రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, ఏప్రిల్ 2021, గురువారం


       సైకాలజీ, సినిమా కథ వేర్వేరు ప్రక్రియలు. సైకాలజీ ఆధారంగా సినిమాలు తీస్తే  సినిమాలు ఇంకో రూపంలోకి మారతాయి. శివ నే తీసుకుని సైకాలజీ ఆధారంగా తీస్తే ఇంకోలా వుంటుంది. ఇదెలాగో తర్వాత చూద్దాం. ముందు జీవితంలో సమస్య ఏదైనా ఎదురైతే, ఆ సమస్యని అక్కడితో మర్చిపొమ్మంటుంది సైకాలజీ. మర్చిపోయి పరిష్కారం మీదికెళ్ళి పొమ్మంటుంది. సమస్య వస్తే దానికి కౌంటర్ గా పరిష్కారాన్ని పెట్టాలి. ఇలా గాకుండా సమస్య గురించే ఆలోచిస్తూ, ఆందోళన చెందుతూ వుంటే, సమస్యతోనే వుండిపోతారు. దీంతో ఆ సమస్య మరిన్ని సమస్యలకి దారితీస్తుంది. ఇంకేవో బాధలు చుట్టు ముడతాయి, మైండ్ చెడుతుంది, మానసిక సమస్యలొస్తాయి. అన్నం సయించదు, నిద్రపట్టదు. ఇక అసహనం కోపం అరుపులూ వగైరా ఆడియో విజువల్ ఎఫెక్ట్సు, హాస్పిటల్ బెడ్ అదనపు హంగులు- ఇదంతా అవసరమా? ఇదంతా లో- వైబ్రేషన్ యాక్టివిటీ. ఈ లో- వైబ్రేషన్స్ ని చుట్టూ వున్న వాళ్ళకి కూడా అంటించేస్తారు. కనుక ఏం చేయాలంటే, సమస్యతో ఫలానా ఈ పరిస్థితి వచ్చింది సరే, ఇక దాన్ని వదిలేసి, ఇలా కాక ఏ పరిస్థితి వుంటే బావుంటుందని కోరుకుంటున్నారో - ఆ పరిస్థితిని విజువలైజ్ చేసుకుని, వెంటనే దాని సాధనకి యాక్షన్లోకి దిగి పొమ్మంటుంది సైకాలజీ. ఇది హై వైబ్రేషన్ యాక్టివిటీ. మైండ్ అనేది ముందుకెళ్ళే యాక్షన్ కోసమే తప్ప, జడంగా వుండే బాధ కోసం కాదు, దాంతో మానసిక, శారీరక అనారోగ్యాలు తెచ్చుకోవడం కోసం కాదు.  

        అందుకని మైండ్ ని ఎలా ట్రైనప్ చేసుకోవాలంటే, సమస్య ఎదురైనప్పుడు ఫ్లాష్ లా దాని మారు దృశ్యం (పరిష్కారం) విజువలైజ్ అయిపోవాలి. విజువలైజ్ ఎందుకంటే, మైండ్ కి ఒక థాట్ వచ్చిందంటే ఇంకో థాట్ మీదికి వెళ్లిపోతుంది. నిమిషానికి 260 థాట్స్ వస్తాయి మైండ్ కి. అంత బిజీగా వుంటుంది. అందుకని సమస్యకి పరిష్కారంగా ఒక థాట్ వచ్చిందంటే, వెంటనే దాన్ని విజువలైజ్ చేసుకుంటే, మైండ్ ఆ విజువలైజ్ అయిన దృశ్యం మీద ఆగిపోతుంది. ఇక ఆ దృశ్యాన్ని ఓన్ చేసుకుని, దాన్ని సాధించే వైబ్రేషన్స్ ప్రసారం చేస్తూ ముందుకు సాగిపోతుంది. సమస్యకి పరిష్కారంగా కోరుకుంటున్న దృశ్యాన్ని కళ్ళు మూసుకుని  మైండ్ లో మైండ్ కి చూపించాలి. చూపిస్తే ఆ పరిష్కారాన్ని నిజం చేసే పని మైండ్ చూసుకుంటుంది.
***
        ఇప్పుడు సినిమా కథలో ఏం జరుగుతుందో చూద్దాం. హీరో ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గరి కొస్తాడు. అక్కడ సమస్య ఎదురవుతుంది. దాంతో పోరాటం మొదలెడతాడు. పోరాడుతూ పోరాడుతూ పోరాడుతూ పోయి పోయీ, చివరాఖరికి ఎక్కడో సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ దగ్గర, పరిష్కారం కనిపెడతాడు. ఇది ఒక రోజు నుంచి కొన్ని సంవత్సరాల కథగా వుండొచ్చు. అంటే అంత కాలం సమస్యనే పట్టుకుని మధన పడుతున్నాడన్న మాట. పరిష్కారం ఆలోచించాలని తట్టడమే లేదు ప్లాట్ పాయింట్ టూ కి వచ్చేదాకా. ఈ క్రమంలో చాలా నష్టాలు కూడా చవి చూస్తాడు.

        దీన్ని శివ  అనే యాక్షన్ లో చూద్దాం : ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర నాగార్జున జేడీని కొట్టి పడేశాక, అది మాఫియా భవానీతో సమస్యకి దారి తీస్తుంది. ఇక ఆ భవానీతో  పోరాడీ పోరాడీ, సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ దగ్గర, భవానీతో సమస్యకి పరిష్కారంగా భావానీ అనుచరుడు గణేష్ ని పట్టుకుంటాడు. ఈ పోరాటంలో ఒక మిత్రుణ్ణీ, అన్న కుమార్తెనీ కోల్పతాడు.

        దీనికి పైన చెప్పుకున్న సైకాలజీ ఆధారంగా చేస్తే? అప్పుడు ప్లాట్ పాయింట్ వన్ లో నాగార్జున జేడీని కొట్టాక, భవానీతో ఎదురైన సమస్యకి వెంటనే పరిష్కారం ఆలోచిస్తాడు. దాన్ని విజువలైజ్ చేసుకుంటాడు. బిగ్ పిక్చర్ ని చూస్తాడు. సమస్య పట్టుకుని, సమస్యతోనే వుండిపోయి, భవానీతో పిన్ టు పిన్ పోరాటం చేయడు. దూర దృష్టితో బిగ్ పిక్చర్ ని చూస్తాడు. మొత్తం నగరానికి భవానీ సమస్యని  వదిలించే పిక్చర్. దీనికి అతడి మూలాల్ని పెకిలించి వేసే నిర్ణయం. ఇందుకు గణేష్ నే పట్టుకోవాలన్న గోల్.

        అంటే సినిమాలో చూపించినట్టు ప్లాట్ పాయింట్ టూ దగ్గర, గణేష్ ని పట్టుకునే పరిష్కార మార్గమేదో ఇప్పుడే ఆలోచిస్తాడన్న మాట. అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్యకి కారణమైన జేడీని కొట్టిన సంఘటనని ఇక మనసులోంచి తుడిచేసి, గణేష్ ని పట్టుకునే పరిష్కారాన్ని విజువలైజ్ చేసుకుంటాడన్న మాట. సింపుల్ గా చెప్పాలంటే తాత్కాలికమైన ప్రెజెంట్ కోసం గాక, శాశ్వతమైన ఫ్యూచర్ కోసం ప్రయాణం సాగిస్తాడన్న మాట.
***
        నిజానికి శివ సెకండాఫ్ రెండో సీన్లో మిత్రుణ్ణి కోల్పోపోయిన నేపథ్యంలో నాగార్జున అంటాడు : "నా తప్పు నాకిప్పుడు అర్ధమవుతోంది. రౌడీయిజానికి ఎదురు తిరిగాను కానీ అదొక్కటే సరిపోదని తెలిసింది. మల్లిని చంపాడన్న కోపంతో నేను భవానీని చంపితే, వ్యక్తిగతంగా నా పగ తీర్చుకోవడమే తప్ప, ఇంకేమీ జరగదు. ఈ భవానీ కాకపోతే రేపు గణేష్ భవానీ అవుతాడు, లేకపోతే ఇంకొకడు. దీనికి సొల్యూషన్ భవానీని చంపడం కాదు, అలాటి గూండాల్ని పుట్టిస్తున్న వ్యవస్థని నాశనం చెయ్యాలి- గెలుస్తానో లేదో తెలీదు, కానీ ప్రయత్నిస్తాను" అని.

