రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, జులై 2020, సోమవారం

961 : రివ్యూ!



దర్శకత్వం: ముఖేష్ ఛబ్రా
తారాగణం: సుశాంత్ సింగ్ రాజ్పుత్, సంజనా సంఘీ, సాహిల్ వేద, శాశ్వతా ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ తదితరులు

రచన: శశాంక్ ఖైతాన్, సుప్రోతిం సేన్ గుప్తా
సంగీతం: ఏఆర్ రెహ్మాన్, ఛాయాగ్రహణం: సత్యజిత్ పాండే
బ్యానర్: ఫాక్స్ స్టార్ స్టూడియోస్
విడుదల: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

***
       
త్మహత్య చేసుకుని సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి విడుదల ‘దిల్ బేచారా’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సందడి చేస్తోంది. ఇది కూడా అతడి మరణాన్ని చూపించేదే. అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదలై వుంటే దాని ప్రభావంతో మనసు మార్చుకుని ఇవ్వాళ అందరి మధ్య సజీవంగా వుండే వాడేమో. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కొత్త దర్శకుడు ‘మీటూ’ వివాదంలో ఇరుక్కోవడంతో నిర్మాణం ఆలస్యమై అనుకున్న నవంబర్ 2019 కల్లా విడుదల కాకపోవడం ఒక బ్యాడ్ లక్. 

       
అంతరిక్షం సుశాంత్ అభిమాన సబ్జెక్టు. నలభై లక్షలు పెట్టి కొన్న టెలిస్కోప్ తో నక్షత్ర లోకాలని వీక్షిస్తూ వుండేవాడు. 2016 లో ఆత్మ హత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ వేముల కూడా అంతరిక్ష అభిమానియే. ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ లాగా సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు రాయాలనుకున్నట్టు సూసైడ్ నోట్ లో రాసుకున్నాడు. నక్షత్ర లోకాలకి పయనించాలని వుందని కూడా రాసుకున్నాడు. సుశాంత్ నీ, రోహిత్ నీ నక్షత్ర లోకాలే సూదంటు రాయిలా ఆకర్షించి తీసికెళ్ళి పోయాయేమో. ఇక ‘దిల్ బేచారా’ కి ఆధారమైన పాపులర్ నవల పేరులో కూడా ‘స్టార్స్’ వుండడం (‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’) ఇంకో ఐరనీ.

        ‘దిల్ బేచారా’ లో అంతరిక్షం గురించిన ప్రస్తావన కూడా వుంది. ఆత్మహత్యకి వ్యతిరేకంగా సంభాషణ కూడా వుంది. మరణాన్ని అదుపు చేసే మంత్రం కూడా వుంది. అతడికి సరదాగా సిగరెట్ నోట్లో పెట్టుకునే అలవాటు వుంటుంది. దాన్ని ముట్టించి స్మోక్ చెయ్యడు. సిగరెట్ అంటే క్యాన్సర్. క్యాన్సర్ అంటే మరణం. ‘మారణాయుధాన్ని మన పెదాల మధ్య వుంచుకున్నా, మనల్ని చంపే శక్తిని మాత్రం దానికివ్వకూడదు’ అంటాడు. ‘జననం ఎప్పుడు, మరణం ఎప్పుడు మనం నిర్ణయించలేం, ఎలా జీవించాలో నిర్ణయించుకో గలం’, ‘మరణించాక దాంతో బాటే జీవించాలన్న ఆశ కూడా చచ్చిపోతుంది’, ‘పాట పూర్తిగా ఎందుకు లేదు? ఎందుకంటే జీవితమే పూర్తిగా వుండదు కాబట్టి’, ‘కాలుతున్న సిగరెట్ లో చంపే శక్తి వుంటుంది, దాన్నుంచి నేనా శక్తిని లాక్కున్నా’, ‘నా అంతిమ సంస్కారాల్లో నేనూ పాల్గొనాలనుకుంటున్నా’, ‘నేను గొప్ప గొప్ప కలలు గంటాను, వాటిని తీర్చుకోవాలన్న కోరిక మాత్రం కలగదు’, ‘స్ట్రాంగ్ గా వుండాలని నేననుకోవడంలేదు, నార్మల్ గా వుండాలనుకుంటున్నా’, ‘సూసైడ్ ఇల్లీగల్, కనుక బతకాలి తప్పదు’... ఇలా జీవితం గురించి ఇన్ని సత్యాలు తెలుసుకున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. 

సగం పాడిన పాట
     జీవన్మరణాలు, సంఘర్షణ, అస్తిత్వ సంక్షోభం వంటి అంశాలని తాకుతుంది ‘దిల్ బేచారా’. ప్రాణాంతక వ్యాధితో యువజంట, వాళ్ళ యంగ్ రోమాన్స్, ఎడబాటు ఈ కథ. జంషెడ్ పూర్ నేపధ్యంలో వుంటుంది. అక్కడ కిజీ బసు (సంజనా సంఘీ) థైరాయిడ్ క్యాన్సర్ బాధితురాలు. భుజాన ఆక్సిజన్ సిలండర్ తో వుంటుంది. తల్లిదండ్రులు (శాశ్వతా ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ) అండగా వుంటారు. మరణం కోసం ఎదురు చూస్తూ గడపడం తప్ప రోజంతా చేసే పనుండదు. అయితే బాధని మరిపించుకోవడానికి ఎక్కువ బయట తిరుగుతూ వుంటుంది. ఒక సింగర్ ని అభిమానిస్తూ వుంటుంది. అతను పాడిన పాట సగమే వుండడం ఆమెకి సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూంటుంది. ఆ పాట అతను పూర్తిగా ఎందుకు పాడలేదు? ఆపేసిన దగ్గర్నుంచి పాట ఎలా వుంటుంది? అతనేమయ్యాడు? ఇవి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ వుంటుంది. 

        ఊళ్లోనే ఒక షార్ట్ మూవీస్ మేకర్, ఇమ్మాన్యుయేల్ రాజ్ కుమార్ జూనియర్ అలియాస్ మానీ (సుశాంత్) వుంటాడు. ఇతను రజనీకాంత్ అభిమాని. రజనీకాంత్ ని అనుకరిస్తూ షార్ట్ మూవీ తీస్తూంటాడు. ఇంకో క్యాన్సర్ బాదితుడైన మిత్రుడు జేపీ (సాహిల్ వేద్) సహకరిస్తూ వుంటాడు. ఒక రోజు కిజీని చూసి ప్రేమలో పడిపోతాడు మానీ. వెంటపడుతున్న అతణ్ణి కిజీ వారిస్తూంటుంది. కానీ క్రమంగా తనూ ప్రేమలో పడిపోతుంది. అతను బోన్ క్యాన్సర్ బాధితుడు. 

        ఇద్దరూ పరస్పరం అర్ధం జేసుకుని ప్రేమని కొనసాగిస్తూంటారు. ఆమె తల్లిదండ్రుల ఆమోదం కూడా పొందుతారు. ఆమె అసంపూర్ణంగా వున్న పాట గురించే కాదు, ఆ సింగర్ ని కూడా కలుసుకోవా లనుకుంటోందని కూడా తెలుసుకుని, ఆమె కోరిక తీర్చడానికి పూనుకుంటాడు మానీ. ఆ సింగర్ అభిమన్యు వీర్ (సైఫలీ ఖాన్). అతను పారిస్ లో వున్నట్టు తెలుస్తుంది. అతడ్ని కలుసుకోవడానికి పారిస్ చేరుకుంటారు కిజీ, ఆమె తల్లి, మానీ. 

        అక్కడేం జరిగింది? ఆ తర్వాత ఇద్దరి ప్రేమా ఏమైంది? ఇద్దరి వ్యాధులు ఏమయ్యాయి? మరణాన్ని ఆహ్వానించారా? అతను షార్ట్ మూవీ పూర్తి చేయగలిగాడా? ఆమెకి పాట పూర్తిగా తెలిసిందా? ఆ పాటని ఎవరు పూర్తి చేశారు?...ఇదీ మిగతా కథ. 

ఎలా వుంది కథ
     ముందుగా చెప్పుకున్నట్టు ఇది బెస్ట్ సెల్లర్ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ నవలాధారం. ఇదే టైటిల్ తో హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. హాలీవుడ్ సినిమా పూర్తిగా నవలని అనుసరించి వుంది. ‘దిల్ బేచారా’ లో మార్పులు చేశారు. ముఖ్యంగా హీరోయిన్ గోల్ విషయంలో చేసిన మార్పు కనెక్ట్ కాలేదు. ఆమె సగం పాట గురించి సింగర్ ని కలుసుకోవాలన్న గోల్ తో వుంటుంది. ఇదేమీ ఆమె జీవితంలాంటి పాట కాదు కనెక్ట్ కావడానికి. నవల్లో కథ ప్రకారం అందులోని హీరోయిన్ ఒక నవల చదువుతుంది. అది తన లాంటి క్యాన్సర్ తో వున్న హీరోయిన్ కథే. ఆ నవల చివరి వాక్యాలు సగమే వుండి ముగింపు తెలియదు. దీంతో ముగింపు తెలుసుకోవడానికి అజ్ఞాతంలో వున్న రచయిత అన్వేషణలో వుంటుంది. ఇలా మరణం ముంగిట వున్న హీరోయిన్ జీవితానికి కనెక్ట్ అయ్యే పాయింటుగా ఇది వుంటుంది.


        ‘దిల్ బేచారా’ డైలాగులు కాన్సెప్టుకి తగ్గట్టుగా బాగానే వున్నాయి. కానీ కథా కథనాలు కాన్సెప్ట్ కి తగ్గ ఫీల్ ని కల్గించవు. ఫీల్ కల్గించేది చనిపోయిన వ్యక్తిగా సుశాంతే గానీ పాత్ర  కాదు. పాత్ర కంటే, సూసైడ్ చేసుకున్న సుశాంతే కన్పిస్తూంటే, బోలెడు సానుభూతీ కన్నీళ్ళతో ప్రతిస్పందించి సినిమా బావుందంటున్నారు ప్రేక్షకులు. సుశాంత్ కి వీడ్కోలు చెబుతున్న సినిమాగా ఇంతకంటే కథని విశ్లేషించడం భావ్యం కాదు. 

