రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, జనవరి 2020, శనివారం

నాటి సినిమా!

దేశం దుర్మతుల పాలయినప్పుడు, అమాయకులు అన్యాయాలకి బలౌతున్నప్పుడు, ధర్మానికి తానే  రాజు అయి, న్యాయానికి తానే బుద్ధి అయ్యి, ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అని ఆ గీతాచార్యుడు సాకార రూపంలో ఈ లోకాన అవతరిస్తాడు. ఆ రూపం ‘బొబ్బిలి పులి’ అయినప్పుడు,  ఆ ప్రక్షాళనా  శతఘ్నులు భళ్ళున భళ్ళున అగ్ని వర్షాలు కురిపిస్తాయి!
          ఎస్, ఇందుకే కనక వర్షం కురిసింది!

        స్ట్రాంగ్ క్యారెక్టర్.. స్ట్రాంగ్ స్టోరీ.. చివరికి  ఇవన్న మాట సినిమా సిల్వర్ జూబ్లీ  అవడానికి మూలస్థంభాలు! సినిమా అంటే ఇప్పుడొస్తున్న  పాసివ్ పాత్రలతో పేలవమైన కథనాలతో చుట్టేసే క్రేజీ కాంబినేషన్ల ప్రదర్శన కాదు. డాక్టర్ ఎన్టీ రామారావు - డాక్టర్ దాసరి నారాయణ రావుల కాంబినేషన్ ఇలాటిది కాలేదు. వాళ్ళ బాధ్యతాయుతమైన భాగస్వామ్యంలో  ‘బొబ్బిలిపులి’ అనే పరాకాష్ట ధూర్తజనులకి కొరడా చరుపైంది. అవినీతిని ఏదో లంచం రూపంలో చూపించేసి, చంపడం వేరు. అవినీతి వల్ల భౌతిక నష్టతీవ్రతని పెంచి చూపించి, శత్రువుని వధించడం పూర్తిగా వేరు. మొదటిది ( లంచం ) ప్రేక్షకులు తేలిగ్గా తీసుకున్నే నిత్య వ్యవహారమే. రెండోది ( ప్రాణ నష్టం, ఆస్తి నష్టం) మాత్రం సీరియస్ గా పట్టించుకోవాల్సిన పవర్ ఫుల్ వ్యక్తీ కరణ అవుతుంది. ఇందుకే ‘బొబ్బిలిపులి’ ది  పవర్ఫుల్ స్టోరీ అయింది. ఇందుకే ‘బొబ్బిలి పులి’  ఎన్టీఆర్  నట జీవితానికో కుదుపు నిచ్చిన బ్లాక్ బస్టర్ మాత్రమే కాలేదు, అంతలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ఉత్తరీయమిచ్చిన ఉపాఖ్యానం కూడా అయింది.

        ‘బొబ్బిలి పులి’  అనే నాణేనికి ఇలా రెండు ముఖా లేర్పడ్డాయి. ఇందుకు ఉత్తరాది పాత్రి కేయ బృందమూ సాక్ష్యమే. ఓ వైపు ఊరూరా ప్రభంజనం సృష్టిస్తున్న ఎన్టీఆర్ చైతన్య రథ యాత్రా విశేషాల్ని కవర్ చేస్తూనే, మరో వైపు మారు మూల పల్లెల్లో క్రిక్కిరిసిన థియేటర్ లలో ‘బొబ్బిలిపులి’  బాక్సాఫీసు గాండ్రింపుల్ని సైతం  లోకానికి చాటిన చరిత్రా వుంది.

        అపూర్వంగా  ఎన్టీఆర్ నటించిన  ఈ శక్తిమంతమైన పాత్ర తప్ప, మరింకో చర్చనీయాంశం సాక్షాత్తూ షెర్లాక్ హోమ్స్ వచ్చి తన ట్రేడ్ మార్క్ భూతద్ధం పెట్టి గాలించినా ఈ సినిమాలో దొరకదు. కాబట్టి ఒక పాత్ర బలంగా ఎదగడానికి ఏవి దోహద పడతాయో, తెలుసుకోవడమే  మనకి ముఖ్యాంశ మవుతుంది.

        సినిమాల్లో కథే పాత్రని నడిపితే అది  నసపెట్టే పాసివ్ పాత్రవుతుంది. పాత్రే కథని నడిపిస్తే అప్పుడది యాక్టివ్ పాత్ర,  లేదా స్ట్రాంగ్ క్యారెక్టర్ అవుతుంది. స్ట్రాంగ్ క్యారెక్టర్ కి వ్యక్తిగత ఆశయమే వుంటే,  అది అంతవరకే  పరిమితమైన దాని సొంత కథవుతుంది. ఇంకో మెట్టు పైకెళ్ళి ఇతరుల సమస్యల్ని పట్టించుకుంటే అప్పుడది సామాజిక కథగా, పాత్రగా ప్రమోటవుతుంది. మరింకో మెట్టు పైకి చేరుకుని అంతర్జాతీయ సమస్యని తలకెత్తుకుంటే, అప్పుడు విశ్వజనీన కథగా, పాత్రగా పదోన్నతి పొందుతుంది. మరింకో మెట్టు పైకి చేరుకుని అక్కడ పారలౌకిక అంశాల్ని స్పృశిస్తే,  భక్తి లేదా ఆథ్యాత్మిక కథగా, పాత్రగా పరమోన్నతమవుతుంది. కథల, పాత్రల గౌరవ ప్రపత్తులు ఈ ఆరోహణా క్రమంలో వుంటాయి. మెట్లెక్కే కొద్దీ  పెరుగుతూంటాయి.

        1982 లో విడుదలై అఖండ విజయాన్ని సాధించిన ‘బొబ్బిలిపులి’  లో ఎన్టీఆర్ పోషించిన మేజర్ చక్రధర్ పాత్ర  పై ఆరోహణా క్రమంలో రెండో స్థానాన్ని అలంకరిస్తోంది. ఇతరుల సమస్యల్ని పట్టించుకుంటూ సామాజిక పాత్ర అయింది. దుష్టులు ధర్మాన్ని చె రబట్టడం ప్రపంచ వ్యాప్త సమస్యే. దీనిమీద సామాజిక బాధ్యతతో తిరగబడ్డ చక్రధర్  విశ్వ జనీన ఆశయంతో ప్రతీ ఒక్కర్నీ అందుకే కదిలించ గలిగాడు. సినిమాల్లో కనీసం అయిదు కదిలించే సన్నివేశాలుంటే  విజయం ఖాయమని  నటి ఇంగ్రిడ్ బెర్గ్ మాన్ చెప్పినట్టు మూడు  ఆస్కార్ ల రచయిత విలియం గోల్డ్ మాన్ తన పుస్తకంలో రాశాడు. ఐదేం ఖర్మ, అరడజనుకి పైగా కుదిపివేసే సన్నివేశాలు కొలువు దీరాయి ‘బొబ్బిలిపులి’ లో.

      పాజిటివ్ సహిష్ణుతతో మేజర్ చక్రధర్ తన వాళ్ళ పట్ల ఔదార్యం వహించే ప్రతీ  మలుపూ కదిలించే సంఘటనే! అదే పాజిటివ్ సహిష్ణుత రీత్యా నిస్పృహ కి లోనవకుండా, ఆత్మ స్థయిర్యమూ కోల్పోకుండా, ప్రజా కంటకుల మీద దండయాత్ర చేసినప్పటి ప్రతీ ఘట్టమూ  కదిలించే సంఘటనే! 

