రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, ఆగస్టు 2020, మంగళవారం

969 : రివ్యూ



 రచన - దర్శకత్వం : ఫరూఖ్ కబీర్ 

తారాగణం : విద్యుత్ జామ్వల్, శివాలికా ఒబెరాయ్, అన్నూ కపూర్, శివ్ పండిత్, నవాబ్ షా తదితరులు
సంగీతం : మిథూన్
, ఛాయాగ్రహణం : జీతన్ హర్మీత్ సింగ్
బ్యానర్ : పనోరమా స్టూడియోస్
విడుదల : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
***
      యాక్షన్ హీరో విద్యుత్ జామ్వాల్ ఈసారి భావోద్వేగాలు ప్రధానంగా సామాన్యుడైన యాంగ్రీ యంగ్ మాన్ పాత్రతో అభిమానులని అలరించేందుకు ప్రత్యక్షమయ్యాడు. కొత్త దర్శకుడు ఫరూఖ్ కబీర్ యాక్షన్ ని పణంగా పెట్టి సున్నిత భావోద్వేగాలతో ప్రయోగం లాంటిది చేశాడు. అయితే తీసుకున్న కథా వస్తువు దశాబ్దాల బాలీవుడ్ చరిత్రలో అనేక సార్లు రిపీట్ చేసిందే. దీన్ని సున్నిత భావోద్వేగాల ప్రయోగంతో కొత్తగా ఏ  మేరకు నిలబెట్టాడో చూద్దాం...

 కథ
    లక్నోలో కొత్తగా పెళ్ళయిన సమీర్ చౌదరి (విద్యుత్ జామ్వాల్) - నర్గీస్ (శివలీకా ఒబెరాయ్) లు 2008 ఆర్ధిక మాంద్య పరిస్థితుల్లో ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. ఇక ఉపాధి వెతుక్కోవడం మధ్య ప్రాచ్య దేశంలో తప్పనిసరవుతుంది. ప్రపంచం ఆర్ధిక మాంద్యంలో కుదేలైనా మధ్యప్రాచ్యం చమురు బావులతో నిక్షేపంగా వుంది. అక్కడ నోమన్ (కల్పిత దేశం) లో ఉద్యోగాలు  సంపాదించుకుంటారు. పేపర్స్ క్లియర్ అవడానికి సమీర్ కి సమయం పట్టేలా వుండడంతో, ముందు నర్గీస్ బయల్దేరి వెళ్లిపోతుంది. వెళ్ళిన ఆమె కంగారుగా ఫోన్ చేస్తుంది తనని కిడ్నాప్ చేశారని. వెంటనే సమీర్ నోమన్ వెళ్ళిపోతాడు.


        అక్కడ ఉస్మాన్ (అన్నూకపూర్) అనే టాక్సీడ్రైవర్ సాయంతో నర్గీస్ ని వెతికితే ఆమె వేశ్యాగృహంలో కన్పిస్తుంది. ఆమెని విడిపించేందుకు విఫలయత్నం చేసిన సమీర్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే
, అక్కడ ఉస్మాన్ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఇప్పుడు ఈ హత్యలోంచి ఎలా బయట పడి భార్యని కాపాడుకున్నాడన్నది మిగతా కథ.

నటనలు - సాంకేతికాలు 
    విద్యుత్ జామ్వాల్ ఒక సామాన్య లక్నో యువకుడి పాత్ర పోషించాడు. అన్యాయాలకి ఆవేశం పొంగుకొస్తుంది. కానీ ఎదుర్కొనే ధైర్యం చాలదు. ఆగ్రహమే తప్ప పోరాటం తెలియని అమాయకత్వం. ఇలాటి ఇతను నోమన్ లో అనుభవాల్లోంచి ఎలా రాటుదేలి బలవంతుడయ్యాడన్నది అతడి క్యారక్టర్ ఆర్క్. ఈ పాత్ర చిత్రణ వల్ల అభిమానులు అతన్నుంచి ఆశించే యాక్షన్ దృశ్యాలు తక్కువ వుంటాయి. ఒక సామాన్యుడిగా భార్యని వెతకడానికి సాయపడండని అడిగినప్పుడల్లా అతడి బలహీన స్వరం వణకడం, చేతులు వణకడం వంటివి వెంటాడే నటనగా వుంటాయి. పోరాటానికి తెగించాక ఇక హద్దులుండవు. ఈ పోరాట క్రమం కూడా అంచెలంచెలుగా స్థాయి పెంచుకుంటూ వుంటుంది. క్లయిమాక్స్ లో విజృంభిస్తుంది. విద్యుత్ జామ్వాల్ అండర్ ప్లే చేసిన ఈ పాత్ర, రొటీన్ యాక్షన్ హీరో పాత్రలకి భిన్నంగా జీవంతో కన్పిస్తుంది. అతడిలోని నటుణ్ణి బయటికి తీస్తుంది. 


        నర్గీస్ గా శివాలికా ఒబెరాయ్ ది చాలావరకూ కనిపించని పాత్ర. కిడ్నాపవడం కారణం. కాసేపే వున్నా కొట్టొచ్చే గ్లామర్. శివ్ పండిత్
, ఆహానా కుమ్రా, నవాబ్ షాలు దుష్ట పాత్రలు పోషించారు.    

        మిథూన్ పాటలు
, అమర్ మోహిలే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ యాక్షన్ మూవీకి ఓ మాదిరి ట్రెండీగా వున్నాయి. అరబ్ దేశపు లొకేషన్స్ కి, యాక్షన్ సీన్స్ కి జితన్ హర్మీత్ సింగ్ ఛాయాగ్రహణం డిటో. 

కథా కథనాలు

    కథేమీ లేదు. భార్య కిడ్నాపవడం, ఆమెని విడిపించుకోవడం ఇదే కథ, ఇంటర్వెల్లో భార్య దొరికినట్టే దొరికి మళ్ళీ దూరమవుతుంది. సెకండాఫ్ కథని లాగడానికే మళ్ళీ దూరం చేయడమేమో. రెండుసార్లూ భార్యని వెతికే కథనంలో కూడా బలం వుండదు. రాయబారుల చర్చలతో, విద్యుత్ ని ప్రశ్నించడాలతో నిండిపోతుంది. ఈ బలహీనతల్ని కవర్ చేసేందుకా అన్నట్టు విద్యుత్ పాత్ర చిత్రణ. బలహీనుడు ఎలా బలవంతుడయ్యాడన్న క్యారక్టర్ ఆర్క్. ఈ క్యారక్టర్ ఆర్క్ ఒక్కటే సినిమాని నిలబెట్టిందా అంటే లేదు. క్యారక్టర్ ఎదుగుదలకి తగ్గ దృశ్యాలతో కథనం పరుగులు దీయలేదు. పక్క దోవపడుతూ చర్చలూ, ప్రశ్నించడాలూ అంటూ కూర్చుంది. ఇందుకే రెండుం పావు గంటల ఈ యాక్షన్ థ్రిల్లర్ విజయావకాశాలు తగ్గాయి.

సికిందర్ 

17, ఆగస్టు 2020, సోమవారం

968 : రివ్యూ



రచన - దర్శకత్వం : తేజా మార్ని
తారాగణం : చైతన్య కృష్ణ, నైనా గంగూలీ, ఎస్తర్ అనిల్, ఈశ్వరీ రావు, రోహిణి, శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం : :ప్రియదర్శన్ బాలసుబ్రహణ్యం, ఛాయాగ్రహణం : జగదీష్ చీకటి
నిర్మాతలు: సందీప్ మార్ని, రత్నాజీ రావు మార్ని
విడుదల : ఆహా ఓటీటీ


        రో కొత్త దర్శకుడి కృషి ఓటీటీ లో విడుదలయ్యింది. ఇది రాజకీయ సినిమా. థియేటర్ మీద ఆశలు పెట్టుకుంటే ఇంట్లోకే వెళ్ళి హోమ్ డెలివరీ ఇవ్వాల్సిన అగత్యమేర్పడింది. ఇళ్ళల్లోనే రకరకాల సైజుల్లో హోమ్ థియేటర్లు వెలిశాయి. ఈ ప్రేక్షకులు వేరు. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ప్రేక్షకులు. దాదాపూ మాస్ వుండరు. సింగిల్ థియేటర్ల నుంచి మల్టీ ప్లెక్సులకి, మల్టీ ప్లెక్సుల నుంచీ హోమ్ థియేటర్లకీ ప్రేక్షకుల్ని కుదించుకుంటూ వస్తున్నాయి సినిమాలు. ప్రస్తుతాని కిదొక అనివార్య పరిస్థితి, అసంతృప్తి. కొత్త దర్శకులకైతే వర్ణణాతీత బాధ. ఆనందిద్దామన్నా అది వర్చువల్ ఆనందం. తేజా మార్ని అనే మరో కొత్త దర్శకుడు ఈ బరిలోకి తన కృషితో దిగాడు. ఒక రాజకీయ సినిమాతో పరిచయమవుతున్నాడు. ఈ పరిచయం, కృషీ పరిశీలించాల్సిన అవసరం వచ్చింది. పరిశీలిద్దాం...

