రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, ఫిబ్రవరి 2021, మంగళవారం

1013 : స్క్రీన్ ప్లే సంగతులు

 

  కథ : కుటుంబం, మతం, అధికారం, చమురు - నాల్గూ వాళ్ళిద్దరి జీవితాల్లో పోషించిన నిర్ణాయక పాత్రని చిత్రించే మహోజ్వల గాథ’. పైచేయి కోసం ఆయిల్ మోతుబరి డానీ, చర్చి పాస్టర్ ఇలై ల మధ్య మానవత్వానికి చోటు లేని ఘర్షణ. స్వార్ధపు విష కౌగిట్లో డానీ దుష్టత్వం, దైవ చింతనని తుంగలో తొక్కిన ఇలై దౌర్జన్యం. ధనార్జన లక్ష్యాన్ని న్యాయ సమ్మతంగా చూడలేని ఇద్దరు ఆస్తిక నాస్తిక దురదృష్టవంతుల అధోగతి యానం. చమురుతో ధనార్జనే ఏకైక లక్ష్యంగా అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన డానీ, వ్యాపార విస్తరణకి ఆ పట్టణాని కేగినపుడు, అక్కడి మత ప్రచారకుడు ఇలై దురాశతో తలపడే అధ్యాయంలో, ప్రతీ మానవ విలువ, ప్రేమ, సమాజ మర్యాద ధ్వంసమైన క్రమం. వ్యాపారం, మతం ఇలా వుండకూడదన్న సందేశం. ప్రపంచాన్నినడిపే భవిష్యత్ ఇంధనం చమురు అయినప్పుడు అది రక్తం కంటే విలువైనదని నమ్మిన డానీ, ఈ రక్తం ముందు దేవుడు లేడు, పాపం లేదని ప్రకటించే స్థితికి దిగజారిన ఇలై - ఇద్దరూ మానవ లోకం నుంచి వెలివేతకి అర్హులైన ఖల నాయకులే! 1927 అప్టన్ సింక్లేర్ నవల ఆయిల్! కి చిత్రానువాదం....

థా నిర్మాణం, బిగినింగ్ : 1898 లో న్యూ మెక్సికో. దూరాన మూడు కొండలు కనపడుతూంటాయి. ఆవిరి ఇంజన్ల చరిత్ర చరమ దశ కొస్తున్న కాలం. చమురు భవిష్యత్ ఇంధనం కాబోతోంది. ధనార్జనకి వెండి, బంగారం అన్వేషణల్లో ఎదుర్కొనే కష్టనష్టాలు ఇక లాభసాటి కావన్న భావం బలపడుతున్న సమయం. ధనవంతులు కావాలని యువత సాగించే ప్రయత్నాలు కొత్త మలుపు తీసుకుంటున్న వేళ. ఇలాటి యువకుల్లో ఒకడు డానీ. ఇంకా వెండి అన్వేషణలో వుంటాడు. వెండి కోసం బావి తవ్వుతూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడతాడు. దొరికిన వెండి ముక్క గుప్పెట పట్టుకుని, విరిగిన కాలితో పాక్కుంటూ పోతాడు. దూరాన అవే మూడు కొండలు కనపడుతూంటాయి. దూరపు కొండలు నునుపనీ, ఈ మార్గాన ధనార్జన అంత లాభసాటి కాదనీ.
        
కాలిఫోర్నియా 1902. చమురు బావి తవ్వుతాడు డానీ. చిన్నపాటి ఆయిల్ డ్రిల్లింగ్ కంపెనీ ఏర్పాటు చేస్తాడు. ఒక రోజు చమురు పడుతుంది. డానీ మొహం ఆనందంతో నిండిపోతుంది. చమురు పడిన ఈ శుభసందర్భంలో, పనివాళ్లలో ఒకడి ఏడాది కొడుకు ఏడ్వడం మొదలెడతాడు. పనివాడు వాడి మొహానికి చమురు పూస్తాడు. తర్వాత చమురు తోడుతూంటే, యంత్రం విరిగిపడి పని వాడు చనిపోతాడు. విధిలేక అనాధగా మారిన పనివాడి కొడుకుని పెంచుకుంటాడు డానీ. హెచ్ డబ్ల్యీవ్ అని పేరు పెడతాడు. వాడికి పాలు పట్టి లాలించే బదులు, పాలలో మద్యం కలిపి నిద్రపుచ్చేసి వదిలించుకుంటాడు.

        కాలచక్రం తిరిగిపోతుంది. డానీ కంపెనీ విస్తరణకి ప్రజల సహకారం కోరుతూ సమావేశాలు నిర్వహిస్తూంటాడు. తమ చమురు భూముల్ని అమ్మాలన్నా, లీజుకివ్వాలన్నా ప్రజలు వెనుకాడుతారు. కుటుంబం లేని తను విశ్వసనీయత కోసం పదేళ్ళ హెచ్ డబ్ల్యీవ్ ని కొడుకుగా చూపించుకుంటాడు. వ్యాపారానికి కొడుకుని సెంటిమెంటల్ గా వాడుకుంటాడు. సరేలే గానీ, మీ ఆవిడ ఏదని ఒకావిడ అడిగితే, వీణ్ణి కని, పురిట్లోనే పోయిందని అబద్ధం చెప్తాడు. డబ్బేతప్ప కుటుంబం గురించి అతడాలోచించ  లేదు.

        ఈ సమావేశాలు విఫలమవుతున్నాక, ఒక రోజు పాల్ సండే అనే అతను డానీని కలుస్తాడు. కలిసి, లిటిల్ బోస్టన్ లో వున్న తమ కుటుంబ భూముల్ని అమ్మకానికి పెడతాడు. చమురు నిల్వలున్నాయనీ, వచ్చి చూసుకోమనీ ఆహ్వానిస్తాడు.

***

         వివరణ : ఈ బిగినింగ్ విభాగం 25 నిమిషాలు వస్తుంది. పాల్ సండే వచ్చి డానీకి భూముల్ని ఆఫర్ చేసే ఈ చివరి దృశ్యం ప్లాట్ పాయింట్ వన్ (పిపి -1). ఇక్కడ పిపి -1 లో ఏముంది, కాన్ఫ్లిక్ట్ లేకుండా పిపి -1 ఎలా అవుతుందని కేకలు వేయనవసరం లేదు. గాథ కి ఆకలి కేకలు వేయకూడదు. పెదరాయుడు చూసి సూపర్ హిట్ చేసినప్పుడు కేకలేయ లేదుగా. ఉదాత్త పాత్రలతో పెదరాయుడు లాంటి ఉదాత్త కథ చెప్పినప్పుడది గాథవుతుంది. గాథల్లో ప్రధాన పాత్ర విలువల కోసం త్యాగం చేసే ఉదాత్త పాత్రగా వుంటుంది, లేదా విలువల్ని తుంగలో తొక్కుతూ పతనమయ్యే దుష్ట పాత్రగా వుంటుంది. గాథలు రెండే పాయింట్స్ చుట్టూ వుంటాయి : విలువలతో మంచి తనం, లేదా విలువలతో చెడు తనం. మంచి తనంతో ఉదాత్త పాత్ర, చెడుతనంతో దురాత్మ పాత్ర. మొదటి దానితో త్యాగం, రెండో దానితో పతనం. హీరోకి విజయమనే అలవాటయిన రొటీన్ ముగింపులు ఇక్కడ మర్చిపోవాలి. జీవితాలన్నీ విజయాలతోనే ముగియవు. సినిమాలన్నీ విజయ ఢంకా మోగించవు.

