రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, సెప్టెంబర్ 2020, ఆదివారం

981 : సందేహాలు - సమాధానాలు


 

Q : నమస్తే, తెలుగులో నాయకుడు లాంటి గ్యాంగ్ స్టర్ మూవీస్ ఇప్పుడు వర్కౌట్ అవుతాయా? గ్యాంగ్ స్టర్ స్టోరీస్ రాసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పగలరు.
జయసింహా, రైటర్
A : తమిళంలో కమలహాసన్ తో మణిరత్నం 1987 లో తీసిన నాయకన్ (నాయకుడు) ముంబాయి డాన్ వరదరాజన్ ముదలియార్ జీవిత కథ. వరదరాజన్ 1960-80 ల మధ్య డాన్ గా ఏలాడు. అదే కాలంలో హాజీ మస్తాన్ డాన్ గా వున్నాడు. హాజీ మస్తాన్ కథతో అమితాబ్ బచ్చన్ తో 1975 లో దీవార్ తీశారు, దీవార్’, నాయకన్ ఈ రెండూ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. వరదరాజన్ కథతో నాయకన్ తర్వాత ఇంకెన్నో హిందీ తమిళం మలయాళం సినిమాలు తీశారు. ఏవీ నిలబడలేదు. హాజీ మస్తాన్ తర్వాత ముంబాయిలో దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ ల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సత్య’, కంపెనీ లు తీసినప్పుడు హిట్టయ్యాయి. ఇక హాలీవుడ్ గాడ్ ఫాదర్ ననుసరించి ఇంకెన్నో ఫిక్షన్ డాన్ల సినిమాలొచ్చాయి. ఇవన్నీ గ్యాంగ్ స్టర్ జానర్ కిందికే వస్తాయి. అలాగే 1970 ల నాటి విజయవాడ గ్యాంగ్ స్టర్స్ రంగా, రాధాల ఆధారంగా వర్మ తీస్తే అవి కూడా సంచలనం సృష్టించాయి. చెప్పొచ్చేదేమిటంటే, పేరుండి వార్తల కెక్కిన నిజ డాన్లు, గ్యాంగ్ స్టర్లు, లేదా వీరప్పన్ లాంటి బందిపోట్లతో తీసే సినిమాలకి మంచి మార్కెట్ యాస్పెక్ట్ వుంటోంది. 


        విజయవాడ సీన్ ని ఇటు హైదారాబాద్ వైపు చూస్తే 1970 లలో జార్జి రెడ్డి (విద్యార్థి నాయకుడు)
, 2000 లలో నయీమ్ (గ్యాంగ్ స్టర్) వున్నారు. జార్జి రెడ్డితో ఈ మధ్య తీసిన జార్జిరెడ్డి ఆడలేదు. ఇక నయీమ్ మీద తీయలేదు. మార్కెట్ యాస్పెక్ట్ వున్నప్పటికీ జార్జి రెడ్డి ఆడకపోవడానికి తీసిన విధానం, అంటే జానర్ మర్యాదలతో క్రియేటివ్ యాస్పెక్ట్ బాగా లేకపోవడం కారణం. 


        ఇప్పుడు డాన్లు. గ్యాంగ్ స్టర్లు ముంబాయిలోనే లేరు. కాబట్టి ఆ జానర్ సినిమాలు హిందీలో తీయడం లేదు. నిజ డాన్లు
, గ్యాంగ్ స్టర్లు కాకుండా ఫిక్షన్ చేసి తీస్తే ఆడినవి కూడా ముంబాయిలో డాన్ల, గ్యాంగ్ స్టర్ల ప్రభావమున్న కాలంలోనే. 1978 లో అమితాబ్ తో తీసిన హిట్ డాన్ ఫిక్షన్. మరి 1989 లో డాన్లు ఏపీ లోనే లేనప్పుడు, శివ అనే ఫిక్షన్ డాన్ హిట్టయ్యింది కదా అంటే, దానికి విజయవాడ కాలేజీ రాజకీయాల, రౌడీయిజాల నిజ వ్యక్తులతో నిజ నేపథ్యముంది. ఆ తర్వాత కాలేజీ ఎన్నికల్లేవు, రౌడీ రాజకీయాల్లేవు. కేవలం ఎన్టీఆర్ కాలంలో మద్య నిషేధమనే నిజ నేపథ్యంతో, ఫిక్షన్ క్యారక్టర్ తో శర్వానంద్ తో 2019 లో రణరంగం తీస్తే ఆడలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు గ్యాంగ్ స్టర్ సినిమాలు తీయడమన్నది జూదమనుకోవాలి.

        ఇందుకు బదులుగా ఇటీవలి కన్నడ
ఫ్రెంచి బిర్యానీ లాంటి కామెడీ ప్రధానమైన ఫిక్షన్ డాన్ తీస్తే వర్కౌట్ అవచ్చు. ఒకసారి  ఫ్రెంచి బిర్యానీ చూడండి. దాని ఇన్నోవేట్ చేసిన మార్కెట్ యాస్పెక్ట్ పరిశీలించండి. ఈ లింక్ క్లిక్ చేసి రివ్యూ చూడండి.

        సీరియస్ గ్యాంగ్ స్టర్ కథలు హీరోల మీద వుంటేనే ఆడాయి. ఎందుకంటే హీరోల్లో మంచి గుణాలు చూపించే వీలవుతుంది. వరదరాజన్
, హాజీ మస్తాన్లలో ప్రజల్లో మమేకం చేసే మంచి గుణాలు కూడా వున్నాయి. కనుక ఫిక్షన్ కథగా తీయాలనుకున్నప్పుడు హీరో పాత్ర ఈ తీరులో వుండాల్సి వుంటుంది. మిగతా స్ట్రక్చర్  అంతా మూడంకాల త్రీయాక్ట్ స్ట్రక్చరే. త్రీ యాక్ట్ స్ట్రక్చర్ గురించి ఈ బ్లాగులోనే చాలా ఆర్టికల్స్ వున్నాయి. మీరు చాలా కాలంగా బ్లాగుని ఫాలో అవుతున్నారు కాబట్టి అన్ని జానర్లకూ ఒకే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వుంటుందని తెలిసే వుంటుంది. కాకపోతే గ్యాంగ్ స్టర్ జానర్ మర్యాదలు తెలుసుకుని ఈ స్ట్రక్చర్ లో కూర్చాలి. జానర్ జానర్ కీ జనర్ మర్యాదలు వేర్వేరుగా వుంటాయి. ఇది క్రియేటివ్ యాస్పెక్ట్ లో చూసుకోవాల్సిన విషయం.

