రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, ఆగస్టు 2020, సోమవారం

972 : రివ్యూ


దర్శకత్వం : నితిన్ కక్కర్
తారాగణం : కుముద్ మిశ్రా
, దివ్యా దత్తా, ఆకాష్ ఖురానా, సలీమా రజా, ఫరూఖ్ సేయర్ తదితరులు    
రచన : నితిన్ కక్కర్
, షరీబ్ హాష్మీ; సంగీతం : ట్రాయ్ ఆరిఫ్, అర్జిత్ దత్తా; ఛాయాగ్రహణం : శుభ్రాంశూ దాస్, మాధవ్ సలూంఖే
బ్యానర్ : లిటిల్ టూ మచ్ ప్రొడక్షన్స్
నిర్మాతలు : నితిన్ కక్కర్
, షరీబ్ హాష్మీ, ఉమేష్ పవార్
నిడివి : 95 నిమిషాలు
విడుదల : సోనీ లైవ్

***
        
కోవిడ్ -19 సృష్టించిన సంక్షోభంలో భారీగా ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డ దృశ్యాలు ఛానెల్స్ చూపించక పోవచ్చు, వార్తా పత్రికలు ప్రచురించకపోవచ్చు, కానీ ఆల్టర్నేట్ మీడియా నుంచి వెబ్ పాత్రికేయులు, యూట్యూబర్స్ ఈ విషయంగా నిత్యం అప్ డేట్స్ ఇస్తూ ప్రశ్నలు లేవదీస్తున్నారు. యాదృచ్ఛికంగా ఒక సినిమా కూడా ఇదే పని చేస్తోంది. ఈ సినిమా విడుదల కావాల్సిన 2018 లో విడుదలై వుంటే అప్పటి పరిస్థితుల్లో ఆలోచింప జేసేది కాదేమో. ఇప్పుడు ఈఎంఐ లకి రిజర్వ్ బ్యాంక్ పొడిగించిన మారటోరియం గడువు ఆగస్టు 31 న ముగియనుండగా, ఉద్యోగాలు కోల్పోయిన రెండు కోట్ల మంది రుణగ్రహీతలు ఆందోళనకి గురవుతున్న నేపథ్యంలో, రామ్ సింగ్ చార్లీ విడుదల ఒక ఆశ అయితే, మరో వైపు నిరాశ కూడా. ఆశావహ దృక్పథంతో నిరాశ కాదనుకుని చెరిపేసుకుంటే త్యాగం. త్యాగధను లన్పించుకోవడం మనసొప్పకపోతే దొరికిన ఉపాధిని ఇంకొకడికి దానం చేయాల్సి వచ్చిన నిస్సహాయత. ఈ నిస్సహాయత కూడా ఎందుకు తెచ్చుకోవాలి? ఆశకి పోతేనే నిరాశ. దీంతో జీవితమే ఒక నాటక రంగం, నీ వంతు పాత్ర నువ్వు పోషించి అక్కడ్నుంచి తప్పుకో, ఇంకేమీ ఆశించకు- అనే కఠిన వాస్తవం.     

        ప్రపంచమే ఒక నాటక రంగమన్న విలియం షేక్స్ పియర్ కొటేషనుతో ప్రారంభమయ్యే రామ్ సింగ్ చార్లీ - బయటి ప్రపంచంలో ఇంకా పెద్ద సర్కస్ వుంటుందని తెలియని, సర్కస్ రింగే లోకంగా జీవించే సర్కస్ కళాకారుల ఉపాధి కేక. ఆధునిక వినోద మాధ్యమాల వెల్లువలో సర్కస్ కళారంగం ఉనికిని కోల్పోతున్న వేళ- సర్కస్ గుడారం కళ్ళ ముందే నేల వాలుతూంటే, బ్రతుకు పోరాటంలో తెలియని విద్య అయిన జీవితపు సర్కసుకి సిద్ధపడే జీవితాల కథ.

కథ 
    కోల్కతలోని జాంగో సర్కస్ కంపెనీలో  రాంసింగ్ (కుముద్ మిశ్రా), భార్య కజ్రీ (దివ్యా దత్తా) సర్కస్ కళాకారులుగా సుఖంగా జీవిస్తూంటారు. చార్లీ చాప్లిన్ వేషం వేయడంలో దిట్ట రామ్ సింగ్. తోటి సర్కస్ కళాకారులందరూ సర్కస్సే జీవితంగా కలిసి మెలిసి వుంటారు. కానీ ఒక రోజు సర్కస్ కంపెనీ ఓనర్ మాస్టర్జీ (సలీమా రజా) పిడుగులాంటి వార్తతో హడలెత్తిస్తుంది. ఈ రోజుల్లో సర్కస్ నడపడం ఎంతమాత్రం లాభసాటిగా లేదనీ, భారీ నష్టాలు చవిచూస్తున్నామనీ, అందుకని కంపెనీని మూసేస్తున్నామనీ, అయితే మూడు నెలల జీతాలు చెల్లించి సాగనంపుతామనీ ప్రకటిస్తుంది. 

          హతాశులైన కళాకారులు మూగ జీవులై జీతాలు తీసుకుని వెళ్లిపోతారు. రామ్ సింగ్ గర్భవతిగా వున్న భార్యని కొడుకుతో వూరు పంపేస్తాడు. ఏదో చేసి డబ్బు సంపాదించి పంపిస్తానని మాటిస్తాడు. కానీ అది జరగదు. ఒక ఈవెంట్ కంపెనీలో పదిహేను వేల జీతానికి జోకర్ వేషాలేయడానికి కుదిరినా, ఒక పొరపాటు చేసి డిస్మిస్ అవుతాడు. అక్కడ షాజహాన్ (ఫరూఖ్ సేయర్) అనేవాడు పరిచయమవుతాడు. అతను రిక్షా లాగే పనిలో పెట్టిస్తాడు. రామ్ సింగ్ ఇక రిక్షా కార్మికుడిగా మారిపోతాడు. అనుకోకుండా అతడి రిక్షానే ఎక్కిన మాస్టర్జీ చలించి పోతుంది. ఎప్పుడైనా సర్కస్ ప్రారంభించాలనుకుంటే వచ్చి సామగ్రి తీసికెళ్ళ మంటుంది. 

      ఇలాటి పరిస్థితిలో బిడ్డనికని వచ్చి, రామ్ సింగ్ ని చూసి దిగ్భ్రాంతి చెందుతుంది భార్య కజ్రీ. రామ్ సింగే కాదు, సర్కస్ లో వయొలిన్ వాయించిన మాస్టర్, రోడ్ల మీద వయొలిన్ వాయించుకుంటూ బ్రతుకుతూంటాడు. ఇద్దరు లిల్లీపుట్ కళాకారులు బార్ ముందు వాచ్ మెన్లుగా కుదిరి వెక్కిరింతలకి గురవుతూంటారు. ఇలా చెట్ట కొకరు పుట్ట కొకరుగా చెదిరిపోతారు.

        అలాగే కష్టపడి సంపాదిస్తూ కొడుకుని స్కూల్లో చేర్పించిన రామ్ సింగ్
, ఫాదర్స్ డేనాడు కొడుకుతో ప్రదర్శన ఇవ్వడంతో అతడికి ఆఫర్స్ రావడం మొదలవుతాయి. క్రమంగా సర్కస్ ప్రారంభించాలన్న ఆలోచన చేస్తాడు. కానీ సర్కస్ సామగ్రి తీసి కెళ్ళ మన్న మాస్టర్జీ చనిపోయింది. ఆమె కొడుకు డబ్బు డిమాండ్ చేస్తాడు. షాజహాన్ పొలం అమ్మి డబ్బు తెచ్చి రామ్ సింగ్ కిస్తాడు. ఇక్కడ్నించీ రామ్ సింగ్ అసలు కష్టాలు మొదలవుతాయి. మనుషులు, వాళ్ళ నైజాలు, స్వార్ధాలు, అవకాశవాదం మొదటిసారి చవిచూస్తూ సర్కస్ విన్యాసాలు చేస్తున్నట్టే అయి పోతుంది జీవితం.

        సర్కస్ ప్రారంభించాలన్న రామ్ సింగ్ కల నెరవేరిందా లేదా
? ఆ నిర్ణయం సరైనదేనా? ఒకసారి చేస్తున్న వృత్తి వ్యాపారాలు కోల్పోయాక తిరిగి ఆ వృత్తి వ్యాపారాల కోసమే తాపత్రయపడ్డం సరైనదేనా? వృత్తి వ్యాపారాల గురించి తెలుసుకోవాల్సిన నీతేమిటి? ఇది తెలుసుకునేలా చేసేదే మిగతా కథ. 

నటనలు -సాంకేతికాలు
     కుముద్ మిశ్రా టాలెంట్ కిది నిలువెత్తు నిదర్శనం. అతడి క్లోజప్స్ అతడి హావభావాల, భావోద్రేకాల ముఖ పుస్తకం. సర్కస్ కళాకారుడైతే సర్కస్ కళాకారుడు, రిక్షా కార్మికుడైతే రిక్షా కార్మికుడు - ఏదైతే ఆ జీవితాన్ని సూక్ష్మ స్థాయిలో ప్రదర్శించి చూపిస్తాడు. తాగుబోతా, భార్యని తూలనాడేడా, తనలోని కళాకారుణ్ణి నిరసించాడా, రిక్షా కార్మికుణ్ణి భరించాడా, పరుగులెత్తే మహా నగరంలో పాసింజర్స్ ని ఎక్కించుకుని పశువులా లాగుతూ పరుగెత్తాడా, మాస్టర్జీ కొడుకుని ఆనాటి షర్టు ఇమ్మని కోరాడా, కూతురు పుడితే  లక్ష్మి పుట్టిందని వివశుడయ్యాడా, తిరిగి సొంతమవుతున్న వృత్తిని ఇంకొకరికి త్యాగం చేశాడా, ఏడుస్తూ నవ్వించాడా - ఇలా ఒకటి కాదు, ఏ సీను చూసినా మర్చిపోలేని సన్నివేశాల్ని సృష్టించాడు. స్థాయి ఏదైనా ప్రతీ మనిషిదీ అస్తిత్వ పోరాటమే. సామాన్యుడి అస్తిత్వ పోరాటాన్ని కుముద్ కంటే దృశ్యమానం చేసే కళాకారులుండరేమో. 

