రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, నవంబర్ 2020, బుధవారం

999 : స్క్రీన్ ప్లే సంగతులు

 


  యోపిక్స్ ట్రెండ్ తగ్గు ముఖం పడుతున్న వేళ ఒక ఆటో బయోగ్రఫీ రివ్యూ కొచ్చింది. దీని స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కావాలని అడిగిన ఒక పదుగురి కోరిక మేరకు సవివరంగా రాయాల్సి వచ్చింది. అప్పుడప్పుడు సమయం తీసి రాయడం వల్ల ఆలస్యమైంది. 3,542  పదాలతో పూర్తి చేసే సరికి ఎన్ని రోజులు గడిచిపోయాయో తెలియలేదు. ఇది 16 పేజీలు వస్తుంది. కనుక చదవబోయే ముందు నిడివి గురించి ముందే ఈ హెచ్చరిక. తెలుగులో మంచి ఫాలోయింగున్నతమిళ స్టార్ సూర్య ఈ ఆటో బయోగ్రఫీకి కథానాయకుడు. దేశంలో సామాన్యులకి చౌకలో ఏర్ డెక్కన్ విమాన యానాన్ని ఆవిష్కరించిన కెప్టెన్ జీఆర్ అయ్యంగార్ గోపీనాథ్ రాసుకున్న ఆత్మ కథతో  సూరరై పొట్రు (ధీరుడికి వందనం) గా, వెంకటేష్ తో గురు ఫేమ్ దర్శకురాలు సుధా కొంగర రూపకల్పన చేసింది. ఇదింకా మలయాళ కన్నడలతో బాటు, తెలుగులో ఆకాశమే నీ హద్దురా అని సెల్ఫిష్ టైటిల్ తో విడుదలైంది. మీడియా ప్రశంసలు విశేషంగా అందుకుంది. సెల్ఫిష్ టైటిల్ అనడమెందుకంటే, సామాన్యులకి చౌకలో విమాన సౌకర్యం కల్పించే కల తన స్వార్ధం కాదని, ప్రజా ప్రయోజనం కోసమేననీ సినిమాలో సూర్య అంటాడు. అలాంటప్పుడు టైటిల్ ఆకాశమే మీ హద్దురా అని కస్టమర్ ఓరియెంటెడ్ గా వుండాలేమో.

        సూర్య కాబట్టి ఇది మరో తమిళ మాస్ మసాలాగా తయారై నట్టుంది. తన మాస్ ఫ్యాన్స్ ని సంతోష పెట్టే వూర మాస్ సినిమా. లేదా ద్రవిడ క్యాస్ట్ పొలిటిక్సు కావొచ్చు. బ్రాహ్మణ కెప్టెన్ గోపీనాథ్ ని అణగారిన వర్గాల మాస్ క్యారక్టర్ గా మార్చి, భార్య పాత్రని కూడా మాసమ్మాయిగా మార్చి, విలన్ గా బ్రాహ్మణ గోస్వామి పాత్రని సృష్టించారు. బ్రాహ్మణుల మీద విజయంగా ముగించారు. ఆటో బయోగ్రఫీని తిరగేసి రాసి, క్యాస్ట్ ఫీలింగ్ ని ఆకాశమే నీ హద్దురా చేశారు. ఈ సినిమాకి కులం రంగులు పులమడం అవసరమా అన్పించేట్టు చేశారు. 

        దర్శకురాలు సుధ గురు తోనే తన స్కూల్ ని స్పష్టం చేసింది. అదే స్కూల్లో ఇప్పుడు సూర్యతో వూర మాస్ గా తీసింది- కార్పొరేట్ కథనాన్ని పక్కన పెట్టేసి. ఐతే స్పోర్ట్స్ కథ గురు ని  స్పోర్ట్స్ జానర్లోనే తీసినట్టు, ఇప్పుడు ఎంటర్ ప్రెన్యూర్ కథని కూడా అదే స్పోర్ట్స్ జానర్లో ఈజీగా తీసేయడంతో సమస్య వచ్చింది. ఎంటర్ ప్రెన్యూర్ లేదా బిజినెస్ జానర్ మూవీస్ వున్నాయిగా - ముఖ్యంగా ఏవియేషన్ బిజినెస్ తో రియల్ స్టోరీ ది ఏవియేటర్’, మెక్ డొనాల్డ్స్ ఫుడ్ బిజినెస్ తో ఇంకో రియల్ స్టోరీ ది ఫౌండర్ వంటివి ఎన్నో పకడ్బందీగా, భావి ఎంటర్ ప్రెన్యూర్స్ కి కూడా పనికొచ్చేలా వున్నాయిగా. కెప్టెన్ గోపీనాథ్ ఒక వినూత్న బిజినెస్ మోడల్ తో విజయం సాధిస్తే, దాంతో బాక్సాఫీసు మోడల్ ని సక్రమంగా ప్రెజెంట్ చేయాలిగా. అసలు బయో పిక్కులకైనా, ఆటో బయోగ్రఫీల కైనా కథకి ఏది పాయింటుగా వుంటుంది, ఏది మార్కెట్ యాస్పెక్ట్ తో చెప్పాల్సిన కథవుతుంది? ఇలాకాక మొన్న అమెరికాలో ఇండియన్ టీ అంటూ వచ్చిన మరో మిస్ ఇండియా లా మిక్చర్ పొట్లంలా తీసేయడమేనా? ఇలా జరిగిన అనేక తప్పిదాల్నితర్వాత విశ్లేషించు కుందాం. 

ముందుగా కథ

         తమిళనాడు మధురై దగ్గర్లో సోలవందన్ లో వుంటాడు నెడుమారన్ రాజంగం అలియాస్ మారా (సూర్య). అతను ఒకప్పుడు ఏర్ ఫోర్స్ లో కెప్టెన్. సామాన్యులకి విమానం కల నిజం చేయాలన్న ఆశయంతో ఇప్పుడు దాని మీద వుంటాడు. టీచరైన తండ్రితో పడదు. మధ్యలో తల్లి (ఊర్వశి) కి హైరానా. ఒక బేకరీ నడిపే అమ్మాయి సుందరి (అపర్ణా బాలమురళి) ని ప్రేమిస్తాడు. ఆమె ఆకాశంలో కలలుగనే అతణ్ణి దూరం పెడుతుంది. మారా కలకి జాజ్ ఏర్ లైన్స్ అధినేత పరేష్ గోస్వామి (పరేష్ రావల్) స్ఫూర్తి. మధ్యతరగతి వాడైన గోస్వామి ఏర్ వేస్ లో టాప్ కి ఎదగడం ప్రేరణ. దాంతో ఆయన్ని కలిసి తన చీప్ ఏర్ వేస్ ప్లాను గురించి చెప్పి భాగస్వామ్యం కోరతాడు. గోస్వామి హేళన చేసి పంపిస్తాడు. దాంతో మారా పట్టుదలకి పోతాడు. అప్పులు చేసి, క్రౌడ్ ఫండింగ్ చేసుకుని అతను విమానాన్ని ఎగరేసినప్పుడల్లా గోస్వామి భూ మార్గం పట్టిస్తూంటాడు. ఒకటి రెండు సార్లు కాదు, చాలా సార్లు. ఇలా ఈ పోరాటంలో మారా చివరికి తన కలని నిజం చేసుకుంటూ, సామాన్య ప్రయాణీకులతో విజయవంతంగా విమానాన్ని ఎలా ఎగరేశాడన్నది మిగతా కథ.  

సూర్య మాస్ అవతారం 

         వూళ్ళో ఇరుకు బస్తీలో మాస్ యువకుడి పాత్రలో సూర్య తమిళ అభిమానుల హృదయాలకి మునుపెన్నడూ లేనంతగా దగ్గరైనట్టు కనిపిస్తాడు. శవ యాత్రలో విరగబడి మసాలా డాన్స్ చేస్తాడు. నవ్వించడు, పైగా ఏడ్పిస్తాడు. భావోద్రేకాల్ని రెచ్చగొడతాడు. క్యాస్టిజం గురించి మాట్లాడతాడు. నేను సోషలిస్టుని, నువ్వు సోషలైట్ వి అంటాడు. ఏం జరిగినా అగ్రవర్ణ అణిచివేతగా ఫీలవుతాడు. మొత్తంగా సామాజిక వర్గ కోణంలో లక్ష్యిత ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు. లక్ష్యం కోసం తన పోరాటంలో ఈ వర్గ ప్రజలే తన బలమని సమీకరిస్తాడు. ఇదేమన్నా విప్లవ సినిమానా? బిజినెస్ మెయిన్ స్ట్రీమ్ లో వుంటుంది. రెబలిజమంటే సమాంతర వ్యవస్థని ఆహ్వానించడమే. సమాంతర వ్యవస్థలో స్మగ్లింగ్ వుంటుంది. స్మగ్లింగ్ చేసుకు బ్రతకాలి, ఆ వినియోగ దార్లు వేరు. దేశంలో మెయిన్ స్ట్రీమ్ లో దళిత కార్పొరేట్ అధిపతులు లేరనా?

        నేరుగా కార్పొరేట్ క్లబ్ కి చేర వేసే ఒక వినూత్న విమాన యాన బిజినెస్ మోడల్ ని ఆలోచించగల్గిన అడ్వాన్సుడు ఎంటర్ ప్రెన్యూర్ అయిన తను, ఈ మూస పోరాటాలూ కులం కార్డులూ, తన క్యాస్ట్ ని ఫీలయ్యే ఇన్ఫీ రియారిటీ కాంప్లెక్సులూ, రోషాలూ పక్కన పెట్టి, రెబెల్ పంథా నుంచి కాస్త మెయిన్ స్ట్రీమ్ లో కొచ్చి-  బిజినెస్ మైండ్ తో  హేమా హేమీలతో నెగెటివ్ గా రియాక్టవని మాస్టర్ నెగోషియేటర్ గా వ్యవహరించాలని ఆలోచించని, ఆవేశమే తప్ప ఆలోచన లేని, సగటు టెంప్లెట్ మాస్ పాత్రగా మిగిలి పోతాడు. బిజినెస్ జానర్ మూవీలో వింత పాత్రలా వుంటాడు. అసలొక తాజా మాజీ కెప్టెన్ లా అన్పించడు. డిఫెన్స్ దళాలకి కుల మతాలుండవని మర్చిపోయారేమో.

        గోస్వామిని అప్రోచ్ అయ్యే విధానం, మిస్ ఇండియా లో ఎంబీఏ చదివిన కీర్తీ సురేష్ పాత్ర, జగపతి బాబుని అప్రోచ్ అయి రొచ్చు చేసుకునే విధానంతో వంద మార్కుల సరి సమానం. ఎవరైనా ఎదుటి వ్యక్తికి పోటీ నిచ్చే ప్రతిపాదనతో అప్రోచ్ అవుతారా? ది ఫౌండర్ లో ఒకే రెస్టారెంట్ నడుపుతున్న మెక్ డొనాల్డ్ సోదరుల్ని, రే క్రాక్ ఎలా అప్రోచ్ అయ్యాడు? ఫ్రాంఛైజీలు ప్రారంభించి, మెక్ డొనాల్డ్స్ పురోభివృద్ధికి తోడ్పడతానన్నాడు. ఇవ్వాళ మన సమీపంలో కూడా మెక్ డొనాల్డ్స్ వుందంటే అది మెక్ డోనాల్డ్స్ సోదరులతో రే క్రాక్ నెరపిన డిప్లమసీ ఫలితమే. 

        మారా తనకి గోస్వామి స్ఫూర్తి అంటాడు. నువ్వు స్ఫూర్తి నిచ్చావు, నాకు అన్నం పెట్టు అన్న టైపులో తగువుకి దిగుతాడు. బ్రతుకు తెరువుకి స్ఫూర్తి నిచ్చిన వ్యక్తితో పోట్లాటకి దిగితే కాలం క్షమిస్తుందా? ఇదే తర్వాత జరిగింది. ఇలా ఇన్ని లోపాలతో వున్న మారా పాత్రతో ఫీలవాల్సింది హీరోయిజంగా ఏమీ అన్పించదు, దాని ప్రవర్తనలోంచి ఇలా మనం చేయకూడదని నేర్చుకోవాల్సిన మోరల్ లెసన్ కన్పిస్తుంది. ఎలా పడితే అలా తీయడానికి ఇది చిన్నా చితకా సినిమా కాదు, స్టార్ సినిమా. దీని రాత, తీత పై స్థాయిలో వుండక పోతే ఎలా? అందులోనూ ఆటో బయోగ్రఫీతో. అసలు కెప్టెన్ గోపీనాథ్ కి స్ఫూర్తి అమెరికాలో, యూరప్ లో రెండు ఏవియేషన్ కంపెనీలు. ఆ ఐడియాని ఇండియాలో స్వతంత్రంగా అమలు చేశాడు.    

