రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, ఆగస్టు 2021, ఆదివారం

1053 : రివ్యూ

రచన- దర్శకత్వం : హసిత్ గోలి 
తారాగణం: శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయన, రవి బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, కాదంబరి కిరణ్, గంగవ్వ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్, ఛాయాగ్రహణం : వేద రామన్ శంకరన్
బ్యానర్స్ :  అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్, టి.జి. విశ్వప్రసాద్ 
విడుదల : 19 ఆగస్టు 2021
***
      రెండేళ్ళ క్రితం బ్రోచేవారెవరురా అనే హిట్ తర్వాత తిప్పరా మీసం’, గాలి సంపత్ లాంటి రెండు ఫ్లాప్స్ లో నటించి తిరిగి ఇప్పుడు రాజరాజ చోర తో గాడిలో పడినట్టు వార్తలు సృష్టిస్తున్న శ్రీవిష్ణుకిది నిజానికి నటనలో  ప్రతిభని సానబట్టుకునే అవకాశం, పాత్ర అలాటిది కాబట్టి.  చోరకళ  వున్న పాత్రకి ప్రేక్షకుల హృదయాల్ని దోచుకునే నటన కూడా తోడ్పడాలి.  దీన్నెంత వరకు సాధించాడు? అలాగే కె. విశ్వనాథ్, జంధ్యాల వంటి దర్శకుల స్కూలుకి చెందినట్టు చెప్పుకున్న కొత్త దర్శకుడు హసిత్, సాహిత్య సంగీత సాంప్రదాయాల సమ్మేళనంగా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకుల ముందుంచాడు. దీంతో ఎంత వరకు మెప్పించగల్గాడు? ఈ విషయాలు పరిశీలిద్దాం.

కథ


   భాస్కర్ (శ్రీవిష్ణు) జెరాక్స్ షాపులో పనిచేస్తూంటాడు. ప్రేమిస్తున్న సంజన (మేఘా ఆకాష్) కి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నని చెప్పుకుంటాడు. ఆమె కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఆమెతో ఖర్చులకి జీతం చాలక దొంగతనాలు చేస్తూంటాడు. మరో వైపు భార్య విద్య (సునయన), ఓ కొడుకూ వుంటారు. కొడుకి చదువుకి, భార్య లా చదువుకీ, ఇంకా ఇతర ఇంటి ఖర్చులకీ దొంగతనాల మీదే ఆధారపడతాడు.

        ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్ విలియం రెడ్డి (రవి బాబు) వుంటాడు. ఇతడికో ఫ్రెండ్ వుంటాడు. ఆ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తో తను వ్యవహారం నడిపిస్తూ వుంటాడు. సిటీలో దొంగతనాలు పెరిగిపోతున్నాయని పై నుంచి వొత్తిడి వుంటుంది. ఒక మోటారు షెడ్డులో నివసించే (అంజమ్మ) గంగవ్వ వుంటుంది. ఇక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా డ్రెస్ మార్చుకుని పోతూంటాడు భాస్కర్. ఇతడి దొంగతనాల గురించి తెలిసిన ఆమె, కిరీటం పెట్టుకుని రాజు వేషంలో వెళ్తే దొంగతనంలో బాగా కలిసి వస్తుందని చెప్తుంది.

        ఈలోగా సంజనకి భాస్కర్ పెళ్ళయిన వాడని తెలిసి పోతుంది. దీంతో భార్య చనిపోయిందని అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. ఓ రాత్రి కిరీటం పెట్టుకుని రాజులా వేషం వేసుకుని భారీగా దొంగతనం చేసుకుని వస్తూ, ఇన్స్ పెక్టర్ విలియం రెడ్డికి దొరికిపోతాడు. అదే చోట విలియం రెడ్డి కూడా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కోసం వెళ్ళి  ఫ్రెండ్ కి దొరికిపోతాడు.

        ఇప్పుడు తప్పుచేసి ఫ్రెండ్ కి దొరికిపోయిన విలియం రెడ్డి, దొంగతనమనే ఇంకో తప్పు చేసి దొరికిపోయిన భాస్కర్ ని పట్టుకునే సాహసం చేశాడా? తన గుట్టు కాపాడుకోవాలంటే భాస్కర్ గుట్టు కూడా కాపాడాల్సి వచ్చిందా? ఇది తెలిసిపోయిన భాస్కర్ భార్య విద్య ఏం చేసింది? భాస్కర్ పెళ్ళయిన వాడని తెలుసుకున్న సంజన ఇప్పుడేం చేసింది? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ
   కామెడీ అన్నారు గానీ ఇది ఫిలాసఫికల్ గా చెప్పాలనుకున్న నీతి కథ. పాత సినిమాల్లో దొంగ మంచివాడుగా మారే ఎన్నోసార్లు చూసేసిన రొటీన్ నీతి కథే. నీతి తప్పిన ఇతర పాత్రలు కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం ఫలితం అనుభవించే సెంటిమెంటల్, ఎమోషనల్ డ్రామాల కథ. దీనికి వాల్మీకి కథ ఆధారమని కూడా ప్రచారమైంది.

        2010 లోనే వాల్మీకి గురించి దుష్ప్రచారం చేయకూడదని హైకోర్టు తీర్పు వుంది.  పంజాబ్ - హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు వాల్మీకి జీవితాన్ని పరిశోధించిన పంజాబ్ - హర్యానా యూనివర్సిటీ, వాల్మీకి దొంగ అని నిరూపించే ఆధారాలేవీ దొరకలేదని తేల్చింది. దీంతో వాల్మీకిని అలా చిత్రిస్తూ నాటికలు, టీవీ సీరియల్స్, సినిమాలు వంటివి రూపొందించడం నేరమని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చనీ హైకోర్టు తీర్పిచ్చింది. అయినా 2019 లో వరుణ్ తేజ్ నటించిన తెలుగు సినిమాకి వాల్మీకి టైటిల్ పెడితే ఆందోళనలు చెలరేగి,  చివరికి గద్దలకొండ గణేష్  గా పేరు మార్చాల్సి వచ్చింది. అయినా కూడా ప్రస్తుత సినిమాకి వాల్మీ కథ ఆధారమని మీడియాలో వచ్చేసింది...

        శ్రీవిష్ణు నటించిన ఈ తాజా కథ ఇటీవల తమిళంలో విడుదలైన జీవి కథని గుర్తుకు తెస్తుంది. ఇది కూడా కర్మ సిద్ధాంతంతో  విధి విలాసపు కథే. కాకపోతే ఆ కుటుంబ కథని చాదస్తాలకి పోకుండా, రియలిస్టిక్ జానర్ లో బిగిసడలని సస్పెన్స్ థ్రిల్లర్ కథగా తీశాడు. ఇందులో కూడా హీరో దొంగే. హీరో చేసే ఒక దొంగతనమనే ప్రధాన కథని, ఇంకో కుటుంబంలో ఇంకో కాలంలో జరిగిన దొంగతనంతో ముడిపెట్టి, సారూప్యతా సిద్ధాంతం అనే దాంతో అర్ధవంతంగా తీశాడు.

