రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

6, అక్టోబర్ 2020, మంగళవారం

984 : రివ్యూ


 

      దెయ్యాలున్నాయా లేవా? వున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని అవి స్వాధీనం చేసుకుని స్వాహా చేసేస్తాయి. తమ కథల్ని చెప్పనివ్వవు. మీడియా మేనేజ్ మెంట్. రాజకీయ నాయకుల నుంచి నేర్చుకున్నాయి. సైలెన్స్ ప్లీజ్... అని నోరూ చెవులు కూడా మూసేస్తాయి. నిశ్శబ్దం పాటించాలి. తమిళ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్స్ సృజనాత్మకతా పరంగా నిశ్శబ్దం పాటిస్తున్నాయి. అవి అదే అనాథాశ్రయంలో ఇద్దరు అనాథ బాలికల అవే పాత కథల్నుంచీ పదేపదే పేదగా పుట్టుకొస్తాయి. సమకాలీనంగా ఇంకే సమస్యలూ లేనట్టు. పదే పదే గత కాలంలోనే పేదగా జీవించే సస్పెన్స్ థ్రిల్లర్స్ కి దెయ్యాల దర్బారు నుంచి విముక్తి లేదు. ఆ నిశ్శబ్దం కాస్తా నీరుగారి దెయ్యపు కచేరీలతో నిండిపోతుంది…  
    30 కోట్లు పెట్టి తీయాలనుకున్నప్పుడు మూడుండాలి : ఏం తీస్తున్నాం, ఎందుకు తీస్తున్నాం, ఎలా తీస్తున్నామనే ప్రశ్నలు. కమర్షియల్ లాభ నష్టాలతో ముడిపెట్టి జవాబులు. పరమాద్భుత లొకేషన్స్, కళ్ళు చెదిరే తారాగణం, అదిరిపోయే ప్రొడక్షన్ విలువలు ఇవి కావు జవాబులు. ఇవి పోయే డబ్బులు వచ్చే డబ్బుల లెక్కలు కావు. పేపరు మీద రాస్తున్నప్పుడే వచ్చే డబ్బులా పోయే డబ్బులా తెలిసిపోకపోతే తీయడం మభ్యపెట్టుకోవడమే. మొదటి ప్రయత్నం తోనే మభ్యపెట్టుకున్నామని తెలుసుకోకపోతే ఆ అలసత్వానికి అంతం లేదు. దర్శకుడు హేమంత్ మధుకర్ 2010 లో హిందీలో తీసిన దెయ్యం సినిమా ఏ ఫ్లాట్ పరాజయం గురించి ఎవరేమన్నారో తెలిసీ అప్రమత్తమవక పోతే  మభ్య పెట్టుకునే నిశ్శబ్దాలు చాలానే వుంటాయి. 

    సస్పెన్స్ థ్రిల్లర్ అత్యంత సంక్లిష్ట జానర్. హిచ్ కాక్ అంతటి వాడికే పట్టుబడలేదు. తీసే ప్రతీ సస్పెన్స్ థ్రిల్లర్ అతడికి యాతనే. మూస ఫార్ములాలు చేస్తూ సరదాగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ లాగిద్దామనుకుంటే సాగే పనికాదు. సస్పెన్స్ థ్రిల్లర్ ఫుల్ టైమ్ జాబ్. సస్పెన్స్ - క్రైమ్ జానర్లో తలపండిన వాడికి ఇతర జానర్లు నల్లేరు నడక. ఎందుకంటే కథలకి కావాల్సిన మనస్తత్వ చిత్రణ, భావోద్వేగాలు, సమయస్ఫూర్తి, కాలీన స్పృహ, లాజిక్, డైనమిక్స్ వంటి కథాంగాలు వొంటబట్టి వుంటాయి క్రైమ్ జానర్లో.

     నిశ్శబ్దం  తమిళంలో  సైలెన్స్  మొదట మాటలు లేకుండా మూకీగానే తీయాలనుకున్న ఆలోచన. మనసు మార్చుకుని మాటలు జోడించిన ప్రయత్నం. ఈ మాటలు జోడించడం మామూలుగా లేదు. మూకీ అనే మాటల అనావృష్టి నుంచీ అతి వృష్టి కురిపించే క్రియేటివిటీ. నటులకున్న మాటలు చాలనట్టు వాయిసోవర్ల కుండపోత. ఎవరి వాయిసోవర్ ఎందుకో అర్ధం కాకుండా సాంతం స్వగతాల జడివాన. డాక్యుమెంటరీ చూస్తున్నట్టు డైజెటిక్ సౌండ్. డైజెటిక్ సౌండ్, ఇంట్రా డైజెటిక్ సౌండ్ ఎప్పుడు ఎలా ఎందుకు వాడాలో తెలుసుకోకుండా శబ్ద గందరగోళం. కథలో ఏం జరుగుతోందో వంతులేసుకుని వ్యాఖ్యాతలు వివరిస్తే గానీ అర్ధంగాని పరిస్థితి వుంటే కథని శానిటైజ్ చేయాలి. దాని విజువల్ స్టోరీ టెల్లింగ్ నేచర్ కి వైరస్ సోకి వుంటుంది. సినిమా తీస్తే ఇతరులు నేర్చుకునేట్టు వుండాలి గానీ నేర్చుకున్నది పోయేట్టు వుండకూడదు.

    మరి నిశ్శబ్దం కర్ధమేమిటి? ఈ అర్ధమే పట్టుకోగలిగి వుంటే సినిమా ఎక్కడో వుండేది గ్లోబల్ చార్ట్ లో అనూష్కాని తళతళ మెరిపిస్తూ. ఇది జానర్ రీసెర్చి చేసుకుని ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో (1955) టెక్నిక్ తో తీయాల్సిన 41 మిలియన్ డాలర్ల స్టార్ మూవీ. జానర్ రీసెర్చా? అదేమిటి? అదేమిటో తెలియాలంటే వీధి బడి దశ నుంచీ సినిమా నేర్చుకుంటూ రావాల్సి వుంటుంది.

కథ 

        సాక్షి (అనూష్కా) మూగ చెవిటి పెయింటర్. తల్లిదండ్రులెవరో తెలీదు. యూఎస్ లో అనాథాశ్రయంలో పెరిగింది సోనాలీ (శాలినీ పాండే) తో బాటు. ఆమెకి సియాటిల్లో ఆర్ట్ గ్యాలరీ నుంచి పిలుపు వస్తుంది. అక్కడ పెయింటింగ్ వేసి విజిటింగ్ కి వచ్చిన సెల్లో ప్లేయర్ ఆంథోనీ గోన్సాల్వేస్ (మాధవన్) ని ఇంప్రెస్ చేస్తుంది. తన కన్సర్ట్ కి అతనా హ్వానిస్తే వెళ్తుంది. అలా పరిచయం పెరిగి అతడికి పెయింటింగ్ నేర్పుతుంది, అతను మ్యూజిక్ నేర్పుతాడు. ఇక ప్రేమ పుడుతుంది. ఎంగేజిమెంట్ చేసుకుని అతణ్ణి తీసుకుని ఒక శిథిల విల్లాలో జోసెఫైన్ వుడ్స్ అనే ఆమె పెయింటింగ్ అన్వేషణలో బయల్దేరుతుంది. ఆ విల్లాలో 47 ఏళ్ల నుంచీ దాని ఓనర్ దెయ్యం వుంటుంది. అది వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చంపేస్తూంటుంది. ఇప్పుడు ఆంథోనీని కూడా చంపేస్తుంది. సాక్షి పారిపోతుంది. 

    సియాటిల్ పోలీస్ డిపార్ట్ మెంట్ డిటెక్టివ్ మహాలక్ష్మి (అంజలి) కేసు టేకప్ చేస్తుంది. ఆమెకి తోడుగా కెప్టెన్ రిచర్డ్ డాకిన్స్ (మైకేల్ మాడ్సెన్) దిగుతాడు. అయితే విల్లాలో కేసుకి సంబంధించి ఆధారాలేవీ దొరకవు. మరోవైపు చూస్తే కొందరు యువతుల మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. సోనాలీ కూడా అదృశ్యమవుతుంది. సోనాలీని ఆంథోనీ హత్య కేసులో అనుమానిస్తుంది మహాలక్ష్మి. సొనాలీని వెతకడం మొదలుపెడుతుంది.

    ఇప్పుడు సోనాలీని ఎందుకనుమానించింది మహాలక్ష్మి? సోనాలీకున్న మానసిక సమస్యేమిటి? ఆంథోనీకి కూడా వున్న మానసిక రుగ్మతేమిటి? ఈ ఇద్దరి మధ్యా సాక్షి స్థానమేమిటి? విల్లాలో ఆమె చూసింది ఎంత వరకు నిజం? ఈ మొత్తం కేసులో కెప్టెన్ రిచర్డ్ పొందాలని చూసిన ప్రయోజనా లేమిటి? ఇదంతా మహాలక్ష్మి ఎలా పరిష్కరించి దోషిని తేల్చింది? ఇదీ మిగతా కథ.  
నటనలు- సాంకేతికాలు