కథ 
      వర్షపు హోరుతో అల్లకల్లోలంగా వున్న వాతావరణంలో ముఖ్యమంత్రి అచ్యుత రామయ్య దుర్మరణం వార్త వెలువడుతుంది. దీంతో ఆయన కుమారుడు విజయ్ వర్మ (చైతన్య కృష్ణ) కి ఉప ముఖ్యమంత్రి పదవి పార్టీ సూచిస్తే కాదని ముఖ్యమంత్రి అయిపోతాడు. ఇక తండ్రిని గొప్పగా ప్రతిష్టించుకోవాలన్న కోరికతో, నాన్న నరికిన తలలు కాదు, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గుర్తుకు రావాలి. నా తండ్రి పేరు చెబితే కీర్తి ప్రతిష్టలు గుర్తుకు రావాలి. ప్రతిపక్షాలు చేసే విష ప్రచారం కాదు, పాలకులు రాసేదే చరిత్ర కావాలి అంటూ ప్రమాణ స్వీకారం చేసి, ప్రపంచంలో కెల్లా ఎత్తైన విగ్రహం తండ్రికి కట్టించేందుకు పూనుకుంటాడు. మూడువేల కోట్లు అవసరమయ్యే విగ్రహం కోసం సంక్షేమ పథకాలకి కత్తెర వేసి నిధులు సమకూరుస్తాడు.

        ఇలా వుండగా వివిధ ప్రాంతాల్లో డబ్బుల్లేక కొందరు జీవన పోరాటాలు చేస్తూంటారు. కలుషిత నీరువల్ల కిడ్నీలు పాడైన కూతురి వైద్యం కోసం కౌలు రైతు (ఈశ్వరీ రావ్)
, శిథిలమైన అనాధాశ్రమం మరమ్మత్తుల కోసం స్వాతంత్ర్య యోధుడు (శుభలేఖ సుధాకర్), వారణాసి నుంచి పారిపోయి వచ్చి స్కాలర్ షిప్ ప్రయత్నాల్లో ఒక జంట (ఈస్తర్, అంకిత్),   క్రీడారంగంలోకి ప్రవేశించే ఆశయంతో గారడీ అమ్మాయి (నైనా గంగూలీ)... ఇలా విద్యా, వైద్య, తాగునీరు, క్రీడా రంగాలకి చెందిన వర్గాలు నిధుల కొరతతో బాధలు పడుతూంటాయి. 

        ఈ నాల్గు వర్గాల జీవన పోరాటం విగ్రహంతో ముఖ్య మంత్రి స్వార్ధ ప్రయోజనాన్ని ఎలా ఎదుర్కొంది
? ఎదుర్కొందా లేదా? ఎదుర్కొకపోతే ఎందుకు ఎదుర్కొలేదు? ఇదీ మిగతా కథ. 

నటనలు – సాంకేతికాలు
       అందరూ బాగా నటించారు. రియలిస్టిక్ పాత్రలు లీనమై నటించారు. పేద తరగతి రియలిస్టిక్ పాత్రలవడం వల్ల గ్లామర్ తో పని లేకుండా పోయింది. దీంతో గ్లామర్ తో వుండే పరిమితులు అడ్డు పడలేదు. ఫ్రీ స్టయిల్ నటనలకి వీలు కుదిరింది. మొట్ట మొదటిసారిగా ముఖ్యమంత్రి వంటి పెద్ద పాత్ర నటించిన చైతన్య కృష్ణ, పాత్రలో పెద్దగా బలం లేకపోయినా, పాత్ర కన్పించినప్పుడల్లా ముఖ్యమంత్రి పాత్ర అనే బెరుకు లేకుండా నటించాడు. 

         ఈశ్వరీ రావ్ ఇలాటి పాత్రలకి ఒక శారద. శోక పాత్రలో ఆమెదొక ఆర్ట్ సినిమా నటన. క్రీడాకారిణిగా కాస్త స్పీడున్న పాత్రలో నైనా గంగూలీ భావోద్వేగాల్ని రగిలించే నటన. స్టూడెంట్ గా ఎస్తర్ అనిల్ అమాయకత్వాన్ని బాగా ప్రదర్శించే నటన. చాయ్ వాలాగా అంకిత్ ఇంకో బాధిత పాత్ర, స్వాతంత్ర్య యోధుడిగా శుభ లేఖ సుధాకర్, ఇద్దరూ మంచి నటులు-  చివర్లో ఒక సీనులో జర్నలిస్టుగా రోహిణి కన్పిపిస్తుంది. వాస్తవిక ధోరణిలో తీసిన సినిమాకి వాస్తవిక నటనలతో అందరూ నిలబెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నంలో ఒక వంతు కూడా తన బాధ్యతగా సినిమాని నిలబెట్టేందుకు కృషి చేయలేదు కొత్త దర్శకుడు. ఇక ఎత్తైన విగ్రహపు వూహలేల? 

        ఉద్దేశపూర్వకంగానో
, లేక కాకతాళీయంగానో గానీ ప్రారంభంలో ఒకరి తర్వాత ఒకరు ఓపెనయ్యే బాధిత పాత్రల దృశ్యాలకి నేపథ్యంలో వాటర్ థీమ్ ని కల్పించాడు కొత్త దర్శకుడు. ముఖ్యమంత్రి అచ్యుత రామయ్య దుర్మరణంతో హోరు వర్షం, ఈశ్వరీ రావ్ తో సముద్రం, ఈస్టర్ తో వారణాసిలో గంగ, నైనా తో విశాఖలో సముద్రం, ఇవి గాక రాజమండ్రిలో గోదావరి, ఆ తర్వాత శుభలేఖ సుధాకర్ తో కారే వర్షపు నీళ్ళు, కొద్ది సేపటికి కలెక్టర్ తో వర్షం... ఇలా ఈ జల నేపథ్యాలు సబ్ కాన్షస్ మూడ్ ని సృష్టిస్తాయి. ఈ సింబాలిజంతో ఏ రసోత్పత్తితో కాన్సెప్ట్ కొలిక్కి వస్తుందా అని ఎదురు చూస్తే, ఏమీ వుండదు. ఆ దృశ్యాలకే అవి పరిమితం. ముఖ్యమంత్రిని దుర్మరణం పాల్జేసిన ఈ వాటర్ థీమ్, చివరికి ముఖ్యమంత్రి విగ్రహాన్ని కూల్చేసే ప్రకృతి ప్రకోపమవుతుందేమో నని మన బుర్రకి అన్పిస్తుంది. కానీ మన పనికొచ్చే బుర్రకి పని పెట్టుకోవడం వేస్ట్ అని తేలుతుంది. 

        ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోరు దాదాపు పాటలే ఆక్రమిస్తాయి. ఏ బాధ పెట్టే ఘట్టం వచ్చినా ఓ పాట వచ్చేస్తుంది. బాగానే వుంటుంది. మ్యూజికల్ రియలిస్టిక్ లాగా కొత్తగా. కానీ విషయం లేని సినిమాని నటనలతో
, పాటలతో నిలబెట్ట గలరా? 

        కెమెరా పరంగా కూడా విజువల్ బలం వుంది. దీనికీ విషయం తోడ్పడలేదు. వారణాసి లాంటి పుణ్య క్షేత్రంలో పడుపు వృత్తిని పచ్చిగా చూపించ వచ్చు. అదొక వాస్తవం. కానీ కథ కేమవసరం
? ఆ నేపథ్యంలోంచి వచ్చే ఆ రాష్ట్రపు పాత్ర, ఇంకో రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనం కోరుకోవడంలో ఔచిత్యం? స్థానిక పాత్రల స్ట్రగుల్ ని చూపించే కాన్సెప్ట్ లో ఇదొక రస భంగం. ఈ రాజకీయ సామాజికార్ధిక కాన్సెప్ట్ ని తెరకెక్కించాలంటే పేపర్ న్యూస్ కటింగ్స్ చాలవు, సమకాలీన స్పృహతో వెండి తెరని మించిన గ్రాండ్ పిక్చర్ ని మైండ్ లో చూడాలి. 