        కజ్రీ పాత్రలో దివ్యాదత్తా మౌనంతోనే కోటి అర్ధాలు నటిస్తుంది. భర్త రామ్ సింగ్ లో చార్లీని చూసిన కళ్ళతో రిక్షావాణ్ణి చూసేసరికి
, నిశ్చేష్టురాలై చూసే చూపు గుండెల్ని పిండేసే బాధ. చాలా సేపు ఆమె చూపులోంచి బయటపడలేక చస్తాం. జీవితపు సర్కస్ నెగ్గాలంటే తెలిసిన సర్కస్ నే ఎరగా వేయాలన్న మౌన నిర్ణయం చేతల్లోనే ప్రదర్శిస్తుంది. కొడుకు పెట్టె దించి ఫాదర్స్ డే ప్రోగ్రాంకి కాస్ట్యూమ్స్ తీస్తూంటే విసిరి కొడతాడు. కొడుక్కీ మళ్ళీ ఆ జీవితం వద్దంటాడు. ఆ జీవితమే కావాలని తండ్రీ కొడుకుల్ని స్టేజి ఎక్కిస్తుంది. అక్కడ్నించీ  జీవితం మారిపోతుంది. అయితే ఆడది తన సహజాతంతో ప్రకృతికి లోబడి ఒకటాలోచిస్తే,  దాంతో మగాడు ఓవరాక్షన్ చేసి చెడ గొట్టుకుంటాడన్నట్టు - ఈ పరిస్థితిని కూడా అనుభవించే మౌన పాత్రలో దివ్యాదత్తా దొక బలమైన ముద్రవేసే శైలి. 

      ఇతర పాత్రల్లో రెండు మూడు సన్నివేశాలే అయినా, మాస్టర్జీ గా వృద్ధ పాత్రలో సలీమా రజా గుర్తుండి పోతుంది. ఈ సర్కస్ నేం చూశావ్, బయటి ప్రపంచంలో ఇంకా పెద్ద సర్కస్ వుందని గుర్తు చేసే క్లుప్త పాత్ర. అలాగే రామ్ సింగ్ మిత్రుడు షాజహాన్ గా ఫరూఖ్ సేయర్ సర్కస్ కోసం పొలం అమ్మి డబ్బు తెచ్చిస్తే, రామ్ సింగ్ ఇంకో అత్యవసరానికి వాడెయ్యడంతో, లోలోపల అతడిలో రూపుదిద్దుకునే ఇంకో మనిషి స్వార్ధం వైపు నడిపిస్తాడు. ఈ పాత్రలోని షేడ్స్ ని అతను సులువుగా పోషించాడు.

        ఈ పాత్రలే కాదు మిగిలిన సహాయ పాత్రలూ
, వాటిని నటించిన నటులూ ఒకే విజన్ ని పరివ్యాప్తం చేస్తారు : ఈ కథ స్పిరిట్ ని. సాంకేతికంగా చూస్తే వెనుక బడలేదు. సాంకేతికం గొప్ప, కంటెంట్ దిబ్బ అన్పించుకునే సినిమాలే వ్యర్ధంగా తీస్తున్న కాలంలో రెండిటా ముందుండే ప్రొడక్షన్ గా ఈ సెమీ- రియాలిస్టిక్ కన్పిస్తుంది. సంగీతం, ఛాయాగ్రహణం, కూర్పు ఒకే విజన్లో బలంగా వుంటాయి. 

కథా కథనాలు
    చిన్న సినిమాకి దానిదైన సొంత జీవితం ప్రత్యేకంగా వుంటుంది. పెద్ద సినిమాల ఛాయల్ని దగ్గరికి కూడా రానివ్వదు. పెద్ద సినిమాలన్నీ ఒకే పోతలో పోసినట్టున్నా చెల్లిపోవచ్చు. చిన్న సినిమాలకి ఏ కథకా కథగా యూనిక్ క్రియేషన్ వుంటుంది. ఇదే వాటిని నిలబెడుతుంది. అదే సమయంలో చిన్న సినిమా ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్ట్రక్చర్ ని పాటిస్తే కథా కథనాలే కాదు, ప్రధాన పాత్ర ననుసరించి ఇతర పాత్రలు, పాత్ర చిత్రణలు, వాటి ప్రయాణాలు, చెప్పాలనుకున్న పాయింటూ సమస్తం ప్రభావ శీలంగా అర్ధవంతంగా వస్తాయి. స్ట్రక్చర్ వల్ల కాన్సెప్ట్ దానికదే లోతుపాతుల్లోకి వెళ్ళిపోతుంది. స్ట్రక్చర్ మొహమే తెలియని లొట్ట పీసు స్క్రిప్టుతో చిన్న సినిమా చెత్త బుట్ట దాఖలవుతుంది. బుట్ట దాఖలయ్యే సినిమాలే మెట్ట వ్యవసాయం చేస్తున్నాయి. చినుకు పడదు, చిల్లులు మాత్రం పడుతూంటాయి నిర్మాతగారి జేబుకి. 

       
రామ్ సింగ్ చార్లీ స్ట్రక్చర్ లో వున్న అర్ధవంతమైన కథ, కథనమూ. కథనంలో దృశ్యాల అల్లిక చాలా సార్లు మెస్మరైజ్ చేస్తుంది. ఉదాహరణకి వూరికెళ్ళి పోయిన కజ్రీ అక్కడెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టు కన్పిస్తుంది. తీరా ఇటు ఓపెన్ చేస్తే రామ్ సింగ్ తోనే మాట్లాడుతున్నట్టు దృశ్యం థ్రిల్ చేస్తుంది. ఇంకో దృశ్యంలో బార్ దగ్గర ఒకడు అదే పనిగా వెక్కిరిస్తూంటే, పొట్టి లిల్లీపుట్ చూసి చూసి లాగిపెట్టి లెంపకాయ కొడతాడు. లెంపకాయ తిన్నవాడు పరమ కోపంగా చూస్తాడు. అంతే, దృశ్యం కట్ అయిపోతుంది. తర్వాతి దృశ్యంలో రామ్ సింగ్ ఇంటికి పరుగెత్తు కొచ్చి డబ్బులన్నీ తీసుకుని పరిగెడతాడు. 

     ఈ దృశ్యమేంటో కూడా అర్ధం గాకుండానే కట్ అయిపోతుంది. దీని తర్వాతి దృశ్యంలో  గాయపడిన లిల్లీపుట్ హాస్పిటల్లో పడి వుంటాడు. అక్కడికి డబ్బుతో వచ్చేస్తాడు రామ్ సింగ్. ఇలా మొదటి దృశ్యంతో సస్పెన్స్ క్రియేట్ చేసి, రెండో దృశ్యంతోనూ సస్పెన్స్ క్రియేట్ చేసి, రెండిటి అర్ధాలూ మూడో సీన్లో స్పష్టం చేస్తాడు దర్శకుడు. ఇదీ దృశ్య మాలిక అంటే. రొటీన్ మెలోడ్రామాని తొలగించే ఈ మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ కథనపు టెక్నిక్ వల్ల కథ చెడకుండా సినిమా నిడివి, షూటింగ్ సమయం, బడ్జెట్ ఎంతో ఆదా అయ్యాయి. ఇలా కథని బట్టి దానిదైన యూనిక్ డైనమిక్స్ తో కథనం చిన్న సినిమాకే సాధ్యమవుతుంది.

        సర్కస్ కంపెనీలో ఉద్యోగాలు పోవడం ప్లాట్ పాయింట్ వన్
, ఈ సమస్యతో రామ్ సింగ్ తనే సర్కస్ పెట్టాలని పరిష్కారానికి రావడం ప్లాట్ పాయింట్ టూ. ప్లాట్ పాయింట్ వన్ తో సమస్యలో పడ్డ రామ్ సింగ్ తో కష్టాలు, భార్యతో సంసారపు ఈతిబాధలు, ఇంట్లో గొడవలు, వీటన్నిటితో ఇక బీదల పాట్లుగానే సాగుతుందన్నట్టు బోరు కొట్టే పరిస్థితి వచ్చేలోగా, ఈ మిడిల్ కథనం ఇందులోంచి వూహించని నెక్ట్ లెవెల్ కెళ్లిపోతుంది. ఫాదర్స్ డే ప్రోగ్రాంకి కజ్రీ రాంసింగ్ ని బలవంతం చేసి, కొడుకు సమేతంగా చార్లీ చాప్లిన్ ప్రదర్శన ఇప్పించడంతో వాళ్ళ జీవితాలే మారిపోతాయి. ఇది కావాలని ఫార్ములా మలుపా, కాదు. పునర్విజయానికి మెట్లు సహజంగా ఇలాగే వుంటాయి.

        గతవారం యూట్యూబ్ లో ఏదో సెర్చి చేస్తూంటే, ఇంకేదో ఆటోమేటిగ్గా వూడి పడి ఆటో ప్లే అవుతోంది. ఏమిటాని చూస్తూంటే, ఒక స్పిరిచ్యువల్ గురు ప్రేక్షకుడడిగిన ప్రశ్నకి సమాధాన మిస్తున్నాడు. నా పనీ పాటలు పోయాయ్, నేనిప్పుడేం చెయ్యాలి?’ అని ప్రేక్షకుడి ప్రశ్న. నీకలవాటైన పనీ పాటలు తప్ప నువ్వింకేమీ చెయ్యలేవు, ఇది గుర్తు పెట్టుకో. ఆ పనీ పాటలకి తలుపులు పడిపోయాయ్. ఆ తలుపుల్నే చూస్తూ కూర్చోకు. వెళ్లిపో, వెళ్ళిపోయి కొత్త తలుపులు తెరువ్. ఆ కొత్త తలుపుల్లోంచి ఇంకో చోట అవే పనీ పాటల కోసం వెతక్కు. నీకు తెలిసిన ఆ పనీ పాటల్లోంచి కొత్తగా నువ్వేం సృషించగలవో ఆలోంచించు. అదే నువ్వు చెయ్యాల్సిన పని అని స్పష్టం చేశాడు నార్త్ స్పిరిచ్యువల్ గురు.

