రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, డిసెంబర్ 2021, శుక్రవారం

1106 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : సుకుమార్
తారాగణం : అల్లు అర్జున్
, రశ్మికా మందన్న, అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్, అజయ్ ఘోష్, ధనుంజయ్ తదిరతులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
, ఛాయాగ్రహణం : మిరోస్లా కూబా
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ ఎర్నెని
, వై. రవిశంకర్
విడుదల : డిసెంబర్ 17
, 2021

***

        ల్లు అర్జున్ రెండు భాగాల పుష్ప మొదటి భాగం పుష్ప -ది రైజ్ విడుదలైంది. ఈ నెల నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత విడుదలైన భారీ బడ్జెట్ మాస్ మూవీ ఇదే. అల్లు అర్జున్- సుకుమార్ల కాంబినేషన్ తిరిగి దశాబ్దం తర్వాత రావడంతో ఎంత బావుందో చూద్దాం...

కథ

పుష్ప అలియాస్ పుష్పరాజ్ (అల్లు అర్జున్) ఇంటిపేరు లేని, ఫలానా తండ్రికి పుట్టానని చెప్పుకోలేని పరిస్థితుల్లో పెరిగి, శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ లో కూలీగా చేరతాడు. పోలీసుల బారి నుంచి స్మగ్లింగ్ ని తప్పించగల నేర్పుతో సిండికేట్ లీడర్ కొండారెడ్డి (అజయ్ ఘోష్) మెప్పుపొంది, చిన్న షేర్ తో భాగస్థుడవుతాడు. కొండారెడ్డి ఈ సరుకు సిండికేట్ సుప్రీమ్ మంగళం శీను (సునీల్) కి చేరవేస్తే, శీను చెన్నైలో ఇంటర్నేషనల్ స్మగ్లర్ మురుగన్ కి అమ్మి ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు.

        ఇలా వుండగా పుష్ప పాల వ్యాపారం చేసే శ్రీవల్లి (రశ్మికా మందన్న) తో ప్రేమలో పడతాడు. ఈ ప్రేమ వ్యవహారాలు సాగిస్తూండగా, శీను చెన్నైలో ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న విషయం పుష్పకి తెలుస్తుంది. ఇది కొండారెడ్డికి చెప్తే, వెళ్ళి శీనుని ఎక్కువ డబ్బు డిమాండ్ చేయమంటాడు కొండా రెడ్డి. అలా వెళ్ళిన పుష్పకి శీను దగ్గర వాటాలు కుదరక, నేరుగా మురుగన్ కే సరుకు అమ్ముకుంటామని సవాలు చేస్తాడు. దీంతో శీనుతో ఘర్షణ ప్రారంభంవుతుంది...

        ఈ ఘర్షణ ఎక్కడికి దారితీసింది? ఈ ఘర్షణలో మంగళం శీను ఏమయ్యాడు? అతడ్ని భార్య దాక్షాయణి (అనసూయ) ఎందుకు శిక్షించింది? పుష్పకి కొండా రెడ్డి తోనే శతృత్వం ఎందుకు రగిలింది? కొండారెడ్డి ఏమయ్యాడు? పుష్పతో నిశ్చితార్ధం ఆగిపోయిన శ్రీవల్లి ఏమైంది? ఈ మొత్తం వ్యవహారంలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫవాద్ ఫాజిల్) పాత్రేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
గ్యాంగ్ స్టర్ జానర్లో రెగ్యులర్ టెంప్లెట్ కథ. పరిస్థితుల బాధితుడైన సామాన్యుడు నేర ప్రపంచంలోకి ప్రవేశించి బాస్ కింద పని చేస్తూ, బాస్ స్థానాన్నే ఆక్రమించి లీడర్ గా ఎదిగే రొటీన్ కథ. పుష్ప- ది రైజ్ అని టైటిల్ లోనే కథ తెలుస్తోంది. ఇటీవలే రోమాంటిక్ లో కూడా ఈ టెంప్లెట్ నే వాడారు. పైగా పుష్ప రెండు భాగాల కథ కావడంతో ఈ మొదటి భాగమంతా రైజ్ గురించే వుంటుంది. రెండు భాగాలు కలిపి స్ట్రక్చర్ చూసినప్పుడు రైజ్ తో బిగినింగ్ భాగమే ఇప్పుడు చూస్తాం. రెండో భాగంలోనే మిడిల్, అంటే కథని  చూడగలం. దాని ఎండ్ తో ముగింపూ చూడగలం.

        కాబట్టి ఈ మొదటి భాగం రాబోయే రెండో భాగానికి ఉపోద్ఘాతం మాత్రమే. బాహుబలి రెండు భాగాల కథ కూడా ఈ విభజనతోనే వుంటుంది. అందుకని కథని ఆశించకుండా రెండో భాగంలో కథకి ఉపోద్ఘాతాన్నీ, పాత్రల పరిచయాన్నీ మాత్రమే ఈ మొదటి భాగంలో చూడాల్సి వుంటుంది. ఇంకో దృష్టితో చూస్తే కాన్ఫ్లిక్ట్ లేదు కాబట్టి ఇది గాథలా కూడా వుంటుంది. ఈ మొదటి భాగం చివర్లో వచ్చే ఎస్పీ షెకావత్ పాత్రతో కాన్ఫ్లిక్ట్ రెండో భాగంలోనే ప్రారంభమవుతుందన్న మాట. అంటే అదే కథ, అసలు కథ అవుతుంది.

నటనలు - సాంకేతికాలు

అల్లు అర్జున్ పాత్రలో అల్లు అర్జున్ కాకుండా పాత్ర మాత్రమే కన్పించేలా చేసే అపూర్వ నటన ఇది. ఇలాటి డీ గ్లామ్ పాత్ర ఒప్పుకోవడం నటుడుగా ఎదగడానికే. పైగా పానిండియా ప్రేక్షకులకి, ఇతర పరిశ్రమల వర్గాలకీ తనేమిటో చెప్పుకునే అవకాశం. భాష, యాస, భంగిమ (మహాసముద్రం లో రావురమేష్ గూని పాత్రలా ఎడం భుజం పైకి లేచి వుండే అవకరం) ఒక సర్ప్రయిజ్ ప్రెజెంటేషన్. కూలీ అంటే బయట మనకి కన్పించే కూలివాడే అతడిలో కన్పిస్తాడు. పేరు చెప్పక పోతే అల్లు అర్జున్ అని తెలియడం కష్టం. ఒక స్టార్ గా ఆర్ట్ సినిమా పాత్రని గా కమర్షియల్ సినిమాలో చూపించి ఒప్పించడం సాహసమే.

