రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, ఏప్రిల్ 2021, బుధవారం

 

Tuesday, March 17, 2020

920 : జానర్ మర్యాద

(ఇది మొదటి భాగం. మిగిలిన భాగాల కోసం కింద ఇచ్చిన లింకుని క్లిక్ చేసి, స్క్రోల్ డౌన్ చేయండి)

        జానర్ మర్యాదల గురించి కొనసాగింపు వ్యాసంగా మొదట ప్రస్తుత ట్రెండ్ మీద దృష్టి పెడితే, మొత్తానికి ఇటీవల రోమాంటిక్ కామెడీ (?) ల తాకిడి తగ్గి, సస్పెన్స్ థ్రిల్లర్ల (?) హవా నడుస్తోంది. వీటి జానర్ మర్యాదలు తెలియజేయాలని కొందరు రాస్తున్నారు. ఒక సహకార దర్శకుడు డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్ (?) జానర్ ఎనాలిసిస్ రాయాలని కోరారు. ‘డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్’ అని అనెయ్యడం అనాలోచితంగా జరిగిపోయి వుండొచ్చు. జానర్ సంబంధ సాంకేతిక పదాలు ఇష్టానుసారం వాడేస్తే ఇక జానర్ మర్యాదలు ఎంత చెప్పినా అర్ధంగావు. ప్రేమ కథలన్నిటినీ కలిపి రోమాంటిక్ కామెడీలని ఒకే పదం వాడెయ్యడం, నేర కథలన్నిటినీ సస్పెన్స్ థ్రిల్లర్స్ అనుకోవడం చేస్తే ఇక జానర్ మర్యాదల గురించి చెప్పుకోవడం అసాధ్యమైపోతుంది. ఒక జానర్ లో ఎన్నో సబ్ జానర్లు వుంటాయి. నిజంగా జానర్ మర్యాదల్ని అమలుచేసి, ఒక వైవిధ్యాన్నిచాటుకోవాలనుంటే, ముందు తెలుసుకుని మాట్లాడాల్సింది ఏ సబ్ జానర్ కింద చేస్తున్న కథ వస్తుందన్నదే. ఇది ఐడియా దశలోనే నిర్ణయమవాలి. ఐడియా దగ్గరే కట్టుబడక పోతే ఇక కథతో ఏ కట్టుబాట్లూ వుండవు. ఏ జానర్ మర్యాదలూ వుండవు. లవ్ జానర్లో రోమాంటిక్ కామెడీలు మాత్రమే వుండవు. రోమాంటిక్ డ్రామాలుంటాయి, రోమాంటిక్ సస్పెన్సులుంటాయి. అడల్ట్ రోమాన్సులుంటాయి, ఎరోటిక్ రోమాన్సులుంటాయి. ఇలా అనేక సబ్ జానర్లుగా వర్గీకరణ చెంది వుంటుంది లవ్ జానర్. ఇది తెలుసుకోక రోమాంటిక్ కామెడీ లంటూ తీస్తూ వచ్చిన సినిమాలు దాదాపూ అన్నీ ఒకే మూసలో రోమాంటిక్ డ్రామాలే. ఇలా వుంటే ఇక జానర్ మర్యాదల గురించి తెలుసుకుని ప్రయోజనమేముంటుంది.   

        
లాగే నేర కథలన్నీ సస్పెన్స్ థ్రిల్లర్స్ కావు. నేర కథలు ప్రధానంగా క్రైం జానర్. దీనికింద సబ్ జానర్స్ గా మిస్టరీ, క్రైం థ్రిల్లర్, రోమాంటిక్ థ్రిల్లర్, ఎరోటిక్ థ్రిల్లర్, లీగల్ థ్రిల్లర్, మెడికల్ థ్రిల్లర్, మిలిటరీ థ్రిల్లర్... ఇలా ఎన్నో వుంటాయి. దేని జానర్ మర్యాద దానిదే. సస్పెన్స్ థ్రిల్లర్ అనే సబ్ జానర్ కూడా లేదు. కారణం, సస్పెన్స్ నేది అన్ని జానర్ల కథల్లోనూ వుండేదే. ఇది కథలకి సస్పెన్స్ ని కల్పించే టూల్ తప్ప, టైపు కాదు. జానర్ కాదు. పైన చెప్పుకున్న క్రైం సబ్ జానర్ లో కథలు ఒక నేరం చుట్టూ వుంటాయి. ఈ కథలు స్టార్స్ తో తీసినప్పుడు హాలీవుడ్ సినిమాల్లోలాగా వాటివైన జానర్ మర్యాదలతో వుండక పోవచ్చు. అన్ని మసాలాలూ కలిపేసి వుండొచ్చు. స్టార్స్ కుండే ఇమేజి అలా డిమాండ్ చేస్తుంది కాబట్టి. వీటికి జానర్ మర్యాదల గురించి కంగారుపడ నవసరం లేదు. 



   స్టారేతర సినిమాలకి మనసుంటే మర్యాదలు, బంధుత్వాలు కలుపుకోవచ్చు. మనసే లేకపోతే  కొత్త హీరోల, చిన్న హీరోల క్రైం జానర్ ని కూడా స్టార్స్ సినిమాల్లాగా సర్వ కళా సమ్మేళనం చేసుకోవచ్చు. తీసేది కోటి రూపాయల క్రైం జానరైనా, పదుల కోట్ల స్టార్ సినిమాల్లా వుండాలని కలలుగంటే, స్టార్ సినిమాలకి చీప్ నకళ్ళు తయారవుతాయి తప్ప, జానర్ స్పెసిఫిక్ సినిమాలు రావు. అదే టిక్కెట్ కి వైభవోపేతంగా స్టార్ సినిమాలు లభిస్తోంటే, చీప్ నకళ్ళతో ఆడియెన్స్ కేంపని? ఇదీ పాయింటు. 

డిటెక్టివ్- పోలీస్ డిటెక్టివ్ 
        కాబట్టి క్రైం జానర్ తో చీప్ నకళ్ళే కావాలో, ఒరిజినాలిటీ కావాలో ఎవరికి వారే నిర్ణయించుకుని బరిలోకి దిగాలి. ముందుగా ఐడియాతో ఈ స్పష్టత కొస్తే దానికి తగ్గ వ్యాపారం తెలుస్తుంది. వ్యాపార రేంజి తెలుస్తుంది. ఈ రేంజి చాలనుకుంటే అదే రేంజిలో తీసుకోవచ్చు. గొడవుండదు. దానికి తగ్గ ఫలితం ముందే తెలుస్తుంది కాబట్టి సమస్య వుండదు. ముందుగా క్రైం జానర్లో పైన అడిగిన ‘డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్’ చూద్దాం. ‘డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్’ అనడం జానర్ ని పిలవడంలో అస్పష్టతే అయినా, ఇందులో ప్రధానంగా ‘డిటెక్టివ్’ అనే పదం వుంది. అంటే నేర కథ. నేర కథల్లో డిటెక్టివ్ అంటే నేర పరిశోధన, దర్యాప్తు వగైరా. అంటే మిస్టరీ సబ్ జానర్. నేరాల్ని శోధించే నేర కథలు మిస్టరీ సబ్ జానర్ కింది కొస్తాయి. మిస్టరీ అంటే రహస్యంతో ముడిపడి వున్నది. అంటే ఒక నేరం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే రహస్యం డిటెక్టివ్ తెలుసుకునే కథనంతో కూడిన కథావస్తువు.

        దీని జానర్ మర్యాదలేమిటో చూద్దాం: డిటెక్టివ్ సాహిత్యానికి ఆద్యుడు షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త అర్ధర్ కానన్ డాయల్ కాదు. ఎడ్గార్ అలెన్ పో. 1841 లో ఈయన రాసిన ‘మర్డర్స్ ఇన్ ది రూ మార్గ్’ చరిత్రలో మొదటి డిటెక్టివ్ కథ. ఈయన సృష్టించిన ఆగస్ట్ పైన్ మొదటి డిటెక్టివ్. ఈ ప్రసిద్ధ డిటెక్టివ్ కథా క్రమంలో ‘పో’ కల్పించిన ఎనిమిది దశల్ని తీసుకుని, షెర్లాక్ హోమ్స్ పాత్రని సృష్టించి, ‘ఏ స్టడీ ఇన్ స్కార్లెట్’ అని మొదటి డిటెక్టివ్ కథ 1887 లో రాశాడు డాయల్. డాయల్ తో సరిసమానమైన అగథా క్రిస్టీ కూడా ఆగస్ట్ పైన్ తోనే స్ఫూర్తి పొంది, హెర్క్యూల్ పైరట్ పాత్రని సృష్టిస్తూ, ‘ది మిస్టీరియస్ ఎఫైర్ ఇన్ స్టైల్స్’  అనే తన తొలి  డిటెక్టివ్ కథ 1920 లో రాసింది. 