ఇద్దరూ ఇద్దరే
    నటుడుగా ఇంత టాలెంట్ వున్న సుశాంత్, జీవించడంలో ఆ టాలెంట్ చూపక పోవడం అతి పెద్ద విషాదం. టాలెంట్ ని ఓడించగల శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదని తెలుసుకోలేక పోయాడు. స్మైల్ అతడి చిరకాల ఎస్సెట్. ఆ స్మైల్ కే సీన్లు షైన్ అవుతాయి. డైలాగ్ డెలివరీ అసామాన్యం. మరణాన్ని తేలికగా తీసుకునే పాత్రగా కొన్ని ఫన్నీ సీన్స్ క్రియేట్ చేశాడు. సైలెంట్ హ్యూమర్ ఇంకో ప్లస్. ఇన్ని పాజిటివ్స్ వున్న తను నెగెటివ్ నిర్ణయం తీసుకోవడమే పాజిటీవిటీకి గొడ్డలి పెట్టు. అతడి నిష్క్రమణ పాజిటీవిటీకే పెద్ద లోటు. 

        హీరోయిన్ సంజనా క్యాన్సర్ పాత్రకి సరీగ్గా సూటయ్యింది. ఆధునిక క్యాన్సర్ పాత్ర. కొద్ది కొద్ది మాటలు, వడివడి నడక, గెటప్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ సైకలాజికల్ గా అలౌకిక భావతరంగాల్ని తట్టిలేపుతాయి. బెస్ట్ నటి. సాంకేతికాలు థీమ్ ని ప్రదర్శిస్తాయి. కొన్ని చోట్ల వెలసిన జీవితాల్లాగే వెలసిన రంగులుంటాయి. తొమ్మిది వుండీ లేనట్టుండే పాటలతో రెహ్మాన్ సంగీతం ఒక స్మూత్ ట్రావెల్. 

        క్యాస్టింగ్ డైరెక్టర్ నుంచి సినిమా దర్శకుడుగా మారిన ముఖేష్ ఛబ్రా హాలీవుడ్ ఒరిజినల్ జానర్ ని కూడా మార్చి తీశాడు. నవల గానీ, హాలీవుడ్ సినిమా గానీ కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ కి చెందినవి. పదహారేళ్ళ హీరోయిన్, పదిహేడేళ్ళ హీరో ఇద్దరి క్యాన్సర్ కథ. వినూత్నంగా ఇంత లేత టీనేజీ హీరోహీరోయిన్ పాత్రలతో క్యాన్సర్ కథ కాబట్టే మార్కెట్ యాస్పెక్ట్ తో నవల, సినిమా అంత పాపులర్ అయ్యాయి.

సికిందర్







!

25, జులై 2020, శనివారం

960 : రివ్యూ!



దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
సంగీతం : డీఎస్ఆర్, ఛాయాగ్రహణం: జోషి
బ్యానర్: ఆర్జీవీ
వరల్డ్ థియేటర్
విడుదల: జులై 25, 2020

***
        వివాదాలతో, దాడులతో, ట్రైలర్ లీకులతో హైప్ సృష్టించిన ఆర్జీవీ ‘పవర్ స్టార్’ శనివారం ఆర్జీవీ వరల్డ్ థియేటర్ సైట్ లో విడుదలయ్యింది. టికెట్టు ధర 150 రూపాయలు. నిడివి 37 నిమిషాలు. నటీనటులు కొందరు నిజ వ్యక్తుల్ని పోలిన నటులు. వాళ్ళ పేర్లు స్పెల్లింగులు మార్చారు. టైటిల్ పాత్ర పవన్ కళ్యాణ్ ప్రవన్ కళ్యాణ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ పోలికలతో వున్న ఇతను పవన్ బాడీ లాంగ్వేజీని బాగానే అనుకరించాడు. ఇతను తప్ప ఈ వెబ్ మూవీలో ఆసక్తి కల్గించేదేమీ లేదు. 

       చెప్పుకోవడానికి ఇది పేరడీ కాదు, డాక్యూడ్రామా కాదు, అసలు సినిమా కూడా కాదు. ఓ ఆరేడు ఒకదాని కొకటి సంబంధం లేని సీన్లు జోడించి ముగించారు. ఈ ఒక్కో సీన్లో ఒకొక్క ప్రవన్ కళ్యాణ్ సన్నిహితుడు వచ్చి ఓదార్చి వెళ్ళడం వుంటుంది. ఓదార్చి తిట్లు తిని వెళ్ళడం కూడా వుంటుంది. 

        ప్రవన్ కళ్యాణ్ ఎన్నికలు ఓడిపోయిన రాత్రి మొదలవుతుంది ఈ వెబ్ మూవీ. ప్రవన్ కళ్యాణ్ మన సేన పార్టీ ఒకటే స్థానం గెలుస్తుంది. తను పోటీ చేసిన రెండు స్థానాలూ ఓడిపోతాడు. ఈ పరాభవంతో వున్న అతడి దగ్గరికి పెద్దన్న మెగాస్టార్ వచ్చి మందలిస్తాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ వచ్చి సంజాయిషీ ఇచ్చుకుంటాడు. నిర్మాత బండ్ల గణేష్ వచ్చి కొత్త సినిమా ఆఫర్ ఇస్తాడు. జర్నలిస్టు కత్తి మహేష్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాడు. రష్యన్ భార్య వస్తుంది. చివరికి చిన్నన్న నాగబాబు పోన్లో పలకరిస్తాడు. చివరి సీను మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో వుంటుంది. ఆఖరికి ఆర్జీవి వచ్చి హితోపదేశం చేయడం వుంటుంది.

        ప్రవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత అమాయకుడో, అతడి చుట్టూ చేరి కొందరు ఎలా దెబ్బతీశారో అన్నదే చెప్పాలనుకున్నాడు ఆర్జీవి. ఇంతకి మించి పవన్ ని అవమానించడం ఎక్కడా చేయలేదు. సానుభూతి చూపించడం మాత్రమే చేశాడు. ఈ సానుభూతికి పరాకాష్ట చివర్లో ఆర్జీవి హితబోధ.

        ‘గడ్డి తింటావా’ అన్న పాటలో వున్న సెటైర్ మిగతా మూవీలో లేదు. డైలాగుల్లో పంచ్ తప్ప సెటైర్ లేదు. కెమెరాతో గిమ్మిక్కులు చేయకుండా స్టడీ షాట్లు తీశారు. ఒక ఫాం హౌస్ లో వారం రోజుల్లో షూటింగ్ ముగించారు. అతి లో బడ్జెట్ లో తీసిన ఈ వెబ్ మూవీ క్వాలిటీ గురించి చెప్పుకోవాల్సింది లేదు. విషయం గురించి అసలే లేదు. ప్రవన్ కళ్యాణ్ మీద సానుభూతి ఏమో గానీ, వర్మ మీద జాలిపడేలా వుంది. 

-సికిందర్

21, జులై 2020, మంగళవారం

959 : రివ్యూ



రచన, దర్శకత్వం : అన్వితా దత్తా
తారాగణం: తృప్తీ దిమ్రీ, అవినాష్ తివారీ, పావలీ దామ్, రాహుల్ బోస్, పరమబ్రత ఛటర్జీ
సంగీతం: అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ దివాన్
బ్యానర్: క్లీన్ స్లేట్ ఫిలిమ్స్
నిర్మాతలు: అనూష్కా శర్మ, కర్ణేష్ శర్మ
విడుదల: నెట్ ఫ్లిక్స్


      ‘ఎన్ హెచ్ -10’, ‘పరీ’ వంటి సినిమాలు, ‘పాతాళ్ లోక్’ వంటి వెబ్ సిరీస్ నిర్మించిన బాలీవుడ్ స్టార్ అనూష్కా శర్మ, తాజాగా ‘బుల్బుల్’ అనే సూపర్ నేచురల్ హార్రర్ తో ఓటీటీ ప్రవేశం చేసింది. నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. రచయిత్రి అన్వితా దత్ దర్శకురాలిగా పరిచయమైంది. 19 వ శతాబ్దపు నేపథ్యంతో ‘డ్రాక్యులా’ ని తలపించే ఫీల్ తో, సంజయ్ లీలా భన్సాలీ లాంటి దృశ్య వైభవంతో, పిశాచ కథని కవితాత్మకంగా తెరకెక్కించింది. ‘పోస్టర్ బాయ్స్’, ‘లైలా మజ్నూ’ అనే రెండు సినిమాల హీరోయిన్ తృప్తీ ధిమ్రీ టైటిల్ పాత్ర నటించింది. రాహుల్ బోస్ ద్విపాత్రాభినయం చేశాడు. అమిత్ త్రివేదీ సంగీతం చేశాడు. ఇలా ఓ జమీందారీ కుటుంబంలో అంతఃపురపు కుట్రల్ని వెల్లడించే ఈ కథేమిటో ఒకసారి చూద్దాం... 

కథ
     1880 లో బెంగాల్లో ఐదేళ్ళ బుల్బుల్  కి పెళ్ళవుతుంది. తన తోటి బాలుడు సత్యతో పెళ్లి చేస్తున్నారని అనుకుంటే, సత్య అన్న ఇంద్రనీల్ (రాహుల్ బోస్) తో పెళ్లయి పోతుంది. ఐదేళ్ళ బుల్బుల్ ని పెళ్ళిచేసుకున్న పెద్ద జమీందారు ఠాకూర్ ఇంద్రనీల్ కి తనలాగే వున్న కవల సోదరుడు మహేంద్ర (రాహుల్ బోస్) వుంటాడు. ఇతడికి మతిస్థిమితం వుండదు. ఇంకో ఏడేళ్ళ తమ్ముడు, బుల్బుల్ తో కలిసి ఆడుకున్న సత్య వుంటాడు. ఇరవై ఏళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు లండన్లో చదువు పూర్తి చేసుకున్న సత్య (అవినాష్ తివారీ) తిరిగొస్తాడు. వచ్చేసరికి చాలా మార్పులు జరిగివుంటాయి. పెద్దన్న ఇంద్రనీల్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు, చిన్నన్న చనిపోయాడు. చిన్న వదిన బినోదిని (పావలీ దామ్) వితంతువుగా శిరోముండనం చేయించుకుని తెల్ల చీరలో వుంది. పెద్దన్న భార్య బుల్బుల్ (తృప్తీ ధిమ్రీ) దొరసానిలా జమీందారీ బాధ్యతలు చేపట్టింది.  