        ఇలా పరస్పర భిన్నమైన అంతర్గత, బహిర్గత ఆశయాలుండబట్టే  మర్చిపోలేని సజీవ పాత్రయ్యాడు. ఇది యాక్షన్ సినిమాయే అయినా ఇందులో పాత్ర వ్యక్తిగత జీవిత చిత్రణకి కూడా ( దాదాపు 50 సీన్లు) ప్రముఖ స్థానముంది. మనం డబ్బు సంపాదన అనే యాక్షన్లో పడిపోయి  వ్యక్తిగత  జీవితాన్నిపట్టించుకోం. దీని ఫలితాన్ని మానసిక రుగ్మతల రూపంలో అనుభవిస్తున్నాం. జీవించడానికి బయట యాక్షన్ తో బాటు, ఇంటి మీద కాస్త ఎఫెక్షనూ అంత ముఖ్యమే. ఈ సంగతి పైకి చెప్పకుండా అన్ కాన్షస్ గా సైకో ఎనాలిసిస్ చేసేదే పవర్ఫుల్ పాత్ర. కాకి కేం తెలుసు సైకో ఎనాలిస్ అన్నాడో కవి. చరిత్రలో నిలచిపోయిన కొటేషను. కాకి సంగతేమో గానీ, మన టైంపాస్ తెలుగు సినిమా  పాత్రలు కూడా సైకో ఎనాలిస్  చేయగలవని మేజర్ చక్రధర్ నిరూపిస్తున్నాడు.

        సెలవు మీద ఊరొచ్చిన సైనికుడతను. ఇక్కడ ప్రేమించినమ్మాయి ( శ్రీదేవి) తో పెళ్లను కుంటోండగానే  సైన్యం నుంచి అర్జెంటుగా పిలుపు! ఆ పిలుపందుకుని పెళ్లి కంటే దేశ రక్షణే ముఖ్యమనుకుని వెళ్లి పోతాడు. అంతలో తల్లి అస్తమించిన వార్త. విధి నిర్వహణలో తల్లి ఋణం కూడా తీర్చుకోలేని దైన్యం. ఎలాగో ఊరొస్తే, చెల్లెలి (అంబిక)  తొందరపాటు ఫలితంగా కుండ మార్పిడి పెళ్ళిళ్ళు తప్పవు. అసలు ప్రేమించినమ్మాయిని పెళ్లి చేసుకోలేని బాధని కూడా దిగమింగుకుని, మతిస్థిమితం లేని ఈ భార్య (జయచిత్ర) తో రాజీ పడి,  ఇక విధి నిర్వహణకి తిరుగు ప్రయాణమవబోతూంటే, నడిరాత్రి నగరంలో దుష్ట త్రయం (సత్యనారాయణ, రావు గోపాలరావు, రాజనాల)  దగుల్బాజీ తనం నగ్నంగా కళ్ళబడుతుంది!

        ఇక దేశ సరిహద్దుల్లో కాదు విధి నిర్వహణ, ఈ దేశం నడిబొడ్డునే అని కళ్ళు తెర్చి సమరభేరి మోగిస్తాడు దుష్టజాతి మీద! 

      ఇలాటి సైనికుల కథల్లో  రొటీన్ గా కొన్ని స్టాక్ సీన్లు వుంటాయి. వాటిలో ముఖ్యమైనది సరిహద్దులో డ్యూటీ చేస్తూ ప్రియురాలి నుంచి ఉత్తర మందుకోవడం. అలనాటి హీరో బాలరాజ్ సహానీ లా ‘హకీఖత్’ లో   ‘హోకే  మజ్బూర్ హమే ఉస్నే బులాయా హోగా’ అని తల్చుకుని పాట పాడుకోవచ్చు. లేదా జేపీ దత్తా ‘బోర్డర్’  లో లాగా ‘సందేశే ఆతే హై  హమే తడ్పాతే హై’ అని కూడా పాడుకోవచ్చు. మేజర్ చక్రధర్ కూడా ఇలాటి లేఖే ప్రేమించినమ్మాయి నుంచి అందుకుని  ‘ఇది ఒకటో నంబరు బస్సూ’  అని ఎంటర్ టైన్ చేస్తాడు.

        ఇలాటి రోమాంటిక్  హీరో జ్వలిత హృదయుడు అవడానికి రెండు బలమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒకటి, సమాజ ద్రోహులు గోడౌన్ లో చక్కర నిల్వల్ని తరలించుకుపోయి అగ్ని ప్రమాదం సృష్టించే  సంఘటన. ఇది ఎప్పుడో రాజేష్ ఖన్నాతో మన్మోహన్ దేశాయ్ తీసిన ‘రోటీ’ లో రేషన్ డీలర్ జీవన్ దాచేసిన సరుకుని సింపుల్ గా పట్టుకోవడం లాంటి సాత్విక సంఘటన కాదు – చాలా నీచమైన తామసిక సంఘటన! 

        ఒక నేరాన్ని దాచడానికి నిప్పెట్టి ఇంకో దుర్మార్గం చేసే రాక్షస చర్య.  అవినీతి అనగానే ఓ లంచం పుచ్చుకునే  సీనుతో సరిపెట్టేసే  సాదా కథనం కాదు. ఆ అవినీతి దుష్పరిణామంగా నష్ట తీవ్రతని భౌతికంగా చూపించే మేజర్ సీను. ఇందుకే దీంతో తలపడి కోర్టులో నిరూ పించలేక, చక్రధర్ పడే వేదన - విజువల్ గా నష్ట తీవ్రతని  చూసి చలించిన ప్రేక్షకులు కూడా అంత ఆవేశంతో రగిలిపోవడానికి వీలయ్యింది.

        ఇలా అమాయక ప్రజల ఆస్తి నష్టానికి కారణమయ్యీ, కోర్టులో దుష్టులు తప్పించుకుంటే, రెండోసారి ప్రాణ నష్టం చూస్తాడు చక్రధర్. ఇదింకా బలమైన సంఘటన. రోడ్డుపక్క నిద్రపోతున్న అభాగ్యుల మీదికి  తాగిన మైకంలో కారు తోలిన దుర్మార్గం కూడా కళ్ళెదుటే కోర్టులో వీగిపోతుంది!

        దీంతో తిరగబడతాడు చక్రధర్. కోర్టులోనే అవినీతి యంత్రాంగాన్ని పట్టుకుని చితకబాది చితకబాది  వదుల్తాడు. కిష్కింధ అవుతుంది కోర్టు.

        ఫిలిం ఈజ్ బిహేవియర్ అంటారు స్క్రీన్ ప్లే పండితులు. పాత్రంటే ఏంటి?  సంఘటనని సృష్టించేది. మరి సంఘటనంటే? పాత్రకి వన్నెచేకూర్చేది...అని అంటాడు 19 వ శతాబ్దపు ప్రసిద్ధ నవలా రచయిత హెన్రీ జేమ్స్.  మనుషులు నాల్గు భౌతిక తత్త్వాల ( అగ్ని, భూమి, వాయు, జల౦) తోనూ, మూడు మానసిక తత్త్వాల ( చర, స్థిర, ద్విస్వభావాలు) తోనూ ఉంటారని అంటారు ప్రాచీన శాస్త్రకారులైన పరాశరుడు, వరాహ మిహిరుడు ప్రభృతులు.

      ఈ పైవన్నీ క్రోడీకరించుకుని,  రక్తమాంసాలతో సజీవంగా అవతరించిందే మేజర్ చక్రధర్ పవర్ఫుల్ పాత్ర!

        కోర్టు లో తిరగబడి ఇలా ప్రకాశించిన చక్రధర్, ఇక బొబ్బిలిపులియై కొండ కోనల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని  ప్రజా ద్రోహుల్ని బంధించి హతమారుస్తూంటాడు. ఇదంతా యమలోకం వాతావరణాన్ని స్ఫురింపజేస్తుంది. తనేమో యమధర్మ రాజు, అనుచరులు యమ భటులు, వాళ్ళు పట్టుకొచ్చే జీవులు పాపులు. వాళ్ళకి కఠిన శిక్షలు. మరణ శిక్షలు.

