రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, జూన్ 2020, సోమవారం

949 : సందేహాలు -సమాధానాలు


Q:  పిరియాడిక్ కథలు (1970, 80 ప్రాంతాల్లో జరిగే రంగస్థలం’ లాంటివి ) రాయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా? అప్పటి పరిస్థితులు, సమస్యలు సహజంగానే ఇప్పుడు ఉండవు కాబట్టి సమకాలీనత లోపిస్తుంది కదా, దాన్నుంచి బయటపడడం ఎలా? సమకాలీనత కచ్చితంగా ఉండాలా? లేకపోయినా డ్రామాతో నిలబెట్టొచ్చారంగస్థలం’ లాగే?  మహానటి’, జెర్సీ’ సినిమాల్లో ప్రాసంగికతను తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలను వివరించగలరు. అలాగే ఒక పాత్ర జీవితం నుంచి మరొక పాత్ర ఇన్ స్పైర్ అయ్యే తీన్ మార్’ లాంటి స్క్రీన్ ప్లే లు చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు. రిఫరన్స్ సినిమాలు కూడా ప్రస్తావించగలరు?
అశోక్, ఏడీ 

A:  ఒక కవి అన్నట్టు ఇప్పుడు కాలం కరోనా పూర్వంగా, కరోనా శకంగా రెండు ముక్కలైంది. ఈ లెక్కన ఇప్పుడు కరోనా శకంలో వున్నామని అనుకోవాలి. కూలీనుంచీ కుబేరుడి వరకూ, సూది నుంచీ విమానం వరకూ అందరూ, అన్ని రంగాలూ ఆర్ధికంగా ఛిన్నాభిన్నమైన గడ్డు కాలం. ఈ విధ్వంసం లోంచి పునర్నిర్మాణ కాలమిది. ఈ కాలంలో కళ్ళు మూసుకుని ఇంకా కరోనా పూర్వపు అవే కథలు అలాగే తీస్తూ కూర్చోవడం సాధ్యమవుతుందా? ఒకతను ఒక బ్యాంకు అవినీతి కథ పట్టుకొచ్చాడు. ఇప్పుడు బ్యాంకులకి ఎగనామం పెట్టి విదేశాలకి ఉడాయించే కథలకి ఆడియెన్స్ కనెక్ట్ అవుతారా? ఎవడి జేబుల్లోనూ డబ్బే లేదు, ప్రభుత్వాల దగ్గరా లేదు, ఇంకా అవే పాత అవినీతి కథలేమిటి? ప్రేక్షకుల జేబుల్లో డబ్బులు పెట్టే కథలు కావాలి. డబ్బుల కోసం పాట్లు కావాలి. 

        పీరియాడిక్ సినిమాలూ ఇంతే. ఇప్పుడు బ్రతుకులెలా అని ఆలోచిస్తూంటే ఎప్పటివో పీరియాడిక్ కథల సినిమాలకి మార్కెట్ వుంటుందా అనేది వేసుకోవాల్సిన ప్రశ్న. 2008 ఆర్ధిక మాంద్యంలో హాలీవుడ్ కుప్పతెప్పలుగా రోమాంటిక్ కామెడీలు తీస్తూ ఆర్ధిక బాధల్ని మరిపించే ప్రయత్నం చేసింది. మార్కెట్ యాస్పెక్ట్ హాలీవుడ్ కి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. ఇప్పుడు కరోనా కాలపు కొత్త ఆర్ధిక, జీవన పరిస్థితులు బాక్సాఫీసుని నిర్ణయిస్తాయి. ఏం సినిమాలు తీయాలో ఎవరికీ తెలియడం లేదు. ఒకటి మాత్రం నిశ్చింతగా తీసుకోవచ్చు : ఎంటర్ టైనర్స్. పలాయన వాద కాలక్షేప ఎంటర్ టైనర్లు. 1896 లో నిమాల్ని కనిపెట్టిన లూమియర్ బ్రదర్స్ కీ, ఆ తర్వాత వచ్చిన నిర్మాతలకీ ఏం తీయాలో తెలియదు. ఎంటర్ టైనర్లే తీసుకుంటూ పోయారు. కాలప్రవాహంలో ఎందరెందరో నిర్మాతలు కలుస్తూ, కాలాన్నిబట్టి సినిమాల్ని శాఖోప శాఖల జానర్లుగా విస్తరింప జేస్తూ, 124 ఏళ్లలో ఇప్పుడు కరోనా నాటికి - ఒక మహావృక్షాన్ని నిలబెట్టారు. అది కుప్ప కూలింది అందరి జీవితాలతో బాటు. ఇప్పుడు నిలబెట్టాలంటే ఏ మందులు వేయాలో, ఏ కాయలు కాయించాలో ఎవరికీ తెలియడం లేదు. జీవితాలు అర్ధమైతే తప్ప సినిమా ఆర్ధిక శాస్త్రం పట్టుబడేలా లేదు. మళ్ళీ 1896 నుంచీ ప్రారంభమవడం తప్పదేమో. సినిమాలిప్పుడు తిరిగి 1896 కే చేరుకున్నట్టు. కాబట్టి బ్యాక్ టు ది ఎంటర్ టైనర్స్. 

        ఇక మీరడిగిన చివరి రెండు ప్రశ్నలకి వివరణ ఇక్కడ సాధ్యం కాదు. మీరడిగిన ప్రశ్నలు నల్గురికి ఉపయోగ పడేవే. వీటికి ప్రత్యేక ఆర్టికల్స్ అవసరం. ప్రయత్నం చేద్దాం.

Q: మే 20 న Q & A లో ఒక ప్రశ్నకు మీరిచ్చిన సమాధానం పెద్ద హోం వర్క్ ఇచ్చింది. పది రకాల స్క్రీన్ ప్లే లు అన్నారు కద. అవేంటి వెతికి, రకం సినిమాలు వెతకడం చాలా పని. తెలుగు సినిమాలు ఏడాదికి వంద వస్తాయి కద. అన్నీ ఒకే తరహా నెరేషన్. ఒకటి రెండు కొత్త రకం ఉంటాయి. అవే గొప్ప సినిమాలు మనకు. ఇంక సర్క్యులర్ నేరేషన్ తో సినిమాలు ఎపుడొస్తాయో. చిన్న సందేహం. కథ చెప్పే విభిన్న పద్ధతుల్లో హైపర్ లింక్  ఒకటి. ఇది మల్టిపుల్ నెరేషన్. ఉదాహరణగా సత్యజిత్ రేకాంచన్ జంగ’,  తెలుగు వేదం’,  తమిళ్ ‘సూపర్ డీలక్స్’  ఇచ్చారు. ఐతే తరహాలో రెండు, మూడు వేరు వేరు కథలతో మొదలుపెట్టి ఒకచోట ముడివేస్తారు. ఇవి వేరువేరు కథలకు ఒకే ముగింపు తప్ప, కథలు చెప్పే పద్ధతి లీనియర్ గానే ఉంటుంది కద? ఫెబులా, రోషోమన్ లలాగా హైపర్ లింక్ స్పెషల్ టెక్నిక్ ఎలా ఔతుంది? ఆదివారం సందేహం కింద తీర్చగలరు.
చందు తులసి, కథా రచయిత

A: హైపర్ లింక్ అంటే కేవలం ముగింపులోనే కథలన్నిటికీ లింకు పెట్టి ముగించడం కాదు. కథనంలోనూ వాటికి లింకులుంటాయి. ఒక కథలో ఒకరికి జరిగే ఓ సంఘటన ప్రభావం, ఇంకో కథలో ఇంకొకరి మీద వుంటుంది. ఇలా మనుషులంగా మనం ఎక్కడెక్కడో ఎవరెవరితోనో కనెక్ట్ అయి వుంటామన్న ఫీల్ ని కల్గిస్తుంది. అంతేగానీ విడివిడి కథలకి మాత్రమే చివర్లో ఒక ముగింపుతో లింకుపెట్టడం కాదు. కింద ఇచ్చిన రెండు లింకులు క్లిక్ చేసి, 10 రకాల ప్లేలు తెలుసుకోవచ్చు. 

