రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, అక్టోబర్ 2021, బుధవారం

1063 : రివ్యూ

రచన - దర్శకత్వం : సురేష్ ఉత్తరాది
తారాగణం : నవీన్ చంద్ర
, గాయత్రీ సురేష్, అదితి, క్రిష్ సిద్దిపల్లి, రాజారవీంద్ర
సంగీతం : జువెన్ సింగ్
, ఛాయాగ్రహణం : ఎస్ కె భూపతి  
నిర్మాతలు : కె కళ్యాణ్
, ఎన్ దుర్గా ప్రసాద్ రెడ్డి, డాక్టర్ ఏ భాస్కర్ రావు
విడుదల : అక్టోబర్ 8
, 2021

***

        ప్రేమ కథల్ని కొత్తగా చెప్పాలనుకుని కొత్త దర్శకులు ప్రయత్నించడం మంచిదే. రెండే రకాల ప్రేమ కథలతో గత రెండు దశాబ్దాలుగా అదేపనిగా తీసిందే తీసి ప్రేమంటేనే విరక్తి పుట్టించాక, ఈ మధ్య అలాటి కొత్త బైరాగి దర్శకుల తాకిడి దాదాపు తగ్గిపోయి ప్రాణాలు హాయిగా వున్నాయి. ఇతర పనులు చేసుకోగల్గుతున్నాం. ఈ సినిమాలతో ప్రేక్షకులకి ఉపయోగం లేదు గానీ నిర్మాణంలో ఎందరికో ఉపాధి కల్పిస్తూంటాయి. ఈ కార్మిక  సేవకే వీటిని అలా వుండనివ్వాలి తప్ప కళా సేవకి కాదు. కళా సేవ కూడా చేస్తూ నేను లేని నా ప్రేమ కథ లాంటివి అప్పుడప్పుడు వస్తూంటే చిన్న సినిమా బతికే వుందని ఒక సంకేతం వెళ్తుంది.

        యితే ఆ సంకేతం ఎంత బలంగా వెళ్ళి ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకుంటుందనేదే సమస్య. ఇందుకే చిన్న సినిమా బేషరతుగా అన్ని విభాగాల్లో బలంగా వుండాలంటారు. మరి అంత బలంగా ప్రస్తుత కొత్త దర్శకుడి ప్రేమ కథేమైనా  వుందా లేదా చూద్దాం...

కథ

   ఆ వూళ్ళో నాట్యమంటే ఇష్టమున్న రాధ (గాయత్రీ సురేష్) సామాజిక కార్యకర్త రామ్ (నవీన్ చంద్ర) తో ఏకపక్ష ప్రేమలో వుంటుంది. రామ్ కి వసుధ అని ఒక ఫ్రెండ్ వుంటుంది. ఇంకో వూళ్ళో కృష్ణ (క్రిష్ సిద్ధిపల్లి) అనే అతను వుంటాడు. ఇతడికో గర్ల్ ఫ్రెండ్ వుంటుంది. ఇతను శబ్ద తరంగాల మీద పరిశోధన చేస్తూంటాడు. ఐన్ స్టీన్ పదార్ధానికి వినాశం లేదని చెప్పాడు కాబట్టి, విశ్వం లో శబ్ద తరంగాల రూపంలో నిక్షిప్తమైన ఒక పదార్ధాన్ని అన్వేషిస్తూంటాడు. ఆ పదార్ధం కాశ్మీరు సమస్యకి పరిష్కారం. కాశ్మీర్ సమస్యని పరిష్కరించాలంటే దాని సమస్యా మూలాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. అది తెలిసిన వాళ్ళు నెహ్రూ, జిన్నా, కాశ్మీరు రాజు అనీ, వాళ్ళ సంభాషణలు శబ్ద తరంగాల రూపంలో విశ్వంలో ఎక్కడో వుంటాయనీ పరిశోధన చేస్తూంటాడు.

        ఇటు రాధ చదువుతున్న కాలేజీ లెక్చరర్ (రాజా రవీంద్ర) ఒక ఫంక్షన్ లో హామ్ రేడియోని పరిచయం చేసి దాన్ని రాధకి బహుమతిగా ఇస్తాడు. ఆమె దాన్ని ట్యూన్ చేస్తూంటే ఒక రోజు కృష్ణ విశ్వంలోకి పంపుతున్న ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతుంది. ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలెడతారు. అప్పుడు కృష్ణకి ఏమర్ధమవుతుందంటే, తను 1983 కాలంలో  వున్న అమ్మాయితో కనెక్ట్ అయ్యాడని. ఈ విషయమే ఆమెకి చెప్పి, తను 2020 లో వున్నానంటాడు. ఆమె నమ్మలేకపోతుంది. రామ్ కి చెప్తుంది.

        తను 1983 లో, కృష్ణ 2020 లో వున్నారు. మరి రామ్ ఏ కాలంలో వున్నాడు? ఈ ముగ్గురి మధ్య వున్న సంబంధమేమిటి? వీళ్లతో వసుధ పాత్రేమిటి? ఆమె ఎవరికి ఏమవుతుంది? చివరికి నల్గురూ ఏమయ్యారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

       టైమ్ ట్రావెల్ జానర్ కథ ఇది. కృష్ణ అనే అతను కాలంలో 1947 లోకి ప్రయాణించి కాశ్మీర్ సమస్యని పరిశీద్దామనుకుని చేసే ప్రయత్నం, మధ్యలో 1983 దగ్గర రాధ అనే అమ్మాయితో కనెక్టయితే ఏం జరిగిందన్నది ప్రేమ కథగా చేసి చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు సురేష్. ఆలోచన కొత్తదే.

        గత మార్చి లోనే ప్లేబ్యాక్ అని ఇలాగే భిన్న కాలాల్లో పాత్రల్ని కనెక్ట్ చేస్తూ తెలుగులోనే వచ్చింది గానీ కథ వేరు. ప్రస్తుత ప్రేమ కథ ప్రేమ కథగానే వుండక కుటుంబ కథగానూ బయటపడే విషయంతో వుంటుంది. టైమ్ ట్రావెల్ తో కుటుంబ కథ అనగానే రాబర్ట్ జిమెకిస్ 1985 క్లాసిక్ బ్యాక్ టు ది ఫ్యూచర్ గుర్తుకొస్తుంది. ఇందులో కీచులాడుకునే తల్లిదండ్రుల్ని భరించలేని కుర్రాడు టైమ్ మెషీన్ లో తల్లిదండ్రుల టీనేజీ కాలంలో కెళ్లి, వాళ్ళ కీచులాటలకి కారణాన్ని అక్కడ, ఆ టీనేజీ వయసులో తొలగించి తిరిగొస్తాడు. సైకలాజికల్ గా చెప్పాలంటే ఇది సైకో థెరఫీకి కథా రూపం. హిప్నాటిస్టులు కూడా హిప్నాటిజంతో గతంలోకి  తీసికెళ్ళి మానసిక సమస్యల్ని మరమ్మత్తు చేయడం తెలిసిందే.

        ప్రస్తుత కథ ముక్కోణ ప్రేమ కథ. ఇందులో 1983లో రాధ ఆ ప్రేమ దక్కించుకోలేని బాధతో వున్నప్పుడు, 2020 లో వుంటూ ఆమెతో కనెక్ట్ అయిన కృష్ణ చేయాల్సింది ఆమెకి సైకో థెరఫీనే. ఇది చేయకుండా ఆమె పుణ్యాన ఆ కాలంలో తన తల్లిదండ్రులతో మాట్లాడగల్గిన తను, దానికే జన్మ ధన్యమైనట్టు ఫీలై, ఆమెని గాలి కొదిలేసి ముగించడం పాత్రోచితంగా లేదు.