        ఈ మొదటి భాగమంతా ది రైజ్ అని టైటిల్లో వున్నట్టు పాత్ర ఎదుగుదల గురించే. ఈ ఎదుగుదల క్రమాన్ని శరీర భాష కూడా క్యారీ చేస్తుంది మొదటి సీను నుంచీ చివరి వరకూ  తగ్గేదే లే... అన్న ఊత పదంతో. కూలీ వాడుగా కన్పించే మొదటి సీను నించీ కాలు మీద కాలేసుకుని కూర్చునే అలవాటు వుంటుంది. ఈ శరీర భాష ఎదగాలన్న మనస్తత్వాన్ని పట్టిస్తూంటుంది. యజమాని ఐదు లక్షలు జీతమిస్తా నంటే, నాల్గు శాతం పర్సెంటేజీ  ఇమ్మంటాడు. అలా తీసుకుంటే లక్ష తగ్గుతుందంటే ఫర్వాలేదంటాడు. ఐదు లక్షలు జీతం తీసుకుంటే యజమాని కింద కూలీ వాడుగా వుంటాడు. లక్ష తగ్గినా పర్సెంటేజీ తీసుకుంటే పార్టనర్ అవుతాడన్న బిజినెస్ మైండ్ అతడిది. మొదటి పేమెంటుతో కారు కొనేసుకుని కూలీ కొస్తాడు. ఇలా క్యారక్టర్ ఆద్యంతం చాలా యాక్టివ్ గా, మాస్ ప్రేక్షకుల్ని ఎడ్యుకేట్ చేసేలా, కలర్ఫుల్ గా వుంటుంది. ఇందుకు దర్శకుడు సుకుమార్ ని మెచ్చుకోవాలి. క్యారక్టరైజేషనంటే ఏమిటో చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో చూస్తాం.

        పాటల్లో కూడా స్టెప్పు లేస్తూ రెగ్యులర్ అర్జున్ కన్పించడు. స్వాతిముత్యం లో కమల్ హాసన్ రాధికతో డ్యూయెట్ లో ఎలా చేస్తాడో- అర్జున్ ఎడం  భుజం పైకి లేచి వుండే అవకరంతో అలా గమ్మత్తుగా కన్పిస్తాడు. సెకండాఫ్ లో తన గ్రూప్ సాంగ్ లోకూడా అవకారాన్ని మెయింటెయిన్ చేస్తాడు. రష్మికతో రెండు డ్యూయెట్లలో,  సమంతాతో ఐటెమ్ సాంగ్ లో కూడా రెగ్యులర్ అర్జున్ కన్పించడు. ఇక యాక్షన్ సీన్స్ చెప్పాల్సిన పనిలేదు. సెకండాఫ్ లో చావుకి దగ్గరై చేతులు కట్టేసిన నిస్సహాయ స్థితిలో, ఆవకరాన్ని మెయింటెయిన్ చేస్తూ వాటర్ స్కీముతో యాక్షన్ సీను సినిమాలో వైరల్.హీరోయిన్ రశ్మికతో రూరల్ రోమాన్స్ కూడా సెకండాఫ్ వరకూ ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ మూవీ విషయమున్న క్యారక్టర్ తో అల్లు అర్జున్ ఒన్ మాన్ షో ఎలాటి ఓవరాక్షన్ లేకుండా.

        రశ్మిక రెగ్యులర్ టెంప్లెట్ పాత్రలో రూరల్ క్యారక్టర్ గా ఓకే. విలన్ గా కమెడియన్ సునీల్ కూడా ప్రయోగం చేశాడు. మంగళం శీను పాత్రలోని క్రూరత్వాన్ని కూల్ గా పోషించి సక్సెస్ అయ్యాడు. అజయ్ ఘోష్ కూడా ఓకే. మంగళం శీను భార్యగా అనసూయ ఫస్టాఫ్ అంతా బ్యాక్ గ్రౌండ్ లో వుంటూ సెకండాఫ్ లో షాకింగ్ షేడ్ చూపిస్తుంది. ఇక చివరి ఇరవై నిమిషాల్లో ఎస్పీగా వచ్చే మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ సైకో పాత్రలా ఏం చేయబోతున్నాడో సస్పెన్స్ ని క్రియేట్ చేస్తాడు. రెండున్నర గంటల ఈ సుదీర్ఘ ఉపోద్ఘాతానికి రిలీఫ్ గా సెంట్రల్ ఎట్రాక్షన్ అవుతాడు తన యాక్టింగ్ స్కిల్స్ తో.

        సాంకేతికంగా అడవుల నేపథ్యంలో ఎర్ర చందనం చెట్ల నరికి వేత, స్మగ్లింగ్, యాక్షన్ సీన్స్ మొదలైనవి ఉన్నతంగా వున్నాయి. కాకపోతే దేవీశ్రీ ప్రసాద్ బిజీఎం పూర్ క్వాలిటీ తో వుంది. రసూల్ పోకుట్టి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా హైలైట్ కావు. రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ ల యాక్షన్ కొరియోగ్రఫీ కథ లోనేని థ్రిల్ ఎలిమెంట్ ని భర్తీ చేస్తాయి. మొత్తం ప్రొడక్షన్ డిజైన్ కి విజువల్ క్వాలిటీతో కెమెరాలో బంధించాడు  మిరోస్లా కూబా. దేవీశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలన్నీ బావున్నాయి. వైరల్ అయిన సమంతా ఐటెమ్ సాంగ్ మాత్రం చిత్రీకరణలో అంత కిక్కిచ్చేలా లేదు.

        పుష్ప ఈ మొదటి భాగం కథ ప్రారంభంకాని మొదటి భాగం లాగే తీయడం వల్ల విషయపరంగా చెప్పుకో దగ్గది కాదు. అల్లు అర్జున్ పాత్రే ఈ సినిమా, కథ కాదు. కథ కోసం రెండో భాగం చూడాలి. విషయపరంగా ఈ మొదటి భాగాన్నే నిలబెట్టే క్రియేటివ్ యాస్పెక్ట్ కి అవకాశమున్నా దాన్ని ఉపయోగించుకోలేదు. సినిమాని రెండుగా విడగొట్టడంతో రిజల్టూ  రేటింగ్స్ కూడా అలాగే వస్తున్నాయి...పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్! అన్న డైలాగు కంటెంట్ కి కూడా వర్తించక పోవడంతో.

—సికిందర్

13, డిసెంబర్ 2021, సోమవారం

1105 : రివ్యూ!

 

రచన - దర్శకత్వం : సుజనా రావు
తారాగణం : శ్రియా శరన్‌
, నిత్యా మీనన్‌, ప్రియాంకా జ‌వల్క‌ర్, శివ కందుకూరి, బిత్తిరి సత్తి తదితరులు 
సంగీతం : ఇళయరాజా, ఛాయాగ్రహణం : వీఎస్ జ్ఞాన శేఖర్
బ్యానర్స్ : క్రియా ఫిలిం కార్పొరేషన్
, కాళీ ప్రొడక్షన్స్
నిర్మాతలు  : కె రమేష్
, పి వెంకీ, వీఎస్ జ్ఞాన శేఖర్
విడుదల : డిసెంబర్‌
10, 2021
***