కథా కథనాలు
       ఇది ఏ రాజకీయ కుటుంబపు కథో వర్షపు హోరులో ముఖ్యమంత్రి దుర్మరణంతో తెలిసిపోతుంది. అయితే కథనంతో అంటీ ముట్టనట్టు వుండిపోతుంది. ప్రశ్నించే పని చేయదు. ఇదే సమస్య. ప్రశ్న లేకపోవడంతో సినిమా అనే రెండు గంటల విలువైన సమయానికి ప్రయోజనం లేకుండా పోయింది. కాన్ఫ్లిక్ట్ లేకుండా సినిమానెలా వూహిస్తాడు ఏ కొత్త దర్శకుడైనా? కథ కూడా కదలకుండా విగ్రహంలా వున్న చోటే వుంటుందా? ప్రశ్న పుడితే కదలాలన్పిస్తుంది కథకి. పుట్టకపోతే పడుకుని వుంటుంది. కథ కదలడం లేదన్న మినిమం ఫీలింగ్ కూడా దర్శకుడికి కలక్కపోతే ఎలా? 

         రెండోది, దీన్ని విడివిడి కథల ఆంథాలజీగా చేయడం. ఆంథాలజీలు వర్కౌట్ కావని తెలిశాక కూడా. పోనీ ఈ విడివిడి కథల్లోని బాధిత పాత్రలు ఒకటై ముఖ్యమంత్రి విగ్రహ పిచ్చిని ప్రశ్నిస్తాయా అంటే అదీ లేదు. అవి వాటి మానాన అవి కథలు ముగించుకుంటాయి. స్వాతంత్ర్య యోధుడి పాత్ర కూడా ప్రశ్నించి నాల్గు దులుపుళ్ళు దులపక పోతే ఎందుకు? ఇలా వుంటే, ముఖ్యమంత్రి తన తండ్రి విగ్రహం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగడ మేమిటి? ఆ బాధితుల కథలు రాసుకుని జర్నలిస్టు ముఖ్యమంత్రికి చూపిస్తే ముఖ్యమంత్రి ఫీలవడం. ప్రజా శ్రేయస్సు కాదని మూడువేల కోట్లు ధారబోసి విగ్రహం కట్టేశాక కథలు చూపించి ఏం లాభం, ఆయన ఫీలయ్యి ఏం ప్రయోజనం? 

        ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది స్ట్రక్చర్ ఛాయలు లేని మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే. అయితే మిడిల్ మాటాష్ కైనా ముగింపులో  ప్రశ్న పుట్టి  వాళ్ళూ  వీళ్లూ కొట్టుకునే మటన్ ఫ్రై లాంటి నాన్ వెజ్ ముగింపు వుంటుంది. ఇలా వెజ్ కూడా కాని ఎండు గ్రాసంలా వుండదు. దటీజ్ ది మెయిన్ ప్రాబ్లం.

సికిందర్




8, ఆగస్టు 2020, శనివారం

967 : రివ్యూ


దర్శకత్వం: హనీ ట్రెహాన్
తారాగణం: నవాజుద్దీన్ సిద్ధిఖీ
, రాధికా ఆప్టే, తిగ్మాంశూ ధూలియా, ఖాలిద్ త్యాబ్జీ, పద్మావతీ రావ్ తదితరులు
రచన: స్మితా సింగ్
, సంగీతం: స్నేహా ఖన్వాల్కర్, ఛాయాగ్రహణం: పంకజ్ కుమార్
బ్యానర్:  ఆర్ ఎస్ విపి మూవీస్
నిర్మాత: రోనీ స్క్రూ వాలా
, అభిషేక్ చౌబే 
విడుదల: నెట్ ఫ్లిక్స్
***                                                                                                
        టీటీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ రెండో సినిమా రాత్ అకేలీ హై నియో నోయర్ జానర్ లో ఒక మర్డర్ మిస్టరీ. కొత్త దర్శకుడు, క్యాస్టింగ్ డైరెక్టర్ హనీ ట్రెహాన్ దీని మేకర్. వరసగా ఇది క్యాస్టింగ్ డైరెక్టర్లు దర్శకత్వం వహించిన మూడో సినిమా. దిల్ బేచారా తో ముఖేష్ చబ్రా, శకుంతలా దేవి తో అనూ మీనన్ అనే ఇద్దరు క్యాస్టింగ్ డైరెక్టర్లు కూడా డైరెక్టర్ లయ్యారు. ఈ ఇద్దరికీ భిన్నంగా హనీ ట్రెహాన్ మిస్టరీ తీశాడు. ఫ్రేము ఫ్రేముకీ చాలా కష్ట పడ్డాడు.అయితే ఈ క్రియేటివ్ కష్టం మేకింగ్కి వుంటే సరిపోతుందా, కంటెంట్ కి అవసరం లేదా? ఈ ప్రశ్ననోసారి పరిశీలిద్దాం...

కథ
      ఐదేళ్ల క్రితం ఓ రాత్రి కాన్పూర్ హైవే మీద కారుకి యాక్సిడెంట్ జరిపి జంట హత్యలు చేస్తారు దుండగులు. కారులో భూస్వామి రఘు బీర్ సింగ్ భార్య, డ్రైవర్ వుంటారు. వాళ్ళ మృత దేహాలు దొరక్కుండా చేస్తారు. 

        ఐదేళ్ల తర్వాత
, కాన్పూర్ లో అరవై ఏళ్ల భూస్వామి రఘుబీర్ సింగ్, ఎవరో తెలియని ఉంపుడుగత్తె రాధ (రాధికా ఆప్టే) ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న రాత్రే హత్యకి గురవుతాడు. సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) దర్యాప్తు చేపడతాడు. రాధతో బాటు మహల్లో చాలా పరివారముంటుంది. రఘుబీర్ సింగ్ మొదటి భార్య తమ్ముడు విశాల్, కొడుకు కరణ్, కూతురు కరుణ, అల్లుడు రవి, చెల్లెలు ప్రమీల, మేనల్లుడు విక్రమ్, మేనకోడలు వసుధ, పనిమనిషి చున్నీ...  వీళ్ళందరూ కలిసి ఆస్తి కోసం రాధ చంపిందని ఆరోపిస్తారు. సబిన్ స్పెక్టర్ జటిల్ యాదవ్ అందర్నీ అనుమానిస్తాడు. 

        కేసులో అందర్నీ ప్రశ్నిస్తూ ముందుకు పోతున్న అతణ్ణి లోకల్ నాయకుడు మున్నారాజా
(ఆదిత్యా శ్రీవాస్తవ) అడ్డుకుంటాడు. మున్నా రాజా ఎసెస్పీ లాల్జీ శుక్లా (తిగ్మాంశూ ధూలియా) కి సన్నిహితుడు. లాల్జీ శుక్లా జటిల్ యాదవ్ దర్యాప్తుకి బ్రేకులేస్తూంటాడు. జటిల్ యాదవ్ కి నిజాన్ని బయటికి లాగి దోషిని పట్టుకోవాలన్న పట్టుదల పెరిగిపోతుంది.

        ఇంతకీ ఎవరు దోషి
? ఎందుకు చంపారు? అంత మంచి చరిత్రలేని రాధ పెళ్ళయిన రాత్రి ఏం చేసింది? మతి స్థిమితం లేని హతుడి కొడుకు ఆస్తిని ఆజమాయిషీ చేయలేడని హక్కులు పొందాలని చూస్తున్న హతుడి బావమరిదే చంపాడా? కరెంటు పోయిందని లాంతరేసుకుని హతుడి గదిలోకి వెళ్ళిన పని మనిషి చున్నీ అక్కడ ఎవర్ని చూసింది? హతుడి మేనకోడలు వసుధ ఆ రాత్రి కాసేపట్లోనే వేసుకున్న చున్నీ ఎందుకు మార్చుకుంది? హతుడి చెల్లెలు ప్రమీల, మేనల్లుడు విక్రమ్ లోకల్ లీడర్ మున్నారాజాని వాటా ఎందుకు అడిగారు? ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో చున్నీని ఎవరు, ఎందుకు చంపారు? చున్నీని చంపిన హంతకుణ్ణి ఎవరు చంపారు? ప్రమీల ఎందుకని ఆత్మహత్య చేసుకుంది? ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు రాధా గతమేమిటి? ఐదేళ్ల క్రితం జరిగిన జంట హత్యల వెనకెవరున్నారు? అసలు హతుడు రఘుబీర్ సింగ్ అసలు స్వరూపమేమిటి? ఈ జటిల కేసుని సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ ఎలా పరిష్కరించాడు? ఇదీ మిగతా కథ. 

