రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, మే 2020, సోమవారం

943 " స్క్రీన్ ప్లే సంగతులు


        (చదివే పని పెరగడంతో రాత పనికి వారంపాటు బ్రేక్ పడింది. నేటి నుంచి షరా మామూలే...)
       
టీవల హిందీలో టౌన్ కామెడీలనే కొత్త ట్రెండ్ రోమాంటిక్ కామెడీలు వస్తున్నట్టు, ఇదో కొత్త జానర్ అవుతున్నట్టూ గతంలో కొన్ని సార్లు చెప్పుకున్నాం. దీని జానర్ మర్యాదల గురించి కొందరు అడుగుతున్నారు. ఈ టౌన్ రోమాంటిక్ కామెడీలు రెండు రకాలు. లివ్ ఇన్ రిలేషన్ షిప్, గే లవ్, లెస్బియన్ లవ్ వంటి జీవన శైలుల్ని నగర సంస్కృతిలో చూపిస్తున్నవి కాస్తా, సాంప్రదాయంగా నిదానంగా వుండే టౌన్ సెటప్ లో చూపిస్తూ కొత్త ట్రెండ్ కి బాట వేయడం ఒక రకం కాగా; ఈ కాన్సెప్ట్స్ కాకుండా, సాధారణ రోమాంటిక్ కామెడీలనే ఇదే టౌన్ సెటప్ లో చూపించడం రెండో రకం. మన్మర్జియా, లుకా ఛుప్పీ, శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్, ఏక్ లడ్కీకో దేఖాతో ఐసా లగా వంటివి మొదటి రకంలోకి వస్తే, బరేలీకీ బర్ఫీ, డ్రీంగర్ల్ వంటివి రెండో కోవకి చెందుతాయి. ఈ రెండు రకాల రోమాంటిక్ కామెడీల్ని సిటీ లైఫ్ లో చూపించడం మొనాటనీ అయిపోవడం వల్ల కావొచ్చు, వీటిని టౌన్లకి తీసికెళ్ళి నేపథ్య వైవిధ్యంతో కొత్తదనాన్ని సాధిస్తున్నారు. ఆ టౌన్ ఏదైతే వుంటుందో దానిదైన నేటివిటీని, మనుషుల్నీఅచ్చంగా చిత్రించి ఒక దగ్గరితనం ప్రేక్షకులు ఫీలయ్యేలా, ఎంజాయ్ చేసేలా చేస్తున్నారు.

       
‘లుకా ఛుప్పీ’ (దాగుడు మూతలు) లివ్ ఇన్ రిలేషన్ షిప్ కథ. నగర నేపథ్యంలో చూపిస్తూ వచ్చిన ఈ ఆధునిక పోకడని ఇలా టౌన్లో చూపించడం వల్ల ఒనగూడే బాక్సాఫీసు లాభమేమిటంటే, ఇలాటి నగర పోకడలు టౌనులో అలజడి సృష్టించ వచ్చనే ఒక అంచనా. అక్కడి ప్రజలు (పాత్రలు) ఛీ థూ అని దీన్నో ఇష్యూగా చేసి హంగామా చేయ వచ్చన్న ఆలోచన. ఈ అల్లరి అలజడి లేదా కామిక్ కాన్ఫ్లిక్ట్ కొత్త వినోదాత్మక విలువగా మారి బాక్సాఫీసుకి తాజాదనాన్ని తీసుకు వస్తుందన్న వ్యూహం. టౌను జీవులు నగరాల కంటే కాలంతో ఒకడుగు వెనకుంటారనే అందరూ ఆమోదించే సినిమా సూత్రీకరణే ఈ జానర్ కి నేపథ్య బలాన్ని సమకూరుస్తోంది. 

        ‘లుకా ఛుప్పీ’ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కూడా. మరాఠీలో రెండు సినిమాల దర్శకుడు. రచయిత రోహన్ శంకర్ ఈ కథ రాసుకొస్తే వెంటనే తిరస్కరించాడు. కారణం అది మథుర పట్టణ నేపథ్యంలో వుండడం. ఆ పట్టణమూ అక్కడి వాతావరణం తనకి తెలియవు. తెలియని వాటితో రిస్కు తీసుకోలేడు. అలాగని కథని ఫలానా వూరు అని కాకుండా ఫార్ములా సినిమాగా తీసేయడానికి మనసొప్పలేదు. తర్వాత్తర్వాత ఈ సబ్జెక్టుని చేపట్టేందుకు సిద్ధపడి, రచయితతో కలిసి ఏడాదిన్నర పాటూ మథురకి వెళ్ళివస్తూ అక్కడి నేటివిటీని అర్ధంజేసుకోవడానికి ప్రయత్నించాడు. మథుర పట్టణం పలికే ఆత్మని పట్టుకునే ప్రయత్నం చేశాడు. తదనుగుణంగా కథా రచనలో పాల్గొన్నాడు.

        ఈ కథకి పూర్వరంగం
       ఇలా ఏర్పాటవుతుంది - మథుర పట్టణాన్ని సందర్శించిన సినిమా స్టార్ నజీం ఖాన్ (అభినవ్ శుక్లా) తను లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో వున్నట్టు గొప్పగా ప్రకటించడంతో పెద్ద దుమారం లేస్తుంది. ప్రజలు అతడి పోస్టర్ల మీద పేడ కొడతారు. సినిమాలు నిషేధిస్తారు. పెళ్లి పవిత్రత గురించి ఓవరాక్షన్ చేస్తూ ఆందోళనకి దిగుతారు. భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్న యాంటీ నేషనల్ అని అతడి మీద ముద్ర వేస్తారు. ఇదంతా చూసి సంస్కృతీ రక్షా మంచ్ అనే లోకల్ పార్టీ రంగంలోకి దూకుతుంది. దీన్ని రాజకీయం చేసి ప్రేమికుల్ని ఉరికించి ఉరికించి కొడుతుంది. పార్టీకి చెందిన పేట రౌడీ కార్యకర్తలు హిందూ ధర్మ సంరక్షకులుగా మారిపోయి ఎడాపెడా వాయిస్తూంటారు. ఎన్నికల్లో ఇదే ప్రధానాంశమని, లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ (ఎల్ ఆర్) కి తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమనీ ధీరోదాత్త ప్రకటన చేస్తాడు పార్టీ అధ్యక్షుడు విష్ణు త్రివేదీ (వినయ్ పాఠక్). ఇతను ప్రతీసారీ ఎన్నికల్లో ఓడిపోతూంటాడు. ఇప్పుడు గెలవడానికి మంచి మసాలా దొరికింది.  


        ఈ పూర్వ రంగంలో కథ
        ఇలా ప్రారంభమవుతుంది- లోకల్ కేబుల్ టీవీ స్టార్ రిపోర్టర్ వినోద్ ‘గుడ్డూ’ కుమార్ శుక్లా (కార్తీక్ ఆర్యన్), అతడి కెమెరామాన్ అబ్బాస్ ( అపరాశక్తి ఖురానా) పనిచేస్తున్న ఆఫీసుకి కూతురు రేష్మీ (కృతీ సానన్) ని వెంటబెట్టుకుని  విష్ణు త్రివేదీ వస్తాడు. ఈమె జర్నలిజం చేసి ఇంటర్న్ షిప్ కోసం ఎదురు చూస్తోంది. కేబుల్ టీవీ చీఫ్ ఆమెని చేర్చుకుంటాడు. ఆమె గుడ్డూ, అబ్బాస్ లతో కలిసి టీంగా వుంటుంది. వీళ్ళు  టౌన్లో ఎల్ ఆర్ మీద అభిప్రాయ సేకరణ చేస్తూంటారు. ఎల్ ఆర్ చాలా మంచిదని, కాబోయే మొగుడు తాగుబోతో కాదో అప్పుడే తెలుస్తుందనీ, తాగుబోతు మొగుడితో అనుభవం గడించిన ఒక ముసలావిడ కెమెరా ముందు సంచలన కామెంట్ చేస్తుంది.

        ఇలా కలిసి పనిచేస్తూ ప్రేమలో పడతారు గుడ్డూ రేష్మీలు.  గుడ్డూ కుటుంబంలో తల్లిదండ్రులు, పెళ్ళయిన అన్న, వాళ్ళ కొడుకు, పెళ్ళికాని అన్న, ఇంకో బాబూలాల్ (పంకజ్ త్రిపాఠీ) అనే తుంటరి బంధువూ వుంటారు. వీళ్ళకో బట్టల షాపు వుంటుంది. ఈ బాబూలాల్ ఆడవాళ్ళ వెంటపడే రోమాంటిక్ అలవాటుతో వుంటాడు. ఇటు రేష్మీని ప్రేమిస్తున్న గుడ్డూ పెళ్ళికి పెళ్ళికాని అన్న అడ్డుగా వుంటాడు. మరోపక్క రేష్మీ అప్పుడే ప్రేమకి సిద్ధంగా వుండదు. మరికొంత కాలం అతణ్ణి తెలుసుకోవాలనుకుంటుంది. ఇందుకు ఎల్ ఆర్ ప్రపోజ్ చేస్తుంది. గుడ్డూ షాక్ తింటాడు. తప్పదంటుంది. ఉన్న వూళ్ళో అందరికీ తెలిసేలా ఎల్ ఆర్ కి భయపడతాడు. అబ్బాస్ ఒక ఐడియా చెప్తాడు. దూరంగా గ్వాలియర్ లో ఎసైన్ మెంట్ పెట్టుకుని ముగ్గురూ వెళ్తే, అక్కడ వాళ్ళిద్దరూ 20 రోజులు ఎల్ ఆర్ చేసుకో వచ్చంటాడు.

