రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, నవంబర్ 2021, గురువారం

1080 : సాంకేతికం


       రాజ రాజ చోర లో చూద్దాం : 1. ఇందులో ప్రారంభ దృశ్యాల్లో జెరాక్స్ సెంటర్లో పనిచేసే శ్రీవిష్ణు, 2. గర్ల్ ఫ్రెండ్ మేఘా ఆకాష్ ల మధ్య ఫోన్ సంభాషణ ముగిశాక, 3. శ్రీవిష్ణు ఒక గ్యారేజ్ కెళ్ళి, ఐటీ ప్రొఫెషనల్ లా డ్రెస్ మార్చుకుని, ఐటీ జాబ్ చేసే మేఘా ఆకాష్ ని కలుసుకోవడానికి బయల్దేరతాడు. అంటే జెరాక్స్ సెంటర్లో పని చేసే శ్రీ విష్ణు, మేఘా ఆకాష్ ని ఐటీ ప్రొఫెషనల్ గా నమ్మిస్తూ, అందుకు గ్యారేజీలో దాచి పెట్టిన డ్రెస్ వేసుకుని ఆమెని కలవడానికి వెళ్తున్నాడనీ ఈ మూడు సీన్లలో అర్ధం జేసుకోవాలి. వీటిలో ఏ సీను వ్యర్ధంగా వుంటూ బడ్జెట్ ని పెంచింది? వ్యూయింగ్ ఎక్స్ పీరియెన్సు ని  డల్ గా మార్చింది?

        శ్రీవిష్ణు మేఘా ఆకాష్ తో ఫోన్లో మాట్లాడే 2వ సీను బడ్జెట్ కి, వ్యూయింగు ఎక్స్ పీరియెన్సుకీ భారంగా వుంది. ఈ సీన్ని స్క్రిప్టు ఆడిట్ లోనే కట్ చేసేయ్యొచ్చు. ఈ సీను, దీని తర్వాతి గ్యారేజి సీను చూస్తే ఎలాటి ఫీలింగు నిస్తున్నాయంటే, శ్రీవిష్ణు మేఘాతో ఫోన్లో మాట్లాడి వస్తున్నట్టు చెప్పి, గ్యారేజీకి వెళ్ళి, అక్కడ తాను ఐటీ ప్రొఫెషనల్ అన్నట్టు మేఘా ముందు నటించేందుకు, డ్రెస్ మార్చుకుని వెళ్తున్నాడు... అన్న స్పూన్ ఫీడింగ్ టైపులో డల్ ఫీలింగు నిస్తోంది.

        ఇది కూడా స్థలకాలాల ఐక్యతా సూత్రాన్నుపయోగించుకుని క్రాఫ్టింగ్ తో స్టోరీ మేకింగ్ చేయాల్సిన సందర్భం. కానీ స్టోరీ రైటింగే చేస్తూ ట్రీట్మెంట్ లో రాసుకున్నది ఎత్తి రాసిన డైలాగ్ వెర్షన్లా వుందిది. ఫైనల్ గా డైలాగు వెర్షనే షూటింగు స్క్రిప్ట్ అవుతుంది. తానొక రైటర్ గా ఫీలవకుండా, స్టోరీ మేకింగ్ చేసుకోవాల్సిన మేకర్, రైటర్ గానే  ఫీలవుతూ డైలాగు వెర్షన్ (షూటింగ్ స్క్రిప్టు) ఎలా రాసుకుంటే అలాగే షూటవుతుంది. తెరకెక్కుతుంది. ఎడిటింగులో కూడా సరిదిద్దడం కుదరదు.

        సాధారణంగా రివ్యూల్లో ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా వుండాల్సిందంటూ రాస్తూంటారు. మనం చెప్పుకుంటున్న మంచి రోజులొచ్చాయి’, రాజరాజ చోర లకి సంబంధించిన సీన్లలో వంటి ల్యాగ్ ని ఎడిటింగ్ లో సరిదిద్దడం కుదరదు. స్క్రిప్టుల్లోనే సరిదిద్దుకోవాలి. ఈ చిన్న విషయం ఎడిటర్లకి తెలీక కాదు. అసలు ఎడిటింగ్ లో సినిమా రన్ నే మార్చేసి, రెండు మూడు వెర్షన్లు దర్శకులకి చూపిస్తామంటారు మార్తాండ్ వెంకటేష్ వంటి ఎడిటర్లు. రాస్తున్నప్పుడు మేకర్ మేకర్ గా ఫీలైతే, విజువల్ సెన్స్ తో స్టోరీ మేకింగ్ చేసి, సంక్షిప్తీకరించి, ముచ్చటైన డైలాగు వెర్షన్ రాస్తాడు. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి ట్రీట్మెంట్లో ఓ మూడు సీన్లూ కలిపి రెండు సీన్లుగానో, ఒకే సీనుగానో మారిపోవడం యాదృచ్ఛికంగా జరిగిపోయే తంతుగా వుంటుంది.

        ఇప్పుడు ఇంటర్ కట్స్ తో శ్రీవిష్ణు మేఘాతో ఫోన్లో మాట్లాడే రెండో సీను, గ్యారేజీలో డ్రెస్ మార్చుకునే మూడో సీనూ విడివిడిగా వుండడం వల్ల, ఈ రెండు సీన్లలో కలిపి వున్న  విషయంలోని పంచ్ పంచ్ కాకుండా పోయింది. జోకుని రెండుగా విడదీసి ఇక్కడో ముక్క, అక్కడో ముక్క చెప్తే ఎలా వుంటుంది?

        సీన్ 2 లో మేఘాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, ఆమె అతడి గర్ల్ ఫ్రెండ్ గా మనకి రివీలైంది. ఇలా రివీల్ చేసి ఏమీ జరక్కుండానే సీను ముగించేసి, సీన్ 3 లో అతను గ్యారేజీలో డ్రెస్ మార్చుకుంటున్నప్పడు, ఐటీ ప్రొఫెషనల్ గా మేఘాని నమ్మిస్తున్నాడని అర్ధమైనప్పుడు కూడా ఫన్ లేదు, పంచ్ లేదు. డ్రెస్ మార్చుకుని వెళ్ళాడంతే.

        సీన్ 2 ఎత్తేసి, జెరాక్స్ సెంటర్లో వున్న వాడు టైము చూసుకుని గ్యారేజీకి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటూ వుంటే, ఎందుకా అని మనకి ఆసక్తి రేగుతుంది. ఇంతలో మేఘా నుంచి కాల్ వచ్చిందనుకుందాం, ఇప్పుడు ఇంటర్ కట్స్ లో ఆమె గర్ల్ ఫ్రెండ్ అని రివీలై, వాళ్ళ మాటల్లో ఆమె అమాయకత్వం, అతడి మోసం తెలుస్తూ, ఆమెని ఇటీ ఫ్రొఫెషనల్ లా నమ్మించడానికే డ్రెస్ మార్చుకుంటున్నాడని మనకి ఇప్పుడు అర్ధమవడంలో వున్న డ్రామా, డైనమిక్స్, థ్రిల్, ఫన్, పంచ్, చైతన్యం - విడివిడిగా వున్న రెండు సీన్లతో వున్నాయా? ఈ విడివిడి సీన్లు తగిన వీక్షణానుభవాన్నివ్వక పోగా, సీన్ 2 మీద అనవసర వ్యయాన్ని పట్టివ్వడం లేదూ?

2.   

స్టోరీ మేకింగ్ ట్రయాంగులర్ ఆట. స్టోరీ- మేకర్- ఆడియెన్స్ అనే ట్రయాంగిల్లో ఆట. ఇలా కాకుండా మేకర్ ఒక్కడే కూర్చుని స్టోరీయే ఆలోచిస్తూ, స్టోరీ చేసుకుపోతూంటే, అది సరళ రేఖ మీద సులభ ప్రయాణం. ఆ సరళ రేఖ మీద ఇటు చివర తను, అటు చివర స్టోరీ మాత్రమే వుంటాయి. సరళ రేఖ మీద తన కెదురుగా వున్న స్టోరీనే చూస్తూ, తన లోకంలో తోచినట్టూ స్టోరీ మేకింగ్ చేసుకుంటూ పోయీ బోరు కొట్టించే అవకాశముంటుంది.

                 ఎప్పుడైతే ఈ సరళ రేఖని వంచి త్రికోణంగా చేస్తామో, అప్పుడు మూడు మూల లేర్పడతాయి., మేకర్, స్టోరీ, ఆడియెన్స్. ఇప్పుడు మేకర్, స్టోరీ, ఆడియెన్స్  మూడు వైపులా వుంటారు. మేకర్ స్టోరీ వైపు చూసి తను ఫీలైంది ఆడియెన్స్ వైపూ చూసి ఆలోచిస్తాడు. దీనికి ఆడియెన్స్ రెస్పాన్స్, రియాక్షన్ ఎలా వుంటాయి, బుర్రకి పని చెప్పి బిజీగా ఈ సీన్ని చూస్తారా, ఎలా ఫీలౌతారు- మొదలైనవి. అంటే ఆడియెన్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసే ఇంటరాక్టివ్ స్టోరీ మేకింగ్ అన్నమాట.    


       బడ్జెట్ ఆదాతో బాటు ఆడియెన్స్ కి గుర్తుండి పోయే వ్యూయింగ్ ఎక్స్ పీరియెన్స్ నివ్వడం స్టోరీ మేకింగ్ ప్రధాన లక్ష్యంగా వుంటాయి. ట్రీట్మెంట్ నుంచి డైలాగ్ వెర్షన్ కెళ్ళే కీలక దశ దీనికి ప్రారంభం. ఓ కారు వచ్చి వచ్చి ఇంటి ముందాగింది - అని ట్రీట్మెంట్ లో మేకరే రాసుకున్నా, దీన్ని జల్లెడ పట్టి డైలాగు వెర్షన్ సవ్యంగా రాసుకోవాల్సి వుంటుంది. ఈ రోజు కొందరు మేకర్లు, కాబోయే మేకర్లు, అసిస్టెంట్లు నిన్నటి వ్యాసానికి రెస్పాండ్ అవుతూ ఫోన్లు చేశారు. తామూహించని స్క్రిప్టు రైటింగ్ టెక్నిక్స్ కొత్తగా చెప్పినందుకు బ్లాగుకి కృతజ్ఞతలు తెలుపుతూ. వీలైనంత నాలెడ్జిని వైరల్ చేయడమే ఈ బ్లాగు పని. ఇది ఎన్నాళ్ళుగానో రాయాలనుకుంటున్న వ్యాసం. అయితే సిట్టింగ్స్ లో ఈ కాన్సెప్ట్ ని అమలు పర్చడం జరుగుతూనే వుంది- స్క్రీన్ ప్లే సెట్టింగ్ వర్క్స్ లో.

3.
       