Q: ‘అయ్యప్పనుం కోషియం’ రివ్యూ కోసం ఎదురు చూస్తున్నాం. మలయాళం సినిమాలు ఒక క్రేజ్ గా ఎందుకుంటున్నాయి? వాటిని రీమేక్స్ చేయడం కూడా జరుగుతోంది.
ఆది, ఏడీ 

A: రివ్యూ రెండు రోజుల్లో వస్తుంది. మలయాళం సినిమాలు అక్కడి మట్టి కథలు చెప్తాయి. అందుకని కమర్షియల్ మూస ఫార్ములాలకి భిన్నంగా అన్పిస్తాయి. మట్టి కథలకి మొహం వాచి వున్న ప్రేక్షకులకి ఇవే గిట్టుబాటు అవుతాయి. అక్కడి మట్టి కథల్ని ఇక్కడి మట్టి కథలుగా రీమేక్ చేస్తే చేయవచ్చు. తేడా ప్రేక్షకులకే తెలుస్తుంది. ఎక్కడిదో మట్టి ఎందుకు, ఇక్కడ మట్టి లేదా? ఇక్కడి మట్టిలో బాక్సాఫీసు కన్పించడం లేదా? లేక మట్టిని పిసికి బొమ్మెలా తయారు చేయాలో తెలీడం లేదా? ముందు పిసకడం నేర్చుకోవాలి. చేతులకి మట్టి అంటకుండా మీసం తిప్పితే లాభం లేదు.

సికిందర్
లింక్స్ : పది నమూనాలు-1
పది నమూనాలు-2 


30, మే 2020, శనివారం

948 : 'పాలపిట్ట' ఆర్టికల్, విస్మృత సినిమాలు


       కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సామాజిక సినిమాల్లో ‘అదిగో అల్లదిగో’ ఎవరి దృష్టిలో పడకుండా కనుమరుగై పోయింది. 1984లో ‘మంగమ్మగారి మనవడు’ అనే సంచలన హిట్ కంటే ముందు తీసిన ఈ సామాజికంలో చంద్రమోహన్, సుహాసిని, గుమ్మడి, నూతన్ ప్రసాద్, పిఎల్ నారాయణ, రాళ్ళపల్లి మొదలైన వారితో కూడిన ప్రముఖ తారాగణమే వుంది. ఆత్రేయ పాటలున్నాయి, ఎంవీఎస్ హరనాథరావు మాటలున్నాయి, కన్నప్ప ఛాయాగ్రహణమూ వుంది. సాంప్రదాయ వాదం, హేతు వాదం కలబడితే మధ్యలో దుష్టశక్తులు జొరబడతాయని సందేశమిచ్చే ఆసక్తికర కథావస్తువూ వుంది. 

       
యినా ఆ కాలంలో ఎందుకనో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ కాలంలో ఇది జియోలో  స్ట్రీమింగ్ అవుతోంది. ఓ యాభై వేల వ్యూస్ తో యూట్యూబ్ లో ఎలాగూ  చాలాకాలంగా వుంది. 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు దీన్ని చూస్తే, నిత్యసత్యమే కన్పిస్తుంది. ఈ కాలానికి కూడా పనికొచ్చే ముక్క. సాంప్రదాయ వాదాన్ని ఆధ్యాత్మిక వ్యాపకాలకి పరిమితం చేసుకోవాలే తప్ప, అంధవిశ్వాసంగా మార్చుకుంటే లేని పోని సామాజిక అనర్ధాలకి సాంప్రదాయ వాదులు మూలమవుతారన్న హెచ్చరిక ఇందులో వుంది. సాంప్రదాయ వాదుల అంధవిశ్వాసాల చుట్టూ చేరి మూఢభక్తులు, మూఢ భక్తుల మనోభావాలతో ఆడుకుని అందలా లెక్కే రాజకీయ శక్తులు, రాజకీయ శక్తుల్ని మూఢ భక్తిలోకి లాగి బాముకునే దొంగ బాబాలు, మళ్ళీ ఆ దొంగ బాబాలకి నిలువు దోపిడీలిచ్చుకుంటూ సాష్టాంగపడే అదే జనాలూ... ఇలా వొక విషవలయాన్ని సృష్టించి పెట్టేస్తారన్న అర్ధం వచ్చేలా కోడి రామకృష్ణ సోషల్ కామెంట్ చేశారు. సాంప్రదాయ వాదం ఆధ్యాత్మికాన్ని దాటి నప్పుడే హేతువాదం ప్రశ్నిస్తుంది. సాంప్రదాయ వాది పాత్రలో గుమ్మడి మానవవాదాన్ని మర్చిపోతే, కొడుకు పాత్రలో చంద్రమోహన్ పాల్పడే ఓ చర్యే దీనికంతటికీ దారి తీస్తుంది. కంఠ శోష తప్ప, సాంప్రదాయం - హేతువాదం ఏదీ గెలవదు, ఓడిపోదు. యుగాలుగా తెగని పంచాయితీ. సందట్లో సడేమియాలకి చేతినిండా పని. 

కథ చూద్దాం
        శివానంద శాస్త్రి అలియాస్ శివానంద్ (చంద్రమోహన్) ఎరువుల ఆఫీసర్ గా ఆ గ్రామాని కొస్తాడు. సహజనటి జయసుధ వీరాభిమానిగా అమ్మాయిల్నేసుకుని అల్లరిగా తిరిగే రాజేశ్వరి (సుహాసిని) కంటపడి అల్లరవుతాడు. ఈ అల్లరి ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. సుహాసిని తల్లి మరియా క్రైస్తవురాలు. ఈ కారణంగా రాజేశ్వరికి పెళ్లి సమస్య వుంటుంది. తండ్రి సంగీతరావు (పిఎల్ నారాయణ) వ్యవసాయ దారుడు. శివానంద్ వీళ్ళ ఇంటికి స్నానానికి వచ్చినప్పుడు ఈ విషయాలు తెలుసుకుంటాడు.  