         నటనల గురించి చెప్పుకోవాలంటే పాత్రల గురించి చెప్పుకోవాలి. పాత్ర చిత్రణల్లో లోపాలుంటే ఎంతటి నటనలూ మెప్పించలేవు. అనూష్కా సాక్షి పాత్ర అలాటి లోపాలున్న ఈ సినిమా పాత్రల్లో ప్రధానమైనది. దీంతో ఆమె నటన ఉపరితలంలోనే వుండి పోతోందే తప్ప ఇన్నర్ ఎమోషన్లు పలికే పరిస్థితి లేదు. అసలు ఇన్నర్ ఎమోషన్లు లేనట్టే వుంటాయి పాత్ర చిత్రణ, నటనా. సైన్ లాంగ్వేజీ, అప్పుడప్పుడు ఫోన్లో టైపు చేసి వాయిస్ ఇన్ఫర్మేషన్ వంటి ఉపకరణాల ద్వారా సాధారణ సమాచారాన్ని తెలుపుతుంది తప్ప, డ్రామాకి ముఖ్యమైన తన ఇన్నర్ ఎమోషన్స్ ని అర్ధమయ్యేలా చెప్పడంలో వుండే స్ట్రగుల్ తో కూడిన ఉద్విగ్నభరిత సన్నివేశాలుండవు. పోనీ బొమ్మవేసి చూపే ప్రయత్నం చేసే ఆడియెన్స్ ఫ్రెండ్లీ మెలోడ్రామా వుండదు. ఇన్నర్ ఎమోషన్సే లేనప్పుడు ఇక  అయ్యోపాపం అన్పించే స్ట్రగుల్ ఏ రూపంలోనైనా ఎందుకుంటుంది. అసలొక మూగజీవి అయిన సాక్షి లాంటి పెయింటర్ కి పెయింటింగ్సే తన భాష, మాధ్యమం కాకుండా పోతాయా? తనని కుదిపేస్తున్న భావోద్వేగాల్ని కుంచె ద్వారా ప్రకటించకుండా ఏ చిత్రకారుడుండ గలడు? లేనప్పుడు అలాటి పాత్ర ఎందుకు? సాక్షి మూగజీవి పాత్రకి లాగే ఆమె పెయింటరన్న వృత్తిపరమైన పాత్ర చిత్రణ కూడా లేదు. టెంప్లెట్ సినిమాల్లో టెంప్లెట్ పాత్రలాగే రెండు పెయింటింగు లేయించి గొప్ప పెయింటరని చెప్పి, పది మిలియన్ డాలర్లతో బ్రహ్మాండమైన బిల్డప్పిచ్చి వదిలేశారు. మళ్ళీ ఈ పాత్ర చిత్రణ తాలూకు కొనసాగింపే వుండదు. ఒకసారి బర్ఫీ లో రణబీర్ కపూర్ ని చూస్తే తెలుస్తుంది మూగజీవి సమగ్ర పాత్రంటే ఏమిటో.

పాత్రకి కథతోనే సమస్య 

        సమస్య ఎక్కడొచ్చిందంటే, అసలీ సస్పెన్స్ థ్రిల్లర్ కథ అనూష్కా పాత్ర కథ అని తెలుసుకోక పోవడం దగ్గర వచ్చింది. స్టార్ హీరోయిన్ తో హీరోయిన్ ఓరియెంటెడ్ హంగామా తీస్తున్నప్పుడు ఆమె మీదే కథ వుండాలని కలం పుచ్చుకుని రాస్తాడు రచయిత. అంతేగానీ ఆమెని అవతలికి లాగేసి, ఇతర పాత్రలతో కథ గిల్లుకుంటూ కూర్చోడు. ఇలా ఎందుకు జరుగుతుందంటే అసలు కథే౦టో అర్ధం గాకపోతేనే. అందుకే ఇన్ని ఇతర పాత్రలతో ఇన్ని ఫ్లాష్ బ్యాకులు, వాళ్ళ వాయిసోవర్లు. కథతో అయోమయం వుంటేనే అర్ధం లేని ఫ్లాష్ బ్యాకులతో హడావుడి చేస్తారంటాడు సిడ్ ఫీల్డ్. 

    సెంట్రల్ క్యారక్టర్ గా అనూష్కా మీద కథా, పాత్రచిత్రణా ఎలా వుండి వుంటే అమెరికాలో తీసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్లో గ్లోబల్ ఎట్రాక్షన్ అయివుండేదో తర్వాత కథా కథనాలు విభాగంలో చూద్దాం.  

డిటో మాధవన్ 

      ఇక మాధవన్ గురించి. భారతీ రాజా దర్శకత్వంలో ఎర్రగులాబీ లు (సిగప్పు రోజాక్కల్ -  1980) లో కమలహాసన్ క్లాసిక్ సీరియల్ కిల్లర్ పాత్రని గుంజి నిశబ్దం లో గుంజీళ్ళు తీయించాడు. పుంజాలు తెంపుకుని పారిపోయింది పాత్ర. విశేషమేమిటంటే, ఇదే సీరియల్ కిల్లర్ కథని భారతీ రాజాయే రాజేష్ ఖన్నాతో హిందీలో రెడ్ రోజ్ గా తీస్తే అదీ సూపర్ హిట్టయింది. ఇప్పుడు ఇంత కాలం తర్వాత ఐఎండీబీ లో ఇప్పటి ప్రేక్షకులు రెడ్ రోజ్ ని చూసి ఆహా ఓహో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాటి థ్రిల్లర్ ని చూడలేదంటున్నారు అప్పటి రాజేష్ ఖన్నాని పొగుడుతూ. 

    నిశ్శబ్దం లోనే కెప్టెన్ రిచర్డ్ పోలీసు పాత్ర ఎక్కడిదనుకున్నారు? భారతీ రాజా థ్రిల్లర్ లోనే కమలహాసన్ / రాజేష్ ఖన్నా అమ్మాయిల్ని చంపుతూంటే చూసి ఎంజాయ్ చేసే సైకో పెంపుడు తండ్రి పాత్ర. మాధవన్ అమ్మాయిల్ని చంపుతూంటే రిచర్డ్ సహకరించడం డబ్బు కోసమన్నట్టుగా వుండదు. భారతీ రాజా థ్రిల్లర్లో తండ్రి పాత్రలాగా అతను సైకో అని మనమర్ధం చేసుకోవాలి. భారతీ రాజా థ్రిల్లర్ లోని కమల్ పాత్రని అదే కథతో మాధవన్ కథగా ముక్క అతికించి, అదే గొప్ప ఒరిజినల్ క్రియేషన్ అన్నట్టుగా చివర్లో సస్పెన్స్ రివీల్ చేశారు. 

    ఆంథోనీ పాత్రలో మాధవన్ కూడా డిటో అనూష్కా. కథ కుపయోగపడని అతడి సంగీతం. ఆ సంగీతంలో తనలో దాగున్న సీరియల్ కిల్లర్ భావోద్వేగాలున్నాయా అంటే లేదు. అమీర్ ఖాన్ సర్ఫరోష్ లో గజల్ గాయకుడి రూపంలో వున్న టెర్రరిస్టుగా నసీరుద్దీ న్ షా, పాడే పాటలో అంతరార్ధం పాత్ర నిజస్వరూపాన్ని తెలిసీ తెలీనట్టు ప్రకటిస్తుంది. ఇది కథ కాదు లో వెంట్రిలాక్విజం కళాకారుడైన కమల్ కూడా తన భావోద్వేగాల్ని వెంట్రిలాక్విజం ద్వారా ప్రకటిస్తాడుగా?

    మాధవన్ పాత్రకి ఆంథోనీ గోన్సాల్వెజ్ పేరు యాదృఛ్ఛికంగా పెట్టేశారా లేక ఉద్దేశపూర్వకంగానా? ఆంథోనీ గోన్సాల్వెజ్ గోవాకి చెందిన సుప్రసిద్ధ సంగీత కారుడు. లక్ష్మీ కాంత్ - ప్యారేలాల్ లకి సంగీతం నేర్పిన గురువు. వాళ్ళ ఎన్నో పాటలకి ఆయనే స్ఫూర్తి. ఏకంగా ఆయన పేరే ప్రయోగించి అమర్ అక్బర్ ఆంథోనీ లో అమితాబ్ బచ్చన్ మీద మై నేమ్ ఈజ్ ఆంథోనీ గోన్సాల్వెజ్ అనే ఆల్ టైమ్ హిట్ పాట సృషించేశారు. అలాటి ఆంథోనీ గోన్సాల్వెజ్ పేరు మ్యూజిషియన్ అయిన సీరియల్ సైకో కిల్లర్ కి వాడడం ఏమీ బాగాలేదు. ప్యారేలాల్ శర్మ ఇప్పటికీ ఆంథోనీని స్మరిస్తాడు. 

పొడిపొడి ప్రణయ బాంధవ్యం 

       ఇక మాధవన్ - అనూష్కాలు పరస్పరం తమ కళల్ని నేర్పుకునే  క్రమంలో కూడా రసపోషణ వుండదు. ఆకలిరాజ్యం లో కమల్ -శ్రీదేవిల మధ్య వున్నట్టు. శ్రీదేవి తాళం పాడితే కమల్ స్వరాలు కూర్చే పోటాపోటీ - ఆమె సంగీతమైతే అతను సాహిత్యంగా - కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే పాట లాగా. మాధవన్ సంగీతానికి అనూష్కా చిత్ర లేఖనం పోటీయో, లేదా అనూష్కా చిత్ర లేఖనానికి మాధవన్ సంగీతం పోటీయో లేకుండా కళాకారుల పాత్రలెందుకు? వీళ్ళు ప్రేమికులైనప్పుడు కళల సమాగం లేని అంటీముట్టని చిత్రణ లెందుకు? ప్రియుడే సంగీతము - ప్రియురాలే నాట్యము - అని  ఇది కథ కాదు లో కళాకారులైన కమల్, జయసుధ పాడుకున్నారుగా? మాధవన్ సంగీతం అనూష్కాకి వినపడని లోపంలోంచి మాధవన్ పడే వేదనాభరిత డ్రామా ఏది?

    ఇలా అనూష్కా, మాధవన్ - ఇద్దరు స్టార్స్ మీద ప్రణయంలో యూత్ అప్పీల్ ప్రవహించే కనీస ఎమోషనల్ బాండింగ్ కూడా లేకపోవడం కొట్టొచ్చే లోపం. ఇన్ని లోపాలతో తెరమీద ఈ స్టార్స్ ని చూసి ఎందుకు ఎంజాయ్ చేయాలి?