          ఓ కారు వచ్చి వచ్చి ఇంటి ముందాగింది - అని ట్రీట్మెంట్ లో మేకర్ రాసుకున్నాడనుకుందాం. అంత సెటప్ కి, షూట్ కీ డబ్బు పెట్టుకోలేను... దీంతో కథకీ, క్యారక్టర్ కీ ఉపయోగం లేదని నాలెడ్జి వున్న నిర్మాత అన్నాడనుకుందాం. అప్పుడు సమయస్ఫూర్తి గల మేకర్ ఏం చేస్తాడు? కారుని ఇంటి ముందే పెట్టి, క్యారక్టర్ని కారులోంచి దింపుతాడు. సరిపోతుంది. దీనివల్ల కథకీ, క్యారక్టర్ కీ, నిర్మాతకీ నష్టమేం లేదు. పైగా స్క్రిప్టు స్పీడు పెరుగుతుంది. ఎక్కడ్నించో దిక్కుమాలిన కారు వచ్చీ వచ్చీ, వస్తూనే.... వున్న ల్యాగ్ - సాగతీత వుండదు.

        ఒక కోళ్ళ వ్యాను వెళ్ళీ వెళ్ళీ స్తంభానికి ఓ గుద్ది, కోళ్ళు చెల్లాచెదురైన, రక్తసిక్తమైన సీనుకి బడ్జెట్ కోత వేసి ఏం చేయవచ్చు? ఇక్కడ బిగ్  బడ్జెట్ స్టార్ సినిమాల గురించి కాదు మాట్లాడుకోవడం. వాటిలో కోళ్ళ వ్యాను యాక్సిడెంట్ సీను ఎంత బీభత్సంగా నైనా తీయొచ్చు. ఈ సినిమాలెన్ని వుంటాయి - ఇవి ఏడాదికి పది వుంటే మిగిలిన మీడియం, స్మాల్ వంద పైనే వుంటాయి. వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. వీటికి బడ్జెట్ సేవింగ్ చాలా అవసరం. ఇక్కడ కోళ్ళ వ్యాను సీనుకి క్రాఫ్టింగ్ చేసి- వస్తున్న వ్యాను స్తంభానికి గుద్దింది చూపించి కట్ చేసేస్తే సస్పెన్స్ కూడా వుంటుంది. కట్ చేశాక, రోడ్డు పక్క కూర్చుని మూల్గుతున్న డ్రైవర్ కి, సెల్ ఫోన్లో యాక్సిడెంట్ ఫోటో చూపిస్తూంటాడు ఒకడు. వాడి చేతిలో రెండు చచ్చిన కోళ్ళుంటాయి రక్తం కారుతూ. ఇలా అంచెలంచెలుగా యాక్సిడెంట్ సీన్ ని రివీల్ చేస్తూ పోతే, టెన్షన్ కూడా పెరుగుతుంది.

        మన అభిమాన థ్రిల్లర్ నవలా రచయిత లీ చైల్డ్ వున్నాడు. అతను సృష్టించిన జాక్ రీచర్ యాక్షన్ క్యారక్టర్ చాలా పాపులర్. హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చాయి. అతను నవలల్లోనే సినిమా చూపిస్తాడు. విజువల్ గా రాస్తాడు. ఒక రకంగా నవలలకి స్టోరీ మేకింగ్ చేస్తాడు. యాక్షన్ని స్లో చేసి డ్రామా పెంచుతాడు. డై ట్రయింగ్ నవల్లో యాక్షన్ని విజువలైజ్ చేస్తూ స్లో యాక్షన్- హై డ్రామా ఎలా క్రియేట్ చేశాడో చూద్దాం...

        జాక్ రీచర్ గురి చూసి గన్ పేల్చాడు. మరుక్షణం గన్ బ్యారెల్లోంచి వేడి వేడి పొగ బయటికి ఎగజిమ్మింది. బుల్లెట్లోని గన్ పౌడర్ సెకనులో మిలియన్ వంతు కంటే తక్కువ కాలంలో విస్ఫోటించడంతో, ఆ మండిపోతున్న పొగ బుడగలా విప్పారింది.   
    
        బుడగలా విప్పారిన పొగని తిరిగి బ్యారెల్ గుంజేసుకుని, బ్యారెల్లోపల గ్రూవ్స్ రాపిడికి గిర్రున తిరుగుతున్న బుల్లెట్ వెనుకా, చుట్టూ పొగ కమ్మేసేలా చేసి, ఆ రాపిడికి బుల్లెట్ ఎగదన్ని బయటి వాతావరణంలోకి దూసుకు పోయేలా చేసింది బ్యారెల్.

        బయటికి వెళ్ళిన పొగ బుడగ వాతావరణాన్నిచర్రున వేడెక్కించేసింది...బుల్లెట్ కి ముందు దూసుకుపోతున్న వేడివేడి పొగ, గాలిలోని ఆక్సిజన్ ని వేడెక్కించేసి మంట రేగే స్థాయికి తీసికెళ్ళింది. ఆ మంటలో మెరుపు. బుల్లెట్ పొగలోంచి బయటికి దూసుకొచ్చేసింది. మండుతున్న గాల్లోంచి గంటకి 1900 మైళ్ళ వేగంతో.

        సెకనులో వెయ్యో వంతు కాలం తర్వాత, బుల్లెట్ ఇంకో మూడు గజాల దూరంలో వుంది. ఇంకో సెకనులో వెయ్యో వంతు కాలంలో, ఆరడుగుల దూరంలో వుంది. ఇక రొద చేసుకుంటూ టార్గెట్ ని తాకబోతోంది బుల్లెట్...  

        ఇదీ లీచైల్డ్ యాక్షన్ విజువలైజేషన్. అతను చెప్పడం లేదు, చూపిస్తున్నాడు. ఇలా సినిమాల్లో చూపించాలంటే సీజీకి సమర్పించుకోవాలిగా లక్షలకి లక్షలు అన్పించొచ్చు. స్టార్ సినిమాలకి సీజీకి సీజీన్నర పెట్టుకోగలరు. ఇతర సినిమాలకి దీన్లోని అర్ధాన్ని చూడాలి. కవి హృదయాన్ని చూడాలి. ఏం తేల్చి చెప్తున్నాడు లీ చైడ్? స్లో యాక్షన్ - హై డ్రామా గా లేదూ పై సీను? ఇంతకీ ఆ బుల్లెట్ ఎవరికైనా తగిలిందా లేదా చెప్పడానికి ఇంత సస్పెన్స్ లో ముంచెత్తడమన్న మాట.

        పైన చెప్పుకున్న కోళ్ళ వ్యాను యాక్సిడెంట్ సీనులోనూ ఇంతే. కోళ్ళ వ్యాను స్తంభానికి గుద్దుకున్నాక ఏమైంది? మూల్గుతూ రోడ్డు పక్కన కూర్చుని వున్నాడు డ్రైవర్. వ్యాను కేమైంది? ముందు భాగం నజ్జయినట్టు సెల్ ఫోన్లో  ఫోటోలు చూపిస్తున్నాడొకడు.  మరి కోళ్ళు ఏమయ్యాయి? అవి చచ్చినట్టు మచ్చుకి రెండు చచ్చిన కోళ్ళు చూపిస్తున్నాడు వాడు... లో బడ్జెట్లో స్లో యాక్షన్ -హై డ్రామా!
(ముగింపు శనివారం)

—సికిందర్   


10, నవంబర్ 2021, బుధవారం

1079 : సాంకేతికం


         మంచి రోజులొచ్చాయి ప్రారంభ దృశ్యాల్లో బెంగళూరులో ఐటీ జాబ్స్ చేస్తున్న సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాల పాట అయిపోయాక, వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వెళ్ళిపోవాలని మాట్లాడుకున్నాక, విమానం లాండ్ అవుతున్న షాట్ పడుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో విచారంగా కూర్చున్న కోటేశ్వరరావుని చూపిస్తుంది కెమెరా. అక్కడికి అజయ్ ఘోష్ వస్తాడు. వాళ్ళిద్దరి కూతుళ్ళ గురించి చర్చ జరుగుతుంది... అంటే బెంగళూరులో జాబ్స్ చేస్తున్న సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలు ఆల్రెడీ ప్రేమలో వున్నారనీ, వాళ్ళిద్దరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారనీ, వాళ్ళు వచ్చిన విమానం హైదరాబాద్ లో లాండ్ అయిందనీ, హైదారాబాద్ లో అజయ్ ఘోష్ మిత్రుడు కోటేశ్వరరావు విచారంగా కూర్చుని వున్నాడనీ, అజయ్ ఘోష్ అతడి దగ్గరకొచ్చి విచారంగా వున్న కారణం అడిగితే, ఇద్దరి మధ్య వాళ్ళ కూతుళ్ళ  మీదికి చర్చ మళ్ళిందనీ ఈ ఐదు సీన్లలో డల్ గా చెప్పారు. సినిమా ప్రారంభంలోనే డల్ గా చెప్పిన ఈ ఐదు సీన్లు ఎలా వున్నాయి? స్క్రిప్టు ట్రీట్మెంట్ లోంచి ఎత్తిరాసిన డైలాగ్ వెర్షన్ లా లేవూ? 

        స్క్రిప్టు ట్రీట్మెంట్ లోంచి ఎత్తి రాస్తే అది డైలాగు వెర్షన్ అవుతుందా? ఇదీ ఇప్పుడు వేసుకోవాల్సిన మిలియన్ బడ్జెట్ల ప్రశ్న. రచయితకి పరిధులుంటాయి. ఆ పరిధిలు దాటి విజువల్ గా డైలాగు వెర్షన్ రాయలేడు. దర్శకులు ఒప్పుకోరు. విజువల్స్ చూసుకోవడం దర్శకుల పరిధి. కాబట్టి రచయిత స్క్రిప్టు ట్రీట్మెంట్ లోంచే ఎత్తి డైలాగు వెర్షన్ రాయగలడు. కానీ  కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం మొదలైన వాటికి మేకర్ తనే అయినప్పుడు రైటర్ లా రాయలేడు. అతను రైటర్ లా రైటింగ్ చేయలేడు, మేకర్ లా మేకింగ్ చేస్తాడు. స్టోరీ మేకింగ్. అతను పదాలతో సీన్స్ ఆలోచించడు, షాట్స్ తో సీన్స్ ని చూస్తాడు. ఆ ప్రకారం రాస్తాడు. రైటర్ దగ్గర పెన్నే వుంటుంది, మేకర్ దగ్గర కెమెరా వుంటుంది. కెమెరాతో వెండి తెర మీద రాస్తాడు. స్టోరీ రైటింగ్ రైటర్ చేసుకుంటాడు, మేకర్ గా దర్శకుడు స్టోరీ మేకింగ్ చేస్తాడు. అంటే రైటర్ లా సీన్లతో డైలాగులు రాసుకుంటూ వర్బల్ గా కథ చెప్పకుండా, కెమెరా షాట్స్ తో ఇమేజెస్ సృష్టించి కదిలే బొమ్మల కథ చూపిస్తాడు. అతను చెప్పడు. చెప్పడం పుస్తక భాష. అతను చూపిస్తాడు. చూపించడం సినిమా భాష, దృశ్య మాధ్యమం భాష. దృశ్య మాధ్యమం భాష తెలిస్తే సీన్లు తగ్గి, సినిమా నిడివీ తగ్గి, దాంతో బడ్జెట్టూ తగ్గి, నిర్మాత సంతోషిస్తాడు.