        ‘అసలే మీరు అగ్రకులం. మా యింటికి స్నానికి రావడం...’ అంటూ సంగీతరావు సంకోచిస్తే, ‘ఈ రోజుల్లో కులాలేంటండీ మనిషి గ్రహాల్లో తిరుగుతూంటేనూ...’ అని కొట్టి పారేస్తాడు శివానంద్. ‘ఈనాటికీ మావూరు అగ్రహారంలో ఇంకో కులం వాడు కాలు పెడితే కాలు విరగ్గొడతారు’ అని సంగీతరావు పరిస్థితి చెప్తాడు. ఈ పరిస్థితిని కళ్ళతో చూస్తాడు శివానంద్. ఒక దళిత పిల్లాడు అగ్రహారంలోకి అడుగుపెట్టాడని ఎడాపెడా కొట్టేస్తూంటాడు పూజారి. దీనిమీద శివానంద్ తిరగబడతాడు, ‘అగ్రహారాలు ఆకాశం నుంచి వూడి పడ్డాయా? మీ చెప్పులు కుట్టే దెవరురా? మీ బట్టలు ఉతికే దెవరురా? మీరు తినే తిండి పండించే దెవరురా? వీటన్నిటికీ పనికొచ్చే మనుషులు ఇక్కడికి రావడానికి పనికిరారా? ఈ హరిజనులతో ఇప్పుడే ఆలయంలో ప్రవేశిస్తాను’  అని మొత్తం దళితులందరితోఆలయంలో కెళ్ళి పోతాడు. బ్రాహ్మణ వర్గం హాహాకారాలు చేస్తారు.

        ‘ఏది మతం, ఏది కులం’ అని పాడుతూ కోవెల కులం, ప్రమిదల కులం, పూజ పువ్వుల కులం, విబూధి కులం, పుట్టించినవాడి కులం, గిట్టే మట్టికి కులం అడుగుతాడు. ఇలా వున్న శివానంద్ వ్యవహారం, వీరంగం, వేరే గ్రామంలో వుంటున్న తండ్రికి తెలిసిపోతుంది. తండ్రి గౌరీనాథ శాస్త్రి (గుమ్మడి) రాజరాజేశ్వరీ దేవిని ఉపాసిస్తాడు. ప్రతీ శుక్రవారం దేవిని పూజించి, పేటికలోని తాళపత్ర  గ్రంథంలో ఖాళీగా వున్నఒక రాగిరేకుని తీసి ఆసక్తిగా చూస్తాడు. అదయ్యాక, ఇంటిముందు వరస కట్టిన గ్రామ ప్రజలకి విబూధి, తీర్థం ప్రసాదంగా పెడతాడు. వాటితో రోగాలు నయమవుతూంటాయి.

        ఆ తాళపత్ర గ్రంథం పూర్వీకుల నుంచి సంక్రమించింది. అందులో ఖాళీగా వున్న రాగి రేకుకి ఒక విశిష్టత వుంటుంది. దాని మీద దేవి ప్రపంచంలో ఎప్పుడు సాక్షాత్కరిస్తుందో స్వహస్తాలతో లిఖిస్తుందని తాత ముత్తాతల కాలం నుంచీ నమ్ముతూ వస్తున్నారు. దేవీ  సాక్షాత్కారమే పాపపంకిలమైన ఈ ప్రపంచానికి మోక్షదాయకమని నమ్ముతూ వున్నారు. ఆ దేవీ దర్శనం కోసం తాత ముత్తాతలు ఎదురు చూశారు. ఇప్పుడు గౌరీనాథ శాస్త్రి హారతులిస్తూ ఆహ్వానిస్తున్నాడు. 

        తన తర్వాత దేవిని ఆహ్వానించేదెవరా అని ఆలోచించకుండా, కొడుకుని కోరిన ఉద్యోగం ఎరువుల కంపెనీలో చేసుకోనిచ్చి, భార్య కాత్యాయినితో  హాయిగా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇలా సుఖంగా గడిచిపోతున్న జీవితానికి ఉన్నట్టుండి కొడుకు కొరివి దెయ్యంలా తయారయ్యాడు. 

        అవధాని వచ్చి చెప్తాడు, ‘మీ కొడుకు శివానంద శాస్త్రి అగ్రహారంలో బ్రహ్మణ్యంపై తిరగబడి హరిజన ప్రవేశం కల్పించాడు. వర్ణసంకరానికి పుట్టిన పిల్లతో ప్రేమలో పడ్డాడు’ అని. దీంతో గౌరీ పునాదులు కదిలిపోతాయి. కోడలికి అన్నిఅర్హతలూ వున్నాయంటూ చల్లగా వచ్చి చెప్తాడు శివానంద్. ‘ఆ కులహీనురాలికి తాళి కట్టావో, ఈ యజ్ఞోపవీతంతో వురేసుకుంటా!’ అని బెదిరిస్తాడు గౌరీ. ‘మీ మూర్ఖత్వానికి మూఢాచారాల కోసం ఆ అమ్మాయిని బలి చెయ్యాలా?’ అని ఎదురుతిరుగుతాడు శివానంద్. చెంప ఛెళ్ళుమన్పిస్తాడు గౌరీ. శివానంద్ కోపంతో వెళ్ళిపోయి, రాజేశ్వరి నేస్తాలడిగితే జంధ్యం తీసిచ్చేస్తాడు. ఆ జంధ్యానికి పసుపు కొమ్ము కట్టి, తాళిగా మార్చి పెళ్లి జరిపించేస్తారు నేస్తాలు. 

        ఇక మీ ఇంటి కెళ్దామంటుంది రాజేశ్వరి. ‘అక్కడికా? తుఫానులో సముద్ర స్నానం చేసినట్టుంటుంది’ అని వద్దంటాడు. ‘ఆ ఇంటి కోడలిగా నేనొప్పించుకుంటాగా’ అని తీసికెళ్తుంది. వీళ్ళని చూసి మండిపడ్డ  గౌరీ, ఇంటిని రెండు ముక్కలు చేసి ఒక ముక్కలో పడుండమంటాడు. ఒక ముక్కలో పక్కమీద కాపురం పెడతారు. ఓ తెల్లారే తులసి కోటకి ముగ్గు పెట్టలేదేమని భార్యనడుగుతాడు గౌరీ. బయట వున్నానని అంటుంది. ఇది విన్న రాజేశ్వరి వచ్చి ముగ్గు పెట్టేస్తుంది. ఇది చూసి మౌనంగా వెళ్ళిపోతాడు గౌరీ. మామగారు కరిగిపోయారు, ఇక మనదే విజయమని శివానంద్ కి చెప్పుకుని ఆనందిస్తుంది సుహాసిని. గబగబా నీళ్ళు తెచ్చి గుమ్మరించి ముగ్గు కడిగి పారేస్తాడు గౌరీ. 