        ‘పో’ రాసిన కథని హోమ్స్ పరిశీలించి ఫాలో అయిన ఎనిమిది  కథన దశలేమిటో చూద్దాం. ఈ దశలే ఆయన రాసిన చిన్న కథలతో బాటు నవలల్లో వుంటాయి. నవలల ఆధారంగా తీసిన సినిమాల్లోనూ వుంటాయి. 1. ముందుగా అనుచరుడు డాక్టర్ వాట్సన్ తో షెర్లాక్ హోమ్స్ పూర్వపు కేసులు చర్చిస్తూ కథా ప్రారంభం, 2. కొత్త క్లయంట్ వచ్చి సమస్య చెప్పుకోవడం, హోమ్స్  ఆ కేసు స్వీకరించడం, 3. క్లయంట్ ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు మొదలెట్టడం, ఒక కీలక ఆధారం దొరకడం, ఇది అంత ప్రధానం కాదన్నట్టుగా పాఠకులకి అన్పించేలా చేయడం, 4. వాట్సన్ ఆ ఆధారంతో పొరపాటు విశ్లేషణ చేయడం, 5. ప్రభుత్వ డిటెక్టివ్ ఇంకో ఫాల్స్ క్లూ ఇవ్వడం, ప్రభుత్వ డిటెక్టివ్ కాకపోతే దినపత్రికో, క్లయంటో, లేక కేసులో బాధితుడు లేదా బాధితురాలో, ఇంకో సాక్షియో ఆ ఫాల్స్ క్లూ నివ్వడం, 6. తర్జనభర్జనలతో కేసు అంతు చిక్కక వాట్సన్ అయోమయంలో పడ్డం, హోమ్స్ క్లూస్ అన్నిటినీ కలిపి ఊహాగానం చేస్తూ, నిర్ణయం చెప్పకపోవడం, 7. అనూహ్యంగా హోమ్స్ కేసుని బద్దలు కొట్టి దోషిని పట్టుకోవడం, 8. తను కనుగొన్న వాస్తవాలన్నిటినీ కలిపి హేతుబద్ధ వివరణ నిస్తూ ముగించడం. 


      ఏ  షెర్లాక్ హోమ్స్ కథైనా నవలైనా ఈ ఎనిమిది దశలతో టెంప్లెట్ గా వుంటుంది. కొమ్మూరి సాంబశివరావు రాసిన తెలుగు డిటెక్టివ్ నవలలు కూడా ఇదే టెంప్లెట్ లో వుంటాయి. అగథా క్రిస్టీ ‘పో’ నే ఫాలో అయినా కొంత తేడా చూపిస్తూ ముందడుగేసింది. 1. ఒక హత్య జరుగుతుంది, హెర్క్యూల్ పైరట్ ప్రవేశిస్తాడు, 2. తన చుట్టూ కొందరు అనుమా నితులుంటారు, ప్రశ్నించడం మొదలెడతాడు, 3. ఒకరొకరుగా అనుమానితుల్ని ప్రశ్నిస్తూంటే ఆసక్తికర విషయాలు బయటపడుతూంటాయి, 4. ఎనాలిసిస్ చేసుకోవడం మొదలెడతాడు, 5. అనుమానితుల్లో కొందరి ప్రవర్తన, చర్యలు దృష్టి నాకర్షిస్తాయి, 6. ఇక ఫలానా అనుమానితుడు లేదా అనుమానితురాలు దోషి అని పట్టేసుకుంటాడు, 7. ఆ దోషి ఒక్కరే కావచ్చు, లేదా అనుమానితులందరూ దోషులు కావచ్చు, అసలు హత్య జరిగిందో లేదో కూడా తేలక పోవచ్చు, దోషిని పట్టుకోబోతే హత్యకి గురైన వ్యక్తే సజీవంగా దొరకవచ్చు!

        కానన్ డాయల్  క్లూస్ తో కేసుల్ని పరిష్కరిస్తే, అగథా క్రిస్టీ అనుమానితులతో ఆట చూపిస్తూ సర్ప్రైజ్ ముగింపుల్నిస్తుంది. ఈ తేడా గమనించాలి ఈ జానర్లో. డిటెక్టివ్ సాహిత్యానికి ‘పో’ సహా వీరిద్దరూ స్థిరీ కరించిన ఓవరాల్ జానర్ మర్యాద - రహస్యాన్ని దర్యాప్తు చేసేదే, ఛేదించేదే. ఇందువల్ల  నేర కథల్లో (క్రైం జానర్లో) ఇవి మిస్టరీ సబ్ జానర్లవుతున్నాయి. ఇందులో చివరి వరకూ దోషి ఎవరో తేలదు. దోషిని పట్టుకున్నాక అతడి మీద నేర నిరూపణ చేస్తూ డిటెక్టివ్ అనే వాడు మొత్తం మొదట్నుంచీ కేసు పూర్వాపరాలు పారాయణం చేస్తూ, దోషికాపాదించి తీర్పు చెప్తాడు. అంటే ఏది ఎందుకు జరిగిందో, ఎవరు ఎలా చేశారో చివరి వరకూ కథ పట్టుబడని ప్రక్రియ అన్నమాట. కాన్ఫ్లిక్ట్ తెలిస్తేనే కదా కథేమిటో తెలిసేది. కాన్ఫ్లిక్ట్ ని చివరికి వరకూ తోసేసి డిటెక్టివ్ విప్పి చెప్పినప్పుడు,  ఆ సస్పెన్స్ కథని ఎండ్ సస్పెన్స్ కథ అంటారు. అప్పారావు సుబ్బారావు దగ్గరి కొచ్చి, వచ్చిన పని చెప్పకుండా రెండు గంటలు సోది చెప్పి, చల్లగా ఫిఫ్టీ అప్పడగడాని కొచ్చానని అసలు విషయం చెప్తే, ఈడ్చి కొట్టాలన్పిస్తుంది సుబ్బారావ్ కి. ఈ విషయం ముందే చెప్పొచ్చుగా? 



        ఇలా ఎండ్ సస్పెన్స్ కూడా సుబ్బారావ్ సిండ్రోమే. కథేమిటో ముందే కాన్ఫ్లిక్ట్ చూపించకుండా, మూసి పెట్టిన కథ తాలూకు ఏవేవో కథనాలు చూపిస్తే ఎలా అర్ధమయ్యేది. స్క్రీన్ మీద రియల్ టైం స్టోరీ ప్రత్యక్షంగా నడవాలి. ఎండ్ సస్పెన్స్  అప్పటి నవలల్లో కాబట్టి సరిపోయింది. సినిమాల్లో సరిపోవడం లేదని హాలీవుడ్ ఆలస్యంగా గ్రహించింది. చదవడం వేరు, సినిమాగా చూడ్డం వేరు. పైగా సుమారు 1980 ల తర్వాత డిటెక్టివ్ సాహిత్యానికి కాలం చెల్లింది తెలుగు సహా. తరం మారిన నవ పాఠకులకి, నవీన ప్రేక్షకులకి చివరివరకూ కథ తెలియని వాదోపవాదాలేమిటో, ఆ క్లూక్లూ కూడబలుక్కుని ఇన్వెస్టిగేషన్ ఆధారంగా సాగే, పడక్కుర్చీ మేధావి డిటెక్టివ్ కథలేమిటో నచ్చలేదు. యాక్షన్ తక్కువ, లెక్చర్ లెక్కువ. దీని బదులుగా యాక్షన్ తో కాన్ఫ్లిక్ట్ ఓరియెంటెడ్ గా కథ తెలిసిపోయి, సీన్ టు సీన్ సస్పెన్స్ నే కోరుకున్నారు. దీంతో పోలీస్ డిటెక్టివ్ పాత్రలు పుట్టుకొచ్చాయి. ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలు కేవలం కాల్పనిక సాహిత్యంలో కన్పించేవే. విదేశాల్లో ప్రైవేట్ డిటెక్టివులు సమాజంలో తెలిసిన వ్యక్తులే అయినా, కాల్పనిక కథల్లో అంత పాపులర్ డిటెక్టివులు నిజ జీవితంలో ఎవరూ లేరు. ఇంకా నిజ జీవితంలో మెలిటా నార్వుడ్, వర్జీనియా హాల్, సిడ్నీ రీల్లీ మొదలైన పాపులర్ గూఢచారులున్నారు. ప్రైవేట్ డిటెక్టివులకి దర్యాప్తుల్లో పోలీస్ డిటెక్టివులకున్నంత యాక్సెస్ వుండదు. క్రైం సీన్లోకి కూడా వెళ్ళలేరు. పోలీస్ డిటెక్టివులకి ఫోరెన్సిక్  సైన్స్ కూడా అందుబాటులో వుంటుంది. డిటెక్టివ్ కథలకంటే  పోలీస్ డిటెక్టివ్ కథలు నేటి పాఠకులకి, ప్రేక్షకులకి వాస్తవికంగా అన్పించి వెంటనే కనెక్ట్ అవుతారు కూడా. 

మిస్టరీ కావాలా, థ్రిల్లర్ కావాలా?
        బ్రిటన్నుంచి రచయిత్రి రూత్ రెండెల్  ‘చీఫ్ ఇన్స్ పెక్టర్ రెగ్ వెక్స్ ఫర్డ్’ అనే పోలీస్ డిటెక్టివ్ పాత్రని సృష్టించి బాగా పాపులర్ చేసింది. ఆమెకెప్పుడూ అవార్డులే. 25 అవార్డులు పొందింది. ఈ పోలీస్ డిటెక్టివ్ పాత్రతో 24 నవలలు రాసింది. ఇతడికి భార్య, ఇద్దరు కూతుళ్ళు వుంటారు. ఒక కూతురితో సమస్యలే వుంటాయి. ఈ ఫ్యామిలీ సబ్ ప్లాట్ ప్రతీ నవల్లో క్యారీ అవుతూంటుంది.  పోలీస్ డిటెక్టివ్ ని ఫ్యామిలీ మ్యాన్ గా చిత్రించవచ్చు. మామూలు డిటెక్టివ్ కి ఫ్యామిలీ, పెళ్ళాం  పిల్లలూ, పిల్లీ మేకా అంటే కుదరదు. జానర్ మర్యాద కాదు. అతను ఎవర్ గ్రీన్ బ్యాచిలర్ గా తిరుగుతూ వుండాల్సిందే, ఇలాగే స్పై పాత్ర కూడా. తెలుగులో వచ్చిన ఏ డిటెక్టివ్ పాత్రకి కూడా ఫ్యామిలీ వుండదు. రూత్ రెండల్ రాసిన ‘ఎండ్ ఇన్ టియర్స్’ (2005) నవల్లో ఒక యాక్సిడెంట్ కేసు కథ, ఫ్యామిలీ ఉపకథ ఉత్తమంగా వుంటాయి. 