          త మూడు నెలలుగా ముగ్గురు కొత్త యువ దర్శకురాళ్ళు తెలుగు వెండితెర మీది కొచ్చారు : గౌరీ రోణంకి (పెళ్ళి సందడి), లక్ష్మీ సౌజన్య (వరుడు కావలెను), సుజనా  రావు (గమనం). తొలి ఇద్దరివీ కమర్షియల్ ప్రయత్నాలైతే, సుజనా రావుది సామాజిక స్పృహతో ఆఫ్ బీట్ ప్రయత్నం. ఆహ్వానించ దగ్గది. ఇలాటి ప్రయత్నాలకి పాపులర్ నటులు, సాంకేతికులు తోడైతే ప్రేక్షకుల్లోకి వెళ్ళే అవకాశాలెక్కువ వుంటాయి. గమనం కి శ్రియా శరణ్, నిత్యా మీనన్, సుహాస్, చారు హాసన్, బిత్తిరి సత్తిలతో బాటు, రచయిత సాయినాధ్ బుర్రా, సంగీత దర్శకుడు ఇళయ రాజా, ఛాయా గ్రాహకుడు జ్ఞాన శేఖర్ ల వంటి ప్రముఖుల సమ్మేళనంతో ప్యాకేజీ ట్రెండీగా వుంది. తెల్లారి పోయిన ఆర్ట్ సినిమాలని  బాలీవుడ్ స్టార్స్ తో తీసి ట్రెండ్ లో కి తీసుకొచ్చి- క్రాసోవర్ సినిమా అనే కొత్త కేటగిరీని సృష్టించిన శ్యామ్ బెనెగల్ బాట ఎవరికైనా మంచిదే.

        బాటలో కొత్త యువ దర్శకురాలు సామాజిక స్పృహతో హైదరాబాద్ లో వరదలు అనే ఇంత వరకూ ఎవరూ ప్రయత్నించని యూనిక్ కాన్సెప్ట్ ని తీసుకుంది. ఈ మధ్య నూటొక్క జిల్లాల అందగాడు’, కొండపొలం’, అద్భుతం’, స్కై లాబ్’, లక్ష్య ...ఇవి కూడా యూనిక్ కాన్సెప్టులే. ఇవన్నీ కూడా పాత మూస ఫార్ములా ధోరణులతో కాన్సెప్టులకి అన్యాయం చేసి అపజయాల సంఖ్య పెంచినవే. గమనం కూడా ఇదే బాటలో వెళ్ళిందా, బెనెగల్ తరహా సమ్మోహనకర ప్యాకేజీ వుండి కూడా? యూనిక్ అంటేనే అసాధారణమైన, అరుదైన, ప్రత్యేకమైన అని అర్ధం. ఈ అర్ధాన్ని గమనం అయినా నిలబెట్టుకుందా? లేక ఆకాశం నుంచి దిగివచ్చినా మన తెలుగు సినిమాల కాన్సెప్టులింతే, గమ్యమింతే అన్పించుకుందా? ఈ ప్రశ్నలకి ఏమని సమాధానం చెబుతోందో చూద్దాం...

కథ

హైదరాబాద్ లో మూడుగా విభజించి చూపించిన జీవితాలవి...మొదటిది, ఆమె కమల (శ్రియ) అని వినికిడి లోపమున్న వివాహితురాలు. చిన్న కూతురుతో వుంటుంది. భర్త గల్ఫ్ లో టాక్సీ నడుపుతూ వుంటే, తను బస్తీలో బట్టలు కుడుతూ జీవనం సాగిస్తూంటుంది. భర్త వచ్చేలోగా వినికిడి సమస్యకి వైద్యం చేయించుకుని, భర్త తెచ్చే డబ్బుతో చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశతో వుంటుంది.

        రెండోది, నగరంలో ఇంకో చోట అలీ (శివ కందుకూరి) అనే యువకుడు తాత (చారు హాసన్) తో వుంటాడు. మెడిసిన్ చదివే ఇతను తాత మాట వినక, క్రికెటరై దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కృషి చేస్తూంటాడు. అక్కడే జారా(ప్రియాంకా జవల్కర్‌) అనే పెద్దింటి యువతి వుంటుంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటే పెద్దలు ఒప్పుకోరు. జారా పారిపోయి అలీ దగ్గరికి వచ్చేస్తుంది పెళ్ళి చేసుకోవాలని.

        మూడోది, మరింకో చోట మురికి వాడలో ఇద్దరు వీధి బాలలుంటారు. చిత్తు కాగితా లేరుకుని బ్రతుకుతూంటారు. ఈ ఇద్దర్లో ఒకడికి పుట్టిన రోజు ఘనంగా జరుపుకోవా లనుంటుంది. అందుకు కేక్ కొనేందుకు, మట్టి వినాయకుల విగ్రహాలమ్మి డబ్బు పోగేస్తూంటారు.

        ఈ మూడు చోట్లా జీవితాలిలా వుండగా, నగరంలో భారీ వర్షాలు కురిసి వరదలొచ్చేస్తాయి. వరదలకి ప్రాణాలతో బాటు కలలు, ఆశలూ కల్లోలితమవుతాయి. ఇందులోంచి ఎలా బయటపడి జీవితాల్ని తిరిగి గాడిలో పెట్టుకున్నారనేది మిగతా కథ. ఈ మిగతా కథలో  అలీ తాతతో బాటు, అలీ మిత్రుడు అబ్దుల్లా (సుహాస్), అలీ కోచ్ (రవి ప్రకాష్), జారా తండ్రి (సంజయ్ స్వరూప్), గాయని శైలపుత్రి (నిత్యా మీనన్) మొదలైన వ్యక్తులెక్కడ కనెక్ట్ అయ్యారనేది కూడా చూడొచ్చు.

ఎలా వుంది కథ 

గత వారమే విడుదలైన కుప్పకూలే స్కై లాబ్ యూనిక్ కథ లాగే, హైదరాబాద్ లో వరద ముప్పుతో ఇది కూడా డిజాస్టర్ జానర్ యూనిక్ కథ. స్కైలాబ్ లాగే డిజాస్టర్ జానర్ ఎలిమెంట్స్ తో కథ చేసుకోని కథ. అలాగని వరద ముప్పులో సర్వైవల్ (జీవన్మరణ పోరాటం) జానర్ ఎలిమెంట్స్ తో  కూడా చేయని కథ. పోనీ ఒక సామాజిక స్పృహతో ఆర్ట్ లేదా ఆఫ్ బీట్ మూవీయా అంటే అలా కూడా ఈ కథాంగాలు వుండవు. అన్ని కథా లక్షణాలూ తీసేసి- వరదలొచ్చాయి, ఇందులోంచి ఎలా బయట పడ్డారూ అన్న డాక్యుమెంటరీ మాత్రపు ప్రయత్నంగా యూనిక్ కథ మిగిలింది. పేరుప్రతిష్టల్ని తెచ్చి పెట్టే యూనిక్ కథ ఇలా సింహాసనం నుంచి జారిపోగా, ఈ డాక్యుమెంటరీ శైలి కథనం మొదట్నుంచీ  మూడుగా విభజించి చూపించిన జీవితాల చిత్రీకరణల్లో కన్పిస్తూ వస్తుంది. ఈ డాక్యుమెంటరీ కథనమే మొత్తం కథకొక అల్లిక, మెలికలు, ముడులు లేకుండా చేసింది. అసలు దేనితో ఏం చేస్తున్నామో తెలుసుకోకుండా రాసేసి తీసేస్తే ఇలాగే వుంటుందేమో. ఈ కథ కూడా పైన చెప్పుకున్న ఇటీవలి నాల్గు సినిమాల యూనిక్ కాన్సెప్టుల బాటలోనే బుట్ట దాఖలైపోయింది. 