        అలా గ్వాలియర్ లో ఎల్ ఆర్ పెడ్తారు. వీళ్ళ మీద అదే భవనంలో వుండే మిసెస్ శ్రీవాస్తవ్ అనే ఆవిడ కన్నేసి వుంటుంది. వీళ్ళకి పెళ్లి కాలేదని పసిగట్టి అందర్నీ పిలుచుకు వచ్చి పట్టిస్తుంది. ఇలాటిదేదో జరుగుతుందని ముందే వూహించిన అబ్బాస్ ఐడియాతో, తమ నకిలీ పెళ్లి ఫోటో ఒకటి గోడకి పెట్టేస్తారు గుడ్డూ రేష్మీలు. ఈ పెళ్లి ఫోటో చూసి నమ్మేసి అందరూ మిసెస్ శ్రీవాస్తవ్ ని తిట్టేసి వెళ్ళిపోతారు.


            అలా గ్వాలియర్ లో ఎల్ ఆర్ పెడ్తారు. వీళ్ళ మీద అదే భవనంలో వుండే మిసెస్ శ్రీవాస్తవ్ అనే ఆవిడ కన్నేసి వుంటుంది. వీళ్ళకి పెళ్లి కాలేదని పసిగట్టి అందర్నీ పిలుచుకు వచ్చి పట్టిస్తుంది. ఇలాటిదేదో జరుగుతుందని ముందే వూహించిన అబ్బాస్ ఐడియాతో, తమ నకిలీ పెళ్లి ఫోటో ఒకటి గోడకి పెట్టేస్తారు గుడ్డూ రేష్మీలు. ఈ పెళ్లి ఫోటో చూసి నమ్మేసి అందరూ మిసెస్ శ్రీవాస్తవ్ ని తిట్టేసి వెళ్ళిపోతారు. 

        ఇక ఈ ఎల్ ఆర్ లో గుడ్డూ పెళ్ళికి తగిన వాడేనని సర్టిఫై చేస్తుంది రేష్మీ. ఇంతలో గ్వాలియర్ కొచ్చి, ఒక పెళ్ళయినావిడతో రోమాంటిక్ ఎపిసోడ్ వెలగబెడుతున్న బాబూలాల్ కంట పడిపోతారు గుడ్డూ రేష్మీలు. ఇక అతను కడుపులో దాచుకోలేక గుడ్డూ కుటుంబం మొత్తాన్నీ తీసుకొచ్చి చూపించేస్తాడు సీను. ఆ పెళ్లి ఫోటో చూసి గుడ్డూ కుటుంబం వీళ్ళకి పెళ్ళయిందనే నమ్ముతారు. కాకపోతే లేచిపోయి దొంగ పెళ్లి చేసుకుని పరువు తీసినందుకు తిడతారు. వెళ్లి రేష్మీ తండ్రికి విన్నవించుకుంటారు. అతను షాక్ తింటాడు. కూతురే ఇలా చేస్తే రేపు ఎన్నికల్లో ఏం పోరాడతానని తల పట్టుకుంటాడు. ఖర్మ అనుకుని పెళ్లి రిసెప్షన్ కి ఏర్పాట్లు చేస్తాడు. పెళ్ళికాని గుడ్డూ రేష్మీలు పెద్దల ముందు ఇంకోసారి పెళ్లి చేసుకుని రిసెప్షన్ పెట్టుకుంటామంటారు. వీల్లేదంటాడు. 

         ఇలా పెళ్లి కాలేదని నమ్మించలేని తాము పెళ్ళయిన జంటలాగా కాపురం పెట్టా ల్సివస్తుంది గుడ్డూ వాళ్ళింట్లో. ఇది మనసొప్పక రహస్యంగా నైనా పెళ్లి చేసుకుందామని పట్టుబడుతుంది రేష్మీ. ఇలా వీళ్ళ  రహస్య పెళ్లి ప్రయత్నాలు కూడా ఎలా విఫలమవుతూ  హాస్య ప్రహసనాలు సృష్టించాయన్నది మిగతా సెకండాఫ్ కథ.

జానర్ మర్యాదలు
      ముందుగా చెప్పుకోవాల్సిందేమిటంటే బ్యాక్ డ్రాప్. నగర బ్యాక్ డ్రాప్ లో కథని టౌన్ బ్యాక్  డ్రాప్ లో చూపించడం. ఆ టౌను వాతావరణాన్నీ, అక్కడి ప్రజల తీరు తెన్నుల్నీ, భాషనీ కథలో భాగం చేసి, ఆ టౌను కథా ప్రపంచాన్ని సృష్టించడం. ఈ కథ ఈ టౌనుకి వర్తించే  కథా ప్రపంచం. ఇదే కథని ఇంకో టౌనులో తీస్తే ఆ టౌనుకి వర్తించే కథా ప్రపంచంగా మార్పు చేర్పులు చేసుకోక తప్పదు. ఒక కథ పట్టుకుని ఏ టౌను కైనా ఇదే నా కథ, ఇదే నా కథనం, ఇవే నా పాత్రలు, ఇవే నా దృశ్యాలు, ఇవే నా డైలాగులూ  - ఎంతో కష్టపడి నా నా ముద్దొచ్చే స్క్రిప్టు నేను రాసుకున్నాను, మార్చమంటే మార్చనుగాక మార్చను - అని గుండుగుత్త బేరం పెట్టుకుంటే ఈ జానర్ జోలికి రానవసరం లేదు. 


       ఈ కథ ఎల్ ఆర్ కాన్సెప్ట్ తో తీశారు. ఒక్కో టౌనులో దీని పట్ల ఒక్కో రియాక్షన్ ప్రజల నుంచి వుండొచ్చు. కనుక ఒక టౌనుని దృష్టిలో పెట్టుకుని ఇలాటి కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు, ఆ టౌను ప్రజల రియాక్షనేమిటో వెళ్లి అడిగి తెలుసుకోవాలి. ఆ రియాక్షన్స్ ని కథలో భాగం చేయాలి. 

        మాది వరంగల్, లేదా విజయవాడ- మాకు తెలిసిన వరంగల్ లేదా విజయవాడలో మేం బాగా తీసుకోగలమనుకుంటే తీసేది కథతో వుండక,  పనిగట్టుకుని అక్కడి చారిత్రక, పర్యాటక, తీర్థ స్థలాల ప్రదర్శన చేసే ప్రమాదముంది. తెలియని టౌన్లో తీస్తే దర్శకుడు కథతో వుంటాడు.  ఈ జానర్లో హిందీలో తీస్తున్న ఇలాటి టౌన్లు దర్శకులకి పరాయి ప్రాంతాలే. ‘లుకా ఛుప్పీ’ తీసిన మథురలో ఎన్నో దేవాలయాలున్నాయి. ఒక్కటీ చూపించలేదు.   
    
రెండోది, తారాగణం కూర్పు
        ఈ జానర్లో తీస్తున్న హిందీ సినిమాల్లో పెద్ద స్టార్స్ వుండరు. పెద్ద విలన్లు, పెద్ద కమెడియన్లు, పెద్ద సహాయ నటులూ వుండరు. బాలీవుడ్ బిగ్ బడ్జెట్స్ తో పోలిస్తే ఇవి చాలా స్మాల్ బడ్జెట్ కామెడీలు. ఇలాటి వాటిలో నటిస్తూ గుర్తింపూ, ప్రేక్షకుల అభిమానమూ పొందుతున్న స్మాల్ నటీ నటులే ఈ జానర్ ని పెంచి పోషించుకుంటున్నారు. ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావ్, కార్తీక్ ఆర్యన్, అపరా శక్తి ఖురానా, అభినవ్ శుక్లా వంటి హీరోలు, కృతీ సానన్, నుస్రత్ బరూచా, భూమీ పట్నేకర్ వంటి హీరోయిన్లు, పంకజ్ త్రిపాఠీ, పియూష్ మిశ్రా వంటి కమెడియన్లు, వినయ్ పాఠక్, సీమా పహ్వా వంటి సహాయ నటులూ ఈ స్మాల్ మూవీస్ స్టార్లుగా తమదైన వినోదాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఈ సినిమాలు బాగా పాపులర్ అవడానికి వీటికి పరిమితమై పాపులర్ అవుతున్న ఈ నటులే కారణం. వీళ్ళని మళ్ళీ మళ్ళీ చూడ్డానికి ఈ స్మాల్ మూవీస్ కి క్యూలు కడుతున్నారు ప్రేక్షకులు. 


