రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, అక్టోబర్ 2020, శనివారం

986 : రివ్యూ


దర్శకత్వం : జకారియా మహ్మద్  
తారాగణం : ఇంద్రజిత్ సుకుమారన్, గ్రేస్ ఆంటోనీ, జోజు జార్జి, షరాఫుద్దీన్, పార్వతీ తిరువోట్టు, సౌబిన్ సాహిర్ తదితరులు
రచన : జకారియా మహ్మద్, మోహ్సిన్ పరారీ; సంగీతం : బిజిబల్, షహబాజ్, యజ్కన్ -నేహా; ఛాయాగ్రహణం : అజయ్ మీనన్
బ్యానర్స్ : పపయా ఫిలిమ్స్, ఓపిఎమ్ సినిమాస్, అవర్ హుడ్ మూవీస్
నిర్మాతలు : ఆషిక్ ఆబు, జెస్నా అషీమ్, హర్షద్ అలీ
విడుదల : అమెజాన్ ప్రైమ్ 
***

    లయాళ సినిమా ప్రాతినిథ్య సినిమా అవుతోంది. కమర్షియల్ సినిమా అంటే వినోదమే కాదు, సమాచారమనే (ఇన్ఫోటైన్మెంట్) అర్ధంలో కూడా వరస మార్చుకుంటోంది. ఇవ్వాళ గ్లోబల్ ప్రేక్షకుల్లోకి సినిమా దూసుకెళ్తున్నప్పుడు ఇది చాలా అవసరం కూడా. చాలా చాలా పూర్వం తెలుగు సినిమాలకి సంబంధించి ఇదే పేర్కొన్నాం. తెలుగు జీవితమంటే ఏమిటో చూపించ గల్గినప్పుడే తెలుగు సినిమాలు గుణాత్మకంగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతాయని. ఇంత తెలుగు జనాభా వుంది, వివిధ పార్శ్వాల్లో ఇన్నితెలుగు జీవితాలున్నాయి -కానీ ప్రపంచానికి ఇవేవీ వున్నట్టే తెలీదు. మలయాళీ సినిమాలు హిందూ సమూహాలే కాదు, క్రైస్తవ, ముస్లిం సమూహాలు కేరళలో తాము కూడా వున్నట్టు ప్రపంచ దృష్టికి తమ ఉనికిని చాటుతున్నారు. ప్రాతినిథ్య సినిమాలుగా అంతర్జాతీయ ఆసక్తిని పెంపొందిస్తున్నారు. వినోదంతో బాటు తమ గురించి సమాచారమిచ్చి అపోహల్నితొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల సూఫీయుమ్ సుజాతాయుమ్ తో ఒక ప్రయత్నం చేశారు. అందులో మతం ఎక్కువైపోయి సామాజికం తగ్గింది. ఇప్పుడు హలాల్ లవ్ స్టోరీ సామాజికం మీద దృష్టి పెట్టింది.

    సాధారణంగా ముస్లిం సినిమాలు హిందీలోనే వస్తాయి. హలాల్ లవ్ స్టోరీ మలయాళంలో ఇంకో ముస్లిం సినిమా. కేరళలోని మలబార్ ప్రాంతపు సాంప్రదాయ ముస్లిం సమాజం వచ్చేసి సామాజికంగా చొరవ చూపాలకునే కథ. అల్లా చుట్టూ తిరిగే సాంప్రదాయ ముస్లిం, సామాజికంగా బతకడానికి మెయిన్ స్ట్రీమ్ లోకొచ్చిన ఉదారవాద ముస్లిం మధ్య విలువల సున్నిత, సంయమనంతో కూడిన, ఎడ్యుకేటెడ్ సంఘర్షణ. ఇది కథలో కథ కూడా. అంటే సినిమాలో సినిమా. 
కథ    

     కథాకాలం 2001 న్యూయార్క్ మీద అల్ ఖాయిదా దాడి అనంతర కాలం. కేరళ మలబార్ ప్రాంతంలో జమైతుల్ ఇఖ్వానల్ వతన్ అనే మత సంస్థ. దీని కల్చరల్ విభాగానికి కొన్ని సామాజిక కార్యకలాపాలుంటాయి. వీధి నాటకాలేయడం, బృందగానాలు చేయడం మొదలైనవి. కోకాకోలాని బహిష్కరిస్తూ బృందగానం, 2001 న్యూ యార్క్ దాడిని పురస్కరించుకుని జార్జి బుష్ ఇరాక్ ని ధ్వంసం చేసినందుకు ఆయన దిష్టి బొమ్మని తగులబెడుతూ వీధి నాటకం వగైరా.

ఈ సంస్థలో సభ్యుడైన షరీఫ్ (ఇంద్రజిత్ సుకుమారన్) వీధి నాటకాల్లో నటుడుగా వుంటాడు. భార్య సుహ్రా (గ్రేస్ ఆంటోనీ) ఇంటి దగ్గర సాంప్రదాయ పద్ధతిలో వుంటుంది. ఇద్దరు పిల్లలుంటారు. అయితే సంస్థ స్థానిక శాఖ నిర్వాహకుడు రహీమ్ (నాజర్ కె) కి ఇలా కార్యక్రమాలు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడం లేదన్న అసంతృప్తి వుంటుంది. ఆ అసంతృప్తి లోంచి సినిమా తీయాలన్న ఆలోచన పుడుతుంది. తమ సంస్థ విశ్వాసాలకి లోబడిన సినిమా. మత నియమాలకి భంగం కలక్కుండా. దీనికి తగ్గట్టుగా ఒక సమ్మతమైన (హలాల్) ప్రేమ కథని టెలి సినిమాగా తీయాలనుకుంటాడు. దీన్ని బక్రీద్ కి ప్రసారం చేయడానికి ఓ ఛానెల్ ఒప్పుకుంటుంది. సినిమా టైటిల్ మూన మథుమ్ ఉమ్మా’. తల్లిని దైవంగా పూజించాలన్నమహ్మద్ ప్రవక్త సందేశంతో.   

    ఒక స్కూల్లో తౌఫీఖ్ (షరాఫుద్దీన్) అనే టీచర్ వుంటాడు. ఇతను రచయిత, ఆర్గనైజర్, మలయాళంలో పీజీ చేసిన స్కాలర్. ఇతను వచ్చి ఒక హలాల్ ప్రేమ కథ పవిత్రంగా రాసి పెడతాడు. ఫండింగ్ కి ఇల్లిల్లూ తిరుగుతారు. దర్శకుడుగా మెయిన్ స్ట్రీమ్ సినిమా దర్శకుణ్ణి పెట్టుకోవాలనుకుంటారు. సిరాజ్ (జోజు జార్జి) అనే అసోసియేట్ ని అనుకుంటారు. అతను స్మోకర్, డ్రింకర్, నమాజ్ కూడా చెయ్యడు. తప్పదని తౌఫీఖ్ రహీమ్ ని తీసుకుని బార్ కెళ్ళి సిరాజ్ ని కలుస్తాడు. మందు కొడుతూ వింటారు సిరాజ్, అతడి అసిస్టెంట్ అభి. ఇలా పవిత్ర ప్రేమలు తీయలేనని, కమర్షియల్ గా మారుస్తాననీ చెప్పేస్తాడు సిరాజ్. ఎలాగో ఒప్పించి బడ్జెట్ చెప్పమంటారు. స్క్రిప్టు బరువు చూసి బడ్జెట్ చెప్పలేమనీ, చదవాలనీ అంటాడు సిరాజ్. అసిస్టెంట్ అభి బరువు చూసేసి పదిహేను రోజుల్లో తీసి పారెయ్యొచ్చంటాడు.

    ఇక హీరో హీరోయిన్లుగా సంస్థ నియమాల ప్రకారం పెళ్ళయిన జంటని పెట్టాలంటారు పవిత్రతని కాపాడేందుకు. ఇతర తారాగణం కూడా నిష్టగా వుండే సంస్థ సభ్యులే వుంటారంటారు. తల పట్టుకుంటాడు సిరాజ్. ప్రొఫెషనల్ నటుల్నిపెట్టాలంటాడు. సాగదు. మళ్ళీ రాజీపడతాడు. నటించగల పెళ్ళయిన ముస్లిం జంట కోసం వెతికివెతికి చివరికి ఆస్థాన నటుడైన పవిత్రుడైన షరీఫ్ దగ్గరికే వస్తారు. అతను పవిత్రమైన భార్య సుహ్రాని  హీరోయిన్ గా అడిగి, అపవిత్ర చీవాట్లు తిని నోర్మూసుకుంటాడు.

    మొత్తానికి షరీఫ్, సుహ్రా హీరో హీరోయిన్లుగా షూటింగు ప్రారంభమయ్యాక, వాళ్ళ చేత నటింపజేయలేక మందు కొట్టేస్తూంటాడు దర్శకుడు సిరాజ్. ఈ సమస్య వుండగా ఇంకో సమస్య వస్తుంది. వాళ్ళు ప్రేమ సీన్లు నటిస్తే వాళ్ళ నిజ జీవితంలో మరుగున వున్న రిలేషన్ షిప్ గొడవలే పొడుచుకు వచ్చేస్తూంటాయి. మరోవైపు దర్శకుడు సిరాజ్ కి విడాకులైన భార్యతో పీకల మీది కొస్తుంది. శుభమా అని పవిత్ర ప్రేమ సినిమా తీస్తూంటే తమ వైవాహిక జీవితాల ట్రాజడీ సినిమాగా మారిపోవడమేమిటో అర్ధం గాదు. ఇక ఈ పవిత్ర ప్రేమ సీన్లని ఎలా మార్చి తీస్తే, వైవాహిక సమస్యలు తీరి సినిమా కూడా  పూర్తయిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ 

     వాదాలతో ఘర్షణలు ఎప్పుడూ వుంటాయి. సాంప్రదాయ వాదానికి వ్యతిరేకంగా అభ్యుదయ వాదం సాంప్రదాయవాదం లోంచే పుడుతుంది. సాంప్రదాయవాదం లేకపోతే దేన్ని చూసి అభ్యుదయవాదం పుడుతుంది? కాబట్టి వాదాలకి మాతృక సాంప్రదాయం. అది లేనిదే అభ్యుదయ ఆలోచనలే లేవు. అయితే సాంప్రదాయాన్ని అభ్యుదయం నిర్మూలించాలని, లేదా అభ్యుదయాన్ని సాంప్రదాయం నిర్మూలించాలనుకుని కత్తులు దూసుకుంటేనే వస్తుంది సమస్య. దీన్నెలా మేనేజ్ చేయాలో శంకరాభరణం లో శంకర శాస్త్రి చెప్పాడు. సేమ్ విన్ స్టన్ చర్చిల్ చెప్పిందే. ఆధునికత్వం గొర్రెలమంద లాంటిది. దాన్ని సాంప్రదాయమనే ములుగర్రతో పొడుస్తూ వుండకపోతే దారితప్పి చెల్లాచెదురైపోతుందని. కనుక సాంప్రదాయమనేది ములుగర్రే తప్ప, ఆనర్ కిల్లింగ్ చేసుకునే పిడిబాకు కాదు.

శంకరశాస్త్రి తన శాస్త్రీయ సంగీతానికి వెటకారంగా పాశ్చాత్య సంగీతం చూసి ద్వేషించలేదు. చించి పోగులు పెట్టి నిర్మూలించాలనుకోలేదు. దారిలో పెట్టాలనుకున్నాడు. సాంప్రదాయ సంగీతం నేర్చుకుంటే మంచి పాశ్చాత్య గాయకులు కూడా అవచ్చని. సాంప్రదాయం ఆధునికత్వాన్ని నిర్మూలించదు. అలా చేస్తే అది సాంప్రదాయమే కాదు. మాతృస్థానం వుండదు. అది దారి చూపుతూ నిర్మాణానికి తోడ్పడుతుంది. సాంప్రదాయ అంశలేని ఏ ఆధునిక జీవితం, కళ, వ్యవహారం లేదు.