        ప్రపంచ పురాణా లన్నిటినీ కూలంకషంగా పరిశోధించడానికే  జీవితాన్నంతా వెచ్చించిన గ్రేట్ జోసెఫ్ క్యాంప్ బెల్ -  ఓ చిన్న జోకు అయినా, మహా గొప్ప ఫిక్షన్ అయినా అన్నిటి మూలాలూ పురాణాల్లోనే ఉన్నాయని అంటాడు. అందుకే ఒక కల్పిత పాత్రలో వివిధ పురాణ పాత్రల కోణాలూ  కనిపిస్తాయనీ పేర్కొంటూ- ‘ది హీరో విత్ ఎ థౌజండ్ ఫేసెస్’ అన్న ఉద్గ్రంథాన్ని రచించాడు. సశాస్త్రీయంగా ఇలాటి మిథికల్ క్యారెక్టరే మేజర్ చక్రధర్ కూడా! 

        నవలా పాత్రలాగా సినిమా పాత్ర డైలాగులతో కథ నడపలేదు. చేతలతో నడిపితేనే చెల్లుబడి అయ్యేది. చేతలన్నీ  అయ్యాకా మాటలతో ఎంతైనా నడపొచ్చు. ఇలాటి మేకప్ ఉండబట్టే క్లయిమాక్స్ లో చాలా సుదీర్ఘమైన  ఆ వాదోపదావాలతో కూడిన కోర్టు సీనుని విగు పుట్టించకుండా డైలాగులతో లాక్కు రాగలిగాడు చక్రధర్. పైగా తన వాదపటిమకి తగ్గట్టు కథనంలో మొదటి మలుపు ( ప్లాట్ పాయింట్- 1)  దగ్గర స్థాపించిన సమస్య ( ప్రాణ నష్టం) కూడా అంత బలంగానూ వుంది. ప్లా పా- 1 దగ్గర సమస్య ఏర్పాటు బలంగా వుంటే దాంతో పోటీ పడుతూ ఆటోమేటిగ్గా క్లయిమాక్స్ కూడా బలంగా వచ్చేసినట్టే. ఇలాటి కథా పథకం బలం వల్లే సినిమా మొత్తం మీద చివరి కోర్టు సీనుని అంత హైలైట్ గా మార్చగలిగాడు చక్రధర్. 

      అతడి వాదం ఒక్కటే. ఒకే కేసులో ఒక కోర్టుకీ దాని పై కోర్టు కీ పొంతన లేని తీర్పు లేమిటి? శత్రువుని సైనికుడు సరిహద్దులో చంపితే  సత్కారమా? అదే దేశం లోపల నేరస్థుల్ని వధిస్తే మరణశిక్షతో ఛీత్కారమా? నిజంగా సైనికుడు దేశాన్ని ఎప్పుడు కాపాడినట్టు? మర లాంటప్పుడు ఈ మరణశిక్ష తన కెందుకు విధించినట్టు?

        యంత్రాంగం సమాధానం ఇవ్వలేని లేని ప్రశ్నలు.  దేశం మొత్తం మీద ఒక్క సైనిక జవాను మాత్రమే వేయగల కఠిన ప్రశ్నలు. 

        అతడి ఆవేదన మాత్రమే గొప్పది. 

        ప్రాణాల్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడు కొస్తూంటే, పందికొక్కులు దేశంలోపల సర్వ వ్యవస్థల్నీ నాశనం చేస్తున్నాయి.

        స్ట్రాంగ్ క్యారెక్టర్ కి నషాళాన్నంటే అంతే స్ట్రాంగ్ స్టోరీ!

        ఈ పాత్ర చిత్రణతో  తెరమీద మహానటుడు ఎన్టీఆర్ ప్రేక్షకులకి ఊపిరి సలపనీయడు. తెరవెనుక సూత్రధారి దాసరి కూడా కళ్ళు తిప్పుకోనివ్వడు.

        తెలుగు ప్రజల సాంస్కృతిక, రాజకీయ భావజాలాల మీద ‘బొబ్బిలిపులి’ ది చెరగని ముద్ర!


- సికిందర్

(2009- ‘సాక్షి’)
http://www.cinemabazaar.in/

       

15, జనవరి 2020, బుధవారం

909 : రైటర్స్ కార్నర్



                          క్లిఫ్ డార్ఫ్ మాన్ - హాలీవుడ్ హిట్  ‘వారియర్’  స్క్రీన్ ప్లే రచయిత...ఈ మూవీ హిందీలో ‘బ్రదర్స్’ గా అధికారిక రీమేక్ అయింది. ఈ రిమేక్ తో క్లిఫ్ కి రచనాపరంగా ఏ సంబంధం లేకపోయినా, ‘వారియర్’ రచయితగా ఆయన క్రిస్ నిటెల్ కిచ్చిన ఇంటర్వ్యూని ఈ సందర్భంగా ప్రచురిస్తున్నాం...
వారియర్’ తో మీ అనుభవం చెప్పండి?
          ‘వారియర్’ 2011 లో విడుదలయ్యింది. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రపంచాన్ని ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ చేసి చూపించాం. ఈ స్క్రిప్టు పని పూర్తయి షూటింగ్ కూడా పూర్తయ్యాకా విడుదల తేదీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఈ లోగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మె కారణంగా నా మరో స్క్రిప్ట్ అమ్ముడుపోక ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డాను. నా సేవింగ్స్ అన్నీ ఖర్చయిపోయాయి. కారూ ఇల్లూ కూడా పోయి పూర్తిగా దివాళా తీశాను. ఇంకో ఆరు నెలలకి గానీ ‘వారియర్’  విడుదల కాలేదు. అది విడుదలయ్యాక తిరిగి నా ఆర్ధిక పరిస్థితి మెరుగు పడింది.
మీరు రాసిన మొట్టమొదటి కథ?
          నవల. అప్పుడు నాకు పదకొండేళ్ళు. పెన్నుతో కాగితాల మీద రాసుకుని ఆ 50 పేజీలనీ ఫైల్ చేసి పెట్టుకున్నాను. అది తర్వాత చెదలు పట్టిపోయింది.
మీ కళాతృష్ణకి ఎలాటి సినిమాలు, లేదా కథలు మీకు స్ఫూర్తి నిచ్చేవి?
          మొదట్నించీ గ్రీకు పురాణాలంటే ఇష్టం. ఇప్పటికీ వాటికి ప్రభావితుణ్ణి అవుతూనే వుంటాను. ఆ తర్వాత క్లాసిక్ లిటరేచర్ వైపు, క్లాసిక్ సినిమాలవైపూ ఆసక్తి పెరిగింది. నా జీవితంలో నేనేం కావాలో నిర్ణయించుకోవడానికి ఒకే ఒక్క సినిమా చూశాక తెలిసి వచ్చింది. ఆ సినిమా ‘బ్లడ్ సింపుల్’. ఈ సినిమా చూశాక ఇలా రాస్తే సినిమా ఫీల్డులో అగ్ర స్థానానికి చేరుకోవడం సాధ్యమేనని అన్పించింది. ‘ఫౌంటెన్ హెడ్’ నవల చదివినప్పుడు కూడా నాకిలాటి ఫీలింగే కలిగింది.
ఒక అనామక రచయిత తన స్క్రిప్టు  వెలుగు చూడాలంటే ఏం చేయాలంటారు?
          ఇలా చెప్తే సిల్లీగా ఉండొచ్చు- కానీ ఏదైనా బ్రహ్మాండమైన స్క్రిప్టు  రాస్తే అది తప్పకుండా వెలుగు చూస్తుంది. ఎలా వెలుగు చూస్తుందో వివరించలేను గానీ, వెలుగు మాత్రం చూస్తుంది. ఐతే ముందుగా తను ఏ బ్రాండో తెలుసుకోవాలి. ఆ బ్రాండ్ తో తను రాసిన దానికి దగ్గరగా వుండే అలాటి రచయితల్నిగానీ, దర్శకుల్ని గానీ, నిర్మాతల్ని గానీ ఫాలో అవుతూ వుండాలి.  వీళ్ళకి దగ్గరయ్యే  మార్గాలని అన్వేషించాలి. నేటి డిజిటల్ యుగంలో ఇదేం కష్టం కాదు. నేను స్ట్రగుల్ చేస్తున్న కాలంలో ప్రీమియర్ షోలలో చొరబడి సినీ ప్రముఖుల్ని పలకరించే అవకాశం తీసుకునే వాణ్ణి. రైటర్ గా ఇతరులకంటే తనెలా ప్రత్యేకమైన వాడో, ఏ నిర్మాతయినా తన స్క్రిప్టుని ఎందుకు ఓకే చేయాలో చెప్పగలిగి వుండాలి. వాణిజ్య రంగంలో యూ ఎస్ పీ(యూనిక్ సెల్లింగ్ పాయింట్) అని వస్తువులకి వాటిదైన ప్రత్యేకత ఒకటి వుంటుంది. అలాటి యూ ఎస్ పీ తన కేమిటో రైటర్ తెలుసుకోవాలి. అది తనదైన ఒక వాయిస్ అవుతుంది - లేదా శైలి అయి వుంటుంది. సొంత వాయిస్. మరొకరికి అనుకరణ కానిది.
ఏ జీవితానుభవాలు మీ పాత్రలపై ప్రభావం చూపుతాయి?
         
