రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, సెప్టెంబర్ 2021, సోమవారం

1058 : రివ్యూ

దర్శకత్వం: రాచకొండ విద్యాసాగర్
తారాగణం: అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ, రోహిణి తదితరులు
రచన: అవసరాల శ్రీనివాస్,  సంగీతం: శక్తి కాంత్ కార్తిక్, ఛాయాగ్రహణం : రామ్
బ్యానర్: ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
విడుదల : 3 సెప్టెంబర్, 2021
***

      నటుడు రచయిత దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మరో ప్రేమ కథ రాసి కొత్త దర్శకుడు రాచకొండ విద్యాసాగర్ కి అప్పగించాడు. బట్టతల గురించి కథ. విషయం చిన్నది, వ్యవసాయం పెద్దదిగా వుండాలి. అలా వుందా? ఇందులో చిలసౌ ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్. ఈసారి ఈమెకి చిలసౌలో లాంటి బలమైన పాత్ర దక్కిందా? బట్టతల మీద ఇదివరకే రెండు సినిమాలొచ్చాయి. అవసరాల బట్టతల కథ ఏమైనా భిన్నంగా వుందా? కొత్త దర్శకుడు ఏమైనా కొత్త ముద్ర వేశాడా? ఇవి తెలుసుకోవడానికి విషయంలో కెళ్దాం...

కథ

   జీఎస్సెన్ అనే గొత్తి సూర్య నారాయ‌ణ (అవ‌సరాల శ్రీనివాస్‌) ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్. తల్లి (రోహిణి) వుంటుంది. వంశపార్యంపరంగా వచ్చిన బట్టతల వుండడంతో అది బయటపడకుండా విగ్గు పెట్టుకుని స్ట్రగుల్ చేస్తూంటాడు. ఇంట్లో వున్నప్పుడు క్యాప్ పెట్టుకుంటాడు. అదే కంపెనీలో అంజలి (రుహానీ శర్మ) కొత్తగా చేరుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. తన బట్టతల ఆమె నుంచి దాస్తూ తప్పు చేస్తు న్నానేమోనని ఫీలవడం మొదలెడతాడు. ఇంతలో అతడి బట్టతల ఆమె చూసేస్తుంది. మడిపడి తెగతెంపులు చేసుకుంటుంది. ఇప్పుడీమె ప్రేమని ఎలా గెలుచుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

            బట్టతలతో ఇన్నోవేట్ చేయని రోమాంటిక్ కామెడీ కథ. ఓ ఇరవై ఏళ్ళ క్రితం వచ్చి వుంటే ఈ కథని నమ్మొచ్చు. ఇప్పుడు కాదు. ఇప్పుడు బట్ట తల సమస్యే కాదు. ఈ ఇరవై ఏళ్ళ కాలంలో హేర్ ట్రాన్స్ ప్లాంట్ టెక్నాలజీ  వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. హైదారాబాద్ లోనే డజనుకి పైగా క్లినిక్స్ వున్నాయి. రెండు సిటింగ్స్ తో, ఓ యాభై వేల ఖర్చుతో, ఆరు నెలల్లో గర్వ కారణమైన కేశ సంపద పొంద వచ్చు.

        వాస్తవమిలా వుండగా, బట్ట తల సమస్య నెదుర్కొన్న వెనుకటి కాలపు కథ అందించారు. మనమున్నది 2021 లో. 2019 లో విడుదలైన బాలా’, ఉజ్డా చమన్ కూడా ఇలాటివే. వీటికి ముందే ఈ కథ అనుకున్నట్టు అవసరాల వివరణ. ఈ కథ ముందే అనుకుంటే అనుకోవచ్చు గానీ, డీహెచ్ఐ (డైరెక్ట్ హేర్ ట్రాన్స్ ప్లాంటేషన్) టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని అప్డేట్ చేసుకుని వుంటే, ఆ రెండిటి కాపీ అన్న అపోహ వుండేది కాదు. డీహెచ్ఐ టెక్నాలజీ 43 దేశాల్లో వుంది. లక్షల మంది దీని సేవలు పొందుతున్నారు.

        సరే, పాత కాలపు పరిస్థితితోనే కథ చేయకుండా డీహెచ్ఐ తో కథని ఇన్నోవేట్ చేసివుంటే వచ్చే లాభమేమిటి? ఒకటి, బట్టతల- విగ్గు- విగ్గూడిపోయి బట్టతల బట్టబయలు- చివరికి విధిలేక బట్టతలతో రాజీపడి, అందమే ఆనందం కాదు, ఆనందమే అందమని బలవంతాన నవ్వుతెచ్చుకుని, ముగించే విషయంలేని మూస అయ్యేది కాదు కథ.

        ఇలా సైంటిఫిక్, సైకలాజికల్, మెడికల్ సబ్జెక్టులతో కమిటెడ్ గా వుండలేక, లేదా విషయ సేకరణ పట్ల అలసత్వం వల్ల ఇలాటి కథలు ఫ్లాపవుతున్నాయి. డిస్కో రాజాలో, ‘సవ్యసాచిలో సైంటిఫిక్ పాయింట్స్ ని ఇలా చెడగొట్టుకోవడం వలన భారీగానే ఫ్లాప్స్ నెదుర్కొన్నారు. సైజ్ జీరోలో మెడికల్ పాయింటుతోనూ ఇంతే.  వరల్డ్ ఫేమస్ లవర్లో సైకలాజికల్ పాయింటుతోనూ ఇంతే. ఇవి కొన్ని మాత్రమే ఉదాహరణలు. ఈ సబ్జెక్టులకి వాటివైన జానర్ మర్యాదలుంటాయి. ఇదికూడా లేకుండా మూసగా తయార్రు చేసుకుంటున్నారు కథలు.

నటనలు -సాంకేతికాలు

    హాస్య ప్రధానమైన బట్టతల పాత్రధారి అవసరాల నటన ఫర్వాలేదు. కామిక్ సెన్స్ వుంది, టైమింగ్ వుంది. ముఖ్యంగా హోటల్లో పెళ్ళి సందర్భంగా సృష్టించిన కామెడీ ఎక్కువ నవ్వు తెప్పించేదే. ఇలాటి పంచ్ కామెడీ ఇదొక్కటే కన్పిస్తుంది. హీరోయిన్ తెలుగు రాని హిందీ అమ్మాయి అనుకుని నటించిన సీన్లూ ఓకే. కానీ పాత్రకి కథ లేనప్పుడు ఎంతసేపు ఏ కామెడీతో నడిపిస్తారు. సెకండాఫ్ లో ఈ సమస్య ఎక్కువైపోయింది. పైగా మొదట్నుంచీ పాసివ్ పాత్ర. బట్టతలతో సమస్యైతే వుంది, ఈ సమస్యని పరిష్కరించుకోవాలన్న గోల్ మాత్రం లేదు.

        ఇంటర్వెల్లో హీరోయిన్ కి బట్టతల బయట పడ్డాక, ఇప్పుడామె ప్రేమనెలా పొందాలన్న గోల్ కూడా లేదు. తనకి దూరమైన హీరోయిన్ తానే దగ్గరై కౌన్సెలింగ్ చేసి, సమస్యతో రాజీ పడమని మోటివేట్ చేస్తుంది. అలా సమస్య నుంచి బయటపడతాడు పాపం! సొంత గోల్ లేకుండా ఇంతకంటే సినిమాని ఫ్లాప్ చేసే పాసివ్ ప్రధాన పాత్ర వుంటుందా?

1. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.
2. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.
3. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.
4. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.
5. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.
6. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.

        ఈ బ్లాగు అంతా ఈ హెచ్చరికలే నిండిపోయాయి. అయినా సినిమాల్లో పదేపదే పాసివ్ పాత్రలే! సిగరెట్ ప్యాక్ హెచ్చరికల్లా కన్పిస్తున్నాయి కాబోలు. మనకి తెలుసు- ఇలా సినిమా కథా శాస్త్రం నల్గురికి తెలియడం కోసం చదవడం, నల్గురి ముందు గొప్ప కోసం చర్చించడం వరకే. తీరా సినిమా చేసేప్పుడు ఇవన్నీ కట్టకట్టి అవతల పెట్టి, సొంత పైత్యాలతో సినిమాల్ని సింగారించుకుని మునిగిపోవడం. అనుభవమైతే గానీ తత్వం బోధపడదన్నట్టు అనుభవించి తీరాల్సిందే!

        ఆ మధ్య  మనియారయిలే అశోకన్ అనే మలయాళం వచ్చింది. ఇందులో పాత్రకి పొట్టి తనమనే సమస్య వుంటుంది గానీ, దీన్నుంచి ఎలా బయటపడాలన్న గోల్ వుండదు. పొట్టి తనం శాపం కాదు, సమస్య కూడా కాదు. తన సైజు అమ్మాయిని చేసుకుంటే సరిపోతుంది. ఈ గోల్ పెట్టుకుని అలాటి అమ్మాయి కోసం పాట్లు పడితే సరిపోతుందని ఆలోచించడు.

     పొట్టితనం ఎప్పుడు సమస్య కావచ్చంటే, మై మేరీ పత్నీ ఔర్ వో అనే హిందీ సూపర్ హిట్ లో పొట్టి లెక్చరర్ రాజ్ పల్ యాదవ్, పొడుగు రీతూపర్ణా సేన్ ని పెళ్ళి చేసుకుని, అందరూ నవ్వుతున్నారని గింజికు చావడంలో వుండొచ్చు. పొట్టి రాజ్ పల్ యాదవ్ కి పొడుగు భార్యతో వుండే ఆత్మ న్యూన్యతా భావం, దాంతో సమస్యలు తెచ్చుకుని  పడే బాధా చిత్రించాలంటే దర్శకుడికి సామర్ధ్యం అవసరం. నవ్విస్తూ ఏడ్పించడమనే ద్వంద్వాల పోషణతో ఈ సామర్ధ్యాన్ని ప్రదర్శించాడు.  

        పాత్ర ఏదో సమస్య పెట్టుకుని లోలోపల కుమిలిపోవడం దాని బాధ, ఆ బాధలోంచి బయటపడేదుకు పాల్పడే చర్యలు ప్రేక్షకులకి హాస్య వినోదం. ఇలాగే  జో సమ్ బడీలో పిరికివాడైన టిమ్ అలెన్, తన కూతురి ముందు ఒక బలవంతుడు తనని కొట్టాడని, తనూ  బలవంతుడై కూతురి ముందే వాణ్ణి కొట్టాలని చేసే ప్రయత్నాలు ఆ పాత్రకి సీరియస్, ప్రేక్షకులకి నవ్వులు. ఇంత సింపుల్ ఎంటర్ టైనర్స్ లో చెప్పకుండానే ఎంత బలమైన సందేశం, నీతీ వుంటాయో చెప్పక్కర్లేదు.

        అవసరాల బట్టతల పాత్రకి ఈ ద్వంద్వాల పోషణ అనే స్క్రిప్టింగ్ టూల్ లోపించడం వల్లే సజీవ పాత్ర కాకుండా అట్ట ముక్కలా వుంది. తనకి లేని జుట్టు ఎదుటి వాడికుందన్న అక్కసు లోలోపల వేధిస్తూంటే ఎదుటి వ్యక్తులతో పాల్పడే చర్యలెలా వుంటాయో సైకలాజికల్ స్టడీ చేసుకుని రూపకల్పన చేసుకోవాల్సిన సందర్భం. పాత్రంటే అదీ, కథంటే అదీ. ఇక పాత్రకి గోల్ విషయం చివర్లో చూద్దాం.

        ఈసారి రుహానీ శర్మ హీరోయిన్ పాత్రకి విషయం లేదు. ఆమెలోని నటిని బయట పెట్టే సన్నివేశాల్లేవు. అవసరాల పాత్రకే కథ లేనట్టు తనకీ లేకపోతే చేసేదేముంది. సాంకేతికంగా కెమెరా వర్క్ రిచ్ గా వుంది. సంగీతం నిరాశ.  

చివరికేమిటి

     ఫస్టాఫ్ హీరోయిన్ కి బట్టతల తెలియకుండా ప్రయత్నాలు. ఇంటర్వెల్లో బట్ట తల తెలియడం. సెకండాఫ్ చూసి చూసి హీరోయినే అర్ధం జేసుకుని దగ్గరై సమస్య నుంచి బయట పడేయడం. బొత్తిగా విషయం లేదు. బట్ట తలతో ఎలా మొదలైందో పరిష్కారం లేకుండా అలాగే బట్ట తలతో ముగుస్తుంది. ఇంటర్వెల్లో హీరోయిన్ కి బట్టతల తెలిసే ప్లాట్ పాయింట్ వన్ మలుపు- కాన్ఫ్లిక్ట్ అత్యంత బలహీనం. ఈ బలహీన కాన్ఫ్లిక్ట్ లో సెకండాఫ్ ని నిలబెట్టే విషయం లేకపోవడంతో కథకి సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండం. ఇందుకే మధ్యలో దూరమైన హీరోయిన్ ని దగ్గర చేసి కాన్ఫ్లిక్ట్ ని ముగించేశారు. ఇక హీరోయిన్ తోడ్పాటుతో బట్టతలతో తన మానసిక సమస్య నుంచి ఎలా బయటపడ్డాడో చూపించడం. చివర్లో హడావిడిగా ఓ స్టేజి ప్రసంగంతో నీతి చెప్పి ముగించడం.

        హీరోయిన్ కి వెంట్రుక వాసిలో బట్టతల తెలిసిపోయే ప్రమాదకర ఘట్టం నుంచి బయట పడి, ఇక లాభం లేదు, పెళ్ళి టైములోగా సీక్రెట్ గా జుట్టు మొలిపించుఒకోవడమే మార్గమని గోల్ పెట్టుకుని- క్లినిక్స్ లో ఆ జుట్టు మొలిపించుకునే పాట్లు, అదెంతకీ మొలవక పోవడం, పెళ్ళి టైము ముంచుకు రావడం - ఇలా వాస్తవికంగా, ప్రాక్టికల్ గా థ్రిల్లింగ్ గా - ఇన్నోవేట్ చేసి ఈ కథ చెప్పొచ్చు కదా?