        డిటెక్టివ్ నవలలు పోయి పోలీస్ డిటెక్టివ్ నవలలు రాజ్యమేలుతున్నాయి ఇప్పటికీ కూడా. ఎడ్ మెక్ బెయిన్ ‘87 వ ఏరియా పోలీస్ స్టేషన్’ అని క్రియేట్ చేసి అందులో పోలీస్ డిటెక్టివ్ పాత్రలతో ఎన్నో నవలలు రాశాడు. స్టీవ్ కరెల్లా, అలివర్ వీక్స్, మేయర్ మేయర్ వంటి పోలీస్ డిటెక్టివ్ పాత్రలు పాఠకుల అభిమాన పాత్రలయ్యాయి. స్టీవ్ కరెల్లా చెవిటి మూగని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సినిమాల విషయానికొస్తే ‘ఎల్ ఏ కాన్ఫిడెన్షియల్’, ‘హీట్’, ‘ఇన్ ది హీట్ ఆఫ్ ది నైట్’, ‘ది ఫ్రెంచ్ కనెక్షన్’, ‘డర్టీహేరీ’ సిరీస్, ‘బేవర్లీ హిల్స్ కాప్’ సిరీస్ వంటివెన్నో వచ్చాయి, వస్తున్నాయి. 


     ప్రైవేట్ డిటెక్టివ్ నవలలకీ పోలీస్ డిటెక్టివ్ సినిమాలకీ తేడా ఏమిటంటే, పోలీస్ డిటెక్టివ్ సినిమాలు ఎండ్ సస్పెన్స్ కథల్ని తీసి పక్కన పెట్టాయి, సీన్ టు సీన్ సస్పెన్స్ ని కనిపెట్టాయి. అంటే మిస్టరీ సబ్ జానర్ నుంచి విడిపోయి, క్రైం థ్రిల్లర్ అనే సబ్ జానర్ కి తెర తీశాయి. అంటే పోలీస్ డిటెక్టివ్ కథలు, సినిమాలు క్రైం థ్రిల్లర్సే తప్ప మిస్టరీలు కావన్న మాట.  మాస్ మార్కెట్ అయిన సినిమాల మీద గౌరవముంటే పనికొచ్చే ఈ తేడా గుర్తించాలి. ఈ తేడాతో ఈ క్రైం థ్రిల్లర్ అనే సబ్ జానర్ కి ఎండ్ సస్పెన్స్ కాకుండా, సీన్ టుసీన్ సస్పెన్స్ అనే కథన ప్రక్రియని చేపట్టారు. ఇదెలా వుంటుంది? ఎవరు చంపారో ప్రేక్షకులకి చూపించేస్తారు. పోలీస్ డిటెక్టివులకి తెలియకుండా దర్యాప్తు ప్రారంభిస్తారు. ప్లాట్ పాయింట్ వన్ లేదా ఇంటర్వెల్ కొచ్చేసరికల్లా ఇన్వెస్టిగేషన్ లో డిటెక్టివ్ పోలీసులకి హంతకుడెవరో రివీల్ చేసేస్తారు. ఇక వాణ్ణి పట్టుకోవడానికి యాక్షన్ ప్రారంభిస్తారు. వాడెలా దొరుకుతాడనేది సీను సీనుకీ సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ, రియల్ టైంలో లైవ్ కథనం చేస్తారు. ఇందువల్లే ఇది చప్పటి ఎండ్ సస్పెన్స్ కథనం కాకుండా, వేడి పుట్టిస్తూ వుండే  సీన్ టు సీన్ సస్పెన్స్ అయింది. 

        అంటే, మిస్టరీలు కాకుండా వచ్చే అన్ని ఇతర సినిమాల్లో లాగే, ప్లాట్ పాయింట్ వన్ దగ్గరో, ఇంటర్వెల్లోనో కాన్ఫ్లిక్ట్ చూపించేసి కథేమిటో తేలిసేలా చేసేస్తారు. హీరోకి గోల్ ని ఏర్పాటు చేసి, గోల్ కోసం మిడిల్ సంఘర్షణ ప్రారంభిస్తారు. దీనివల్ల మిస్టరీలు తప్ప అన్ని జానర్ల సినిమాల్లో వుండే - కథేమిటో అర్ధమై, ఈ కథెలా ముగుస్తుందన్న ఇన్వాల్వ్ మెంట్ ని క్రియేట్ చేస్తారు. మిస్టరీ లొక్కటే అన్ని జానర్లు, సబ్ జానర్లూ కాదని సినిమాలకి నష్టాన్ని తెచ్చే ఎండ్ సస్పెన్స్ అనే ప్రింట్ మీడియా వ్యాపకంతో వుంటున్నాయి. 

        స్థూలంగా ప్రైవేట్ డిటెక్టివ్ కథలకీ, పోలీస్ డిటెక్టివ్ కథలకీ తేడా ఏమిటంటే, ప్రైవేట్ డిటెక్టివ్ కథలు నేరాన్ని పరిశోధించడం గురించి, పోలీస్ డిటెక్టివ్ కథలు నేరస్థుణ్ణి పట్టుకోవడం గురించి. సినిమాలకి ఏది బావుంటుంది? ప్రైవేట్ డిటెక్టివ్ కథలు చివరి వరకూ నేరస్థుడెవరో (విలన్) తెలియని ఎండ్ సస్పెన్స్ పాసివ్ కథలు, పోలీస్ డిటెక్టివ్ కథలు నేరస్థుడెవరో (విలన్) తెలిసిపోయి వాణ్ణి పట్టుకునే యాక్టివ్ - యాక్షన్ కథలు. సినిమాలకి ఏది బావుంటుంది? ప్రైవేట్ డిటెక్టివ్ కథలు చివరి వరకూ విలనే లేని, ‘నాకో విలన్ కావాలీ’ అని విలన్ ని వెతుక్కుంటున్నట్టు సాగే ఏకపక్ష కథలు, పోలీస్ డిటెక్టివ్ కథలు విలన్ తెరపైకొచ్చి యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లేకి తెరతీసే ద్వైపాక్షిక కథలు. సినిమాలకి ఏది బావుంటుంది? ప్రైవేట్ డిటెక్టివ్ కథలు చిట్ట చివరికి డిటెక్టివ్ నేరస్థుణ్ణి కనుగొని, వాడిపై నేరాభియోగం చేసే కేసు పూర్వపరాల పారాయణంతో వుంటాయి, పోలీస్ డిటెక్టివ్ కథలు కేసు పూర్వాపరాలు ప్రేక్షకులకి తెలిసిపోయిన నేపథ్యంలో పారాయణం, ప్రసంగం, పచ్చి పులుసూ లేని పోలీస్ బ్యాంగ్ తో వుంటాయి. మాస్ మార్కెట్ అయిన సినిమాలకి ఏది బావుంటుంది? 

        చిట్టచివరికి సస్పెన్స్ విప్పి మొత్తం కథంతా ఎనాలిస్ చేస్తూ (రివ్యూ రైటర్ రివ్యూ రాసినట్టు), ముందు జరిగిన దృశ్యాల తాలూకు మాంటేజెస్, కట్ షాట్స్ వేస్తూ, ప్రేక్షకులకి గుర్తు చేస్తూ - చూశారా నా టాలెంట్ - అని దర్శకుడు థ్రిల్లానందం పొందవచ్చు, ప్రేక్షకులకది నిద్రానందాం. ఇంతసేపూ విలనెవరో దాచింది గాక, వాడి గురించి కతలు. 


షెర్లాక్ తాతతో సినిమాలు? 
        తెలుగుకి వద్దాం. తెలుగులో డిటెక్టివ్ సాహిత్యం 1980 లలోనే అంతరించి పోయింది. మధు బాబు యాక్షన్ ఓరియెంటెడ్ అడ్వెంచరస్ షాడో వచ్చేశాడు. కాబట్టి ఇప్పటి తరానికి డిటెక్టివులు తెలియరు. పైగా ఆ డిటెక్టివులు మనకి సాంఘిక మూలాలు లేని, సమాజంలో కన్పించని, కేవలం అప్పట్లో నవలల్లో కన్పించిన కాల్పనిక పాత్రలే. ఇప్పటి మేకర్లు షెర్లాక్ హోమ్స్ కి ఉత్తేజితులై తెలుగులోకి దింపేస్తున్నారు. ప్రైవేట్ డిటెక్టివ్ కథలకీ, పోలీస్ డిటెక్టివ్ కథలకీ సినిమాల కొచ్చేసరికి తేడా లెలా వుంటాయో పైన తెలుసుకున్నాం. హాలీవుడ్ లో ప్రైవేట్ డిటెక్టివ్ సినిమాలొస్తున్నాయి కదా అంటే, వస్తున్నాయి. 2007 లో తీసిన ‘జోడియాక్’ కథని 1960-70 లలో స్థాపించి చూపెట్టారు. అందులో కార్టూనిస్టు అవసరార్ధం డిటెక్టివ్ అవతార మెత్తుతాడు. ఈ పరిశీలనలన్నిటి దృష్ట్యా, తెలుగు సినిమాలకి ఇంకా ప్రైవేట్ డిటెక్టివులే అవసరమో, లేక పోలీస్ డిటెక్టివులు కావాలో ఎవరికివారే నిర్ణయించుకోవాలి.