        తెలుగులో ఈ పరిస్థితి, ఈ మార్కెట్ యాస్పెక్ట్ ఆలోచన, పరిశీలన, పరిజ్ఞానం  లేవు. ఇదంతా వదిలేసి ఇక సినిమాలకి భవిష్యత్తే లేదనీ, ఓటీటీయే టీకా మందు అనీ అటువైపు క్యూలు కట్టడం. స్మాల్ మూవీస్ తో పాపులరై స్మాల్ మూవీస్ కి ప్రేక్షకుల్ని ఆకర్షించే స్మాల్ హీరోహీరోయిన్లు గానీ, కమెడియన్లు గానీ, సహాయ నటులుగానీ తెలుగుకి లేకుండా చేశారు మొత్తానికి. అలా పెంచి పోషించుకోలేదు.  సినిమాకొక కొత్త హీరో, సినిమాకొక కొత్త హీరోయిన్ కావాలి. ఆ తర్వాత వాళ్ళేమైపోతారో తెలీదు. సినిమాకొక కొత్త బ్యాచి ఎవరూ ప్రేక్షకులకి తెలియడం లేదు. ఆ సినిమాలూ దృష్టిలో పడ్డం లేదు.        

       ఒకప్పుడు స్మాల్ మూవీస్ హీరోయిన్ గా గజలా వుంటూ ఆకర్షించేది. ఒక స్మాల్ మూవీ లో ఆకర్షించిన హీరోయిన్ ని మరో దర్శకుడు తీసుకోవడం లేదు. తనూ ముక్కూ మొహం తెలీని ఓ కొత్త హీరోయిన్నే తెచ్చుకుని ప్రేక్షకుల మీద రుద్ద బోతాడు. ప్రేక్షకులకి చీమ కుట్టి నట్టుండదు. వాళ్ళు మొహం తిప్పుకుని ఎటో చూస్తారు. ఆ కొత్త హీరోయిను ఎటో వెళ్ళిపోతుంది. ఏ కొత్త హీరోయినుకీ రెండో సినిమా నొసట రాసి పెట్టి వుండదు. చాలా బ్యాడ్ మార్కెటింగ్ సాంప్రదాయంతో వున్నారు తెలుగు స్మాల్ మేకర్లు. హిందీలో ఇలా లేదు. ఒక స్మాల్ మూవీలో ఆకర్షించిన కృతీ సాసన్, నుస్రత్ బరూచా, భూమీ పట్నేకర్ లని ఇతర స్మాల్ దర్శకులు తమ స్మాల్ మూవీస్ కి తీసుకుంటూ, అలాగే పైన చెప్పుకున్న లాంటి హీరోలనీ, కమెడియన్లనీ, క్యారక్టర్ ఆర్టిస్టులనీ తీసుకుంటూ, స్మాల్ మూవీస్ మార్కెట్ కంటూ ఒక స్మాల్ స్టార్ డమ్ ని సృష్టించుకున్నారు. ఇక ఈ సినిమాలకి గిరాకీయే గిరాకీ. వంద కోట్లకి పైనే వసూళ్లు. 

        ‘లుకా ఛుప్పీ’ లో కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా సినిమాల్లో కన్పించే ఆర్టిస్టు లెవరూ లేరు. వుంటే జానర్ మర్యాద దెబ్బతింటుంది. తెలుగులో ఈ జానర్ ని ప్రయత్నించాలనుకుంటే ఈ క్యాస్టింగ్ నిగ్రహం పాటించాల్సిందే. ఒకటొకటిగా స్మాల్ మూవీ స్టార్ క్యాస్ట్ తో స్టార్ డమ్ ని సృష్టించాల్సిందే. రెగ్యులర్ సినిమాల తారాగణాన్ని పక్కన బెట్టాల్సిందే. వాళ్ళేం నష్టపోరు. 

       క్రియేటివ్ యాస్పెక్ట్ లో -
        కాన్సెప్ట్ బోల్డ్ అయినా ఇది రోమాంటిక్ కామెడీ. అందువల్ల హీరో హీరోయిన్లు విడిపోకుండా తమ బంధం కోసం కామిక్ పోరాటానికి తెరలేపారు. రోమాంటిక్ కామెడీ జానర్ మర్యాదల ప్రకారం అవి ఫస్టాఫ్ కామెడీగా, ఇంటర్వెల్లో ఇద్దర్నీ విడదీసి సెకండాఫ్ బాధాకర డ్రామాగా వుండవు. రోమాంటిక్ ప్రేమల్లో ప్రేమికులు ఏవో క్రేజీ పనులకి దిగుతారు, ఇరుక్కుంటారు, బయటపడేందుకు నానా కామిక్ ప్రయత్నాలూ చేస్తారు. ఈ జానర్ మర్యాదే ‘లుకా ఛుప్పీ’ లో వుంది. ఫస్టాఫ్ లో ఆమె ఎల్ ఆర్ ని ప్రపోజ్ చేసే దగ్గర ప్లాట్ పాయింట్ వన్ వచ్చింది. సెకండాఫ్ లో సామూహిక వివాహాల ఘట్టంతో ప్లాట్ టూ ఏర్పడింది. ఆద్యంతం హాస్య ధోరణి బతికింది. అక్కడక్కడా పాత్రలు సీరియస్ అవుతాయి గానీ అది ధర్మాగ్రహమే. దీంతో కథ సీరియస్ అయిపోలేదు. 


        అలాగే హీరో హీరోయిన్ల పాత్రలు రెండూ యాక్టివ్ గానే వున్నాయి. రోమాంటిక్ కామెడీ అన్నాక ఉర్రూత లూగించాలి. అది హీరో ఒక్కడి వల్లే కాకూడదు, హీరోయిన్ ని నామమాత్రం చేయకూడదు. ఇక్కడ హీరో కాకుండా హీరోయిన్ కృతీ సానన్ ఎల్ ఆర్ ని ప్రపోజ్ చేయడం అతిపెద్ద యూత్ అప్పీలున్న క్రేజీ బీట్ అయింది. ఈ ప్లాట్ పాయింట్ వన్ న్యాయంగానే అరగంట సమయానికొస్తుంది. ఇక్కడ్నించే కాన్ఫ్లిక్ట్ మొదలయ్యింది. ఎల్ ఆర్ (సహజీవనం చేద్దాం) అనే పాయింటు తో ఈ కాన్ఫ్లిక్ట్ లో కావాల్సినంత యూత్ అప్పీల్ కూడా వచ్చేసింది. అలాగే పెళ్ళికాకుండా పెళ్ళైన వాళ్ళలా బతకలేక రహస్య పెళ్లి ప్రయత్నాలకి తెరలేపే ఇంటర్వెల్ మలుపులోనూ, ఆ తర్వాత సెకండాఫ్ సాంతం, యూత్ అప్పీల్ పరవళ్ళు తొక్కింది. ఐరనీ కామెడీని సృష్టిస్తుందని అంటాడు అరిస్టాటిల్. అరటి తొక్క మీద కాలేసి జారిపడ్డ వాడికి ఏడుపు, మనకి నవ్వు. అలాగే పెళ్లి లేకుండా కాపురం చేసి చూద్దామనుకుంటే, విరుద్ధంగా పెళ్ళయిన జంటలా కాపురం చేయాల్సి వస్తున్న డైనమిక్సే ఈ కథకి, కాన్ఫ్లిక్ట్ కి ఓ ఐరనీ సృష్టించాయి. 

        ఇంకో ప్రధాన డైనమిక్ ఏమిటంటే, ఎల్ ఆర్ మీద యుద్ధం ప్రకటించిన హీరోయిన్ తండ్రియే కూతురి ఎల్ ఆర్ తో కుక్కిన పేనయిపోవడం. అయితే అతడి నియోజక వర్గంలో యువ ఓటర్లు ఎక్కువ వున్నారనీ, అతను ఓడిపోతూ వుండాడానికి అతడి యూత్ వ్యతిరేక భావాలే కారణమనీ - హీరో అతడి కళ్ళు తెరిపించే ముగింపు బాగానే వుంది గానీ, మొత్తంగా చూస్తే ఈ కథ బలహీనమైనది. 

        ప్లాట్ పాయింట్ వన్ లో హీరోయిన్ ఎల్ ఆర్ ప్రపోజల్ తో ముక్కోణం ఏర్పడింది. కానీ ఆమె ప్రపోజల్ కి హీరో కంగారు పడతాడే గానీ, అసలు స్టార్ నజీం ఖాన్ ఎల్ ఆర్ స్టేట్ మెంట్ తో వూరుని గడగడ లాడించిన నాయకుడే ఆమె తండ్రి అనీ, ఆమె తోనే ఎల్ ఆర్ అంటే ఇక చావే గతి అనీ రిస్కు ఫ్యాక్టర్ ని ఎస్టాబ్లిష్  చేయకుండా పైపైన కథ చేసేశారు. ప్లాట్ పాయింట్ వన్ లో హీరోయిన్ ప్రపోజల్ తో హీరోయిన్ -హీరో- హీరోయిన్ తండ్రీ అన్న ముక్కోణం ఏర్పడింది. ఈ ముక్కోణంలో వుండాలి కథ. ప్లాట్ పాయింట్ వన్ లో గోల్ ఎలిమెంట్స్ ని కలపకపోవడం వల్ల ఈ ఇబ్బంది. 