    హలాల్ లవ్ స్టోరీ ఈ సందేశమే ఇస్తుంది. మాటల్లో చెప్పని అంతర్లీన సందేశం. సీరియస్ విషయానికి షుగర్ కోటింగుతో ఎంటర్ టైన్మెంటుగా. సున్నిత హాస్యం దీని యూఎస్పీ. సినిమాల్లో సున్నిత హాస్యం కరువైపోయిన రోజుల్లో కరువుదీరా హ్యూమర్ తో. 

     సాంప్రదాయానికి మత సంస్థని, అభ్యుదయానికి సినిమా నిర్మాణాన్నీ ముఖాముఖీ చేసి, అభ్యుదయ అభ్యంతరాలకి సాంప్రదాయ ఊరడింపులతో, సాంప్రదాయ అభ్యంతరాలకి అభ్యుదయ చిట్కాలతో కార్యం పూర్తి చేసుకునే ప్రణాళిక. ఇందులో దర్శకుడు ఎటువైపు వున్నాడంటే, ఏ వాదమూ తీసుకోకుండా బ్యాలెన్స్ చేస్తూ మధ్యలో వున్నాడు. 

    2012 లో మమతా మూర్తి మణిపురీ భాషలో ఫ్రైడ్ ఫిష్, చికెన్ సూప్ అండ్ ఏ ప్రీమియర్ షో అనే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన సినిమా తీసింది. మణిపూర్ సినిమాలు తీవ్రవాదుల నియంత్రణలో వున్నాయి. మణిపూర్ విలువలకి అద్దం పట్టకుండా పెడ ధోరణులతో సినిమాలు తీశారో తుపాకీ పేల్తుంది. కాబట్టి మణిపూర్ దర్శకులు వొళ్ళుదగ్గర పెట్టుకుని చెప్పిన పని చేస్తూ జాతీయ అంతర్జాతీయ పురస్కారాల పంటగా మారుస్తున్నారు వాళ్ళ సినిమాల్ని. ఏ సినిమాలైనా జాతీయ, అంతర్జాతీయ వేదికలు పొందాలంటే తమవైన స్థానిక విలువల్ని చిత్రించాలి. ఇలా సినిమా తీసే కుటుంబం కథే మమతా మూర్తి తెరకెక్కించింది. ఇందులో పాత్రల వ్యక్తిగత కథలుండవు. ఇది తీవ్రవాదం - సినిమా అనే కాన్సెప్ట్ అయితే, హలాల్ లవ్ స్టోరీ సాంప్రదాయం - సినిమా అనే కథ. 

నటనలు – సాంకేతికాలు

     ఇవన్నీసున్నిత సహజ నటనలు. కేరళ మొత్తమ్మీద ఎడ్యుకేటెడ్ రాష్ట్రం. అందుకే అక్కడి సినిమాలు లౌడ్ గా వుండవు. ఇందులో ప్రధాన పాత్రలు షరీఫ్, సుహ్రాలుగా ఇంద్రజిత్ సుకుమారన్, గ్రేస్ ఆంటోనీలున్నా, ఎక్కువ ముద్రవేసేది దర్శకుడు సిరాజ్ గా జోజు జార్జియే. మత సంస్థ సినిమా నియమాలతో తంటాలు పడేది తనే. వీళ్ళు చెప్పినట్టు సినిమా తీస్తే దర్శకుడుగా ఈ తొలి అవకాశం తెల్లారినట్టే. ఒకవైపు ఈ ఔటర్ ఎమోషన్, ఇంకో వైపు విడాకులైన భార్యతో ఇన్నర్ ఎమోషన్ రెండూ పాత్రని, నటనని హైలైట్ చేశాయి.      

     సుకుమారన్, గ్రేస్ లలో గ్రేస్ ది ఎక్కువ మానసిక సంఘర్షణ. భర్తతో నటిస్తూంటే ఎప్పుడో పెళ్లినాటి పాత చేదు జ్ఞాపకాలు నటనకి ప్రతిబంధకాలుగా మారిపోతాయి. భర్తతో నిజజీవిత సంబంధం కూడా వికలమవుతుంది ఈ సినిమా పుణ్యమాని. గ్రేస్ ఆంటోనీ ఈ పాత్రని పరిపక్వ నటనతో పోషించింది.

    షరీఫ్ గా సుకుమారన్ పెళ్లినాటి పాత చేదు జ్ఞాపకాలకి కర్తగా తన తప్పు తెలుసుకునే పాత్ర. ట్రైనింగ్ కోచ్ తీసుకునే ఆడిషన్ లో హీరోయిన్ గా భార్య ఎంపికై, వృత్తి నటుడైన తను హీరోగా తను ఎంపికకాని అవమానం, జెలసీ అద్భుతంగా పోషించాడు. 

    ట్రైనింగ్ ఇప్పించే కోచ్ హసీనాగా అరుంధతీరాయ్ లా కన్పించే పార్వతీ తిరువోట్టు ఒక ఫన్నీ క్యారక్టర్. ఇంకో ఫన్నీ క్యారక్టర్ షూటింగులో సింక్ సౌండ్ రికార్డిస్టు గా సౌబిన్ సాహిర్. ఇక రచయితగా షరాఫుద్దీన్ మత సంస్థకీ దర్శకుడికీ మధ్య క్రియేటివ్ ఒడంబడికలు కుదిరిస్తూ, అప్పుడప్పుడూ సీన్లు మార్చేసే దర్శకుడితో షాకులు తింటూ వుంటాడు. ఎంత పవిత్రంగా నిష్టగా స్క్రిప్టు రాసినా, సినిమా అనే పదార్ధానికి ఇప్పుడు రైటరనే వాడు లేనే లేడంటాడు దర్శకుడు. మత సంస్థ రహీమ్ గా నటించిన నాజర్ కె ఇంకో సమర్ధ నటుడు. 

     ఇంకా చిన్నచిన్న పాత్రలేసిన నటీనటులూ సినిమా ప్రొఫెషనల్ నటులే. కానీ కొత్తవాళ్లు నటిస్తున్నారా అన్నట్టు సహజత్వానికి తోడ్పడ్డారు.  ఈ సినిమాకి దీనిదైన స్టోరీ వరల్డ్ వుంది. ఏ సినిమాలోనైనా ఒకేలా నటించే నటులు అలాగే నటిస్తామంటే కుదరదు. నటులు ఇలాటి స్టోరీ వరల్డ్ లో సింక్ అవాలంటే సెట్లో సీను తెలుసుకుని అప్పటికప్పుడు నటించి వెళ్లిపోతే కాదు, ముందుగానే క్షుణ్ణంగా స్క్రిప్టంతా చదవాలి.

    టెక్నికల్ గా కెమెరాకి  Ziess లెన్సులు వాడారు. దీని సత్ఫలితాలు సీన్లలో కన్పిస్తున్నాయి. స్టోరీ వరల్డ్ కి సున్నిత తరంగాల వుండీ లేనట్టుండే సంగీతం ఇంకో చెప్పుకోదగ్గ విశేషం. అలాగే ఎడిటింగ్ అసలుందా అన్నట్టు అదృశ్యంగా తనపని తాను చేసుకుపోతుంది. అసలు దర్శకుడు వున్నాడా అన్నట్టు కూడా వుంటుంది ఈ యూనిక్ స్టోరీ వరల్డ్.

కథా కథనాలు

     స్పోర్ట్స్ జానర్ టెంప్లెట్లో కథని కూర్చారు. అన్నీ సమకూర్చుకుని షూటింగు మొదలెట్టే సరికి నటనల్లో విఫలమై, షూటింగు ప్రశ్నార్ధకం కావడం, తేరుకుని బేసిక్స్ నుంచీ నటనలు నేర్చుకుని సమాయత్తమైతే, పర్సనల్ ఇష్యూలు నటనల్లోంచే ఉత్పన్నమై షూటింగు అసాధ్యమైపోవడం, పర్సనల్ ఇష్యూస్ ని సీన్లు మార్చి పరిష్కరించుకుని, ఎట్టకేలకు షూటింగు సక్సెస్ చేయడం వంటి కథాక్రమం.

      ఈ సినిమా కథ వొక సైకో థెరఫీ. ఆ మాటకొస్తే వెండితెరమీద కదలాడే సినిమాలు సైకో థెరఫీలే. మన లోటుపాట్లని చక్కదిద్దే మానసిక చికిత్సలు. బ్యాక్ టు ది ఫ్యూచర్ లో బాల పాత్ర కాల యంత్రంలో కాలంలో వెనక్కి వెళ్ళి, అక్కడ తల్లిదండ్రుల మానసిక సమస్యని చక్కదిద్ది తిరిగి వచ్చే సైకో థెరఫీ లాంటిదే - హలాల్ లవ్ స్టోరీ లో సినిమా షూటింగు అనే ప్రయాణంలో సినిమా కథలోంచి పాత్రలు తమ కథకి (సమస్యకి) సైకో థెరఫీ చేసుకోవడం. 

    మతసంస్థ పెట్టే నిబంధలతో ఏర్పడే పరిస్థితులు హాస్యాన్ని సృష్టిస్తూంటాయి. అంత పవిత్రమైన సినిమా తీయాలనుకున్న నిష్టాగరిష్టుడైన రహీమ్ బార్ కెళ్ళి దర్శకుణ్ణి కలవాల్సి రావడమొక కామెడీ. పొరపాటున నేనిక్కడ చచ్చిపోతే పరిస్థితేంటి?’ అంటాడు. అదే దర్శకుణ్ణి విడాకులైన భార్య పోలీస్ స్టేషన్లో పెట్టిస్తే, రహీమ్ విడిపించడాని కెళ్ళినపుడు మళ్ళీ, పొరపాటున నేనిక్కడ చచ్చిపోతే పరిస్థితేంటో?’ అంటాడు.

      షూటింగులో సింక్ సౌండ్ రికార్డిస్టుకి అన్నీ అవాంతరాలే. ఎక్కడో జాడించి బట్టలుకుతున్న చప్పుడు, ఇంకెక్కడో కోడి కూస్తున్న సౌండ్, మరెక్కడో పిల్ల ఏడుస్తున్న శబ్దం, ఎవరో కిచెన్లో బర్రు మని మిక్సీ వేసిన, ఇంకెక్కడో బుర్రు మని ఆటో వస్తున్న రొ దలు. వాటినాపడానికి అసిస్టెంట్ల పరుగులు.

    లవ్ స్టోరీ సుఖాంతం చేసే సీన్లో దర్శకుడు అకస్మాత్తుగా హగ్ చేసుకునే సీను పెట్టేస్తాడు. లేకపోతే పరిపూర్ణత రాదంటాడు. మతసంస్థ, రైటర్ గగ్గోలు పెట్టేస్తారు. వీల్లేదంటే వీల్లేదంటారు. సెక్స్ చేసుకునేప్పుడు చేసుకునే హగ్ సినిమాలో చూపించడం పాపం అంటారు. సెక్స్ చేసుకునేప్పుడే కాదు, ఇంకా చాలా హగ్ చేసుకునే సందర్భాలుంటాయంటాడు దర్శకుడు. మీరు సెక్స్ చేసుకునేప్పుడే హగ్ చేసుకుంటారా, లేకపోతే లేదా అని షరీఫ్, సుహ్రారాలని అడుగుతాడు. వాళ్ళు లోపలికెళ్లి చర్చించుకుని, ముందు హగ్ చేసుకుని, ఆ తర్వాతే  సెక్స్ చేసుకునే వాళ్ళమని తేల్చుకుంటారు.

     ఇలా తెమలదని క్రియేటివ్ కెమెరామ్ మాన్ జోక్యం చేసుకుంటాడు. వాళ్ళు హగ్ చేసుకుంటారు, కానీ చేసుకున్నట్టు వుండదని ఏదేదో తిప్పి తిప్పి టెక్నికల్ చిట్కా చెప్తాడు. అదేదో ఏడవమంటాడు దర్శకుడు. ఫాగ్ వేసి, రివాల్వింగ్ షాటుతో అద్భుత చిత్రణ చేస్తాడు క్రియేటివ్ కెమెరామాన్. కొబ్బరికాయకి నిప్పంటించి హారతులు ఇచ్చుకుని ప్రారంభించిన షూటింగు మొత్తానికిలా విజయవంతమవుతుంది.  