        2.
           రాజ రాజ చోర లో చూద్దాం. ఇందులో ప్రారంభ దృశ్యాల్లో జెరాక్స్ సెంటర్లో పనిచేసే శ్రీవిష్ణు, గర్ల్ ఫ్రెండ్ మేఘా ఆకాష్ ల మధ్య ఫోన్ సంభాషణ ముగిశాక, శ్రీవిష్ణు ఒక గ్యారేజ్ కెళ్ళి, ఐటీ ప్రొఫెషనల్ లా డ్రెస్ మార్చుకుని, ఐటీ జాబ్ చేసే మేఘా ఆకాష్ ని కలుసుకోవడానికి బయల్దేరతాడు. ఈ రెండు సీన్లలో అర్ధమయ్యే విషయమేమిటి? జెరాక్స్ సెంటర్లో పని చేసే శ్రీ విష్ణు, మేఘా ఆకాష్ ని  ఐటీ ప్రొఫెషనల్ గా నమ్మిస్తున్నాడనీ, అందుకు గ్యారేజీలో దాచి పెట్టిన డ్రెస్ వేసుకుని ఆమెని కలవడానికి వెళ్తున్నాడనీ డల్ గా అర్ధమవుతోంది.

        ఇవి కూడా ట్రీట్మెంట్ లోంచి ఎత్తి రాసిన డైలాగ్ వెర్షన్ సీన్లే. ట్రీట్మెంట్ లోంచి ఎత్తి రాస్తే సీన్లు డల్ గానే వుంటాయి. చాలా సినిమాల్లో, చాలా చాలా సినిమాల్లో, వెండితెర మీద ట్రీట్మెంటే చూపిస్తున్నారు కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం మేకర్లు. వెండి తెర మీద చూపించాల్సిన డైలాగ్ వెర్షన్ చూపించడం లేదు. పుస్తక భాష చెప్తున్నారు. రైటర్ చేసే స్టోరీ రైటింగ్ అనేది జస్ట్ క్రియేటివిటీ, మేకర్ చేసే స్టోరీ మేకింగ్ క్రాఫ్ట్. క్రాఫ్ట్ తెలిసిన మేకర్లు ఎంతమంది వున్నారు? ఎంత బడ్జెట్ ని సేవ్ చేస్తున్నారు? దృశ్య మాధ్యమ భాష చూపిస్తూ తమలోని ఆర్ట్ ని ఎంతవరకు ప్రదర్శిస్తున్నారు?

        పై రెండు సినిమాల్లో మచ్చుకి ప్రారంభ సీన్లే చెప్పుకున్నాం. సినిమా సాంతం  చూస్తే ఇలాటివింకెన్నో వుంటాయి. చెప్పొద్దు, చూపించు - అని సాహిత్యానికి సంబంధించే రష్యన్ రచయిత చెఖోవ్ చురక వేశాడు. ఇక సినిమాలకిది ఇంకెంత వర్తించాలి. చంద్రుడు ప్రకాశిస్తున్నాడని నాకు చెప్పకు, పగిలిన అద్దం మీద చంద్ర కాంతి తళుక్కుమనడాన్ని నాకు చూపించూ - అన్నాడు చెఖోవ్. అంటే ఉత్త మాట కాదు, వర్ణన కావాలని పుస్తక భాషక్కూడా. ఈ వర్ణనాత్మక దృశ్యాన్నే మేకర్ కెమెరాతో చూపిస్తాడు. ట్రీట్మెంట్లో వెన్నెల కాస్తోందని రాసేయ్యొచ్చు. అది పట్టుకుని రైటర్ డైలాగ్ వెర్షన్లో 'వెన్నెల కాస్తోంది' అనే రాయొచ్చు. అప్పుడు మేకర్ ఆరుబయట పండు వెన్నెలని ట్రీట్మెంట్ లాగా డల్ గా చూపిస్తాడా, లేకపోతే పగిలిన కిటికీ అద్దం మీదో, టేబుల్ మీద గాజు గ్లాసు మీదో, చంద్ర కిరణాలు పడి తళుక్కున పరావర్తనం చెందే యాక్షన్ ని బ్యూటీఫుల్ గా డైలాగ్ వెర్షన్ చూపిస్తాడా? అదన్న మాట, యాక్షన్ ఈజ్ విజువల్ రైటింగ్, స్టోరీ మేకింగ్. సినిమా స్టిల్ ఫోటోగ్రఫీ కాదు, చలనం లేకపోవడానికీ, చైతన్యంతో లేకపోవడానికీ. సినిమా చలనాన్నీ చైతన్యాన్నీ చూపించే సినిమాటోగ్రఫీ. అందుకే చలన చిత్రమన్నారు, నిశ్చల చిత్రమనలేదు.

        3.
        మరి ఎలా చేసి వుండాలి పై రెండు సినిమాల విషయంలో? మంచి రోజులొచ్చాయి నే తీసుకుందాం. 1. బెంగళూరులో ఐటీ జాబ్స్ చేస్తున్నారు  సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలు. 2. ఓ పాట అయిపోయింది. 3. వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదరాబాద్ వెళ్ళిపోవాలని మాట్లాడుకున్నారు. 4. విమానం లాండ్ అవుతున్న షాట్ పడింది. 5. అప్పుడు హైదరాబాద్ లో విచారంగా కూర్చున్న కోటేశ్వర రావున్నాడు. అతడి దగ్గరికి అజయ్ ఘోష్ వచ్చాడు. వాళ్ళిద్దరి కూతుళ్ళ గురించి చర్చ జరిగింది...ఇలా వున్నాయి స్టోరీ రైటింగ్ చేసిన ఐదు సీన్లు.

        వీటిని స్టోరీ మేకింగ్ చేస్తే... బెంగళూరులో సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలు ఐటీ జాబ్స్ చేస్తున్నట్టు చూపించి పాట వేశాక, వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వెళ్ళిపోవాలని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కథనమంటే ఆడియెన్స్ కి ప్రశ్నలా సీను వేసి, దానికి జవాబు సీను తర్వాత చూపించడమేని చాలాసార్లు చెప్పుకున్నాం. అప్పుడే ఆడియెన్స్ ఏం జరుగుతోందాని బుర్రకి పని చెప్పి, సీను తర్వాత సీను యాక్టివ్ గా చూడ్డంలో లీనమైపోతారు. ప్రశ్నలు జవాబులుగా సీన్లుంటేనే కథనానికి డైనమిక్స్ వుంటాయి. ఎప్పటికప్పుడు కథనం చలనంలో వుంటూ చైతన్యవంతంగా, థ్రిల్లింగ్ గా వుంటుంది.             

            ఇలా కాక - బెంగళూరులో ఐటీ జాబ్స్ చేస్తున్న సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలు ప్రేమలో వున్నారు. పాట పూర్తయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వెళ్ళి పోవాలనుకున్నారు. విమానం లాండ్ అయింది. హైదరాబాద్ లో విచారంగా కూర్చుని వున్నాడు కోటేశ్వరరావు. అతడి దగ్గరికి అజయ్ ఘోష్ వచ్చాడు. కూతుళ్ళ గురించి మాట్లాడుకున్నారు - అంటూ పండు వొలిచి చేతిలో పెట్టినట్టు, స్పూన్ ఫీడింగ్ చేస్తున్నట్టు వరస పెట్టి, కథ తెలిసిపోయేలా అన్నీ ముందే చెప్పేస్తూంటే, ఇక చూడడానికి ఆసక్తి ఏముంటుంది. ఏవో వచ్చిపోతున్న సీన్లని ఆడియెన్స్ లేజీగా, పాసివ్ గా చూడ్డం తప్ప.

        అందుకని, బెంగళూరులో సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలు ఐటీ జాబ్స్ చేస్తున్నట్టు చూపించి పాట వేశాక, వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వెళ్ళిపోవాలని మాట్లాడు కోవాల్సిన అవసరం లేదు. విమానం లాండింగ్ షాట్  కూడా అవసరం లేదు. కోటేశ్వర రావు విచారంగా కూర్చున్న సీనూ అవసరం లేదు. ఈ మూడు సీన్లూ అవసరం లేదు.

        పాట అవగానే హైదరాబాద్ లో వున్న మెహ్రీన్ పీర్జాదా తండ్రి అజయ్ ఘోష్ ని చూపించి, అతడి మీద విమానం సౌండ్ వేస్తే సస్పెన్స్ క్రియేటై పోతుంది, ఆ విమానం సౌండేంటని. దీని తర్వాత కోటేశ్వర రావుతో అజయ్ ఘోష్ సీను వేసి,  దీని తర్వాత సినిమాలో చూపించినట్టు ఏర్ పోర్టు నుంచి క్యాబ్ లో వస్తున్న సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలని చూపిస్తున్నప్పుడు, వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వచ్చేసినట్టు చెప్పిస్తే సరిపోతుంది. తలెత్తిన ప్రశ్నలూ జబాబులూ అన్నీ వచ్చేస్తాయి. డైలాగ్ వెర్షన్ డైనమిక్ గా, విజువల్ గా వుంటుంది. మేకర్ ఆర్టు బయటపడుతుంది.

        ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదరాబాద్ వెళ్ళిపోవాలని బెంగుళూరు కాఫీ షాప్ లో మాట్లాడుకునే సీను, విమానం లాండింగ్ షాట్, కోటేశ్వరరావు మీదే ఓపెన్ చేసిన సీనూ- ఈ మూడిటి ఖర్చూ తప్పి, బడ్జెట్ తగ్గిపోతుంది. అవసరానికి మించి వున్న సినిమా నిడివి కూడా తగ్గి అర్ధవంతంగా, చైతన్య వంతంగా వుంటాయి సీన్లు.

        అర్ధవంతంగా ఎలా వుంటాయి? విడి విడిగా చూపించిన విమానం షాటుకీ, తర్వాత కోటేశ్వర రావు సీనుకీ ఏమైనా సంబంధముందా? దీన్నే లేజీ రైటింగ్ అంటారు. ఈ రెండూ లేపేసి, అజయ్ ఘోష్ మీద విమానం సౌండు పోస్టు చేస్తే అర్ధముంటుంది. ఆడియెన్స్ కి దాచి పెడుతూ, విమానంలో వస్తున్నది అతడి కూతురే కాబట్టి. సౌండ్ చాలా స్క్రీన్ ప్లే సమస్యల్ని పరిష్కరిస్తుంది, బడ్జెట్ నీ ని తగ్గిస్తుంది. స్టోరీ మేకింగ్ కి సౌండ్ కూడా ఒక టూలే. ఈ టూల్ తో కూడా కలిపి  షాట్సునీ, సీన్సునీ ఆలోచించడం చాలా అవసరం.
(మిగతా రేపు)

—సికిందర్

9, నవంబర్ 2021, మంగళవారం

 

Wednesday, July 13, 2016

నాటి సినిమా!