        ఇంకా క్రియేటివ్ యాస్పెక్ట్ లో
, సంపన్నంగా ఎదగాలన్న బలమైన కోరిక గ్యాంగ్ స్టర్స్ ని నేరాల వైపు తీసికెళ్ళడమన్నదే కాన్సెప్ట్ గా వుంటుంది. అంటే ఎకనమిక్స్ ప్రధానంగా ఈ కథలుంటాయి. రెండోది, ప్రత్యర్ధి గ్యాంగ్ స్టర్ తో ఘర్షణ చుట్టూ వుంటాయి. సంపన్నంగా ఎదగడానికి చేసే నేరాలు ఆత్మవినాశానికి దారి తీసేవిగా వుంటాయి. చట్టానికీ నీతికీ వ్యతిరేకంగా పాత్ర చిత్రణలుంటాయి. ఈ చట్టానికీ నీతికీ ఎలా దొరికిపోతాడన్న ప్రశ్న రేకెత్తిస్తూ వుంటాయి. సంపన్నంగా ఎదగడానికి అడ్డమైన మార్గాలు ఎందుకు ఎంచుకుంటాడు? ఎందుకంటే, సన్మార్గంలో పొందే అర్హతలు గానీ, అవకాశాలు గానీ లేకపోవడం వల్ల. ఇలా జానర్ మర్యాదలు చాలా వుంటాయి. సీరియస్ గ్యాంగ్ స్టర్ మూవీయే చేయాలనుకుంటే జానర్ రీసెర్చి బాగా చేసుకోవాల్సి వుంటుంది.

Q : కథలు విన్పించడానికి వచ్చే కొత్త వాళ్ళకి మ్యానర్స్ గురించి మీరు రాయండి, తెలుసుకుని మారతారు. డిస్కస్ చేస్తున్నప్పుడు మధ్యలో వాడి సెల్ మోగుతుంది. నాకు మండిపోతుంది.
నిర్మాత
       
మీరే మొట్టి కాయేస్తే సరి. ఇలాటివి ఏం రాస్తాం. ఇంటి దగ్గర్నుంచి కూడా కాల్స్ వస్తాయి. ఎప్పుడొస్తారనో; మీ తమ్ముడొచ్చాడు, వచ్చేటప్పుడు చికెన్ తెమ్మనో అవతలి నుంచి తియ్యటి గొంతు. కామన్ సెన్స్ వుండదు. నిర్మాత తనకి కేటాయించిన టైముని నిర్మాతకే పరిమితం చేయాలి. ఇంకే విషయాలు మనసులోకి రానీయకూడదు. సెల్ ఫోన్ ఆఫ్ చేసేయాలి. నిర్మాత దగ్గరే కాదు, ఇంకే రంగంలో అప్పాయింట్ మెంట్ కెళ్లినా ఇదే చేయాలి. ఇక ఆఫీసుల్లో స్టోరీ వర్క్ చేస్తున్నప్పుడు కూడా సెల్ ఆఫ్ చేసేయాలి. బ్రేక్ తీసుకున్నప్పుడే అవతలి కెళ్ళి మాట్లాడుకోవాలి. స్టోరీ వర్క్ జరుగుతున్నప్పుడు రైటర్ మానసిక లోకమెలా వుంటుందంటే,  బ్రేక్ తీసుకున్నా స్టోరీ గురించే ఆలోచిస్తూంటాడు. టీ సిగరెట్లు, ఇతర్లతో కబుర్లు యాంత్రికంగా జరిగిపోతాయి. నిజమైన క్రియేటివ్ మైండ్ కి వెకేషన్ వెళ్ళినా బ్రేక్ వుండదు. రాయడం గురించే ఆలోచనలుంటాయి. రైటర్ కి భౌతికంగా బ్రేక్ వుండొచ్చు నేమో గానీ, మానసికంగా వుండదు. నిర్మాత ఇచ్చిన టైము మీద గౌరవంతో వుండాలి. సెల్ మర్యాద పాటించాలి.  

సికిందర్


26, సెప్టెంబర్ 2020, శనివారం

980 : రివ్యూ

రచన - దర్శకత్వం : ఆరతీ కడవ్
తారాగణం : విక్రాంత్ మాసీ
, శ్వేతా త్రిపాఠీ
సంగీతం : షేజాన్ షేక్
, ఛాయాగ్రహణం : కౌశల్ షా
నిర్మాతలు : అనురాగ్ కశ్యప్
, నవీన్ శెట్టి, శ్లోక్ ర్మా, ఆరతీ కడవ్
బ్యానర్స్ :  ఫండమెంటల్ పిక్చర్స్
, ఎలక్ట్రిక్ ఫిలిమ్స్
విడుదల
:  నెట్ ఫ్లిక్స్
***
         
బాలీవుడ్ నుంచి సైన్స్ ఫిక్షన్ లో కొత్త ప్రయోగం చేసింది కొత్త దర్శకురాలు ఆరతీ కడవ్. పురాణాలు చెప్పే జనన మరణాలు, పునర్జన్మ అర్ధాలకి అంతరిక్ష యుగంలో ఆధునిక టెక్నాలజీని సమన్వయం చేస్తూ పౌరాణిక -సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కించింది. రాక్షసులు మంచివాళ్ళుగా మారి, మానవ సేవకి దిగివస్తే మానవ జీవితం ఎలా వుంటుందన్న ప్రశ్న రేకెత్తించింది. బావుంది. మరి ఇదెంతవరకు చెప్పగల్గింది? అసలేం చెప్పింది? చెప్పాల్సింది చెప్పిందా లేదా? ఈ ప్రశ్నలతో ముందుకెళ్తే ఆక్సిజన్ లేకుండా అంతరిక్షంలోకి వెళ్ళినట్టుంటుందా? అంతరిక్షంలోంచి తోసేస్తే మధ్యలో వేలాడినట్టుంటుందా? కిందపడితే పునర్జన్మ ఎత్తినట్టుంటుందా? ఎలా వుంటుంది? దీనికి జవాబుకోసం ఈ నెట్ ఫ్లిక్స్ మూవీని చూద్దాం...

