రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, మార్చి 2021, ఆదివారం

1024 : సందేహాలు -సమాధానాలు



Q : మీరు నాంది’, శ్రీకారం సినిమాలకి ఇచ్చిన విశ్లేషణలు చూశాను. రివ్యూల కంటే ఇదే బావుంది. మీరు రివ్యూలు మానేసి మంచి పనే చేశారు. కాన్సెప్ట్ ఎనాలిసిస్ చేస్తే చాలు. అంతా అర్ధమైపోతుంది. ఇదే ముఖ్యం. ఇలాగే కంటిన్యూ చేయండి.
ఎస్. ఎం, దర్శకుడు

A : అద్భుతమైన సినిమా ఏదైనా వస్తే పూర్తిస్థాయి రివ్యూ రాయక తప్పదు. మామూలుగా మీడియాలో వస్తున్న రివ్యూలు చాలు. కాన్సెప్ట్ ఎనాలిసిస్ కూడా అన్నిటికీ అవసరం లేదు. ఒక స్క్రిప్టు రాయడానికి పూనుకునే ముందు తీసుకున్న ఐడియా (కాన్సెప్ట్) ని నిర్మించుకోవాలని ప్రపంచంలో ఎక్కడా చెప్పలేదు. సినాప్సిస్ నుంచే మొదలు పెట్టి చెప్పారు. కానీ సినాప్సిస్ రాయడానికైనా ముందుగా ఐడియా సెట్ అవ్వాలి. నిర్దుష్టమైన ఐడియా లేకుండా సినాప్సిస్ రాస్తే అదేమంత బలంగా కూడా వుండదు. బలం సంగతి తర్వాత ఆర్డర్ వేసేప్పుడు చూసుకోవచ్చను కుంటారు. అది జరగదు. అలా ఏ దశలోనూ జరగదు. ఐడియా అనేది మొత్తం స్క్రీన్ ప్లేకి బలానికి బేస్ వంటిది. ఇది అర్ధమయ్యాక, ఈ బ్లాగులో  తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్  అంటూ వ్యాసాలు రాస్తున్నప్పుడు, ముందుగా ఐడియా నుంచే ప్రారంభించాం. తెలుగుకి వ్యాసాలు డిఫరెంట్ గా వుండాలిగా.  
       
     ఐడియాని విశ్లేషించుకున్నప్పుడు
, అందులో మార్కెట్ యాస్పెక్ట్ వుందా లేదా తెలుస్తుంది. ఐడియాని విశ్లేషించు కున్నప్పుడు అందులో కథ వుందా, గాథ వుందా, కొంపదీసి డాక్యుమెంటరీ వుందా తెలుస్తుంది. ఐడియాలో స్ట్రక్చర్ని విశ్లేషించుకున్నప్పుడు,  అందులో త్రీయాక్ట్ స్ట్రక్చర్ వుందా, కొంపలు ముంచే మిడిల్ మాటాష్, సెకండాఫ్ సిండ్రోములు తిష్ట వేసి వున్నాయా తెలుస్తుంది. ఇలా చాలా తెలుస్తాయి. అన్నం ఉడికిందని చెప్పడానికి ఒక్క మెతుకు చాలన్నట్టు, ఐడియాని ఉతికి ఆరేస్తే స్క్రీన్ ప్లే బతికిందా లేదా తెలిసిపోతుంది. అందువల్ల సినిమాకి ముఖ్యంగా ఏది బేస్ గా వుంటుందో దాన్ని విశ్లేషిస్తే చాలన్నట్టు సమీక్షలు ఇస్తున్నాం, మీ సూచనలకి థాంక్స్.

Q : నాదొక ప్రశ్న. సరదా సరదాగా సాగిపోతున్న కథ, ఒక అనుకోని సంఘటనతో సీరియస్ క్రైమ్ లోకి టర్న్ అవ్వొచ్చా? ఇది జానర్ మర్యాదను ధిక్కరించినట్టు అవుతుందా? ఇలాంటి కథలు రాసేటప్పుడు (ఉదా : నా పేరు శివ) స్క్రీన్ ప్లే లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా? కథలోకి సడన్ గా క్రైమ్ ఎలిమెంట్ రావొచ్చా? లేక ముందు నుంచి రేఖా మాత్రంగా ప్రస్తావిస్తుండాలా? దీనికి రిఫరెన్స్ సినిమాలు ఏమైనా ఉన్నాయా?
అశోక్, అసోసియేట్

A : ఎంత సరదా సరదాగా సాగిపోతున్నా పీపీ వన్ వచ్చేసరికి అనుకున్న క్రైమ్ తో కథ ప్రారంభమవాల్సిందే. దీనికి జానర్ మర్యాదతో సంబంధం లేదు. స్ట్రక్చర్ తో సంబంధం. క్రైమ్ ముందు నుంచీ రేఖామాత్రంగా రావాలంటే బిగినింగ్ విభాగంలో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో భాగంగా దీన్ని సెట్ చేసుకుంటూ రావాలి. కథని బట్టి వుంటుంది. కొన్ని కథలకి ఇది అవసరం లేదు. సరదా సరదాగా వెళ్ళి ఒక కారాపి ఎక్కితే, అందులో కిల్లర్ వుంటే, అదే పీపీ వన్ అవచ్చు. ఇలాటి సందర్భంలో ముందు నుంచి రేఖా మాత్రంగా ప్రస్తావించ నవసరం లేదు. కథలోకి సడన్ గా పీపీ 1 లో క్రైమ్ ఎలిమెంట్ లాగా రావచ్చు. రిఫరెన్సులు ఎన్ హెచ్ 10’, హాలాహల్ లాంటివి చాలా వుంటాయి. ఇవి కామన్.

Q : నేను మీ బ్లాగ్ ఫాలోవర్ ని. ఒక స్మాల్ డౌట్ రావడంతో ఈ మెసేజ్ చేస్తున్నా. సీనిక్ ఆర్డర్ అనేది లొకేషన్ ఛేంజ్, క్యారక్టర్స్ ఛేంజ్ బట్టి మనకి సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో క్లారిటీ ఇస్తూనే, షూటింగులో కూడా సీన్స్ తీస్తున్నప్పుడు ఈ సీనిక్ ఆర్డర్ కన్ఫ్యూజ్ పడనివ్వకుండా ఉపయోగపడుతుంది కదా. మరి ఒకే లొకేషన్ లో జరిగే మూవీస్ వస్తున్నాయి, డోంట్ బ్రీత్ లాంటివి. ఇలాటి మూవీస్ కి ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి అని సీనిక్ ఆర్డర్ ఎలా వేసుకోవాలి? ఈ డౌట్ ని కాస్త క్లారిఫై చేయండి.
రాజేష్ అసిస్టెంట్

A : ఏముంది సింపుల్. సింగిల్ లొకేషన్లో ఎన్ని స్పాట్స్ లో సీన్లుంటే ఆ స్పాట్స్ ని సబ్ సీన్లుగా పరిగణించి, సీన్ నంబర్ పక్కన స్పాట్స్ కి ఎబిసీడీలు ఇచ్చుకోవడమే. ఈ మధ్య ఇలాటి ఒక పూర్తి స్థాయి సింగిల్ లొకేషన్ స్క్రిప్టుకి, ఎబిసీడీలు కన్ఫ్యూజన్ గా తయారై, అన్నిటికీ సీన్ నంబర్లు ఇచ్చేశాం. బెడ్రూంకి సీన్ 1, హాలుకి సీన్ 2, కిచెన్ కి సీన్ 3 ఇలా... గోడవ వదిలిపోయింది. మీరు కూడా ఇలా చేయవచ్చు.

        ‘డోంట్ బ్రీత్  స్క్రీన్ ప్లేలో సీన్ నంబర్లు వుండవు. హాలీవుడ్ స్క్రీన్ ప్లేల్లో సీన్ నంబర్లు వేస్తే ఆ రైటర్ ఫ్రొఫెషనల్ కాదని తెలిసి పోతాడు. సీన్ నంబర్లు వేయకుండా ఒక నవలలాగా నిర్మాతలు చదవడానికి స్క్రీన్ ప్లే ఈజీగా వుండాలి. సీన్ నంబర్లు తర్వాత ప్రొడక్షన్ విభాగం వేస్తుంది- షెడ్యూలింగ్, క్యాస్టింగ్, ఎడిటింగ్ అవసరాల కోసం. దీన్ని షూటింగ్ స్క్రిప్టు అంటారు. అయితే దేర్ విల్ బి బ్లడ్ స్క్రీన్ ప్లే లో సీన్ నంబర్లే గాక, సబ్ సీన్స్ కి ఎబిసీడీలు కూడా వేశారు.