        పోతే, దీనికి వారం క్రితం విడుదలైన ఇచ్చట వాహనములు నిలపరాదు లో ఫస్టాఫ్ లవ్ ట్రాక్ ఎలా వుందో, అదే మళ్ళీ అదే సెటప్ లో చూడాల్సి రావడం సహన పరీక్షే. కాకపోతే అందులో ఆర్కిటెక్చర్ కంపెనీ, ఇందులో రియల్ ఎస్టేట్ కంపెనీ.

        గోల్ లేకపోవడం, కాన్ఫ్లిక్ట్ లేకపోవడం, పాసివ్ పాత్ర కావడం - దీని తర్వాత మొన్న విడుదలై దెబ్బతిన్న  టక్ జగదీష్ లోనూ చూశాం. తెలుగు సినిమాలు అద్భుత క్రియేటివ్ టాలెంట్ తో ముందడుగేస్తున్నాయి. ఇలాగే మరిన్ని కదం తొక్కుతూ వస్తూంటే తెలుగు సినిమాల కీర్తి దశదిశలా మార్మోగుతుంది. జీవితం పండుగలా వుంటుంది. 
సికిందర్

 

12, సెప్టెంబర్ 2021, ఆదివారం

1057 : రివ్యూ

రచన - దర్శకత్వం: శివ నిర్వాణ 
తారాగణం: నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, నాజర్, రావురమేష్, నరేష్, రఘుబాబు, సీవిఎల్ నరసింహా రావు, శ్రీకాంత్ అయ్యంగార్, మాలా పార్వతి, రోహిణి, దేవదర్శిని, డేనియల్ బాలాజీ, తిరువీర్ తదితరులు 
సంగీతం: తమన్, గోపీ సుందర్, ఛాయాగ్రహణం : ప్రసాద్ మూరెళ్ళ
బ్యానర్ : షైన్ స్క్రీన్స్
నిర్మాతలు : గారపాటి సాహు, పెద్ది హరీష్
విడుదల : 9 సెప్టెంబర్, 2021, అమెజాన్ ప్రైమ్
***

        త సంవత్సరం  విడుదలైన నేచురల్ స్టార్ నాని  వి  లాగే తాజా  టక్ జగదీష్ ఓటీటీలో విడుదలైంది. వి లో నాని నటించింది సీరియల్ కిల్లరో, రివెంజి తీర్చుకునే క్యారక్టరో తేలక ఆ సినిమా ఫలితం అలా తేలింది. మరి టక్ జగదీష్’? లో ఎలా వుంది? ఈ పాత్ర ఎలాటి కథని సృష్టించింది? సత్కథా కాలక్షేపమేనా? పెద్ద సినిమాల్లేని  క్షామంలో బంపర్ హిట్టేనా? అలాగే నిన్ను కోరి’, మజిలీ అనే రెండు లైటర్ వీన్ సినిమాల దర్శకుడు శివ నిర్వాణా ఈ మూడో ప్రయత్నమెలా వుంది? నాని నుంచి ప్రేక్షకులాశించేది ఇచ్చాడా? లేక శర్వానంద్ కి ఒక  శ్రీకారం లాగా సరిపెట్టేశాడా? ఈ విషయాలు పరిశీలిద్దాం.... 

కథ


    ఆదిశేషు నాయుడు (నాజర్) భూదేవీ పురం భూస్వామి. ఇతడి చనిపోయిన మొదటి భార్య కి బోసుబాబు (జగపతి బాబు), జగదీష్ (నాని) అనే ఇద్దరు కొడుకులు. రెండో భార్య అర్జునమ్మ (మాలా పార్వతి) కి ఇద్దరు కూతుళ్ళు (రోహిణి, దేవదర్శిని), ఒక కొడుకు. మొత్తం ఐదుగురు సంతానం. దేవుడు బాబు (రావు రమేష్), సత్తిబాబు (నరేష్) అనే అల్లుళ్ళు. చంద్రమ్మ (ఐశ్వర్యా రాజేష్) అని మనవరాలు. అంతా కలిసి సుఖపడుతున్న ఉమ్మడి కుటుంబం.      

        గుమ్మడి వరలక్ష్మి (రీతూవర్మ) అని మండలంలో పనిచేసే ఒక వీఆర్వో. ఈమెని జగదీష్ ప్రేమిస్తూంటాడు. జగదీష్ ని చంద్రమ్మ పెళ్లి చేసుకోమని పోరుతూ వూంటుంది. జగదీష్ ఇంకో వూళ్ళో ఏదో చదువుతూ అప్పుడప్పుడూ వస్తూంటాడు. చిన్నప్పుడు తను చూసిన ఒక టక్ చేసుకున్న అధికారి విధి నిర్వహణలో కచ్చితంగా వుండడం ఆకట్టుకుని, తను కూడా అలాటి అధికారిలా ఉద్యోగం చేయాలని అప్పట్నుంచే టక్ చేసుకుని తిరగడం ప్రారంభిస్తాడు. 
   
        వీరేంద్ర నాయుడు (డానియల్ బాలాజీ), అతడి తమ్ముడు తిరుమల నాయుడు (తిరువీర్) వూళ్ళోనే బరితెగించిన దుష్టులు. ఎమ్మార్వోని కలుపుకుని భూములు లాక్కుంటారు. హత్యలు చేస్తారు. ఆదిశేషు నాయుడు ఇతణ్ణి ఎదుర్కొంటూ వుంటాడు. ఈ కక్షలు లేని గ్రామం చూడాలన్న కోరికతో వుంటాడు. ఇంతలో గుండెపోటుతో చనిపోతాడు. చనిపోతూ పెద్ద కొడుకు బోసుబాబుకి ఆస్తి పంపకాలు చెప్పి చనిపోతాడు. ఈ పంపకాలు బోసుబాబుకి నచ్చవు. ఉమ్మడి ఆస్తినంతా చెరబట్టి ఎవరికీ పంచేది లేదని పొమ్మంటాడు. ఇతణ్ణి వీరేంద్ర నాయుడు లోబర్చుకుని చంద్రమ్మని తమ్ముడికిచ్చి పెళ్ళి చేయించుకుని హింసించడం మొదలెడతాడు. వేరే వూళ్ళో వున్న జగదీష్ కి ఈ విషయాలు తెలిసి ఎమ్మార్వోగా తిరిగొచ్చి, పరిస్థితిని చక్కబర్చే కార్యక్రమం  ప్రారంభిస్తాడు...

ఎలావుంది కథ

      శ్రీకారం లో చూపించింది ఉమ్మడి వ్యవసాయపు కథైతే, టక్ జగదీష్ తో ఉమ్మడి కుటుంబపు కథ. శ్రీకారం లో అవాస్తవిక ఉమ్మడి వ్యవసాయం లాగే, టక్ జగదీష్ లో ఇప్పుడు అనుభవంలో లేని కాలగర్భంలో కలిసిపోయిన ఉమ్మడి కుటుంబాల పాత ఫార్ములా కథ. ఈ కాలం చెల్లిన, యూత్ అప్పీల్ వుండని కాన్సెప్ట్ ని పదుల కోట్లతో సినిమాలకి ఇంకా వాడుకోవడం విచిత్రమే.

