్ ఫైల్ పెట్టగలరు. ఇప్పటికే పెట్టి ఉన్నట్లు అయితే మరొకసారి పోస్ట్ చేయగలరు.
సచిన్, జి, అసిస్టెంట్

A : ఆల్రెడీ ఒక పోస్టు పెట్టాం. ఇప్పుడు కుదిరేలా లేదు. సెర్చి బాక్స్ లో జానర్ మర్యాదలు అని తెలుగులో కొడితే వ్యాసాలు కనపడతాయి. అవి తీసుకోండి.

(కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. అవి వచ్చే వారం)

సికిందర్

  

21, మార్చి 2021, ఆదివారం

1028 : 'మోసగాళ్ళు' ఐడియా


(ఆదివారం Q&A సోమవారం వెలువడుతుంది)
      న్ని నదులూ వెళ్ళి సముద్రంలో కలుస్తాయన్నట్టు అన్ని జానర్లూ వెళ్ళి తెలుగులో మూస టెంప్లెట్ లో కలిసి పోతాయి. మోసగాళ్ళు తో ఈ ముచ్చట మరోసారి తీర్చుకున్నారు. హీరోయే కథా రచయిత, దీని అమెరికన్ దర్శకుడు ఇంకో రచయిత, మరో ఇద్దరు తెలుగు రచయితలు, ఇంకో మాటల రచయితా...ఇంత మంది కలిసి 50 కోట్ల బడ్జెట్ తో ఆశ్చర్య పర్చారు. సినిమా కథ రెండు వేల కోట్ల స్కామ్ గురించైతే, సినిమా సమస్య 50 కోట్ల బడ్జెట్ గురించి. రెండువేల కోట్ల స్కామే చేస్తున్నాం కాబట్టి 50 కోట్లు పోతే పోయాయనుకున్నారేమో. ఆ రెండు వేల కోట్లు ప్రేక్షకులకైనా పంచి పెడితే నష్టపరిహారంగా వుంటుంది. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ లు ఆ డబ్బు ఎక్కడ దాచేశారో తెలియదని ముగింపు ఇచ్చారు. ప్రేక్షకులు దాన్ని కనిపెట్టి దోచుకోవడం మీద ఇక దృష్టి పెట్టాలి.

        2016 లో ముంబాయిలో మీరా రోడ్ స్కామ్ అనే కాల్ సెంటర్ మోసం జరిగింది. కాల్ సెంటర్ ఉద్యోగులు అమెరికన్లని ఐఆర్ఎస్ అధికారులమని ఫోన్లు చేసి, ఆదాయపన్ను ఎగవేత దార్లు అంటూ వాళ్ళని బెదిరించి, రెండు వేల కోట్లు బకాయిల పేర దండుకున్నారు. దీని మాస్టర్ మైండ్ షాగీ రవీందర్ పశుహా అనే పాతికేళ్ళు నిండని వాడు. రెండేళ్ళూ ఇది సాగించాక పోలీసులకి దొరికిపోయాడు. ఈ కేసే మోసగాళ్ళు కథ కాధారం. షాగీ పాత్ర విష్ణు పోషించాడు. షాగీకో అక్క వుంది. అక్క పాత్ర కాజల్ పోషించింది.