        తెలుగు సినిమాల్లో పోలీస్ అనగానే ఇంకా అదే మూసలో ఎస్సై పాత్రనే చూపిస్తున్నారు. ఏ కథకైనా ఎస్సైనే. మామూలు పోలీస్ స్టేషన్నుంచి పోలీస్ శాఖలో ఇంకో  విభాగమైన క్రైం బ్రాంచ్ ని తెరపైకి తేవడం లేదు. ఆనాటి డిటెక్టివ్ నవలల్లో డిటెక్టివ్ కి సాయంగా పోలీస్ డిటెక్టివ్ పాత్ర వుండేది. కొమ్మూరి నవలల్లో డిటెక్టివ్ యుగంధర్ పాత్రకి పోలీస్ డిటెక్టివ్ పాత్ర - డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ స్వరాజ్య రావు పాత్ర. సినిమాల్లోకి మాత్రం ఈ సాంఘిక మూలలున్న, ప్రేక్షకులు గుర్తించగల్గే, పోలీస్ డిటెక్టివ్ పాత్రలు దిగిరాలేదు. డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ అనే పాత్ర సినిమాల్లో ఎక్కడా చూడం. ప్రభుత్వ డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్లని వదిలేసి, ఎవరో ప్రైవేట్ డిటెక్టివ్ లంటూ తాతల కాలం నాటి షెర్లాక్ హోమ్స్ ని కాపీ కొడుతూ కృతకంగా తీస్తారట.

        ఈ వ్యాసంలో క్రైం జానర్లో సబ్ జానరైన మిస్టరీ (డిటెక్టివ్) తో, క్రైం జానర్లోనే ఇంకో సబ్ జానరైన క్రైం థ్రిల్లర్ (పోలీస్ డిటెక్టివ్) తోనూ వున్న లాభ నష్టాలు తెలుసుకున్నాం. వచ్చే వ్యాసంలో మిస్టరీని వదిలేసి, క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాదల్ని విపులంగా చూద్దాం.

సికిందర్


15, ఏప్రిల్ 2021, గురువారం


       సైకాలజీ, సినిమా కథ వేర్వేరు ప్రక్రియలు. సైకాలజీ ఆధారంగా సినిమాలు తీస్తే  సినిమాలు ఇంకో రూపంలోకి మారతాయి. శివ నే తీసుకుని సైకాలజీ ఆధారంగా తీస్తే ఇంకోలా వుంటుంది. ఇదెలాగో తర్వాత చూద్దాం. ముందు జీవితంలో సమస్య ఏదైనా ఎదురైతే, ఆ సమస్యని అక్కడితో మర్చిపొమ్మంటుంది సైకాలజీ. మర్చిపోయి పరిష్కారం మీదికెళ్ళి పొమ్మంటుంది. సమస్య వస్తే దానికి కౌంటర్ గా పరిష్కారాన్ని పెట్టాలి. ఇలా గాకుండా సమస్య గురించే ఆలోచిస్తూ, ఆందోళన చెందుతూ వుంటే, సమస్యతోనే వుండిపోతారు. దీంతో ఆ సమస్య మరిన్ని సమస్యలకి దారితీస్తుంది. ఇంకేవో బాధలు చుట్టు ముడతాయి, మైండ్ చెడుతుంది, మానసిక సమస్యలొస్తాయి. అన్నం సయించదు, నిద్రపట్టదు. ఇక అసహనం కోపం అరుపులూ వగైరా ఆడియో విజువల్ ఎఫెక్ట్సు, హాస్పిటల్ బెడ్ అదనపు హంగులు- ఇదంతా అవసరమా? ఇదంతా లో- వైబ్రేషన్ యాక్టివిటీ. ఈ లో- వైబ్రేషన్స్ ని చుట్టూ వున్న వాళ్ళకి కూడా అంటించేస్తారు. కనుక ఏం చేయాలంటే, సమస్యతో ఫలానా ఈ పరిస్థితి వచ్చింది సరే, ఇక దాన్ని వదిలేసి, ఇలా కాక ఏ పరిస్థితి వుంటే బావుంటుందని కోరుకుంటున్నారో - ఆ పరిస్థితిని విజువలైజ్ చేసుకుని, వెంటనే దాని సాధనకి యాక్షన్లోకి దిగి పొమ్మంటుంది సైకాలజీ. ఇది హై వైబ్రేషన్ యాక్టివిటీ. మైండ్ అనేది ముందుకెళ్ళే యాక్షన్ కోసమే తప్ప, జడంగా వుండే బాధ కోసం కాదు, దాంతో మానసిక, శారీరక అనారోగ్యాలు తెచ్చుకోవడం కోసం కాదు.  

        అందుకని మైండ్ ని ఎలా ట్రైనప్ చేసుకోవాలంటే, సమస్య ఎదురైనప్పుడు ఫ్లాష్ లా దాని మారు దృశ్యం (పరిష్కారం) విజువలైజ్ అయిపోవాలి. విజువలైజ్ ఎందుకంటే, మైండ్ కి ఒక థాట్ వచ్చిందంటే ఇంకో థాట్ మీదికి వెళ్లిపోతుంది. నిమిషానికి 260 థాట్స్ వస్తాయి మైండ్ కి. అంత బిజీగా వుంటుంది. అందుకని సమస్యకి పరిష్కారంగా ఒక థాట్ వచ్చిందంటే, వెంటనే దాన్ని విజువలైజ్ చేసుకుంటే, మైండ్ ఆ విజువలైజ్ అయిన దృశ్యం మీద ఆగిపోతుంది. ఇక ఆ దృశ్యాన్ని ఓన్ చేసుకుని, దాన్ని సాధించే వైబ్రేషన్స్ ప్రసారం చేస్తూ ముందుకు సాగిపోతుంది. సమస్యకి పరిష్కారంగా కోరుకుంటున్న దృశ్యాన్ని కళ్ళు మూసుకుని  మైండ్ లో మైండ్ కి చూపించాలి. చూపిస్తే ఆ పరిష్కారాన్ని నిజం చేసే పని మైండ్ చూసుకుంటుంది.
***
        ఇప్పుడు సినిమా కథలో ఏం జరుగుతుందో చూద్దాం. హీరో ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గరి కొస్తాడు. అక్కడ సమస్య ఎదురవుతుంది. దాంతో పోరాటం మొదలెడతాడు. పోరాడుతూ పోరాడుతూ పోరాడుతూ పోయి పోయీ, చివరాఖరికి ఎక్కడో సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ దగ్గర, పరిష్కారం కనిపెడతాడు. ఇది ఒక రోజు నుంచి కొన్ని సంవత్సరాల కథగా వుండొచ్చు. అంటే అంత కాలం సమస్యనే పట్టుకుని మధన పడుతున్నాడన్న మాట. పరిష్కారం ఆలోచించాలని తట్టడమే లేదు ప్లాట్ పాయింట్ టూ కి వచ్చేదాకా. ఈ క్రమంలో చాలా నష్టాలు కూడా చవి చూస్తాడు.

        దీన్ని శివ  అనే యాక్షన్ లో చూద్దాం : ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర నాగార్జున జేడీని కొట్టి పడేశాక, అది మాఫియా భవానీతో సమస్యకి దారి తీస్తుంది. ఇక ఆ భవానీతో  పోరాడీ పోరాడీ, సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ దగ్గర, భవానీతో సమస్యకి పరిష్కారంగా భావానీ అనుచరుడు గణేష్ ని పట్టుకుంటాడు. ఈ పోరాటంలో ఒక మిత్రుణ్ణీ, అన్న కుమార్తెనీ కోల్పతాడు.

        దీనికి పైన చెప్పుకున్న సైకాలజీ ఆధారంగా చేస్తే? అప్పుడు ప్లాట్ పాయింట్ వన్ లో నాగార్జున జేడీని కొట్టాక, భవానీతో ఎదురైన సమస్యకి వెంటనే పరిష్కారం ఆలోచిస్తాడు. దాన్ని విజువలైజ్ చేసుకుంటాడు. బిగ్ పిక్చర్ ని చూస్తాడు. సమస్య పట్టుకుని, సమస్యతోనే వుండిపోయి, భవానీతో పిన్ టు పిన్ పోరాటం చేయడు. దూర దృష్టితో బిగ్ పిక్చర్ ని చూస్తాడు. మొత్తం నగరానికి భవానీ సమస్యని  వదిలించే పిక్చర్. దీనికి అతడి మూలాల్ని పెకిలించి వేసే నిర్ణయం. ఇందుకు గణేష్ నే పట్టుకోవాలన్న గోల్.