        ఇందులో హీరో పాత్ర పాసివ్ గా వుండదు, యాక్టివ్ గా వుంటుంది. ప్రస్తుత కథ పాసివ్ పాత్రతో వున్న నీతి కథ. కథ అనేకంటే సరిగ్గా తీయని గాథ అనొచ్చు. ఈమధ్య కథ అనుకుంటూ గాథలు తీసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కథ- గాథ తేడాల గురించి ఎవరికున్న నాలెడ్జి వాళ్ళది. కథా కథనాలకి కొత్త దర్శకుడు కొత్త కాబట్టి ఇది తన అవగాన మేరకు చేసుకున్న రచన, దర్శకత్వం. దీనికి తన సాహిత్య సంగీతాభి లాషల్ని, ప్రవచనాలతో కథని వివరించే కామెంటరీని జోడించి నేటివిటీని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు.

        తెలుగు పట్ల మక్కువతో ఇంటర్వెల్లో సృజనాత్మకత కోసం ప్రయత్నించాడు. ఇంటర్వెల్లో విలియం రెడ్డి ఫ్రెండ్ కి దొరికిపోయినందుకు విలాపం అని, ఇదే సీనులో భాస్కర్ దొంగగా దొరికి పోయినందుకు విఘాతం అనీ, ఈ రెంటినీ కలిపి విరామం అనీ  అక్షరాలేశాడు.

        ఇలా చేయడం వల్ల పంచ్, బ్యాంగ్ లాంటివి మిస్సయి పేలవంగా మారింది. నవ్వుతూంటే నవ్వుతోందనీ, ఏడుస్తూంటే ఏడుస్తున్నాడనీ క్యాప్షన్స్ వేసి చెప్తే ఎలా వుంటుందో అలా వుందిది. ఏం జరిగిందో తెలిసి పోతున్నాక ఇంకా బ్లాక్ బోర్డు మీద రాసి పాఠం చెప్పనవసరం లేదు.

        ఇలా విజువల్ మీడియాకి ఎప్పుడు స్క్రీన్ మీద రాసి చెప్తే ఎఫెక్ట్ వుంటుందంటే, పూరీ జగన్నాథ్ బుజ్జిగాడు చూడొచ్చు. ఇందులో ఇంటర్వెల్ యాక్షన్ సీను ముగింపు చూస్తే- ఈ భావోద్వేగ సన్నివేశంలో ప్రభాస్ తో మోహన్ బాబు లవ్ యూ సాలా అని భుజం తట్టినప్పుడు, ఇదే మాట  Love You Saala’ అని ఇంగ్లీషులో లెటర్స్  వేసినప్పుడు, ఇంటర్వెల్ కి హుషారైన పంచ్, బ్యాంగూ పడ్డాయి. ఇదీ తేడా.

        ఇక దర్శకుడి అభిమాన దర్శకులైన జంధ్యాల, కె విశ్వనాధ్ సినిమాలు చైతన్యంతో వుంటాయి. పాత్ర చిత్రణల మీద పట్టు వుంటుంది. గుర్తుండి పోయే పాత్ర చిత్రణలుంటాయి. వీటి గురించి అనుభవం గడించాల్సిన అవసరముంది దర్శకుడికి.

నటనలు -సాంకేతికాలు

   ఒక చోరుడుగా శ్రీవిష్ణు పాత్రతో బాటు, నటనా ఇంప్రూవ్ అవడానికి అవకాశముంది. అయితే ఇది హాస్య పాత్రనా, సీరియస్ పాత్రనా స్పష్టత లేనట్టు అటు ఇటు కాని పాత్రగా  తయారయ్యింది. కామిక్ సెన్స్, హుషారు, స్పీడు, డైనమిక్స్ వంటి కథాంగాలకి కథనం  దూరంగా వుండడంతో, ఫిలాసఫికల్ మూడ్లోకి వెళ్లిపోవడంతో, శ్రీవిష్ణు చోరుడు పాసివ్ పాత్ర కూడా అయ్యాడు. మధ్య తరగతి కుటుంబ సమస్య డామినేటింగ్ గా, దీనికి తగ్గట్టు భార్యగా నటించిన సునయన పాత్ర సీరియస్ పాత్ర కూడా కావడంతో, వినోదాత్మక విలువలు ఇందులో కనపడవు.

        కథ ఏ జానర్ లో వుంటే ఆ ఫ్రేములోనే నటనలుంటాయి. అయినా కూడా పోనుపోనూ సెకండాఫ్ లో, హడావిడిగా ముగించిన ముగింపులో, శ్రీవిష్ణు స్కిల్స్ ని మరింత మెరుగుపర్చుకుని వుంటే ఈ బరువైన కథకొక వెయిట్ వుండేదేమో. అన్ని సినిమాల్లో ఒకేలాటి పొడిపొడి సాఫ్ట్ నటనతో సరిపెట్టుకోవడం ఏమంత మేలు చేయదేమో.

        సంఘర్షించడానికి, నటించడానికీ ఎక్కువ స్కోపున్న, వ్యక్తిత్వమున్న పాత్ర సునయనది. ఇందులో సఫలమైంది. అయితే పాత్ర వ్యక్తిత్వం ఒక దగ్గర దెబ్బతిని పోయింది. ఈ కథలో తప్పుచేసిన పాత్రలు ఏదోక విధంగా నిష్కృతి చేసుకుంటాయి, లేదా ఫలితం అనుభవిస్తాయి. భర్త తనకి తెలియకుండా చేసిన దొంగతనాల డబ్బుతో లా చదువుతున్న తను, తెలిశాక అలాటి చదువు పట్ల నైతికతని ఫీలవకుండా, అతడితోనే ఒక ఏర్పాటుతో వుంటూ, మళ్ళీ అతను దొంగతనాలు చేస్తే, అప్పుడు బై చెప్పి కొడుకుతో వెళ్ళిపోయి- రెండేళ్ళ తర్వాత లాయర్ గా సెటిలై వుంటుంది!

        ఈమె నైతికతని ప్రశ్నించుకుని అలాటి చదువుకి మొదటే ఛీ కొట్టి వుంటే, ఇది శ్రీవిష్ణు పాత్ర పరివర్తన చెందడానికి బలమైన ఫ్యామిలీ డ్రామాని క్రియేట్ చేసేది. ఇక తన తప్పు వల్ల భార్య భవిష్యత్తు బలి కాకూడదన్న రియలైజేషన్ ఏర్పడి, ఆమె చేత చదువు పూర్తి చేయించే ఏకైక లక్ష్యం కోసం మంచివాడుగా మారే, ఏ త్యాగమైనా చేసే పాత్ర ప్రయాణంతో, నిజమైన ఫ్యామిలీ మాన్ గా హృదయాల్ని దోచుకునే వాడు. శ్రీవిష్ణు ఈ మంచి అవకాశాన్ని కోల్పోయాడు.

       దొంగగా దొరికిపోయిన శ్రీవిష్ణుని విడిపించుకోవడానికి సునయన పోలీస్ స్టేషన్ కొచ్చినప్పుడు,  ఇన్స్ పెక్టర్ పాత్ర రవి బాబుతో, అతనే ఇరుక్కోగల లా పాయింట్లు మాట్లాడి గెలవడం గొప్ప అన్పించుకునే సన్నివేశ సృష్టి కాబోదు. పోవమ్మా, దొంగ డబ్బుతో లా చదువుతూ నాకే నీతులు చెప్తున్నావా అని రవిబాబు అంటే, ఆమె మొహం ఎక్కడ పెట్టుకుంటుంది.