ప్రతీ అనుభవం కూడా. ప్రతీ వ్యక్తితో అనుభవం కూడా. ఒక్కక్షణం అలా కలిసి వెళ్ళిపోయినా సరే, అది కూడా పనికొచ్చే అనుభవమే. నా కుటుంబ సభ్యులతో, మిత్రులతో, బయట ఇతరులతో అన్నీ పనికొచ్చే అనుభవాలే. నేను రాస్తున్నప్పుడు ఏదీ నాకు వ్యర్ధ పదార్ధం కాదు. బహిరంగ ప్రదేశాల్లో కూర్చుని ఇతరులు అనుకునే మాటల్ని వింటాను. అవి ఆసక్తి కరంగా వుంటే రికార్డు చేసుకుంటాను. లేదా నోట్ చేసుకుంటాను. సహజంగా దొర్లే జనం భాష ఇంటలెక్చువల్ గా ఏమీ వుండదు గానీ, ఆ మాటలు లోతుగా ఎక్కడో తాకుతాయి. నేనేం విన్నా, చదివినా నేను రాస్తున్న పాత్రలకి ఎలా అన్వయించాలా అని ఆలోచిస్తాను.
మీ క్యారక్టర్ డెవలప్ మెంట్ ప్రాసెస్ ని వివరించండి?
         
నేనెప్పుడు రాయడానికి కూర్చున్నా దేవుడు నాకు మార్గం చూపించాలని ప్రార్ధిస్తాను. నా అనుభవాల భాండాగారంలో కెళ్ళి క్యారక్టర్స్ ని చూపించమని అడుగుతాను.
.క్యారక్టర్  బయోగ్రఫీలు రాసుకుంటారా?
          రాయను, క్రియేట్ చేసుకుంటాను
మీరు క్రియేట్ చేసే క్యారక్టర్ లతో మీరు ఎమోషనల్ గా ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు?
          ప్రాసెస్ లో ఇది చాలా కఠినాతి కఠినమైన పని. టార్చర్ కూడా. నేను రాస్తున్నంత కాలమూ ఎన్ని క్యారక్టర్స్ వుంటే వాటన్నిటి  ప్రపంచాల్లో జీవిస్తూ వుండాల్సిందే.


 గొప్ప క్యారక్టర్ ని సృష్టించాలంటే దేన్ని  ప్రాతిపదికగా తీసుకోవాలంటారు?
          జీవితానుభవాన్ని. మనుషుల అసంకల్పిత చర్యల్ని. ఆహారపు టలవాట్లని. ఫిజికల్ బిజినెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనమెప్పుడూ చేసే పనుల ద్వారా మన మనసేమిటో బయట పెట్టేస్తూంటాం. ఈ డైకాటమీ- ఆలోచనకీ  చేతకూ మధ్యన వుండే సంబంధాన్ని పరిశీ లిస్తూంటాను- దాన్ని ఎక్స్ ప్లాయిట్ చేస్తాను. నేను సృష్టించిన ఒక స్త్రీ పాత్ర ఆందోళనకి గురయినప్పుడు బొటన వేలుని గట్టిగా పట్టుకుని మెలి తిప్పడమనే డైకాటమీని రాశాను.

రాసే ముందు అవుట్ లైన్ వేసుకుంటారా?
          కొన్నిసార్లు వేస్తూంటాను. కానీ అది నా కిష్టముండదు. అయితే కొన్ని రకాల కథలకి అవుట్ లైన్ అవసరమే.

స్ట్రక్చర్ గురించి మీ అభిప్రాయం?
          అది టెక్నికల్. కొంతవరకూ తప్పనిసరిగా అవసరమే. ఐతే దాన్ని ఎగేసే మార్గాలు ఎప్పుడూ వుంటాయి. నా మైండ్ లో కథకి ఓ బిగినింగ్, మిడిల్, ఎండ్ లేమిటో ముద్రపడి పోయాక, ఆకథని నేనెలాగైనా చెప్పగలను. అది వర్కౌట్ అయితే అది చెప్పడానికి నేనేంచుకున్న స్ట్రక్చర్ ప్రధానమే కాదు. ఇందుకే నేను నవలల్ని నేనెక్కువ ఇష్టపడతాను. అవి స్ట్రక్చర్ లో ఇరుక్కుని వుండవు.

మీరు అభిమానించే సినిమాలు ఏ  స్ట్రక్చర్స్ లో ఉన్నాయంటారు?
          దేనికవే ..అయితే ’గుడ్ ఫెల్లాస్’  స్ట్రక్చర్ ని నేనిష్ట పడతాను. థర్డ్ యాక్ట్ ప్రారంభం దగ్గర  లేదా, సెకండ్ యాక్ట్ ముగింపు దగ్గర్నుంచి ఆ సినిమా ప్రారంభమవుతుంది. అక్కడ్నించీ బయల్దిరిన చోటుకి తిరిగి వస్తుంది. అక్కడి నించీ ఎండ్ వరకూ కంటిన్యూ అవుతుంది. ఎన్నిరకాల స్ట్రక్చర్స్ వున్నా నేను బాగాలవ్ చేసేది  ‘పల్ప్ ఫిక్షన్’  స్ట్రక్చర్ని. అది చాలా బ్రిలియెంట్ స్ట్రక్చర్.

మీ క్యారక్టర్ లు ఎప్పుడైనా వాటి గురించి అవి మాట్లాడుకోవడం జరుగుతుందా?
          అవి తమలో తాము మాట్లాడుకుంటాయి- లేకపోతే వాటికి నేను అన్యాయం చేసినట్టే.
మీకు డైలాగులు ఈజీ గా వచ్చేస్తాయా- లేక బాగా కష్ట పెడతాయా?
          ఏ డైలాగూ అంత ఈజీగా రాదు. బాధాకరమైన ప్రాసెస్ అది.

పాత్రలు వివరణలు ఇచ్చుకోవడాన్ని మీరెలా నివారిస్తారు?
          నివారించలేం. పోలీసులాగా నిఘా పెట్టగలం. పాత్ర ఇచ్చిన ఓ వివరణకి నేను మళ్ళీ మళ్ళీ వెనక్కెళ్ళి చదువుకుంటూ ఆ వివరణ అవసరమా అని ఆలోచిస్తాను. అవసరమే అనుకుంటే, అది మాటల్లో కాకుండా విజువల్ గా - సింబాలిక్ గా చెప్పొచ్చా అని కూడా ఆలోచిస్తాను.

మీ డైలీ రైటింగ్ రొటీన్ గురించి చెప్పండి?
          వ్యాయామం చాలా చేస్తాను. వాటిలో బాక్సింగ్, యోగా వుంటాయి. జిమ్, రన్నింగ్ వుంటాయి.  అప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్ బాడీకీ  మైండ్ కీ  చాలా హెల్ప్ చేస్తుంది. రాసేటప్పుడు ఫోన్ ని స్విచాఫ్ చేసి వేరే రూమ్ లో పెట్టేస్తాను.