        అంటే సినిమాలో చూపించినట్టు ప్లాట్ పాయింట్ టూ దగ్గర, గణేష్ ని పట్టుకునే పరిష్కార మార్గమేదో ఇప్పుడే ఆలోచిస్తాడన్న మాట. అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్యకి కారణమైన జేడీని కొట్టిన సంఘటనని ఇక మనసులోంచి తుడిచేసి, గణేష్ ని పట్టుకునే పరిష్కారాన్ని విజువలైజ్ చేసుకుంటాడన్న మాట. సింపుల్ గా చెప్పాలంటే తాత్కాలికమైన ప్రెజెంట్ కోసం గాక, శాశ్వతమైన ఫ్యూచర్ కోసం ప్రయాణం సాగిస్తాడన్న మాట.
***
        నిజానికి శివ సెకండాఫ్ రెండో సీన్లో మిత్రుణ్ణి కోల్పోపోయిన నేపథ్యంలో నాగార్జున అంటాడు : "నా తప్పు నాకిప్పుడు అర్ధమవుతోంది. రౌడీయిజానికి ఎదురు తిరిగాను కానీ అదొక్కటే సరిపోదని తెలిసింది. మల్లిని చంపాడన్న కోపంతో నేను భవానీని చంపితే, వ్యక్తిగతంగా నా పగ తీర్చుకోవడమే తప్ప, ఇంకేమీ జరగదు. ఈ భవానీ కాకపోతే రేపు గణేష్ భవానీ అవుతాడు, లేకపోతే ఇంకొకడు. దీనికి సొల్యూషన్ భవానీని చంపడం కాదు, అలాటి గూండాల్ని పుట్టిస్తున్న వ్యవస్థని నాశనం చెయ్యాలి- గెలుస్తానో లేదో తెలీదు, కానీ ప్రయత్నిస్తాను" అని.

         వ్యవస్థని నాశనం చేయాలన్న బిగ్ పిక్చర్ ని ఆలస్యంగా ఇప్పుడు చూశాడు. దీన్ని సాధించే మార్గాన్ని ప్లాట్ పాయింట్ టూలో కనుక్కున్నాడు. సైకాలజీతో విభేదించి సినిమా కథల్లో పరిష్కారం ఆలస్యంగా ప్లాట్ పాయిట్ టూ దగ్గరే ఎందుకుంటుంది? ఎందుకంటే సినిమా కథలు స్పిరిచ్యువల్ జర్నీలు. ఇంకే మాధ్యమంలో కథలైనా స్పిరిచ్యువల్ జర్నీలే. స్పిరిచ్యువల్ జర్నీ అంటే మానసిక లోకపు మధనం. ప్రపంచ పురాణాల్లో కథలన్నీ  మానసిక లోకపు మధనాలే. కథలు మనిషి స్వాస్థ్యం కోసం - అంటే మానసిక శారీరక ఆరోగ్యాల కోసం మానసిక లోకపు మధనాలుగానే వుంటాయని పురాణాలు నిర్ణయించాయి. 
.
        ఇప్పుడు కూడా ఎవరు ఏ కథ రాయాలన్నా తెలియకుండా మానసిక లోకపు మధనాన్నే రాసేస్తారు. దీన్నుంచి తప్పించుకోలేరు. కథంటే మానసిక లోకం. ఏమిటా మానసిక లోకం? ఒక వెలుపలి మనసు, ఒక అంతరాత్మ, మధ్యలో అహం. ఈ మూడూ లేకుండా మానవ జాతి లేదు.

        సరే, అప్పుడు మానసిక లోకంలో అంతర్భాగంగా వుండే వెలుపలి మనసు, అంతరాత్మ, అహం - ఈ మూడూ కాన్షస్ మైండ్, సబ్ కాన్షస్ మైండ్, ఇగో లన్నమాట. అప్పుడు పురాణాల్లో, ఇతర కథల్లో, ఇవి 1. బిగినింగ్ (ఫస్ట్ యాక్ట్- కాన్షస్ మైండ్ అంటే వెలుపలి మనసు), 2. మిడిల్ (సెకండ్ యాక్ట్ - సబ్ కాన్షస్ మైండ్ అంటే అంతరాత్మ), 3. ఎండ్ (థర్డ్ యాక్ట్ - మోక్షం) గా వుంటున్నాయి. ఇక ఇగో (అహం) పురాణాల్లో స్పిరిచ్యువల్ జర్నీ చేసే పురాణ పురుషుడుగా, ఇతర కథల్లో కథానాయకుడుగా, సినిమాల్లో హీరోగా వుంటున్నారు. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ పరమార్ధం ఇదన్న మాట.

        ఇప్పుడు ఈ నిర్మాణంతో వున్న మానసిక లోకంలో ఏం జరుగుతుంది? వెలుపలి మనసులో వుండే ఇగో, అంతరాత్మలో ఎంటరై, జీవితాన్ని మధిస్తుంది. తన సమస్యకి  పరిష్కారాన్ని అంతరాత్మ నుంచి అంది పుచ్చుకుని, మధనాన్ని ముగిస్తుంది. స్క్రీన్ ప్లేలో దీన్నిలా చూస్తాం : బిగినింగ్ (వెలుపలి మనసు) లో వుండే హీరో, ప్లాట్ పాయింట్ వన్ అనే గడప తొక్కి, సమస్యని తీసుకుని, మిడిల్ (అంతరాత్మ) లోకి ఎంటరై, సంఘర్షణ చేసి, పరిష్కారంతో ప్లాట్ పాయింట్ టూ అనే వెనుక గడప తొక్కి, ఎండ్ లోకి అడుగుపెట్టి  విజయం సాధించడం.

        రాముడు అయోధ్యలో వుండడం బిగినింగ్, అడవుల కెళ్ళడం మిడిల్, రావణుణ్ణి సంహరించడం ఎండ్. అంటే మిడిల్లో పాత్ర ఎందులోనైతే ప్రవేశిస్తుందో, ఆ మిడిల్ అంతా సబ్ కాన్షస్ (అంతరాత్మ) వరల్డే. ప్రేమికుల మధ్య సమస్య వచ్చిందంటే, ఆ సమస్య వాళ్ళు మధించాల్సిన సబ్ కాన్షస్ వరల్డ్. పోలీసు హంతకుణ్ణి పట్టుకోవాలంటే ఆ వేట అంతా సబ్ కాన్షస్ వరల్డ్. ఒక్కడు లో మహేష్ బాబు భూమికని తెచ్చి గదిలో దాచాడంటే, ఆ గది సబ్ కాన్షస్ వరల్డ్. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ కోర్టులో కేసు పోరాడుతున్నాడంటే ఆ కోర్టు సబ్ కాన్షస్ వరల్డ్. హార్రర్ సినిమాల్లో భూత్ బంగళా సబ్ కాన్షస్ వరల్డ్. పాత్ర వుంటున్న సాధారణ ప్రపంచం లోంచి, ఏ అసాధారణ లోకంలోకి ఎంటరైనా, అది సబ్ కాన్షస్ వరల్డే అవుతుంది.

        ఈ అంతరాత్మ లేదా సబ్ కాన్షస్ వరల్డ్ లో పాత్ర సమస్యతో పోరాటం చేస్తుంది. సమస్య రూపంలో అంతరాత్మ పాత్రకి పరీక్షలు పెడుతుంది. ఈ పరీక్షలు నెగ్గే ఉపాయాలూ అందిస్తుంది. ఈ పరీక్షలతో పాత్ర పడుతూ లేస్తూ ప్రయాణిస్తూంటుంది. ఇదే హీరోస్ జర్నీ అయింది. జీవితం గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలే ఈ జర్నీ. తెలుసుకున్న తర్వాత సమస్యలోంచి బయట పడే పరిష్కార మార్గం లేదా అమృత భాండం అంతరాత్మ అందిస్తుంది. ఈ పడుతూ లేస్తూ చేసే జర్నీలో ఒక్కో మజిలీ వుంటుంది. ఒక్కో మజిలీలో ఒక్కో సత్యాన్ని తెలుసుకుంటుంది పాత్ర.

        ఇందుకే సుఖాంతమో దుఖాంతమో జర్నీ చివర పరిష్కార మార్గంతో కథలన్నీ స్పిరిచ్యువల్ జర్నీలే. హాలీవుడ్ తీసినా ఇంతే. ఇందుకే శివ లో నాగార్జునకి ప్లాట్ పాయింట్ టూ దగ్గర మాత్రమే పరిష్కారం దొరికింది. ఇందుకే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, సమస్యతో బాటు బిగ్ పిక్చర్ ని చూసే పరిష్కార మార్గం అందక, పరీక్షలెదుర్కొంటున్న జర్నీలో భాగంగా, ఆలస్యంగా - సెకండాఫ్ సెకండ్ సీను మజిలీలో - ఇక వ్యవస్థని నాశనం చేయాలన్న బిగ్ పిక్చర్ ని చూడగలిగాడు నాగార్జున.
***
    ఇలా అంతరాత్మని తెలుసుకునే జర్నీగా స్పిరిచ్యువల్ కథలుంటాయి. కానీ సైకాలజీ ప్రకారం చూస్తే, కథకి అంతరాత్మని తెలుసుకునే స్పిరిచ్యువల్ జర్నీ అనేది  వుండదు. రోగం, దానికి తక్షణ ట్రీట్మెంట్ అన్న ప్రక్రియగానే వుంటుంది. వెళ్ళి ధ్యానం చేసి నీ అంతరాత్మని తెలుసుకొమ్మని సైకియాట్రిస్టు పంపడు. కనుక సైకాలజీ ప్రకారం చూస్తే,  శివ లో నాగార్జున భవానీతో రోగాన్ని చూస్తాడు. ఆ రోగానికి కారణమైన వ్యవస్థ మూలాల్ని నిర్మూలించడానికి గణేష్ ని పట్టుకునే ట్రీట్ మెంట్ ప్రారంభిస్తాడు. ఇలా కథ మారిపోతుంది. మరి శివ లో వున్న ప్లాట్ పాయింట్ టూ నుంచి గణేష్ ని ఇవతలికి లాగేస్తే, సైకాలజీ ప్రకారం ప్లాట్ పాయింట్ టూలో ఏం జరుగుతుంది? ఇది కథ చేస్తూంటే తెలుస్తుంది.

