రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, నవంబర్ 2021, ఆదివారం

1096 : రివ్యూ


 

దర్శకత్వం : మహేష్ మంజ్రేకర్
తారాగణం : సల్మాన్ ఖాన్
, ఆయుష్ శర్మ, మహిమా మక్వానా, సచిన్ ఖెడేకర్, జీశ్శూ సేన్ గుప్తా, మహేష్ మంజ్రేకర్ తదితరులు
కథ : ప్రవీణ్ టార్డే
, స్క్రీన్ ప్లే : మహేష్ మంజ్రేకర్, అభిజిత్ దేశ్ పాండే, సిద్ధార్థ్ సాల్వి సంగీతం : రవీ బస్రూర్, ఛాయాగ్రహణం : కరణ్ రావత్
బ్యానర్ : సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్
నిర్మాత  : సల్మాన్ ఖాన్
విడుదల : నవంబర్ 26
, 2021
***

      ల్మాన్ ఖాన్ స్టార్ డమ్ ని, ఫ్యాన్స్ నీ కాసేపు పక్కన బెట్టి, బావగారు ఆయుష్ శర్మతో కలిసి అంతిమ్ = ది లాస్ట్ ట్రూత్ అనే డార్క్ - రియలిస్టిక్ మూవీలో నటించాడు. పరిమిత బాక్సాఫీసు అప్పీలుండే ఈ సినిమాని  పరిమిత బడ్జెట్లోనే తన సంస్థ ద్వారా నిర్మించి ఫలితాన్ని ప్రేక్షకులకి వదిలేశాడు. 2018 లోనే ఆయుష్ ని వెండితెరకి పరిచయం చేస్తూ లవ్ యాత్రీ అనే రోమాంటిక్ డ్రామా నిర్మిస్తే, అది నష్టాలతోనే ముగిసింది. తిరిగి ఇప్పుడు జానర్ ని మార్చి, ఆయుష్ ని పరీక్షకి పెట్టే కరుడుగట్టిన క్రిమినల్ పాత్రలో రీలాంచ్ చేశాడు. ఇలాటి సినిమాల స్పెషలిస్టు మహేష్ మంజ్రేకర్ దర్శకుడుగా రంగంలోకి దిగాడు. మరి సల్మాన్, మంజ్రేకర్ ఇద్దరూ కలిసి ఆయుష్ ని లాంచీ ఎక్కించి తీరం దాటించారా లేదా అనేది చూద్దాం...

కథ

రాహుల్యా (ఆయుష్ శర్మ) పుణె సమీపంలోని ఓ గ్రామంలో తల్లిదండ్రులతో, చెల్లెలితో నివసిస్తూంటాడు. తండ్రి దత్తా (సచిన్ ఖెడేకర్) కూతురి పెళ్ళి కోసం తక్కువ ధరకి పొలం అమ్మేస్తాడు. పొలం కొన్న షిండే అనే అతను ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకుంటే, అక్కడ వాచ్ మాన్ గా చేరతాడు దత్తా. ఒక రోజు షిండే దత్తాతో దురుసుగా ప్రవర్తించి ఉద్యోగంలోంచి తీసేస్తాడు. దత్తా కుటుంబంతో పుణె వెళ్ళిపోయి కూరగాయల మార్కెట్ లో కూలీగా చేరతాడు. అక్కడ సాల్వీ (విజయ్ నికమ్) అనే కార్పొరేటర్ అనుచరులు మామూళ్ళ కోసం సత్య (మహేష్ మంజ్రేకర్) అనే కూలీని కొడతారు. ఇది చూసి రాహుల్యా, అతడి ఫ్రెండ్ గణ్య (రోహిత్ హల్దీకర్), సాల్వీ అనుచరుల్ని కొట్టి అరెస్టవుతారు.

        స్థానిక పోలీస్ స్టేషన్ లో రాజ్ వీర్ సింగ్ (సల్మాన్ ఖాన్) స్ట్రిక్టు ఇన్స్ పెక్టర్ గా వుంటాడు. అరెస్టయిన రాహుల్యానీ, గణ్యనీ జైలుకి పంపిస్తాడు. జైల్లోనే వున్న కార్పొరేటర్ సాల్వీ అనుచరులు రాహుల్యా, గణ్యల మీద దాడి చేస్తారు. స్థానిక గ్యాంగ్ స్టర్ నాన్యా భాయ్ (ఉపేంద్ర లిమాయే) అడ్డుకుంటాడు. రాహుల్యా, గణ్యా తనకి పనికొస్తా రన్పించి బెయిలు మీద విడిపిస్తాడు.

        ఇక కార్పొరేటర్ సాల్వీకి ఎలాగైనా బుద్ధిచెప్పాలనుకున్న రాహుల్యా, అనుకోకుండా అతణ్ణి చంపేస్తాడు. దీంతో జైలు కెళ్ళిన రాహుల్యా, గణ్యలని మళ్ళీ బెయిలు మీద విడిపిస్తాడు నాన్యా భాయ్. ఇక రాహుల్యా కూరగాయల మార్కెట్లో రైతుల హక్కుల కోసం పోరాడతాడు. ఈ పోరాటంలో నాన్యా భాయ్ కూడా చేతులు కలిపి రాహుల్యాని మార్చేస్తాడు. రాహుల్యా నుపయోగించుకుని పేద రైతుల భూముల్ని చిల్లర ధరలకి కొనేసుకుంటాడు. ఇది గమనిస్తున్న సత్య, నీ తండ్రి పొలాన్ని కూడా నాన్యా, షిండేకి తక్కువ ధరకే అమ్మించాడు, అమ్మకపోతే నీ చెల్లెల్ని చెరుస్తానని బెదిరించాడనీ  చెప్పడంతో రాహుల్యాకి కనువిప్పవుతుంది. ఇప్పుడు నాన్యా ప్రత్యర్ధి అంబీర్ అనే ఎమ్మెల్యే వచ్చి, రాహుల్యాకి ఒక సూచన చేస్తాడు - నాన్యాని చంపేయమని.

        ఇదీ విషయం. ఇప్పుడు రాహుల్యా గుంటనక్క నాన్యాని చంపేశాడా? ఇన్స్ పెక్టర్ రాజ్ వీర్ ఏం చేస్తున్నాడు? పుణెకి కొత్త గ్యాంగ్ స్టర్ గా మారబోతున్న రాహుల్యాని ఆపాడా? పుణెలో గ్యాంగ్ స్టర్స్ అందర్నీ అంతమొందించడానికి అతను పన్నిన పథకమేమిటి? ఈ పథకంలో రాహుల్యా కూడా చిక్కుకున్నాడా? ఈ ఇద్దరి మధ్య పోరాటం ఏ ముగింపుకి దారి తీసింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