    కథ లాజిక్ వదిలేసినా చెల్లుతుందేమో గానీ, పాత్ర చిత్రణల్లో లాజిక్కులు లేకపోతే కథే ఖతమవుతుంది. ఇక శ్రీవిష్ణుని ప్రేమించే పాత్రలో సంజనగా మేఘా ఆకాష్ వుంటుంది. ఈమె పాత్రకి ఇంటెర్వెల్లో ఒక ట్విస్టు వుంటుంది. ఇంతవరకూ సాఫ్ట్ రోమాన్స్ నటనే వుంటుంది. సెకండాఫ్ లో సైడ్ అయిపోతుంది. భార్య చనిపోయిందని శ్రీవిష్ణు అబద్ధం చెప్పాడని తెలుసుకున్నప్పుడు ఆమె పాత్ర ముగిసిపోతుంది. ఈ అబద్ధం చెప్పాడని తెలుసుకునే మలుపు మాత్రం చేసిన కథనంతో డైల్యూట్ అయిపోయింది. దీంతో అది మలుపు కాకుండా పోయింది. శ్రీవిష్ణు అబద్ధం చెప్పాడని ఆమె తెలుసుకున్న ఇంకో నిజం ఇలా ఫ్లాష్ బ్యాక్ గా వేయడంతో థ్రిల్లింగ్ గా లేక చప్పగా తేలిపోయింది.  
     
        దేర్ విల్ బి బ్లడ్ (2007) ఆస్కార్ గాథ స్క్రీన్ ప్లే సంగతులులో ఇలా జరక్కుండా ఏ జాగ్రత్త తీసుకున్నాడో గమనించాం. ఇందులో ఇంటర్వెల్ ఎపిసోడ్ లో రెండు ప్రమాదాలు జరుగుతాయి. ఒకదాని తర్వాతొకటి రెండు ప్రమాదాలూ చూపిస్తే రిపిటీషన్ తో దెబ్బతింటాయని ఈ జాగ్రత్త తీసుకున్నాడు దర్శకుడు పి.టి. ఆండర్సన్ :  మొదటి ప్రమాదాన్ని మైనర్ ప్రమాదంగా చేసి, లైవ్ యాక్షన్లో చూపించకుండా, మాటలతో వివరించే వెర్బల్ సీనుగా  వేశాడు. దీంతో బాటు ప్రమాదం తాలూకు కొన్ని విజువల్స్ వేశాడు. ఇలా మొదటి ప్రమాదం గురించి కేవలం చెప్పించడంతో, ఆ వెంటనే ఇంటర్వెల్లో జరిగే మేజర్ ప్రమాదాన్ని రియల్ టైమ్ లో లైవ్ యాక్షన్లో చూపించడం వల్ల, ఇది రిపిటీషన్ బారిన పడని ఇంటర్వెల్ ఇంపాక్ట్ గా నిలబడగల్గింది. మేఘా ఆకాష్ విషయంలో కూడా ఇలా ఇంపాక్ట్ వుండాలంటే రియల్ టైమ్ లో లైవ్ యాక్షన్లో చూపించాలి తప్ప, చల్లారిపోయిన అభిప్రాయం కల్గించే ఫ్లాష్ బ్యాకుగా కాదు.

        ప్రవచన కారుడుగా తనికెళ్ళ భరణి కన్పిస్తాడు. ఇక ఇన్స్ పెక్టర్ రవిబాబుతో బాటు డాక్టర్ కమ్ రియల్ ఎస్టేట్ శ్రీకాంత్ అయ్యంగార్, జెరాక్స్ షాప్ ఓనర్ అజయ్ ఘోష్, హెడ్ కానిస్టేబుల్ కాదంబరి కిరణ్, గంగవ్వ పాత్రలకి ఒక్కో కథనిచ్చాడు దర్శకుడు. కర్మ ఫలాలు కాన్సెప్ట్ కాబట్టి ఈ కథలు. పోతే సాంకేతికంగా ఏ సినిమా అయినా ఇలా అప్డేట్ అవుతూనే వుంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేది సాంకేతికులు మాత్రమే. ఏమాత్రం అప్డేట్స్ అంటకుండా జాగ్రత్తలు తీసుకుని, మాస్కులు వేసుకుని, శానిటైజ్ చేసుకుంటూ, అరకిలోమీటరు దూరం పాటించేది కథకులే. కోవిడైజుడు కథకులు. ఇక సంగీతానికి సెమీ క్లాసిక్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

చివరికేమిటి

    గుళ్ళో శివరాత్రి పవిత్ర ప్రవచనాలతో ప్రారంభమై, గుళ్ళోనే  ఉగాది పవిత్ర ప్రవచనాలతో ముగిసే ఈ గాథ- దొంగతనాలే గాకుండా రంకుతనాల్ని కూడా చూపించింది. సుమారు గంటా ఇరవై నిమిషాలు కథలోకి వెళ్ళడానికే టైము పట్టింది. పైన చెప్పుకున్న ఇంటర్వెల్ సీనుకి గానీ బిగినింగ్ విభాగం ముగియదు. 23 వ నిమిషంలో హీరోకి భార్య వుందన్న విషయం బయటపడుతుంది. ఇది ప్లాట్ పాయింట్ వన్ కాదు. ప్లాట్ పాయింట్ వన్ ఇంటర్వెల్లోనే - శ్రీవిష్ణు, రవిబాబు పరస్పరం దొరికిపోవడంతో.
        ఈ గంటా ఇరవై నిమిషాలూ కథనంలో డైనమిక్స్ లేక, దాంతో స్పీడూ లేక మందకొడిగా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ గంట సేపు పూర్తిగా శ్రీవిష్ణు-సునయనల సీరియస్ కుటుంబ డ్రామాగా మారిపోతుంది. శ్రీవిష్ణు పూర్తిగా పాసివ్ అయిపోతాడిక్కడ. ఫస్టాఫ్ లో గోల్ లేనట్టే సెకండాఫ్ లోనూ గోల్ వుండదు. కథకుడు ఎలా కథనం చేస్తే అలా పోతాడు. కానీ కథనానికి బేసిక్ సూత్రమేమిటంటే, పాత్ర ఎలా కథనం సృష్టిస్తూంటే కథకుడు అలా పోవడం. ఎందుకంటే కథాకథనాలనేవి కథకుడివి అయివుండవు. పాత్రకి చెందిన ఆస్తి అది. పాత్ర డొమైన్. పాత్ర డొమైన్ లో కథకుడికేం పని?

     కేవలం ఐడియానే కథకుడు సృష్టించగలడు. దాంతో కథా కథనాల్ని సృష్టించుకుని, నడుపుకునే పని పాత్రదే. అందుకే కథ నడుపుకునే వాడు కాబట్టి కథా నాయకుడన్నారు. ఫస్టాఫ్ నుంచీ ఇది జరిగి వుంటే శ్రీవిష్ణు గోల్ వున్న యాక్టివ్ పాత్రగా వుంటూ, కథనం చైతన్యంతో వుండేది. గాథల్లో సైతం ట్రాజడీ అయినా సరే పాత్రకి గోల్ వుంటుంది. కొత్త దర్శకుడి స్క్రిప్టులో ఇలాటి చాలా స్క్రిప్టింగ్ టూల్స్ మిస్సయ్యాయి.

“If you give people tools, and they use their natural abilities and their
curiosity, they will develop things in ways that will surprise you very much
beyond what you might have expected.”― Bill Gates

సికిందర్


18, ఆగస్టు 2021, బుధవారం

tonight!


