రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, ఆగస్టు 2021, శనివారం

1052 : రివ్యూ + స్క్రీన్ ప్లే సంగతులు


 సార్పట్ట (తమిళం)

రచన - దర్శకత్వం: పా. రంజిత్‌
తారాగణం : ఆర్య, దుషారా విజయన్‌, పశుపతి, అనుపమా కుమార్‌, సంచనా నటరాజన్‌, జాన్‌ కొక్కెన్‌, జాన్ విజయ్, కలైరాసన్‌, సంతోష్ ప్రతాప్‌, షబీర్ కలరక్కల్ తదితరులు
 సంగీతం: సంతోష్‌ నారాయణ్‌, ఛాయాగ్రహణం : మురళి.జి, కూర్పు: సెల్వ ఆర్‌.కె.
కళ:  టి.రామలింగం, పోరాటాలు : అన్బరీవ్‌ 
నిర్మాత: షణ్ముగమ్‌ దక్షణ్‌రాజ్‌; 
విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌
***

        స్పోర్ట్స్ సినిమాలు కాల్పనికంగా అనేకం వస్తూంటాయి. బయోపిక్స్ గా, చారిత్రకంగా, వచ్చినప్పుడు ఒక ఆసక్తిని రేకెత్తిస్తూంటాయి. రెండు చారిత్రక నేపథ్యపు పరంపరల బాహాబాహీ బాక్సింగ్ క్రీడగా - కాల్పనిక చరిత్రగా వచ్చినప్పుడు కాస్త ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తాయి. ఒకప్పుడు మద్రాసు బ్రిటిషిండియాలో  భాగం కాబట్టి పాశ్చాత్య ధోరణుల్ని ఆహ్వానించడానికి మద్రాసీలకి అభ్యంతరముండేది కాదని చెప్తున్నారు. బాక్సింగ్ ని అలా సొంత క్రీడగా మార్చుకున్న చరిత్ర మద్రాసుది. మద్రాసు చెన్నై అయింది.  అయితే  అప్పుడప్పుడు పీరియెడ్ సినిమాల పేరుతో మద్రాసు కథల్ని తవ్వి తీస్తూ చెన్నైకి అందిస్తూనే వున్నారు తమిళ దర్శకులు. దర్శకుడు పా రంజిత్ కూడా హీరో ఆర్యతో ఈ పనే చేశాడు. బాక్సింగ్ కి పేరెన్నిక గన్న ఉత్తర మద్రాసు బాక్సింగ్ పరంపరల నేపథ్యంతో ఆధిపత్య పోరుగా సార్పట్టా  పరంబరై తీశాడు. సార్పట్టా పరంపర దీని తెలుగు వెర్షన్. ఏమిటీ సార్పట్టా పరంపర, ఈ పరంపర చరిత్ర కెంత వరకు న్యాయం చేశాడు, స్పోర్ట్స్ సినిమాల్లో ఇదెలా ప్రత్యేకమయిందీ మొదలైనవి పరిశీలిద్దాం...

కథ


        1970 లలో సమర (ఆర్య) ఉత్తర మద్రాసులోని హార్బర్ లో కూలీగా పనిచేస్తూంటాడు. చిన్నప్పట్నుంచీ మనసంతా బాక్సింగ్ మీదే వుంటుంది. బాక్సరైన తండ్రి లాగా ఎదగాలని బలమైన కోరిక అతడిది. కానీ బాక్సరైన తండ్రి నేరాలవైపు మొగ్గి జీవితం పాడు చేసుకోవడంతో, సమర తల్లి భాగ్యం (అనుపమా కుమార్) బాక్సింగ్ అంటే ద్వేషం పెంచుకుని వుంటుంది. సమర బాక్సింగ్ పోటీలు చూడడానికి వెళ్ళినా పట్టుకుని విపరీతంగా కొడుతుంది. ఐనా సమర పోటీలు చూడ్డానికి వెళ్ళడం మాత్రం మానడు. ఇంకోవైపు కుటుంబ మిత్రుడు కెవిన్ అలియాస్ డాడీ (జాన్ విజయ్) బాక్సింగ్ లోకి దిగమని సమరని ఒకటే రెచ్చగొడుతూంటాడు.

        ఆ ఏరియాలో ప్రధానంగా సార్పట్టా పరంపరకి చెందిన కోచ్ రంగయ్య (పశుపతి), ఎదుటి ఇడియప్ప పరంపర మీద విజయం కోసం విఫల యత్నాలు చేస్తూంటాడు. ఇతను డీఎంకే పార్టీ అభిమాని. ముఖ్యమంత్రి ఎం. కరుణానిధిని ఆరాధిస్తాడు. అయితే ఇడియప్ప పరంపరకి చెందిన బాక్సర్ వేటపులి (జాన్ కొక్కెన్) ని ఓడించడం రంగయ్య బాక్సర్ల వల్ల గావడం లేదు. ఇడియప్ప పరంపర రంగయ్యకి ఇంకొక్క అవకాశం ఇస్తుంది. ఇంకోసారి ఓడిపోతే శాశ్వతంగా సార్పట్టా పరంపర రంగంలోంచి తప్పుకోవాలని షరతు విధిస్తుంది.

        ఇంతలో 1975 లో ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తుంది. అంటే బాక్సింగ్ కి అవకాశముండదు. అయితే కరుణానిధి ఎమర్జెన్సీని వ్యతిరేకించడంతో ఉత్తర మద్రాసు బాక్సింగ్ కి ఢోకా వుండదు. దీంతో కోచ్ రంగయ్య ఇడియప్ప పరంపరతో చావో రేవో తేల్చుకోవడానికి రంగంలోకి దిగుతాడు.

        ఇప్పుడు బాక్సింగ్ కి దూరంగా వుంటున్న సమర, ఇడియప్ప బాక్సరైన  వేట పులిని ఓడించడానికి రంగంలో కెలా దిగాడు, దాంతో ఎదుర్కొన్న పరిణామాలేమిటి, ఆ అడ్డంకుల్ని అధిగమించి వేట పులినెలా మట్టి కరిపిస్తూ, సార్పట్టాకి విజయం కట్ట బెట్టాడన్నది మిగతా కథ.  

 ఎలావుంది కథ

    ముందుగా ఇది కథ కాదని, గాథ అనీ గుర్తించాల్సి వుంటుంది. గాథ ఎలా అయిందో తర్వాత చూద్దాం. సార్పట్టా అంటే నాల్గు పట్టా కత్తులని అర్ధం. ఉర్దూలో చార్ పట్టా తమిళంలో సార్పట్టా,అయిందని సమాచారమిచ్చారు. ఈ పేరు బాబూ భాయ్ పరంపర నుంచి వచ్చింది. సినిమాలో చూపించినట్టు సార్పట్టా పరంపర, ఇడియప్ప పరంపర అంటూ ఉత్తర మద్రాసులో రెండే బాక్సింగ్ పరంపరలు కాకుండా ఇంకా చాలా వుండేవి. ఇవి వంశాలకి చెందిన పరంపరలు కావు, గురుశిష్యులకి చెందిన పరంపరలు. ఇడియప్ప పరంపర అంటే పిడుగులా మెరుపు దాడి చేసే వాళ్ళని అర్ధం.