అంజలి పాత్రా గల్లంతు 

      ఇక అంజలి. దర్శకుడు ముందుగా అనుకున్న కథలో అంజలి పాత్ర లేదు. ఆమె స్థానంలో మగ పాత్ర వుంటే, కథ మేల్ డామినేషన్ తో వుందనిపించి మగ పాత్ర తీసేసి,  పోలీస్ డిటెక్టివ్ ని స్త్రీ పాత్రగా మార్చానన్నాడు దర్శకుడు. అయినా అనూష్కాతో బాటు అంజలి పాత్రనీ నీరుగార్చే చిత్రణలు చేశాడు. అంజలి పాత్రకి మహాలక్ష్మి పేరుకి అర్ధం పర్ధం, ప్రయోజనం లేవు. తెలుగు ప్రేమ సినిమాల్లో పెడుతున్న ఇంకో టెంప్లెట్ పేరుగానే మూలన పడింది. ఆంథోనీ పేరుతో అలా చేశారు. మహాలక్ష్మి పేరుతో ఏమీ చేయలేదు అమెరికా బ్యాక్ డ్రాప్ లో. తను పోలీస్ డిపార్ట్ మెంట్ కే గర్వకారణమైన విజయలక్ష్మిలా వుండదు. అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఇండియన్ మిథికల్ క్యారక్టర్ ని ప్లేచేసి విశ్వ గురు అంటున్నఇండియా ఖ్యాతిని పెంచాలను కోలేదు. పేరు గొప్ప పని దిబ్బ అన్నట్టు వుంది. 

    తగ్గట్టే స్టయిలిస్ట్ యాక్టింగ్ తో అసహజ ఇన్వెస్టిగేషన్. 47 ఏళ్లుగా దెయ్యం చంపుతూంటే ఆంథోనీని దెయ్యం చంపలేదని మొదటే ఎలా నిర్ధారించింది? సాక్షి ఫ్రెండ్ సోనాలీ కనిపించకపోతే ఆమె చంపినట్టా? ఇది వరకు దెయ్యం చేసిన హత్యలతో ఈ హత్యకున్న తేడా ఏమిటో కేసు పాత రికార్డుల్లో సైంటిఫిక్ ఎవిడెన్సు లతో నిగ్గు తేల్చిందా? దీని జోలికే పోలేదే. కథా సౌలభ్యం కోసం వూరికే సోనాలీని టార్గెట్ చేయడం వల్ల అసలు దెయ్యమనే మూల కథే ప్రశ్నార్ధకమైంది.

    సరే, చివరికి దెయ్యం చంపలేదనే తేలింది. మరి చంపుడు కార్యక్రమం పెట్టుకున్న దెయ్యం ఏమైంది? తన ముందు తను చంపాల్సిన ఆంథోనీని ఇంకెవరో చంపుతూంటే చూస్తూ వుందా? ఆంథోనీతో బాటు చంపడానికొచ్చిన వాణ్ణీ బోనస్ గా చంపుకుని దెయ్యం నెక్స్ట్ శాల్తీ కోసం కూర్చోవాలిగా? అసలు వచ్చిన మహాలక్ష్మితో బాటు పోలీసు టీమునీ సఫా చేసేయాలిగా? మహాలక్ష్మి లో గజలక్ష్మిని చూసి జడుసుకుందా అమెరికన్ దెయ్యం? ఇదే చూపించి వుంటే మోతెక్కి పోయేది అమెరికా!!

    కాబట్టి బిల్డప్ కోసం ఏదో దెయ్యం కలరిచ్చారు తప్ప, అసలు దెయ్యాముందా లేదా స్పష్టత లేదు కథకుడికి. కన్పిస్తున్న దెయ్యాలుగా పాత్రలే వున్నప్పుడు వేరే దెయ్యం అక్కర్లేదేమో. మహాలక్ష్మిగా అంజలి ఈ కేసులో తేల్చిందేమీ లేదు. చివరికి సుబ్బరాజే తన కథ చెప్పుకుని ఆంథోనీ హత్యా రహస్యం విప్పుతాడు ప్రేక్షకులకి. మహాలక్ష్మికి కాదు. కనీసం ఇంకో పనైనా చేయలేదు మహాలక్ష్మి - కెప్టెన్ రిచర్డ్ పోలీసుని చంపి కిందికి తోసేస్తాడు. ఆ శవం దగ్గర రిచర్డ్ వేసుకున్న బ్లేజర్ బటన్ దొరుకుతుంది మహాలక్ష్మికి. దాంతో ఆంథోనీ హత్యతో రిచర్డ్ కి సంబంధముందన్న విషయం తర్వాత, ముందు ఈ పోలీసు హత్యలో రిచర్డ్ రెడ్ హేండెడ్ గా దొరికిపోతే కిమ్మనదు. ధైర్య లక్ష్మి కూడా కాలేదు. రిచర్డ్ చేసిన ఈ పోలీసు హత్యని ప్రమాద వశాత్తూ మరణంగా నమోదు చేసిందేమో చూపించలేదు. అసలు అర్ధం కాని కథలో అనూష్కా లాగే తనూ గల్లంతైన పాత్రే. ఎవరెవరో ఫ్లాష్ బ్యాకులేసుకుని ప్రేక్షకుల నుద్దేశించి వాయిసోవర్లు చెప్తూంటే, వీటితో సంబంధం లేనట్టు హైఫై పోలీస్ డిటెక్టివ్ మాహాలక్ష్మి ఎక్కడుంటుందో తెలీదు. చివరికి ఆంథోనీ మిస్టరీ వెల్లడవడం కూడా తన మూలంగా జరగదు. తనుండదు. పూర్తిగా పాసివ్ క్యారెక్టర్.  
    *హాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ లక్ష్మీదేవిని పూజిస్తుందట!

        విదేశీయులు, ఇతర మతస్థులు కూడా హిందూ దేవుళ్లను ఆరాధిస్తుంటారు. అలాంటి వాళ్లలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. ఎన్నో హాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన సల్మా హయెక్ లక్ష్మీదేవిని పూజిస్తుందట. ధ్యానంలో కూర్చున్నప్పుడు లక్ష్మీదేవిపైనే దృష్టి పెడుతుందట. ఈ విషయాన్ని సల్మా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. లక్ష్మీదేవి ఫొటోను కూడా పోస్ట్ చేసింది.  
       
`నేను నా అంత:సౌందర్యంతో అనుసంధానం కావాలనుకున్నప్పుడు దేవత లక్ష్మీదేవిపై దృష్టి పెట్టి ధ్యానం చేస్తాను. హిందూ మతస్థులు ఆమెను సంపదకు, అదృష్టానికి, ప్రేమకు, అందానికి ప్రతినిధిగా భావిస్తారు. ఆమె చిత్రం నాకు చాలా సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. సంతోషం, ప్రశాంతత మన అంత:సౌందర్యానికి బాటలు వేస్తాయ`ని సల్మా పేర్కొంది. ఈ పోస్ట్ చూసిన బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు `అద్భుతం` అంటూ కామెంట్ చేసింది. 
ఆంధ్రజ్యోతి
, 9.10.20
అనాధల బ్యాచి 

     సాక్షి ఫ్రెండ్ సోనాలీగా శాలినీ పాండే అనాధాశ్రయంలో పదేపదే ఇలాటి సస్పెన్స్ థ్రిల్లర్స్ లో రిపీటవుతున్న పాత మూస పాత్ర. స్టార్ సినిమాల్లో హీరో ఎప్పుడూ బస్తీలో వుండే అనాథే- పేరు శీను గాడే అన్నట్టు - సస్పెన్స్ థ్రిల్లర్స్ లో హీరోయిన్, ఆమె నేస్తం అనాథాశ్రయంలో పడుండే అనాధలు! తెలుగు రాష్ట్రాల్లో యువతీ యువకులు దిక్కులేని అనాధలన్న మాట. ఇప్పుడు అమెరికా తీసికెళ్ళీ ఇదే పరాభవం. 

    సోనాలీకి సాక్షి మరెవరితో వుండకూడదనీ, తనతోనే వుండాలని పొసెసివ్ నెస్ చిన్నప్పట్నుంచీ. దీంతో పెద్దయ్యాక సాక్షితో క్లోజ్ గా వుంటున్నాడని అనుమానించి ఒకడి మీద  హత్యా యత్నం చేసి  జైలుకి కూడా వెళ్ళి వచ్చిన చరిత్ర. అమెరికన్ ప్రభుత్వం ఆమెకి మానసిక చికిత్స చేయకుండా మళ్ళీ దేశం మీదికి వదిలేసి నట్టుంది. ఈ పాత మూస టెంప్లెట్ పాత్ర నేటి కాలం పోకడలకి లెస్బియన్ అయి వుంటుందని ప్రేక్షకులు భావిస్తారన్న స్పృహలేదు కథకుడికి. పొసెసివ్ నెస్ వికటించి పొటెన్షియల్ కిల్లర్ గా మారిన సోనాలీతో ఇంకా ఫ్రెండ్ షిప్ ఏమిటో సాక్షికి. ఇది మరిన్ని హత్యలకి దారి తీసేందుకు తానే కారణమైందన్న పొరపాటు, సాక్షి పాత్ర సమూలంగా నెగెటివ్ అయిందన్నసంగతీ గ్రహించాడో లేదో కథకుడు. 