        కాల్ సెంటర్ బాస్ నవదీప్ కి ఈ అక్కా తమ్ముళ్ళు సహకరించి, కాల్ సెంటర్ ఉద్యోగులతో కలిసి ఐఆర్ఎస్ పేరుతో అమెరికన్లని మోసం చేసి సంపన్నులై, ఎలా దొరికిపోయారన్నది కథ. ఈ ట్రూ క్రైమ్ (నిజంగా జరిగిన నేరం) జానర్ కథ ఐడియాలో లోడ్ అయివున్న శక్తివంతమైన బహుముఖ ప్రయోజనాల వైపు దృష్టి సారించకుండా, తెలిసిన, అలవాటయిన ఒకే ఒక మూస టెంప్లెట్ లో బంధించి ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ ఎగ్జిక్యూషన్ కి అయిన ఖర్చు 50 కోట్లు. అన్ని మరణ శిక్షలకీ ఉరి కంబమే అన్నట్టు, అన్ని జానర్ల కథలకీ అదే టెంప్లెట్- మూస టెంప్లెట్. ఈ మూసలో ఆశ్చర్య కరంగా దీని అమెరికన్ దర్శకుడు వచ్చి కలిసిపోవడం కొసమెరుపు. కలిసిపోయేట్టు చేస్తుంది తెలుగు మూస. క్వెంటిన్ టరాంటినో ని తీసుకొచ్చినా చేస్తావా చస్తావా అన్న పరిస్థితే వుంటుంది. మా పద్ధతిలో మా బాక్సాఫీసు పనితీరు ప్లస్ 50% అయితే, మీ పద్ధతిలో మీ బాక్సాఫీసు మైనస్ 90% కదా అని టరాంటినో గనుక అంటే, మా పద్ధతిలో మాకు మైనస్ 90% మాత్రమే కావాలని విజయవంతమైన పట్టుదల.

        జరిగిన ట్రూ క్రైమ్ ని పరిశోధన చేసి రాశామన్నారు. ఇది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో వున్నదే. డొమైన్లో వున్నది వున్నట్టు సినిమా తీస్తే పరిశోధన అవుతుందా? స్టోరీ ఐడియా అవుతుందా, ఎత్తి రాసిన వార్తా కథన మవుతుందా? డొమైన్లో వున్న విషయం కాక కొత్తగా ఏం చూపించారు, ఏం చెప్పారు?

        స్కామ్ చేసి దొరికిపోయిన షాగీ డబ్బెక్కడుందో పోలీసులు కనుక్కోలేకపోయారు. స్కామ్ చేసి దొరికిపోయిన అక్కాతమ్ముళ్ళు డబ్బెక్కడ దాచారో తెలియదని సినిమాలో కూడా షాగీ కేసు ముగింపే  ఇచ్చారు. ఇందులో పరిశోధన ఎక్కడుంది? స్టోరీ ఐడియా ఏముంది?

        ట్రూ క్రైమ్ కేసు అంతు చిక్కకుండా వుంటే, దాన్ని పరిశోధించి సమాధానమిచ్చేది ట్రూ క్రైమ్ జానర్. సంచలనం సృష్టించిన జెస్సికా లాల్ హత్య కేసుతో తీసిన  నో ఒన్ కిల్డ్ జెస్సికా తో దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా ఈ పనే చేశాడు. మరో సంచలనాత్మక ఆరుషి హత్య కేసు గురించి తల్వార్ తీసి ఈ పనే చేసింది దర్శకురాలు మేఘనా గుల్జార్. వీళ్ళిద్దరూ తేలని ఈ కేసుల్లో ఇలా జరిగుండ వచ్చని పరిశోధనాత్మక అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ రెండు సినిమాలూ చర్చనీయాంశాలయ్యాయి. హాలీవుడ్ బ్లాక్ ఢాలియా’, జోడియాక్ వంటి ట్రూ క్రైమ్స్ కూడా ఇలాటివే. మోసగాళ్ళు తో ఇలా నోటెడ్ అయ్యే అవకాశాన్నికోల్పోయారు మూస టెంప్లెట్ తో. దీని ఐడియాలో దాగున్న మార్కెట్ యాస్పెక్ట్ లాభాలని పట్టించుకోలేదు. ఐడియా - ఐడియా విశ్లేషణతో మార్కెట్ యాస్పెక్ట్, మార్కెట్ యాస్పెక్ట్ తో క్రియేటివ్ యాస్పెక్ట్ - ఇవంటే పడక పోతే ఇలాగే వుంటుంది.