        పెదరాయుడు లో రజనీకాంత్, మోహన్ బాబుల ప్రధాన పాత్రలు మాట కోసం ప్రాణ త్యాగం చేసే పాత్రలు. ఈ త్యాగాన్ని నిలబెట్టడం కోసం ఉపయోగపడేది కుట్ర చేసే ప్రతి నాయక పాత్ర. అందువల్ల త్యాగం చేసే ఉదాత్త పాత్రకి గాథలో లక్ష్యం వుండదు. లక్ష్యముండదు కాబట్టి, తనవైపు నుంచి కాన్ఫ్లిక్ట్ వుండదు. ఈ ఉదాత్త పాత్ర ఒక మాటనో, చేతనో నెగెటివ్ గా తీసుకున్న ప్రతినాయక పాత్రకే లక్ష్యం వుంటుంది. దీంతో ఉదాత్త పాత్రని దెబ్బతీస్తుంది. ఇదే పెదరాయుడు గాథ. మనమొక మంచి మాట చెప్తాం. ఇది నచ్చని అతను వెనుక నుంచి వచ్చి కత్తి పోటు పొడిస్తే మనమేం చేస్తాం. ఉదాత్త పాత్రకి మంచి తనం ఒక లక్ష్యం కాదు, దాని జీవితంలోనే మంచితనం ఆల్రెడీ ఒక భాగం. ఏదైనా లోపించినప్పుడే అది సాధించాలన్న లక్ష్యం ఏర్పడుతుంది. ప్రతినాయకుడికి తన చెడుతనం దెబ్బ తింటోందని అనిపిస్తుంది గనుకే, మంచి తనాన్ని చంపాలన్న లక్ష్యం ఏర్పడుతుంది. కాబట్టి సరైన మహోజ్వల గాథల్ని చూసినప్పుడు ఫార్ములా పొలికేక లేయకూడదు, జీవితపు ఏడ్పులు ఏడవాలి.

        గాథల్లో ప్రధాన పాత్ర యాక్టివ్ పాత్రగా వుండదు, ప్రత్యర్ధి పాత్రే అసమంజస కోర్కెలతో యాక్టివ్ గా వుంటుంది- వుంటేనే ప్రధాన పాత్ర నైతిక బలం తేలుతుంది. రామాయణం ఒక గాథనుకుంటే, రామాయణం లో రఘువంశమంతా పాసివ్ క్యారక్టర్ల మయమే, కైకేయితప్ప. ఈమె యాక్టివ్ గా తన లక్ష్య దృష్టితో దశరధుడి మీద కోర్కెల బాణం విసరకపోతే, రామాయణమే లేదు. గాథల్లో యాక్టివ్ పాత్రలు నిప్పు రాజెయ్యకపోతే పాసివ్ పాత్రలకి ఉనికే లేదు, ట్రాజడీల్లేవు, వాటి త్యాగాలూ గొప్పతనాలూ తేలవు.

        ఇప్పుడు పై కథ పిపి -1 లో కాన్ఫ్లిక్ట్ ఏర్పడలేదంటే ఇదే కారణం. గాథ కావడం. అయితే డానీతో ఇది ఉదాత్త పాత్ర గాథా, లేక దురాత్మ పాత్ర గాథా అన్న సందేహం ఈ బిగినింగ్ విభాగంలో తలెత్తే ఆస్కారమే లేదు. పాజిటివ్ పాత్రగానే కన్పిస్తున్నాడు. ఇలాగే కన్పించాలి. ఇప్పుడే నెగెటివ్ క్యారక్టర్ గా చూపించేస్తే పాత్ర పరంగా సస్పెన్స్ ఏముంటుంది, గుప్పెట్లో కథ బయటపెట్టేస్తే ఇంకేముంటుంది. పైగా కథనంలో డైనమిక్స్ ఏముంటాయి.
        
అంటే ఈ పిపి -1 తర్వాత, రాబోయే మిడిల్-1 కథనంలో ఇప్పుడు పాజిటివ్ గా కన్పిస్తున్న డానీకి ఎవరో ప్రత్యర్ధి పాత్ర ఎదురు కావచ్చన్న మాట. అందుకని పిపి- 1 లోనే కాన్ఫ్లిక్ట్ ఏర్పడాల్సిన అవసరం లేదు. కాన్ఫ్లిక్ట్ ఏర్పడ్డానికి తగిన తయారీ జరిగితే చాలు. ఈ తయారీ స్థల మార్పు కావచ్చు. అంటే బిగినింగ్ విభాగపు నేపథ్యం లోంచి ఇంకో కొత్త నేపథ్యం లోకి స్థల మార్పు. మొనాటనీగా అన్పిస్తున్న కథనానికి రీఫ్రెష్ బటన్ నొక్కినట్టు. పాత్రకి బిగినింగ్ విభాగంలోంచి స్థాన చలనం జరిగిందంటే, పిపి-1 వచ్చినట్టే. ఇలా ఇక్కడ డానీ భూములు కొనడానికి లిటిల్ బోస్టన్ కి ప్రయాణం స్థాన చలనమూ, స్థల మార్పులతో కూడిన పిపి-1 అయింది.

***

      ఈ బిగినింగ్ విభాగం సీనిక్ ఆర్డర్ చూద్దాం. 25 నిమిషాల ఈ కథనంలో అయిదే సీన్లుంటాయి. పాతిక నిమిషాల కథనానికి అయిదే సీన్లా అని మళ్ళీ గుండెలు బాదుకో నవసరం లేదు. ఇలా దర్శకుడో, కథకుడో వచ్చి చెప్తే పకపకా నవ్వుకుని, పోరాబై అననవసరం లేదు. కథకి రాసేసినట్టు ఐదు పక్కన సున్నా చేర్చి, 50 సీన్లూ తనివిదీరా పక్కాగా రాసుకుని, తృప్తిగా నిద్రపోతే గాథయి పోదు. కథలదేముంది, ఎలా తీసినా ఛోటా భాయీల నుంచీ బిగ్ స్టార్స్ వరకూ శుభ్రంగా నటించుకో వచ్చు. గాథలు బిగ్ స్టార్స్ కి సూటవుతాయి. బిగ్ స్టార్ పాత్రని కాక, పాత్రలోని మనిషిని డిమాండ్ చేస్తాయి గాథలు. స్ట్రక్చర్ ఒకటే. త్రీ యాక్ట్ స్ట్రక్చరే. ఆ స్ట్రల్చర్ లోపల గాథల కూర్పు వేరు, క్రియేటివిటీ వేరు, ఫ్లో వేరు, జానర్ మర్యాదలు వేరు.