    ఈ సూత్రం కజ్రీ కెలా తెలిసింది? ప్రకృతి నియమాలకి దగ్గరగా వుండే ఆమె స్త్రీ సహజాతమది. మగాడికి ప్రకృతీ లేదు, పర్యావరణం లేదు. అయితే ఆవారా, కాకపోతే బంజారా. దీంతో మూసుకు పోయిన సర్కస్ పనిలోంచే ఆమె చాప్లిన్ కామెడీ షోలు సృష్టించగల్గింది. అప్పటి వరకూ రామ్ సింగ్ ఏం చేస్తున్నాడు? ఈసురో మని రిక్షా లాగుతూ మూతపడ్డ సర్కస్ ని మర్చిపోలేక పోతున్నాడు. మేకప్ వేసుకుని మధన పడిపోతున్నాడు. తాగి పడిపోయి ఇంకా సర్కస్ నే కలవరిస్తున్నాడు.

        భార్య కజ్రీ స్టేజి ఎక్కించాక ఆఫర్లు వస్తూంటే అతనేం చేసి వుండాల్సింది
? దాన్ని పెంచుకుంటూ నల్గురికి నేర్పి ఈవెంట్ కంపెనీ ప్రారంభించుకోవచ్చు. కానీ ఏం చేశాడు? ఇది కాదని అత్యాశకి పోయి మళ్ళీ మూత బడ్డ సర్కస్ అనే పాత తలుపుల్నే తెరవాలనుకున్నాడు. పతనానికి మెట్లేసుకుని మళ్ళీ మొదటి కొచ్చాడు. చనిపోయాడు. ఇక కొడుకు పెద్దవాడై కామెడీ షోలతో తండ్రి పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తూంటాడు... ప్లాట్ పాయింట్ టూలో అతను అనుకున్నది పరిష్కారమా? కాదు, తప్పుడు నిర్ణయం. 

      సర్కస్ జీవితం మీద తీసిన మేరానామ్ జోకర్ (1970) లో జోకర్ గా రాజ్ కపూర్ జీనా యహా మర్నా యహా అంటూ హిట్ సాంగ్ పాడతాడు. ఇక్కడే జీవనం, ఇక్కడే మరణమనే అర్ధంలో. ఆ శకం ముగిసింది. సర్కస్ చచ్చిపోయి, ఇక్కడే జీవనం, ఇక్కడే మరణమనే సీను బయటి ప్రపంచానికి మారింది. 

        ఇదే సినిమాలో రాజ్ కపూర్ ఇంకో హిట్ సాంగ్ లో బయటి ప్రపంచాన్ని చూపిస్తాడు -
యే భాయ్ జర దేఖ్ కే చలో పాటలో -  ఈ ప్రపంచమొక సర్కస్. ఈ సర్కస్ లో పెద్దోడు చిన్నోడు, ఉన్నోడు లేనోడు, బక్కోడు బలిసినోడు, పైనుంచి కిందికీ, కింది నుంచి పైకి పడుతూ లేస్తూ వెళ్లిపోవాల్సిన వాళ్ళే. ఈ సర్కస్ కేవలం మూడు గంటలు... మొదటి గంట బాల్యం, రెండో గంట యవ్వనం, మూడో గంట వృద్ధాప్యం. ఆ తర్వాత అమ్మ లేదు అయ్యలేడు, కొడుకు లేడు కూతురు లేదు, పిల్లాలేదు పీచూ లేదు, నువ్వూ లేవు నేనూ లేను, అదీ లేదు ఇదీ లేదు, ఏదీ లేదు ఏదీ వుండదు ... ఖాళీ ఖాళీ కుర్చీలే, ఖాళీ ఖాళీ గుడారాలే, ఖాళీ ఖాళీ తివాచీలే, పక్షు లెగిరిపోయిన గూళ్ళే!

        ఇది ప్రకృతి ఆడించే సర్కస్
. ఈ ఆటలో - కాల చక్రంతో పాటు ముందుకే వెళ్లాలి తప్ప, కాల చక్రాన్ని వెనక్కి తిప్పాలనుకుంటే రామ్ సింగ్ లాగే దాని పళ్ళ కింద ముక్కలవుతారు. పనీ పాటల రహస్యాన్ని ఇంత బాగా చెప్తున్న ఈ సినిమా అర్దం గావాలంటే, బయటి ప్రపంచమే తెలియకుండా సర్కస్ గుడారాల్లో వుండి పోకూడదు.

    గ్లోబలైజేషన్ అనే సర్కస్ గుడారమూ ఇంతే. గ్లోబలైజేషన్ వచ్చి రాజకీయరంగాన్ని పండగలా మార్చేసింది. గ్లోబలైజేషనే జీవితంగా కొట్టుకుపోతూ సమాజంలోకి తొంగి చూసే వర్గాలు తగ్గిపోతున్నాయి. గ్లోబలైజేషన్ పూర్వం 1990ల వరకూ రాజకీయ రంగాన్ని ఢీకొనే సామాజిక చైతన్యం విద్యార్థి లోకం సహా వివిధ వర్గాల్లో వుండేది. గ్లోబలైజేషన్ పుణ్యమాని అదిప్పుడు మంటగలిసింది. ఇందుకే రాజకీయ రంగానికి ఎదురులేకుండా పోయి ఆడిందే ఆటగా మారింది. ఈ ఆటలో పాలు పంచుకోవడం కూడా నాగరికత అనుకుంటున్నారు. రాజకీయ రంగం నాణ్యత, దానితో సామాజికారోగ్యం, సామాజికారోగ్యంతో ఆర్ధికారోగ్యం జనం కాస్త సమాజంలోకి తొంగి చూడ్డంలోనే వుంది. సమాజంనుంచి దృష్టి మళ్లించే సుశాంత్ సింగ్ కేసు కోలాహలం లాంటి మత్తు మందుని వెదజల్లే మీడియాలకి దాసులవడంలో లేదు. ఇది నీతులు చెప్తున్నట్టు అన్పించవచ్చు గానీ వాస్తవం. సమాజమే తెలీని, బయట బతకడమే తెలీని  కోట్లాది మంది నిరుద్యోగ రామ్ సింగ్ చార్లీలు ఇలాగే పుట్టుకొచ్చి జాంబీలుగా మారిపోతే, సినిమాలకి ప్రేక్షకులు కూడా వుండరు.  

సికిందర్
telugurajyam.com 

29, ఆగస్టు 2020, శనివారం

971 : రివ్యూ


దర్శకత్వం : మహేష్ భట్
తారాగణం : సంజయ్ దత్
, ఆలియా భట్, ఆదిత్యా రాయ్ కపూర్, ప్రియాంకా బోస్, జిస్షూ సేన్ గుప్తా, మార్కండ్ దేశ్ పాండే తదితరులు
రచన : మహేష్ భట్
, సుమిత్రా సేన్ గుప్తా; సంగీతం: జీత్ గంగూలీ, అంకిత్ తివారీ తదితరులు, నేపథ్య సంగీతం : సందీప్ చౌతా, ఛాయాగ్రహణం : జే పటేల్
నిర్మాత : ముఖేష్ భట్
విడుదల : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
***
        సీనియర్ దర్శకుడు మహేష్ భట్ 1999 లో కర్టూస్ తర్వాత తిరిగి ఇప్పుడు 21 ఏళ్ళు గడిచాక దర్శకత్వం వహించాలన్పించి, తీరా 1991 లో తనే దర్శకత్వం వహించిన సడక్ కి ఇప్పుడు 29 ఏళ్ల తర్వాత సీక్వెల్ కూడా తీయాలన్పించి, సడక్- 2 గా సర్వాంగ సుందరంగా సిద్ధం చేశాడు. హృదయపు పాత రహదారి మీద ఏమీ లేదు... అనే టైటిల్ పాటతో సినిమా కథ ప్రారంభించాడు. సడక్ (అంటే రోడ్డు) పాత రహదారే. ఇప్పుడు టోల్ గేట్లతో కొత్త రోడ్లు వచ్చాయి. సడక్ -2 కి కొత్త రోడ్డు - ఎక్స్ ప్రెస్ వే వేసుకోకపోతే ఏముంటుంది? హృదయపు పాత రహదారి మీద ఏమీ లేదనే బాటసారి పాటే మిగుల్తుంది.

       
పాటతోనే తేల్చేశాక ఇంకా సినిమా చూడ్డాని కేముంటుంది? 1990 మోడల్ సినిమాకి 1.5 రేటింగ్ వుంటుంది. ముంబాయి నుంచీ కైలాస పర్వతానికి కారు ప్రయాణపు కథ పావు గంటకే కైలాసం కన్పించేలా చేస్తుంది. కైలాసం చూడాలనుకుంటే ఈ సినిమా చూసి పావుగంటలో టపా కట్టేయొచ్చు. మానస సరోవరానికి అదనపు జన్మ. సరోవరంలో పుణ్య స్నానం ఆ జన్మ నిర్ణయిస్తుంది. 

        సంజుబాబా (సంజయ్ దత్)
, ఆలియా భట్, ఆదిత్యా రాయ్ కపూర్ ఈ యాత్ర చేశారు. వీళ్ళకి కంపెనీ ఇస్తూ కొందరు వెంటపడ్డారు. ఎవరు వీళ్ళు, ఎందుకు వెంటపడ్డారు తెలుసుకోవడానికి కథ చూద్దాం.