        ది 2027 వ సంవత్సరం. 75 ఏళ్ల  క్రితం రాక్షసులు అంతరిక్ష యుగంలోకి ప్రవేశించి మనుష్య - రాక్షస శాంతి ఒప్పందం చేసుకుని వుంటారు. దాంతో మనుషులతో తమ వైరాన్ని పూర్తిగా తుడిపేసుకుంటారు. పుష్పక్ 634 A అనే ఒక అంతరిక్ష నౌకని సిద్ధం చేసి పంపడం మొదలెడతారు. ఈ నౌకలో రావణ సైన్యం ప్రధాన దళాధికారి ప్రహస్త (విక్రమ్ మాసీ) వుంటాడు. ఇతను ప్రతీ ఉదయం భూమికి సమీపంగా వచ్చి మరణించిన వారి కార్గోని తీసికెళ్తాడు. భూమ్మీద గ్రౌండ్ కంట్రోల్ ఆఫీసర్ నీతిజ్ఞ (నందూ మాధవ్) కి కంప్యూటర్ ద్వారా అనుసంధానమై వుంటూ, మృతుల సమాచారమందుకుని ఈ డ్యూటీ చేస్తూంటాడు.

       అంతరిక్ష నౌకలో ప్రహస్త పోస్ట్ డెత్ ట్రాన్సిషన్ సర్వీసెస్ కి పని చేస్తూంటాడు. అంటే చనిపోయిన మనుషులకి  కంప్యూటరీకరణ, రీసైక్లింగ్ మొదలైనవి చేసి, పునర్జన్మకి సిద్ధం చేస్తూంటాడు. ఈ ప్రక్రియలో జ్ఞాపకాల్ని కూడా తీసేస్తాడు. 75 సంవత్సరాలుగా మార్పూ  అభివృద్ధీ లేకుండా రొటీన్ గా ఇదే పని చేస్తూంటాడు. అప్పుడు అతడి కంటే ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్న యువిష్కా (శ్వేతా త్రిపాఠీ) అసిస్టెంట్ గా నౌకలో ప్రవేశిస్తుంది. 
        ఆమె చేసే ట్రీట్మెంట్ అతడికి భిన్నంగా వుంటుంది. యాంత్రికంగా వుండే అతడికి చావుపుట్టుకల గురించి పౌరాణిక అర్ధాలు చెప్తుంది. చెప్తూనే వుంటుంది...అలా చెప్తూ వుంటుంది...ఇంతే కథ
, ఇదే కథ. ఇంతకి మించి ఏమీ వుండదు.

        మృతుల్ని పునర్జన్మకి సిద్ధం చేశాక ఆ మరుజన్మ ఎలా వుంటుందో చూపించాలనుకోదు దర్శకురాలు. కార్గో రిసీవ్ చేసుకోవడమేగానీ డెలివరీ వుండదు. కథలో ఏ మలుపులూ వుండవు. పాయింటు వుండదు. పాత్రలకి లక్ష్యా లుండవు. సంఘర్షణ వుండదు. థ్రిల్స్ వుండవు
, స్పీడు వుండదు. ముగింపు కూడా వుండదు. అసలు హీరోహీరోయిన్ పాత్రల మధ్య రోమాన్స్ కూడా వుండదు. వాళ్లెందుకున్నారో, ఏం చేస్తున్నారో అర్ధముండదు. కథా లక్షణాలే వుండవు.

        హీరోయిన్ హీరోకంటే ఎలా భిన్నమో దర్శకురాలు హాస్యాస్పదంగా చూపించింది. మృతుల గాయాల్ని మాన్పడమెలాగో అతడికి తెలియకపోతే
, గాయాల మీద బ్లూ ప్లాస్టిక్ టేపు వేసి టార్చి వేస్తుంది. గాయాలు మాయం! ఇదీ హీరోయిన్ స్పెషల్ నాలెడ్జి. కత్తితో కూడా కోస్తుందామె. జానపద సినిమాల్లో మంత్రగత్తె ఉఫ్ మని వూదితే గాయాలు మాయమైపోతాయి- ఇలాకూడా వుండవు ఈ సైన్స్ ఫిక్షన్ క్యారక్టర్లు. 

        మృతులై వచ్చిన వాళ్ళల్లో ఒక మెజీషియన్, ఒక సినిమా స్టంట్ మాన్, ఇంకో కోపిష్టీ మొదలైన వాళ్ళుంటారు. ఈ ప్రత్యేకతలు కథ కుపయోగపడిందీ లేదు. ఉపయోగపడితే కథ అనే పదార్ధం పుట్టేది. మృతులు మగవాళ్లే వుంటారా? ఆడవాళ్ళు మగవాళ్ళని పైకి తోలేసి మజా చేసుకుంటున్నారా? స్టంట్ మాన్ తాను సల్మాన్ ఖాన్ గా పుట్టాలనుకుంటాడు. అలా పుట్టి భూమ్మీదికొస్తే ఏం చేస్తూంటాడో చూపించాలిగా? చచ్చిపోయిన మనుషులకి పైన నరకం లేదనీ, జన్మ మార్చుకుని మళ్ళీ కోరుకున్న విధంగా పుట్టే అవకాశముందనీ తెలిస్తే ఎవరు దారుణాలు చేయకుండా వుంటారు? భూమి పాపాల దిబ్బగా మారదా? కష్టాల్లో వున్నవాళ్లు అర్జెంటుగా ఆత్మహత్యలు చేసుకుని పైకెళ్లి మంచి జన్మ కోరుకుని పుట్టరా? ఇలాటి వన్నీ ఈ మూవీలో తలెత్తే ప్రశ్నలు. ప్రకృతికి వ్యతిరేకంగా రాక్షసులు ఇలా దుకాణం పెట్టుకుంటే ప్రకృతి వూరుకుంటుందా? 


        ఈ రాక్షసులెవరు
? యముడేమయ్యాడు, యమ భటులేమయ్యారు, యమలోకం ఏమైంది? రావణ భటు లెక్కడ్నుంచి వచ్చారు? ఈ ప్రశ్నలకి, సందేహాలకీ సమాధానాలు కూడా ఇవ్వాలనుకోదు దర్శకురాలు. పురాణాల్లో రావణుడు యమ కుబేర దేవ అసుర లోకాలపై యుద్ధం ప్రకటించి ముల్లోకాల్ని జయిస్తాడు. ఈ యుద్ధానికి ముఖ్య సేనాపతి ప్రహస్త. రావణుడు జయించడం
వల్ల యమలోకంపోయి రావణ లోకం ఏర్పడిందనీ
, అతను మనుషులతో శాంతి ఒప్పందం చేసుకుని ఈ కథ ప్రారంభించాడా? ఏదోవొక స్పష్టత నివ్వాలిగా?