        పాత దర్శకుడు డాన్ లివింగ్ స్టన్ ఫిలిం అండ్ ది డైరెక్టర్అని రాసిన పుస్తకంలో, ‘మూవ్ మెంట్అన్న విభాగంలో ఇలాగంటాడు- కెమెరా మూవ్ మెంట్ ని ఇంటలిజెంట్ గా నిర్వహించడం  దర్శకుడి విజువల్ టెక్నిక్స్ లో ప్రథమ స్థానం వహించాలి. అప్పుడే అతను  ప్రేక్షకుల్ని చాలా ఈజ్ తో సినిమా చూసేట్టు చేసేయగలడు. పాత్రల వ్యక్తిత్వాల చిత్రణ సుబోధకం చేయగలడు. అంతే కాదు, ప్రేక్షకుల్ని ఫీల్ గుడ్ మూడ్ లోకి ఇట్టే తీసికెళ్ళి కట్టిపడెయ్యనూ గలడు- అని.  పెదరాయుడు లో రవిరాజా పినిశెట్టి దిగ్విజయంగా సాధించిందిదే : స్లో మూవ్ మెంట్స్ తో, కథా నడకలో ఒక లయని స్థాపించి, కథాత్మ (సోల్) ని పోషించడం!

        అందుకని ఐదే సీన్లు. సనల్ శశిధరన్ అనే మలయాళ దర్శకుడు 2015 లో ఒకటి చెప్పాడు : మెయిన్ స్ట్రీమ్ సినిమాలకీ, ఇతర సినిమాలకీ మధ్య విభజన రేఖ చెరిగిపోయే కాలం రానే వస్తుందని. ఆ కాలం ఇప్పుడొచ్చేసింది. ఇప్పుడు ఓటీటీ సినిమాలే మెయిన్ స్ట్రీమ్ సినిమాలు. ఓటీటీలో ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్న విభిన్న ప్రయోగాలే మెయిన్ స్ట్రీమ్ సినిమాలు. దీన్ని థియేటర్ విండో సినిమాలు ఒప్పుకుని మారాల్సిన సమయం వచ్చేసింది...ఇక అల్లుడు అదుర్స్, రెడ్, బంగారు బుల్లోడు, జాంబీ రెడ్డి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, 3 రోజుల్లో సరీగ్గా తన్నుకు చావడమెలా - లాంటి ఆమ్ల వర్షాలు కురిపించే చిలుము పట్టిన రీసైక్లింగ్ మిల్లుని మూసెయ్యాలి. 2021 ఋతువు మారి, క్రతువు మార్చుకో మంటోంది.

***

    పాతిక నిమిషాల బిగినింగ్ విభాగంలో డానీ మీద ఐదు సీన్లు. మొదటి సీను వెండి కోసం బావిలో ప్రయత్నం, రెండో సీను దొరికిన వెండికి సర్టిఫికేట్ పొందడం, మూడో సీను ఆయిల్ డ్రిల్లింగ్ ఏర్పాటు చేసుకోవడం, నాల్గో సీను భూముల కోసం ప్రజలతో సమావేశం, ఐదో సీను పాల్ సండే భూములు అమ్ముతామని రావడం.

        రెండో సీను తప్ప మిగిలినవి దీర్ఘంగానే వుంటాయి. నాల్గో సీను వరకూ 15 నిమిషాలు డైలాగులే వుండవు- ఒక్క  వెండి బావిలో గాయపడినప్పుడు నో అనడం తప్ప, వెండి దొరకగానే దొరికింది...దొరికింది... అనుకోవడం తప్ప. ఈ 15 నిమిషాలూ క్యారక్టర్ గురించి ప్రతిదీ ఎస్టాబ్లిష్ చేసే క్రమం నిదానంగా సాగుతుంది. ప్రేక్షకుల్ని తదేక ధ్యానంలోకి తీసికెళ్లి పోతుంది. దీనికి ఒకే ఎడతెగని బాణీలో బిజీఎమ్ హార్రర్ సినిమాల్లో లాగా మిస్టీరియస్ అనుభవాన్నిస్తుంది. క్యారక్టర్ అంత మిస్టీరియస్ గా వుందని చెప్పడానికి. సినిమా ఎత్తుగడలోనే ఇంట్రెస్టు పెంచడానికి.
        
సినిమా మార్కెట్ యాస్పెక్ట్ కి ఒక ముఖ్య సూత్ర్ర మేమిటంటే, ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ స్క్రిప్టులో సమ్ థింగ్ క్రేజీ థాట్ కి పాల్పడ్డం. దాంతో ఆ థాట్ తో థ్రిల్లయిన ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రేక్షకుల్ని, మిగతా షోలకి మౌత్ టాక్ తో ప్రచారకులుగా మార్చెయ్యడం. సింపుల్ గా చెప్పాలంటే మొదటి షోకే సినిమాని వైరల్ చేయడం.

        డానీ క్యారక్టర్ ని అతడి చర్యల ద్వారానే బయట పెట్టారు. యాక్షన్ స్పీక్స్ క్యారక్టర్ అన్నమాట. ఒంటరిగా వెండి బావితీసి ఒక్కడే ఒంటరిగా పని చేయడంలో అతడి సంకుచిత మనస్తత్వం తెలుస్తుంది. ఇతరులతో సంబంధం లేకుండా తన కృషి తానే  చేసుకుని, తన సంపాదన తానే సంపాదించుకుని, తానే అనుభవించాలన్న మనస్తత్వం. కృషిని ఎంత సాహసించి, ఎంత ఓపికగా, ఎంత పట్టుదలగా, ఎంత నైపుణ్యంగా, నిశ్శబ్దంగా చేస్తాడో వెండి తీసే చర్యల్లోనే కన్పిస్తుంది. బావిలోంచి బయటి కొచ్చి, చలిమంట వేసిన చోట మూత్రం పోస్తాడు. తానే ఒక మంట, ఇంకో మంట ఎదురుగా వుండకూడదన్న భావం. ఈ మంట సీను రాబోయే మంటలాంటి ఇలై పాత్రతో ఫోర్ షాడోయింగ్ సీను. ప్రత్యర్ధి ఇలైని ఆర్పేస్తాడన్నమాట డానీ. ప్రతీ చర్యకీ, ప్రతీ షాటుకీ కథతో, పాత్రతో సంబంధముంది. మన స్టార్ అయితే ఇవన్నీ కామెడీ కోసం చేసి పోతాడు, అంతకంటే క్రియేటివ్ ఆర్ట్ తో ఏం చేయాలో అర్ధంగాక. పనైపోయాక డానీ తన ఖాళీ సమయాన్ని తనే ఎంజాయ్ చేస్తాడు. పిల్లవాడ్ని వ్యాపారంలో సెంటి మెంటల్ గా వాడుకుంటున్న డానీ, ఆ పిల్లాడితో ఎంత సెంటిమెంటల్ గా వుంటున్నాడో పాలల్లో మద్యం కలిపి తాగించినప్పుడే బయట పడింది.