***

        రోమాంటిక్ సైడ్ సూర్యకి అపర్ణాతో రోమాన్స్ ప్రాక్టికల్ గా, ఇన్స్పైరింగ్ గా ఏమీ వుండదు. ఆకాశంలో అతడి కల అసాధ్యమని అతణ్ణి దూరం పెట్టి, ఆమె తన బేకరీ షాపు  చూసుకుంటుంది. అతనప్పటికే వైమానిక దళ కెప్టెన్ గా విమానం నడిపాడని ఆలోచించదు. అతడికి కూడా తన కలతో ఒక విజన్ అంటూ లేదు. ముందు తన కుటుంబాన్నికలుపుకుని తన కలల్ని వూహించుకోని వాడు ఇతరుల కలల్ని ఏం నిజం చేస్తాడు. ఇరుకు జీవితాలు గడుపుతున్న తన పేరెంట్స్ తోబాటు, ప్రేమిస్తున్న అమ్మాయినీ బేకరీ వృత్తి వదిలించి - తన కలలతో ఉన్నత జీవితం అందించాలన్న తపన అతడికుండదు. వుంటే వాళ్ళని కాక్పిట్ లో కూర్చో బెట్టుకుని తను విమానం నడుపుతున్నట్టు కరువుదీరా డ్రీమ్ సాంగ్ వేసుకునే వాడు. దర్శకుడు శంకర్ అయితే ఇలాగే చేసి ప్రేక్షకుల కోరిక నంతా తీర్చేస్తాడు. విజువలైజేషన్ లేని కలలుంటాయా. అలాటి డ్రై కలలు నిజమవుతాయా, వాటిని నమ్మొచ్చా. ఏదో సాధించాలని కలలుంటే ఆటో మేటిగ్గా మైండ్ విజువలైజేషన్ కెళ్లిపోతుంది. ఈ ప్రకృతి ధర్మాన్ని పాత్ర కెలా నిరాకరిస్తారు. కొన్ని కలలు రోమాంటిక్ ఇంట్రెస్ట్ వల్ల కూడా నిజమవుతాయి. సినిమాకి రోమాంటిక్ ఇంట్రెస్ట్ తోడవని హీరో గోల్ ఏం బావుంటుంది. ఆమె కోసం నేను సాధిస్తాను- అనుకోక పోతే ఇంకెందుకు పాత్ర. ప్రణయ రసం లేని పాత్ర ప్రయాణం ఎడారిలో గుడారంతో సమానం. ఇసుక పిసుక్కోవడమే.

        ఇలా ఈ సినిమాలో క్లట్టర్ ఎక్కువుంది. ఫిల్టర్ చేస్తే అందులోంచే సరైన కథనం చేసుకోవడానికి ఆణిముత్యాలు దొరుకుతాయి. పెళ్లయాక విమానంలో కేటరింగ్ గురించి చర్చ వస్తుంది. వివిధ వూళ్ళలో  తన బంధువులు స్వగృహ టైపులో స్నాక్స్ వ్యాపారాలు చేస్తున్నారనీ, వాళ్ళు సప్లయి చేస్తారనీ అంటుంది. బాగానే వుంది విమానంతో కుటీర పరిశ్రమ. గల్లీ మాస్ ఆలోచన. అసలు గోపీనాథ్ ఎకానమీ బిజినెస్ మోడల్ లో విమానంలో ఫుడ్ సర్వింగ్ అనే అంశం లేనే లేదని మర్చిపోయారు. మారా అనే తను, మాస్ నుంచి క్లాస్ కి ఎదిగి, కంపెనీలో సుందరిని కూడా కార్పొరేట్  పోస్టుకి సిద్ధం చేయాలన్న ఎంటర్ ప్రెన్యూర్ ఆలోచనలుండవు. డైనమిక్స్ తో కథనం ఎక్కడికక్కడ రీఫ్రెష్ అవుతూ నెక్స్ట్ లెవెల్ కెళ్ళకుండా, ఎక్కడేసిన గొంగళిలా వుంటుంది.
***

       ప్రేమతో మొదలయ్యే వీళ్ళ ఇగోలతో సమస్య సంసారంలో కూడా కొనసాగుతుంది. ఈ ఇగోలతో కూడా బలమైన సన్నివేశాలు వుండవు గానీ, తండ్రి చావు బతుకుల్లో వున్నపుడు విమాన టికెట్ కొనలేక పడే యాతనతో కదిలించే బలమైన నటన ప్రదర్శిస్తాడు సూర్య. సందేహం లేదు, సూర్య ఈజ్ ది బెస్ట్. ఈ సీను టాప్. అయితే ఈ విషాదం కంటే, ఖర్మ కాలి అతను పై వర్గాల వాళ్ళనే తిరిగి దీనంగా టికెట్ డబ్బులు అడుక్కుంటూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది కదాని గుణపాఠంలా అన్పిస్తుంది. ఎవ్వరూ కనికరించి డబ్బులివ్వరు. ఇలా ఏం డ్రామా క్రియేట్ చేస్తున్నారో గ్రహించకుండా, హీరోకే డ్యామేజింగ్ గా వుండే దృశ్యాల చిత్రీకరణ చేసేశారు. 

        ఇంటర్వెల్ సీను కూడా ఇలాటిదే. భారీ సీను క్రియేట్ చేస్తూ, స్ఫూర్తి ప్రదాత గోస్వామి మీద సిలిండర్ విసిరేస్తాడు. చివరికి ఇంత పోరాడుతూ యాక్షన్ తో కన్పిస్తున్న సూర్య పాత్ర యాక్టివ్ పాత్రనా? కాదు. రియాక్షనే చూపిస్తున్న పాసివ్ - రియాక్టివ్ పాత్ర. అందుకే కథ ఇలాటి దృశ్యాలే రిపీటవుతూ ముగిసింది. 

        మలయాళ నటి అపర్ణా బాల మురళి సరైన దృక్పథం లేని బేకరీ నడిపే మాస్ హీరోయిన్ గా, మాస్ విలువలకి తగ్గ న్యాయం చేసుకుంది. గోస్వామిగా పరేష్ రావల్ మాత్రం ఉండీ లేనట్టుండే ప్రతినాయక పాత్ర. ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సూర్య విమానం ఎగరేసినప్పుడల్లా భూమార్గం పట్టించడానికి వచ్చి రెడీగా కన్పిస్తూంటాడు. క్లయిమాక్సులో కన్పించడం శుద్ధ అనవసరమనుకుంటాడు. 

        గోస్వామికి కూడా తెలివి వుండదు. మారా చెప్తున్న అయిడియా పనికొచ్చేదే. తను కాకపోతే ఇంకో అంతర్జాతీయ కంపెనీకి పోయి ఇండియాలో దింప వచ్చు మారా. అప్పుడేం చేస్తాడు. ఇదేదో తను క్యాష్ చేసుకుని తన ఏక ఛత్రాధిపత్యానికి విఘాతం కలక్కుండా చూసుకోకుండా? కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో లేని మారా - గోస్వామిల ఈ పోరాటాన్ని సినిమాలో కల్పించారు. 

        మారాని చూడగానే గోస్వామి శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకుంటాడు. ఇలా అంటరాని తనాన్ని కూడా ఈ కథలోకి తీసుకు రావడం! దీనికి మారా రియాక్షన్ ఏమీ వుండదు. గోస్వామి తనని చూసి అలా చేతులు తుడుచుకున్నాడంటే, మారా ఇక ఆ మీటింగ్ కి నీళ్లొదుకుని వెళ్లిపోవాలి. ఇలా కథని మార్చేసే అర్ధం లేని చిత్రణ లున్నాయి. 

        ఒక ఏర్ ఫోర్స్ కెప్టెన్ తో గోస్వామికి అంత లేకి తనమేమిటో అర్ధం గాదు. దేశంలో అందరూ కలిసి జీవించాల్సిందే. దేశం తప్ప ఇంకోటి లేదు జీవించడానికి. అసలు సినిమా ప్రారంభంలోనే బ్రాహ్మణ వ్యక్తి రైలులో బడుగు జనాల్ని చూసి అసహ్యించుకోవడం వుంది. ఇక్కడ్నించే సినిమాలో బ్రాహ్మణ - బడుగు బాహాబాహీకి అలవాటు పడేందుకు ప్రేక్షకులని సిద్ధం చేశారు. ఈ బ్రాహ్మణులకి శాస్తి చేయాల్సిందే అన్నట్టు మిగతా కథ నడిపారు. ఏమిటో ఇదంతా. 

        ఇక కింగ్ ఫిషర్ ఏర్ లైన్స్ నడిపిన విజయ్ మాల్యా రూపంలో వుండే విమల్ బాలయ్య పాత్రలో డాన్ ధనోవా వుంటాడు. ఏర్ డెక్కన్ చరిత్రలో ఈ కీలక పాత్రని ఆటో బయోగ్రఫీలోని క్రోనాలజీ పట్టించుకోకుండా మధ్యలో అసందర్భంగా ప్రవేశ పెట్టి ముగించారు. ఏర్ ఫోర్స్ అధికారిగా మోహన్ బాబు అతిధి పాత్ర కూడా కల్పితమే. 

        సాంకేతికాల కొచ్చేటప్పటికి ఏ స్టార్ సినిమా అయినా బాగానే వుంటుంది. ఇది కూడా అంతే. ఎగరేసినప్పుడల్లా ఒక్కో విమానం ప్రమాదానికి లోనయ్యే దృశ్యాలన్నీ ప్రొఫెషనల్ గా వున్నాయి. సంగీతమూ ప్రొఫెషనల్ గా వుంది. అన్నీ ప్రొఫెషనల్ గానే  వుంటాయి. సాంకేతికులు ఎప్పటి కప్పుడు అప్డేట్ అవుతూ ప్రొఫెషనల్స్ గా వుంటారు, లేకపోతే ప్రొఫెషన్ వుండదు. కథా కథనాల వాళ్ళే, పాత్ర చిత్రణల వాళ్ళే ప్రొఫెషనల్స్ గా వుండరు, అప్డేట్ అవరు. అవకపోయినా ప్రొఫెషన్ పదిలం.

ఎలావుంది కథ
       భారీగా కల్పితాలు చేసిన సినిమా అన్నాడు కర్ణాటకకి చెందిన కెప్టెన్ గోపీనాథ్. చాలా చోట్ల నవ్వానన్నాడు. ఈ సినిమాలో కామెడీ లేకపోతే ఎందుకు నవ్వాడో. పెద్ద మనసు చేసుకుని అభినందించాడు. రాష్ట్రీయ, జాతీయ మీడియాలు పోటీలు పడి మూడేసి నాల్గేసి స్టార్స్ ఇచ్చి కొనియాడేక, ఈ సినిమా ఖచ్చితంగా సూపర్బ్ ఆటో బయోగ్రఫీయే, ఇంకో మాట లేదు. 

        అయితే  సింప్లీ ఫ్లై- ఏ డెక్కన్ ఒడెస్సీ పేర ఆటో బయోగ్రఫీ కూడా సమగ్రంగా వుండదు. ఇందులో ఏర్ డెక్కన్ ప్రారంభానికి ముందు బాల్యం నుంచీ గోపీనాథ్ జీవిత కథ వుంటుంది. గ్రామీణుడిగా, సైనికుడుగా, రైతుగా, వ్యాపారిగా, ఎంటర్ ప్రెన్యూర్ గా సగ భాగం వుంటుంది. రెండో సగం దేశంలో తొలి ఛార్టర్ హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభకుడుగా, తర్వాత ఏర్ డెక్కన్ తో తొలి లో -కాస్ట్ క్యారియర్ (ఎల్సీసీ) కంపెనీ వ్యవస్థాపకుడుగా వుంటుంది. 

        అయితే ఏర్ డెక్కన్ ఆపరేషన్స్ ఎలా వుండేవి, సామాన్య ప్రయాణీకుల స్పందన లేమిటి, విమానం కల తీరిన వాళ్ళ అనుభవాలేమిటి, దాచుకోదగ్గ అనుభూతులేమిటి, ఆనంద పారవశ్యాలేమిటి, కంపెనీ ప్రాభవమేమిటి, సిబ్బంది నియామకా లేమిటి, ఉపాధి పొందిన వాళ్ళ సంఖ్యేమిటి, కొనుగోలు చేసిన మరిన్ని విమానాల వివరాలేమిటి, చివరికి విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ తో విలీనానికి దారి తీసిన పరిస్థితులేమిటీ సమాచారం లేదు. సినిమాకి కావాల్సింది ఈ కథే. ఈ కథే లేక పోవడంతో సినిమాలో చూపించిందంతా కథకి పూర్వం వుండే కేవలం ఉపోద్ఘాతమని గుర్తించాల్సిన అవసరముంది.