        మనుష్య - రాక్షస ఒప్పందమని కొత్తగా కిల్లర్ ఐడియా చెప్పి ప్రాజెక్టు ఓకే చేయించుకున్నట్టుంది
. ఇలాటి ఒప్పందమే సాధ్యమైతే పరిణామాలెలావుంటాయో వూహించినట్టు లేదు. మంచీ చెడుల్లో రాక్షసులనే చెడు లేకపోతే భూమ్మీద కూడా ఈ ద్వంద్వాలుండవు. ద్వంద్వాలనేవి సృష్టి మూల సూత్రాలు. సృష్టి మూలసూత్రాలకే విరుద్ధంగా ఐడియాలు చేస్తే ఇదుగో ఇలా ఏం కథ చెప్పాలో తెలియక చేతులెత్తేసి నట్టుంటుంది. ప్రేక్షకుల్ని అంతరిక్షంలోకి తీసికెళ్లి తోసేసి నట్టుంటుంది.

సికిందర్ 

 

17, సెప్టెంబర్ 2020, గురువారం

977 : సందేహాలు - సమాధానాలు


 

        Q : నా పేరు  వి.డి., అసోసియేట్.  థ్రిల్లర్ కథల్లో ప్రధాన పాత్ర తనే అన్ని విషయాలు తెలుసుకొని ప్రేక్షకులకు రివీల్ చేస్తే అది ఆక్టివ్ పాత్ర అన్నారు. అయితే మొన్న వచ్చిన వి సినిమాలో కూడా హీరో పాత్ర ముందు వేరే పాత్ర కూర్చుని జరిగిన కథ అంతా చెపుతుంది. ప్రతిసారి ఇలాంటి కథల్లో ఇదే పొరపాటు జరుగుతోంది. దీన్ని తప్పించుకుని హీరోనే అన్ని విషయాలు చెప్పాల్సిన విధంగా కథను ఎలా రాసుకోవాలి?

           
A :  ముందుగా జానర్ స్పష్టత తెచ్చుకుందాం. వి థ్రిల్లర్ కాదు, సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, క్రైమ్ థ్రిల్లర్ జానర్. అంటే ఇన్వెస్టిగేషన్ ఆధారిత కథ. ఒక పెద్ద స్టార్ తో వేలిముద్రలు, డీఎన్ఏ, రక్తపు జాడల వంటివి పోగేసుకుని విశ్లేషించుకునే సోకాల్డ్ ఇన్వెస్టిగేషన్ ఆధారిత కథ ఈ రోజుల్లో వర్కౌటవుతుందా? అవి చిన్న హీరోల పాదరక్షలు. లేదా టీవీ సీరియల్స్ సరుకు. పెద్ద స్టార్స్ కి క్రైమ్ థ్రిల్లర్ జానర్లో యాక్షన్ సబ్ జానర్ కథ అవసరం. క్యాచ్ మీ ఇఫ్యూ కెన్ స్టీవెన్ స్పీల్ బెర్గ్ సినిమాలాగా. ఇందులో క్రిమినల్ గా బిగ్ స్టార్ లియోనార్డో డీ కాప్రియో, ఇతణ్ణి పట్టుకునే ఎఫ్బీఐ అధికారిగా ఇంకో బిగ్ స్టార్ టామ్ హాంక్స్ నటించారు. ఇది పరారీలో వుంటున్న క్రిమినల్ హీరోని క్లూస్ ఆధారంగా పట్టుకునే చిన్న రేంజి కథ కాదు. యాక్షన్ ద్వారా పట్టుకునే బిగ్ యాక్షన్ కథ. అంటే హై కాన్సెప్ట్ క్రైమ్ - యాక్షన్ థ్రిల్లర్. ఈ కథ కూడా క్రిమినల్ ని పట్టుకోవడం గురించిన పొడిపొడి కథ కాదు. బ్యాక్ డ్రాప్ లో విచ్ఛిన్న కుటుంబం, దుర్భర బాల్యం గురించిన బాధాకర కథ. ఇలాటి కథ తీయాలని స్పెర్గ్ బెర్గ్ కల.

        ఎఫ్బీఐ అధికారి కూడా క్లూస్ తో ఇన్వెస్టిగేషన్ చేయడు. స్థూలంగా లీడ్స్ తోనే పట్టుకునే యాక్షన్లో వుంటాడు. అంటే క్రిమినల్ ఫలానా చోట వున్నాడని తెలుసుకుని వెళ్ళి పట్టుకోబోతే ఎత్తుకు పై ఎత్తు వేసి క్రిమినల్ పారిపోతూంటాడు. ఇదీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్లో వుండే కథనం.

        ఇక
వి లో నాని ఫ్లాష్ బ్యాక్ ఇంకో పాత్ర ద్వారా సుధీర్ బాబు వింటూ కూర్చోవడం జానర్ మర్యాద కాదు, అక్రమంగా చొరబడిన ఫ్యాక్షన్ సినిమాల టెంప్లెట్. ఫ్యాక్షన్ సినిమాల్లో హీరో ఫ్లాష్ బ్యాక్ సెకండాఫ్ లో ఇంకో పాత్ర చెప్పడం మొదలెట్టినట్టు. అట్టు వేస్తే అట్టే వేస్తారు, అట్టులో రొట్టె కలపడం వంట మర్యాద కాదు. అలాటి అట్టు రొట్టె గిరగిరా తిరుగుతూ వెళ్ళి పొయ్యిలోనే పడుతుంది. కాబట్టి దర్యాప్తు అధికారి సాక్షుల ద్వారానో, ఇంటరాగేషన్లోనో విడతలు విడతలుగా సమాచారం రాబట్టు కోవడం ఇన్వెస్టిగేషన్ జానర్ మర్యాదల కథనం. వి ని దర్శకుడి పాయింటాఫ్ వ్యూలో కథగా చెప్తున్నప్పుడు, నాని ఫ్లాష్ బ్యాక్ ని ఒకానొక విషమ ఘట్టంలో నానియే స్వయంగా తల్చుకునే
జ్ఞాపకంగా వుండి వుంటే ప్రథమ పురుషలో బాగా కనెక్ట్ అయ్యేది. అసలు వి ని హైకాన్సెప్ట్ క్రైమ్ - యాక్షన్ థ్రిల్లర్ గా తీసి వుండాలని ఇదివరకే చెప్పుకున్నాం.