        ఐతే ఏంటి - బ్రహ్మోత్సవం’, శతమానం భవతి’, అమ్మమ్మ గారిల్లు లాంటివి ఇటీవల రాగా లేనిది - మనం తీస్తే ఫ్యామిలీ, యూత్, మాస్ మసాలా వగైరా బాక్సాఫీసు అప్పీళ్ళన్నిటికీ జవాబిచ్చే స్టార్ మూవీ ఎందుక్కాదని నమ్మి తీసినా ఇంతే. ఎందుకంటే ఫ్యామిలీ, యూత్, మాస్ మసాలా బాక్సాఫీసు - ఇంకా ఏవైతే అప్పీళ్ళు వుంటాయో- అవన్నీఇలాటి కథలు దారితీసే కాలం చెల్లిన క్రియేటివ్ యాస్పెక్ట్ థాటికి హాంఫట్ అయిపోతాయి.  

        చిన్న కొడుకు అనే హీరో ఉమ్మడి కుటుంబంలో దారి తప్పిన అన్నని, చెదిరిన కుటుంబాన్నీ చక్కదిద్దే టెంప్లెట్ ఇంకా సినిమా కథేనా ఇప్పుడు? 54 ఏళ్ళ క్రితం 1967 లో ఎన్టీఆర్ నటించిన ఉమ్మడి కుటుంబం’, 49 ఏళ్ళ క్రితం 1972 లో కృష్ణ నటించిన పండంటి కాపురం’, ఆనాడింకా వున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉనికితో ఐడెంటిఫై అవడంవల్ల అంత హిట్టయ్యాయి. ఇవి కూడా అన్ననో తమ్ముడ్నో చక్కదిద్దే కథలే. అప్పట్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కాపాడాలి కాబట్టి అలాటి చక్కదిద్దే కథలతో సినిమాలొచ్చేవి. ఇప్పుడా వ్యవస్థే లేనప్పుడు చక్కదిద్దే సినిమా లేమిటి?

        ఈ కథలో ఒక ట్విస్టు హిడెన్ ట్రూత్ గా వుంది. దీని ప్రకారం జగదీష్, అతడి అన్న బోసుబాబు ఒక తల్లి పిల్లలు కాదని, ఆదిశేషు నాయుడి మొదటి భార్యకి పుట్టింది జగదీష్ ఒక్కడేననీ, ఒకానొక కీలక ఘట్టంలో బైటపడుతుంది. ఇలా ఆస్తికి ఏకైక వారసుడు జగదీషేననే టర్నింగ్ పాయింటు వచ్చాక- దీన్ని కూడా నీరుగార్చడంతో, ఈ హిడెన్ ట్రూత్ అనే జగదీష్ పాత్రకి అందివచ్చిన అస్త్రం - పాత్ర విలువల్ని ఉదాత్తంగా చిత్రించే అవకాశం లేకుండా చేసింది.

        ఈ ఉమ్మడి కుటుంబం కాన్సెప్టే కాలం చెల్లినదైదే, దీనికి బలహీన కథా కథనాలు తోడయ్యాయి. ఇందులో ఒక డైలాగు కూడా - దారితప్పిన చంటి బిడ్డకి అమ్మ చెప్పే కథ నీది  అని! ఇలాటి కథ అమ్మ చెపితే ఏం చెప్పిందో ఏమర్ధమవుతుందో పిల్లలకి. ఇది నిన్నుకోరి’, మజిలీ తరహా లైటర్ వీన్ గా తీయాల్సిన కథ మాత్రం కాదనేది తెలుసుకోవాల్సిన నీతి. ఏ తరహా మేకర్ ఆ తరహా కథలు తీసుకుంటే సేఫ్ గా వుండొచ్చని టక్ జగదీష్ చెప్తుంది.  

నటనలు సాంకేతికాలు

     పాత్రని బట్టి అది నడిపే కథ, ఆ పాత్ర నడిపే కథని బట్టి నటనా వుంటాయి. పాత్రని పక్కనబెట్టి కథకుడు దాని కథని తనే నడిపితే, ఇలా పాసివ్ నీరస పాత్రతో నీరస కథే, దాంతో నీరస నటనే వస్తుంది. కొన్ని జాతీయ మీడియాలో రివ్యూలు తప్ప, ఓవరాల్ గా రివ్యూలు మెతకగానే రాశారు. సోషల్ మీడియాలో ప్రేక్షకుల కామెంట్స్ మాత్రం అంత మృదువుగా ఏం లేవు. 90% హాహాకారాలే. నానికీ, నాని నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న దానికీ ఇంత ఎడం వుందన్న మాట. పాత్రని, దాని కథనీ జడ్జి చేయడంలో నాని విజ్ఞత ప్రదర్శించలేదు.

        నటన ఎంత బలహీనంగా వుందంటే, మాటలు కూడా డల్ గా, సరిగా విన్పించనంత గొణుక్కోవడం లాగా వున్నాయి. లోలోపల ఏదో సఫర్ అవుతున్నట్టు కన్పిస్తుంది పాత్ర. కాస్త స్టార్ హవా, కాస్త హుషారైన రోమాన్స్, ఇంటినిండా కుటుంబంతో ఫన్, ఎంటర్టయిన్మెంట్ లాంటి హై వైబ్రేషన్స్ తో కూడిన చిత్రీకరణలుంటే నష్టమేమిటి?

        ఫస్టాఫ్ లో పాత్ర ఎంత సీరియస్ మూడ్ తో వుంటుందో, సెకండాఫ్ లో అంత లో- వైబ్రేషన్స్ తో విషాదం తాండవిస్తూ వుంటుంది. అన్నిపాత్రలూ, కథా విషాదచ్ఛాయలలుముకునే వుంటాయి సెకండాఫ్ లో. నాని క్యారక్టరైజేషనే మేకింగ్ కీ, మొత్తం ప్యాకేజీకీ హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ లేకుండా చేసింది. బాక్సాఫీసు రెస్పాండ్ అయ్యేది ఈ ఫ్రీక్వెన్సీ కే.  వి లో లాగే ఇందులోనూ పాత్ర చిత్రణ విషయంలో కన్ఫ్యూజనే.   

        ఒక టక్ చేసుకుని స్ట్రిక్టుగా వుండే ఆఫీసరుని చూసి, తానూ అలా ఆఫీసరవ్వాలని చిన్నప్పట్నుంచీ టక్ చేసుకోవడం మొదలెట్టిన జగదీష్ ని చూసి, పాపం ఇంటా బయటా సరదాగా ఎవరూ ఆఫీసర్ గారూ అని పిలవకపోవడమనే లోటు - పాత్ర ప్రజెంటేషన్ని పట్టించుకోక పోవడం వల్ల జరిగింది.

        అలా పిలుస్తూ వుంటే టక్ చేసుకుని వున్న పాత్రతో సస్పెన్సు వుండేది- ఎందుకలా పిలుస్తున్నారని. ఎమ్మార్వోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ సస్పెన్సుకి సమాధానం దొరికేది. కథనమంటే ప్రశ్న రేకెత్తించి, తర్వాత జవాబివ్వడమనే డైనమిక్స్ అని అర్ధం జేసుకోకపోతే ఇంతే, మొత్తం డల్ వ్యవహారమైపోతుంది. పాత్రకి ప్రెజెంటేషన్ పరంగా ఈ బ్యాకప్ లోపించడంతో, టక్ చేసుకోవడానికి కారణమైన చిన్ననాటి ఫాంటసీ ప్రేక్షకులు ఆటలు పట్టించే స్థాయికి వెళ్ళింది.