        కెప్టెన్ గోపీనాథ్ ఏర్ డెక్కన్ ప్రారంభించుకోవడానికి చంద్రబాబు నాయుడు, ఎస్ ఎం కృష్ణ, వెంకయ్య నాయుడు వంటి అన్ని పార్టీల నాయకులూ, ప్రభుత్వాలూ సహాయపడ్డారు. ఇతర కంపెనీలతో గోపీనాథ్ ఎదుర్కొన్నది పోటీయే తప్ప, సినిమాలో చూపించినట్టు కుట్రల్ని కాదు. ఏం చేసినా ఆటో బయోగ్రఫీని మార్చి చేశామనుకుంటున్నది కథ కాదు. సినిమాలో కథే ప్రారంభం కాలేదు. కథకే రెక్కలు మొలవలేదు. 

స్క్రీన్ ప్లే సంగతులు

        ఏ బయోపిక్కైనా, ఆటో బయోగ్రఫీయైనా సినిమాకి ఒకే కాన్ఫ్లిక్ట్ తో వుంటుంది. ఒక నిజ వ్యక్తి జీవితాన్ని తెరకెక్కించడానికి ఆ వ్యక్తి జీవితంలో ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యనే (కాన్ఫ్లిక్ట్) ప్రధానంగా చేసుకుని, సమస్య-సంఘర్షణ- పరిష్కారమనే త్రీయాక్ట్ స్ట్రక్చర్ కిందికి తెస్తారు. అదే జానర్ బయోపిక్ అయినా సరే. 

        ఇక్కడ సౌలభ్యం కోసం బయోపిక్ అనే వాడదాం. బయోపిక్ స్క్రీన్ ప్లేకి ఎప్పుడో 1982 లో  గాంధీతీసిన సర్ రిచర్డ్ అటెన్ బరో ఒక మార్గం వేశాడు. ఇటీవల 2012 లో స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన లింకన్వుండనే వుంది. ఇంకా చాలామంది తీసిన చాలా బయోపిక్ లు అర్ధవంతంగా వున్నాయి. బయోపిక్ అంటే మామూలు సినిమా కథలాగే ఆ వ్యక్తి పాత్ర, అది ఎదుర్కొనే సమస్య, కనుగొనే పరిష్కారం, చివర విజయమో అపజయమో, ఇంతే. ఇలా ఒక లైనులో చూసినప్పుడు సమస్య- సంఘర్షణ- పరిష్కారం అనే మజిలీల క్రమం వెండితెర మీద స్పష్టంగా తొణికిస లాడాలి.

        బయోపిక్ అంటే పుట్టిందగ్గర్నుంచీ గిట్టిందాకా ఆ వ్యక్తి జీవితాన్ని పూసగుచ్చినట్టు చూపించడం కాదు. ఆ వ్యక్తి జీవితాన్ని మార్చిన ఒకే ఒక్క మలుపు, లేదా ఒక లక్ష్యం కోసం ఆ వ్యక్తి ఎదుర్కొన్న సమస్య మాత్రమే సినిమాకి బయోపిక్ కథ అవుతుంది. మహాత్మా గాంధీ లక్ష్యం స్వాతంత్ర్య సముపార్జన. దీనికి ప్రేరణ 1) దక్షిణాఫ్రికా రైల్లో తనకి జరిగిన అవమానం, అప్పుడు 2) సహాయ నిరాకరణోద్యమం, 3) క్విట్ ఇండియా ఉద్యమం - స్వాతంత్ర్య సిద్ధి, 4) మతకల్లోలాలు -మరణం. ఇంతే, శాఖోపశాఖలుగా విస్తరించిన మహాత్ముడి జీవితంలో ఈ నాల్గే ఘట్టాల్ని స్క్రీన్ ప్లే కి ఫౌండేషన్ గా తీసుకుని, అజరామరమైన చలన చిత్రరాజాన్ని ప్రపంచాని కందించాడు అటెన్ బరో. 

        అంతేగానీ మహాత్ముడు ఎలా సత్యనిష్టుడో చిన్నప్పటి సీన్లేద్దాం, కుటుంబం సీన్లేద్దాం, ఆ బిట్లు వేద్దాం, ఈ బిట్లు తెచ్చి వేద్దామని కలగాపులగం చేయలేదు. మహాత్ముడి వ్యక్తిగత జీవితమే చూపించాలంటేఆ పాయింటుతో అది వేరే బయోపిక్ అవుతుంది. గాంధీ మై ఫాదర్అనీ గాంధీ మీద కోపం వచ్చేలా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ గాంధీ కొడుకుతో తీయనే తీశాడు. 

            ఇలాగే స్టీవెన్ స్పీల్ బెర్గ్ లింకన్తీసినప్పుడు సినిమా కథగానే తీశాడు. వెండితెర వున్నది స్పష్టమైన కథల కోసం తప్ప; గాథలతో, ఉపోద్ఘాతాలతో, డాక్యుమెంటరీలతో, న్యూస్ బులెటిన్ లతో, కచరా చేయడానికి కాదు. లింకన్తీసినప్పుడు స్పీల్ బెర్గ్ అమెరికా పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ జీవితాన్నంతా కామెంటరీ చేస్తూ తీయలేదు. ఆయన జీవితంలోని ఒక ప్రధాన ఘట్టం - అగ్నిపరీక్ష లాంటిది -13 వ రాజ్యాంగ సవరణ గురించిన రాజకీయ డ్రామాని మాత్రమే స్క్రిప్టు చేశాడు. ఈ డ్రామాలో లింకన్ పాత్ర, 13 వ రాజ్యాంగ సవరణ అనే సమస్య, దీనికోసం సంఘర్షణ, విజయం, ఇంతే వున్నాయి. 

        ఎందరో రచయితలు లింకన్ జీవితాన్ని పుట్టిన దగ్గర్నుంచీ ఎపిసోడ్లు రాసుకొస్తే స్పీల్ బెర్గ్ పక్కన పడేశాడు. ఈ బయోపిక్ కి డొరిస్ కీర్న్స్ గుడ్విన్ రాసిన పుస్తకం ఆధారం. 500 పేజీల ఈ లింకన్ జీవిత చరిత్రలో స్పీల్ బెర్గ్ కేవలం నాలుగే నాలుగు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు! అయినా దీని మీద కసరత్తు చేస్తే కుదరదన్పించింది. నాలుగు నెలలు కాక రెండు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు!! ఈ రెండు నెలల కాలంలో చోటు చేసుకున్న 13 వ రాజ్యాంగ సవరణ పరిణామాలతో బయోపిక్ తీసి పెద్ద విజయం సాధించాడు.

         1970 లలో ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ని నిండా ముంచిన వాటర్ గేట్ కుంభకోణాన్ని కూపీలాగి పుస్తకం రాశారు ఇద్దరు జర్నలిస్టులు. ఆల్ ది ప్రెసిడెంట్స్ మెన్అన్న పుస్తకం టైటిల్ తోనే గొప్ప సినిమా తీశారు. పుస్తకాన్ని స్క్రీన్ ప్లేగా మార్చే బాధ్యత హాలీవుడ్ లో ఆచార్యుడు లాంటి రైటర్ విలియం గోల్డ్ మాన్ తీసుకున్నాడు. అప్పటికే ఒక ఆస్కార్ అవార్డు తన ఖాతాలో వుంది. పుస్తకంలోని రెండో భాగాన్నితీసి అవతల పడేసి, మొదటి భాగంతోనే స్క్రీన్ ప్లే అంతా రాశాడు. పుస్తకం రాసిన జర్నలిస్టులిద్దరు ఇదేమిటని గోలగోల చేశారు. ఒక జర్నలిస్టు గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఇంకో స్క్రీన్ ప్లే కూడా రాశాడు. స్క్రీన్ రైటింగ్ అంటే జర్నలిజం కాదురా అన్నాడు గోల్డ్ మాన్. స్క్రీన్ మీద ప్రేక్షకులు జర్నలిజాన్ని చూడరన్నాడు. దీంతో బిగ్ స్టార్ రాబర్ట్ రెడ్ ఫోర్డ్, దర్శకుడు అలన్ పకూలా కంగారు పడి గోల్డ్ మాన్ రాసిన స్క్రీన్ ప్లేని తీసుకుని నెలరోజులు అజ్ఞాతంలో కెళ్ళి పోయారు. దాంతో కుస్తీ పట్టారు. ఇలా కాదు, అలా వుండాలి...అలా కాదు, ఇలా చేద్దాం...రెండో భాగాన్ని ఇలా కలుపుదాం, కాదు అలా కలుపుదామని జుట్లు పీక్కుని పీక్కునీ ఏమీ చేయలేక పెద్దాయనే కరెక్ట్ అని, పెద్దాయన రాసిన శిలాశాసనాన్నే సినిమాగా తీశారు. అదెక్కడికో వెళ్ళిపోయి చరిత్ర కెక్కింది. ఎన్నో ఆస్కార్ అవార్డు లొచ్చి పడ్డాయి. ఆ స్టార్ కీ, దర్శకుడికీ కాక, పెద్దాయనకీ ఇంకోటి పడింది. అలా ఆల్ ది గోల్డ్ మాన్స్ మెన్ అన్పించుకున్నారన్న మాట.

***

            బిజినెస్ జానర్ బయోకిక్ కైనా ఇంతే. ది ఏవియేటర్, ది ఫౌండర్, జాయ్, వాల్ స్ట్రీట్, ది బ్యాంకర్ ఇలా ఎన్నో. ఓ సామాన్య వ్యక్తి బిజినెస్ కలల్ని నిజం చేసుకునే ఈ కథల్లో త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తో కథే వుంటుంది. అంటే ఆ బిజినెస్ ప్రారంభించాక ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య, దాని పరిష్కారం మొదలైనవి. ది ఫౌండర్ (2016) లో మెక్ డోనాల్డ్స్ సోదరుల్ని ఒప్పించి ఫ్రాంఛైజీలు ప్రారంభించిన రే క్రాక్, క్రమంగా టేకోవర్ కే పథకమేసి సంక్షోభం సృష్టిస్తాడు. దీన్ని మెక్డొనాల్డ్స్ సోదరులెలా ఎదుర్కొన్నారన్నది కథ. 

        ది ఏవియేటర్ (2004) చూద్దాం :  ప్రసిద్ధ దర్శకుడు మార్టిన్ స్కార్సెసీ దర్శకత్వంలో లియోనార్డో డీ కాప్రియో నటించిన ఈ బయోపిక్ లో, కథ క్లియర్ కట్ గా వుంటుంది. బిగినింగ్ విభాగంలో కాప్రియో వేగంతో  రికార్డుల్ని బ్రేక్ చేసే మోనో ప్లేన్ ని నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ప్లాట్ పాయింట్ వన్ లో నిర్మాణం పూర్తి చేస్తాడు. మిడిల్ లో ఓసిడి వ్యాధికి లోనవుతాడు. దాంతో బాధపడుతూనే విమాన వేగంలో ప్రపంచ రికార్డుల్ని బ్రేక్ చేస్తూ పోతాడు. ఒక ఏర్ ఫోర్స్ కాంట్రాక్టు లభిస్తుంది. ఇంకోసారి విమానం కూలిపోతుంది. ఈ ప్లాట్ పాయింట్ టూ లో, ఏర్ ఫోర్స్ తో అవినీతి ఆరోపణల కేసులో ఇరుక్కుంటాడు. ఎండ్ విభాగంలో ఇందులోంచి బయటపడి, విమానం ఎగరేసుకుంటూ హేపీగా పోతాడు. చాలా సింపుల్ - ఒక్క లైనులో కథేమిటో స్పష్టంగా కనపడుతూంటుంది తెరమీద. కథలా వుండే కథ. 

        బిగినింగ్ లో ఇది బాల్య జీవితంతోనే ప్రారంభమవుతుంది. బాల్యంలో సినిమా కలలతో వుంటాడు. సినిమాలు తీస్తున్నాక విమానాల మీద దృష్టి మళ్లించి ఆ దిశగా వెళ్ళిపోతాడు. ఈ ఉపోద్ఘాతమంతా స్ట్రక్చర్ అనుమతించే బిగినింగ్ విభాగం లోపే సర్దేసి వుంటుంది. ఇది సినిమా దర్శకుడు, ఏవియేషన్ మాగ్నెట్ అయిన - హోవర్డ్ హ్యూజెస్ జీవిత కథ. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే ఆస్కార్ అవార్డు లందుకున్న మెస్మరైజింగ్ బయోపిక్. బయోపిక్స్ కి గైడ్ బుక్.