          ఇక హీరోనే అన్ని విషయాలు చెప్పాల్సిన విధంగా కథను ఎలా రాసుకోవాలి? - అంటే, ముందు కథలు అడ్డగోలుగా రాసుకునే అలవాటుకి దూరమవాలి. ముందు తట్టిన ఐడియా జానరేమిటో స్పష్టత తెచ్చుకోవాలి. అప్పుడు జానర్ని, ఐడియాలో విషయాన్నీ క్షుణ్ణంగా  రీసెర్చి చేసుకుని పట్టు సంపాదించాలి. అలా ఒక రూపమేర్పడిన ఐడియాని స్ట్రక్చర్లో కుదిరే వరకూ పాట్లు పడాలి. ఇదంతా ఎన్ని రోజులైనా పట్టొచ్చు. అప్పుడా స్ట్రక్చర్లో కుదిరిన ఐడియాని సినాప్సిస్ గా రాసుకోవాలి. ఇదికూడా ఎన్నిరోజులైనా పట్టొచ్చు. ఈ రోజులన్నీ  సినాప్సిస్ తో జీవించాలి. కథ విస్తృతిని, లోతుపాతుల్నీ, పాత్రల స్వరూప స్వభావాల్నీ బాగా అర్ధం జేసుకోవాలి. కథలో ఫీల్ కథతో రాదు. పాత్రలతో వస్తుంది. సినిమా బావుందని ప్రేక్షకులు అన్నారంటే పాత్రల్ని ఫీలవడం వల్ల అంటారు. కాబట్టి ఆ పాత్రల్ని బాగా ఫీలయ్యి రాసుకోవాలి. అప్పుడు మాత్రమే లైనార్డర్ లోకి వెళ్ళాలి. అంతే గానీ ఏదో అనేసుకుని, దారీ తెన్నూ తెలియకుండా లైనార్డర్ వేసెయ్యబోతే వచ్చేది కథ కాదు, కన్నీటి గాథ. 

        ఇక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రాయడం గురించి. చిన్న హీరోలకైనా ఇవి రాయకపోవడం మంచిది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తీయడానికి ఇప్పుడెవరికీ అంత పరిజ్ఞానం లేదు. పైన చెప్పిన యాక్షన్ క్రైమ్ తీసుకుంటే సరిపోతుంది. ప్రేక్షకులు కూడా యాక్షన్ లో వుండే క్రైమ్ చూసేందుకు ఇష్టపడతారుగానీ
, తమ మేధస్సుకి ఎవరో పెట్టే అపరిపక్వ పరీక్షలకి బలి పశువులు కావాలనుకోరు.
  
Q : రెండవ ప్రశ్న. ప్రేమ కథల్లో రొమాంటిక్ కామెడీ, రొమాంటిక్ డ్రామా, ట్రియాంగిల్ లవ్ స్టోరీ లకు స్ట్రక్చర్ ఎలా వుంటుంది. వాటికి ప్లాట్ పాయింట్స్ ఏంటి? పాత్రలు ఆక్టివ్ లేక పాసివ్ పాత్రలుగా ఎలా వుంటాయి?? క్యారెక్టర్ ఆర్క్ ఎలా వుంటుంది అన్న విషయాల మీద పూర్తి వివరాలు చెప్పగలరు.
A :  పూర్తి వివరాలు చాలాసార్లు ఆర్టికల్స్ రూపంలో బ్లాగులో ఇచ్చాం.

సికిందర్

 

 

14, సెప్టెంబర్ 2020, సోమవారం

976 : సందేహాలు - సమాధానాలు


Q :  నాని నటించిన వి సినిమా రివ్యూలో స్టార్ సినిమాలకి హై కాన్సెప్ట్ కథ వుండాలని రాశారు. అన్ని స్టార్ సినిమా కథలు హై కాన్సెప్ట్ అయి వుండాలా? అసలు హై కాన్సెప్ట్ అనే మాట టాలీవుడ్ లో నేను వినలేదు.
దర్శకుడు  
A : హాలీవుడ్ లో వినే వుంటారు. అక్కడ స్టార్ సినిమాలకి హై కాన్సెప్ట్స్ నే ఆలోచిస్తారు. అంతేగానీ పదుల కోట్ల స్టార్ సినిమాలకి రెండు కోట్ల చిన్న హీరోల సినిమా కథలు  ఆలోచించరు. వి లో నాని చేసిన పొరపాటు తన స్టార్ ఇమేజికి చాలని చిన్న హీరో సినిమా కథని - అంటే లో – కాన్సెప్ట్ ని ఓకే చేసుకోవడమే. నానియే నటించిన గ్యాంగ్ లీడర్ లో ఆల్రెడీ ఈ పొరపాటు చేశాడు. అది చిన్న హీరో చేసుకోవాల్సిన లో- కాన్సెప్ట్ సినిమా. ఇదే దర్శకుడు విక్రమ్ కుమార్ తీసిన మనం హై కాన్సెప్ట్ స్టార్ సినిమా. భారీ బడ్జెట్ తో తీసినంత మాత్రాన స్టార్ సినిమా అయిపోదు. విషయం హై కాన్సెప్ట్ అయి వుండాలి. ఇంకా వివరాలు కావాలంటే ఈ లింకు క్లిక్ చేయగలరు - స్టార్ మూవీస్ అంటే...

Q :  వి లో నెలకొన్న ఎండ్ సస్పెన్స్, మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే సమస్యల్ని రివ్యూలో వివరిస్తారనుకున్నాము.
కెవిపి, అసోసియేట్
A : వి స్క్రీన్ ప్లే సంగతులు రాయలేదు కాబట్టి సమస్యల విషయం అలా వుండిపోయింది. ఇంకోటేమిటంటే, వి ఒక జానర్లో కూడా లేదు. ఎప్పుడే జానర్లోకి వెళ్ళిపోయి రసాస్వాదనని దెబ్బతీస్తుందో మనమే కాచుకోవాలి. దీని స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే కొన్ని రోజులు పట్టేలా వుంది.