సినిమా దర్శకుడు భావుకత గల రచయిత కూడా అయినపుడు (సినిమా రచయిత కాదు) అతడి సినిమాలు పర్సనల్ డైరీలవుతాయి. వెంటనే  అర్ధంగాక పోస్ట్ ప్రొడక్షన్లోనే  గొడవలైపోతాయి. అతను ‘గాడ్ ఫాదర్’ తీసివున్న కపోలా అయితేనో, ‘సిరిసిరిమువ్వ’ తీసివున్న విశ్వనాథ్ అయితేనో ఫర్వాలేదు.  కపోలా, విశ్వనాథ్ లు కమర్షియల్ గా నిరూపించుకున్నాకే ‘యూత్ వితవుట్ యూత్’, ‘శంకరాభరణం’ లాంటి పర్సనల్ సినిమాలు తీసి డిస్ట్రిబ్యూటర్లని ఒప్పించుకోగల్గారు. కానీ లేడికి  లేచిందే పరుగన్నట్టు, ఓ భావుకత గల కొత్త దర్శకుడు రంగ ప్రవేశం చేసింది లగాయతు అదేపనిగా పర్సనల్ సినిమాలే తీస్తూ పోతే దీన్నేమనాలి?


        ది లేడి కాబట్టి పచ్చని ప్రకృతిలో తిరుగాడుతుంది. గోదావరీ పరివాహక ప్రాంతాల్లో తచ్చాడుతుంది. అడవుల్లో చెట్లే దారి  చూపుతాయన్నట్టు, జీవితాలకి అంతటి మట్టి వాసనల కథలే  మార్గం చూపుతాయి. అలాటి కమ్మటి నేటివ్ వాసనల కథలు సినిమాలకి అవసరపడతాయనుకున్న లేడి, ఫార్ములా పులి చంపిన లేడి నెత్తురై పోకుండా, కీకారణ్యం  లాంటి మూస మాస్ మసాలాల క్రియేషన్ల  మధ్య, తనదైన ఓ ప్రత్యేక ముద్రతో కూడిన బాణీని విన్పిస్తూ యావత్ప్రజానీకాన్నీ మంత్రముగ్ధుల్ని చేయడం సామాన్య విషయమా? 

         చాలామంది సాహితీపరులు సినిమా దర్శకులుగా కన్పిస్తారు. వాళ్ళు సినిమా దర్శకత్వానికి సరిపోరనే అభిప్రాయాన్నే కల్గించారు. ఒక జర్నలిస్టుగా మారిన రచయితని యుద్ధ రంగానికి పంపిస్తే, అతను యుద్ధ వార్తలు  రాయకుండా ఆ చుట్టూ ప్రకృతి అందాలని  అద్భుతంగా వర్ణిస్తూ పోయాడట. ఇలాకాక, చాప కింద నీరు లాంటి ఇలాటి చాపల్యాన్ని ఈదేసిన గజఈత గాడు కూడా అయ్యింది పైన చెప్పుకున్న లేడీ. లేకపోతే  అచ్చులో కథలు రాసుకునే వాడికి జన్మకి సినిమా డైరెక్షన్ అబ్బే పరిస్థితి లేదా రోజుల్లో.


        ఇలా వంశీ అనే హైలీ ఇండివిడ్యువలిస్టిక్ డైరక్టర్ గురించి ఇంత చాలు.  తీసిన మొట్ట మొదటి ‘సితార’ తోనే తను బాపు, విశ్వనాథ్ ల సరసన చేరిపోయాడు. ముత్యాలముగ్గు (1975), శంకరాభరణం (1980),  మేఘసందేశం (1982), సితార (1984) ... ఈ నాల్గూ ఒకే అచ్చులో పోసిన కళా ఖండాలుగా కన్పిస్తాయి. వీటిలో కామన్ గా కన్పించేది ఒక్కటే : అతి తక్కువ సంభాషణలు! అసలు డైలాగు లేవీ అని ఫైనాన్షియర్లు గొడవ పడేంతగా, దృశ్యానికో  పోలియో చుక్క లాంటి  ఏకవాక్య సంభాషణ మాత్రమే వీటి ప్రత్యేకత! ప్రేక్షకులు హారతులు పట్టిన ఈ విజయవంతమైన కమర్షియలార్టు పంథాకి  ఎవరు మొదట  బీజం వేసి,  ఎవరెవరు పెంచి పోషిస్తూ పోయారో పై నాల్గు సినిమాల విడుదల  క్రమాన్ని చూస్తే  తెలిసిపోతుంది.

        ‘మహల్లో కోకిల’ అని వంశీయే రాసిన నవల ‘సితార’ గా తెర కెక్కింది. ‘శంకరాభరణం’ , ‘సాగర సంగమం’ లాంటి రెండు ఘన విజయాలు సాధించి వున్న ఏడిద నాగేశ్వరరావు దీని నిర్మాత.  తమిళ రీమేకుగా వంశీ మొదటి సినిమా ‘మంచు పల్లకి’  హిట్ అవలేదు. రెండో సినిమా ‘సితార’ తో నిర్మాత చేసింది సాహసమే. ఈ సినిమా చారడేసి కళ్ళ భానుప్రియని పరిచయం చేసింది. అప్పటికామెకి పచ్చి కొబ్బెర లాంటి పదిహేడేళ్లే.  అప్పటికే మంచి డాన్సర్ కూడా అయిన ఆమె నృత్యాలతో  ‘సితార’  విక్షణాసక్తత బాగా పెరిగింది. తెర వెనుక ఇళయరాజా హిట్ బాణీలు కన్పించని దేవుడిలా అభయహస్తమిచ్చాయి.


          మరో కన్పించని మాంత్రికుడు ఛాయాగ్రాహకుడు ఎంవీ రఘు. గ్రామీణ అందాల్ని చూపించడంలో దిట్ట. అక్కడే తచ్చాడే వంశీలాంటి దర్శకుడ్ని ఈయన కాపేసి పట్టుకుంటే ఇక చెప్పనక్కర్లేదు- వెండి తెరమీద సినిమా రీళ్ళు తిరగవు, రంగులరాట్నం తిరుగుతుంది.

        రాచరికపు పంజరంలో బందీ అయిపోయిన అందాల బొమ్మ జీవితాన్ని ‘సితార’ చూపిస్తుంది. ఆస్తులూ  పరువు ప్రతిష్టలూ సమకూరడానికి  ఏయే న్యాయమైన కారణాలైతే తోడ్పడ్డాయో, వాటిని గౌరవించుకోకపోతే, ఆ కారణాలూ తొలగిపోయి ఆస్తులూ పరువు ప్రతిష్టలూ మంట గలిసిపోతాయని ఒక సూక్తి.  ఇలాంటి దుర్గతే సూడో జమీందారు చందర్ ( శరత్ బాబు) ది. ఇతడి జమీందారు తండ్రి విలాసాలు మరిగి ఆస్తులు గుల్ల చేశాడు. దుర్భర దారిద్ర్యాన్ని కొడుక్కి మిగిల్చిపోతూ, ఆస్తి పాస్తులు ఇక లేవన్న విషయం బయటి ప్రపంచానికి తెలీనివ్వకూడదని, వంశ ప్రతిష్ట నిలబెట్టాలనీ మాట తీసుకుని స్వర్గానికో ఇంకెక్కడికో  వెళ్ళిపోయాడు. లోన చిరిగిన చొక్కా,  పైన వంశ హోదా వెలగబెడుతూ కోటూ -  ఇదీ చందర్ డబుల్ యాక్షన్ జీవితం. తగాదాల్లో వున్న  పొలం మీద ఎలాగో కేసు గెల్చుకుని, తండ్రి కిచ్చిన మాట ప్రకారం పూర్వవైభవం కల్పించుకుందామని లాయర్ (జెవి సోమయాజులు) తో కలిసి ఎంత ప్రయత్నించినా పప్పులుడకడం లేదు. 

        ఇలాటి చందర్ కి ఓ చెల్లెలు కోకిల (భానుప్రియ) అని. బంగళాలో ఈమెని బందీ చేసి వుంచాడు. ఏమంటే, ‘పరదాలు, ఘోషాలు మా రాజవంశపు సాంప్రదాయం’  అంటూ గొప్పలు. ‘ఆ చీకటి గోడల మధ్య మీ స్త్రీలు పడే హింస గమనించావా?’  అని ఎవరైనా ప్రశ్నిస్తే, సాంప్రదాయం పట్ల  గౌరవమే వుంటే  హింసే అన్పించదనీ, అయినా ఒంటరిగా వుంచకుండా వాళ్ళ కాలక్షేపం కోసం నాట్యం, సంగీతం నేర్పిస్తామనీ, కోకిల కూడా వాటితో కాలక్షేపం చేస్తోందనీ సమర్ధన. ఆమె ఏదో స్వేచ్ఛ అంటూ సాంప్రదాయాన్ని కాల దన్నుకోదని ప్రగాఢ విశ్వాసం  కూడా చందర్ కి.

      గృహ నిర్బంధంలో వున్న కోకిలకి రాజు  (సుమన్) దగ్గరవుతాడు. వూళ్ళో జరుగుతున్న  జాతరకి పగటి వేషగాళ్ళ బృందంతో వచ్చిన కళా కారుడితను. ఇతడి ఆటా పాటా కోకిలలోని  నాట్యకళాకారిణిని  తట్టి లేపుతాయి. ఇక నాట్య విన్యాసాలే నాట్య విన్యాసాలు. విరహ గీతాలే గీతాలు ప్రేమలో. చందర్ కిది తెలిసిపోయి  రాజుని చంపించేసి, తండ్రి  మాట నిలబెట్టలేకపోయానని ఆత్మ హత్య చేసుకుంటాడు. 

        ఈ జరిగిందంతా దేవదాసు ( శుభలేఖ సుధాకర్) కి చెప్పుకొస్తుంది కోకిల. ఇతనొక ఫోటోగ్రాఫర్. ఇలా తన ఆశ్రయం పొందిన  కోకిలని సినిమా హీరోయిన్ ని చేస్తాడు. ఇంతలో తన గతమంతా పేపర్లకెక్కి బెంబెలెత్తిపోతుంది కోకిల. ఏ వంశ గుట్టు కాపాడతానని తను అన్న కిచ్చిన మాట ఇలా అయ్యిందో, ఇక దీనికి ఒకే ఒక్క  పరిష్కార మార్గంగా  వయసుమళ్ళిన  డాక్టర్ (ప్రభాకర రెడ్డి) ని తన తో పెళ్ళికి ఒప్పిస్తుంది. ఇది కూడా బెడిసి కొట్టి తను ఆత్మహత్య చేసుకోబోతున్నప్పుడు, చనిపోయాడనుకున్న రాజు బయల్దేరి వస్తూంటాడు. 