***

  తర్వాత తప్పనిసరై కొందరు పనివాళ్లని పెట్టుకుని ఆయిల్ డ్రిల్లింగ్ ప్రారంభించినప్పుడు, వాళ్ళతో అస్సలు మాట్లాడడు. మనుషులంటే పడదు కాబట్టి. బావిలో ఆయిల్ పడ్డాక, పిల్లవాడి ఏడ్పు ఒక్కటే మానవ స్వరం. ఆయిల్ పడగానే పిల్లవాడు ఏడ్చినట్టు చూపడం రెండర్ధాల్ని సూచిస్తుంది : ఇంకాసేపట్లో అదే బావిలో తండ్రి మరణానికి హెచ్చరికా, ఆ పడ్డ ఆయిల్ తో ఒక కొత్త రక్త చరిత్ర మొదలవబోతున్న సంకేతం. పిల్లవాడి నుదుట తండ్రి ఆయిల్ పూసినప్పుడు, ఆయిలూ క్యాపిటలిజమూ కలగలిసిన కొత్త మతంలోకి పిల్లవాడి ఆగమన సందేశం కావొచ్చు. అయితే ఈ నుదుట ఆయిల్ పూత తలరాతలా వాడి జీవితమంతా వెంటాడుతుంది... యాక్షన్ స్పీక్స్ స్టోరీ. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దేన్ వర్డ్స్. పిల్లవాడి నుదుట చమురు పూయడమనే చర్యే కథ చెప్తోంది. అసలు డానీ వంశంలో రక్తం ప్రవహిస్తే, రక్త సంబంధాలుంటే, ఆయిలుని రక్తంగా మార్చేసే వాడు కాదేమో.

        పాతిక నిమిషాలూ వృధా కాకుండా నాల్గైదు సీన్లలో ఇంత కథవుంటే, ఇంత పాత్ర వుంటే, ఇంకెక్కడికి పోతారు ప్రేక్షకులు? ఈ పాత్ర నటించిన బ్రిటిష్ నటుడు డానియేల్ డే లెవిస్ కి, 2007 ఆస్కార్ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. 

        ఈ బిగినింగ్ విభాగంలో వుండాల్సిన బిజినెస్ వుంది. 1. ఆయిల్ ఉత్పత్తితో కథా  నేపథ్యపు ఏర్పాటు, 2. డానీ, పిల్లవాడు, పాల్ సండే కీలక పాత్రల పరిచయాలు, 3. విఫల సమావేశాలతో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, 4. భూముల ఆఫర్ తో పాల్ సండే రాకతో సమస్య ఏర్పాటు.

        ఆసక్తి పరులు తమ క్రియేటివ్ అప్డేట్స్ కోసం ముందుగా ఈ బిగినింగ్ విభాగాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసుకుంటే, ఆ తర్వాత మిడిల్-1 కెళ్దాం. సినిమా నెట్ ఫ్లిక్స్ లో వుంది.

సికిందర్


3, ఫిబ్రవరి 2021, బుధవారం

   సినిమా అంటే ఒక హీరో - ఒక విలన్, సినిమా అంటే ఒక యాంటీ హీరో - ఒక పోలీసు, సినిమా అంటే ఒక మంచి మాఫియా - ఒక చెడ్డ మాఫియా... సినిమా అంటే ఇద్దరూ విలన్లే అయితే? పెట్టుబడి దారు - మత ప్రచారకుడు? సంపద కోసం సంఘర్షణ? దేర్ విల్ బి బ్లడ్ - భూమాత దేహ నాళాల్లో చమురు కోసం?...ఇద్దరు విలన్ల ఇంటర్ ప్లేతో స్క్రీన్ ప్లే ఏమిటి? కథనా, గాథనా? రేపటి నుంచి... 

 

31, జనవరి 2021, ఆదివారం

1012 : సందేహాలు - సమాధానాలు




 Q : నేను మీ బ్లాగ్ ఫాలోవర్ ని. నాదొక చిన్న డౌట్. ప్రతీ మూవీలో హీరోకి ఒక గోల్ వుంటుంది. హీరో ఆ గోల్ తో సంఘర్షణ అనుభవించి చివరికి ఆ గోల్ సక్సెస్ లేక ఫెయిల్యూర్ అయి కదా పూర్తవుతుంది. ఐతే అర్జున్ రెడ్డి లాంటి కొన్ని మూవీస్ లో హీరోకి గోల్ వుండదు. ఇలాటి స్టోరీస్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి. కాస్త సలహా ఇవ్వండి.
రాజేష్ దమ్ము, అసిస్టెంట్

A :అర్జున్ రెడ్డి రోమాంటిక్ డ్రామా జానర్. రోమాంటిక్ డ్రామా గోల్ లేకపోయినా ఒక్కోసారి చెల్లుతుంది. ఇదే రోమాంటిక్ కామెడీ అయితే చెల్లదు. రోమాంటిక్ డ్రామాలు, ఇంకెవైనా ఫ్యామిలీ డ్రామాలు గాథల కిందికొస్తాయి. గాథలు తప్ప కథలనే వాటికి గోల్ వుండాల్సిందే. జీవితంలో గోల్ లేకుండా ఏ మనిషి వుంటాడు. వుంటే ఇంట్లోంచి వెళ్ళగొడతారు. వెళ్ళ గొట్టించుకునే గాథలు రాసుకోవచ్చు. సినిమా తీయాలన్న గోల్ తో వచ్చి, హీరోకి గోల్ ని ఎలా కాదంటారు. దర్శకుడికి కెరీర్ గోల్ వుండాలి గానీ హీరోకి, నిర్మాతకి బాక్సాఫీసు గోల్ వుండ కూడదా? కథ కి చక్రాల్లాంటిగి గోల్. చక్రాల్లేకుండా కథెలా డిజైన్ చేస్తారో తెలియదు. ఆర్ట్ సినిమాల గురించి శివాజీ గణేశన్ ఒకసారి చెప్పారు : నదిలో పడవ పోతూ వుంటుందిఇంకా పోతూ వుంటుంది ... పోతూనే వుంటుందికథలో ఏమీ జరగదని! పడవకి చక్రాలుండవు. అలలు ఎటు తోస్తే  అటు వెళ్ళి పోవాల్సిందే. గాథ చేయాలనుకున్నప్పుడు గోల్ లేకుండా రాసుకోవచ్చు. కథ చేయాలంటే చాలా ప్లస్ లు, మైనస్ లు దృష్టిలో పెట్టుకోవాల్సి వుంటుంది. గోల్ ఒక ప్లస్.