2018 లో విడుదలైన ముల్షీ పాటర్న్ అనే మరాఠీకి రీమేక్. మహారాష్ట్రలో పట్టణ, నగర శివారు రైతులు పెట్టుబడి దార్ల వొత్తిడికి లొంగి పొలాలు అమ్ముకుని కూలీలుగా మారుతున్న పరిణామాలకి, నేర ప్రపంచపు కథ జోడించి మరాఠీ రియలిస్టిక్ గ్యాంగ్ స్టర్ గా తీశారు. దీని దర్శకుడు ప్రవీణ్ టార్డేకి మంచి పేరొచ్చింది. బాలీవుడ్ సినిమాల ప్రభావానికి దూరంగా, అలాటి వాసనలు లేని పక్కా మరాఠా నేపథ్యంతో  తెరకెక్కించాడు. అయితే మేకింగ్ మరాఠా ముద్రే అయినా, కథాకథనాలు బాలీవుడ్ గ్యాంగ్ స్టర్/మాఫియా కథల టెంప్లెట్ ని దాటి వెళ్ళక పోవడం లోపం. ఐతే ఇంకేం, ఇది మన బాలీవుడ్ కథేగా అనుకునేమో, సల్మాన్, ఆయుష్ తో కలిసి ఈ ప్రాంతీయ సినిమా రీమేక్ లో నటించి, నిర్మించేందుకు ముందుకొచ్చాడు. ఇది సల్మాన్ లెవెల్ పాత్ర కాదు, సినిమా కూడా కాదు. ఆయుష్ కి చేయూత నివ్వడానికి దీన్ని చేపట్టాడు. సల్మాన్ సోలోగా రియలిస్టిక్ లో నటించాలనుకుంటే  జై భీమ్ లో సూర్య పాత్ర లాగైనా కనీసం వుండాలి. 

        మరాఠీ నేటివిటీ తప్ప బాలీవుడ్ గ్యాంగ్ స్టర్ టెంప్లెట్ లోనే తీసిన ముల్షీ పాటర్న్ ని బాలీవుడ్డే రీమేక్ చేయడంతో చూస్తే కొత్తగా ఏమీ వుండదు. అప్పట్లో రాంగోపాల్ వర్మ తీసిన హిందీ  కంపెనీ ముగింపు కూడా మరాఠీలో వుంది. అదే మళ్ళీ ఈ హిందీలో చూపించారు.  కాకపోతే ఈ తరహా కథలో గ్యాంగ్ స్టర్ గా ఒకే ఒక్క సినిమా అనుభవమున్న ఆయుష్ తీరం చేరాడా, మునిగాడా అన్నదే పాయింటు.

నటనలు- సాంకేతికాలు

ఆయుష్ ది ప్రధాన పాత్ర. పల్లె నుంచి ఉపాధి వెతుక్కుంటూ పుణె చేరి అక్కడ సంఘ విద్రోహక శక్తులతో తలపడి, తానే సంఘ విద్రోహక శక్తిగా మారే పాత్ర. రాహుల్యాగా ఈ పాత్రలో నటించడానికి మరాఠీ వొరిజినల్లో నటించిన రెండు సినిమాల అనుభవమున్న ఓం భూట్కార్  రిఫరెన్స్ ఎలాగూ వుంది, మంజ్రేకర్ గైడెన్స్ కూడా వుంది. ఈ రెండిటినీ పాత్రలో తనని తీర్చిదిద్దుకోవడానికి వినియోగించుకున్నాడు. కమర్షియల్ నటన కంటే రియలిస్టిక్ నటనకి ఎక్కువ స్కిల్స్ అవసరం. దీనికి ఫిజికల్ గా, ఎమోషనల్ గా పూర్తి మేకోవర్ తో - పది సినిమాల అనుభవమున్న హీరో లాగా పవర్ఫుల్ గా నటించేశాడు రియలిస్టిక్ పాత్రని. నిస్సహాయుడైన పల్లెటూరి వాసి నుంచి నగర వాసిగా, గ్యాంగ్ స్టర్ గా, పోలీసుల్ని ఎదిరించే రెబెల్ గా పాత్ర ఎదుగుదల క్రమంలో భిన్న భావోద్వేగాల ప్రదర్శన ఈజీగా చేసేశాడు. మధ్యలో హీరోయిన్ మహిమా మక్వానాతో రోమాంటిక్ యాంగిల్ కూడా. ఇలా సల్మాన్, మంజ్రేకర్ లు ఎక్కించిన లాంచీలో తీరం దాటేశాడు. ఇక బాలీవుడ్ యాక్షన్ హీరోగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించుకోవచ్చు. అమీర్ ఖాన్ కూడా 1985 లో ఖయామత్ సే ఖయామత్ తక్ (యుగాంతం నుంచి యుగాంతం దాకా) అనే సూపర్ హిట్ మ్యూజికల్ రోమాంటిక్ డ్రామాతో ప్రవేశించి, రెండో సినిమా రాఖ్ (బూడిద) అనే రియలిస్టిక్ లో నటించి జాతీయ అవార్డు పొందాడు. 

        మరాఠీలో ఉపేంద్ర లిమాయే నటించిన ఇన్స్ పెక్టర్ పాత్ర సల్మాన్ నటించాడు. అదే ఉపేంద్ర ఈ హిందీ రీమేక్ లో గ్యాంగ్ స్టర్ నాన్యా భాయ్ గా నటించాడు. ఇది మరాఠీ పాత్రే. కానీ సల్మాన్ సిక్కు పాత్రగా మార్చాడు. హిందీ సినిమాల్లో సీరియస్ సిక్కు పాత్రల్ని చూసి చూసి బోరు కొట్టేసే పరిస్థితి వచ్చింది. సిక్కులు హాస్య ప్రియులు కూడా. ఒకప్పుడు హిందీ సినిమాల్లో హాస్యం గానే సిక్కు పాత్రలుండేవి. సర్దార్జీ జోకులని పుస్తకాలు కూడా వున్నాయి. ప్రసిద్ధ జర్నలిస్టు ఖుష్వంత్ సింగ్ శాంటా-బాంటా అనే రెండు తెలివి తక్కువ సిక్కు క్యారక్టర్లని సృష్టించి, అదే పనిగా సెటైర్లు రాసేవాడు. 1980లో ఫిరోజ్ ఖాన్ సూపర్ హిట్ ఖుర్బానీ లో గబ్బర్ సింగ్ అమ్జాద్ ఖాన్, క్యారట్ నమిలే ఇన్స్ పెక్టర్ గా జంటిల్ మాన్ హాస్యంతో లాండ్ మార్క్ పాత్రగా చేసి పెట్టాడు.  అదే అమ్జాద్ ఖాన్ 1980 లోనే లవ్ స్టోరీ లో మంద బుద్ధి కానిస్టేబుల్ గా చేసిన కామెడీ మర్చిపోలేరు.

        సల్మాన్ సిక్కు ఇన్స్ పెక్టర్ కి ఇలా కాస్త కామిక్ టచ్ వుండాల్సింది. బావ బావమరుదులిద్దరూ సినిమాని యమ సీరియస్ చేసేస్తే ఎలా. ఓపెనింగ్స్ 4.5 కోట్లే వచ్చాయి. దీని ముందు జాన్ అబ్రహాం మతిమాలిన మాస్ సత్యమేవ జయతే 2 కి 3.6  కోట్లు మాత్రమే వచ్చాయిగా అని సంతోషించాలేమో.