నటనలు - సాంకేతికాలు
     సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి మార్క్ వేస్తాడు. పాత్ర గురించి దర్శకుడు వివరించినట్టు, అతను సామాన్యుడిలా వుండాలి. హీరోలా అన్పించకూడదు. చేసే పనులలో హీరోయిజం వుండాలి. అలా సినిమా ఎస్సై లా కాకుండా, రియల్ ఎస్సైలా వుంటాడు. అతడికి 40 ఏళ్ళు. పెళ్లి కాలేదు. అతడి తల్లి (ఇళా అరుణ్) అతడి ఫోటో ఎవరికి చూపించినా రంగు తక్కువ, వయసు ఎక్కువని సంబంధాలు రావు. రంగు పెరగడం కోసం ఒక క్రీము వాడుతూంటాడు. ఇలా అమ్మాయిలకి నచ్చని వాడు, మొత్తమంతా ఆడవాళ్లతో వున్న మహల్లో పడతాడు కేసు గురించి. పెళ్లి రోజే విడో అయిన రాధ పట్ల రోమాంటిక్ గా వుంటూ, ఆమెని కాపాడే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. పాత్ర ఫన్నీగా వుండదు. సీరియస్ గానే వుంటుంది. పాత్రని చివరంటా నిలబెట్టే ప్రయత్నమైతే చేస్తాడు. కానీ కాసేపటి తర్వాత కథే సహకరించదు. ఒకళ్ల తర్వాత ఒకళ్లని ప్రశ్నించే పర్వంతోనే గంటకి పైగా గడిచిపోతుంది. గంటన్నరకి గానీ యాక్షన్ దృశ్యాలు మొదలై పాత్రకి వూపు రాదు. మళ్ళీ చివర్లో అరగంట పాటు వుండే ముగింపు దృశ్యాలు బోరే. ముగింపు థ్రిల్లింగ్ గా లేకపోవడం కారణం.

        రాధికా ఆప్టే పేద బాధిత పాత్ర. మగవాళ్ళతో ఆమె గతం జీవితాన్ని మార్చేస్తుంది. పెళ్ళయిన రాత్రే భర్త చావుకి కేంద్ర బిందువయ్యే పాత్ర. దర్యాప్తుకి ఏమాత్రం సహకరించని పాత్ర. ఈమె కూడా ఒక మార్కు వేస్తుంది. ఇక అనుమానితులుగా మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులకి ఎక్కువ స్పేస్ లేదు. 

        సాంకేతికంగా కాన్పూర్ నేపథ్యంలో తీసిన సినిమా. లొకేషన్స్ బావున్నాయి. అయితే నైట్ సీన్లు ఎక్కువ వుండడం
, పగలు ఇండోర్ సీన్లు కూడా లో- కీ లైటింగ్ తో వుండడం నియో నోయర్ జానర్ అన్పించాలని తీసినట్టుంది. ఓపెనింగ్ లో నైట్ హైవే యాక్సిడెంట్ సీను నోయర్ జానర్ మర్యాదకి బలమైన నిదర్శనం. అయితే నోయర్ జానర్ మర్యాదలకి లైటింగే కాకుండా ఇంకో  ఎనిమిది ఎలిమెంట్స్ వుంటాయి. వీటి జోలికి వెళ్లక పోవడం ఒక లోపం. మూవీలో మిస్టీరియస్ వాతావరణ సృష్టికి నేపథ్య సంగీతం మాత్రం బాగా తోడ్పడింది. పూర్తిగా నోయర్ జానర్ లో లేకపోయినా, కొత్త దర్శకుడు హనీ ట్రెహాన్ మేకింగ్ నైపుణ్యం మాత్రం సాంకేతికంగా మంచి నాణ్యతతో వుంది. మూవీలో వున్న మిస్టరీ స్వభావానికి తగ్గ డార్క్ మూడ్ విజువల్స్ తో ఒక శైలిని పాటించాడు.  

కథాకథనాలు

        నేను మిస్టరీలు తీయను, సస్పెన్సులే తీస్తానన్నాడు సస్పెన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్. ఎందుకంటే మిస్టరీల్లో కూర్చోబెట్టే సస్పెన్స్ వుండదు. చివర్లోనే కథేమిటో, అసలేం జరిగిందో సస్పెన్స్ అంతా ఓపెనవుతుంది. అంతవరకూ ప్రేక్షకులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడమే. ఇలా కాక సస్పెన్స్ కథలో ఇప్పుడేం జరుగుతుందో, ఇంకేం జరుగుతుందో నన్న అనుక్షణ యాక్షన్ లో వుంటుంది సస్పెన్స్. మిస్టరీలు జడప్రాయమైన ఎండ్ సస్పెన్స్ లైతే, సస్పెన్సులు చైతన్యవంతమైన  సీన్ టు సీన్ ఉత్కంఠ రేపే సస్పెన్సులు. కాబట్టి హిచ్ కాక్ మిస్టరీలు ఎందుకు తీయనన్నాడో అసలంటూ అర్ధమైతే, ఎండ్ సస్పెన్స్ సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకోరు. కానీ మన ఇండియన్ సినిమాల్లో అదేం అలవాటో గానీ, మర్డర్ కథ అనగానే వీరావేశంతో ఎండ్ సస్పెన్స్ మిస్టరీలు తీసెయ్యడమే. సస్పెన్స్ అంటే చిట్ట చివరి వరకూ రహస్యం దాచడమే అనుకుంటున్నారు. చాలా సిల్లీ. ఈ పెద్ద బాలశిక్ష స్టేజి అవగాహన నుంచి పైకెదగాలి.

        కొత్త దర్శకుడు హనీ ట్రెహాన్, కొత్త రచయిత్రి స్మితా సింగ్ ఈ నోయర్ ని ప్రయత్నించారు. హాలీవుడ్ నియో నోయర్ చైనా టౌన్ స్ఫూర్తి అన్నాడు ట్రెహాన్. హిచ్ కాక్ తీసిన నార్త్ బై నార్త్ వెస్ట్ కూడా ప్రభావితం చేసిందన్నాడు. హిచ్ కాక్ అభిమానినన్నాడు. కానీ తను తీస్తున్న నోయర్ ని హిచ్ కాక్ లా సస్పెన్స్ కథలో తీయపోవడం అందరి లాగే సస్పెన్స్ కీ మిస్టరీకీ తేడా తెలియకపోవడం వల్లేనని మనం అర్ధం జేసుకోవచ్చు. కొందరు ఆగథా క్రిస్టీ కథా ప్రపంచాన్ని సృష్టించాడన్నారు. ఆగథా క్రిస్టీ కథా ప్రపంచాలు మిస్టరీ నవలలు. మిస్టరీ నవలలు చదివిస్తాయి. మిస్టరీ సినిమాలు బోరు కొడతాయి. ఆగథా క్రిస్టీ మిస్టరీల ముగింపులు మైండ్ బ్లోయింగులు. ట్రెహాన్ మిస్టరీ ముగింపు బోరు. ముగించడానికే అరగంట తీసుకున్నాడు. దాచి పెట్టిన రహస్యాన్ని అరగంట పాటు వివరించాల్సి వచ్చింది. ఇదేమన్నా క్లాస్ రూమ్ పాఠమా? 

        కొందరు గత సంవత్సరం విడుదలైన
నైవ్స్ అవుట్ తో పోల్చారు. నైవ్స్ అవుట్ నోయర్ జానర్ కాదు. నోయర్ జానర్ లో రియాన్ జాన్సన్ అంతకి ముందు బ్రిక్ తీశాడు. పెద్ద స్టార్లతో వస్తూ వుండిన నోయర్ జానర్ తో ప్రయోగం చేసి యువ నటులతో కాలేజీ నేపథ్యంలో టీనేజి నోయర్ గా తీసి సంచలనం సృష్టించాడు. అలాగే నైవ్స్ అవుట్ లో ఆగథా క్రిస్టీ వాతావరణాన్నే క్రియేట్ చేస్తూ ఒక ప్రయోగం చేశాడు. అగథా క్రిస్టీ నవలల్లో వుండే  ఎండ్ సస్పెన్స్ మిస్టరీగా  తీయలేదు. ఎవరు చంపారో మధ్యలోనే చూపించేసి, సీన్ టు సీన్ సస్పెన్స్ గా కథ నడిపాడు. అతను శాస్త్రాన్ని చదివి అర్ధం జేసుకుని సినిమాలు తీస్తాడు. ఏది ప్రింట్ మీడియా కథనమో, ఏది విజువల్ మీడియా కథనమో తెలుసుకోకుండా సినిమాలు తీసి ఫ్లాపవుతున్న వాళ్ళు మనదగ్గరే వున్నారు.