        ముందు కోకిలగా, తర్వాత సితారగా రెండు విభిన్న పాత్రల్లో కన్పించే భాను ప్రియ కిది తెలుగులో అడుగు పెడుతూనే సూపర్ హిట్ ఎంట్రీ. తను తెలుగే అయినా దీనికి ముందు  ఒక తమిళం చేసింది. మాస్ కమర్షియల్ హీరోగా కొనసాగుతున్న సుమన్ కిది ఒక జ్ఞాపిక లాంటిది. సినిమాలో భానుప్రియ జ్ఞాపికగా ఇచ్చే పళ్ళెం పట్టుకుని తన బృందాన్ని బాధ పెట్టి వెళ్ళిపోయే సీను ఒక్కటి చాలు సుమన్ హావభావ ప్రకటనా సామర్థ్యానికి. 

        వంశీ విజువల్ సెన్స్ కి శృంఖలాల్లే

వనడానికి ఓ మూడు సీన్లు చూస్తే చాలు-  1. పంజరాల్లో చిలుకలు తల్లడిల్లే షాట్లు, 2. ఎగిరే చిలుకని పట్టుకుందుకు సుమన్- భాను ప్రియల రాపాడే చేతుల శృంగారభరిత విజువల్స్, 3. హాలు నిండా వాద్య పరికరాల మధ్య సుమన్- భానుప్రియలతో వుండే ఒక సన్నివేశం ...ఇక పాటల చిత్రీకరణ చెప్పనే అక్కర్లేదు. ఇవన్నీ చాలా సూపర్ హిట్  పాటలే ఇప్పటికీ. 


        ఇంత కళాఖండంలోనూ  లోపాలూ లేకపోలేదు. లోపాలతోనే కళాఖండాలకి  అందం వస్తుందేమో. ఇందులో భానుప్రియ పాత్ర ఎంతకీ ఎదగదేమిటి? సుమన్ ఆమె చెర విడిపించాక ఆమె పూర్తి స్వేచ్ఛా జీవియే. ఇంకా తన స్వేచ్ఛని హరించిన వంశప్రతిష్ట గురించి ప్రాకులాట ఎందుకు? తన అన్న సుమన్ ని చంపించాడని  తెలిసీ అన్నంటే సెంటి మెంట్లు ఎందుకు? బాధపడాల్సింది చనిపోయాడనుకున్న సుమన్ గురించి కాదా? అంతలోనే ముక్కలైన అతడితో తన ప్రేమ గురించి కాదా? ఇంకా అన్న గురించీ, సాంప్రదాయాల గురించీ ఆలోచిస్తే ముందు కెళ్ళిపోయిన పాత్ర ఎలా ఎదుగుతుంది? ఎదగ వద్దన్న ఫ్యూడలిజాన్ని బోధిస్తున్నట్టా ఈ పాత్రతో? 

        ఇక తను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చీటీ రాసి ప్రభాకర రెడ్డికి పంపడమెందుకు? తనని కాపాడేందుకా? అలా చీటీ రాసి ఆత్మహత్యా యత్నం ఒక నాటకంగా పాత్ర దిగజారి పోలేదా? (ఈ వ్యాసం చదివి వంశీ తర్వాత లోపాలు ఒప్పుకున్నారు). క్లయిమాక్స్ బలహీనంగా తేలిపోవడానికి శరత్ బాబు ఆత్మహత్య చేసుకునే దగ్గర కథ  బలహీన పడడమే కారణం. హాలీవుడ్ ఇంద్రజాలికుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఇందుకే అన్నాడేమో- కథ ఎలా చెప్పాలో మర్చిపోతున్నారు. కథలకి మిడిల్, ఎండ్ లు ఏమాత్రం వుండడం లేదు, ఎంత సేపూ బిగినింగే .. ఈ బిగినింగ్ కూడా ఎంత సేపటికీ ముగియదు..అని!

         అసలు బిగినింగ్, మిడిల్, ఎండ్ అంటే ఏమిటో తెలిస్తేగా అవి వుండడానికి. ఈ చిన్న విషయం  వంశీకి తెలీదనుకోలేం. నవలని సినిమాగా మారుస్తున్నప్పుడు ఆ  నవలా కథనమే స్క్రిప్టులో జొరబడినట్టుంది. కానీ కెరీర్ కొత్త లోనే ఇంత సాహసమూ సృజ నాత్మకతా  ప్రదర్శించినందుకు వంశీని అభినందిద్దాం. వంశీ మరో ‘సితార’ లాంటిది తీయడు, తీయలేడు కూడా- పర్సనల్ డైరీ అనేది ఒక్కటే వుంటుంది కాబట్టి.

పట్టపగలే చుక్కలు!

          వాళ్ళందరికీ ‘సితార’ ని చూసి పట్టపగలే చుక్కలు కన్పించాయి... వాళ్ళందరూ-  నిర్మాత, దర్శకుడు, ఫైనాన్షియర్లూ- ప్రివ్యూ థియేటర్లో కొలువుదీరారు ‘సితార’ చూద్దామని. ఇంకా రీ రికార్డింగ్ మిగిలి వుంది. ముందు డబుల్ పాజిటివ్ పోస్ట్ ప్రివ్యూ చూద్దామనుకున్నారు. అంతాకలిసి చూశారు. ఇదేం సినిమా? డైలాగులేవీ? ఆ కళ్ళు, చేతులు, కాళ్ళూ చూపించడమేమిటి మాటిమాటికీ? ఆ నీడలేంటి?  ఆ పడవ లేంటి? ఐపోయింది! పనైపోయింది! పూర్ణోదయా వారి పని గోవిందా! పదండి వెళ్లి పోదాం,  చెక్కేద్దాం- అనేసి ఫైనాన్షియర్లు చెక్కేశారు. వంశీ బొమ్మలా నిలబడిపోయాడు. 

        రీరికార్డింగ్ మొదలైంది. ఇళయరాజాని చూస్తూంటే వంశీకి ఒకటే గుబులుగా వుంది.  ఈయన కూడా పారిపోతే?  అలా చేయలేదు ఇళయరాజా.  సినిమా సాంతం చూసి నె మ్మదిగా లేచారు. వంశీ దగ్గరి కొచ్చారు. ‘భలే బ్యూటిఫుల్ కాన్వాస్ ఇచ్చావయ్యా! థాంక్యూ...ఎవ్విరీ మినట్ ఈ పిక్చర్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తా!’ అనేసరికి  వంశీ ఎక్కడికో వెళ్ళిపోయాడు!

        12 కేంద్రాల్లో వంద రోజులాడింది సినిమా. మంచి మ్యూజికల్ హిట్. పైగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు, ఉత్తమ గాయనిగా ఎస్. జానకికి మరో జాతీయ అవార్డు, ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఎస్వీ రామనాథన్ కి మరింకో జాతీయ అవార్డు సంపాదించి పెట్టింది ‘సితార’.



-సికిందర్
(“సాక్షి” –నవంబర్ 2009)
           


8, నవంబర్ 2021, సోమవారం

1078 : సందేహాలు- సమాధానాలు

Q :   నేనొక ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. అయితే మీరు తరచూ యాక్టివ్ క్యారక్టర్, పాసివ్ క్యారక్టర్ అని రాస్తుంటారు. యాక్టింగ్ కోర్సులో వీటి గురించి చెప్పడం లేదు. రేపు నాలాంటి నటులు పాత్రల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పాసివ్ క్యారక్టర్స్ తో సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని అంటారు. నాకు భయంగా వుంది. రేపు నేను నటిస్తే నా సినిమాలు కూడా ఫ్లాపవుతాయా? లేకపోతే నటుడిగా ఇదంతా నాకవసరం లేదంటారా? డైరెక్టర్ చెప్పినట్టు చేయాలంటారా? దయచేసి నా సందేహాలు తీర్చగలరు.
—ఆర్ జె పి
, యాక్టింగ్ విద్యార్థి
A :    ఇనిస్టిట్యూట్స్ లో యాక్టివ్, పాసివ్ పాత్రలు నేర్పుతారు. నేర్పకపోతే అడగండి. పాసివ్ పాత్రలెందుకంటే ట్రాజడీల కవసరం కాబట్టి. రియలిస్టిక్- అన్ రియలిస్టిక్ పాత్రల నటన కూడా నేర్పుతారు. అయితే థియరీ నేర్చుకోవడం వేరు, ప్రాక్టికల్ గా కథ వినేప్పుడు అది యాక్టివా పాసివా గుర్తించడం వేరు. ఏ ఏ లక్షణాలు యాక్టివ్ కుంటాయి, ఏ ఏ లక్షణాలు పాసివ్ కుంటాయి అదనంగా స్క్రీన్ ప్లే పుస్తకాలు చదివి తెలుసుకోండి. విరివిగా సినిమాలు చూసి గుర్తించండి. సినిమాల్లో ప్రధాన పాత్రల్నే కాదు, ఇతర పాత్రల్ని కూడా పరిశీలించండి. సహాయ పాత్రలు పాసివ్ గా కూడా వుండొచ్చు. నష్టం లేదు. సినిమా ప్రధాన పాత్రదే అవుతుంది కాబట్టి అది యాక్టివ్ గానే వుందా తెలుసుకోండి. కథ ట్రాజడీ అయితే పాసివ్ గా వుండడాన్ని గమనించండి. కమర్షియల్ సినిమా అన్నాక హీరోయిన్, విలన్ పాత్రలు కూడా యాక్టివ్ గానే వుండాల్సి వుంటుంది.

        మీరు భవిష్యత్తులో హీరో అయితే
, కథ వినేప్పుడు ట్రాజడీ కాకపోతే, యాక్టివ్ పాత్రేనా తెలియడం అవసరం. గీత గోవిందం లో హీరో పాసివ్ క్యారక్టరే కానీ స్క్రీన్ ప్లే వల్ల అది హిట్టయిందని ఒక ప్రముఖ ఇనిస్టిట్యూట్ సీనియర్ ప్రిన్సిపాల్ చెప్తూంటారు. ఇలా అన్నిసార్లూ జరగక పోవచ్చు. రిస్కు తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం. అయితే ఇనిస్టిట్యూట్స్ లో 
ఏ పాత్ర ఎలా నటించాలో నేర్పుతారే తప్ప, ఏ పాత్ర ఒప్పుకుని సినిమాలో నటించాలో అది నటుల ఛాయిస్సే. పాసివ్ పాత్రల్ని తిరస్కరించమని ఇనిస్టిట్యూట్స్ లో చెప్పరు. అది మీ విచక్షణ.


    మీరు సహాయ పాత్రలు చేయాల్సి వస్తే యాక్టివా పాసివా ప్రశ్న వుండదు. హీరోనే అవాలనుకుంటే యాక్టివ్ పాత్ర చిత్రణల్ని బాగా స్టడీ చేసుకోండి. రియలిస్టిక్ సినిమాలు ఆర్ట్ సినిమాలకి దగ్గరగా వుంటాయి. ఆర్ట్ సినిమాల్లో హీరో సర్వసాధారణంగా పాసివే. కానీ ఈ రోజుల్లో కమర్షియల్ గా తీయాల్సిన రియలిస్టిక్ సినిమాల్లో యాక్టివ్ గా వుండాల్సిందే. మీరు యాక్టింగ్ కోర్సు చేస్తూనే, బయట కథలు వింటూండే ఏర్పాటు చేసుకుంటే ఇప్పట్నుంచే ప్రాక్టీసు అవుతుంది. కథలు వింటూ, కొత్తాపాతా సినిమాలు చూస్తూ అనుభవం సంపాదించుకోండి. ఈ సందర్భంగా ప్రసిద్ధ యాక్టింగ్ టీచర్ ఉటా హేగెన్ రాసిన 9 క్వశ్చన్స్ అన్న పుస్తకం మీకు పనికి రావచ్చు. కొని చదవండి. పీడీఎఫ్ కూడా అందుబాటులో వుంది. ఆల్ ది బెస్ట్.