Q : దేర్ విల్ బి బ్లడ్ విశ్లేషణలో నాకు ఒకటి అర్ధం గాలేదు. ఎంతసేపూ బ్యాడ్ కర్మకి బ్యాడ్ జరుగుతున్నట్టే వుంది తప్ప, గుడ్ కర్మకి గుడ్ జరుగుతున్నట్టు ఎక్కడాలేదు. అంటే గుడ్ కర్మ అనేది లేదనా? కర్మ సిద్ధాంతం గురించి మీ అభిప్రాయమేంటి?
ఎస్. ఎల్. వి. ప్రకాష్, పాఠకుడు

A : నిజమే, ఇది మనకి తట్టనే లేదు. ఎంతసేపూ బ్యాడ్ కర్మ గురించే గాథ వుంది. అయితే శత్రువులైన డానీ, ఇలై ఇద్దరూ మంచి కర్మలు చేసే రకాలు కారు. ఒక్క మేరీతో గుడ్ కర్మగా వుంటున్న డానీ, చివరికి బ్యాడ్ కర్మే చేశాడు. అతను మతంలోకి మారినప్పుడు, మేరీ కూడా మతంలోకి మారి ఫ్యామిలీ అన్పించుకుంటే, కొడుకుని బాస్టర్డ్ అని చెప్పి వెళ్ళగొట్టి, కోడలైన మేరీని అవమానకర పొజిషన్లోకి నెట్టేశాడు.

చిన్నప్పుడు మేరీ తండ్రి ప్రార్ధన చేయట్లేదని కొట్టే వాడు. తర్వాత అదే తండ్రి వేరే కారణం చేత పెద్ద కొడుకు ఇలై చేతిలో ఘోరంగా తన్నులు తిన్నాడు. ఇంత దారుణంగా వుంటుంది బ్యాడ్ కర్మ ఫలితం. ఇలా ఎవర్నీ వదిలిపెట్టకుండా బ్యాడ్ కి బ్యాడ్ లాగే వుంది గాథ. దీంట్లో మళ్ళీ గుడ్ చూపిస్తే ఫీల్ చెడుతుందని (రస భంగమవుతుందని) కావచ్చు, గుడ్ కి గుడ్ చూపించలేదు.

కర్మ సిద్ధాంతం సైంటిఫిక్. యూనివర్సల్ ట్రూత్. ప్రకృతి నియమం. దీన్ని సింపుల్ గా వివరించే సంఘటన జరిగింది. చాలా ఏళ్ళ  క్రితం ప్రశాంతంగా వుండే మా కాలనీ ఆలయంలో విజయవాడ నుంచి ఒకావిడ ప్రవచనా లివ్వడానికొచ్చింది. తెల్లారి అయిదుగంటలకి ప్రవచనాలు విన్పిస్తూండేవి. ఒక రోజు వాకింగ్ చేస్తూ వింటూంటే ఆవిడ చెప్పుకొచ్చింది...మాకు మంచి రోజులు రావడం లేదు రావడం లేదని, గుళ్ళూ గోపురాలూ యాత్రలూ తిరుగుతూంటారు. మంచి రోజులెలా వస్తాయి? చేసిన చెడు కర్మల్ని మంచి కర్మలు మించినపుడు మంచి రోజులొస్తాయ్ అనేసింది. సింపుల్ గా సింగిల్ లైనులో పంచ్ డైలాగ్- చేసిన చెడు కర్మల్ని మంచి కర్మలు మించినపుడు మంచి రోజులొస్తాయ్  షీ ఈజ్ జెమ్. మాయచేసి భక్తుల్ని దండుకోవాలనుకోలేదు.
        
కనుక కష్టాలొచ్చాయని, రామా అల్లా ప్రభూ అంటూ సాగిలపడితే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. దేవుళ్ళు మనల్ని పుట్టించడమే ఎక్కువ, మోయడం కూడానా? మంచి రోజులు రావాలంటే మంచి పనులు చేయడమే. మొత్తానికి  దేర్ విల్ బి బ్లడ్ స్క్రీన్ ప్లే సంగతుల పుణ్యమాని చాలా ఫిలాసఫీ మాట్లాడుకున్నాం ఈ సినిమా బ్లాగులో. ఇక ఆపుదాం.

సికిందర్ 


13, మార్చి 2021, శనివారం

1023 : మూవీ నోట్స్


         రైతులు బాగు పడాలన్నా, సినిమాలు బాగు పడాలన్నా మార్కెట్ దృష్టే ప్రధానం. మార్కెట్ ని ఏ దృష్టితో చూస్తున్నారన్నది ముఖ్యం. ఇందులోంచి ఆవిర్భవించిందే సినిమాలకి సంబంధించి మార్కెట్ యాస్పెక్ట్ అన్నఆలోచన. మార్కెట్ యాస్పెక్ట్ కి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ అన్న కార్యాచరణ. శ్రీకారం సినిమా కాన్సెప్ట్ అయిన వ్యవసాయానికి ఏది మార్కెట్ యాస్పెక్ట్ అవుతుంది? స్టాలిన్ తెచ్చిన సమిష్టి వ్యవసాయం విఫలమైంది. లెనిన్ తెచ్చిన పంటల మీద ప్రభుత్వానికి అధిక బాగం విధానం కూడా విఫలమైంది. ఈ రెండు సార్లూ రైతులు తిరగబడ్డారు.        తెలంగాణా రైతాంగ పోరాటంలో దొరల చేతుల్లోంచి లాక్కున్న భూములు దొరల చేతుల్లోకే వెళ్ళాయి. ఇప్పుడు ప్రభుత్వం నయాదొరల (కార్పొరేట్) చేతుల్లో వ్యవసాయ రంగాన్నిపెట్టే కొత్త చట్టాలు తెచ్చింది. దీని మీద తిరగబడుతున్నారు రైతులు. ఇలాంటప్పుడు  శ్రీకారం  హీరో ఇంకా రైతులతో ఉమ్మడి వ్యవసాయం చేయిస్తానంటాడు దొరలాగా. రైతులతో ఉమ్మడి వ్యవసాయం చేయించడం, ఇది చూపించి వ్యవసాయం లోకి రావాలని యువతకి సందేశమివ్వడం, ఎలా సినిమాకి మార్కెట్ యాస్పెక్ట్ అవుతుంది?   

        మ్మడి కుటుంబ వ్యవస్థే అసాధ్యమైనప్పుడు అందరూ కలిసి వుండే ఉమ్మడి కుటుంబాలు ఇంకా కావాలనే సినిమాలు వస్తున్నాయి అవగాహన లేకుండా. ఇప్పుడు ఉమ్మడి వ్యవసాయం సినిమా వచ్చింది. దెబ్బతిన్న రైతుల్నీ వాళ్ళ భూముల్నీ ఒక చోట చేర్చి, హీరో రైతులకి నెలజీతాలివ్వడం, హీరో సహా అందరూ కలిసి పంటలు పండించుకోవడం, ఆ పంటల్ని అమ్మి హీరో ఆదాయాన్ని పంచడం. ఇదీ కథ. హీరో యాజమాన్యంలో ఉమ్మడి వ్యవసాయం.

        ఈ కథలో అసలు రైతులెందుకు వ్యవసాయం వదిలేశారు. విత్తనాలు, ఎరువులు, ఇంకేవో బరువులు వంటి టెంప్లెట్ సినిమా కారణాలు చెప్పారు. హీరో ఇది నమ్మి టెంప్లెట్ గా కొత్త వ్యవసాయ పద్ధతులు, కొత్త పంటలు ప్రవేశపెట్టాడు. దీంతో టెంప్లెట్ గా విజయం సాధించాడు. పంటలు ఎలా పండించాలో రైతులకి తెలియకనా. వాళ్ళ చేత చెప్పించిన టెంప్లెట్ కారణాలకంటే పెద్ద సమస్య మార్కెట్ సమస్య. హీరో ఎంత గొప్పగా ఆధునిక పద్ధతులనే టెంప్లెట్ తో పరిశోధనలు చేసి ఉమ్మడి వ్యవసాయం చేయించినా, మార్కెట్లో సగానికి సగం ధరలకే అమ్మాలి. అప్పుడు మిగిలేది గుండు సున్నా.

        కనీస మద్దతు ధరల కంటే హీనంగా ధరలు నిర్ణయిస్తున్నాయి మార్కెట్ శక్తులు. ఇక్కడే రైతు దివాలా తీస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్ లో ఏడు రూపాయలకి, పది రూపాయలకి కిలో యాపిల్ పళ్ళు కొని, 150 రూయాయకి వినియోగదార్లయిన మనకి అమ్ముతున్నాయి కంపెనీలు. రైతులే కాదు, వినియోగ దార్లయిన మనమూ దోపిడీకి గురవుతున్నాం. మనం నిశ్శబ్దంగా వుంటున్నాం, రైతులు ఆందోళన బాట పట్టారు. వరి ధాన్యం కూడా ఇలాగే కొనుగోలు చేసి, కేజీ ఇరవై రూపాయలకి తయారైన బియ్యాన్ని, విదేశాల్లో 150 కి అమ్ముతున్నారు.

        ఫేస్ బుక్ లో ఒక వీడియో పెట్టారు అమెరికాలో ఒక తెలుగు వ్యక్తి. అందులో వ్యవ సాయ క్షేత్రంలోనే రైతు వినియోగదారులకి కూరగాయలు అమ్ముతున్న దృశ్యాలు వివరించారు. అలాటి వ్యవసాయ క్షేత్రాలున్నాయి. రైతులు అన్ని కూరగాయలూ, ఆకు కూరలూ, అల్లం వెల్లుల్లి సహా పళ్ళూ ఒకే చోట పండిస్తారు. రైతులు తమకి కావాల్సినవి నేరుగా చెట్ల నుంచి కోసుకుని డబ్బు చెల్లిస్తారు. ఇలా వినియోగదారులకి తక్కువ ధరలకి లభించడమే గాక, రైతులకి ఎన్నో మార్కెటింగ్ ఖర్చులూ తప్పుతున్నాయి. ఇంకో తలుగు వ్యక్తి అమెరికాలో సంతల గురించి వీడియో పెట్టారు. మనకి హైదరాబాద్ లో వివిధ చోట్ల వారం వారం తోపుడు బళ్ళ మీద సంతల్లాగా అక్కడా వున్నాయి.