        ఎవరు చంపారు? అన్న విజువల్ మీడియాకి పనికిరాని పాయింటు పట్టుకుని రెండున్నర గంటలు లాగాడు. గంట లోగానే కథ కదలక విసుగు పుట్టిస్తుంది. అరడజను మందిని ఒకరి తర్వాత ఒకర్ని ప్రశ్నించడాలే కదలని సీన్స్ ని క్రియేట్ చేస్తాయి. అనుమానితులందరూ మార్పు లేకుండా అనుమానితులుగానే వుండిపోతారు. కథలో చలనం కోసం అనుమానితులని ఫిల్టర్ చేసి కొందర్ని లిస్టులోంచి తప్పించే చర్యలకి పూనుకోడు సబిన్స్ పెక్టర్. ఎలా వున్న పాత్రల్ని అలా ఈడ్చుకుంటూ పోతూనే వుంటుంది కథ. పోయిపోయి చివరికి హత్యారహస్యం విప్పుతూ అరగంట వివరణ. ఈ వివరణని బుర్ర కెక్కించుకునే ఓపికా ఆసక్తీ వుండవు. చివర్లో వివరణ లెవరిక్కావాలి, విజువల్ యాక్షన్ తో మొదట్నించీ కథ తెలుస్తూండాలి గాని.

        ఎవరు చంపారన్నది ముఖ్యం కాదు, ఎందుకు చంపారన్నది ముఖ్యమన్నాడు దర్శకుడు. కానీ కథ నడిపింది అన్ని మిస్టరీల్లాగే ఎవరు చంపారన్న బోరు కొట్టే పాయింటుతోనే. ఎవరు ఎందుకు చంపారో చివర్లో రివీల్ చేశాడు. దాన్ని బట్టి ఈ కథలో స్త్రీలందరూ ఏదో రకంగా హతుడి బాధితులే. అంటే పితృస్వామ్యం పాయింటు అన్నమాట. కహానీ 2 లో, హైవే లో చైల్డ్ ఎబ్యూజ్ పాయింటు లాగా. ఈ రెండు సినిమాలూ సస్పెన్స్ థ్రిల్లర్స్. ముగింపులో రివీలయ్యే చైల్డ్ ఎబ్యూజ్ పాయింటు షాకింగ్ గా, డిస్టర్బింగ్ గా వుంటుంది. అదీ ముగింపు అంటే. 

        ట్రెహాన్ మిస్టరీలో అతను చెప్పినట్టు ఎందుకు చంపారన్నది ముఖ్యమైనప్పుడు
, ఎవరు చంపారన్న ప్రశ్నతో కాకుండా, ఎందుకు చంపారన్న ప్రశ్న తలెత్తేలా స్త్రీ పాత్రల్ని డ్రైవ్ చేసి వుంటే సరిపోయేది. అరవై ఏళ్ల వాణ్ణి పెళ్ళయిన రాత్రి ఎందుకు చంపారు? నిజంగానే ఈ ప్రశ్న కుతూహలం రేకెత్తించేదే. కానీ సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ ఈ ప్రశ్న వదిలేసి, పసలేని ఎవరు చంపారన్న ప్రశ్న మీదే దృష్టి పెట్టి కథ నడుపుకున్నాడు. 

        మీరందరూ అనుమానితులే అంటాడు
, కానీ మిమ్మల్ని చూస్తే జాయింటుగా సమ్ థింగ్ ఇంకేదో ఫీలవుతున్నాను, అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను... అని వుంటే,  ఆ ఫీలింగ్ తో కథ నడిపివుంటే, అప్పుడు అరవై ఏళ్ల పెళ్లి కొడుకుని శోభనం కాకుండానే ఎందుకు ఢామ్మని రైఫిల్ తో కాల్చి ఖతం చేసి పారేశారన్న కథకి ఆపరేటింగ్ క్వశ్చన్, లేదా డ్రమెటిక్ క్వశ్చన్ ప్రేక్షకుల్ని ఎలర్ట్ చేసేది.
                       
సికిందర్




5, ఆగస్టు 2020, బుధవారం

966 : పాలపిట్ట ఆర్టికల్ -విస్మృత సినిమాలు




        దుల సంఖ్యలో సినిమాలు తీసినా అపజయా లెరుగని దర్శకులు అరుదుగా వుంటారు. కోవెల మూడి బాపయ్య అలాటి అగ్ర దర్శకుల్లో ఒకరు. తీసిన 80 సినిమాల్లో నాలుగే అపజయాలతో అగ్రశ్రేణి కమర్షియల్ దర్శకుడుగా కొనసాగారు ఇటు తెలుగులో, అటు హిందీలోనూ. తెలుగులో 39, హిందీలో 31 తీయడం రికార్డు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, దిలీప్ కుమార్, ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, జితేంద్ర, సంజీవ్ కుమార్, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి, షారుఖ్ ఖాన్, శ్రీదేవి, జయప్రద, జయసుధ, శారద, హేమమాలిని ... ఇలా హేమాహేమీలే ఆయన తారాతోరణం. సోగ్గాడు, ఎదురులేని మనిషి, యుగ పురుషుడు, ముందడుగు, మండే గుండెలు, నాదేశం, మవాలి, దిల్దార్, బందిష్, మక్సద్... ఇలా సూపర్ హిట్స్ తోనే ఆయన వైభవం. ఇలా 1970 - 95 మధ్య పాతికేళ్ళూ 80 సినిమాలతో విజయ యాత్ర చేశారు. 1988 -95 మధ్య నైతే ఏడేళ్ళూ వరసగా 14 హిందీ సినిమాలే తీశారు. 

       
యితే 1970 లో ప్రారంభ చిత్రం నవల ఆధారంగా తీయడం విశేషం. 1954 లో జోసెఫ్ హేస్ అనే రచయిత రాసిన ‘డెస్పరేట్ అవర్స్’ అన్న నవల మొదట 1955 లో నాటకంగా ప్రదర్శించారు. 1955 లో హాలీవుడ్ సినిమాగా తీశారు. 1970 లో కృష్ణం రాజు తో బాపయ్య ‘ద్రోహి’ గా తీశారు. దీన్నేశివాజీ గణేశన్ తో కృష్ణన్ అనే దర్శకుడు తమిళంలో రీమేక్ చేశాడు. ఈ రెండూ ఫ్లాపయ్యాయి. ఆ తర్వాత ‘డెస్పరేట్ అవర్స్’ ఆధారంగా హిందీలో రాజ్ కుమార్, సునీల్ దత్, మాలాసిన్హా లతో ‘36 ఘంటే’ గా 1974 లో నిర్మించారు. ముగ్గురు ఖైదీలు జైలు నుంచి తప్పించుకుని ఒక ఇంట్లో జొరబడే కథ ఇది.


    కె. బాపయ్య నవలల ఆధారంగా దర్శకత్వం వహించిన సినిమాలు రెండే. 1970 లో కృష్ణం రాజు తో ‘ద్రోహి’ తర్వాత, మళ్ళీ కృష్ణం రాజుతోనే 1981 లో యద్దనపూడి సులోచనా రాణి నవల ఆధారంగా ‘అగ్నిపూలు’ తీశారు. రెండూ పరాజయం పాలయ్యాయి. కృష్ణం రాజు ద్విపాత్రాభినయం, జయప్రద, జయసుధ, జయంతి, శ్రీధర్, గుమ్మడి, సత్యనారాయణలతో సురేష్ ప్రొడక్షన్స్  పతాకంపై ప్రసిద్ధ నిర్మాత డి. రామానాయుడు దీన్ని నిర్మించారు. 

        ‘అగ్నిపూలు’ 1981 మార్చి 12 న విడుదలయ్యింది. ‘అగ్నిపూలు’ కి ముందు ఫిబ్రవరి 14 న ఎన్టీఆర్, శ్రీదేవిలతో బాపయ్యే దర్శకత్వం వహించిన ‘అగ్గి రవ్వ’ విడుదలైంది. అలాగే ‘అగ్నిపూలు’ విడుదలైన తొమ్మిది రోజుల్లో వెంటనే మార్చి 21 న ఏఎన్నార్, కృష్ణ నటించిన బాపయ్య సినిమానే ‘గురు శిష్యులు’ విడుదలయ్యింది. ఇలా 35 రోజుల్లో బాపయ్య సినిమాలు మూడు విడుదలవడం విశేషమైతే, మధ్యలో విడుదలైన ‘అగ్నిపూలు’ పరాజయం చెందడం అర్ధంగాని విషయం. నిజానికి పరాజయం చెందేంత చెడ్డ విషయమేమీ లేదిందులో. పైపెచ్చు కథాకథనాలు, నటనలు, చిత్రీకరణ నాణ్యతతో వున్నాయి. కుటుంబ కథా చిత్రాలంటే గత రెండు దశాబ్దాలుగా వస్తున్న మాఫియా - ఫ్యాక్షన్ కుటుంబాల హింసాత్మక సినిమాల్లాగా కాకుండా, అచ్చమైన కుటుంబ సంబంధాల మానసిక సంఘర్షణగా మనకి కన్పిస్తుంది. రెండున్నర గంటలు యూట్యూబ్ లో ఏకబిగిన చూసేలా చేస్తుంది. 