        (మరో మూడు ఫోన్లు వచ్చాయి. ఆ సందేహాలకి సమాధానాలు బ్లాగులో చూడమన్నాం. 1. బుచ్చి నాయుడు కండ్రిగ లాటి ప్రేమ సినిమాలు  ఓటీటీలో సక్సెస్ అవుతాయా, ఓటీటీ ని దృష్టిలో పెట్టుకుని చిన్న సినిమాలు ఎలా తీయాలి? -  బుచ్చి నాయుడు కండ్రిగ లాటి ప్రేమ సినిమాలు ఓటీటీలో కాదుకదా థియేటర్లలో కూడా ఒక్క రోజు ఆడవు. అది కాలం చెల్లిన ప్రేమ సినిమా. పైగా పీరియడ్ బ్యాక్ డ్రాప్. ఇంకా చూసి చూసి వున్న అవే టెంప్లెట్ సీన్లు. పాయింటు వచ్చేసి ప్రేమకి కులం అడ్డు. ఈ కులాల కథలేమిటి పిచ్చి కాకపోతే. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ బోల్డ్, వయోలెంట్, అర్బన్ సబ్జెక్టుల్ని ఫిక్స్ చేసుకున్నాయి. అవి కూడా కొత్త వాళ్ళతో తీస్తే సమస్యే. ఒక ప్రధాన కార్పొరేట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ పోస్ట్ ప్రొడక్షన్ వివరాలడుగుతోంది. దాన్నిబట్టి నిర్ణయించే రేట్లు దారుణంగా వున్నాయి. థియేటర్లలో విడుదల చేస్తే ఒక రేటు, చేయకపోతే ఇంకో రేటు. ఏదైనా క్షవరమే. ఇప్పటికే తీసిన సినిమాలు ఓటీటీకి ఇచ్చుకున్నా ఇవ్వకపోయినా, కొత్తగా ప్లాన్ చేసే సినిమాలు ఇంకో ఆరు నెలలకైనా కోవిడ్ తోకముడ్చుకోవచ్చని నమ్మి థియేటర్లని దృష్టి లో పెట్టుకుని మొదలు పెట్టుకుంటే మంచిది. అప్పుడైనా కండ్రిగలు, కడగండ్లు తీసి విడుదల చేస్తే ప్రేక్షకులు క్షమించరు. కోవిడ్ తర్వాత కొత్త శకంలోకి అడుగుపెట్టబోతున్నాం. 

        2. ఒక్క ముక్కలో అసలు కథంటే ఏమిటి
? - ఒక్క ముక్కలో కథంటే ప్రశ్న, ఆ ప్రశ్నకి తగ్గ సమాధానం. ప్రశ్న పుడితేనే ఆ ప్రశ్నతో పాత్ర సంఘర్షించి, తగిన సమాధానం కనుగొంటుంది. ఆ సమాధానం పాత ఫార్ములా సమాధానమై వుండకూడదు, వర్తమాన పరిస్థితులకి వర్తించేదై వుండాలి. ఇది స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ వన్ (ప్రశ్న), ప్లాట్ పాయింట్ టూ (సమాధానం) లకి వివరణ. 

        3. మలయాళం సినిమాలని చూసిన లొకేషన్లలోనే మళ్ళీ మళ్ళీ చూడక తప్పదా
? - నిజమే, మలయాళ రూరల్ సినిమాలు అవే లోకషన్లతో కనబడుతున్నాయి. అవే కొండలు, అవే లోయలు, అవే ఇళ్ళు. వరసబెట్టి తెలుగు సినిమాలు అరకు లోయలో తీస్తే ఎలా వుంటాయో అలా వుంటున్నాయి. పైత్యం బాగా ముదిరింది. వీటికి రివ్యూలు రాస్తునప్పుడు అద్భుతమైన కొండ కోనలు, లోయలూ పచ్చదమంటూ పదేపదే రాయడం కూడా పైత్యమే. రాయబోయే కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ రివ్యూ కూడా ఇలాగే 
తయారైంది). 

సికిందర్
         



7, సెప్టెంబర్ 2020, సోమవారం

975 : రివ్యూ


రచన - దర్శకత్వం : షంజు జేబా
తారాగణం : జాకబ్ గ్రెగరీ
, అనుపమా పరమేశ్వరన్, నజ్రియా నజీమ్, షైన్ టామ్ చాకో, కృష్ణ శంకర్ తదితరులు
సంగీతం : శ్రీహరి నాయర్
, ఛాయాగ్రహణం : సజద్ కకూ
బ్యానర్ : వేఫేరర్ ఫిలిమ్స్
నిర్మాత :  దుల్కర్ సల్మాన్
విడుదల :  నెట్ ఫ్లిక్స్

        లయాళ సినిమా సబ్జెక్టుల విషయంలో ఎంత ముందుంటుందో, అంత వెనుకబడి కూడా వుంటుంది. కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ తో ఎంత ముందుంటుందో, సూఫీయు మ్ సుజాతాయుమ్ తో అంత వెనుకబడి వుంటుంది. సీయూ సూన్ తో ఎంత దూకుడు గా వుంటుందో, కప్పేలా తో అంత కూలబడి వుంటుంది. తాజాగా ఇప్పుడు మనియారయిలే అశోకన్ (అశోకను శోభనపు గది) వెనకడుగులు లెక్కేసుకుంటూ లెక్కేసుకుంటూ వెళ్ళి సరాసరి సూర్యాస్తమయం దిశగా అంతర్ధానమై పోయింది. లెక్కేసుకుని మరీ రెండు తూర్పున ఉదయించే సినిమాలుగా, మరో రెండు పడమట కుంగే సినిమాలుగా సమ భావంతో తీర్చిదిద్దుతున్నారు మలయాళ టాలెంట్ కొత్త దర్శకులు.

       
కొత్త దర్శకుడు షంజు జేబా అవిరళ కృషి మనియారయిలే అశోకన్’. దీనికి నిర్మాత దుల్కర్ సల్మాన్. హీరో జాకబ్ గ్రెగరీ. ఈ ఎన్నారై సహాయ నటుడు ఈ సినిమాతో హీరో అయ్యాడు. తెలుగులో కూడా బాగా తెలిసిన అనుపమా పరమేశ్వరన్ ఇందులో ఒక హీరోయిన్. ఈమె మొదట్లో వచ్చి వెళ్లిపోయాక, ఇంకో హీరోయిన్ గా నజ్రియా నజీమ్ చిట్ట చివర్లో వచ్చి సెటిలవుతుంది. వీళ్ళిద్దరి రాకపోకల మధ్యంతా ఏం జరిగిందన్నది అసలు విషయం. ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదలై, 0.25 రేటింగ్ తో ట్రెండింగ్ అవుతోందంటే ఇంత ప్రమాద మెలా జరిగిందో చూద్దాం....