Q :   రోమాంటిక్ కామెడీలు బలంగా వుండాలంటే ఏం చేయాలి? లవర్స్ విడిపోయి కలుసుకుంటే బలంగా వుండదా? రోమాంటిక్ కామెడీలు ఇప్పుడు వర్కౌట్ కావని మాత్రం నిరాశపర్చకండి. రోమాంటిక్ కామెడీలు బలంగా వుండాలంటే ఇంకేం చేయాలో చెప్పండి.
—ఏ టూ జెడ్
, దర్శకుడు.
A :   పేరు వద్దన్నారు కాబట్టి ఏ టూ జెడ్ గా మార్చాం. ఇక  వరుడు కావలెను సహా నిరాశ పరుస్తూనే వస్తున్నారుగా మీలాంటి వాళ్ళు. అపార్ధాలతో విడిపోవడాలు, లేకపోతే ప్రేమిస్తున్నట్టు పైకి చెప్పలేక పోవడాలు - ఈ చాదస్తాల చుట్టేగా రెండు దశాబ్దాలుగా చుట్టిందే చుట్టి చుట్ట చేసి చూపిస్తున్నారు. అసలు రోమాంటిక్ కామెడీ కర్ధం తెలుసుకోవాలి ముందు. జంధ్యాల తీసిన అహ నా పెళ్ళంట చూడండి. ఇందులో ప్రేమికులు విడిపోతారా? హాలీవుడ్ రోమాంటిక్ కామెడీల్లో విడిపోతారా? విడిపోవడాల్నీ, ప్రేమిస్తున్నట్టు పైకి చెప్పలేక పోవడాల్నీ రోమాంటిక్ డ్రామా లంటారు. ఇన్నేళ్ళుగా రోమాంటిక్ డ్రామాలు తీస్తూ, రోమాంటిక్ కామెడీలనుకుంటున్నారు. దీంతో రెండూ కాకుండా పోతున్నాయి.

        తీస్తున్నది రోమాంటిక్ కామెడీలు కాదూ డ్రామాలని ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడు రోమాంటిక్ డ్రామాలైనా
మరోచరిత్ర లా అర్ధవంతంగా తీస్తారు. రోమాంటిక్ డ్రామా జానర్ మర్యాదలు వేరు, రోమాంటిక్ కామెడీల జానర్ మర్యాదలు వేరు. రోమాంటిక్ డ్రామాలు వీణ సినిమాలు, రోమాంటిక్ కామెడీలు గిటార్ సినిమాలు. యూత్ కి వీణ కావాలా, గిటార్ కావాలా? ఈ బ్లాగులోనే దీని గురించి వివరంగా వ్యాసం రాశాక మళ్ళీ  ఇక్కడ వివరించనవసరం లేదు. ఇక్కడ క్లిక్ చేసివ్యాసం చూడండి.

        ఇంకేం జరుగుతోందంటే
, తీస్తున్న రోమాంటిక్ కామెడీలనే, డ్రామాలనే లైటర్ వీన్ గా తీయడం. ఈ లైటర్ వీన్ అనే ఫ్యాషన్ కూడా ఇరవై ఏళ్ళ క్రితం అలవాటు చేసుకున్నదే. హాలీవుడ్ మార్కెటింగ్ వ్యూహమెలా వుంటుందంటే, లైట్ గా వుండే కథలకి కథనాన్నికాంప్లికేట్ చేసి తీస్తారు. అప్పుడు బాక్సాఫీసు దగ్గర స్ట్రాంగ్ గా నిలబడుతుంది. బిగ్ యాక్షన్ మూవీస్ లో కథని, కథనాన్నీ లైట్ గానే వుంచి, హెవీ యాక్షన్ సీన్స్ ని క్రియేట్ చేస్తారు. అప్పుడే బాక్సాఫీసు బద్ధలవుతుంది.  ఇలాటివి తెలుసుకోక పోతే ఇంకో ఇరవయ్యేళ్ళూ రోమాంటిక్ కామెడీలతో ఇంతే.

     ఈ మధ్య చూసిన ఒక హాలీవుడ్ ఉదాహరణ చూద్దాం : రోమాంటిక్ కామెడీలో కేవలం హీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ నిలబెట్టలేదని ఏం చేశారో చూద్దాం. సినిమా పేరు క్రేజీ, స్టుపిడ్, లవ్ (2011). ఇందులో హీరో హీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ తో బాటు, కథనంలో తల్లిదండ్రుల మధ్య, ఇంకా తండ్రికీ కొడుక్కీ మధ్య, మరింకా తండ్రికీ కూతురికీ మధ్య, మరీమరీ ఇంకా బేబీ సిట్టర్ కీ తల్లికీ మధ్యా కాన్ఫ్లిక్ట్స్ పెట్టేసి, లైట్ కథని పైన చెప్పుకున్న హాలీవుడ్ మార్కెటింగ్ వ్యూహంతో, కాంప్లికేట్ చేశారు. 50 మిలియన్ డాలర్ల బడ్జెట్ కి, 145 మిలియన్ డాలర్లు బాక్సాఫీసు వచ్చింది.
Q :  వంశీ గారి ‘అన్వేషణ’ కధ కూడా ఎండ్ సస్పెన్స్ కాదా ? ‘అన్వేషణ’ సూపర్ సక్సెస్. మరి ‘అనుమానాస్పదం’ కథ కూడా ఇంచుమించుగా అలాగే వుంటుంది కానీ ఈ సినిమా ప్లాప్. వివరించగలరు.

—ఫణి కుమార్, దర్శకత్వ శాఖ

A :  ఎండ్ సస్పెన్స్ ప్రక్రియ పరిణామ క్రమం సందర్భాను సారం బ్లాగులో ఇస్తూనే వచ్చాం కదా? అన్వేషణ 1985 నాటికి హాలీవుడ్ లో ఎండ్ సస్పెన్స్ ప్రక్రియకి తెర పడుతూ వచ్చింది. హంతకుడెవరో ముగింపు వరకూ వెల్లడి కాని సస్పెన్స్ కథలకి సినిమాల్లో ప్రేక్షకాదరణ తగ్గిపోయింది. ఒక్కో తరహా కథలకి ఒక్కో కాలం వుంటుంది. మారుతున్న కాలానికి అభిరుచులు కూడా మారి, ఇక ఓపిగ్గా కూర్చుని నిదానంగా సాగే కథల్ని సినిమాలుగా చూసే తరం ప్రేక్షలులు తగ్గిపోతూ వచ్చారు. దీంతో హంతకుడెవరో ముందే తెలిసిపోయి, వాణ్ణి పట్టుకునే సీన్ టు సీన్ సస్పెన్స్ కథల్ని సినిమాల్లో ప్రవేశపెట్టింది హాలీవుడ్. ఇది మన దేశంలో వెంటనే అందుకోక పోయినా కొంత కాలం పట్టింది. అప్పట్నుంచీ ఎండ్ సస్పెన్స్ కథలతో వుండే సినిమాలు ఫ్లాపవుతూ వచ్చాయి. 2007 లో వంశీయే తీసిన అనుమానాస్పదం సహా. ఈ లింక్ క్లిక్ చేసి పూర్తి వివరాలుచూడండి.

—సికిందర్


7, నవంబర్ 2021, ఆదివారం

1077 : రివ్యూ

కథ- దర్శకత్వం : రోహిత్ శెట్టి
తారాగణం : అక్షయ్ కుమార్
, కత్రినా కైఫ్, జాకీ ష్రాఫ్, అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్, గుల్షన్ గ్రోవర్, కుముద్ మిశ్రా, జావేద్ జాఫ్రీ, అభిమన్యూ సింగ్, సికిందర్ ఖేర్ తదితరులు
రీసెర్చి : ఎస్ హుసేన్ జైదీ
, స్క్రీన్ ప్లే : యూనస్ సజావల్, మాటలు : ఫర్హాద్ సాంజీ, సంచిత్ బెంద్రే, విధీ ఘోడ్గాడ్కర్
సంగీతం : అమర్ మోహిలే
, ఎస్ తమన్, ఛాయాగ్రహణం : జామన్ జాన్
బ్యానర్స్ : రిలయెన్స్ ఎంటర్ టైన్మెంట్
, రోహిత్ శెట్టి పిక్చర్జ్, ధర్మా ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్
విడుదల : నవంబర్ 5
, 2021

***

      సూర్యవంశీ - వెండి తెరపై కులాసాగా చూడాలని ప్రేక్షకులు ఉవ్వీళ్ళూరిన అక్షయ్ కుమార్ మెగా యాక్షన్ డ్రామా ఓపట్టాన ప్రేక్షకుల ముందుకు రాలేదు. సరీగ్గా రెండేళ్ళ క్రితం నిర్మాణం పూర్తయి, మార్చి 27, 2020 న విడుదల ప్రకటించుకుని సన్నాహాలు చేస్తూంటే, దురదృష్టం కొద్దీ  -24 వ తేదీనే ప్రభుత్వం దేశవ్యాప్త కోవిడ్ లాక్ డౌన్ ప్రకటించడంతో విడుదల ఆగిపోయింది. లాక్ డౌన్ ఎత్తేశాక గత దీపావళికి విడుదల తేదీ ప్రకటిస్తే, థియేటర్ల మీద ప్రభుత్వ ఆంక్షలతో మళ్ళీ వాయిదా పడింది. ఇక లాభం లేదని ఏప్రెల్ 2, 2021 న తిరిగి తేదీ నిర్ణయిస్తే, ముంబాయిలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ప్రకటించడంతో అదీ వాయిదా పడింది. సరేలెమ్మని మళ్ళీ ఏప్రెల్ 30 కి విడుదల ప్రకటిస్తే, మళ్ళీ కోవిడ్ వచ్చి పడడంతో మరోసారి లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. ఇలా ప్రభుత్వ తేదీలతో విడుదల తేదీలు తెమలవని విడుదల మర్చిపోయి కూర్చున్నారు. కూర్చున్నాక పొలిమెరలో ఇక ప్రభుత్వ తేదీలు కనిపించక పోవడంతో, ఈ దీపావళే బిజినెస్ కి సరైన అదును అని విడుదల చేసేశారు!