స్క్రీన్ రైటర్ల గురించి వుండే అపోహ లేమిటో చెప్పగలరా?
          ఈ వృత్తిని ఇతరులు ఫన్ అనుకుంటారేమో- నిజమే, చాలా ఫన్. రాసిన సినిమాని తెర కెక్కితే దాన్ని చూసుకోవడం ఫన్నే కదా? దాన్ని మించిన ఫన్ ఏముంటుంది. కానీ అదే చూస్తున్న సినిమాని ముందుగా కాగితాల మీదికి ఎక్కించడానికి వుంటుందే- అది నావరకూ ఒక నరకం.

మీ కెరీర్ లో బాగా హైలైటయిన అంశం ఏమిటి?
          ఏమీ లేదు. హైలైట్స్ గురించి ఆలోచించను..నాకో ఫిలాసఫీ వుంది. కోరుకున్న గమ్యానికి ఎప్పుడూ చేరుకుంటూ వుండాలే గాని చేరుకోకూడదని. చేరుకున్నామంటే ఇక అక్కడ చేయడాని కేమీ వుండదు. అక్కడ్నించి బయల్దేరి  వెనక్కి రావడమే.      

మీ రీ - రైటింగ్ ప్రాసెస్ ని వివరిస్తారా?
          అదెప్పుడూ వుండే ప్రాసెస్సే. స్క్రిప్టు ఏ కొద్ది అమ్ముడుపోవాలన్నా అది చాలా  అవసరం. చాలా  సింపుల్ గా నేను దీన్ని డీల్ చేస్తాను. నేను రాస్తున్న సీన్లలో ఒకదాన్ని బాగా ఇష్టపడి పదేపదే రీరైట్ చేసి మెరుగు పరుస్తున్నా ననుకోండి- అప్పుడు ఓ వైపు నుంచి నా మైండ్ చెప్తూనే వుంటుంది- ఫస్ట్ కట్ చేయాల్సింది ఆ సీన్నే అని. సీన్లమీద మమకారాలే అలాటివి. ఆ మమకారాలు లాజిక్ ని చంపేస్తాయి. ఇలా నన్ను నేను ఎడిట్ చేసుకునే సౌమనస్యం నాకుంటే- అప్పుడు ఆ స్క్రిప్ట్ గురించి ఏ స్టూడియో నుంచో, ఏ ప్రొడ్యూసర్ నుంచో బెటర్ మెంట్ నోట్స్ నాకందితే, నేను బాధపడే ప్రసక్తే వుండదు.
***

.

13, జనవరి 2020, సోమవారం

908 : రివ్యూ


        (ఈ రివ్యూ రెగ్యులర్ రివ్యూగా ఇవ్వడం లేదు. అంటే హీరో హీరోయిన్లు ఎలా నటించారు, కామెడీ ఎలా వుంది, ఫైట్లు ఎలా వున్నాయి, సంగీతమెలా వుంది, సాంకేతిక విలువలెలా వున్నాయి, దర్శకుడి పనితనమెలా వుందీ  మొదలైన ఉపరితల సంగతులు కాకుండా, వీటి మూలంలో కథా కథనాలెలా వున్నాయి, పాత్ర చిత్రణలు ఎలా వున్నాయన్న సంక్షిప్త సమాచారం మాత్రమే ఈ రివ్యూలో చూడొచ్చు)
       ముంబాయి పోలీస్ కమీషనర్ ఆదిత్యా అరుణా చలం (రజనీ కాంత్) నగరంలో అసాంఘిక శక్తుల్ని ఇష్టారాజ్యంగా ఎన్ కౌంటర్ చేసేస్తూంటాడు. మానవ హక్కుల కమిషన్ అతడి మీద చర్యకి పూనుకుంటుంది. ఈ సందర్భంగా అతను మానసికంగా సరిగాలేడని, అతడి గతం కారణమని తెలుస్తుంది. గతంలో అతడికో కూతురు వల్లి (నివేదా థామస్). ఈమె  రెండేళ్లప్పుడే భార్య చనిపోతే ఏ లోటూ రాకుండా పెంచాడు. ఇప్పుడా వల్లికి తండ్రి పెళ్లి చేసుకుంటే మంచిదని అన్పిస్తుంది. ఒకచోట లిల్లీ (నయన తార) ని చూసి ఈమే తగిన జోడీ అనుకుని తండ్రిని ప్రోత్సహిస్తుంది. తండ్రి ఆదిత్య వచ్చీరాని ప్రేమ సంభాషణలతో వల్లితో పాట్లు పడుతూంటాడు.

        ఇలా వుంటే, ముంబాయి కుర్రకారుని కబళిస్తున్న డ్రగ్స్ జాడ్యం మీద ఆదిత్య దృష్టి పడుతుంది. ఇంతలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ కూతుర్ని డ్రగ్ మాఫియాలు అపహరిస్తారు. ఈ కేసు తీసుకున్న ఆదిత్య మాఫియా రింగ్ ని ఛేదిస్తాడు. మాఫియాలు డ్రగ్స్ సరఫరాయే కాకుండా అమ్మాయిల అక్రమ రవాణాకి కూడా పాల్పడుతూంటారు. వాళ్ళకి విముక్తి కల్గిస్తాడు. మాఫియా లీడర్ అజయ్ మల్హోత్రా (ప్రతీక్ బబ్బర్) ని పట్టుకుని జైల్లో వేస్తాడు. ఇతను పారిశ్రామిక వేత్త విజయ్ మల్హోత్రా (నవాబ్ షా) కొడుకు. తర్వాత ఆదిత్య జైల్లో వున్న అజయ్ కోసం వెళ్ళినప్పుడు అతను అజయ్ కాదనీ, డూప్లికేట్ అనీ, అసలు అజయ్ థాయిలాండ్ పారిపోయాడనీ తెలుసుకుని షాక్ అవుతాడు. థాయిలాండ్ అధికారులతో మాట్లాడి అసలు అజయ్ ని వెనక్కి రప్పిస్తాడు. ఈలోగా  జైల్లో వున్న డూప్లికేట్ ని చంపేసి అజయ్ చావుని డిక్లేర్ చేసి అజయ్ ని ఇబ్బందుల్లో పడేస్తాడు. ఐతే అజయ్ కూడా ఇంకో సంఘటనలో చనిపోతాడు. అప్పుడు అజయ్ తన కొడుకు కాదని విజయ్ మల్హోత్రా అనుచరులకి అసలు సంగతి చెప్తాడు. అజయ్, హరి చోప్రా (సునీల్ శెట్టి) అనే అంతర్జాతీయ డ్రగ్ మాఫియా కొడుకు.
        కొడుకు చనిపోయాడని తెలుసుకుని హరి చోప్రా రహస్యంగా ఇండియా వచ్చి, తన కొడుకు చావుకి విజయ్ మల్హోత్రాని బాధ్యుడ్ని చేసి చంపేస్తాడు. పూర్వం ముప్పై ఏళ్ల క్రితం హరి చోప్రా ముంబాయిలో పోలీస్ స్టేషన్ ని తగులబెట్టి, చాలా మంది పోలీసుల్ని ఆహుతి చేసి పారిపోయాడు. పారిపోతూ చిన్న పిల్లాడిగా వున్న కొడుకుని విజయ్ మల్హోత్రాకి అప్పగించాడు. మల్హోత్రా సంరక్షణలో వున్న కొడుకు ఇప్పుడు చనిపోవడంతో, మల్హోత్రాని చంపి పగ దీర్చుకున్నాడు చోప్రా.
        అంతేగాక కొడుకు చావుకి కారకుడైన కమీషనర్ ఆదిత్యా మీద కూడా పగదీర్చుకోవాలని యాక్సిడెంట్ జరిపిస్తాడు చోప్రా. ఆదిత్య గాయపడతాడు. మెదడులో రక్తస్రావంతో కూతురు వల్లి చనిపోతుంది. దీనికి కారకుడు విజయ్ మల్హోత్రాయేనని అతణ్ణి చంపడానికి పోతే అతను చనిపోయాడని తెలుసుకున్న ఆదిత్య పిచ్చెత్తి పోతాడు. మరి వల్లిని చంపిందెవరు? ఇది తెలీక కన్పించిన క్రిమినల్స్ నల్లా కాల్చి చంపడం మొదలెట్టాడు. ఇదీ గతం.
        ఇప్పుడు చనిపోయిన వల్లి ఫోన్లో వున్న సమాచారంతో హంతకుడి వివరాలు తెలుసుకుని వేట మొదలెడతాడు ఆదిత్య. చివరికి అతణ్ణి పట్టుకుని చంపి పగదీర్చుకుంటాడు. ఈ క్రమంలో దొరక్కుండా చోప్రా వేసిన కొన్ని ఎత్తుల్ని చిత్తు చేస్తాడు.
ఇద్దరు విలన్లతో ఆపద