కథ
     అశోకన్ (గ్రెగరీ) పొట్టి వాడు. అందుచేత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. వూళ్ళో అందరికీ పెళ్ళిళ్ళవుతూంటే, ముప్ఫై దాటుతున్నా పొట్టి తనం వల్ల తన పెళ్ళి ఒక కలగా మారింది. ఈ కలల్లో ఎందరెందరో పెళ్ళి కూతుళ్ళు, ఎన్నెన్నో శోభనపు గదులు. తేరుకుంటే ఎడారి జీవితం. పొట్టి తనమే కాదు, రంగు తక్కువనీ, చిరుద్యోగమనీ కూడా సంబంధాలు రావడం లేదు. ఇతడి కిద్దరు స్నేహితులు రతీష్ (కృష్ణ శంకర్), షైజూ (షైన్ టామ్ చాకో) - వీడికి పెళ్ళెలా చేయాలా అని ఆలోచిస్తూంటారు. 


        తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తూనే వుంటారు. ఒక ప్రయత్నం ఫలించి పెళ్ళి చూపు లేర్పాటవుతాయి. తన కంటే పొడుగ్గా వున్న ఆ అమ్మాయి శ్యామ (అనుపమా పరమేశ్వరన్) ని చూసి నచ్చిందంటాడు. ఆమెకి నచ్చకపోయినా కోపిష్టి తండ్రి ముందు ఆమెకి సాగదు. పంతులు జాతకాలు చూస్తాడు. అశోకన్ జాతకం దారుణంగా వుంటుంది. పెళ్లి చేసుకుంటే తనో
, తనని కట్టుకున్నదో చావడం ఖాయం. ఇంత దారుణమైన జాతకంతో సంబంధం తప్పినందుకు శ్యామ సంతోషిస్తుంది. అశోకన్ కి అశోక వనమే.  

        తర్వాత పంతుల్ని కలిసి మార్గం చెప్పమంటాడు. ముందు అరటి చెట్టుని పెళ్లి చేసుకో
, తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోమంటాడు పంతులు. మొదటి పెళ్ళికే గండం గానీ రెండో పెళ్ళికి కాదంటాడు. అశోక్ వెళ్ళి తమ పొలంలోనే వున్న అరటి చెట్టుకి రహస్యంగా తాళి కట్టేస్తాడు. ఈ విషయం తెలీక ఏదో కారణం చేత వాళ్ళమ్మ అరటి చెట్టుని ఫటేల్ మని నరికేస్తుంది. ఇది చూసి తీవ్ర మానసిక క్షోభకి గురవుతాడు అశోకన్. 

        ఇప్పుడేం చేశాడు
? పెళ్ళికి మళ్ళీ కొత్త బాట ఎలా వేసుకున్నాడు? పొడగరి శ్యామనే చేసుకున్నాడా? పొట్టి తనంతో ఇబ్బంది తొలగిపోయిందా?...ఇవీ మిగతా కథలో తేలాల్సిన విషయాలు.  

నటనలు - సాంకేతికాలు
   అశోకన్ పాత్రని గ్రెగరీ ఫాంటసికల్ గా, మృదుమధురంగా నటించాడు. పెళ్లి, శోభనం, కాపురం వంటి కలల్లో తేలిపోతూ కళ్ళల్లో కైపు, మొహంలో మైమరపు, చేతల్లో అమాయ కత్వం అద్భుతంగా అభినయించాడు. తన సున్నిత అభినయానికి నేపథ్యంలో భావుకత తో కూడిన పాటలు, లాలిత్యంతో కూడిన సంగీతం జత కలిసి ఒక అలౌకిక ప్రపంచాన్ని సృష్టించాయి. దాదాపు గ్రెగరీ ఏకపాత్రాభినయం చేసినంత పని చేశాడు. పెళ్లి కాకపోతే ముప్ఫయ్యేళ్ళ వాడు తనలోకి తాను బాలుడిగా ఒదిగి పోతాడన్నట్టుగా మానసిక స్థితిని పోషించాడు. నా కోసం దూర తీరాల్నుంచీ వచ్చావు, నా హృదయాన్ని ప్రేమతో నింపావు  వంటి గీతాలాపనలతో మైకాన్నిసృష్టిస్తాడు. ఇలా నటనా పరంగా తను పూర్తి న్యాయమే చేశాడు, పాత్రే అన్యాయంగా వుంది. పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 


        ఇక ఇద్దరు హీరోయిన్లు ఆయారామ్ గయారామ్ టైపు. అనుపమా పరమేశ్వరన్ మొదట్లో కాసేపు
, నజ్రియా నజీమ్ చివర్లో కాసేపు కాల్షీటు చేసుకుని వెళ్లి పోతారు. మధ్యలో ఇంకో కాల్షీటు తీసుకుని నేవీ డ్రెస్సులో దుల్కర్ సల్మాన్ వచ్చి, గ్రెగరీని నాల్గు దులిపి వెళ్ళిపోతాడు. హీరోయిన్లు అతిధి పాత్ర లేసిన సినిమా ఇదే కావచ్చు దేశంలో. 

        గ్రెగరీ స్నేహితులుగా కృష్ణ శంకర్
, షైన్ టామ్ చాకో కూడా మృదువుగా నటిస్తారు. అందరిదీ మృదువైన నటనలే. సినిమా ఎక్కడా లౌడ్ గా వుండదు. సంభాషణలు లయబద్ధంగా వుంటాయి. దృశ్యాల్లో మోటు తనముండదు. తక్కువ పరికరాలతో సంగీతం కూడా మృదువుగా వుంటుంది. గ్రామం, చుట్టూ కొండలూ, ఘాట్ రోడ్ల లొకేషన్స్ పెయింటింగ్స్ లా వుంటాయి. మేకింగ్ పరంగా కొత్త అనుభూతి నిచ్చే ఆడియో- విజువల్ క్రియేషన్ ఇది. కొత్త దర్శకుడు షంజు జేబా తానూహించిన కథాప్రపంచం కంటే ఎక్కువే ఆవిష్కరించి వుంటాడు. తెలుగులో మేకింగ్ పరంగా చిన్న సినిమాలకి ఇలాటి ఆవిష్కరణలు ఎందుకు జరగవో ఎప్పుడూ వెంటాడే ప్రశ్నే. 