        విజయవంతమైన కమర్షియల్ సినిమాల దర్శకుడు రోహిత్ శెట్టి (గోల్ మాల్ సిరీస్, సింగం సిరీస్, సింబా వగైరా) ఈసారి  సూర్యవంశీ తో టెర్రరిజం మీది కెళ్ళాడు. భారీ తారాగణాన్నీ, బడ్జెట్ నీ సమకూర్చుకుని, తన అలవాటైన కొత్త కొత్త గిమ్మిక్కులతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశాడు. అసలు దేశాన్ని అర్ధం జేసుకుంటే టెర్రరిజం అర్ధమవుతుంది, ఎవరితో పోరాడాలో తెలుస్తుంది. ఇవి చేశాడా రోహిత్ శెట్టి చూద్దాం...

కథ

    1992 లో బాబ్రీ మసీదు కూల్చివేతకి ప్రతీకారంగా, 1993 లో ముంబాయిలో జరిగిన వరస బాంబు పేలుళ్ళలో వీర్ సూర్యవంశీ (అక్షయ్ కుమార్) తల్లిదండ్రులు చనిపోతారు. ఈ బాంబు దాడులకి పొరుగు దేశం నుంచి వెయ్యి కిలోల ఆర్డీఎక్స్ దిగుమతి అయింది. ఇందులో 400 కిలోలే దాడులకి ఉపయోగించి మిగతా ఆర్డీఎక్స్ దాచి పెట్టారు. దీన్నుపయోగించుకుని, 26/11 దాడుల తర్వాత  లష్కరే తోయిబా మరిన్ని దాడులు జరిపేందుకు 40 మంది టెర్రరిస్టుల్ని పంపి సరయిన సమయం కోసం ఎదురు చూస్తోంది. ఈ నలభై మంది టెర్రరిస్టులు హిందూ పేర్లు పెట్టుకుని, పెళ్ళిళ్ళు చేసుకుని  వివిధ నగరాల్లో ప్రజల్లో కలిసిపోయి వుంటున్నారు.  వీళ్ళని పొరుగు దేశం నుంచి బిలాల్ (జాకీ ష్రాఫ్) కంట్రోలు చేస్తున్నాడు. ఈ నలభై మందిలో ఇతడి ఇద్దరు కొడుకులు బిలాల్ అహ్మద్ (కుముద్ మిశ్రా), రియాజ్ హఫీజ్ (అభిమన్యూ సింగ్) కూడా వున్నారు.

          ఈ సమాచారమందుకున్న యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ డిసిపి వీర్ సూర్యవంశీ తన టీముతో రంగంలోకి దిగుతాడు. పూర్వం ఒక ఆపరేషన్ లో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చేరినప్పుడు, డాక్టర్ రియా (కత్రినా కైఫ్) చికిత్స చేసి కాపాడింది. దీంతో ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కొడుకు పుట్టాడు. అతడికి కుటుంబం కంటే డ్యూటీ  ముఖ్యం కావడంతో, ఒక దాడిలో కొడుకు గాయపడ్డాడు. దీంతో అతడ్ని తిట్టిపోసి కొడుకుతో దూరంగా వుంటోంది రియా.

          ఈ నేపథ్యంలో ఇప్పుడు సూర్యవంశీ కర్తవ్యం టెర్రరిస్టుల స్లీపర్ సెల్స్ తో బాటు, ఆ దాచిపెట్టిన 600 కిలోల ఆర్డీఎక్స్ ని పట్టుకుని, టెర్రర్ దాడుల్ని నివారించడం, టెర్రరిస్టుల్ని నిర్మూలించడం. ఈ క్రమంలో బిలాల్ అహ్మద్, రియాజ్ హఫీజ్ లతో బాటు వాళ్ళ లీడర్ ఖాదర్ ఉస్మానీ (గుల్షన్ గ్రోవర్) నీ ఎలా ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

      ఇది యాక్షన్ థ్రిల్లర్ కాకుండా యాక్షన్ డ్రామా కావడంతో సస్పెన్స్ లేకపోవడం, సస్పెన్స్ లేకపోవడంతో టెన్షన్, థ్రిల్ లేకపోవడం జరిగాయి. ఈ కథ డ్రామా ఆధారంగా ఇలా వుండడం సరైనదే. ఇది సామాజిక కథ. సామాజిక కథ డ్రామా కవకాశం లేని సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వుంటే ఎబ్బెట్టుగా వుంటుంది. అందుకని టెర్రరిస్టుల్ని పట్టుకునే వేటలో ఇప్పుడేం జరుగుతుందన్న మలుపులు గానీ, పతాక సన్నివేశాలుగానీ ఎదురు కావు. యాక్షన్ దృశ్యాలు మాత్రం భారీ స్థాయిలో వుంటాయి. డ్రామాలో భాగంగా ఉత్పన్నమయ్యే యాక్షన్ దృశ్యాలు. ఇలా మార్కెట్ యాస్పెక్ట్, దానికి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ వరకూ ఈ కథ ఓకే. కాన్సెప్ట్ పరంగానే చెదిరిపోయింది...

        దేశంలో టెర్రరిజం దాదాపూ లేదు, కాశ్మీరు లోయలో తప్ప. కారణ ముంటేనే టెర్రరిజం. ఆ కారణాలు లేక పోవడంతో టెర్రరిజం మీద సినిమాలు తీయడం కూడా మానుకున్నారు. దర్శకుడు రోహిత్ శెట్టి అసహజంగా కొత్త కారణాన్ని పుట్టించ కుండా, 1993 లో జరిగిన పేలుళ్ళ లోంచే ఓ కారణాన్ని సృష్టించాడు. ఆ నాటి దాడుల్లో 600 కిలోల ఆర్డీఎక్స్  మిగిలినట్టు కల్పన చేసి, దాంతో ఈ కథంతా చిత్రీకరించుకుంటూ పోయాడు.

        అయితే 30 ఏళ్ళు గడిచిపోయినా ఆ నాటి ఆర్డీక్స్ ని దాచిపెట్టుకుని, దాడుల కోసం ముసలివాళ్ళయి పోతున్నా ఇంకా కూర్చుని వుంటారా టెర్రరిస్టులనేది ఒక లాజికల్ క్వశ్చన్. ఇంత కాలం వేచి వుండడానికి ఓ చారిత్రక విశేషాన్ని టార్గెట్ చేసి కూర్చుంటే, మంచి ఎమోషనల్ కనెక్ట్ వుండేది ఆడియెన్స్ కి. స్వాతంత్ర్య దినోత్సవ గోల్డెన్ జూబ్లీ వేడుకలు కావచ్చు లేదా, 2024 లో 75 వ భారత రాజ్యాంగ దినోత్సవం కావొచ్చు. ఐడియాని సరీగ్గా నిర్మించుకుని వుంటే హాలీవుడ్ హై కాన్సెప్ట్ మూవీగా ఇది అప్ గ్రేడ్ అయి వుండేది.

        ఇకపోతే  వున్న కాన్సెప్ట్ తో స్పష్టమైన పంథా కూడా వుండదు. పాక్ మూలాలున్న టెర్రరిజం కుట్రతో ఇది ఇండియా వర్సెస్ పాక్ దేశాల కథవుతుంది. ఇలా ఏకసూత్రతతో అడుగడుగునా పాక్ ని టార్గెట్ చేస్తూ కథ నడపాలి. ఇలాకాకుండా ఇండియన్ గవర్నమెంట్ వర్సెస్ ఇండియన్ ముస్లిమ్స్ అన్నట్టు కూడా ఏదో చేసుకుంటూ పోయీ గజిబిజి చేశారు.

        ఇండియన్ ముస్లిమ్స్, పాక్, టెర్రరిజం ఇవన్నీ కలగలిపేసి ఇండియన్ ముస్లిమ్స్ కి ఎక్కువ పాఠాలు చెప్పేశారు. టెర్రరిజానికి పాక్ ని టార్గెట్ చేయాల్సింది పోయి- మధ్యలో జింగోయిజంతో ఇండియన్ ముస్లిములని టార్గెట్ చేసే గందరగోళానికి లోనయ్యారు. ఇండియన్ ముస్లిమ్స్ ని టార్గెట్ చేస్తూ పెట్టిన కేసులన్నీ కోర్టులు కొట్టి వేస్తూ ప్రభుత్వాలకి మొట్టి కాయలేస్తున్నాయి ఓ పక్క. ఇండియన్ ముస్లిమ్స్ ని టార్గెట్ చేస్తూ ఇలా సినిమాలు తీస్తే పాక్ కి సంతోషమే కదా. సురక్షితమే కదా. వాళ్ళకి కావాల్సిందిదే. వాళ్ళ ప్రయోజనాలు నెరవేరుస్తున్నామని గుర్తించక పోతే ఎలా.

        టెర్రరిజానికి మతం లేదన్నప్పుడు మత వర్గాన్ని టార్గెట్ చేసేశారు. మంచి ముస్లిం- చెడ్డ ముస్లిం అంటూ చూపించడం ఇంకో వైపు. మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఇతర మతాల్లో వుండనట్టు. పొడుగు గడ్డమున్న వాడు ఎక్కువ దైవ భక్తితో టెర్రరిస్టుగా వుంటాడని, చిన్న గడ్డమున్న వాడు అజ్మీరుకి పోయినా భక్తి వుండదని, క్లీన్ షేవ్ చేసుకున్నవాడు సెక్యులర్ గా వుంటాడనీ అర్ధం లేని వర్గీకరణ చేయడ మొకటి. ఈ దేశంలో ముస్లిములే నెగెటివులు, ఇతరులు మంచి మన్నికైన పాజిటివులని చెప్పాలనేమో.

         ముంబాయి పోలీసులు పాస్ పోర్ట్ మీద మతం చూసి కాల్చి చంపరు, క్రిమినల్ రికార్డు చూసి చంపుతారు అంటాడు అక్షయ్ కుమార్. ఇలా మత ప్రసక్తి లేకుండా టెర్రరిస్టుల గురించి మాట్లాడితే సరిపోతుంది. ఇది ఇరు దేశాల మధ్య రావణ కాష్ఠం కథైనప్పుడు, పొరుగు దేశాన్ని తిట్టాల్సింది పోయి, ముస్లిముల్ని తిట్టే సీన్లు నాల్గు పెట్టి, రెండు మెచ్చుకునే సీన్లతో బ్యాలెన్సు చేయడం ఇంకో వైపు. ఇది కూడా అరిగిపోయిన పాత మూస ఫార్ములా టెక్నిక్కే.

        ఈ కథలో ఒక పేటలో గణేష్ ఉత్సవాలకి హిందువులు విగ్రహాన్ని ఎత్తలేక పోతూంటే, ముస్లిములు పరుగెత్తు కొచ్చి వాళ్ళే మోస్తారు. వెనుక మసీదు కన్పిస్తూంటుంది గొప్ప మెలో డ్రామాగా. వెంటనే పాట- పంద్రాగస్టుకీ, రిపబ్లిక్ దినోత్సవానికీ మోగే అరవై ఏళ్ళనాటి ప్రసిద్ధ పాట - ఛోడో కల్కీ బాతేఁ, కల్కీ బాత్ పురానీ, నయే దౌర్ మే లిఖేంగే మిల్కర్ నయీ కహానీ, హమ్ హిందూస్థానీ (గతాన్ని మర్చిపో, గతం గతః, కొత్త యుగపు కథ కలిసి రాసుకుందాం హిందూస్థానీలుగా) అంటూ. యుగాలుగా కలిసే పాడుకుంటున్నారుగా హిందూ ముస్లిములు. కొత్తగా నేర్పాల్సిన పని లేదు. విభజన రాజకీయాలు మానుకుంటే ఇండియా మౌలిక స్వరూపం వెలుగులో కొస్తుంది.