        ఇంత కుటుంబ కథలో హీరోయిన్ రీతూవర్మ వీఆర్వో పాత్రకి హీరో కుటుంబంతో బాండింగ్ లేకపోవడం కొట్టొచ్చే లోపం. బయట హీరోని కలవడం, రెండు డైలాగులు చెప్పడం వరకే పాత్ర.  పై అధికారి రాత్రి గెస్ట్ హౌస్ కి రమ్మన్నప్పుడు అక్కడే లాగి కొట్టకుండా సైలెంట్ గా వుండిపోతే, హీరో పాత సినిమాల్లోలాగా కామెడీ కొట్టుడు కొట్టించి రక్షించడం హీరోయిన్ పాత్రకీ, హీరో హీరోయిజానికీ ఏమైనా మేలు చేసిందేమో కథకుడే చెప్పాలి. టాలెంటెడ్ నటి రీతూవర్మ ఇందులో వృధానే అయింది. 

    చంద్రమ్మగా ఐశ్వర్యా రాజేష్ అత్తింట్లో ఆరళ్ళు ఏనాటివి! హీరో పెళ్ళి కాదన్నాడన్న కోపంతో దుష్టుల ఇంటికి కొడలిగా వెళ్ళిపోయి ఏం సంకేతాలిచ్చింది? తాత ఆశయాలు గుర్తుకు రాలేదా? పైగా స్త్రీ హక్కులు టైపులో అలాటి మొగుడితో ఘర్షణ. స్త్రీ హక్కుల ఉద్యమమా, తెలిసి తెలిసి ఆ పెళ్ళి చేసుకున్న మూర్ఖత్వమా? కుటుంబ కథా పాత్రలు రాయడం అంత ఈజీ కాదేమో.  

        ఇక తల్లి అర్జునమ్మగా 115 సినిమాల మలయాళ నటి మాలా పార్వతి. హీరో తప్ప మిగతా నల్గురూ సొంత పిల్లలే అన్నది హిడెన్ ట్రూత్. ఆప్యాయతలు సమర్ధవంతంగా నటించగలదు. ఉన్నట్టుండి స్వార్ధపరురాలై పోయి పాత్రని దెబ్బతీయడమే సమస్య. పెద్ద కొడుకు బోసుబాబు, అంటే జగపతిబాబు, తన సొంత కొడుకేనన్న రహస్యం ఇప్పుడు కూడా దాచి, మనసు కరిగినప్పుడు అతనే ఆస్తి పంచుతాడని హీరోకి అడ్డు పడుతుంది. తల్లి మాట విన్నందుకు ఒక అక్క కూడా హీరోని దూరం పెడుతుంది. పాత్రలన్నీ ఆస్తికోసం అర్రులు చాచేవే, హీరో సహా.

        విలన్ గా మారే జగపతి బాబు పాత్ర ఒక్కటే పర్ఫెక్ట్ గా వుంటుంది. విలన్ చేసేదే చెడ్డ పనులైనప్పుడు తప్పులేం వెతుకుతాం. విలన్ ఈజ్ ఆల్వెస్ రైట్ వాడి పాత్ర కొద్దీ. జగపతి బాబుకి ఇలాటి పాత్రలు, నటనలు  కొత్త కాదు.

        రావురమేష్, నరేష్, రఘుబాబు, సీవీఎల్ నరసింహా రావు, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి, దేవదర్శిని - ఇంకా చాలా మంది నటీ నటులున్నారు గానీ వీళ్ళ పాత్రలు నామ మాత్రమే. డేనియల్ బాలాజీ, తిరువీర్ పాత విలనీని ప్రదర్శిస్తారు. ఈ గ్రామీణ కథలో లొకేషన్స్ బావున్నాయి. ఛాయాగ్రహణం బావుంది. సంగీతం ఓ మోస్తరు. ఒకప్పుడు సినిమా ఎలా వున్నా ఒకదాన్ని మించొకటి ఆరు హిట్ పాటలుండేవి. మధ్యమధ్యలో వచ్చే రొడ్డ కొట్టుడు కథ పట్టించుకోకుండా, పాటలు మాత్రం ఎంజాయ్ చేసి హిట్ చేసే వాళ్ళు. ఈ అదృష్టం కూడా ఇప్పుడు లేదు.  

చివరికేమిటి

      ఇప్పుడు అసలు ప్రశ్న! హీరో నాని ఎమ్మార్వో పాత్ర దేనికి వుందన్న ధర్మ సందేహమొకటి. తను ఎమ్మార్వోగా లేకపోతే వచ్చే నష్టమేమిటన్న ఆత్మఘోష. ఆస్తి మీద అన్న కోర్టు నుంచి స్టే తెచ్చుకుని సమస్య సృష్టించడం కథని మలుపు తిప్పి, నాని పాత్రకి గోల్ ని ఏర్పాటు చేసే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. ఈ గంటా ఇరవై నిమిషాలూ ఫస్టాఫ్ చివర్లో తండ్రి మరణం, అన్న స్టే తెచ్చుకోవడం తప్ప - ఈ సుదీర్ఘమైన బిగినింగ్ విభాగపు బిజినెస్ కొత్తగా ఏమీ వుండదు. కొత్తగా వూహించి చూపించిందేమీ లేదు. చాలా సినిమాల్లో రన్ అయివున్న అవే ఫ్యామిలీ కాపీ సీన్లు టెంప్లెట్స్ గా పడిపోతూంటాయి, గ్రామ కక్షలతో బాటు.

        ప్రశ్న హీరో నానికి ఎమ్మార్వో పాత్ర ఎందుకన్నదే. అన్న స్టే తెచ్చుకోవడంతో కథ ప్రారంభమైనప్పుడు, ఆ కథలో ఎమ్మార్వోగా తానేం చేయలేనప్పుడు దేనికా పాత్ర? అన్న స్టే తెచ్చుకోవడంతో అది కోర్టు పరిధిలో కెళ్ళిపోయిన సమస్య అయిపోయింది. తన చేతిలో ఏమీ లేదు. తన మెజిస్టీరియల్ అధికారాలెందుకూ పనికి రావు. ఇక అన్నకి ఓ తమ్ముడుగా కోర్టు కెళ్ళి సివిల్ కేసు పోరాడుకోవడమే. ఎమ్మార్వోగా అధికార పరిధిలో కాదు. ఇంత లొసుగు వుంది ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటులో. నాని ఎమ్మార్వో పాత్రనే క్యాన్సిల్ చేసే లొసుగు. ఇలా యెలా తయారు చేసుకుంటారు కథ?