        పదార్ధానికి వినాశం లేదన్నారు గానీ రూపం మారవచ్చు. పదార్ధమంటే శక్తి. శక్తి ఏ రూపం ధరిస్తే ఆ పదార్ధం. కాబట్టి శక్తికి వినాశం లేదు గనుక పదార్ధమూ నశించదు. అందుకని కాశ్మీరు గురించి నెహ్రూ, జిన్నా, కాశ్మీరు రాజు ఏం మాట్లాడుకున్నారో ఆ శబ్ద తరంగాలు విశ్వంలో వుండే వుంటాయని ఈ కథ ప్రతిపాదన. శబ్దం కూడా శక్తియే. పదార్ధం నుంచి శక్తి రూపంలో వెలువడే వైబ్రేషనే శబ్దం. పదార్ధం ఏ రూపం మార్చుకుంటే ఆ రకమయిన అణువులతో వైబ్రేషన్ ప్రసారమవుతుంది.

        మనం మాట్లాడుకునే మాటల వైబ్రేషన్స్ గాలిలోని అణువుల ద్వారా ప్రయాణించి అన్ని  వైపులా ప్రసరిస్తాయి. దారిలో ఏ అవరోధముంటే దాన్ని తాకి ఆ శక్తి రూపంలోకి మారిపోతాయి. గోడలుంటే గోడల్ని తాకి గోడల శబ్దంగా ప్రతిధ్వనిస్తాయి. గదిలో తివాచీ, సోఫాలు లాంటి మెత్తని ఉపరితలాలుంటే వాటిలోకి మిళితమై పోతాయి. కాబట్టి నెహ్రూ, జిన్నా, కాశ్మీర్ రాజు మాట్లాడుకున్న మాటల తరంగాలు మాట్లాడుకున్న చోటే ఫినిష్ అయిపోతాయి. అవే తరంగాల రూపంలో అలాగే విశ్వంలో పడి వుండవు. పైగా శూన్యంలో శబ్దం ప్రయాణించదు, వాయు మండలంలోనే ప్రయాణిస్తుంది.

        ఇక కాశ్మీరు సమస్యకి మూల కారకులు జిన్నా, కాశ్మీరు రాజులతో బాటు, మౌంట్ బాటెన్ కూడా. వీళ్ళు కంపు చేసిన చరిత్ర లోంచి 55 శాతం కాశ్మీరు భూభాగమైనా లాక్కొచ్చారు నెహ్రూ, పటేల్ లు.

నటనలు- సాంకేతికాలు

    ఇది రాధ పాత్ర చెప్పుకునే ఆమె కథ. ఈ పాత్ర నటించిన గాయత్రి కాలానికి తగ్గట్టు పాత్రకి సరిగ్గా సరిపోయింది- రూప స్వరూప లావణ్యాలతో, ముఖభావాలతో, మాటతీరుతో, డ్రెస్ సెన్స్ తో, నాట్య కళతో. అమాయక పాత్ర. కథ వుంటేనే పాత్రలు నిలబడతాయి.

        ఉద్యమ కార్యకర్తగా, ప్రేమలో పడని పాత్రగా నవీన్ చంద్ర కథతో పాటు వుంటాడు, కథగా కాదు. ఆ మేరకే నటన వుంటుంది. కాశ్మీరు పరిశోధన చేసే పాత్రలో క్రిష్ కథ నడపే పాత్రగా వుంటాడు. నటన కాస్త అతిగా కూడా వుంటుంది. గర్ల్ ఫ్రెండ్ గా అదితి ఎక్స్ ట్రోవర్ట్ పాత్ర. రెండు మూడు సీన్లలో లెక్చరర్ గా రాజారవీంద్ర.

        పాత్రల పేర్లు రామ్, రాధ, కృష్ణ, వసుధ అని వాటి మధ్య సంబంధాల్ని తెలపడానికన్నట్టుఅమెచ్యూరిష్ రైటింగ్ గా వున్నాయి. రామ్ పక్కన రాధని చూసిన లెక్చరర్, ఆమెని సీతా అని పిలవడం మరీ చాదస్తపు స్క్రిప్టు రచనగా వుంది. యూత్ సినిమా అన్నప్పుడు యూత్ అప్పీల్ లేకపోతే కష్టం. పాటలు మెలోడీ ప్రధానంగా వున్నాయి. సాంకేతికంగా బడ్జెట్ కి తగ్గట్టు వుంది.

చివరికేమిటి

     టైమ్ ట్రావెల్ జానర్ ప్రేమ కథని  సైన్స్ ఫిక్షన్ చేయకుండా ప్రేమ కథే ప్రధానంగా సగటు ప్రేక్షకుడికి అర్ధమయ్యేట్టు తీశారు. ఫస్టాఫ్ లో హీరోయిన్ హామ్ రేడియోతో సెకండ్ హీరోతో కనెక్ట్ అయినప్పుడు గానీ హీరోయిన్ 1983 లో వున్నట్టు తెలీదు. ఇలా ఫస్టాఫ్ లో కథనం రీఫ్రెష్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ట్రాక్ ప్రశ్నల్ని రేకెత్తించేలా సాగుతూ, ఫస్ట్ హీరోని ముందుకు తెస్తూ, ఇంటర్వెల్ కి కథనం మరో ప్రశ్నతో రీఫ్రెష్ అవుతుంది.

        ఇలా సెకండాఫ్ లో కూడా మరో మూడు సార్లు కథనం రీఫ్రెష్ అవుతూ ప్రశ్నల్ని రేకెత్తించే మలుపులతో బలంగా మారుతుంది. కథనమంటే ప్రశ్నలు రేకెత్తించి జవాబులివ్వడమనే చైతన్యం కాబట్టి, ఇక్కడ ఇది భిన్నకాలాల్లో సాగే సమాంతర కథకి కుదిరింది. ఇలా కథనం రీఫ్రెష్ అవుతూ కూర్చోబెట్టే సినిమాలు ఎక్కడొస్తున్నాయి గనుక. ప్రేమ కథ కాస్తా కుటుంబ కథగా మలుపు తిరిగి చిక్కుముడి వేయడం, ఆ ముడి విప్పి మళ్ళీ ప్రేమ కథగా మారడం ఇవన్నీ సస్పెన్సుని కూడగట్టుకుని సాగుతూంటాయి సెకండాఫ్ లో.  

        అయితే రచన, దర్శకత్వం, మేకింగ్ మరింత యూత్ ఓరియెంటెడ్ గా, మార్కెట్ యాస్పెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని వుంటే, సినిమా ఇలా అనామకంగా వచ్చి వెళ్లిపోయేది కాదు. పబ్లిసిటీ పరంగా కూడా సినిమాకి డిజిటల్ ప్రెజెన్స్ లేదు. రివ్యూలు సరే, ఎక్కడా కన్పించవు. సినిమా వివరాల గురించి ఒక వీకీపీడియా పేజీని కూడా క్రియేట్ చేసుకోలేకపోతే, సినిమాఎందుకు రిలీజ్ చేయడమనేది ప్రశ్న. కథలో ప్రశ్నలున్నట్టు పబ్లిసిటీలో కూడా ప్రశ్నలుండా లనుకున్నారేమో?