***

         2. పై దృక్పథం ఒకటుంటే ఐడియాలో లోడ్ అయి వున్న బుల్లెట్ ప్రయోజనాలు పూర్తయినట్టా? కాదు. ఈ స్కామ్ లేవనెత్తుతున్న ప్రశ్నలు తీవ్రమైనవి. దేశ ప్రతిష్టకి సంబంధించి కూడా. షాగీ కోటి 20 లక్షల మందిని అమెరికన్లని బెదిరించాడు, 6,400 మంది నుంచి రెండువేల కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నాడు. ముంబాయిలోనే గాక ఇంకో నాల్గు నగరాల్లో కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి, 700 మంది ఉద్యోగులతో కాల్స్ చేయించాడు. ఉద్యోగులు ఐఆర్ఎస్ తరపునే తమ సంస్థ పని చేస్తోందన్న నమ్మకంతో వుండిపోయారు. విలాసవంతమైన జీవితం గడిపాడు. గర్ల్ ఫ్రెండ్ బర్త్ డేకి రెండున్నర కోట్ల రూపాయల బహుమతి ఇచ్చాడు.

        స్కామ్ ఆలస్యంగా అమెరికాలో ఐఆర్ఎస్ కి, ఎఫ్బీఐ కీ లీకై ముంబాయి పోలీసుల్ని ఎలర్ట్ చేశారు. ముంబాయి పోలీసులు పట్టుకోబోతే దుబాయి పారిపోయాడు షాగీదుబాయి నుంచి పట్టుకొచ్చి లోపలేస్తే, బెయిల్ మీద విడుదలై దర్జాగా తిరుగుతున్నాడు షాగీ. రూపాయి కూడా షాగీ నుంచి వసూలు చేయలేకపోయారు. స్కామ్ తో సంబంధమున్న అతడి అక్కని అరెస్ట్ చేశారు. 700 ఉద్యోగుల్నీ అదుపులోకి తీసుకుని చాలా మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళల్లో ఉద్యోగినులు కూడా వున్నారు.  

        స్కామ్ వల్ల అమెరికన్లే కాదు, ఇండియాలో 700 మంది ఉద్యోగులూ మోసపోయారు. చేస్తున్నది స్కామ్ అని తెలియకుండానే కేసుల్లో ఇరుక్కున్నారు. ఈ బాధితుల పరిస్థితి ఏమిటి? వీళ్ళ కథ లేమిటి? ఇలా మోసపోయే వాళ్ళు ఏం నేర్చుకోవాలిందులోంచి? ఇది చూసి ప్రేక్షకులు ఏం నీతి గ్రహించాలి? స్కామ్ చేసిన వాడు దర్జాగా తిరుగుతున్నాడు. మోసగాళ్ళు ని తమిళ మలయాళ హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తామని చెప్పారు. కానీ మార్కెట్ యాస్పెక్ట్ ఏది? జాతీయ సమస్య అయిన దీనిగురించి జాతీయ స్థాయికి తీసికెళ్ళే అవకాశాన్నికూడా కోల్పోయారుగా- తెలుగుకే పరిమితమైన మూస టెంప్లెట్ తో?

***

        3. ఇక వేల మంది అమెరికన్ బాధితుల పరిస్థితి... మీ ఇంటికి మా అఫీషియల్స్ వస్తారు, వీధిలో మీ పరువు తీస్తారు, మూడు నెలలు జైల్లో వేస్తారు, మీ కార్డులన్నీ రద్దు చేస్తారని బెదిరిస్తూంటే, ఏడ్చి అలా చేయవద్దని హీనంగా బతిలాడుకున్నారు అమెరికన్లు. ఈ బాధితుల పరిస్థితేమిటి? కథ లేమిటి? ఇలా ఫూల్స్ అవకుండా ఏం నేర్చుకోవాలిందులోంచి?  ఇలాటి సైబర్ క్రైమ్స్ కి బకరాలవుతున్న వాళ్ళని చూసి ప్రేక్షకులేం నేర్చుకోవాలి?  మోసగాళ్ళు ని ఇంగ్లీషులో అమెరికాలో కూడా విడుదల చేస్తామన్నారు. ఇందులో దానికి తగ్గ మార్కెట్ యాస్పెక్ట్ ఏది? మా వోడు మీ వాళ్ళని ఫూల్స్ చేసి దోచుకుంటే మీరేం చేయలేక పోయారనీ, వాణ్ణి  అమెరికాకి లాక్కొచ్చి జైల్లో వెయ్యలేక పోయారనీ, అమెరికాకి చెబుతున్న అర్ధంలో సినిమా వుంటే, ఏమంత బావుండదేమో? అక్కడి ఇండియన్ల గురించి కూడా ఆలోచించాలేమో?