Q : మీరు డ్రమెటిక్ క్వశ్చన్ అని తరచూ అంటారు. అంటే ఏమిటి? కథలో అదెలా వుంటుంది?
అశోక్ గౌడ్, అసోషియేట్

A : మనం బ్లాగులో హాలీవుడ్ పదాలు వాడడంతో ఇలాటి సందేహాలు వస్తూంటాయి. ఏదైనా తెలుసుకోవడానికి మనకి హాలీవుడ్ తప్ప దిక్కులేదు. వాళ్ళు శాస్త్రాల్ని నిత్యం అభివృద్ధి చేసుకుంటూ వుంటారు కాబట్టి. డ్రమెటిక్ క్వశ్చన్ అంటే మరేమీ కాదు పాయింటు. కథలో పాయింటు. అయితే గమనించాల్సిందేమిటంటే, రెండిటి అర్ధం ఒకటే అయినా సైకాలజికల్ గా రచయిత మీద వేర్వేరుగా పనిచేస్తాయి. పాయింటు అనే పదం జడంగా వుండే భావం కల్గిస్తుంది. అదే డ్రమటిక్ క్వశ్చన్ చలనంలో వుండే ఉత్సాహం కల్గిస్తుంది. పాయింటు గురించి - పాయింటా? ఆఁ... కథలో అలా పడుంటుందిలే పాయింటు అన్పిస్తుంది తేలిగ్గా. దాంతో రచయిత కూడా పాసివ్ గా పడుంటాడు. అదే డ్రమెటిక్ క్వశ్చన్ అనుకుంటే - అమ్మో ఏదో చేయాలనుకుంటాడు. క్వశ్చన్, అంటే ప్రశ్న తలెత్తిందంటే అది కార్యాచరణకి సిద్దం చేస్తుందిగా? యాక్టివ్ గా మారతాడు. అప్పుడా కథలో డ్రమెటిక్ క్వశ్చన్ కి జవాబు వెతికే ఎజెండాతో, క్వశ్చన్ ని  ఫోకస్ చేస్తూ కథని ఉరుకులు పెట్టిస్తాడు.

    కథలో డ్రమెటిక్ క్వశ్చన్ విడిగా వుండదు. ప్రధాన పాత్రకి వుండే గోలే డ్రమెటిక్ క్వశ్చన్. ఆల్ డ్రామా ఈజ్ కాన్ఫ్లిక్ట్ అన్నాడు సిడ్ ఫీల్డ్. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఎప్పుడయితే కాన్ఫ్లిక్ట్ పుడుతుందో, అక్కడ్నించి ఆ మిడిల్ అంతా డ్రామానే. డ్రామా కానిది కాన్ఫ్లిక్ట్ కాదు. కాన్ఫ్లిక్ట్ కానిది డ్రామా కాదు. సినిమా ప్రారంభిస్తే చివరిదాకా వుండే కథనమంతా డ్రామా కాదు. కథ కానిది డ్రామా కాదు. డ్రామా కానిది కథ కాదు. ప్లాట్ పాయింట్ వన్ కి, ప్లాట్ పాయింట్ టూ కీ మధ్యన వుండేదే కథ, డ్రామా, లేదా కాన్ఫ్లిక్ట్. ప్లాట్ పాయింట్ వన్ కివతల, బిగినింగ్ లో వుండేది కేవలం సెటప్, లేదా ఉపోద్ఘాతం. అందుకని ఈ సోది ఎక్కువ చూపించ కూడదు. ప్లాట్ పాయింట్ టూ కవతల, ఎండ్ లో వుండేది మిడిల్లోని కథకి, లేదా డ్రామాకి, లేదా కాన్ఫ్లిక్ట్ కి పరిష్కారం.

     ఈ డ్రమెటిక్ క్వశ్చన్ ప్రధాన పాత్రని టార్గెట్ చేసే వుంటుంది.  అందుకని ఆ క్వశ్చన్ కి సమాధానం లేదా పరిష్కారం వెతికే ప్రయత్నం, లేదా సంఘర్షణ ఆ ప్రధాన పాత్రకే వుంటుంది. అంటే సమాధానం అంత త్వరగా దొరక్కుండా కథనాన్నిజటిలం చేస్తూ పోవాలన్న మాట. ఇంకోటేమిటంటే, గోల్ అనే పదం వాడినప్పుడు నేరోగా అది పాత్రకి మాత్రమే అంటి పెట్టుకుని ఫ్లాట్ గా వుంటుంది. కథలో ఫీల్ వుండదు. డ్రమెటిక్ క్వశ్చన్ అనుకున్నప్పుడు, కథంతా కూడా ఆ క్వశ్చన్ పుట్టించే ఫీల్ నిండి పోతుంది. అంటే సోల్ అన్నమాట. అందుకే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర గోల్ ఏర్పడే ముందు, ఆ గోల్ లో గోల్ ఎలిమెంట్స్ వుండాలనేది. ఏమిటా గోల్ ఎలిమెంట్స్? కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్. వీటిని బిగినింగ్ సెటప్ లో ప్రధాన పాత్రకి ఏర్పడేలా కథనం చేసుకోవాలి. ఒకసారి శివ ని చూసి ఈ మొత్తమంతా  స్టడీ చేసుకోండి.

 సికిందర్ 

 

27, జనవరి 2021, బుధవారం

1011 : రివ్యూ


రచన -దర్శకత్వం :  ప్రవీణ్ వర్మ
తారాగణం : నవీన్ చంద్ర
, చాందినీ చౌదరి, రాకేందు మౌళి, అజయ్ తదితరులు
సంగీతం : సన్నీ ఎంఆర్
, ఛాయాగ్రహణం : దివాకర్ మణి,  
నిర్మాత : సుధీర్ వర్మ
విడుదల : ఆహా

***

          హా నుంచి ఓటీటీలో కొత్త వెబ్ మూవీ సూపర్ ఓవర్ కొత్త దర్శకుడి మేకింగ్ లో విడుదలైంది. కొత్త దర్శకుడు ప్రవీణ్  వర్మ ఇదే మూవీ షూటింగులో కారు ప్రమాదంలో చనిపోయాడు. దీనికి నిర్మాతగా వున్న స్వామి రారా ఫేమ్ దర్శకుడు సుధీర్ వర్మ, మూవీ చివరి భాగాల్ని తనే షూట్ చేసి పూర్తి చేశాడు. 83 నిమిషాల నిడివితో ఇది థియేటర్ సినిమా కాదు కాబట్టి కథతో, పాత్రలతో, యాక్షన్ తో, అనివార్యంగా దీని పరిమితులు దీనికేర్పడ్డాయి. అయితే మేకింగ్ పరంగా చూస్తే దివంగత కొత్త దర్శకుడికి రెగ్యులర్ సినిమా తీసే సామర్ధ్యముంది. జీవించి వుంటే ఈ వెబ్ మూవీతో ఆ అవకాశం వచ్చేది.

        క్రికెట్ బెట్టింగ్ మీద 2008 లో మొదటి సినిమా జన్నత్ వచ్చింది. ఆ తర్వాత 2010 లో దో దోనీ చార్ వచ్చింది. ఈ రెండూ ఇండియాలో ఇల్లీగల్ అయిన క్రికెట్ బెట్టింగ్స్ వలలో పడవద్దని హెచ్చరిస్తాయి. ఇప్పుడు కాలం మారిపోయి, అక్రమం సక్రమమే అనే సినిమాలొస్తున్నాయి కాబట్టి, డబ్బు సంపాదించడానికి చట్టం, నీతి, న్యాయం వంటి స్పీడ్ బ్రేకులు అవసరం లేదనే ధోరణి కొత్త ట్రెండ్. బ్రిటన్లో, అమెరికాలో  క్రికెట్ బెట్టింగ్ లీగల్. ఇండియా నుంచి అక్కడ ఆన్లైన్లో బెట్టింగ్ కట్టొచ్చు. గెలిచిన సొమ్ముకి  ఇండియాలో కూడా పన్నుకట్టి హాయిగా అనుభవించొచ్చు- హవాలా బెట్టింగ్ బ్లాక్ మనీ భయం లేకుండా.