         వ్యవస్థని నాశనం చేయాలన్న బిగ్ పిక్చర్ ని ఆలస్యంగా ఇప్పుడు చూశాడు. దీన్ని సాధించే మార్గాన్ని ప్లాట్ పాయింట్ టూలో కనుక్కున్నాడు. సైకాలజీతో విభేదించి సినిమా కథల్లో పరిష్కారం ఆలస్యంగా ప్లాట్ పాయిట్ టూ దగ్గరే ఎందుకుంటుంది? ఎందుకంటే సినిమా కథలు స్పిరిచ్యువల్ జర్నీలు. ఇంకే మాధ్యమంలో కథలైనా స్పిరిచ్యువల్ జర్నీలే. స్పిరిచ్యువల్ జర్నీ అంటే మానసిక లోకపు మధనం. ప్రపంచ పురాణాల్లో కథలన్నీ  మానసిక లోకపు మధనాలే. కథలు మనిషి స్వాస్థ్యం కోసం - అంటే మానసిక శారీరక ఆరోగ్యాల కోసం మానసిక లోకపు మధనాలుగానే వుంటాయని పురాణాలు నిర్ణయించాయి. 
.
        ఇప్పుడు కూడా ఎవరు ఏ కథ రాయాలన్నా తెలియకుండా మానసిక లోకపు మధనాన్నే రాసేస్తారు. దీన్నుంచి తప్పించుకోలేరు. కథంటే మానసిక లోకం. ఏమిటా మానసిక లోకం? ఒక వెలుపలి మనసు, ఒక అంతరాత్మ, మధ్యలో అహం. ఈ మూడూ లేకుండా మానవ జాతి లేదు.

        సరే, అప్పుడు మానసిక లోకంలో అంతర్భాగంగా వుండే వెలుపలి మనసు, అంతరాత్మ, అహం - ఈ మూడూ కాన్షస్ మైండ్, సబ్ కాన్షస్ మైండ్, ఇగో లన్నమాట. అప్పుడు పురాణాల్లో, ఇతర కథల్లో, ఇవి 1. బిగినింగ్ (ఫస్ట్ యాక్ట్- కాన్షస్ మైండ్ అంటే వెలుపలి మనసు), 2. మిడిల్ (సెకండ్ యాక్ట్ - సబ్ కాన్షస్ మైండ్ అంటే అంతరాత్మ), 3. ఎండ్ (థర్డ్ యాక్ట్ - మోక్షం) గా వుంటున్నాయి. ఇక ఇగో (అహం) పురాణాల్లో స్పిరిచ్యువల్ జర్నీ చేసే పురాణ పురుషుడుగా, ఇతర కథల్లో కథానాయకుడుగా, సినిమాల్లో హీరోగా వుంటున్నారు. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ పరమార్ధం ఇదన్న మాట.

        ఇప్పుడు ఈ నిర్మాణంతో వున్న మానసిక లోకంలో ఏం జరుగుతుంది? వెలుపలి మనసులో వుండే ఇగో, అంతరాత్మలో ఎంటరై, జీవితాన్ని మధిస్తుంది. తన సమస్యకి  పరిష్కారాన్ని అంతరాత్మ నుంచి అంది పుచ్చుకుని, మధనాన్ని ముగిస్తుంది. స్క్రీన్ ప్లేలో దీన్నిలా చూస్తాం : బిగినింగ్ (వెలుపలి మనసు) లో వుండే హీరో, ప్లాట్ పాయింట్ వన్ అనే గడప తొక్కి, సమస్యని తీసుకుని, మిడిల్ (అంతరాత్మ) లోకి ఎంటరై, సంఘర్షణ చేసి, పరిష్కారంతో ప్లాట్ పాయింట్ టూ అనే వెనుక గడప తొక్కి, ఎండ్ లోకి అడుగుపెట్టి  విజయం సాధించడం.

        రాముడు అయోధ్యలో వుండడం బిగినింగ్, అడవుల కెళ్ళడం మిడిల్, రావణుణ్ణి సంహరించడం ఎండ్. అంటే మిడిల్లో పాత్ర ఎందులోనైతే ప్రవేశిస్తుందో, ఆ మిడిల్ అంతా సబ్ కాన్షస్ (అంతరాత్మ) వరల్డే. ప్రేమికుల మధ్య సమస్య వచ్చిందంటే, ఆ సమస్య వాళ్ళు మధించాల్సిన సబ్ కాన్షస్ వరల్డ్. పోలీసు హంతకుణ్ణి పట్టుకోవాలంటే ఆ వేట అంతా సబ్ కాన్షస్ వరల్డ్. ఒక్కడు లో మహేష్ బాబు భూమికని తెచ్చి గదిలో దాచాడంటే, ఆ గది సబ్ కాన్షస్ వరల్డ్. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ కోర్టులో కేసు పోరాడుతున్నాడంటే ఆ కోర్టు సబ్ కాన్షస్ వరల్డ్. హార్రర్ సినిమాల్లో భూత్ బంగళా సబ్ కాన్షస్ వరల్డ్. పాత్ర వుంటున్న సాధారణ ప్రపంచం లోంచి, ఏ అసాధారణ లోకంలోకి ఎంటరైనా, అది సబ్ కాన్షస్ వరల్డే అవుతుంది.

        ఈ అంతరాత్మ లేదా సబ్ కాన్షస్ వరల్డ్ లో పాత్ర సమస్యతో పోరాటం చేస్తుంది. సమస్య రూపంలో అంతరాత్మ పాత్రకి పరీక్షలు పెడుతుంది. ఈ పరీక్షలు నెగ్గే ఉపాయాలూ అందిస్తుంది. ఈ పరీక్షలతో పాత్ర పడుతూ లేస్తూ ప్రయాణిస్తూంటుంది. ఇదే హీరోస్ జర్నీ అయింది. జీవితం గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలే ఈ జర్నీ. తెలుసుకున్న తర్వాత సమస్యలోంచి బయట పడే పరిష్కార మార్గం లేదా అమృత భాండం అంతరాత్మ అందిస్తుంది. ఈ పడుతూ లేస్తూ చేసే జర్నీలో ఒక్కో మజిలీ వుంటుంది. ఒక్కో మజిలీలో ఒక్కో సత్యాన్ని తెలుసుకుంటుంది పాత్ర.

        ఇందుకే సుఖాంతమో దుఖాంతమో జర్నీ చివర పరిష్కార మార్గంతో కథలన్నీ స్పిరిచ్యువల్ జర్నీలే. హాలీవుడ్ తీసినా ఇంతే. ఇందుకే శివ లో నాగార్జునకి ప్లాట్ పాయింట్ టూ దగ్గర మాత్రమే పరిష్కారం దొరికింది. ఇందుకే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, సమస్యతో బాటు బిగ్ పిక్చర్ ని చూసే పరిష్కార మార్గం అందక, పరీక్షలెదుర్కొంటున్న జర్నీలో భాగంగా, ఆలస్యంగా - సెకండాఫ్ సెకండ్ సీను మజిలీలో - ఇక వ్యవస్థని నాశనం చేయాలన్న బిగ్ పిక్చర్ ని చూడగలిగాడు నాగార్జున.
***
    ఇలా అంతరాత్మని తెలుసుకునే జర్నీగా స్పిరిచ్యువల్ కథలుంటాయి. కానీ సైకాలజీ ప్రకారం చూస్తే, కథకి అంతరాత్మని తెలుసుకునే స్పిరిచ్యువల్ జర్నీ అనేది  వుండదు. రోగం, దానికి తక్షణ ట్రీట్మెంట్ అన్న ప్రక్రియగానే వుంటుంది. వెళ్ళి ధ్యానం చేసి నీ అంతరాత్మని తెలుసుకొమ్మని సైకియాట్రిస్టు పంపడు. కనుక సైకాలజీ ప్రకారం చూస్తే,  శివ లో నాగార్జున భవానీతో రోగాన్ని చూస్తాడు. ఆ రోగానికి కారణమైన వ్యవస్థ మూలాల్ని నిర్మూలించడానికి గణేష్ ని పట్టుకునే ట్రీట్ మెంట్ ప్రారంభిస్తాడు. ఇలా కథ మారిపోతుంది. మరి శివ లో వున్న ప్లాట్ పాయింట్ టూ నుంచి గణేష్ ని ఇవతలికి లాగేస్తే, సైకాలజీ ప్రకారం ప్లాట్ పాయింట్ టూలో ఏం జరుగుతుంది? ఇది కథ చేస్తూంటే తెలుస్తుంది.