సికిందర్

11, అక్టోబర్ 2021, సోమవారం

1062 : రివ్యూ


రచన- దర్శకత్వం :  నెల్సన్ దిలీప్ కుమార్
తారాగణం : శివ కార్తికేయన్
, ప్రియాంకా అరుళ్ మోహన్, వినయ్ రాయ్, యోగిబాబు, మిలింద్ సోమన్, రెడిన్ కింగ్ స్లే, జారా వినీత్ తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
, ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కణ్ణన్
నిర్మాతలు : శివ కార్తికేయన్
, కోటపడి రాజేష్
బ్యానర్ : శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్
, కేజేఆర్ స్టూడియోస్
విడుదల అక్టోబర్ 9
, 2021

***

        మిళంలో డాక్టర్ అనే టైటిల్ తో ఈవారం విడుదలైన శివ కార్తికేయన్ మూవీ తెలుగులో వరుణ్ డాక్టర్ గా అనువాదమైంది. ఓ స్టార్ తో కమర్షియల్ సినిమాని డార్క్ కామెడీ క్రైమ్ గా తీయడం సాహసమే. నయన తారతో కూడా కొలమావు కోకి (కోకో కోకిల) అనే డార్క్ కామెడీ క్రైమ్ తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, శివ కార్తికేయన్ ని ఫ్యాన్స్ వూహలకి పూర్తి వ్యతిరేకంగా- నాన్ కమర్షియల్ గా ప్రెజెంట్ చేస్తూ, తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకున్నాడు పదిన్నర కోట్ల బంపర్ బాక్సాఫీసుతో.

        ముందున్న నిర్మాత తప్పుకోవడంతో శివ కార్తికేయనే భుజాన వేసుకుని నిర్మాతగా మారాడు. ఇదొక సాహసం. ఈ సాహసాలకి సోలో రిలీజ్ కూడా తోడై, సెక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది ఈ వారమంతా. దీని కథాకమామిషేమిటో చూద్దాం...

కథ

     వరుణ్ (శివ కార్తికేయన్) మిలిటరీ డాక్టర్. రూల్స్ తో కచ్చితంగా వుంటాడు. నవ్వడు. మాట్లాడడు. మొహం సీరియస్ గా పెట్టుకుని, దేనికీ చలించక, బెల్లం కొట్టిన రాయిలా వుంటాడు. పెళ్ళి చేసుకోడానికి వూరెళ్ళి పద్మిని (ప్రియాంకా అరుళ్  మోహన్) తో నిశ్చితార్ధం చేసుకుని తిరిగి వస్తాడు. వచ్చాక పెళ్ళి క్యాన్సిల్ చేస్తుందామె. మళ్ళీ ఆమె ఇంటికెళ్ళి కారణం అడుగుతాడు. నీలాటి ఎమోషన్లు లేని రోబో మొహంతో పెళ్ళి కుదరదని చెప్పేస్తుంది. ఇక ఏం చెయ్యాలా అని బయటి కెళ్ళి టీస్టాల్ దగ్గర కూర్చుంటే, ఆమె కుటుంబ సభ్యులు బయటికి వచ్చి గోల చేస్తూంటారు. స్కూలు కెళ్ళే పద్మిని చెల్లెలు చిన్నూ (జారా వినీత్) కిడ్నాపైందని గోల. పద్మిని సహా వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడు వరుణ్ డాక్టర్. పోలీసులు కిడ్నాప్ ని లైట్ గా తీసుకునేసరికి, ఆ కుటుంబ సభ్యుల్నే టీముగా ఏర్పాటు చేసి, తానే ఒక ప్లానేస్తాడు చిన్నూని వెతకడానికి. ఇంతకీ చిన్నూ ఏమైంది? ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు చేశారు? టీముతో కలిసి ఆమెని కిడ్నాపర్ల చెర నుంచి ఎలా విడిపించాడు వరుణ్ డాక్టర్? ఇదీ మిగతా కథ.  

ఎలా వుంది కథ

    డార్క్ కామెడీ జానర్లో క్రైమ్ థ్రిల్లర్ ఇది. అవతలి వాడు బాధలో వుంటే, ఆ బాధ మీద జోకులేసి ఆనందించే శాడిజం డార్క్ కామెడీ లేదా బ్లాక్ కామెడీ. చావింటికెళ్ళి కూడా ఆ చావు మీద జోకులేయవచ్చు - చచ్చాడా? నేనొచ్చే వరకూ ఆగమన్నానే - అనడం లాంటిది. ఈ జానర్లో చేసిన సీరియస్ కిడ్నాపుల కథ ఇది. ఒక కిడ్నాప్ కామెడీ కావచ్చు, కానీ వందల మంది పిల్లల కిడ్నాపులతో హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడితే అది సీరియస్ వ్యవహారం. ఈ సీరియస్ వ్యవహారాన్ని బ్లాక్ కామెడీగా తీశాడు. నాని గ్యాంగ్ లీడర్ లో నాని ఫ్యామిలీని వెంట బెట్టుకుని అడ్వెంచర్ చేసినట్టు, ఇందులో శివ కార్తికేయన్ కూడా ఫ్యామిలీని టీముగా చేసుకుని అడ్వెంచర్ చేస్తాడు. ఈ రెండిటిలోనూ హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహనే. ఈ పోలికలు కన్పిస్తాయి.

        కిడ్నాప్ తో వచ్చిన కథలు, హ్యూమన్ ట్రాఫికింగ్ తో వచ్చిన కథలు కొత్త కాదు. హ్యూమన్ ట్రాఫికింగ్ ని డార్క్ హ్యూమర్ జానర్లో చూపించడం కొత్త. అయితే ఈ కథ సగానికి వచ్చేసరికి ఆ కామెడీ కాస్తా కనుమరుగై పోతుంది. కన్నడ ఫ్రెంచి బిర్యానీ లోలాగా, పాత రొటీన్ మాఫియా కథనే కామెడీ చేసి, ఆద్యంతం ఇన్నోవేట్ చేసిన ఫన్ తో నిలబెట్టినట్టు, ఇక్కడ డార్క్ కామెడీని కొనసాగించి నిలబెట్టడం జరగలేదు. మొదటి సగానికే సరుకు అయిపోయింది. రెండో సగం కథ సీరియస్ గా మారిపోయి, కథ కూడా తేలిపోయి రొటీన్ గా ముగియడం, అయినా వేరే సినిమాల్లేక తమిళంలో హిట్టవడం దీని ప్రత్యేకతల్లో కెల్లా ప్రత్యేకతగా భాసిస్తోంది.

నటనలు -సాంకేతికాలు

    శివ కార్తికేయన్ ఈసారి ఫ్యాన్స్ కోసం తన బ్రాండ్ మాస్ నటన జోలికి పోకుండా, ఏ భావాలూ పలకని బండ రాయి లాటి మొహంతో, మరమనిషి బాడీ లాంగ్వేజీతో, లోలోన మాత్రం అన్ని విలువలూ దాచుకున్న డాక్టర్ సుగుణాలతో, మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయన్నట్టు, నవ్వితే నవరత్నాలు జారి పోతాయన్నట్టు- ఒక అర్ధం కాని  మానవాకారంలా వుంటాడు. ఇతణ్ణి చూసి మనం నవ్వడం తప్ప ఇతను నవ్వడు. ఇలా వుండడమే కామెడీ. ఇతడి వాలకం చూసి చూసి పెళ్ళి చూపుల్లో అడిగేస్తుంది పద్మిని, మీరెన్ని గంటలకి లేస్తారు?’ అని. ఫోర్ థర్టీ అంటాడు. ఏఁ? ఇంటింటికీ వెళ్ళి పాల పాకెట్లు వేస్తారా?’ అని డార్క్ కామెడీ వేసుకుంటుంది.  