        సరే, మరి త్రీయాక్ట్స్ స్పిరిచ్యువల్ జర్నీ స్క్రీన్ ప్లేని ఇలా మార్చడం ఎంతవరకు సబబు? అసలిప్పుడున్న త్రీయాక్ట్స్ స్పిరిచ్యువల్ జర్నీ స్క్రీన్ ప్లే ఒకప్పుడు లేదు. పురాణాల్లోంచి వచ్చిన మోనోమిత్ (స్పిరిచ్యువల్ జర్నీ) స్క్రీన్ ప్లేల్లో 18 మజిలీలు వుండేవి. దీన్ని సీడ్ ఫీల్డ్ 5 కి కుదించి స్పీడు పెంచాడు. అంతమాత్రాన స్క్రీన్ ప్లేలు కథతో సైకోథెరఫీ చేసే మోతాదు ఏమీ తగ్గలేదు. సైకాలజీ ప్రకారం కథ చేసినా సైకో థెరఫీతోనే వుంటుంది. అంటే స్పిరిచ్యువల్ జర్నీ వుంటుంది. కాకపోతే ఈ స్పిరిచువల్ జర్నీ సమస్యతో వుండదు, రివర్స్ లో నేరుగా పరిష్కారంతో వుంటుంది.  
***
        సైకాలజీ ప్రకారం వున్న ఒక కథ చూద్దాం. నాగార్జున నటించిన మన్మథుడు 2 లో నాగార్జున సమస్య వాళ్ళమ్మ లక్ష్మి పెట్టిన మూడునెలల్లో పెళ్ళి చేసుకోవాలన్న డెడ్ లైన్. పెళ్ళి ఇష్టం లేని నాగార్జున దీన్నుంచి తప్పించుకోవడానికి మార్గం (పరిష్కారం) ఆలోచించి, రకుల్ ప్రీత్ సింగ్ తో కాంట్రాక్టు కుదుర్చుకుంటాడు. దాని ప్రకారం ఆమె పెళ్ళికి ఒప్పుకున్నట్టు నటించి, తీరా పెళ్ళి సమయంలో లేకుండా ఉడాయిస్తే, వాళ్ళమ్మ మళ్ళీ పెళ్ళి మాటెత్తదని ప్లాను. ఇలా సమస్యకి వెంటనే పరిష్కారం కనుక్కుని రంగంలోకి దిగుతాడు నాగార్జున. ఇది ఫెయిలైతే ప్లాన్ బి ఆలోచిస్తాడు. ఇలా ట్రయల్స్ వేస్తాడు. ఈ ట్రయల్స్ లో ప్రత్యర్ధి పాత్ర లక్ష్మి గల్లంతయి కథ విఫలమవడం వేరే విషయం. ట్రయల్స్ తో నాగార్జున చేసేది స్పిరిచ్యువల్ జర్నీయే. ఈ అర్ధాన్ని పట్టుకుని కథ చేసి వుండాల్సింది.

        స్పిరిచ్యువల్ జర్నీలే సినిమా కథలు. చదువుకోకుండా ఆవారాగా తిరిగే హీరో వుంటాడు. అతడితో ఇంట్లో గొడవ. అతను మారడు. అతణ్ణి ఇంట్లోంచి వెళ్ళి పొమ్మనడమో లేదా అతనే వెళ్ళి పోవడమో జరిగి, ఇక స్పిరిచ్యువల్ జర్నీ చేస్తాడు. మంచి చెడ్డలు తెలుసుకుని మారిన మనిషిగా తిరిగొస్తాడు.

        సైకాలజీ కథ - ఆవారా హీరోని ఇంట్లో ఏమీ అనరు. బాగా చదువుకుంటున్నాడు, బయటి తిళ్ళు తినడం లేదు, తాగి ఇంటికి రావడం లేదు, టైముకి కాలేజీకి వెళ్తున్నాడు, టైముకి ఇంటికే వస్తున్నాడు - ఇలా పాజిటివ్ వైబ్రేషన్స్ తో మనస్సులోనే ఆశీర్వదిస్తూంటారు. అతడిలో మార్పు కనబడతూంటుంది. ఆశీర్వాదానికుండే వైబ్రేషన్స్ అత్యంత శక్తివంతమైనవి. అందుకే గ్లాడ్ బ్లెస్ యూ అంటారు.

సికిందర్  

 

14, ఏప్రిల్ 2021, బుధవారం

1035 : స్క్రీన్ ప్లే సంగతులు


 

        గాది శుభాకాంక్షలు. సినిమాలెలా వుండాలో థియేటర్లు నిర్ణయించడంతో ఒక మూసలో కమర్షియల్ సినిమాలదే రాజ్యమైంది. దీంతో ఆర్ట్, రియలిస్టిక్, ఇండిపెండెంట్ సినిమాలనే ఇతర క్రియేటివ్ వ్యాపకాలకి ప్రదర్శనా రంగంలో చోటు లేకుండా పోయింది. గత రెండు దశాబ్దాలుగా మరీ థియేటర్లు ప్రేక్షకులంటే మూస ప్రేక్షకులేనని ముద్రవేసి, సినిమాలంటే మూస కమర్షియల్ సినిమాలేనని చెప్పడం వల్ల, మూసేతర సినిమాలు తీయాలనుకునే మేకర్స్ కి ప్రేక్షకులు కరువై పోయారు. దీంతో కె ఎన్ టీ శాస్త్రీలు, రాజేష్ టచ్ రివర్లు ఆర్ట్ సినిమాలతో ఫిలిమ్ ఫెస్టివల్స్ కి పరిమితమవాల్సి వచ్చింది. డాక్టర్ డి రామానాయుడు కూడా కమర్షియల్ సినిమాలు తీస్తూ మధ్య మధ్యలో అవార్డు సినిమా తీస్తాననేవారు. ఇదేదో మనకి సంబంధించింది కాదులే అనుకునే వాళ్ళు ప్రేక్షకులు. ఆర్ట్ సినిమా అంటే ప్రేక్షకులకి అంటరాని సినిమాగా అభిప్రాయం కల్గించారు. కోవిడ్ తో మనుషులే అంటరాని వాళ్ళయి, లాక్ డౌన్ తో థియేటర్లే మూతబడి, అవ్వాల్సిందంతా అయింది. లాక్ డౌన్ తో తెలుగు జాతి సామూహికంగా ఇళ్ళల్లో బందీ అయి, ఓటీటీల్లో నిర్బంధంగా సినిమాలు చూస్తున్నాక, ఆ ఓటీటీల్లో జీవితాలకి దగ్గరగా వుంటున్న వివిధ ఆర్ట్ -రియలిస్టిక్- ఇండిపెడెంట్ సినిమాల విలువ తెలిసి వచ్చింది. వచ్చాక వరస మారి చిన్న మూసకి ఎసరు వచ్చింది. చిన్న మూస ఒక ముంగిస.

        ప్పుడిక థియేటర్లకీ స్వేచ్ఛ లభించి, మూస తో బాటూ మూసేతర సినిమాలూ ప్రదర్శించుకునే అవకాశం చిక్కింది. అయితే మూసేతర రియాలిస్టిక్, ఇండిపెండెంట్ సినిమాలనేవి దాదాపూ చిన్న సినిమాలుగానే వుంటాయి. తెలుగులో నూటికి 90 శాతం  చిన్న సినిమాలే ఉత్పత్తి అవుతున్నాయి, అట్టర్ ఫ్లాప్ కూడా అవుతున్నాయి. అందుకని  వీటి బాగోగుల గురించే పదే పదే చెప్పుకునేది. ఇంత కాలం చిన్న మేకర్లు చిన్న మూసలు తీస్తూ మూసకి మూసన్నర మోసపోయారు. పెద్ద మూసని స్టార్ కాపాడతాడు. చిన్న మూసని ఎవరూ కాపాడ లేరు. అయినా కూడా పెద్ద కమర్షియల్ మూసలకి భావ దాస్యం చేస్తూ, చిన్న మూస అంటే పెద్ద మూసగానే తీయాలేమో ననుకుని తీస్తూ, ఏడాదికి 100 మంది చొప్పున కొత్త మూస మేకర్లు రావడం, ఫ్లాప్ చేసుకుని వెళ్లిపోవడం.

      ఐనా కూడా ఇప్పుడింకా పద్ధతి మార్చుకుని రియలిస్టిక్, ఇండిపెండెంట్ సినిమాలకి చిన్న మేకర్ సిద్ధం కాకపోతే - పూర్వంలాగే థియేటర్ కి ఎలాగూ పనికి రాడు, ఇప్పుడు ఓటీటీకి కూడా దూరమవాల్సి వస్తుంది. గత వారం ఇంకొకటి గమనించాం. తెలుగు వాడైన ప్రభాస్ పానిండియా మూవీస్ తో ఆలిండియా స్థాయిలో తెలుగుకి కొత్త గుర్తింపు తెస్తున్నప్పుడు, ఈ అవకాశంతో చిన్న సినిమాలైనా పానిండియా కంటెంట్ తో తీసి -మార్కెట్ పెంచుకో వచ్చని గత వారం వ్యాసంలో రాశాం. ఇలాటివి గమనించాల్సినవి వున్నాయి.       

ఎవరు గమనిస్తున్నారు
, ఎవరూ గమనించడం లేదు. పరిస్థితి ఎప్పట్లాగే వుంది. లాక్ డౌన్ కి ముందు తలపెట్టిన చిన్న మూసలు ఇప్పుడెలాగూ విడుదలవుతాయి, అవుతున్నాయి. ఈ పోగు పడిన బ్యాక్ లాగ్ ని అర్ధం జేసుకోవచ్చు. కానీ లాక్ డౌన్ తర్వాత మారిన సినేరియాలో కూడా అవే చిన్న మూసలు ఇంకా ప్రారంభిస్తున్నారంటే, ఇక ఫ్రెష్ గా మారేది లేదన్న మాట.