        మన దేశంలో మొత్తం వ్యవసాయరంగం మీద ఆధార్పడ్డ మూడువేల వివిధ పరిశ్రమలు ఏటా ఇరవై లక్షల కోట్లు ఆర్జిస్తున్నాయి. కానీ 85 శాతం మంది రైతులు వాళ్ళకి వ్యవసాయోత్పత్తు లందించి, నెలసరి ఆదాయం బొటాబొటీగా ఆరువేల రూపాయలు చేతిలో మిగిలి దీనంగా బ్రతుకులీ డుస్తున్నారు. ఇవి ప్రభుత్వం దగ్గరున్న గణాంకాలే. రైతు అన్నదాత అనే భుజకీర్తులు అవసరం లేదు, రైతు కంపేనీలకి లక్షల కోట్ల ఆదాయ ప్రదాతగా కరిగిపోతున్న కొవ్వొత్తి. ఇది గుర్తించాలి. ప్రభుత్వాలు కంపెనీల్ని నియంత్రించవు. వాటికి కంపెనీల నుంచి వచ్చే వివిధ పన్నులు, పార్టీ ఫండ్స్ కావాలి. ఇలా ప్రభుత్వాలూ కంపెనీలూ రైతుల మీద స్వారీ చేస్తూ తమ పంట పండించుకుంటున్నాయి.

        ఈ వాస్తవాలు తెలుసుకోకుండా, హీరో ఉమ్మడి వ్యవసాయంతో ఉద్ధరిస్తాననడం అపరిపక్వతే అవుతుంది. ఒక స్టార్ సినిమాకి ఇంత అల్లి బిల్లి కథ వుండకూడదు. అసలు వ్యవసాయం వదిలేసిన రైతులతోనే ఉమ్మడి వ్యవసాయం చేయించి, వ్యవసాయంలోకి యువత రావాలని ఎలా సందేశ మిస్తారు. ఈ సినిమా టార్గెట్ ఆడియెన్స్ రైతులే అన్నట్టుంది. వాళ్ళ టెంప్లెట్ కష్టాలూ కన్నీళ్ళూ ఉమ్మడి వ్యవసాయాలూ ఇవే చూపించారు. ఇంతా చేసి ఎవరూ ఉమ్మడి వ్యవసాయంతో బాగుపడినట్టు చూపించలేదు. మొదట్లో వున్న గెటప్స్ తోనే చివర్లో వున్నారు. ఆర్ధిక ఉన్నతి  లేదు. హీరో దొరతనం అలాగే వుంది. అసలు కరోనా కాలంలో రైతుల కడగండ్లు అంటూ చూపించడమేమిటి. కరోనా కాలంలోనే ఇతర పరిశ్రమలూ వ్యాపారాలూ కుప్ప కూలిపోగా, వ్యవసాయరంగ
మొక్కటే జీడీపీ తో దేశాన్ని ఆదుకుంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లాగా సినిమాలో కూడా ఫేక్ న్యూస్ వుంటే ఎలా?

        సినిమాలో ఇచ్చిన సందేశంతో ఈ స్టార్ మూవీ టార్గెట్ ఆడియెన్స్ యూత్ అవ్వాలి. అప్పుడు యూత్ ని ఆకర్షించే కథా కథనాలే యూత్ అప్పీల్ తో వుండాలి. ఇదీ ఈ సినిమాకి మార్కెట్ యాస్పెక్ట్. ఇప్పుడు చూపించాల్సింది రైతులతో ఉమ్మడి వ్యవసాయం కాదు. ఎక్కడెక్కడున్న ఆ రైతుల కొడుకుల్నీ, కూతుళ్లనీ రప్పించి, వాళ్ళ వాళ్ళ వ్యవసాయాల్ని ఇప్పుడంటే ఇప్పుడే వాళ్ళ చేతే చేయించడం. కష్టాలూ కన్నీళ్ళతో కాదు.  డైనమిక్ గా, వైబ్రెంట్ గా. జాయ్ రైడ్ గా. వాళ్ళ అమాయకత్వం, పిచ్చి పనులూ సహా ఎంటర్ టైనర్ గా. హీరో కేవలం మోటివేటర్ గా. దొర కాదు, ఖజానా గుప్పెట్లో పెట్టుకున్న యజమాని కాదు. ఇక మార్కెట్ శక్తులతో యూత్ డీల్ చేసే రూటేవేరు. మెడలు వంచి ముకుతాడేస్తారు. మార్కెట్ యార్డుని ఫార్మర్ ఖిల్లా చేస్తారు.      

        పోతే, స్క్రీన్ ప్లే పరంగా ఈ సినిమాకి స్ట్రక్చర్ అనేది ఏమాత్రం లేదు. కాన్ఫ్లిక్టే లేదు. కాన్ఫ్లిక్ట్ లేకుండా కథెలా అవుతుంది. డాక్యుమెంటరీ అవుతుంది. అయింది.

సికిందర్

 

11, మార్చి 2021, గురువారం

1022 : దర్శకుడి స్టోరీ


   ‘ర్జున్ రెడ్డి లాంటి సూపర్ డూపర్ హిట్ అందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి టాలీవుడ్ లో రెండో సినిమా దొరకడం లేదు. విజయ్ దేవరకొండ స్టార్ డమ్ ని ఏక్ దమ్మున పెంచేసిన అర్జున్ రెడ్డి తర్వాత నుంచి  వంగా టాలీవుడ్ లో  ఖాళీగానే వున్నాడు. 2017 లో అర్జున్ రెడ్డి విడుదలైంది. అప్పట్నుంచీ ఈ నాల్గేళ్ళూ చెయ్యని ప్రయత్నమంటూ లేదు. తెలుగు స్టార్స్ కి అతడి కథలు నచ్చలేదని అప్పట్లో చెప్పుకున్నారు. ఇక లాభం లేదని బాలీవుడ్ వైపు దృష్టి సారించాడు. అక్కడ అదృష్టం పలకరించింది. అర్జున్ రెడ్డి రీమేక్ కి షాహిద్ కపూర్ అంగీకరించాడు. దీంతో అక్కడి నిర్మాణ సంస్థతో కబీర్ సింగ్ తీస్తే అది అతి పెద్ద హిట్టయ్యింది. 60 కోట్ల బడ్జెట్ తో తీస్తే 370 కోట్లు వసూలు చేసింది. ఇది వంగా సాధించిన పెద్ద రికార్డు. ఇది 2019 లో జరిగింది. తిరిగి టాలీవుడ్ మీద దృష్టి పెట్టి  మళ్ళీ ప్రయత్నాలు చేసీనా, నో అనే చెప్పింది టాలీవుడ్.

నిజానికి అర్జున్ రెడ్డి కి కూడా నిర్మాతలు దొరకలేదు. నాల్గేళ్ళూ తిరిగి తిరిగి విసిగి, తానే స్వయంగా నిర్మించేందుకు పూనుకున్నాడు. తండ్రి, సోదరుడు నిర్మాతలుగా ముందుకొచ్చారు. అలా 5 కోట్ల బడ్జెట్ తో అర్జున్ రెడ్డి నిర్మించారు. అది 50 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అయినా తెలుగు స్టార్లు ఆసక్తి చూపలేదు.

        కబీర్ సింగ్ హిట్ ని చూసి కూడా తెలుగు స్టార్లు అవకాశమివ్వక పోవడంతో మళ్ళీ బాలీవుడ్ కెళ్ళిపోయాడు. వెంటనే అక్కడ రణబీర్ కపూర్ తో ఓకే అయ్యింది. సందీప్ చెప్పిన యానిమల్ స్టోరీకి కబీర్ సింగ్ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ కూడా వెంటనే ఓకే చెప్పి ఎననౌన్స్ కూడా చేసేశారు. ఇక చక చకా పరిణితి చోప్రా, అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి స్టార్లు కూడా ఇందులో నటించేందుకు బుక్కైపోయారు.