కథ

        ఆర్య (ఆలియా భట్) కోట్లాది రూపాయల సంపదకి ఏకైక వారసురాలు. ఈమెకి తండ్రి యోగేష్ (జిస్షూ సేన్ గుప్తా), సవతి తల్లి నందిని (ప్రియాంకా బోస్) వుంటారు. నందిని నకిలీబాబా జ్ఞాన్ ప్రకాష్ (మార్కండ్ దేశ్ పాండే) తో కుట్రపన్ని గతంలో ఆర్య తల్లిని చంపేసింది. భర్తని బానిసగా చేసుకుంది. ఇక ఆర్య కి 21 నిండితే ఆస్తి ఆమె చేతికొస్తుంది. ఈలోగా ఆమెని చంపే కుట్రతో వుంటుంది నందిని నకిలీ బాబాతో కలిసి. ఆర్య నకిలీ బాబాల భాగోతాన్ని రట్టు చేసేందుకు సోషల్ మీడియాలో ఉద్యమం ప్రారంభిస్తుంది. జ్ఞాన్ ప్రకాష్ బాబాని కూడా టార్గెట్ చేస్తుంది. ఆమె తల్లి కైలాస ఆలయం దర్శించుకోవాలన్న కోరిక తీరకుండానే చనిపోయింది. ఆ కోరిక తీర్చడానికి తను బయల్దేరుతుంది ఆర్య. తిరిగి వచ్చాక జ్ఞాన్ ప్రకాష్  బాబా పని పట్టాలనుకుంటుంది. చెప్పకుండా ఆమె కైలాస యాత్రకి వెళ్లిపోయేసరికి కంగారు పడ్డ నందిని గ్యాంగ్ ని ఎగదోస్తుంది. 

        ఆర్య తాత్కాలికంగా తప్పించుకుని రవి కిషోర్ వర్మ (సంజుబాబా) దగ్గరి కొస్తుంది. టాక్సీ డ్రైవర్ అయిన రవి చనిపోయిన భార్య గుర్తుకొస్తూ బతకలేక పోతూంతాడు. భార్య దగ్గరికి స్వర్గానికి వెళ్లిపోయెందుకు ప్రయత్నిస్తూంటాడు. అలా స్వర్గానికి వెళ్లబోతూంటే ఆర్య వచ్చి కైలాసానికి పదమంటుంది.

        విశాల్ (ఆదిత్యా రాయ్ కపూర్) అనే సింగర్ బాయ్ ఫ్రెండ్ వుంటాడు ఆర్యకి. అతణ్ణి కూడా టాక్సీ ఎక్కించుకుంటుంది. ఇప్పుడు నందిని గ్యాంగ్
, లంచగొండి పోలీస్ ఇన్స్పెక్టర్, సీరియల్ కిల్లర్ ప్రభృతులు వీళ్ళ వెంట పడతారన్న మాట!

నటనలు - సాంకేతికాలు
     సంజుబాబా ఆదేశిస్తే కుంభకర్ణ అనే గుడ్ల గూబ శత్రువుల మీద దాడి చేస్తుంది. అలాటి గుడ్లగూబని వదిలేసి ఆత్మహత్య చేసుకుంటానంటే ఎలా. ముప్ఫై ఏళ్ల క్రితం 1991 సడక్ లో చనిపోయిన భార్య (పూజా భట్) విజువల్సే వేసుకుంటూ ఇంకా ఏడుస్తూ ఆత్మ హత్య చేసుకోబోతూంటే విఫలం కావడంలో ఆమె హస్తముందేమో ఎందుకు అర్ధం జేసుకోడు. తాజాగా ఫ్యానుకి ఉరేసుకుంటే ఫ్యాను ఊడిపడుతుంది. గ్యారేజీలో ఇంకేదో చేసి భార్య దగ్గరికి వెళ్లిపోదామనుకుంటే ఆర్య వచ్చి కైలాసానికి టాక్సీ బుక్ చేసుకుంటుంది. ఇలాటి విషాద పాత్రలో మొదటి 45 నిమిషాలు సినిమా చూడాలన్న ఆసక్తిని చంపేస్తాడు. పాత మోడల్ సీన్లు, పాత మోడల్ డైలాగులు. యాత్రకి బయల్దేరాక వెంటపడుతున్న శత్రువులతో కామెడీ యాక్షన్ లో కూడా రాణించలేక పోయాడు. నలిగిన పాత కథ కావడంతో నావెల్టీ ఫ్యాక్టర్ పెద్ద ప్రశ్న అయి కూర్చుంది ఏం చేయాలన్నా. 


        ఆలియా భట్ ది సిల్లీ పాత్ర
. తండ్రి సినిమా కాబట్టి ఒప్పుకుని వుండొచ్చు. ఇంకో దర్శకుడు ఇలాటి కథతో ఆమె దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయడు. ఆస్తికోసమో, పెళ్లి కోసమో హెరోయిన్ ని వెంటాడే విలన్ల సినిమాలు వంద వచ్చి వుంటాయి. అలాటి ఒక కాలం చెల్లిన హీరోయిన్ పాత్ర. ఇక ఆదిత్యా రాయ్ కపూర్ ఆలియా భట్ వెంట రోమాన్స్ కీ, సాంగ్స్ కీ, పాత మోడల్ విలన్స్ తో ఫైట్స్ కీ సర్దుబాటు చేసుకుని తృప్తి పడ్డాడు. మహేష్ భట్ మళ్ళీ ఇదొక ఆషిఖీ అన్నట్టు 10 పాటలు పెట్టాడు. ఆషిఖీ ని గుర్తు చేసినందుకు ఈ సినిమా వదిలేసి ఆషిఖీ లో 12 పాటలూ మరోసారి  వినాలన్పించేలా చేశాడు.  

        టేకింగ్ గానీ
, టెక్నికల్ విభాగాలు గానీ ట్రెండ్ లో లేవు. ఇంత సీనియర్ దర్శకుడు ఏకోశానా మార్కెట్ యాస్పెక్ట్ కానరాని ఇలాటి సినిమాకి ఎందుకు దర్శకత్వం వహించాలనుకున్నాడో తెలియదు. తను వయసులో వున్నప్పుడు తీసిన సినిమాల్లాంటిదే ఎల్లకాలం తీయవచ్చనుకుంటాడా ఏ మేకరైనా? ఇప్పటి యువత వయసుకి మారాలా వద్దా?  


కథా కథనాలు
    ఈ పాటికి కథెలా వుందో అర్ధమైపోయే వుంటుంది. ఇక కథనం అనే పదార్ధం, అంటే స్క్రీన్ ప్లే అనే ఫైలు సీక్రెట్ సర్వీస్ డాసియర్ లా వుంది. గూఢచారులే దీన్ని చదివి అర్ధం చెప్పగలరు. వాళ్లయినా ఇంటర్ పోల్ కో, సీఐఏకో పంపాల్సి రావచ్చు. కనుక దీని జోలికి మనం పోతే ఎన్ని పేజీలు రాసినా ఏమీ తేలదు, వదిలేద్దాం. 1.5 రేటింగ్ కి సడక్ కి చాలా మరమ్మత్తులవసరం. విశేషమేమిటంటే, 1990 నుంచి  దిల్’, బేటా’, రాజా లాంటివి తీసిన దర్శకుడు ఇంద్ర కుమార్ ఇదే సంజుబాబా తో 2007 లో ఢమాల్’, 2011 లో డబుల్ ఢమాల్’, తిరిగి ఇటీవలే 2019 లో అజయ్ దేవగణ్ తో టోటల్ ఢమాల్ అనే యాక్షన్ కామెడీ రోడ్ మూవీలు ట్రెండీగా తీస్తూ హిట్ చేసుకుంటూ పోయాడు. ఎప్పటికప్పుడు నవతరం పోకడలకి అతను మారాడు. ఇలాటిదే అయిన రోడ్ మూవీతో భట్ మారలేదు.


సికిందర్

28, ఆగస్టు 2020, శుక్రవారం

970 : రివ్యూ


        

దర్శకత్వం : బాబా అజ్మీ 

తారాగణం :  అదితీ సుబేదీ, డానీష్ హుస్సేన్, శ్రద్ధా కౌల్, రాకేశ్ చతుర్వేది
రచన : హుస్సేన్ మీర్
, సఫ్దర్ మీర్; సంగీతం : రిపుల్ శర్మ, ఛాయాగ్రహణం : మోహిసిన్ ఖాన్ పఠాన్
నిర్మాత : బాబా అజ్మీ
విడుదల : జీ 5

***
        (మళ్ళీ తిరిగొచ్చాం. ఒక స్క్రిప్టు వర్కు గొంతు మీద వుంటే అంకితమై కూర్చున్నాం. ఎటూ వెళ్ళే పని లేకుండా ఫోన్ చర్చల్తో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ వర్కే అయినా, ఈ సౌకర్యంతో ఒక్కోసారి మల్టీ టాస్కింగ్ కూడా కష్టమైపోతోంది. ఈ రెండు నెలల్లో ఆన్లైన్లో  మూడింట్లో ఒకటి షూటింగ్ స్క్రిప్టు పూర్తి. ఈ కరోనా కాలపు మారిన ఈ తరహా రిమోట్ రైటింగ్ అనుభవాల గురించి చెప్పుకుంటే ఆత్మకథ రాసుకున్నట్టవుతుంది. ఉన్నబయో కిక్కులు చాలు. ఇలా కాస్త వీలు చిక్కించుకుని అనాధలా మారిన బ్లాగుకి తిరిగొచ్చినందుకు సంతోషిద్దాం ...) 



        నార్త్ లో మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా రెండూ రోజువారీ కార్యక్రమంగా జాతీయ సమగ్రతని ముక్కలు చేయడంలో ఎదురులేని బ్రాండ్ అంబాసిడర్లమని ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్న వేళ - ఓ సినిమా ఇది మతం కాదు, మతంతో మౌఢ్యమంటూ ముందుకొస్తే అది సామరస్యానికి ఏ మాత్రం గాయం మాన్పే మందు? ఓ హిందీ ఛానెల్లో  - ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల్లో ముస్లిములు చొరబాటు దార్లుగా మారారని, ఇదెలా జరుగుతోందని- ఇది బ్యూరోక్రసీ జిహాద్ అనీ కొత్తగా పేరొకటి తగిలించి -కార్యక్రమం శుక్రవారం (అంటే ఈ రోజు) రాత్రి ప్రసారం చేస్తామని ఎగిరెగిరి ప్రకటిస్తున్నాడు. మొన్నే బాంబే హైకోర్టు మీడియా చేసిన కరోనా జిహాద్ ప్రచారం వొట్టి బూటకమని మొట్టి కాయేసి తీర్పు చెప్పినా విద్యా బుద్ధులు అబ్బేలా లేదు. ఇలాటి భావదారిద్ర్యపు మీడియా ప్రభావిత ప్రజానీకంలో ఇంకా సినిమా అనేది శక్తివంతమైన మాధ్యమంగా మిగిలి వుందా? ఇదలా వుంచితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ముస్లిం కుటుంబపు కథతో సినిమాకి మార్కెట్ యాస్పెక్ట్ వుందా? గత జులైలో మలయాళంలో సూఫీయుమ్ సుజాతాయుమ్’, ఖుదా హాఫీజ్ టైటిల్ తో హిందీ, ఇప్పుడు మీ రఖ్సమ్ అనే ఇంకో హిందీ వచ్చాయి. ఐతే లేటు వయసులో దర్శకుడుగా మారిన ప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు బాబా అజ్మీ, ఇప్పుడనుకుని తీసిన సినిమా కాదిది, పదేళ్ళ పాత కల. తండ్రి అయిన సుప్రసిద్ధ అభ్యుదయ కవి, బాలీవుడ్ గీత రచయిత కైఫీ అజ్మీకి నివాళిగా దీన్ని అర్పించాడు. 