        ఈ 2021 లో కాశీ (నవీన్ చంద్ర), మధు (చాందినీ చౌదరి), వాసు (రాకేందు మౌళి) అనే ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్స్ ఇల్లీగల్ బెట్టింగ్ కే పాల్పడతారు. ఇలా చూస్తే ఈ కథ ఔట్ డేటెడ్ గా అన్పిస్తుంది. కాశీకి 40 లక్షలు ఒక అప్పు కట్టడానికి ఇంట్లో అవసరం. దీని కోసం ఫ్రెండ్స్ తో క్రికెట్ బెట్టింగ్ కి పూనుకుంటాడు. హైదారాబాద్ లో బంగార్రాజు (వైవా హర్ష) అనే బుకీ కి 30 వేలు కట్టి, కోటీ 70 లక్షలు గెలుస్తాడు కాశీ. ఈ డబ్బు తీసుకోవడానికి హవాలా బ్రోకర్ దగ్గరికి రాత్రి పూట బయల్దేరతారు ముగ్గురూ. ఈ క్రమంలో ఒక ఎస్సై (అజయ్) తో, హావాలా ఏజెంట్లతో ప్రమాదా లెదుర్కొంటారు. ఇక తెల్లారేసరికి ఈ డబ్బుని ఎలా రాబట్టుకున్నారనేది మిగతా కథ.

        ఇందులో క్రికెట్ బెట్టింగ్ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుందో ఆపరేషన్స్ వివరంగా చూపించారు. ఇదొక అండర్ వరల్డ్ దందా. బెట్టింగ్ ఏజెంట్లు
, బుకీలు, హవాలా దార్లు, డబ్బు చెల్లింపులు, అదును చూసి మోసాలు, పోలీసులతో సంబంధాలూ ఇవన్నీ ఒక రాత్రి కథలో చూపించారు. ఇది చూస్తే మర్యాదగా బతకాలనుకునే వాళ్ళు క్రికెట్ బెట్టింగ్స్ జోలికి పోరనేది దర్శకుడి ఉద్దేశమైతే అది నెరవేరుతుంది. డ్రగ్ మాఫియా మీద అదే పనిగా సినిమాలొచ్చి విలువ కోల్పోయాయి. కొత్తగా క్రికెట్ బెట్టింగ్ మాఫియా గురించి ఇదొక రౌండప్.

        ఇందులో ఫ్రెండ్స్ గా నటించిన నవీన్ చంద్ర, చాందినీ చౌదరి, రాకేందు మౌళిలు దాదాపు ప్రతీ సీనులో వుంటారు. కథకి తగ్గ నటనలు బాగానే వున్నాయి. వెబ్ కి సెన్సార్ లేదు కాబట్టి నోటి కొచ్చినట్టు పచ్చి అసభ్య భాష వాడారు. హిందీ ట్రెండ్ ఇక్కడ అలవాటు చేస్తున్నారేమో. ఇది కళా స్వేచ్ఛ దుర్వినియోగమని ఇప్పుడనలేం. కాలం మారింది. కళ ఎంత కుళ్ళుగా వుంటే అంత గ్రేట్ ఇప్పుడు. ఇక హీరోయిన్ నోరొకటే మిగిలింది. ఇది కూడా పూర్తి చేసేస్తే సరిపోతుంది.

        ఇక కథలో విషయం సరిగ్గా లేదు. బెట్టింగ్ డబ్బుల కోసం పరుగులు పెట్టడం, ఆ డబ్బు ఒకర్నుంచి ఒకరు లాక్కోవడం, చివరికి ఆ డబ్బుని చేజిక్కించుకోవడం ఇంతే కథ. పాత్రలకి ఎమోషనల్ కనెక్టిచ్చే బలమైన మలుపు లేదు. హవాలా దగ్గర డబ్బు తీసుకోవడానికి గుర్తింపు కోసం పది రూపాయల నోటు చూపించడం వుంటుంది. మధ్యలో ఆ నోటు పోగొట్టు కుంటారు. ఈ సన్నివేశం బలమైన ఎమోషనల్ కనెక్ట్ ఇస్తుంది. అయితే వెంటనే ఆ నోటు సంపాదించుకోవడంతో ఈ ఎమోషనల్ కనెక్ట్ కాస్తా వీగిపోతుంది. ఇంకో చోట డ్రైవ్ చేస్తున్న హీరోయిన్ కారు కింద పడి హవాలా ఏజెంట్ చచ్చి పోతాడు. ఇదికూడా కథని మలుపుతిప్పి పాత్రల్ని సమస్యలో పడెయ్యదు. అంతా పైపైన బలహీనంగా సాగిపోతూంటుంది కథనం.

    ఇంకో సమస్యేమిటంటే, ఈ మొత్తం కథ  పల్ప్ ఫిక్షన్ టెక్నిక్ తో చెప్పాలనుకోవడం. సుధీర్ వర్మ ఎనిమిదేళ్ళ క్రితం కొత్త దర్శకుడిగా తీసిన స్వామి రారా కి ఇదే టెక్నిక్ ఉపయోగించాడు. పల్ప్ ఫిక్షన్ లోని  సీక్వెన్స్ అప్రోచ్ టెక్నిక్. నడుస్తున్న కథలోకి ఒక పాత్ర వస్తే, అక్కడ కథాపి, వెనక్కెళ్ళి ఆ పాత్ర ఎక్కడ కనెక్ట్ అయిందో చెప్పుకు రావడం. దీన్నే తర్వాత తీసిన దోచేయ్ కి కూడా వాడేడు సుధీర్ వర్మ. దీన్నే తిరిగి ఇప్పుడు కొత్త దర్శకుడు ప్రవీణ్ వర్మ వాడేశాడు.

        ఈ పల్ప్ ఫిక్షన్ సీక్వెన్స్ అప్రోచ్ ని ఒకసారి వాడితేనే బావుంటుంది. రెండో సారి బావుండదు, మూడో సారి అసలు బావుండదు. ఇందుకే పల్ప్ ఫిక్షన్ టెక్నిక్ తో ఇంకో హాలీవుడ్ సినిమా తీయలేదు. పల్ప్ ఫిక్షన్ ని అలా తీయడానికి కారణం అది మూడు కథల్లో ఒక కథ. ఇలాటి కథ కాని వాటికి ఈ టెక్నిక్ ని వాడేయడం అర్ధరహితం.శ్యామ్ బెనెగల్ తీసిన సూరజ్ కా సాత్వా ఘోడా లో రచయిత పాత్ర అంటాడు - కథ చెప్పడానికి టెక్నిక్ ఎవరికవసరం? కథలో చెప్పడానికి విషయం లేని రచయితకి అవసరం- అని. ఇదీ సూపర్ ఓవర్ సమస్య.