        ఈ కథలో హీరో చేసిందంతా చేసి, పోలీసులు పట్టుకోబోతూంటే పరివర్తన వచ్చేస్తుంది. చాలా తప్పు చేశానని బాధపడిపోతాడు. పోలీసులకి దొరక్కుండా దుబాయి పారిపోతానంటాడు. అక్క వద్దంటుంది. పోలీసులకి లొంగిపోయి హేపీగా బేడీలు చూపిస్తాడు. పది నెలలే జైలు శిక్ష పడి విడుదలై వచ్చేస్తాడు. దాచుకున్న డబ్బుతో అక్కాతమ్ముళ్ళు ఫుల్ - ఫుల్- ఫుల్ హేపీ! ఈ ఐడియాకి లోకల్ గానైనా మార్కెట్ యాస్పెక్ట్ గనుక వుంటే, 2 వేల కోట్లకి 50 కోట్లు కలిపి ఇచ్చేయచ్చు. మనకి 5 రూపాయలు మిగిలినా చాలు. మినీ సిగరెట్ వస్తుంది. మస్తుగా దమ్ము కొట్టొచ్చు.

***

        4. ట్రూ క్రైమ్ జానర్ కి ప్రత్యేక క్రియేటివ్ యాస్పెక్ట్ వుంటుంది. ఐడియాతో పైన చెప్పుకున్న నిజమేంటో చెప్పగల దృక్పథంతో బాటూ, దర్శకుడి పర్సనల్ యాంగిల్ వుంటుంది. నేరస్థుణ్ణి చూపిస్తూనే, అతడికి బలైన బాధితుల గురించీ చూపించే యాంగిల్ వుంటుంది. అప్పుడే ఇతర థ్రిల్లర్స్ కి తేడాగా వుంటుంది. పన్ను ఎగవేతలూ, చిన్న చిన్న నేరాలూ ట్రూ క్రైమ్స్ జానర్ కి పనికి రావు. హత్యలూ బ్యాంకు దోపిడీలూ వంటివి వుండాలి. జానర్ మర్యాదలు
క్రైమ్, ఇన్వెస్టిగేషన్, యాక్షన్, డ్రామా, టెన్షన్, హై రిస్కూ కలిసి వుండాలి. ఒక ట్రూ క్రైమ్ కేసు దొరికింది కదాని దాన్ని మాత్రమే రీసెర్చి చేసేస్తే సరిపోదు. స్క్రిప్టు విధివిధానాల కోసం కూడా జానర్ రీసెర్చి చేసుకోవాలి. అలా వచ్చిన ఇతర సినిమాల్ని జానర్ మర్యాదల కోసం పరిశీలించాలి.

        స్కాంని బయట పెట్టి విలన్ని పట్టుకునే కథల్లో ఇక నావెల్టీ లేదు. ఇది చాలా అరిగిపోయిన టెంప్లెట్. ఆ మధ్య హిందీలో ఇమ్రాన్ హాష్మి తో  వై చీట్ ఇండియా’ అనే ట్రూ క్రైమ్ వచ్చింది. ఇందులో హీరో డబ్బున్న విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకునితెలివైన పేద విద్యార్ధులకి కొంత డబ్బిచ్చి ఎంసెట్ పరీక్షలు రాయించిడబ్బున్న విద్యార్ధుల్ని పాస్ చేయిస్తూంటాడు. ఇతణ్ణి ఎలా పట్టుకుంటారనేదే కథ. ఈ హీరోని పట్టుకుంటే ప్రేక్షకుల కేంటిపట్టుకోకపోతే ఏంటి?

        హీరో అవతల తను టార్గెట్ చేసిన పేద, ధనిక వర్గాల విద్యార్ధుల వైపు నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల వైపు నుంచీ కూడా కథ చెప్తే పట్టించుకుంటారు ప్రేక్షకులు. దర్శకుడు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో వున్న, తెలిసిన కేసునే పట్టుకుని అలాగే తీసేశాడు. ఫ్లాపయింది. పేరెంట్స్ తమ పిల్లల్ని అమెరికా చేర్చాలని కలలు గని చేసే పనులెలా వుంటాయో  చూడండని కథా ప్రారంభంలోనే చెప్పి మర్చిపోయాడు దర్శకుడు.