        అస్సలు ఎంటర్ టైన్మెంటు జోలికి పోకుండా, గంటు మొహం పెట్టుకుని, యాక్షన్ చేసుకుంటూ పోయే ఇలాటి సింగిల్ ఎక్స్ ప్రెషన్ క్యారక్టరైజేషన్ని షూటింగ్ జరిగినన్నాళ్ళూ నిలుపుకోవడం కష్టమైన పనే. ఈ రిస్కుకి శివ కార్తికేయన్ని ఒప్పుకోవాలి. సెకండాఫ్ లో కథ కుంగినా, ఈ క్యారక్టరైజేషన్ కోసమే చూసేలా చేస్తాడు. కథ లేకపోయినా క్యారక్టరైనా కొత్తగా వుంటే బతికి బయట పడొచ్చు. ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, సాంగ్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా తమిళ అభిమానులు కిక్కురుమనక పోవడాన్ని బట్టి - ఇదొక కట్టి పడేసే క్యారక్టర్స్ మూవీగా ఎస్టాబ్లిష్ అవుతోంది. శివ కార్తికేయన్ ఈ క్యారక్టర్ ని నమ్మే నిర్మాతగా మారి వుంటాడు.

        హీరోయిన్ ప్రియాంకాకి పెద్దగా పాత్రేమీ లేదు. టీములో హీరోతోనే వున్నా, పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంది కాబట్టి రోమాన్స్ కూడా లేదు. మళ్ళీ అతడికి దగ్గరయ్యే సూచనలతో కథనం కూడా ఆమెకివ్వలేదు. సినిమాలో హీరో హీరోయిన్ల రోమాన్స్ లేని లోటు కూడా కన్పించదు. సెకండాఫ్ లో కిడ్నాప్స్ కథ తేలిపోయినా, రోమాన్స్ తో, సాంగ్స్ తో భర్తీ చేయాలనుకోలేదు.

        కమెడియన్ యోగిబాబు మరోసారి కామెడీని నిలబెట్టాడు. ఛోటా కిడ్నాపర్ పాత్ర వేశాడు. వరుణ్ డాక్టర్ తన కిడ్నీ తీసి దాచిపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నమ్మి అతడి వెంటే వుండే అమాయక పాత్ర. అలాగే కానిస్టేబుల్ గా, గొంతు చించుకుని మాట్లాడే కామెడీ పాత్రలో రెడిన్ కింగ్ స్లే బాగా నవ్విస్తాడు. పై అధికారితో కూడా అలాగే అరిచి మాట్లాడతాడు. ఎందుకలా అరుస్తావ్? భోం చేశావా?’ అంటాడు అధికారి. కిడ్నాప్ కంప్లెయింట్ ని లైట్ గా తీసుకుంటే, విసిగి వెళ్ళి పోతున్న హీరోయిన్ తండ్రిని చూసి, అమ్మాయి ఇక రాదని తెలుసుకుని ఇంకో బిడ్డని కంటానికి వెళ్తున్నాడు చూడు!’ అని డార్క్ కామెడీ చేస్తాడు కింగ్ స్లే. ఇతను, యోగిబాబు కథ చెదిరిన సెకండాఫ్ లో అక్కడక్కడా సైడ్ కామెడీతో నవ్విస్తూంటారు.  

        విలన్ గా వినయ్ రాయ్ బలహీన క్యారక్టర్. ఈ మధ్య సినిమాల్లో విలన్లు ఇలాగే వుంటున్నారు. ఇక ముందు రోజుల్లో విలన్లు కనపడరేమో. కల్నల్ గా మిలింద్ సోమన్ కన్పిస్తాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతంలో మాంటేజీ సాంగ్స్ వచ్చి పోతూంటాయి. ఏ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజికల్ అని టైటిల్స్ ప్రారంభంలో ప్రత్యేకంగా వేశారు. విజయ్ కార్తీక్ కణ్ణన్ కెమెరా వర్క్ రిచ్ గా వుంది. ప్రొడక్షన్ విలువల కోసం బాగా ఖర్చు పెట్టారు. పాతిక కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే మెట్రో ట్రైన్లో ఫైట్ ఎక్సైటింగ్ గా వుంది.

చివరికేమిటి

    ఫస్టాఫ్ వరకూ డార్క్ హ్యూమర్ తో కథ నడిపించగల్గిన దర్శకుడు సెకండాఫ్ లో చేతులెత్తేశాడు. డార్క్ హ్యూమర్ తో ఫస్టాఫ్ లో సీన్లు వినోదాన్నందిస్తాయి. సెకండాఫ్ లో కిడ్నాపైన కూతురు కోసం సీరియస్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా, బరువుగా  మార్చేయడంతో డార్క్ హ్యూమరంతా అదృశ్యమైపోయింది. సెకండాఫ్ కి శివ కార్తీకేయన్ క్యారక్టరొక్కటే దిక్కుగా తయారైంది. కానీ వొట్టి క్యారక్టర్ కోసం సినిమా చూడాలా, కథతో కూడిన క్యారక్టర్ కోసం సినిమా చూడాలా? తమిళంలో మొదటిదే పట్టుకుని తెగ చూసేస్తున్నారు. శివ కార్తికేయన్ అక్కడ పాపులర్ కాబట్టేమో.

        ఇంటర్వెల్లో అసలు పెద్ద సంఖ్యలో గోవా గ్యాంగ్ పిల్లల కిడ్నాప్ కి పాల్పడుతోందని తెలుసుకున్నాక, సెకండాఫ్ లో గోవాకి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయ్యాక ఇంటర్వెల్ దగ్గర ఆపిన కథ వదిలేసి ఫ్యామిలీ డ్రామా మొదలెడతారు. ఫస్టాఫ్ ఫన్ అంతా మాయమై పోతుంది. అలాగని ఒక థ్రిల్లర్ గా ఫస్టాఫ్ తో బాటు, సెకండాఫ్ లో కూడా థ్రిల్ చేసే సన్నివేశాలేం వుండవు. కథలో మలుపులుండవు. టెన్షన్ వుండదు, సస్పెన్స్ వుండదు. ఎక్కడా లాజిక్ అనే మాటే వుండదు. ఇన్ని లేకుండా ఈ డార్క్ క్రైమ్ కామెడీని ఒక్క హీరో విభిన్న క్యారక్టర్నే చూసి ఆనందించాలంటే తెలుగు ప్రేక్షకులు సాహసించాల్సిందే. అప్పుడు ఈ ప్రాజెక్టుతో సాహసాలు చేసిన హీరో సరసన, దర్శకుడి సరసన, తెలుగు ప్రేక్షకులు కూడా సరేలెమ్మని టికెట్లు కొనుక్కుని చేరతారు. సాహసవంతులుగా నిరూపించుకుంటారు.

సికిందర్

9, అక్టోబర్ 2021, శనివారం

1061 : రివ్యూ

దర్శకత్వం : బి గోపాల్
తారాగణం: గోపీచంద్
, నయన తార, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, అభిమన్యూ సింగ్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, గుండు హనుమంత రావు  తదితరులు
కథ : వక్కంతం వంశీ
, మాటలు : అబ్బూరి రవి, సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం : బాలమురుగన్
బ్యానర్: జయ బాలాజీ రియల్ మీడియా
నిర్మాత : తాండ్ర రమేష్
విడుదల : అక్టోబర్ 8
, 2021

***

        త నెల తాజా సీటీ మార్ తో వచ్చిన గోపీచంద్ ఈవారం పాత  ఆరడుగుల బుల్లెట్ తో వచ్చాడు. 2017 నుంచీ విడుదల కష్టాల్లో వున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలైంది. ఇందులో నయన తార హీరోయిన్ గా నటించింది. మరో మూడు  పాత్రల్లో దివంగతులైన ఇద్దరు నటులు జయప్రకాష్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, గుండు హనుమంత రావు నటించారు. బ్రహ్మానందం కూడా తన బ్రాండ్ కామెడీతో నటించారు. బి. గోపాల్ దర్శకత్వం వహించారు.