        పాత్రలకి ఎమోషనల్ గా కనెక్ట్ చేసే అంశమేదైనా వుంటే ఈ సమస్య వచ్చేది కాదు. ముందుకు పరిగెడుతున్న కథని టెంపో దెబ్బతీస్తూ మూడుసార్లు ఆపి, కథలోకి వచ్చిన పాత్ర కనెక్టింగ్ పాయింట్ చెప్పుకు వచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కలిసే మొదటి పాత్ర ఎస్సై అజయ్ గురించి పదిహేను నిమిషాలు  విసుగు తెప్పించే కథ చూపించారు. రెండో సారి హవాలా ఏజెంట్ తో, మూడో సారి హీరోయిన్ చేసే యాక్సిడెంట్ తో. ఇలా ఇవన్నీ ముందుకు దౌడు తీయాల్సిన కథకి స్పీడ్ బ్రేకర్లు గా మారాయి. కథలో విషయం లేకపోతే టెక్నిక్ పేరుతో చేసే హంగామా ఇలా వుంటుంది. ఇక ముగింపు చూస్తే నడక మందగించి అర్ధాంతరంగా తెరపడుతుంది.

        టెక్నికల్ గా బిజీఎమ్, కెమెరా వర్క్ బావున్నాయి. రాత్రి పూట నిర్జన హైదారాబాద్ రోడ్ల మీద మాదాపూర్ నుంచీ కోఠీ వరకూ నైట్ సీన్స్ మొనాటనీ అన్పించవు. ఇలా రియలిస్టిక్ గా చూపించడమనేది కొత్తగా వచ్చిన మార్ప్పు అయితే, కంటెంట్ క్వాలిటీ లేకపోతే ఓటీటీలో ఆదరణ వుండదనేది ఒక నిజం. ఓటీటీలో గ్లోబల్ కంటెంట్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు, అదే క్వాలిటీ లోకల్ గా లేకపోతే తిరస్కరిస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి. థియేటర్ విండోకి సినిమాలెలా చుట్టేసినా చెల్లుతుందేమో గానీ, ఓటీటీకి కాదు.

సికిందర్  

 

 

 

 

 

 

 

22, జనవరి 2021, శుక్రవారం

1010 : రివ్యూ

రచన - దర్శకత్వం : బగ్స్ భార్గవ కృష్ణ
తారాగణం : అర్జున్ రామ్ పాల్, మానవ్ కౌల్, ఆనంద్ తివారీ, రజిత్ కపూర్, మధూ సిమ్రన్ కౌర్ 
సంగీతం : సంజయ్ వాండ్రేకర్, ఛాయాగ్రహణం : దీప్ మెట్కర్ 
నిర్మాతలు :  జహానారా భార్గవ, ధీరజ్ వినోద్ కపూర్
విడుదల : జీ5 
***

      కోర్టు రూం డ్రామాలంటే ఒక హత్య, ఒక ముద్దాయి, ఇద్దరు లాయర్లు, ఒక జడ్జి, కేసు విచారణ, గ్యాలరీలో జనం, థియేటర్లో ప్రేక్షకులు, ప్రేక్షకులకి రొటీన్. ఎందుకని రొటీన్ అంటే అవి రొటీన్ గా ఎండ్ సస్పెన్స్ కథలు. కానీ హత్య కేసు కథలనేవి కేసు రహస్యాలు బయటపెట్టే టెంప్లెట్ తోనే ఎందుకుండాలి. ఇది రొటీన్. కేసు విచారణలో ముద్దాయే ఒక రహస్యమై కేసే స్థంభించిపోతే, కేసే లేకుండా పోతే అప్పుడేమిటి? ఇంకో ఎండ్ సస్పెన్స్ కథతో కోర్టు విచారణ చూసే రొటీన్ తప్పుతుంది. 
      యాడ్ ఫిలిమ్ మేకర్, నటుడు, దర్శకుడు బగ్స్ భార్గవ కృష్ణ సాధారణ హత్య కేసు విచారణ కథని, మధ్యలో ముద్దాయి మిస్టరీగా తిప్పేసి కోర్టు రూం డ్రామా రొటీన్ టెంప్లెట్ ని నిలువునా బద్దలు కొట్టాడు. ఈ మధ్య కూడా గరుడ వేగ’, పడిపడి లేచే మనసు’, నర్తన శాల’, 24 కిస్సెస్ లాంటి సెకండాఫ్ సిండ్రోమ్ కథలతో అలవాటుగా తెలుగు సినిమా లొచ్చాయి. ఇంటెర్వెల్ కి కథ తెగిపోయి సెకండాఫ్ సంబంధం లేని వ్యవహారమన్న మాట. దర్శకుడు బగ్స్ నెయిల్ పాలిష్ కథని సెకండాఫ్ సిండ్రోమ్ కి అందకుండా స్లీప్ వాకింగ్ చేసేశాడు. అంటే పాసివ్ గా కూర్చుని చేసే స్టోరీ రైటింగ్ ఇక పని చెయ్యదన్న మాట, బయటి ప్రపంచంలో కొచ్చి చేసే స్టోరీ మేకింగ్ ఇప్పటి అవసరమన్న మాట. 
        నేరం మెదడు చేస్తుంది. ముద్దాయి మీద కేవలం నేరారోపణ చేస్తారు. అయితే బోనులో నిలబడ్డ ముద్దాయి దోషిగా రుజువవుతూ, నిర్దోషి కూడా అయితే అప్పుడేమిటి? - ఈ స్టోరీ ఐడియాతో కథలోకి వెళ్తే, లక్నోలో వీర్ సింగ్ (మానవ్ కౌల్) అని ఒక స్పోర్ట్స్ కోచ్. ఇన్స్ పెక్టర్ సురేష్ అతడి ఫ్రెండ్. ఒక రోజు వూరి బయట ఇద్దరు పిల్లల కాలిన మృతదేహాలు దొరుకుతాయి. సాక్ష్యాధారాలు వీర్ సింగ్ నే పట్టిస్తాయి. ఇంకో అంతుచిక్కని 32 మంది పిల్లల హత్య కేసుల్లో కూడా అనుమానితుడవుతాడు. జైల్లో వేస్తారు. సిద్ధార్థ్ జైసింగ్ అలియాస్ సిడ్ (అర్జున్ రామ్ పాల్) డిఫెన్స్ లాయర్. కేసు చేపడతాడు. అమిత్ కుమార్ (ఆనంద్ తివారీ) ప్రాసిక్యూటర్. కిషోర్ భూషణ్ (రజిత్ కపూర్) జడ్జి . ఇద్దరు పిల్లల తాజా హత్యల మీద విచారణ ప్రారంభమవుతుంది. డీఎన్ ఏ సాక్ష్యంతో వీర్ సింగ్ మీద కేసు రుజువు చేస్తాడు అమిత్ కుమార్. సిడ్ ఏం చేయడానికీ వుండదు. ఈ సాక్ష్యం ఒప్పుకోవాల్సిందే, వీర్ సింగ్ ని ఇక వదులు కోవాల్సిందే. కానీ పంతానికి పోతాడు. ఈ సాక్ష్యం కచ్ఛితత్వాన్ని నమ్మనని, ఎఫ్బీఐ కి పంపాలనీ పట్టు బడతాడు. అమెరికాలో ఎఫ్బీఐకి పంపితే 50 శాతమే టాలీ అవుతున్నట్టు రిపోర్టు వస్తుంది. ప్రాసిక్యూటర్ అమిత్ కుమార్ ఇది ఒప్పుకోనని చిందులేస్తాడు. ఈ గొడవ తెగక ఇలా వుంటే, ముద్దాయి వీర్ సింగ్ లో వీర్ సింగ్ వుండడు, చారు రైనా అనే ఆవిడ వుంటుంది. చారు రైనా మీద కేసేలా నడుపుతారు? ముద్దాయి లోంచి వీర్ సింగ్ మాయమై పోయాడు - వీర్ సింగే లేడు, కేసే లేదు! జడ్జికి దిమ్మదిరిగి పోతుంది...