        బుల్బుల్ కి చిన్నప్పుడు సత్యతో పెళ్లి కాలేదన్న బాధ వుంటుంది. సత్య ఆమెని వదినలాగే చూస్తూంటాడు. అయితే చుట్టు పక్కల ఒక పిశాచి సంచరిస్తోందనీ, అది మనుషుల్ని చంపేస్తోందనీ అందరూ అంటూంటే వింటాడు. చిన్నన్న మహేంద్రని కూడా పిశాచి చంపేసిందని అంటారు. ఇలా వుండగా ఇప్పుడు అడవిలో వేట కెళ్తే తన కళ్ళ ముందే పోలీసు కొత్వాల్ శవవుతాడు. దీంతో ఈ చావుల రహస్యం తెలుసుకోవాలని నిశ్చయించుకుంటాడు సత్య.

        ఈ చావులు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా పిశాచి చంపుతోందా? ఎందుకు చంపుతోంది? చిన్నన్నని పిశాచియే చంపిందా? పెద్దన్న ఎక్కడికెళ్ళి పోయాడు? ఈ మొత్తం పరిణామాల్లో డాక్టర్ సుదీప్ (పరమబ్రత ఛటర్జీ) పాత్రేమిటి? ఇదీ మిగతా కథ.

నటనలు- సాంకేతికాలు
     నటిగా తృప్తీ ధిమ్రీ హైలైట్ అయిన సినిమా ఇది. తియ్యగా నవ్వుతూ, ఇంకా తియ్య తియ్యగా మాట్లాడుతూ, స్నేహభావంతో మెలగుతూ, హవేలీ బాధ్యతలు చూసుకునే యువ జమీందారిణీగా ఒక చెరగని ముద్ర వేస్తుంది. అంతఃపుర రహస్యాలుంటాయి. అవి బాధైనా, మరోటైనా భరించే జమీందారిణీ హూందాతనంతో వుండే పాత్రగా అర్ధంజేసుకుని ఒదిగిపోయింది. చిన్న వయసులో (26 ఏళ్ళు), రెండు సినిమాల అనుభవంతో, ఈ బరువైన క్లిష్ట పాత్ర పోషించే అవకాశం రావడం ఆమెకి గొప్ప.  

        రాహుల్ బోస్ అన్నదమ్ముల ద్విపాత్రాభినయం చేశాడు. గృహ హింస వెలగబెట్టే మగ రాయుళ్ళ పాత్రలు. ఒకటి మతి చెడిన తమ్ముడి పాత్ర. చాలా శాంతంగా, తక్కువ  మాట్లాడే పాత్రలు. చేపట్టేవి క్రూరమైన చర్యలు. అనుభవించేది దారుణమైన శిక్షలు. ఈ డార్క్ షేడ్ పాత్రల్లో రాహుల్ బోస్ ఒకలాటి మత్తైన వాతావరాణాన్ని క్రియేట్ చేస్తాడు నటనతో.  

        వితంతువు బినోదినిగా పావలీ దామ్, ఆ నాటి వితంతువుల జీవితాలకి అద్దం పడుతుంది. డాక్టర్ సుదీప్ గా పరమబ్రత ఛటర్జీ ఇంకో ఫర్వాలేదనిపించే నటన. ఇక హీరోగా అవినాష్ త్రివేదీ లోకల్ షెర్లాక్ హోమ్స్ గా ఆసక్తి కల్గిస్తాడు. ఇంగ్లీషు ప్రభావంతో అతడి లుక్స్, మాటలు ప్రత్యేకంగా వుంటాయి. 

        నటీనటులందరూ 1880 -1900 నాటి మనుషుల పోకడలతో, ముఖ్యంగా నాటి బెంగాలీ నేటివిటీతో, భాషతో, దృశ్యపరమైన సౌందర్యాన్నిపరిపుష్టం చేశారు. హవేలీ వైభవం, వర్ణ చిత్రాలు, పట్టు పరదాలు, వస్త్రా లంకరణ, వస్తు సామగ్రి, గుడ్డి నూనె దీపాల నుంచీ కాలక్రమంలో విద్యుత్ దీపాల కాంతులూ, గుర్రబ్బగ్గీలూ, ఇవన్నీ క్లాసిక్ వాతావరణాన్ని సృష్టిస్తూ ఆ కాలం లోకి లాక్కెళతాయి. 

        రిచ్ కలర్స్, లైటింగ్ స్కీమ్, పిశాచి దాడి చేసేప్పుడు దృశ్యాలకి వాడిన కాషాయ కలర్స్ హార్రర్ ని కూడా ఒక దృశ్య కావ్యంలా మారుస్తాయి. కాషాయం ఎందుకంటే పిశాచి కాళికా దేవీ అని నమ్ముతారు అక్కడి ప్రజలు. పిశాచి వయొలెంట్ జస్టిస్ కి పాల్పడుతోంది. మేల్ వయొలెన్స్ కి వయొలెంట్ జస్టిస్సే సమాధానం అన్నట్టు వుంటుంది. 

        లైటింగ్ ఎఫెక్ట్స్ గురించి కూడా చెప్పుకోవాలి. సత్యజిత్ రే తీసిన ‘దేవి’ పోస్టర్ కి ప్రభావితుడై ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ సృష్టించానన్నాడు కెమెరా మాన్ సిద్ధార్థ్ దివాన్. అమిత్ త్రివేదీ సంగీతం స్వరాలు సుతిమెత్తగా పలుకుతాయి. ఎడిటింగ్ కొంతవరకు కథకి ఉత్తేజం తీసుకొచ్చేలా వుంది. ఎడిటింగ్ కి కథ తోడ్పడకపోతే ఎడిటింగ్ కూడా బోరే కొడుతుంది. కొన్ని చోట్ల ఎడిటర్ రామేశ్వర్ భగత్, ఏ షాట్ ముందు వేసి ఏ షాట్ వెనుక వేస్తే కిక్ వుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. 

        దర్శకురాలిగా తొలి ప్రయత్నంతో ఇంత విజువల్ అద్భుతాన్ని సృష్టించింది అన్వితా దత్తా. ఇంత దర్శకత్వం ఏ దర్శకులూ చేయరు బహుశా. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలకి బీభత్స సూపర్ నేచురల్ వెర్షన్ ని సృష్టించి పెట్టినట్టుంది తను. 

కథాకథనాలు
    19 వ శతాబ్దం, ఇంకా ఆ పూర్వపు కాలాల హార్రర్ కథల్ని గోథిక్ హార్రర్ జానర్ అంటారు. ‘ఫ్రాంకెస్టీన్’, ‘డ్రాక్యులా’ వంటి ప్రసిద్ధ నవలలు వచ్చాయి. ఇవొక ఫాంటసికల్ వాతవరణ నేపథ్యంతో వుంటాయి. ‘బుల్బుల్’ కథ ఈ కోవకే చెందింది. ఈ కథ రబీంద్ర నాథ్ టాగూర్ నవలిక ప్రభావంతో రాశానంది దర్శకురాలు. 1901 లో టాగూర్ రాసిన ‘నష్టనిర్’ (చెదిరిన గూడు) నవలిక లోని పాత్రల్ని హార్రర్ లోకి మార్చి తీశానంది. గృహ హింస ఆనాడు ఎంతుందో ఈనాడూ అంతే వుందంది. నవలికలో వున్న పాత్రలు టాగూర్ నిజ జీవితంలో అన్న దమ్ముల పాత్రలే. బినోదిని పేరుతో పాత్రకూడా నవలికలో వుంది. ఈ నవలిక ఆధారంగా సత్యజిత్ రే ‘చారులత’ తీశారు. 


        దర్శకురాలు అన్విత గీత రచయిత్రిగా బాలీవుడ్ పాటలు రాసింది. మాటల రచయిత్రిగా దోస్తానా, కంబఖ్త్ ఇష్క్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, క్వీన్ వంటి 27 సినిమాలకి రాసింది. ఈ రెండు వృత్తులూ ఓకే. కథా రచయిత్రిగా వచ్చేసరికి విఫలమైంది. దర్శకురాలిగా ఎంతో అద్భుతం చేసింది. లేని కథని అద్భుతంగా తీసినంత మాత్రాన ఫలితాలు అద్భుతంగా వుండవు. అద్భుతమైన పాత్రల్ని తీర్చిదిద్దింది. వాటికి కథే లేదు. ఐతే తనేం కథ చేస్తోందో అది మాత్రం తెలుసని చెప్పింది. రెగ్యులర్ గా తీసే ఎవరు చేశారు? -  అనే మర్డర్ ఇన్వెస్టిగేషన్ గాక, ఎలా చేశారు?- అన్న యాక్షన్ కే పరిమితం చేసినట్టు చెప్పింది. ఇదెంతో రిలీఫ్ నిచ్చే మాట. మర్డర్ ఇన్వెస్టిగేషన్, హంతకుణ్ణి పట్టుకోవడాలు వగైరా ఇంకా ఎవరిక్కావాలి? హంతకుడు ఎలా హత్య చేశాడు, ఎందుకు చేశాడనే ఆసక్తి చుట్టూ కథ వుంటే చాలు. పట్టుకుంటే ఎంత, పట్టుకోకపోతే ఎంత - నేటి శిక్షలు పడే ప్రహసనాలూ కాలయాపనలూ చూస్తున్నాక.

        అయితే తను తెలుసుకోని దేమిటంటే, సినిమాని అడ్డంగా కుప్ప కూల్చే ఎండ్ సస్పెన్స్ అనే మాయదారి జాతికి చెందిన కథ ఇదని. దీంతో ఈ గంటన్నర సినిమా కూడా వృధా అయిపోయింది. గంటన్నరలో గంటా 10 నిమిషాల వరకూ కథ అంతుబట్టక, అసలు కథే అర్ధం గాక, పట్టపగలు కూడా నిద్ర ముంచుకొచ్చే పరిస్థితి. ఆ తర్వాతి ఇరవై నిమిషాల్లోనే ఫ్లాష్ బ్యాకుల వల్ల కథ తెలిసి ముగింపు కొస్తుంది. బుల్బుల్ కి అసలేం జరిగిందో ఈ ఇరవై నిమిషాల్లోనే తెలిసి -తెలిశాక ఇంకేం జరుగుతుందో తెలిసిపోయి- చప్పగా ముగుస్తుంది. 