        1930 లలో సార్పట్టా పరంపరని ప్రారంభించింది కితేరి ముత్తు అనే అతను. అయితే తన తాత గారైన ఈయన పేరు సినిమాలో ఎక్కడా చెప్పలేదనీ, ఉత్తర మద్రాసు బాక్సింగ్ చరిత్రని వక్రీకరించారనీ పెద్ద మనవడు జాన్సన్ ముత్తు ఆరోపణ. పైగా 1942 లో బ్రిటిష్ బాక్సర్ టెరి ని తన తాత ఓడిస్తే, సినిమాలో రంగన్ వడియార్ ఓడించినట్టు హీరో ఆర్య పాత్రతో అన్పించారని అభ్యంతరం వ్యక్తం చేశాడు. టెరిని ఓడించిన తన తాత గార్ని ద్రవిడ వీరన్ బిరుదుతో ఘనంగా సన్మానించారనీ గుర్తు చేశాడు జాన్సన్. ఇతడి తమ్ముడు స్టీవెన్ ముత్తు చెన్నైలో బాక్సింగ్ క్లబ్ నిర్వహిస్తున్నాడు. ఆనాడు ఈ పరంపరలు బాక్సింగ్ క్లబ్బులేనని స్టీవెన్ వివరణ.

        అలాగే ఎమ్జీఆర్ గురించి కూడా తప్పుడు సమాచారమిచ్చారన్నాడు జాన్సన్. సినిమాలో ఎమ్జీఆర్ బాక్సింగ్ ని ప్రోత్సహించ లేదనట్టుగా చూపించారనీ, కానీ ఎమ్జీఆర్ బాక్సింగ్ ని ప్రోత్సహించడమే గాక, మహ్మదాలీ వంటి అంతర్జాతీయ బాక్సర్స్ ని మద్రాసుకి రప్పించి స్థానిక బాక్సర్స్ తో ఈవెంట్స్ జరిపించారనీ జాన్సన్ వివరించాడు. ఎమ్జీఆర్ సార్పట్టా పరంపర ఫ్యాన్ కూడాననీ, తను నటించిన కావల్ కారన్ లో తను సార్పట్టా పరంపరకి చెందిన వాణ్ణని డైలాగు కూడా చెప్పారని జాన్సన్ చెప్పాడు. సార్పట్టా పరంపర కులాలకి, మతాలకి, రాజకీయాలకీ అతీతమని కూడా చెప్పాడు.

     ఉత్తర మద్రాసులో ఆనాటి ఈ పరంపరలు శ్రామిక వర్గాల క్రీడాభినివేశానికి ప్రతీకలు. కానీ సార్పట్టా కి కులమతాలు, రాజకీయాలూ లేవని జాన్సన్ చరిత్ర విప్పితే, సినిమాలో చరిత్రని కప్పి రాజకీయాల్ని ఆపాదించారు. అధికారంలో వున్న ముఖ్యమంత్రి కరుణానిధి కి సార్పట్టా మద్దతుగా వుండేదన్నట్టు చూపించారు. ఇలా చూపించడానికి కారణం 1975-77 ల మధ్య ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఈ సినిమా గాథా కాలంగా తీసుకోవడమే. ఇందువల్ల ఈ గాథకి ఎమర్జెన్సీ నేపథ్యం అతకకుండా పోయింది.

        1975 లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా వున్న కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో 1976 జనవరిలో కరుణానిధి ప్రభుత్వాన్ని ఇందిరా గాంధీ రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. డీఎంకే పార్టీ నాయకుల్ని జైళ్ళల్లో కుక్కింది. నేటి ముఖ్య మంత్రి ఎంకె స్టాలిన్, మురసోలి మారన్ వంటి నాయకులెందరో జైళ్ళల్లో చిత్రహింసలకి గురయ్యారు. అప్పుడు డీఎంకే లో వున్న ఎమ్జీఆర్ పార్టీని చీల్చి ఏఐఏడీఎంకే పార్టీ స్థాపించి, 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీని సమర్ధిస్తూ ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.

        ఎమర్జెన్సీ కాలంలో ఈ రాజకీయ పరిణామాల్ని సినిమాకి వాడుకుంటూ, రాజకీయాలతో సంబంధం లేని సార్పట్టా పరంపరకి రాజకీయ రంగులు పులిమినట్టు అర్ధమవుతోంది. ఇంతకీ ఎమర్జెన్సీ నేపథ్యం సినిమాకి ఉపయోగపడింది కూడా పెద్దగా ఏం లేదు- కేవలం కరుణానిధి ప్రభుత్వం పడిపోయాక జరిగిన అరెస్టులు, అందులో కోచ్ రంగయ్య జైలు కెళ్ళడం వంటి గాథని ప్రభావితం చెయ్యని రెండు సన్నివేశాలు చూపించడం మినహా.

        ఇదీ సార్పట్టా పరంపర చరిత్రకి, దీనికి ఎమర్జెన్సీ నేపథ్యానికీ న్యాయం చేకూర్చిన విధం. ఇవి శ్రామిక వర్గాల పరంపరలు. పరస్పరం శ్రామిక వర్గాలు తలపడే ఈ బాక్సింగ్ పోటీలు వాళ్ళ మధ్య ఒక సెలబ్రేషనే తప్ప, పై వర్గాల అణిచివేతల తాలూకు సంఘర్షణలు ఇక్కడ చిత్రించేందుకు అవకాశంలేదు, చిత్రించ లేదు కూడా.

నటనలు- సాంకేతికాలు

     ఆర్య పోషించిన సమర పాత్ర స్పోర్ట్స్ సినిమా టెంప్లెట్ పాత్రే. స్పోర్ట్స్ సినిమాలు ఒక టెంప్లెట్ లోనే వుంటాయి. క్రీడలో రాణించాలని తపన, శిక్షణ, క్రీడలో ఓటమి, తిరిగి సంఘర్షణ, ఆత్మవిశ్వాసం,  చివరికి విజయం- ఇదే వరసలో వుంటాయి కాబట్టి ఆర్య పాత్ర కూడా ఇలాటి రొటీనే. కాకపోతే ఇది పాసివ్ పాత్ర. పాత్ర ప్రకారం కథ అనుకోవాల్సింది అనుకోకుండా, కథ ప్రకారం పాత్ర అనుకున్నారు కాబట్టి, కథానాయకత్వం లోపించి కథ గాకుండా ఈ సినిమా గాథ అయింది.