         సినిమాని ఇప్పటి ప్రమాణాలతో కాక, టైమ్ ట్రావెల్ చేసి, 2012 లో చూస్తున్నట్టు చూడాలి. ఎందుకంటే ఇది 2012 లోనే ఓ తమిళ దర్శకుడితో ప్రారంభమై, అతను తప్పుకోవడంతో చాలాకాలం వాయిదా పడి, చివరికి బి. గోపాల్ దర్శకత్వంలో 2017 లో నిర్మాణం పూర్తయింది. కనుక 2017 లో పూర్తయినా 2012 ప్రమాణాలతోనే చూడాలి. మరి అప్పుడైనా ఇది పేలే బుల్లెట్టేనా అన్న ప్రశ్న వస్తుంది. మొత్తం కలిపి తొమ్మిదేళ్ళు ఈ బుల్లెట్ ప్రయాణించి బాక్సాఫీసు చేరింది. బాక్సాఫీసు వుందా, బద్దలైందా ఓసారి చూద్దాం...

కథ

    హైదరాబాద్ లో శివ (గోపీచంద్) చదువులేని, గొడవలు పెట్టుకునే  ఆవారా బ్యాఛీ. ఇతడికో ప్రభుత్వోగి అయిన మూర్తి (ప్రకాష్ రాజ్) తండ్రి. ఆవారాగా తిరిగినా కుటుంబ మంటే పంచ ప్రాణాలు శివకి. తండ్రికి సెంటిమెంట్లు లేవు. తిడుతూంటాడు. ఇలా కాదని ముంబాయిలో ఉద్యోగం వేయిస్తాడు. అక్కడ గొడవ పెట్టుకుని వచ్చేస్తాడు శివ. ఇప్పుడు తండ్రి విజయవాడలో వుంటాడు. మళ్ళీ ఇక్కడా ఆవారా బ్యాచీయే శివ. ఈసారి ఓ అమ్మాయి (నయన తార) తో ప్రేమలో కూడా పడతాడు. ఇక్కడ కాశీ (అభిమన్యూ సింగ్) అనే బడా రౌడీ బెజవాడ కింగ్ గా వుంటాడు. వీడు మూర్తి ఆస్తిని కబ్జా చేస్తాడు. శివకి ఒళ్ళు మండుతుంది. ఇక వీడి కబ్జా నుంచి ఆస్తిని విడిపించుకుని, తండ్రి చేత ఎలా శెభాష్ అన్పించుకున్నాడన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ

  మూడు వారాల క్రితమే సందీప్ కిషన్ నటించిన ఫ్రెష్ గల్లీ రౌడీ' యే ఔట్ డెటెడ్ కథతో వచ్చినప్పుడు, పురాతన కాలపు ఆరడుగుల బుల్లెట్ కథని ఇప్పుడు తప్పు పట్టడానికి లేదు. రెండూ బాక్సాఫీసుకి రొమ్ము విరిచే నిల్చున్నాయి. బాక్సాఫీసు ఫిరంగి ఎదురు మోతకి రివర్స్ లో వచ్చిన చోటుకి 1980 లోకి వెళ్ళిపోయాయి. మనిద్దరి ఆస్తిని విడిపించుకునే కథలు మరింకోసారి దండయాత్రలో ప్రయోగిద్దాంలే అని బుల్లెట్ ని ఓదారుస్తూ రౌడీ.   

      ఆరడుగుల బుల్లెట్ 2017 లో కాదు 2012 లో వచ్చినా ఇంతే. ఇలాటి ఆవారా హీరో కథలు 2008-10 నాటికే తనువు చాలించాయి. అయినా 1980-90 ల నాటి కథని 2012లో రుద్దే ధైర్యానికి మెచ్చుకోవాలి. అదీ ఇప్పుడు 2021 లో ఓటీటీలో విడుదల చెయ్యక థియేటర్ల మీద దండయాత్రకి వదలడం ఇంకా విచిత్రం - సరికొత్త మాస్ సినిమా సీటీమార్ నే మాస్ ప్రేక్షకులు కాదన్నాక!

      2012 లో గబ్బర్ సింగ్, దమ్ము, దరువు, జులాయి, రచ్చ, రెబల్ వంటి మాస్ సినిమాల మధ్య వచ్చినా ఫ్లాపయ్యేదే ఈ పాత కాలం కథతో. ఒక్కడున్నాడు, లక్ష్యం, ఒంటరి, శౌర్యం, శంఖం, గోలీమార్, వాంటెడ్ వంటి యాక్షన్ సినిమాల్లో నటిస్తూ వస్తున్న గోపీచంద్ కి, ఈ మందుగుండు లేని బుల్లెట్ యెక్కడ దొరికిందో అర్ధం గాదు. టైటిల్ కి మాత్రం పేల్చి చూసుకుంటే బావుందన్పించి నట్టుంది- కథ పేలుతుందా లేదా అనవసరం. ఈ కథ పేలనందుకు బాధ కాదు, ఇంత మంచి కమర్షియల్ టైటిల్ ఇంకొకరు వాడుకోకుండా వృధా పోయిందే అన్నదే  చింతించాల్సిన విషయం.

నటనలు - సాంకేతికాలు 
  శివగా మాస్ పాత్రలో గోపీచంద్ ఇంత అంకితభావంతో లీనమైపోయి నటించడం చాలా గ్రేట్. అతను టాలెంటెడ్ నటుడే. బుల్లెట్ పేలడానికి తన వంతు కృషినంతా చేశాడు. దర్శకుడు, రచయిత నకిలీ బుల్లెట్ ఇచ్చారని తెలుసుకోలేక పోయాడు. డాన్సులూ ఫైట్లతో తను డైనమైట్లే పేల్చి వుండొచ్చు గాక, పక్కన కథని పేల్చడం దర్శకుడు, రచయిత మర్చిపోతే ఏం చేయగలడు.

నయన తారలాంటి స్టార్ హీరోయిన్ తో రోమాన్స్ కూడా పేలకుండా చేశారు. నయనతారని అదిరిపోయే గ్లామర్ తో మాత్రమే చూపిస్తే సరిపోతుందా? అసలు మాస్ సినిమా అంటేనే అన్ని హద్దులూ దాటేసి ఇష్టానుసారం కథని పేల్చడమే కదా? లాజిక్ ఎవడు అడుగుతాడు. లేనప్పుడు మాస్ సినిమా తీయడమెందుకు? విలన్ అభిమన్యూ సింగ్ ని కూడా పేలవంగా, పరమ వీక్ గా తయారు చేశారు. అతను వీకైతే అతడి తమ్ముడ్ని దించారు. తమ్ముడు కూడా వీక్ కి వీకున్నర.

        ఇక బ్రహ్మానందం బారెడు కామెడీ ట్రాక్. సెకండాఫ్ లో స్పేస్ ఫిల్లర్ గా అప్పట్లో బ్రహ్మానందం బకరా కామెడీ ట్రెండ్ నడిచింది. 2012 లో తయారు చేసుకున్న కథకి ఇదొక్కటే అప్పటి ట్రెండ్ ప్రకారం వుందని సంతోషించాలి.

        మణిశర్మ సంగీతంలో పాటలు ఇప్పుడు గుర్తుండి వుండవు. పాటలు అప్పటివి. మిగతా ప్రొడక్షన్ విలువలు తన జమానాలో అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బి. గోపాల్ స్థాయిలోనే వున్నాయి. వీటి విషయంలో ఆయన తన ఇమేజికి లోటు రానివ్వలేదు. 2009 లో మస్కా తో తన శకం ముగిశాక, 2017 లో అప్డేట్ అవకుండా పాత స్టయిల్లోనే  దర్శకత్వం వహించడం మాత్రం బాగాలేదు.