        మూడుగా విభజించి చూపించిన జీవితాలతో మూడు కథలు. అంటే మూడు విడివిడి కథల ఒక ఆంథాలజీ అన్నమాట. అంటే హైపర్ లింక్ స్టోరీ. ఈ మూడు కథల్ని హైపర్ లింకుగా కూడా ఎక్కడా కలపను కూడా లేదు. అంటే ఆంథాలజీ కూడా కాకుండా పోయింది. ఇప్పుడు కావాలంటే 2020 హైదారాబాద్ వరద దృశ్యాలు చూసేందుకు యూట్యూబ్ లో బోలెడు వున్నాయి. సినిమా దేనికి చూడాలి. అలాటి వార్తా ప్రసారం లేదా డాక్యుమెంటరీ కాదు కదా సినిమా కథంటే. 

        కథ కాలేదు కాబట్టి కాన్ఫ్లిక్ట్ లేదు. వరదల్ని చూపిస్తే అది పాత్రలకి ఎదురైన కాన్ఫ్లిక్ట్ అవదు. ప్రకృతి దాని మానాన అది సర్దుబాటు చేసుకోవడం. ప్రకృతి వరదలతో దాని సర్దు బాటు బిజినెస్ లో అదుంటే, దీన్ని ఎదుర్కొంటూనే పాత్రల మధ్య పుట్టేది కాన్ఫ్లిక్ట్. ప్రకృతి సర్దుబాటు నేపథ్యంలో పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ లేకపోతే పాలగుమ్మి పద్మరాజు రాసిన గాలివాన కథ లేదు, కొరియన్ పారసైట్ మూవీ కూడా లేదు. టైటానిక్ డిజాస్టర్ మూవీ డిజాస్టర్ గురించే కాదు కదా? అదో అమరమైన ప్రేమ కథ కూడా.

పాలగుమ్మి పద్మరాజు గారి సుప్రసిద్ధ కథ గాలివాన ఆయన జీవితంలో జరిగిందే. దాన్ని ఆయన వార్తలా రాసి వుంటే కథయ్యేది కాదు. ఆ అనుభవం లోంచి వర్షపు రాత్రి పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ తో ఆ గొప్ప కథని సృష్టించారు. ఒక డబ్బున్న ఉన్నతాదర్శాల వ్యక్తి, తను అసహ్యించుకునే బిచ్చగత్తెతో వర్షపు రాత్రి చిక్కుకుని, ఆమె వల్ల తన ఉన్నతాదర్శాల్లోని డొల్లతనాన్ని తెలుసుకునే -  సోషల్ కామెంట్ చేసే కథ. 1951 లో రాసిన ఈ కథని ఆయన అనువాదం చేసి పంపితే న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో ద్వితీయ బహుమతి పొంది, అనేక భాషల్లో అనువాదమైన ప్రపంచ స్థాయి కథ.

 సూరజ్ కా సాత్వా ఘోడా’ అనే ప్రసిద్ధ నాల్గు కథల ఆంథాలజీలో శ్యామ్ బెనెగల్ కూడా ప్రేమకి సంబంధించి ఇదే చెప్పారు- సామాజికార్ధిక వర్గ పోరాట పునాదులున్న ప్రేమలే మంచి ప్రేమ కథలవుతాయని. గమనం దర్శకురాలి సామాజిక స్పృహకీ సామాజికార్ధిక కారణాలు కలగలిసిన కాన్ఫ్లిక్ట్ చూపించాలి నిజానికి.


        పాలగుమ్మి కథ లాగా ఆసియా ఖండం నుంచే వెళ్ళిన కొరియన్ మూవీ పారసైట్ లో కూడా వరదలు నగరాన్ని ముంచెత్తే కథే. ఆ వరదల్లో బయటపడే ఒక్కో పాత్ర నిజ రూపాలతో, వర్గ తారతమ్యాల సోషల్ కామెంట్ చేస్తుందీ 2019 ఆస్కార్ అవార్డు పొందిన సినిమా కథ. ఆసియా ఖండం నుంచి వెళ్ళిన ఈ రెండూ అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. గమనం లో హైదరాబాద్ వరదలకి కారణం పేరుకు పోయిన డ్రెయిన్లు, కబ్జా చేసిన చెరువులూ అని మీడియా రిపోర్టు చేసిన కారణమే చెప్పి సరిపెట్టడంతో, అవార్డులకి ఎదిగే అవకాశాన్ని కోల్పోయిన  డాక్యుమెంటరీ అయిందీ యూనిక్ కాన్సెప్ట్.

        ఈ కబ్జాదార్లయిన ధనిక పాత్రల్ని కూడా సృష్టించి- పేద పాత్రలతో కాన్ఫ్లిక్ట్ వల్ల ఏం నేర్చుకున్నారో సోషల్ కామెంట్ చేసి వుంటే అర్ధవంతమైన సామాజిక కథయ్యేది. వరదలతో ప్రకృతి కాదు విలన్. ప్రకృతిని ఆటంకపర్చే సామాజిక శక్తులు విలన్లు. విలన్లు లేకుండా బాధితుల అపసోపాలే చూపిస్తే కథవదు. కథంటే రెండు వైరి వర్గాల మధ్య డ్రమెటిక్ క్వశ్చన్ - ఆ క్వశ్చన్ తో కాన్ఫ్లిక్ట్ - దానికి ముగింపూ. డ్రామాకే అవకాశం లేని డాక్యుమెంటరీలో ఇవి సాధ్యం కావు. సినిమాకి కావాల్సింది డాక్యుమెంటరీలూ గాథలూ కావు, కథలే. బాధితులే తప్ప బాధకుల్ని చూపించక పోవడం వల్ల, పెట్టుబడిదారీ పక్షమేమో కథకురాలన్న అనుమానం కూడా వచ్చేలా వుంది.  

నటనలు- సాంకేతికాలు     

నిస్సందేహంగా సీనియర్ నటి శ్రియది వినికిడి లోపమున్న పాత్రలో చూడదగ్గ నటనే. ఏ సీనులో కూడా కమర్షియలేతర రియలిస్టిక్ నటనని గుండెలోతుల్లోంచి ప్రదర్శించకుండా వదిలి పెట్టలేదు. అయితే సన్నివేశ బలం, భావోద్వేగ బలం లేకపోవడం వలన జీవం లేని నటనయింది. కథ వుంటేగా ఇవి వుండడానికి. తను లీడ్ క్యారక్టర్ కూడా కాలేదు. తను బట్టలు కుడితేనే కాదు, అల్లికలతో కథని కూడా కుట్టాలి. కుట్టాలంటే లీడ్ క్యారక్టరవాలి. కార్యకర్త కావాలి. డిజాస్టర్ / సర్వైవల్ జానర్ కూడా కాదు కాబట్టి ఇవి కాలేదు. తనది ఎపిసోడ్ క్యారక్టర్. ఎపిసోడ్ కి పరిమితమైన క్యారక్టరైనా ఒక మినీ కథయినా కావాలి. కూతురితో ఈ మినీ కథ చేయొచ్చు. వినికిడి లోపమున్న ఇలాటి ఏ తల్లికైనా ముందు తన కూతురి గొంతు వినాలనుంటుంది. ఇది చాలు మినీ కథకి. కూతురి గొంతు వినడం కోసమే చికిత్స చేయించుకోవాలని సంకల్పం వుంటే, తీరా వర్ష బీభత్సంలో ఓ పిడుగు పడి డ్రమెటిక్ గా వినికిడి శక్తి వచ్చేసి వుంటే, ఆ సంబరంతో కూతురి గొంతు వినాలనుకుంటే... కూతురి గొంతు పోవాలి అదే పిడుగుపాటు భయంతో. ఇది మనకొచ్చిన ఐడియా కాదు. 1972 లో మనోజ్ కుమార్ సూపర్ హిట్ షోర్ నుంచి కాపీ కొట్టాం.