        పీరియెడ్ లుక్ తో ఆర్య పోషించిన సమర అనే పాత్ర మేకోవర్ కోసం, కండ పుష్టి కోసం తీసుకున్న కఠిన ట్రైనింగ్ కి నిలువెత్తు సాక్షిగా వుంటాడు. ఈ కఠిన ట్రైనింగ్ తో బాక్సింగ్ దృశ్యాల్ని రసవత్తరం చేశాడు. సమర బాక్సింగ్ పాత్రకి ఆనాటి వరల్డ్ ఛాంపియన్ మహ్మదాలీని మోడల్ గా తీసుకున్నట్టు దర్శకుడు వెల్లడించాడు. అయితే స్పీడ్ పంచ్ కి ప్రసిద్ధుడైన మహ్మదాలీ అతి సునాయాసంగా, పెద్దగా కష్టపడకుండానే, ప్రత్యర్ధిని ఔట్ చేసేసే నైపుణ్యంతో వుంటాడు. సాత్వికంగా అన్పించే ఈ సింపుల్ ట్రిక్ మాస్ సినిమాకి వర్కౌట్ కాదని ఆర్యతో హోరాహోరీ, రక్తసిక్త బాక్సింగ్ కి తెరతీశారు. ఆర్య మీద మొత్తం మూడు ఈవెంట్లు చిత్రీకరించారు.

        పై ఔటర్ స్ట్రగుల్ కి ఇన్నర్ స్ట్రగుల్నీ జత చేశారు : బాక్సింగ్ ని ద్వేషించే తల్లితో సంఘర్షణ, తాగుడు మరిగాక భార్యతో సంఘర్షణ. ఇలా ఇన్నర్, ఔటర్ స్ట్రగుల్స్ తో పరిపూర్ణ పాత్ర అన్పించే ప్రయత్నం చేశారు. ఈ స్ట్రగుల్స్ ని ఆర్య శక్తి వంచన లేకుండా పోషించాడు. అయితే ఇంత మాస్ కమర్షియల్ లో ఆర్య పాత్రకి ఎంటర్ టైనింగ్ పార్శ్వాన్ని కల్పించలేదు. ఏ పాత్రకీ కల్పించ లేదు కాబట్టి, సినిమాలో కామెడీ, వినోదం లాంటివి కన్పించవు.

        తల్లి పాత్రలో అనుపమా కుమార్, భార్య పాత్రలో దుషారా విజయన్ లకి సంఘర్షించడానికి రొటీన్ పాయింట్లే కావడంతో ఫార్ములా పాత్రలుగానే వుంటాయి. ఆర్య ప్రత్యర్ధి పాత్రలో వేట పులిగా జాన్ కొక్కెన్ కవ్వింపు ఎక్స్ ప్రెషన్స్ బావున్నాయి. ఈ బాక్సింగ్ పాత్రకి మైక్ టైసన్ ని మోడల్ గా తీసుకున్నట్టు చెప్పుకున్నారు. దీనికి కూడా వయొలెన్స్ ని జోడించి సినిమాటిక్ గా మార్చేశారు. ఇక ఇంకో బాక్సింగ్ పాత్రలో డాన్సింగ్ రోజ్ గా షబీర్ కలరక్కల్ నటించాడు. నిజానికిది ఆనాటి పాపులరైన డాన్సింగ్ మోహన్, డాన్సింగ్ ఎలుమలై వంటి రియల్ ఫైటర్స్ ఆధారంగా రూపొందించిన పాత్ర అని మనకి సమాచారమందుతోంది.

        ఈ బాక్సింగ్ కి యాక్షన్ కొరియోగ్రఫీ అన్బరీవ్ నిర్వహించాడు. 2015 లో హిందీలో వచ్చిన 'బ్రదర్స్' లో బాక్సింగ్ కి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తో ఫ్యూజన్ చేసి బాక్సింగ్ టెంప్లెట్ ఇన్నోవేట్ చేశారు. మారిన కాలానికి సార్పట్టా వాస్తవిక పీరియెడ్ తో ఈ ప్రయోగం చేసే అవకాశం లేక, రెగ్యులర్ కమర్షియన్ బాక్సింగ్ నే చూపించారు. గొప్ప కోసం రూల్స్ జోలికి పోకుండా, సాంకేతిక భాష వాడకుండా, కామెంటరీ కూడా మాస్ భాషలో చెప్పిస్తూ, దేశవాళీ ఆటగానే చూపించడం మాత్రం కొత్తదనమే.

        మురళి ఛాయాగ్రహణం, గ్రేడింగ్, పీరియడ్ లుక్ ని తెస్తే, ఇతర కూర్పు, కళాదర్శకత్వం, వస్త్రాలంకరణ, కేశాలంకరణ మొదలైన సాంకేతిక విభాగాల పని తీరు ఉన్నత స్థాయిలోనే వున్నాయి. స్క్రిప్టు మాత్రం పోటీ పడలేదు.

చివరికేమిటి
     ఇండిపెండెంట్, రియలిస్టిక్ జానర్ కథనాలు ఈ రెండు స్కూల్స్ నుంచి వచ్చిన మేకర్లు కమర్షియల్ సినిమాలకి- అందునా బిగ్ బడ్జెట్  మూవీస్ కి చేస్తూంటారు. తమిళంలో 'మండేలా'తో ఎం. అశ్విన్, 'సార్పట్టా'లో పా రంజిత్ ఇదే చేశారు. కమర్షియల్ స్క్రిప్ట్ రైటర్స్ ని మొనటానీ పంజరంలోంచి బయటికి తీయించే కథన కలాపం 'మండేలా' లో వున్నట్టు, సార్పట్టా లోనూ  వుంది. అంటే బిగినింగ్ (ఫస్ట్ యాక్ట్) విభాగంలో అన్నమాట.

        బిగినింగ్ అంటే ఏమిటి? ప్రధాన పాత్ర సహా కొన్ని కీలక పాత్రల్ని పరిచయం చేసి, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేసి, దాంతో బిగినింగ్ ని ముగిస్తూ, అప్పుడు వచ్చే ప్లాట్ పాయింట్ వన్లో ప్రధాన పాత్రని సమస్యలో పడేసి, ఆ సమస్యలోంచి బయటపడాలన్న గోల్ ని ఏర్పాటు చేయడమేగా? ప్రతీ సినిమాలో మార్పు లేకుండా హీరో కిదే తంతుగా?

        స్ట్రక్చరనేది దాని చట్రంతో అది శాశ్వతమే. ఎన్ని యుగాలు గడిచినా ఈ చట్రం చట్రమే, మారదు. మార్చాలని  క్రియేటివిటీకి పాల్పడితే కాళ్ళో, మొండెమో, తలకాయో లేని వికృత కథ చేతికొస్తుంది. కనుక బిగినింగ్- మిడిల్- ఎండ్- ఈ మూడిట్లో దేన్నీ తీసేసే క్రియేటివిటీకి పాల్పడ లేరు. పాల్పడగల్గేది ఆ చట్రమనే ఏర్పాటు లోపల చేసుకునే కథనంతో క్రియేటివిటీ మాత్రమే.