చివరికేమిటి

   పరుచూరి బ్రదర్స్ రచనలతో అనేక విజయవంతమైన మాస్, యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలు తీస్తూ వుండిన బి. గోపాల్ కి సినిమా కథ అవసరాలేమిటో తెలియకుండా వుండదు. అయినా కొత్త తరం రచయిత రాసిన ఈ మిడిల్ మటాష్ కథని అంగీకరించడం ఆశ్చర్య పర్చే విషయం. కథతో సమస్య వల్లే మొదట్లో వున్న తమిళ దర్శకుడు వెళ్లిపోయాడు. గోపాల్ పరుచూరి బ్రదర్స్ ని ఎంటర్ చేయాల్సింది.

    ఈ కథ 2012 నాటికే కాలం చెల్లిన కథ అవచ్చు. కథనమైనా బావుండాలిగా? మిడిల్ మటాష్ కి బలి చేస్తే ఏ కథ బతుకుతుంది? పరుచూరి బ్రదర్స్ ఈ మిడిల్ మటాష్ ని త్రీయాక్ట్ స్ట్రక్చర్లో బతికించే వాళ్ళు. కోట్లు వ్యయం చేసే సినిమాకి మిడిల్ మటాష్ తో కథా? లక్షతో తీసినా క్షమించరాని నేరమే. ఇలా తీసిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. అయినా రచయితలు తెలుసుకుని మారకపోతే నేరస్థులే.  

        ఫస్టాఫ్ లో హీరో జీవం లేని కుటుంబ సీన్లు, ఆవారాతనం, హీరోయిన్ తో జీవం లేని లవ్ ట్రాక్, కామెడీ, ఇవన్నీ ఇంటర్వెల్ దగ్గర్లో విలన్ వచ్చేదాకా స్పేస్ ఫిల్లర్లుగా వుంటాయి. విలన్ వచ్చాక అందుకున్న కథ వాడికీ, హీరోకీ మధ్య సంఘర్షణగా నడవదు. వాణ్ణి మూల కూర్చో బెట్టేసి సెకండాఫ్ టెంప్లెట్ ప్రకారం బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి కామెడీ. విలన్ కాసేపు కనిపించి మళ్ళీ వెళ్ళిపోతాడు. హీరోకి వాడు లాక్కున్న ఆస్తి గురించి బాధే వుండదు. హీరోయిన్ తో సాంగ్స్, ఫారిన్ లొకేషన్స్ లో డాన్సులు. క్లయిమాక్స్ లో గానీ ఇంటర్వెల్లో ఆగిపోయిన విలన్ తో కథ ప్రారంభం కాదు! దీన్ని సినిమాగా ఎవరైనా ఒప్పుకుంటే హిట్ చేయమని చెప్పాలి.

సికిందర్
(Published in telugurajyam.com,
 a US based website)

 

 

1060 : రివ్యూ


 దర్శకత్వం : క్రిష్

తారాగణం : వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోట శ్రీనివాసరావు, నాజర్, సాయిచంద్, రవిప్రకాష్, అన్నపూర్ణ, హేమ తదితరులు
కథ
, మాటలు : సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి, స్క్రీన్ ప్లే : క్రిష్, సంగీతం : ఎంఎం కీరవాణి; పాటలు : సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కీరవాణి; ఛాయాగ్రహణం : వీఎస్ జ్ఞాన శేఖర్
బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : జాగర్లమూడి సాయిబాబు
, రాజీవ్ రెడ్డి.
విడుదల :  అక్టోబర్ 8
,2021
***

    రెండేళ్ల క్రితం ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు తర్వాత దర్శకుడు క్రిష్ కొండపొలం తో ఈవారం తెలుగు ప్రేక్షకుల ముందు కొచ్చారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో సవాలుగా తీసుకుని నిర్మాణం పూర్తి చేశామన్నారు. అప్పుడప్పుడే ఉప్పెన లో నటిస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ ని కథా నాయకుడుగా తీసుకున్నారు. ఇటీవల హిందీలో బిజీ అయిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ ని కథా నాయకిగా తీసుకున్నారు. ఈ సినిమా టైటిల్, ట్రైలర్ గొర్రె కాపరుల జీవితాల్ని చూపించే వాస్తవిక సినిమా అన్న అభిప్రాయం కల్గించాయి. వాస్తవిక సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో  కొండపొలం ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో చూద్దాం.

కథ

    రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) ఢిల్లీలో యుపిఎస్ సి ఇంటర్వ్యూకి హాజరవుతాడు. ఐ‌ఏఎస్ తీసుకోకుండా ఐఎఫ్ఎస్ ఎందుకు కోరుకుంటున్నావని ఇంటర్వ్యూలో అడిగితే, ఆత్మవిశ్వాసమంటే ఏమిటో అడవి నేర్పిందున ఫారెస్ట్ ఆఫీసర్ అవుదామనుకున్నట్టు చెప్తాడు. ఈ నిర్ణయం ఎలా తీసుకున్నాడో గతాన్ని చెప్పుకొస్తాడు...

    రాయలసీమ లోని గొర్రెల కాపరుల కుటుంబంలో జన్మించించిన రవీంద్ర, తండ్రి గొర్రెలమ్మి సంపాదించిన డబ్బుతో బీటెక్ చేసి, జాబ్ ఇంటర్వ్యూల్లో ఫెయిలవుతూ వుంటాడు. ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఇంగ్లీషు రాకపోవడం వంటి కారణాలతో ఉద్యోగం సంపాదించుకోలేక ఇంటికొస్తాడు. అప్పుడు తాత (కోట శ్రీనివాసరావు) ఒక సలహా ఇస్తాడు. తండ్రితోబాటు గొర్రెల్ని మేపడానికి అడవి కెళ్ళి, అక్కడ అడవి నేర్పే పాఠాలు నేర్చుకుంటే తప్పకుండా ఉద్యోగం సంపాదించుకునే తెలివి వస్తుందంటాడు.

    రవీంద్ర తండ్రి (సాయిచంద్) తో గొర్రెల్ని తీసుకుని అడవికి బయల్దేరతాడు, వాళ్ళతో తన గొర్రెల్ని తీసుకుని ఓబులమ్మ (రకుల్ ప్రీత్ సిం), మరో ముగ్గురు నల్గురు కూడా నల్లమల అడవికి బయల్దేరతారు. నీరు లేక, గ్రాసం లేక కరువు కాటకాలతో గొర్రెలు మలమల మాడుతూంటే, వర్షాలు పడే వరకూ అడవిలో గొర్రెల్ని మేపి తీసుకు రావడాన్ని, ఇలా వెళ్ళి నెలన్నర అడవిలో గడిపి రావడాన్ని కొండపొలం అంటారు.

    ఇలా మొదటిసారి అడవి కెళ్లిన రవీంద్రకి వూహించని అనుభవాలు ఎదురవుతాయి. అతడి అధైర్యానికి ఓబులమ్మ ఆటలు పట్టిస్తూంటుంది. మరోవైపు గొర్రెల మీద పడే పులి, ఇంకోవైపు ఎర్రచందనం స్మగ్లర్లు, ఇంకా శుంకాలు వసూలు చేసేవాళ్ళూ - ఇలా రకరకాల సమస్యల్ని చూస్తాడు. దీంతో ఓబులమ్మ చెప్పే పాఠాలతో బాటు, ఈ ఎదురయ్యే సమస్యల్ని కూడా జయించే ఆత్మవిశ్వాసం పొందే యువకుడుగా మారడం ఈ కథ. 
  