***
        5. నిఖిల్ నటించిన అర్జున్ సురవరం’ అనే ట్రూ క్రైంలో కూడా ఇంతే. నిఖిల్ నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ తో జాబ్ చేస్తున్నాడని పోలీసులు పట్టుకున్నాక, ఈ స్కామ్ చేస్తున్నదెవరో పట్టుకోవడానికి బయల్దేరతాడు. ఈ పాత టెంప్లెట్ ఫ్లాపయింది. స్కామ్ ఎవరు చేస్తే ఏమిటి, ఎవర్ని పట్టుకుంటే ఏంటి?

        హీరో నిందితుడిగా పట్టుబడితే ఎవరిక్కావాలినిర్దోషిగా నిరూపించుకుంటే  ఎవరిక్కావాలిఈ కథలు ఎప్పటివి? నకిలీ సర్టి ఫికెట్లు కొంటున్న స్టూడెంట్స్ అనేకం వుంటున్నారు. వాళ్ళ జీవితాలతో దీని విష పరిణామాలు చూపిస్తే ట్రూ క్రైమ్ జానరవుతుంది. నకిలీ సర్టిఫికేట్లు కొనే స్టూడెంట్స్ నైతికసామాజిక స్థితి ఏ గతి పడుతుందో హెచ్చరిస్తే ప్రయోజనముంటుంది. ఉత్తరప్రదేశ్ లో వేల మంది ఇలాగే మోసపోయి, నకిలీ సర్టి ఫికేట్లతో టీచర్ ఉద్యోగాలు చేస్తున్నారని దొరికిపోయారు. ఇప్పుడు వీళ్ళ గతేమిటిడ్రమెటిక్ క్వశ్చన్ ఇదీ.

***
        6. మోసగాళ్ళు లో అక్కాతమ్ముళ్ళ జీవితాల్ని చిన్నప్పట్నుంచీ చూపించే కాలం చెల్లిన టెంప్లెట్ తో ఎత్తుకున్నారు. పేదరికంతో ఆ కష్టాలూ పేరెంట్స్ కన్నీళ్లూ చూపించుకొచ్చారు. పెద్దవాడై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవుతాడు హీరో. ఒక స్ట్రీట్ బాక్సింగ్ లో పాల్గొనే టెంప్లెట్ ఎంట్రీతో జాబ్ చేస్తూంటాడు. అక్క ఎకౌంటెంట్ గా వేరే చోట వుంటుంది. ఆమెని డబ్బుకోసం వేధించే భర్త వుంటాడు. ఇతణ్ణి వదిలించుకోవడానికి డబ్బు కావాలి. ప్లస్ పేరెంట్స్ కి రిచ్ లైఫ్ ఇవ్వాలి. అందుకని స్కామ్ కి ఒప్పుకుని, అమెరికన్లని స్కామ్ చేస్తారు. దొరికిపోతారు. దొరికిపోయాక హీరో మాత్రమే జైలు కెళ్తాడు. సీను తిప్పితే, పది నెలల్లో శిక్ష ముగించుకుని విడుదలైపోయి - హేపీ ఎండింగ్ ఇస్తాడు- దాచుకున్న డబ్బుని అక్కతో కలిసి ఎంజాయ్ చేయడాయినికి!

 దోచుకున్న డబ్బు సరేందర్ చేయకుండా మారిపోయానని  జైలుకెళ్ళడ మేమిటి. విడుదలై వచ్చి ఆ డబ్బుని ఎంజాయ్ చేయడ మేమిటి! ఇదేం కథ!