        అలాగే ఇరవై రోజుల ఎల్ ఆర్ లో కూడా డైనమిక్స్ లేవు. సహజీవనంలో అతను నచ్చితే, ఓకే అనుకుంటే అది కథెలా అవుతుంది? అతను నచ్చక తిరగబెడితే కథవుతుంది. నచ్చక దుకాణం కట్టేద్దామనుకునే లోపే గుట్టు బయటపడే పరిస్థితి వచ్చి, నచ్చని వాడు మొగుడుగా తగులుకున్న ఇరకాటంలో ఆమె పడితే -  బలహీన కథకి బలం చేకూరేది. కామిక్ కాన్ఫ్లిక్ట్ కి ఇంకో యాంగిల్ తోడయ్యేది.
 
సికిందర్


11, మే 2020, సోమవారం

942 : స్క్రీన్ ప్లే సంగతులు

ఎండ్ విభాగం
        విషయం 8.
గెస్ట్ హౌస్ దగ్గర శవం దొరికిందనగానే అల్లకల్లోలమవుతాడు విక్రం. నేహా గుర్తు కొస్తుంది. చెల్లెలు గుర్తుకొస్తుంది. ఆ చెల్లెల్ని దుండగులు అపహరించి సజీవ దహనం చేసిన దృశ్యం డిస్టర్బ్ చేస్తుంది. గెస్ట్ హౌస్ దగ్గర గుర్తు తెలియని శవాన్ని చూసి వాంతి చేసుకుంటాడు. ఆ శవం ప్రీతిదని తెలుస్తుంది. షీలా రెండో కారు మీద మట్టి గెస్ట్ హౌస్ మట్టితో కలుస్తోందని తెలుస్తుంది. షీలాని టార్చర్ చేస్తూంటే  ఫోరెన్సిక్స్  షిండే కాల్ చేసి, ప్రీతి చేతి గోళ్ళలో అజయ్ డీఎన్ఏ దొరికిందని అంటాడు. అజయ్ ని పట్టుకుంటే తన కేమీ తెలీదని అంటాడు. షిండే మళ్ళీ కాల్ చేసి ప్రీతి పళ్ళ మీద ఆమె తండ్రి డీఎన్ఏ, తొడమీద సరస్వతి వెంట్రుకా దొరికాయని అంటాడు. వాళ్ళని ప్రశ్నిస్తే తాము చంపలేదని అంటారు. లతా అనే అమ్మాయి కాల్ చెసి, వైట్ అంబాసిడర్ లో వచ్చిన ఒకడు తనని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని అంటుంది. వాడి పోలికలు ఆమె చేత చెప్పించి స్కెచ్ ఆర్టిస్టు చేత బొమ్మ వేయిస్తే, పోలికలు కలవడం లేదని అంటుంది. టోల్ బూత్ ఫుటేజీ చూస్తే ఆ సమయంలో ఒక కార్గో ట్రక్ కన్పిస్తుంది. ప్రీతి మాయమైన రోజున ఫుటేజీలో కూడా ఇంకో కార్గో ట్రక్ కన్పిస్తుంది. ఈ ట్రక్కులు వేర్వేరు అయినా డ్రైవర్ ఒక్కడే. వాణ్ణి మెకానిక్ ఫాహద్ గా గుర్తించి పట్టుకుంటే, వాడు చెప్పేస్తాడు. వాడు చెప్పిన ప్రకారం రోహిత్ ని ప్రశ్నించడానికి వెళ్తే కాల్పులు జరుపుతాడు రోహిత్. విక్రం జరిపే ఎదురు కాల్పులో చనిపోతాడు. అతడి భార్య స్వప్న ఏడుస్తుంది. అదే ఇంట్లో నేహా బంధించి వుంటుంది. స్వప్న తనెందుకిలా చేసిందో చెప్పేస్తుంది...


        చిన్నప్పుడు ప్రీతి అనాధాశ్రయంలో వున్నప్పుడు, ఆమెతో బాటు స్వప్న, స్వప్న చెల్లెలు అలేఖ్యా వుండే వాళ్ళు. అలేఖ్యకి గుండె జబ్బుంది. మోహన్ తమ్ముడు శివ, మరదలు ప్రియ ఒకర్ని దత్తత తీసుకోవడానికి వచ్చినప్పుడు, అలేఖ్యకి దత్తత వెళ్ళే  అవకాశమిస్తే వాళ్ళు గుండె జబ్బు నయం చేస్తారని ప్రీతికి నచ్చజెప్పింది స్వప్న. ప్రీతి కాదని తను దత్తత వెళ్లిపోవడంతో, ఫలితంగా స్వప్న చెల్లెలు చనిపోవడంతో, ప్రీతి మీద పగబట్టి చంపేసింది స్వప్న. ఒక సాక్ష్యాధారం సూది నేహా దగ్గరికి రావడంతో, వాటినామె వెల్లడించకుండా ఆమెని కూడా కిడ్నాప్ చేయించి బంధించింది.

        వివరణ: అదే గెస్ట్ హౌస్ దగ్గర శవం దొరకడం సంభవమా? ఆ గెస్ట్ హౌస్ దగ్గరే శవం కోసం ఇంతకి ముందు పోలీసులు అంత హంగామా చేశారు. గెస్ట్ హౌస్ నిర్వాహకులు ఇక అప్రమత్తమై సెక్యూరిటీ పెంచుకోకుండా వుండరు. అలాంటప్పుడు స్వప్న ప్రీతిని చంపిన తర్వాత, రోహిత్ ఒక చోట పాతిపెట్టిన శవాన్ని తీసి ఇప్పుడు గెస్ట్ హౌస్ దగ్గర పడేసే అవకాశమే వుండదు. గెస్ట్ హౌస్ దగ్గర సెక్యూరిటీ లేకుండా చేసి కథకుడు తోడ్పడడం వల్ల పడేశాడేమో. ఒక చోట పాతిపెట్టిన శవాన్ని ఎందుకు తీశాడు రోహిత్? దాని పళ్ళకి ఆమె తండ్రి డీఎన్ఏ, గోళ్ళకి అజయ్ డీఎన్ఏ, తొడకి సరస్వతి వెంట్రుక తెచ్చి మేకప్ మాన్ లా అతికించి వాళ్ళని ఇరికించాలి కాబట్టి. ఈ చేష్ట వూహించడానికే బ్యాడ్ గా వుంది. ఇష్టారాజ్యంగా కథ చేసేయడం. కథకుడు అన్ని చిక్కుముళ్ళు వేసుకున్నాడు. విడదీయలేక అసంబద్ధ కథనం చేస్తున్నాడు.

        టోల్ బూత్ రెండు ఫుటేజీల ప్రకారం, ప్రీతి మాయమైన రోజున కన్పించే కార్గో ట్రక్ మొదటి ఫుటేజీ సెప్టెంబర్ నెలని సూచిస్తోంది. ఇప్పుడు తాజా ఫుటేజీలో డిసెంబర్ నెల. అంటే ప్రీతి మరణించి మూడు నెలలైందన్న మాట. అంటే ఈ మూడు నెలల తర్వాత కుళ్ళిపోయిన శవం కాదు, ఎండిపోయిన ఆస్థిపంజరం మాత్రమే దొరకాలన్న మాట. కానీ ఈ కథలో కుళ్ళిన శవం దొరికింది. ఇదెలా సాధ్యం? ఆస్థి పంజరమైతే రోహిత్ ఫేక్ ఎవిడెన్సుని దానికి అతికించలేడని, కుళ్ళిన శవాన్ని పెట్టేశారా? 

        రోహిత్ ఇంకో పని కూడా చేశాడు. షీలాని కూడా ఇరికించేందుకు ఆమె రెండో కారుకి గెస్ట్ హౌస్ దగ్గర మట్టిని అంటించి అది ఎవిడెన్స్ గా చూపించాడు. షీలా విక్రం కస్టడీలోనే వుంది. ఇప్పుడిప్పుడే  దొరికిన శవాన్ని ఆమె కారులో ఎప్పుడు తెచ్చి గెస్ట్ హౌస్ దగ్గర పడేసి పోయింది? ఈ అనుమానం విక్రం కి రావద్దా? పైగా పని ముట్లతో ఆమెని థర్డ్ డిగ్రీ టార్చర్ కి గురి చేయడం. పాలీగ్రాఫ్, నార్కో రెండు టెస్టులు  సరీగ్గా చేయించడం చేతగాక థర్డ్ డిగ్రీకి పాల్పడుతున్నాడు!