సుబ్బరాజు, మాడ్సెన్ సూపర్ స్టార్స్

        వీళ్ళిద్దరూ తమ పాత్రల్ని ఎంజాయ్ చేశారు, ఎలాటి బంధనాలు, సంకెళ్ళు లేవు. కానీ క్యారక్టర్ గ్రోత్ తో, వాళ్ళ సీక్రెట్స్ తో బ్యాంగు లిచ్చుకుంటూ పోయారు. సోనాలీని ప్రేమించిన వివేక్ గా సుబ్బరాజు తన గోడు సరీగ్గానే వెళ్లబోసుకున్నాడు. రివెంజ్ క్యారక్టర్ గా మారి కథ ముగించాడు. నీటు పాత్ర, క్లాస్ నటన. పోలీసు కెప్టెన్ గా మైకేల్ మాడ్సెన్ ది విలక్షణ నటన. రిజర్వాయర్ డాగ్స్’, కిల్ బిల్’, ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ వంటి 113 సినిమాల సీనియర్ నటుడు. భారతీరాజా థ్రిల్లర్ లోని పెంపుడు తండ్రి పాసివ్ పాత్రని, కెప్టెన్ గా యాక్టివ్ పాత్రగా పోషించి సైకో విలనిజాన్ని డీసెంట్ గా పోషించాడు. అనూష్కా, అంజలి పాత్రల్లా కాకుండా వీళ్ళిద్దరివీ సస్పెన్సుతో కూడిన పాత్రలు.

సాంకేతిక వైభవం
       
కథా వైభవం లేకపోయినా సాంకేతిక వైభవానికి కొదవ లేదు. కెమెరా మాన్ సి. రామ్ ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే విత్తం కొద్దీ వైభవం. తెర నిండా డాలర్లు అతికించి నట్టుంది. రెండు డాలర్లు మనకిస్తే మందు బాటిల్ పక్కనుంచుకుని చూసేవాళ్లం. మందే కథని మరిపించ గలదు, స్నాక్స్ పని చెయ్యవు. 

    గోపీ సుందర్ సంగీతం, షానీల్ దేవ్ కెమెరా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, చాడ్ బఫెట్ ఆర్ట్, నీరజా కోన కాస్ట్యూమ్స్, అమెరికన్ యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుత క్వాలిటీతో  పోటీపడుతూ వున్నాయి. దర్శకుడి కథా నిర్వహణే సక్సెస్ కి వేటు వేసింది.

సికిందర్  

(కథా కథనాల సంగతులు రేపు)

29, సెప్టెంబర్ 2020, మంగళవారం

983 : రివ్యూ


 దర్శకత్వం : రణదీప్ ఝా 
తారాగణం : బరుణ్ సోబ్తీ, సచిన్ ఖెడేకర్, ఎనాబ్ కిజ్రా, పూర్ణేందు భట్టాచార్య, సాన్యా బన్సల్, తదితరులు 
మూల కథ : సందీప్ గడే, కథ : జీబ్రాన్ నూరానీ, స్క్రీన్ ప్లే : జీషాన్ ఖాద్రీ, సంగీతం : నమన్ అధికారి, సగీష్ భండారీ తదితరులు, ఛాయాగ్రహణం : పీయూష్ పుటీ  
నిర్మాతలు : ప్రియాంకా బస్సీ, శాలినీ చౌదరీ, జీషాన్ ఖాద్రీ
విడుదల : ఇరోస్ నౌ 
***

        మర్షియల్ సినిమా అంటే గుండుగుత్తగా హీరోల మీద వుండే క్లయిమాక్సులు. హీరో మాత్రమే విలన్ని ఓడించే మార్పు లేని ముగింపులు. అప్పుడెప్పుడో 1955 లో దొంగ రాముడు లో సావిత్రి క్లయిమాక్స్ జరిపి అక్కినేని నాగేశ్వరరావుని విడిపిస్తే అదో వెరైటీ. దీన్ని ఇప్పటి కాలానికి సవరిస్తే, హీరో రిమోట్ కంట్రోల్ చేస్తూంటే హీరోయిన్ ముగించే, ఇన్నోవేట్ చేసిన క్లయిమాక్స్ అవచ్చు. కానీ కథనంతో కమర్షియల్ సినిమా వెరైటీని కోరుకోదు. కనీసం ఈక్వలైజర్ 2  లాగా సెకండాఫ్ పది నిమిషాలే కథ, నలభై నిమిషాలూ సుదీర్ఘ  క్లయిమాక్స్ అనే రివర్స్ ఇంజనీరింగ్ కి కూడా ఒప్పుకోదు. ఎంత మూసలో వుంటే అంత సుఖం, భద్రత  ఫీలవుతుంది. రియలిస్టిక్ సినిమాలు కూడా ఇదే  ధోరణిలో వుంటున్నాయి. కాకపోతే కొన్ని ట్రాజడీలుగా ముగుస్తాయి. ఈ ట్రాజడీలు కూడా వూహకందేలా ఫార్ములాగానే వుంటాయి. వూహకందకుండా ట్రాజడీగా ఒకటి కాదు, రెండు లీడ్ క్యారక్టర్ల పరాజయంగా వుంటే ఎలా వుంటుంది? దీనికి ఏ ఎలిమెంట్ తోడైతే అంత బలంగా వుంటుంది? కమర్షియల్ సినిమా కలల్ని చూపిస్తుంది, రియలిస్టిక్ సినిమా వాస్తవ పరిస్థితి చూపించి కళ్ళు తెరిపిస్తుంది. తమ అదుపులో లేని వాస్తవ పరిస్థితిని గెలవడం సగటు వాస్తవిక పాత్రలకి సాధ్యమవుతుందా? కాదు. అందువల్ల హాలాహల్ క్లయిమాక్స్ కమర్షియల్ సినిమా కళ్ళు తెరిపించే క్రియేటివ్ క్లయిమాక్స్ అవుతోంది.

    కొత్త దర్శకుడు రణదీప్ ఝా దీన్నోక కొత్త అనుభవాన్నిచ్చే పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తీయలేదు, చిత్రీకరించలేదు, చెక్కాడు. చుట్టడం కూడా చేసే దర్శకులు వుంటున్న కాలంలో, చెక్కుడు దర్శకుడుగా చెక్కడం అంటే ఏమిటో ఈ కింది విధంగా చూపించాడు...

కథ 

     మెడికల్ స్టూడెంట్ అర్చన (ఎనాబ్ కిజ్రా) రాత్రిపూట ఘాజియాబాద్ హైవేమీద బాయ్ ఫ్రెండ్ ఆశీష్ తో గొడవపడుతుంది. ఒక ట్రక్కు వేగంగా దూసుకురావడంతో ఆశీష్ తప్పించుకుని, అర్చన ట్రక్కుకింది కొచ్చేసి చచ్చిపోతుంది. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా నమోదు చేసి, రోహతక్ లో వుండే ఆమె తండ్రి డాక్టర్ శివ శంకర్ శర్మ(సచిన్ ఖెడేకర్) కి సమాచారమందిస్తారు. డాక్టర్ శర్మ ఇది ఆత్మహత్య అంటే నమ్మడు. పోస్ట్ మార్టం రిపోర్టు తప్పుగా వుంది. ఇదే నిజమనీ, అనవసరంగా గొడవపడకుండా వెళ్లిపొమ్మనీ ఇన్స్ పెక్టర్ అంటాడు. ఇన్స్ పెక్టర్ ని అనుమానించిన శర్మ, ఎస్సై యూసుఫ్ ఖురేషీ (బరుణ్ సోబ్తీ) ని కలిసి రెండు లక్షలు లంచమిస్తాడు. అడ్డగోలుగా లంచాలు మేసే యూసుఫ్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య (పూర్ణేందు భట్టాచార్య) దగ్గరి కెళ్ళి బ్లాక్ మెయిల్ చేసి, అయిదులక్షలు తీసుకుంటాడు. యూసుఫ్ ని నమ్మిన శర్మ కూతురు బాయ్ ఫ్రెండ్ ఆశీష్ గురించి ఆరాతీసి యూసుఫ్ కి చెప్తాడు. కేసుతో ఎవరితో సంబంధముంటే వాళ్ళ దగ్గర లంచాలు మేసే ఆలోచనతో వున్న యూసుఫ్, శర్మని వెంటేసుకుని బాయ్ ఫ్రెండ్ ఆశీష్ వేటలో పడతాడు. ఇప్పుడేం జరిగిందనేది మిగతా కథ. 

నటనలు, సాంకేతికాలు

      ఇది శర్మా యూసుఫ్ రెండు ఆసక్తికర పాత్రల కథ. యూసుఫ్ పాత్ర మరింత ఆసక్తి కల్గించే రియలిస్టిక్ పోలీసు పాత్ర. ప్రతీ సీనులో ఈ పాత్ర నటించిన బరుణ్ సోబ్తీ మీదే వుంటుంది మన దృష్టంతా. అవకాశవాది, లంచగొండి. ఒకసారి ఇతడితో విసిగిపోయిన కొందరు దుప్పటి కప్పి కొట్టి పారిపోతారు. ఎవరు కొట్టారో తెలీక ఇక కుంటుకుంటూ నడుస్తాడు. డాక్టర్ శర్మ దగ్గర లంచం తీసుకున్నది గాక, ఆ అవకాశంతో కేసుతో సంబంధం వున్న వాళ్ళ దగ్గరా లంచాలు లాగి వదిలేస్తూంటాడు. ఈ క్రమంలో కేసుని తారుమారు చేస్తున్న ఇన్స్ పెక్టర్ కి తన కౌంటర్ ఇన్వెస్టిగేషన్ తో అడ్డు తగలుతూంటాడు, ఈ కేసు తన డ్యూటీ కాకపోయినా. ఇలా చేస్తూ సస్పెండ్ అవుతాడు. సస్పెండ్ అయ్యేలోపు మనసు మార్చుకుని డాక్టర్ శర్మ కోసం నిజాయితీ గా పని చేస్తూంటాడు. సస్పెండ్ అయ్యాక ఎక్కడపడితే అక్కడ ఇన్స్ పెక్టర్ కి తలనొప్పి తెప్పిస్తాడు. ఎన్ కౌంటర్లు, హత్యలు కూడా చేస్తూ ఇన్స్ పెక్టర్ సిండికేట్ ని కాపాడ్డానికి  ప్రయత్నిస్తూంటే, తను సిండికేట్ ని పట్టివ్వడానికి, తద్వారా దుర్మరణం చెందిన శర్మ కూతురికి న్యాయం చేయాడానికి రిస్కు తీసుకుని కృషి చేస్తూంటాడు. పాత్ర చిత్రణ, నటనా రెండూ బరుణ్ ని హైలైట్ చేశాయి. 