        ఈ కథలో మూసఫార్ములా సినిమాల్లో చూసి చూసి వున్న ఇంకా చాలా టెంప్లెట్ సీన్లున్నాయి. పేరెంట్స్ ని రిచ్ బంగళాకి తీసుకొచ్చి చూపించే అరిగిపోయిన రొటీన్ సీను సహా.        హీరో నేరం చేయాడానికి పేదరికం, ఇతర కష్టాలూ అనే టెంప్లెట్ జస్టిఫికేషన్. కానీ స్కామ్ చేసిన షాగీ అనేవాడు చిన్నప్పట్నుంచే మోసగాడు. మోసాలు చేయడమే వృత్తి. జస్టిఫికేషన్ లేదు. జస్టిఫికేషన్ ని చట్టం ఒప్పుకోదు. డ్రీమ్ వరల్డ్ టెంప్లెట్లు రియల్ వరల్డ్ లోకి రావాల్సిన టైమ్ వచ్చేసింది. హీరో నేరాలు చేశాడు, కానీ మంచి కోసమే చేశాడన్న బుజ్జగింపుల కిక లొంగరు ప్రేక్షకులు. రియల్ వరల్డ్ కావాలి.

        మెడికల్ సీట్ల స్కామ్ మీద ఇటీవలి హిందీ హాలాహల్ అనే ట్రూక్రైమ్, రియల్ వరల్డ్ నే చూపిస్తుంది. మాఫియాలే గెలుస్తారు, కూతుర్ని పోగొట్టుకున్న డాక్టర్ అయిన బాధితుడు గెలవడు. మిగిలిన  కుటుంబాన్ని కాపాడుకోవాలంటే, మాఫియా ఇస్తానన్న డబ్బుతో మంచి హాస్పిటల్ కట్టుకుని సెటిల్ అవాల్సిందే. మాఫియా మీద పోరాడే ఎస్సై హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. లారీ చక్రాల కిందికి వచ్చేసి. ఎస్సై అనేవాడు పై అధికారులూ నాయకులూ చెప్పేది విని, లంచాలతో ఉద్యోగం చేసుకోవాలే గానీ, ఠాట్ ఠీట్ బాధితుడికి న్యాయం చేస్తా, కనిపించని నాల్గో సింహాన్ని నేనూ అంటూ ఓవరాక్షన్ చేస్తే, ఎంత హీరో అయినా కన్పించకుండా పోతాడు. రియల్ వరల్డ్ సెటప్.   

        అన్ని నేరాలు చేసిన హీరో ఇంకా మారిపోయే టెంప్లెట్టా? జస్టిఫికేషన్ కోసం మార్పు అనే డ్రీమ్ వరల్డా? దేశంలో, బయటా అంత మందిని బాధించిన వాణ్ణి తీసి కెళ్ళి అమెరికా జైల్లో పడేసి ఇండియా పరువు నిలబెట్టక?

        హీరో క్రిమినల్ పాత్ర వేస్తే క్రిమినలే. క్రిమినల్ గా మారితే ఏమేం జరుగుతాయో కఠిన శిక్ష సహా చూపిస్తే ఎక్కువ నమ్మి ఆలోచనలో పడతారు ప్రేక్షకులుఅలాటి పన్లు తాము చేయకుండా జాగ్రత్త పడతారు. అదే శిక్ష పొందిన క్రిమినల్ గా విలన్ పాత్రని చూపిస్తే ఏ ప్రభావమూ వుండదు. ఇలా ఈ వాస్తవ కథతో మంచు విష్ణు వాస్తవం కాని డ్రీమ్ వరల్డ్ లో బుజ్జగిస్తూ వుండిపోయాడు.

        ఇక సినిమాలో ఏ సీన్లు ఎందుకొస్తున్నాయో, స్ట్రక్చర్ ఏమిటో అంతుబట్టకుండా, చప్పగా సాగుతుంది. కనీస స్థాయి థ్రిల్లర్ లక్షణాలు కూడా లేకుండా. డైలాగులు మాస్ సినిమా డైలాగులుగా వుంటాయి, జానర్ స్పెసిఫిక్ గా కాకుండా. అమెరికన్ దర్శకుడు విషయం లేని దీనికి కెమెరాతో చీకాకు పెట్టే టెక్నికల్ హంగామా చేస్తూ వుండి పోయాడు. మూస టెంప్లెట్ సినిమాలు బాక్సాఫీసు సినిమాలు కావు, అవిప్పుడు బి గ్రేడ్ సినిమాలవుతాయి. 

సికిందర్