        మరి ఫస్టాఫ్ అంతా ఏముంది? బుల్బుల్ చిన్నతనంలో పెళ్లి, తర్వాత ఇరవై ఏళ్ళు టైం లాప్స్ తో సత్య ఇంటికి రావడం, అన్నలేమయ్యారో ఆ ఫ్లాష్ బ్యాకులు అసంపూర్ణంగా తెలుసుకోవడం, చావుల దర్యాప్తు చేయడం, ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రధాన పాత్ర బుల్బుల్ జమీందారిణీగా ఏమీ చెయ్యకుండా నవ్వులు చిందిస్తూ వుండడం, ఎంతకీ కథనం ముందుకు కదలక పోవడం, విషయం తెలియక పోవడం, ఇంతే. మూసి పెట్టిన విషయం తో ఎండ్ సస్పెన్స్ పెట్టే సహన పరీక్ష ఇలా వుంటుందని ఈ సినిమాతో వెయ్యో సారి రుజువైంది. 

        అనుమానిత పాత్ర లేకపోవడం ఈ ఎండ్ సస్పెన్స్ లో కూడా ఒక లోపం. బుల్బుల్ ని అనుమానిత పాత్రగా ఎస్టాబ్లిష్ చేసివుంటే కథలో చాలా సమస్యలు తీరేవి. మాటలు కవితాత్మకంగా రాసినట్టు, కథకూడా కవిత రాసినట్టు రాయడం వల్ల వచ్చిన సమస్య ఇది. గృహ హింస తాలూకు రెండు దృశ్యాలు వయొలెంట్ గా వుంటే సరిపోలేదు. ఆ గాభరా, సస్పెన్స్ మిగతా కథలో కూడా వుండాలి. కథేమిటో ఓపెనై పాత్ర సమస్యేమిటో తెలియాలి. సమస్యేమిటంటే- అటు బుల్బుల్, ఇటు సత్య ఏదీ ప్రధాన పాత్ర కాకుండా పోయాయి. టాగూర్ నవలిక, దాంతో సత్యజిత్ సినిమా సామాజికాలు కాబట్టి సరిపోయాయి. వాటిని హార్రర్ గా మార్చాలంటే అసలు  స్క్రీన్ ప్లే అనేది స్ట్రక్చర్ లో వుండడం అవసరం.  

        ఈ కథలో మోస్ట్ టెర్రిఫిక్ డైలాగు, బుల్బుల్ తో బినోదిని ‘చుప్ రహెనా’ (సైలెంట్ గా  వుండిపో) అనడం. అలాగని కథ కూడా సైలెంట్ గా వుండిపోతే ఎలా?  

సికిందర్


17, జులై 2020, శుక్రవారం

958 : రివ్యూ



‘లా’ (కన్నడ)
రచన, దర్శకత్వం: రఘు సమర్థ్
తారాగణం: రాగిణీ ప్రజ్వల్, హేబ్బాలే కృష్ణ, రాజేష్ నటరంగ, అచ్యుత్ కుమార్, ముఖ్యమంత్రి చంద్రు, లిఖిత్ కుర్బా, ఇమ్రాన్ పాషా, మధు హెగ్డే తదితరులు
సంగీతం: వైభవ్ వాసుకి, ఛాయాగ్రహణం: సుగ్నన
నిర్మాతలు: అశ్వనీ పునీత్, రాజ్ కుమార్
విడుదల: అమెజాన్


        తొలి కన్నడ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ‘లా’ ఈ రోజు అమెజాన్ లో విడుదలయ్యింది. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ బ్యానర్ రూపొందించడంతో దీనికి మంచి హైప్ వచ్చింది. దర్శకుడు రఘు సమర్థ్ కి రెండో సినిమా. హీరోయిన్ రాగిణీ ప్రజ్వల్ కి తొలి సినిమా. తొలి సినిమా రెగ్యులర్ ప్రేమ సినిమాగా వుండకూడదని టాలెంట్ ని పరీక్షించే ఈ పాత్ర  ఒప్పుకున్నట్టు చెప్పుకుంది. ఈ సినిమా రెగ్యులర్ లీగల్ డ్రామాగా తీయలేదని దర్శకుడు కూడా చెప్పుకున్నాడు. అయితే ఇటీవల తమిళంలో ఓటీటీలో విడుదలైన జ్యోతిక నటించిన ‘పొన్మంగళ్ వందాళ్’ కూడా ఇలాటి లీగల్  డ్రామానే. ఇలాటి హీరోయిన్ పాత్రే. రేప్ బాధితురాలు తన కేసుని తను వాదించుకునే లాయర్ పాత్ర. ఈ కన్నడ క్రియేటివిటీ ఫ్లాపయిన జ్యోతిక క్రియేటివికి ఎంత భిన్నంగా వుంది? ఇది క్రియేటివిటీయేనా, లేక క్రిమి కీటకమా ఓసారి చూద్దాం...

కథ
    నందిని (రాగిణీ ప్రజ్వల్) లా గ్రాడ్యుయేట్. ఓ రాత్రి గ్యాంగ్ రేప్ కి గురవుతుంది. పోలీస్ స్టేషన్ కెళ్తే హేళన చేస్తారు. మూడు నెలలు గడిచిపోతాయి. ఆమె తనకి జరిగింది సోషల్ మీడియలో వైరల్ చేసేసరికి ఆందోళనలు చెలరేగుతాయి. దీంతో పోలీస్ కమీషనర్ కేసుని సీఐడీ ఇన్స్ పెక్టర్ పార్థ సారథి బ్రహ్మ (హేబ్బాలే కృష్ణ) కి అప్పగిస్తాడు. పార్థ సారథి బ్రహ్మ ఇన్వెస్టిగేట్ చేసి ముగ్గుర్ని (లిఖిత్ కుర్బా, ఇమ్రాన్ పాషా, మధు హెగ్డే) అరెస్ట్ చేసి కేసు పెడతాడు. నందిని ఈ కేసుని తను వాదిస్తానంటుంది. నిందితుల డిఫెన్స్ న్యాయవాదిగా శ్యాం ప్రసాద్ (రాజేష్ నటరంగ) వస్తాడు. న్యాయం కోసం అతడితో తలపడుతుంది నందిని. ఇందులో విజయం సాధించిందా? ఆమె విజయాన్ని ఇన్స్ పెక్టర్ బ్రహ్మ ఎందుకు అడ్డుకోబోయాడు? ఆమె దాచిన అసలు నిజం ఏమిటి? ఈ నిజం బయట పడితే ఏం చేసింది? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి. 

నటనలు-సాంకేతికాలు
    కొత్త హీరోయిన్ రాగిణీ ప్రజ్వల్ తొలి సినిమాకి ఎంపిక చేసుకున్న పాత్ర మంచిదే. కానీ తనకి నటించడం రాక, దర్శకుడికి సినిమా తీయడం రాక చేసిన ప్రయత్నం విఫలమైంది. ప్రారంభం నుంచీ ఎక్కడా రేప్ బాధితురాలిగా కన్పించదు. పోగొట్టుకుంది పర్సు అయినట్టు, పోతే పోయిందన్నట్టు మేకప్ చెదరకుండా తిరుగుతూంటుంది. బీఆర్ చోప్రా తీసిన ‘ఇన్సాఫ్ కా తరాజూ’ (1980) లో జీనత్ అమన్ ని చూస్తే రేప్ బాధితురాలంటే ఏమిటో తెలిసేది రాగిణికి. ఇక లాయర్ గా కూడా నవ్వొచ్చే విధంగా వుంది. చివర్లో అసలు నిజంతో క్లయిమాక్స్ లో నటన జలపాతం దగ్గర అరణ్య రోదనగానే మిగిలింది. ఎంత అరిచి ఏడుద్దామన్నా ఎమోషనే రావడం లేదు. ఎందుకైనా మంచిదని దర్శకుడు లాంగ్ షాట్ వేశాడు. సంగీత దర్శకుడు పీలగా విన్పించిన సంగీతం నుంచి మాత్రం మనకి రక్షణ లేదు. హీరోయిన్ని ఆచి తూచి ఎంపిక చేసుకున్నానని దర్శకుడనడమంటే ఇదేనేమో. ఇందులో ఏం ఆచి వుందో, ఏం తూచి వుందో అర్ధంగాదు. 


        హీరోయిన్ తండ్రి పాత్రలో అవినాష్, ఇన్స్ పెక్టర్ పాత్రలో హేబ్బాలే కృష్ణ, డిఫెన్స్ లాయర్ పాత్రలో రాజేష్ నటరంగ సమర్ధులైన సీనియర్ నటులు. కానీ కథ, సన్నివేశాలు తోడ్పడలేదు. అవినాష్ పోలీస్ స్టేషన్ లో రేప్ బాధితురాలైన కూతురి దగ్గరి కొచ్చి, ‘చట్టం తో ఏమీ తేలదమ్మా, జరిగింది మర్చి పో’ అనేసి లైట్ తీసుకుని కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయే పాత్ర. ఎక్కడా అతను జరిగిందానికి ఏ మాత్రం ఫీలవడు ఎవర్ గ్రీన్ గ్లామర్ గర్ల్ కూతురిలాగే. వీళ్ళని చూస్తే రేప్ మీదే మనకి జాలి పుడుతుంది. 

        ఇక జడ్జి సిద్ధ లింగయ్య పాత్ర వున్నాడు ముఖ్యమంత్రి చంద్రు అనే నటుడు. ఇతను కామెడీ జడ్జి. దర్శకుడికి కథలో ఎంటర్ టైన్మెంట్ తగ్గిందన్న బాధతో సీరియస్ కేసు వాదనల్లో జడ్జి కామెడీలు చూపించాడు. జడ్జికి తోడు బంట్రోతు. మధ్యలో జడ్జి గయ్యాళి పెళ్ళాం నుంచి ఫోను రావడం. బెంబేలెత్తి పోయి జడ్జి హనుమాన్ చాలీసా వేసుకోవడం. ఏం సినిమా తీసి అమెజాన్ కిచ్చాడో దర్శకుడికే తెలియాలి. 