       
సూపర్ స్టార్ రజనీ కాంత్ కోసం దర్శకుడు మురుగ దాస్ చేసిన రొటీన్ కథే. ఈ కథతో వచ్చిన ప్రధాన సమస్యేమిటంటే ఇద్దరు విలన్లు వుండడం. ఇద్దరు విలన్లతో కథలు నిలబడవని కాదు, ఇద్దరూ ఒకటవ కృష్ణుడు, రెండో కృష్ణుడు బాపతుగా ఒకరు పోయాక ఇంకొకరు  వస్తేనే సమస్యంతా. ఇద్దరూ ఒకే గోల్ తో ఒకే సమయంలో ఒకే గ్యాంగ్ గా, సిండికేట్ గా ఆపరేట్ చేస్తే సమస్య రాదు. వాళ్ళు ఉమ్మడి శత్రువులుగా ఒకే టార్గెట్ గా హీరోకి వుంటారు కాబట్టి. ఇలాకాక హీరోని ఒక ఇబ్బంది పెట్టి ఒక విలన్ హీరో ప్రమేయం లేకుండానే చనిపోయి, హీరోని ఇంకో ఇబ్బంది పెడుతూ రెండో విలన్ వస్తే, ఈ విడివిడి రాకలు విడివిడి కథలవుతాయి- మొదటి కథ హీరో ముగించని కథవుతుంది, మొదటి విలన్ తన ప్రమేయం లేకుండా చనిపోయాడు కాబట్టి. అంటే ఒక కథ ముగిసి ఇంకో కథ మొదలవడం. అంటే స్టాప్ అండ్ స్టార్ట్ బాపతు డాక్యుమెంటరీ కథనం, లేదా ఎపిసోడిక్ కథనాలవుతాయి. దీంతో ఎడతెగని ఒకే ధారగా ప్రవహించాల్సిన ఒకే కథ, మధ్యలో ఒక పాయగా విడిపోయి వీగిపోవడమన్న మాట. దీన్ని మల్టిపుల్ విలన్ సిండ్రోం అంటారు.
        ‘సాహో’ లో లెక్కలేనంత మంది విలన్లు. వాళ్ళ లెక్కలేనన్ని విలనిజాలు. ఇలాకాక వాళ్ళందరూ ఒకే కథతో, ఒకే ఎజెండాగా వుండి వుంటే మూకుమ్మడిగా, లేదా వరుసబెట్టి వాళ్ళని ఊచకోత కోసే బలమైన కథతో హీరో రక్తి కట్టించ గల్గే వాడు. హాలీవుడ్ ఫాంటసీ -సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మల్టిపుల్ విలన్స్ వుంటారు. ఇవి ఎక్కువగా కామిక్ బుక్స్ సిరీస్ ఆధారంగా తీసినవై వుంటాయి. ఈ మల్టిపుల్ విలన్స్ ఒక సిండికేట్ గా ఏర్పడి వుంటారు. లేదా ఒక మెయిన్ విలన్ వుంటూ మిగిలిన వాళ్ళు ఆ విలన్ కి ఏజెంట్లుగా వుంటారు. వీళ్ళందరికీ హీరోతో ఒకే సమస్యతో సంబంధం / పోరాటం వుంటుంది.
        ‘అలీటా’ (2019) లో చూడనే చూశాం: ఇందులో చీఫ్ విలన్ గా నోవా పైలోకాల్లో వుంటాడు. భూమ్మీద అతడి ఏజెంటుగా వెక్టర్ వుంటాడు. ఇతడి కింద హంటర్ వారియర్స్ అనే గ్రూపు వుంటుంది. వెక్టర్ ముఖ్య ఏజెంటుగా జపాన్ వుంటాడు. ఇంకా వెక్టర్ అనుచరుడుగా సైబోర్గ్ అనే రాక్షసుడు వుంటాడు. వీళ్ళంతా భూమ్మీద పాపుల్ని ఏరేస్తూంటారు. ఎవరైనా పైలోకాలని దర్శించాలంటే మోటార్ బాల్ అనే మృత్యుక్రీడ గెలవాల్సి వుంటుంది. స్వర్గతుల్యమైన పై లోకాలకి ఎవరూ రాకుండా అడ్డుకునేందుకే నోవా చేసిన ఏర్పాట్లు ఇవి. ఇప్పుడు అలీటా ఈ అడ్డంకుల్ని దాటుకుని అక్కడికెలా చేరుకుందనేదే కథ.
        ఈ కథలో నోవాకి ఏదో తేడా వచ్చి వెక్టర్ ని చంపేస్తే కథెలా వుండేది? అలీటా అనే యాక్షన్ హీరోయిన్ కథ తెగిపోయేది. తను చేయాల్సిన పని ఇంకొకరు చేస్తే అలీటా పాత్రకూడా పాసివ్ అయ్యేది. రజనీకాంత్  పాత్రతో ఇదే జరిగింది. రజనీకాంత్ పోషించిన కమీషనర్ ఆదిత్య పాత్ర ఎదుర్కొంటున్న విజయ్ మల్హోత్రా అనే విలన్ పాత్రని, రవి చోప్రా అనే ఇంకో విలన్ పాత్ర మధ్యలో వచ్చి చంపేయడంతో, ఆదిత్య ఆటలో అరటి పండు అయిపోయాడు. మల్హోత్రాని ఆదిత్యానే చోప్రాకి చెప్పిమరీ  చంపేసి వుంటే, హీరోయిజం పెరిగి- ఈ ఇంటర్వెల్ సెకండాఫ్ ని నిలబెట్టేది ఇక చోప్రాని చంపే కొనసాగింపు కథతో.
        ఇంటర్వెల్లో ఏం చేస్తున్నామన్నదే చాలా ముఖ్యం. ఇంటర్వెల్లో కథని తెగ్గ్గొడుతున్నా మేమో చూసుకోకపోతే సినిమాని చేతులారా నరికి పోగులు పెట్టుకోవడమే. ఇంటర్వెల్ ప్రమదాలెలా వుంటాయో, ఎన్నుంటాయో ఈ బ్లాగులోనే ఇలాటి సందర్భాలు వచ్చినప్పుడల్లా చెప్పుకుంటూనే వున్నాం. సెకండాఫ్ సిండ్రోం, మిడిల్ మటాష్, నిట్టని లువునా స్క్రీన్ ప్లే ఫ్రాక్చర్ మొదలైనవి.
        సినిమాలో ఆదిత్య, మల్హోత్రా, చోప్రా పాత్రల బలాబలాల సమీకరణ ఎలా వుందో చెప్పుకుంటే, ఆదిత్య డ్రగ్ దందా మూలాలు వెతుకుతున్నప్పుడు విలన్ గా మల్హోత్రా తెరపైకొచ్చాడు. అతడి కొడుకు అజయ్ దొరికాడు. వాణ్ణి చంపేసి మల్హోత్రాకి షాకిచ్చాడు. ఇప్పుడు చోప్రా అనే ఆదిత్యకి తెలియని కొత్త విలన్ వచ్చి మల్హోత్రాని చంపేశాడు. తర్వాత ఆదిత్య మీద హత్యా ప్రయత్నం చేస్తే ఆదిత్య కూతురు చనిపోయింది. దీంతో దీనికి కారకుడు మల్హోత్రాయే అనుకుని ఆదిత్య చంపడానికెళ్ళి అప్పటికే చచ్చాడని తెలుసుకున్నాడు. ఎవరు చంపారో తెలీక పిచ్చెత్తిపోయి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాడు...
        బలాబలాల సమీకరణ ఆదిత్య - మల్హోత్రాల మధ్యనే  వున్నట్టు ప్రేక్షకులు నమ్మేట్టు చేశారు. ఈ సమీకరణలో మల్హోత్రాని కొత్త సమీకరణ ప్రారంభిస్తూ కొత్త విలన్ చోప్రా చంపేయడంతో, ఈ కొత్త సమీకరణ ప్రేక్షకులకి మాత్రమే తెలుస్తోంది, కొత్త విలనెవరో తెలీని ఆదిత్యకి కాదు. దీంతో ఈ సమీకరణలో క్రియాత్మక శూన్యం ఏర్పడింది. ఈ శూన్యమెలాంటి
దంటే, ఫస్టాఫ్ లో ఇంకా విలన్ మల్హోత్రా ఎంట్రీ ఇచ్చే వరకూ వుండే శూన్యం లాంటింది. ఫస్టాఫ్ లో విలన్ ప్రవేశించేవరకూ శూన్యమే వుంటుంది, ఇది సహజం.
        ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో కూడా శూన్యమే ఏర్పడిందంటే ఇది అసహజం. బాక్సాఫీసుకి అసహనం. ఫస్టాఫ్ లో హీరోకి విలన్ ని ఎటాచ్ చేయడానికి ఎలా ఎంత సేపూ కథనం చేసి శూన్యాన్ని భర్తీ చేశామో, సెకండాఫ్ లో హీరోకి కొత్త విలన్ని ఎటాచ్ చేయడానికీ అలా అంత సేపూ కథనం చేయాలన్న మాట. అంటే ఫస్టాఫ్ లో బిగినింగ్ విభాగపు కథనమే మళ్ళీ సెకండాఫ్ లో కూడా ఇలా బిగినింగ్ విభాగపు కథనమే అవుతుందన్న మాట. అంటే మొదటి విలన్ తో మిడిల్లో పడ్డ కథ తెగిపోయి, లేదా ఆగిపోయి, మళ్ళీ వెనక్కి వచ్చి, కొత్త విలన్ తో మళ్ళీ బిగినింగే చెప్పుకునే అగత్యానికి దారి తీయడమన్న మాట. అంటే కథకుడు స్ట్రక్చర్ జ్ఞానం లేకుండా ఎంత సేపూ ఫస్టాఫ్ తర్వాత ఫస్టాఫే  రాసుకుంటూ కూర్చుంటున్నాడన్న మాట. ఇలాటి కథకుణ్ణి ఏమనాలి? మూడో విలన్ అనాలా?