        సరే, మరి త్రీయాక్ట్స్ స్పిరిచ్యువల్ జర్నీ స్క్రీన్ ప్లేని ఇలా మార్చడం ఎంతవరకు సబబు? అసలిప్పుడున్న త్రీయాక్ట్స్ స్పిరిచ్యువల్ జర్నీ స్క్రీన్ ప్లే ఒకప్పుడు లేదు. పురాణాల్లోంచి వచ్చిన మోనోమిత్ (స్పిరిచ్యువల్ జర్నీ) స్క్రీన్ ప్లేల్లో 18 మజిలీలు వుండేవి. దీన్ని సీడ్ ఫీల్డ్ 5 కి కుదించి స్పీడు పెంచాడు. అంతమాత్రాన స్క్రీన్ ప్లేలు కథతో సైకోథెరఫీ చేసే మోతాదు ఏమీ తగ్గలేదు. సైకాలజీ ప్రకారం కథ చేసినా సైకో థెరఫీతోనే వుంటుంది. అంటే స్పిరిచ్యువల్ జర్నీ వుంటుంది. కాకపోతే ఈ స్పిరిచువల్ జర్నీ సమస్యతో వుండదు, రివర్స్ లో నేరుగా పరిష్కారంతో వుంటుంది.  
***
        సైకాలజీ ప్రకారం వున్న ఒక కథ చూద్దాం. నాగార్జున నటించిన మన్మథుడు 2 లో నాగార్జున సమస్య వాళ్ళమ్మ లక్ష్మి పెట్టిన మూడునెలల్లో పెళ్ళి చేసుకోవాలన్న డెడ్ లైన్. పెళ్ళి ఇష్టం లేని నాగార్జున దీన్నుంచి తప్పించుకోవడానికి మార్గం (పరిష్కారం) ఆలోచించి, రకుల్ ప్రీత్ సింగ్ తో కాంట్రాక్టు కుదుర్చుకుంటాడు. దాని ప్రకారం ఆమె పెళ్ళికి ఒప్పుకున్నట్టు నటించి, తీరా పెళ్ళి సమయంలో లేకుండా ఉడాయిస్తే, వాళ్ళమ్మ మళ్ళీ పెళ్ళి మాటెత్తదని ప్లాను. ఇలా సమస్యకి వెంటనే పరిష్కారం కనుక్కుని రంగంలోకి దిగుతాడు నాగార్జున. ఇది ఫెయిలైతే ప్లాన్ బి ఆలోచిస్తాడు. ఇలా ట్రయల్స్ వేస్తాడు. ఈ ట్రయల్స్ లో ప్రత్యర్ధి పాత్ర లక్ష్మి గల్లంతయి కథ విఫలమవడం వేరే విషయం. ట్రయల్స్ తో నాగార్జున చేసేది స్పిరిచ్యువల్ జర్నీయే. ఈ అర్ధాన్ని పట్టుకుని కథ చేసి వుండాల్సింది.

        స్పిరిచ్యువల్ జర్నీలే సినిమా కథలు. చదువుకోకుండా ఆవారాగా తిరిగే హీరో వుంటాడు. అతడితో ఇంట్లో గొడవ. అతను మారడు. అతణ్ణి ఇంట్లోంచి వెళ్ళి పొమ్మనడమో లేదా అతనే వెళ్ళి పోవడమో జరిగి, ఇక స్పిరిచ్యువల్ జర్నీ చేస్తాడు. మంచి చెడ్డలు తెలుసుకుని మారిన మనిషిగా తిరిగొస్తాడు.

        సైకాలజీ కథ - ఆవారా హీరోని ఇంట్లో ఏమీ అనరు. బాగా చదువుకుంటున్నాడు, బయటి తిళ్ళు తినడం లేదు, తాగి ఇంటికి రావడం లేదు, టైముకి కాలేజీకి వెళ్తున్నాడు, టైముకి ఇంటికే వస్తున్నాడు - ఇలా పాజిటివ్ వైబ్రేషన్స్ తో మనస్సులోనే ఆశీర్వదిస్తూంటారు. అతడిలో మార్పు కనబడతూంటుంది. ఆశీర్వాదానికుండే వైబ్రేషన్స్ అత్యంత శక్తివంతమైనవి. అందుకే గ్లాడ్ బ్లెస్ యూ అంటారు.

సికిందర్  

 

14, ఏప్రిల్ 2021, బుధవారం

1035 : స్క్రీన్ ప్లే సంగతులు


 

        గాది శుభాకాంక్షలు. సినిమాలెలా వుండాలో థియేటర్లు నిర్ణయించడంతో ఒక మూసలో కమర్షియల్ సినిమాలదే రాజ్యమైంది. దీంతో ఆర్ట్, రియలిస్టిక్, ఇండిపెండెంట్ సినిమాలనే ఇతర క్రియేటివ్ వ్యాపకాలకి ప్రదర్శనా రంగంలో చోటు లేకుండా పోయింది. గత రెండు దశాబ్దాలుగా మరీ థియేటర్లు ప్రేక్షకులంటే మూస ప్రేక్షకులేనని ముద్రవేసి, సినిమాలంటే మూస కమర్షియల్ సినిమాలేనని చెప్పడం వల్ల, మూసేతర సినిమాలు తీయాలనుకునే మేకర్స్ కి ప్రేక్షకులు కరువై పోయారు. దీంతో కె ఎన్ టీ శాస్త్రీలు, రాజేష్ టచ్ రివర్లు ఆర్ట్ సినిమాలతో ఫిలిమ్ ఫెస్టివల్స్ కి పరిమితమవాల్సి వచ్చింది. డాక్టర్ డి రామానాయుడు కూడా కమర్షియల్ సినిమాలు తీస్తూ మధ్య మధ్యలో అవార్డు సినిమా తీస్తాననేవారు. ఇదేదో మనకి సంబంధించింది కాదులే అనుకునే వాళ్ళు ప్రేక్షకులు. ఆర్ట్ సినిమా అంటే ప్రేక్షకులకి అంటరాని సినిమాగా అభిప్రాయం కల్గించారు. కోవిడ్ తో మనుషులే అంటరాని వాళ్ళయి, లాక్ డౌన్ తో థియేటర్లే మూతబడి, అవ్వాల్సిందంతా అయింది. లాక్ డౌన్ తో తెలుగు జాతి సామూహికంగా ఇళ్ళల్లో బందీ అయి, ఓటీటీల్లో నిర్బంధంగా సినిమాలు చూస్తున్నాక, ఆ ఓటీటీల్లో జీవితాలకి దగ్గరగా వుంటున్న వివిధ ఆర్ట్ -రియలిస్టిక్- ఇండిపెడెంట్ సినిమాల విలువ తెలిసి వచ్చింది. వచ్చాక వరస మారి చిన్న మూసకి ఎసరు వచ్చింది. చిన్న మూస ఒక ముంగిస.

        ప్పుడిక థియేటర్లకీ స్వేచ్ఛ లభించి, మూస తో బాటూ మూసేతర సినిమాలూ ప్రదర్శించుకునే అవకాశం చిక్కింది. అయితే మూసేతర రియాలిస్టిక్, ఇండిపెండెంట్ సినిమాలనేవి దాదాపూ చిన్న సినిమాలుగానే వుంటాయి. తెలుగులో నూటికి 90 శాతం  చిన్న సినిమాలే ఉత్పత్తి అవుతున్నాయి, అట్టర్ ఫ్లాప్ కూడా అవుతున్నాయి. అందుకని  వీటి బాగోగుల గురించే పదే పదే చెప్పుకునేది. ఇంత కాలం చిన్న మేకర్లు చిన్న మూసలు తీస్తూ మూసకి మూసన్నర మోసపోయారు. పెద్ద మూసని స్టార్ కాపాడతాడు. చిన్న మూసని ఎవరూ కాపాడ లేరు. అయినా కూడా పెద్ద కమర్షియల్ మూసలకి భావ దాస్యం చేస్తూ, చిన్న మూస అంటే పెద్ద మూసగానే తీయాలేమో ననుకుని తీస్తూ, ఏడాదికి 100 మంది చొప్పున కొత్త మూస మేకర్లు రావడం, ఫ్లాప్ చేసుకుని వెళ్లిపోవడం.

      ఐనా కూడా ఇప్పుడింకా పద్ధతి మార్చుకుని రియలిస్టిక్, ఇండిపెండెంట్ సినిమాలకి చిన్న మేకర్ సిద్ధం కాకపోతే - పూర్వంలాగే థియేటర్ కి ఎలాగూ పనికి రాడు, ఇప్పుడు ఓటీటీకి కూడా దూరమవాల్సి వస్తుంది. గత వారం ఇంకొకటి గమనించాం. తెలుగు వాడైన ప్రభాస్ పానిండియా మూవీస్ తో ఆలిండియా స్థాయిలో తెలుగుకి కొత్త గుర్తింపు తెస్తున్నప్పుడు, ఈ అవకాశంతో చిన్న సినిమాలైనా పానిండియా కంటెంట్ తో తీసి -మార్కెట్ పెంచుకో వచ్చని గత వారం వ్యాసంలో రాశాం. ఇలాటివి గమనించాల్సినవి వున్నాయి.       