        కానీ - మీరు చట్రంలో వున్నప్పుడు చట్రాన్ని చూడలేరన్నాడు సీడ్ ఫీల్డ్. నిజమే, దీంతోనే వస్తోంది చిక్కంతా. లోపల కూర్చుంటే చట్రమే ఫీలవలేరు. కథనమే కనిపిస్తూంటుంది-  చూసిన సినిమాల్లోని రొటీన్ కథనం. బయట నుంచి చట్రాన్ని చూడగల్గితే ఆ చట్రమే కథనానికి కొత్త ఐడియాలిస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోకుండా శాశ్వతమైన స్ట్రక్చరనే చట్రం లాగే, కథనాన్ని కూడా శిలాశాసనంలాగా పర్మనెంట్ ఆకారంతో చెక్కి పడేస్తూ పోతే, సినిమాలేమౌతాయి? చూసిందే చూడరా... అన్నట్టు తయారవుతాయి.

        ప్రతీ సినిమాలో హీరోయే ప్లాట్ పాయింట్ వన్లో సమస్యలో ఎందుకు పడాలి? గోల్ హీరోకే ఎందుకేర్పడాలి? తిరగేసి ఆలోచించ లేరా? విలన్సే సమస్యలో పడి, ప్లాట్ పాయింట్ వన్ గోల్ అనేది విలన్స్ కే ఏర్పడ కూడదా? మరి హీరో ఏమవుతాడు? ఏమీ కాడు, ఆగుతాడు. ఈ ఆపడమేగా క్రియేటివిటీ అంటే? మొన్న తమిళ మండేలా లో ఇదే చూశాం. ఇప్పుడు సార్పట్టా తమిళంలోనూ ఇదే చూస్తున్నాం.

    విలన్లయిన అన్నదమ్ములు ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు పోటీకి దిగడాన్ని ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంగా వుంటుంది మండేలా లో. ఇంతవరకూ ఈ బిగినింగ్ విభాగమంతా కథనం అన్నదమ్ముల మీదే వుంటుంది. బలహీనుడైన హీరో మండేలా అలా వెయిటింగ్ లో వుంటాడు. ఈ బిగినింగ్ విభాగమంతా బలహీనుడైన మండేలా మీద గాక, బలమైన విలన్లయిన అన్నదమ్ముల  మీద వాళ్ళ తగాదాలకి సంబంధించిన కథనం చేసి, వాళ్ళ మధ్యే వాళ్ళ కేర్పడే గోల్స్ తో ప్లాట్ పాయింట్ వన్ కి చేర్చాడు.ఈ విలన్ల గొడవతో సంబంధం లేకుండా మండేలాని బార్బర్ జీవితానికి పరిమితం చేశాడు. మరిప్పుడు ప్లాట్ పాయింట్ వన్ విలన్ల చేతి కెళ్ళిపోయాక మండేలా చేసేదేమిటి? దే సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది మిడిల్ (సెకండ్ యాక్ట్) లో.  

        ఇదే బిగినింగ్ కథనాన్ని సార్పట్టా లో కూడా చూడొచ్చు. ఇందులో హీరో ఆర్య బిగినింగ్ విభాగంలో మండేలా లాగే బలహీన క్యారక్టర్. మండేలా బార్బర్ అయితే ఆర్య హార్బర్ కూలీ. ఒకవైపు బాక్సింగ్ ఈవెంట్స్ భారే యెత్తున జరుగుతున్నా తల్లి భయంతో బాక్సింగ్ జోలికి పోకుండా, ఈవెంట్స్ చూస్తూ ఖాళీగా గడిపేస్తూంటాడు ఆర్య. మూస కమర్షియల్స్ లో హీరోనిలా ఖాళీగా చూపించే ధైర్యం చేయలేరు, స్ట్రక్చర్ గురించి తెలీక.

        బిగినింగ్ ప్రారంభంలో ఇరవై రెండు నిమిషాల సుదీర్ఘ నిడివితో సార్పట్టా - ఇడియప్ప పరంపరల మధ్య ఈవెంట్స్ ఒకే సీనుగా, ఒకే ఎపిసోడ్ గా వుంటాయి. బిగినింగ్ మొదలవగానే ఇలా ఇరవై రెండు నిమిషాల ఒకే సుదీర్ఘ సీనుతో కథనం చేయడం కొత్తగా అన్పించే క్రియేటివిటీ కాక ఏమిటి.

        ఈ ఈవెంట్స్ ని పని లేకుండా కేవలం ప్రేక్షకుడిలా ఎంజాయ్ చేస్తూంటాడు ఆర్య. ఇదే మోనాటనీని వదిలించుకున్న ఇన్నోవేషన్. దీని తర్వాత పది నిమిషాలకి సార్పట్టా - ఇడియప్ప పరంపరల మధ్య ప్లాట్ పాయిట్ వన్ తో బిగినింగ్ ముగుస్తుంది. ఈ రెండు పరంపరల మధ్య ఫైనల్ షో డౌన్ గా, ఇడియప్ప పరంపర సార్పట్టాకి చివరి అవకాశ మివ్వడం సమస్య నేర్పాటు చేస్తుంది. అంటే ఇక సార్పట్టా కి చెందిన కోచ్ పశుపతికి,  ఇడియప్పని ఎట్టి పరిస్థితిలో ఓడించాలన్న గోల్ ఏర్పడడం...

(మిగతా రేపు)
సికిందర్

27, జులై 2021, మంగళవారం

1051 : సందేహాలు- సమాధానాలు

 Q : ఈ రోజుల్లో సినిమా కథ ముగింపు ఎలా వుండాలి? ఈ మధ్య మొదలైన రియలిస్టిక్ సినిమాల ట్రెండ్ లో రియలిస్టిక్ ముగింపుల పేరుతో శాడ్ ముగింపులు ఇవ్వడం రొటీన్ అయినట్టు అన్పిస్తోంది. మారిన కాలాన్ని బట్టి  ప్రేక్షకులు దీన్ని ఇష్టపడుతున్నారంటారా?
నాగరాజు, అసోసియేట్

A : బ్యాక్ టు బ్యాక్ రెండు కోవిడ్ అనుభవాలతో ప్రజలు తీవ్ర ఆరోగ్య, ఆర్ధిక ఉద్రిక్తతల నడుమ జీవిస్తున్నారు. కాబట్టి నిర్మొహమాటంగా చెప్పాలంటే హేపీ ఎండింగు లిచ్చుకోవడం బెటర్. సినిమా అంతా రియలిస్టిక్ వాస్తవికతలతో గంభీరంగా నడిచాక, ముగింపు కూడా భారంగా వుంటే ద్వంద్వాల పోషణ (డైనమిక్స్) దెబ్బతింటుంది. గంభీర కథ చివరికి రిలీఫ్ నివ్వాలి. అలాగని డైనమిక్స్ కోసమని కామెడీలు, రోమాంటిక్ కామెడీలు, ఫ్యామిలీ డ్రామాలు, ఫాంటసీలు, సస్పెన్సు, మిస్టరీ, థ్రిల్లర్స్ మొదలైన హాస్య, అద్భుత రస ప్రధాన జానర్స్ కి శాడ్ ముగింపులిస్తే బెడిసికొడుతుంది.