        ఇదీ సందీప్ రెడ్డి లక్ బ్యాడ్ లక్ ల దొబూచులాట. బాలీవుడ్ లోనే లక్ వున్నట్టు అనుకోవాలి. అక్కడే సెటిలైతే తెలుగు నుంచి రెండో రామ్ గోపాల్ వర్మ అవుతాడు. ఇక టాలీవుడ్ కి రాంరాం, బాలీవుడ్ గయా రామ్ అనుకుని సెకండ్ వర్మ అయిపోతే సరి!
***

1

  

8, మార్చి 2021, సోమవారం


       అసలీ సినిమా మొత్తాన్నీ గమనిస్తే నాటక ధోరణిలో గాథ కన్పిస్తుంది. గాథ అంటేనే పాత స్కూల్లో చెప్పేది. నాటకంలో ఒక్కో అంకానికి తెరపడుతున్నట్టు ఒక్కో చాప్టర్ గా నిదానంగా సాగే ఈ గాథకి ఈ ధోరణిలోనే బలమైన ఆకర్షణ వుంది. అది హృదయాలకి గాలం వేస్తుంది. పాత అనేది లేదు. సాంప్రదాయం లేకపోతే ఆధునికత్వం లేదు. సాంప్రదాయం లేకపోతే దేన్ని చూసి ఆధునికత్వం వస్తుంది. సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ అభ్యుదయం పుడుతుంది. సాంప్రదాయం లేకపోతే అభ్యుదయం ఎక్కడ్నుంచి పుడుతుంది. పెద్దలు చేసే పెళ్ళిళ్ళు లేకపోతే ఠాట్ వీల్లేదని ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కడుంటాయి. వాళ్ళూ వీళ్ళూ కొట్టుకోవడం, వీధిన పడ్డం ఎక్కడుంటుంది. కాబట్టి సాంప్రదాయ అంశలేని ఏ ఆధునిక జీవితంకళవ్యవహారం లేదు. దాన్ని కూడా కలుపుకుంటూ పోవాల్సిందే. ఇప్పుడున్న సినిమాల మేకింగ్ కి సినిమా ప్రేక్షకులు సినిమా ప్రేక్షకులు కాలేకపోతున్నారు. ఏదో పైపైన చూసేసి మర్చిపోవడమే. ఎంత హిట్ అన్పించుకున్నా మళ్ళీ మళ్ళీ చూసే ప్రేక్షకులు ఒకప్పటి లాగా వుండడం లేదు. సినిమా ప్రేక్షకుల్లోని ప్రేక్షకుల్ని చంపేస్తున్న ఈ మేకింగ్ తీరు తెన్నుల్ని సంస్కరించుకోవడానికి దేర్ విల్ బి బ్లడ్ లాంటి గాథలు ఎంతైనా ఉపయోగపడవచ్చు.  

      ఇప్పుడు ఎండ్ విభాగాని కొచ్చాం. మిడిల్ 2 లో భూములున్న బాండీ వచ్చి, పైప్ లైన్ వేసుకోవడానికి భూములు కావాలంటున్న డానీ ని బ్లాక్ మెయిల్ చేసే దగ్గర ఆగాం. డానీ చేసిన హెన్రీ హత్యని అడ్డుపెట్టుకుని ఈ బ్లాక్ మెయిల్. ఇప్పుడు డానీకి భూములు కావాలంటే, చర్చికి వచ్చి మతంలో చేరాలని బాండీ ఆదేశం. ఇది పీపీ 2 ఘట్టం. మతాన్ని వ్యతిరేకించే డానీకి ఇది ఇరకాటంలో పెట్టెసే ఘట్టం. గాథ మతాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమయింది పీపీ 1 దగ్గర. దీనికి సమాధానంగా మతాన్ని ఒప్పుకోవాల్సిన ఈ పీపీ 2 ఘట్టం. గాథకి పీపీ 1 సమస్యా స్థాపన, పీపీ 2 పరిష్కార మార్గం. పీపీ 1, పీపీ 2 ల మధ్య ఈ  మిడిల్ 1, మిడిల్ 2 లతో వుండేదే సినిమా కథ (గాథ). దీని తర్వాత వుండేది కథ (గాథ) కాదు, కథకి (గాథకి) ముగింపు కథనం...

    ఎండ్ కథనం :  చర్చిలో డానీ ప్రాయశ్చిత్తం. డానీ ప్రత్యర్ధి పాస్టర్ ఇలై కార్యక్రమం నిర్వహిస్తాడు, ప్రభువు వైపు చూస్తూ నేను పాపిని, కొడుకుని వదిలేశానని పదేపదే గట్టిగా చెప్పమంటాడు. చెప్పాక డానీ జుట్టు పట్టుకుని సైతాను వదిలిస్తాడు. డానీ పునీతుడవుతాడు. ఇక బాండీ భూముల్ని లీజుకి తీసుకుని పైపు లైన్ వేయడం ప్రారంభిస్తాడు.

        ఎక్కడో వుంటున్న కొడుకుని తీసుకొచ్చి కలుపుతారు. కొడుకుని హత్తుకుంటాడు. కొట్టమని చెంప మీద కొట్టించుకుంటాడు. ఇక కొడుకు జ్యూనియర్ డానీతో ఆనందంగా జీవితం గడుపుతాడు. జూనియర్ పెద్దవాడై మేరీని పెళ్లి చేసుకుంటాడు. కొన్నాళ్ళ తర్వాత వచ్చి విడిగా వ్యాపారం చేసుకుంటాను, వాటా పంచమంటాడు. పంచనంటాడు డానీ. తండ్రిగా నిన్ను ఒప్పుకుంటాను గానీ, పార్టనర్ గా నీతో పొసగడం లేదంటాడు జ్యూనియర్. నీ తండ్రెవరు, అక్రమ సంతానానివి నువ్వని దూషిస్తాడు డానీ. అనాధగా దొరికితే పెంచి పోషించానంటాడు. తన గురించి ఈ కొత్త విషయాలు తెలుసుకున్న జూనియర్ విరక్తితో వెళ్ళిపోతాడు.

మరికొంత  కాలం గడిచి పోతుంది. ఆయిల్ మోతుబరిగా ఇంకింత ఎదిగి విశాలమైన బంగాళాలో ఒంటరిగా వుంటాడు డానీ. తాగుడు మరుగుతాడు. ఇప్పుడు ఇలై వస్తాడు. చాలా రిచ్ గా వుంటాడు. ఇన్నాళ్ళూ మతప్రచారం చేస్తూ దేశాలు తిరిగానంటాడు. రేడియో ప్రచారం కూడా చేశానంటాడు. తన కెందరో ఫ్యాన్స్ ఏర్పడ్డారంటాడు. కొన్నాళ్ళ క్రితం బాండీ చనిపోయాడనీ, బాండీ మనవడు హాలీవుడ్ ప్రయత్నాలు చేస్తున్నాడనీ, ఇప్పుడు తమకున్న భూములు అమ్మేయదల్చుకున్నాడనీ అంటాడు. డానీ లీజుకి తీసుకున్న ఆ భూములు కొనేసుకుంటే, తనకి కొంత కట్ మనీ వస్తుందనీ, తను చాలా ఇబ్బందుల్లో వున్నాననీ అంటాడు. పాత బాకీ ఐదువేలు కూడా ఇమ్మంటాడు.

        అయితే నువ్వు దొంగ పాస్టర్ నని ఒప్పుకో, మతం మూఢ నమ్మకమని అరిచి చెప్పుకో- అంటాడు డానీ. ఇలై అలాగే చేసేస్తాడు. తను దొంగ పాస్టర్ ననీ, మతం మూఢ నమ్మకమనీ అరిచి అరిచి చెప్తాడు. ఇలై చేత ఇలా చెప్పించాక, ఆ భూములు తనకి పనికిరావని చల్లగా చెప్తాడు డానీ. ఆ భూముల్లో స్ట్రా వేసి మిల్క్ షేక్ లా చమురుని తాగి పడేశా నంటాడు.

షాక్ తిన్న ఇలై అన్యాయం చేయవద్దంటాడు
, అన్యాయమే చేస్తానని ఇలైని కొట్టి కొట్టి చంపేస్తాడు డానీ. చంపేసి, ఐయామ్ ఫినిష్డ్ అంటాడు. ది ఎండ్.

***

    విశ్లేషణ : మతం -పెట్టుబడి రెండిటి గాథ కొలిక్కి వచ్చింది. సంఘర్షించుకుంటే మతానికేమీ కాలేదు, పెట్టుబడికేమీ కాలేదు. అయ్యింది వాళ్ళిద్దరికే. నెగెటివ్ క్యారక్టర్లు గా మారిన క్యారక్టర్ల గాథ. ఈ గాథలో ఏ వొక క్యారక్టర్ విజయాన్నీ చూపలేరు. మతం మీద పెట్టుబడి విజయం, లేదా పెట్టుబడి మీద మత విజయం చూపలేరు. అసహజంగా వుంటుంది. మతం పెట్టుబడిని నాశనం చేయదు, పెట్టుబడి మతాన్నీనాశనం చెయ్యదు. మతం మీద నాస్తిక విజయం, పెట్టుబడి మీద కమ్యూనిస్టు విజయం చూపించ వచ్చు. మతమని ఒకరు, పెట్టుబడి అని ఒకరూ సంఘర్షించుకుంటే ఇద్దరూ అంతమవాలి, లేదా రాజీ పడాలి చివరికి. ఇది రాజీపడి సుఖాంతమయే గాథ కాలేదు. డానీ ఇలైలు మతం-పెట్టుబడి భావజాలాలు పరస్పర ఆధారభూతాలని గుర్తించలేదు. వాటిని అడ్డుపెట్టుకుని కక్ష తీర్చుకుందామనుకున్నారు. శిక్షలు పొందారు.