         హైదరాబాద్ మూలాలున్న బాబా అజ్మీ, ప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు ఇషాన్ ఆర్యకి అసిస్టెంట్ గా పనిచేశాడు. హైదారాబాద్ మూలాలే వున్న బాబా అజ్మీ కజిన్ ఇషాన్ ఆర్య, బాపు తీసిన ముత్యాల ముగ్గు కి ఛాయాగ్రహణం సమకూర్చాడు. ఆ తర్వాత మరికొన్ని తెలుగు సినిమాలకి ఆర్య దగ్గర అజ్మీ పనిచేసి, బాలీవుడ్లో మిస్టర్ ఇండియా’, తేజాబ్’, దిల్ వంటి ప్రసిద్ధ సినిమాలకి ఛాయాగ్రాహకుడయ్యాడు.

       
మీ రఖ్సమ్ (
I Dance) తో నాట్యానికి మతం లేదని, మత మౌఢ్యమే సంకెళ్ళని చెప్పదల్చాడు. పాత విషయమే. కళా రంగానికి సంబంధించిన ఈ పాత విషయమే కళా రంగానికే కాకుండా, అన్య రంగాలకీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేరుతుందా అనేది నార్త్విష మీడియా చేతుల్లో వుంది.  

       
నీకు సమాజం ఉపాధి నిచ్చింది, నువ్వు సమాజానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే  సమాజం నీ ఉపాధిని తీసేసుకుంటుంది అని ఈ సినిమాలో మత పెద్ద టైలర్ ని హెచ్చరిస్తాడు. స్వార్ధపు మాటలిలాగే వుంటాయి. సమాజం కలిసి వుండడానికి మతమా  ఆధారం, విత్తమా? విత్తమే సమాజపు, దేశపు మూలాధారం, భాండాగారం. పెత్తందార్లు కులమతాలుగా సమాజాన్ని విడగొట్టి, ఆర్ధిక రంగం నడ్డి విరిచేస్తారు. మత పిచ్చితో ధనలక్ష్మితో రుద్ర తాండవమాడతారు.

        ఉపాధినిచ్చే సమాజం ఆత్మహత్యా సదృశంగా ఉపాధిని తీసేసుకోదు
, తీసేసుకునేలా మత మౌఢ్యం చేస్తుంది. కానీ కడుపాకలి తెలిసిన సమాజం విత్తం కోసం మౌఢ్యం నుంచి భావ స్వాతంత్రాన్ని కోరుకుంటుంది. ఇది పవర్ఫుల్ ఆయుధం. మౌఢ్యం ఉపాధిని తీసేస్తే, భావ స్వాతంత్ర్యం ఉపాధిని కల్పిస్తుంది. ఒక ముస్లిం బాలిక భరత నాట్యం నేర్చుకోవాలనుకోవడం ఆమె భావస్వాతంత్ర్యం. మతంతో సంబంధం లేదు. కళలనేవి సాంస్కృతిక వ్యక్తీకరణలు. ఐతే ఈ ముస్లిం సినిమాలో కోరుతున్నట్టు, మౌఢ్యం నుంచి ఈ భావస్వాతంత్ర్యపు స్పృహ ఇప్పుడున్న పరిస్థితుల్లో నార్త్ లో యువతకి ఎంత వరకుంటుందన్నది ప్రశ్న. ఇది మెజారిటీ మతపు ఏ సూపర్ స్టార్ సినిమానో చేయాల్సిన ప్రయత్నమేమో ఒకవేళ.

        ఇలా మౌఢ్యం వల్ల నాట్యకళే  కాకుండా దాని చుట్టూ ఇంకెన్ని జీవిత పార్శ్వాలు నేల రాలతాయో ఒక సమగ్ర దర్శనం చేయడానికి ప్రయత్నించాడు. ఇదెలా వుందో తెలుసుకోవడానికి ముందు కథలో కెళ్దాం...

కథ

    ఉత్తరప్రదేశ్ లోని మీజ్వాన్ లో సలీం (డానీష్ హుస్సేన్) టైలర్ పని చేస్తాడు. భార్య సకినా భరత నాట్యాభిలాషని కూతురి ద్వారా తీర్చుకోవాలని నాట్యం నేర్పుతూ హఠాన్మరణం చెందుతుంది. పదిహేనేళ్ళ స్కూలు బాలిక మరియం (అదితీ సుబేదీ) ఎలాగైనా తల్లి కోరిక తీర్చాలని సంకల్పించుకుంటుంది. తెలియకుండానే తల్లి పూనినట్టు నాట్యభంగిమలు పురులు విప్పు కుంటూంటాయి. తండ్రి సలీం ప్రోత్సహిస్తాడు. ఇది తెలుసుకున్న అతడి మరదలు జెహ్రా (శ్రద్ధా కౌల్), ఆమె తల్లి (ఫరూక్ జాఫర్) తీవ్రంగా మందలిస్తారు. అది దేవదాసీల నాట్యం, దాంతో పిల్లని వేశ్యలా ఆడిస్తావా?’ అని అడ్డుపడతారు. వినకుండా మరియంని తీసికెళ్ళి డాన్స్ అకాడెమీలో చేర్పిస్తాడు సలీం.  
        
        డాన్స్ టీచర్ (సుదీప్తా సింగ్) మరియం ప్రావీణ్యం చూసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అయితే డాన్స్ అకాడెమీ ఓనర్ జై ప్రకాష్ (రాకేష్ చతుర్వేదీ ఓం) కిది నచ్చదు. అతడికే కాదు, ఇంకా చాలా మందికి నచ్చదు. మరదలు జెహ్రా కుటుంబం సహా బంధువర్గం తెగతెంపులు చేసుకుంటారు. స్థానిక ముస్లిములకి పెద్ద మనిషైన హాషీం సేట్ (నసీరుద్దీన్ షా) తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తాడు. మసీదు మౌలానా నిర్ణయం మార్చుకొమ్మని అల్టిమేటం ఇస్తాడు. పిల్ల డాన్స్ నేర్చినంత మాత్రాన అవమాన పడేంత బలహీనమైనది కాదు ఇస్లాం అని సలీం కూతురికి మద్దతుగా వుంటాడు. మసీదులో అతడి ప్రవేశం నిషేధిస్తారు. బట్టలు కుట్టించుకుంటున్న కస్టమర్లు బట్టలు వాపసు తీసుకుంటారు. ఆదాయం కోల్పోయి ఇబ్బంది పడతాడు. అప్పిచ్చే వాళ్లుండరు. మాట్లాడే వాళ్ళే వుండరు. ఒంటరి అయిపోతాడు. కూతురికి మాత్రం ఇవేవీ తెలియకుండా జాగ్రత్త పడతాడు. 

        
         ఇప్పుడు ఈ సాంఘిక బహిష్కారాన్నెదుర్కొంటున్న సలీం కూతురి ఆశయం ఎలా నెరవేర్చాడు? ఇరు మత వర్గాల నుంచీ అన్ని ప్రతిబంధకాలూ దాటి భరత నాట్యం నేర్చుకుని మరియం ఎలా ప్రదర్శన ఇచ్చింది? ఆ ప్రదర్శనలోనూ అడ్డుకునే ప్రయత్నాలెలా జరిగాయి? ...ఇదీ మిగతా కథ.

నటనలు – సాంకేతికాలు 

     తండ్రీ కూతుళ్ల ప్రధాన పాత్రలు పోషించిన డానీష్ హుస్సేన్, అదితీ సుబేదీలదే ప్రధానంగా ఈ ముస్లిం సోషల్ డ్రామా. టైలర్ గా డానీష్ టైలర్ అన్నట్టే వుంటాడు. ఇతనేకాదు ఇతర ముస్లిం పాత్ర ధారులూ ఫార్ములా సినిమాల్లోలాగా కృత్రిమ వేష భాషల్లో వుండరు. అచ్చమైన ముస్లిమీయత ఉట్టిపడుతూంటుంది. మీజ్వాన్ వూళ్ళో తామూ ఒకళ్లుగా కలిసిపోయినట్టు పాత్రధారులుంటారు. డానీష్ మరదలు జెహ్రా పాత్రలో శ్రద్ధా కౌల్, ఆమె టీనేజి కూతురి పాత్రలో జూహైనా ఎహసాన్, ఆవారా ఆటో డ్రైవర్ అష్ఫాక్ యువ పాత్రలో కౌస్థభ్ శుక్లా, పలుకుబడి గల పెద్ద మనిషిగా నసీరుద్దీ షా... ఇలా ప్రతీ ఒక్కరూ సినిమాల్లో సృష్టించి పెట్టిన మూస ముస్లిం ఇమేజికి భిన్నంగా వాస్తవికతతో వుంటారు. ఒక్క డాన్స్ అకాడెమీ ఓనర్ గా రాకేష్ చతుర్వేదీ ఓం, అతడి టీనేజీ కూతురు తప్ప. వీళ్ళ పాత్రలే మూస సినిమా పోకడలతో కలుషితమయ్యాయి. ముగింపుని సైతం కలుషితం చేశాయి. కూతురు తండ్రికి వ్యతిరేకంగా వుండే టెంప్లెట్ పాత్రగా వుంటుంది. ముస్లిం పిల్ల ఇండియన్ డాన్స్ చేస్తుందట అని తండ్రి అంటే, ముస్లిం పిల్ల ఇండియన్ కాదా?’ అని చురక వేస్తుంది. 