      దర్శకుడు జకారియా, రచయిత పరారీ ల ఫ్రెష్ రైటింగ్, స్క్రిప్టు మీద పట్టు, సామాజిక స్పృహ, మలబార్ జీవితాలు, ప్రపంచ పరిణామాల ఎరుక ఇవన్నీ ఈ విభిన్న సినిమాని వొక విజయవంతమైన ఇన్ఫోటైన్మెంట్ గా మార్చాయి. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే మతావలంబికులైనా కాకపోయినా ముస్లిముల వ్యవహారాలు, ప్రవర్తన ఎంత మృదువుగా వుండాలన్న దానికిదో శాంపిల్. అయితే తాజాగా తనిష్క్ ఉదంతంతో సైతం ప్రజాతంత్రంలో మాకు నువ్వు లేవు - అంటున్న మత రాజకీయాల వాతావరణంలో ఈ సెన్సిటివ్ ముస్లిం సినిమా ఏం సాధిస్తుందో చెప్పలేం.

సికిందర్

 

15, అక్టోబర్ 2020, గురువారం

985 : స్క్రీన్ ప్లే సంగతులు

(కొన్ని ఇతర రాత పనుల వల్ల బ్లాగు రాత పని దాని తల రాతగా మారిపోయింది... మన్నించాలి)

        క్రైమ్ థ్రిల్లర్లు ఫ్లాష్ బ్యాక్స్ తో వుంటే ఒకే ఉద్దేశంతో వుంటాయి : దర్యాప్తు అధికారి గోల్, అంటే హత్యా రహస్యాన్ని కనుక్కునే ఉద్దేశం. దీంతో ఆ ఫ్లాష్ బ్యాక్స్ హత్యా రహస్యం తాలూకు క్లూస్ బయటపడే కథనాలతో వుంటాయి. ఫ్లాష్ బ్యాక్స్ తో ఏ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు చూసినా ఇదే చట్రంలో వుంటాయి. ఫ్లాష్ బ్యాక్స్ లో బయటపడుతూ పోయే క్లూస్ తీవ్రతలో ఒకదాన్ని మించి ఒకటుంటాయి. పరస్పర విరుద్ధంగానూ వుండొచ్చు. దీంతో దర్యాప్తు క్రమంలో సస్పెన్స్, థ్రిల్ బాగా పెరుగుతాయి. ఇంతేకాదు, గతం (ఫ్లాష్ బ్యాక్స్) జోలికి పోతే దర్యాప్తు అధికారికి చావు తప్పదన్న హెచ్చరిక, దాడులు కూడా వుంటాయి. దీంతో కథకి ప్రధాన పాత్రగా దర్యాప్తు అధికారికి సంఘర్షణ, గోల్, పరిష్కారమనే అర్ధవంతమైన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది స్క్రీన్ ప్లేకి. ఇలా ఫ్లాష్ బ్యాక్స్ స్క్రీన్ ప్లేలో ప్రధాన పాత్ర ప్రయాణానికి తోడ్పడాలి. అంటే, స్క్రీన్ ప్లేలో వుండే మిడిల్ విభాగపు సంఘర్షణతో కూడిన బిజినెస్ ఆధారంగా, కథా విస్తరణకి తోడ్పడాలి. ప్రధాన పాత్ర ఈ ముఖ్యావసరాల్ని తీర్చని ఇంకేవో ఉద్దేశాలతో ఫ్లాష్ బ్యాక్స్ వుంటే, ఫ్లాష్ బ్యాక్స్ సహా పూర్తి కథా విఫలమవుంతుంది. నిశ్శబ్దం లో ఈ ఘోర తప్పిదమే జరిగింది.   


ని
శ్శబ్దం లో ప్రధాన పాత్ర అంజలి పోషించిన పోలీస్ డిటెక్టివ్ మహాలక్ష్మి పాత్ర. దీనికి అనూష్కా సాక్షి పాత్ర, మహాలక్ష్మి పాత్రకి ప్రతినాయకి పాత్ర. చివరికి రహస్యం విప్పితే ఆమే హత్య చేసి వుంది గనుక. 1981 హిందీ ధువా లో రాఖీ లాగా, 1989 ఖోజ్ లో రిషి కపూర్ లాగా, దీని రీమేక్ తెలుగులో పోలీస్ రిపోర్ట్ లో మోహన్ లాగా; ఇంకా బెంగాలీ, మలయాళ, తమిళంలలో హీరో పాత్రల్లాగా, తాజాగా 2019 లో మలేషియా మిస్టరీ డిలైలా లో హీరో పాత్రలాగా. ఇవన్నీ 1958 బ్రిటిష్ ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో కి అనుసరణలు. ఎండ్ సస్పెన్స్ కథలతో సినిమాలకి జరుగుతున్న నష్టాలకి ఈ బ్రిటిష్ క్రైమ్ థ్రిల్లర్ ఆనాడు పరిష్కారం చెప్పింది. ఈ కోవలో నిర్మించిన పై సినిమాలు మెప్పుపొందాయి. (మల్లాది వెంకటకృష్ణ మూర్తి మాటలు రాసిన పోలీస్ రిపోర్ట్ యూట్యూబ్ లో వుంది. ఇది చూసి ప్రేక్షకులు పెట్టిన కామెంట్లు చూడండి). ఎండ్ సస్పెన్స్ తో వచ్చే నష్టాల గురించి సందర్భం వచ్చిన్నప్పుడల్లా బ్లాగులో రాస్తూనే పోయాం. అయినా కూడా నిశ్శబ్దం లాంటివి పదేపదే వచ్చి పెద్ద శబ్దంతో ధడేలుమని ఫ్లాపవుతున్నాయి. ఇక కాకులెగిరి పోతున్న రెక్కల చప్పుడు. అభినవ హిచ్ కాకులు’. మచ్చుకి కొన్ని ఉదాహరణలు ఈ లింక్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తూ చూడొచ్చు. 

కథా రూపం 

     నిశ్శబ్దం పూర్తి కథ వీకీపీడీయాలో అప్పుడే ఇచ్చేశారు. దాని ప్రకారమే చూద్దాం. అయితే పూర్వ కథ ఇవ్వలేదు. సినిమాలో ముందుగా చూపించిన పూర్వ కథ చూస్తే, అమెరికాలో ఒక పాడుబడ్డ విల్లాలో ఒక జంట హత్యకి గురవుతారు. ఇలాటి సంఘటనలు జరుగుతూంటాయి. పోలీసులు పరిశోధించి ఈ హత్యల్లో మానవ ప్రమేయం కన్పించక పోవడంతో, విల్లాలో ఆత్మవుందని భావించుకుని కేసులు మూసేస్తారు. ఐతే వచ్చిన వాళ్ళనల్లా చంపుతున్న ఆత్మే వుంటే, అన్నిసార్లు వెళ్తున్న పోలీసుల్ని ఎందుకు చంపడంలేదో స్పష్టత వుండదు. ఆ విల్లాలోకి ఇంకెవరూ వెళ్లకుండా సీలు కూడా చెయ్యరు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 47 ఏళ్ల తర్వాత ప్రధాన కథ మొదలవుతుంది. 

ప్రధాన కథ : చెవిటి మూగ అయిన పెయింటర్ సాక్షి (అనూష్కా) మ్యూజిషియన్ ఆంథోనీ గోన్సాల్వెజ్ (మాధవన్) తో ఎంగెజిమెంటు చేసుకుని, ఆ విల్లాలో వున్న పెయింటింగు కోసం అతడితో అక్కడికి వెళ్తుంది. అక్కడ ఆంథోనీ మీద ఆత్మ దాడి చేసి చంపేస్తుంది. సాక్షి పారిపోతుంది. 

ఈ కేసుని పోలీస్ డిటెక్టివ్ మహాలక్ష్మి (అంజలి) ఆమె బాస్ రిచర్డ్ డాకిన్స్ (మైకేల్ మాడ్సెన్) చేపడతారు. అప్పటికే వీళ్ళు కొందరమ్మాయిల మిస్సింగ్ కేసుల మీద వుంటారు. ఆంథోనీ హత్యకి సంబంధించి మహాలక్ష్మి సాక్షిని ప్రశ్నిస్తుంది. ఆమె స్టేట్ మెంట్ లో ఆమె ఫ్రెండ్ సోనాలీ కనిపించడం లేదని చెప్తుంది. తన ఎంగేజిమెంటైన రెండురోజుల తర్వాత నుంచి కనిపించడం లేదు. 

          సాక్షితో ఫ్లాష్ బ్యాక్ -1:  సాక్షి సోనాలీతో బాటు అనాధాశ్రయంలో పెరిగింది. ఒకరోజు ఒక సమాచారం వస్తే సియాటిల్ బయల్దేరుతుంది. సోనాలీ డిస్టర్బ్ అయి సాక్షి సియాటిల్లో స్థిరపడగానే తనని పిలిపించుకోవాలని మాట తీసుకుంటుంది. సియాటిల్లో ఆర్ట్ గ్యాలరీలో చేరుతుంది సాక్షి. అక్కడ వివేక్ (సుబ్బరాజు) అనే అతను పరిచయమవుతాడు. అప్పుడు అక్కడికి ఆర్ట్ ఎగ్జిబిషన్ని ప్రారంభించడానికి మ్యూజిషియన్ ఆంథోనీ వస్తాడు. సాక్షి వేసిన పెయింటింగ్ కి ఫిదా అయిపోయి మిలియన్ డాలర్లు ఆమె అనాథాశ్రయాని కిచ్చేస్తాడు. తన మ్యూజికల్ ప్రోగ్రామ్ కి ఆహ్వానిస్తాడు. ప్రోగ్రామ్ అయ్యాక తనకి పెయింటింగ్ నేర్పమం
టాడు. ఆమెకి మ్యూజిక్ నేర్పుతాడు. ఇంతలో సోనాలీ వచ్చేసి సాక్షితో వుంటుంది. ఇక సాక్షీ ఆంథోనీల మధ్య స్నేహం ప్రేమగా మారి ఎంగేజిమెంటుకి దారితీస్తుంది. తర్వాత ఒక రోజు విల్లాలో వున్న జోసఫైన్ పెయింటింగు తెచ్చుకునేందుకు ఆంథోనీని తీసుకుని వెళ్తుంది సాక్షి. అక్కడ ఆత్మ ఆంథోనీని చంపేసింది.     

 ప్రధాన కథ : డిటెక్టివ్ మహాలక్ష్మి దర్యాప్తు కొనసాగిస్తూ సోనాలీ అదృశ్యం గురించి ఆరా తీయడానికి అనాధాశ్రయం వెళ్తుంది. ఆమె అదృశ్యానికీ ఆంథోనీ హత్యకీ సంబంధముందని అనుమానిస్తుంది. సాక్షి తనకే సొంతమన్నట్టుగా సోనాలీ ప్రవర్తన వుండేదని తెలుసుకుంటుంది. ఈ ప్రవర్తనతో సోనాలీ ఒకడ్ని పొడిచిన కేసులో జైలుకెళ్లింది కూడా. తిరిగివచ్చి మహాలక్ష్మి సాక్షి ఇంటికెళ్తే, అక్కడొక ముసుగువ్యక్తి ఎదురయ్యేసరికి వెంటాడి కాలుస్తుంది. తప్పించుకుంటాడు.

పోలీసులు మళ్ళీ విల్లా కెళ్ళి సోనాలీకి సంబంధించిన సాక్ష్యాధారాలకోసం శోధిస్తారు. అక్కడ టామ్ అనే పోలీసుకి ఒక తాళం చెవి దొరుకుతుంది. అది ఆంథోనీది. అది రిచర్డ్ కివ్వడాని వెళ్తాడు. అది తీసుకుని టామ్ ని చంపేస్తాడు రిచర్డ్. టామ్ శవం దగ్గర రిచర్డ్ బ్లేజర్ బటన్ని చూసి రిచర్డ్ ని అనుమానిస్తుంది మహాలక్ష్మి.

రిచర్డ్ రూమ్ లోకి రహస్యంగా వెళ్ళి అక్కడ తాళం చెవిని గమనిస్తుంది. రిచర్డ్ ని ఫాలో అయి ఆంథోనీ ఫామ్ హౌస్ కెళ్తుంది. రిచర్డ్ అక్కడ సీసీ టీవీ హార్డ్ డిస్క్ కోసం వెతికి అది లేకపోవడంతో కోపంతో వెళ్ళిపోతాడు. 