         
అయితే ఆ నాటి ప్రేక్షకులు ఇందులోని వినోదం పాలు తక్కువ, విషయ గాంభీర్యం ఎక్కువవడం ఇష్టపడ లేదేమో. ప్రథమార్ధంలో గంట సేపటికి గానీ ఒక కామెడీ సీను అల్లు రామలింగయ్యతో రాదు. అలాగే కృష్ణం రాజు - జయప్రదలతో సినిమా మొత్తంమీద వున్న ఒక్క యుగళ గీతమూ గంట తర్వాత గానీ రాదు. నవలని మార్చకుండా యధాతథంగా తీశామన్నారు. కమర్షియల్ విజయాలు సాధించే బాపయ్య, నవలకి న్యాయం చేయబోయి సినిమాని నాటి ప్రేక్షకుల కోసం తగిన వ్యాపార విలువలతో తీయలేక పోయారేమో.

అగ్నిపూలెంతో ఇష్టం

    విహార యాత్ర కెళ్ళిన ‘పక్షుల వేసవి విడిది కేంద్రం’ లో కింద రాలిపడి పూలుంటాయి. ఏడాది కొకసారి వచ్చే వలస పక్షుల్లాగే, అమెరికా నుంచి వచ్చిన స్కర్ట్ ధరించిన ఆధునికురాలు జయసుధ, అవేం పూలని అడుగుతుంది. ఇంగ్లీషులో ఫ్లవర్స్  ఆఫ్ ది ఫారెస్ట్ అనీ, తెలుగులో మోదుగ పూలనీ, లేకపోతే అగ్నిపూలనీ అంటారని వివరిస్తాడు సత్యనారాయణ. పగదీర్చుకోవడానికి అమెరికా నుంచి వచ్చి వుంటున్న జయసుధ, మొదటి సారిగా ఆనందంగా చూసి, ‘బ్యూటిఫుల్’ అంటుంది. తర్వాత ఆ పూలు పట్టుకుని వుంటే, ఆ పూలంటే అంతిష్టమా అనడుగుతాడు సత్యనారాయణ. అవునంటుంది జయసుధ, ‘నా గుండెల్లో రేగుతున్న మంటల్లా వున్నాయి... నా కళ్ళు చూస్తే అగ్ని పూలు కన్పించడం లేదా డాక్టర్?’ అంటుంది. 

        ఇలా టైటిల్ జస్టిఫై అవుతుంది. ఈ సీను ప్రథమార్ధం మధ్యలో వస్తుంది. ఇంతకీ జయసుధ ప్రతీకారం దేనికి, ఎవరి మీద? తుపాకీతో కాల్చి పారేసేంత గుండె మంటతో వున్న తనని ఈ పరిస్థితి లోకి నెట్టేసిందెవరు?

        అతను విరూపాక్షి రాజా (కృష్ణం రాజు). ఆమె రాజేశ్వరి (జయంతి). ఇద్దరూ దేనికైనా తెగించే స్వార్ధ పరులు. ఆమె జమీందారు గోవింద వల్లభ రాజా (గుమ్మడి) కూతురు. అతను అల్లుడు. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా దర్పం పోని వల్లభ రాజా లంకకి లంకంత రాజ భవనం (మైసూరు మహారాజా ప్యాలెస్), వందల ఎకరాల ఎస్టేటూ  గల సంపన్నుడు. వంశ కట్టుబాట్లకి ప్రాణమిస్తాడు. భార్య అన్నపూర్ణ (నిర్మలమ్మ) కి కట్టుబాట్లు కాదు, మనుషుల మధ్య సత్సంబంధాలు ముఖ్యం. గుర్రమెక్కి తుపాకీ పట్టుకుని, పులుల్ని వేటాడే అల్లుడు విరూపాక్ష రాజా, ఎస్టేట్ కూలీలకి కొరడా దెబ్బలు కూడా పంచుతూంటాడు. పెంపుడు కుక్క సుల్తాన్ కి సరిగా ఆహారం పెట్టకపోతే చావ బాదుతూంటాడు. ఇలా కూతురూ అల్లుడూ స్వార్ధంతో ఆస్తిపాస్తులెలా కాజెయ్యాలా అని కాచుకుని వుంటారు. 

        వీళ్ళ పంట పండి అమెరికాలో వుంటున్న వల్లభ రాజా కొడుకు శివ ప్రసాద్ (శ్రీధర్)  అక్కడ మేరీ అనే అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం పట్టుకుని కూతురూ అల్లుడూ పథక రచన చేస్తారు. ఆ ఉత్తరం చూసి రెచ్చిపోయిన వల్లభ రాజా, కట్టుబాటు తప్పిన కొడుకు మొహం ఇక చూడనంటాడు. విరూపాక్ష రాజా ఇంకా రెచ్చ గొడతాడు. ఇక తన చావుక్కూడా వాణ్ణి పిలవొద్దంటాడు వల్లభ రాజా. తల కొరివి అల్లుడే  పెట్టాలంటాడు. అలా జమీందారీ వారసత్వం అల్లుడికే అప్పగించేస్తాడు

.    దీంతో కూడా వూరుకోడు విరూపాక్ష రాజా. మామ గతించాక జమీందారీ చేతిలో పెట్టుకుని భార్య రాజేశ్వరి సహకారంతో శివప్రసాద్ కీ, అతడి భార్య మేరీకీ పూర్తిగా అన్యాయం తలపెడతాడు. ఈ విషయం పెద్దయ్యాక శివప్రసాద్ కూతురు జానకి అలియాస్ జేనీ (జయసుధ) తల్లి రాసిన డైరీలో తెలుసుకుంటుంది. ఇటు విరూపాక్ష రాజా కూడా గతించడంతో జమీందారీ వ్యవహారాలు కొడుకు కృష్ణ చైతన్య (కృష్ణం రాజు) చేతికొస్తాయి. ఇతడికో తమ్ముడు రాహుల్ (శరత్ బాబు), చెల్లెలు భవానీ (సుమలత) వుంటారు. కృష్ణ చైతన్య మెత్తటి స్వభావం కలవాడు. ఓ నాట్య ప్రదర్శనలో నాట్యం చేస్తున్న రుక్మిణి (జయప్రద) ని చూసి పెళ్లి చేసుకుంటాడు. రుక్మిణి ప్రమాదంలో కాళ్ళు దెబ్బతిని చక్రాల కుర్చీకి పరిమితమై పోతుంది. వీళ్ళ కిద్దరు పిల్లలు.

        ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్నపూర్ణ కోరికపై అమెరికానుంచి మనవరాలు జేనీ, మనవడు బాబీ (సుధాకర్) వస్తారు. జేనీ ఎవరితోనూ కలవక ఎడమొహం పెడ మొహంగా వుంటుంది. ఎలాగైనా బావ కృష్ణ చైతన్యని చంపి పగదీర్చుకోవాలనుకుంటుంది. బాబీ కృష్ణ చైతన్య చెల్లెలు భవానీతో ప్రేమలో పడతాడు. భవానీకి మిర్యాల పురం సంబంధం చేసుకోవాలని పట్టుదలతో వుంటుంది ఆమె తల్లి రాజేశ్వరి. మరో వైపు కాళ్లులేని కోడలు రుక్మిణిని రెండో పెళ్ళికి కొడుకు కృష్ణ చైతన్యని ఒప్పించమని ఆదేశిస్తుంది. ఇక తల్లిని యధాతథంగా ఇబ్బంది పెడుతూంటుంది.