        రియలిస్టిక్ సినిమాలకి శాడ్ ముగింపులిచ్చినా, పాత్ర అనుభవించే ఆ పరిస్థితి, మనకెక్కడో మన జీవితంలో అనుభవమైనట్టు వున్నట్టయితే, అది వర్కౌట్ అవుతుంది. ఆ ముగింపు మనల్ని సంస్కరించ వచ్చు. మన అవగాహనని విశాలం చేయవచ్చు. ఉదాహరణకి, హాలాహల్ లో క్రిమినల్సే గెలుస్తారు. పోలీసు అయిన హీరో బలై పోతాడు. ఫార్ములా సినిమాలు చూపించే వాటికి భిన్నంగా వాస్తవంలో వ్యవస్థ ఎలా పని చేస్తుందో చూపించి మన అవగాహనని పెంచడానికిది తోడ్పడుతుంది. పోతే, హేపీ ఎండింగ్స్, శాడ్ ముగింపులు – అనే చట్రంలోనే ఆలోచించకుండా, రాడికల్ ముగింపు అనే సజాతి ముగింపు అనేదొకటి కూడా రియలిస్టిక్స్ కుంటుందని గమనించాలి.

        ముగింపు చూస్తే అది మనసుని దొలిచేసేలా వుండాలంటే, ముగింపు రాశాక, దాన్ని బట్టి ప్రారంభాన్ని మార్చుకోవాలి. ముగింపు చూసిన ప్రేక్షకులు వెనక్కి వెళ్ళి ప్రారంభాన్ని మళ్ళీ చూసేలా వుండాలి. అలా చూసినప్పుడు ముగింపు ఫ్రేములు, ప్రారంభ ఫ్రేములు మ్యాచింగ్ ఫ్రేములుగా వుంటే, ప్రేక్షకులు లోనయ్యే కిక్కే వేరు. ఈ కింది వీడియో చూడండి.

సికిందర్ 

16, జులై 2021, శుక్రవారం

1050 : రివ్యూ

 

కోల్డ్ కేస్ ( మలయాళం)
దర్శకత్వం : తనూ బాలన్
తారాగణం : పృథ్వీరాజ్ సుకుమారన్, అదితీ బాలన్, ఆత్మీయ రాజన్, సుచిత్రా పిళ్ళై, లక్ష్మీ ప్రియా చంద్రమౌళి తదితరులు
రచన : శ్రీనాథ్ వి నాథ్, సంగీతం : ప్రకాష్ అలెక్స్, ఛాయాగ్రహణంగిరీష్ గంగాధరన్, జోమన్ జాన్  
బ్యానర్ : ఆంటో జోసెఫ్ ఫిలిమ్ కంపెనీ
నిర్మాత : ఆంటో జోసెఫ్, జోమన్ జాన్, షమీర్ అహ్మద్  
విడుదల : జూన్ 30, 2021, అమెజాన్
***

          తాజాగా ఒక క్రాస్ జానర్ మలయాళం థ్రిల్ కి గురిచేయాలనే సంకల్పంతో చిన్న తెర మీద ప్రత్యక్షమైంది. పెద్ద తెర మీద తేలిపోయే సినిమాలు చిన్న తెర మీద అద్భుతంగా అన్పించేస్తాయి. సైజు పుణ్యం. దాంతో కనికట్టు. ఇంకా మొబైల్లో సూక్ష్మ తెర మీద లాగిపెట్టి కనికట్టు చేస్తాయి. ఎక్కువగా తీసే సజాతి జానర్ల కలబోతకి భిన్నంగా విజాతి జానర్లని కలిపి తీయడం ఒక సాహసమే. తేడా వస్తే తెప్పరిల్లడం కష్టమే. కొత్త దర్శకుడు, ఛాయాగ్రాహకుడు తనూ బాలన్, ఛాయాగ్రహణం నిర్వహించకుండా తొలిసారిగా దర్శకత్వం చేపట్టి తీసిన, కోల్డ్ కేస్ (పరిష్కారం కాని కేసు) అనే థ్రిల్లర్, రెండు విజాతి జానర్లతో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టే వుంటుందంటే, వినోదానికి ఇంకేదో అర్ధం వెతికి చెప్తున్నట్టే అనుకోవాలి.  
         
సలు ఎంటర్ టెయిన్మెంట్ కి అర్ధమేమిటో తెలిస్తే, కొత్తర్ధం కనిపెట్ట వచ్చు. అర్ధమే తెలియకేపోతే కొత్తర్ధం కనిపెట్టే ఆలోచనే పుట్టదు. విజాతి జానర్ల కలబోతలో తలమునకలై ఏదో చేయబోతే ఇంకేదో అర్ధం ప్రాణం పోసుకోవడ మవుతుంది. ప్రాణం పోసుకున్నాక ఎవరి ప్రాణం తీయవచ్చు? ఇదే తెలుసుకోవాల్సిన అసలు విషయం.
కథ
         
ఒక చెరువులో చేపలు పడుతున్న మత్శ్యకారుడి వలకి బరువుగా వున్న క్యారీబ్యాగేదో చిక్కుతుంది. దాన్ని విప్పి చూసి ఠారెత్తి పోతాడు. పోలీసులు వచ్చి బ్యాగులో పెట్టి వున్న పుర్రెని చూస్తారు. ఇదెవరి పుర్రె? ఎవరు వేశారు చెరువులో? విచారణ ప్రారంభిస్తాడు ఏసీపీ సత్యజిత్ (పృథ్వీరాజ్ సుకుమారన్).
        మేధా పద్మజా ( అదితీ బాలన్) అని సింగిల్ మదర్ ఒకామె కూతురు చిన్నూతో  వుంటుంది. విడాకుల కేసు కోర్టులో వుంది. ఒక ఛానెల్లో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా పని చేస్తూంటుంది. అతీంద్రియ శక్తుల మీద ప్రోగ్రాములు చేయడం ఆమె విధి. ఒక ఇంట్లో ఆమె కూతురితో అద్దెకి దిగుతుంది. ఇంట్లో వింత సంఘటనలు జరుగుతూంటాయి.
         
పుర్రెతో సత్యజిత్ విచారణ సవాలుగా మారుతుంది. మేధా ఇంట్లో ఆత్మ సమస్యగా తయారవుతుంది. సత్యజిత్ చేతిలో పుర్రె ఎవరిది, మేధాని పీడిస్తున్న ఆత్మ ఎవరిది? రెండూ ఒకరివేనా? అదెవరు? ఎవరు చంపి వుంటారు? ఎందుకు చంపివుంటారు? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ?
         