 వివేక్ తో ఫ్లాష్ బ్యాక్ -2  : వివేక్ దృక్కోణంలోకి కథ మారుతుంది. ఆర్ట్ గ్యాలరీలో సాక్షీ వివేక్ లు స్నేహితులయ్యారు. సోనాలీ వచ్చి సాక్షితో వున్నాక సాక్షిని వివేక్ కి దూరంగా వుంచడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకు హర్టయిన వివేక్ కి సోనాలీ డిఫరెంట్ క్యారక్టరని నచ్చజెప్తుంది సాక్షి. ఈ ప్రవర్తనతో గతంలో ఆమె ఒకడిమీద చేసిన హత్యాప్రయత్నం గురించి చెప్తుంది. ఇదెలా జరిగిందో సంఘటన వివరిస్తుంది. వివేక్ సోనాలీని అర్ధం జేసుకుని దగ్గరవుతాడు. ప్రపోజ్ చేస్తాడు. ఇదయ్యాక ఆంథోనీ సాక్షికి ప్రపోజ్ చేస్తే సోనాలీఒప్పుకోదు. ఒక ప్రోగ్రాంలో అభిమానులు ఆంథోనీని చుట్టుముట్టి ముద్దుల్లో ముంచెత్తి ఫోన్ నంబర్లు ఇచ్చేసరికి అతను తిరుగు బోతని చెప్పేస్తుంది సోనాలీ. కావాలంటే రుజువు చేస్తానంటుంది. అతణ్ణి రెచ్చగొడుతూ మెసేజి పెడుతుంది. పట్టించుకోడు. తర్వాత కలుసుకోవడానికి ఒప్పుకుంటాడు. అతడితో ఫామ్ హౌస్ కెళ్తుంది. సాక్షి అనుసరిస్తుంది. వాళ్ళిద్దర్నీ గమనిస్తుంది. వాళ్ళు సన్నిహితంగా వున్నప్పుడు అతను అకస్మాత్తుగా బ్యాట్ తీసుకుని ఆమె తల మీద కొట్టి చంపేస్తాడు. రిచర్డ్ వచ్చేసి ఈ హత్యని గప్ చిప్ చేయడానికి సాయపడతాడు ఆంథోనీకి.

 సాక్షి అక్కడ్నించి పారిపోయి జరిగింది వివేక్ కి చెప్తుంది. ఇద్దరూ ఆంథోనీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. మిస్సయిన ఇతర అమ్మాయిలు ఆంథోనీ ప్రోగ్రాం జరిగినప్పుడల్లా మిస్సయ్యారని తెలుసుకుంటుంది సాక్షి. ఇక ఆంథోనీని చంపే పథకమేస్తారు సాక్షీ వివేక్ లు. పెయింటింగ్ వంకతో ఆంథోనీని పాడుబడ్డ విల్లాకి తీసికెళ్తుంది సాక్షి. అక్కడ సోనాలీ గురించి ఆంథోనీని అడగడం మొదలెడతారు సాక్షీ వివేక్ లు. 

ఆంథోనీతో ఫ్లాష్ బ్యాక్ -3 : ఆంథోనీ చెప్పడం మొదలెడతాడు. అతడికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. ఒకరోజు భార్య పడకమీద అతణ్ణి వేరే పేరుతో పిలిచేస్తుంది. అతను అనుమానిస్తాడు. ఆమె మోసం చేస్తోందని గ్రహిస్తాడు. ఒక హోటల్ కి ఆమెని ఫాలో అయి ఆమె ప్రియుడు సహా పట్టుకుని ఇద్దర్నీచంపేస్తాడు. కెప్టెన్ రిచర్డ్ వచ్చి చూసి ఆంథోనీకి చెప్తాడు. తను కూడా తన భార్యని ఫాలో అయి ఇక్కడికి వచ్చానని, ఆమె ప్రియుడితో వేరే రూంలో వుందనీ అంటాడు. ఆంథోనీ వెళ్ళి రిచర్డ్ భార్యని కూడా చంపేస్తాడు. అప్పట్నుంచీ మోసం చేసే అమ్మాయిల్ని ఆంథోనీ చంపడం మొదలెడితే రిచర్డ్ కవర్ చేస్తూ వచ్చాడు. ఇదంతా విన్న సాక్షి ఆ విల్లాలో ఆంథోనీని చంపేస్తుంది. 

ప్రధాన కథ : సాక్షి వివేక్ లు హార్డ్ డిస్క్ ఆధారంగా రిచర్డ్ నేరాలు ఎఫ్బీఐకి చెప్పాలని ప్రయత్నిస్తూంటే రిచర్డ్ వచ్చేసి దాడి చేస్తాడు. మహాలక్ష్మి వచ్చేసి రిచర్డ్ ని చంపేసి వాళ్ళిద్దర్నీ కాపాడుతుంది. ఆంథోనీ హత్యని అంతుచిక్కని హత్యగా ప్రకటిస్తారు. సాక్షీ వివేక్ లు సోనాలీ సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు. 

క్యాన్సిలైన కథ 

      పై రూపంలో వున్న కథలో స్థూలంగా కొన్ని ప్రధాన అడ్డంకులు కన్పిస్తాయి. విల్లాలో ఆత్మ చంపుతోందని గత కేసులతో తేలాక, ఆంథోనీ హత్యా దర్యాప్తుకి అవకాశమెక్కడిది? అది కూడా ఆత్మ చంపిన కేసే అవదా? ఇంకెందుకు దర్యాప్తు చేపట్టాలి? సోనాలీ చంపి వుంటుందని ఏ ఆధారాలతో మొదట అనుమానించి దర్యాప్తుకి ప్రారంభోత్సవం చేశారు. అలా దర్యాప్తు చేస్తూ పోలీసులు విల్లాలో కొస్తూంటే ఆత్మ వాళ్ళ మీద ఎందుకు దాడి చేయడం లేదు? ఆంథోనీని చంపడానికి సాక్షి అలాటి విల్లాలోకి తీసికెళ్ళే ధైర్యమెలా చేసింది? చివరికి ఆంథోనీ హత్య మరో మిస్టరీ వీడని మరణమని చెబుతూ కథ ముగించారు. అంటే ఆత్మ వున్నట్టా? ఆత్మ వుంటే, సాక్షి ఆంథోనీని చంపుతోంటే, సాక్షిని కదా ఆత్మ చంపెయ్యాలి ఆమె కుట్ర పసిగట్టి?

సాక్షీ ఆంథోనీల ప్రేమకి సోనాలీ అడ్డు. సోనాలీనలా వుంచుదాం, అసలు ఒక సెలబ్రిటీ మ్యూజీషియన్ తనకి ప్రపోజ్ చేస్తే సాక్షి ఒకసారి అతడి ప్రొఫైల్ చెక్ చేసుకోవాలిగా? అప్పుడతను పెళ్ళయిన వాడనీ, భార్య ఆత్మహత్య చేసుకుందనీ తెలుసుకుని జాగ్రత్త పడాలిగా? ఆంథోనీ కూడా భార్య మోసం చేసిందని అలాటి అమ్మాయిల్ని చంపే సైకోగా మారినప్పుడు, సాక్షిని ఎందుకు ప్రేమించి ఎంగేజిమెంట్ చేసుకున్నాడు? అతను మారాడా? మారితే తనని పరీక్షించబోయిన సోనాలీ నెందుకు చంపాడు? సవ్యమైన పాత్ర చిత్రణలు అవసరం లేదా? పైపైన రాసేసి పైపైన తీసేయడానికి మసాలా సినిమాలకి కుదిరినట్టు, ప్రేక్షకుల మేధకి పదునుపెట్టే ఇన్వెస్టిగేటివ్ సినిమాలకి కూడా కుదురుతుందా? పై అడ్డంకుల వల్ల ఎక్కడికక్కడ కథే క్యాన్సిల్ అయిపోతూంటే, ఇంకా సినిమాగా తీసే మాటెక్కడిది?

క్రమం – అపక్రమం

     పై కథ అపక్రమ (నాన్ లీనియర్) పద్ధతిలో వుంది. దీన్ని క్రమ (లీనియర్) పద్ధతి లోకి మార్చి  అసలెక్కడ మొదలై ఎలా సాగి ముగిసిందో చూద్దాం. 

సాక్షితో ఫ్లాష్ బ్యాక్ -1:  సాక్షి సోనాలీతో బాటు అనాధాశ్రయంలో పెరిగింది. ఒకరోజు ఒక సమాచారం వస్తే సియాటిల్ బయల్దేరుతుంది. సోనాలీ డిస్టర్బ్ అయి సాక్షి సియాటిల్లో స్థిరపడగానే తనని పిలిపించుకోవాలని మాట తీసుకుంటుంది. సియాటిల్లో ఆర్ట్ గ్యాలరీలో చేరుతుంది సాక్షి. అక్కడ వివేక్ (సుబ్బరాజు) అనే అతను పరిచయమవుతాడు. అప్పుడు అక్కడికి ఆర్ట్ ఎగ్జిబిషన్ని ప్రారంభించడానికి మ్యూజిషియన్ ఆంథోనీ వస్తాడు. సాక్షి వేసిన పెయింటింగ్ కి ఫిదా అయిపోయి మిలియన్ డాలర్లు ఆమె అనాథాశ్రయాని కిచ్చేస్తాడు. తన మ్యూజికల్ ప్రోగ్రామ్ కి ఆహ్వానిస్తాడు. ప్రోగ్రామ్ అయ్యాక తనకి పెయింటింగ్ నేర్పమంటాడు. ఆమెకి మ్యూజిక్ నేర్పుతాడు. ఇంతలో సోనాలీ వచ్చేసి సాక్షితో వుంటుంది...దీని కొనసాగింపు ఫ్లాష్ బ్యాక్ 2 లో వుంది : 

వివేక్ తో ఫ్లాష్ బ్యాక్ -2  :  ఆర్ట్ గ్యాలరీలో సాక్షీ వివేక్ లు స్నేహితులయ్యారు. సోనాలీ వచ్చి సాక్షితో వున్నాక సాక్షిని వివేక్ కి దూరంగా వుంచడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకు హర్టయిన వివేక్ కి సోనాలీ డిఫరెంట్ క్యారక్టరని నచ్చజెప్తుంది సాక్షి. ఈ ప్రవర్తనతో గతంలో ఆమె ఒకడిమీద చేసిన హత్యాప్రయత్నం గురించి చెప్తుంది. ఇదెలా జరిగిందో సంఘటన వివరిస్తుంది. వివేక్ సోనాలీని అర్ధం జేసుకుని దగ్గరవుతాడు. ప్రపోజ్ చేస్తాడు. ఇదయ్యాక ఆంథోనీ సాక్షికి ప్రపోజ్ చేస్తే సోనాలీ ఒప్పుకోదు. ఒక ప్రోగ్రాంలో అభిమానులు ఆంథోనీని చుట్టుముట్టి ముద్దుల్లో ముంచెత్తి ఫోన్ నంబర్లు ఇచ్చేసరికి అతను తిరుగు బోతని చెప్పేస్తుంది సోనాలీ. కావాలంటే రుజువు చేస్తానంటుంది. అతణ్ణి రెచ్చగొడుతూ మెసేజి పెడుతుంది. పట్టించుకోడు. తర్వాత కలుసుకోవడానికి ఒప్పుకుంటాడు. అతడితో ఫామ్ హౌస్ కెళ్తుంది. సాక్షి అనుసరిస్తుంది. వాళ్ళిద్దర్నీ గమనిస్తుంది. వాళ్ళు సన్నిహితంగా వున్నప్పుడు అతను అకస్మాత్తుగా బ్యాట్ తీసుకుని ఆమె తల మీద కొట్టి చంపేస్తాడు. రిచర్డ్ వచ్చేసి ఈ హత్యని గప్ చిప్ చేయడానికి సాయపడతాడు ఆంథోనీకి.