        ఇలా ఆనాడు రాజేశ్వరి భర్తతో కలిసి పన్నిన పన్నాగం వల్ల ఇప్పటికీ తండ్రి ఆస్తికి  ఆమె అక్రమ వారసురాలై, ముగ్గురు ఆడవాళ్ళు నానా కష్టాలూ  పడుతూంటారు. తల్లి అన్నపూర్ణ, కోడలు రుక్మిణి, మేనకోడలు జేనీ...  పూర్వం జేనీ తల్లి మేరీ కూడా బాధితురాలే. ఆమెతో కలుపుకుని నల్గురు ఆడవాళ్లు నరకం అనుభవిస్తారు. ఈ మొత్తం సంక్షోభానికి కారణమైన రాజేశ్వరి ఆట ఎలా కట్టింది? రుక్మిణి రెండో పెళ్ళికి భర్త కృష్ణ చైతన్యని ఒప్పించిందా? జేనీ తల్లిదండ్రులేమయ్యారు? జెనీకి బావ కృష్ణచైతన్య మీద పగకి కారణ మేమిటి? అతణ్ణి చంపిందా? ఆనాడు మేరీని పెళ్లి చేసుకున్నట్టు శివప్రసాద్ రాసిన ఉత్తరంతో ప్రారంభమైన కుటుంబ సంక్షోభం, ఈనాడు మేరీ రాసిన డైరీ వల్ల పరిష్కారమైందా? ... ఇవీ మిగతా కథలో తేలే ఆసక్తికర అంశాలు.

నల్గురు అతివల గాథ
    ఇది కుటుంబ కథా చిత్రమే కాకుండా నాలుగు స్త్రీ పాత్రలతో కూడిన మహిళా చిత్రమని  కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే అభ్యుదయం కోసం మహిళల తిరుగుబాటులా కాకుండా, కుటుంబ సంబంధాల్లో మానసిక సంఘర్షణల కుమ్ములాట. దీనికి విరూపాక్ష రాజా పాత్రలో మొదటి కృష్ణం రాజు చిచ్చు పెట్టి పోతే, అతడి కొడుకు పాత్ర కృష్ణ చైతన్యగా రెండో కృష్ణం రాజు కథలో నిమిత్త మాత్రుడుగా, పాసివ్ గా వుండి పోతాడు. కథంతా స్త్రీ పాత్రల చుట్టే వుంటుంది. ఈ స్త్రీ పాత్రల కథ, సన్నివేశాల కూర్పు అర్ధవంతంగా, ఆలోచనాత్మకంగా వుంటాయి. కథా బలం కోసం వినోదాత్మక విలువల్నే త్యాగం చేశారు.   అయితే ఇది కమర్షియల్ సినిమా లెక్కల్లో వుండాల్సిన ఒక ప్రధాన పాత్ర, దాని సమస్య, సమస్యతో దాని సంఘర్షణా అనే చట్రంలో ఒక కథగా గాకుండా - ఓ ప్రధాన పాత్రంటూ లేని నాల్గు స్త్రీ పాత్రల ఉమ్మడి వృత్తాంతం గావడంతో, కథా లక్షణాలు కోల్పోయి గాథగా మారింది. కథల్లో పాత్ర కథని నడిపిస్తుంది, గాథల్లో గాథే పాత్రల్ని నడిపిస్తుంది. గాథలు నవలలకి బావుంటాయి, కమర్షియల్ సినిమాలకి కావాల్సింది కథలే, గాథలు కాదు. అందువల్ల ఈ కారణం చేత ప్రేక్షకులకి నచ్చలేదేమో. గాథల్ని ‘పెదరాయుడు’ లా తీసి నిలబెట్టడం అరుదుగా జరుగుతూంటుంది.


        ఇది గాథైనప్పటికీ పాత్ర చిత్రణలు ఆకర్షిస్తాయి. జయంతి, నిర్మలమ్మ, జయప్రద, జయసుధ, అమెరికా పాత్ర నటించిన హిందీ నటి. ఈ ఐదుగురు కాకుండా పని మనిషి నీలి పాత్రలో సుభాషిణి కూడా. అయితే సుభాషిణి పాత్ర సమస్య అనవసరమైనదిగా కనిపిస్తుంది. ఇదెలాగో తర్వాత చూద్దాం. 

        మొదట రాజేశ్వరి : ఈ ప్రతి నాయకి పాత్రలో జయంతి ఒక ప్రధానాకర్షణ. ఇలాటి ‘దుష్ట’ పాత్ర ఆమెకిదే మొదటిసారి. జమీందారిణీ దర్పం, అహం, పొగరు, దుర్నీతి ఆమె నటనతో విలనీకే వన్నె తెస్తాయి. తండ్రి ఆస్తి తమ్ముడికి అంగుళం దక్కకుండా తనే కాజేసి కూర్చుంటుంది. తల్లిని నోరెత్త నివ్వదు. తల్లి కోరిక మేరకు కూతురు భవానీ పెళ్లి తమ్ముడి కొడుకు బాబీతో జరగనివ్వదు. ఆ పెళ్లి ఇక్కడే చేసి చూపిస్తానని తల్లి అన్నపూర్ణ అంటే, ‘ఏమిటీ ఇక్కడ చేస్తావా? ఇది ధర్మ సత్రం కాదు, అడ్డమైన వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి!’ అని ఎదురు దాడికి దిగుతుంది. 

        ‘ఎవడే అడ్డమైన వాళ్ళూ? వాళ్ళకి చెందాల్సిన ఇల్లూ వాకిలీ మీరు కాజేసి?’ అని తల్లి అంటే, ‘అమ్మా, మాటలు జాగ్రత్తగా రానీయ్!’ అని హెచ్చరిస్తుంది. 


     ‘నోర్ముయ్యవే. గుడ్డొచ్చి పిల్లని  వెక్కిరించిందనీ నన్ను మాటలు జాగ్రత్తగా రానీ అం టావటే నువ్వు?  పుట్టినప్పుడు జానెడు లేవు. అనవే నీ ఇష్టమొచ్చినట్టు అను. ఇదంతా మీ నాన్న చేసిన నిర్వాకం. నా ఇంట్లోనే నన్ను పనిమనిషిని చేసి వున్నదంతా నీకు కట్ట బెట్టి పోయాడా మారాజు’ అని తల్లి వాపోతే, ‘ఆఁ కట్టబెట్టాడు! నా నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి వెళ్ళాడమ్మా మీ ఆయన. ఆడా మగా అంతా నేనే సర్దుకోలేక చస్తున్నాను. ఇన్నేళ్ళుగా పెట్టి పోషిస్తున్న దాన్ని, కన్న కూతుర్ని నా కంటే ఇవ్వాళ వచ్చిన కొడుకు పిల్లలు ఎక్కువై పోయారు నీకు!’ అని రెచ్చిపోతుంది. 

        ‘ఇదిగో వాళ్ళ పేరెత్తితే వూరుకోను!’ అని తల్లి మందలిస్తే, ‘వూరుకోక పోతే వూరేగు!’ అంటుంది ఈసడింపుగా. మంచి మర్యాదలు, దయ, జాలి ఏవీ వుండవు. ఆస్తిని ఆజమాయిషీ చేస్తున్న కొడుకు కృష్ణ చైతన్యతోనే ప్రేమ. ఫ్యూడల్ కుటుంబాల్లో పురుషులు స్త్రీలని అణిచేసే సంగతులుంటాయి. ఇక్కడ స్త్రీయే స్త్రీలని అణిచి పారేస్తోంది. 

        అన్నపూర్ణ : మాట వినని భర్త, పులిగోరు మెళ్ళో వేసుకునే మేకవన్నె పులి అల్లుడు, ఆస్తి నొక్కేసిన విశ్వాసం లేని కూతురు...వీళ్ళతో ఏళ్లకేళ్ళు నలిగిపోయి విముక్తి కోసం ఎదురు చూసే పాత్ర. విడిపోయిన కుటుంబాన్ని కొడుకు పిల్లల్నైనా ప్రయోగించి తిరిగి ఏకం చేయాలన్న తాపత్రయం తనది. తన శైలిలో నీటుగా పాత్ర పోషణ చేస్తుంది నిర్మలమ్మ. అప్పట్లో ఆమె గ్లామర్ కూడా బావుంది.   

        రుక్మిణి : ఇది జయప్రద వేదనాభరిత పాత్ర. చక్రాల కుర్చీకి అంకితమై భర్త సుఖం కోసం కుమిలిపోయే పాత్ర. పైగా అత్త రాజేశ్వరి అల్టిమేటంతో ఇంకింత కుంగుబాటు. భర్తని రెండో పెళ్లి చేసుకోమని ఒప్పించలేక, అతడి బేషరతు ప్రేమకి పాత్రురాలూ  కాలేక నలిగి పోతూంటుంది. తనకి విముక్తి ఎలా లభిస్తుంది? ఇదొక విషాదకర ముగింపు. ఈ పాత్రలో జయప్రద అత్యంత రూపవతిగా కన్పిస్తుంది. డాన్సర్ పాత్రలో ఆమె చేసే సర్ప నృత్యం సినిమాకే హలైట్ అనొచ్చు. నేల మీద సర్పమంత వేగంగా సరసర ప్రాకే శరీర విన్యాసాలతో ఆశ్చర్య పరుస్తుంది. 