        ఇలా స్క్రీన్ ప్లేల్లో కొత్త కొత్త వింత సమస్యలు తెచ్చి పెడితే వీటిని వివరించాలంటే కొత్త కుస్తీపట్లు పట్టాల్సి వస్తోంది. స్ట్రక్చర్ జ్ఞానం లేని కథకులు మామూలోళ్ళు కాదు, ఏ కథలో ఏ కొత్త చిక్కుముళ్ళు పెట్టి ముప్పు తిప్పలు పెడతారో తెలీదు. కథకుడ్ని పడుకోబెట్టి కోసి చూసినా, ఏం రాతకోతలు చేసి కథనలా తగులబెట్టాడో అంతుబట్టదు. వీటి విశ్లేషణలు రాయాలంటే ఇలాటి కథకుల మీద భారీ పెనాల్టీలు విధించాల్సిందే.
రెండూ ఫస్టాఫులే
      రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ మూవీ ఇన్వెస్టిగేషన్ జానర్ కథగా వుండాలని ఎవరూ కోరుకోరు. యాక్షన్ కథగానే వుండాలనుకుంటారు. కానీ ఈ ‘దర్బార్’ లో ఫస్టాఫ్ యాక్షన్ కథగా వుంటూ, సెకండాఫ్ కొత్త విలన్ చోప్రా ఎవరనే తెలుసుకునే ఇన్వెస్టిగేషన్ కథనంగా మార్చేశారు. అసలే కథలో కొత్త విలన్ తో సెకండాఫ్ మళ్ళీ బిగినింగ్ కే వచ్చిందనుకుంటే, దీన్నికూడా  యాక్షన్ జానర్లోనే పెట్టక, తీరుబడిగా చేసుకునే ఇన్వెస్టిగేషన్ కథగా చేసి, ఎక్కడేసిన గొంగళి చేశారు కథని.
        ఇంకోటేమిటంటే, ఫస్టాఫ్ లో ప్రారంభమైన ఫ్లాష్ బ్యాక్ సెకండాఫ్ లో ఇంకా చివరి అరగంట వరకూ కొనసాగడం. పైగా ఇందులో ఇన్వెస్టిగేషన్ మొదలెట్టడంతో మళ్ళీ ఆదిత్యకి కొత్త విలన్ తో ఎటాచ్ మెంట్ ఇవ్వడానికి ఆ సమయమంతా పట్టడం. ఇలా ఈ కథనం కూడా బిగినింగ్ విభాగపు కథనంలాగే తయారయ్యింది. బిగినింగ్ విభాగంలో వుండేది కథకాదు, మిడిల్లో ప్రారంభమవబోయే కథకి ఉపోద్ఘాతం మాత్రమే.  అందువల్ల ఇక్కడ సెకండాఫ్ లో మళ్ళీ ఉపోద్ఘాతమే మొదలుయ్యింది. దీంతో సెకండాఫ్ విషయం లేక బోరు కొట్టడానికి కారణమైంది. అసలీ సెకండాఫ్ లో వుండాల్సింది ప్రారంభం నుంచీ హీరో విలన్ల మధ్య సంఘర్షణతో కూడిన మిడిల్ విభాగపు బిజినెస్సే.
        విలనెవరో ప్రేక్షకులకి తెలుస్తూ ఇంకా హీరోకి తెలియకపోవడం, హీరో తెలుసుకోవడం ఫస్టాఫ్ లోపు జరిగిపోవడం కథాన్యాయం. అంటే ఫస్టాఫ్ లో జరిగిపోవాల్సిన డైనమిక్స్, సస్పెన్స్, థ్రిల్ ఏదైతే అది. ఇలా ఫస్టాఫ్ కల్లా హీరో విలన్లు ముఖాముఖీ అయిపోవాలి. ఇంకా హీరో విలన్ తో దాపరికాలుండకూడదు. దీన్ని ఎత్తి సెకండాఫ్ లో పెడితే, అప్పటికి విలన్ తో ముఖా ముఖీ యాక్షన్లో వుండాల్సిన హీరో, ప్రేక్షకులకంటే చాలా వెనుకబడిపోయి బోరు కొట్టిస్తాడు.  
        సెకండ్ విలన్ చోప్రాతో తో సెకండాఫ్ లో రివీలయ్యే అతడి పూర్వ కథ కూడా పెట్టారు. ముప్ఫై ఏళ్ల క్రితం పోలీస్ స్టేషన్ తగులబెట్టి పోలీసుల్ని చంపి పారిపోయిన గతం. ఇదిప్పుడెవరికవసరం. ఇప్పుడు ఆదిత్య కూతుర్ని చోప్రా చంపిన కథా కథానాలే అవసరం. హాలీవుడ్ హై కాన్సెప్ట్ సినిమాలు సింపుల్ లైను కథమీద భారీ యాక్షన్ తో వుంటాయి. ఎందుకలా వుంటాయి? భారీ యాక్షన్ కి, కథ కూడా భారీగా, రకరకాలుగా వుంటే చూసే ప్రేక్షకులు మానసిక అలసటకి గురై ఇటు కథనీ, అటు యాక్షన్నీ దీన్నీసరీగ్గా ఎంజాయ్ చేయలేరు గనుక. ఈ విషయం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. అయినా స్క్రీన్ ప్లే రచనలో ఆడియెన్స్ సైకాలజీ ఒక ముఖ్య భాగమన్న విషయం మనకి పట్టడం లేదు.
        ‘దర్బార్’ కథ సింపుల్ గా చెప్పుకుంటే, చోప్రా మహాశయుడి ముప్పై ఏళ్ల నాటి ఘనకార్యం ఓపెనింగ్ టీజర్ వేసేసి, ఆదిత్యతో ఎన్ కౌంటర్లు చేయిస్తూ, అజయ్ ని చంపి, మల్హోత్రా మీదికిపోయినప్పుడు, చోప్రా వచ్చేసి ఆదిత్యకి తెర వెనుక అసలు విలన్ బయటపడితే, సెకండాఫ్ విలనీ విరిగిపోదు. కథ విరిగి అతికించుకునే పనుండదు. ఇన్వెస్టిగేషన్ అగత్యముండదు. పూర్తి స్థాయి యాక్షన్లోనే వుంటుంది కథ.
        ఈ యాక్షన్లో రెండు బలమైన పిల్లర్ సన్నివేశాలున్నాయి. ఫస్టాఫ్ లో జైల్లో అజయ్ బదులు డూప్లికేట్ వున్నప్పటి డ్రామా, సెకండాఫ్ లో ఆదిత్య కూతురు చనిపోయినప్పటి భావోద్వేగం. ఈ స్క్రీన్ ప్లే బలానికి మురుగ దాస్ ఏవైనా కనిపెడితే ఈ రెండు పిల్లర్లే కనిపెట్టాడు. ప్రమాదంలో ఆదిత్య స్పృహ కోల్పోయి ఐదు గంటలవరకూ కోలుకోని స్థితి, స్పృహలోనే వున్న కూతురు మెదడులో రక్త స్రావంతో రెండు గంటల్లో మరణించే విషాదం. అయితే కూతురి పాత్రచిత్రణ మొదట్నుంచీ అల్లాటప్పాగానే వుంది. ఎప్పుడు చూసినా పనీపాటా లేనట్టు తండ్రితోనే వుంటుంది. తండ్రితోనే తిరుగుతూంటుంది. ఈ మూస ఫార్ములాలోంచి నేటి కెరీర్ వుమన్ గా బయటికి తెచ్చే చిత్రణ చేయలేదు. మురుగదాస్ చేసింది ఎప్పటివో రజనీకాంత్ సినిమాల తీరుతెన్నుల్నే మళ్ళీ తిరగేయడం. పనీపాటా లేకపోయినా కూతురికో ఆశయమంటూ వుంది, తండ్రి పెళ్లి చేయాలని. ఈ ఆశయం తీరకుండానే చనిపోయింది. అయితే చనిపోయేప్పుడు దీని వూసే వుండదు. దీని తాలూకు తపనే వుండదు. తను చనిపోబోయే రెండు గంటల్లోగా లిల్లీని పిలిచి కమిట్ చేయించి చనిపోవచ్చు. ఆమెకి మురుగదాస్ ప్రయోజనంలేని మరణమే ఆమెకి కరెక్ట్ అనుకుని శిక్షించినట్టుంది.
***
         ‘డెత్ విష్’ అనే సంచలనాత్మకంలో ఛార్లెస్ బ్రాన్సన్ కూతురి మీద అఘాయిత్యం చేసిందెవరో తెలీక, రాత్రి పూట సంచరిస్తూ కనపడిన అసాంఘీక శక్తుల నల్లా ట్రాప్ చేసి కాల్చి చంపుతాడు. ‘దర్బార్’ లో రజనీకాంత్ కూతుర్ని చంపిందెవరో తెలీక మానియక్ లా మారి ఎన్ కౌంటర్లు చేస్తూంటాడు. ఈ పోలికలతో  మొదటిది సీక్వెల్స్ కి దారితీసింది. రెండోది వున్న దాంట్లోనే ఎపిసోడ్స్ కి దారితీసింది. ఎపిసోడ్లు సినిమా అవదు, సీక్వెన్సులు సినిమా అవుతాయి. ఒకే కథని అల్లుకుంటూ పోతాయి. స్ట్రక్చర్ ఎన్నో అల్లికల్ని దారిలో పెడుతుంది.
సికిందర్
  