        తన ప్రభుత్వాధికారం పనికి రాదు గనుక ఇంట్లో చెప్పి కోర్టులో స్టే వెకేట్ చేసేందుకు సహకరించమంటాడు. ఇది ప్రైవేట్. తర్వాత తల్లి అడ్డుకుని అలా చేస్తే ఒట్టని ఒట్టే యించుకుంకోవడంతో ఆగిపోతాడు. ఇది కూడా ప్రైవేట్. ఆ తర్వాత లాయర్ ఇందాక పైన చెప్పుకున్న హిడెన్ ట్రూత్ వెల్లడించడంతో, ఎవరికీ చెప్పవద్దంటాడు. ఇది కూడా ప్రైవేటే. ఇన్ని చిక్కుల్లో ఎమ్మార్వోగా చేయడానికేమీ లేదు. చివరికి అన్నతో తేల్చుకోవడమూ, విలన్ల అంతు చూడ్డమూ అంతా ప్రైవేటే. మరి ఎమ్మార్వో పాత్ర దేనికి? ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ ముందు ఎమ్మార్వోగా ఎంట్రీ ఇచ్చిన ఐదు నిమిషాలకే, జగపతి బాబు అడ్డం తిరగడంతో ఎమ్మార్వో పాత్ర ఔటై పోయింది! కథకి పనికి రాకుండా పోయింది. హీరో పాత్ర అవసరం లేకుండా చేసే ఇంత బ్లండర్ ఇంకే  సినిమాలోనూ చూడం.

        ఎమ్మార్వోగా ఎంట్రీ ఇచ్చాక ఒక సీన్లో నేను మెంటల్ రౌడీ ఆఫీసర్ అంటాడు. ఈ మాట ప్లాట్ పాయింట్ వన్ లో అనిపించి పాత్రని మార్చేసి వుంటే పోయేదేమో. జగపతి బాబు స్టే తెచ్చుకోవడం ఎలాటి ఆయుధమో గ్రహించినట్టు లేదు. నువ్వు ఎమ్మార్వోగా వచ్చావా నాయనా? ఐతే నేను స్టే తెచ్చుకున్నాను, ఇప్పుడు ఏ పవర్స్ తో ఏం చేసుకుంటావో చేసుకో ఫో అని వుంటే, ఒక బలమైన డ్రమేటిక్ క్వశ్చన్ పుట్టేది కథ బలంగా నడవడానికి.

        నానికి నిషా దిగి, ఎమ్మార్వోగా పవర్స్ లేవని అర్ధమై- ఐతే నేను మెంటల్ రౌడీ ఆఫీసర్ని! అని కౌంటర్ ఇస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకుని దిగిపోతే, అదో రచ్చ చేసే ఎమ్మార్వో క్యారక్టరైనా అయ్యేది, బతికేది.

        హిడెన్ ట్రూత్ సంగతికొస్తే, ఇది వెల్లడించే లాయర్ (సీవీఎల్ నరసింహారావు) సిన్సియర్ లాయర్ అన్పించడు. ఎందుకంటే, ఆదిశేషు నాయుడు చనిపోతున్నప్పుడు తను అక్కడే వుండి, ఆస్తి పంపకం గురించి చెప్పిన మాటలు వింటాడు. కానీ సైలెంట్ అయిపోతాడు. హిడెన్ ట్రూత్ విషయానికొచ్చేసరికి జన్మ రహస్యం నానికి చెప్పేస్తాడు. సరే, నాని ఇప్పుడేం చేయాలి- ఆస్తికి తను వారసుడైనప్పుడు, ఈ నిజం జగపతి బాబుకి చెప్పేసి - నేను ఆస్తికోసం లేను, ఆస్తిని నువ్వు ఇంట్లో అందరికీ పంచేసేయ్- అని వెళ్ళిపోతే పాత్ర ఉదాత్త పాత్రగానైనా మారేది.

        డబ్బు కాదు కుటుంబ బంధాలు ఎంత ముఖ్యమో చెప్పడానికీ సినిమా తీశామన్నా రు. ఇందులో పోట్లాట అంతా డబ్బు కోసమే కదా. హీరో, విలన్ సహా ఇంట్లో ఎవరికి వాళ్ళ తగువులాట ఏమిటి. విలన్ ఆస్తితో పోతే పోయాడు, మనమంతా కలిసి వుందామని ఎందుకనుకోరు. కుటుంబ సినిమాలు తీయాలంటే చాలా మెచ్యూరిటీ అవసరమేమో. ఇలా యాక్టివ్ పాత్ర, సరైన కాన్ఫ్లిక్ట్, గోల్ లాంటి కనీసావసరాల్లేకుండా రాస్తే స్క్రీన్ ప్లే అయిపోతుందా?

సికిందర్  
 

4, సెప్టెంబర్ 2021, శనివారం

1056 : రివ్యూ

 రచన - దర్శకత్వం:  ఎస్. దర్శన్
సుశాంత్, మీనాక్షీ చౌదరి, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, వెంకట్, రవి వర్మ తదితరులు 
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణం : ఎం సుకుమార్
బ్యానర్ : ఏవన్ స్టూడియోస్, శాస్త్ర మూవీస్
నిర్మాతలు: రవి శంకర్ శాస్త్రి, ఏకతా శాస్త్రి, కె హరీష్
విడుదల : 27 ఆగస్టు, 2021
***
      సుశాంత్ నటించిన ఏడు సినిమాల్లో చిలసౌ’, అల వైకుంఠపురం రెండే చెప్పుకోదగ్గవిగా నమోదయ్యాక, ఎనిమిదో సినిమాగా ఇచ్చట వాహనములు నిలుపరాదు తెరపై కొచ్చింది. ఒక కొత్త దర్శకుడితో  చిలసౌ లాంటి వినూత్న ప్రయత్నం చేశాడు తను. ఇప్పుడు ఇంకో కొత్త దర్శకుడితో మరో వైవిధ్యాన్ని అందించాలన్న తపనతో ఈ సినిమా చేసినట్టుంది. ఇందులో కొత్త హీరోయిన్ మీనాక్షీ చౌదరి తోడయ్యింది. హీరో హీరోయిన్లుగా ఇద్దరూ బావున్నారు. మరి కొత్త దర్శకుడు ఎస్ దర్శన్ ఈ ఇద్దరితో కలిపి చేసిన కృషి ఏమైనా కొత్తగా వుందా? సినిమాలో కొత్తదనం పక్కన పెడదాం, అసలు కొత్త దర్శకుడంటే అర్ధమేమిటి? ఏం చేస్తే కొత్త దర్శకుడన్పించుకుంటాడు? ఇవి తెలుసుకోవడానికి సినిమాలోకెళ్దాం...