డాక్టర్ శర్మగా సచిన్ ఖెడేకర్ రెండో ప్రధానాకర్షణ. కూతుర్ని పోగొట్టుకున్న అతడి కోపం, పట్టుదలా ఎంత దూరమైనా అతణ్ణి తీసికెళ్లిపోతుంది. సిండికేట్ ని ఎదుర్కోవడానికి తన శక్తి చాలకపోయినా, దుండగులు తనని కొట్టి వెళ్ళినా, వెనకడుగేయని సంకల్ప బలం. ఒక పెన్ డ్రైవ్ తో సిండికేట్ ని తుదముట్టించగలడు. ఆ పెన్ డ్రైవ్ కి యాభై లక్షల కోసం వూళ్ళో క్లినిక్ అమ్మేసి, భార్యనీ, చిన్న కూతుర్నీ ఆందోళనలో పడేస్తాడు. ఇంతా చేసి, ఆ ప్రొఫెసర్ కి డబ్బిచ్చి మోసపోతాడు. పెన్ డ్రైవ్ లేదు ఏమీ లేదు. తననీ యూసుఫ్ నీ టపటపా కొట్టేసి వెళ్లిపోతారు నోయిడా గ్యాంగ్.  

ఇలా సచిన్ ఖెడేకర్, బరుణ్ సోబ్తీ ఇంట్రెస్టింగ్ జంట. డాక్టర్ గా సచిన్ మేధ ఆయితే, ఎస్సైగా బరుణ్ చేత. సచిన్ మేధస్సు నుపయోగించి ఆలోచించి చెప్తే, అతణ్ణి తీసుకుని బరుణ్ యాక్షన్లోకి దిగిపోతాడు. ఇద్దరూ మందు మిత్రులవుతారు. సిండికేట్ చేతిలో ఇద్దరూ సఫరవుతారు. ఒకసారి బాయ్ ఫ్రెండ్ ఆశీష్ తల్లి దగ్గరికి ఇద్దరూ పోతారు. కొడుకు ఎక్కడున్నాడో ఆమె తెలియదంటే బయటి కొచ్చేస్తారు. ఆమె అబద్ధం చెప్తోందని సచిన్ అంటాడు. టేబుల్ మీద ఆల్బెట్రాల్ బాటిల్ వుంది. ఆస్తమా పేషెంట్స్ వాడతారు. అది వాడితే కనుగుడ్లు పెద్దవిగా అవుతాయి. ఆమె కళ్ళు మామూలుగా వున్నాయి. ఆ బాటిల్ ఆమె కొడుకు కోసం తెచ్చి వుంటుంది. అదెప్పుడో తీసికెళ్లి అందిస్తుంది. నీకు కొడుకు హాస్టల్లో ఇన్హేలర్ దొరికింది గా. అంటే కొడుకే ఆస్తమా పేషెంట్ అన్నమాట...ఈమెని కనిపెట్టి ఫాలో అవుదాం  ఇలా నిశిత దృష్టితో గమనించి క్లూలు ఇస్తూంటాడు సచిన్.         

        ఇందులో వివిధ స్థాయుల్లో విలన్ల రూపంలో  అధికారులు, ఓ డాక్టర్, ఓ ప్రిన్సిపాల్, ఓ బడా రాజకీయ నాయకుడూ వుంటారు. ఎవరూ మాస్ విలన్స్ గా వుండరు. నీటుగా, మర్యాదస్తుల్లా వుంటారు. నైస్ గా మాట్లాడతారు. అంతా రియల్ గా వుంటుంది. ఏదీ సినిమాటిక్ గా వుండదు. డైలాగులు కూడా సినిమాటిక్ గా వుండవు. సినిమా చూస్తున్నట్టు వుండదు. కెమెరా మూవ్మెంట్స్ కూడా సినిమా చూపించవు, పరిస్థితిని  చూపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంతే. ఎడిటింగ్ ఇంకో ఎస్సెట్. సీన్ల స్మూత్ ట్రాన్సిషన్స్ పరిస్థితినే ఎలివేట్ చేస్తాయి. ఔట్ డోర్ లొకేషన్స్, మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్, హోటల్స్, పోలీస్ స్టేషన్లు మొదలైన రియల్ లొకేషన్లు అత్యంత వాస్తవికంగా కన్పిస్తాయి. 

కథా కథనాలు 

   హాలాహల్ (గరళం) కథకి -2013 మధ్య ప్రదేశ్ వ్యాపమ్ (వ్యావసాయిక్ పరీక్షా మండల్) స్కామ్ - మెడికల్ సీట్ల భారీ కుంభకోణం ఆధారం. ఎంట్రెన్స్ పరీక్షలు, అడ్మిషన్లు, రిక్రూట్ మెంట్లతో ఓ మహా దోపిడీయే సాగింది. పలుకుబడిగల రాజకీయ నాయకులు,  జ్యూనియర్, సీనియర్ అధికార్లు, వ్యాపారవేత్తలు సిండికేట్ గా ఏర్పడి, ఎంట్రెన్స్ రాయడానికి నకిలీ అభ్యర్ధుల్ని నియమించడం, పరీక్షా హాలు సీటింగ్ ఏర్పాట్లని తారుమారు చేయడం, ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమితులైన అధికార్లని కొనేసి, ఫోర్జరీ చేసిన ఆన్సర్ షీట్లని సరఫరా చేయడం వంటివి పథకం ప్రకారం జరిపి, కోట్లాది రూపాయలు దండుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఆత్మహత్యలు జరిగాయి...

ఈ నేపథ్యాన్ని సినిమాకి ఉత్తరప్రదేశ్ లో సృష్టించి ఈ కథని నడిపారు. స్ట్రక్చర్లో వున్న దీని స్క్రీన్ ప్లే -ఇంటలిజెంట్, క్రియేటివ్ వర్క్ చేయాలనుకునే భావి దర్శకులకి ఒక గైడ్. మామూలు క్రియేటివ్ వర్క్ కాదు, నోనాన్సెన్స్ క్రాఫ్ట్. ఈ క్రాఫ్ట్ కి ఒక్క సీను ఉదాహరణగా తీసుకుంటే, క్లయిమాక్స్ లో సచిన్ ఖెడేకర్ కి కొన్సెలింగ్ చేస్తున్న పద్ధతిలో విలన్ వివరిస్తాడు చాలా స్మూత్ గా. సీన్ కట్ అవుతుంది. రోహతక్ లో ఆందోళనలో వున్న సచిన్ భార్యా కూతురు అతణ్ణి వచ్చెయ్యమని అంతకి ముందే కోరతారు. ఇప్పుడు టేబుల్ దగ్గర కూర్చున్న కూతురు, తలుపు వైపు చూస్తుంది. ఆమె మొహం ప్రసన్నమవుతుంది. షాట్ కట్ అయిపోతుంది. ఆమె తలుపు వైపు అలా ఏం చూసి ప్రసన్నమై వుంటుంది? సచిన్ వచ్చేసి వుంటాడు. ఇలా సచిన్ ని చూపించకుండానే ఆ అర్ధంలో షాట్ తీశాడు క్రాఫ్ట్ తెలిసిన దర్శకుడు. ఇది మర్చిపోలేని బ్యూటీఫుల్ షాట్.

విలన్ చేసిన కౌన్సెలింగ్ కి తన మంచి చెడ్డలు అర్ధమైపోయే వుంటాయి సచిన్ కి. పోరాటం విరమించాడు. తప్పదు. ఈ వ్యవస్థలో సామాన్యుడికి గత్యంతరం లేదు. ఇప్పుడున్న కుటుంబాన్ని కాపాడుకోవాలి. మరి న్యాయం? న్యాయం జరగాలని రూలుందా? న్యాయమే జరుగుతుందని సినిమాలు చూపించి మభ్యపెడుతున్నాయి. న్యాయం జరగదు, ఇది వాస్తవం. ఎందుకు జరగదు తెలుసుకోవడం బుద్ధిమంతుల లక్షణం. న్యాయం చెప్పే సిండికేట్లు, కేట్లు, డూప్లికేట్లు పలికే సుభాషితాలు ఆరోగ్యకరమైనవి. 

అగథా క్రిస్టీ ఫేమస్ డిటెక్టివ్ పాత్ర హర్క్యూల్ పైరట్ లా గుబురు మీసాలు పెంచుకుని వీరంగం వేసిన ఎస్సైకి కూడా ఇదే గుణపాఠం. వ్యవస్థలో అతను ఆఫ్టరాల్ ఎస్సై. పెద్ద తలకాయలతో పెట్టుకోకూడదు. లంచాలు తిని ఉద్యోగం చేసుకుంటే చాలు. 

        ఎంత సింపుల్ గా వుంటుందో, అంత బలంగా వుంటుంది సందేశాత్మక ముగింపు. అయితే ఒక తప్పుంది. సిండికేట్ మీద డాక్టర్ ఆధారాలన్నీ సేకరించాక, సిండికేట్ ముందుకెళ్లి మీడియా ముందు రట్టు చేస్తానని సవాలు విసరడం రొటీన్ మూస ఫార్ములా సీను. ఈ రియలిస్టిక్ జానర్ మర్యాదలకి ఇది తగదు. దీనివల్ల ఏమైందంటే సిండికేట్ ఎలర్ట్ అయిపోయి కథకి నష్టం జరిగింది. గుట్టు చప్పుడవకుండా మీడియా ముందుకెళ్ళకుండా అనవసర హీరోయిజం ఏమిటి?