        ఇంకో రోజు తన పుట్టిన రోజని పళ్ళూ పలహారం తీసుకొచ్చి, దీవించదీమంటాడు శివానంద్. తీసి ఇంటవతల విసిరేస్తాడు గౌరీ. సుహాసిని నెల తప్పుతుంది. నెలలు నిండాక తీసికెళ్దామని వస్తారు తల్లిదండ్రులు మరియా, సంగీత రావులు. రెండు బిందెల్లో సూడిదలు తీసుకుని వస్తారు. గౌరీ ఆగ్రహించి, పంచ పాతక జలం తెమ్మంటాడు భార్యని. ఆ జలాన్ని బిందెల మీద పోసి, బిందెల్ని ఎత్తి బయటికి విసిరి పారేస్తాడు. ఆవు పంచకంతో ఇల్లు శుద్ధి చేయమంటాడు. దిగ్భ్రాంతి చెందుతారు సుహాసిని తల్లిదండ్రులు. తల కొట్టేసినట్టవుతుంది శివానంద్ కి.

        ‘మీ దృష్టిలో మనుషులు ఆవు పంచకం కంటే హీనమైపోయారు. కానీ మనిషికి నియమ నిష్టల కన్నా, వేద వేదాంగాల్లో పాండిత్యం కన్నా, సాటి మనిషిని అర్ధం చేసుకునే  హృదయం, సంస్కారం వుండాలని నా అనుభవం చెప్పింది... మీ ధర్మాలూ శాస్త్రాలూ నా బిడ్డని కులం లేని దానిగా నిర్ణయించవచ్చు. కానీ మీ మనస్సాక్షికి నా బిడ్డ ఒక గర్భవతి. అభం శుభం తెలీని ఆడపిల్లగా కన్పిస్తే చాలు...’ అని బాధనణుచుకుని వెళ్ళిపోతాడు సంగీత రావు. 

        మనవడు పుట్టి వచ్చేసరికి గౌరీ పరమానంద భరితుడై పోతాడు. వాడు శ్లోకాలు పఠించేసరికి దగ్గరై పోతాడు. వాడిలో తనని చూసుకుంటాడు. ఈ ఆనందం ఎంతోసేపు నిలవదు. ఓ శుక్రవారం తను ఇచ్చిన విబూధికి ఒకడు చచ్చిపోతాడు. దీంతో దారంట పోతూంటే ప్రతివాడూ మాటలే. కులం లేని కోడలి రాకతో అమ్మవారి అనుగ్రహం ఆగ్రహమైపోయిందని. సాటి బ్రాహ్మణులు కూడా ఎత్తి పొడుస్తారు. దీంతో ఇంటికొచ్చి తుఫాను రేపుతాడు, ‘ఏ క్షణంలో ఈ కులహీనురాలు అడుగుపెట్టిందో, ఆ క్షణమే మన నియమ నిష్టలన్నీ మంటగలిసి పోయాయి. శక్తి విహీనులమైపోయాం. విబూధి స్మశానంలో బూడిదైంది, తీర్ధం మురిక్కాల్వలో నీళ్ళు. దాన్ని వెళ్ళిపొమ్మని చెప్పు!’ అని వూగిపోతాడు. దేవి ముందు క్షమించమని విలపిస్తాడు. 

         రాజేశ్వరి తన తక్కువ జన్మ తల్చుకుని కుమిలిపోతుంది. ఇక లాభం లేదని శివానంద్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. రహస్యంగా పూజ గదిలో పేటిక లోంచి తాళపత్ర గ్రంథం తీస్తాడు. అందులో ఖాళీగా వున్న రాగి రేకుని తీసి ఒక పని చేస్తాడు. ఏమిటా పని? ఏం చేశాడు? ఏం చేస్తే గౌరీనాథ శాస్త్రి ప్లేటు ఫిరాయించి కోడల్ని బంగారంలా చూసుకున్నాడు? పొలోమని జనాలూ, రాజకీయ నాయకులూ, దొంగబాబాలూ వచ్చిపడి  వాళ్ళ వాళ్ళ లాభాలూ చూసుకున్నారు? ఇదంతా చివరికి ఏ పరిణామాలకి దారితీసింది?...ఇదీ మిగతా కథ.

గుమ్మడియే ప్రధానాకర్షణ  
     గౌరీనాథ శాస్త్రి పాత్రలో గుమ్మడిది శక్తివంతమైన నటన. ఆగ్రహాన్ని ప్రదర్శించడంలో తనకి తానే సాటి అనేది తెలిసిందే. సన్నివేశాల్లో తనే ప్రధానాకర్షణ. కథకి మూలస్థంభం. సాంప్రదాయం ఆచారాలూ అంటూ పట్టుబట్టే సద్బ్రాహ్మణుడి పాత్ర రొటీనే, కొత్తదేం కాదు. అయితే ఓ కాస్త వూరటకి చాపల్యానికి పోయి, చాప కిందికి నీరు తెచ్చుకోవడం కొత్త చిత్రీకరణే. పాత్రకి ఆసక్తికర మలుపు. కొడుకు శివానంద్ చేసిందేమిటి? భార్యమీద తండ్రి అభిప్రాయం మార్చాలని రాగి రేకు మీద, ‘గౌరీనాథా...తరతరాలుగా నువ్వు చేస్తున్న పూజా ఫలితంగా నీ కోడలి రూపంలో నేను నీ ఇంట వెలిశాను’ అని మాత్రమే సువర్ణా క్షరాలు లిఖించాడు. ఇది చదువుకున్న గౌరీ ఓవరాక్షన్ చేశాడు. ఇక తరతరాలుగా వస్తుందని, వచ్చి రాగి రేకు మీద తన ఆగమనం గురించి లిఖిస్తుందనీ నీరీక్షిస్తున్న దేవీయే, ఇక సాక్షాత్కరించిందని నమ్మేశాడు గౌరీ. ఆనందం పట్టలేక ఇప్పుడు దేవీ అవతారంగా మెరిసిపోతున్న కోడలు రాజేశ్వరికి సాష్టాంగ పడిపోయాడు. లెంప లేసుకున్నాడు. పశ్చాత్తాపం ప్రకటించాడు. ఆమె కేమీ అర్ధంగాక తలుపేసుకుంది. పూజా గదిలో చేయి కాల్చుకుంటే వచ్చి ఆపింది. దీంతో పరవశుడైపోయాడు, ‘తల్లీ, నీ స్పర్శతో నాలో కొత్త జీవం వచ్చింది. నా అజ్ఞానం గానీ నీవు దయామయివి...ధరిత్రిని మించిన క్షమా మయివీ ....’ అంటూ పాలాభిషేకం చేశాడు. గౌరీ ప్రవర్తన చూసిన గ్రామస్థులు, ‘పూజలో అమ్మవారు వొంటి మీదికి వచ్చి వుంటుంది’ అనుకోసాగారు.


        గుమ్మడి పాత్ర ‘శంకరాభరణం’ లో జేవీ సోమయాజులు పాత్రకి దగ్గరగా వుంటుంది. ఇద్దరూ చేసింది ఒకటే. కాకపోతే పరిస్థితులు, ఉద్దేశాలు వేరు. సోమయాజులు శంకరశాస్త్రి పాత్ర నిమ్న కులస్థురాలైన వెలయాలి కూతుర్ని చేరదీస్తాడు. నాట్యంలో ఆమెని ప్రోత్సహిస్తాడు.
ఆచార వ్యవహారాలు మనుషుల్ని సన్మార్గంలో పెట్టడానికే తప్పమనుషుల్ని కులమనే పేరుతో  విడదీయడానికి కాదు అని ప్రకటిస్తాడు. ఇందుకు కలిసి వచ్చిన పరిస్థితి, సంగీతంలోనే తను అభ్యుదయవాది కాదు, జీవన యానంలోనూ గొప్ప అభ్యుదయవాది కావడం. 