        అసలు ఈ సీనులో టూరిస్టులుగా వచ్చిన పాక్ దేశస్థులు గణేష్ విగ్రహం సాయం పట్టినట్టు చూపిస్తూ ఈ పాట వేసి వుంటే, మెలోడ్రామాతో బాటు పాక్ కి మెసేజి అదిరేది. ఈ కాన్సెప్ట్ ఇండియా వర్సెస్ పాక్ అని ఎప్పటికప్పుడు కావాలని మర్చిపోతూ సినిమా తీస్తే ఇలా గాకుండా ఇంకెలాగో వుంటుంది.

  అసలు ఇండియా పట్ల పాక్ దేశస్థుల అభిప్రాయమేమిటో ఇండియన్లు వెళ్ళి తీసిన వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఇండియా పట్ల వాళ్ళ ప్రేమ, బాలీవుడ్ సినిమాలతో బాటు ప్రత్యేకించి తెలుగు సినిమాలంటే అక్కడి అమ్మాయిల క్రేజ్ తెలుస్తాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తెలుస్తారు. ఇంకా చాలా తెలుస్తాయి. రివర్స్ లో ఇలాటి పాక్ క్యారక్టర్స్ తో టెర్రరిస్టులకే, పాక్ ప్రభుత్వాలకే గట్టి మెసేజ్ వెళ్ళేలా చేసి వుంటే రోహిత్ శెట్టి మూసని బద్దలు కొట్టిన మొదటి దర్శకుడయ్యేవాడు. ఇండియన్ ముస్లిమ్స్ ని పరీక్షించే అదే పాత మూస ఇంకెంత కాలం. పాక్ పౌరుల్ని లాక్కొచ్చి కొత్త కథలు చెప్పకుండా.

        ఈ దేశంలో కసబ్ మీద ఎంత ద్వేషముందో కలాం మీద అంత ప్రేమ వుంది అని ఇంకో పాఠం చెప్తాడు అక్షయ్. ఇది పాక్ చెప్పాల్సిన పాఠం. మనకి కాదు. అసలు హిందూ ముస్లిం ప్రసక్తి దేనికి- పౌరులు అనకుండా. పౌరులొక వైపు, టెర్రరిస్టులొక వైపు అనకుండా? టెర్రరిస్టుల భాషే సినిమా కూడా మాట్లాడితే, వాళ్ళకీ సినిమాకీ, సినిమా తీసే వాళ్ళకీ తేడా ఏముంటుంది.   

        కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టి వేస్తుంది అన్న గాంధీజీ సూక్తితో ఈ సినిమా ప్రారంభమవుతుంది. కంటికి కన్నే డౌట్ లేదు అన్నట్టు బిగ్ యాక్షన్ సీన్స్ తో టెర్రరిస్టుల్ని కాల్చి కాల్చి చంపుతున్నప్పుడు ఈ సూక్తి దేనికి. సూక్తిని కూడా కాల్చి చంపేశారు. ఏదో రకంగా గాంధీని చంపాలి. ఇలా మసాలా ఫార్ములా యాక్షన్ సినిమాగా తీయక తప్పదని తెలిసీ ఐడియాలజీల ఉత్సాహం, అరకొర మేధావి తనాలు ప్రదర్శించారు. ఇలా చెప్పాల్సిన కథ ఒకటైతే, చెప్పిన కథ గజిబిజిగా ఇంకోటైంది. అక్షయ్ కుమార్ రాజకీయ నేపథ్యంతో ఇంతేనేమో. జస్ట్ ఏ ప్రాపగండా మూవీ.

        ఐతే ఇంతా చేసి రజనీకాంత్ అన్నాత్తే (పెద్దన్న) ని బీట్ చేయలేక పోయింది సూర్యవంశీ. అన్నాత్తే మొదటి రెండు రోజులు 63 కోట్లు, సూర్యవంశీ 40 కోట్లు. 

నటనలు- సాంకేతికాలు

       రోహిత్ శెట్టి యాక్షన్ హీరో అంటే మన ఫ్యాక్షన్ సినిమాల్లోలాగా గాల్లోకెగిరి ఎగిరి కార్ల పేలుళ్లు, విచ్చలవిడి కాల్పులు, ఇదే గాకుండా ఇప్పుడు అక్షయ్ తో రజనీ కాంత్ స్టయిల్లో ఏక వ్యక్తి సైన్యంగా డేర్ డెవిల్ విన్యాసాలూ... విచ్చల విడిగా 20, 30 వేల రౌండ్ల బుల్లెట్ల వర్షం. నువ్వు చచ్చే బుల్లెట్ మీద మేడిన్ ఇండియా అని పెద్ద అక్షరాలతో రాసుంటుంది అని అక్షయ్ పవర్ఫుల్ డైలాగు.

        సగటు ప్రేక్షకుడికి కావాల్సిన గిమ్మిక్కులన్నీ వున్నాయి అక్షయ్ తో. బ్యాంకాక్ లో సికిందర్ ఖేర్ (రాజేంద్ర గుప్తా పాత్ర) మోటార్ బోటు మీద దూసుకు పోతూంటే, అక్షయ్ హెలీకాప్టర్ మీద వెంటాడి లిఫ్ట్ చేసి కాపాడే యాక్షన్ కొరియోగ్రఫీ హైలైట్. విడుదలకి ఎన్ని అవాంతరా లొచ్చినా ఓటీటీకి వెళ్ళక పోవడానికి కారణమిదే. సగటు ప్రేక్షకుడికి బిగ్ స్క్రీన్ మీద, జలదరించే శబ్ద ఫలితాలతో చూపించాలని. బ్యాక్ గ్రౌండ్ లో సూర్యవంశీ సూర్యవంశీ అంటూ చెవులు పగిలే ఆడియో లోగో సహా.

     అక్షయ్ పాత్రకి పేర్లు గుర్తుండవు. ఇంత పెద్ద ఆపరేషన్లు చేసే ఆఫీసరుకి పేర్లు గుర్తుండకపోయే క్యారక్టరైజేషన్ కామిక్ రిలీఫ్ కి బాగా తోడ్పడింది. ఎంటర్టైన్మెంట్. అయితే దేశభక్తి గురించి, పౌర బాధ్యతల గురించి, సెక్యులరిజం గురించీ ముస్లిములకే లెక్చర్ లివ్వాలని మాత్రం ఎంతో బాగా గుర్తుంటుంది. రోహిత్ శెట్టి అక్షయ్ పాత్రని కేర్లెస్ గా వుండే, నిబంధనలు పాటించని అధికారిగా కూడా ప్రెజెంట్ చేశాడు. ఈ ప్రవర్తనకి భార్య దూరమైన కారణమేమో తెలీదు.

          భార్య డాక్టర్ రియా పాత్రలో కత్రినా కైఫ్ మోరల్ యాంకర్ గా పనిచేసే పాత్ర. యాంటీ ముస్లిం ధోరణిని బ్యాలెన్స్ చేయడానికన్నట్టు ఈ పాత్ర. తప్పుగా మాట్లాడుతున్నాడని, తప్పుగా ప్రవర్తిస్తున్నాడని భర్త అక్షయ్ కి క్లాసులు పీకే పాత్ర. అవతలింట్లో కాదు, మనింట్లో ఏం జరుగుతోందో చూడమన్నట్టు ఈ క్లాసులు. క్లయిమాక్స్ లో రణవీర్ సింగ్ కి కూడా ఓ క్లాసు పీకి వుండాల్సింది.

        ఇక అసలైన వాళ్ళు వున్నారు. చివరి ఇరవై నిమిషాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్. రోహిత్ శెట్టి తీసిన సింగం సిరీస్ లోని ఇన్స్ పెక్టర్ బాజీరావ్ సింగం (అజయ్ దేవగణ్) పాత్రని, సింబా లోని ఇన్స్ పెక్టర్ సంగ్రామ్ సింబా భలేరావ్ (రణవీర్ సింగ్) పాత్రనీ ప్రవేశపెట్టి, అక్షయ్ కుమార్ తో యాక్షన్ లోకి దింపి, క్లయిమాక్స్ ని బ్లాస్ట్ చేశాడు శెట్టి. అజయ్ సీరియస్ అయితే, రణవీర్ ఫన్. ఈ క్లయిమాక్స్ ముందు వరకూ అక్షయ్ కి యాక్షన్ మూవీని భుజాన మోసే సత్తా వుంది. అయితే ఆడియెన్స్ కి ఇంకా జోష్ కోసం వీళ్ళిద్దరి ఎంట్రీ.

     గత మూవీ సింబా లో సింగంఅజయ్ దేవగణ్ ని దింపి కథని ఊహించని మలుపు తిప్పాడు దర్శకుడు రోహిత్ శెట్టి. ఇలాటి ఆలోచనలు అతడికే వస్తాయి. పాత మసాలా కమర్షియల్స్ ని కూడా ఏదో గిమ్మిక్కు చేసి ఉలిక్కి పడేలా చేస్తాడు. సింగంఅజయ్ దేవగణ్ వచ్చేసి, సింబా రణవీర్ సింగ్ ని కాపాడే కిక్కిచ్చే మలుపు!

          టెర్రరిస్టుల పాత్రల్లో గుల్షన్ గ్రోవర్, అభిమన్యూ సింగ్, కుముద్ మిశ్రాలు మంచి విలనీతో కన్పిస్తారు. గుల్షన్ గ్రోవర్ మౌల్వీ వేషంలో వుండే టెర్రరిస్టు లీడర్. అభిమన్యూ సింగ్ హిందూ పేరు పెట్టుకుని జైసల్మీర్లో పెళ్ళి చేసుకుని సెటైలైన స్లీపర్ సెల్ టెర్రరిస్టు. ఇతను టెర్రరిస్టు అని ఎంతో కాలానికి తెలుసుకున్న హిందూ భార్య ఏడ్పు వర్ణనాతీతం. ఇతను హిందువు కాదని పెళ్ళయి మొదటి రాత్రే తెలియాలిగా.

        దీనికి బ్యాక్ గ్రౌండ్ స్కోరు మాత్రమే అమర్ మోహిలే, తమన్ లందించారు. నాలుగు పాటలు వేరే రెండు బ్యాండ్స్ వాళ్ళు అందించారు. ఈ పాటల్లో పైన చెప్పుకున్న హమ్ హిందూస్థానీ లోని ఛోడో కల్కీ బాతేఁ’, మొహ్రా లోని టిప్ టిప్ బర్సా పానీ  రీమిక్స్ పాటలు.

—సికిందర్