        విక్రంని ఎంత అమాయకుణ్ణి చేసి, పాసివ్ క్యారక్టర్ గా చేసి ఆడుకుంటున్నారంటే, ఒక ఆట ఇంటర్వెల్ కాడ్నించీ షీలా ఆడుకుంది, ఇప్పుడు ఇంకో ఆట రోహిత్ ఆడుకుంటున్నాడు. ఒకరు ఫేక్ లెటర్ తో, మరొకరు ఫేక్ ఎవిడెన్సుతో. ఈ ట్రాప్ లో పడి  ప్రీతి పేరెంట్స్, షీలా, సరస్వతి, అజయ్ మొత్తం సిండికేట్ అయి ప్రీతిని చంపేశారని చెప్పుకుని డిస్టర్బ్ అయిపోతూ, ఫేక్ సస్పెన్స్ ని సృష్టిస్తున్నాడు విక్రం. చాలా బ్యాడ్ క్యారక్టరైజేషన్. చెల్లెలి ఫైనల్ ఫ్లాష్ బ్యాక్ వేసుకున్నప్పుడు, అందులో ఇద్దరు దుండగులు ఆమెని ఇంట్లోంచి అపహరించుకు పోతూంటారు. దీని ముందు ఫ్లాష్ బ్యాక్ లో మనకి చూపించిన ప్రకారం, ఆ చెల్లెలు కిటికీ లోంచి ఇద్దరు తొంగి చూశారని అంటే, పని వాళ్ళని అడిగి వూరుకుంటాడు విక్రం. ఇలా చెల్లెలి చావుకి కూడా తనే బాధ్యుడయ్యాడు సరైన చర్య తీసుకోకుండా పాసివ్ క్యారక్టర్ విక్రం. ఇంతకీ ఈ ఫ్లాష్ బ్యాక్ అసలు కథ ‘హిట్’  సీక్వెల్ లో తెలియవచ్చేమో.

        వెంటవెంటనే ఫోరెన్సిక్స్ షిండే రెండు సీన్లలోనే బోలెడు సమాచారమందించేస్తూ కథ ముగించేయాలని తొందరపడుతున్నాడు... ప్రీతి శవం దొరికిందని, షీలా రెండో కారు మీద మట్టి గెస్ట్ హౌస్ మట్టితో కలుస్తోందని, ప్రీతి చేతి గోళ్ళలో అజయ్ డీఎన్ఏ దొరికిందని, ప్రీతి పళ్ళ మీద ఆమె తండ్రి డీఎన్ఏ, తొడమీద సరస్వతి వెంట్రుకా దొరికాయని... ఇలా తడవతడవకీ ఫోన్లు చేస్తూ కథ ముగించెయ్యాలని సమాచార వెల్లువకి తెరతీశాడు.

        ఏ లాబ్ కీ ఇలా క్షణాల మీద తెలుసుకోవడం అస్సలు సాధ్యం కాదు. అది అజయ్ డీఎన్ఏ అని షిండే కెలా తెలుసు? సరస్వతి వెంట్రుక అని ఎలా తెలుసు? ఫస్టాఫ్ లో విక్రం అసహజంగా ప్రీతి పేరెంట్స్ లాలాజలం, వేలిముద్రలు శాంపిల్స్ సేకరించడం చూశాం. అదెందుకంటే, ఇలా ప్రీతి పళ్ళ మీద డీఎన్ఏ ఆమె తండ్రిదని షిండే వెరిఫై చేయడానికన్న మాట. అంటే రోహిత్ ప్రీతి పళ్ళకి ఆమె తండ్రి డీఎన్ఏ అంటిస్తాడని విక్రం ముందే వూహించి, ఫస్టాఫ్ లో అలా శాంపిల్స్ సేకరించి ముందస్తుగా షిండేకి అందించాడన్న మాట. ఏం కథ ఇది?


        ఇంతా చేసి ఈ సమాచార వెల్లువతో ఒక చిన్న లీడ్ పట్టుకుని ముందుకు సాగలేకపోయాడు విక్రం. అతను ఆలోచించగల్గితేగా? ఎవరో ఆధారాలందిస్తే తప్ప మళ్ళీ ముందుకు సాగలేని పాసివ్ క్యారక్టర్. లత ఆధారమందించింది. ఎవరో తనని  కిడ్నాప్ చేయబోయాడని. స్కెచ్ ఆర్టిస్టు చేత వాడి బొమ్మ వేయించాడు విక్రం. అతను బొమ్మ సరిగ్గా వెయ్యలేదని అవమానం కూడా చేసి పంపించాడు. కథలోనే షీలా అనే బొమ్మలేసే బంపర్ ఆర్టిస్టు వుంది. ఆమె వచ్చి ఆ వూహా చిత్రం వెసిందంటే విక్రం దిమ్మ దిరిగేది. దెబ్బకి తన ఫ్రెండ్ ప్రీతి కిడ్నాపర్ ని పట్టించి పారేసేది. క్యారక్టర్ ఎలివేట్ అయి నిజమైన షైనింగ్ స్టార్ అయ్యేది. ఒక్కటైనా సజీవమైన ఆకట్టుకునే పాత్ర వుండాలిగా? విక్రం ఇంకా టోల్ బూత్ ఫుటేజీలు వెతుక్కునే పనుండేది కాదు. అదంతా వృధా షూటింగు ఖర్చు. కిడ్నాపర్ మెకానిక్ ఫాహద్ బొమ్మని షీలాయే సర్వాంగ సుందరంగా వేసిచ్చేసేది! బొమ్మ వేయించిన లత కూడా పొరపాటు చేసింది. నే చెప్పే బొమ్మ మేడం షీలా గారే క్రియేటివ్ గా వేయాలని డిమాండ్ చేసి వుండాల్సింది... విక్రంకిలా లీడ్ అందించాలి మరి. సొంతంగా ఆలోచించలేడు.

        మొత్తానికి ఎప్పుడో దూది వల్ల దొరికిపోవాల్సిన ఫాహద్ ఇప్పుడు ఇలా దొరికాడు. ఆ సూది మీద అతడి వేలిముద్రల ఎవిడెన్స్ గురించి కూడా విక్రంకిప్పుడే తెలిసింది. హంతకురాలిగా పట్టుపడ్డ స్వప్న చెప్పేయడంతో. కానీ ఫస్టాఫ్ లో మనం చూసినట్టు శ్రీనివాస్ దూదితో బాటు ఈ సూది గురించి అప్పుడే విక్రం కి లీడ్ ఇచ్చాడు. విక్రం కథకోసం పట్టించుకోలేదు. విక్రం, కథకుడు ఇలా కుమ్మక్కై అడుగడుగునా ప్రేక్షకుల్ని ఫూల్స్ చేస్తున్నారు వంద రూపాయల టికెట్టు వసూలు చేసి.

        ఇప్పుడు స్వప్న విక్రం కేం చెప్పింది? సూది మీద వేలిముద్రలు తీస్తున్న నేహా, అవి ఫాహద్ వేలిముద్రలతో కలుస్తున్నాయని రోహిత్ కి చెప్పినట్టు చెప్పింది. అందువల్ల ఈ విషయం ఆమె బయట పట్టకుండా కిడ్నాప్ చేసి బంధించినట్టు చెప్పింది. ఇక్కడ మనకొచ్చే సందేహలేమిటంటే, సూది మీద వేలిముద్రలు తీయడం సాధ్యమా? పాక్షిక వేలిముద్రలే దొరికాయి నేహాకి. పాక్షిక వేలిముద్రలే అనుకుందాం, సగం సగం పాక్షిక వేలిముద్రలతో ట్యాలీ చేసి అవి ఫలానా వ్యక్తివని చెప్పగలరా? కోర్టు తిప్పికొడుతుంది. ఈ వేలిముద్రల్ని ట్యాలీ చేయడానికి ఆమెకి ఫాహద్ నమూనా వేలిముద్ర లెక్కడివి? పాత నేరస్థుల డేటా బేస్ చెక్ చేస్తూంటే అందులో ఫాహద్ వున్నాడట! కథని సులభం చేయడం కోసం పాత్రల్ని ఎలాపడితే అలా చిత్రిస్తున్నాడు కథకుడు. మెకానిక్ ఫాహద్ ని ఇక్కడ సీను అవసరం కోసం పాత నేరస్థుడిగా చిత్రించేశాడు. పాత నేరస్థుడితో ఎస్సై ఇబ్రహీం స్నేహం చేస్తున్నట్టు చూపించాడని మర్చిపోయాడు! ఇప్పుడు ఈ ఫాహద్ ని పట్టుకోబోతూంటే ఇబ్రహీం వచ్చేసి సహకరించి మంచోడైపోయాడు. విక్రం ని కాపాడుతూ ప్రాణత్యాగం కూడా చేసి నిర్దోషిగా నిరూపించుకున్నాడు!

        ఇక నేహా గురించి. ఈమెని ఎప్పుడు కిడ్నాప్ చేసి వుండాలి? విక్రం సెలవు మీద వెళ్లి తిరిగి వచ్చే ముందు కిడ్నాప్ చేసి వుండాలి. ఇప్పటికి సుమారు నెల గడిచిందనుకుందాం. ఇంతకాలం ఆమెని బంధించి వుంచడం సాధ్యమా? నేహా తప్పించుకునే ప్రయత్నమే చేయలేదా? ఎంతకాలం బంధించి వుంచాలనుకుంది? ఆమె బయటికొస్తే ఎప్పటికైనా తనకి ప్రమాదమే. చంపెయ్యా
లనుకోలేదా? స్పష్టత లేదు కథకుడికి. నేహా కంప్యూటర్ లో వున్న ఎవిడెన్స్ ని కూడా లేకుండా చేయాలిగా? ఇది కూడా ఆలోచించలేదు కథకుడు.