        షోర్ లో మనోజ్ కుమార్ కొడుకు యాక్సిడెంట్ లో మూగవాడై పోతాడు. అతడికి గొంతు తెప్పించి మాటలు వినాలని వైద్యం కోసం నానా పాట్లు పడి విజయం సాధిస్తే, పని చేస్తున్న కర్మాగారంలో తన చెవులు పోతాయి...దీన్ని ఉదాహరణ చెప్పడానికే తీసుకున్నాం, కాపీ కొట్టాలని కాదు.

        స్కైలాబ్ తో నిత్యామీనన్, ఇప్పుడు గమనం తో శ్రియ - తాము యూనిక్ కథలని నీరుగార్చే పాత్రల్ని ఒప్పుకుంటున్నామని ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు వాళ్ళ నటనలకి సార్ధకత వుంటుంది. మిగిలిన పాత్రల్లో తెలిసిన నటీనటులున్నారంటే ఏదో వున్నారంతే. వీళ్ళందరి మధ్య ఇద్దరు స్లమ్ పిల్లల కథ తమిళ సినిమా లోనిదేనేమో.


2016 లో వెట్రి మారన్ ‘విసారనైకి’ కి దర్శకత్వం వహించి దేశ విదేశాల్లో పేరు గడించక మునుపు - 2015 లో ‘కాక ముట్టై’ కి నిర్మాతగా వ్యవహరించి అంతే పేరు ప్రతిష్టలూ  పొందాడు. కాకపోతే దీనికి సహ నిర్మాతగా హీరో ధనుష్ వున్నాడు. ధనుష్వెట్రి మారన్ ల అండదండలతో కెమెరా మాన్ మణికందన్ దర్శకుడుగా మారిబాలల చలన చిత్రం ‘కాకముట్టై’ తీసి అంతర్లీనంగా గ్లోబలైజేషన్ స్వరూపాన్ని తేటతెల్లం చేశాడు. ‘కాకముట్టై’ (కాకి గుడ్డుని ఇద్దరు స్లమ్ పిల్లల గ్లోబల్ కోరికల కథగా తీశాడు.

        ఈ పిల్లలకి పిజ్జా కొనుక్కు తినాలని కోరిక. దానికి డబ్బుల కోసం చాలా కష్టపడతారు. తీరా కొనుక్కుని పిజ్జా ముక్క నోట్లో పెట్టుకుంటే - థూ, దీనికంటే స్టవ్ మీద ముసలి నానమ్మ వేసే బియ్యప్పిండి దిబ్బ రొట్టే ది బెస్ట్ అన్పిస్తుంది! అవసరం లేని గ్లోబల్ ఉత్పత్తుల మీద గురి చూసి సోషల్ కామెంట్ ఇది. దీనికి దేశ విదేశాల్లో 21 అవార్డు లొచ్చాయి. 2 కోట్ల బడ్జెట్ కి 12 కోట్ల బాక్సాఫీసూ వచ్చింది.

గమనం లో స్లమ్ పిల్లలు బర్త్ డేకి కేక్ కొనాలని ఆరాటపడతారు. ఇది కాకతాళీయమో కాపీనో దర్శకురాలే చెప్పాలి. అయితే తమిళంలో కేకుతో కాకుండా పిజ్జాతో కథ చేయడం- దిబ్బ రొట్టె కాంట్రాస్ట్ తో సామాజిక స్పృహ అయింది. గమనం లో ఇలాటిది కాలేదు. అసలీ కేకుతో బర్త్ డేలు మన కల్చర్ కాదని పిల్లలు చివరికి గుర్తించి, పుట్టిన రోజుకి శుభ్రంగా స్నానం చేసి గుడి కెళ్ళి గంట కొడితే, కాంట్రాస్ట్ తో ముచ్చటైన సోషల్ కామెంట్ అయ్యేది.

        మరో మూడు పేర్లూ బాక్సాఫీసు అప్పీలుగా వున్నాయి - ఇళయరాజా (సంగీతం), వీఎస్ జ్ఞాన శేఖర్ (ఛాయాగ్రహణం), బుర్రా సాయినాథ్ (మాటలు). నటీనటుల్లాగే ఈ ముగ్గురూ కూడా బాక్సులో విషయం లేకపోవడం వల్ల ప్రశ్నార్థకంగా మిగిలారు తమ ప్రతిభా పాటవాలతో.

చివరికేమిటి

ఫస్టాఫ్ సమయమంతా మూడు కథల పాత్రల్ని ఎస్టాబ్లిష్ చేయడానికే తీసుకున్నా పాత్రలు ఇంకా సరిగ్గా ఎస్టాబ్లిష్ కావు. భావోద్వేగాలు కనిపించని ఈ కథలు, పాత్రలు  నిదానంగా సాగడంతో ఫస్టావ్ ఓపికని పరీక్షిస్తుంది. సెకండాఫ్ వరదల్లో కష్టాలతో సాగుతుంది. ఫస్టాఫ్ లో కథలు, పాత్రలు సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడంతో, ఈ సెకండాఫ్ లో భావోద్వేగాల్లేని పాత్రల స్ట్రగుల్ తో ఆడియెన్స్ కనెక్ట్ కష్టమైపోతుంది. ఇలా సెకండ్ యాక్ట్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడంతో, ఆకస్మికంగా వచ్చే థర్డ్ యాక్ట్ సైతం ఆకట్టుకునే పరిస్థితి వుండదు. ఇలా స్క్రీన్ ప్లే ఏ యాక్ట్ లోనూ దాని బిజినెస్ జరగని పరిస్థితి ఈ సినిమాలోనే మొదటిసారిగా చూస్తాం. డాక్యుమెంటరీ చేస్తే యాక్ట్స్ సహజంగానే వుండవు.