నేనూ మహారాష్ట్ర లోనే పుట్టాను. కానీ నీలాగా గూండాని కాలేదు, గూండాలకి బాబు నయ్యాను -పోలీస్ వాలా ...నువ్వు పుణెకి కొత్త భాయ్ వి, నేను నీ కంటే ముందే హిందూస్తాన్ కే భాయ్ ని ... ఎక్కడెక్కడ సర్దారో అక్కడక్కడ గురుద్వారా, లంగర్’… ‘సర్దార్ని నేను, వాహేగురు ముందే తల వంచుతాను లాంటి ఇమేజి సెట్టింగ్ సీరియస్ మాస్ డైలాగులున్నాయి. మానభంగమైన అమ్మాయి మీద సల్మాన్ తలపాగా తీసి కప్పే మెలోడ్రామా సీనొకటి.

        పోటాపోటీగా షర్టులు విప్పి బావ బావమరుదులు కొట్టుకునే సీను ఆయుష్ సిక్స్ ప్యాక్ చూపించడానికే. ఇంకెన్ని సార్లు ఇలా సిక్స్ ప్యాక్ చూపిస్తారు? ప్యాంటు విప్పి తొడగొడితే సరైన వీరత్వమవచ్చు.  గ్యాంగ్ స్టర్స్ ని అంత మొందించడానికి సల్మాన్ పాత్ర పన్నే వ్యూహం హిందీ సినిమాల్లో ఆల్రెడీ వచ్చేసిందే. ఆయుష్ ని ప్రమోట్ చేయడానికి సల్మాన్ పాత్రని పరిమిత స్కోపుకి తగ్గించుకున్న దృశ్యం కన్పిస్తోంది.

        హీరోయిన్ మహిమా మక్వానా హిందీ గ్యాంగ్ స్టర్ / మాఫియా సినిమాల్లోని రొటీన్ టెంప్లెట్ పాత్రే. గ్యాంగ్ స్టర్ ని ప్రేమించి భంగపడే పాత్ర. రాజకీయాల్లో ప్రత్యర్ధుల కుటుంబాల్ని రచ్చకీడ్చే దుర్నీతి వున్నట్టు మాఫియాల్లో వుండదు. మనం పరస్పరం కుటుంబాల జోలికి పోవద్దని మాట్లాడుకుంటారు. ఇదే హిందీ సినిమాల్లోనూ చూస్తాం. మాఫియాలు బయట ఎన్ని అన్యాయాలు చేస్తారో, కుటుంబాల్ని అంతగా ప్రేమించే సన్నివేశాలు మాఫియా సినిమాల్లో అందుకే వుంటాయి. అయితే మాఫియాల రణ నీతితో సురక్షిత కుటుంబ జీవితాల్ని అనుభవించే మాఫియాల ఇంటి ఆడపడుచులు, తమ భర్తలకి జీవన్మరణ సమస్య ఎదురైనప్పుడు, ఎందుకని పోరాటానికి దిగరన్నది మాఫియా సినిమాల్లో హీరోయిన్ల పాత్రల్ని చూస్తే ఎదురయ్యే ప్రశ్న. ఆయుష్ కోసం మహిమా పోరాటానికి దిగి, అతడితో పాటే అంతమై వుంటే, ఆమె హీరోయిన్ పాత్రకి వాస్తవిక దృక్పథాన్ని కల్పిస్తూ, టెంప్లెట్ చెర నుంచి బైట పడేసి నట్టయ్యేది.


ఒరిజినల్లో ఇన్స్ పెక్టర్ పాత్ర పోషించిన ఉపేంద్ర లిమాయే, ఈ రీమేక్ లో గ్యాంగ్ స్టర్ నాన్యా భాయ్ గా కన్పిస్తాడు. ఈ పాత్రని ఒరిజినల్లో దర్శకుడు ప్రవీణ్ టార్డే పోషించిన తీరు చూస్తే ఉపేంద్ర తేలిపోతాడు. అదే ఒరిజినల్లో ఉపేంద్ర పోషించిన ఇన్స్ పెక్టర్ పాత్ర చూస్తే సల్మాన్ తేలిపోతాడు. రీమేక్ అన్నాక తేలిపోవడం మామూలే.

        సాంకేతికంగా జానర్ డిమాండ్ ని బట్టి  డార్క్ మూడ్ విజువల్స్ తో వుంది. కలర్ థీమ్ మాత్రం అతి డిమ్ గా కన్పిస్తుంది. కెమెరామాన్ కరణ్ రావత్ యాక్షన్ సీన్స్ కి కమర్షియల్ షాట్స్ తీయకుండా, బ్రేక్ లేకుండా తీవ్రత ఫ్లో అవడానికి నార్మల్ టేకింగ్ తీసుకున్నాడు. క్లయిమాక్స్ లో రన్నింగ్ హీరో ఛేజ్ దృశ్యాలకి నార్మల్ టేకింగ్ తో మంచి టెన్షన్ బిల్డప్ చేశాడు. అజయ్ దేవగణ్ నటించిన ప్రకాష్ ఝా అపహరణ్ (2005) లో యాక్షన్ దృశ్యాలు గుర్తొస్తాయి. కేజీఎఫ్ చాప్టర్-1 సంగీత దర్శకుడు రవీ బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు మూవీ జానర్ మూడ్ ని ఎలివేట్ చేస్తూ వుంది. జానర్ ని బట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోరు సృష్టించడం అరుదు. తెలుగులో అన్ని సినిమాలకీ ఒకటే దరువు.

        ఇరవై ఏళ్ళుగా దర్శకుడుగా వున్న 30 సినిమాల మహేష్ మంజ్రేకర్ అవుట్ డేటెడ్ అవకుండా మేకింగ్ చేశాడు. కాకపోతే ఒరిజినల్లో వున్న అసలు కాన్సెప్ట్ ని మిస్సయ్యాడు.

చివరికేమిటి

ముల్షీ పాటర్న్ మరాఠీ ఒరిజినల్ ని రైతు ఉద్యమం లేని 2018 లో నిర్మించారు. అయినా నేటి రైతు ఉద్యమం దృష్ట్యా ఇది ఇప్పటికీ సమకాలీనంగా వుంది కాన్సెప్ట్ తో. మంజ్రేకర్ - సల్మాన్ ద్వయం నేటి సంచలన రైతు ఉద్యమకాల నేపథ్యంలో రీమేక్ విడుదల చేస్తూ ఒరిజినల్లోని కాన్సెప్ట్ నే మిస్సయ్యారు. లేకపోతే రైతు ఉద్యమం ప్రతిబింబించే బలంతో సమకాలీనంగా వుండేది. ప్రేక్షక బలాన్నీ పెంచుకునేది.

        ఇన్స్ పెక్టర్ రాజ్ వీర్ సింగ్ గా సల్మాన్ వాయిసోవర్ తో ఈ రియలిస్టిక్ ప్రారంభమవుతుంది. పట్టణ, నగర శివార్లలో బలవంతులు బొటాబోటీ ధరలకి రైతుల పొలాలు లాక్కుని బలపడుతున్నారనీ చెబుతూ, పొలాలు అమ్ముకున్న రైతులు ఆ డబ్బు నిలుపుకోలేక నగరాలకి వెళ్ళి కూలీలుగా మారుతున్నారనీ, అలాటి ఒక కుటుంబ కథే ఇదనీ స్టాంపు వేశాక- కథా నాయకుడు రాహుల్యా కథ ప్రారంభమవుతుంది. ఫస్టాఫ్ లో ఇదంతా బాలీవుడ్ గ్యాంగ్ స్టర్ / మాఫియా రెగ్యులర్ టెంప్లెట్ లోనే రొటీన్ గా వుంటుంది.