***

        2. ఈ ఎండ్ కథనంలో తిరిగి మిడిల్ 2 కథనం లోలాగే  క్యారక్టర్ల వారీ చాప్టర్లున్నాయి. పీపీ 2 లో బ్లాక్ మెయిల్ తో ఎంటరైన బాండీ, ఈ ఎండ్ ప్రారంభంలో డానీని చర్చిలో చేర్పించి నిష్క్రమిస్తాడు. ఈ చాప్టర్లో డానీ వదిలేసిన కొడుకు ప్రస్తావన వుండడంతో, తర్వాతి చాప్టర్ ఆ కొడుకు రాకతో ప్రారంభమవుతుంది. కొడుకు తను అక్రమ సంతానమని తెలుసుకుని వెళ్ళి పోయాక, ఇలై రాకతో చివరి చాప్టర్ ప్రారంభమవుతుంది. ఒకరి తర్వాత ఒకరుగా మూడు చాప్టర్లతో ఈ ఎండ్ వుంది. ఈ నాటక శైలి తెలుగులో వస్తే, బాగా లేదని  కొన్ని రివ్యూలే ఆడియెన్స్ కి మిస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాయి. దేన్ని ప్రమోట్ చేయాలో, దేన్ని డీమోట్ చేయాలో తెలుసుకోక పోతే.

***

         3. మొదటి చాప్టర్లో చర్చిలో డానీ నిష్కృతి పేర ఇలై ప్రతీకార పండగ చేసుకున్నాడు. వెనుకటి మిడిల్ 2 లో, బాకీ డబ్బుల కోసం వచ్చిన ఇలైని బురదలో పడేసి ఎడాపెడా కొట్టాడు డానీ. దాని ప్రతీకారమిలా... మిడిల్ 1 లో ప్రచ్ఛన్న పోరాటంగా, మిడిల్ 2 లో ప్రత్యక్ష పోరాటంగా సాగిన ఈ ప్రత్యర్ధుల మధ్య యాక్షన్ రియాక్షన్ల్ పరంపర, ఈ ఎండ్ లో కొలిక్కి వచ్చే క్రమం ప్రారంభమైంది.

        వ్యాపారం కోసం విధిలేక మతంలో చేరడాని కొచ్చిన డానీ చేత, పాపినని చెప్పిస్తాడు పాస్టర్ ఇలై. చెప్పించి, కొడుకుని వదిలేసిన పాపం ప్రభువు వైపు చూసి చెప్పమంటాడు. చెప్పాక, మోకాళ్ళ మీద కూర్చున్న డానీని ఎడాపెడా కొడుతూ సైతానుని వదిలిస్తాడు. కానీ ఆల్రెడీ తనలోనే సైతానుతో వున్న ఇలైని కూడా ప్రభువు గమనిస్తూనే వున్నాడు...

        నిజంగా డానీకి పాప ప్రక్షాళన అయ్యిందా? పాపాలన్నీ చెప్పుకున్నాడా? హెన్రీని హత్య చేసిన విషయం చెప్పుకోలేదు. ఇది కర్మ ఫలంగా తర్వాత యాక్షన్లో కొస్తుంది. హెన్రీ హత్యని అడ్డుపెట్టుకుని డానీని బ్లాక్ మెయిల్ చేసి మతంలో చేర్పించిన బాండీ, ఈ  విజయానికి ఆనందిస్తున్నాడు. ఇది బాండీ విజయమేనా?

డానీ చేసిన హత్యని స్వార్ధానికి ఉపయోగించుకున్నబాండీ, తనూ నేరంలో భాగస్వామి అయ్యాడు. హత్య విషయం కూడా డానీ చేత చెప్పిస్తే, డానీ అరెస్టయి అతడి బిజినెస్ వుండదు, తను భూములు లీజుకిచ్చి లాభపడే అవకాశముండదు. అందుకని నేరం గురించి తెలిసినా దాచి పెట్టాడు. మరి ఈ బ్యాడ్ కర్మకి శిక్షేమిటి?

కొన్ని శిక్షల్ని ముందే ఖరారు చేసి పట్టేస్తుంది ప్రకృతి, ముందు జరగబోయేది దానికి తెలుసు గనుక. కర్మ ఫలాలు అడ్వాన్స్ బుకింగ్ గానూ వుంటాయి, కరెంట్ బుకింగ్ గానూ వుంటాయి. ఎదైతే అది తీసుకుని షో చూసుకోవాలి. ఆ షో హిట్టే అవుతుంది, తెలుగు సినిమాల్లాగా 90% ఫ్లాప్స్ తో వుండదు. రేపు ఈ శిక్షనుంచి బాండీ తప్పించుకున్నా వారసులు తప్పించుకోలేరు. చూద్దాం ఏం జరుగుతుందో. మతం, పెట్టుబడి లాంటి వన్నీ మనుషులు ఏర్పర్చు కున్నవి. మతమైనా, పెట్టుబడి అయినా, మరేదైనా, అన్నిటికీ పైనుండేది మనుషులు ఏర్పర్చని ప్రకృతే.  అది యాక్షన్ రియాక్షన్ల బిజినెస్ తో బిజీగా వుంటుంది.

***

       4. రెండో చాప్టర్లో కొడుకు జూనియర్ డానీ వస్తాడు. మిడిల్ 2 లో పనికొచ్చే హెన్రీ ని ఛూసి, పనికిరాని చెవిటి పెంపుడు కొడుకుని రైలెక్కించేసి వదిలించుకున్న డానీకి, చర్చిలో పునీతుడయ్యాక బహుమతిగా తిరిగి అదే కొడుకు. ఇప్పుడెంతో ప్రేమగా చూసుకుంటాడు. తండ్రీ కొడుకులు గతంలో సరదాగా ఆడుకున్న ఆటలు ఇప్పుడు విజువలైజ్ అవుతాయి. సడెన్ గా ఈ కొత్త డిస్కవరీ థ్రిల్ చేసి ఆనంద పరుస్తుంది మనల్ని. ఎందుకంటే బిగినింగ్ లోగానీ, మిడిల్ రెండు విభాగాల్లో గానీ, వీళ్ళిద్దరి సాన్నిహిత్యం ఎక్కడా చూపించలేదు. ఎక్కడ చూపిస్తే రక్తి కట్టి సినిమా టాప్ అప్ అవుతుందో (వేరేపదం దొరక్క టాప్ అప్ అని వాడేశాం), అక్కడ చూపించేందు కోసం ప్రత్యేకంగా అట్టిపెట్టాడు దర్శకుడు. ఇది డైనమిక్స్. మనమేం చేస్తామంటే, ఫాదర్ - ఛైల్డ్ సెంటి మెంటని అక్కడా చూపించి, ఇక్కడా చూపించి చెడగొడతాం. ఎక్కడా టాప్ అప్ అవదు సినిమా. రీఫ్రెష్ అవదు. చద్దన్నంలా పడుంటుంది.

        జూనియర్ పెద్దవాడై మేరీని పెళ్లి చేసుకుంటాడు. మేరీని ఇప్పుడు చూపించడు దర్శకుడు. చిన్నతనంలో ప్రార్ధన చేయక తండ్రి చేత దెబ్బలు తింటూ వున్న మేరీకి, నాస్తికుడైన డానీ అండగా వున్నాడు. అతను ఆల్రెడీ నాస్తికుడు, ఆమె కాబోయే నాస్తికురాలు. ఇద్దరికీ అక్కడ సరిపోయింది. గత చాప్టర్లో, చర్చి సీనులో ఇలై డానీ చెమ్డా లెక్కదీసింతర్వాత, మతంలో చేరిన అతడ్ని, బేబీ మేరీ వాటేసుకుంటుంది. ఇలా తనుకూడా డానీని ఫాలో అయి మతాన్ని ఒప్పుకుని, ఫ్యామిలీ అయిందని ఈ ఒక్క షాట్ లో కథ చెప్పాడు దర్శకుడు. దీన్ని అండర్ లైన్ చేసుకోవచ్చు టిప్ బావుంటే.

ఇప్పుడు పెద్దవాడైన జూనియర్ మేరీని పెళ్లిచేసుకున్న విషయం డానీకి చెప్పడం ద్వారా తెలియజెస్తాడు దర్శకుడు. ఇక మెక్సికోలో విడిగా వ్యాపారం చేసుకుంటానని, వాటా పంచమని జూనియర్ అంటాడు. ఇలా జూనియర్ వాటా అడిగేసరికి, డానీకి జూనియర్ బాస్టర్డ్ గా కన్పిస్తాడు. ఎవడికి పుట్టావని అంటాడు. బాస్టర్డ్ ఫ్రమ్ ఏ బాస్కెట్ అని తిడతాడు. అనాధగా దొరికితే పెంచుకున్నానంటాడు. చాలా తూలనాడుతాడు. తన జన్మరహస్యం ఇలా తెలుసుకుని షాక్ తిన్న జూనియర్, ఏమీ చేయలేక ఒట్టి చేతులతో వెళ్ళిపోతాడు.  