సాక్షి అక్కడ్నించి పారిపోయి జరిగింది వివేక్ కి చెప్తుంది. ఇద్దరూ ఆంథోనీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. మిస్సయిన ఇతర అమ్మాయిలు ఆంథోనీ ప్రోగ్రాం జరిగినప్పుడల్లా మిస్సయ్యారని తెలుసుకుంటుంది సాక్షి. ఇక ఆంథోనీని చంపే పథకమేస్తారు సాక్షీ వివేక్ లు. పెయింటింగ్ వంకతో ఆంథోనీని పాడుబడ్డ విల్లాకి తీసికెళ్తుంది సాక్షి. అక్కడ సోనాలీ గురించి ఆంథోనీని అడగడం మొదలెడతారు సాక్షీ వివేక్ లు.... దీని కొనసాగింపు ఫ్లాష్ బ్యాక్ 3 లో వుంది :

ఆంథోనీతో ఫ్లాష్ బ్యాక్ -3 : ఆంథోనీ చెప్పడం మొదలెడతాడు. అతడికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. ఒకరోజు భార్య పడకమీద అతణ్ణి వేరే పేరుతో పిలిచేస్తుంది. అతను అనుమానిస్తాడు. ఆమె మోసం చేస్తోందని గ్రహిస్తాడు. ఒక హోటల్ కి ఆమెని ఫాలో అయి ఆమె ప్రియుడు సహా పట్టుకుని ఇద్దర్నీచంపేస్తాడు. కెప్టెన్ రిచర్డ్ వచ్చి చూసి ఆంథోనీకి చెప్తాడు. తను కూడా తన భార్యని ఫాలో అయి ఇక్కడికి వచ్చానని, ఆమె ప్రియుడితో వేరే రూంలో వుందనీ అంటాడు. ఆంథోనీ వెళ్ళి రిచర్డ్ భార్యని కూడా చంపేస్తాడు. అప్పట్నుంచీ మోసం చేసే అమ్మాయిల్ని ఆంథోనీ చంపడం మొదలెడితే రిచర్డ్ కవర్ చేస్తూ వచ్చాడు. ఇదంతా విన్న సాక్షి ఆ విల్లాలో ఆంథోనీని చంపేస్తుంది. 

ఇదీ ప్రధాన కథకి ముందు అసలు జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి ప్రధాన కథ ఇలా మొదలైంది :

మొదటి ప్రధాన కథ : విల్లాలో ఆంథోనీని చంపి పారిపోయిన సాక్షి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆంథోనీని దెయ్యం చంపిందని చెప్తే - పోలీస్ డిటెక్టివ్ మహాలక్ష్మి (అంజలి) ఆమె బాస్ రిచర్డ్ డాకిన్స్ (మైకేల్ మాడ్సెన్) చేపడతారు. అప్పటికే వీళ్ళు కొందరమ్మాయిల మిస్సింగ్ కేసుల మీద వుంటారు. ఆంథోనీ హత్యకి సంబంధించి మహాలక్ష్మి సాక్షిని ప్రశ్నిస్తుంది. ఆమె స్టేట్ మెంట్ లో ఆమె ఫ్రెండ్ సోనాలీ కనిపించడం లేదని చెప్తుంది. తన ఎంగేజిమెంటైన రెండురోజుల తర్వాత నుంచి కనిపించడం లేదు... దీని కొనసాగింపు రెండో ప్రధాన కథలో వుంది :       

రెండో ప్రధాన కథ : డిటెక్టివ్ మహాలక్ష్మి దర్యాప్తు కొనసాగిస్తూ సోనాలీ అదృశ్యం గురించి ఆరా తీయడానికి అనాధాశ్రయం వెళ్తుంది. ఆమె అదృశ్యానికీ ఆంథోనీ హత్యకీ సంబంధముందని అనుమానిస్తుంది. సాక్షి తనకే సొంతమన్నట్టుగా సోనాలీ ప్రవర్తన వుండేదని తెలుసుకుంటుంది. ఈ ప్రవర్తనతో సోనాలీ ఒకడ్ని పొడిచిన కేసులో జైలుకెళ్లింది కూడా. తిరిగివచ్చి మహాలక్ష్మి సాక్షి ఇంటికెళ్తే, అక్కడొక ముసుగువ్యక్తి ఎదురయ్యేసరికి వెంటాడి కాలుస్తుంది. తప్పించుకుంటాడు

 పోలీసులు మళ్ళీ విల్లా కెళ్ళి సోనాలీకి సంబంధించిన సాక్ష్యాధారాలకోసం శోధిస్తారు. అక్కడ టామ్ అనే పోలీసుకి ఒక తాళం చెవి దొరుకుతుంది. అది ఆంథోనీది. అది రిచర్డ్ కివ్వడాని వెళ్తాడు. అది తీసుకుని టామ్ ని చంపేస్తాడు రిచర్డ్. టామ్ శవం దగ్గర రిచర్డ్ బ్లేజర్ బటన్ని చూసి రిచర్డ్ ని అనుమానిస్తుంది మహాలక్ష్మి. 

        రిచర్డ్ రూంలోకి రహస్యంగా వెళ్ళి అక్కడ తాళం చెవిని గమనిస్తుంది. రిచర్డ్ ని ఫాలో అయి ఆంథోనీ ఫామ్ హౌస్ కెళ్తుంది. రిచర్డ్ అక్కడ సీసీ టీవీ హార్డ్ డిస్క్ కోసం వెతికి అది లేకపోవడంతో కోపంతో వెళ్ళిపోతాడు...దీని కొనసాగింపు మూడో ప్రధాన కథలో వుంది : 

మూడో ప్రధాన కథ : సాక్షి వివేక్ లు హార్డ్ డిస్క్ ఆధారంగా రిచర్డ్ నేరాలు ఎఫ్బీఐకి చెప్పాలని ప్రయత్నిస్తూంటే రిచర్డ్ వచ్చేసి దాడి చేస్తాడు. మహాలక్ష్మి వచ్చేసి రిచర్డ్ ని చంపేసి వాళ్ళిద్దర్నీ కాపాడుతుంది. ఆంథోనీ హత్యని అంతుచిక్కని హత్యగా ప్రకటిస్తారు. సాక్షీ వివేక్ లు సోనాలీ సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు.

ఇలా వుంది  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్

   ప్రధాన కథతోనే  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వుంటుంది. పై ఫ్లాష్ బ్యాకులన్నీ ప్రధాన కథకి  ఉపోద్ఘాతాలే తప్ప ప్రధాన కథ కాదు. ఫ్లాష్ బ్యాకులు (డ్రీమ్ టైమ్) ఎప్పుడూ ప్రధాన కథ (రియల్ టైమ్) కావు. మూడుగా వున్న ప్రధాన కథని చూస్తే, 
      మొదటి ప్రధాన కథలో : విల్లాలో ఆంథోనీని చంపి పారిపోయిన సాక్షి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆంథోనీని దెయ్యం చంపిందని చెప్తే - పోలీస్ డిటెక్టివ్ మహాలక్ష్మి (అంజలి) ఆమె బాస్ రిచర్డ్ డాకిన్స్ (మైకేల్ మాడ్సెన్) చేపడతారు. అప్పటికే వీళ్ళు కొందరమ్మాయిల మిస్సింగ్ కేసుల మీద వుంటారు. ఆంథోనీ హత్యకి సంబంధించి మహాలక్ష్మి సాక్షిని ప్రశ్నిస్తుంది. ఆమె స్టేట్ మెంట్ లో ఆమె ఫ్రెండ్ సోనాలీ కనిపించడం లేదని చెప్తుంది. తన ఎంగేజిమెంటైన రెండురోజుల తర్వాత నుంచి కనిపించడం లేదు...అనేదంతా బిగినింగ్
, అంటే సమస్యా విభాగం. 

రెండో ప్రధాన కథలో : డిటెక్టివ్ మహాలక్ష్మి దర్యాప్తు కొనసాగిస్తూ సోనాలీ అదృశ్యం గురించి ఆరా తీయడానికి అనాధాశ్రయం వెళ్తుంది. ఆమె అదృశ్యానికీ ఆంథోనీ హత్యకీ సంబంధముందని అనుమానిస్తుంది. సాక్షి తనకే సొంతమన్నట్టుగా సోనాలీ ప్రవర్తన వుండేదని తెలుసుకుంటుంది. ఈ ప్రవర్తనతో సోనాలీ ఒకడ్ని పొడిచిన కేసులో జైలుకెళ్లింది కూడా. తిరిగివచ్చి మహాలక్ష్మి సాక్షి ఇంటికెళ్తే, అక్కడొక ముసుగువ్యక్తి ఎదురయ్యేసరికి వెంటాడి కాలుస్తుంది. తప్పించుకుంటాడు. 

పోలీసులు మళ్ళీ విల్లా కెళ్ళి సోనాలీకి సంబంధించిన సాక్ష్యాధారాలకోసం శోధిస్తారు. అక్కడ టామ్ అనే పోలీసుకి ఒక తాళం చెవి దొరుకుతుంది. అది ఆంథోనీది. అది రిచర్డ్ కివ్వడాని వెళ్తాడు. అది తీసుకుని టామ్ ని చంపేస్తాడు రిచర్డ్. టామ్ శవం దగ్గర రిచర్డ్ బ్లేజర్ బటన్ని చూసి రిచర్డ్ ని అనుమానిస్తుంది మహాలక్ష్మి. 

రిచర్డ్ రూంలోకి రహస్యంగా వెళ్ళి అక్కడ తాళం చెవిని గమనిస్తుంది. రిచర్డ్ ని ఫాలో అయి ఆంథోనీ ఫామ్ హౌస్ కెళ్తుంది. రిచర్డ్ అక్కడ సీసీ టీవీ హార్డ్ డిస్క్ కోసం వెతికి అది లేకపోవడంతో కోపంతో వెళ్ళిపోతాడు...అనేదంతా మిడిల్, అంటే సంఘర్షణా విభాగం.

మూడో ప్రధాన కథలో :  సాక్షి వివేక్ లు హార్డ్ డిస్క్ ఆధారంగా రిచర్డ్ నేరాలు ఎఫ్బీఐకి చెప్పాలని ప్రయత్నిస్తూంటే రిచర్డ్ వచ్చేసి దాడి చేస్తాడు. మహాలక్ష్మి వచ్చేసి రిచర్డ్ ని చంపేసి వాళ్ళిద్దర్నీ కాపాడుతుంది. ఆంథోనీ హత్యని అంతుచిక్కని హత్యగా ప్రకటిస్తారు. సాక్షీ వివేక్ లు సోనాలీ సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు... అనేదంతా ఎండ్, అంటే పరిష్కార విభాగం. 

ఫ్లాష్ బ్యాకుల పాత్ర

    పై మూడు బిగినింగ్-మిడిల్- ఎండ్ విభాగాల్లో ఫ్లాష్ బ్యాకులెలా పాత్ర వహించాయో చూద్దాం. బిగినింగ్ విభాగంలో మహాలక్ష్మి దర్యాప్తు చేపట్టిన ఫలితంగా (కాజ్ అండ్ ఎఫెక్ట్) సాక్షితో ఫ్లాష్ బ్యాక్ -1 లో :  సాక్షి సోనాలీతో బాటు అనాధాశ్రయంలో పెరిగింది. ఒకరోజు ఒక సమాచారం వస్తే సియాటిల్ బయల్దేరుతుంది. సోనాలీ డిస్టర్బ్ అయి సాక్షి సియాటిల్లో స్థిరపడగానే తనని పిలిపించుకోవాలని మాట తీసుకుంటుంది. సియాటిల్లో ఆర్ట్ గ్యాలరీలో చేరుతుంది సాక్షి. అక్కడ వివేక్ (సుబ్బరాజు) అనే అతను పరిచయమవుతాడు. అప్పుడు అక్కడికి ఆర్ట్ ఎగ్జిబిషన్ని ప్రారంభించడానికి మ్యూజిషియన్ ఆంథోనీ వస్తాడు. సాక్షి వేసిన పెయింటింగ్ కి ఫిదా అయిపోయి మిలియన్ డాలర్లు ఆమె అనాథాశ్రయాని కిచ్చేస్తాడు. తన మ్యూజికల్ ప్రోగ్రామ్ కి ఆహ్వానిస్తాడు. ప్రోగ్రామ్ అయ్యాక తనకి పెయింటింగ్ నేర్పమంటాడు. ఆమెకి మ్యూజిక్ నేర్పుతాడు. ఇంతలో సోనాలీ వచ్చేసి సాక్షితో వుంటుంది...అనే  సమాచారం మహా లక్ష్మికి దొరికింది.