        అయితే ఒరిజినల్లో ఇది మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో వుంటుంది. మంజ్రేకర్ దీన్ని ఎత్తేసి లీనియర్ కథ చేశాడు. రెండిట్లో విషయం మాత్రం అదే. విషయం లేనప్పుడు కథని నిలబెట్టడానికి మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో మభ్య పెట్టకూడ దంటాడు సిడ్ ఫీల్డ్. ఒరిజినల్లో మభ్య పెట్టడమే వుంది. రీమేక్ లో మంజ్రేకర్ మభ్యపెట్టకుండా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు ఎత్తేసి, సీదా కథగా సాపు చేసి ఇస్త్రీ చేసినా అదే ఫలితం. విషయ లేమితో విలవిల. ఎన్నిసార్లు ఈ టెంప్లెట్ నే చూడలేదు. మొన్న పూరీ జగన్నాథ్ తనయుడి రోమాంటిక్ లోనూ మాఫియాగా మారే క్రమం ఈ టెంప్లెట్టే.

        టెంప్లెట్ లో వరసగా ఎబిసీడీలు : ఏ - తండ్రి పొలం అమ్ముకుని దెబ్బతిన్నాక కుటుంబంతో పుణె వెళ్ళి కూరగాయల మార్కెట్లో కూలీగా తండ్రితో బాటు చేరతాడు రాహుల్యా, బి - అక్కడ కార్పొరేటర్ అనుచరులని కొట్టి జైలుకి పోతాడు రాహుల్యా, సి- జైల్లో కార్పొరేటర్ అనుచరుల్ని కొట్టి గ్యాంగ్ స్టర్ నాన్యా దృష్టిలో పడతాడు రాహుల్యా, డి- నాన్యా బెయిలు మీద విడిపిస్తే కార్పొరేటర్ ని చంపి మళ్ళీ జైలుకి పోతాడు రాహుల్యా, ఎఫ్ - మళ్ళీ నాన్యా బెయిలు మీద విడిపిస్తే నాన్యాని చంపేసి అతడి స్థానంలో గ్యాంగ్ స్టర్ అవుతాడు రాహుల్యా... ఈ టెంప్లెట్ తోనే ఫస్టాఫ్ లో గ్యాంగ్ స్టర్ గా ఎస్టాబ్లిష్ అయ్యే కథ వుంటుంది. ఇతణ్ణి అదుపు చేయాలనుకుంటున్న ఇన్స్ పెక్టర్ రాజ్ వీర్ కీ, రాహుల్యాకీ  ఫైట్ సీను ఇంటర్వెల్ గా వుంటుంది.  

        ఇంకో రెండు గ్యాంగ్ స్టర్ గ్రూపులుంటాయి. ఇక ఈ మొత్తం అందర్నీ రూపు మాపడానికి రాజ్ వీర్ వాళ్ళ ఇగోలతో వాళ్ళల్లో వాళ్ళకే తంపులు పెట్టి ఆడుకునే ఆట సెకండాఫ్. ఇక్కడ కథ ఎటూ వెళ్ళకుండా అక్కడక్కడే తిరుగుతూంటుంది. ఇంటర్వెల్ ఫైట్ సీను తర్వాత కథ సెకండాఫ్ సిండ్రోమ్ లో పడి మొరాయిస్తున్నట్టు వుంటుంది. ఇక క్లయిమాక్స్ లోనే శత్రు గ్యాంగ్ తో రాహుల్యా యాక్షన్ సీనుతో వూపందుకుని ముగుస్తుంది. ఈ ముగింపు వర్మ కంపెనీ మార్కు ముగింపు కావడంతో షాకింగ్ గా ఏమీ వుండదు. ఒక పిల్ల వాడు వచ్చేసి రాహుల్యాని అకస్మాత్తుగా కాల్చి చంపి కథ ముగించడం. 


మరాఠీ హిట్ సైరత్ ముగింపు లాగా - రక్తపు మడుగులో తల్లిదండ్రుల శవాల్ని చూసిన పిల్లవాడు రక్తపు అడుగుజాడల్ని సృష్టిస్తూ వెళ్ళిపోయే మరపురాని క్లోజింగ్ ఇమేజిలా వుంటుందనుకుని – ఇలా పిల్లవాడితో చంపించినట్టుంది మరాఠీ ముల్షీ పాటర్న్ లో.       


        మంజ్రేకర్ దాన్నే తీసుకోవడంతో ముగింపు వర్కౌట్ కాలేదు. కంపెనీ లో ఈ క్లాసిక్ ముగింపు చూడని ప్రేక్షకులకి బాగానే వుండొచ్చు. కంపెనీ కథా క్రమంలో మనం పూర్తిగా మర్చిపోయే విజయ్ రాజ్, ముగింపు చివరి క్షణంలో మెరుపులా అనూహ్యంగా ప్రత్యక్షమై, అజయ్ దేవగణ్ ని షూట్ చేసి చంపి- షాకింగ్ ముగింపు నిస్తాడు. కథా క్రమంలో విజయ్ రాజ్ ని మనం ఎక్కడో పూర్తిగా మర్చిపోయేలా చేసిన వర్మ నేర్పు వల్ల, ఈ మాస్టర్ స్ట్రోక్ సాధ్య పడింది.

ఇదలా వుంచితే, అసలు మరాఠీ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏమిటి? పొలాలు అమ్ముకుని పతనమవుతున్న రైతులకి కనువిప్పు కల్గించడం. రేపు పార్లమెంటులో రద్దు కాబోతున్న మూడు రైతు చట్టాల్లో వ్యవసాయం కార్పొరేట్ల వశమై రైతులు వాళ్ళ పొలాల్లో వాళ్ళే కూలీలుగా పనిచేయాల్సిన పరిస్థితి సరే, చట్టాలు రాకముందు రైతులు చేస్తోందేమిటి? పొలాలు అమ్ముకుని కూలీలుగా వలస వెళ్ళడం. మరాఠీ ఒరిజినల్ ఈ వైఖరిని ఖండిస్తోంది. మంజ్రేకర్ దీన్ని టచ్ చేయకుండా ప్రాణంలేని గ్యాంగ్ స్టర్ కథ చేశాడు.

        చివరికి రాహుల్యా చనిపోయాక, తండ్రి పడీ పడీ పిచ్చినవ్వు నవ్వుతాడు. నా కొడుకు చచ్చి పోయాడు కాబట్టి ఇక గ్యాంగ్ స్టర్ గా వుండడూ - అని.  విషాదం. అయితే క్లోజింగ్ షాట్ టాప్ యాంగిల్లో, వాన జల్లు పడకుండా రాహుల్యా శవానికి జనం గొడుగులు పడుతున్నట్టు వుంటుంది. ఇలాటి కథ ఇక కోరుకో వద్దని చెప్పకుండా, గ్యాంగ్ స్టర్ ని గ్లోరిఫై చేస్తున్నట్టు వుంది గొడుగులు పట్టడం ...