         ‘పొన్మంగళ్ వందాళ్’ లో గోవింద్ వసంత అనే సంగీత దర్శకుడి లాగే ఇక్కడ కూడా వైభవ్ వాసుకి అనే సంగీత దర్శకుడు, పరికరాలే లేనట్టు వీలయినంత పేలవంగా సంగీత సృష్టి గావించాడు. కెమెరా మాన్ సుగ్నన అనే ఒకతను మాత్రమే అప్పగించిన బాధ్యతకి కాస్త న్యాయం చేసినట్టు కనబడతాడు. సినిమా నిడివి రెండు గంటలే అయినా రెండు యుగాల్లా వుంటుంది. 

కథా కథనాలు
    కథకి అయిడియా మంచిదే. ఆచరణలో చెదిరి పోయింది. ముగింపులో హీరోయిన్ మోటివేషన్ కి ఇచ్చిన కారణంతో దీన్నొక బలమైన ఎమోషనల్ లీగల్ యాక్షన్ డ్రామా చేయొచ్చు. తన అయిడియాలో వున్న బలం, లోతు పాతులు తనకే తెలియక పోతే ఎలా? ఈ అయిడియాలో హీరోయిన్ తన శీలంతో తనే ప్రయోగం చేయడమనే రాడికల్ తెగింపు వుంది. ఈ పాయింటుని  హైలైట్ చేసి మార్కెట్ యాస్పెక్ట్ ని పట్టుకోవాలనుకోలేదు దర్శకుడు. మొద్దుబారి
పోయిన వ్యవస్థని లేపడానికి శీలాలతో ఇలాటి ప్రయోగాలు  తప్పవా అన్న సామాజిక ప్రశ్న ఈ కథలో వుంటే, ఏవో కామెడీలు చేస్తూ వుండిపోయాడు దర్శకుడు. చట్టంతో మగాడు ఈజీగా ఆడుకోగలడు. ఆడది ఆడుకోవాలంటే ఇక శీలాల్ని పణంగా పెట్టాలేమో. 

        ఇలాటి కథలో కూడా దర్శకుడికి ఎంటర్ టైన్మెంట్ తగ్గుతోందన్న వర్రీ తీవ్రంగా వున్నట్టుంది. రేప్ బాధితురాలైన హీరోయిన్ కి కామెడీ ఫ్లాష్ బ్యాకులు. అల్లరి చేష్టలు. కథలో జరిగిన విషయానికీ ఈ ఫ్లాష్ బ్యాకులకీ సంబంధమేమిటో, వీటినెలా ఎంజాయ్ చేయాలో అర్ధంగాదు. ఫస్టాఫ్ లో నాల్గు సార్లు ఈ కామెడీ ఫ్లాష్ బ్యాకులేస్తాడు. ప్రతీ రాత్రీ తనకి జరిగిందే గుర్తుకొస్తూ నిద్రపట్టడం లేదని హీరోయిన్ డైలాగు. ఎప్పుడు గుర్తొచ్చింది, ఎప్పుడు నిద్ర పట్టలేదు సీన్లే చూపించలేదు. పోయింది పర్సే కదా అన్నట్టు జాలీగా తిరుగుతూంటే. 

        ‘పొన్మంగళ్ వందాళ్’, ‘లా’ రెండూ దాదాపు కథ లొకటే. తీసి ఫ్లాప్ చేసుకున్న విధం ఒకటే. క్రియేటివిటీకి రెండు తరాలు వెనకున్నాయీ సినిమాలు. కథ పక్కనబెట్టి, కనీసం ఇప్పుడు సినిమా ఇలా తీయరన్న ఆలోచన కూడా లేకపోతే ఎలా?

సికిందర్  


15, జులై 2020, బుధవారం

957 : రివ్యూ



‘కాక్ టైల్’ (తమిళం)
రచన, దర్శకత్వం: ఆర్ ఏ విజయ మురుగన్
తారాగణం: యోగిబాబు, రేష్మీ గోపీనాథ్, మిథున్ మహేశ్వరన్, బాలా, కవిన్, సాయాజీ షిండే తదితరులు
సంగీతం: సాయి భాస్కర్, ఛాయాగ్రహణం: ఆర్ జే రవీన్
నిర్మాత: పిజి ముత్తయ్య, ఎం. దీపా
విడుదల: జీ5

***
        మిళంలో పొన్మంగళ్ వందాళ్, పెంగ్విన్ అనే రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ డైరెక్ట్ ఓటీటీ విడుదలల తర్వాత, కమెడియన్ యోగిబాబుతో  ‘కాక్ టైల్’ విడుదలైంది. ఇది కూడా మొదటి రెండిటిలాగే కొత్త దర్శకుల సినిమాల జాబితాలో ఓటీటీ కొచ్చి ఔటై పోయింది. కొత్త దర్శకుడు విజయ మురుగన్ అట్టర్ ఫ్లాప్ చేయడంలో కొత్త పుంతలు తొక్కాడు. కొత్త దర్శకుడికి ఇంత పాత కాలపు చీకేసిన సినిమా తీయాలన్న బ్రహ్మాండమైన అయిడియా ఎలా వచ్చిందో తెలీదు. కమెడియన్ గా తమిళంలో ఇప్పుడు డిమాండ్ లో వున్న యోగిబాబుని బలవంతంగా వాడుకుని, బలవంతంగా నవ్వించాలని విశ్వప్రయత్నం చేశాడు. యోగిబాబు షూటింగులో డైలాగులు చెప్పలేదనీ, డబ్బింగులోనే చెప్పాడనీ తెర వెనుక సంగతులు. ఇందుకేనేమో ఫేసు ఒకలాగా, డైలాగులు ఇంకోలాగా పలికాయి. మనవి ఫూల్స్ అయిన ఫేసులయ్యాయి. ఈ ఫూలిష్ కథేమిటో చూద్దాం...
కథ
      450 ఏళ్ల చోళుల కాలం నాటి పురాతన మురుగన్ దైవ విగ్రహం మ్యూజియం నుంచి చోరీ అవుతుంది. ఇన్స్ పెక్టర్ రాజమాణిక్యం (సాయాజీ షిండే) కేసు టేకప్ చేస్తాడు. అలాటి నకిలీ విగ్రహం మీడియాకి చూపించి, విగ్రహాన్నిసాధించామని మీడియాకి చెప్తాడు. దీని వల్ల అసలు విగ్రహాన్ని చోరీ చేసిన దొంగలు తమ దగ్గరున్నది నకిలీ విగ్రహమనుకుని అమ్మేయడానికి ప్రయత్నిస్తారనీ, అప్పుడు పట్టుకోవచ్చనీ ప్లాను. 

     యోగిబాబు జంతువుల సెలూన్ నడుపుతూంటాడు. అతడికి మిథున్ మహేశ్వరన్, బాలా, కవిన్ ఫ్రెండ్స్ గా వుంటారు. మిథున్ మహేశ్వరన్ ఇన్స్ పెక్టర్ రాజమాణిక్యం కూతురు రేష్మీ గోపీనాథ్ ని ప్రేమిస్తూంటాడు. ఒక రోజు నల్గురూ తాగి పార్టీ చేసుకుని పడుకుంటే తెల్లారి అమ్మాయి శవం వుంటుంది. ఈ శవం ఎలా వచ్చిందో, ఈ అమ్మాయి ఎవరో తెలీక భయపడతారు.

        ఒకవైపు విగ్రహాన్ని అమ్మేద్దామని ప్రయత్నిస్తూ దొంగలు, ఇంకోవైపు శవాన్ని వదిలించు కోవాలని ఈ నల్గురూ. ఈ రెండు గ్రూపులు ఎక్కడ ఎదురెదురయ్యాయి? ఎదురైతే ఏం జరిగింది? ఇన్స్ పెక్టర్ రాజమాణిక్యం ప్లాను పారిందా? విగ్రహం దొరికిందా? శవం కేసులోంచి నల్గురూ ఎలా బయట పడ్డారు? ఇదీ మిగతా కథ. 

నటనలు - సాంకేతికాలు
      ముందుగానే చెప్పుకున్నట్టు యోగిబాబు ఫేసొకటి డైలాగొకటిగా నటించిన ఫూలిష్ పాత్ర. కలవని ఫేసూ డైలాగులతో బ్యాడ్ కాక్ టైల్. రజనీకాంత్ ‘దర్బార్’ లో తను చాలా నయం. ఇప్పుడు ఈ సినిమాతో హీరోగా శ్రద్ధగానీ ఆసక్తిగానీ లేనట్టు  నటించాడు మాస్ కూడా చూడలేని నటన. ఒక్క డైలాగూ నవ్వు పుట్టించదు. పైగా అర్ధం పర్ధం లేని మైండ్ లెస్ కామెడీ సీన్లు కావడంతో అట్టర్ ఫ్లాపయ్యాడు. 

     బక్కగా వుండే టీవీ కమెడియన్ బాలాది భరించలేని చీప్ కామెడీ. ఓవరాక్షన్ కూడా. మిథున్ మహేశ్వరన్ కి కామెడీ రాదు, సాయాజీ షిండేకి ఈ సినిమా ఎలా పోయినా పట్టింపు లేదు. హీరోయిన్ రేష్మీ గోపీనాథ్ ఎప్పుడు కనిపిస్తుందో తెలీదు. కన్పించినప్పుడు ఎందుకీ రోమాంటిక్ సీన్లు అన్నట్టు ఆమెకే చీదర. పోతే ఇంకో స్టార్ కూడా వుంది. టైటిల్ కోసం పట్టుకొచ్చిన పక్షి. కాక్ టైల్ అనే ఆస్ట్రేలియా పక్షి. ఇది పైన కూర్చుని యోగిబాబుని చూస్తూ వుంటుంది తప్ప వీళ్ళ సంగతేమిటో చూద్దామనుకోదు. కాక్ టైల్స్ చిలకల్లా మాట్లాడతాయి. అలా కూడా మాట్లాడించాలనుకోడు దర్శకుడు. ఈ ఆస్ట్రేలియన్ పక్షిని cockatiel అంటారు.  

        వీలయినంత పాత కాలపు దర్శకత్వం చేశాడు కొత్త దర్శకుడు. సాంకేతిక  విలువలకి విలువలేదు. రైటింగ్ లో గానీ, టేకింగ్ లో గానీ కొత్తదనం లేదు. ఉన్న రెండు పాటలు నీరసం. 