        చివరిగా,దివ్యాంగుల్ని విషాద పాత్రలుగా చూపించే ఫార్ములా ఇక పోయింది. వాళ్ళని కూడా సాధారణ పౌరులుగానే సమానంగా ట్రీట్ చేసే సంస్కారాన్ని సమాజాలు గుర్తించాయి. పత్రికా భాష కూడా వికలాంగులు నుంచి దివ్యాంగులుకి మారింది. 2012 లో బర్ఫీ లో రణబీర్ కపూర్ మూగ చెవిటి పాత్ర ఫార్ములాని బ్రేక్ చేస్తూ హిలేరియస్ క్యారక్టర్ గా పాపులర్ అయింది. పాత్ర తన లోపాలతో బాధపడే విషాద పాత్రగా వుండదు. అలా చూపించే కుసంస్కారానికి పోలేదు.

        డిసెంబర్ 6 న దివ్యాంగుల సాధికారత అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా రాష్ట్రపతి స్టేజి దిగి అవార్డులు అందించడం తీవ్ర విమర్శలకి దారితీసిన ఉదాహరణ వుంది. రాష్ట్రపతి అలా స్టేజి దిగి రావడం దివ్యాంగులని అవమానించడమే అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి సమక్షంలో కెళ్ళి అవార్డులు అందుకునేందుకు తాము ముందుగానే డ్రెస్ రిహార్సల్స్ చేశామని, ఇందుకోసం హైడ్రాలిక్ లిఫ్ట్ కూడా ఉపయోగించామని, ఆ రిహార్సల్స్ అంతా వృధా అయిందనీ  దివ్యాంగులు చెప్పుకుని బాధ పడ్డారు. ఇలాంటి చర్యలతో తమని మరోమారు దివ్యాంగుల్ని చేయవద్దని విన్నవించుకున్నారు. ఆలోచనల్లో మార్పు రావాలని కోరారు. సామాజిక స్పృహతో సామాజిక కథకి ఇదవసరమే.

—సికిందర్


10, డిసెంబర్ 2021, శుక్రవారం

1104 : రివ్యూ

రచన- దర్శకత్వం : జె ధీరేంద్ర సంతోష్
తారాగణం : నాగశౌర్య
, కేతికా శర్మ, జగపతి బాబు, సచిన్ ఖెడేకర్, సత్య, రవి ప్రకాష్ తదితరులు
సంగీతం : కాల భైరవ
, ఛాయాగ్రహణం : రామ్
బ్యానర్స్ : శ్రీ వెంకటేశ్వరా సినిమాస్
, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : నారాయణ దాస్ నారంగ్
, పుష్కర్ రామ మోహన రావు. శరత్ మరార్
విడుదల : డిసెంబర్ 10
, 2021
***


        మొన్న అక్టోబర్ చివర్లోనే తను నటించిన వరుడు కావలెను పరాజయం చూసి ఇక విలుకాడుగా లక్ష్యానికి గురి పెట్టి బాణం విసురుతూ వచ్చేశాడు నాగశౌర్య. టైటిల్ : లక్ష్య’. పూర్తి మేకోవర్ తో ఎయిట్ ప్యాక్ కి అప్డేట్ అయి, అమీతుమీ తేల్చుకోవడానికి వచ్చేశాడు. 2011 నుంచీ ఒకే ఒక్క హిట్ తో, మరో 16 అవసరమే లేని ఫ్లాప్స్ తో ముందుకు పరుగులు తీస్తున్న నాగశౌర్య, ఎయిట్ ప్యాక్ స్పోర్ట్స్ డ్రామాతో బాక్సాఫీసు ఛాంపియన్ షిప్ కి కర్చీఫ్ వేశాడు. దర్శకుడుగా సుబ్రహ్మణ్య పురం తో సక్సెస్ ఇచ్చిన ధీరేంద్ర సంతోష్ ని తీసుకున్నాడు. ప్రముఖ నిర్మాతల బ్యానర్స్ అండదండలతో, తెలుగులో ఆర్చరీ (విలువిద్య) మీద తొలి క్రీడా చలన చిత్ర్రాన్ని పరిచయం చేస్తూ చరిత్ర పుటల్లో తన పేరుని నమోదు చేసుకున్నాడు. మరి ఇన్ని సమకూర్చుకున్న తను, ఇప్పుడు ఒకటైనా హిట్ కోసం వేసిన బాణాలేమిటి? అవెక్కడెక్కడ తగిలాయి? బాక్సాఫీసుకే తగిలాయా? ఈ సందేహాలు తీర్చుకుందాం...

కథ


  పార్థు (నాగశౌర్య) కి చిన్నప్పట్నుంచీ బాణా లేయడంలో నేర్పు. ఈ విద్య తండ్రి (రవి ప్రకాష్) కుండేది. అతను చనిపోయాక అతడి కలని తీర్చగల వాడుగా మనవడు పార్ధు కన్పిస్తాడు తాత (సచిన్ ఖెడేకర్) కి. ఇక సర్వస్వం ఒడ్డి విలు విద్యలో మనవడ్ని తీర్చి దిద్దుకుంటూ వస్తాడు. మనవడు పార్ధుకి తాత ప్రోత్సాహంతో బాటు, రీతిక (కేతకీ శర్మ) ప్రేమ కూడా లభించడంతో ఆర్చరీలో రాణించి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ గెలుస్తాడు. ఇక అంతర్జాతీయ పోటీలకి సిద్ధమవుతూంటే గుండెపోటుతో తాత చనిపోతాడు. ఈ బాధ తట్టుకోలేక పార్ధు డ్రగ్స్ మరిగి బహిష్కరణకి గురవుతాడు. ఇప్పుడు ఇతడి క్రీడా జీవితం ఏమయిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

వెండితెర మీద ఆర్చరీతో స్పోర్ట్స్ మూవీ అనేది కాన్సెప్టుగా కొత్తదే. కథ  చూస్తే అదే కొత్త సీసాలో పాత సారా. కాకపోతే సారా బదులు డ్రగ్స్ చూపించారంతే. రొటీన్ టెంప్లెట్ స్పోర్ట్స్ డ్రామా. 1. ఒక గురువు, 2. ఒక శిష్యుడు, 3.శిక్షణ, 4. సమస్యలు, 5. ఒక ప్రత్యర్థి, 6. ప్రత్యర్ధితో ఓటమి, 7. తాజా శిక్షణ, 8. ప్రత్యర్ధి మీద గెలుపు! ...ఈ ఎనిమిది స్టోరీ బీట్స్ ని టెంప్లెట్లో వరుసగా వేసుకుంటూ పోతే స్పోర్ట్స్ మూవీ తయార్. చాలా ఈజీ స్క్రిప్టు తయారీ. ఇంత ఈజీగా దర్శకులు తీసి తీసి విసుగు చెందరేమో గానీ, ప్రేక్షకులకి అంత ఓపిక లేదు. లక్ష్య తో అసలే ఓపిక లేనట్టు ఇంటర్వెల్ కి బయటి కెళ్ళిన ప్రేక్షకులు చాలా మంది వెనక్కి రాక పోవడం ఆందోళన కల్గించే విషయం కాదేమో.