       దీనికి విరుద్ధ భావజాలంతో వున్న గుమ్మడి గౌరీనాథ శాస్త్రి పాత్ర, ‘మనిషికి నియమ నిష్టల కన్నా, వేద వేదాంగాల్లో పాండిత్యం కన్నా, సాటి మనిషిని అర్ధం చేసుకునే  హృదయం, సంస్కారం వుండాలని’ ఇంకొకరితో చెప్పించుకునే పరిస్థితి. ఇలాటి తను కులహీనురాలని ఈసడించుకున్న కోడల్ని దేవతగా చేసేశాడు. కొడుకు చేసిన పనికి అంధ విశ్వాసంతో ఈ చర్యకి పాల్పడ్డాడు. ఆధ్యాత్మిక శాస్త్రాలకి మూఢత్వం తోడయితే దేవుళ్ళు పుట్టుకొచ్చేస్తారు. కొడుకు శివానంద్ ఈ మూఢత్వాన్నే వ్యతిరేకిస్తాడు. శంకరశాస్త్రి, గౌరీనాథ శాస్త్రి పాత్రల్ని పక్కపక్కన చూసినప్పుడు, ఇద్దరూ సామాజిక భక్తి కిరువైపులా కన్పిస్తారు. 

        సుహాసిని రాజేశ్వరి పాత్ర సంక్లిష్టమైనదే. కథా ప్రారంభంలో ఆమె పాత్ర ప్రవేశం రాజరాజేశ్వరీ దేవిగా నటిస్తూ నేస్తాలకి వరాలిచ్చే అల్లరిగా వుంటుంది. జీవితంలో ఇదే నిజమై, మామగారు తనని అదే దేవతగా చేస్తాడని వూహించి వుండదు. మామగారి కులహీనురాలి ముద్రతో కించ పడుతున్న తను, ఏకాఎకీన ఆ మామ తన సింహాసనం మీదే కూర్చోబెట్టి ప్రసాదాలు ఇప్పించేసరికి, నవ్వాలో ఏడ్వాలో తెలియని స్థితి ఆమె నటనకి ఒక చేర్పు. దీన్ని వేళాకోళంగా తీసుకుని, జనాల వెర్రి తనాన్ని చూసీ, విబూధీ తీర్ధాల తోనే కాదు, నిమ్మకాయలతో కూడా నోటికొచ్చిన వైద్యం చేసి పారేసే తమాషా క్యారక్టర్ ని వినోదం పండేలా చేసింది. తను చేస్తున్నది తప్పని తెలిశాక వెనక్కి తీసుకోలేని పరిస్థితి. వెనక్కి తీసుకుంటే తండ్రి సహా అందరం దోషులుగా నిలబడతామని శివానంద్ హెచ్చరిక. చివరికి తన కొడుకే జబ్బునపడితే తన మహిమలతో బాగు చేసుకోలేక వాణ్ణి కోల్పోవాల్సిన దౌర్భాగ్యం. ఇదంతా సుహాసిని పాత్రని సంక్లిష్ట పాత్రగా మార్చడంతో బాటు, నటిగా ఆమెకో నిఘంటువు కూడా అయింది. ఈ కథకి క్రమక్రమంగా తను దేవత అయ్యేసరికి ప్రధాన పాత్ర తనే అయిపోయింది.

        చంద్రమోహన్ శివానంద్ పాత్ర ఉత్ప్రేరక పాత్ర. రాగిరేకు మీద అలా రాయడంతో అతనే ఈ కథని ప్రధాన మలుపుతిప్పి సుహాసిని పాత్ర చేతిలో పెట్టేశాడు. పరిణామాలు చూస్తూ బెంబేలెత్తి పోయాడు. తన అభ్యుదయం, తండ్రి సాంప్రదాయం తగాదా పడితే మధ్యలో భార్య అమ్మవారై పోయి జీవితం తిరునాళ్ళయి పోవడమేమిటో అర్ధంగాక జుట్టు పీక్కునే పరిస్థితి. చివరికి వెర్రి జనం తననే చంపడానికి వెంటపడడం...ఆ రోజుల్లో ఇలాటి ఎమోషనల్ పాత్రలు పోషిస్తున్న చంద్రమోహన్ కి ఈ పాత్ర కష్టమేం కాదు. 

అర్ధవంతమైన కథనం  
       కథనంలో ఏఒక్క సీనూ అనవసరంగా వుండదు. అరగంటలో ప్రధాన మలుపుకొ చ్చి కథ ప్రారంభమైపోతూ, ప్రతీసీనూ ఇంకో సీనుగా మలుపు తీసుకునే పాయింటుతోనే వుంటుంది. పాయింటు నుంచి పాయింటు గా సాగే ఈ కథనంతో కథ చిక్కనవుతూ వుంటుంది. కథ పెద్దదవుతూ కూడా వుంటుంది. రాజేశ్వరి అభిమాన నటి జయసుధ కూడా వచ్చేసి ఆశీర్వాదం పొంది, లక్ష రూపాయలు విరాళం కూడా ఇచ్చేస్తుంది. రాజేశ్వరి దేవతగా వెలసిన విషయం రాజకీయ పార్టీలకీ తెలిసిపోతుంది. కండువా పార్టీ నాయకుడు కొండలరావు వచ్చేసి కండువా పర్చి ఆశీర్వదించమంటాడు. ఆశీర్వదిస్తూంటే ఆమె పాద ముద్రలు కండువా మీద పడతాయి. అంతే, ఆ పాదముద్రలు ప్రచారం చేసుకుంటూ పాదముద్రల గుర్తుకే ఓటెయ్యాలంటాడు. జనం శివాలెత్తి ఆ పాదముద్రలకే ఓట్లు గుద్ది అతణ్ణి సీఎంని చేసి పారేస్తారు! 


        ఇక సీఎం కొండలరావు రాజేశ్వరికి ఆశ్రమం కట్టించేస్తాడు. తిరునాళ్ళు జరిపించేస్తాడు. ఇదంతా గమనిస్తున్న, 33 సార్లు జైలునుంచి తప్పించుకొచ్చిన దొంగబాబా (నూతన్ ప్రసాద్), వచ్చేసి రాజేశ్వరిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తాడు, ‘నేను నందీశ్వరుడ్ననీ, నీకోసం నీతో పాటు నేనూ పుట్టానని భక్తులకి చెప్పు. నా వ్యాపారం చేసుకుంటాను. నీ కలెక్షన్ కేం అడ్డు రాను’ అని బేరం పెడతాడు.

        ఈ బ్లాక్ మెయిల్ ఆశ్రమాన్ని కబ్జా చేసేదాకా పోతుంది. అమ్మవారు సజీవ సమాధికి సిద్ధమయ్యారని ప్రకటించి జనాల్ని రెచ్చగొడతాడు. ఇప్పుడు రాజేశ్వరి అసలైన సంక్షోభంలో పడుతుంది. దీంతో అంతిమ నిర్ణయం ఏం తీసుకుందన్నది ముగింపు. 