(మరాఠీ ఒరిజినల్ కూడా చూడాల్సి రావడం వల్ల రివ్యూ ఆలస్యం)

—సికిందర్

26, నవంబర్ 2021, శుక్రవారం

1095 : రివ్యూ


 రచన - దర్శకత్వం శ్రీను గవిరెడ్డి
తారాగణం :  రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, నరేన్, పోసాని కృష్ణమురళి, అజయ్, అరియనా తదితరులు
సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : గేష్ బనేల్ 
బ్యానర్స్ : : అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎల్లెల్పీ  
నిర్మాతలు : సుప్రియ, ఆనంద్ రెడ్డి
విడుదల : నవంబర్ 26, 2021
***

రాజ్ తరుణ్ సక్సెస్ కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. 2013 లో పరిచయమవుతూ నటించిన ఉయ్యాల జంపాల సక్సెస్ తర్వాత, 2015 లో కుమారి 21 ఎఫ్ తప్ప, ఇంత వరకూ సక్సెస్ ఏమీ లేదు. నటించిన 11 సినిమాలూ వరుసగా ఫ్లాపయ్యాయి. తాజాగా ఇప్పుడు అనుభవించు రాజా విడుదలైంది. దీనికి దర్శకుడు తను నటించిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు అనే ఫ్లాప్ తీసిన గవిరెడ్డి శ్రీను! ఫ్లాపు ఫ్లాపూ కలిసి అనుభవించు రాజా అంటూ వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ పెద్ద బ్యానర్ అండగా వుంది. మరి ఈసారి ఏం అనుభవించారు- హిట్టా, ఫ్లాపా? తెలుసుకుందాం...

కథ 
పశ్చిమ గోదావరి జిల్లా యండగండి అనే గ్రామం. ఈ గ్రామంలో బంగారం అలియాస్ రాజు (రాజ్ తరుణ్)  తాత బాగా ఆస్తిపరుడు. రాజు ఏ లోటూ లేకుండా పెరుగుతాడు. ఇంతలో యాక్సిడెంట్ జరిగి తల్లిదండ్రులు చనిపోతారు. తాత కూడా చనిపోతూ మాట చెప్తాడు- ఇన్నాళ్ళూ డబ్బు కూడ బెట్టడమే సరిపోయిందనీ, దాన్ని అనుభవించ  లేకపోయాననీ, నూవ్వైనా రాజాలా అనుభవించమనీ చెప్పి చచ్చిపోతాడు. చెప్పకపోయినా ఏకైక వారసుడిగా అనుభవించే వాడే. రాజు పెద్దవాడై అనుకోని ఒక సంఘటనలో జైలుకి పోతాడు. జైల్లోంచి విడుదలై హైదరాబాద్ వెళ్ళిపోతాడు.  ఆక్కడ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరతాడు. ఇక్కడ ఇటీ జాబ్ చేస్తున్న శృతి (కాశీష్ ఖాన్) తో ప్రేమలో పడతాడు. రాజు సిస్టమ్స్ సెక్యూరిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడనునుకుని ఆమె కూడా ప్రేమలో పడుతుంది. తీరా ఒట్టి సెక్యూరిటీ గార్డేనని తెలుసుకుని షాకవుతుంది. రాజు వూరు విడిచి వచ్చేయాడానికి కారణమేమై వుంటుంది? అక్కడేం జరిగి వుంటుంది? ఆస్తిని రాజాలా అనుభవించకుండా ఎందుకు వదిలేసి వచ్చాడు? ఇవి తెలుసు కోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

ఆయాచిత ఆస్తిని అనుభవించే పని లేని రాజాగా కామెడీ కథగా చెప్పొచ్చు. దీంట్లో ఏదో గుణపాఠం నేర్పొచ్చు. కానీ కామెడీ అనుకున్నది కాస్తా హంతకులు జొరబడే సస్పెన్స్ థ్రిల్లర్ గా మారుపోవడంతో ఫస్టాఫ్ వరకే వర్కౌట్ అయింది. సెకండాఫ్ విషయంలేక తేలిపోయింది. ఎత్తుగడ ఆసక్తి కరంగానే వుంది.  టైటిల్స్ కి ముందు ఆ గ్రామంలో రాజ్ తరుణ్ కోటీశ్వరుడి వారసుడిగా పరిచయమై, తర్వాత జైల్లో కనిపిస్తాడు. ఆ తర్వాత హైదారాబాద్ లో ఐటీ కంపెనీకి సెక్యూరిటీ గార్డ్ గా వుంటాడు. ఇలా క్యారక్టర్ సస్పెన్స్ తో మారిపోతూ వుంటుంది. హీరోయిన్ తో లవ్ ట్రాక్ మొదలవుతుంది. అది రెగ్యులర్ గా సినిమాల్లో బోరు కొడుతున్న సాఫ్ట్ వేర్ ప్రేమల్లో ఒక టెంప్లెట్ ప్రేమగా టైము తినేస్తుంది.      

ఇంటర్వెల్లో ఒక మలుపుతో సెకండాఫ్ లో గ్రామంలో ఫ్లాష్ బ్యాక్ లోకి  పోతుంది కథ. ఇంటర్వెల్ వరకూ సస్పెన్సుతో నిలబడ్డ కథ, సెకండాఫ్ లో విషయం లేక చతికిల బడింది. కామెడీ చేసి నవ్వించే ప్రయ్తత్నాలు కూడా ఫలించలేదు. కోళ్ళ పందాలూ, అవెలా జరుగుతాయన్న వివరాలూ, రాజ్ తరుణ్ ప్రెసిడెంట్ గా పోటీ, హంతకుల హడావిడీ...ఏవీ ఫస్టాఫ్ లో లేవనెత్తిన ప్రశ్నలతో పోటీ పడి నడవలేదు. బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఇంతే. లైటర్ వీన్ సినిమాలు తీస్తే ఒకప్పటి రోమాంటిక్ కామెడీల్లాగే ఫ్లాపావుతాయి. ఈ మూవీ రాజ్ తరుణ్ కి ఫస్టాఫ్ హిట్, సెకండాఫ్ ఫ్లాప్.

నటనలు- సాంకేతికాలు

రాజ్ తరుణ్ ఏ పాత్రయినా చక్కగా నటించగలడు. కథలే కలిసి రావడం లేదు. తనకున్న యూత్ ఫాలోయింగ్ క్రమక్రమంగా తగ్గిపోతున్న పరిస్థితి వుంది. ఓపెనింగ్స్ కూడా వుండడం లేదు. తనేం చేయాలో ఇక తీవ్రాలోచన చేయాల్సిందే. అన్నపూర్ణ బ్యానర్లో కూడా పరిస్థితి మారకపోతే ఇంకెప్పుడూ మారుతుంది. ఐతే అన్నపూర్ణ నిర్వాహకులు ఈ స్క్రిప్టుని ఎలా అనుకుని జడ్జి చేశారన్నది కూడా పాయింటే.

        రాజ్ తరుణ్ గ్లామర్ కి గోపీసుందర్ సమకూర్చిన పాటలు కూడా సహకరించలేదు. కొత్త హీరోయిన్ కశీష్ ఖాన్ తో రొటీన్ రోమాన్సు వల్ల కెమిస్ట్రీ కూడా వర్కౌట్ కాలేదు. అందచందాలున్న కశీష్ కి సరైన పాత్ర కూడా లేదు. ప్రొడక్షన్ విలువలూ, కెమెరామాన్ నగేష్ విజువల్స్ మాత్రం బావున్నాయి.