కథా కథనాలు
      పాత కాలపు అరిగిపోయిన కామెడీ కథ. విగ్రహం దొంగలు -శవంతో ఫ్రెండ్స్  అన్న డై నమిక్స్ వున్న కథని అర్ధంపర్ధం లేని కామెడీలతో చుట్టేశాడు. విగ్రహం కథ మళ్ళీ క్లయిమాక్స్ లో తప్ప గుర్తుకు రాదు. శవంతో కథతో సస్పెన్స్, థ్రిల్స్ వుండవు. గతంలో మైండ్ లెస్ కామెడీలు చాలా వచ్చాయి. రోహిత్ శెట్టి తీసిన ‘గోల్ మాల్’ సిరీస్ సహా. అవి లాజిక్ ని వదిలేసి నవ్వించడంలో సక్సెస్ అయ్యాయి. ‘కాక్ టైల్’ లో లాజిక్ లేదు, నవ్వులేదు.

-సికిందర్ 
Rv at telugurajyam.com

13, జులై 2020, సోమవారం

956 : రివ్యూ



రచన, దర్శకత్వం : మహమ్మద్ ముస్తఫా
తారాగణం: అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యీవ్, జేమ్స్ ఎలియా, నిషా సరంగ్  తదితరులు
సంగీతం: సుశిన్ శ్యాం, ఛాయాగ్రహణం: జిమ్షి ఖాలిద్
నిర్మాత: విష్ణు వేణు

***
      లయాళం నుంచి కొత్త దర్శకుడు ఇంకో లాక్ డౌన్ బాధితుడయ్యాడు. తీసిన మొదటి సినిమా విడుదల కాగానే లాక్ డౌన్ తో థియేటర్లు మూతబడ్డాయి. అనేక సినిమాల్లో నటుడుగా అనుభవం గడించిన మహమ్మద్ ముస్తఫా, దర్శకుడుగా మలయాళ సినిమాలకి ప్రాణమైన నేటివిటీని ప్రధానంగా చేసుకుని తీసిన ‘కప్పెలా’ (చిన్నచర్చి), ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ రాబడుతోంది. సృజనాత్మక స్వేచ్ఛ లేని అవే ఫార్ములా టెంప్లెట్ సినిమాలకి దూరంగా, వాస్తవంగా జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో యూత్ సినిమాలు తీస్తున్న మలయాళ దర్శకుల కోవలో, ముస్తఫా కూడా ఒక రియలిస్టిక్ ఫిక్షన్ తీశాడు. అయితే అంతర్లీనంగా ఒక తిరోగమన భావజాలాన్ని షుగర్ కోటింగ్ వేసి తెలియకుండా అందించాడు. అదేమిటో చూద్దాం...

కథ
     రాహుల్  గాంధీ ఎంపీగా ప్రకాశిస్తున్న వాయనాడ్ నియోజక వర్గం పూవరన్మాల కొండ ప్రాంతం గ్రామంలో వర్ఘీస్ (జేమ్స్ ఎలియా) వ్యవసాయం చేస్తాడు. మేరీ (నిషా సరంగ్) బట్టలు కుడుతుంది. వీళ్ళ పెద్ద కూతురు జెస్సీ (అన్నా బెన్) ఇంటర్ తో చదువాపేసి ఇంటి పట్టున వుంటుంది. చిన్న కూతురు స్కూలుకి పోతూంటుంది. కూతుళ్ళ పట్ల వర్ఘీస్ చాలా కఠినంగా  వుంటాడు. చిన్న కూతురు ఒకబ్బాయి సైకిలెక్కి స్కూలు నుంచి రావడం చూసి వెంటాడి బాగా కొడతాడు. కూతుళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఓ కన్నేసి వుంచుతాడు. ఇలాటి పరిస్థితుల్లో తల్లి కోసం ఒక కాల్ చేస్తుంది జెస్సీ. అది రాంగ్ నెంబర్ వెళ్లి ఇంకో వూళ్ళో వుం టున్న విష్ణు (రోషన్ మాథ్యీవ్) అనే ఆటో డ్రైవర్ కి చేరుతుంది. సారీ చెప్పి కట్ చేస్తుంది. అతను వూరుకోకుండా కాల్స్ చేస్తూంటాడు. మొదట వ్యతిరేకించినా క్రమంగా అతడికి దగ్గరవుతుంది. ప్రేమిస్తుంది ఫోన్లోనే.

        గ్రామంలో బెన్నీ (సుధి కొప్పా) అనే ఫ్యాన్సీ డ్రెస్సుల షాపతను జెస్సీని ప్రేమిస్తూంటాడు. తల్లి దండ్రులకి చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేయించుకుంటాడు. జెస్సీ ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళ ముందు నిలబెడతారు ఆమె తల్లిదండ్రులు. వాళ్లకి పెట్టిన ఫలహారం, టీలు చూసి - వీళ్ళకి బతకడమే చేతకావడం లేదని బెన్నీని తీసుకుని వెళ్ళిపోతుంది అతడి తల్లి.

        ఈ విషయం ఫోన్లో విష్ణుకి చెప్తుంది జెస్సీ. అతను స్పందించడు. అటు బెన్నీ డబ్బుకంటే గుణం చూడాలని తల్లి మీద చిందులేసి మొత్తానికి తల్లిని ఒప్పిస్తాడు. జెస్సీ తల్లిదండ్రులు సంతోషించి ఎంగేజి మెంటుకి బంధువుల్ని పిలిచేందుకు వూరెళ్తారు. ఈ అవకాశంతో జెస్సీ విష్ణుకి ఫోన్ చేసి, ఇక తాము పెళ్లి చేసుకోక తప్పదని అతనుంటున్న వూరు కోళికోడ్ కి వెళ్ళిపోతుంది. ఒకర్నొకరు గుర్తు పట్టే పరిస్థితి లేక బస్టాండ్ లో కలుసుకుందా మనుకుంటారు. బస్టాండ్ లో ఎవరో గొడవ పడుతూంటే ఆ గొడవలో ఫోన్ పోగొట్టుకుంటాడు విష్ణు. ఆ ఫోన్ రోయ్ ( శ్రీనాథ్ భాసి) అనే రౌడీలా వున్న అతడికి దొరుకుతుంది. ఫోన్ చేసి అతనే విష్ణు అనుకుని వెళ్లి కలుస్తుంది జెస్సీ.

        కలిస్తే ఏం జరిగింది? రోయ్ ఏం చేశాడు? తను విష్ణు కాదని చెప్పాడా? విష్ణు ఎక్కడున్నాడు? అతడికి జెస్సీ దొరికిందా? అసలు రోయ్ ఉద్దేశమేమిటి? ఈ ఇద్దరి మధ్య జెస్సీ ఏమైంది? ఇదీ మిగతా కథ. 

నటనలు -సాంకేతికాలు
      జెస్సీగా నటించిన అన్నా బెన్ కుంబళంగి నైట్స్, హెలెన్ అనే తొలి  రెండు విజయాలతో వుంది. ప్రస్తుత పాత్రలో సగటు అమ్మాయిగా ఒక పాసివ్ పాత్ర పోషించింది. ఇలాటి కోరికలు చంపుకుని జీవించే సగటు అమ్మాయిలు నిజ జీవితంలో వుండరని కాదు, బోలెడు మంది వుంటారు. ఆ పాసివ్ జీవితాల్ని యాక్టివ్ గా మార్చి చూపించక పోతే సినిమా అవదు. ఇలాటి అమ్మాయిలు ఎక్కడెక్కడున్నారో వాళ్ళ మీద ఒక డాక్యుమెంటరీ తీయవచ్చు, సినిమా కాదు. ఈ పాత్రలో అన్నా బెన్ విష్ణు దగ్గరికి వెళ్ళిపోయే తెగువ చూపించి ప్రోగ్రెసివ్ గా కన్పిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలే. తనకి లభించిన, ఈ ఉన్న సగటు అమ్మాయి పాత్ర ఎలా నటించిందంటే చక్కగా నటించింది. భావాలు విస్తారంగా పలికే మొహమామెది. 

      ఆటో డ్రైవర్ విష్ణుగా నటించిన రోషన్ మాథ్యీవ్ నాటక రంగంలో కూడా పేరున్న వాడు. సాఫ్ట్ గా కన్పించే తను నెగెటివ్ పాత్రగా రివీల్ అవడం, రఫ్ గా కన్పించే శ్రీనాథ్ భాసి పాజిటివ్ పాత్రగా రివీల్ అవడమనే డైనమిక్స్ కథా పరంగా బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే ఈ ఇద్దరితో పాటు జెస్సీ తండ్రి పాత్ర జేమ్స్ ఎలియా స్త్రీ పాత్రల్ని అణిచేసే మేల్ ఇగోతో వుండడం గమనించ వచ్చు. పెళ్లి చూపుల కొచ్చే బెన్నీ పాత్రది కూడా ఇదే ధోరణి. 

        కొండలూ లోయలతో లొకేషన్స్, ఆ లొకేషన్స్ మధ్య ఇళ్ళూ బావున్నాయి. మలయాళ సినిమాల్లో నేటివ్ లొకేషన్స్  హార్ష్ కలర్స్ కాకుండా కూల్ గా డీఐ చేయడం వల్ల ఆ ఫీల్ వస్తోంది. కోళికోడ్ టౌను సినిమాటోగ్రఫీ కూడా నేటివిటీ తప్పిపోలేదు. ఇంతే సాఫ్ట్ గా నేపథ్య సంగీతం, రెండు పాటలూ వున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ బడ్జెట్ ని కంట్రోలు చేస్తూ కూడా నాణ్యతతో వుంది. 

        తెలుగు సినిమాల్లో లాగా కామెడీ మలయాళం సినిమాల్లో తప్పనిసరి కాదు. కామెడీ అంటే నాటకీయత. నాటకీయతకి దూరంగా సహజత్వంతో తీస్తున్న ఇలాటి సినిమాలు మలయాళ ప్రేక్షకులు అలవాటు పడ్డారు. ఒకప్పుడు ప్రియదర్శన్ తీసిన కామెడీ సినిమాల్లాంటివి కూడా ఇప్పుడు రావడం లేదు. కొత్త దర్శకులతో మలయాళం సినిమా ఎదుగుతోంది. 