         సార్పట్టా కోచ్ పశుపతికి, ఇడియప్పని ఎట్టి పరిస్థితిలో ఓడించాలన్న గోల్ ఏర్పడడంతో బిగినింగ్ విభాగం బిజినెస్ ముగుస్తుంది. ఈ సన్నివేశాన్ని గమనించిన ఆర్య ముఖభావాల్ని బట్టి అతనీ సమస్యని పట్టించుకున్నాడని అర్ధమై, ఇక ఏం చేస్తాడన్న సస్పెన్స్ పుడుతుంది. ఇప్పుడు ప్రారంభమయ్యే మిడిల్ -1 విభాగంలో, కొంత స్క్రీన్ టైమ్ గడిచాక, ఇడియప్ప గ్రూప్ చేతిలో రంగయ్య అవమానపడే  ఘట్టం వస్తుంది. మిడిల్ -1 అంటే సమస్యతో సంఘర్షణా ప్రకరణ కాబట్టి, ఈ అవమానపడ్డ ఘట్టం ఆర్య పాత్ర యాక్టివేట్ అవడానికి ట్రిగ్గర్ పాయింటులా పనిచేస్తుంది.  ఇలా సార్పట్టా ప్రతిష్ట నిలబెట్టడానికి తాను రంగంలోకి దిగే నిర్ణయంతో అలజడి రేపుతాడు ఆర్య ఇంటా బయటా.  ఈ రెండు వైపుల నుంచీ కొంత ప్రతిఘటన ఎదుర్కొన్న తర్వాత శిక్షణ పొందడం ప్రారంభిస్తాడు. శిక్షణ పొందాక మొదటి ఈవెంట్ లో డాన్సింగ్ రోజ్ ని ఓడిస్తాడు. రెండో ఈవెంట్ లో వేట పులి తో తలపడినప్పుడు ఇంటర్వెల్ వస్తుంది. ఇలా మిడిల్ -1 విభాగం ప్రధాన కథ ముగుస్తుంది.

        క్కడ్నించే మొదలవుతుంది కథనంతో సమస్య. ఇంతవరకూ ప్రధాన పాత్రగా, కథానాయకుడుగా, ఆలస్యంగానైనా ఆర్య తన కథ తాను నడుపుకుంటూ వస్తున్న వాడల్లా, యాక్టివ్ పాత్రగా వుంటున్న వాడల్లా, కథకుడు తన చేతి నుంచి కథ లాక్కోవడంతో, ఇక కథకుడే కథ నడుపుకోవడంతో, యాక్టివ్ పాత్ర ఆర్య కుదేలైపోయి పాసివ్ పాత్రగా మారిపోతాడు...ఈ ఇంటర్వెల్ తర్వాత మిడిల్ -2 నుంచీ.

        ఇలా పాత్ర తెగిపోవడమే కాదు, కథ కూడా తెగిపోయి సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడుతుంది సినిమా ఇక్కడ్నించీ. ఇంటర్వెల్ ఈవెంట్ లో వేటపులి ఇక ఓడిపోతాడనగా, ఇడియప్ప గ్రూపు దాడి చేసి అలజడి సృష్టిస్తారు. బాక్సింగ్ జరక్కుండా చూస్తారు. ఆర్యని కొట్టి పడేసి బట్టలు చించేసి పోతారు. విజయం చేజారి ఆర్య కుప్పకూలుతాడు. యాక్షన్ రియాక్షన్ల మిడిల్ -1 సంఘర్షణలో ప్రత్యర్ధుల చేతిలో హీరో అనేవాడు ఓటమి చెందడమనే పాత్రోచిత చాపం (క్యారక్టర్ ఆర్క్) ఇలా భావోద్వేగాల్ని బాగా రెచ్చగొడుతున్న క్రియేషనే అనిపిస్తుంది మొదట ఇంటర్వెల్ మలుపు చూస్తే.

       అయితే ఇదే పాయింటు  పట్టుకుని ఇంటర్వెల్ తర్వాత ఇమ్మీడియేట్ గా మిడిల్ -2 కథనముండాల్సింది పోయి, ఇంటర్వెల్లో ఆర్యకి జరిగిన ఇంత అవమానాన్నే మర్చిపోయి, కథని హైజాక్ చేసిన కథకుడు తీరుబడిగా జైలు కథలు, తాగుబోతు కథలూ చూపిస్తూ ఆర్యకి రెండో శత్రువుగా మారిపోయాడు. ఇంటర్వెల్లో ఇడియప్ప మేళం బాక్సింగ్ ని భగ్నం చేసిన దానికంటే, ఇప్పుడు కథకుడు చేస్తున్న కథా వధ చాలా వ్యధ.

        రంగయ్యని అవమానించినందుకే బాక్సింగ్ కి దిగిన ఆర్య, తన బట్టలు చించి నగ్నంగా చేసిన అవమానాన్ని ఎలా మర్చిపోతాడో తెలీదు. రెండోది, తాము పాల్గొంటున్న ఈవెంట్ మీద దాడి చేసిన ఇడియప్ప గ్రూపు ఆ దాడితో తమ మరణ శాసనం తాము రాసుకున్నట్టే అవుతుంది. ఈ తప్పుకి బాక్సింగ్ క్రీడనుంచి ఇక బహిష్కృతులై పోవాలి. ఇక ఇడియప్ప పరంపర గిరంపర లేకుండా,  విజయం సార్పట్టాకే కట్టబెట్టేయాలి ఇంటర్వెల్లో. దీన్ని ఇడియప్ప దళం ఒప్పుకోకపోతే సెకండాఫ్ కథ వుంటుంది, లేకపోతే ఇక్కడితో కథ ముగిసిపోయినట్టే.

        కనుక ఎంతో బలంగా అనిపిస్తున్న ఇంటర్వెల్ సీను నిజానికి ఇంత బేలగా వుంది. సరే, దీని తర్వాత ఆర్య అన్నీ మర్చిపోయి సంసారం చేసుకుంటూ వుంటాడు. ఇక ఎమర్జెన్సీ ప్రకటించాక కోచ్ రంగయ్య జైలుకి పోతాడు. ఒక హోటల్లో భోజనం చేస్తున్న ఆర్యని ఇడియప్ప బాస్ గెలుక్కోవడంతో పోరాటం జరిగి పొడిచేస్తాడు ఆర్య. ఆ హత్యా యత్నం కేసు మీద ఇతను కూడా జైలుకి పోతాడు. జైలు నించి వచ్చాక దొంగసారా వ్యాపారంలోకి దిగుతాడు. తాగుడికి బానిసవుతాడు. ఇంట్లో భార్యతో గొడవ. ఇలా మొదలెట్టిన ప్రధాన కథని, పాత్రల లక్ష్యాల్నీ వదిలేసి కథని ఓ బారెడు మద్యపానం సన్నివేశాల మీదికి మళ్ళించాడు కథకుడు ఏవో సందేశాలివ్వాలని.

        తమిళనాడులో 1937 నుంచి 71 వరకూ చాలా సుదీర్ఘ కాలం మద్యనిషేధం అమల్లో వుంది. కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాక 1971 లో ఎత్తేశాడు. ఎత్తేశాక ’75-‘76 ఎమర్జెన్సీ కాలంలో మూకుమ్మడి కల్తీ సారా మరణాలు సంభవించడంతో మళ్ళీ మద్యనిషేధం విధించాడు. 1981 లో ఎమ్జీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎత్తేశారు. ఈ క్రోనాలజీలో హీరో ఆర్య కరుణానిధి కాలంలో దొంగసారా వ్యాపారంలోకి దిగుతాడు. ఇలా కథతో సంబంధం లేని ఎమర్జెన్సీని చూపించినట్టే, దొంగసారా వ్యాపారాన్నీ చూపిస్తూ మిడిల్ -2 అంతా కాలక్షేపం చేశాడు.