ఇక సీను తర్వాత సీన్ల క్రమం, కూర్పు ఇంకో క్రాఫ్టు. సీన్ల ప్రారంభ ముగింపులు అనూహ్యంగా థ్రిల్లింగ్ గా చేశారు. సెంటి మెంట్లు, మెలోడ్రామాలూ ఎక్కడికక్కడ లేకుండా చూసుకున్నారు. అవన్నీ సన్నివేశాల్ని బట్టి, కథ నడకని బట్టి మనం ఫీలవుతాం. 1970 లలో ఆర్ట్ సినిమాలకి తిరుగుబాటుగా రాబర్ట్ బ్రెసన్ శైలిలో తనదైన బ్రాండ్ ఆర్ట్ సినిమాలతో ఆశర్యపర్చిన మణికౌల్ దృష్టిలో, నటులు నటులు కాదు, మానవ రూపానికి మోడల్స్. నటులు పాత్ర అంతర్ముఖాన్ని బహిర్గతం చేస్తారు, మోడల్స్ బాహిర్ రూపంతో అంతర్ముఖాన్ని ఊహాత్మకం చేస్తాయి. అంటే పాత్ర లోపల ఏం ఫీలవుతోందో అంతరార్థాన్ని మన వూహకి వదిలేస్తాయి. ఇదే జరుగుతుంది హాలాహల్ లో. తప్పక చూడాల్సిన క్రియేషన్. 

సికిందర్

 

28, సెప్టెంబర్ 2020, సోమవారం

982 : రివ్యూ


 రచన - దర్శకత్వం : అనుశ్రీ మెహతా 

తారాగణం : హితేన్ తేజ్వానీ, అనుప్రియా గోయెంకా, సెహబాన్ అజీమ్, ఆయుష్మాన్ సక్సేనా, అశ్విన్ మిశ్రా, రవి ఖేమూ, అశోక్ పండిత్
సంగీతం: ఎ. వసంత్
, ఛాయాగ్రహణం : క్షితిజ్ తారే
నిర్మాత : ప్రీతీ రాఠీ గుప్తా
బ్యానర్ : ఇరోస్ ఇంటర్నేషనల్
విడుదల : ఇరోస్ నౌ

***

        స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఇరోస్ నౌ నిర్మాణంలో మరో మర్డర్ మిస్టరీ అన్ కహీ విడుదలైంది. ఈ నెలలోనే హలాహల్ అనే మర్డర్ మిస్టరీ కూడా విడుదలైంది. హిందీలో ఓటీటీ కంటెంట్ అంటే యూత్ ని టార్గెట్ చేసే క్రైమ్, అడల్ట్ మూవీస్ గనుక ప్రస్తుత మర్డర్ మిస్టరీ అర్ధంలో మర్డర్ మిస్టరీయే గానీ, కంటెంట్ లో కాదు. జరిగిపోయిన సీరియల్ మర్డర్స్ గురించి చర్చ. సింగిల్ లొకేషన్, టేబుల్  చుట్టూ చర్చ. చర్చించుకుని సీరియల్ కిల్లరెవరో తేల్చే కథ. అ గథా క్రిస్టీ నవలల్లో పడక్కుర్చీ డిటెక్టివ్ పరిశోధన లాగా. అయితే ఈ టైపు కథకి క్రిస్టీ ఫార్ములాతో ఊపిరి బిగబట్టే సస్పెన్సు సృష్టించవచ్చు. ఇదే జరగలేదు. 

    
రుగురు అనుమానితుల్ని ఒకచోట బంధించి మీలో సీరియల్ కిల్లరెవరో తేల్చుకు  చెప్పండనే స్టోరీ ఐడియా వరకూ బాగానే వున్నా, నిర్వహణా లోపం వల్ల ముగింపు సహా తేలిపోయింది. పూర్తిగా డైలాగులతో నడిచే ఈ కథ డైనమిక్స్ కొరవడి ఎందుకూ కొరగాకుండా పోయింది ప్రయోగం చేసిన కొత్త దర్శకురాలి చేతిలో.

    అభిమన్యూ మాథుర్ (హితేష్ తేజ్వానీ) ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్
, టియా శర్మ (అనుప్రియా గోయెంకా) రీజనల్ మేనేజర్, లెస్బియన్; సంతోష్ హుడా (సెబాన్ అజీమ్) రిచ్ హర్యానా యూత్, రోషన్ ఖేర్ (అశ్విన్ ముష్రాన్) డివోర్సీ, క్రిష్ మల్హోత్రా (ఆయుష్మాన్ సక్సేనా) డ్రగ్ బానిస, దీపక్ మెహ్రా (రవి ఖేమూ) టెలికాం మేనేజర్ - వీళ్ళందరూ సీరియల్ కిల్లింగ్ లో అనుమానితులు.

    సంవత్సర కాలంగా ఢిల్లీలో పదకొండు మంది అమ్మాయిల హత్యలు జరిగాయి. ఇవన్నీ వివిధ మెట్రో స్టేషన్స్ కేంద్రంగా జరిగాయి. హత్యాస్థలాల్లో ఆధారాలతో పై ఆరుగురిని పట్టుకున్నారు. అందరి మీదా సాక్ష్యాధారాలున్నాయి కానీ అందరూ హంతకులు కాదు. వాళ్ళు చెప్పే సమాధానాలు నమ్మదగ్గవిగా లేవు. అందుకని వివిధ పోలీస్ స్టేషన్లో వున్న వాళ్ళని పట్టుకొచ్చాడు ఐజీ షేర్గిల్ (అశోక్ పండిత్). మాస్ ఎన్ కౌంటర్లు చేయడానికి తీసికెళ్ళాడని వార్తలు గుప్పుమన్నాయి. ఎందుకంటే అతను ఎన్ కౌంటర్ స్పెషలిస్టు.

    ఆరుగుర్నీ ఒక గ్యారేజీలో వేసి
, సాక్ష్యాధారాల ఫైళ్ళు వాళ్ళ ముందు పడేసి, మీలో ఎవరు సీరియల్ కిల్లరో తేల్చుకుని చెప్పమన్నాడు. పన్నెండు గంటలు టైము. ఈ లోగా చెప్పకపోతే పన్నెండు గంటల తర్వాత ఎన్ కౌంటర్లయి పోతారు.

    ఇదీ సమస్య. ఇప్పుడు ఒకొక్కరి ఫైలు తీసి విచారణ ప్రారంభిస్తారు ఆరుగురూ. తమ నిర్దోషిత్వాల్ని నిరూపించుకునే ప్రయత్నంలో పరస్పరం నిందించుకుంటారు. రహస్యాలు బయట పెట్టుకుంటారు. కొట్టుకుంటారు. ఇలా టేబుల్ చుట్టూ చర్చ చివరికి వాళ్ళల్లో ఒక సీరియల్ కిల్లర్ ని పట్టిస్తుంది. 

    గ్యారేజి దాటి సీన్లు బయటి కెళ్ళవు. ఫ్లాష్ బ్యాకులుండవు. వాళ్ళు చెప్పుకునే కథనాలకి విజువల్ సపోర్టు వుండదు. కేవలం వెర్బల్ డ్రామా. నటనలు మాత్రం బావున్నాయి. కానీ సింగిల్ లొకేషన్లో వాగ్యుద్ధాలతో కథలో అసలు బిగి లేదు. కథలో ఉత్కంఠ పెంచే మలుపుల్లేవు. అరుచున్నంత మాత్రాన, కొట్టుకున్నంత మాత్రాన కథలో టెన్షన్ పెరగదు. పదకొండు మంది అమ్మాయిల్ని చంపుతూ పోవడానికి సైకో కిల్లర్ కి ఏదో మానసిక కారణం వుంటుంది. ఈ కారణాన్ని పట్టుకోవడానికి సాక్ష్యాధారాలు చూపించుంకుని కొట్టుకోవడం కాకుండా, అందరి మెంటల్ కండిషన్ ని పరిశీలనకి పెడితే, సీరియల్ కిల్లర్ పైకి కన్పించే కామన్ లక్షణాల్ని పట్టుకోగల్గితే, సమస్య ఒక పద్ధతిగా సాల్వ్ అయ్యే అవకాశముండేది. చిట్టచివరికి సీరియల్ కిల్లర్ రివీలయినప్పుడు వాడి మాటలు, నటన, తిరగబడి మిగతా వాళ్ళని చంపేసే ప్రయత్నం- లేదా చంపిపారేసీ ఈజీకి లొంగిపోయే ముగింపు వుండి వుంటే – ఈ షోడౌన్ కనీసం కొన్ని రోజులు వెంటాడేది. కానీ ఒక మాటతో చప్పటి ముగింపు షో ఆఫ్ చేసేసింది.

    ఈ టైపు సినిమాలేమున్నాయా అని సెర్చి చేస్తే
, 1986 లో బాసు భట్టాచార్య తీసిన
ఏక్ రుక్తాహువా ఫైసలా (వాయిదా పడ్డ నిర్ణయం) దొరికింది. 18 ఏళ్ల యువకుడికి పడిన మరణ శిక్షని పన్నెండు మందితో కూడిన జ్యూరీ తిరగదొడే కథ. ఒక గదిలో సాగే చర్చోపచర్చల కోర్టు రూమ్ డ్రామా. ఇది 1957 లో సిడ్నీ లుమెట్ తీసిన క్లాసిక్ 12 యాంగ్రీ యంగ్ మెన్ కి రీమేక్. అన్ కహీ (అన్ టోల్డ్) కొత్త దర్శకురాలు అనుశ్రీ మెహతా తోచినట్టు గుడ్డిగా తీయకుండా,ఈ సినినిమాలు చూసి కాస్త జానర్ రీసెర్చి చేసుకుని వుంటే బావుండేది.