—సికిందర్

 

1094 : రివ్యూ

రచన- దర్శకత్వం : మిలాప్ జవేరీ
తారాగణం : జాన్ అబ్రహాం
, దివ్యా ఖోస్లా కుమార్, హర్ష్ ఛాయా, జాకీర్ హుస్సేన్, అనూప్ సోనీ, నోరా ఫతేహీ తదితరులు
సంగీతం : సంజయ్ చౌదరి
, ఛాయాగ్రహణం : డడ్లీ
బ్యానర్స్ : టీ సిరీస్ ఫిలిమ్స్
, ఎమ్మే ఎంటర్ టైంమెంట్స్
నిర్మాతలు : భూషణ్ కుమార్
, కృష్ణ కుమార్, మనీషా అద్వానీ, నిఖిల్ అద్వానీ
విడుదల : నవంబర్ 25
, 2021

***

        జాన్ అబ్రహాం తో సత్యమేవ జయతే (2018) తీసిన దర్శకుడు మిలాప్ జవేరీ దాని సీక్వెల్ సత్యమేవ జయతే 2 తో వచ్చాడు. మాస్ సినిమాలకే చెడ్డ పేరు తెస్తున్నాడని పేరున్న మాస్ డైరెక్టర్ జవేరీ, సీక్వెల్ తో ఇంకెంత చెడ్డ పేరు తెస్తాడోనని భయ సందేహా లేర్పడ్డాయి. పైగా 1980 ల నాటి సినిమాలకి నివాళిగా తీసినట్టు ప్రకటించాడు. నివాళిగా తీస్తే నీటుగానే తీసి వుంటాడని ఒక పక్క నమ్మకమేర్పడింది. జాన్ అబ్రహాం త్రిపాత్రాభినయం చేయడంతో మాస్ యాక్షన్ మస్తుగా వుంటుందని ఫ్యాన్స్ కూడా బుకింగ్స్ కి రెడీ అయ్యారు. కోవిడ్ తర్వాత ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించాలంటే ముందు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఆడే మాస్ సినిమాలు తీయాలని ప్లాన్ చేసిన జవేరీకి, మొన్న సూర్యవంశీ మాస్ పెద్ద హిట్టవడంతో ధైర్యం వచ్చేసింది. మరి ఇది మాస్ సినిమాలకి మంచి పేరా, చెడ్డ పేరా చూద్దాం...

కథ

ఉత్తర ప్రదేశ్‌లోని సంకీర్ణ ప్రభుత్వంలో సత్య బలరామ్ ఆజాద్ (జాన్ అబ్రహాం) హోం మంత్రి. ఇతడి తండ్రి దాదా సాహెబ్ బలరాం ఆజాద్ (జాన్ అబ్రహాం) వ్యవసాయదారుడు. కవల సోదరుడు జై బలరాం ఆజాద్ (జాన్ అబ్రహాం) ఏసీపీ. సత్య బలరామ్ ఆజాద్ హోమ్ మంత్రిగా అసెంబ్లీలో అవినీతి నిరోధక బిల్లు ప్రవేశ పెడతాడు. దీన్ని కూటమి భాగస్వాములు వ్యతిరేకిస్తారు. దీనికి ఎమ్మెల్యే విద్య (దివ్యా ఖోస్లా కుమార్) కూడా వ్యతిరేకంగా ఓటేస్తుంది. ఈమె సత్య భార్యే, పైగా ముఖ్యమంత్రి చంద్ర ప్రకాష్ కుమార్తె. అసెంబ్లీలో బిల్లుని ఓడించడంతో సత్య ఇక స్వయంగా తనే అవినీతి పని బట్టాలనుకుంటాడు.

        ఓ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సమ్మెకి దిగుతారు. ఈ సమయంలో ప్రమాదానికి గురైన కూతురికి చికిత్స చేయమని ఓ తల్లి వేడుకుంటే, సమ్మెకి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ నిరాకరిస్తాడు. ఆ కూతురు చనిపోతుంది. దీంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న హోమ్ మంత్రి సత్య, డాక్టర్ని చంపేస్తాడు. దీంతో భయపడి సమ్మె విరమిస్తారు. సత్య రాత్రికి రాత్రే హీరో అయిపోతాడు. ఇది సీఎం చంద్ర ప్రకాష్ కి నచ్చక, వాణ్ణి పట్టుకోమని పోలీసుల్ని ఆదేశిస్తాడు. సత్యని పట్టుకోవడానికి కవల సోదరుడు ఏసీపీ జై రంగంలోకి దిగుతాడు.        

మదర్సాలో విషాహారంతో అస్వస్థతకి లోనై ఆస్పత్రిలో చేరిన 40 మంది పిల్లలు ఆక్సిజన్ అందక చనిపోతారు. దీనికి పాడైపోయిన ఆహార ధాన్యాలని సరఫరా చేసిన ఎమ్మెల్యే, ఆక్సిజన్ని సరఫరా చేయని ఎమ్మెల్యే, ఇద్దరూ  కూటమిలో భాగస్వామ్య పార్టీ సభ్యులే బాధ్యులని వాళ్ళిద్దర్నీ చంపేస్తాడు సత్య. ఒక ఫ్లైఓవర్ కూలిపోవడంతో అది నిర్మించిన కాంట్రాక్టర్ అవినీతిపరుడని అతణ్ణి కూడా సత్య చంపేస్తాడని ఏసీపీ జై ఆపడానికి ఉద్యుక్తుడవుతాడు...ఇక అవినీతిపరుల్ని చంపుతున్న సత్యకీ, అతణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించే జైకీ మధ్య తీవ్ర సంఘర్షణ ప్రారంభమవుతుంది...

నివాళి కాదు నిప్పు

1980 ల నాటి యాంగ్రీ యంగ్ మాన్ సినిమాలకి నివాళిగా ఈ సినిమా అందిస్తున్నట్టు చెప్పిన దర్శకుడు మిలాప్ జవేరీ, 1980 ల నాటి సినిమాలంటే నేటి తరం ప్రేక్షకులు భయపడేంత భీకరంగా తీశాడు. 1980 ల నాటి సినిమాలు ఇలా వుండేవా? ఆ నాటి దర్శకులు ఇంత నాటుగా వుండేవాళ్ళా? ఇది నివాళియా, నిప్పంటించడమా? జాన్ అబ్రహాం అవినీతి పరుల్ని నిప్పంటించి జుగుప్సాకరంగా చంపినట్టు - 1980 ల నాటి సినిమాల చరిత్రని ఇలా తుదముట్టించడమే. అప్పటి సినిమాల్లో దేశభక్తి ఇలా వుందా? దేశభక్తి పేరుతో ఇలా చేశారా? మిలాప్ జవేరీ చూపించింది థర్డ్ క్లాస్ దేశభక్తి. చెవులు పగిలి పోయేలా అరుపులు అరిచి వినిపించే దేశభక్తి. చంపినప్పుడల్లా తన్ మన్ ధన్ సే బడ్కర్ జన్ గణ్ మన్ (దేహం, గుండె, డబ్బు కంటే గొప్పది జనగణమన) అని గొంతు చించుకునే నాటు దేశభక్తి. ఏ దేశానికైతే గంగమ్మ తల్లిగా వుందో, అక్కడ రక్తం కూడా త్రివర్ణ పతాకమే - అనే రక్తదాహపు దేశభక్తి. హింసకి పర్యాయ పదంగా అతి దేశభక్తి.