10, జనవరి 2020, శుక్రవారం

907


      దివంగత రివ్యూ రైటర్ రోజర్ ఎబర్ట్ స్కాండినేవియా సినిమాల గురించి రాస్తూ, హాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాల ముందు తమ స్థానిక మార్కెట్ నిలుపుకోవాలంటే, తమకున్న బడ్జెట్ పరిమితుల రీత్యా, కథని నమ్ముకుని కథాబలమున్న లోబడ్జెట్ థ్రిల్లర్స్ తీసే కొత్త పంథాననుసరిస్తున్నారని పేర్కొన్నాడు. కథా బలమున్న ఈ లోబడ్జెట్ స్కాండినేవియా థ్రిల్లర్స్ గత కొన్నేళ్లుగా ప్రపంచ దృష్టి నాకర్షిస్తున్నాయి. 2005 లో విడుదలైన ‘అంబులెన్స్’ ఒక చక్కటి ఉదాహరణ. మనం వీటిలోంచి కథలు కాపీ కొట్టాలని కాక, తక్కువ బడ్జెట్ లో విజయవంతమైన రైటింగ్, మేకింగ్ ఎలా వుంటాయో పరిశీలించే దృష్ట్యా వీటిని చూడాలి. ‘అంబులెన్స్’ అనే ఈ థ్రిల్లర్స్ కి మూడే రూల్స్ పాటించారు : 1. పూర్తిగా కథ అంబులెన్స్ అనే ఒకే లొకేషన్ లో జరగాలి, 2. ఆ కథ 80 నిమిషాల రియల్ టైంలో జరగాలి, 3. నాల్గే క్యారక్టర్లు వుండాలి.

      ఇక ఈ కథ చూస్తే సింపుల్ గా వుంటూనే బలంగా వుంటుంది. ఇద్దరు అన్నదమ్ముల కథ. మృత్యు ముఖంలో వున్న వాళ్ళ తల్లి వైద్యానికి అత్యవసరంగా డబ్బు కావాలి. ఆ డబ్బుకోసం దోపిడీ చేస్తారు. ఆ దోపిడీ డబ్బుతో కారులో తప్పించుకునే లోగా పోలీసులు వచ్చేస్తారు. పోలీసులనుంచి తప్పించుకుని పారిపోతూ అంబులెన్స్ ఎక్కేస్తారు. డ్రైవర్ని తోసేసి దూసుకుపోతారు. పోలీసు కారు వెంటాడుతుంది. అంబులెన్స్ లోనే గుండె పేషంటు వుంటాడు. ఇతడ్ని అర్జెంటుగా ఆస్పత్రికి తీసికెళ్ళక పోతే చనిపోతాడని గొడవ పడుతుంది నర్సు. దీంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తాయి. పేషంట్ ని ఆస్పత్రికి తీసికెళ్తే తాము పోలీసులకి దొరికిపోయి అవతల తల్లి మరణిస్తుంది. పేషంట్ ని ఆస్పత్రికి తీసికెళ్ళకుండా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతే అవతల తల్లిని బతికించుకోవచ్చు, ఇవతల పేషంట్ చస్తాడు. ఈ తగాదాలో అన్నమీద తమ్ముడు తిరగబడతాడు. ముందు తల్లిని రక్షించుకుని, పేషంట్ ని చంపిన నేరం మీదేసుకోవడానికి సిద్ధపడతాడు. ఇప్పుడేం జరుగుతుందనేది    ఫాస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మిగతా కథ!
***