కథా కథనాలు
    ఇది రోమాంటిక్ డ్రామా జానర్ లో వున్న కథ. హీరో కాకుండా ఇతర పాత్రలు బలవంతం చేసి పెళ్లి జరిపించారు కాబట్టి ఇది రోమాంటిక్ డ్రామానే. సినిమా కథంటేనే హీరో కుండే గోల్. ఇక్కడ హీరోకి పొట్టి తనమనే సమస్య వుంది గానీ దాంతో ఏం చేయాలనే గోల్ లేదు. పొట్టి తనం శాపం కాదు, సమస్య కాదు. తన సైజు అమ్మాయిని చేసుకుంటే సరిపోతుంది. పొట్టితనం ఎప్పుడు సమస్య కావచ్చంటే, మై మేరీ పత్నీ ఔర్ వో అనే సూపర్ హిట్ లో పొట్టి లెక్చరర్ రాజ్ పల్ యాదవ్, పొడుగు రీతూపర్ణా సేన్ ని పెళ్లి చేసుకుని, అందరూ నవ్వుతున్నారని గింజికు చావడంలో వుండొచ్చు. 


        ఏ కథయినా ఒకే పాయింటు లేదా సమస్యతో వుంటుంది. అశోకన్ పాత్రకి పొట్టి తనం అనే పాయింటుని ఎస్టాబ్లిష్ చేశాక
, మళ్ళీ రంగు తక్కువ, చిరుద్యోగం అనే లోపాలు కూడా కలపడంతో పొట్టి తనమనే పాయింటు తేలిపోయింది. ఇంతే కాదు, జాతకమనే ఇంకో పాయింటు కూడా పొట్టితనం పాయింటుతో క్లాష్ అయి ఇదేం కథో అర్ధం గాకుండా చేసింది. ఈ కథ పొట్టితనం గురించా, జాతకం గురించా? 

        ఈ జాతకం పాయింటు కూడా గందరగోళంగా వుంది. అశోకన్ పెళ్లి చేసుకుంటే మరణ గండం వుందన్నపుడు దానికి విరుగుడు చెట్టుని పెళ్లి చేసుకోవడంగా చెప్పారు. అశోకన్ అరటి చెట్టుని పెళ్లి చేసుకున్నాక జాతక దోషం తొలగిపోయినట్టే. ఆ చెట్టుని తల్లి నరికి పారేస్తే జాతకం ప్రకారం మరణం గొడవ కూడా వదిలిపోయి క్లీన్ చిట్ వచ్చేసినట్టే. వెంటనే శ్యామని కాకపోతే ఇంకో తన సైజు అమ్మాయిని పెళ్లి చేసుకుని శోభనం జరుపుకో వచ్చు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఎక్కడో సినిమాల్లోనే కాదు
, నిజ జీవితంలో సినిమా నటి విషయమే వుంది. ఐశ్వర్యా రాయ్ కి కుజ దోషం వల్ల విడాకులో, మరణమో పొంచి వుందని, దోష నివారణకి రెండు చెట్లతో పెళ్లి జరిపించి, ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ తో జరిపించారు. 

       కానీ అశోకన్ ఏం చేస్తాడంటే, అరటి చెట్టుకి తాళి కట్టాకా, అరటి చెట్టునే భార్యగా తల్చుకుంటూ వూహాల్లో కాపురం చేస్తూంటాడు. తల్లి చెట్టు కొట్టేస్తే దోష నాశనమైందని సంతోషించక పిచ్చివాడయి పోతాడు. తండ్రి పెరట్లో రెండు మొక్కలు నాటితే, మళ్ళీ పిల్లలు పుట్టారని ఇంకో ప్రహసనం మొదలెడతాడు. వాటికి శివగామి, శివగంగ అని పేర్లు పెట్టుకుని, వాటి మీద వర్షం కూడా పడకుండా కాపాడుకుంటాడు. ఆ పిల్లలే లోకంగా జీవిస్తాడు. పెళ్లి చేసుకుంటే భార్య ఈ పిల్లల్ని చూడదని భీష్మించుకుంటాడు...ఇలా న్యూసెన్స్ చేస్తాడు. 

        ఇక స్నేహితులే  మెడలు వంచి తాము చూసిన సంబంధం ఇందూ (నజ్రియా నజీమ్) తో పెళ్లి జరిపించి అవతల పడేస్తారు. ఇందూని అడిగినప్పుడు పొట్టితనాన్ని ప్రశ్నించదు. పొట్టితనం ప్రశ్నకాకపోతే ఈ కథంతా ఎందుకు
? ఇప్పుడు పొడుగు అమ్మాయి ఇందూని చేసుకున్న తనని చూసి నల్గురూ నవ్వితే తట్టుకోగలడా? సహజంగా ఏ సైజుకా సైజు ఈడూ జోడూ చూసి పెద్దలు పెళ్ళిళ్ళు చేస్తారు. అశోకన్ పేరెంట్స్ కి ఈ కామన్ సెన్సు కూడా లేకుండా ఏళ్ల తరబడి సంబంధాలు చూడ్డం.   

        ఈ జాతక దోషం గతంలో సంబంధాలు చూసినప్పుడు లేదా
? ఇప్పుడే దేవుడు అర్జెంటుగా లేచి అప్డేట్ చేశాడా? సెంటిమెంట్లకి లాజిక్ కూడా అవసరం. ఇలా కథలోనే ఇన్నిదోషాలున్నాయి. దీంతో కథనంలో విషయం లేకుండా పోయింది. మొదటి అరగంట కథలో అనుపమా పరమేశ్వరన్ ఒకటి  రెండు సీన్లు పూర్తి చేసుకుని వెళ్లిపోయాక, చివర్లో నజ్రియా నజీమ్ వచ్చి రెండు సీన్లలో కన్పించే వరకూ, మధ్యలో దాదాపు గంటన్నర పాటు చెట్లతో అశోకన్ అర్ధం పర్ధం లేని కథే.

సికిందర్