ఎవరు గమనిస్తున్నారు
, ఎవరూ గమనించడం లేదు. పరిస్థితి ఎప్పట్లాగే వుంది. లాక్ డౌన్ కి ముందు తలపెట్టిన చిన్న మూసలు ఇప్పుడెలాగూ విడుదలవుతాయి, అవుతున్నాయి. ఈ పోగు పడిన బ్యాక్ లాగ్ ని అర్ధం జేసుకోవచ్చు. కానీ లాక్ డౌన్ తర్వాత మారిన సినేరియాలో కూడా అవే చిన్న మూసలు ఇంకా ప్రారంభిస్తున్నారంటే, ఇక ఫ్రెష్ గా మారేది లేదన్న మాట.

        లిస్టు సేకరిస్తే కనీసం ఇప్పటికి ఓ ముప్ఫై చిన్న మూసలే తీస్తున్నట్టు తేలింది. కొందరు రియలిస్టిక్ ఔత్సాహికులు తాము విన్న, కన్న చిన్న మూస తయారీ దృశ్యాలు చెప్పుకుని వాపోతున్నారు. నిన్న ఉగాదికి ఒక రియలిస్టిక్ ఔత్సాహికుడు ప్రారంభమవుతున్న రెండు చిన్న మూసల గురించి చెప్పుకుని, వీటికేనా ఉగాది, మాకు లేదాని వాపోయాడు. నిన్ననే ఔట్ డోర్ లొకేషన్లో వున్న ఒక సీనియర్ అసోసియేట్ ఫోన్ చేసి, లొకేషన్లో పరిచయమైన ఒక ఔత్సాహిక నిర్మాత ఎంత చెప్పినా మూస గురించే ఐడియాలు చెప్తున్నాడని అప్డేట్స్ ఇచ్చాడు. అంటే మేకర్స్ ఒకరే మారితే లాభం లేదనేది కూడా ఒక వాస్తవమే.

***

      మండేలా సంక్షిప్త స్క్రీన్ ప్లే సంగతులకి ఈ ఉపోద్ఘాతం అవసరమవుతోంది. పర్యావరణం తెలుసుకోకుండా స్క్రీన్ ప్లే సంగతుల పరమార్ధం అర్ధంగాదు. ఓటీటీలతో పర్యావరణం మారింది. ఆ పర్యావరణంలో తెలుగు ప్రేక్షకులున్నారు, తెలుగు మేకర్స్ కూడా వుంటే బావుంటుంది. లేదంటే పర్యావరణ కాలుష్య కారకులవుతారు. మళ్ళీ చిన్న సినిమాలకి అంధకారమే సృష్టిస్తారు. అనేకులు ఈ పర్యావరణాన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ సీజన్ అనుకుంటున్నారు. వీటిని రియలిస్టిక్ గా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా మూస ఫార్ములాలుగానే వుంటున్నాయని తెలుసుకోవాలి. రియలిస్టిక్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్సే కాదు, సీరియస్ రాజకీయ, సామాజిక సమస్యలే కాదు; ప్రేమ, కుటుంబం, హాస్యం లాంటివి కూడా రియలిస్టిక్సే అవుతాయి. కాకపోతే వీటికి మూసని వదిలించి రియలిస్టిక్ జానర్ మర్యాదలు కూర్చాలి.

        ఈ రియలిస్టిక్ జానర్ మర్యాదలు నిజ జీవితం లోంచి వస్తాయి. మంచి జ్ఞాపక  శక్తితో మంచి కల్పనా శక్తి వస్తుందంటాడు అకిరా కురసావా. జ్ఞాపక శక్తి లోక జ్ఞానంతో  పెరుగుతుంది. వివిధ రంగాలకి సంబంధించిన జీకేతో ఎంత మెమరీ బ్యాంకు వుంటే అంత కల్పనా శక్తి పెరుగుతుంది. ఉదాహరణకి మండేలా లో పోస్టాఫీసు సీనులో వెనుక గుమ్మం లేకపోవడం, ముందు తలుపు వూడిపోవడం, ఈ రెండిటిలో మండేలా పాత్ర రీత్యా ఒక అనుమానం, ఒక భయం పైకి కనిపించి నవ్విస్తాయి. అనుమానం - బార్బర్ గా తను ఇళ్ళల్లోకి వెనుక గుమ్మం లొంచే వెళ్ళాలి కనుక, పోస్టాఫీసులోకి కూడా వెనుకనుంచే వెళ్ళాలనుకుని, వెనుక గొడకేసి అలా అనుమానంగా చూడడం.

        భయం - ముందు తలుపు వూడి పడగానే ఇక్కడ డబ్బులు దాస్తే వుంటాయా అని భయపడతాడు. ఇవి పైకి నవ్వించినా, ఒక అంతరార్ధం ఈ నవ్వుకి బేస్ వేసింది. పోస్టాఫీసుల్లో డిపాజిట్లు రిస్కులో వున్నాయనేది ఒక యదార్ధం. వెనుక నుంచి దొంగలు పడకుండా కట్టుదిట్టంగా వున్నా, ముందునుంచి దర్జాగా నిధులు తరలి పోతున్నాయి- ఎక్కడికి? దివాలా తీసిన ఎఫ్సీఐ కి. ఈ నిధులు మౌలిక సదుపాయాలకీ,ఇతర రాబడి నిచ్చే పెట్టుబడులకీ వెళ్ళాల్సినవి. ఈ పోస్టాఫీసు సీను వెనుక తెలియకుండా ఇంత వాస్తవముంది.

        ఇంకో సీను కూడా వుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్నదమ్ముల్ని గెలిస్తే ఏం చేస్తారని అడిగితే, ప్రతి ఒక్కరి అక్కౌంట్ లో 15 వేలు వేస్తాననని అన్న అంటాడు, 20 వేలు వేస్తానని తమ్ముడు అంటాడు. ఈ సెటైర్ ఎక్కడ్నించి వచ్చిందో తెలిసిందే.

        ఇంకో సీనులో మెండేలా ఓటు కోసం వేలం పాడతారు అన్నదమ్ములు. ఇది పెరిగి పెరిగి 50 లక్షల దాకా పోతుంది. అప్పుడు ఎన్నికల అధికారి వచ్చి, నామినేషన్లతో బాటు వేసిన అఫిడవిట్లని చూపిస్తూ - ఇందులో మీ ఆస్తి 50 వేలని రాశారు, 50 లక్షలు ఎక్కడ్నించీ వచ్చాయనీ పట్టుకుంటాడు. ఇలా లోక వ్యవహారాలు రిఫ్లెక్ట్ అయ్యే, ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యే కామెడీ. రియలిస్టిక్ జానర్ మర్యాద. ఇది లోక జ్ఞానంతోనే వస్తుంది.

***

      అయితే - అయితే - ఈ పర్యావరణానికి స్ట్రక్చర్ లో వున్న సినిమాలే అవసరం. సీను మారింది కదాని లాక్ డౌన్ లో పుట్టిన రియలిస్టిక్, ఇండిపెండెంట్లని కూడా అలవాటైన అదే మూసలో స్ట్రక్చర్ లేకుండా తీస్తే మళ్ళీ మొదటి కొస్తారు. ఈ మధ్య ఒక రియలిస్టిక్ స్క్రిప్టుతో ఇదే జరిగింది. రాసుకున్న 70 సీన్లలో 13 సీన్లే ప్రధాన కథ వుందని తెలుసుకోకుండా షూటింగు కెళ్ళి పోతున్నారు! హీరోహీరోయిన్లని బుక్ చేసుకునేప్పుడైనా ఎన్ని సీన్లున్నాయో చూసుకోలేదా అంటే, షాకులోంచి తేరుకో లేక సమాధానం లేదు. ఇంకా ఇలాటి విచిత్రాలున్నాయి. స్ట్రక్చర్ తో చేస్తే ఏదెలా వస్తోందో తెలుస్తూంటుంది, ఎక్కడెక్కడ ఏది రాకపోయినా వివిధ టూల్స్ తో సరిదిద్దుకోమని హెచ్చరిస్తూంటుంది. మూసకేం టూల్స్ వుంటాయి. మూస పనిముట్లు లేని గోస.

        కనుక స్ట్రక్చర్ సహిత స్టోరీ రైటింగ్ - కాదు, స్టోరీ మేకింగ్ అనాలి - ఇష్టపడని క్లబ్ ని అలా వుంచి, స్ట్రక్చర్ క్లబ్ లో మాట్లాడుకుంటే, మారిన సినేరియాలో రియలిస్టిక్స్ ని మళ్ళీ అవే పనీ పాటా లేని, పనిముట్లు లేని మూసలుగా తీస్తే లాభం లేదు. దేనికైనా త్రీయాక్ట్ స్ట్రక్చర్ వాడాల్సిందే. 50 లక్షల సినిమా స్క్రీన్ ప్లే అన్నాకూడా త్రీయాక్ట్ స్ట్రక్చరే గతి. లేకపోతే పైన చెప్పుకున్న Friday the 13th లాంటి భయపెట్టే సంగతి పదమూడు సీన్లతో.