మరిన్ని భీకర అరుపులు- ఒక్కో పాపిష్టోడ్నీ ఎలా చంపుతానంటే...మళ్ళీ జన్మలో వాడు అమ్మ కడుపులోంచి బయటికి రావడానికే కాదు, అయ్య వీర్య కణంలోంచే బయటికి రావడానిక్కూడా భయపడి చస్తాడు!

        నా కుతి తీరేలా నిన్ను కొడతా. నువ్వు పళ్ళు బయటపెట్టి పడీ పడీ నవ్వాల! నవ్వాపావో, మళ్ళీ మళ్ళీ కొడతా!

        చెత్త నాకొడుకుల్ని చంపాలంటే 56 ఇంచుల ఛాతీ కాదు, 56 కిలోల బండ (చెయ్యి) కావాలి!

        నా ఫండమెంటల్ దండి (దండి మార్చ్) కాదు, నా ఫండమెంటల్ దండా (లాఠీ). గాంధీజీకీ ఎప్పుడూ జై, కానీ నా భగత్ సింగ్ కి ఇంకా జై!  


నోట్లు తప్ప ఇంకేం మారలేదు. పేదోడు బరిబత్తెలు గానే వున్నాడు, ఇక ఇప్పుడు అవినీతైనా అంతమవ్వాలి, రక్తాలైనా పారాలి!

        సిగ్నల్ దగ్గర పోలీసుకి వంద రూపాయల మీద ఆశ. నీ పేరు ఖాన్ అయితే నీ ఖాందాన్ (వంశం) మొత్తం టెర్రరిస్టులే. రైతు వాడింట్లో వాడే ఫ్యానుకి వేలాడే నా దేశం మహాన్ హై!

        ఈ హీరోయిజాన్ని చూసి ప్రతీసారీ జనాలు కవితలు అల్లి మరీ జేజేలు పలకడం-హీరోనే ఎంట్రీ మారీ, పబ్లిక్ నే సీటీ మారీ, అబ్ తో షురూ మారామారీ! (హీరోగారు ఎంట్రీ కొట్టారు, జనాలు ఈలలు కొట్టారు, ఇక వీర కొట్టుడు మొదలు) ... కసమ్ సినిమాకీ, అబ్ దిఖాదే బేటీ తూ ధర్తీ మాకీ! (సినిమా మీదొట్టు, నేలతల్లి బిడ్డగా ఇహ నేల మట్టం చెయ్యమ్మా).

దినపత్రిక చదువుతున్నట్టు ఎత్తి రాసి తీసిన ఎన్నో సంఘటనలు. అమరుడైన తండ్రి పెన్షన్ కోసం ఓ యువతి పోతే అవినీతి అధికారి వెళ్ళ గొట్టడం, రాజకీయ నాయకుల అనుచరులు ఓ యువతిని మానభంగం చేస్తే ఆమె బహిరంగంగా కాల్చుకుని చనిపోవడం, రైతుల ఆత్మ హత్యలు, లోక్ పాల్ బిల్లు, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు, మత సహనం, సామరస్యం... ఇలా ఎన్నెన్నో.

        ప్రభుత్వాఫీసు ముందు ఖురాను, జానీమాజ్ పట్టుకుని నిలబడ్డ ముస్లిం స్త్రీని ప్రశ్నించిన అధికారికి జాన్ అబ్రహాం రాజ్యాంగం గురించి క్లాసు పీకడం. అసలామె అక్కడెందుకు నిలబడిందంటే, జాన్ అబ్రహాం రాజ్యూంగం గురించి కూడా ఓ క్లాసు పీకే సీను వుండాలి కాబట్టి. కానీ రాజ్యూంగ భక్తి లేకుండా దేశభక్తి పూని మనుషుల్ని నిప్పంటించి మరీ చంపడం. జాతీయ పతాకాన్ని కూడా అవమానించడం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపినప్పుడల్లా జాతీయ పతాకాన్ని చూపించడం.

        ముగ్గురు జాన్ అబ్రహాంలు అరుపులు, పెడబొబ్బలు, గాండ్రింపులు! అసలు సినిమాలో ఏ నటులు కూడా మాట్లాడరు, అరుస్తారు. మామూలుగా అరవరు, మ్యూజిక్ డైరెక్టర్ దిక్కులు పిక్కటిల్లేలా కొట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పోటీపడి అరుస్తారు. ఈ మూవీ భారీ శబ్దాల హోరు. చెవులు తట్టుకోగల్గాలి.

1980 సినిమాలకే కాదు అప్పటి దర్శకులు మన్మోహన్ సింగ్, ప్రకాష్ మెహ్రా లకి కూడా నివాళీ అన్న దర్శకుడు, చెడగొట్టి చూపించడానికి దేన్నీ వదల్లేదు.  అర్ధం పర్ధం లేని కిచిడీ కథ; నాటు, మోటు, ఘాటు నటనలు, లాజిక్ లేని హాస్యాస్పదమైన ఫైట్లు...హెలికాప్టర్ ఎగరకుండా పట్టి లాగుతాడు అబ్రహాం. మోటారు సైకిలు మీద వున్న వాడితో సహా లేపి గాల్లోకి విసిరేస్తాడు. ఇవన్నీ చూసి మాస్ ప్రేక్షకులు మాత్రం చప్పట్లు కొడితే చాలనుకున్నట్టుంది. ట్రైలర్స్ విడుదల చేసినప్పుడే ట్విట్టర్ నిండా వెటకారాలు చేశారు యూత్.

ఒకందుకు మెచ్చుకోవాలి

జాన్ అబ్రహాం అరుపులు  అరిస్తే అరిచాడు, అతడికా శక్తి వుంది. అరవలేని ఇతర నటులు అరవడం సూట్ కాకపోయినా అరవడమే. ఇది ఇంకో టార్చర్. సిక్స్ ప్యాక్ జాన్ అబ్రహాం తను గౌరవం గల స్టార్ అన్న విషయం మర్చిపోయి, సక్సెస్ కోసం సృష్టించిన బీభత్సం వూర మాస్ ప్రేక్షకులకే నచ్చుతుంది. దేశభక్తితో అన్నితరగతుల ప్రేక్షకుల్ని ఆకట్టుకో లేక పోతే దేశభక్తినే అవమానించినట్టు అవుతుంది. పూర్వం సంగతి పక్కన పెడదాం, కనీసం 1980 నుంచీ నేటి వరకూ ఇంత నేలబారు చీప్ సినిమా ఏ భాషలోనూ రాలేదు. అయితే ఒక విషయంలో దర్శకుణ్ణి మెచ్చుకోవాలి- 1980 ల సినిమాల్లో దేశభక్తి మత ఫీలింగుతో లేదు. దీన్ని కాపాడినందుకు అభినందించాలి.

        ఈ సినిమాకి లేడీస్ కూడా వస్తారనేమో, ఈ బీభత్స కాండలో స్త్రీలు జరుపుకునే కర్వా చౌత్ పండగ పాట హీరోయిన్ దివ్య మీద పెట్టారు. ఇంకో పెళ్ళి పాట నోరా ఫతేహీ మీద పెట్టారు. విచిత్రమేమిటంటే ఈ రెండు పాటలూ బావున్నాయి- ముగ్గురు అబ్రహాంల అబ్బా అనే దెబ్బని మనం తట్టుకోవడానికి!