పోలీస్ ప్రొసీజురల్, హార్రర్ - రెండు విజాతి జానర్లని కలిపి చేసిన హైబ్రిడ్ జానర్ కథ. రెండూ విడివిడి ట్రాకులు. పోలీసుకీ రిపోర్టర్ కీ పరస్పర సంబంధం లేని విడివిడి కథలు. పుర్రె ఎవరిదో గుర్తించడానికి పోలీసు విచారణ, ఆత్మ ఎవరిదో తెలుసుకోవడానికి రిపోర్టర్ ప్రయత్నం రెండు విడివిడి ట్రాకులూ, కథ మధ్య కొచ్చేసరికి విడివిడిగానే కొలిక్కి వస్తాయి. ఇక్కడ చనిపోయిందెవరో ఇద్దరికీ తెలిశాక కూడా రెండు కథలూ కలవవు. మరెక్కడా కలవ్వు. దీంతో హార్రర్ కథ అర్ధం కోల్పోయి, పోలీసు కథగానే పేలవంగా ముగుస్తుంది.
         
కలపడం వేరు, కలిపి సమన్వయం చేయడం వేరు. సమన్వయం ఎలా చేయాలో జానర్ రీసెర్చి చేసినట్టు లేదు. మనమే రీసెర్చి లాంటిది చేస్తే, హార్రర్ కలిపిన ఫిలిం నోయర్/నియో నోయర్ జానర్ పోలీస్ ప్రొసీజురల్స్ కొన్ని కనిపిస్తున్నాయి. కథకి ఏకత్వం సాధిస్తూ, రెండు విజాతి జానర్లూ పాలూ నీళ్ళల్లా కలిసిపోయేట్టుగా, ఎలా సమన్వయం చేశారో తెలుస్తోంది. ఫ్రెంచి 1955
         
ది బీస్ట్ మస్ట్ డై (1974), ఫాసినేషన్ (1979), వుల్ఫెన్ (1981), ఏంజెల్ హార్ట్ ( 1987),  లెపర్డ్ మాన్ (1943), లే డయబోలిక్ ( ఫ్రెంచి, 1952), మొదలైనవి కొన్ని ఉదాహరణలు. ప్రస్తుత కథ సెటప్ కి దగ్గరగా వున్నది, ది వికర్ మాన్ (1973) ఇందులో అదృశ్యమైన అమ్మాయి అన్వేషణలో వున్న ఇన్స్ పెక్టర్, క్రమేణా ఒక దీవికి చేరుకునే సరికి, అక్కడ  మాయలతో, మంత్రాలతో, నరబలులతో ఫోక్ హార్రర్ ఎదురవుతుందిఇలా పోలీస్ ప్రొసీజురల్ గా వున్న కథ కాస్తా, ఫోక్ హార్రర్ లోకి సునాయాసంగా ఫ్లో అయిపోతుంది అతికించినట్టు కనబడకుండా.
         
ప్రస్తుత కథలో కూడా పోలీసు కథ, హార్రర్ కథ ఒకటై లీనమైతేనే పోలీస్ -హార్రర్ హైబ్రిడ్ సార్ధక మవుతుంది. దేనిదారి దానిదే అయినప్పుడు క్రికెట్ మ్యాచే అవుతుంది. ఏది దేన్ని ఓడిస్తుందా అని ఆత్మహత్య చేసుకుంటున్నట్టే వుంటుంది. ఇక్కడ పోలీసు కథ హార్రర్ కథని హత్య చేసింది. ఇందుకోసం - క్రికెట్ కోసం - సినిమా చూడాలా? ఐడియా రీసెర్చి చేయకపోతే, ఐడియాలో కథలెలా ఇమిడాయో స్ట్రక్చర్ పరంగా క్రియేటివ్ యాస్పెక్ట్ చూసుకోక పోతే, కబడ్డీలు కూడా చూడాల్సి వస్తుంది. దొమ్మీలు కూడా చూస్తాం.
నటనలు- సాంకేతికాలు  
         
నటనల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏసీపీ సత్యజిత్ పాత్ర నటించిన సుకుమారన్ ది నటనేనా అన్న ప్రశ్న వెంటాడుతుంది. సీను కా సీను డైలాగులు చెప్పేసి తప్పుకోవడమే. మోడలింగ్ చేస్తున్నాడా అన్నట్టు వుంటాడు. సీన్లలోని కంటెంట్ కి మోడలింగ్ చేయడం. ఎవరైనా స్టార్ మోడలింగ్ చేస్తే వస్తువు అమ్ముడు పోవడానికి చేస్తాడు. సుకుమారన్ మోడలింగ్ కి ఇది కూడా కుదర్లేదు. సీనూ అర సీను కూడా అమ్ముడు పోయే పాపాన పోదు. ఇన్వెస్టిగేషన్ మాత్రం హైరేంజిలో వుంటుంది. పుర్రె ఎవరిదో నిర్ధారించడానికి ఫోరెన్సిక్ ఆంత్రోపాలజీ, పుర్రెలో దంతం ఎవరిదో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ ఓడొంటాలజీ వగైరా.
         
ఇన్వెస్టిగేషన్స్ లోంచి సస్పెన్సూ పుట్టదు, పరుగులు తీయించే అర్జెన్సీ ఉద్భవించదు. ఫోరెన్సిక్స్ పద్ధతుల్ని విజ్ఞానాన్ని బోధిస్తూ తీరిగ్గా డెమో ఇస్తున్నట్టే కథ వుంటుంది. కథలో భాగం చేసి పాత్రకి పని పెట్టే క్రియాత్మక సుగుణంతో వుండదు. ఫలితంగా ఎమోషన్స్ వుండవు, ఉత్థాన పతనాల క్యారక్టర్ ఆర్క్ వుండదు, టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫూ వుండదు.
         
ఇలా ఇన్వెస్టిగేషన్ హీరో పాత్రకి పనీ పెట్టక పోగా, ఎదురు పాత్ర లేకపోవడంతో ఇంకో అవస్థ వచ్చి పడింది. ఒక అనుమానితుడు, ఒక ప్రత్యర్ధి అంటూ లేకపోవడంతో, క్లయిమాక్స్ వరకూ హీరో లింగు లిటుకు మంటూ ఏకాకిగా దిక్కుతోచక తిరిగే పరిస్థితి వచ్చి పడింది.  ఇలా ఎందుకు జరిగిందంటే, దర్శకుడనే వాడు సస్పెన్స్ అనుకుంటూ ఎండ్ సస్పెన్స్ కథ సింగారించాడు కాబట్టి. సస్పెన్సు అనగా విషయమును ఎండ్ వరకూ సస్పెన్సుతో సురక్షితముగా వుంచుట - అనే సినిమాల కొంప ముంచే దుష్ట సాంప్రదాయాన్ని ఇష్టంగా పోషించే అద్భుత  దర్శకుల్లో ఒకడై పోయాడు కాబట్టి. దుష్టుడు కన్పించని ఎండ్ సస్పెన్స్ కథల్లో దర్శకుడే ప్రత్యక్ష నిరుపమాన దుష్టుడు - ప్రేక్షకులకీ, సినిమాకీ.
         