కథాకథనాలు
     దర్శకుడు కోళికోడ్ లో ఒక సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడొక అమ్మాయి ఎవరికోసమో వెతుక్కుంటూ కన్పించింది. అడిగితే  తనూ ఒకతనూ ఫేస్బుక్ లో  పరిచయమయ్యామని, తీరా కలుసుకుందామని వస్తే అతను రాలేదనీ వాపోయింది. దీన్ని కథగా చేసి ఈ సినిమా తీశానన్నాడు దర్శకుడు. కొత్త దర్శకుడు తీసినట్టుగా మాత్రం లేదు. నటనలు గానీ, టెక్నికల్ గా గానీ అనుభవమున్నవాడు తీసినట్టుంది. మంచి సమర్ధులైన టెక్నీషియన్స్ ని నియమించుకున్నానన్నాడు. 


        అయితే ఫేస్బుక్ ప్రియుడ్ని వెతుక్కుంటూ కన్పించిన అమ్మాయితో కలిగిన సానుభూతి, సినిమా తీసేసరికి అలాటి హీరోయిన్ పాత్రని అణిచేసే ధోరణిలోనే  తయారయ్యింది. జెస్సీకి ఇంట్లోగానీ బయటగానీ భావస్వాతంత్ర్యం లేదు. బెన్నీఅనే వాడు ఏక పక్షంగా ప్రేమించుకుని పెళ్లి చూపులు పెట్టుకుంటాడు. జెస్సీకి ఇష్టమా కాదా తెలుసుకోకుండా ఆమె పేరెంట్స్ సంబంధం ఒప్పేసుకుంటారు. ఆమె తండ్రి కూతుళ్ళ పట్ల ఎంత కఠినంగా వుంటాడో చిన్న కూతుర్ని చావబాదుతున్నప్పుడు చూస్తే చాలు. వాళ్ళ మీద నిఘా కూడా పైగా. తండ్రిగా కూతుళ్ళని సంరక్షించుకోవడం వేరు, సంరక్షణ పేరుతో పురుషాధిక్యం ప్రదర్శించడం వేరు. పెళ్లి విషయంలో బెన్నీది కూడా తల్లి మీద పురుషాధిక్యమే. ఇక విష్ణు అయితే జేస్సీని వల్లో వేసుకుని అమ్మేసే దుర్మార్గం. పరాయి అమ్మాయి జేస్సీని కాపాడుతూ రోయ్ మంచి మగాడే గానీ, తను ప్రేమిస్తున్న టీచర్ అమ్మాయితో పురుషాహంకారమే. ఈమె నా ఆస్తి అన్నట్టు ఇగోయే తప్ప, ఈమె నా సమస్తం అన్న ప్రేమే వుండదు. పాఠాలు చెప్పే ఆ టీచరమ్మ పాపం అణిగిమణిగి వుంటుంది. 

        నూట పది నిమిషాల నిడివిలో ఫస్టాఫ్ ఏమీ జరగదు- విష్ణుని కలుసుకోవడానికి  జెస్సీ బస్సెక్కి కోళికోడ్ వెళ్ళడం తప్ప. సెకండాఫ్ లో రోయ్ పాత్ర ప్రవేశంతోనే అసలు కథ మొదలవుతుంది. ఈ అసలు కథ చివరి పదిహేను నిమిషాలు తప్పించి ఒక సస్పెన్సుతో నడుస్తుంది. చివరి పదిహేను నిమిషాల్లో ముగింపు కొచ్చేసరికి రోమాంటిక్ డ్రామాగా చప్పగా ముగుస్తుంది. అంటే పెద్దలు చూసిన సంబంధమే తప్ప నీకంటూ నీ ఇష్టాలతో పనిలేదన్న పురుషాధిక్య భావజాలం ఉట్టి పడే సీన్లతో ముగుస్తుంది. చివరికి ఆమె ఫ్రెండ్ కూడా ఆమెకి  భావ స్వాతంత్ర్యమివ్వని మోరల్ పోలిసింగ్ తో మాట్లాడుతుంది. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి నువ్వెందుకు ఇరుక్కుంటావ్, ఇంటికెళ్ళి పొమ్మంటుంది. 

        ఇది అమాయక అమ్మాయిల్ని మోటివేట్ చేసే సినిమాయే అయితే, అమ్మాయిల స్మగ్లర్ల గురించి తనే పోలీసులకి సమాచారమిచ్చి సాటి అమ్మాయిల్ని కాపాడాలి ఒక కథానాయిక పాత్రగా. ఇది చెయ్యక, ప్రేమించిన వాడితో మోసపోయి, ఇంకేం చేయాలన్పించక ఇంటి ముఖం పట్టి, అదే బెన్నీ కన్పించి ముసిముసి నవ్వులు నవ్వితే, పెళ్ళికి తలూపడం తిరోగమనమే తప్ప అభ్యుదయం కాదు.

సికిందర్
rev. at telugurajyam.com



9, జులై 2020, గురువారం

955 : రివ్యూ


‘ఘూమ్ కేతు’
రచన - దర్శకత్వం : పుష్పేంద్ర నాథ్ మిశ్రా
తారాగణం: నవాజుద్దీన్ సిద్దిఖీ, రాగిణీ ఖన్నా, అనురాగ్ కశ్యప్, రఘువీర్ యాదవ్, ఇళా అరుణ్ తదితరులు
సంగీతం : స్నేహా ఖన్వాల్కర్. ఛాయాగ్రహణం : సత్య రాయ్ నాగ్ పల్
నిర్మాత : అనురాగ్ కశ్యప్, వికాస్ బహల్
***
      నురాగ్ కశ్యప్ లాంటి టాప్ దర్శకుడు నిర్మించిన సినిమా ఆరేళ్ళూ విడుదలకి నోచుకోక పోవడం వింతే. ఆరేళ్ళ నాడే ఇలా పురాతన కాలపు సినిమాలా తీసి కామెడీకి శ్రద్ధాంజలి ఘటిస్తే అది సినిమాకీ శ్రద్ధాంజలి ఘటించడమే అయింది. డిస్ట్రిబ్యూటర్లు కరోనా డెత్ అనుకుని పారిపోవడమే అయింది. ఇప్పుడు ‘జీ5’ ముందుకు వచ్చి స్ట్రీమింగ్ చేస్తే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సుదీర్ఘ అనుభవమున్న యాడ్ ఫిలిం మేకర్, టీవీ డైరెక్టర్ పుష్పేంద్ర నాథ్ మిశ్రా దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఈయన ప్రస్తుతం వెబ్ సిరీస్ కొచ్చాడు. ప్రస్తుతం ఈయన తీస్తున్న ‘తాజ్ మహల్ 1989’ అనే రిలేషన్ షిప్స్ తో కూడిన కథతో వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో పాపులర్ అవుతోంది.

       
వాజుద్దీన్ సిద్దిఖీ, అనురాగ్ కశ్యప్ లతో బాటు అతిధి పాత్రల్లో అమితాబ్ బచ్చన్, రణవీర్ సింగ్, సోనాక్షీ సిన్హా, చిత్రాంగద సింగ్, దర్శకుడు నిఖిల్ అద్వానీ లతో ఇంత స్టార్ ఎట్రాక్షన్ వున్నా, ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేదంటే దీని కామెడీ వ్యవహారం ఏ స్థాయిలో వుందో అర్ధం జేసుకోవచ్చు. ఉన్న గంటా 40 నిమిషాల నిడివికి కూడా నిలబడని కామెడీ పేరుతో ఏదో కథ!

కథ
     ఘూమ్ కేతు (నవాజుద్దీన్) తాజాగా జానకీ దేవి (రాగిణీ ఖన్నా) ని పెళ్లి చేసుకుని ఉత్తరప్రదేశ్ లో వుంటాడు. మనసు బాలీవుడ్ వైపు లాగుతూంటుంది. కిరాణా షాపు నడిపే తండ్రి దద్దూ (రఘువీర్ యాదవ్) నీకు సినిమా లేంట్రా అని చెడా మాడా తిడుతూంటాడు. తను బాలీవుడ్ రైటర్ అవ్వాల్సిందే నని పట్టుబట్టి కూర్చుంటాడు ఘూమ్ కేతు. కిరాణా లెక్కలు రాసినంత మాత్రాన, నీ పెళ్లి పత్రికల మీద పేర్లు రాసినంత మాత్రానా బాలీవుడ్ రైటర్ అయిపోతా వట్రా అని ధూంధాం చేస్తాడు పరమ కోపిష్టి దద్దూ. ఘూమ్ కేతుకి మేనత్త (ఇళా అరుణ్) సపోర్టు బాగా వుంటుంది. తల్లిలేదు, తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో ఇంకో పెళ్లి కాని  పెదనాన్న వుంటాడు. ఘూమ్ కేతు ఇలా కాదని ఒక ‘గిలిగింతలు’ అనే హాస్య పత్రికలో చేరడానికి పోతాడు. ఆ ఎడిటర్, నువ్వు పత్రికల్లో రాయడానికి పనికిరావని- సినిమా రైటర్ గా పని కొస్తావని- తను రాసిన ‘30 రోజుల్లో బాలీవుడ్ రైటర్ అవడమెలా?’ అన్న బుక్ ఇచ్చి ఆశీర్వదిస్తాడు. 

       ఆ బుక్ పట్టుకుని ముంబాయి పారిపోతాడు ఘూమ్ కేతు. పెళ్ళయిన పదిరోజుల్లో పారిపోవడం చూసి దద్దూ పోలీస్ కంప్లెయింట్ ఇస్తాడు. వాడి  ఫోటో ఇమ్మంటే ఫ్యామిలీ ఫోటో ఆల్బం తీసుకుని పారిపోయాడంటాడు. ఫోటో లేకుండా పోలీసులు ముంబాయి పోలీసులకి సమాచారం అందిస్తారు. ఫోటో లేని మిస్సింగ్ కేసు ఇన్స్ పెక్టర్ దద్లానీ (అనురాగ్ కశ్యప్) ముందుకొస్తుంది. 30 రోజుల్లో ఈ కేసు సాల్వ్ చేయకపోతే, మంచి నీళ్ళు కూడా పుట్టని చోట ట్రాన్స్ ఫర్ అయిపోతావని పై అధికారి నుంచి వార్నింగ్ వస్తుంది. 