  సికిందర్

 

 

25, నవంబర్ 2021, గురువారం

1093 : క్విక్ రివ్యూ!

రచన- దర్శకత్వం: జీతూ జోసెఫ్
తారాగణం: వెంకటేష్, మీనా, కృతిక, ఎస్తర్ అనిల్, తనికెళ్ల భరణి, నదియా, నరేష్, సంపత్ రాజ్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం : సతీష్ కురుప్
బ్యానర్స్ సురేశ్ ప్రొడక్షన్స్, ఆశీర్వాడ్ సినిమాస్ నిర్మాతలు: డి సురేష్ బాబు, ఆంటోనీ పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి
విడుద; నవంబర్ 25, 2021 (అమేజాన్ ప్రైమ్)

***

        2014 లో వెంకటేష్ తో హిట్టయిన  దృశ్యం ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ సీక్వెల్  దృశ్యం 2 ఈ రోజు విడుదలైంది. దృశ్యం 2 మలయాళం ఒరిజినల్ గత ఫిబ్రవరిలో ఓటీటీలో అమెజాన్లో విడుదలై ఫర్వాలేదనిపించుకుంది. తెలుగు సీక్వెల్ కూడా ఇప్పుడు అమెజాన్లోనే విడుదలైంది. దీనికి ఒరిజినల్ దృశ్యం’, దృశ్యం 2 దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. తెలుగు దృశ్యం శ్రీప్రియ దర్శకత్వం వహించింది. ఇప్పుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెలుగు సీక్వెల్ ఎలా వుందో చూద్దాం.

కథ

   దృశ్యం లో కేబుల్ ఆపరేటర్ అయిన రాంబాబు (వెంకటేష్) ఇప్పుడు థియేటర్ ఓనర్ గా, సినిమా తీయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ గా వుంటాడు. భార్య జ్యోతి (మీనా), కూతుళ్ళు అంజూ, అనూ (కృతిక, ఎస్తర్ అనిల్) వుంటారు. రాంబాబు ఓ రచయిత (తనికెళ్ళ భరణి) తో కలిసి సినిమా కథ కూడా రాస్తూంటాడు. ఆరేళ్ళ క్రితం దృశ్యం లో పోలీస్ ఐజీ గీత (నదియా) కొడుకు వరుణ్ అదృశ్యం కేసులో అనుమానితుడైన రాంబాబు కుటుంబాన్ని ఆ కేసు భయం ఇంకా వెన్నాడుతూ వుంటుంది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వరుణ్ ని చంపి కుటుంబాన్ని కాపాడుకున్నాడు రాంబాబు. శవం దొరక్కుండా చేశాడు. ఇప్పటికీ కోల్డ్ కేసుగా వున్న ఆ కేసుని ఇప్పుడు పోలీసులు తిరగ దోడడం ప్రారంభిస్తారు. దీంతో రాంబాబు కుటుంబం మళ్ళీ సమస్యల్లో పడుతుంది. ఐజీ గౌతమ్ సాహూ (సంపత్ రాజ్) కొత్త ఆధారాలతో రాంబాబుని ట్రాప్ చేస్తాడు. ఇప్పుడు రాం బాబు ఏం చేశాడు? సినిమా కథ అల్లడంలో టాలెంట్ చూపిస్తున్న రాంబాబు ఇప్పుడు ఏ కథల్ని అల్లి పోలీసుల్ని ఓడించాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

దృశ్యం కొనసాగింపు కథ దృశ్యం కంటే నీటుగా వుంది. ఫస్టాఫ్ కథనం 40 నిమిషాలు మాత్రం అత్యంత మందకొడిగా సాగుతుంది. ఈ నిడివిని కేసు భయంతో ఇంకా కూతుళ్ళు మానసిక వేదన అనుభవించే దృశ్యాలు, వెంకటేష్ ని మీనా సున్నితంగా సాధించే దృశ్యాలూ, రహస్యంగా పోలీసులు దర్యాప్తు చేసే దృశ్యాలూ ఒక క్రమ పద్ధతిలో వస్తూంటాయి డ్రామాని బిల్డప్ చేస్తూ. చనిపోయిన వరుణ్ తండ్రి నరేష్ కూడా వచ్చి, వరుణ్ అస్థికలైనా ఇప్పించమని వెంకటేష్ ని ప్రాధేయపడే ఎమోషనల్ దృశ్యాన్ని వెంకటేష్ గిల్టీ ఫీలింగ్ ని పెంచే మంచి దృశ్యంగా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు. ఒక అర్ధవంతంగా సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి వెంకటేష్ డిఫెన్స్ లో పడి, కథలు చెప్పే కాబోయే నిర్మాతగా చెక్ పెట్టే దృశ్యాలూ థ్రిల్ చేస్తాయి. కథనం, దాని చిత్రీకరణ, నేపథ్య సంగీతం మలయాళ దర్శకుడి చేతిలో రెగ్యులర్ తెలుగు సినిమాలకి భిన్నంగా ఒక ఫీల్ తో డిఫరెంట్ అనుభవాన్నిస్తాయి. మలయాళ దర్శకుడు ఈ తెలుగు సినిమా తీసి సహజత్వాన్ని అత్యంత సహజంగా ప్రెజెంట్ చేశాడు. క్లయిమాక్స్, ముగింపూ అసాధారణమైనవే మేధస్సుకి పని పెడుతూ.

నటనలు -సాంకేతికాలు

వెంకటేష్ మళ్ళీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పాత్రలో దృశ్యం అనుభవంతో దివ్యంగా చేసుకుపోయారు. ఫ్యామిలీ మాన్ గా తెలుగు మార్కు హెవీ ఎమోషన్స్ లేకుండా సున్నిత ఫీలింగ్స్ తో సైలెంట్ గా చేసుకుపోయారు. పోలీస్ స్టేషన్ లో నదియా ప్రతాపం చూపించే సన్నివేశంలోనూ డౌన్ ప్లే చేశారు. నదియా సంధించే ప్రశ్నలకి పోలీస్ స్టేషన్ కెక్కిన కుటుంబంతో పడే వేదన, నేరం ఒప్పుకోలేని డైలమా చాలా కాలం తర్వాత వెంకటేష్ లోని నటుడ్ని కొత్త రూపంలో చూపిస్తుంది. హైప్, కమర్షియల్ హంగామా, హీరోయిజమూ లేని ఈ బలమైన ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ తో వెంకటేష్ గుర్తుండి పోతారు.

        మీనా, కృతిక, ఎస్తర్, నదియా, సంపత్ రాజ్ నల్గురూ ఎక్సెలెంట్ గా నటించారు. అరుపులు, కేకలు లేకుండా, హింస, దానికి చెవులు పగిలే బిజిఎం లేకుండా సైలెంట్ గా సాగిపోయే మూవీ అసలు మూవీ చూస్తున్నట్టు భారంగా అన్పించదు. అమెజాన్లో తప్పక చూడాల్సిన తెలుగు మూవీ.

—సికిందర్