        ఎక్కువగా డానీష్ సంఘర్షణ పడే పాత్రగా వుంటాడు
. సంయమనంతో వుండే పాత్ర. నిండు కుండలా వుంటాడు. ఎవరితోనూ ఎదురు తిరిగి మాట్లాడడు. తను చేయాల్సింది కూల్ గా చేసుకుపోతాడు. ఎంత నిస్సహాయత లోనూ కూతుర్ని పల్లెత్తు మాటనడు. కూతురి ఆశయంలో భార్య కోరిక వుంది. కూతుర్ని నాట్య కారిణిని చేయడమే, తనేమైపోయినా ఫర్వాలేదు - గంగా జమునా తెహజీబ్ ని నిలబెట్టడమే ధ్యేయంగా వుంటాడు. నసీరుద్దీన్ షా మసీదులోకి అతన్ని రానివ్వకుండా అడ్డుకునే దృశ్యం, డాన్స్ అకాడెమీ ఓనర్ ఆడిటోరియంలో అతన్ని అడుగడుగునా అవమానించే దృశ్యాలు వంటివి కదిలిస్తాయి. 

       అయితే కూతురు తనని స్కూల్లో మగపిల్లలు చీప్ గా డాన్సర్ అని వెక్కిరి
సున్నారని చెప్పినప్పుడు
, అది వాళ్ళు నీతో పెంచుకుంటున్న ఆసక్తికి తార్కాణమంటూ అనునయించడం అంత బావుండదు. కూతుర్ని ఆటవస్తువుగా భావించి అన్నట్టుంటుంది. నీ నాట్యం విలువ వాళ్ళే తెలుసుకుంటారులే అనేస్తే పోయేది.  

        కూతురుగా అదితి నటనకి కొత్త. అయినా నటనలోనూ నాట్యంలోనూ సమర్ధురాలిగా కన్పిస్తుంది మీజ్వాన్ లోనే పుట్టి పెరిగిన తను. అయితే ఇది నాట్యం గురించి కథ అనీ నాట్యాలతో నింపేయలేదు సినిమా. నాట్యంతో ఒకటే పాట క్లయిమాక్స్ లో వుంటుంది. ఇది సంగీతభరిత నాట్య సినిమా కాదు. నాట్యం కోసం సమాజంతో సంఘర్షించే సినిమా. క్లయిమాక్స్ ప్రదర్శనలో భరత నాట్యానికి  
దమ్ అలీ అలీ దమ్ - ఝనక్ ఝనక్ నాచే నటరాజ్ రే  అనే సూఫీ పాట అతిగానే వుంటుంది. దీనిగురించి కథాకథనాల్లో చెప్పుకుందాం. నసీరుద్దీన్ షాకి పెద్దగా పాత్ర లేదు. రెండు మూడు సార్లు బెదిరించడానికే వుంటాడు. క్లయిమాక్స్ లో వుండడు. 

        రిపుల్ శర్మ సంగీతంలో మత వాసన వుండదు. నేపథ్య సంగీతంలో కూడా ఎక్కడా ముస్లిం సంగీత బాణీలివ్వలేదు. రెండే పాటలు - ఒక మాంటేజ్ సాంగ్
, ఇంకో క్లయిమాక్స్ సాంగ్ వుంటాయి. సూఫీయుమ్ సుజాతాయుమ్ లో ఆద్యంతం సూఫీ భక్తి సంగీతమే తల వాచేలా వుంటుంది. ఇక మోహిసిన్ ఖాన్ పఠాన్ ఛాయాగ్రహణం ఫ్రెష్ లుక్ తో వుంది.      


      సరైన రచయితలు దొరక్క ఇంతకాలం పట్టిందన్నాడు దర్శకుడు. దొరికిన రచయితలు హుస్సేన్ మీర్, సఫ్దర్ మీర్ లు సినిమాటిక్ రచన చేయలేదు క్లయిమాక్స్ తప్పించి. క్లయిమాక్స్ వొక కమర్షియల్ మసాలా. వాస్తవిక సినిమాకి మసాలా ముగింపు. సంభాషణలు సినిమా డైలాగ్స్ కాకుండా, టెంప్లెట్ డైలాగులు కాకుండా, ఆయా వాస్తవిక పాత్రలు మాట్లాడినట్టుగానే వున్నాయి. దృశ్యాలకి సింబాలిజాన్ని పొదుపుగా వాడారు.        


       ప్రారంభంలో మరియం పిన్ని జెహ్రా పాలు వేడి చేస్తూంటే
, మాడిన వాసన వేస్తోందని అమ్మమ్మ అంటుంది. అక్కడే మరియం కూడా వుంటుంది. పాలింకా పొంగడం లేదంటుంది జెహ్రా. అడుగంటుతుందీ - మరక అవుతుందీ - అని తిరిగి అంటుంది అమ్మమ్మ. మరక అవదని అంటుంది జెహ్రా. ఈ మాటలు మరియం నుద్దేశించే రచయితలు సింబాలిక్ గా  రాసి రసాత్మకం చేశారు. ఇలాటి ఫోర్ షాడోయింగ్ సిట్యుయేషన్నే రెండు సార్లు అందమైన బీభత్సం చేశాడు బుచ్చి నాయుడు కండ్రిగ దర్శకుడు యమా బంపర్ గా.

కథాకథనాలు
        శంకరాభరణం లో శంకర శాస్త్రి వేశ్య కూతుర్ని ఉద్ధరించడానికి వ్యతిరేకతల్ని ఎదుర్కొంటాడు. మీ రుఖ్సమ్ లో సలీం కి శంకర శాస్త్రి అంత స్థాయి లేదు గానీ కోరిక లున్నాయి కూతుర్నుద్ధరించాలని. ఇద్దరికీ కులం, మతం అడ్డు కాదు. అయితే సంగీతం తెలిసిన శంకర శాస్త్రి కుటుంబ డ్రామాకి పరిమితమైతే, సంగీత నాట్యాలు తెలియని సలీం సామాజికార్ధిక సంఘర్షణతో సతమతమవుతాడు. కథని ఇతడి పాత్ర మీదుగా నడపకపోతే, కూతురి పాత్ర నాట్యం కథాకమామీషుతో రొటీన్ రొంపిలో పడుతుంది. అందుకని ఇందులో నాట్యం గురించి కన్నా ఆ నాట్యం వల్ల ఎదురయ్యే కష్టాలే ప్రధాన కథయ్యింది. శంకరా భరణం, పాకీజా, ఉమ్రావ్ జాన్ ల వంటి సంగీత నాట్యాల సినిమా కాలేక పోయింది. ఇప్పుడు వర్తమానం ప్రతిబింబించే కష్టాలే అవసరం. దీంతో మత మౌఢ్యంతో బాటు సామాజికార్ధిక కోణాల్ని కూడా తట్టగల్గింది. అయితే ఈ మెసేజులతో మీడియా ప్రచారాన్నిబద్ధలు కొట్టే శక్తి ఒక ముస్లిం సినిమాగా మాత్రం దీనికి లేదు. 


        పైగా పరిష్కర్తలుగా టీనేజి యువపాత్రలు అత్యుత్సాహం ప్రదర్శిస్తాయి (ఆటోడ్రైవర్
, జెహ్రా కూతురు, డాన్స్ అకాడెమీ ఓనర్ కూతురు తదితరుల బృందం). సలీం కష్టాలకి పరిష్కారమనేది లేకుండా వుండుంటే వర్తమాన పరిస్థితిలా వుండేది. పరిష్కారం కూతురి నాట్యాభిలాషకే వుంటే సరిపోయేది. తండ్రి కష్టాలు చూసి పోటీ నుంచి విరమించు కుంటుంది కూతురు. ఎప్పుడైతే ఇంటి మీద రాయి పడుతుందో, వాళ్ళకి జవాబుగా ఇక పోటీకి సిద్ధమైపోతుంది. ఈ క్లయిమాక్స్ మలుపు బావుంది పాత్రని ఎలివేట్ చేసేలా. 

        అయితే అకాడెమీ ఓనర్
, అతడి కూతురి పాత్రలే మరీ చోద్యంగా మూస ఫార్ములా చేష్టలతో వుంటాయి. ఈ రెండు పాత్రలే క్లయిమాక్స్ ని సుందర బీభత్సం చేశాయి. పదహారేళ్ళ హిందూ టీనేజి పిల్ల ఐఫోన్ తో అల్లాహూ అల్లాహూ సూఫీ పాటల ఫ్యాన్. క్లయిమాక్స్ కోసం కావాలని ఈ అతికింపు. ఇక తండ్రి గారు ఎందుకో రియాక్షన్లు పొడిగించుకుంటూ పోతాడు. అసలు మరియంని అకాడెమీలో నిషేధిస్తే పోయేదిగా. ఆడిటోరియం దాకా తెచ్చుకోవడం ఎందుకు. అక్కడ సెక్యూరిటీ గార్డులకి సైగలు చేస్తూ కమర్షియల్ వీర విలనీ ప్రదర్శించడమెందుకు. డిస్కో డాన్సర్ వంటి సినిమాల్లో క్లయిమాక్సులు ఇలాగే వుంటాయి టెంప్లెట్ లో. హీరో సాంగ్ అండ్ డాన్స్ ప్రోగ్రాం నెగ్గకుండా విలన్ పాల్పడే టెంప్లెట్ కుట్రలు. ఆ టెంప్లెట్టే ఇక్కడా  పడిపోయింది.

        చివరికి మరియం నాట్యం చేస్తూంటే సెక్యూరిటీకి ఫైనల్ సైగ చేస్తాడు అకాడెమీ ఓనర్. పాటాగి పోతుంది. నాట్యం ఆగిపోతుంది. ఇక కూతురు లేస్తుంది ఐఫోన్ తో బీభత్సంగా.  దమ్ అలీ అలీ దమ్ - ఝనక్ ఝనక్ నాచే నటరాజ్ రే  సూఫీ భక్తి ఫ్యూజన్ పాటపెట్టేసి  పారేస్తుంది! మతం చేతిలోంచి నాట్యం వెళ్ళిపోయి టీనేజర్ల చేతిలో ఇలా తయారయ్యింది.