ఇప్పుడు ఆమె మిడిల్ విభాగంతో ఏ ఫ్లాష్ బ్యాక్ కనెక్ట్ అయింది? ఏదీ కాలేదు. వివేక్ తో రెండవ ఫ్లాష్ బ్యాక్ ఆమె సంఘర్షణలో భాగంగా (కాజ్ అండ్ ఎఫెక్ట్) ప్రారంభం కాలేదు. స్క్రీన్ ప్లే తెగి, ఆమె పాయింటాఫ్ వ్యూ నుంచి వివేక్ పాయింటాఫ్ వ్యూకి వేరే ముక్కగా ఫ్లాష్ బ్యాక్ 2 ప్రారంభమయ్యింది. దీంతో మిడిల్ విభాగంలో ఆమెకుండాల్సిన సంఘర్షణ కాస్తా గల్లంతై పోయింది. 

మహా లక్ష్మి ఎండ్ విభాగంలో ఆమెకే బయటపడాల్సిన ఆంథోనీతో మూడో ఫ్లాష్ బ్యాక్ కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ తో లేకుండా, ఆమెతో సంబంధం లేకుండా, ఆంథోనీ పాయింటాఫ్ వ్యూలో, సాక్షీ వివేక్ లకి చెప్పే ఫ్లాష్ బ్యాకుగా జొరబడిపోయింది. 

ఈ రెండు ఫ్లాష్ బ్యాకులూ స్ట్రక్చర్ని చెడగొట్టి స్క్రీన్ ప్లేని స్క్రీన్ ప్లే కాకుండా చేశాయి. ఫలితంగా ప్రధాన పాత్రగా, కథానాయికగా, మహాలక్ష్మి కుండాల్సిన కి త్రీయాక్ట్ స్ట్రక్చర్ బలం గుల్లయింది. కేసు తేల్చే దృక్పథంతో వుండాల్సిన ఆమెకి ఒక గోల్ అంటూ లేకుండా పోయింది. 

మరేం చెయ్యాలి?

      ప్రతినాయక పాత్ర లేకపోతే ప్రధాన పాత్రకి గోల్ వుండదు. కథంటేనే నాయక- ప్రతినాయక పాత్రల మధ్య సంఘర్షణ. ఈ కథలో ఆంథోనీని చంపిన సాక్షియే ప్రతినాయిక. కానీ కథలో ప్రతినాయిక పాత్రని గుర్తించక, ఫీలవ్వక, ఏదో తోచినట్టూ రాసుకుంటూ పోయాడు కథకుడు. ఫలితంగా తాడూ బొంగరం లేని కథానాయిక అయింది మహాలక్ష్మి. సిడ్ ఫీల్డ్ మాటల్లో చెప్పాలంటే - the character seems to disappear off  the page’

        ప్రతినాయిక సాక్షి. అంటే అనూష్కా కేంద్ర బిందువుగా వుండాల్సిన నేర కథ. అనూష్కా- వర్సెస్ అంజలి ఇద్దరు హీరోయిన్ల డైనమిక్స్ తో థ్రిల్లర్ వుంటే ఎంత జనరంజకంగా వుంటుంది. మార్కెట్ యాస్పెక్ట్ నిర్ణయించుకుని ఈ కథ ఏమైనా చేశారా?

అనూష్కా పాత్ర ఆటోమేటిగ్గా పైన చెప్పుకున్న ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో చట్రంలో ఒదిగిపోతుంది. పైనే చెప్పుకున్న ఇతర భాషల్లో వచ్చిన సినిమాలు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో కి అదే కథతో రీమేకులు. కానీ నిశ్శబ్దం కథ వేరు. ఇందులో అనూష్కా పాత్ర మాత్రమే ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో లో పాత్రకున్న, షేడ్ తో వుంటుంది. అందులో ఆ పాత్ర చుట్టూ అల్లిన కథ వేరు, నిశ్శబ్దం కథ వేరుగా వుంటుంది. ఎక్కడా పోలిక రాదు, కాపీ అని ఎవరూ అనలేరు. 

        హిందీ రీమేక్ ధువా లో రాజమాతగా అప్పటి హీరోయిన్ రాఖీ చేసిన హత్య తాలూకు గుట్టు విప్పే ఘట్టం చివర్లో ఒక క్లాసిక్ చిత్రణ. ఒక పాజిటివ్ క్యారెక్టర్ ఉన్నట్టుండి నెగెటివ్ గా బండారం బయటపడుతుంది. మిథున్ చక్రవర్తి, అంజాద్ ఖాన్ తదితర సీబీఐ బృందం అండర్ కవర్ ఆపరేషన్ కి అద్భుత, వెంట్రుకలు నిక్కబొడుచుకునే పరాకాష్ట!

సికిందర్

6, అక్టోబర్ 2020, మంగళవారం

984 : రివ్యూ


 

      దెయ్యాలున్నాయా లేవా? వున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని అవి స్వాధీనం చేసుకుని స్వాహా చేసేస్తాయి. తమ కథల్ని చెప్పనివ్వవు. మీడియా మేనేజ్ మెంట్. రాజకీయ నాయకుల నుంచి నేర్చుకున్నాయి. సైలెన్స్ ప్లీజ్... అని నోరూ చెవులు కూడా మూసేస్తాయి. నిశ్శబ్దం పాటించాలి. తమిళ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్స్ సృజనాత్మకతా పరంగా నిశ్శబ్దం పాటిస్తున్నాయి. అవి అదే అనాథాశ్రయంలో ఇద్దరు అనాథ బాలికల అవే పాత కథల్నుంచీ పదేపదే పేదగా పుట్టుకొస్తాయి. సమకాలీనంగా ఇంకే సమస్యలూ లేనట్టు. పదే పదే గత కాలంలోనే పేదగా జీవించే సస్పెన్స్ థ్రిల్లర్స్ కి దెయ్యాల దర్బారు నుంచి విముక్తి లేదు. ఆ నిశ్శబ్దం కాస్తా నీరుగారి దెయ్యపు కచేరీలతో నిండిపోతుంది…  
    30 కోట్లు పెట్టి తీయాలనుకున్నప్పుడు మూడుండాలి : ఏం తీస్తున్నాం, ఎందుకు తీస్తున్నాం, ఎలా తీస్తున్నామనే ప్రశ్నలు. కమర్షియల్ లాభ నష్టాలతో ముడిపెట్టి జవాబులు. పరమాద్భుత లొకేషన్స్, కళ్ళు చెదిరే తారాగణం, అదిరిపోయే ప్రొడక్షన్ విలువలు ఇవి కావు జవాబులు. ఇవి పోయే డబ్బులు వచ్చే డబ్బుల లెక్కలు కావు. పేపరు మీద రాస్తున్నప్పుడే వచ్చే డబ్బులా పోయే డబ్బులా తెలిసిపోకపోతే తీయడం మభ్యపెట్టుకోవడమే. మొదటి ప్రయత్నం తోనే మభ్యపెట్టుకున్నామని తెలుసుకోకపోతే ఆ అలసత్వానికి అంతం లేదు. దర్శకుడు హేమంత్ మధుకర్ 2010 లో హిందీలో తీసిన దెయ్యం సినిమా ఏ ఫ్లాట్ పరాజయం గురించి ఎవరేమన్నారో తెలిసీ అప్రమత్తమవక పోతే  మభ్య పెట్టుకునే నిశ్శబ్దాలు చాలానే వుంటాయి. 

    సస్పెన్స్ థ్రిల్లర్ అత్యంత సంక్లిష్ట జానర్. హిచ్ కాక్ అంతటి వాడికే పట్టుబడలేదు. తీసే ప్రతీ సస్పెన్స్ థ్రిల్లర్ అతడికి యాతనే. మూస ఫార్ములాలు చేస్తూ సరదాగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ లాగిద్దామనుకుంటే సాగే పనికాదు. సస్పెన్స్ థ్రిల్లర్ ఫుల్ టైమ్ జాబ్. సస్పెన్స్ - క్రైమ్ జానర్లో తలపండిన వాడికి ఇతర జానర్లు నల్లేరు నడక. ఎందుకంటే కథలకి కావాల్సిన మనస్తత్వ చిత్రణ, భావోద్వేగాలు, సమయస్ఫూర్తి, కాలీన స్పృహ, లాజిక్, డైనమిక్స్ వంటి కథాంగాలు వొంటబట్టి వుంటాయి క్రైమ్ జానర్లో.

     నిశ్శబ్దం  తమిళంలో  సైలెన్స్  మొదట మాటలు లేకుండా మూకీగానే తీయాలనుకున్న ఆలోచన. మనసు మార్చుకుని మాటలు జోడించిన ప్రయత్నం. ఈ మాటలు జోడించడం మామూలుగా లేదు. మూకీ అనే మాటల అనావృష్టి నుంచీ అతి వృష్టి కురిపించే క్రియేటివిటీ. నటులకున్న మాటలు చాలనట్టు వాయిసోవర్ల కుండపోత. ఎవరి వాయిసోవర్ ఎందుకో అర్ధం కాకుండా సాంతం స్వగతాల జడివాన. డాక్యుమెంటరీ చూస్తున్నట్టు డైజెటిక్ సౌండ్. డైజెటిక్ సౌండ్, ఇంట్రా డైజెటిక్ సౌండ్ ఎప్పుడు ఎలా ఎందుకు వాడాలో తెలుసుకోకుండా శబ్ద గందరగోళం. కథలో ఏం జరుగుతోందో వంతులేసుకుని వ్యాఖ్యాతలు వివరిస్తే గానీ అర్ధంగాని పరిస్థితి వుంటే కథని శానిటైజ్ చేయాలి. దాని విజువల్ స్టోరీ టెల్లింగ్ నేచర్ కి వైరస్ సోకి వుంటుంది. సినిమా తీస్తే ఇతరులు నేర్చుకునేట్టు వుండాలి గానీ నేర్చుకున్నది పోయేట్టు వుండకూడదు.

    మరి నిశ్శబ్దం కర్ధమేమిటి? ఈ అర్ధమే పట్టుకోగలిగి వుంటే సినిమా ఎక్కడో వుండేది గ్లోబల్ చార్ట్ లో అనూష్కాని తళతళ మెరిపిస్తూ. ఇది జానర్ రీసెర్చి చేసుకుని ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో (1955) టెక్నిక్ తో తీయాల్సిన 41 మిలియన్ డాలర్ల స్టార్ మూవీ. జానర్ రీసెర్చా? అదేమిటి? అదేమిటో తెలియాలంటే వీధి బడి దశ నుంచీ సినిమా నేర్చుకుంటూ రావాల్సి వుంటుంది.

కథ 

        సాక్షి (అనూష్కా) మూగ చెవిటి పెయింటర్. తల్లిదండ్రులెవరో తెలీదు. యూఎస్ లో అనాథాశ్రయంలో పెరిగింది సోనాలీ (శాలినీ పాండే) తో బాటు. ఆమెకి సియాటిల్లో ఆర్ట్ గ్యాలరీ నుంచి పిలుపు వస్తుంది. అక్కడ పెయింటింగ్ వేసి విజిటింగ్ కి వచ్చిన సెల్లో ప్లేయర్ ఆంథోనీ గోన్సాల్వేస్ (మాధవన్) ని ఇంప్రెస్ చేస్తుంది. తన కన్సర్ట్ కి అతనా హ్వానిస్తే వెళ్తుంది. అలా పరిచయం పెరిగి అతడికి పెయింటింగ్ నేర్పుతుంది, అతను మ్యూజిక్ నేర్పుతాడు. ఇక ప్రేమ పుడుతుంది. ఎంగేజిమెంట్ చేసుకుని అతణ్ణి తీసుకుని ఒక శిథిల విల్లాలో జోసెఫైన్ వుడ్స్ అనే ఆమె పెయింటింగ్ అన్వేషణలో బయల్దేరుతుంది. ఆ విల్లాలో 47 ఏళ్ల నుంచీ దాని ఓనర్ దెయ్యం వుంటుంది. అది వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చంపేస్తూంటుంది. ఇప్పుడు ఆంథోనీని కూడా చంపేస్తుంది. సాక్షి పారిపోతుంది. 