     తమ పొజిషనేంటో తెలుసుకోకుండా ఎవర్నీ నమ్మి పని చేయకూడదు. ఒట్టి చేతులే మిగులుతాయి. బాల్యం నుంచీ డానీయే తండ్రి అనుకున్న జూనియర్, తల్లి ఏదని అడగలేదు. అడిగివుంటే తన పొజిషన్ అప్పుడే తెలిసేది. అందుకనుగుణంగా జీవితాన్ని మల్చుకునే వాడు. డానీ మీద ఆధారపడేవాడు కాదు. ఇదేమీ తెలుసుకోకుండా డానీ పార్టనర్ గా చేస్తే పార్టనర్ గా వుండి పోయాడు. కంపెనీ అభివృద్ధికి కష్టపడ్డాడు. ఇప్పుడు  తండ్రిగా డానీ ఓకే గానీ, పార్టనర్ గా పొసగడం లేదని వాటా అడిగేసరికి, బాస్టర్డ్ అన్నాడు. కనువిప్పయి, చేసేది లేక పడ్డ కష్టమంతా వదులుకోవాల్సి వచ్చింది జూనియర్ కి.

        తండ్రిగా ఓకే అనుకున్నాడు. హెన్రీని చూసి తనని రైలెక్కించి వదిలించుకున్న కోపం, పాలల్లో లిక్కర్ కలిపి తాగించిన కసీ అన్నీ మర్చిపోయాడు జ్యూనియర్ - తిరిగి వచ్చిన తనతో, చేసిన తప్పుకి డానీ చెంప మీద కొట్టించుకోవడంతో. తండ్రిగా ఓకే అన్పించాడు అప్పట్నుంచీ డానీ.

        కానీ తండ్రిగా కూడా ఓకే కాదనీ, చిన్నప్పట్నుంచీ తనని వ్యాపారంలో ఫ్యామిలీ లుక్ కోసమే వాడుకున్నాడనీ, అలా నమ్మించడానికే చిన్నప్పుడే పార్టనర్ గా చేశాడనీ తెలుసుకోలేకపోయాడు జూనియర్. తండ్రిగా నువ్వు ఓకే అనడంలో, ఓకే కాదన్న అతడికి తెలీని సత్యమూ దాగుంది. అదిప్పుడు బయటపడింది. ఇదీ డైలాగులు రాసే కళ. ఎవ్విరీథింగ్ ఈజ్ కనెక్టెడ్. గాథతో ఎక్కడో కనెక్ట్ అయ్యే వుంటున్నాయి డైలాగులు. తెలుగులో ఈ కళ ప్రదర్శించ వచ్చా? చాలా ఇన్స్ ఫైరింగ్ గా వుంది.

        డానీ సంగతి. డానీకి ఆనాడు జూనియర్ని పార్టనర్ గా చేయడానికి కన్పించని బాస్టర్డ్, ఈనాడు వాటా అడిగేసరికి బాస్టర్డ్ లా కన్పించాడు. తనని నమ్మిన మేరీ కోసమైనా సంయమనంతో లేడు. కొడుకుని వదిలేసిన పాపంతో ప్రభువు ముందు చెంపలు వాయించుకుని మతంలో చేరిన తను, తిరిగి అదే కొడుకుని శాశ్వతంగా వెళ్ళ గొట్టేశాడు. డానీ మారలేదు, మారడు. తియ్యటి సినిమాలు, కమ్మటి హీరోయిజాలూ మనుషులెలా వుంటారో చూపించవు.

***

       5.  మూడో చాప్టర్ కల్లా చాలా కాలం గడిచిపోతుంది. డానీ అల్ట్రా  రిచ్ గా పెద్ద బంగాళాలో ఒంటరిగా వుంటూ, తాగుడు మరుగుతాడు. నిజానికి భావిజీవితం గురించి కలలు గంటూ, తమ్ముడ్ని అంటూ వచ్చిన హెన్రీకి మిడిల్ 2 లో ఏం చెప్పాడు డానీ - పెద్ద బంగాళా కట్టుకుని మనుషులకి దూరంగా జీవించాలని...అతను మనుషుల్ని మొదట్నుంచీ అసహ్యించుకుంటున్నాడు. ఇప్పుడు కోరుకున్న పెద్ద బంగాళాలోనే వున్నాడు- కోరుకున్నట్టు తను అసహ్యించుకునే మనుషులకి దూరంగానే వున్నాడు- అయితే కొడుకుని వెళ్ళ గొట్టుకుని, నా అనే వాళ్ళంటూ సైతం లేని దిక్కులేని జీవితంతో, తాగుడే తోడై...

           మనుషులతో వుండడమనేది సార్వజనీన ప్రవర్తన. ఇది కాదనుకున్నందుకు సొంత మనుషులే వుండని దిక్కులేని జీవితమైంది.  మనమేం మాట్లాడతామో ఆలోచించి మాట్లాడాలి. రైటుగా మాట్లాడితే రైటుగా రిసీవ్ చేసుకుంటుంది సబ్ కాన్షస్, రాంగ్ గా మాట్లాడితే రాంగ్ గా రిసీవ్ చేసుకుని అది మోతాదు మించి నిజం చేసేస్తుంది. ఈ మైండ్ మెకానిక్స్ గురించి ది పవరాఫ్ యువర్ సబ్ కాన్షస్ మైండ్ అన్న అరవై ఏళ్ళ నాటి ప్రసిద్ధ పుస్తకంలో చక్కగా వివరిస్తాడు డాక్టర్ జోసఫ్ మర్ఫీ.

        ఇక ఇలై ఎంటరవుతాడు. ఈ మొత్తం గాథలో యాక్షన్ జరగడానికి పాత్రలు స్వయంగా చర్యలు తీసుకోవడం లేదని గమనించాలి. ఉదాహరణకి, మిడిల్ 2 లో డబ్బులడిగితే బురదలో వేసి ఇలైని కొట్టిన డానీ మీదికి ఇలై వెంటనే పోలేదు. తర్వాత డానీయే ఖర్మరా బాబూ అనుకుని మతంలో చేరడానికి చర్చికి వెళ్ళి, ఇలైకి చిక్కి దేహశుద్ధి చేయించుకున్నాడు. అలా దేహశుద్ధి చేయించుకున్న డానీ కూడా వెంటనే వెళ్ళి ఇలైని చిత్త శుద్ధితో తన్నలేదు.

కాలమే ఒకళ్ళ ముందు ఒకళ్ళని అవసరాలు సృష్టించి వ్యూహాత్మకంగా ప్రవేశ పెడుతూ, సెట్ రైట్ చేస్తోంది. కాలమే యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లేని చూసుకుంటోంది. నిజ జీవితం ఇలాగే వుంటుంది. మనల్ని ఎవరో ఏదో అన్నాడని బదులు తీర్చుకోవాల నుకుని తీర్చుకోకుండా వుండి పోతాం. అతనే అవసరం పడి తర్వాతెప్పుడో మన దగ్గరికి వస్తాడు. అప్పుడు చూసుకుంటాం చూసుకోవాలనుకుంటే. గాథ ఈ స్కీముతో నడుస్తోంది. నిజ జీవితంలో జరిగే స్కీము. కమర్షియల్ కథల్లో చిరంజీవి వెంటనే వెళ్ళి రావుగోపాలరావుని కొట్టకపోతే రుచించదు. నిజ జీవితంలో మన చేతగానిది చిరంజీవి చేసి చూపాలనుకుంటాం. కథ యాక్టివ్ క్యారక్టర్లతో తియ్యటి డ్రీమ్ వరల్డ్ అయితే, గాథ పాసివ్ క్యారక్టర్లతో రియల్ లైఫ్. రియల్ లైఫ్ లో మనం పాసివ్ క్యారక్టర్లమే. సినిమాల్లో లాగా వెళ్ళి కొట్టలేం, సాంగేసుకోలేం .

***

      6. అలా మత ప్రచారమంటూ లోకం చుట్టిన వీరుడిగా తిరిగి తిరిగి డానీ దగ్గరికే వచ్చాడిప్పుడు ఇలై. టైమ్ ఈజ్ ది గ్రేటెస్ట్ లెవెలర్. కర్మల బాకీ తీర్చడానికి. డానీ చేతికి చిక్కాడిప్పుడు. ఆనాడెప్పుడో ప్రక్షాళన పేరుతో చర్చిలో నన్ను కొట్టావ్, ఇప్పుడు నిన్ను కొడతా టైపులో చిక్కాడు. పాస్టర్ ఇలై ఇప్పుడు కమీషన్ ఏజెంట్ అయిపోయాడు. బాండీ మనవడి భూముల్ని డానీకి అమ్మించి కమీషన్ పొందాలని. అలాగే పాత బాకీ ఐదువేలు ఇమ్మని కోరుతున్నాడు... తన కర్మల బాకీ మర్చిపోతున్నాడు...చర్చిలో చేసిన అవమానంతో ఐదు వేలు బాకీ అడిగే అర్హత కోల్పోయాడు. తానే చేసిన అవమానం తాలూకు బ్యాడ్ కర్మ బాకీ పడ్డాడు. దాన్ని అదే రూపంలో వసూలు చేసుకుంటున్నాడిప్పుడు డానీ... అయితే నువ్వు దొంగ పాస్టర్ ననీ, మతం మూఢ నమ్మకమనీ అరిచి అరిచి చెప్పుకో అంటూ.

        తప్పలేదు ఇలైకి డబ్బవసరంతో. నేను దొంగ పాస్టర్ ని, మతం మూఢ నమ్మకం అని స్లోగన్స్ ఇస్తాడు. ఇప్పుడు డానీ భూములు బేరమాడుకోవాలి. బేరమాడుకోడు. ఇలైని సర్వ భ్రష్టుడ్ని చేయాలి.  అందుకే అంటాడు, ఇంకెక్కడి భూములూస్ట్రా వేసి మిల్క్ షేక్ లా చమురంతా ఎప్పుడో తాగేశాననీ.