        ఇందులో కథకి సంబంధం లేకుండా వచ్చిపోయే హాస్య పాత్ర వుంటుంది. రాళ్ళపల్లి పోషించిన హేతువాది డాక్టర్ తేయాకు పాత్ర. అతడికి విప్లవ కారుంటుంది, విప్లవ పనిమనిషుంటాడు, విప్లవ కుక్క వుంటుంది. కానీ విప్లవ భార్య వుండదు. ఆమె పిల్లల కోసం రావి చెట్టు చుట్టూ తిరుగుతూంటుంది. 

        కోడి రామకృష్ణ ఒక సామాజిక. రాజకీయ వ్యాఖ్యానం చేశారు ఈ ప్రయత్నం ద్వారా. సమస్యలకి మూలం ఎక్కడుందో ఆరోపించకుండా ఆలోచనాత్మకంగా అందించే సృజనాత్మకతని ప్రదర్శించారు. ప్రతివొక్కరూ ఇది తెలుసుకో గల్గితే కోడి రామకృష్ణ ముక్తాయించినట్టు, ఆచారాలు చేసే దేవుడు కాదు మనకి కావాల్సింది, మనసుతో మనుగడ చేసే మనిషి కోసం అదిగో అల్లదిగో... ఆ దిశగా సాగుదామని కోరుకుంటాం.

సికిందర్

 (‘పాలపిట్ట’ సాహిత్య మాస పత్రిక మే ’20 సంచిక నుంచి)


24, మే 2020, ఆదివారం

947 : సందేహాలు - సమాధానాలు

Q: మొన్న టీవీలో వచ్చినప్పుడు ‘హిట్’  సినిమా చూసాను. కాని మీ అంత పరిశీలనగా చూడలేదు. చిన్నప్పుడెప్పుడో జరిగినదానికి ఇప్పుడు పగ తీర్చుకోవడం, దానికి పోలీస్ అయిన భర్త అడ్డు చెప్పి, మానసిక వైద్యుడికి చూపించకపోవడంలో అర్థం లేదు. అలాగే చంపటానికి అంత స్కెచ్ వేసి కిడ్నాప్ చెయ్యాలా? రోడ్డు మీద నుంచున్నప్పుడు ట్రక్కుతో గుద్దించి చంపవచ్చు, లేకపోతే సింపుల్ గా ఎక్కడో అక్కడ కాల్చి పారేయచ్చు. ఇకపోతే షీలాలా ఎవరైనా కోరి మర్డర్ కేసుల్లో తల దూరుస్తారా? చాలా లాజిక్‌లు మిస్సయ్యాయి.

        ఇలాగే ‘అతడు’ సినిమా చాలా సార్లు టివిలో (కామెడి కోసం) చూసినప్పుడల్లా అనుకుంటాను. సిబిఐ అంత దిక్కుమాలిన ఇన్వెస్టిగేషన్ చేస్తుందా అని?  అసలు ప్రకాష్‌రాజ్ ఏం వెతుకుతున్నాడో అతనికైనా తెలుసా? సినిమాలో చాలా లాజిక్కులు మిస్సయ్యాయి. మహేష్ భవనం కిందకి దూకినప్పుడు అక్కడికి రైల్వే స్టేషన్ ఎలా వస్తుందో?  రైలు మీదకు దూకినప్పుడు ఎలక్ట్రిక్ వైర్లు తగలలేదా? గుడివాడలో మిస్సయిన చరణ్‌రాజ్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్‌లో కనపడడు. బాంకులు పేరు కూడ చూడకుండా చెక్కులు పాస్ చేస్తాయా? ఇలా చాలా ఉన్నాయి. ఈ సినిమాని మీ స్టయిల్లో వివరంగా విశ్లేషించవలసిందిగా కోరుతున్నాను.
బోనగిరి, బ్లాగర్ 

A: ఇంకెందుకు అయిపోయిన దానిగురించి. విషయమేమిటంటే అప్పట్లో ‘అతడు’ చూడడం కుదర్లేదు. తర్వాతెప్పుడూ చూడాలన్పించలేదు. ఎందుకో తెలీదు, అలా గడిచిపోయింది. ఇప్పుడు మీరు చెప్తూంటే విశేషాలు తెలుస్తున్నాయి. లాజిక్ అవసరం లేని ‘మ్యాజిక్’ కదా, అలాగే వుంటుంది. సినిమాల్ని గారడీ వాడి ఆటగా మార్చేస్తే చప్పట్లు కొట్టక ఏం చేస్తారు. ఇక ‘హిట్’ గురించి మీరు చెప్పింది బావుంది. రోడ్డు మీద నించున్నప్పుడు ట్రక్కుతో గుద్దించి చంపవచ్చు, తుపాకీతో కాల్చి పారేయ్యొచ్చు. దానికో స్కెచ్, కిడ్నాపూ అవసరం లేదు. అసలు తనే కారుతో గుద్ది చంపేయ వచ్చు. భర్త అడ్డు చెప్పకపోవడం కూడా ఒకటి. మానసిక వైద్యం ఆమెకి కాదు, కథకే కామన్ సెన్సు వైద్యం అవసరముంది. హిట్ -2 లోనైనా ఈ వైద్యం జరుగుతుందో లేదో చూద్దాం.

Q:  రోమాంటిక్ డ్రామాలకు అలాగే రోమాంటిక్ కామెడీలకు తేడాలు చెప్పండి. రెండు జానర్స్ లో పాసివ్, ఆక్టివ్ పాత్రలు, వాటి గ్రోత్ ఎలా ఉండాలి తెలియజేయండి. రోమాంటిక్ డ్రామా లలో పెద్దల పాత్రలతో ప్రధాన పాత్రలకు లక్ష్యాలు ఏర్పడడం లేదా వాళ్ళు మారడం లేదా వాళ్ళు చెప్పిన మాటలు విని  కలుసుకోవడం లేక విడిపోవడం జరుగుతుంటాయి, ఇవి ఎంత వరకు కరెక్ట్ అంటారు. అలాగే రెండు జానర్స్ లలో క్రియేటివ్ గా ఆలోచించి ఏవైనా రూల్స్ బ్రేక్ చేస్తూ కథలు చేసుకోవచ్చా? మిడిల్ సీన్లంటే క్యారక్టర్ గ్రోత్ లేదా యాక్షన్ కంటిన్యూటీ, ఏదో ఒకటై వుంటాయి అని మీరే ఒకసారి చెప్పారు. మరి ఈ జానర్ లలో అదెలా వుండాలో కూడా వివరించండి.
డివి, అసోసియేట్ 