***

    ఐతే- ఐతే-  త్రీయాక్ట్ స్ట్రక్చర్ తో ఒప్పుకు తీరాల్సిన నిజం ఒకటుంది. ఇది కూడా ఒక మూసే. స్ట్రక్చర్ పరంగా పరమ మూస. ఎలాగంటే, అదే ఫస్ట్ యాక్ట్, ఫలానా చోట అదే ప్లాట్ పాయింట్ వన్, అదే సెకండ్ యాక్ట్, ఫలానా చోట అదే ప్లాట్ పాయింట్ టూ, అదే థర్డ్ యాక్ట్... అనే ఈ యూనివర్సల్ స్ట్రక్చర్ ని ఇలాగే ఒక టెంప్లెట్ లా వాడుకుంటూ, పదేపదే అదే మోడల్ కథలు. ఇలా ఒక మోడల్లోనే ఏళ్ళ తరబడి సినిమాలొస్తున్నాయి హాలీవుడ్ నుంచి కూడా.

        కమర్షియల్ సినిమాలకిది తప్పదు. స్టార్స్ తో మరీ తప్పదు. ప్రయోగాలు చేయలేరు. కానీ రియలిస్టిక్స్ తో స్వేచ్ఛ వుంది. ఇక్కడ స్టార్స్ వుండరు. ఇప్పుడు రియలిస్టిక్ కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమానే కాబట్టి స్వేచ్ఛకి ఆంక్షల్లేవు. త్రీయాక్ట్ స్ట్రక్చర్ అనివార్య పరిస్థితి. ఇది వినా కథా నిర్మాణం లేదు సినిమాలకి. ఐతే ఈ స్ట్రక్చర్ ని పట్టుకుని క్రియేటివ్ పరికల్పనలని మర్చి పోవడం వల్లే స్ట్రక్చర్ మూస అయింది. స్ట్రక్చర్ ని ఫాలో అవుతూనే, ఆ సురక్షిత స్ట్రక్చర్ లోపల కథనంతో క్రియేటివ్ ప్రయోగాలు చేయక పోవడం వల్లే త్రీయాక్ట్ స్ట్రక్చర్ నిర్మాణాత్మక మూస అయింది. ఈ ప్రయోగాలు చేసుకునే స్వేచ్ఛ రియలిస్టిక్స్ తో కచ్ఛితంగా వుంది. ఇదే హిట్టయిన  పింక్ చెప్పింది (తెలుగు రీమేక్ లో కాదు), ఇదే హిట్టయిన మండేలా ఇప్పుడు చెప్తోంది...

***

    ఈ కొత్త తమిళ దర్శకుడు మండేలా అనే రియలిస్టిక్ తో రాత కనబడే సినిమా తీశాడు. రియలిస్టిక్స్ లో కూడా రాత కనపడక, తీత మాత్రమే కనబడే వొట్టి పోయిన సినిమాలు తీసేవాళ్ళే ఎక్కువ. మండేలా లో స్టార్ట్ టు ఫినిష్ ఆధునిక రాతే. అంత ఆధునిక రాత వల్ల ఇంత అందమైన సినిమా అయింది. అది కూడా స్ట్రక్చర్ తెలిసిన రాత. స్ట్రక్చర్ లోపల కథనంతో ప్రయోగం ఎలా చేయాలో తెలిసిన రాత. ఏమిటా ప్రయోగం ఎవరైనా కనిపెట్టారా?

        మండేలా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లో 30 నిమిషాల్లో ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. ఇది స్ట్రక్చర్ సమయ పాలనే. ఐతే ఇది రొటీనే. కొత్తేం లేదు. మరి రొటీన్ కాని కొత్తేమిటి? ఈ ప్లాట్ పాయింట్ వన్ రివర్సై  హీరో మండేలా మీద లేక పోవడమే కొత్త. ఇది గమనించాల్సిన విషయం. హీరో మీదే ప్లాట్ పాయింట్ వన్ వుండడం సర్వసాధారణం. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకే సమస్య ఎదురవడం, హీరోకే గోల్ ఏర్పడడం రొటీనే. ఈ రొటీన్ తోనే ఒకే మోడల్ కథలు వస్తూంటాయి.

        దీన్ని రివర్స్ చేసి హీరో మీద గాక విలన్ల మీద పెట్టాడు దర్శకుడు. ఇదే స్టార్ మీద కాక విలన్ మీద పెడితే స్టార్ డీలా అయిపోయి కన్పిస్తాడు. స్టార్ లేని రియలిస్టిక్ లో ఇలాంటప్పుడు హీరో ఆసక్తి కల్గిస్తాడు. ప్లాట్ పాయింట్ వన్ నుంచి పలాయనంలో వున్న ఈ రియలిస్టిక్ హీరో ఇప్పుడేం చేస్తాడన్న ఆసక్తి. తన ప్లాట్ పాయింట్ వన్ ని విలన్లు కబ్జా చేశారు. ఇప్పుడు స్ట్రక్చర్ లో తానేం క్లెయిమ్ చేస్తాడు? ఏ తురుపు ముక్క ప్రయోగించి ప్లాట్ పాయింట్ వన్ కాకపోయినా, స్ట్రక్చర్లో తనకంటూ ఓ కీలక స్థానాన్ని క్లెయిమ్ చేస్తాడు? స్ట్రక్చర్ తో ఆసక్తికర క్రియేటివిటీ.  

        విలన్లయిన అన్నదమ్ములు ఎన్నికల్లో ఒకరిమీద ఒకరు పోటీకి దిగడాన్ని ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంగా చేశాడు. కథ కోసం ఇక్కడ క్లిక్ చేసి రివ్యూ చూడండి. ఇంతవరకూ ఈ బిగినింగ్ విభాగమంతా కథనం అన్నదమ్ముల మీదే వుంచాడు. హీరో అయిన మండేలాని పట్టించుకోలేదు. ఈ బిగినింగ్ విభాగమంతా బలహీనుడైన మండేలా మీద గాక, బలవంతుల మీద వాళ్ళ తగాదాలకి సంబంధించిన కథనం చేసి, ప్లాట్ పాయింట్ వన్ కి చేర్చాడు. ఈ విలన్ల గొడవతో సంబంధం లేకుండా మండేలాని బార్బర్ జీవితానికి పరిమితం చేశాడు.

        అలాగని మండేలాని పాసివ్ చేయలేదు. అతడికి తండ్రి కల సెలూన్ నిర్మించాలన్న గోల్ పెట్టి, యాక్టివ్ పాత్రగానే చేశాడు. ఇది గమనించాలి. టూల్స్ తో స్ట్రక్చర్ లో వుంటే ఫ్లాపయ్యే పాసివ్ హీరో క్యారక్టర్లు తయారు కావు. పనిముట్లు లేని మూసలోనే ఇలాటివి తయారవుతాయి. మరిప్పుడు ప్లాట్ పాయింట్ వన్ విలన్ల చేతి కెళ్ళిపోయాక మండేలా చేసేదేమిటి? ఇది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఆ మాటకొస్తే ఈ సినిమా చివరంటా మండేలా సస్పెన్స్ తో కూడిన క్యారెక్టరే. ఏం చేస్తాడో తెలియదు, చేసినప్పుడే తెలుస్తుంది.

        విలన్ల గోల్ కి ఒక్క ఓటు కావాలి. మండేలా గోల్ కి సెలూన్ నిర్మించుకోవాలి. ఒక ఒరలో రెండు కత్తుల్లాంటి ఇదేం కథ? ఏ కథ ఏ కథగా మారుతుంది? విలన్ల ఓటు కథ మండేలా సెలూన్ కథగా మారుతుందా? మండేలా సెలూన్ కథ విలన్ల ఓటు కథగా మారిపోతుందా?