    సియాటిల్ పోలీస్ డిపార్ట్ మెంట్ డిటెక్టివ్ మహాలక్ష్మి (అంజలి) కేసు టేకప్ చేస్తుంది. ఆమెకి తోడుగా కెప్టెన్ రిచర్డ్ డాకిన్స్ (మైకేల్ మాడ్సెన్) దిగుతాడు. అయితే విల్లాలో కేసుకి సంబంధించి ఆధారాలేవీ దొరకవు. మరోవైపు చూస్తే కొందరు యువతుల మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. సోనాలీ కూడా అదృశ్యమవుతుంది. సోనాలీని ఆంథోనీ హత్య కేసులో అనుమానిస్తుంది మహాలక్ష్మి. సొనాలీని వెతకడం మొదలుపెడుతుంది.

    ఇప్పుడు సోనాలీని ఎందుకనుమానించింది మహాలక్ష్మి? సోనాలీకున్న మానసిక సమస్యేమిటి? ఆంథోనీకి కూడా వున్న మానసిక రుగ్మతేమిటి? ఈ ఇద్దరి మధ్యా సాక్షి స్థానమేమిటి? విల్లాలో ఆమె చూసింది ఎంత వరకు నిజం? ఈ మొత్తం కేసులో కెప్టెన్ రిచర్డ్ పొందాలని చూసిన ప్రయోజనా లేమిటి? ఇదంతా మహాలక్ష్మి ఎలా పరిష్కరించి దోషిని తేల్చింది? ఇదీ మిగతా కథ.  
నటనలు- సాంకేతికాలు

         నటనల గురించి చెప్పుకోవాలంటే పాత్రల గురించి చెప్పుకోవాలి. పాత్ర చిత్రణల్లో లోపాలుంటే ఎంతటి నటనలూ మెప్పించలేవు. అనూష్కా సాక్షి పాత్ర అలాటి లోపాలున్న ఈ సినిమా పాత్రల్లో ప్రధానమైనది. దీంతో ఆమె నటన ఉపరితలంలోనే వుండి పోతోందే తప్ప ఇన్నర్ ఎమోషన్లు పలికే పరిస్థితి లేదు. అసలు ఇన్నర్ ఎమోషన్లు లేనట్టే వుంటాయి పాత్ర చిత్రణ, నటనా. సైన్ లాంగ్వేజీ, అప్పుడప్పుడు ఫోన్లో టైపు చేసి వాయిస్ ఇన్ఫర్మేషన్ వంటి ఉపకరణాల ద్వారా సాధారణ సమాచారాన్ని తెలుపుతుంది తప్ప, డ్రామాకి ముఖ్యమైన తన ఇన్నర్ ఎమోషన్స్ ని అర్ధమయ్యేలా చెప్పడంలో వుండే స్ట్రగుల్ తో కూడిన ఉద్విగ్నభరిత సన్నివేశాలుండవు. పోనీ బొమ్మవేసి చూపే ప్రయత్నం చేసే ఆడియెన్స్ ఫ్రెండ్లీ మెలోడ్రామా వుండదు. ఇన్నర్ ఎమోషన్సే లేనప్పుడు ఇక  అయ్యోపాపం అన్పించే స్ట్రగుల్ ఏ రూపంలోనైనా ఎందుకుంటుంది. అసలొక మూగజీవి అయిన సాక్షి లాంటి పెయింటర్ కి పెయింటింగ్సే తన భాష, మాధ్యమం కాకుండా పోతాయా? తనని కుదిపేస్తున్న భావోద్వేగాల్ని కుంచె ద్వారా ప్రకటించకుండా ఏ చిత్రకారుడుండ గలడు? లేనప్పుడు అలాటి పాత్ర ఎందుకు? సాక్షి మూగజీవి పాత్రకి లాగే ఆమె పెయింటరన్న వృత్తిపరమైన పాత్ర చిత్రణ కూడా లేదు. టెంప్లెట్ సినిమాల్లో టెంప్లెట్ పాత్రలాగే రెండు పెయింటింగు లేయించి గొప్ప పెయింటరని చెప్పి, పది మిలియన్ డాలర్లతో బ్రహ్మాండమైన బిల్డప్పిచ్చి వదిలేశారు. మళ్ళీ ఈ పాత్ర చిత్రణ తాలూకు కొనసాగింపే వుండదు. ఒకసారి బర్ఫీ లో రణబీర్ కపూర్ ని చూస్తే తెలుస్తుంది మూగజీవి సమగ్ర పాత్రంటే ఏమిటో.

పాత్రకి కథతోనే సమస్య 

        సమస్య ఎక్కడొచ్చిందంటే, అసలీ సస్పెన్స్ థ్రిల్లర్ కథ అనూష్కా పాత్ర కథ అని తెలుసుకోక పోవడం దగ్గర వచ్చింది. స్టార్ హీరోయిన్ తో హీరోయిన్ ఓరియెంటెడ్ హంగామా తీస్తున్నప్పుడు ఆమె మీదే కథ వుండాలని కలం పుచ్చుకుని రాస్తాడు రచయిత. అంతేగానీ ఆమెని అవతలికి లాగేసి, ఇతర పాత్రలతో కథ గిల్లుకుంటూ కూర్చోడు. ఇలా ఎందుకు జరుగుతుందంటే అసలు కథే౦టో అర్ధం గాకపోతేనే. అందుకే ఇన్ని ఇతర పాత్రలతో ఇన్ని ఫ్లాష్ బ్యాకులు, వాళ్ళ వాయిసోవర్లు. కథతో అయోమయం వుంటేనే అర్ధం లేని ఫ్లాష్ బ్యాకులతో హడావుడి చేస్తారంటాడు సిడ్ ఫీల్డ్. 

    సెంట్రల్ క్యారక్టర్ గా అనూష్కా మీద కథా, పాత్రచిత్రణా ఎలా వుండి వుంటే అమెరికాలో తీసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్లో గ్లోబల్ ఎట్రాక్షన్ అయివుండేదో తర్వాత కథా కథనాలు విభాగంలో చూద్దాం.  

డిటో మాధవన్ 

      ఇక మాధవన్ గురించి. భారతీ రాజా దర్శకత్వంలో ఎర్రగులాబీ లు (సిగప్పు రోజాక్కల్ -  1980) లో కమలహాసన్ క్లాసిక్ సీరియల్ కిల్లర్ పాత్రని గుంజి నిశబ్దం లో గుంజీళ్ళు తీయించాడు. పుంజాలు తెంపుకుని పారిపోయింది పాత్ర. విశేషమేమిటంటే, ఇదే సీరియల్ కిల్లర్ కథని భారతీ రాజాయే రాజేష్ ఖన్నాతో హిందీలో రెడ్ రోజ్ గా తీస్తే అదీ సూపర్ హిట్టయింది. ఇప్పుడు ఇంత కాలం తర్వాత ఐఎండీబీ లో ఇప్పటి ప్రేక్షకులు రెడ్ రోజ్ ని చూసి ఆహా ఓహో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాటి థ్రిల్లర్ ని చూడలేదంటున్నారు అప్పటి రాజేష్ ఖన్నాని పొగుడుతూ. 

    నిశ్శబ్దం లోనే కెప్టెన్ రిచర్డ్ పోలీసు పాత్ర ఎక్కడిదనుకున్నారు? భారతీ రాజా థ్రిల్లర్ లోనే కమలహాసన్ / రాజేష్ ఖన్నా అమ్మాయిల్ని చంపుతూంటే చూసి ఎంజాయ్ చేసే సైకో పెంపుడు తండ్రి పాత్ర. మాధవన్ అమ్మాయిల్ని చంపుతూంటే రిచర్డ్ సహకరించడం డబ్బు కోసమన్నట్టుగా వుండదు. భారతీ రాజా థ్రిల్లర్లో తండ్రి పాత్రలాగా అతను సైకో అని మనమర్ధం చేసుకోవాలి. భారతీ రాజా థ్రిల్లర్ లోని కమల్ పాత్రని అదే కథతో మాధవన్ కథగా ముక్క అతికించి, అదే గొప్ప ఒరిజినల్ క్రియేషన్ అన్నట్టుగా చివర్లో సస్పెన్స్ రివీల్ చేశారు. 

    ఆంథోనీ పాత్రలో మాధవన్ కూడా డిటో అనూష్కా. కథ కుపయోగపడని అతడి సంగీతం. ఆ సంగీతంలో తనలో దాగున్న సీరియల్ కిల్లర్ భావోద్వేగాలున్నాయా అంటే లేదు. అమీర్ ఖాన్ సర్ఫరోష్ లో గజల్ గాయకుడి రూపంలో వున్న టెర్రరిస్టుగా నసీరుద్దీ న్ షా, పాడే పాటలో అంతరార్ధం పాత్ర నిజస్వరూపాన్ని తెలిసీ తెలీనట్టు ప్రకటిస్తుంది. ఇది కథ కాదు లో వెంట్రిలాక్విజం కళాకారుడైన కమల్ కూడా తన భావోద్వేగాల్ని వెంట్రిలాక్విజం ద్వారా ప్రకటిస్తాడుగా?

    మాధవన్ పాత్రకి ఆంథోనీ గోన్సాల్వెజ్ పేరు యాదృఛ్ఛికంగా పెట్టేశారా లేక ఉద్దేశపూర్వకంగానా? ఆంథోనీ గోన్సాల్వెజ్ గోవాకి చెందిన సుప్రసిద్ధ సంగీత కారుడు. లక్ష్మీ కాంత్ - ప్యారేలాల్ లకి సంగీతం నేర్పిన గురువు. వాళ్ళ ఎన్నో పాటలకి ఆయనే స్ఫూర్తి. ఏకంగా ఆయన పేరే ప్రయోగించి అమర్ అక్బర్ ఆంథోనీ లో అమితాబ్ బచ్చన్ మీద మై నేమ్ ఈజ్ ఆంథోనీ గోన్సాల్వెజ్ అనే ఆల్ టైమ్ హిట్ పాట సృషించేశారు. అలాటి ఆంథోనీ గోన్సాల్వెజ్ పేరు మ్యూజిషియన్ అయిన సీరియల్ సైకో కిల్లర్ కి వాడడం ఏమీ బాగాలేదు. ప్యారేలాల్ శర్మ ఇప్పటికీ ఆంథోనీని స్మరిస్తాడు. 

పొడిపొడి ప్రణయ బాంధవ్యం 

       ఇక మాధవన్ - అనూష్కాలు పరస్పరం తమ కళల్ని నేర్పుకునే  క్రమంలో కూడా రసపోషణ వుండదు. ఆకలిరాజ్యం లో కమల్ -శ్రీదేవిల మధ్య వున్నట్టు. శ్రీదేవి తాళం పాడితే కమల్ స్వరాలు కూర్చే పోటాపోటీ - ఆమె సంగీతమైతే అతను సాహిత్యంగా - కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే పాట లాగా. మాధవన్ సంగీతానికి అనూష్కా చిత్ర లేఖనం పోటీయో, లేదా అనూష్కా చిత్ర లేఖనానికి మాధవన్ సంగీతం పోటీయో లేకుండా కళాకారుల పాత్రలెందుకు? వీళ్ళు ప్రేమికులైనప్పుడు కళల సమాగం లేని అంటీముట్టని చిత్రణ లెందుకు? ప్రియుడే సంగీతము - ప్రియురాలే నాట్యము - అని  ఇది కథ కాదు లో కళాకారులైన కమల్, జయసుధ పాడుకున్నారుగా? మాధవన్ సంగీతం అనూష్కాకి వినపడని లోపంలోంచి మాధవన్ పడే వేదనాభరిత డ్రామా ఏది?