ఇక హీరోయిన్ అదితీ బాలన్ మేధా పద్మజా పాత్ర ఇంకా అద్భుతం. 2017 లో అరువి  (ప్రవాహం) అనే తమిళంలో హీరోయిన్ గా పరిచయమై, ఏకంగా ఆరు ఉత్తమ నటి అవార్డు లందుకున్న తను - ఎందుకీ సినిమా చేస్తున్నానన్నట్టు వుంటుంది. తాడూ బొంగరం లేని పాత్ర ఎందుకు నటిస్తున్నానూ అన్నట్టు ముఖ భావాలుంటాయి. పసుపు తాడు ఎలాగూ విడాకులతో కోర్టులో వుంది, ఆటవిడుపుకి బొంగరమైనా లేకపోతే ఎలా? బొంగరం గరిమానాభికి పెట్టింది పేరు. తన పాత్రకుండాల్సింది గరిమనాభియే.
         
తను అతీంద్రియ శక్తుల ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్. పేరుకే బిల్డప్. కనీసం మేధా పద్మజ అని పేరున్నందుకైనా మేధతో వుండదు. ఎక్కడ అలౌకిక సంఘటన జరిగినా ఛానెల్లో ప్రోగ్రాం చేసే తను, తన ఇంట్లోనే ఆత్మ సందడి చేస్తూంటే ప్రోగ్రాం చేయకుండా హడలిపోతూంటుంది. ఆత్మ కూతుర్ని కూడా ఇబ్బంది పెడుతూంటే, కూతురికి ఆత్మ పూనిందా అన్నట్టుంటే, పని మనిషికి కూడా అనుభవాలవుతూంటే, దీన్ని న్యూస్ ఐటెం చేయకుండా, ఏమీ లేదని కొట్టి పారేస్తూంటుంది
         
పరిస్థితి తీవ్రమవుతూంటే ఏం చేయాలో ఆత్మల ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా తనకి తెలియనట్టు కొలీగ్ ని అడుగుతుంది! అతను జరా జూక్కై ( సుచిత్రా పిళ్ళై) అనే పారా సైకాలజిస్టు దగ్గరికి తీసి కెళ్తాడు! ఇంత అమాయకంగా వుంటుంది ఈమె పాత్ర. తను పని చేస్తున్న ఫీల్డులో పారా సైకాలజిస్టులతో, భూత వైద్యులతో పరిచయాలు లేకుండా ఎలా వుంటుంది.
           
మరొకటేమిటంటే, వైపు పోలీసులకి పుర్రె దొరికి దాని ఇన్వెస్టిగేషన్ మీడియాలో సంచలనంగా వుంటూంటే, ఇది కూడా తెలియనట్టే వుంటుంది. వెళ్ళి ఏసీపీని కలిసి ఆత్మ గురించి చెప్పాలనుకోదు. సినిమాలు బోరు కొట్టడానికి ప్రధాన కారణం పాత్ర చిత్రణలు సరిగా లేకపోవడం. పాత్రే కథ కాబట్టి, పాత్ర నడుస్తున్న కథ కాబట్టి. పాత్రచిత్రణ గరిమనాబి నిస్తుంది కాబట్టి, ఆట ఆగిందా సీటు గోవిందా కాబట్టి.
       
ఇక చనిపోయిన అమ్మాయి ఈవా మరియాగా ఆత్మీయ రాజన్ కన్పిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఈమెకి కూడా ఆత్మీయ కథ వుండదు. చాలా మలుపులతో భావోద్వేగాల్లేని, సానుభూతి లేని, మాత్రం కదిలించని పొడిపొడి కథ వుంటుంది. దీంతో కూడా ప్రేక్షకులకి ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడదు. ఇక ఎండ్ సస్పెన్స్ విప్పినప్పుడు ప్రవేశించే లక్ష్మీ ప్రియా చంద్రమౌళి ప్రతినాయకి పాత్ర - అడ్వొకేట్ హరిత - ఎక్సైట్ మెంట్, థ్రిల్ పుట్టించని ఇంకో వ్యర్ధ సృష్టి.
           
మొత్తం సినిమాలో దృష్టిని మరల్చే పాత్ర పారా సైకాలజిస్టు జరా జుక్కై పాత్ర. బ్లాక్ స్పెక్ట్స్ ధరించి పాత్రకి గాఢమైన  మిస్టీరియస్ ఫీల్ ని కల్పిస్తూ, సుచిత్రా పిళ్ళై ఇచ్చిన స్టన్నింగ్ పెఫార్మెన్స్ చూస్తే - కథకి ఈమే విలన్ కావాలని వెంటనే పట్టేస్తాం. అప్పుడు కనీసం క్లయిమాక్సయినా బతికి బెనారస్ చీర కట్టేది.
         
కానీ దర్శకుడు, అతడి రచయిత మూలాలుండని సొంత క్రియేటివ్ వ్యాపకంతో పాత్రల్ని, వాటి కథల్నీ సరిగా ప్లానింగ్ చేయకపోవడంతో పరిస్థితేర్పడింది. స్ట్రక్చర్ తెలిసి వుండి స్ట్రక్చర్ చెప్పే సూత్రాల్ని పట్టించుకుని వుంటే, కోల్డ్ కేస్ కోల్డ్ స్టోరేజీ కెళ్ళేది కాదు.
         
సాంకేతికంగా ఉన్నతమేకానీ కేవలం సాంకేతిక ఔన్నత్యాలు సినిమాని నిలబెట్టలేవు. అద్భుత సాంకేతిక విలువలుండొచ్చు. ఐతే ఏంటి? - అన్న ప్రశ్నతో సాంకేతికాలు సున్నాలై పోతాయి. దీనికి జవాబు స్క్రిప్టే చెప్పాల్సి వుంటుంది.
చివరికేమిటి  
        హైబ్రిడ్
జానర్ సమన్వయ లోపం, ఎండ్ సస్పెన్స్ కథ, చేసిన కృషిని కృశింప జేశాయి. పోలీస్ ప్రొసీజురల్ని ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ గా నాలెడ్జిని అందిస్తూనే, ఇన్ఫో టైన్మెంట్ గా చేయకుండా, అదే డాక్యుమెంటరీగా చాలా మంది చేస్తున్న పొరపాటు మళ్ళీ చేసేశారు. సినిమా అంటే ఎంటర్ టైన్మెంటే కాదు, ఇన్ఫో టైన్మెంట్ కూడా ననే అర్ధంతో ఇవాళ్టి సినిమాలు ముందడు గేస్తున్నాయి.
         