        లిస్టు సేకరిస్తే కనీసం ఇప్పటికి ఓ ముప్ఫై చిన్న మూసలే తీస్తున్నట్టు తేలింది. కొందరు రియలిస్టిక్ ఔత్సాహికులు తాము విన్న, కన్న చిన్న మూస తయారీ దృశ్యాలు చెప్పుకుని వాపోతున్నారు. నిన్న ఉగాదికి ఒక రియలిస్టిక్ ఔత్సాహికుడు ప్రారంభమవుతున్న రెండు చిన్న మూసల గురించి చెప్పుకుని, వీటికేనా ఉగాది, మాకు లేదాని వాపోయాడు. నిన్ననే ఔట్ డోర్ లొకేషన్లో వున్న ఒక సీనియర్ అసోసియేట్ ఫోన్ చేసి, లొకేషన్లో పరిచయమైన ఒక ఔత్సాహిక నిర్మాత ఎంత చెప్పినా మూస గురించే ఐడియాలు చెప్తున్నాడని అప్డేట్స్ ఇచ్చాడు. అంటే మేకర్స్ ఒకరే మారితే లాభం లేదనేది కూడా ఒక వాస్తవమే.

***

      మండేలా సంక్షిప్త స్క్రీన్ ప్లే సంగతులకి ఈ ఉపోద్ఘాతం అవసరమవుతోంది. పర్యావరణం తెలుసుకోకుండా స్క్రీన్ ప్లే సంగతుల పరమార్ధం అర్ధంగాదు. ఓటీటీలతో పర్యావరణం మారింది. ఆ పర్యావరణంలో తెలుగు ప్రేక్షకులున్నారు, తెలుగు మేకర్స్ కూడా వుంటే బావుంటుంది. లేదంటే పర్యావరణ కాలుష్య కారకులవుతారు. మళ్ళీ చిన్న సినిమాలకి అంధకారమే సృష్టిస్తారు. అనేకులు ఈ పర్యావరణాన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ సీజన్ అనుకుంటున్నారు. వీటిని రియలిస్టిక్ గా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా మూస ఫార్ములాలుగానే వుంటున్నాయని తెలుసుకోవాలి. రియలిస్టిక్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్సే కాదు, సీరియస్ రాజకీయ, సామాజిక సమస్యలే కాదు; ప్రేమ, కుటుంబం, హాస్యం లాంటివి కూడా రియలిస్టిక్సే అవుతాయి. కాకపోతే వీటికి మూసని వదిలించి రియలిస్టిక్ జానర్ మర్యాదలు కూర్చాలి.

        ఈ రియలిస్టిక్ జానర్ మర్యాదలు నిజ జీవితం లోంచి వస్తాయి. మంచి జ్ఞాపక  శక్తితో మంచి కల్పనా శక్తి వస్తుందంటాడు అకిరా కురసావా. జ్ఞాపక శక్తి లోక జ్ఞానంతో  పెరుగుతుంది. వివిధ రంగాలకి సంబంధించిన జీకేతో ఎంత మెమరీ బ్యాంకు వుంటే అంత కల్పనా శక్తి పెరుగుతుంది. ఉదాహరణకి మండేలా లో పోస్టాఫీసు సీనులో వెనుక గుమ్మం లేకపోవడం, ముందు తలుపు వూడిపోవడం, ఈ రెండిటిలో మండేలా పాత్ర రీత్యా ఒక అనుమానం, ఒక భయం పైకి కనిపించి నవ్విస్తాయి. అనుమానం - బార్బర్ గా తను ఇళ్ళల్లోకి వెనుక గుమ్మం లొంచే వెళ్ళాలి కనుక, పోస్టాఫీసులోకి కూడా వెనుకనుంచే వెళ్ళాలనుకుని, వెనుక గొడకేసి అలా అనుమానంగా చూడడం.

        భయం - ముందు తలుపు వూడి పడగానే ఇక్కడ డబ్బులు దాస్తే వుంటాయా అని భయపడతాడు. ఇవి పైకి నవ్వించినా, ఒక అంతరార్ధం ఈ నవ్వుకి బేస్ వేసింది. పోస్టాఫీసుల్లో డిపాజిట్లు రిస్కులో వున్నాయనేది ఒక యదార్ధం. వెనుక నుంచి దొంగలు పడకుండా కట్టుదిట్టంగా వున్నా, ముందునుంచి దర్జాగా నిధులు తరలి పోతున్నాయి- ఎక్కడికి? దివాలా తీసిన ఎఫ్సీఐ కి. ఈ నిధులు మౌలిక సదుపాయాలకీ,ఇతర రాబడి నిచ్చే పెట్టుబడులకీ వెళ్ళాల్సినవి. ఈ పోస్టాఫీసు సీను వెనుక తెలియకుండా ఇంత వాస్తవముంది.

        ఇంకో సీను కూడా వుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్నదమ్ముల్ని గెలిస్తే ఏం చేస్తారని అడిగితే, ప్రతి ఒక్కరి అక్కౌంట్ లో 15 వేలు వేస్తాననని అన్న అంటాడు, 20 వేలు వేస్తానని తమ్ముడు అంటాడు. ఈ సెటైర్ ఎక్కడ్నించి వచ్చిందో తెలిసిందే.

        ఇంకో సీనులో మెండేలా ఓటు కోసం వేలం పాడతారు అన్నదమ్ములు. ఇది పెరిగి పెరిగి 50 లక్షల దాకా పోతుంది. అప్పుడు ఎన్నికల అధికారి వచ్చి, నామినేషన్లతో బాటు వేసిన అఫిడవిట్లని చూపిస్తూ - ఇందులో మీ ఆస్తి 50 వేలని రాశారు, 50 లక్షలు ఎక్కడ్నించీ వచ్చాయనీ పట్టుకుంటాడు. ఇలా లోక వ్యవహారాలు రిఫ్లెక్ట్ అయ్యే, ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యే కామెడీ. రియలిస్టిక్ జానర్ మర్యాద. ఇది లోక జ్ఞానంతోనే వస్తుంది.

***

      అయితే - అయితే - ఈ పర్యావరణానికి స్ట్రక్చర్ లో వున్న సినిమాలే అవసరం. సీను మారింది కదాని లాక్ డౌన్ లో పుట్టిన రియలిస్టిక్, ఇండిపెండెంట్లని కూడా అలవాటైన అదే మూసలో స్ట్రక్చర్ లేకుండా తీస్తే మళ్ళీ మొదటి కొస్తారు. ఈ మధ్య ఒక రియలిస్టిక్ స్క్రిప్టుతో ఇదే జరిగింది. రాసుకున్న 70 సీన్లలో 13 సీన్లే ప్రధాన కథ వుందని తెలుసుకోకుండా షూటింగు కెళ్ళి పోతున్నారు! హీరోహీరోయిన్లని బుక్ చేసుకునేప్పుడైనా ఎన్ని సీన్లున్నాయో చూసుకోలేదా అంటే, షాకులోంచి తేరుకో లేక సమాధానం లేదు. ఇంకా ఇలాటి విచిత్రాలున్నాయి. స్ట్రక్చర్ తో చేస్తే ఏదెలా వస్తోందో తెలుస్తూంటుంది, ఎక్కడెక్కడ ఏది రాకపోయినా వివిధ టూల్స్ తో సరిదిద్దుకోమని హెచ్చరిస్తూంటుంది. మూసకేం టూల్స్ వుంటాయి. మూస పనిముట్లు లేని గోస.

        కనుక స్ట్రక్చర్ సహిత స్టోరీ రైటింగ్ - కాదు, స్టోరీ మేకింగ్ అనాలి - ఇష్టపడని క్లబ్ ని అలా వుంచి, స్ట్రక్చర్ క్లబ్ లో మాట్లాడుకుంటే, మారిన సినేరియాలో రియలిస్టిక్స్ ని మళ్ళీ అవే పనీ పాటా లేని, పనిముట్లు లేని మూసలుగా తీస్తే లాభం లేదు. దేనికైనా త్రీయాక్ట్ స్ట్రక్చర్ వాడాల్సిందే. 50 లక్షల సినిమా స్క్రీన్ ప్లే అన్నాకూడా త్రీయాక్ట్ స్ట్రక్చరే గతి. లేకపోతే పైన చెప్పుకున్న Friday the 13th లాంటి భయపెట్టే సంగతి పదమూడు సీన్లతో.

***

    ఐతే- ఐతే-  త్రీయాక్ట్ స్ట్రక్చర్ తో ఒప్పుకు తీరాల్సిన నిజం ఒకటుంది. ఇది కూడా ఒక మూసే. స్ట్రక్చర్ పరంగా పరమ మూస. ఎలాగంటే, అదే ఫస్ట్ యాక్ట్, ఫలానా చోట అదే ప్లాట్ పాయింట్ వన్, అదే సెకండ్ యాక్ట్, ఫలానా చోట అదే ప్లాట్ పాయింట్ టూ, అదే థర్డ్ యాక్ట్... అనే ఈ యూనివర్సల్ స్ట్రక్చర్ ని ఇలాగే ఒక టెంప్లెట్ లా వాడుకుంటూ, పదేపదే అదే మోడల్ కథలు. ఇలా ఒక మోడల్లోనే ఏళ్ళ తరబడి సినిమాలొస్తున్నాయి హాలీవుడ్ నుంచి కూడా.