ఎలా వుంది కథ

     ‘తానా నవలల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న 'కొండపొలం' నవల ఈ సినిమా కాధారమని సమాచారం. రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి. ఈ నవల 2019 లో వెలువడింది. నల్లమల అడవుల్లో గొర్రెల కాపరుల కుటుంబాల జీవన పోరాటాన్ని చిత్రించిన ఈ నవలలో లేని ఓబులమ్మ పాత్రని, ఆమెతో ప్రేమ కథనీ   సినిమా కోసం సృష్టించారు. రవీంద్ర యాదవ్ పాత్ర యధాతథం. కానీ సినిమా మాత్రం హైదారాబాద్ సమీపంలోని వికారాబాద్ లో తీశారు. అందుకని నల్లమల నేటివిటీ లేదు. నల్లమలలోని రకరకాల చెట్లు, కాయలు పళ్ళూ, వాగులూ వంకలూ గురించిన సమాచారం నవల్లో వివరంగా వున్నట్టు నవల మీద వెలువడ్డ సమీక్ష ద్వారా తెలుస్తోంది. ఈ సహజత్వమంతా సినిమాలో వుండదు.  

     ఇక రవీంద్ర అడవిలో నేర్చుకునే జీవిత పాఠాలు ఈ సినిమా థీమ్ అయినప్పుడు ఈ థీమ్ తో అతను మమేకం కాలేక పోవడమనే క్యారక్టరైజేషన్ లోపం స్పష్టంగా కనబడుతుంది. కనీసం ఆకులో ఆకుగా, మానులో మానుగా అడవిని ఆవాహన చేసుకోకపోతే, మొదటిసారి అడవికెళ్ళిన తను అక్కడి దృశ్యాలకి వండర్ అవకపోతే, అడవిని మధించకపోతే, ఏం నేర్చుకున్నట్టు? రకరకాల సంఘటనలు, ప్రమాదాలూ వంటి భయపెట్టే అంశాలే నేర్చుకునే సాధనా లన్నట్టు వుంటాయి - తడవకోసారి పులితో తలపడే దృశ్యాలు సహా.

     ఇవి తప్ప హృదయాల్ని కదిలించే అనుభవాలు లేకపోవడంతో ఎమోషనల్ కనెక్ట్ కనపడదు. దీంతో ఆత్మవిశ్వాసం పొందే ముగింపు రాణించకుండా పోయింది. కథలో కండబలంతో బాటు హృదయ స్పందన కూడా వుంటే సమగ్రంగా వుండేది. నవలని సినిమాగా మార్చడంలో జరిగిన లోపమిది. లాక్ డౌన్ కోవిడ్ గురించే గానీ, నవల గురించి కాదుగా?


      ఈ సినిమా చూస్తూంటే మృణాల్ సేన్ హిందీ క్లాసిక్ 'భువన్ షోమ్', ధ్యానేష్ మోఘే  కొంకణిలో తీసిన 'దిగంత్' మెదులుతాయి. ఈ రెండు సినిమాల్ని దర్శకుడు క్రిష్ స్టడీ చేసి వుంటే బావుండేది. 'భువన్ షోమ్ లో మానవత్వం లేని రైల్వే ఆఫీసర్ ఉత్పల్ దత్ అడవికి షికారుకెళ్ళి, అడవి పిల్ల సుహాసినీ మూలేతో మానవత్వమంటే ఏమిటో నేర్చుకుని, మారిన మనిషిగా తిరిగి వచ్చే కథ ఒక క్యారక్టర్ స్టడీగా నిల్చిపోయింది. ఫ్రెంచి న్యూవేవ్ సినిమా శైలిని తొలిసారిగా భారతీయ తెరమీదికి  'భువన్ షోమ్' గా మార్చి సంచలనం సృష్టించాడు మృణాల్ సేన్.

     అలాగే కొంకణి దర్శకుడు ధ్యానేష్ మోఘే 'దిగంత్' లో ఇక 'కొండపొలం' లోని గొర్రెల కాపరుల జీవితమే కన్పిస్తుంది. కాకపోతే ఇందులో కథా నాయకుడికి తండ్రితో బాధ వేరు. చదువుకున్న కథానాయకుడు సిటీలో రియల్ ఎస్టేట్ ఉద్యోగంలో చేరాలని పట్టుదల. తండ్రికి తమ కులం అస్థిత్వం గురించిన బాధ. అడవిలోనే ఇంత స్వేచ్ఛా, భద్రతా వుంటే ఇంకెక్కడో వెతుక్కొనవసరం లేదనే మంకుపట్టు. ఈ కథ ఒక వర్తమాన సామాజిక పరిశీలనగా గుర్తుండి పోతుంది. ఇలాటివి 'కొండపొలం' తీయడానికి రిఫరెన్సులుగా వున్నాయి.

నటనలు సాంకేతికాలు

    'ఉప్పెన' ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరో యాదవ పాత్రలో ఒదిగిపోయాడు అనే రొటీన్ మాట అవసరం లేదుగానీ, ఫర్వాలేదు. కాకపోతే ఒకే ఎక్స్ ప్రెషన్ తో సినిమా మొత్తం లాక్కొస్తాడు. అతడి కళ్ళు ఆకర్షించాయన్నాడు దర్శకుడు. దీంతో అతను కనిపించినప్పుడల్లా మన దృష్టి కళ్ళ మీదికే పోతుంది. కళ్ళల్లో అంత శక్తివుంటే ఆత్మవిశ్వాసం నేర్చుకునే పనే లేదుగా? పాత్రకి తగ్గట్టు కళ్ళున్నాయి.

     కాకపోతే రియలిస్టిక్ సినిమాలో రియలిస్టిక్ పాత్రని చూపిస్తే బావుంటుంది. మొదటి యూపీఎస్సీ ఇంటర్వ్యూ సీన్లోనే ఇది లోపించింది. యూపీఎస్సీ  ఇంటర్వ్యూలు ఎలా జరుగుతాయో మాక్ ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో బోలెడున్నాయి. అభ్యర్ధులు ఎంత మృదువుగా, చక్కగా సమాధానాలు చెప్తారు. బాడీ లాంగ్వేజ్ ఎంత బావుంటుంది. వైష్ణవ్ తేజ్ ఈ వీడియోలు చూసి వాస్తవికతని, విశ్వసనీయతనీ ఈ సీన్లో ప్రదర్శించాల్సింది. 'రిపబ్లిక్' లో యూపీ ఎస్సీ ఇంటర్వ్యూని ఇంకో పై లెవెల్ కి తీసి కెళ్ళారు. హీరో దగ్గరగా, టేబుల్ మీద చేతులు పెట్టుకుని కూర్చుని, ఎమోషనల్ లెక్చర్ దంచేస్తూంటాడు!

    ఆత్మ విశ్వాసం నేర్చుకునే పాత్రపరంగా వైష్ణవ్ తేజ్ డీలా పడ్డానికి తగిన ఎమోషనల్ త్రెడ్ లేకపోవడం కారణం. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో లేకపోతే ఇంతే. స్క్రీన్ ప్లే అంటే పాత్రకి ఒక సమస్య, ఒక సంఘర్షణ అనే సూత్రం పాటించకపోతే పాత్ర ఇలాగే బలహీనంగా తయారవుతుంది. ఫార్ములా పాత్రలకి భిన్నంగా ప్రయోగాలు చేస్తున్న వైష్ణవ్ తేజ్ ఇవి దృష్టిలో పెట్టుకోవడం అవసరం.