     అప్పట్లో బాండీ భూముల చుట్టూ ఇలై వాళ్ళ భూములే కొన్నాడు చమురు కోసం. ఆ భూముల్లో చుట్టూ బోర్లు వేసి, భూములు అమ్మని బాండీ భూముల్లో చమురంతా కూడా తోడేశాడు డానీ!

     భోరు మంటాడు ఇలై. అన్యాయం చేయవద్దని ఏడ్చేస్తాడు. మొదటి చాప్టర్లో బాండీ విజయం గురించి చెప్పుకున్నాం. డానీ చేసిన హత్యని పురస్కరించుకుని, డానీని బ్లాక్ మెయిల్ చేసి లాభపడాలనుకున్నాడు బాండీ. అలా ఆ హత్యా నేరంలో భాగస్వామి అవుతూ బ్యాడ్ కర్మ రాసుకున్నాడు  అలా బాండీ అనుకున్న ప్లాను పారి డానీకి భూముల్ని లీజుకిచ్చి లాభపడ్డాడు. ఆ బ్యాడ్ కర్మ అడ్వాన్సుగా శిక్ష రాసేసిందని కూడా చెప్పుకున్నాం. ఆ శిక్ష ఇదే...ఆల్రెడీ ఆ భూముల్లో చమురు తాగేశాడు డానీ. ఈ శిక్ష నుంచి బాండీ తప్పించుకున్నా, బాండీ చేసిన దాంతో సంబంధం లేని మనవడు తప్పించుకోలేకపోయాడు. పెద్దలు చేసే పాపాలు పిల్లలకి అంటుకుంటాయని ఇందుకే అంటారు.


           ఇక నైతికంగా, ఆర్ధికంగా పూర్తిగా పతనమై రోదిస్తున్న ఇలైని, కొట్టి కొట్టి చంపేస్తాడు డానీ. చేసిన ఒక హత్యతో దొరకని డానీ, ఈ హత్యతో దొరికిపోతూ ఐయామ్ ఫినిష్డ్ అంటాడు.

***

        ఇంత చెప్పుకున్నాక, ఇంకా ఈ నాల్గు భాగాల సుదీర్ఘ వ్యాసానికి ఉపసంహారం అవసరం లేదు. జీవితాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ దేర్ విల్ బి బ్లడ్ రూపంలో మనముందు కొచ్చిన ఈ కదిలించే గొప్ప గాథ, తెలుగులో గాథలు తీసి ఔన్నత్యాన్ని సాధించడానికేమైనా ఉపయోగపడుతుందేమోనని భావిద్దాం.

        ఈ వ్యాసాల్ని ఒకే బంచ్ గా పీడీఎఫ్ తీసి, డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలుగా అందుబాటులో వుంచమని అంటున్నారు. ఎనిమిది వేల పదాలతో, 37 పేజీల ఈ నాల్గు వ్యాసాలు, ఒక చోట కాపీ పేస్ట్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులోనే వున్నాయి.

 సికిందర్ 

3, మార్చి 2021, బుధవారం


      ప్రభుత్వం రైతు చట్టాలు తెచ్చింది. వద్దన్నారు రైతులు. బావుంటుంది, తినండి, మీ కోసమే ఈ ఫలహారం అంది ప్రభుత్వం. ఫలహారం మాకొద్దంటే తినమంటారేంటీ?’ అని ఆందోళనకి దిగారు రైతులు. ఇక రైతుల దారి రైతులది, ప్రభుత్వం దారి ప్రభుత్వానిదైంది. రైతులతో చర్చించకుండా చట్టాలు చేస్తే ఇలా వుంది. ఫంక్షన్ హాల్లో అడక్కుండా మెనూ తయారు చేసి, బావుంటుంది తినమంటే, ఇలాగే ఆందోళనకి దిగుతారు పోనీకదాని పెళ్ళికి వచ్చిన జనాలు. పాత్రలతో చర్చించకుండా కథకుడు చేస్తే ఇలాగే వుంటుంది కథ కూడా. ఈ బేసిక్స్ ని అర్ధం జేసుకోవడం లేదు కొందరు కథకులు. కథకుడు కథ నడప కూడదనీ, పాత్రల్నే కథని నడుపుకోనివ్వాలనీ ప్రాథమిక సూత్రం ఈ బ్లాగులో కీ బోర్డు అరిగి అరిగి కరిగి పోయేలాగా ఎన్నిసార్లు అ ఆలు గుర్తు చేసినా, అర్ధం జేసుకోక పోతే, ఈ బ్లాగు ఏమర్ధమవుతున్నట్టు. ఎందుకు చదువుతున్నట్టు.

        2. బేసిక్స్ నే ప్రశ్నిస్తూ వాదన కూడా. అక్షర మాల  అఆ లతో కాకుండా, ఇఈ లతో ప్రారంభమవుతుందనేలాటి వాట్సాప్ స్కూలు వాదన. ఇందాక వార్తలు చూస్తూంటే కథ రాయడానికి ఏ బేసిక్స్ ని  దృష్టిలో పెట్టుకోవాలో సరీగ్గా ఒక కామన్ సెన్సు టిప్ దొరికింది ఇది చెప్పడానికి. వార్తల్లో, ఫలానా వ్యక్తి ఫలానా విధంగా అన్నాడని వార్తలు చదువుతాడు. వ్యక్తి అనని మాటలు తను కల్పించి వార్తలు చదవడు. వార్తలు సేకరించాలంటే వ్యక్తులు ఏమంటున్నారో, ఏమనుకుంటున్నారో తెలుసుకోకుండా వార్తలు సేకరించరు. ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వ్యక్తిని అడిగి తెలుసుకుంటాడు తప్ప, వ్యక్తిని కూర్చోబెట్టి తను చెప్పెయ్యడు ఇంటర్వ్యూ కర్త. కానీ కథకుడు మాత్రం పాత్రల్ని కూర్చోబెట్టి తను రాసేస్తూంటాడు వాటి కోసం కథ.

        3. సీనంటే మరేమిటో కాదు సిట్యుయేషన్. సిట్యుయేషన్ అంటే అవసరం. పాత్రల  అవసరం. పాత్రల అవసరాలే సిట్యుయేషన్ని సృష్టిస్తాయి. పాత్రల అవసరాలు చూడకుండా, ఆ సిట్యుయేషన్ తో కథకుడు తానుగా ఇంకేదో నచ్చింది ఫీలై సీను రాసేస్తే, అది సీను అవ దు, కథకుడి అధికారమవుతుంది. సీను మీద పాత్రలకే అధికారముంటుంది.  

        4. నచ్చడాలు నచ్చక పోవడాలు కథకుడి కుండవు. పాత్రలకే వుంటాయి. కథకుడి పాయింటాఫ్ వ్యూ గాలి బుడగ. స్వతంత్రంగా కథకుడి మైండ్ కి అర్ధం లేదు. పాత్రల మైండ్ లోపలుంటేనే ఎంతో కొంత అర్ధం పర్ధం. కథలు రాసి కథకుడు మెచ్యూర్ అవడు. పాత్రల్లోపల జీవించే మెచ్యూర్ అవుతాడు. కథ మీద కథకుడికి ఏ ఆధారిటీ లేదు, పాత్రలకే వుంది. కథకుడు కథలు రాయడు, పాత్రలు అనుకున్నదే రాస్తాడు. పాత్రలు అనుకుంటున్న దాంతోనే వాదిస్తాడు. కథంటే ఇన్నర్ ఇంజనీరింగ్, కథకుడు పై పైన వేసే పూతకాదు. బయట బయట వుంటే కథకుడికి రక్షణ లేదు, గర్భస్థ శిశువుగా పాత్రల్లోపలుంటేనే తన వాదంతో రక్షణ. ప్రతీ కథతో పాత్రలు పుట్టవు. అవి ఆల్రెడీ పుట్టివుంటాయి. కథకుడే  శిశువుగా పుట్టి నేర్చుకుంటాడు.

5. సింపుల్ ఉదాహరణ. హీరోయిన్, సెకండ్ హీరోయిన్, హీరో వున్నారు. హీరో హీరోయిన్లు ప్రేమలో వున్నారు. వీళ్ళ మధ్యకి సెకండ్ హీరోయిన్ వచ్చింది. ఈమెకి తనకంటే ఎక్కువ అర్హతలున్నాయని హీరోయిన్ కి ఇన్ఫీరియారిటీ ఏర్పడింది. హీరో తనతో వుంటాడా ఈమెతో వెళ్ళి పోతాడాని అనుమానం వేసింది, వీళ్ళిద్దరూ ఒకటై తనకి అన్యాయం చేస్తారేమోనని భయం ఏర్పడింది. దీంతో హీరో తనని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో తేల్చుకోవాలనుకుంది. సెకండ్ హీరోయిన్ సమక్షంలోనే హీరోకి టెస్టు పెట్టింది. ఆ టెస్టులో ప్రాణాలు పోయే ప్రమాదం జరిగి భయపడి పారిపోయింది. పారిపోయి హీరోతో కాంటాక్టు లేకుండా ఎక్కడో దాక్కుంది. ఇక కనిపించలేదు హీరో కనుక్కునే దాకా. ఇదీ సిట్యుయేషన్.