        రంగయ్య జైలు నుంచి విడుదలై వచ్చాకాగానీ తిరిగి కథని అందుకోడు కథకుడు. నాల్గేళ్ళ తర్వాత విడుదలవుతాడు రంగయ్య. రికార్డుల ప్రకారం ఎమర్జెన్సీ వున్నదే 22 నెలలు. 1975 లో ఎమర్జెన్సీ విధించాక, ’76 లో కరుణానిధి ప్రభుత్వం రద్దయ్యింది. 77 లో ఎమర్జెన్సీని ఎత్తేశాక రాజకీయ ఖైదీలందరూ విడుదలైపోయి ఎన్నికలు జరిగాయి. అంటే ’76 లో రంగయ్య జైలు కెళ్తే ’77 లో విడుదలైపోవాలి. నాల్గేళ్ళ తర్వాత విడుదలయ్యాడంటే కథకుడు ఆలో... చించేసిన కథ కోసం వేచి వుండి, లేదా కాల్షీటు కోసం పొంచి వుండి విడుదలయ్యాడన్న మాట. చరిత్రతో క్రోనాలజీ కూడా ఇలా వుంది.    

        ఇప్పుడు ఎండ్ విభాగం కథలోకొస్తే, ఎప్పుడో నాల్గేళ్ళ క్రిందటి పగలూ ప్రతీకారాలు గుర్తొచ్చి తిరిగి సార్పట్టా- ఇడియప్పల బాక్సింగులు. ఇప్పుడు పాసివ్ పాత్రగా వున్న ఆర్య పగ రగిలించుకుని దిగాలంటే తాగుడు వల్ల తగిన షేపులో లేడు. బాక్సింగ్ మర్చిపోయాడు. మళ్ళీ ట్రైనింగ్. అంటే మిడిల్ -1 లో చూపించిన కథనమే రిపీట్ అవుతుంది. బాక్సింగ్ లో మళ్ళీ శిక్షణ, వేట పులితో బాక్సింగ్, వాణ్ణి ఓడించడం వగైరా రిపిటీషన్ తో బలహీన క్లయిమాక్స్.  

     ఇలా సినిమా మొత్తం మీద చూస్తే కనిపించేది గాథే తప్ప కథ కాదు. గాథల్లోనే లక్ష్యంలేని, కథకుడు నడిపించే పాసివ్ హీరో పాత్ర వుంటుంది. కథనం కూడా పాత్ర- లక్ష్యం- సంఘర్షణ - విజయం అనే స్ట్రక్చర్ లేకుండా వుంటుంది. అయితే గాథల్ని కూడా అర్ధవంతమైన కథనంతో తీయవచ్చు. ఒక వేళ  గాథ చేయాలనుకుని ఆ సంబంధమైన రూల్స్ పాటిస్తే.

        ఒక వంద అత్యుత్తమ నవలల్లో 1927 లో వర్జీనియా వుల్ఫ్ రాసిన టు ది లైట్ హౌస్ అన్న నవల వుంది. నవలా రచనా నియమాల్ని బేఖాతరు చేసిన డేరింగ్ రచనగా ఇది పేరుబడింది. ఇందులో దాదాపు కథ అనేదే వుండదు. ఉండీ లేనట్టు సంభాషణాలుంటాయి. ఉన్న కాస్త కథ కూడా ఒక పాత్ర దృక్కోణంలో వుండదు. అయినా ఇది మానవ సంబంధాల గురించి లయబద్ధంగా సాగిపోయే – తదేక ధ్యానం లోకి తీసికెళ్ళ గల ఉత్కంఠ భరిత కథనంగా వుంటుంది. ఇది గాథ. ఇలాటివి పరిశీలిస్తే గాథ ఎలా తీయాలో తెలుస్తుంది.


సికిందర్

 

14, ఆగస్టు 2021, శనివారం

1052 : రివ్యూ + స్క్రీన్ ప్లే సంగతులు


 సార్పట్ట (తమిళం)

రచన - దర్శకత్వం: పా. రంజిత్‌
తారాగణం : ఆర్య, దుషారా విజయన్‌, పశుపతి, అనుపమా కుమార్‌, సంచనా నటరాజన్‌, జాన్‌ కొక్కెన్‌, జాన్ విజయ్, కలైరాసన్‌, సంతోష్ ప్రతాప్‌, షబీర్ కలరక్కల్ తదితరులు
 సంగీతం: సంతోష్‌ నారాయణ్‌, ఛాయాగ్రహణం : మురళి.జి, కూర్పు: సెల్వ ఆర్‌.కె.
కళ:  టి.రామలింగం, పోరాటాలు : అన్బరీవ్‌ 
నిర్మాత: షణ్ముగమ్‌ దక్షణ్‌రాజ్‌; 
విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌
***

        స్పోర్ట్స్ సినిమాలు కాల్పనికంగా అనేకం వస్తూంటాయి. బయోపిక్స్ గా, చారిత్రకంగా, వచ్చినప్పుడు ఒక ఆసక్తిని రేకెత్తిస్తూంటాయి. రెండు చారిత్రక నేపథ్యపు పరంపరల బాహాబాహీ బాక్సింగ్ క్రీడగా - కాల్పనిక చరిత్రగా వచ్చినప్పుడు కాస్త ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తాయి. ఒకప్పుడు మద్రాసు బ్రిటిషిండియాలో  భాగం కాబట్టి పాశ్చాత్య ధోరణుల్ని ఆహ్వానించడానికి మద్రాసీలకి అభ్యంతరముండేది కాదని చెప్తున్నారు. బాక్సింగ్ ని అలా సొంత క్రీడగా మార్చుకున్న చరిత్ర మద్రాసుది. మద్రాసు చెన్నై అయింది.  అయితే  అప్పుడప్పుడు పీరియెడ్ సినిమాల పేరుతో మద్రాసు కథల్ని తవ్వి తీస్తూ చెన్నైకి అందిస్తూనే వున్నారు తమిళ దర్శకులు. దర్శకుడు పా రంజిత్ కూడా హీరో ఆర్యతో ఈ పనే చేశాడు. బాక్సింగ్ కి పేరెన్నిక గన్న ఉత్తర మద్రాసు బాక్సింగ్ పరంపరల నేపథ్యంతో ఆధిపత్య పోరుగా సార్పట్టా  పరంబరై తీశాడు. సార్పట్టా పరంపర దీని తెలుగు వెర్షన్. ఏమిటీ సార్పట్టా పరంపర, ఈ పరంపర చరిత్ర కెంత వరకు న్యాయం చేశాడు, స్పోర్ట్స్ సినిమాల్లో ఇదెలా ప్రత్యేకమయిందీ మొదలైనవి పరిశీలిద్దాం...

కథ


        1970 లలో సమర (ఆర్య) ఉత్తర మద్రాసులోని హార్బర్ లో కూలీగా పనిచేస్తూంటాడు. చిన్నప్పట్నుంచీ మనసంతా బాక్సింగ్ మీదే వుంటుంది. బాక్సరైన తండ్రి లాగా ఎదగాలని బలమైన కోరిక అతడిది. కానీ బాక్సరైన తండ్రి నేరాలవైపు మొగ్గి జీవితం పాడు చేసుకోవడంతో, సమర తల్లి భాగ్యం (అనుపమా కుమార్) బాక్సింగ్ అంటే ద్వేషం పెంచుకుని వుంటుంది. సమర బాక్సింగ్ పోటీలు చూడడానికి వెళ్ళినా పట్టుకుని విపరీతంగా కొడుతుంది. ఐనా సమర పోటీలు చూడ్డానికి వెళ్ళడం మాత్రం మానడు. ఇంకోవైపు కుటుంబ మిత్రుడు కెవిన్ అలియాస్ డాడీ (జాన్ విజయ్) బాక్సింగ్ లోకి దిగమని సమరని ఒకటే రెచ్చగొడుతూంటాడు.