ఆత్మ గురించి సస్పెన్స్ లో, హార్రర్ కి సింక్ లో వెంట్రుకలు, ఐస్, ఫ్రిడ్జి, బావి మొదలైనవి చూపిస్తూనే వాటర్ థీమ్ కల్పించారు. బెడ్రూం లోకి వాటర్ వచ్చేయడం లాంటిది. కానీ ఇవన్నీ హీరోయిన్ భయపడ్డానికే తప్ప, ఇవి చెబుతున్న అర్ధాన్ని కనుక్కునే  లీడ్స్ గా కథ కుపయోగ పడాలని మర్చిపోయారు. పారా సైకాలజిస్టు కూడా ఆత్మ ఎవరో కనుక్కుంటుంది గానీ, వాటర్ థీమ్ కి అర్ధం తెలుసుకోవాలన్న ఆలోచన చేయదు. ఇంతా చేస్తే వాటర్ థీమ్ తో ఆత్మకి సంబంధం లేదనీ, కేవలం ఫ్రిజ్ తోనే సంబంధమనీ క్లయిమాక్స్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తుంది
              2003
లో అనురాగ్ బసు దర్శకత్వంలో, జాన్ అబ్రహాం, తారా శర్మ, మహిమా చౌధురీ లతో మహేష్ భట్ నిర్మించిన 'సాయా (నీడ) సాంతం వాటర్ థీమ్ బ్యాక్ డ్రాప్ తో వుంటుంది. బయటి నుంచి, పైకప్పులోంచి ఇంట్లోకి పారుతున్న నీటికి అర్ధమేమిటో  తెలుసుకునే ప్రయాణంలో అద్భుత రహస్యం బయట పడుతుంది జాన్ అబ్రహాంకిచనిపోయిన భార్య ఏదో రహస్యం చెప్పాలని చేస్తున్న ప్రయత్నమే ఇది. వరదల్లో జాడ లేకుండా కొట్టుకు పోయిన భార్య ఆదివాసీలకి దొరికి చనిపోతుంది. అబ్రహాం అక్కడికి వెళ్ళేసరికి చనిపోతూ భార్య ప్రసవించిన బిడ్డ ఆదివాసీల దగ్గర వుంటుంది. ఇదీ- ఫలప్రాప్తి అంటే ఇలా వుంటుంది. బ్యాక్ డ్రాప్ లో చూపిస్తూ వచ్చిన రహస్యమయ థీమ్ కి కదిలించే ఫలప్రాప్తి!
         
ప్రస్తుత 'కోల్డ్ కేస్' లో రెండేళ్ల క్రితం అదృశ్యమైన ఈవా మరియా కేసు తేలక అపరిష్కృత (కోల్డ్ కేసు) గా  వుండిపోయింది. పుర్రె దొరకడంతో కేసు రీఓపెనైంది. ఇంటర్వెల్ ముందు ఆత్మ ఈవా మరియా అనే అమ్మాయిదని ఇటు హీరోయిన్ కి, అటు హీరోకీ ఒకే సారి తెలుస్తుంది. ఇప్పుడైనా రెండు ట్రాకులు కలవ్వు. ఫస్టాఫ్ అంతా చనిపోయిందెవరూ అన్న పాయింటుతో సుదీర్ఘ కథ నడిపారు. ఇంటర్వెల్లో ఈవా మరియా అని తెలిశాక ఏం చేయాలి? ఆమెని చంపిన వ్యక్తి ఎవరో తెలుసుకునే క్లూ కూడా అప్పుడే తెలివిగా  ఏర్పాటు చేసుకుని, సెకండాఫ్ వ్యక్తి కోసం వేటగా యాక్షన్లోకి కథని తేవాలి.
         
కానీ ఫస్టాఫ్ అంతా చనిపోయిందెవరో తెలుసుకునే కథ నడిపి, ఈవా మరియా అని తెలిశాక, మళ్ళీ సెకండాఫ్ ఈవా మరియా పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకునే కథే క్లయిమాక్స్ వరకూ నడిపి దుంప తెంచారు. సినిమా ప్రారంభం మొదలు క్లయిమాక్స్ వరకూ తెలుసుకోవాలి, తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలని ఒకటే ఆరాట పడిపోతూ, బోలెడు విషయాలు తెలుసుకునే కథగా తయారు చేశారు. తెలుసుకుని ఏం చేస్తామో తెలుసుకోలేక పోయారు. ఏదో తిప్పలుపడి రాసేస్తే టెక్నీషియన్ల సపోర్టుతో అదే స్క్రీన్ ప్లే గొప్ప అయిపోతుందను కున్నట్టుంది.
         
దీంతో ఫస్టాఫ్ ఇన్వెస్టిగేషనే, సెకండాఫూ ఇన్వెస్టిగేషనే జరగడంతో సాంతం డైలాగులే కథలో వున్నాయి. ఒక్క యాక్షన్ సీనూ లేదు. క్లయిమాక్స్ లోకూడా యాక్షనే లేదు. కోల్డ్ కేసు చల్లారిన బిర్యానీ రైసు లాగే తయారైంది. విజువల్ మీడియాకి కూడా అర్ధాన్ని మార్చి పారేశారు. డైలాగులే కథనుకుంటే, డైలాగుల్ని రికార్డు చేసి రేడియోలో ప్రసారం చేస్తే సంక్షిప్త శబ్ద చిత్రం లాగానో, నాటకం లాగానో అర్ధమైపోతుంది. ఇంత ఖర్చుపెట్టి సినిమాగా తీయాల్సిన అవసరమే లేదు
         
ఇక ఎండ్ సస్పెన్స్ విషయానికొస్తే, ముగింపు వరకూ విలనెవరో చూపించకుండా ఓపికని పరీక్షించినప్పుడు, సస్పెన్స్ విప్పితే బిగ్ సర్ప్రైజ్ వుండాలి. అది లేదు. ఫ్లాష్ బ్యాకులోనే ఒక అడ్వొకేట్ ని చూపించి, ఈమె మరియాని చంపే కారణాన్ని పేలవంగా చూపించడంతో ఎండ్ సస్పెన్స్ గొప్ప దిబ్బ అయింది. కనీసం పారా సైకాలజిస్టుగా కథలో చూపిస్తూ వుండిన టెర్రిఫిక్ సుచిత్రా పిళ్ళైతో సస్పెన్స్ విప్పినా సర్ప్రైజ్ ఎండింగ్ గా వుండేది. అంతా సేపూ మన ఓపికని పరీక్షించినందుకు పరిహారంగా వుండేది.
           
మలయాళం సినిమాలు అద్భుతాలని అనుకోనవసరం లేదు. ఇలాటి దిగువ శ్రేణి పదార్ధాలు కూడా వుంటాయి. రివ్యూ చాలా రోజులు కోల్డ్ స్టోరేజీలో వుండి పోయింది,  ఇప్పుడు బయటికి తీసి వేడి చేశాం.

సికిందర్