***

         ఇప్పుడు ఏర్ డెక్కన్ బయోపిక్ స్ట్రక్చర్ చూద్దాం. ప్రారంభంలో ఏర్ డెక్కన్ క్రాష్ లాండింగ్ దృశ్యం తర్వాత ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. ఏర్ ఫోర్స్ లో మారా జీవితం, వూళ్ళో సుందరితో ప్రేమ, పేరెంట్స్ తో పరిస్థితి, చౌక విమాన యానం కల, అందులో భాగంగా గోస్వామిని కలవడం. ఇక్కడ గోస్వామిని కలిసి ప్రపోజల్ పెట్టడం, తిరస్కారం పొందడం అన్నది ప్లాట్ పాయింట్ వన్ దృశ్యం. ఇది సముచితంగా 30 నిమిషాల కొస్తుంది. 

        ఇక మిడిల్ లో గోస్వామితో తిరస్కారం పొందిన మారా పట్ల, వెంచర్ క్యాపిటలిస్ట్ ప్రకాష్ బాబు అనే అతను ఆసక్తి చూపిస్తాడు. అతను చెప్పినట్టు మలేషియా నుంచి విమానం హైర్ చేసుకోవడానికి మారా నలభై లక్షలు అప్పు చేస్తాడు. దీనికి డీజీసీఏ అధికారి బ్రేక్ వస్తాడు. దీని వెనుక గోస్వామి వుంటాడు. ప్రకాష్ బాబు గోస్వామి మనిషే. ఇలా మోసపోయానని గ్రహించిన మారా నీరుగారి పోతాడు. ఇంతలో తండ్రి చావు బతుకుల్లో వుంటే పరిగెడతాడు. తండ్రి చనిపోతాడు. మలేషియా  విమానం క్యాన్సిల్ అవుతుంది. మారా గోస్వామి మీద తిరగబడతాడు. ఇక్కడ ఇంటర్వెల్ వస్తుంది గంటం పావుకి. 

        సెకండాఫ్ లో అంటే మిడిల్ టూ లో- చేసిన అప్పుల గురించి ఇంటా బయటా  సమస్యలు వస్తాయి. సుందరితో కూడా సమస్యలు వస్తాయి. ఎలాగో పెళ్ళవుతుంది. మారా ఇంకో ప్రయత్నం చేస్తాడు. క్రౌడ్ ఫండింగ్ తో ప్రజల దగ్గర డబ్బు సేకరించి కార్గో ఫ్లయిట్ కొంటాడు. దాన్ని పాసింజర్ టర్బో క్రాప్ గా మార్చి ప్రారంభిస్తే, గోస్వామి లాండింగ్ డిలే చేయిస్తాడు. విమానం ఏర్ ఫోర్స్ బేస్ లో క్రాష్ లాండింగ్ అవుతుంది. ఇదే ప్రారంభంలో చూపించిన దృశ్యం. దీంతో ఫ్లాష్ బ్యాక్ ఇక్కడి కొచ్చి పూర్తయినట్టు. 

        ఇప్పుడు దీని మీద ఏర్ ఫోర్స్ అధికారి కోర్ట్ మార్షల్ చేసి ఫైన్ వేస్తాడు. తిరిగి మారా రూపాయి టికెట్ పెట్టి ఇంకో ఏర్ ట్రావెల్ ప్రయత్నం చేస్తాడు. దీన్నీ గోస్వామి ఫెయిల్ చేస్తాడు. కొడుకు పుడతాడు. ఇప్పుడు విమల్ బాలయ్య వచ్చి, విలీనం చేయమని ఆఫర్ ఇస్తాడు. మారా తిరస్కరిస్తాడు. దీంతో మిడిల్ టూ కూడా  ముగిసి ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఇక ఎండ్ విభాగంలో మారా సామాన్యుల్ని ఎక్కించుకుని విజయవంతంగా విమానాన్ని ఎగరేస్తాడు. ఇదీ స్ట్రక్చర్.

***

       ఇందులో మొదటి 30 నిమిషాల్లో గోస్వామితో మీటింగ్ తో ప్లాట్ పాయింట్ వన్ వచ్చిందనుకుని, సహజంగానే ఇంటర్వెల్ కి విజయవంతంగా ఏర్ డెక్కన్ ప్రారంభించి, ఆ వ్యవస్థని మారా సుందరితో కలిసి ఎలా నడిపాడో దాని తాలూకు వైభవాన్ని చూస్తామను కుంటాం. సామాన్య ప్రయాణీకులతో సీన్లేమిటో, ఎంటర్టయిన్ మెంట్ ఏమిటో, బర్నింగ్ ట్రైన్ లో ఎలాగైతే రకరకాల కుటుంబాలు ట్రైనెక్కి చేసే వినోద కార్యక్రమాల్లాగా, ప్రయాణంలో పదనిసల్లాగా, ఆ సరదాలు చూస్తామనుకుంటాం. బాంబే టూ గోవా బస్సు ప్రయాణంలో కమెడియన్లు, మూర్ఖులు, హౌలే గాళ్ళు, ఆకూపోకా తెలీని అమాయకులూ చేసే కామెడీల్లాంటివి చూస్తామనుకుంటాం. స్వర్గమన్నాక స్వర్గాన్ని చూపించాలిగా. ఎంతసేపూ స్వర్గం చేరుకునే పాట్లే చూపించి ముగిస్తారా. అది కథవుతుందా. స్వర్గమో రామచంద్రా  అని అల్లాడాలా సినిమా చూస్తున్న వాడు -త్రిశంకు స్వర్గంలో పడేస్తే?


        ప్రేక్షకుల్లో విమానాన్ని ఎక్కని వాళ్లెందరో వుంటారు. అసలు ఏర్ డెక్కన్ చీప్ ట్రావెల్ ఎలా వుంటుందో చూడాలనుకునే వాళ్ళుంటారు. సామాన్యుల విమానం కల అని చెప్పి ఆ కల చూపించక పోతే ఎట్లా. శంకర్ అయితే ఇలాగే చూపించి వాళ్ళ కోరిక నంతా తీర్చేస్తాడు. ఇదే చెప్పాల్సిన కథ కాబట్టి. ఇది మిడిల్ విభాగమూ, మిడిల్ విభాగమంటే కథా ప్రారంభమూ కాబట్టి. కథంటే ఇదే కాబట్టి. ఇంకా గోపీనాథ్ లా మారా 40 విమానాలతో ఎదిగిన విధం, పొందిన మీడియా కవరేజి, వైభవం ఇదంతా చూడాలనుకుంటాం. 

        ది ఏవియేటర్ లో ప్లాట్ పాయింట్ వన్ లో విమాన నిర్మాణం పూర్తి చేశాక, దీంతో మిడిల్ ప్రారంభంతో విమానాన్నేసుకుని స్పీడ్ లో రికార్డ్ బ్రేకింగ్ మొదలెట్టేశాడని ఇందాకా తెలుసుకున్నాం. ఇదే కదా చెప్పాల్సిన కథ. ది ఫౌండర్ లో  మెక్డొనాల్డ్స్ ఫ్రాంఛైజీలు ప్రారంభించాలన్న ప్లాట్ పాయింట్ వన్ గోల్ తో ప్రారంభమయిన రే క్రాక్, మిడిల్ లో ఫ్రాంఛైజీలని విస్తరిస్తూ, ఎలా కంపెనీని అభివృద్ధి చేశాడని కదా చూస్తాం. 

        అలాగే ఏర్ డెక్కన్ కథలో ఏర్ డెక్కన్ బిజినెస్ వ్యవహారం చూపించాల్సి వుంటుంది. ఒకసారి మరాఠీలో తీసిన ప్రసిద్ధ చలన చిత్రం, దాదాసాహేబ్ ఫాల్కే బయోపిక్ తో హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ చూడండి. ప్రింటింగ్ ప్రెస్ లో నష్టాలొచ్చి నిరుద్యోగిగా తిరుగుతున్న ఫాల్కే, ఒక గుడారంలో ఇంగ్లీష్ సైలెంట్ మూవీ చూస్తాడు ప్లాట్ పాయింట్ వన్ లో. దాంతో తన గోల్ సినిమా తీయడమేనని డిసైడ్ అయిపోతాడు. ఇంటిల్లిపాదీ జట్టు కడతారు. ఇలా మిడిల్ ప్రారంభమైపోతుంది. అంటే కథ ప్రారంభమైపోతుంది. అలా దేశంలో మొట్ట మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర నిర్మాణం ప్రారంభించేస్తాడు. ఈ నిర్మాణం చాలా ఫన్ గా వుంటుంది కుటుంబ సభ్యులతో. ఎన్ని కష్టాలొచ్చినా వాటిని హాస్యం పట్టిస్తూ ఫన్నీగా వుంటారు. చాలా వినోద భరితంగా వుంటుంది కథా ప్రారంభంతో ఈ మిడిల్ జర్నీ. 

        సరే, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎలా వస్తుంది? ది ఏవియేటర్ లో హోవర్డ్ హ్యూజెస్ డిఫెన్స్ కాంట్రాక్టు పొందడంతో వస్తుంది. ది ఫౌండర్ లో రే క్రాక్ మెక్డొనాల్డ్స్ ని టేకోవర్ చేసే ప్రయత్నంతో వస్తుంది. ఏర్ డెక్కన్ లో ఏం రావాలి? బిగ్ ఫిష్ విజయ్ మాల్యా ఏర్ డెక్కన్ ని విలీనం చేసుకుని మింగేసే ప్రయత్నంతో రావాలి. 

        అప్పుడు గోపీనాథ్ పడ్డ క్షోభ, చివరికి విలీనం చేసేసి తప్పు కోవడం మొదలైనవి రావాలి. ఇది కాసేపు పరాజయంగా అనిపించినా అంతిమంగా ఆయన మార్గదర్శి అయ్యాడు. ఆయన తర్వాత ఇదే ఎల్సీసీ సెగ్మెంట్లో గో-ఎయిర్, స్పైస్ జెట్, ఇండిగో, జెట్ నెట్ మొదలైన సామాన్యుల విమానాలు ప్రారంభమయ్యాయంటే ఆయనే స్ఫూర్తి. మాల్యా నుంచి వచ్చిన డబ్బుతో డెక్కన్ 360 అని కార్గో ఏర్ లైన్స్ ప్రారంభించి, కోర్టు ఉత్తర్వులతో మూసేశాడు. ఇలా ఉపసంహారంలో చెప్పి ముగించాలి. 

        అంటే ఆటో బయోగ్రఫీకి అదనంగా రీసెర్చి చేసుకోవాలి. ఆటో బయోగ్రఫీలో సినిమా కథ లేదు. అది బిగింగ్ ఉపద్ఘాతమే. మిడిల్, ఎండ్ లు లేవు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోగ్రఫీగా సంజయ బారు రాసిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ లో కూడా ఇలాగే కథలేదు. సినిమాకి అది బిగినింగ్ విభాగమే. దాంతో బయోపిక్ తీస్తే ఎలా వచ్చిందో తెలిసిందే. ఈ లింకు క్లిక్ చేయండి. చాలా మందితో సమస్యేమిటంటే ఏది బిగినింగో, ఏది మిడిలో గుర్తు పట్టలేరు. ఏ సినిమాలోనూ ప్లాట్ పాయింట్ ని గుర్తించ లేరు, దాని ఉపయోగం చెప్పలేరు. స్క్రీన్ ప్లే పౌర ధర్మాలు తెలియకుండా స్క్రీన్ ప్లేల్లో తిరుగాడుతూంటారు. నగర పౌర ధర్మాలు తెలియకుండా నగరంలో తిరుగాడినట్టు. 

        కెప్టెన్ గోపీనాథ్ జీవితాన్ని అదనంగా రీసెర్చి చేసుకుంటే ఆయన సంస్థని ఎలా నడిపి వదిలేశాడో బోలెడు సమాచారముంది. సినిమా రచయిత అన్నాక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు తనం చాలా అవసరం.

***

        ఇలా ఈ సినిమా అంతా చూపించింది ఎంతకీ ముగియని బిగినింగే. శివ నే తీసుకుంటే, అరగంటలో బిగినింగ్ ముగిస్తూ నాగార్జున, ప్లాట్ పాయింట్ వన్ లో జేడీని కొట్టాక, మాఫియా భవానీతో అమీతుమీకి -కథలోకి- వెళ్లకుండా, సినిమా అంతా జేడీనే కొడుతూ వుండడం లాంటిదన్న మాట. ఇంతకన్నా అర్ధమయ్యేలా చెప్పడం సాధ్యం కాదు.      