        పోలీసులకి ఫోటో దొరక్కుండా ఇన్స్ పెక్టర్ దద్లానీ పై పోర్షన్లోనే మకాం వేసిన  ఘూమ్ కేతు జోరుగా మూడు స్క్రిప్టులు రాస్తూంటాడు. షారుఖ్ ఖాన్ ని టార్గెట్ గా  పెట్టుకుంటాడు. ఓ దొంగ ఆ స్క్రిప్టులు ఎత్తుకుపోవడంతో పోలీస్ స్టేషన్ కెళ్ళి ఇన్స్ పెక్టర్ దద్లానీకే కంప్లెయింట్ ఇస్తాడు. ఇప్పుడేం జరిగింది? దద్లానీ ఘూమ్ కేతుని పట్టుకున్నాడా? ఘూమ్ కేతు బాలీవుడ్ రైటర్ అయ్యాడా? ఇద్దరిలో ఎవరి ఆశయం నెరవేరింది? ఇదీ మిగతా కథ. 

నటనలు - సాంకేతికాలు 
      1970 మోడల్ గెటప్ తో, డ్రెస్సులతో నవాజుద్దీన్ అవుట్ డేటెడ్ గా వుంటే కామెడీగా వుంటుందనుకున్నట్టుంది. ఇది బెడిసి కొట్టింది. నవ్వుకాదు కదా నీరసం వచ్చేస్తుంది. ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ లో ఇర్ఫాన్ ఖాన్ ఇప్పటి ఫ్యాషన్ తో రంగు రంగుల డ్రెస్సు లేసుకుంటే మాంచి కిక్ తో నవ్వొచ్చే సందర్భం. నవాజుద్దీన్ ఘూమ్ కేతు పాత్ర కూడా కాలం చెల్లిన పురాతన సినిమా పాత్ర. ఇలా కూడా నటించడానికీ, ఏదో నవ్వించడా నికీ తగిన స్పేస్ కూడా లేదు. అతడి స్పేస్ ని ఇతర పురాతన పాత్రలు మింగేస్తూంటాయి. బాలీవుడ్ లో రైటర్ గా ఎపిసోడ్స్ కూడా పెద్దగా ఏమీ వుండవు. మధ్యలోనే అతను విరమించుకుని వెనక్కి రావడంతో, మొదట్లో ఆసక్తి రేకెత్తించిన రైటర్ పాత్ర ముగిసిపోయి తేలిపోతాడు. నవాజుద్దీన్ ఈ సినిమా చేయడం బ్యాడ్ జడ్జిమెంట్. 

        ఇన్స్ పెక్టర్ గా అనురాగ్ కశ్యప్ ఇంకో బలహీన కామెడీ పాత్ర. ఇందులో తనుకూడా చేయగల్గిందేమీ లేదు. వూళ్ళో ఘూమ్ కేతు ఇంటిదగ్గర పాత్రలన్నీ ఓవరాక్షన్ కామెడీ. వీళ్ళంతా సినిమాకి చేయాల్సిన హాని అంతా చేసేస్తారు. అతిధి పాత్రల్లో కన్పించే అమితాబ్ బచ్చన్, రణవీర్ సింగ్, సోనాక్షి సిన్హా తదితరులు వాళ్ళ వాళ్ళ సినిమా షూటింగుల్లో సంక్షిప్తంగా కన్పిస్తారు. సంక్షిప్తంగా కన్పించినా, చివర్లో అమితాబ్ పాత్ర కథని మలుపు తిప్పే పాత్ర. ఈ అవుట్ డేటెడ్ సినిమాకి అమితాబ్ వల్ల చివరి పది నిమిషాలే కాస్త హుషారు పుడుతుంది.  

        సాంకేతికంగా యాడ్ ఫిలిం మేకర్ గా కొన్ని క్రియేటివిటీలు చూపించాడు దర్శకుడు. అట్టహాసంగా సెట్ వేసి సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ చేయడం, నవాజుద్దీన్ వూహించుకుని రాస్తున్న మూడు కథల్ని విజువలైజ్ చేసి చూపించడం మొదలైనవి. 16 ఎంఎం బ్లాక్ అండ్ వైట్ లో చార్లీ చాప్లిన్ టైపు మూకీ సీన్లు వేసి వ్యంగ్యం చేయాలనుకున్న క్రియేటివ్ ప్రయత్నం కూడా రాణించలేదు. ఇవి పాత కాలం ప్రేక్షకులకి తప్ప నేటి యువ ప్రేక్షకులకి ఎక్కవు. ఇక సంగీతం, ఛాయాగ్రహణం పేలవంగానే వున్నాయి. నిర్మాణ విలువలకి స్థానం లేదు. తక్కువ బడ్జెట్ లో లాగించేశారు.  

కథాకథనాలు 
     2007 లో కమెడియన్ వినయ్ పాఠక్, రజత్ కపూర్ లతో వచ్చిన సూపర్ హిట్ ‘భేజా ఫ్రై’ తో పోలిస్తే ‘ఘూమ్ కేతు’ కథ ఓ కామెడీ కథే కాదు. ‘భేజా ఫ్రై’ లో వినయ్ పాఠక్ బాలీవుడ్ సింగర్ నవ్వాలని పల్లెటూరు నుంచి వచ్చి, ఆడియో కంపెనీ బాస్ రజత్ కపూర్ ఇంట్లో తిష్టవేసి, తన సంగీత రాగాలతో బుర్ర తినేస్తాడు. చాలా అమాయక క్యారక్టర్. తనేం చేస్తున్నాడో తెలుసుకోకుండా ఆడియో బాస్ కీ, అతడి భార్యకీ తంపులు పెట్టి కాపురం గుల్ల చేస్తాడు. ఇదొక విజయవంతమైన న్యూ ఏజ్ కామెడీ. ‘ఘూమ్ కేతు’ లో నవాజుద్దీన్ కి బాలీవుడ్ లో రైటర్ అయ్యే ప్రయత్నాలతో తగిన సీన్లే వుండవు. ఈ సీన్ల మధ్య వూళ్ళో వున్న ఓల్డ్ ఫ్యామిలీ గొడవల కామెడీలు మాటి మాటికీ వస్తూంటాయి. ఇవే ఎక్కువ భాగం ఆక్రమిస్తూ కథకి అడ్డు పడుతూంటాయి.

        పైగా దర్శకుడు ‘ఫోర్త్ వాల్’ టెక్నిక్ ప్రదర్శించడం ఒకటి. అంటే పాత్ర ప్రేక్షకుల వైపు చూస్తూ కథని, పాత్రల్ని వివరించడం. ఇది ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ లో అక్షయ్ ఖన్నా మీద బాగా వర్కౌట్ అయింది. ‘ఘూమ్ కేతు’ లో ఫ్యామిలీ గొడవల్ని చూపించడానికే ఈ టెక్నిక్ ని సాకుగా వాడుకున్నాడు దర్శకుడు. రైటర్ నవ్వాలని ముంబాయి వెళ్ళిపోయిన నవాజుద్దీన్ ఆ ప్రయత్నాలేవో చేసుకోకుండా, ఎప్పుడు చూసినా ఇంకా ఎక్కడో వూళ్ళో వదిలేసి వచ్చిన ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకుంటూ -  మా నాన్న ఇలా చేశాడు, పిన్ని ఇలా చేసింది, మేనత్త ఇలా చేసింది, కొత్త భార్యతో ఇలా జరిగిందీ అని ప్రేక్షకులకి చెబుతూ పిచ్చి కామెడీ సీన్లేసు కోవడమేమిటో? ఈ కథ ఫ్యామిలీ గొడవల గురించా, బాలీవుడ్ ప్రయత్నాల గురించా?

        స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్, స్ట్రక్చర్ సంబంధ సూత్రాలూ పట్టించుకోక పోవడం వల్ల ‘ఘూమ్ కేతు’ అయినా, ‘సూఫీయం సుజాతాయుమ్’ అయినా కథేమిటో అర్ధంగాని దయనీయ స్థితిలో పడి అట్టర్ ఫ్లాపయ్యాయి. నవాజుద్దీన్ 30 రోజుల్లో బాలీవుడ్ రైటర్ అవ్వాలి, అనురాగ్ కశ్యప్ 30 రోజుల్లో నవాజుద్దీన్ ని పట్టుకోవాలి. ఇదీ కథకి పాయింటు, కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు, ఈ కాన్ఫ్లిక్ట్ ఏర్పడగానే నవాజుద్దీన్ రైటర్ అయ్యే ప్రయత్నాలు మానుకుని ఊరికెళ్ళి పోతాడు. ‘సూఫీయం సుజాతాయుమ్’ లో కూడా కాన్ఫ్లిక్ట్ ఏర్పడగానే పాత్రలు  దేని దారి అది చూసుకుంటాయి. ఇవి కథలెలా అవుతాయి? వీటినెవరు చూస్తారు?

        నవాజుద్దీన్ స్క్రిప్టు పోగొట్టుకున్నాక వూళ్ళో వున్న ఫ్యామిలీ గుర్తుకొచ్చి, ఆ సెంటి మెంట్లు గొప్పగా అన్పించి ముంబాయి వదిలి ఇంటికెళ్ళి పోతాడు. అసలు ఈ పాత్రే రైటర్ పాత్రగా నమ్మశక్యంగా వుండదు. జీవితంలో ఏమీ రాయని వాడు బాలీవుడ్ రైటర్ అవ్వా లనుకోవడం ఆషామాషీగా తీసుకున్నట్టుంది దర్శకుడు. అతను రాసే కథలు కూడా ‘సవతి తల్లి’ అనీ, ‘బాత్రూం లో హత్య’ అనీ ఇలాటి చిల్లర వేషాలు.  

        నవాజుద్దీన్ స్క్రిప్టు రాసుకుంటూ ఒక చోట అనుకుంటాడు - ‘కామెడీ రాయడం సీరియస్ బిజినెస్, ప్రేక్షకులు కూడా నవ్వాలి కదా’ అని. దర్శకుడు మాత్రం దీన్ని సీరియస్ బిజినెస్ గా తీసుకోక ‘సి గ్రేడ్’ కామెడీగా చేసి వదిలాడు.

సికిందర్
(తెలుగురాజ్యం డాట్ కాం)


8, జులై 2020, బుధవారం



డియర్ రీడర్స్,
ఓటీటీలో విడుదలయ్యే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాల రివ్యూలు ఈ రోజు నుంచి ‘తెలుగు రాజ్యం డాట్ కాం
లో  పోస్ట్ అవుతాయి. ఈ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.


సూఫీయుం సుజాతాయుం మూవీ రివ్యూ