సికిందర్    

 

27, సెప్టెంబర్ 2020, ఆదివారం

981 : సందేహాలు - సమాధానాలు


 

Q : నమస్తే, తెలుగులో నాయకుడు లాంటి గ్యాంగ్ స్టర్ మూవీస్ ఇప్పుడు వర్కౌట్ అవుతాయా? గ్యాంగ్ స్టర్ స్టోరీస్ రాసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పగలరు.
జయసింహా, రైటర్
A : తమిళంలో కమలహాసన్ తో మణిరత్నం 1987 లో తీసిన నాయకన్ (నాయకుడు) ముంబాయి డాన్ వరదరాజన్ ముదలియార్ జీవిత కథ. వరదరాజన్ 1960-80 ల మధ్య డాన్ గా ఏలాడు. అదే కాలంలో హాజీ మస్తాన్ డాన్ గా వున్నాడు. హాజీ మస్తాన్ కథతో అమితాబ్ బచ్చన్ తో 1975 లో దీవార్ తీశారు, దీవార్’, నాయకన్ ఈ రెండూ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. వరదరాజన్ కథతో నాయకన్ తర్వాత ఇంకెన్నో హిందీ తమిళం మలయాళం సినిమాలు తీశారు. ఏవీ నిలబడలేదు. హాజీ మస్తాన్ తర్వాత ముంబాయిలో దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ ల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సత్య’, కంపెనీ లు తీసినప్పుడు హిట్టయ్యాయి. ఇక హాలీవుడ్ గాడ్ ఫాదర్ ననుసరించి ఇంకెన్నో ఫిక్షన్ డాన్ల సినిమాలొచ్చాయి. ఇవన్నీ గ్యాంగ్ స్టర్ జానర్ కిందికే వస్తాయి. అలాగే 1970 ల నాటి విజయవాడ గ్యాంగ్ స్టర్స్ రంగా, రాధాల ఆధారంగా వర్మ తీస్తే అవి కూడా సంచలనం సృష్టించాయి. చెప్పొచ్చేదేమిటంటే, పేరుండి వార్తల కెక్కిన నిజ డాన్లు, గ్యాంగ్ స్టర్లు, లేదా వీరప్పన్ లాంటి బందిపోట్లతో తీసే సినిమాలకి మంచి మార్కెట్ యాస్పెక్ట్ వుంటోంది. 


        విజయవాడ సీన్ ని ఇటు హైదారాబాద్ వైపు చూస్తే 1970 లలో జార్జి రెడ్డి (విద్యార్థి నాయకుడు)
, 2000 లలో నయీమ్ (గ్యాంగ్ స్టర్) వున్నారు. జార్జి రెడ్డితో ఈ మధ్య తీసిన జార్జిరెడ్డి ఆడలేదు. ఇక నయీమ్ మీద తీయలేదు. మార్కెట్ యాస్పెక్ట్ వున్నప్పటికీ జార్జి రెడ్డి ఆడకపోవడానికి తీసిన విధానం, అంటే జానర్ మర్యాదలతో క్రియేటివ్ యాస్పెక్ట్ బాగా లేకపోవడం కారణం. 


        ఇప్పుడు డాన్లు. గ్యాంగ్ స్టర్లు ముంబాయిలోనే లేరు. కాబట్టి ఆ జానర్ సినిమాలు హిందీలో తీయడం లేదు. నిజ డాన్లు
, గ్యాంగ్ స్టర్లు కాకుండా ఫిక్షన్ చేసి తీస్తే ఆడినవి కూడా ముంబాయిలో డాన్ల, గ్యాంగ్ స్టర్ల ప్రభావమున్న కాలంలోనే. 1978 లో అమితాబ్ తో తీసిన హిట్ డాన్ ఫిక్షన్. మరి 1989 లో డాన్లు ఏపీ లోనే లేనప్పుడు, శివ అనే ఫిక్షన్ డాన్ హిట్టయ్యింది కదా అంటే, దానికి విజయవాడ కాలేజీ రాజకీయాల, రౌడీయిజాల నిజ వ్యక్తులతో నిజ నేపథ్యముంది. ఆ తర్వాత కాలేజీ ఎన్నికల్లేవు, రౌడీ రాజకీయాల్లేవు. కేవలం ఎన్టీఆర్ కాలంలో మద్య నిషేధమనే నిజ నేపథ్యంతో, ఫిక్షన్ క్యారక్టర్ తో శర్వానంద్ తో 2019 లో రణరంగం తీస్తే ఆడలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు గ్యాంగ్ స్టర్ సినిమాలు తీయడమన్నది జూదమనుకోవాలి.

        ఇందుకు బదులుగా ఇటీవలి కన్నడ
ఫ్రెంచి బిర్యానీ లాంటి కామెడీ ప్రధానమైన ఫిక్షన్ డాన్ తీస్తే వర్కౌట్ అవచ్చు. ఒకసారి  ఫ్రెంచి బిర్యానీ చూడండి. దాని ఇన్నోవేట్ చేసిన మార్కెట్ యాస్పెక్ట్ పరిశీలించండి. ఈ లింక్ క్లిక్ చేసి రివ్యూ చూడండి.

        సీరియస్ గ్యాంగ్ స్టర్ కథలు హీరోల మీద వుంటేనే ఆడాయి. ఎందుకంటే హీరోల్లో మంచి గుణాలు చూపించే వీలవుతుంది. వరదరాజన్
, హాజీ మస్తాన్లలో ప్రజల్లో మమేకం చేసే మంచి గుణాలు కూడా వున్నాయి. కనుక ఫిక్షన్ కథగా తీయాలనుకున్నప్పుడు హీరో పాత్ర ఈ తీరులో వుండాల్సి వుంటుంది. మిగతా స్ట్రక్చర్  అంతా మూడంకాల త్రీయాక్ట్ స్ట్రక్చరే. త్రీ యాక్ట్ స్ట్రక్చర్ గురించి ఈ బ్లాగులోనే చాలా ఆర్టికల్స్ వున్నాయి. మీరు చాలా కాలంగా బ్లాగుని ఫాలో అవుతున్నారు కాబట్టి అన్ని జానర్లకూ ఒకే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వుంటుందని తెలిసే వుంటుంది. కాకపోతే గ్యాంగ్ స్టర్ జానర్ మర్యాదలు తెలుసుకుని ఈ స్ట్రక్చర్ లో కూర్చాలి. జానర్ జానర్ కీ జనర్ మర్యాదలు వేర్వేరుగా వుంటాయి. ఇది క్రియేటివ్ యాస్పెక్ట్ లో చూసుకోవాల్సిన విషయం.

        ఇంకా క్రియేటివ్ యాస్పెక్ట్ లో
, సంపన్నంగా ఎదగాలన్న బలమైన కోరిక గ్యాంగ్ స్టర్స్ ని నేరాల వైపు తీసికెళ్ళడమన్నదే కాన్సెప్ట్ గా వుంటుంది. అంటే ఎకనమిక్స్ ప్రధానంగా ఈ కథలుంటాయి. రెండోది, ప్రత్యర్ధి గ్యాంగ్ స్టర్ తో ఘర్షణ చుట్టూ వుంటాయి. సంపన్నంగా ఎదగడానికి చేసే నేరాలు ఆత్మవినాశానికి దారి తీసేవిగా వుంటాయి. చట్టానికీ నీతికీ వ్యతిరేకంగా పాత్ర చిత్రణలుంటాయి. ఈ చట్టానికీ నీతికీ ఎలా దొరికిపోతాడన్న ప్రశ్న రేకెత్తిస్తూ వుంటాయి. సంపన్నంగా ఎదగడానికి అడ్డమైన మార్గాలు ఎందుకు ఎంచుకుంటాడు? ఎందుకంటే, సన్మార్గంలో పొందే అర్హతలు గానీ, అవకాశాలు గానీ లేకపోవడం వల్ల. ఇలా జానర్ మర్యాదలు చాలా వుంటాయి. సీరియస్ గ్యాంగ్ స్టర్ మూవీయే చేయాలనుకుంటే జానర్ రీసెర్చి బాగా చేసుకోవాల్సి వుంటుంది.

Q : కథలు విన్పించడానికి వచ్చే కొత్త వాళ్ళకి మ్యానర్స్ గురించి మీరు రాయండి, తెలుసుకుని మారతారు. డిస్కస్ చేస్తున్నప్పుడు మధ్యలో వాడి సెల్ మోగుతుంది. నాకు మండిపోతుంది.
నిర్మాత
       
మీరే మొట్టి కాయేస్తే సరి. ఇలాటివి ఏం రాస్తాం. ఇంటి దగ్గర్నుంచి కూడా కాల్స్ వస్తాయి. ఎప్పుడొస్తారనో; మీ తమ్ముడొచ్చాడు, వచ్చేటప్పుడు చికెన్ తెమ్మనో అవతలి నుంచి తియ్యటి గొంతు. కామన్ సెన్స్ వుండదు. నిర్మాత తనకి కేటాయించిన టైముని నిర్మాతకే పరిమితం చేయాలి. ఇంకే విషయాలు మనసులోకి రానీయకూడదు. సెల్ ఫోన్ ఆఫ్ చేసేయాలి. నిర్మాత దగ్గరే కాదు, ఇంకే రంగంలో అప్పాయింట్ మెంట్ కెళ్లినా ఇదే చేయాలి. ఇక ఆఫీసుల్లో స్టోరీ వర్క్ చేస్తున్నప్పుడు కూడా సెల్ ఆఫ్ చేసేయాలి. బ్రేక్ తీసుకున్నప్పుడే అవతలి కెళ్ళి మాట్లాడుకోవాలి. స్టోరీ వర్క్ జరుగుతున్నప్పుడు రైటర్ మానసిక లోకమెలా వుంటుందంటే,  బ్రేక్ తీసుకున్నా స్టోరీ గురించే ఆలోచిస్తూంటాడు. టీ సిగరెట్లు, ఇతర్లతో కబుర్లు యాంత్రికంగా జరిగిపోతాయి. నిజమైన క్రియేటివ్ మైండ్ కి వెకేషన్ వెళ్ళినా బ్రేక్ వుండదు. రాయడం గురించే ఆలోచనలుంటాయి. రైటర్ కి భౌతికంగా బ్రేక్ వుండొచ్చు నేమో గానీ, మానసికంగా వుండదు. నిర్మాత ఇచ్చిన టైము మీద గౌరవంతో వుండాలి. సెల్ మర్యాద పాటించాలి.  