ఇప్పుడు, హీరోయిన్ అలా ఎలా పారిపోయి దాక్కుంటుందని కథకుడు ప్రశ్నిస్తే? ప్రాణాలుపోయే ప్రమాదం జరిగితే హీరోని వదిలేసి పారిపోయి, హీరో ఏమైపోయాడో పాపమని కూడా తల్లడిల్లకుండా, హీరోని కలుసుకునే ప్రయత్నం చేయకుండా, దాక్కోవడమేమిటని కథకుడు అనుకుంటే?

అప్పుడే కెవ్వున కేకేసి ఆ ప్రమాదం నుంచి హీరోని కాపాడి, టెస్టు పెట్టిన తన అసలు ఉద్దేశం చెప్పుకుని, క్షమించమని లొంగిపోతే కరెక్టా? లేదా అలా పారిపోయినా, కలుసుకోవడానికి తల్లడిల్లుతూ ప్రేక్షకుల కంట నీరు తెప్పించాలనుకుంటే కరెక్టా? ఏది కరెక్టు?

ఈ రెండూ తానుగా ఏదో ఫీలైపోతూ పునాది లేకుండా కథకుడాలోచించడమే. పాత్ర కోసం కథకుడు తనకి నచ్చిన విధంగా ఆలోచించి పెట్టి కథ చెయ్యడమే. రెండూ తప్పే. పాత్ర మైండ్ లో కెళ్ళి అప్పుడేం ఆలోచిస్తూ వుంటుందో చూడగల్గితే కథకుడు దారిలో వుంటాడు. పాత్ర ఆలోచనలే కథ. కథకుడి ఆలోచనలు కథ కాదు. వెనుక సీన్లని కథకుడు మర్చిపోతాడేమో గానీ, పాత్ర అస్సలు మర్చిపోదు. పాత్రకి సీన్లంటే అనుభవాల శ్రేణి. ఆ శ్రేణిలోంచే నిర్ణయాలు.

హీరోయిన్ మానసిక స్థితి సీక్వెన్స్ చూద్దాం : 1. తనకి తక్కువ అర్హతలున్నాయని సెకండ్ హీరోయిన్ వల్ల హీరోయిన్ కి ఇన్ఫీరియారిటీ ఏర్పడింది, 2. హీరో తనతో వుంటాడా ఈమెతో వెళ్ళి పోతాడాని అనుమానం వేసింది, 3. వీళ్ళిద్దరూ ఒకటై తనకి అన్యాయం చేస్తారేమోనని భయం ఏర్పడింది, 4. దీంతో హీరో తనని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో తేల్చుకోవాలనుకుంది, 5. సెకండ్ హీరోయిన్ సమక్షంలోనే హీరోకి టెస్టు పెట్టింది... టెస్టుకి దారి తీసిన కారణాలు కార్యకారణ సంబంధంతో వరస క్రమంలో- ఇన్ఫీరియారిటీ, హీరో మీద అనుమానం, వాళ్ళిద్దరంటే భయం, భయనివృత్తి నిర్ణయం...

ఇలా క్రమంగా ఆమె వాళ్ళిద్దరంటే భయపడే స్థితికి వచ్చింది. టెస్టు పెట్టినప్పుడు ఏం తేలుతుందో నన్న భయం. టెస్టులో వూహించని విధంగా ప్రమాదం జరిగి భయం రుజువైపోయింది. హీరో టెస్టు ఇష్టం లేక
, వాళ్ళిద్దరూ కలిసి ప్రమాదం జరిపి తనని అడ్డు తొలగించు కోవాలకున్నారనీ ప్రాణ భయంతో పారిపోయింది. కనపడకుండా దాక్కుందంటే వాళ్ళంటే ప్రాణ భయంతోనే. దీనికంతటికీ మూలం - ట్రిగ్గర్ పాయింట్- డ్రైవింగ్ ఫోర్స్- ఏదై తే అది- తనకి తక్కువ అర్హతలున్నాయని అనుకోవడమే. ఈ సెటప్ కి పే ఆఫ్ ప్రమాదం.  

అప్పుడు ఇదంతా వదిలేసి, హీరోయిన్ తన మానసిక స్థితిని శుభ్రంగా తుడిపేసుకుని, ఎలా తల్లడిలుతూ వచ్చి ఇంకా హీరోనే ప్రేమిస్తున్నట్టు క్షమాపణ అడిగి సెటిలై పోతుంది? అది పాత్రేనా, ఎవడు పడితే వాడు కూర్చునే చబూత్రానా? వాళ్ళు చంపాలనుకున్నప్పుడు హీరోకి తన మీద ప్రేమే లేదని తేలిపోయాక? పాత్ర మైండ్ లోకి వెళ్ళి, ఏది ఎందుకాలోచిస్తోందో చూసే ఓపిక వుంటే, సీన్లు సరీగ్గా వస్తాయి. పాత్రలకి వాటి భావస్వాతంత్ర్యంతో కొనసాగే ప్రజాస్వామ్యాన్నివ్వాలి, కట్టడి చేసే నియంతృత్వం కాదు.

 6. కథ మీద ఆర్నెల్లు కూర్చున్నా, ఏడాది కూర్చున్నా, పాత్రల్లోపల గంటైనా కలిసి కూర్చున్నారా లేదా అన్నది పాయింటు. పాత్రలు సృష్టించుకునే కథాప్రపంచంలో కథకుడు పాత్రలు జరుపుకునే ఉత్తరప్రత్యుత్తరాలకి  కేవలం పోస్టు మన్ లాంటి వాడే తప్ప ఇంకో మహావీరుడు కాదు.

        7. కథ ఎంతవరకూ వచ్చిందని వాకబు చేయకుండా, పాత్రలెంతవరకూ వచ్చాయని వాటి ప్రోగ్రెస్ అడగడం రిలేటెడ్ గా వుంటుంది. కథతో కథకుడు అంతర్ దృష్టితో వుండడానికి.

8. టిప్స్ సీరియస్ అవుతున్నాయి కాబట్టి కాసేపు లైట్ గా... దర్శకుడు పెట్టింది కథకుడు తినడం కాక, కథకుడు పెట్టిందీ దర్శకుడు తినడం గాక, పాత్రలు పెట్టింది ఇద్దరూ కలిసి విందు చేసుకోవాలి. పక్కన ఒక బాటిల్ వుంచుకున్నా ఫర్వా లేదు.

9. బాటిల్ చేసే పని ఇంతా అంతా కాదు. కథకుడ్ని డబ్బులిచ్చేశాంగా రాస్తాడులే అన్నట్టు గాకుండా - బాటిల్, సిగ్గీ ప్యాక్ వంటి మంగళ ద్రవ్యాలు కూడా పెట్టి పంపిస్తూంటే, ఇంట్లో కూర్చుని తనలోని రెండో మనిషిని లేపుతాడు. అప్పుడు చచ్చినా కథలోకి వెళ్ళలేడు. పాత్రల్లోకే పరకాయ ప్రవేశం చేసి వాటితో విహరిస్తాడు. తెల్లారి వచ్చి తను కను గొన్న అమృత విషయాలు వెల్లడిస్తాడు. రెండో మనిషి కంట్రిబ్యూషన్ ఇంతా అంతా కాదు. టీంలో ఇంకొక మెంబర్ని ఫ్రీగా యాడ్ చేస్తాడు కథకుడు.

10. నటులు పరకాయ ప్రవేశం చేస్తారు కాబట్టే నటించగల్గుతారు. కథకుడు పరకాయ ప్రవేశం చేస్తే రాయగల్గుతాడు. అసలు కథకులు యాక్టింగ్ కోర్సు కూడా చేసి రావాలంటాడు ఒక హాలీవుడ్ అతను.

11. ఇప్పుడు సీరియస్... ప్రేక్షకులిప్పుడు ఎదిగిపోయారు. వాళ్ళతో పోటీ పడాలి. ఇంకా రెండు మూడేళ్ళ  క్రితం రాసుకున్న కథలతో ప్రయత్నాలు వృధా. అవి మూలన పడేసి, మారిన కొత్త బిజినెస్ మాడెల్ తో ఇప్పుడు రాసుకునే కథలు, రెండు మూడేళ్ళకైనా పనికొస్తాయి. సినిమా అనేది ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో మారిపోయే బిజెనెస్. ఈ బిజినెస్ లో పాత్రల్ని అమ్మగల్గాలే గానీ కేవలం కథల్ని కాదు.

        12. మాటలు పాత్రల నోటి నుంచి రావాలి. ముద్ద చేసి పాత్రల నోట్లో పెట్టడం కాదు. పాత్రలు సృష్టించుకునే కథని పాత్రలే అనుభవిస్తాయి. వాటి మాటలు కథ గురించే వుంటాయి. పాత్రలనుభవిస్తున్న కథ లోంచే మాటలు వస్తాయి. ఏ మాట చెప్పినా అది కథతోనే రిలేటెడ్ గా వుంటుంది. ఈ సైన్సు కోసం  దేర్ విల్ బి బ్లడ్ చూడొచ్చు.


సికిందర్