              మారా కూడా అరగంటలో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర గోస్వామీతో తలబడ్డాక, కంపెనీని ప్రారంభించి అభివృద్ది చేయకుండా -కథ ప్రారంభించకుండా- సినిమా అంతా గోస్వామితో సిగపట్లకే దిగాడు. చిట్ట చివర సినిమా ముగింపులో ఎలాగో విజయవంతంగా విమానాన్ని ఎగరేశాడు. అంటే ఇప్పుడు బిగినింగ్ ముగించి ప్లాట్ పాయింట్ వన్ కొచ్చాడన్న మాట. ఇంకో గంటన్నర సినిమా తీస్తేగానీ చెప్పాల్సిన కథతో మిగిలిన మిడిల్, ఎండ్ లు ముగించడన్న మాట. ఇంత వింత ఎక్కడా చూడం.

        మరి సినిమా ముగింపులో వచ్చింది ప్లాట్ పాయింట్ వన్ అయితే, వెనుక గోస్వామితో చూపించిన ప్లాట్ పాయింట్ వన్? అది ప్లాట్ పాయింట్ వన్ కాదని ఇప్పుడు తేలుతోంది. అది ప్లాట్ పాయింట్ వన్ అన్న భ్రమలో సినిమా చూస్తూంటాం. ఎంతకీ మిడిల్లోకి వెళ్ళక పోతే ఏం చేస్తాం. భ్రమల్లోంచి బయట పడతాం. మిడిల్ మటాష్ సినిమాలతో కూడా ఇలాగే జరుగుతుంది. సెకండాఫ్ ప్రారంభమైతే గానీ మిడిల్ మాటాష్ అని బయటపడదు. 

        ఇప్పుడు మారాకి గోస్వామితో ఏర్పడిన ప్లాట్ పాయింట్ వన్ కాని ప్లాట్ పాయింట్ వన్ సీను, నిజానికి ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అన్నమాట. అంటే బిగినింగ్ విభాగంలో ప్లాట్ వన్ కి దారి తీసే పరిస్థితుల కల్పనలో భాగంగా వచ్చే ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అనే మలుపు అన్నమాట. శివలో నాగార్జున జేడీని కొట్టే ముందు, జేడీ అమలని టచ్ చేసే సీను అన్నమాట.

***

          మొదట దర్శకురాలు స్పోర్ట్స్ జానర్లో తీసిన గురు ఫార్మాట్ బాగానే వుందిగాఅనుకుని, ఆ ఫార్మాట్లో పెట్టి ఈ బిజినెస్ జానర్ సినిమా తీసే
సినట్టుంది. స్పోర్ట్స్ జానర్ ఫార్మాట్  బిజినెస్ జానర్ కి రెడ్ కార్పెట్ అవుతుందా. స్పోర్ట్స్ జానర్లో క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి అపజయాలెదు
ర్కొనీ ఎదుర్కొనీ చివర్లో గోల్ కొట్టి విజయం సాధించడం వుంటుంది. ఇలా బిజినెస్ జానర్ కథ వుంటుందా. మారా గోస్వామితో సిగపట్లు పట్టీ పట్టీ ఆఖరికి విమానం ఎగరేస్తే బిజినెస్ జానరై పోతుందా?

        ఈ కథనం కూడా ఎపిసోడిక్ గా వుంది. స్టార్ట్ అండ్ స్టాప్ అని డాక్యుమెంటరీల కూపయోగపడే ఎపిసోడిక్ కథనం. ఒక సమస్యతో ఒక ఎపిసోడ్ ఎత్తుకుని, దాన్ని ముగించి, ఇంకో సమస్యతో ఇంకో ఎపిసోడ్ మొదలు పెట్టి ముగించడం. ఇలాగే చేస్తూ పోవడం. టైగర్ హరిశంద్ర ప్రసాద్ గుర్తుందా. విమానాన్ని ఎగరేసే వివిధ ప్రయత్నాలతో రిపీటయ్యేది అలాటిదే కథనం. ప్రతీ ప్రయత్నం ప్రారంభ ముగింపుల్లో బిగినింగ్ మిడిల్ ఎండ్ లుంటాయి. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఒకటే కాదు,  సైజ్ జీరో’, ‘సిటిజన్’, ‘ఆటోనగర్ సూర్య ఆఖరికి సర్దార్ గబ్బార్ సింగ్ కూడా డాక్యుమెంటరీ కథనాలే. ఇవెందుకు ఫ్లాపయ్యాయో తెలుసుకోలేదు. 

        ఇక జానర్ చూస్తే ఇది బిజినెస్ జానరా, ఫ్యామిలీ డ్రామా జానరా. సినిమా నిడివిలో సగం ఫ్యామిలీ బాధలే వున్నాయి. బాధల్ని రిజర్వ్ చేయాల్సింది బిజినెస్ జానర్ అంటూ వున్న విమానం కథనం కోసం ప్రత్యేకంగా. రెండు వైపులా బాధలతో ఎడాపెడా వాయిస్తే ప్రధానమైన బిజినెస్ జానర్ కథనం హైలైట్ అవడం మానుకుంటుంది. మిస్ ఇండియా లో కూడా ఇలాగే కుటుంబ కష్టాలు భారీగా చూపించి, బిజినెస్ కష్టాల మీంచి దృష్టి తప్పేలా చేశారు. ఏది మెయిన్ స్టోరీ, ఏది సబ్ ప్లాట్ తేడా లేకుండా, సబ్ ప్లాట్ ని కూడా మెయిన్ స్టోరీ చేసేయడమేనా. లేక రెండూ మెయిన్ స్టోరీలే చెప్పాలనుకున్నారా. ఒక సినిమాలో రెండు మెయిన్ స్టోరీ లుంటాయా. 

        ఇలా ఆటో బయోఫ్రఫీతో సంబంధం లేని విషయాలతో పూర్తి సినిమా తీసి, సృజనాత్మక స్వేచ్ఛ తీసుకున్నామని ప్రారంభంలో వేశారు. ఒక వ్యక్తి జీవిత కథతో ఇదా సృజనాత్మక స్వేచ్ఛ! 

        ఇదీ సూరరై పొట్రు స్క్రీన్ ప్లే సంగతుల సంపూర్ణ రామాయణం. స్టార్ సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు అవసరమాని ఎప్పుడో మానుకున్నాం. అవి మారవు. స్ట్రక్చర్ తెలుసుకుని చేసేదేముంది. ఏమీ వుండదు. స్టార్ సినిమాలెలా వున్నా ఎంజాయ్ చేయడమే. అంతకి మించిన సుఖం లేదు. సుఖ్ హై ఏక్ ఛావ్ ఢల్తీ ఆతీ హై జాతీ హై -అని పాడుకుంటూ దుఖాన్ని ఎంజాయ్ చేయడమే.

సికిందర్

 

13, నవంబర్ 2020, శుక్రవారం

998 : రివ్యూ

 

  అందరూ కొత్త వాళ్ళే ప్రయత్నించిన అమెరికాలో తెలుగు ఇండియన్ సైకో కిల్లర్ మూవీ గతం. ఇలా అంటున్నందుకు బాధపడక పోతే, కాస్తాలోచిస్తే, ఇలాటి మూవీస్ అఫెన్సివ్ గా వుంటాయి. గతంలో తెలుగులో, హిందీలో ఇలాటి ఫారిన్ నేపథ్యాల్లో తీసిన ఇండియన్ పాత్రలతో క్రైమ్ సినిమాలు, మాఫియా సినిమాలూ చూస్తున్నప్పుడు ఈ ప్రశ్నే రేకెత్తించేలా వుండేవి. ప్రేక్షకులంగా మనం ఇలా చూపించింది చూసి ఎంజాయ్ చేయలేం కదా? మధ్యలో దేశం గుర్తొచ్చి ఎంజాయ్మెంటు చెడగొడుతుంది. సినిమా చూడవయ్యా అంటే దేశాన్ని గుర్తు చేసుకోవడం నాన్సెనూ సైకో తనమూ అన్పించవచ్చు. మనం సైకోలమే, కానీ ఫారినర్లు ఇలాటి సినిమాలు చూస్తే ఫారిన్లో కూడా ఇండియన్లు ఇంతేనేమో అనుకోవడం సైకోతనం కాబోదు. అమెరికాలో కొందరు ఎన్నారై నేరగాళ్ళు వుండొచ్చు. ఎఫ్బీఐ వేటాడుతున్న టాప్ 10 నేరగాళ్ళల్లో భద్రేష్ కుమార్ వుండొచ్చు. ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో కలిసి భార్యని చంపి అరెస్టయిన నర్సన్ వుండొచ్చు. కాల్ సెంటర్ స్కామ్ చేసి దొరికిపోయిన కొందరు ఇండియన్ యూత్ వుండొచ్చు. పరాయి దేశాల్లో ఇది తప్పూ అని చెప్పే బదులు గ్లోరిఫై చేసే సినిమాలు వస్తున్నాయి, అదీ సమస్య. ఫారిన్ వెళ్ళి సెటిలవడమంటే ఇండియన్ స్టయిల్ నేరాల్ని అక్కడ దిగుమతి చేసుకోవడమా? ఫ్రాన్స్ లో ఉగ్రవాదాన్ని దిగుమతి చేసుకుంటున్న ఒక వర్గానికీ మనకీ తేడా ఏముంది?

    క్రైమ్ జానర్ అసలు ఎజెండా నైతిక విలువల్ని గుర్తు చేయడమే, స్థాపించడమే. అప్పుడే కథా ప్రయోజనమనే మౌలికాంశం నెరవేరుతుంది. సాధ్యం కాకపోతే ఇలాటి సినిమాల్ని తెలుగు రాష్ట్రాల నేపథ్యంగా తీసుకోవచ్చు. సినిమాల్ని సినిమాల్లాగా చూడాలన్న అర్ధం లేని వాదం పని  చెయ్యదు. కమర్షియల్ సినిమా అనేది అతి పెద్ద మాస్ మీడియా అయినంత మాత్రాన బాధ్యత వుండదని కాదు. 

        నీతి శతకం ఆపి విషయానికొస్తే, ఖచ్చితంగా ఇది కథాపరంగా పాక్షికంగా, మేకింగ్ పరంగా ఫర్వాలేదనిపించేలా కొత్త వాళ్ళు చేసిన మంచి ప్రయత్నం, సందేహం లేదు. పాత్రల పరంగా అందరూ కొత్తవాళ్లు కావడంతో పోల్చుకోవడానికి గడ్డాలు అడ్డం వస్తున్నాయి. నటనల పరంగా కథే రిలీఫ్ లేని సీరియస్ మూడ్ కావడంతో, సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో సేఫ్ అయిపోయారు కొత్త నటులూ, నటీమణులూ. సైకో రిషిగా రాకేష్, గర్ల్ ఫ్రెండ్ అదితిగా పూజిత, సైకోని పట్టుకునే అర్జున్ గా నిర్మాతల్లో ఒకరైన భార్గవ, ఈయన కొడుకు హర్షగా హర్షా ప్రతాప్, అందరూ మాటలు పలకడానికి నోటికి పనిచెప్పినట్టు కన్పిస్తారు. బిహేవియర్ ద్వారా కూడా భావ ప్రకటన చేసి వుండాల్సింది. ఎలాగూ ఈ మూవీని థియేటర్లలో సామాన్య ప్రేక్షకులకి ఉద్దేశించినట్టు లేదు. డైలాగులు ఇంగ్లీషులో ధారాళంగా ప్రవహించాయి. కొన్ని చోట్ల కథలో మలుపుల్ని తెలియజేసే కీలక డైలాగులు కూడా ఇంగ్లీషులోనే వున్నాయి. సామాన్యులకి కథెలా అర్ధమవుతుంది. అందుకని నెటిజన్లని ఉద్దేశించినప్పుడు, ఇన్ని డైలాగుల్ని కూడా తగ్గించి, ఫిలిమ్ ఈజ్ బిహేవియర్ అని దృష్టిలో పెట్టుకుని, యాక్షన్ ద్వారా అంటే చేతల ద్వారా చెప్పిస్తే - ఈ టెక్నిక్ ఆకర్షణగా వుండేది. 
        
        నిడివి గంటా 40 నిమిషాలే అయినా నిదానమైన నడకవల్ల రెండు గంటలు గడిచిపోయినట్టు అన్పిస్తుంది. మిస్టరీకి వేగం తక్కువ వుండొచ్చు; థ్రిల్లర్ కి వేగమెక్కువ వుండాలి. మనోజ్ రెడ్డి ఛాయాగ్రహణం, శ్రీచరణ్ పాకాల సంగీతం ఫర్వాలేదన్పించే స్థాయిలో  వున్నాయి. పాటల్లేవు. కొత్త దర్శకుడు కిరణ్ కొత్తవాడు అన్పించేలా లేడు. కాకపోతే కథనంలో పాక్షికంగానే సక్సెస్ అయ్యాడు.