***

    విలన్లతో ప్లాట్ పాయింట్ వన్ తర్వాత ప్రారంభమయ్యే సెకండ్ యాక్ట్ లో విలన్లతో, మండేలాతో విడివిడిగా వాళ్ళ వాళ్ళ సెకండ్ యాక్ట్ బిజినెస్సే వుంటుంది. సెకండాఫ్ బిజినెస్ అంటే గోల్ కోసం సంఘర్షణ. ఒక అదనపు ఓటు ఎలా పొందాలన్న గోల్ తో విలన్ల విడివిడి సంఘర్షణ, మరో వైపు- సెలూన్ కోసం డబ్బు పొదుపు చేసే గోల్ తో మండేలా వేరే సంఘర్షణ. కొంపా గోడూ లేని తన దగ్గర కొందరు డబ్బు కొట్టేస్తే, మిగిలిన డబ్బు దాచుకోవడానికి పోస్టాఫీసులో ఖాతా తెరవడానికి పోవడం, అక్కడ తన పేరేమిటో తనకి తెలియక పోతే తెలుసుకు రమ్మని పోస్ట్ మాస్టర్ పంపడం, తన పేరు తెలుసు కోవడానికి వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతూ మండేలా హిలేరియస్ గా స్ట్రగుల్ చేయడం...ఇలా చివరికి పోస్ట్ మాస్టరే నెల్సన్ మండేలా అని పేరు పెట్టడంతో - ఆ పేరుతో ఆధార్ కార్డు తెచ్చుకుని ఖాతా తెరవడం, ఆధార్ కార్డు రావడంతో ఓటరు ఐడీ కార్డు కూడా వచ్చి- ఒక అదనపు ఓటరు కోసం చూస్తున్న అన్నదమ్ములకి ఇంటర్వెల్లో చిక్కడం!

        వెర్రి బాగుల వాడు అయిన తను తెలియకుండానే వెళ్ళి వెళ్ళి సంబంధం లేని కథలో ఓటరు కార్డుతో విలన్లకి చిక్కి కింగ్ అయిపోవడం, వాళ్ళ కథలో తన స్థానమేమిటో స్ట్రక్చరల్ గా క్లెయిమ్ చేసుకుని పాగా వేయడం!
***
        స్ట్రక్చర్ తో రియలిస్టిక్ కథకి ప్రయోగమిది. స్ట్రక్చర్ తెలియకపోతే ఎలా ప్రయోగాలు చేయాలో తెలీదు. కాబట్టి ఇప్పటికైనా అకారణంగా స్ట్రక్చర్ ని వ్యతిరేకించే తెలుగు మేకర్స్, పర్యావరణానికి న్యాయం చేయడం కోసం పునరాలోచన చేసుకోవాలి. ఇతర భాషల మేకర్స్ కి తీసిపోకుండా ఎదగాలి.

సికిందర్    

9, ఏప్రిల్ 2021, శుక్రవారం

1034 : రివ్యూ


మండేలా (తమిళం)
దర్శకత్వం : మడోన్ అశ్విన్
తారాగణం : యోగి బాబు
, షీలా రాజ్ కుమార్, సంగిలీ మురుగన్, జీఎం సుందర్, కణ్ణ రవి తదితరులు
రచన : మడోన్ అశ్విన్
, సుమన్ కుమార్ (కంటెంట్ హెడ్), సంగీతం : భరత్ శంకర్,
ఛాయాగ్రహణం : విధు అయ్యన్న
బ్యానర్స్ : వైనాట్ స్టూడియోస్
, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, ఓపెన్ విండో ప్రొడక్షన్స్, విష్ బెర్రీ
నిర్మాతలు : బాలాజీ మోహన్
, చక్రవర్తి రామచంద్ర, శశికాంత్
విడుదల : నెట్ ఫ్లిక్స్
, ఏప్రెల్ 5, 2021

***  

            మొన్న6 వతేదీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఈవీఎం లని గాడిదల మీద తరలిస్తున్నప్పుడు, ముందు రోజు విడుదలైన మండేలా లో గాడిద ని చూసి వుండరు. ఈ సినిమాలో హీరోని గాడిదా అనే పిలుస్తూంటారు. సరీగ్గా తమిళ నాడు పోలింగ్ కి ముందు రోజు, ఈ గాడిద తిరగబడి ఓటుకి నోటు, తాయిలం, కులం, మతం కాదని ఓటేస్తూ, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నయా ఓటింగ్ మోడల్ చూపిస్తే, పోలింగ్ రోజున ఎంత వరకూ ఇది  ప్రజల్లోకి వెళ్ళిందో తెలీదు.

        కానీ ఓటింగ్ పరంగా ఒక వినూత్న ఐడియాతో  మండేలా జాతీయ మీడియా కొనియాడుతున్న ఒక అర్ధవంతమైన పానిండియా అప్పీలున్న కంటెంట్ గల మూవీ. తమిళ టాప్ కమెడియన్ యోగిబాబుతో, కొత్త దర్శకుడు మడోన్ అశ్విన్ చేసిన కొత్త కమర్షియల్ ప్రయోగమిది. దీన్ని నిర్మాతలతో పూర్వ వివాదం కారణంగా చూపుతూ తమిళ బయ్యర్లు బాయ్ కాట్ చేయడం విషాదం. తెలుగు డబ్బింగ్ తో థియేటర్లలోకి వస్తే ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృత మవుతుంది తెలుగు ప్రేక్షకులకి. తెలుగులో పానిండియా కంటెంట్ గల మూవీలేని కొరత ఇలాగైనా తీరుతుంది.

కథ
    తమిళనాడులో సూరం కుడి అనే గ్రామం. పెరియావర్ (సంగిలీ మురుగన్) ఇక్కడి పంచాయితీ సర్పంచ్. ఇతను రామస్వామి పెరియార్ అభిమాని. ఇతడి కిద్దరు వేర్వేరు కులాల భార్యలు. వాళ్ళకిద్దరు కొడుకులు రత్నం (జీఎం సుందర్), మది (కణ్ణ రవి). వీళ్ళిద్దరికీ పడదు. గ్రామాన్ని ఉత్తర గ్రామం, దక్షిణ గ్రామంగా విభజించి, ఉత్తరం ఒక కులం, దక్షిణం ఒక కులంగా కులాధిక్య పోరాటాలు చేస్తూంటారు. ఒకరు చేసిన అభివృద్ధిని ఓర్వలేక ఇంకొకరు ధ్వంసం చేస్తూంటారు. ఉత్తర కులం నాయకుడు రత్నం, దక్షిణ కుల నాయకుడు మది. వీళ్ళ తల్లులు కొడుకులతో కులాలుగా విడిపోయి వుంటారు. కానీ కోడళ్ళుగా కలిసి సీరియళ్ళు చూస్తూంటారు.

        తండ్రి పెరియావర్ పంచాయితీ కొచ్చే ఏ పనులు ఏ కొడుక్కి అప్పజెప్పినా, రెండో కొడుకు ధ్వంసం చేస్తాడని, జనం కూడా ఈ ధ్వంస రచనలో పాల్గొంటూ అభివృద్ధి అనేదే కళ్ళజూడరనీ కారణంగా చూపుతూ, పంచాయితీ పనులు వేరే కాంట్రాక్టర్స్ కి అప్పగిస్తూంటాడు. ఈ ఏరియాలో ఒక ఫ్యాక్టరీ కట్టేందుకు పెరియావర్ సంతకం పెట్టాలి. పెడితే 30 కోట్లు వస్తాయి. కానీ ఫ్యాక్టరీ కడితే కొడుకులు కొట్లాడుకుని ధ్వంసం చేస్తారనీ, జనం కూడా పీకి పంది రేస్తారనీ సంతకం పెట్టడు పెరియావర్. ఇలాటి పరిస్థితుల్లో పంచాయితీ ఎన్నికలొస్తాయి. మంచాన పడ్డ పెరియావర్ ఎన్నికలో పోటీ చేసేందుకు వారసుణ్ణి నిర్ణయించలేక, ఇద్దర్నీ గెటవుట్ అంటాడు. ఇద్దరూ వెళ్ళిపోయి పోటాపోటీగా నామినేషన్లు వేస్తారు.

             వూరు మొత్తం కలిపి 700 ఓట్లు. ఉత్తరం 350, దక్షిణం 350. అన్నదమ్ముల్లో ఏ వొకరు గెలవాలన్నా ఇంకొక్క ఓటు అవసరం (2 ఓట్ల తేడాతో ఎబి వాజపాయ్ ప్రభుత్వం కూలిపోయిన లాటి పరిస్థితి). వూళ్ళో ఆ ఒక్క అదనపు ఓటరు లేక, ఎదుటి వర్గంలో ఓ ఇద్దరు ఓటర్లని తగ్గించేందుకు హత్యా ప్రయత్నాలు కూడా చేస్తారు.