        ఆ ఏరియాలో ప్రధానంగా సార్పట్టా పరంపరకి చెందిన కోచ్ రంగయ్య (పశుపతి), ఎదుటి ఇడియప్ప పరంపర మీద విజయం కోసం విఫల యత్నాలు చేస్తూంటాడు. ఇతను డీఎంకే పార్టీ అభిమాని. ముఖ్యమంత్రి ఎం. కరుణానిధిని ఆరాధిస్తాడు. అయితే ఇడియప్ప పరంపరకి చెందిన బాక్సర్ వేటపులి (జాన్ కొక్కెన్) ని ఓడించడం రంగయ్య బాక్సర్ల వల్ల గావడం లేదు. ఇడియప్ప పరంపర రంగయ్యకి ఇంకొక్క అవకాశం ఇస్తుంది. ఇంకోసారి ఓడిపోతే శాశ్వతంగా సార్పట్టా పరంపర రంగంలోంచి తప్పుకోవాలని షరతు విధిస్తుంది.

        ఇంతలో 1975 లో ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తుంది. అంటే బాక్సింగ్ కి అవకాశముండదు. అయితే కరుణానిధి ఎమర్జెన్సీని వ్యతిరేకించడంతో ఉత్తర మద్రాసు బాక్సింగ్ కి ఢోకా వుండదు. దీంతో కోచ్ రంగయ్య ఇడియప్ప పరంపరతో చావో రేవో తేల్చుకోవడానికి రంగంలోకి దిగుతాడు.

        ఇప్పుడు బాక్సింగ్ కి దూరంగా వుంటున్న సమర, ఇడియప్ప బాక్సరైన  వేట పులిని ఓడించడానికి రంగంలో కెలా దిగాడు, దాంతో ఎదుర్కొన్న పరిణామాలేమిటి, ఆ అడ్డంకుల్ని అధిగమించి వేట పులినెలా మట్టి కరిపిస్తూ, సార్పట్టాకి విజయం కట్ట బెట్టాడన్నది మిగతా కథ.  

 ఎలావుంది కథ

    ముందుగా ఇది కథ కాదని, గాథ అనీ గుర్తించాల్సి వుంటుంది. గాథ ఎలా అయిందో తర్వాత చూద్దాం. సార్పట్టా అంటే నాల్గు పట్టా కత్తులని అర్ధం. ఉర్దూలో చార్ పట్టా తమిళంలో సార్పట్టా,అయిందని సమాచారమిచ్చారు. ఈ పేరు బాబూ భాయ్ పరంపర నుంచి వచ్చింది. సినిమాలో చూపించినట్టు సార్పట్టా పరంపర, ఇడియప్ప పరంపర అంటూ ఉత్తర మద్రాసులో రెండే బాక్సింగ్ పరంపరలు కాకుండా ఇంకా చాలా వుండేవి. ఇవి వంశాలకి చెందిన పరంపరలు కావు, గురుశిష్యులకి చెందిన పరంపరలు. ఇడియప్ప పరంపర అంటే పిడుగులా మెరుపు దాడి చేసే వాళ్ళని అర్ధం.

        1930 లలో సార్పట్టా పరంపరని ప్రారంభించింది కితేరి ముత్తు అనే అతను. అయితే తన తాత గారైన ఈయన పేరు సినిమాలో ఎక్కడా చెప్పలేదనీ, ఉత్తర మద్రాసు బాక్సింగ్ చరిత్రని వక్రీకరించారనీ పెద్ద మనవడు జాన్సన్ ముత్తు ఆరోపణ. పైగా 1942 లో బ్రిటిష్ బాక్సర్ టెరి ని తన తాత ఓడిస్తే, సినిమాలో రంగన్ వడియార్ ఓడించినట్టు హీరో ఆర్య పాత్రతో అన్పించారని అభ్యంతరం వ్యక్తం చేశాడు. టెరిని ఓడించిన తన తాత గార్ని ద్రవిడ వీరన్ బిరుదుతో ఘనంగా సన్మానించారనీ గుర్తు చేశాడు జాన్సన్. ఇతడి తమ్ముడు స్టీవెన్ ముత్తు చెన్నైలో బాక్సింగ్ క్లబ్ నిర్వహిస్తున్నాడు. ఆనాడు ఈ పరంపరలు బాక్సింగ్ క్లబ్బులేనని స్టీవెన్ వివరణ.

        అలాగే ఎమ్జీఆర్ గురించి కూడా తప్పుడు సమాచారమిచ్చారన్నాడు జాన్సన్. సినిమాలో ఎమ్జీఆర్ బాక్సింగ్ ని ప్రోత్సహించ లేదనట్టుగా చూపించారనీ, కానీ ఎమ్జీఆర్ బాక్సింగ్ ని ప్రోత్సహించడమే గాక, మహ్మదాలీ వంటి అంతర్జాతీయ బాక్సర్స్ ని మద్రాసుకి రప్పించి స్థానిక బాక్సర్స్ తో ఈవెంట్స్ జరిపించారనీ జాన్సన్ వివరించాడు. ఎమ్జీఆర్ సార్పట్టా పరంపర ఫ్యాన్ కూడాననీ, తను నటించిన కావల్ కారన్ లో తను సార్పట్టా పరంపరకి చెందిన వాణ్ణని డైలాగు కూడా చెప్పారని జాన్సన్ చెప్పాడు. సార్పట్టా పరంపర కులాలకి, మతాలకి, రాజకీయాలకీ అతీతమని కూడా చెప్పాడు.

     ఉత్తర మద్రాసులో ఆనాటి ఈ పరంపరలు శ్రామిక వర్గాల క్రీడాభినివేశానికి ప్రతీకలు. కానీ సార్పట్టా కి కులమతాలు, రాజకీయాలూ లేవని జాన్సన్ చరిత్ర విప్పితే, సినిమాలో చరిత్రని కప్పి రాజకీయాల్ని ఆపాదించారు. అధికారంలో వున్న ముఖ్యమంత్రి కరుణానిధి కి సార్పట్టా మద్దతుగా వుండేదన్నట్టు చూపించారు. ఇలా చూపించడానికి కారణం 1975-77 ల మధ్య ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఈ సినిమా గాథా కాలంగా తీసుకోవడమే. ఇందువల్ల ఈ గాథకి ఎమర్జెన్సీ నేపథ్యం అతకకుండా పోయింది.

        1975 లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా వున్న కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో 1976 జనవరిలో కరుణానిధి ప్రభుత్వాన్ని ఇందిరా గాంధీ రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. డీఎంకే పార్టీ నాయకుల్ని జైళ్ళల్లో కుక్కింది. నేటి ముఖ్య మంత్రి ఎంకె స్టాలిన్, మురసోలి మారన్ వంటి నాయకులెందరో జైళ్ళల్లో చిత్రహింసలకి గురయ్యారు. అప్పుడు డీఎంకే లో వున్న ఎమ్జీఆర్ పార్టీని చీల్చి ఏఐఏడీఎంకే పార్టీ స్థాపించి, 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీని సమర్ధిస్తూ ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.