        ఇక అతి రహస్యం బట్టబయలు సంగతి... మొత్తానికి విలనెవరు...విలనెవరూ అని వూరిస్తూ డీలా పడిన కథ స్వప్న అనే ఓ మైనర్ క్యారక్టర్ ని విలన్ గా రివీల్ చేసింది. ఇక్కడే ఉస్సూరు మన్పించేలా వుంది. నిన్న ఒక అసోసియేట్ ఒక హాలీవుడ్ సినిమా ముగింపు గురించి చెప్పాడు. హీరోయిన్ హత్య చేసిందని చూపిస్తూ చూపిస్తూ చివరికామె హత్యచేయలేదని తేల్చి సినిమా గాలి తీశారట. ఇలాటి సస్పెన్స్ ని ప్రేక్షకులు ఎంతో మెంటల్ వర్క్ చేసుకుంటూ చూస్తూంటారు. చివరికి ఏమీ లేదు హుష్ కాకీ పొమ్మంటే, ఆ మెంటల్ వర్క్ అంతా వృధా అయిపోయి తెల్లమొహం వేయాల్సి వస్తుంది. ఇలా వుందన్న మాట కథకుడి ఘనకార్యం.

        ప్రీతిని చంపడానికి స్వప్న చెప్పిన కారణం, ఇంతసేపూ మెయింటెయిన్ చేసిన ఎండ్ సస్పెన్సుకి సరిపోయిందా? ఎప్పుడో చిన్నప్పటి కచ్చతో ఇప్పుడు చంపడం నమ్మేలా వుందా? సైకాలజీలో కలెక్టింగ్ ది స్టాంప్స్ అనే మానసిక రుగ్మత వుంటుంది. చిన్నప్పుడు పిల్లలు దెబ్బ లాడుకుంటారు. ఒకరికి ఇంకొకరు ఏదో చిన్న నష్టం చేస్తారు. ఏళ్ళు గడిచి పెద్దవాళ్ళయి ఆ తగాదాలే మర్చిపోతారు. అయితే భూమిలోపల రాతి పలకలు కదిలి భూకంపం వచ్చినట్టు, చిన్నప్పటి తగాదాలో నష్టపోయిన వ్యక్తి మెదడులో వున్నట్టుండి జ్ఞాపకాల పొరలు కదిలి చిన్నప్పటి తగాదా పెనుభూతమై కన్పిస్తుంది. అంతే, దాంతో పగ దీర్చుకోవడం మొదలెడతాడు. ఎలా? ఆ రెండో వ్యక్తి పోతూంటే వెనుక నుంచి కొట్టి పారిపోతాడు. నిద్రపోతూంటే ఇంటిమీద రాయి విసిరి పారిపోతాడు. భార్యతో బజారెళ్తూంటే పేడజల్లి పరారవుతాడు. ఇలాటి చేష్టలు చేస్తూంటాడు. రెండో వ్యక్తి ఉపాయంగా పట్టుకుని నిలదీస్తే – అప్పుడెప్పుడో మన  చిన్నప్పుడు నీ బొమ్మ బస్సుతో నా బొమ్మ బస్సుని గుద్ది పాడు చేయలేదా? నా బొమ్మ బస్సు మొత్తం పాడయింది, నిన్ను వదిలిపెట్టను - అంటున్న ప్రాణమిత్రుణ్ణి చూసి నవ్వాలో ఏడవాలో అర్ధంగాదు రెండో వ్యక్తికి. తీసికెళ్ళి మానసిక చికిత్స చేయిస్తాడు.


      ఇదీ సంగతి. ఇలావుంది ఎండ్ సస్పెన్స్ ముగింపు. చిన్నప్పుడు స్వప్న మాటని కాదని ప్రీతి దత్తత వెళ్లి పోవడంలో ఆ వయసులో ఆమె కావాలని చేసిందేముంది? స్వప్న చెల్లెలి చావుకి ఆమె కారణమెలా అవుతుంది. ఇంత పెద్దయ్యాక స్వప్న ఇలాగే  ఆలోచిస్తుందా? ఆలోచించి చంపేస్తుందా? జస్టిఫికేషను లేని ముగింపుతో ఈ క్రైం కథ తేలిపోయింది.

      మరొకటేమిటంటే, ఈ చివరి సన్నివేశంలో కూడా స్వప్న చేతిలో విక్రం పాసివే. ఏది ఎలా ఎందుకు చేసిందో ఆమె డెమో ఇస్తూంటే చూసి తెల్లబోవడం తప్ప, అవన్నీ తను కనిపెట్టి ఆమెకి డెమో ఇచ్చి షాకివ్వాలన్న యాక్టివ్ పాత్ర చిత్రణకి నోచుకోలేకపోయాడు. ఇక ఆమె ఏది ఎందుకెలా జరింగిందో మాంటేజెస్ తో వివరిస్తూంటే, మొదట్నుంచీ ఆ జరిగినవి ఆడియెన్స్ ఎలా గుర్తు తెచ్చుకుని కనెక్ట్ చేసుకుంటారు - పాసివ్ గా ఏదో చూడ్డం తప్ప. ఎండ్ సస్పెన్స్ తో ఇదే పీకులాట.

        ఎండ్ సస్పెన్స్ అనేది సినిమాకి అన్నివిధాలా చేటు. ఎంతసేపూ అనుమానితులతో తంటాలు పడ్డమే తప్ప హంతకుడితో డ్రామా, యాక్షన్ కన్పించని హీరో ఏకపక్ష కథనంతో సహన పరీక్షే గాక, చివరికి రివీలయ్యే హంతకుడు సినిమా షెల్ఫ్ లైఫ్ ని కూడా నాశనం చేస్తాడు. సినిమా చూసిన ప్రేక్షకుడు హంతకుడు ఫలానా వాడురా అని బయటి కొచ్చి చెప్పేస్తే, చూడాలనుకున్న వాళ్ళకి ఏ సస్పెన్సూ వుండదు. ఒకసారి చూసిన ప్రేక్షకులు బావుందని రిపీట్ ఆడియెన్స్ గా వచ్చే అవకాశమూ వుండదు.

        ఈ కథ మొత్తం ప్రతీ సీనూ లోపభూయిష్టంగా, గజిబిజిగా వుందని చెప్పడానికి చాలా విచారించాల్సి వస్తోంది. అదృష్టమేమిటంటే నిర్మాతా హీరో ఓకే చేసేశారు. ప్రేక్షకులూ హిట్ చేసేశారు. అసలు సినిమాలు ఇలా తీస్తే చాలేమో. తీయడానికీ, ప్రేక్షకులు చూడ్డానికీ పెద్దగా మెదడుతో పనిలేకుండా, అందులోనూ ఇన్వెస్టిగేషన్ కథని!

        ఈ స్క్రీన్ ప్లే సంగతులు ఇంత వివరంగా ఎందుకంటే, మరొకరు ఇలా తీయకుండా జాగ్రత్త పడతారని. ఎండ్ సస్పెన్ కి ఇకనైనా దూరంగా వుంటారని. సినిమా అనేది చూసే ప్రేక్షకులకి క్విజ్ పోటీనో, ఐక్యూ పరీక్షో కాదు. ఆ వేదికలు వేరే వుంటాయి. అక్కడ ఇలాటి సినిమాల్ని డెమో చూపిస్తూ ప్రశ్నలడగాలి ప్రేక్షకుల్ని. సినిమా హాళ్లలోనో, అమెజాన్లోనో కాదు.

(ఐపోయింది)
సికిందర్

10, మే 2020, ఆదివారం

941 : సందేహాలు -సమాధానాలు


Q: నేనొక కథ తయారు చేసుకున్నాను. త్వరలో ఒక హీరోకి పంపించబోతున్నాను. ఇప్పుడు కథలు వినడం లేదు, తెప్పించుకుని చదువుతున్నారని మీకు తెలుసుకదా. అయితే మొన్న మీ పాత ఆర్టికల్ చదివితే అందులో కాన్ఫ్లిక్ట్ లో యూత్ అప్పీల్ వుండాలని వుంది. నా కర్ధం గాలేదు. సినిమా అనేదే యూత్ అప్పీల్ తో తీస్తాం కదా? కాన్ఫ్లిక్ట్ లో యూత్ అప్పీల్ ఏమిటి? ఇది వివరిస్తే, అది బావుందనుకుంటే, ఆ విధంగా నా కథలో కాన్ఫ్లిక్ట్ లో జోడించుకుంటాను. ఆ తర్వాతే హీరోకి పంపిస్తాను. వీలైనంత త్వరగా సమాధానమిస్తారని ఆశిస్తాను.
కాశీనాథ్ (పేరుమార్పు), దర్శకుడు