        కమర్షియల్ సినిమాలకిది తప్పదు. స్టార్స్ తో మరీ తప్పదు. ప్రయోగాలు చేయలేరు. కానీ రియలిస్టిక్స్ తో స్వేచ్ఛ వుంది. ఇక్కడ స్టార్స్ వుండరు. ఇప్పుడు రియలిస్టిక్ కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమానే కాబట్టి స్వేచ్ఛకి ఆంక్షల్లేవు. త్రీయాక్ట్ స్ట్రక్చర్ అనివార్య పరిస్థితి. ఇది వినా కథా నిర్మాణం లేదు సినిమాలకి. ఐతే ఈ స్ట్రక్చర్ ని పట్టుకుని క్రియేటివ్ పరికల్పనలని మర్చి పోవడం వల్లే స్ట్రక్చర్ మూస అయింది. స్ట్రక్చర్ ని ఫాలో అవుతూనే, ఆ సురక్షిత స్ట్రక్చర్ లోపల కథనంతో క్రియేటివ్ ప్రయోగాలు చేయక పోవడం వల్లే త్రీయాక్ట్ స్ట్రక్చర్ నిర్మాణాత్మక మూస అయింది. ఈ ప్రయోగాలు చేసుకునే స్వేచ్ఛ రియలిస్టిక్స్ తో కచ్ఛితంగా వుంది. ఇదే హిట్టయిన  పింక్ చెప్పింది (తెలుగు రీమేక్ లో కాదు), ఇదే హిట్టయిన మండేలా ఇప్పుడు చెప్తోంది...

***

    ఈ కొత్త తమిళ దర్శకుడు మండేలా అనే రియలిస్టిక్ తో రాత కనబడే సినిమా తీశాడు. రియలిస్టిక్స్ లో కూడా రాత కనపడక, తీత మాత్రమే కనబడే వొట్టి పోయిన సినిమాలు తీసేవాళ్ళే ఎక్కువ. మండేలా లో స్టార్ట్ టు ఫినిష్ ఆధునిక రాతే. అంత ఆధునిక రాత వల్ల ఇంత అందమైన సినిమా అయింది. అది కూడా స్ట్రక్చర్ తెలిసిన రాత. స్ట్రక్చర్ లోపల కథనంతో ప్రయోగం ఎలా చేయాలో తెలిసిన రాత. ఏమిటా ప్రయోగం ఎవరైనా కనిపెట్టారా?

        మండేలా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లో 30 నిమిషాల్లో ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. ఇది స్ట్రక్చర్ సమయ పాలనే. ఐతే ఇది రొటీనే. కొత్తేం లేదు. మరి రొటీన్ కాని కొత్తేమిటి? ఈ ప్లాట్ పాయింట్ వన్ రివర్సై  హీరో మండేలా మీద లేక పోవడమే కొత్త. ఇది గమనించాల్సిన విషయం. హీరో మీదే ప్లాట్ పాయింట్ వన్ వుండడం సర్వసాధారణం. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకే సమస్య ఎదురవడం, హీరోకే గోల్ ఏర్పడడం రొటీనే. ఈ రొటీన్ తోనే ఒకే మోడల్ కథలు వస్తూంటాయి.

        దీన్ని రివర్స్ చేసి హీరో మీద గాక విలన్ల మీద పెట్టాడు దర్శకుడు. ఇదే స్టార్ మీద కాక విలన్ మీద పెడితే స్టార్ డీలా అయిపోయి కన్పిస్తాడు. స్టార్ లేని రియలిస్టిక్ లో ఇలాంటప్పుడు హీరో ఆసక్తి కల్గిస్తాడు. ప్లాట్ పాయింట్ వన్ నుంచి పలాయనంలో వున్న ఈ రియలిస్టిక్ హీరో ఇప్పుడేం చేస్తాడన్న ఆసక్తి. తన ప్లాట్ పాయింట్ వన్ ని విలన్లు కబ్జా చేశారు. ఇప్పుడు స్ట్రక్చర్ లో తానేం క్లెయిమ్ చేస్తాడు? ఏ తురుపు ముక్క ప్రయోగించి ప్లాట్ పాయింట్ వన్ కాకపోయినా, స్ట్రక్చర్లో తనకంటూ ఓ కీలక స్థానాన్ని క్లెయిమ్ చేస్తాడు? స్ట్రక్చర్ తో ఆసక్తికర క్రియేటివిటీ.  

        విలన్లయిన అన్నదమ్ములు ఎన్నికల్లో ఒకరిమీద ఒకరు పోటీకి దిగడాన్ని ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంగా చేశాడు. కథ కోసం ఇక్కడ క్లిక్ చేసి రివ్యూ చూడండి. ఇంతవరకూ ఈ బిగినింగ్ విభాగమంతా కథనం అన్నదమ్ముల మీదే వుంచాడు. హీరో అయిన మండేలాని పట్టించుకోలేదు. ఈ బిగినింగ్ విభాగమంతా బలహీనుడైన మండేలా మీద గాక, బలవంతుల మీద వాళ్ళ తగాదాలకి సంబంధించిన కథనం చేసి, ప్లాట్ పాయింట్ వన్ కి చేర్చాడు. ఈ విలన్ల గొడవతో సంబంధం లేకుండా మండేలాని బార్బర్ జీవితానికి పరిమితం చేశాడు.

        అలాగని మండేలాని పాసివ్ చేయలేదు. అతడికి తండ్రి కల సెలూన్ నిర్మించాలన్న గోల్ పెట్టి, యాక్టివ్ పాత్రగానే చేశాడు. ఇది గమనించాలి. టూల్స్ తో స్ట్రక్చర్ లో వుంటే ఫ్లాపయ్యే పాసివ్ హీరో క్యారక్టర్లు తయారు కావు. పనిముట్లు లేని మూసలోనే ఇలాటివి తయారవుతాయి. మరిప్పుడు ప్లాట్ పాయింట్ వన్ విలన్ల చేతి కెళ్ళిపోయాక మండేలా చేసేదేమిటి? ఇది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఆ మాటకొస్తే ఈ సినిమా చివరంటా మండేలా సస్పెన్స్ తో కూడిన క్యారెక్టరే. ఏం చేస్తాడో తెలియదు, చేసినప్పుడే తెలుస్తుంది.

        విలన్ల గోల్ కి ఒక్క ఓటు కావాలి. మండేలా గోల్ కి సెలూన్ నిర్మించుకోవాలి. ఒక ఒరలో రెండు కత్తుల్లాంటి ఇదేం కథ? ఏ కథ ఏ కథగా మారుతుంది? విలన్ల ఓటు కథ మండేలా సెలూన్ కథగా మారుతుందా? మండేలా సెలూన్ కథ విలన్ల ఓటు కథగా మారిపోతుందా?

***

    విలన్లతో ప్లాట్ పాయింట్ వన్ తర్వాత ప్రారంభమయ్యే సెకండ్ యాక్ట్ లో విలన్లతో, మండేలాతో విడివిడిగా వాళ్ళ వాళ్ళ సెకండ్ యాక్ట్ బిజినెస్సే వుంటుంది. సెకండాఫ్ బిజినెస్ అంటే గోల్ కోసం సంఘర్షణ. ఒక అదనపు ఓటు ఎలా పొందాలన్న గోల్ తో విలన్ల విడివిడి సంఘర్షణ, మరో వైపు- సెలూన్ కోసం డబ్బు పొదుపు చేసే గోల్ తో మండేలా వేరే సంఘర్షణ. కొంపా గోడూ లేని తన దగ్గర కొందరు డబ్బు కొట్టేస్తే, మిగిలిన డబ్బు దాచుకోవడానికి పోస్టాఫీసులో ఖాతా తెరవడానికి పోవడం, అక్కడ తన పేరేమిటో తనకి తెలియక పోతే తెలుసుకు రమ్మని పోస్ట్ మాస్టర్ పంపడం, తన పేరు తెలుసు కోవడానికి వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతూ మండేలా హిలేరియస్ గా స్ట్రగుల్ చేయడం...ఇలా చివరికి పోస్ట్ మాస్టరే నెల్సన్ మండేలా అని పేరు పెట్టడంతో - ఆ పేరుతో ఆధార్ కార్డు తెచ్చుకుని ఖాతా తెరవడం, ఆధార్ కార్డు రావడంతో ఓటరు ఐడీ కార్డు కూడా వచ్చి- ఒక అదనపు ఓటరు కోసం చూస్తున్న అన్నదమ్ములకి ఇంటర్వెల్లో చిక్కడం!

        వెర్రి బాగుల వాడు అయిన తను తెలియకుండానే వెళ్ళి వెళ్ళి సంబంధం లేని కథలో ఓటరు కార్డుతో విలన్లకి చిక్కి కింగ్ అయిపోవడం, వాళ్ళ కథలో తన స్థానమేమిటో స్ట్రక్చరల్ గా క్లెయిమ్ చేసుకుని పాగా వేయడం!
***
        స్ట్రక్చర్ తో రియలిస్టిక్ కథకి ప్రయోగమిది. స్ట్రక్చర్ తెలియకపోతే ఎలా ప్రయోగాలు చేయాలో తెలీదు. కాబట్టి ఇప్పటికైనా అకారణంగా స్ట్రక్చర్ ని వ్యతిరేకించే తెలుగు మేకర్స్, పర్యావరణానికి న్యాయం చేయడం కోసం పునరాలోచన చేసుకోవాలి. ఇతర భాషల మేకర్స్ కి తీసిపోకుండా ఎదగాలి.

సికిందర్