కథ

    అరుణ్ (సుశాంత్) ఓ ఆర్కిటెక్ట్. అదే కంపెనీలో ఆర్కిటెక్చర్ ఇంటర్న్ గా చేరుతుంది మీనాక్షి (మీనాక్షీ చౌదరి). ఇద్దరూ ప్రేమలో పడతారు. ఈమెకో అన్న నర్సింగ్ యాదవ్ (వెంకట్) అనే కార్పొరేటర్ వుంటాడు. ఇతనుండే కాలనీలో దొంగతనాలు జరుగుతూంటే కాలనీ వాసుల చేత గస్తీ ఏర్పాటు చేస్తాడు. ఒక రోజు అన్న వూరికెళ్ళింది చూసి అరుణ్ ని ఇంటికి రమ్మంటుంది మీనాక్షి. కొత్త బైక్ కొనుక్కుని వెళ్తాడు అరుణ్. నో పార్కింగ్ బోర్డున్న ఇంటి ముందు బైక్ ఆపి లోపలికెళ్ళి, ఈ ఇల్లు కాదని పక్క ఫ్లాట్లోకి వెళ్ళి మీనాక్షిని కలుసుకుంటాడు. అదే సమయంలో తను వెళ్ళిన ఇంట్లో వుంటున్న ఓ సీరియల్ నటిని చంపి దోచుకుని పారిపోతాడు ఓ దొంగ. ఇంటి ముందు బైక్ చూసిన గస్తీ ప్రజలు దొంగ ఇక్కడే వున్నాడనుకుని కాలనీని దిగ్బంధం చేసి గాలించడం మొదలెడతారు. జరిగింది తెలుసుకున్న అరుణ్, మీనాక్షీ వాళ్ళ ఫ్లాట్ లో ఇరుక్కుంటాడు. ఇప్పుడు ఈ ఫ్లాట్లోంచి ఎలా సురక్షితంగా బయటపడి, నేరం తాను చేయలేదని  నిరూపించుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

      జానర్ రీసెర్చ్ మర్చిన కిల్లర్ అయిడియా. ఈ బాపతు కిల్లర్ - అంటే కత్తి లాంటి అయిడియాని ఏ జానర్లోకి కూర్చి తీయవచ్చో తెలుసుకోకుండా కల్పన చేసుకున్న ఓ మూస కథ. 'డైహార్డ్' టైపు హాస్టేజ్ జానర్ డ్రామాని డిమాండ్ చేస్తున్న అయిడియాని, 'సి గ్రేడ్' కింద కిష్కింధ చేసుకున్న కథ. పారిపోయిన నేరస్థుడు ఒకింట్లో మనుషుల్ని బందీలుగా పట్టుకుని సృష్టించే డ్రామా హాస్టేజ్ డ్రామా అయినప్పుడు, ఇదే పరిస్థితిని నేరారోపణ ఎదుర్కొంటున్న ఓ అమాయకుడి మీద రివర్స్ ప్లే చేస్తే, కొత్త కథగా మారిపోయే ఈ అయిడియాని  - అనాలోచిత రాత తీతలతో వృధా చేసుకున్న అవకాశం. 

        బహుశా అమాయక పాత్ర ఇలాటి పరిస్థితిలో ఇరుక్కుని తానుగా సృష్టించే హాస్టేజ్ డ్రామా అయిడియాగా సినిమాలు రాలేదు. ఈ ఇన్నోవేషన్ ని జారవిడుచుకుని తనదైన ముద్రతో ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. మొదటి సినిమా పట్టుకోవడానికి ఎన్నో సంవత్సరాలు యాతన పడతారు. తీరా ఆ మొదటి సినిమాతో ముద్ర వేయకపోతే మళ్ళీ అదే యాతన రీప్లే. ఈ ముందున్న మొసళ్ళ పండగని తెలుసుకుంటే ఇలా చుట్టేయరు మొదటి సినిమాని. కొత్త దర్శకుడు కొత్తని దర్శించక పోతే మళ్ళీ పాత స్ట్రగులే. ఇలా ఈ అయిడియా డిమాండ్ చేస్తున్న మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ రెండూ చెల్లకుండా పోతాయి. 1955 లో 'డెస్పరేట్ అవర్స్' నుంచీ, 1988 లో 'డైహార్డ్' మీదుగా, 2021 లో 'రోగ్ హాస్టేజ్' వరకూ నేరస్థుల మీద వందల్లో వున్నాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి అమాయకుడి మీద కథగా కొత్త తరహా థ్రిల్లర్ గా మార్చుకునే ఛాన్సు ఇది మౌలికంగా.

        మొదటి కోవిడ్ కి పూర్వం జనవరి 2020 లో ఈ సినిమా ప్రారంభమైంది. కోవిడ్ కారణంగా సెప్టెంబర్ లో తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ఈ విరామంలో ఓటీటీ వల్ల మారిన బిజినెస్ మాడెల్ దృష్ట్యా ఈ మూస కథని, మేకింగ్ నీ మార్చుకునే ఆలోచన చేయలేదు. 2021 లో రెండో కోవిడ్ కూడా వచ్చి పడి ఓటీటీ ఇంకింత విజృంభించింది. అయినా రెండో కోవిడ్ తర్వాత ఈ ఆగస్టులో అదే మూస మోడల్ తో విడుదలై గల్లంతైపోయిందీ సినిమా. కోవిడ్ ఒక్కటే సినిమాలని ఆపితే నష్టమేం లేదు. కోవిడ్ లో సందు చూసుకుని దాన్ని మించిన వైరస్ లా తిష్టవేసిన ఓటీటీయే ఇలాటి మూసలకి చావుదెబ్బ. ప్రేక్షకులు ఓటీటీలో ఏమేం చూస్తున్నారో కాస్త తెలుసుకుని ఇలాటి చిన్న సినిమాలు తీస్తే సొమ్మేం పోదు.

నటనలు- సాంకేతికాలు  

    2018 లో హీరోగా సుశాంత్ చిలసౌ అనే ఫర్వాలేదన్పించుకున్న ప్రయోగాత్మకం నటించింత్తర్వాత, ఈ రెండో ఎంపిక ట్రాక్ తప్పింది. కథ ఏమీ లేకుండానే ఒకే రాత్రి జరిగే కథతో సినిమా అంతా కూర్చోబెట్ట గల్గిన రియలిస్టిక్ రోమాంటిక్ డ్రామెడీ చిలసౌ. కొత్తగా దర్శకత్వం చేపట్టిన నటుడు రాహుల్ రవీంద్రన్, దీంతో కాస్త  వాస్తవ జీవితాలు ఉట్టిపడే రియలిస్టిక్  ప్రేమ సినిమాల కొరత తీర్చడంతో సుశాంత్ కా మాత్రం తలెత్తుకునే అవకాశం లభించింది. రాహుల్ రవీంద్రన్ కి ఉత్తమ స్క్రీన్ ప్లే జాతీయ అవార్డు లభించడంతో బాటు, ఉత్తమ నూతన దర్శకుడుగా నామినేట్ అయ్యాడు. రుహానీ శర్మ ఉత్తమ నటిగా, వెన్నెల కిషోర్ ఉత్తమ హాస్య నటుడుగా నామినేట్ అయ్యారు. ఈ వైభవమంతా ఎక్కడికి పోయింది.   

జానర్ ని మన్నిస్తూ చిలసౌలో హీరోహీరోయిన్లే ఒకరికొకరు ప్రత్యర్ధులు కావడంతో పాత్రల లోతుపాతుల్లో కెళ్ళి నటించడానికి ఒక ఆధారమంటూ ఇద్దరికీ దొరికింది. ప్రస్తుత ప్రయత్నంలో ఆధారమే లేదు సుశాంత్ తో బాటు మీనాక్షి పాత్రకీ. సుశాంత్ యువ ప్రేమికుడుగా ఫ్రెష్ గా, వైబ్రంట్ గా నటించాడు తప్పితే పాత్రలో విషయం లేదు. విషయం లేకపోవడంతో ఫస్టాఫ్ లో ఎంటర్ టైన్ చెయ్యడు. ఆర్కిటెక్చర్ పాత్ర దేనికో తెలీదు. ప్రేమిస్తున్న హీరోయిన్ కోసం ఓ అద్భుత స్ట్రక్చర్ ని నగరం మధ్య నిలబెట్టడం లాంటి డ్రీమ్ కూడా వుండదు. ఆర్కిటెక్చర్ అన్పించే ప్రవర్తన, మాటలూ వుండవు. నటిస్తున్నది ఒక క్యారక్టర్ అన్న భావమే కనపడదు.