A: ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ లో యూత్ అప్పీల్ ని జోడిస్తే మీ కథే మారిపోవచ్చు. కథకి పాయింటు కాన్ఫ్లిక్ట్ నుంచే పుడుతుంది కదా? హీరోహీరోయిన్లు విడిపోయే కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా కలుస్తారనేదే పాయింటు. అపార్ధాలతో విడిపోతే, ఆ అపార్ధాలు తొలగిపోతే తిరిగి ఏ కమవుతారని ఆ పాయింటు అంతరార్ధం. ఈ అంతరార్ధంలో యూత్ అప్పీల్ వుందా అనేది  చూడాలి. ఈ అపార్ధాలు తొలగిపోయి కలుసుకునే పాయింటు చూసి చూసి విసుగెత్తి పోయుంటారు ప్రేక్షకులు. అంటే ఇందులో యూత్ అప్పీల్ అనేది ఇక లేదన్న మాట. ఆఁ... చేసుకుంటే చేసుకున్నావ్ లే అపార్ధం, నేనింకోదాన్ని చూసుకుని సెటిలైపోతా - అని హీరో అన్నాడంటే ఇది యూత్ అప్పీల్. యూత్ అప్పీల్ అంటే ఎక్సైట్ మెంట్. హీరో ప్రకటనలో ఎక్సైట్ మెంటుంది. కర్నూల్లో కబడ్డీ ఆడేందుకు వెళ్ళిన మహేష్ బాబు (ఒక్కడు) అక్కడ్నుంచి ప్రమాదంలో వున్న భూమికని లేపుకు వచ్చే కాన్ఫ్లిక్ట్ లో ఎక్సైట్ మెంట్. యూత్ అప్పీల్. అదే మహేష్ బాబు ఏడు తరాల బంధువుల్ని వెతికే కాన్ఫ్లిక్ట్ (బ్రహ్మోత్సవం) ఎక్సైట్ మెంట్ కాదు, యూత్ అప్పీల్ లేదు. ఏడుతరాల బంధువుల అమ్మాయిల్ని వెతికితే, అది ఈలల్తో దద్దరిల్లిపోయే కాన్ఫ్లిక్ట్, యూత్ అప్పీల్. ఇలా మీ కథ కాన్ఫ్లిక్ట్ లో యూత్ అప్పీల్ వుందేమో చూడండి. లేకపోతే కథనే మార్చి యూత్ అప్పీల్ని కూర్చాల్సి రావొచ్చు. ఈ సమయంలో కథని మార్చడం కుదరకపోతే అలాగే వదిలెయ్యండి. ఐడియా అనుకున్నప్పుడే అన్నీ నిర్ణయించుకుంటే ఇలాటి సమస్యలు ఎదురుకావు.

Q: నా పేరు వి.డి, అసోసియేట్ డైరెక్టర్. నావి కొన్ని సందేహాలు. 1. యుద్ధాలతో డైరెక్ట్ గా సంబంధం ఉన్న మిగతా దేశాల సినిమాలతో పోలిస్తే మన దగ్గర యుద్ధాల బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీయడం కొంచెం కష్టమే. నార్త్ లో అయితే పాకిస్తాన్ తో వచ్చిన యుద్ధాల నేపథ్యంలో సినిమాను తీసుకోగలరు. ఎందుకంటే ఉత్తర భారతదేశం వారు యుద్ధాలతో ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉన్నారు. అదే సౌత్ ఇండియాకు వచ్చేసరికి యుద్ధాల బ్యాక్ డ్రాప్ లో మనం సినిమాలు తీయడం కుదరదు. ఇలా ఒక గొప్ప కథా నేపధ్యాన్ని మనం మిస్ అవుతున్నాం కదా, దీనికి ప్రత్యామ్నాయంగా వేరే కథా నేపథ్యన్ని ఏమైనా సూచించగలరు.
        2. లుకా చుప్పి’ లో లాగా మన దగ్గర ఉన్న టౌన్స్ బ్యాక్ డ్రాప్ లో ఎలాంటి కథలు చెప్పచ్చో సలహాలు సూచనలు చెప్పండి.
       
3. థ్రిల్లర్ కథలను చిన్న  బడ్జెట్ లో చెప్పేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  అలాగే థ్రిల్లర్ అంటే ఎంత సేపు అవే సీరియల్ కిల్లర్ లేదా పోలీస్ డిటెక్టివ్ కథలు కాకుండా కొత్తగా ఏం చేయాలి అనేది సలహాలు సూచనలు చెప్పండి.
       
4. చివరగా కొత్త దర్శకులు తమ తొలి ప్రయత్నంగా ప్రయోగం చేయడానికి ఏవైనా కొత్త జానర్స్ కానీ, అలాంటి టైపు సినిమాల గురించి కానీ చెప్పండి.
వీడీ, అసోసియేట్
A: ఇండో - పాక్ యుద్ధాల్లో పాల్గొన్న తెలుగు సైనిక వీరులున్నారు- హవల్దార్ వీరచక్ర పోత రాజు, కెప్టెన్ మనోజ్ శర్మ, గ్రూప్ కెప్టెన్ నచికేత మొదలైన వారు (1965 ఇండో - పాక్ యుద్ధంలో పాక్ యుద్ధ విమానాన్ని గన్ తో కూల్చేసిన హవల్దార్ పోతరాజు వీరచక్ర అవార్డు నందుకుంటున్న దృశ్యం పక్క పటంలో చూడొచ్చు). యుద్ధ సినిమాకి తెలుగు నేటివిటీకి ఇంత కంటే ఏం కావాలి. వీళ్ళ బయోపిక్స్ తీయొచ్చు. 2015 లో దర్శకుడు క్రిష్ ‘కంచె’ తీసినప్పుడు అది రెండో ప్రపంచ యుద్ధంలో నిజంగా పాల్గొన్న తెలుగు సైనికుల కథ. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించ లేదంటే వాళ్ళ ఖర్మ. ‘ఘాజీ’ లాంటి నేటివిటీ లేని యుద్ధ సినిమాని మళ్ళీ బాగానే చూశారు. తెలుగు యుద్ధ నేపథ్య సినిమాలకి నేటివిటీ అడ్డొచ్చే మాట నిజమే. దీనికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. ‘ఆర్ ఆర్ ఆర్’, ‘విరాటపర్వం’ లాంటి స్థానిక పోరాట కథలు తీసుకోవడమే. దేశ విభజన నేపథ్యంలో 2019 లో కరణ్ జోహార్ తీసిన ‘కళంక్’ చూసినప్పుడు, అలాంటిది హైదరాబాద్ నిజాం రాజరిక కుటుంబాల్లో దేశ్ ముఖ్ హీరో పాత్రని కల్పించి ఒక పీరియెడ్ మూవీ తీయొచ్చన్న ఆలోచన రావచ్చు. తెలుగు సినిమాలకి నేపథ్యాలతో స్వేచ్ఛ అంతగా లేదు. యుద్ధ కథలకి ప్రత్యామ్నాయం స్థానిక పోరాట కథలే. 


        2. అగథా క్రిస్టీ ఏనాడో చెప్పింది - న్యూయార్కే ఒక క్రైం స్టోరీ, ఇంకా న్యూయార్క్ లో నేపథ్యంలో క్రైం స్టోరీలు రాసేదేమిటని. ఆమె క్రైం స్టోరీలు గ్రామీణ నేపథ్యంలో వుంటాయి. ఎక్కడో హైదరాబాద్ లో జరిగేలాంటి సంఘటనలు మెట్ పల్లిలో జరుగుతూంటే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. హిందీలో ఇలాగే చేస్తున్నారు. యువతీ యువకులు నగర సంస్కృతిలో పాల్పడుతున్న కొత్త పోకడల్ని పట్టణ నేపథ్యాల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో పెట్టి తీస్తున్నారు. దీనివల్ల షాక్ వేల్యూ వుంటుంది. దీంతో ఇవి హిట్టవువుతున్నాయి. ‘లుకా చుప్పీ’ (దాగుడు మూతలు) ఇలాంటిదే. ఇంకా మన్మర్జియా, డ్రీం గర్ల్, బరేలీకీ బర్ఫీ, శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ మొదలైనవి కూడా ఇంతే. సినిమాల్లో నగరాలకి పరిమితం చేసిన సహజీవనాల్ని, స్వలింగ సంపర్కాల్ని ఇక పట్టణాల్లో చూపించే కొత్త ఒరవడి ప్రారంభించారు. ఈ ఆధునిక జీవన శైలుల్నే కాదు, ఆర్ధిక ఆరాటాల్ని కూడా చిన్న టౌన్లో చూపించారు ‘లిప్ స్టిక్ అండర్ మై బురఖా’ లో. చిక్కడపల్లిలో వుండే మధ్యతరగతి కుర్రాళ్ళు, బంజారా హిల్స్ లో సంపన్న జీవితాలకి ఎగబ్రాకాలని ఆరాటపడ్డారనుకుందాం, దానికోసం ఏం చేస్తారన్నదే చిక్కడపల్లిలో సంచలనం సృష్టించే కథ. అవే కథల్ని బ్యాక్ డ్రాప్స్ మార్చేస్తే నేటి కథలవుతాయి. పాత సినిమాల్లో నగర కథలేమేం వున్నాయో వెతికితే వాటిని పట్టణాలకి, పల్లెలకీ దించి అలజడి సృష్టించవచ్చు కొన్నాళ్ళు. ఏదైనా కొన్నాళ్ళు వుండేదే. ఆ కొన్నాళ్ళ తర్వాత ఇంకో కొన్నాళ్ళు ఇంకో ఆవిష్కరణ. కొన్నాళ్ళు కొన్నాళ్ళుగా కొలుచుకుంటూ సాగేదే సినిమా. ఒకటే పట్టుకుని ఎన్నాళ్ళో కూర్చుంటే బుద్ధి చెప్తుంది అదే సినిమా.