           దీనికంతటికీ దూరంగా వూళ్ళోనే ఒక బార్బర్ (యోగి బాబు) జీవిస్తూ వుంటాడు. మర్రి చెట్టు కింద ఓపెన్ క్షౌర శాల పెట్టుకుని, చెట్టుకి ఉయ్యాల కట్టుకుని, అందులో పడి రేడియో వింటూ నిద్ర్ర పోతూ వుంటాడెప్పుడూ. తల్లిదండ్రులేం పేరు పెట్టారో అతడికి గుర్తు లేదు. వూళ్ళో నోటికొచ్చిన తిట్టుతో తనని పిలుస్తోంటే అసలు పేరు మర్చిపోయాడు. నోరు సరిగా మూసుకోక, చూస్తే చిరునవ్వు నవ్వుతున్నట్టు కన్పిస్తాడు కాబట్టి, కొందరు స్మైల్ అని పిలుస్తారు. వూళ్ళో అతణ్ణి పిలిచే ఫేమస్ పేరు మాత్రం గాడిద. క్షవరం చేయించుకుని డబ్బులు కూడా ఇవ్వరు. అన్నం అడుక్కుని తింటూ వుంటాడు. ఇళ్ళల్లోకి ముందు గుమ్మం నుంచి రానివ్వరు. వెనుక గుమ్మంలోంచి రావాలి. క్షవరమే కాకుండా టాయిలెట్స్ కడిగే పని కూడా చేయించుకుంటారు. 

            ఇవన్నీ మౌనంగా భరిస్తూ ఒకే ఒక కల కోసం జీవిస్తూంటాడు. తండ్రి ఈ వూళ్ళో ఒక సెలూన్ నిర్మించాలనుకున్నాడు. ఇది నిజం చేయాలని పోస్టాఫీసులో డబ్బు దాస్తూంటాడు. పోస్టాఫీసులో మొదట ఐడీ కార్డు లేక ఖాతా తెరిచే పరిస్థితి వుండదు. పేరే లేకపోతే ఐడీ కార్డు కూడా రాదు. కొత్త పోస్ట్ మాస్టర్ తెన్మోళీ (షీలా రాజ్ కుమార్) బాగా ఆలోచించి, అతడికి నెల్సన్ మండేలా అని పేరు పెడుతుంది. వెళ్ళి ఆ పేరుతో ఆధార్  కార్డు తెచ్చుకో మంటుంది. అలా ఖాతా ఓపెన్ అవుతుంది. ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీ కార్డు కూడా రావడంతో వూళ్ళో సంచలనం రేగుతుంది. గాడిద మండేలా అవడమే గాక, ఓటరు ఐడీ కార్డు వచ్చింది...

        దీంతో ఇప్పుడు మండేలా వీఐపీ అయిపోతాడు ఎన్నికలో ఒక్క ఓటు కోసం ప్రయత్నిస్తున్న అన్నదమ్ములకి. ఓటు కోసం మండేలాని అందలా లెక్కించడమే గాక, తొక్కేస్తారు ఎవరికి వేస్తాడో చెప్పలేక పోతూంటే. ఇలా ఈ అన్నదమ్ముల మధ్య చిక్కుకున్న మండేలా తన ఏకైక ప్రజాస్వామిక హక్కుతో ఏ నిర్ణయం తీసుకున్నాడు? దీనికి ఎన్ని ప్రమాదా లేదుర్కొన్నాడు? చివరికి తన ఓటు హక్కుతో వ్యూహాత్మకంగా, ప్రత్యర్ధులు దిమ్మెరబోయేలా మాస్టర్ స్ట్రోక్ ఎలా ఇచ్చాడు? ... ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

   ఎన్నికల్లో కుల మతాలు, డబ్బూ బహుమతులూ ఎరగా వేసి ఓట్లు కొల్లగొట్టుకునే కన్స్యూమరిజం రాజకీయం కొత్తదేం కాదు. ఓటర్లంటే ఫ్రీబీలకి ఆశపడే కస్టమర్లు. ఈ బహుమతులు ప్రకటించడంలో తమిళ పార్టీలు ముందున్నాయి. మా పార్టీని గెలిపిస్తే వాషింగ్ మెషీన్ తో బాటు, కేబుల్ టీవీ కనెక్షన్ ఫ్రీగా ఇస్తామని ఒక పార్టీ అంటే, ఇంకో పార్టీ ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యార్థులకి టాబ్లెట్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. గృహిణులకి వెయ్యి రూపాయలిస్తామని ఒక పార్టీ అంటే, 1500 ఇస్తామని ఇంకో పార్టీ పోటీ పడింది. జయలలిత ప్రారంభించిన జాతర ఇది. ప్రభుత్వ ఖర్చుతో ఈ బహుమతులు.

        కుల మత భావాలు రెచ్చగొట్టడం సపరేట్ సెక్షన్. దీనికి పార్టీలు పెట్టుకునే ఖర్చుంటుంది. ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కో ర్యాలీ నిర్వహణకి పది కోట్లు ఖర్చు పెడుతున్నాయి పార్టీలు. ఈ ఎన్నికల ప్రచార వ్యయం అన్ని పార్టీలకీ కలిపి లెక్కకడితే, ఈ ఖర్చుతో ఒక ఏడాది పాటు దేశ ప్రజలకి రేషన్ సరఫరా చేయ వచ్చు ప్లస్ దేశవ్యాఫంగా బడి పిల్లలకి ఏడాది పాటు మధ్యాహ్న భోజన పథకం ఇవ్వొచ్చు ప్లస్ దేశవ్యాప్తంగా పేదలకి ఏడాది పాటు ఉపాధి హామీ పథకం నిర్వహించ వచ్చు...ఈ మూడు పథకాలకి ప్రభుత్వాల దగ్గర డబ్బులేదు. కానీ ఎన్నికల్లో పార్టీల దగ్గర ఈ మూడు పథకాలంత డబ్బుంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 107 దేశాల్లో, దేశం 94 వ స్థానానికి పడిపోయి ఆకలి రాజ్యంగా అలమటిస్తోంది. పార్టీలు మాత్రం అపర కుబేర పార్టీలుగా వున్నాయి. ప్రభుత్వం పేదది, ప్రజలు పేదలు, పార్టీలు అల్ట్రా రిచ్. ఎన్నికల్లో పార్టీల హోరాహోరీ పోరాటాలన్నీ ప్రభుత్వ ఖజానా కోసమే.

       
ఇక్కడ 1970 లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు నటించి నిర్మించిన 'మరో ప్రపంచం' ప్రయోగాత్మకాన్ని గుర్తు తెచ్చుకోవాలి. కాలం కంటే ముందూహించి తీసిన ఈ ప్రయోగాత్మకంలో, చూపించిన సంఘటనలన్నీ ఆ తర్వాతి కాలంలో జరుగుతూ వచ్చినవే. ముఖ్యంగా అక్కినేని పలికే డైలాగు - ఉపన్యాసాలలో తప్ప ఆంతరంగిక సంభాషణల్లో దేశం, ప్రజలూ అన్న మాటలు ఒక్కసారైనా అనే నాయకుడు ఒక్కడైనా వున్నాడేమో గుండెల మీద చేయి వేసుకుని చెప్పమనండిఅన్నది ఇవాళ్టి నాయకులకీ వర్తిస్తుంది. ఆంతరంగిక సంభాషణల్లో దేశం గురించీ, ప్రజల గురించీ మాట్లాడుకో గల్గితే ఎన్నికల వ్యవస్థ ఇలా వుండదేమో!

        మీరిచ్చే బహుమతులు కాదు, మేం ఓటేయాలంటే ముందు మౌలిక సదుపాయాలు కల్పించండి అని గ్రామాలు ఎదురు బేరం పెడితే, ర్యాలీలు జరగవు. ఆ ఖర్చుతో గ్రామాలు బాగుపడతాయి. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కొరత నెదుర్కొంటున్నది గ్రామీణులే. ఇదే ఈ కథలో చూపించారు. అయితే సినిమా కథ కాబట్టి గేమ్ గా చూపించి రక్తి కట్టించాలనుకున్నారు. మండేలా ఓటు కోసం నాయకులు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించింతర్వాత, గ్రామప్రజలు ఓటెయ్యకుండా మొండి చేయి చూపడమన్నది అన్యాయమే. అయితే పార్టీల్ని ఇలా డబుల్ క్రాస్ చేస్తే తప్ప ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ ప్రజా పాలన చెయ్యవేమో.

నటనలు - సాంకేతికాలు
     తమిళంలో ఇప్పుడు టాప్ కమెడియన్ అయిన యోగి బాబుది కమర్షియల్ సినిమాల్లో మోటు కామెడీయే. అయితే మండేలా లో అతను సమూలంగా రూపాంతరం చెందాడు. కమెడియన్ ఇమేజిని, ఆ ఫేసునీ పూర్తిగా చెరిపెసుకుని, ఇప్పుడే వెండి తెరకి కొత్తగా పరిచయమవుతున్న ఆర్టిస్టుగా బార్బర్ రూపంలో వచ్చాడు. హావభావాల్లో ఏ యాంగిల్లోనూ మనకి తెలిసిన యోగిబాబు అనేవాడు కన్పించక పోవడమన్నది నటనలో అతను తాకిన ఉన్నత శిఖరం.