సికిందర్
telugurajyam.com 

18, ఆగస్టు 2020, మంగళవారం

969 : రివ్యూ



 రచన - దర్శకత్వం : ఫరూఖ్ కబీర్ 

తారాగణం : విద్యుత్ జామ్వల్, శివాలికా ఒబెరాయ్, అన్నూ కపూర్, శివ్ పండిత్, నవాబ్ షా తదితరులు
సంగీతం : మిథూన్
, ఛాయాగ్రహణం : జీతన్ హర్మీత్ సింగ్
బ్యానర్ : పనోరమా స్టూడియోస్
విడుదల : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
***
      యాక్షన్ హీరో విద్యుత్ జామ్వాల్ ఈసారి భావోద్వేగాలు ప్రధానంగా సామాన్యుడైన యాంగ్రీ యంగ్ మాన్ పాత్రతో అభిమానులని అలరించేందుకు ప్రత్యక్షమయ్యాడు. కొత్త దర్శకుడు ఫరూఖ్ కబీర్ యాక్షన్ ని పణంగా పెట్టి సున్నిత భావోద్వేగాలతో ప్రయోగం లాంటిది చేశాడు. అయితే తీసుకున్న కథా వస్తువు దశాబ్దాల బాలీవుడ్ చరిత్రలో అనేక సార్లు రిపీట్ చేసిందే. దీన్ని సున్నిత భావోద్వేగాల ప్రయోగంతో కొత్తగా ఏ  మేరకు నిలబెట్టాడో చూద్దాం...

 కథ
    లక్నోలో కొత్తగా పెళ్ళయిన సమీర్ చౌదరి (విద్యుత్ జామ్వాల్) - నర్గీస్ (శివలీకా ఒబెరాయ్) లు 2008 ఆర్ధిక మాంద్య పరిస్థితుల్లో ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. ఇక ఉపాధి వెతుక్కోవడం మధ్య ప్రాచ్య దేశంలో తప్పనిసరవుతుంది. ప్రపంచం ఆర్ధిక మాంద్యంలో కుదేలైనా మధ్యప్రాచ్యం చమురు బావులతో నిక్షేపంగా వుంది. అక్కడ నోమన్ (కల్పిత దేశం) లో ఉద్యోగాలు  సంపాదించుకుంటారు. పేపర్స్ క్లియర్ అవడానికి సమీర్ కి సమయం పట్టేలా వుండడంతో, ముందు నర్గీస్ బయల్దేరి వెళ్లిపోతుంది. వెళ్ళిన ఆమె కంగారుగా ఫోన్ చేస్తుంది తనని కిడ్నాప్ చేశారని. వెంటనే సమీర్ నోమన్ వెళ్ళిపోతాడు.


        అక్కడ ఉస్మాన్ (అన్నూకపూర్) అనే టాక్సీడ్రైవర్ సాయంతో నర్గీస్ ని వెతికితే ఆమె వేశ్యాగృహంలో కన్పిస్తుంది. ఆమెని విడిపించేందుకు విఫలయత్నం చేసిన సమీర్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే
, అక్కడ ఉస్మాన్ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఇప్పుడు ఈ హత్యలోంచి ఎలా బయట పడి భార్యని కాపాడుకున్నాడన్నది మిగతా కథ.

నటనలు - సాంకేతికాలు 
    విద్యుత్ జామ్వాల్ ఒక సామాన్య లక్నో యువకుడి పాత్ర పోషించాడు. అన్యాయాలకి ఆవేశం పొంగుకొస్తుంది. కానీ ఎదుర్కొనే ధైర్యం చాలదు. ఆగ్రహమే తప్ప పోరాటం తెలియని అమాయకత్వం. ఇలాటి ఇతను నోమన్ లో అనుభవాల్లోంచి ఎలా రాటుదేలి బలవంతుడయ్యాడన్నది అతడి క్యారక్టర్ ఆర్క్. ఈ పాత్ర చిత్రణ వల్ల అభిమానులు అతన్నుంచి ఆశించే యాక్షన్ దృశ్యాలు తక్కువ వుంటాయి. ఒక సామాన్యుడిగా భార్యని వెతకడానికి సాయపడండని అడిగినప్పుడల్లా అతడి బలహీన స్వరం వణకడం, చేతులు వణకడం వంటివి వెంటాడే నటనగా వుంటాయి. పోరాటానికి తెగించాక ఇక హద్దులుండవు. ఈ పోరాట క్రమం కూడా అంచెలంచెలుగా స్థాయి పెంచుకుంటూ వుంటుంది. క్లయిమాక్స్ లో విజృంభిస్తుంది. విద్యుత్ జామ్వాల్ అండర్ ప్లే చేసిన ఈ పాత్ర, రొటీన్ యాక్షన్ హీరో పాత్రలకి భిన్నంగా జీవంతో కన్పిస్తుంది. అతడిలోని నటుణ్ణి బయటికి తీస్తుంది. 


        నర్గీస్ గా శివాలికా ఒబెరాయ్ ది చాలావరకూ కనిపించని పాత్ర. కిడ్నాపవడం కారణం. కాసేపే వున్నా కొట్టొచ్చే గ్లామర్. శివ్ పండిత్
, ఆహానా కుమ్రా, నవాబ్ షాలు దుష్ట పాత్రలు పోషించారు.    

        మిథూన్ పాటలు
, అమర్ మోహిలే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ యాక్షన్ మూవీకి ఓ మాదిరి ట్రెండీగా వున్నాయి. అరబ్ దేశపు లొకేషన్స్ కి, యాక్షన్ సీన్స్ కి జితన్ హర్మీత్ సింగ్ ఛాయాగ్రహణం డిటో. 

కథా కథనాలు

    కథేమీ లేదు. భార్య కిడ్నాపవడం, ఆమెని విడిపించుకోవడం ఇదే కథ, ఇంటర్వెల్లో భార్య దొరికినట్టే దొరికి మళ్ళీ దూరమవుతుంది. సెకండాఫ్ కథని లాగడానికే మళ్ళీ దూరం చేయడమేమో. రెండుసార్లూ భార్యని వెతికే కథనంలో కూడా బలం వుండదు. రాయబారుల చర్చలతో, విద్యుత్ ని ప్రశ్నించడాలతో నిండిపోతుంది. ఈ బలహీనతల్ని కవర్ చేసేందుకా అన్నట్టు విద్యుత్ పాత్ర చిత్రణ. బలహీనుడు ఎలా బలవంతుడయ్యాడన్న క్యారక్టర్ ఆర్క్. ఈ క్యారక్టర్ ఆర్క్ ఒక్కటే సినిమాని నిలబెట్టిందా అంటే లేదు. క్యారక్టర్ ఎదుగుదలకి తగ్గ దృశ్యాలతో కథనం పరుగులు దీయలేదు. పక్క దోవపడుతూ చర్చలూ, ప్రశ్నించడాలూ అంటూ కూర్చుంది. ఇందుకే రెండుం పావు గంటల ఈ యాక్షన్ థ్రిల్లర్ విజయావకాశాలు తగ్గాయి.

సికిందర్ 

17, ఆగస్టు 2020, సోమవారం

968 : రివ్యూ



రచన - దర్శకత్వం : తేజా మార్ని
తారాగణం : చైతన్య కృష్ణ, నైనా గంగూలీ, ఎస్తర్ అనిల్, ఈశ్వరీ రావు, రోహిణి, శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం : :ప్రియదర్శన్ బాలసుబ్రహణ్యం, ఛాయాగ్రహణం : జగదీష్ చీకటి
నిర్మాతలు: సందీప్ మార్ని, రత్నాజీ రావు మార్ని
విడుదల : ఆహా ఓటీటీ


        రో కొత్త దర్శకుడి కృషి ఓటీటీ లో విడుదలయ్యింది. ఇది రాజకీయ సినిమా. థియేటర్ మీద ఆశలు పెట్టుకుంటే ఇంట్లోకే వెళ్ళి హోమ్ డెలివరీ ఇవ్వాల్సిన అగత్యమేర్పడింది. ఇళ్ళల్లోనే రకరకాల సైజుల్లో హోమ్ థియేటర్లు వెలిశాయి. ఈ ప్రేక్షకులు వేరు. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ప్రేక్షకులు. దాదాపూ మాస్ వుండరు. సింగిల్ థియేటర్ల నుంచి మల్టీ ప్లెక్సులకి, మల్టీ ప్లెక్సుల నుంచీ హోమ్ థియేటర్లకీ ప్రేక్షకుల్ని కుదించుకుంటూ వస్తున్నాయి సినిమాలు. ప్రస్తుతాని కిదొక అనివార్య పరిస్థితి, అసంతృప్తి. కొత్త దర్శకులకైతే వర్ణణాతీత బాధ. ఆనందిద్దామన్నా అది వర్చువల్ ఆనందం. తేజా మార్ని అనే మరో కొత్త దర్శకుడు ఈ బరిలోకి తన కృషితో దిగాడు. ఒక రాజకీయ సినిమాతో పరిచయమవుతున్నాడు. ఈ పరిచయం, కృషీ పరిశీలించాల్సిన అవసరం వచ్చింది. పరిశీలిద్దాం...

కథ 
      వర్షపు హోరుతో అల్లకల్లోలంగా వున్న వాతావరణంలో ముఖ్యమంత్రి అచ్యుత రామయ్య దుర్మరణం వార్త వెలువడుతుంది. దీంతో ఆయన కుమారుడు విజయ్ వర్మ (చైతన్య కృష్ణ) కి ఉప ముఖ్యమంత్రి పదవి పార్టీ సూచిస్తే కాదని ముఖ్యమంత్రి అయిపోతాడు. ఇక తండ్రిని గొప్పగా ప్రతిష్టించుకోవాలన్న కోరికతో, నాన్న నరికిన తలలు కాదు, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గుర్తుకు రావాలి. నా తండ్రి పేరు చెబితే కీర్తి ప్రతిష్టలు గుర్తుకు రావాలి. ప్రతిపక్షాలు చేసే విష ప్రచారం కాదు, పాలకులు రాసేదే చరిత్ర కావాలి అంటూ ప్రమాణ స్వీకారం చేసి, ప్రపంచంలో కెల్లా ఎత్తైన విగ్రహం తండ్రికి కట్టించేందుకు పూనుకుంటాడు. మూడువేల కోట్లు అవసరమయ్యే విగ్రహం కోసం సంక్షేమ పథకాలకి కత్తెర వేసి నిధులు సమకూరుస్తాడు.