        ఎమర్జెన్సీ కాలంలో ఈ రాజకీయ పరిణామాల్ని సినిమాకి వాడుకుంటూ, రాజకీయాలతో సంబంధం లేని సార్పట్టా పరంపరకి రాజకీయ రంగులు పులిమినట్టు అర్ధమవుతోంది. ఇంతకీ ఎమర్జెన్సీ నేపథ్యం సినిమాకి ఉపయోగపడింది కూడా పెద్దగా ఏం లేదు- కేవలం కరుణానిధి ప్రభుత్వం పడిపోయాక జరిగిన అరెస్టులు, అందులో కోచ్ రంగయ్య జైలు కెళ్ళడం వంటి గాథని ప్రభావితం చెయ్యని రెండు సన్నివేశాలు చూపించడం మినహా.

        ఇదీ సార్పట్టా పరంపర చరిత్రకి, దీనికి ఎమర్జెన్సీ నేపథ్యానికీ న్యాయం చేకూర్చిన విధం. ఇవి శ్రామిక వర్గాల పరంపరలు. పరస్పరం శ్రామిక వర్గాలు తలపడే ఈ బాక్సింగ్ పోటీలు వాళ్ళ మధ్య ఒక సెలబ్రేషనే తప్ప, పై వర్గాల అణిచివేతల తాలూకు సంఘర్షణలు ఇక్కడ చిత్రించేందుకు అవకాశంలేదు, చిత్రించ లేదు కూడా.

నటనలు- సాంకేతికాలు

     ఆర్య పోషించిన సమర పాత్ర స్పోర్ట్స్ సినిమా టెంప్లెట్ పాత్రే. స్పోర్ట్స్ సినిమాలు ఒక టెంప్లెట్ లోనే వుంటాయి. క్రీడలో రాణించాలని తపన, శిక్షణ, క్రీడలో ఓటమి, తిరిగి సంఘర్షణ, ఆత్మవిశ్వాసం,  చివరికి విజయం- ఇదే వరసలో వుంటాయి కాబట్టి ఆర్య పాత్ర కూడా ఇలాటి రొటీనే. కాకపోతే ఇది పాసివ్ పాత్ర. పాత్ర ప్రకారం కథ అనుకోవాల్సింది అనుకోకుండా, కథ ప్రకారం పాత్ర అనుకున్నారు కాబట్టి, కథానాయకత్వం లోపించి కథ గాకుండా ఈ సినిమా గాథ అయింది.

        పీరియెడ్ లుక్ తో ఆర్య పోషించిన సమర అనే పాత్ర మేకోవర్ కోసం, కండ పుష్టి కోసం తీసుకున్న కఠిన ట్రైనింగ్ కి నిలువెత్తు సాక్షిగా వుంటాడు. ఈ కఠిన ట్రైనింగ్ తో బాక్సింగ్ దృశ్యాల్ని రసవత్తరం చేశాడు. సమర బాక్సింగ్ పాత్రకి ఆనాటి వరల్డ్ ఛాంపియన్ మహ్మదాలీని మోడల్ గా తీసుకున్నట్టు దర్శకుడు వెల్లడించాడు. అయితే స్పీడ్ పంచ్ కి ప్రసిద్ధుడైన మహ్మదాలీ అతి సునాయాసంగా, పెద్దగా కష్టపడకుండానే, ప్రత్యర్ధిని ఔట్ చేసేసే నైపుణ్యంతో వుంటాడు. సాత్వికంగా అన్పించే ఈ సింపుల్ ట్రిక్ మాస్ సినిమాకి వర్కౌట్ కాదని ఆర్యతో హోరాహోరీ, రక్తసిక్త బాక్సింగ్ కి తెరతీశారు. ఆర్య మీద మొత్తం మూడు ఈవెంట్లు చిత్రీకరించారు.

        పై ఔటర్ స్ట్రగుల్ కి ఇన్నర్ స్ట్రగుల్నీ జత చేశారు : బాక్సింగ్ ని ద్వేషించే తల్లితో సంఘర్షణ, తాగుడు మరిగాక భార్యతో సంఘర్షణ. ఇలా ఇన్నర్, ఔటర్ స్ట్రగుల్స్ తో పరిపూర్ణ పాత్ర అన్పించే ప్రయత్నం చేశారు. ఈ స్ట్రగుల్స్ ని ఆర్య శక్తి వంచన లేకుండా పోషించాడు. అయితే ఇంత మాస్ కమర్షియల్ లో ఆర్య పాత్రకి ఎంటర్ టైనింగ్ పార్శ్వాన్ని కల్పించలేదు. ఏ పాత్రకీ కల్పించ లేదు కాబట్టి, సినిమాలో కామెడీ, వినోదం లాంటివి కన్పించవు.

        తల్లి పాత్రలో అనుపమా కుమార్, భార్య పాత్రలో దుషారా విజయన్ లకి సంఘర్షించడానికి రొటీన్ పాయింట్లే కావడంతో ఫార్ములా పాత్రలుగానే వుంటాయి. ఆర్య ప్రత్యర్ధి పాత్రలో వేట పులిగా జాన్ కొక్కెన్ కవ్వింపు ఎక్స్ ప్రెషన్స్ బావున్నాయి. ఈ బాక్సింగ్ పాత్రకి మైక్ టైసన్ ని మోడల్ గా తీసుకున్నట్టు చెప్పుకున్నారు. దీనికి కూడా వయొలెన్స్ ని జోడించి సినిమాటిక్ గా మార్చేశారు. ఇక ఇంకో బాక్సింగ్ పాత్రలో డాన్సింగ్ రోజ్ గా షబీర్ కలరక్కల్ నటించాడు. నిజానికిది ఆనాటి పాపులరైన డాన్సింగ్ మోహన్, డాన్సింగ్ ఎలుమలై వంటి రియల్ ఫైటర్స్ ఆధారంగా రూపొందించిన పాత్ర అని మనకి సమాచారమందుతోంది.

        ఈ బాక్సింగ్ కి యాక్షన్ కొరియోగ్రఫీ అన్బరీవ్ నిర్వహించాడు. 2015 లో హిందీలో వచ్చిన 'బ్రదర్స్' లో బాక్సింగ్ కి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తో ఫ్యూజన్ చేసి బాక్సింగ్ టెంప్లెట్ ఇన్నోవేట్ చేశారు. మారిన కాలానికి సార్పట్టా వాస్తవిక పీరియెడ్ తో ఈ ప్రయోగం చేసే అవకాశం లేక, రెగ్యులర్ కమర్షియన్ బాక్సింగ్ నే చూపించారు. గొప్ప కోసం రూల్స్ జోలికి పోకుండా, సాంకేతిక భాష వాడకుండా, కామెంటరీ కూడా మాస్ భాషలో చెప్పిస్తూ, దేశవాళీ ఆటగానే చూపించడం మాత్రం కొత్తదనమే.

        మురళి ఛాయాగ్రహణం, గ్రేడింగ్, పీరియడ్ లుక్ ని తెస్తే, ఇతర కూర్పు, కళాదర్శకత్వం, వస్త్రాలంకరణ, కేశాలంకరణ మొదలైన సాంకేతిక విభాగాల పని తీరు ఉన్నత స్థాయిలోనే వున్నాయి. స్క్రిప్టు మాత్రం పోటీ పడలేదు.