***

        అమెరికాలో వుంటున్న రిషి (రాకేష్) ఒక ప్రమాదానికి లోనై హాస్పిటల్లో వుంటాడు. స్పృహలో కొచ్చాక జ్ఞాపక శక్తి కోల్పోయి వుంటాడు. గర్ల్ ఫ్రెండ్ అదితి (పూజిత) ని కూడా గుర్తు పట్టడు. తన కెవరున్నారంటే తల్లి లేదనీ, తండ్రి వున్నాడనీ చెప్తాడు. తండ్రి దగ్గరికి వెళ్దామని తీసుకు బయల్దేరుతుంది. దారిలో కారు పాడయితే అర్జున్ (భార్గవ) అనే వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి తన ఇంటికి తీసుకుపోతాడు. ఆ ఇంట్లో అర్జున్ కొడుకు హర్ష (హర్షా ప్రతాప్) కూడా అర్జున్ తో పాటు సైకోలా ప్రవర్తిస్తాడు. ఆ రాత్రి కొన్ని ఇబ్బందికర అనుభవాలతో రిషి అదితితో పారిపోయే ప్రయత్నం చేస్తాడు. అర్జున్ అడ్డుకుంటాడు. రిషి ఆ ఇంట్లో ఇరుక్కుంటాడు.

        ఎవరీ అర్జున్, హర్ష? ఎందుకు రిషిని, అదితిని ట్రాప్ చేశారు? జ్ఞాపక శక్తి కోల్పోయిన రిషి గతమేమిటి? అతడి గతంతో ఈ తండ్రీ కొడుకుల గతంతో వున్న సంబంధమేమిటి? ఎవరు సైకో, ఎవరు కాదు?... అన్న ప్రశ్నలతో కొనసాగేదే మిగతా కథ.

***


       ఇది సైకలాజికల్ కథ కాదు, అంటే ఇందులో పాత్ర ఎందుకు సైకలాజికల్ పేషంట్ గా మారాడన్న విచిత్స, చికిత్స అన్నది గాకుండా, ఒక సైకోగా చేస్తున్న నేరాలకి ఎలా అడ్డు కట్ట వేశారన్న కథ. సైకో థ్రిల్లర్. ఫ్లాష్ బ్యాకులతో నాన్ లీనియర్ కథనం. ఈ నాన్ లీనియర్ కథనం పోనూపోనూ ఫ్యాక్షన్ సినిమాల టెంప్లెట్ లో పడి, నిలబెట్టుకున్న నవ్యత కాస్తా డీలా పడిపోయింది క్లయిమాక్స్ సహా.

        స్ట్రక్చర్ లేదని కాదు, వుంది. నాన్ లీనియర్ లో చెదిరిపోయింది. మొదటి పది నిమిషాల్లోపు రిషి అదితిలు  అర్జున్ ఇంట్లో ప్రవేశించడంతో ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. ఇక మిడిల్ సంఘర్షణలో వూహించని మలుపు తిరుగుతుంది. పాత్రలు తారుమారైపోతాయి. సైకోగా రిషి తేలతాడు, తన కూతుర్ని హత్య చేసిన రిషి చేత నిజం చెప్పించే పథకంతో అర్జున్ రివీలవుతాడు.

        
        అంటే ఎండ్ సస్పెన్స్  కథనాలకి 1958 లో పరిష్కారం సూచించిన 'టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో' టెక్నిక్ అన్న మాట. దీని గురించి చాలా సార్లు చెప్పుకున్నాం. దీని హిందీ రీమేకుగా 'ధువా' వస్తే, తర్వాత ఇంకో రీమేకుగా హిందీలోనే 'ఖోజ్' వచ్చింది. దీన్ని అప్పట్లో తెలుగులో 'పోలీస్ రిపోర్ట్' గా రీమేక్ చేశారు. 'పోలీస్ రిపోర్ట్' అప్పట్లో బాగా తీయలేదనీ, ఇప్పుడు తీయవచ్చాని ఒక దర్శకుడు అడిగారు. అదే కథ ఎన్నిసార్లు తీస్తారు. 'గతం' లాగా ఇంకేదైనా కథతో తీయొచ్చు.
        
        కాకపోతే 'ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో' లో పాత్రలు చిట్ట చివర్లో రివీలవుతాయి, 'గతం' లో మిడిల్ మధ్యలో రివీల్ అయ్యాయి. అంతే  తేడా. ఈ రివీలయ్యే ముందు వచ్చే ట్విస్టుల మీద ట్విస్టులకి మొదట జస్టిఫికేషన్ కన్పిస్తుంది. ఇంట్లో సింగిల్ లొకేషన్లో నైట్ పూట జరిగే చిన్న కథ కాబోలన్న అభిప్రాయం కల్గించడం వల్ల. సింగిల్ లొకేషన్లో ఒక పూట లేదా ఒక రోజులో ముగిసే చిన్న కథలకి హాలీవుడ్ కథనం ట్విస్టులతోనే వుంటుంది. లేకపోతే అదే లొకేషన్లో తక్కువ టైమ్ స్పాన్ లో కదలని సీన్లు బోరు కొడతాయి. ట్విస్టులతో ఎప్పటికప్పుడు వేగంగా కథ రీఫ్రెష్ అవాల్సిందే.
        
    అయితే ఎప్పుడైతే మిడిల్ మధ్యలో పాత్రలు తారుమారై అసలు కథ బయటపడుతుందో- అప్పుడు ఈ ట్విస్టులు చీటింగ్ అనిపిస్తాయి. వాటికి అర్ధం కనిపించదు. ఇదొక పూటలో ముగిసిపోయే చిన్న కథ కాదని ఇప్పుడు తేలింది కాబట్టి.
        
        కొన్ని రోజుల స్పాన్ తో వుండే పెద్ద కథల్లో మల్టీపుల్ ట్విస్టులుండవు. వుంటే హిందీలో 'క్యాష్' లా నవ్వులపాలవుతుంది సినిమా. పెద్ద కథలు ఒకే ట్విస్టు కేంద్రంగా వుంటాయి- 'తూర్పు- పడమర' లాగా. ట్విస్టు అంటే పొడుపు కథ. పొడుపు కథ అన్నాక దాన్ని విప్పాలిగా. అందుకే పైన చెప్పుకున్నట్టు హాలీవుడ్ సింగిల్ లొకేషన్ చిన్న కథల్లో ఒక ట్విస్టు ఇచ్చి, దాన్ని విప్పి, ఇంకో ట్విస్టు ఇస్తూ పోతారు. 'గతం' లో ఇది కూడా జరగలేదు. 
        
       కథల్లో ఏది జరిగినా పాత్రల గోల్ ప్రకారమే జరుగుతుంది. మెమరీ తెప్పించడానికి రిషి బ్రెయిన్లో ట్రిగ్గర్ పాయింట్ ని యాక్టివేట్ చేయడం గోల్ అయినప్పుడు, ఆ ట్రిగ్గర్ పాయింటుతో సంబంధం లేని ట్విస్టులు అతడికెలా ఇస్తారు. వూరికే ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి కాకపోతే. అందుకే వర్కౌట్ కాలేదు.

***

       పాత్రలు తారుమారయ్యాక అసలు కథ చెప్తూ మూడు ఫ్లాష్ బ్యాకులు వస్తాయి. ఇక్కడే తప్పులో కాలేశారు. మొదటిది రిషి చేసిన హత్య గురించి, రెండోది అతడికి యాక్సిడెంట్ జరిగిన విధం గురించి, మూడోది మెమరీ తెప్పించడానికేం చేయాలా అన్న దాని గురించి. వీటిలో మొదటిది మాత్రమే చూపించి, బోరు కొట్టే మిగిలిన రెండూ ఎత్తేయాల్సిన పని. గతంలో రిషి- అర్జున్ లు ఏ సంఘటనతో కనెక్ట్ అయ్యారో ఆ హత్య గురించి తప్ప ఇంకో ఫ్లాష్ బ్యాక్ అవసరం లేదు. కథ శిల్పం చెడి, బ్యూటీ పోతుంది. మిగిలిన రెండు ఫ్లాష్ బ్యాకుల్లో విషయాన్ని క్లయిమాక్స్ కి సర్దేసి- 'ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో' చూపిన మార్గంలో ఏకకాలంలో రిషితో బాటూ ప్రేక్షకులూ ఉలిక్కిపడేలా ప్రయోగించాల్సిన తురుపు ముక్క. ఒక సారి  హిందీ 'ధువా' లో క్లయిమాక్స్ లో అమ్జాద్ ఖాన్ నేతృత్వంలోని సీబీఐ బృందం ఆధారాలు చూపిస్తూ రాఖీని రౌండప్ చేసే డ్రమెటిటిక్, క్లాసిక్ సీను చూడండి.

***

       ఈ కథకి గోల్, డ్రమెటిక్ క్వశ్చన్ ఏదైనా వుంటే, రిషి మెమరీ తెప్పించడమే. ఇదొక్కటే కథ. కథంటే ఇప్పుడు లైవ్ గా జరిగేదే. దీని మీదే ప్రక్షకులు దృష్టి పెట్టి యాక్టివ్ గా వుంటారు. దీన్నోదిలేసి ఎప్పుడో గతంలో జరిగిన ఫ్లాష్ బ్యాకులేస్తే దృష్టి చెదిరి పాసివ్ అయిపోతారు ప్రేక్షకులు. ఎందుకంటే అది కథ కాదు కాబట్టి. లైవ్ గా జరుగుతున్న కథకి గత సమాచారమివ్వడం కాబట్టి. అనవసరంగా లైవ్ లో జరుగుతున్న ఆసక్తికర కథనాపి పాత సమాచారమిస్తున్నారు కాబట్టి. రాంగోపాల్ వర్మ ఏ సినిమాలోనూ ఫ్లాష్ బ్యాకుల జోలికి ఎందుకు పోలేదో ఒకసారాలోచిస్తారు కాబట్టి. ప్రేక్షకులు తెలివైన వాళ్ళు కాబట్టి. ఫ్లాష్ బ్యాకులంటే శుభ్రమైన కథ వెన్నులో బాకులు దింపడమే కాబట్టి. అదేం గొప్ప టెక్నిక్కేం కాదు కాబట్టి. 

        
        అందుకని రిషి కి యాక్సిడెంట్ ఎలా అయ్యిందీ అన్న బోరు కొట్టిన ఫ్లాష్ బ్యాక్ అప్రస్తుతం కథకి. అది మెమరీ వచ్చాక అమ్జాద్ ఖాన్ టైపులో అతడికే ఇవ్వాల్సిన డోస్. అలాగే మెమరీ ఎలా తప్పించాలా అని ఆలోంచించే సీన్లూ, డాక్టర్ తో తెలుసుకునే ప్రక్రియలతో కూడుకున్న ఇంకో బోరు కొట్టేసిన ఫ్లాష్ బ్యాక్ కూడా అనవసరం. ట్రిగ్గర్ పాయింటుని ఎలా యాక్టివేట్ చేస్తారో చెప్పేశాకా ఇంకా చూపించడమెందుకు. చెప్పకుండా చూపించేసి అమ్జాద్ ఖాన్ టైపులో చివర్లో ఫాస్ట్ గా చెప్పేస్తే ప్రేక్షకులు బ్రతికి పోతారు గాని. ప్రేక్షకులు- ప్రేక్షకులు- ప్రేక్షకులు- ప్రేక్షకుల్ని మర్చిపోయి కథ చేస్తే అదేమంత ఆరోగ్యవంతంగా వుండక పోవచ్చు.