        ఇలా వుండగా వివిధ ప్రాంతాల్లో డబ్బుల్లేక కొందరు జీవన పోరాటాలు చేస్తూంటారు. కలుషిత నీరువల్ల కిడ్నీలు పాడైన కూతురి వైద్యం కోసం కౌలు రైతు (ఈశ్వరీ రావ్)
, శిథిలమైన అనాధాశ్రమం మరమ్మత్తుల కోసం స్వాతంత్ర్య యోధుడు (శుభలేఖ సుధాకర్), వారణాసి నుంచి పారిపోయి వచ్చి స్కాలర్ షిప్ ప్రయత్నాల్లో ఒక జంట (ఈస్తర్, అంకిత్),   క్రీడారంగంలోకి ప్రవేశించే ఆశయంతో గారడీ అమ్మాయి (నైనా గంగూలీ)... ఇలా విద్యా, వైద్య, తాగునీరు, క్రీడా రంగాలకి చెందిన వర్గాలు నిధుల కొరతతో బాధలు పడుతూంటాయి. 

        ఈ నాల్గు వర్గాల జీవన పోరాటం విగ్రహంతో ముఖ్య మంత్రి స్వార్ధ ప్రయోజనాన్ని ఎలా ఎదుర్కొంది
? ఎదుర్కొందా లేదా? ఎదుర్కొకపోతే ఎందుకు ఎదుర్కొలేదు? ఇదీ మిగతా కథ. 

నటనలు – సాంకేతికాలు
       అందరూ బాగా నటించారు. రియలిస్టిక్ పాత్రలు లీనమై నటించారు. పేద తరగతి రియలిస్టిక్ పాత్రలవడం వల్ల గ్లామర్ తో పని లేకుండా పోయింది. దీంతో గ్లామర్ తో వుండే పరిమితులు అడ్డు పడలేదు. ఫ్రీ స్టయిల్ నటనలకి వీలు కుదిరింది. మొట్ట మొదటిసారిగా ముఖ్యమంత్రి వంటి పెద్ద పాత్ర నటించిన చైతన్య కృష్ణ, పాత్రలో పెద్దగా బలం లేకపోయినా, పాత్ర కన్పించినప్పుడల్లా ముఖ్యమంత్రి పాత్ర అనే బెరుకు లేకుండా నటించాడు. 

         ఈశ్వరీ రావ్ ఇలాటి పాత్రలకి ఒక శారద. శోక పాత్రలో ఆమెదొక ఆర్ట్ సినిమా నటన. క్రీడాకారిణిగా కాస్త స్పీడున్న పాత్రలో నైనా గంగూలీ భావోద్వేగాల్ని రగిలించే నటన. స్టూడెంట్ గా ఎస్తర్ అనిల్ అమాయకత్వాన్ని బాగా ప్రదర్శించే నటన. చాయ్ వాలాగా అంకిత్ ఇంకో బాధిత పాత్ర, స్వాతంత్ర్య యోధుడిగా శుభ లేఖ సుధాకర్, ఇద్దరూ మంచి నటులు-  చివర్లో ఒక సీనులో జర్నలిస్టుగా రోహిణి కన్పిపిస్తుంది. వాస్తవిక ధోరణిలో తీసిన సినిమాకి వాస్తవిక నటనలతో అందరూ నిలబెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నంలో ఒక వంతు కూడా తన బాధ్యతగా సినిమాని నిలబెట్టేందుకు కృషి చేయలేదు కొత్త దర్శకుడు. ఇక ఎత్తైన విగ్రహపు వూహలేల? 

        ఉద్దేశపూర్వకంగానో
, లేక కాకతాళీయంగానో గానీ ప్రారంభంలో ఒకరి తర్వాత ఒకరు ఓపెనయ్యే బాధిత పాత్రల దృశ్యాలకి నేపథ్యంలో వాటర్ థీమ్ ని కల్పించాడు కొత్త దర్శకుడు. ముఖ్యమంత్రి అచ్యుత రామయ్య దుర్మరణంతో హోరు వర్షం, ఈశ్వరీ రావ్ తో సముద్రం, ఈస్టర్ తో వారణాసిలో గంగ, నైనా తో విశాఖలో సముద్రం, ఇవి గాక రాజమండ్రిలో గోదావరి, ఆ తర్వాత శుభలేఖ సుధాకర్ తో కారే వర్షపు నీళ్ళు, కొద్ది సేపటికి కలెక్టర్ తో వర్షం... ఇలా ఈ జల నేపథ్యాలు సబ్ కాన్షస్ మూడ్ ని సృష్టిస్తాయి. ఈ సింబాలిజంతో ఏ రసోత్పత్తితో కాన్సెప్ట్ కొలిక్కి వస్తుందా అని ఎదురు చూస్తే, ఏమీ వుండదు. ఆ దృశ్యాలకే అవి పరిమితం. ముఖ్యమంత్రిని దుర్మరణం పాల్జేసిన ఈ వాటర్ థీమ్, చివరికి ముఖ్యమంత్రి విగ్రహాన్ని కూల్చేసే ప్రకృతి ప్రకోపమవుతుందేమో నని మన బుర్రకి అన్పిస్తుంది. కానీ మన పనికొచ్చే బుర్రకి పని పెట్టుకోవడం వేస్ట్ అని తేలుతుంది. 

        ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోరు దాదాపు పాటలే ఆక్రమిస్తాయి. ఏ బాధ పెట్టే ఘట్టం వచ్చినా ఓ పాట వచ్చేస్తుంది. బాగానే వుంటుంది. మ్యూజికల్ రియలిస్టిక్ లాగా కొత్తగా. కానీ విషయం లేని సినిమాని నటనలతో
, పాటలతో నిలబెట్ట గలరా? 

        కెమెరా పరంగా కూడా విజువల్ బలం వుంది. దీనికీ విషయం తోడ్పడలేదు. వారణాసి లాంటి పుణ్య క్షేత్రంలో పడుపు వృత్తిని పచ్చిగా చూపించ వచ్చు. అదొక వాస్తవం. కానీ కథ కేమవసరం
? ఆ నేపథ్యంలోంచి వచ్చే ఆ రాష్ట్రపు పాత్ర, ఇంకో రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనం కోరుకోవడంలో ఔచిత్యం? స్థానిక పాత్రల స్ట్రగుల్ ని చూపించే కాన్సెప్ట్ లో ఇదొక రస భంగం. ఈ రాజకీయ సామాజికార్ధిక కాన్సెప్ట్ ని తెరకెక్కించాలంటే పేపర్ న్యూస్ కటింగ్స్ చాలవు, సమకాలీన స్పృహతో వెండి తెరని మించిన గ్రాండ్ పిక్చర్ ని మైండ్ లో చూడాలి. 

కథా కథనాలు
       ఇది ఏ రాజకీయ కుటుంబపు కథో వర్షపు హోరులో ముఖ్యమంత్రి దుర్మరణంతో తెలిసిపోతుంది. అయితే కథనంతో అంటీ ముట్టనట్టు వుండిపోతుంది. ప్రశ్నించే పని చేయదు. ఇదే సమస్య. ప్రశ్న లేకపోవడంతో సినిమా అనే రెండు గంటల విలువైన సమయానికి ప్రయోజనం లేకుండా పోయింది. కాన్ఫ్లిక్ట్ లేకుండా సినిమానెలా వూహిస్తాడు ఏ కొత్త దర్శకుడైనా? కథ కూడా కదలకుండా విగ్రహంలా వున్న చోటే వుంటుందా? ప్రశ్న పుడితే కదలాలన్పిస్తుంది కథకి. పుట్టకపోతే పడుకుని వుంటుంది. కథ కదలడం లేదన్న మినిమం ఫీలింగ్ కూడా దర్శకుడికి కలక్కపోతే ఎలా? 

         రెండోది, దీన్ని విడివిడి కథల ఆంథాలజీగా చేయడం. ఆంథాలజీలు వర్కౌట్ కావని తెలిశాక కూడా. పోనీ ఈ విడివిడి కథల్లోని బాధిత పాత్రలు ఒకటై ముఖ్యమంత్రి విగ్రహ పిచ్చిని ప్రశ్నిస్తాయా అంటే అదీ లేదు. అవి వాటి మానాన అవి కథలు ముగించుకుంటాయి. స్వాతంత్ర్య యోధుడి పాత్ర కూడా ప్రశ్నించి నాల్గు దులుపుళ్ళు దులపక పోతే ఎందుకు? ఇలా వుంటే, ముఖ్యమంత్రి తన తండ్రి విగ్రహం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగడ మేమిటి? ఆ బాధితుల కథలు రాసుకుని జర్నలిస్టు ముఖ్యమంత్రికి చూపిస్తే ముఖ్యమంత్రి ఫీలవడం. ప్రజా శ్రేయస్సు కాదని మూడువేల కోట్లు ధారబోసి విగ్రహం కట్టేశాక కథలు చూపించి ఏం లాభం, ఆయన ఫీలయ్యి ఏం ప్రయోజనం? 

        ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది స్ట్రక్చర్ ఛాయలు లేని మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే. అయితే మిడిల్ మాటాష్ కైనా ముగింపులో  ప్రశ్న పుట్టి  వాళ్ళూ  వీళ్లూ కొట్టుకునే మటన్ ఫ్రై లాంటి నాన్ వెజ్ ముగింపు వుంటుంది. ఇలా వెజ్ కూడా కాని ఎండు గ్రాసంలా వుండదు. దటీజ్ ది మెయిన్ ప్రాబ్లం.

సికిందర్