        ఆర్చరీ మీద తొలి సినిమా అన్నాక దీనికి మార్కెట్ యాస్పెక్ట్ పట్టింపు కూడా లేదు. కథా ప్రయోజనం అసలే లేదు. కనీసం కథగా సోల్ కూడా లేని నిర్జీవ నమూనాగా మిగిలింది. వరల్డ్ నంబర్ వన్ ప్రొఫెషనల్ ఆర్చర్ దీపికా కుమారి మీద తీసిన లేడీస్ ఫస్ట్ అనే అద్భుత అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీ తప్ప ఆర్చరీ మీద సినిమా రాలేదు. ఇప్పుడు తెలుగులోనే వచ్చింది. ఆర్చరీ లాంటి ప్రజాకర్షణ లేని పాసివ్ స్పోర్ట్స్ ని ప్రేక్షకుల్లో ప్రమోట్ చేసే ఒక మంచి అవకాశాన్నీ, ఇంకా మాట్లాడితే జాతీయ అవార్డునీ పొంద వచ్చన్న స్పృహ  గానీ లేకుండా కాన్సెప్ట్ ని వృధా చేశారు.

        ఈ సినిమాకి కావాల్సింది కథ కవసరం లేని నాగశౌర్య ఎయిట్ ప్యాక్ కాదు. ఎయిట్ ప్యాక్ లాంటి ప్యాకేజీ వుండాల్సింది ఈ విలు విద్య కథకి. నాగశౌర్య పాత్రకి పార్ధు అనే పేరు పెట్టి వదిలేస్తే కాదు. పురాణాల్లో విలువిద్యతో పార్ధు (అర్జునుడు) కీ, ఏకలవ్యుడుకీ వున్న సంబంధమేమిటో గుర్తు చేస్తూ- ఆర్చరీ పట్ల భావి క్రీడాకారులకి స్ఫూర్తిని, క్రేజ్ నీ రగిలించే ఒక కథా ప్రయోజనం, ఒక మార్కెట్ యాస్పెక్ట్ అవసరం.

        ఆర్చరీ అనే పాయింటుని ఒక క్యారక్టర్ గా తీర్చిదిద్దే హిస్టరీతో, బాక్సాఫీసు అప్పీలుతో, ఆర్చరీయే దైవమన్న భక్తితో - దాని ఎమోషనల్ కంటెంట్ కోసం, సోల్ కోసం  ప్రయత్నించకుండా - అర్ధం లేని చిత్రణలు నాగశౌర్య పాత్రకి ఆపాదించారు. ఆర్చరీతో నాగశౌర్యకి ఏ ఎటాచ్ మెంటూ కనబడదు. అలాటి ఒక్క సీను కూడా లేదు. తాత తోనే ఎటాచ్ మెంట్, పిల్లలతోనే ఎటాచ్ మెంట్, హీరోయిన్ తోనే ఎటాచ్ మెంట్. తాత చనిపోతే ఆ బాధ మరుపుకి డ్రగ్స్ తో మత్తు బానిసవడం, విలన్ తో హింసఏం చెప్తున్నారు ఈ కథతో? ఆర్చరీ క్రీడ చంఢాలమైనదనీ, దాని జోలికి పోకూడదనా? స్ఫూర్తిమంతంగా, ఉత్సాహజనకంగా వుండాల్సిన కథలో ఈ డ్రగ్స్ తో రిపల్సివ్ మూడేంటి?

నటనలు- సాంకేతికలు
నాగశౌర్యది పూర్తిగా పాసివ్ పాత్ర. తాత ఎదురుగా లేకపోతే బాణం వేయలేని పాసివ్ పాత్ర. తాత చనిపోతే డ్రగ్స్ మరిగి పతనమయ్యే విషాద పాసివ్ పాత్ర. సెకండాఫ్ లో జగపతి బాబు వచ్చి లేపి చెప్తేగానీ లక్ష్యం తెలియని పాసివ్ పాత్ర. ఈ కథ నాగశౌర్య క్యారక్టర్ గ్రాఫ్, క్యారక్టర్ గ్రోత్, క్యారక్టర్ స్టడీ గురించైనట్టు. ఈ ప్లాట్ టూల్స్ అన్నీ ప్రధానంగా వుండాల్సింది ఆర్చరీ స్పోర్ట్స్ కి కాదన్నట్టు. ఆర్చరీ కథే కానట్టు, నాగశౌర్య పాత్ర కథే అన్నట్టు! అద్భుత పాత్ర చిత్రణ...

        తాతగా సచిన్ ఖెడేకర్ కూడా కథకుడి చేతిలో కీలుబొమ్మ పాత్ర. నాగశౌర్య పాత్ర డ్రగ్స్ ని మరగాలంటే తాత సడెన్ గా చావాలి. ఈ చావుతో పాపం ఆస్తులమ్మి మనవణ్ణి తీర్చిదిద్దుతున్న తాత మనవణ్ణి వీధిన పడేశాడు. ఈ చావు సానుభూతి నిచ్చేదేనా?

మొదట్లో తండ్రి పాత్ర కూడా, ఆర్చరీ గెలిచొస్తానని తాతకి చెప్పి వెళ్ళే సీను కట్ చేస్తే, నెక్స్ట్ సీన్లో యాక్సిడెంట్లో చనిపోయాడని కబురు! కథ నడపాలంటే సడెన్ చావులు తప్పవన్నమాట!

        ఇక జగపతి బాబు పాత్ర ఎక్కడ్నించి వస్తుందో, ఎందుకొస్తుందో సిల్లీగా వుంటుంది. తను రెండో కృష్ణుడన్నట్టు గురువు నెంబర్ టూ. హీరోయిన్ కేతికా శర్మ పాత్ర కూడా ఎందుకుంటుందో, ఏం చేస్తూంటుందో తెలియదు. గ్యాలరీలో కూర్చుని చప్పట్లు మాత్రం కొడుతుంది. చచ్చిపోతూ తాత హీరోని ఒప్పజెప్పాడని, రెండో కృష్ణుడు వచ్చే వరకూ హీరోకి గార్డియన్ లా వుంటుంది. లేకపోతే వుండదేమో. కానీ హీరో డ్రగ్స్ ఆరగిస్తూంటే తెలియని గార్డుగా సరదాగా వుంటుంది, పారితోషికం ఇస్తున్నందుకు.

        సాంకేతికంగా బలహీనమే. ఆర్చరీ ట్రైనింగు, ఈవెంట్స్, ఆఖరికి వరల్డ్ కాంపిటీషన్ దృశ్యాలూ అపరిపక్వంగా వున్నాయి. కనీసం ఇవైనా ప్రొఫెషనల్ గా వుండి థ్రిల్ చేస్తే ఓ యాక్షన్ మూవీ చూసినట్టయినా వుండేది. హాకీ, ఫుట్ బాల్ ఆటల్లాగా యాక్షన్ ఓరియెంటెడ్ గా వుండదు బాణాలేసే ఆర్చరీ. ప్రత్యర్ధితో నేరుగా తలబడ్డం వుండదు. ఎదురుగా బోర్డు మీద బుల్స్ ఐని నిలబడి గురిచూసి కొట్టడమే వుంటుంది. కానీ బాణాలతో జలదరింప జేసే పోరాట సినిమా లెన్నో వచ్చాయి. పద్మావత్ చూసినా, ఇందులో సింహళ రాకుమార్తె పద్మావత్ పాత్రలో దీపికా పడుకునే, బాణాలతో జింకని వేటాడే ఓపెనింగ్ విజువల్స్ ని ఎవరు మర్చిపోతారు.