 A: రోమాంటిక్ డ్రామా, రోమాంటిక్ కామెడీ తేడాల గురించి అనేక సార్లు చెప్పుకునీ చెప్పుకునీ అలసిపోయాం కదా. 2016 లో ‘రోమాంటిక్ కామిడేడ్పులు’ అని ఏకంగా ఆ ర్టికలే రాశాం. ఆ కింద లింక్ ఇచ్చాం, చూడండి. మీ సందేహాలన్నీ తీరిపోతాయి. ఇక ఈ జానర్స్ లో క్రియేటివ్ గా ఆలోచించి రూల్స్ బ్రేక్ చేస్తూ కథలు చేయడం గురించి : రూల్స్ అనేవి సినిమాల్లోంచి ఏర్పడ్డాయి. విజయవంతమైన, పరాజయం పాలైన సినిమాల్లోని స్టోరీ మెకానిజంలని చూసి, ఇలాతీస్తే బావుటుంది, ఇంకిలా తీస్తే బావోదు అని రూల్సు ఏర్పాటు చేశారు. సినిమాల్లోంచే శాస్త్రం పుట్టింది, శాస్త్రంలోంచి సినిమాలు కాదు. పదార్థం లేక శాస్త్రం లేదు. ముందు పదార్థం, తర్వాతే దాన్ని బట్టి శాస్త్రం. న్యూటన్ నెత్తి మీద ఆపిల్ పండు రాలిపడితే, దాన్నిబట్టి భూమికి గురుత్వాకర్షణ శక్తి వుందని తెలుసుకుని శాస్త్రం రాశాడు. స్ట్రక్చర్ కూడా సినిమాల్ని పరిశీలించే పుట్టింది. ముందు స్ట్రక్చర్ రాస్తే దాంతో సినిమాలు పుట్టలేదు. అరిస్టాటిల్ నాటకాలు చూసే నాటక శాస్త్రం రాశాడు. భరతముని నాట్యం చూసే నాట్య శాస్త్రం రాశాడు. ట్రాఫిక్ లో గుద్దుకు చస్తుంటే అది చూసి ట్రాఫిక్ రూల్స్ ఏర్పడ్డాయి. చేసే వాడు రాయడు, చూసే వాడు రాస్తాడు. ఎండ్ సస్పెన్స్ తీస్తే సినిమాలు ఫ్లాపవుతాయని ప్రాచీనుడెవరైనా తాళపత్రాల మీద రాశాడా? ఎండ్ సస్పెన్స్ సినిమాలు ఫ్లాపవుతున్నాకే ఎందుకుఫ్లాపవుతున్నాయో అందులోని కారణాలతో పరిశీలకులు హెచ్చరించారు. ‘ఈక్వలైజర్ టూ’ లో రొటీన్ కథకి మిడిల్ తగ్గించి, 40 నిమిషాలు క్లయిమాక్స్ పెట్టుకుంటే సక్సెస్ అవుతుందని ఎవరైనా ముందు రూల్స్ చెప్పారా? దర్శకుడు అలా తీశాక, అవును ఇది కూడా ఒక రూలే కదా అని పరిశీలకులు చెప్పగల్గుతున్నారు. రూల్స్ ఎవరి మెదళ్లలోంచీ వూడి పడవు, తీస్తున్న సినిమాల్లోంచే పుట్టుకొస్తాయి. అయితే జరుగుతున్నదేమిటంటే, రూల్స్ సిడ్ ఫీల్డ్ అనే ఎవరో ఏర్పాటు చేశాడనీ, లేదా మెక్ కీ అనే అతను చెబుతున్నాడనీ, వీళ్ళెవరు సినిమాలెలా తీయాలో మా సినిమా వాళ్ళకి చెప్పడానికి, మా సినిమా వాళ్లకి సినిమాలెలా తీయాలో తెలీదా -   మా సినిమా వాళ్ళంటే ఏమనుకుంటున్నారు -అనే వీర ప్రచండ అజ్ఞాన వైఖరి ఏదైతే వుందో - దాంతో వస్తోంది సమస్య. దాంతో వస్తున్నాయి 92 శాతం ఫ్లాపులన్నీ. స్క్రీన్ ప్లే నిపుణుడు, రివ్యూ రైటర్ ఎవరూ సొంత అభిప్రాయాలని రుద్దరు, సినిమాలు స్థాపించిన సూత్రాల్నే తిరిగి గుర్తు చేస్తారు. వీళ్ళు జస్ట్ రిపోరర్స్ లాంటి వాళ్ళు. ఉన్న వాస్తవాన్ని రిపోర్టింగ్ చేస్తారంతే. 

        కాబట్టి, రూల్స్ గురించి అపోహలు తొలగించుకుని, వాటిని బ్రేక్ చేయాలన్న అనవసర కోపతాపాలకి పోకుండా, ముందు తామేం చేయాలో గుర్తిస్తే బావుంటుంది. తీసే పాత మూస సినిమాల వారసత్వ మోజుని బ్రేక్ చేసి, కొత్త తరహా కథలతో కొత్త తరానికి ఏం చెబుతారన్నది ఛాలెంజి అవాలి. కానీ ఈ ఛాలెంజికి ఎవరూ సిద్ధంగా వుండరు. అలాంటప్పుడు ఏ రూల్స్ తోనూ పనిలేని, సినిమా టికెట్లు తెగని, ఇండీ మూవీస్, ఆర్ట్ మూవీస్, వరల్డ్ మూవీస్ లాంటివి తీసుకుని అహాన్ని సంతృప్తి పర్చుకోవచ్చు. 

Q: ప్రేమ కథల్లో సెకండ్ యాక్ట్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? ఏ ప్రేమ కథ తీసుకున్నా అంతో ఇంతో ఇంట్రస్ట్ గా ఉండే పాత్రలను మొదటి అరగంటలో పరిచయం చేస్తారు ఆ తర్వాత షరా మామూలే. ఆ పాత్రలు బాగానే ఉన్నా ప్రేమకథ లో ఫీల్ కానీ లేదా డెప్త్ కానీ మిస్ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది. హీరో హీరోయిన్ ను ప్రేమించాలి, తను అతనికి పడాలి, అని బలంగా ప్రేక్షకుడు కోరుకుని అది జరిగిన తర్వాత, వాళ్ళ ప్రేమ కథలో విషయం లేక నీరసం నిస్సత్తువ ఆవహిస్తాయి ప్రేక్షకులకు. హీరో హీరోయిన్ ప్రేమలో పడ్డాక ఏం జరగాలి? లవ్ స్టోరీ లలో స్ట్రక్చర్ ని బ్రేక్ చేస్తూ కథలు చేసుకోవచ్చా? ఇవన్నీ వివరించగలరు.
ఏవీ, అసోసియేట్

A: ఏ కథలోనైనా సెకండ్ యాక్ట్ (మిడిల్) బిజినెస్ ఒకటే వుంటుంది. దీని గురించి వివిధ సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు రాస్తున్న ప్రతీసారీ చర్విత చరణంగా వివరించాకే విశ్లేషణ లోకి వెళ్తున్నాం. ఏ కథకైనా అదే బిజినెస్ వుంటుంది. సమస్యతో పోరాటం, ప్రత్యర్ధి తో యాక్షన్ రియక్షన్ల ఇంటర్ ప్లే. మిడిల్ బిజినెస్ అంటేనే మన సైకలాజికల్ గా, ఒప్పుకుంటే స్పిరిచ్యువల్ గా కూడా - మన కాన్షస్ మైండ్, సబ్ కాన్షస్ మైండ్ ల లడాయే కాబట్టి, ఇది లేకుండా ఏ రకమైన కథా వుండదు. వుంటే కథ కాదు. 