      ఇక ఓబులమ్మ పాత్రలో సహజంగానే రకుల్ ప్రీత్ సింగ్ నేటివిటీకి దూరంగా వుంది. పాత్రకి వున్న చలాకీతనంతో ఈ లోపాన్ని అధిగమించే ప్రయత్నం చేసింది. కానీ తనకి కూడా వైష్ణవ్ కి లాగే ఎమోషనల్ సీన్లు లేవు. ఎమోషన్లనేవి ఒకే ఒక్క సమస్యతో పోరాడుతున్నప్పుడు మాత్రమే క్యారీ అవుతాయి. తడవకో సమస్యతో కాదు.

    మూడో పాత్ర తండ్రి పాత్రలో సాయిచంద్ చాలా బాగా నటించాడు. గొర్రెలకి నీరు పెట్టలేని అశక్తతతో వాటిమీద విరుచుకు పడే సన్నివేశం ఈ సినిమాకి హైలైట్. 'సొంత ఊరు' లో ఎల్బీ శ్రీరామ్ గుర్తొస్తాడు. ఇంకో పాత్రలో ఫార్ములా సినిమాల రవిప్రకాష్ సహజ నటన ప్రదర్శించాడు. ఐతే భార్యతో గోడు వెళ్ళబోసుకునే అంత లాంగ్ ఫోన్ సంభాషణ అనవసరమన్పించేదే. కథకీ పాత్రకీ ఉపయోగం లేదు. అసలే వేగంగా కదలని కథకి ఇదొక స్పీడ్ బ్రేకు. సహనపరీక్షగా వుంది.

    జ్ఞాన శేఖర్ ఛాయాగ్రహణంలో అరణ్య దృశ్యాలు అత్యంత రమణీయంగా వున్నాయి. కానీ తాగడానిక్కూడా నీళ్ళు దొరకని ఎండా కాలపు అరణ్యం అంత పచ్చగా వుండదేమో. ఇంత అద్భుతంగా చూపించిన అడవిని దాన్నొక హీరో నేర్చుకునే పాత్రగా, పాఠంగా చేసి అనువణువు విప్పి చూపించాలి అసలుకి. క్లోజప్స్ తో కట్టి పడేయాలి. నవలలో చిత్రీకరణకి సాధ్యమైన వర్ణనలున్నాయి. ‘సాక్షి’ లో ప్రచురించిన జంపాల చౌదరి ముందు మాట చదివితే అర్ధమవుతుంది.

    కీరవాణి సంగీతం హెవీగా వుంది. అయితే క్యాచీగా పాటలున్నాయి. అసలే బిక్కుబిక్కుమంటూ నేర్చుకోవడానికి వచ్చిన హీరో పాత్రకి ఇంత హెవీ సౌండ్ అవసరం లేదేమో. ఈ సినిమా హీరో కళ్ళతో చూస్తున్న బయస్కోప్ అన్నది దృష్టిలో పెట్టుకుంటే కథా కథనాలూ, సంగీతం అన్నీ శృతిలో వుండే అవకాశముంది.

చివరికేమిటి

     నవలా రచన  చేసిన సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డియే మాటలు రాయడం ఈ సినిమాకి సహజత్వం. సినిమా రచయితలు రాసివుంటే టెంప్లెట్, కృతక సీమ లాంగ్వేజీ వుండేది. రామిరెడ్డి రాసిన మాటల వల్ల చాలా సన్నివేశాలు రక్తి కట్టాయి. అయితే నవలకి దర్శకుడి స్క్రీన్ ప్లే ఒక్కటే అన్ని సమస్యలకి కారణమైంది. స్క్రీన్ ప్లేకో దశ, దిశ కన్పించవు. దీంతో చాలా సీన్లు రిపీటవుతూంటాయి. పైగా కథనానికో ప్లానింగ్ లేదు. మొదటిసారిగా అడవిలోకి ప్రవేశించిన హీరోకి పులి భయం పెట్టేశారు. అతను కనీసం మొదటిసారి అడవిని చూస్తున్న ఆనందాన్ని కలగనీయకుండా చేశారు. అడవిని పరిచయం చేసుకునే, ప్రేమించే అవకాశం కూడా లేకపోయింది. పులిని గురించిన మాటలతో పులి భయం... పులి భయం...

     40 వ నిమిషంలో పులి దాడి చేసేసరికి అతను పూర్తిగా బెదిరిపోతాడు. నిజానికి ఇక్కడే కథ ప్రారంభం కావాలి. అన్నిసార్లు పులిని గురించి వింటున్నప్పుడు, పులి కన్పిస్తే దాంతో తేల్చుకునే ధైర్యం నింపుకుని సిద్ధంగా వుండాలి. అది దాడి చేయగానే ఎదుర్కొనే పోరాటం ప్రకటించేస్తే, కథ ప్రారంభైపోయి గొడవ వదిలిపోయేది.

     ఈ నలభై నిమిషాలూ గొర్రెల కాపరుల రిపీటయ్యే కష్టాలు, హీరోయిన్ తో ప్రేమ ప్రారంభం కాని ఏవో దృశ్యాలూ వచ్చి పోతూంటాయి. పులి దాడిని అతను ఆత్మవిశ్వాసం పొందే మార్గంగా నిర్ణయించుకుని పోరాటం ప్రకటించి వుంటే థీమ్ ని ఎస్టాబ్లిష్ చేసే మలుపుగా వుంటూ కథ ప్రారంభమై పోయేది. ఈ గోల్ ప్రారంభం కాక, హీరోయిన్ తో ప్రేమా ప్రారంభం కాక, ఇంకేదో ఎర్ర చందనం స్మగ్లర్ల ఎపిసోడ్ వస్తుంది. దీని మీదే ఇంటర్వెల్ పడుతుంది. ఇప్పుడు కథేమిటంటే ఏమీ చెప్పలేని పరిస్థితి.

     సెకండాఫ్ లో ఇంకో రెండు సార్లు పులి దాడి చేస్తుంది. మొదటి దాడిని ఎదుర్కొంటాడు. కానీ ఇది ఆత్మవిశ్వాసం పొంది, ఉద్యోగం సాధించుకునే గోల్ కోసమని స్పష్టంగా ఇప్పుడైనా కథ ఎస్టాబ్లిష్ కాదు. ఇక ప్రేమ విషయాని కొస్తే ఇంకో ముప్పావు గంటకి గానీ ప్రేమలో పడరు. పడ్డాక దీని మీద కూడా వుండరు. ఇంకో పావుగంటకి విడిపోతారు. అంటే ప్రేమ విషయంగా చివరి అరగంట సమయంలో గానీ ప్రేమలో పడడం, కాన్ఫ్లిక్ట్ ప్రాంభమవడం జరగవన్న మాట. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్న మాట. హీరో గోల్ కథ కూడా మిడిల్ మటాషే.

    నవలలో లేని హీరోయిన్ పాత్ర, దాంతో ప్రేమ కథ సినిమాలో కల్పించడంలో కన్ఫ్యూజన్ వల్ల ఈ పరిస్థితి. కేవలం ఆత్మ విశ్వాసం కథ చెప్పాలనుకుని ప్రేమ కథని వెనక్కి తోసేయడంతో రెండూ నష్టపోయాయి. ఫస్టాఫ్ లోనే ప్రేమ కథ ప్రారంభిస్తే అది షుగర్ కోటింగ్ లా వుండేది. దాని మాటున అంతర్లీనంగా ఆత్మవిశ్వాసం కథ చెప్తే సమస్యలన్నీ తీరేవి. హీరోయిన్ పాత్ర కూడా అర్ధవంతంగా వుండేది.

 సికిందర్  

(Published in telugurajyam.com,
 a US based website)