    ఇలా అనూష్కా, మాధవన్ - ఇద్దరు స్టార్స్ మీద ప్రణయంలో యూత్ అప్పీల్ ప్రవహించే కనీస ఎమోషనల్ బాండింగ్ కూడా లేకపోవడం కొట్టొచ్చే లోపం. ఇన్ని లోపాలతో తెరమీద ఈ స్టార్స్ ని చూసి ఎందుకు ఎంజాయ్ చేయాలి?

అంజలి పాత్రా గల్లంతు 

      ఇక అంజలి. దర్శకుడు ముందుగా అనుకున్న కథలో అంజలి పాత్ర లేదు. ఆమె స్థానంలో మగ పాత్ర వుంటే, కథ మేల్ డామినేషన్ తో వుందనిపించి మగ పాత్ర తీసేసి,  పోలీస్ డిటెక్టివ్ ని స్త్రీ పాత్రగా మార్చానన్నాడు దర్శకుడు. అయినా అనూష్కాతో బాటు అంజలి పాత్రనీ నీరుగార్చే చిత్రణలు చేశాడు. అంజలి పాత్రకి మహాలక్ష్మి పేరుకి అర్ధం పర్ధం, ప్రయోజనం లేవు. తెలుగు ప్రేమ సినిమాల్లో పెడుతున్న ఇంకో టెంప్లెట్ పేరుగానే మూలన పడింది. ఆంథోనీ పేరుతో అలా చేశారు. మహాలక్ష్మి పేరుతో ఏమీ చేయలేదు అమెరికా బ్యాక్ డ్రాప్ లో. తను పోలీస్ డిపార్ట్ మెంట్ కే గర్వకారణమైన విజయలక్ష్మిలా వుండదు. అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఇండియన్ మిథికల్ క్యారక్టర్ ని ప్లేచేసి విశ్వ గురు అంటున్నఇండియా ఖ్యాతిని పెంచాలను కోలేదు. పేరు గొప్ప పని దిబ్బ అన్నట్టు వుంది. 

    తగ్గట్టే స్టయిలిస్ట్ యాక్టింగ్ తో అసహజ ఇన్వెస్టిగేషన్. 47 ఏళ్లుగా దెయ్యం చంపుతూంటే ఆంథోనీని దెయ్యం చంపలేదని మొదటే ఎలా నిర్ధారించింది? సాక్షి ఫ్రెండ్ సోనాలీ కనిపించకపోతే ఆమె చంపినట్టా? ఇది వరకు దెయ్యం చేసిన హత్యలతో ఈ హత్యకున్న తేడా ఏమిటో కేసు పాత రికార్డుల్లో సైంటిఫిక్ ఎవిడెన్సు లతో నిగ్గు తేల్చిందా? దీని జోలికే పోలేదే. కథా సౌలభ్యం కోసం వూరికే సోనాలీని టార్గెట్ చేయడం వల్ల అసలు దెయ్యమనే మూల కథే ప్రశ్నార్ధకమైంది.

    సరే, చివరికి దెయ్యం చంపలేదనే తేలింది. మరి చంపుడు కార్యక్రమం పెట్టుకున్న దెయ్యం ఏమైంది? తన ముందు తను చంపాల్సిన ఆంథోనీని ఇంకెవరో చంపుతూంటే చూస్తూ వుందా? ఆంథోనీతో బాటు చంపడానికొచ్చిన వాణ్ణీ బోనస్ గా చంపుకుని దెయ్యం నెక్స్ట్ శాల్తీ కోసం కూర్చోవాలిగా? అసలు వచ్చిన మహాలక్ష్మితో బాటు పోలీసు టీమునీ సఫా చేసేయాలిగా? మహాలక్ష్మి లో గజలక్ష్మిని చూసి జడుసుకుందా అమెరికన్ దెయ్యం? ఇదే చూపించి వుంటే మోతెక్కి పోయేది అమెరికా!!

    కాబట్టి బిల్డప్ కోసం ఏదో దెయ్యం కలరిచ్చారు తప్ప, అసలు దెయ్యాముందా లేదా స్పష్టత లేదు కథకుడికి. కన్పిస్తున్న దెయ్యాలుగా పాత్రలే వున్నప్పుడు వేరే దెయ్యం అక్కర్లేదేమో. మహాలక్ష్మిగా అంజలి ఈ కేసులో తేల్చిందేమీ లేదు. చివరికి సుబ్బరాజే తన కథ చెప్పుకుని ఆంథోనీ హత్యా రహస్యం విప్పుతాడు ప్రేక్షకులకి. మహాలక్ష్మికి కాదు. కనీసం ఇంకో పనైనా చేయలేదు మహాలక్ష్మి - కెప్టెన్ రిచర్డ్ పోలీసుని చంపి కిందికి తోసేస్తాడు. ఆ శవం దగ్గర రిచర్డ్ వేసుకున్న బ్లేజర్ బటన్ దొరుకుతుంది మహాలక్ష్మికి. దాంతో ఆంథోనీ హత్యతో రిచర్డ్ కి సంబంధముందన్న విషయం తర్వాత, ముందు ఈ పోలీసు హత్యలో రిచర్డ్ రెడ్ హేండెడ్ గా దొరికిపోతే కిమ్మనదు. ధైర్య లక్ష్మి కూడా కాలేదు. రిచర్డ్ చేసిన ఈ పోలీసు హత్యని ప్రమాద వశాత్తూ మరణంగా నమోదు చేసిందేమో చూపించలేదు. అసలు అర్ధం కాని కథలో అనూష్కా లాగే తనూ గల్లంతైన పాత్రే. ఎవరెవరో ఫ్లాష్ బ్యాకులేసుకుని ప్రేక్షకుల నుద్దేశించి వాయిసోవర్లు చెప్తూంటే, వీటితో సంబంధం లేనట్టు హైఫై పోలీస్ డిటెక్టివ్ మాహాలక్ష్మి ఎక్కడుంటుందో తెలీదు. చివరికి ఆంథోనీ మిస్టరీ వెల్లడవడం కూడా తన మూలంగా జరగదు. తనుండదు. పూర్తిగా పాసివ్ క్యారెక్టర్.  
    *హాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ లక్ష్మీదేవిని పూజిస్తుందట!

        విదేశీయులు, ఇతర మతస్థులు కూడా హిందూ దేవుళ్లను ఆరాధిస్తుంటారు. అలాంటి వాళ్లలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. ఎన్నో హాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన సల్మా హయెక్ లక్ష్మీదేవిని పూజిస్తుందట. ధ్యానంలో కూర్చున్నప్పుడు లక్ష్మీదేవిపైనే దృష్టి పెడుతుందట. ఈ విషయాన్ని సల్మా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. లక్ష్మీదేవి ఫొటోను కూడా పోస్ట్ చేసింది.  
       
`నేను నా అంత:సౌందర్యంతో అనుసంధానం కావాలనుకున్నప్పుడు దేవత లక్ష్మీదేవిపై దృష్టి పెట్టి ధ్యానం చేస్తాను. హిందూ మతస్థులు ఆమెను సంపదకు, అదృష్టానికి, ప్రేమకు, అందానికి ప్రతినిధిగా భావిస్తారు. ఆమె చిత్రం నాకు చాలా సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. సంతోషం, ప్రశాంతత మన అంత:సౌందర్యానికి బాటలు వేస్తాయ`ని సల్మా పేర్కొంది. ఈ పోస్ట్ చూసిన బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు `అద్భుతం` అంటూ కామెంట్ చేసింది. 
ఆంధ్రజ్యోతి
, 9.10.20
అనాధల బ్యాచి 

     సాక్షి ఫ్రెండ్ సోనాలీగా శాలినీ పాండే అనాధాశ్రయంలో పదేపదే ఇలాటి సస్పెన్స్ థ్రిల్లర్స్ లో రిపీటవుతున్న పాత మూస పాత్ర. స్టార్ సినిమాల్లో హీరో ఎప్పుడూ బస్తీలో వుండే అనాథే- పేరు శీను గాడే అన్నట్టు - సస్పెన్స్ థ్రిల్లర్స్ లో హీరోయిన్, ఆమె నేస్తం అనాథాశ్రయంలో పడుండే అనాధలు! తెలుగు రాష్ట్రాల్లో యువతీ యువకులు దిక్కులేని అనాధలన్న మాట. ఇప్పుడు అమెరికా తీసికెళ్ళీ ఇదే పరాభవం. 

    సోనాలీకి సాక్షి మరెవరితో వుండకూడదనీ, తనతోనే వుండాలని పొసెసివ్ నెస్ చిన్నప్పట్నుంచీ. దీంతో పెద్దయ్యాక సాక్షితో క్లోజ్ గా వుంటున్నాడని అనుమానించి ఒకడి మీద  హత్యా యత్నం చేసి  జైలుకి కూడా వెళ్ళి వచ్చిన చరిత్ర. అమెరికన్ ప్రభుత్వం ఆమెకి మానసిక చికిత్స చేయకుండా మళ్ళీ దేశం మీదికి వదిలేసి నట్టుంది. ఈ పాత మూస టెంప్లెట్ పాత్ర నేటి కాలం పోకడలకి లెస్బియన్ అయి వుంటుందని ప్రేక్షకులు భావిస్తారన్న స్పృహలేదు కథకుడికి. పొసెసివ్ నెస్ వికటించి పొటెన్షియల్ కిల్లర్ గా మారిన సోనాలీతో ఇంకా ఫ్రెండ్ షిప్ ఏమిటో సాక్షికి. ఇది మరిన్ని హత్యలకి దారి తీసేందుకు తానే కారణమైందన్న పొరపాటు, సాక్షి పాత్ర సమూలంగా నెగెటివ్ అయిందన్నసంగతీ గ్రహించాడో లేదో కథకుడు. 

సుబ్బరాజు, మాడ్సెన్ సూపర్ స్టార్స్

        వీళ్ళిద్దరూ తమ పాత్రల్ని ఎంజాయ్ చేశారు, ఎలాటి బంధనాలు, సంకెళ్ళు లేవు. కానీ క్యారక్టర్ గ్రోత్ తో, వాళ్ళ సీక్రెట్స్ తో బ్యాంగు లిచ్చుకుంటూ పోయారు. సోనాలీని ప్రేమించిన వివేక్ గా సుబ్బరాజు తన గోడు సరీగ్గానే వెళ్లబోసుకున్నాడు. రివెంజ్ క్యారక్టర్ గా మారి కథ ముగించాడు. నీటు పాత్ర, క్లాస్ నటన. పోలీసు కెప్టెన్ గా మైకేల్ మాడ్సెన్ ది విలక్షణ నటన. రిజర్వాయర్ డాగ్స్’, కిల్ బిల్’, ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ వంటి 113 సినిమాల సీనియర్ నటుడు. భారతీరాజా థ్రిల్లర్ లోని పెంపుడు తండ్రి పాసివ్ పాత్రని, కెప్టెన్ గా యాక్టివ్ పాత్రగా పోషించి సైకో విలనిజాన్ని డీసెంట్ గా పోషించాడు. అనూష్కా, అంజలి పాత్రల్లా కాకుండా వీళ్ళిద్దరివీ సస్పెన్సుతో కూడిన పాత్రలు.

సాంకేతిక వైభవం
       
కథా వైభవం లేకపోయినా సాంకేతిక వైభవానికి కొదవ లేదు. కెమెరా మాన్ సి. రామ్ ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే విత్తం కొద్దీ వైభవం. తెర నిండా డాలర్లు అతికించి నట్టుంది. రెండు డాలర్లు మనకిస్తే మందు బాటిల్ పక్కనుంచుకుని చూసేవాళ్లం. మందే కథని మరిపించ గలదు, స్నాక్స్ పని చెయ్యవు. 

    గోపీ సుందర్ సంగీతం, షానీల్ దేవ్ కెమెరా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, చాడ్ బఫెట్ ఆర్ట్, నీరజా కోన కాస్ట్యూమ్స్, అమెరికన్ యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుత క్వాలిటీతో  పోటీపడుతూ వున్నాయి. దర్శకుడి కథా నిర్వహణే సక్సెస్ కి వేటు వేసింది.

సికిందర్  

(కథా కథనాల సంగతులు రేపు)