        ఈ రూపాంతరానికి ఆధారం పాత్రచిత్రణే. పైకి బార్బర్ గా పాత్ర చిత్రణ సరే, పాత్ర అంతర్గత కారణాలు అతడి ప్రవర్తనని నిర్ణయించాయి. అంతర్గత కారణం సెలూన్ నిర్మించాలన్న తండ్రి కలని నిజం చేయాలన్న ఆలోచన. కలలున్నప్పుడు అశాంతిని తెచ్చుకోకూడదన్న అర్ధంలో ఈ పాత్ర తీరు. అందుకే వూళ్ళో తనని ఎంత తక్కువ కులం వాడిగా చూసినా, కించపర్చినా, కిమ్మనక శాంతంగా కల కోసం పని చేసుకు పోతాడు.         

    కుల, మత, ప్రాంతీయ తత్వాలు భూమ్మీద మనుషులున్నంత కాలం వుండేవే. ఎక్కడికీ పోవు. ఉద్యమాలతో హాహాకారాలు చేస్తే ఆయాసమే మిగులుతుంది. ఇవి తనని తొక్కే స్తున్నాయని కులం కార్డో, మతం కార్డో, ప్రాంతం కార్డో ప్రయోగించి వీధికెక్కి ఏమీ లాభం లేదు. అప్పుడా కార్డూ వుండదు, దాంతో కలలూ వుండవు. కాసేపు మీడియాలో కేకలు తప్ప. ఈ కుల మత ప్రాంతీయ తత్వాల మధ్య నుంచి దారి చేసుకుంటూ కలల సాఫల్యతకి కృషి చేసుకు పోవడమే మార్గం. ఇదే నేర్పు తున్నాడు బార్బర్ మండేలాగా యోగిబాబు. ఇందుకే అతడి పాత్ర అణిగి మణిగి వుండే క్యారక్టర్ గా కన్పించడం. వూళ్ళో అగ్రకులాల పట్ల ఎంత జాగ్రత్తగా వుంటాడంటే, పోస్ట్ మాస్టర్ తెన్మోళీ  నెల్సన్ మండేలా అని పేరు పెడితే, అది అగ్రకులం పేరేమోనని భయపడతాడు.

       తన నిమ్న కుల ఆత్మ న్యూనతా భావాన్ని మర్చిపోవడానికి, మర్రి చెట్టుకి పైన ఉయ్యాల కట్టుకుని, ఉయ్యాల్లో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో తను పైన స్వర్గంలో వున్నట్టు ఫీలవుతూ, కమ్మగా నిద్రపోతాడు. తన నిమ్న కుల స్థానంతో ఎంత విధేయంగా వుంటాడంటే, పోస్టాఫీసు కెళ్ళి పక్క గోడ చూస్తూ, వెనుక గుమ్మం లేదే అనుకుంటాడు. ఇళ్ళల్లోకి వెనుక గుమ్మంలోంచి వెళ్ళాలి కాబట్టి ఇక్కడా అదే అనుకుంటాడు.         

         పోస్టాఫీసులోకి వెళ్తూంటే తలుపు వూడి పడుతుంది. ఇక్కడ డబ్బులు దాస్తే వుంటాయా అని భయపడతాడు. డబ్బులు జమచేసి వెళ్తూ తలుపు గట్టిదనాన్ని మళ్ళీ పరీక్షిస్తాడు. ఈ చర్యలు పాత్ర తీరు రీత్యా హాస్యం పుట్టించినా, వెనుక గుమ్మం, ముందు తలుపు ప్రస్తావనలతో  చాలా సింబాలిజం వుంది. పోస్టాఫీసుల్లో  డిపాజిట్లు రిస్కులో వున్నాయని గత సంవత్సరం మీడియా రిపోర్టులు వచ్చాయి కూడా. ఎలాగన్నది వేరే విషయం.

        ఓటరు ఐడీ కార్డు వచ్చాక అతడి క్యారక్టర్ ని మార్చేస్తారు ఎన్నికల్లో పోటీ పడుతున్న అన్నదమ్ములు. తనని రాజాలా చూసుకోవడం చేస్తూంటే యోగిబాబు మరింత డిగ్నిటీ తో నటించి క్యారక్టర్ కి ఇంకో లెవెల్ కి తీసికెళ్తాడు. మళ్ళీ యధాస్థితి కొచ్చి పూర్వపు బార్బర్ అయిపోతాడు. చివరికి ఓటింగ్ చేసేప్పుడు కింగ్ అయిపోతాడు. ఎక్కడా ఎదిరించకుండా, ఒక్క మాట అనకుండా, ఓటు పవర్ తో ఓడించేస్తాడు. యోగి బాబుకి ఐడీ కార్డు వచ్చినప్పట్నుంచీ, ముగింపు షాట్ వరకూ ఏం చేయబోతున్నాడో ఎడతెగని ఒక సస్పెన్స్ తో అతడి క్యారక్టర్ కొనసాగుతుంది.

       అతడికి రేఖామాత్రంగా తెన్మోళీతో ప్రేమ కూడా వుంటుంది. అయితే మొదట అలా అన్పించదు. ఆమె కూడా ప్రేమిస్తున్నట్టు అన్పించదు. ఈ సినిమాలో ఎక్కడా ఏ పాత్రా  అరిచి మాట్లాడదు. కూల్ గా మాట్లాడతాయి. ఈ ఆడియో లెవెల్ ఇలాగే కూల్ గా మెయింటెయిన్ అవుతున్నది కాస్తా, ఒక విషయంలో తెన్మోళీ ఓవర్ గా అరిచి అతడ్ని తిడుతుంది. ఉన్నట్టుండి ఈ హై వాల్యూమ్ మన మూడ్ చెడగొడుతుంది. కానీ చూస్తే ఆ అరుపులు ఆమె ప్రేమని రివీల్ చేస్తున్నాయని మనకూ యోగిబాబుకీ ఇప్పుడే రహస్యం బోధపడుతుంది.

        దీనికి చాలా ముందు అద్దంలో ఆమె చూసుకుంటూ, నెరసిన వెంట్రుక దాస్తూంటే, యోగిబాబు ఓర కంట గమనిస్తాడు. ప్రేమ రివీలయ్యాక మళ్ళీ ఆమె అద్దంలో చూసుకుంటూంటే, ఆమె నెరసిన వెంట్రుకని యోగి తనే దాస్తాడు. చాలా టచింగ్ సీన్. తెన్మోళీ పాత్రలో షీలా రాజ్ కుమార్ బావుంటుంది. మేజర్ పాత్రలతో బాటు చాలా మైనర్ పాత్రలకీ డెటెయిలింగ్ చేస్తాడు దర్శకుడు. గెలిచే ఓటు కోసం ప్రత్యర్ధులు సినిమాటిక్ గా కాకుండా రియల్ లైఫ్ లో ఏమేం ఎత్తుగడలు వేస్తారో కూడా డెటెయిలింగ్ చేస్తూ కథ నడిపాడు. ఇదే కథనానికి బలాన్నిచ్చింది.

     టెక్నికల్ గా ఒక రిధమ్, ఒక విజువల్ క్రాఫ్ట్  కన్పిస్తాయి. సెటైర్ గా వుండే సీన్స్ కి ఆ ఫీల్ నిస్తూ, సాఫ్ట్ విజువల్స్ చూపిస్తూ ఆకస్మిక కట్స్ ఇస్తాడు. ప్రత్యర్ధుల సీరియస్ సీన్లు వచ్చేసరికి డార్క్ లైటింగ్ ఉపయోగిస్తూ, ఎమోషన్లు హైలైట్ అయ్యే క్యారక్టర్ ఫ్రేమింగ్ ఇస్తాడు. బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ సెటైరికల్ గా, లైట్ మ్యూజిక్ తో ఇచ్చాడు. అయితే ముగింపే ఒకే షాట్ తో మరీ ఇంటలెక్చువల్ గా వుంది. దీన్ని పెంచి డ్రమటైజ్ చేసి వుంటే సామాన్యులకి బాగా అర్ధమయ్యేది. జాలి పుట్టించే సున్నిత హాస్యంతో ఒక పెద్ద రాజకీయ సమస్యనే, కుల సమస్యనే, ఎవర్నీ నొప్పించకుండా ఆలోచింప జేసే చిత్రీకరణలతో ఆశ్చర్యపర్చే ప్రతిభ కనబర్చాడు కొత్త తమిళ దర్శకుడు. దీన్ని యోగిబాబు హిమాలయాలకి తాటించాడు.  

సికిందర్  

(ఆదివారం మండేలా మూవీ నోట్స్.
ఆదివారం వెలువడే Q&A కి కొంతకాలం విరామం)