సికిందర్


26, సెప్టెంబర్ 2020, శనివారం

980 : రివ్యూ

రచన - దర్శకత్వం : ఆరతీ కడవ్
తారాగణం : విక్రాంత్ మాసీ
, శ్వేతా త్రిపాఠీ
సంగీతం : షేజాన్ షేక్
, ఛాయాగ్రహణం : కౌశల్ షా
నిర్మాతలు : అనురాగ్ కశ్యప్
, నవీన్ శెట్టి, శ్లోక్ ర్మా, ఆరతీ కడవ్
బ్యానర్స్ :  ఫండమెంటల్ పిక్చర్స్
, ఎలక్ట్రిక్ ఫిలిమ్స్
విడుదల
:  నెట్ ఫ్లిక్స్
***
         
బాలీవుడ్ నుంచి సైన్స్ ఫిక్షన్ లో కొత్త ప్రయోగం చేసింది కొత్త దర్శకురాలు ఆరతీ కడవ్. పురాణాలు చెప్పే జనన మరణాలు, పునర్జన్మ అర్ధాలకి అంతరిక్ష యుగంలో ఆధునిక టెక్నాలజీని సమన్వయం చేస్తూ పౌరాణిక -సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కించింది. రాక్షసులు మంచివాళ్ళుగా మారి, మానవ సేవకి దిగివస్తే మానవ జీవితం ఎలా వుంటుందన్న ప్రశ్న రేకెత్తించింది. బావుంది. మరి ఇదెంతవరకు చెప్పగల్గింది? అసలేం చెప్పింది? చెప్పాల్సింది చెప్పిందా లేదా? ఈ ప్రశ్నలతో ముందుకెళ్తే ఆక్సిజన్ లేకుండా అంతరిక్షంలోకి వెళ్ళినట్టుంటుందా? అంతరిక్షంలోంచి తోసేస్తే మధ్యలో వేలాడినట్టుంటుందా? కిందపడితే పునర్జన్మ ఎత్తినట్టుంటుందా? ఎలా వుంటుంది? దీనికి జవాబుకోసం ఈ నెట్ ఫ్లిక్స్ మూవీని చూద్దాం...

        ది 2027 వ సంవత్సరం. 75 ఏళ్ల  క్రితం రాక్షసులు అంతరిక్ష యుగంలోకి ప్రవేశించి మనుష్య - రాక్షస శాంతి ఒప్పందం చేసుకుని వుంటారు. దాంతో మనుషులతో తమ వైరాన్ని పూర్తిగా తుడిపేసుకుంటారు. పుష్పక్ 634 A అనే ఒక అంతరిక్ష నౌకని సిద్ధం చేసి పంపడం మొదలెడతారు. ఈ నౌకలో రావణ సైన్యం ప్రధాన దళాధికారి ప్రహస్త (విక్రమ్ మాసీ) వుంటాడు. ఇతను ప్రతీ ఉదయం భూమికి సమీపంగా వచ్చి మరణించిన వారి కార్గోని తీసికెళ్తాడు. భూమ్మీద గ్రౌండ్ కంట్రోల్ ఆఫీసర్ నీతిజ్ఞ (నందూ మాధవ్) కి కంప్యూటర్ ద్వారా అనుసంధానమై వుంటూ, మృతుల సమాచారమందుకుని ఈ డ్యూటీ చేస్తూంటాడు.

       అంతరిక్ష నౌకలో ప్రహస్త పోస్ట్ డెత్ ట్రాన్సిషన్ సర్వీసెస్ కి పని చేస్తూంటాడు. అంటే చనిపోయిన మనుషులకి  కంప్యూటరీకరణ, రీసైక్లింగ్ మొదలైనవి చేసి, పునర్జన్మకి సిద్ధం చేస్తూంటాడు. ఈ ప్రక్రియలో జ్ఞాపకాల్ని కూడా తీసేస్తాడు. 75 సంవత్సరాలుగా మార్పూ  అభివృద్ధీ లేకుండా రొటీన్ గా ఇదే పని చేస్తూంటాడు. అప్పుడు అతడి కంటే ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్న యువిష్కా (శ్వేతా త్రిపాఠీ) అసిస్టెంట్ గా నౌకలో ప్రవేశిస్తుంది. 
        ఆమె చేసే ట్రీట్మెంట్ అతడికి భిన్నంగా వుంటుంది. యాంత్రికంగా వుండే అతడికి చావుపుట్టుకల గురించి పౌరాణిక అర్ధాలు చెప్తుంది. చెప్తూనే వుంటుంది...అలా చెప్తూ వుంటుంది...ఇంతే కథ
, ఇదే కథ. ఇంతకి మించి ఏమీ వుండదు.

        మృతుల్ని పునర్జన్మకి సిద్ధం చేశాక ఆ మరుజన్మ ఎలా వుంటుందో చూపించాలనుకోదు దర్శకురాలు. కార్గో రిసీవ్ చేసుకోవడమేగానీ డెలివరీ వుండదు. కథలో ఏ మలుపులూ వుండవు. పాయింటు వుండదు. పాత్రలకి లక్ష్యా లుండవు. సంఘర్షణ వుండదు. థ్రిల్స్ వుండవు
, స్పీడు వుండదు. ముగింపు కూడా వుండదు. అసలు హీరోహీరోయిన్ పాత్రల మధ్య రోమాన్స్ కూడా వుండదు. వాళ్లెందుకున్నారో, ఏం చేస్తున్నారో అర్ధముండదు. కథా లక్షణాలే వుండవు.

        హీరోయిన్ హీరోకంటే ఎలా భిన్నమో దర్శకురాలు హాస్యాస్పదంగా చూపించింది. మృతుల గాయాల్ని మాన్పడమెలాగో అతడికి తెలియకపోతే
, గాయాల మీద బ్లూ ప్లాస్టిక్ టేపు వేసి టార్చి వేస్తుంది. గాయాలు మాయం! ఇదీ హీరోయిన్ స్పెషల్ నాలెడ్జి. కత్తితో కూడా కోస్తుందామె. జానపద సినిమాల్లో మంత్రగత్తె ఉఫ్ మని వూదితే గాయాలు మాయమైపోతాయి- ఇలాకూడా వుండవు ఈ సైన్స్ ఫిక్షన్ క్యారక్టర్లు. 

        మృతులై వచ్చిన వాళ్ళల్లో ఒక మెజీషియన్, ఒక సినిమా స్టంట్ మాన్, ఇంకో కోపిష్టీ మొదలైన వాళ్ళుంటారు. ఈ ప్రత్యేకతలు కథ కుపయోగపడిందీ లేదు. ఉపయోగపడితే కథ అనే పదార్ధం పుట్టేది. మృతులు మగవాళ్లే వుంటారా? ఆడవాళ్ళు మగవాళ్ళని పైకి తోలేసి మజా చేసుకుంటున్నారా? స్టంట్ మాన్ తాను సల్మాన్ ఖాన్ గా పుట్టాలనుకుంటాడు. అలా పుట్టి భూమ్మీదికొస్తే ఏం చేస్తూంటాడో చూపించాలిగా? చచ్చిపోయిన మనుషులకి పైన నరకం లేదనీ, జన్మ మార్చుకుని మళ్ళీ కోరుకున్న విధంగా పుట్టే అవకాశముందనీ తెలిస్తే ఎవరు దారుణాలు చేయకుండా వుంటారు? భూమి పాపాల దిబ్బగా మారదా? కష్టాల్లో వున్నవాళ్లు అర్జెంటుగా ఆత్మహత్యలు చేసుకుని పైకెళ్లి మంచి జన్మ కోరుకుని పుట్టరా? ఇలాటి వన్నీ ఈ మూవీలో తలెత్తే ప్రశ్నలు. ప్రకృతికి వ్యతిరేకంగా రాక్షసులు ఇలా దుకాణం పెట్టుకుంటే ప్రకృతి వూరుకుంటుందా? 


        ఈ రాక్షసులెవరు
? యముడేమయ్యాడు, యమ భటులేమయ్యారు, యమలోకం ఏమైంది? రావణ భటు లెక్కడ్నుంచి వచ్చారు? ఈ ప్రశ్నలకి, సందేహాలకీ సమాధానాలు కూడా ఇవ్వాలనుకోదు దర్శకురాలు. పురాణాల్లో రావణుడు యమ కుబేర దేవ అసుర లోకాలపై యుద్ధం ప్రకటించి ముల్లోకాల్ని జయిస్తాడు. ఈ యుద్ధానికి ముఖ్య సేనాపతి ప్రహస్త. రావణుడు జయించడం
వల్ల యమలోకంపోయి రావణ లోకం ఏర్పడిందనీ
, అతను మనుషులతో శాంతి ఒప్పందం చేసుకుని ఈ కథ ప్రారంభించాడా? ఏదోవొక స్పష్టత నివ్వాలిగా?

        మనుష్య - రాక్షస ఒప్పందమని కొత్తగా కిల్లర్ ఐడియా చెప్పి ప్రాజెక్టు ఓకే చేయించుకున్నట్టుంది
. ఇలాటి ఒప్పందమే సాధ్యమైతే పరిణామాలెలావుంటాయో వూహించినట్టు లేదు. మంచీ చెడుల్లో రాక్షసులనే చెడు లేకపోతే భూమ్మీద కూడా ఈ ద్వంద్వాలుండవు. ద్వంద్వాలనేవి సృష్టి మూల సూత్రాలు. సృష్టి మూలసూత్రాలకే విరుద్ధంగా ఐడియాలు చేస్తే ఇదుగో ఇలా ఏం కథ చెప్పాలో తెలియక చేతులెత్తేసి నట్టుంటుంది. ప్రేక్షకుల్ని అంతరిక్షంలోకి తీసికెళ్లి తోసేసి నట్టుంటుంది.

సికిందర్