        సెకండాఫ్ లో కథలో కొచ్చి హీరోయిన్ ఇంట్లో ఇరుక్కున్నప్పుడు అర్ధవంతమైన డ్రామా లేకపోవడంతో కథతో బాటు పాత్రా చెల్లాచెదురై నటుడిగా చూపించుకునేందుకు ఏమీ మిగల్లేదు. హాస్టేజ్ డ్రామా క్రియేట్ చేసివుంటే నటించడానికి వుండేది. ఇక్కడున్న పరిస్థితితో స్ట్రగుల్ చూపించడం మానేసి, దీంతో సంబంధం లేని బయటెక్కడో తల్లికి యాక్సిడెంట్ కల్పించి - ఆ మదర్ సెంటిమెంటుతో అతకని ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తే నటన ఏం ఆకట్టుకుంటుంది. హీరోయిన్ తో కూడా ఇలాగే ఎమోషనల్ ఎటాచ్ మెంట్ లేక సుశాంత్ యాంత్రికమై పోయాడు. ఫస్టాఫ్ గంటా ఇరవై నిమిషాలు హీరోయిన్ తో సాగించిన రోమాన్స్ కి సెకండాఫ్ లో అర్ధమే లేదా?

        డైహార్డ్ లో బ్రూస్ విల్లీస్ భార్యతో చెడిన సంబంధాల్ని మెరుగు పర్చుకోవడం కోసం ఆమె ఆఫీసుకెళ్ళి, క్రిమినల్స్ జరిపే దాడిలో హాస్టేజ్ డ్రామాలో ఇరుక్కుంటాడు. సుశాంత్ కూడా ఫస్టాఫ్ లో మీనాక్షితో చెడి ఆమె ఇంటికెళ్ళి ఇరుక్కుని వుంటే, ఒక అర్ధవంతమైన ఎమోషనల్ డ్రామా ఇన్నర్ స్ట్రగుల్ గా క్రియేటయ్యేది. నిరపరాధిగా ఇంట్లోంచి ఎలా బయటపడాలన్నది ప్రధాన కథకి తగిన ఔటర్ యాక్షన్ గా వేరే వుండేది.

        మీనాక్షి స్లిమ్ గా, గ్లామరస్ గా బావుంది. నటన కూడా వచ్చు సరైన పాత్రంటూ వుంటే. వెన్నెల కిషోర్ కామెడీ కుదర్లేదు. ప్రియదర్శిది కామెడీయే లేని ట్రాజడీ పాత్ర. కమెడియన్ - హీరో సునీల్ సెకండాఫ్ లో దొంగ ఎస్సై గా చేసిపోయే కామెడీ ఏమిటో అర్ధం గాదు. వెంకట్, రవి వర్మ, విలన్ కృష్ణ చైతన్య పాత్రలేం ఆకట్టుకోవు. సుశాంత్ తల్లిగా ఊర్వశి నటించింది.  ఇక సంగీతం గురించి ఏం చెప్పుకుంటాం. కెమెరా వర్క్ బావుంది.

చివరికేమిటి
     ఇది కూడా రెండున్నర గంటల సినిమా! వరుసగా రెండున్నర గంటలతో ఇలా బాదుతున్నారు. ఈ కథ చెప్పడానికి గంటన్నర కూడా ఎక్కువే. ప్రారంభ దృశ్యాలే మిగతా సినిమా ఎంత అద్భుతంగా వుంటుందో చెప్పేస్తాయి. ఈ కథని కూడా ఫస్టాఫ్, సెకండాఫ్ రెండు ఫ్లాష్ బ్యాకులుగా చూపించే క్రియేటివిటీ. ఫస్టాఫ్ లో సుశాంత్ బైక్ కొనడానికి కారణం చెప్తూ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే, అది దాదాపు గంట సేపు మీనాక్షితో విషయం లేని టెంప్లెట్ రోమాంటిక్ ట్రాకుని సాగలాగుతుంది. ఈ సేమ్ మోడల్ టెంప్లెట్ రోమాంటిక్ ట్రాకుని  గతవారమే శ్రీదేవి సోడా సెంటర్ లో చూడలేక ఆర్తనాదాలు చేశాం. ఇక ఎవరైనా సినిమా కెళ్ళాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని, బితుకుబితుకు మంటూ, టెంప్లెట్టేనా బాబూ? అని అడుక్కుని వెళ్ళాల్సిన పరిస్థితి. ఇంకో ఇరవై నిమిషాలకి ఆమె ఇంటికెళ్ళి ఇరుక్కుంటే గానీ ఇంటర్వెల్ కి ప్రారంభం కాని కథ. ఇదంతా బడ్జెట్ వృధా. ఇలా ఫస్టాఫ్ లో విషయం లేకపోయాక, ఇంటర్వెల్ సంగతితో సెకండాఫ్ చేయడానికి చేతులెత్తేయడంతో అంతా రసాభాస.

        ఏ ఇంట్లో దొంగ దాక్కున్నాడో వెతికే కాలనీ వాసులతో లెక్కలేనన్ని క్రౌడ్ దృశ్యాలు. ఏవేవో కామెడీ సీన్లు. ఇంటి ముందు బైక్ వుంది. ఆ బైక్ ని చూస్తారు. చూసినప్పుడు దాని నెంబర్ తో అదెవరి బైకో తెలుసుకుంటే పోయేడానికి, వచ్చిన పోలీసులూ కూడా దొంగెవరో పట్టుకునే గుడ్డి పరుగులే.        

       చేయని నేరానికి మీనాక్షీ ఫ్లాట్లో దాక్కున్న సుశాంత్, బయట పడలేక చివరికి పోలీసులు వచ్చేసే వరకూ మీనాక్షితో కంగారు పడుతూ వుండడమే. బ్రూస్ విల్లీస్ భార్యని మంచి చేసుకోవడాని కెళ్ళి ఇరుక్కున్నాడు కదా, సుశాంత్ కూడా ఫస్టాఫ్ లో మీనాక్షితో చెడినట్టు కథ రాయించుకుని, మంచి చేసుకోవడానికి ఆమె ఇంటి కెళ్ళినట్టు వుంటే, ప్రేమ కథకి సెకండాఫ్ లో బలం కదా. ఆమె వినకపోతే బయటపడడానికి ఆమెనే బందీగా పట్టుకుని హాస్టేజ్ డ్రామా క్రియేట్ చేసుకుని- పోలీసులతో, కాలనీ గుంపుతో ఒక హీరోగా ఆడుకోవచ్చు కదా. బైక్ ని ప్రధానంగా చేసి వరుణ్ సందేశ్ తో కుర్రాడు తీస్తే పోయింది, రాజ్ తరుణ్ తో లవర్ తీస్తే పోయింది. ఇక మూడో దానికి పార్కింగ్ ఎక్కడుంటుంది? 

సికిందర్