సికిందర్

 

11, నవంబర్ 2020, బుధవారం


స్ట్రక్చర్ ని  కాస్సేపు పక్కన పెడదాం, అసలు ఈ క్రియేటివిటీ ఏంటో చూద్దాం. తెలుగు సినిమా అనేది క్రియేటివ్ ఆలోచనల పరంగా ఇంకా సంధి కాలంలోనే కొట్టు మిట్టాడుతోంది. గడిచిపోయిన తొలి వ్యాపార యుగం దాటిరావడానికి మొరాయిస్తోంది. తొలిస్వర్ణయుగం (1931 - 51), మలిస్వర్ణ యుగం (1951 -71) ముగిసిపోయి,  తొలి వ్యాపార యుగం (1971 – 2001) కూడా గడిచి పోయి రెండు దశాబ్దాలు కావొస్తున్నా ఇంకా 1971 – 2001 నాటి తొలి వ్యాపార యుగం దగ్గరే తచ్చాడుతోంది తెలుగు సినిమా క్రియేటివిటీ. నేటివిటీ పేర, ప్రేక్షకుల భావోద్వేగాల పేరా ఆ సంధి కాలంలోనే అవాస్తవిక, కృత్రిమ సర్కస్సులు చేస్తోంది. దాంతో చేదు అనుభవాలు చవి చూస్తోంది. నేటివిటీలు మారిపోతున్నాయి, సంస్కృతులు సన్నగిల్లుతున్నాయి,ఇంటర్నెట్ జీవితాలవుతున్నాయి, భావోద్వేగాలూ అందుకనుగుణమైన  సంగతులు పట్టుకుని కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తరాల అంతరాలు చెరిగిపోయాయి. ఇంటర్నెట్  కలిపేస్తున్న జీవితాల్లో అన్ని వయసుల వారూ కలిసిమెలిసి  సాగుతున్నారు. పరస్పర ఫిర్యాదులు లేవు, జనరేషన్ గ్యాప్ సంఘర్షణల్లేవు. అయినా ఇంకా  అదే ముప్పై ఏళ్ళనాటి పాతకాలం మూస క్రియేషన్లతో  సినిమాలు చుట్టేస్తున్నారు. ఈ మూసతో అనుసంధానం కాలేక మలి వ్యాపార యుగపు ప్రేక్షకులు  గోలెడుతున్నారు. యుగ ధర్మాల్ని క్రోడీకరించుకుని దిశా నిర్దేశం చేయాల్సిన గొప్ప గొప్ప సీనియర్లు, అనుభవజ్ఞులు సైతం  సంధికాలంలోనే గడ్డ కట్టిన క్రియేటివిటీతో  అక్కడే  ఇరుక్కుపోయారు. సినిమా క్రియేటివిటీ వ్యాపారంతో  కూడుకున్నదని తెలిసికూడా కాలం చెల్లిపోయిన పాత ఫ్యాషన్ చొక్కాలు సినిమాలకి ధరింప జేస్తున్నారు.  తొలి వ్యాపార యుగం దాని కాలజ్ఞానంతో ఎంత విజయవంతమో, మలి వ్యాపార యుగాన్ని  అజ్ఞానంతో అంత దివాలా కోరుతనంగా తయారు చేస్తున్నారు  – నిత్యం  90 శాతం ఫ్లాపుల పుణ్యంతో ఇంకా ఇంకా. సింపుల్ గా చెప్పాలంటే , శుభ్రంగా  వ్యాపారం మర్చిపోయారు! 

          ఈ కల్చర్ తాజా బాధితురాలు ‘గాయత్రి’. దీనికి సంధి కాలపు మార్కెటబిలిటీ లేని క్రియేటివిటీ తప్ప స్ట్రక్చర్ పట్టలేదు. స్ట్రక్చర్ లో ఆలోచిస్తే,  కూతురి అన్వేషణలో వున్న శివాజీ (బిగినింగ్),  తీరా కన్పించిన కూతురు దుర్మార్గుడని తిరస్కరించాక (మిడిల్) - ఆమె అపార్ధం తొలగించడానికి స్ట్రగుల్ చేస్తూంటే, పటేల్ ఇచ్చిన ఆఫర్ తో అతని బదులు తను జైలుకెళ్ళి ఇరుక్కుని,  కూతురి  అపార్ధం తొలగడంతో ( ఎండ్) -   ఆమెతో కలిసి పటేల్ అంతు చూశాడు – అనే క్రమంలో వుండాలల్సిన  కథ. 

          ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ ఇలా కూతురితో తలెత్తిన సమస్యా,  దాని పరిష్కారమూ  అన్న రెండు మూల స్తంభాలాధారంగా వున్నప్పుడే, ఈ కథకి స్క్రీన్ ప్లే అనే సౌధం నిలబడగల్గేది. 

          కానీ ఈ స్క్రీన్ ప్లేకి మొదటి మూలస్తంభమే వుంది, రెండోది కన్పించడంలేదు. శివాజీ యాక్టివ్ పాత్రగా లేడు, పాసివ్ గా కన్పిస్తున్నాడు. ఏది ప్రధాన కథో తెలియడం లేదు, గాయత్రీతో  -  పటేల్ తో రెండు వేర్వేరు కథల్లాగా అన్పిస్తున్నాయి. ఏది ప్రధాన జానరో, ఏది దాని తాలూకు సబ్ జానరో తెలియడంలేదు, రెండూ కలిసి పోయి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామానో, ఫ్యామిలీ థ్రిల్లరో అర్ధం గావడం లేదు.  గాయత్రితో ఫ్యామిలీ డ్రామాగా వుంటూ,  ఒక్కసారిగా  పటేల్ రాకతో ఫ్యామిలీ థ్రిల్లర్ గా మారిపోయి,  సెకండాఫ్ సిండ్రోంలో పడిపోతోంది.  ఇలా సెకండాఫ్ లో కథ ప్లేటు ఫిరాయించి వేరే కథలుగా మారిపోయిన సెకండాఫ్ సిండ్రోములు - సర్దార్ గబ్బర్ సింగ్దొంగోడుధమ్తేరేనామ్హవాజ్యోతిలక్ష్మి, సైజ్ జీరో వగైరా వగైరా  ఎన్నో అట్టర్ ఫ్లాపుల జాబితాలో చేరిపోతోంది ‘గాయత్రి’ కూడా. క్రియేటివ్ యాస్పెక్ట్ రీత్యా స్ట్రక్చర్ పరిస్థితి ఇదీ.
―2―
మార్కెట్ యాస్పెక్ట్  కొద్దాం. ఇక మోహన్ బాబు యువతరం ప్రేక్షకుల్లో పాగా వేయాలనుకుంటే, వాళ్ళ అభిరుచులకి తగ్గట్టుగా తన పాత్రల తీరుతెన్నుల్ని  మార్చుకోవాల్సిందే. ఇవాళ్ళ సినిమాలు  ప్రధానంగా యూత్ కోసం, తర్వాత మిగిలితే వాళ్ళ అమ్మా బాబుల కోసం. సీనియర్ మోహన్ బాబు అయినా రంగంలో వుండాలంటే యూత్ కోసమే వుండాలి తప్ప, వాళ్ళ అమ్మా బాబుల్ని రంజింప జేస్తానంటే అమ్మాబాబులు ఆల్రెడీ అలసిపోయారు. ఇవాళ్ళ తెలుగు సినిమాలకి యూత్ అప్పీల్  గా మిగిలిన  అంశాలు రెండే రెండు - ఎకనమిక్స్, రోమాంటిక్స్. మోహన్ బాబు మొదటిది ప్రతిబింబించేలా మొదటి పాత్ర పోషణ చేశారు. డబ్బుకోసం ఇతరుల బదులు జైలు కెళ్ళడం. అయితే ఆ ఎకనమిక్స్ తో ఎక్కడా ఆకట్టుకోలేదు. డబ్బు నెక్కడా చూపించలేదు. మాటల్లో తప్ప విజువల్ ప్రెజెన్స్ లేదు. ఆ డబ్బుతో విలాసవంతమైన ఎదుగుదల లేదు. అది నెగెటివ్ షేడ్ అవుతుందని అభ్యంతరం చెప్పదల్చుకుంటే, అసలలా చట్టాన్ని ఏమారుస్తూ ఒకరి బదులు జైలు కెళ్ళడమే పెద్ద నేరం. ఆ డబ్బుతో అనాధ పిల్లల్ని పోషించడం ఇంకా తప్పు. 

          రెండోది, ఈ వుండీ లేని ఎకనమిక్స్ తో యూత్ అప్పీల్ కి,  అనాధాశ్రమం నడపడమనే ఏ మాత్రం పొంతన లేని సంధి కాలపు పాత సుత్తి వ్యవహారం తోడయ్యింది. దీంతో మోహన్ బాబు మొదటి పాత్ర యూత్ అప్పీల్ కి పూర్తిగా దూరమైపోయింది. యూత్ కి కనెక్ట్ కాకుండా పోయారు. మోహన్ బాబు ఇంకా మధ్య వయస్కులైన తన పాత అభిమానుల కోసమో, మరెవరి కోసమో ఆ కాలపు పాత్ర చిత్రణ చేసుకుంటానంటే కుదిరే పరిస్థితి లేదు. వర్గాల కతీతంగా  ప్రేక్షకులందరి అప్పీలూ ఇవాళ్ళ  ఈ రెండిటికే - ఎకనమిక్స్, రోమాంటిక్స్. 

          ఎకనమిక్స్, రోమాంటిక్స్. 
          ఎకనమిక్స్, రోమాంటిక్స్.
          ఎకనమిక్స్, రోమాంటిక్స్.
          ఎంటర్ టైన్మెంట్, ఎంటర్ టైన్మెంట్, ఎంటర్ టైన్మెంట్ – ఇదే మలి వ్యాపార యుగపు సినిమా స్టయిల్.
―3―
పోనీ రోమాంటిక్స్ చూద్దామన్నా, దీని జాడ ఎక్కడా కనబడదు. యువ గాయత్రి పాత్రతో కూడా. మోహన్ బాబు మొదటి పాత్ర శివాజీకి యుక్త వయసు వెర్షన్ పోషించిన విష్ణుతో కూడా రోమాన్స్ కన్పించదు, ఏదో కాసేపు ఫ్లాష్ బ్యాకులో శ్రియతో పాత తరహా ప్రేమ తప్ప. యూత్ అప్పీల్ కి వీలుండే గాయత్రికి ప్రేమాయణం లేకుండానే డ్రైగా చూపించడం మార్కెట్ యాస్పెక్ట్ అయిన రోమాంటిక్స్ కి విరుద్ధం. ఇలా మార్కెట్ యాస్పెక్ట్ కి  వుండాల్సిన ఎకనమిక్స్ లేదు, రోమాంటిక్స్ లేదు. మార్కెట్లో యువ ప్రేక్షకులు -  యువ ప్రేక్షకులు అంటూంటారే గానీ ఎవరా యువప్రేక్షకులు? వాళ్ళల్లో అమ్మాయిల్లేరు. చాలా వరకూ అబ్బాయిలే యువప్రేక్షకులుగా పోషిస్తున్నారు సినిమాల్ని. అమ్మాయిల్ని ఆకట్టుకునే పాత్ర చిత్రణలు లేకపోవడం అమ్మాయిలు దూరమవడానికి కారణం. కాబట్టి ‘గాయత్రి’ అని టైటిల్ పెట్టుకున్నప్పటికీ  అమ్మాయిలు డుమ్మా కొట్టడానికి కారణమిదే. కనీసం - ‘గాయత్రి’ క్యారక్టర్ యూత్ అప్పీల్ తో వుందని, ఆమె యూత్ ఫుల్ రోమాంటిక్స్ కి మోహన్ బాబు చేసే డిగ్నిఫైడ్ హెల్ప్ ‘పింక్’ లో అమితాబ్ లాగా ఏంతో అప్డేట్ అయి  వుందనీ, మౌత్ టాక్ వచ్చేలా సినిమా ధోరణి వుంటేగా!
―4―
           ఫ్యామిలీ డ్రామాలు నేటి దైనందిన  జీవితాల్లో  ఎదురవుతున్న సమస్యలతో (ఎకనమిక్స్, లేదా రోమాంటిక్స్) ఎంతో పకడ్బందీగా, ఆధునికంగా  తీస్తే తప్ప ఈ రోజుల్లో పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కథని ఎకనమిక్స్ తోనో, రోమాంటిక్స్ తోనో ముడి పెట్టి ఫ్యామిలీ థ్రిల్లర్ జానర్ ప్రధాన కథగా చేసి చూపించాల్సి వుంటుంది. అంటే శివాజీకి కూతురు కన్పించడం లేదన్న ధ్యాస తప్ప, దాంతో కూతురికోసం సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్లేవర్ తో తీవ్ర ప్రయత్నాలు తప్ప, ఇంకో వ్యాపకం వుండడానికి కుదరదు. ఉపాధి కోసం స్టేజి నటుడి టాలెంట్ ని నేరస్థులకి డబుల్ గా వ్యవహరిస్తూ జైలుకెళ్ళి వస్తూండే బిజినెస్ గా వుంటే వుండొచ్చు. కూతరు కన్పించడం ప్లాట్ పాయింట్ వన్ గా వుంటూ, ఆమె తిరస్కరించడంతో మిడిల్ సంఘర్షణగా కొనసాగుతూ,  మధ్యలో విలన్ గాయత్రీ పటేల్ పరిచయంతో, సంఘర్షణ కూతురి ఆర్గ్యుమెంట్ నేపధ్యంలో నైతిక విలువల ప్రశ్నగా మారుతూ, చివరికి జైలు కెళ్ళి పటేల్ తో మోసపోయి, కూతురి ఆర్గ్యుమెంటే నెగ్గి తను తలొగ్గి,  ప్లాట్ పాయింట్ టూ కొచ్చి, ఇక కూతురితో కలిసి పటేల్ ని ఎదుర్కొనే ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా ముగియాలి. ఇందులో ఫ్యామిలీ డ్రామా వుంటే అంతర్లీనంగా ఎలాగూ వుంటుంది. దానికోసం తహతహలాడుతూ కథనే ఫ్యామిలీ డ్రామాగా మార్చేయ నవసరం లేదు.
―5―
          కూతురి ఆర్గ్యుమెంట్ నేపధ్యంలో నైతిక విలువల ప్రశ్న అంటే ఏమిటి? కథంటే ఆర్గ్యుమెంట్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. రెండు పాత్రల మధ్య తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ సహిత  కథనమనీ, చివరికి ఆ ఆర్గ్యుమెంట్ తాలూకు జడ్జి మెంట్ తో ముగింపనీ. ఇది ఏ కథయినా డిమాండ్ చేసే దాని ప్రాథమిక హక్కు. దీన్ని కాదనడానికి వీల్లేదు. 