చివరికేమిటి

చిన్నప్పట్నుంచీ కథ చూపించారు. తాత- తండ్రి-మనవడుల జీవితం చూపిస్తూ స్పూన్ ఫీడింగ్ చేశారు. ఇదేదో ఫ్యామిలీ కథైనట్టు జానర్ మర్యాద కలుషితం. ఈ బయోగ్రఫీ అంతా, పరిచయమంతా కూడా, స్పోర్ట్స్ జానర్ మర్యాద కింద, బాక్సాఫీసు అప్పీలు కోసం, ఆర్చరీతో వుండాల్సింది. తాతా, కోచింగ్ కి వెళ్తున్నానంటాడు హీరో. తాత దగ్గుతాడు. ఇక హీరో కోచింగ్ కి వెళ్ళే సీను లేకుండా, తాతతో సెంటిమెంటు -ఎటాచ్ మెంటు సీను వచ్చేస్తుంది. ఇలా ఆర్చరీ సీన్లకి పదేపదే తాతా మనవళ్ళ అనుబంధాల సీన్లు, హీరోయిన్ లవ్ సీన్లు, ఆర్చరీలో ప్రత్యర్ధి (విలన్) తో గొడవల సీన్లూ ఆల్టర్నేట్ గా వచ్చి అడ్డుపడుతూంటాయి. కథకుడికి దేనిమీద మక్కువ వుందో ఇలా తెలిసి పోతూంటే ఇంకేం స్పోర్ట్స్ సినిమా చూస్తాం. పైగా ప్రత్యర్ధిని ముందే చూపించడంతో కథేమిటో ఇక్కడే తెలిసిపోతోంది.

        తాత మరణం, హీరో డ్రగ్స్ సేవనం, మత్తులో వున్న హీరో ఇంటర్వెల్ సీన్లో ఈవెంట్ కెళ్ళకుండా విలన్ గ్యాంగ్ దాడి చేసి అడ్డుకోవడం లాంటి రొటీన్ కి, హీరో గాయాలతో తూలుతూ వచ్చి ఈవెంట్ లో బాణం వేసి గెలిచి పడిపోవడం లాంటి ఇంకో రొటీన్ జీవం లేనివిగా వుంటాయి. ఫస్టాఫ్ ఇలా విఫలమయ్యాక, సెకండాఫ్ కథ వదిలేసి హీరో ఎమోషనల్ డ్రామాలతో మరీ ఎక్కడికో వెళ్ళిపోయింది...ఎయిట్ ప్యాక్ ని  కేవలం ఒక రెస్టారెంట్ లో సిల్లీ గొడవకి షర్టు విప్పి చూపించడం. ఈ మైనర్ ఫైట్ కోసమే ఎయిట్ ప్యాక్. ఇలా మొత్తానికి నాగశౌర్య వేసిన బాణం ఇంకో ఫ్లాప్ ని పెంచడానికే పనికొచ్చింది....

—సికిందర్
 

8, డిసెంబర్ 2021, బుధవారం

1103 : బాక్సాఫీస్

శుక్రవారం 10వ తేదీ ఇంకో 8 సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. గత నెల 19 న కూడా ఒకేసారి  తొమ్మిది సినిమాలు విడుదలయ్యాయి. పెద్ద సినిమాలు లేని శుక్రవారం చూసుకుని ఛోటా సినిమాలు ఈ సంఖ్యలో విడుదలై పోతున్నాయి. ఈ శుక్రవారం లక్ష్య తప్ప మిగిలినవి చిన్న సినిమాలే. లక్ష్య సహా అన్ని సినిమాలూ కొత్త దర్శకులవే. లక్ష్య లో నాగ శౌర్య హీరో. ఇది మరో స్పోర్ట్స్ డ్రామా. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం. ట్రైలర్ తో ఆసక్తి రేపింది. ఈ మూవీ ట్రైలర్‌ ని గ్లామర్ కోసం విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. పైగా నాగశౌర్య పలకల శరీరం (సిక్స్ ప్యాక్) తో పరిచయమవుతున్నాడు. క్రీడాకారులు సిక్స్ ప్యాక్ తో వుంటారా అన్నది వేరే సంగతి. కేతికా శర్మ మరో సారి హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈమె ఇటీవలే పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ రోమాంటిక్ లో హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమైంది. ప్యాడింగ్ ఆర్టిస్టులుగా జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ల బలం ఈ సినిమాకి వుంది. దీని నిర్మాతల్లో ప్రముఖులు నారాయణ్ దాస్ కే నారంగ్, శరత్ మరార్ వున్నారు.

        మెయిన్ మూవీ శౌర్య తర్వాత చెప్పుకో దగ్గ మూవీ గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవిత కథ నయీమ్ డైరీస్’. ఈ వివాదాస్పద నయీమ్ కథలో చాలా నిజాలు నిజాయితీగా చెప్పాననీ, సినిమా ఎలా రిలీజ్ చేస్తావో చూస్తామని బెదిరింపులు వస్తున్నాయనీ దర్శకుడు దాము బాలాజీ చెప్పడం ఆసక్తిని పెంచింది సినిమా మీద. ఇందులో నయీమ్ పాత్రని వశిష్ట సింహా పోషించాడు. ఇతను కేజీఎఫ్, నారప్ప సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటుడు. దీని ట్రైలర్ చూస్తూంటే సాంకేతిక బలంతో పవర్ఫుల్ గా కన్పిస్తోంది.

        పోతే, కొత్త దర్శకురాలు సుజనా రావు తీసిన గమనం లో శ్రియ నటించింది. ఇంకో పాత్రలో నిత్యా మీనన్ కన్పిస్తుంది. సుహాస్ కూడా ఓ పాత్రలో కన్పిస్తాడు. హైదారాబాద్, విశాఖల్లో షూటింగ్ చేశారు. ఇళయరాజా సంగీతం వహించిన ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ కథ ఐదు భాషల్లో విడుదలవుతోంది.

        మిగిలిన అయిదూ కొత్త నటులవే. మడ్, బుల్లెట్ సత్యం, కఠారీ కృష్ణ, ప్రియతమా, మనవూరి పాండవులు. అందరూ కొత్త దర్శకులే తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్న ఈ ఎనిమిదిలో ఎన్ని నిలబడతాయో శుక్రవారం తేలుతుంది. ఈవారం పెద్ద సినిమాలు లేకపోయినా అఖండ సృష్టిస్తున్న మేనియా ఇంకా తగ్గలేదు. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్స్ లో విడుదలైనప్పుడు హైదారాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాలు విడుదల చేస్తే, పెద్ద సినిమా బుకింగ్స్ ఫుల్ అయిపోతే, కాంపౌండులో చిన్న సినిమా వున్న థియేటర్లో పడే వాళ్ళు పెద్ద సినిమా కొచ్చిన ప్రేక్షకులు. ఇలా బతికిన చిన్న సినిమా లున్నాయి. ఆన్ లైన్ బుకింగ్స్ తో ఇప్పుడా పరిస్థితి లేదు.

***