        ప్రశ్నలో మీరడిగిన సందేహాలన్నీ మిడిల్ గురించే. ప్రేమ కథల డైనమిక్స్ అన్నీ మీకు కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి చూస్తే తెలుస్తాయి. ఇక స్ట్రక్చర్ ని బ్రేక్ చేయడం గురించి పై ప్రశ్నకి జవాబు చూడగలరు. గతవారం Q&A కూడా చూడగలరు. 

Q: మీరొక పోస్ట్ లో రీసెంట్ గా, అసలు నేను ప్రేమిస్తున్నాను అని పాత్రలు ఒకరికొకరు చెప్పుకోవడం చాలా వరస్ట్ రైటింగ్ అన్నారు. ప్రేమను వ్యక్త పరిచే సన్నివేశాలు ఎలా ఉండాలి ఉదాహరణలు ఇవ్వగలరు. నోట్: ప్రేమ కథలలో వచ్చేవి అవే మానసిక పరిపక్వ త లేని పాత్రలు కాబట్టి వాళ్ళు తమ ప్రేమను వ్యక్తం చేయడాన్ని సదరు రచయితలు, దర్శకులు కూడా భారీ గానే రాస్తారు తీస్తారు. హీరోలు కూడా అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తారు. అసలు ప్రేమ కథలలో పాత్రల మానసిక స్థితి గతుల గురించి చెప్పండి.
ధీర్, దర్శకత్వ శాఖ 

A: వాళ్ళు ప్రేమలో పడ్డారనే విషయం చూస్తున్న సీన్ల ప్రకారం ప్రేక్షకులకి తెలిసిపోతూంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని ఇంకా చెప్పడం దేనికి? ప్రేక్షకులు తెలివి లేని వాళ్ళా? ఆ మేరకు తీసిన ఫుటేజీ బడ్జెట్ వేస్ట్ కదా? ప్రింట్ మీడియా రైటింగ్ తెచ్చి విజువల్ మీడియాకి రాసి పడేస్తే ఇలాగే వుంటుంది. కచ్చితంగా ఇది బోరు కొట్టే సీను. ఇందులో మార్కెట్ యాస్పెక్ట్ గానీ, క్రియేటివ్ యాస్పెక్ట్ గానీ లేదు. యూత్ అప్పీల్ సరే. ఆమె ప్రేమిస్తున్న విషయం ప్రేక్షకులకి కళ్ళారా తెలుసు. అది పాత సంగతే. వొళ్లారా ఆమె ఎలా ప్రేమిస్తోందో ప్రేక్షకులకి తెలియని కొత్త సమాచారం కావాలి. ప్రేమిస్తున్న విషయం అతడికి నిర్ధారణ చేయడానికి వొళ్ళు వూపిందా, కళ్ళు తిప్పిందా, పెదవి కొరికిందా, అసలు నాలిక్కర్చుకుని పారిపోయిందా విజువల్ యాక్షన్ కావాలి. ఏదైనా టిఫిన్ చేసిపెట్టిందా, అతడి పనులు చేసి పెట్టడానికి వెంటపడుతోందా, అతను తిన్న జాంపండు చాటుగా కోరికి ఓల్డ్ డ్రామా చేసిందా, అతడికి గాయమైతే పర్రున చున్నీ చించి కట్టి మెలోడ్రామా ఆడిందా కావాలి. ప్రేమ కథకి విజువల్ యాక్షన్ ప్రాణం. ప్రేమనేది చైతన్య వంతమైనది. వొళ్ళూ మనసూ కదిలిపోయేలా చేసేది. ఫిలిం ఈజ్ బిహేవియర్ అని సింపుల్ గా చెప్పాడు సిడ్ ఫీల్డ్. ప్రియదర్శన్ తీసిన ‘కాంచీ పురం’ లో ఒక స్టన్నింగ్ సీనుంటుంది : నువ్వు నచ్చావని బావ నీకు చెప్పాడా అని పదిహేను పదహారేళ్ళ కూతుర్ని ప్రకాష్ రాజ్ అడిగే సీను. అప్పుడు కూతురు -తను నచ్చానని బావ చెప్పాడని వలవలా ఏడ్చెయ్యడం ఆ వయసుకి ఆమె బిహేవియర్. ఏడ్వకుండా డైలాగు చెప్పేస్తే క్యారక్టర్ లేదు, సీను లేదు. మీరు చెప్పిన మానసిక పరిపక్వత లేని పాత్ర ఇలా వుంటుంది. మానసిక పరిపక్వత లేదు కాబట్టి ఎలా ప్రవర్తించాలో పాత్రకి తెలియదనుకుని రచయితలు, దర్శకులు భారీ డైలాగులు రాసేస్తే అది పాత్ర మానసిక ప్రపంచం మీద దాడి అవుతుంది. పాత్రలోకి వెళ్లి పాత్ర చేత పలికిస్తే, ప్రవర్తింపజేస్తే ఇలా వుండదు. ఇలాటి చిత్రణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ప్రేమ  కథల్లో మానసిక స్థితుల గురించి ఎలా చెప్తాం. ఆ కథల్లో ఏర్పాటయ్యే గోల్ ని బట్టి వుంటుంది.

Q: నేను ఇండీ ఫిలిం చేసే ఉద్దేశంతో వున్నాను. దీనికి బిజినెస్ జరగాలంటే ఏం చేయాలంటారు?
దర్శకుడు  

A: వేల సంవత్సరాలుగా ఆకట్టుకుంటూ ఇంకా మున్ముందు కూడా ఆకట్టుకోగల సాంప్రదాయ నిర్మాణాన్ని కలిగివుండే కథల నిర్మాణపరమైన నియమ నిబంధనల్ని ఉల్లంఘించి, అవాంట్ గార్డ్ పద్ధతిలో అంటే- కమర్షియలేతర యూరోపియన్ సినిమాల తరహాలో- (మీరనే ఇండీ ఫిలిం కూడా) - ఇంకా చెప్పాలంటే మన ఆర్ట్ సినిమాల  టైపులోనే - కథ చెప్పాలనుకుంటే మిమ్మల్ని కాపాడే వారెవరూ వుండరని అంటున్నాడు ఇంటర్నెట్ స్క్రీన్ రైటింగ్ కోర్సు ఎడిటర్ లారెన్స్ కానర్. కనుక సాంప్రదాయబద్ధంగానే ( అంటే బిగినింగ్-మిడిల్-ఎండ్ నియమ నిబంధనల్ని పాటిస్తూ) కథ చెప్పాలనీ, చెబుతూ అందులోనే కొత్తగా, ఆశర్యపర్చే విధంగా కథనం చేసుకోవాలనీ చెబుతున్నాడు. వ్యాపార విలువ లేని కళా ప్రక్రియల గురించి ఆలోచించడం అనవసరమేమో.  

సికిందర్ 

‘రోమాంటిక్ కామిడేడ్పులు’