         గాయత్రి ఆర్గ్యుమెంట్ ఏమిటి? పుట్టగానే తన తండ్రి శివాజీ తాగుడు కోసం వెయ్యి రూపాయలకి తనని అమ్మే ప్రయత్నం చేశాడని కదా? ఇదామె అపార్ధమే కావొచ్చు. కానీ ఆమె పుట్టక ముందు నుంచీ తను చేస్తున్న పనేమిటి? తన నాటక కళని తప్పుడు విధానంలో జీవిక కోసం వాడుకుంటూ - చట్టాన్ని ఏమారుస్తూ -  ఆయా నేరస్థుల రూపంలో వాళ్ళ బదులు తను జైలు కెళ్ళి వస్తున్నాడు. ఒక క్రిమినల్ గా రూపాంతరం చెందాడు. అదామె అపార్ధమైతే, ఇది తన నైతిక విలువల ప్రశ్న. దీనికేం సమాధానం చెప్తాడు కూతురికి? ఈ అనైతిక ప్రవర్తన ఆమె చేసుకున్నఅపార్ధాన్ని పూర్తిగా బలపర్చేట్టు లేదా? ఇది కాదా ఫ్యామిలీ డ్రామా అంటే? తప్పిపోయిన కూతురు దొరికి, ఆ తండ్రీ కూతుళ్ళు కన్నీళ్లు కార్చే  పై పై ఉపరితల  మెలో డ్రామాయేనా ఇంకా తెలుగు సినిమా మార్కు ఫ్యామిలీ డ్రామా అంటే?  పాత్రల లోలోపలి కుళ్ళు అలాగే మిగిలిపోతూ? ఈ హిపోక్రసీకే  - ఫాల్స్ డ్రామాకే ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారా?
―6―
        అనాధ పిల్లల సంరక్షణతో, జైలుకి రాకపోకలతో, ఇంకొన్ని మంచి పనులతో  శివాజీని చూపించుకొస్తూ, ఒకచోట అనుకోకుండా కూతురు గాయత్రితో సంఘటన సృష్టించారు. తండ్రీ కూతుళ్ళమని వాళ్ళిద్దరికీ తెలియని డ్రామా బావుంది. దుండగుల బారి నుంచి ఆమెని కాపాడేస్తాడు. ఆమె సెల్ ఫోన్ కింద పడిపోయి వుంటుంది. తీసి ఆమె కివ్వబోయేంతలో ఆమె ఆటోలో వెళ్లిపోతూంటుంది. ఇంటికొచ్చి ఛార్జింగ్ పెడతాడు. సెల్ ఛార్జి అయ్యాక స్క్రీన్ వెలుగుతుంది. అప్పుడా స్క్రీన్ సేవర్ గా ఆమె తల్లి ఫొటో డిస్ ప్లే అవుతుంది. ఆ తల్లి (శ్రియ) శివాజీ భార్యే! ఇదెంతో కదలించే  మంచి మెలో డ్రామాగా వుంటుంది (ఇది తప్ప ఈ ఫ్యామిలీ డ్రామాగా తీసిన సినిమాలో ఇంకొక్క కదిలించే సన్నివేశం కూడా లేదు). 

          పుట్టగానే కన్పించకుండా పోయిన కూతురి కోసం తను పడుతూ వచ్చిన ఆవేదన ఇక తీరిపోయిన క్షణాలు! పట్టరాని ఆనందం. సర్వసాధారణంగా ప్లాట్ పాయింట్ ఘట్టం ఒక సీరియస్ గా తలెత్తే సమస్యతో ఉద్రిక్తంగా వుంటుంది. ఆ సీరియస్ సమస్యని సాధించే గోల్ తో పాత్ర ప్రయాణం మిడిల్లోకి సంఘర్షణాత్మకంగా వుంటుంది. కానీ ఇక్కడ పూర్తి వ్యతిరేకంగా వుంది అపూర్వంగా. ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ ఆనందభరితంగా తయారైంది. కథకి అనితరసాధ్యంగా కుదిరిన ప్లాట్ పాయింట్ వన్ మలుపు ఇది. సర్వ సాధారణంగా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర్నుంచి పాత్రకి సీరియస్ ప్రయాణంగానే వుంటుంది. ఇక్కడ దీనికి విరుద్ధంగా,  ఇక్కడ్నించీ శివాజీకి సంతోషకరమైన ప్రయాణంగా వుంది - కూతురు దొరికిందనీ, కూతుర్ని కలుసుకోబోతున్నాననీ!

          ఇంతమంచి ప్లాట్ పాయింట్ వన్ తో శివాజీ ఓ హేపీ సాంగ్ కూడా పాడుకోవడం ప్లాట్ పాయింట్ వన్ ని విజువల్ గా ఇంకెంతో ఎలివేట్ చేసింది. ప్లాట్ పాయింట్ వన్ ని అనుసరించి పాటెప్పుడూ వుండదు. ఇక్కడ ఇలా చక్కగా  కుదిరింది.  తీరా పాట తర్వాత ఆ కూతుర్ని కలుసుకోబోతూంటే, నిండు సభలో తండ్రి గురించి ఆమె చెప్పే మాటలు వింటాడు - తండ్రి ఎంత దుర్మార్గంగా తాగుడు కోసం తనని అమ్మేశాడో అని. దీంతో శివాజీ ప్రపంచం తలకిందు లవుతుంది. 

          ప్లాట్ పాయింట్ వన్ ఇలా రివర్స్ అయింది. నిజానికి హేపీ గా వున్న ప్లాట్ పాయింట్ వన్ తో,  మిడిల్ కూడా కూతురి కలయిక పరంగా హేపీగా కొనసాగుతుందనీ, సంఘర్షణకి బదులు మిడిల్ కూడా ప్రయోగాత్మకంగా ఇక్కడ హేపీగా కొనసాగబోతోందనీ అన్పించి అత్యంత  ఆసక్తి రేపుతుంది. అలా కలుసుకునీ జీవితాల్ని ఆనందమయం చేసుకున్న తండ్రీ కూతుళ్ళకి  వూహించని విపత్తు ఏదో ఎదురవుతుందనీ ఒక అభిప్రాయం కల్గుతుంది. విపత్తు లేకపోతే ఇది కథగా వుండదు, కమర్షియల్ సినిమాకి పనికి రాని గాథగానే  ముగిసే ప్రమాదముంది.

          అయితే విపత్తు కూతురి మాటల్లోంచే పుట్టింది. శివాజీలో సంఘర్షణ మొదలవుతుంది. తను తాగుడు కోసం పురిటి పిల్లని అమ్మేశాడా? ఇరవై ఏళ్ళనాటి ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఇందులో నాటక నటుడుగా ప్రేమించి పెళ్ళిచేసుకున్నగురువు కూతురు క్యాన్సర్ సోకడంతో,  శివాజీ తన నట వృత్తిని నేరప్రవృత్తిగా మార్చుకుంటాడు. వైద్యం డబ్బుల కోసం మొదటి సారిగా ఒకరిలా నటిస్తూ జైలుకెళ్ళి వస్తాడు. వస్తే భార్య చనిపోయిందని తెలుస్తుంది. ప్రసవించిన కూతుర్ని అనాధాశ్రమం వాళ్ళు తీసికెళ్ళి పోయారని అంటాడు స్నేహితుడు. తాగుబోతు అయిన స్నేహితుడు,  పుట్టిన శివాజీ కూతుర్ని వెయ్యి రూపాయలకి అమ్మేయబోతూంటే అనాధాశ్రమం వాళ్ళు  పట్టుకుని తీసికెళ్ళి పోయారు. ఇదీ విషయం.

          పెద్ద విషయం కాదు. ఆ అనాధాశ్రమం తెలుసుకుని శివాజీ వెళ్లి కూతుర్ని అప్పుడే తెచ్చుకోవచ్చు. ఈ లాజిక్ ని (కామన్ సెన్స్ ని) దాటవేశారు.

          ఈ ఫ్లాష్ బ్యాక్ కూతురు గాయత్రికి శివాజీ పంపిన డైరీలో రివీలవుతుంది. అతడి డైరీ చదువుకున్న ఆమె వెంటనే తండ్రి మీది ద్వేషం తొలగించుకుంటుంది. ఆమె పాయింటాఫ్ వ్యూలో ఒక ఫ్లాష్ కట్ పడుతుంది. అందులో పదేళ్ళ వయసున్నప్పుడు తండ్రి యేడని  అనాధాశ్రమం అతణ్ణి అడుగుతుంది. ఇంకెక్కడి తండ్రీ,  పుట్టగానే తాగుడుకోసం నిన్నమ్మేసి  పోయాడని  అసహ్యభావంతో అంటాడతను. 

           ఇక్కడ ఈ రెండూ గందరగోళంగా వున్నాయి. ఒకటి- తండ్రి పంపిన డైరీ చదవగానే ఆమె  ద్వేషమంతా తొలగిపోవడం. ఆ డైరీలో రాసిందే నిజమని ఎలా నమ్ముతుంది తనుఅసలు డైరీ ఎలా రాస్తాడుఆ డైరీ లోనే నటుడిగా తన నేరప్రవృత్తి గురించి ఎలా బయట పెట్టుకుంటాడుదొరికిపోడాఇప్పుడు కూతురికి దొరికిపోలేదాఒక తప్పు చేయలేదని ఆమెకి చెప్పబోతూ రెండో తప్పుతో దొరికిపోలేదాఅయినా డైరీ చదివిన కూతురుకి ఈ విషయమే పట్టదు. 

          ఇక ఇప్పుడామెకి  పదేళ్ళ వయసులో అనాధాశ్రమం అతనితో కట్ షాట్ పడుతుంది. తన తండ్రి ఏమయ్యాడని అడుగుతుంది. ఇంకెక్కడి తండ్రీ, పుట్టిన నిన్ను తాగుడికి అమ్మేయబోతే పట్టుకున్నాం – అని అసహ్య భావంతో అంటాడతను. ఒక అనాధా శ్రమం నడిపే అతను  అనాధ పిల్ల సందేహం ఇలాగే తీర్చి గాయపరుస్తాడా? జీవితాంతం బాధ పడేలా చేస్తాడా? 

          ఇలాటి అవాస్తవిక, అసహజ చిత్రణలతో, పైపై కథనాలతో చాలా బలహీనపర్చారు. 
దీన్నిసినిమాని సినిమాలాగే చూడాలన్న గొప్ప కొటేషన్ తో సమర్ధించుకో వచ్చు కథకుడు. అతడి విచక్షణకే వదిలెయ్యాలి. సినిమాని సినిమాలాగా చూడడానికి అడ్డగోలుగా రాసి పారేయ్యొచ్చు. 

          అసలు అంతకి ముందు జైలు కెళ్ళే ఒక సందర్భంలో,  శివాజీ పృథ్వీలా నటిస్తూ అతడి బదులు జైలు కెలా వెళ్తాడు? పృథ్వీ హైట్ ఎక్కడ?  తన హైట్ ఎక్కడా? పోలీసులు అంత లాలీపాప్ గాళ్ళా? కోర్టుల్ని కూడా ఇలాగే ఏమారుస్తాడు శివాజీ. తను నేరం చేస్తున్నట్టుగానే ఫీల్ కాడు. ఇరవై ఏళ్లుగా ఇలా మారువేషాలతో మోసాలు చేస్తున్నాడని యంత్రంగానికీ తెలీదు. ఇలాగే  ముగుస్తుంది కథ!

          క్రియేటివిటీని ఇంత అడ్డగోలుగా చేసుకుంటూ స్ట్రక్చర్ ని ద్వేషించడం ఎంతవరకు సబబు? ఇది బాగా ఆలోచించుకోవాలి.  స్ట్రక్చర్ లేని క్రియేటివిటీలే 90 శాతం ఫ్లాపులకి కారణం. క్రియేటివిటీ స్ట్రక్చర్ లోకొచ్చినప్పుడు ‘గాయత్రి’ లాంటివి  గాయపడవు. శివాజీకీ, గాయత్రీ పటేల్ కీ మధ్య గాయత్రులు గల్లంతవరు.
.
సికిందర్   
11.2.18