చివరికేమిటి
     ఇండిపెండెంట్, రియలిస్టిక్ జానర్ కథనాలు ఈ రెండు స్కూల్స్ నుంచి వచ్చిన మేకర్లు కమర్షియల్ సినిమాలకి- అందునా బిగ్ బడ్జెట్  మూవీస్ కి చేస్తూంటారు. తమిళంలో 'మండేలా'తో ఎం. అశ్విన్, 'సార్పట్టా'లో పా రంజిత్ ఇదే చేశారు. కమర్షియల్ స్క్రిప్ట్ రైటర్స్ ని మొనటానీ పంజరంలోంచి బయటికి తీయించే కథన కలాపం 'మండేలా' లో వున్నట్టు, సార్పట్టా లోనూ  వుంది. అంటే బిగినింగ్ (ఫస్ట్ యాక్ట్) విభాగంలో అన్నమాట.

        బిగినింగ్ అంటే ఏమిటి? ప్రధాన పాత్ర సహా కొన్ని కీలక పాత్రల్ని పరిచయం చేసి, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేసి, దాంతో బిగినింగ్ ని ముగిస్తూ, అప్పుడు వచ్చే ప్లాట్ పాయింట్ వన్లో ప్రధాన పాత్రని సమస్యలో పడేసి, ఆ సమస్యలోంచి బయటపడాలన్న గోల్ ని ఏర్పాటు చేయడమేగా? ప్రతీ సినిమాలో మార్పు లేకుండా హీరో కిదే తంతుగా?

        స్ట్రక్చరనేది దాని చట్రంతో అది శాశ్వతమే. ఎన్ని యుగాలు గడిచినా ఈ చట్రం చట్రమే, మారదు. మార్చాలని  క్రియేటివిటీకి పాల్పడితే కాళ్ళో, మొండెమో, తలకాయో లేని వికృత కథ చేతికొస్తుంది. కనుక బిగినింగ్- మిడిల్- ఎండ్- ఈ మూడిట్లో దేన్నీ తీసేసే క్రియేటివిటీకి పాల్పడ లేరు. పాల్పడగల్గేది ఆ చట్రమనే ఏర్పాటు లోపల చేసుకునే కథనంతో క్రియేటివిటీ మాత్రమే.

        కానీ - మీరు చట్రంలో వున్నప్పుడు చట్రాన్ని చూడలేరన్నాడు సీడ్ ఫీల్డ్. నిజమే, దీంతోనే వస్తోంది చిక్కంతా. లోపల కూర్చుంటే చట్రమే ఫీలవలేరు. కథనమే కనిపిస్తూంటుంది-  చూసిన సినిమాల్లోని రొటీన్ కథనం. బయట నుంచి చట్రాన్ని చూడగల్గితే ఆ చట్రమే కథనానికి కొత్త ఐడియాలిస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోకుండా శాశ్వతమైన స్ట్రక్చరనే చట్రం లాగే, కథనాన్ని కూడా శిలాశాసనంలాగా పర్మనెంట్ ఆకారంతో చెక్కి పడేస్తూ పోతే, సినిమాలేమౌతాయి? చూసిందే చూడరా... అన్నట్టు తయారవుతాయి.

        ప్రతీ సినిమాలో హీరోయే ప్లాట్ పాయింట్ వన్లో సమస్యలో ఎందుకు పడాలి? గోల్ హీరోకే ఎందుకేర్పడాలి? తిరగేసి ఆలోచించ లేరా? విలన్సే సమస్యలో పడి, ప్లాట్ పాయింట్ వన్ గోల్ అనేది విలన్స్ కే ఏర్పడ కూడదా? మరి హీరో ఏమవుతాడు? ఏమీ కాడు, ఆగుతాడు. ఈ ఆపడమేగా క్రియేటివిటీ అంటే? మొన్న తమిళ మండేలా లో ఇదే చూశాం. ఇప్పుడు సార్పట్టా తమిళంలోనూ ఇదే చూస్తున్నాం.

    విలన్లయిన అన్నదమ్ములు ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు పోటీకి దిగడాన్ని ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంగా వుంటుంది మండేలా లో. ఇంతవరకూ ఈ బిగినింగ్ విభాగమంతా కథనం అన్నదమ్ముల మీదే వుంటుంది. బలహీనుడైన హీరో మండేలా అలా వెయిటింగ్ లో వుంటాడు. ఈ బిగినింగ్ విభాగమంతా బలహీనుడైన మండేలా మీద గాక, బలమైన విలన్లయిన అన్నదమ్ముల  మీద వాళ్ళ తగాదాలకి సంబంధించిన కథనం చేసి, వాళ్ళ మధ్యే వాళ్ళ కేర్పడే గోల్స్ తో ప్లాట్ పాయింట్ వన్ కి చేర్చాడు.ఈ విలన్ల గొడవతో సంబంధం లేకుండా మండేలాని బార్బర్ జీవితానికి పరిమితం చేశాడు. మరిప్పుడు ప్లాట్ పాయింట్ వన్ విలన్ల చేతి కెళ్ళిపోయాక మండేలా చేసేదేమిటి? దే సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది మిడిల్ (సెకండ్ యాక్ట్) లో.  

        ఇదే బిగినింగ్ కథనాన్ని సార్పట్టా లో కూడా చూడొచ్చు. ఇందులో హీరో ఆర్య బిగినింగ్ విభాగంలో మండేలా లాగే బలహీన క్యారక్టర్. మండేలా బార్బర్ అయితే ఆర్య హార్బర్ కూలీ. ఒకవైపు బాక్సింగ్ ఈవెంట్స్ భారే యెత్తున జరుగుతున్నా తల్లి భయంతో బాక్సింగ్ జోలికి పోకుండా, ఈవెంట్స్ చూస్తూ ఖాళీగా గడిపేస్తూంటాడు ఆర్య. మూస కమర్షియల్స్ లో హీరోనిలా ఖాళీగా చూపించే ధైర్యం చేయలేరు, స్ట్రక్చర్ గురించి తెలీక.

        బిగినింగ్ ప్రారంభంలో ఇరవై రెండు నిమిషాల సుదీర్ఘ నిడివితో సార్పట్టా - ఇడియప్ప పరంపరల మధ్య ఈవెంట్స్ ఒకే సీనుగా, ఒకే ఎపిసోడ్ గా వుంటాయి. బిగినింగ్ మొదలవగానే ఇలా ఇరవై రెండు నిమిషాల ఒకే సుదీర్ఘ సీనుతో కథనం చేయడం కొత్తగా అన్పించే క్రియేటివిటీ కాక ఏమిటి.

        ఈ ఈవెంట్స్ ని పని లేకుండా కేవలం ప్రేక్షకుడిలా ఎంజాయ్ చేస్తూంటాడు ఆర్య. ఇదే మోనాటనీని వదిలించుకున్న ఇన్నోవేషన్. దీని తర్వాత పది నిమిషాలకి సార్పట్టా - ఇడియప్ప పరంపరల మధ్య ప్లాట్ పాయిట్ వన్ తో బిగినింగ్ ముగుస్తుంది. ఈ రెండు పరంపరల మధ్య ఫైనల్ షో డౌన్ గా, ఇడియప్ప పరంపర సార్పట్టాకి చివరి అవకాశ మివ్వడం సమస్య నేర్పాటు చేస్తుంది. అంటే ఇక సార్పట్టా కి చెందిన కోచ్ పశుపతికి,  ఇడియప్పని ఎట్టి పరిస్థితిలో ఓడించాలన్న గోల్ ఏర్పడడం...

(మిగతా రేపు)
సికిందర్