***

       న్యాయ వ్యవస్థకే సవాలు ఈ కేసు. సిడ్, అమిత్ కుమార్ లు ఇక పోట్లాట మానుకుని ఈ మిస్టరీ ఏంటో తేల్చేందుకు ఒకటవుతారు. జడ్జికి ఇంటి దగ్గర డ్రింక్ చేసే పడుచు భార్య శోభ (మధూ) తో పిచ్చెత్తుతూ వుంటుంది. కేసుకాని కేసు విచారణ కోర్టు హాల్లోంచి జడ్జి ఛాంబర్ కి ప్రైవేటుగా మారుతుంది. ముద్దాయి కాని ముద్దాయి జైల్లో చేతి గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటూ వుంటాడు. 

        పాయింటే మిటంటే, డిఐడి ( డిస్ససోషియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్) అని మనో రుగ్మత వుంది. స్ప్లిట్ పర్సనాలిటీ అన్నమాట. దీన్ని ఇదివరకు ఎంపిడి (మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్) అనే వాళ్ళు. దీంతో అపరిచితుడు వచ్చింది. డిఐడి లో రోగిలో రెండు నుంచి 400 దాకా ఎన్నయినా పర్సనాలిటీస్ వుండొచ్చు. డిఐడి తో హాలీవుడ్ లో చాలా సినిమాలొచ్చాయి. 2017 లో ఎం. నైట్ శ్యామలన్, మెక్ ఎవాయ్ తో స్ప్లిట్ తీశాడు. ఇందులో 24 పర్సనాలిటీస్ బయటపడుతూ వుంటాయి మెక్ ఎవాయ్ లో.
        నెయిల్ పాలిష్ లో వీర్ సింగ్ లో వున్నది చారు రైనా ఆత్మనా, లేక అతనేనా? లేక చారు రైనాలా నటిస్తున్నాడా? అతడిలో వున్నది అతడే అయితే చారు రైనాగా ఎలా మారాడు? చారు రైనా ఎవరు? చారు రైనా గానే అతను మారాడని సైంటిఫిక్ గా రుజువైతే  కేసే మవుతుంది? శరీరం వీర్ సింగ్ ది, మెదడు చారు రైనాది. మెదడు నేరం చేయమంటుంది, శరీరం ఆ నేరం చేస్తుంది. పిల్లల్ని వీర్ సింగ్ శరీరమే చంపింది, కానీ చంపించింది అతడి మెదడే అని రుజువు లేదు. రుజువు చారు రైనాతో వుంది. మరి ఈ డిఐడి కేసు చిక్కు ముడి ఎలా వీడింది? జడ్జి ఎలా తీర్పు చెప్పాడు?

***

       డిఐడి తో వచ్చే సినిమాల మీద అమెరికాలో ఏమంత మంచి అభిప్రాయం లేదు. డిఐడి ని వాస్తవ దూరంగా భూతంలా చూపిస్తున్నారని ఆరోపణలు. జనాభాలో ఒక శాతం మందికే వుండే ఈ రుగ్మత హింసాత్మక చర్యలకి పాల్పడేలా చెయ్యదు. రోగులు తమని తాము కూడా హింసించుకోరు. ఇక హత్యలు చేసిన సంఘటనలు లేవు. ఇలాటి సినిమాల వల్ల ఈ రోగులు సమాజంలో వెలివేతకి గురవుతున్నారు. డిఐడి గురించి ఈ సినిమాలు ప్రేక్షకులకి తప్పుడు అభిప్రాయం కల్గించి, రోగుల్ని అంటరాని వాళ్ళుగా చేస్తున్నాయి. 

        అయితే నెయిల్ పాలిష్ లో వీర్ సింగ్ డిఐడి తో హత్యలు చేయలేదు. కేసు కొనసాగుతూండగా, జైల్లో జరిగిన ఒక సంఘటనతో డిఐడి కి లోనయ్యాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏడాదిన్నర వ్యవసాయ చట్టాలు ఆపుతామంటే, రైతులు కాదన్నట్టు- జడ్జి కేసు నిరవధికంగా వాయిదా వేస్తానంటే బాధితులు ఒప్పుకోరు. అప్పుడు జడ్జి క్రియేటివ్ మైండ్ తో అందరికీ తృప్తి కల్గించేలా ఇంటలిజెంట్ తీర్పు చెప్తాడు. ఈ ఆలోచన ఇంట్లో డ్రింక్ చేసే పడుచు భార్య వల్ల వచ్చింది... 
        చాలా కాలం తర్వాత నాటి  హీరోయిన్ మధూ పడుచు భార్యగా కన్పించింది. అర్జున్ రామ్ పాల్ కి జాతీయ అవార్డు వస్తుందని దర్శకుడి నమ్మకం. యూపీలో చిత్రీకరణ చేశారు. సాంకేతికంగా బావుంది. ఎడిటింగ్ చాలా బావుంది. కోర్టు దృశ్యాలు ఆర్డర్ ఆర్డర్ అరుపులతో లేవు. సహజంగా వున్నాయి. జడ్జిని యువరానర్, మిలార్డ్ టెంప్లెట్ పిలుపులతో సంబోధించడం లేదు. లాయర్లు జడ్జితో ఫ్రీగా వుంటారు. జడ్జి ఛాంబర్లో జడ్జి ముందు కాలుమీద కాలేసుక్కూర్చుంటారు. జడ్జి కూడా కేసు తేల్చడానికి లాయర్లతో కలిసి పని చేస్తాడు. 
        సినిమాలు మారి పోతున్నాయి. విషయ ప్రధాన సినిమాలు వస్తున్నాయి. పాత విషయాలు, ఉన్న నమూనాలూ, బాక్సాఫీసు మూస లెక్కలూ పక్కన పెడుతున్నారు. ఎవరూ ఇంకొకర్ని అనుసరించడం లేదు. ఎవరి పంథా వాళ్ళదిగా డైవర్సిటీని ప్రదర్శిస్తున్నారు. డైవర్సిటీతోనే  ఇలాటి డిస్కవరీలుంటాయి.  

సికిందర్