       
3.  థ్రిల్లర్ కథల్ని చిన్నబడ్జెట్లో లో చెప్పేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ‘హిట్’ లో చూశారుగా ఎన్ని అజాగ్రత్తలు తీసుకోవాలో. ‘హిట్’ వ్యాస పరంపరకి ముందు క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాదల వ్యాస పరంపర సాగింది. అవొకసారి చదవండి. థ్రిల్లర్ అంటే ఎంత సేపూ  అవే సీరియల్ కిల్లర్ లేదా పోలీస్ డిటెక్టివ్ కథలు కాకుండా కొత్తగా ఏం చేయాలంటే ఏమీ లేదు, ప్రస్తుత ప్రపంచమెలా వుందో అలా చేయాలి. సోషల్ మీడియా నుంచీ సోషల్ లైఫ్ వరకూ ప్రపంచం పరమ వయొలెంట్ గా వుంది. దీన్నే ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకీ అంటిస్తున్నారు. అంటే ఇందులోకి దూకి మనమూ ఎంజాయ్ చేయాలనీ కాదు. ఒడ్డున వుంటూ ఆట గమనించాలి. ఆ ఆటకి తగ్గ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలి. ఎంటర్ టైన్మెంట్ తోనే కళ్ళు తెరిపించాలి. 

        ఈవారం ఒక దర్శకుడు ఒక లో బడ్జెట్ థ్రిల్లర్ కథ సినాప్సిస్ పంపారు. అది చదివాక దీన్ని తిరగేసి తీస్తే బావుంటుందని చెప్పాం. వెంటనే ఆయన ఈ సవరణ లోని పాయింటుని పసిగట్టారు. ఏదైనా తిరగేస్తేనే కొత్తగా మారుతుంది. ‘హిట్’ వుంది. ఇందులో కథ ఇన్వెస్టిగేటర్ పాయింటాఫ్ వ్యూలో అతడి కథగా నడుస్తుంది. ఇలాకాక కిల్లర్ పాయింటాఫ్ వ్యూలో వాడి కథగా నడిస్తే? ఇంకా ఈ
వయొలెంట్ ప్రపంచంలో క్రైం సినిమాల్ని పాజిటివ్ పాయింటాఫ్ వ్యూలో చూపిస్తే లెక్క చెయ్యరు. నెగెటివ్ పాయింటాఫ్ వ్యూలో చూపించాల్సిందే. పోలీస్ మైండ్ కాదు, క్రిమినల్ మైండ్ ఓపెన్ చేయాల్సిందే. పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తూంటే, క్రిమినల్ కౌంటర్ ఇన్వెస్టిగేషన్ చేసే కథలు. క్రిమినలే ఒక పెద్ద ఆర్టిస్టు అన్నారు, పోలీసు కేవలం క్రిటిక్. వయొలెంట్ ప్రపంచంలో క్రిటిక్ కి స్థానం లేని మాట నిజమే, మరి ఆర్టిస్టు గెలుపు కూడా ఎలాంటి గెలుపు? ఫిలిం నోయర్ జానర్ క్రైం సినిమాల్ని పదేపదే కర్మ సిద్ధాంతంతో ఎందుకు తీసేవాళ్ళు? మనిషి ఎంత వయొలెంట్ గా మారినా, అతను ఆత్మికంగా పురాణాలతో కనెక్ట్ అయి వుంటాడు కాబట్టి.  ఏమీ చేయనవసరం లేదు, క్రైం మీద ఇంటర్నెట్ లో ప్రముఖులు చెప్పిన కోట్స్ చాలా వుంటాయి. ఆ సుభాషితాలు చదువుతూ వుంటే సబ్జెక్టు మీద పరిజ్ఞానం విశాలమవుతుంది, పట్టు లభిస్తుంది. వంద కేజీలు తెలుసుకుంటే ఒక కేజీ కథ వస్తుందని గమనించాలి. ఏమీ తెలుసుకోకుండా సినిమాలు చూసి కాపీ కొడితే సన్నాసులుగా మారడమే. 

        4. ఇక
 కొత్త దర్శకులు తొలి ప్రయత్నంగా ప్రయోగం చేయడానికి రియాలిస్టిక్ ఫిక్షన్ అనే తెలుగులో ప్రయత్నించని జానర్ వుంది. ‘ఏ వుమన్ అండర్ ది ఇన్ ఫ్లూయెన్స్’, ‘బాయ్ హుడ్’, ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ లాంటివి. వీటిని స్టడీ చేసి ఇలాటివి తీయొచ్చు. అలాగే రోమాంటిక్ సస్పెన్స్ వుంది. ‘వైల్డ్ థింగ్స్’, ‘సీ ఆఫ్ లవ్’ లాంటివి. కొత్తగా ఏం ప్రయత్నించినా మార్కెట్ యాస్పెక్ట్స్ రెండే - రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్. రోమాంటిక్ డ్రామా అయినా, ఫ్యామిలీ డ్రామా అయినా, ఇంకేదైనా వీటి చుట్టూ వుండడం విజ్ఞత. 

Q: సీరియస్ పాత్రలు బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎలా రాయాలో వివరిస్తారా? దానికి సంబంధించిన ఉదాహరణలు కూడా ఇస్తే మరింత ఉపయోగంగా ఉంటుంది.
ఏపీ, ఏడీ 

A: అమితాబ్ బచ్చన్ ‘దీవార్’, శోభన్ బాబు ‘మల్లెపువ్వు’ లాంటివి తీసుకోవచ్చు పరిశీలనకి. సీరియస్ పాత్రలు రకరకాలు. ‘మిలి’ లో లోపల బాధ దాచుకుని పైకి నవ్వుతూ వుండే జయాబాధురీ పాత్ర,  ‘అంతులేని కథ’ లో కుటుంబ భారమంతా మోయాల్సి వస్తోందన్న కసితో జయప్రద పాత్ర,  ‘శంకరాభరణం’ లో లౌకిక తత్వానికి నిలబడే సోమయాజులు పాత్ర, ‘పెదరాయుడు’ లో కుటుంబ విలువలకి ప్రాణమిచ్చే మోహన్ బాబు పాత్ర... హిట్టయిన సీరియస్ పాత్రలకి బోరుకొట్టకుండా ఏఏ క్యారక్టర్ ఎలిమెంట్స్ జతపడ్డాయో గమనిస్తే ఆ ఎలిమెంట్స్ ని  వాడుకుంటూ బోరుకొట్టని సీరియస్ పాత్రల్ని తయారు చేసుకోవచ్చు. ‘గ్లాడియేటర్’ లో రసెల్ క్రొవ్, ‘మాట్రిక్స్’ లో కీనూ రీవ్స్, ‘ఇట్సె వండర్ఫుల్ లైఫ్’ లో జేమ్స్ స్టీవార్ట్ లాంటి పాత్రలు. కథేమిటి, ఆ కథలో పాత్రేమిటి అనే దాన్నిబట్టి సీరియస్ పాత్రలొస్తాయే తప్ప, విడిగా చెప్పడం కష్టం. అయితే ముందు అలాటి పాత్ర అనుకుంటేనే దాన్ని అనుసరించి పాత్రచిత్రణా కథా వస్తాయి. నిజజీవితంలో కొందర్ని రిఫరెన్స్ గా తీసుకున్నా సరిపోతుంది. ఎప్పుడు నవ్వుతారో తెలీని చంద్రబాబు నాయుడిని తీసుకోవచ్చు. ఎప్పుడు మాట్లాడతారో తెలీని మన్మోహన్  సింగ్ ని తీసుకోవచ్చు. పక్కన కమెడియన్ పెట్టి ఎత్తి పొడుస్తూంటే కూడా సీరియస్ పాత్రలు బోరు కొట్టవు. సీరియస్ పాత్రల్ని వూహించాలంటే కామెడీ పాత్రల్ని రిఫరెన్స్ గా తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. రాజేంద్ర ప్రసాద్ కామెడీల్ని తీసుకుని, ఆయా కామెడీ సన్నివేశాల్లో రాజేంద్ర ప్రసాద్ ని సీరియస్ గా మార్చుకుని ఆలోచించవచ్చు. 

        అసలు పాత్ర సీరియస్ గా ఎందుకుంటోందీ? ప్రాథమికంగా ఈ మూలాలు అవసరం. స్వాభావికంగానే తనలో తాను గడిపే మనిషి కావడం, స్వాభావికంగానే నవ్వడం చేతగాని వ్యక్తి కావడం, చాలా చిన్న వయసునుంచే సుఖాలకి దూరంగా బాధ్యతల బరువు మోయడం, జీవితపు ఏదో మజిలీలో దెబ్బతినడం, ప్రేమలో ఏదో సందర్భంలో గాయపడడం, ‘అమర దీపం’ లో కృష్ణం రాజులాగా అపార్ధాలకి గురికావడం (ఆ పైన ఆత్మ హత్య చేసుకోవడం), ‘నేరము శిక్ష’ లో కృష్ణలాగా ఇంకొకర్ని నష్టపర్చడంతో స్వయం శిక్ష విధించుకోవడం, ఏదో అన్యాయానికి బలైతే తిరుగుబాటు చేయడం, పగ దీర్చుకోవడం లాంటివి. బోరు కొట్టకుండా వుండాలంటే ముఖ్యంగా యాక్టివ్ పాత్రయి వుండాలి.

సికిందర్