        మేరీ : హిందీ నటి పోషించిన మరో బాధిత పాత్ర. భర్త శివప్రసాద్ తో వస్తే రాజ భవనంలో కాకుండా అవుట్ హౌజ్ లో పెట్టి అవమానించిన మామ మీద ఆమె కేం కోపముండదు. మామ చావుకి దగ్గరికి కూడా రానివ్వకుండా, కొరివి పెట్టనివ్వకుండా, భర్తని వెలివేసిన తీరని బాధ ఓ వైపుండగా, ఆ భర్తకి విరూపాక్ష రాజా భర్తకి తలపెట్టిన కీడు దహించి వేస్తుంది. అదంతా డైరీలో రాసిపెట్టి తనూ అన్యాయమైపోతుంది. విరూపాక్ష రాజా పెంపుడు కుక్క సుల్తాన్ అంత పనీ చేస్తుందని వూహించదు.

     జేనీ : జయసుధ పాత్ర. ఈ పాత్రని చెక్కిన తీరు గుర్తుండి పోతుంది. తండ్రి పులిగోరు మెళ్ళో వేసుకున్న కృష్ణ చైతన్యని చంపాలన్న ఏకైక లక్ష్యంతో రహస్య ఎజెండా అమలు చేస్తూంటుంది. డాక్టర్ విశ్వం (సత్యనారాయణ) తో మాత్రమే తన బాధ చెప్పుకుంటూ వుంటుంది. మా ఇంటికి మేం పరాయి వాళ్ళల్లా వచ్చామని అక్కసు వెళ్ళ గ్రక్కుతుంది. తల్లి రాసిన డైరీ చదువుతూ, ఆనాడు అసలేం జరిగిందో తెలుసుకుంటూ వుంటుంది. ఈ ఆ స్తిపాస్తులకి నిజమైన వారసులు తను, తన అన్న బాబీ. ఇది కాదు తనకి ముఖ్యం, ఆ మేనమామ విరూపాక్ష రాజా చేసిన అన్యాయానికి గుర్తుగా మిగిలిన బావ కృష్ణ చైతన్యని తుపాకీ తో కాల్చి చంపడం ముఖ్యం. అదే మేనత్త రాజేశ్వరికీ శిక్ష. అప్పుడే తనకి ఈ మానసిక క్షోభ నుంచి విముక్తి. ముగింపు దృశ్యాల్లో జయసుధ టెర్రిఫిక్ గా వుంటుంది. అప్పటికామె ఇంకా లేత వయసులో స్లిమ్ గా వుంది. బీజ్ కలర్ జీన్స్, బ్రౌన్ కలర్ టీస్ లో యూత్ అప్పీల్ తో టెర్రిఫిక్ గా కన్పిస్తుంది. 

        నీలి : పని మనిషిగా సుభాషిణి పాత్ర. జేనీ అన్న బాబీ ఈమెని గర్భవతిని చేస్తాడు. ఈ నిజం చెబితే బాబీ చిక్కుల్లో పడతాడు. కారకుడెవరో చెప్పితీరాలని కుటుంబమంతా నిలదీస్తారు. చెప్పలేక కుమిలిపోతుంది. చివరికి మూగ వాడైన పనివాడిని చూపిస్తుంది. ఆ మూగ వాడితో పెళ్ళయి పోతుంది.

చివర్లోనే రెండో కృష్ణం రాజు
      ఇలా స్త్రీ పాత్రల సమాహారంగా వుంటుంది. జయప్రద, జయసుధ పాత్రలకి ఫ్లాష్ బ్యాకులుంటాయి. ఫ్లాష్ బ్యాక్ అనగానే మొత్తం ఒకేసారి బారెడు చూపించే ఆచారం ఇప్పటికీ ఒకటుంది. దీంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతోందంటే అసహనం మొదలై పోతుంది. ఇక్కడ మొత్తం ఒకేసారి ప్రారంభించకుండా, ముందుగా చిన్న చిన్న దృశ్యాలు అప్పుడప్పుడు ఫ్లాష్ బ్యాక్స్ గా వేస్తూ ఆసక్తి రేపుతారు. మనకి ఆసక్తి పుట్టాక, మిగిలిన దృశ్యాలన్నీ ఒకే ఫ్లాష్ బ్యాకుగా వేసేసి ముగిస్తారు. ప్రేక్షకుల్ని భాగస్వాముల్ని చేసే టెక్నిక్ తో మాత్రమే సృజనాత్మకత రాణిస్తుంది. ఒక హాలీవుడ్ రచయిత చెప్పినట్టు, సినిమా రచన అనేది సినిమాతో రచయిత రోమాన్స్ కాదు. అదొక ట్రయాంగిల్ ఎఫైర్. ఈ ముక్కోణ వ్యవహారంలో సినిమా, రచయిత, ప్రేక్షకులూ వుంటారు. సినిమాతో బాటు ప్రేక్షకుల ప్రతిస్పందనలని దృష్టిలో పెట్టుకోని రచయిత విఫలమవుతాడు.  

        కృష్ణం రాజు ద్విపాత్రాభినయం కూడా ఆకర్షణీయమైనదే. అయితే మొదటి పాత్రకున్నంత బలం రెండో పాత్రకి లేదు. స్త్రీ పాత్రల కథ కావడం వల్ల. స్త్రీ పాత్రల సమస్యల్ని చక్కబెట్టే బాధ్యత కూడా వుండదు. ప్రేక్షకులు ఏదో చేస్తాడని ఆశిస్తే నిరాశే ఎదురవుతుంది. చివర్లో నిజాలు తెలుసుకుని తల్లిపాత్రని నిలదీసే సన్నివేశంలో మాత్రం హైలైట్ అవుతాడు. తల్లి ముందు డైరీ పడేసి, ‘ఏడుస్తావేంటమ్మా, ఆనందించు. నీ ఘన కార్యపు ప్రతిఫలం ఎంత ముచ్చటగా వుందో చూసి సంతోషించమ్మా. నువ్వూ నాన్నగారూ చేసిన పాపాల చిట్టా చూడు. ఇన్నాళ్ళూ నాకు తెలియకుండా దాచిన మీ నేరాల్నీ ఘోరాల్నీ ఎత్తి చూపి నాకు కర్తవ్యాన్ని భోదించిన గీతమ్మా అదీ. మంచి మనుషుల్ని బాధించీ పీడించే రాక్షసుల చరిత్రతో నిండిన రామాయణమమ్మా... జోహార్లమ్మా నీకూ...’  ఇలా విచలితుడవుతూ భావోద్వేగాల్ని పండిస్తాడు.

        కృష్ణం రాజు తమ్ముడి పాత్రలో శరత్ బాబుకి ప్రాధాన్యం లేదు. జయసుధ అన్న బాబీగా సుధాకర్ పాత్ర మాత్రం అభ్యంతర కరంగా వుంటుంది. శివ ప్రసాద్ కొడుకుగా అతణ్ణి కాముకుడిగా చిత్రించారు. నిజానికి జయసుధ పాత్రతో బాటు తను సానుభూతి పొందాల్సిన బాధిత పాత్ర.  అలాటిది కాముక చర్యలతో మొదట మరదలు భవానీ మీద కన్నేసి, సాధ్యం కాకపోవడంతో, ‘ఇది విస్కీ ఇది బ్రాందీ’ అని తాగి పాడి పని మనిషిని గర్భవతిని చేస్తాడు. భవానీని పెళ్లి చేసుకుంటాడు. జయసుధ పాత్ర, తండ్రి శివప్రసాద్ పాత్రతో బాటు తనూ, నీతితో వుంటేనే తమకి జరిగిన అన్యాయం చెప్పుకోవడాని కుంటుంది. ఇంతా చేసి బాబీ ప్రవర్తనతో ఏర్పడిన సమస్య కథ కుపయోగ పడిందీ లేదు. దాన్ని పనివడి మీదే తోసేసి ముగించారు.  

        సినిమాలో వినోదానికి కథతో సంబంధం లేకుండా, అల్లు రామలింగయ్య సీతాపతి కామెడీ ట్రాక్ వుంది. తనని అన్నయ్యా అనీ, పిల్లల్ని తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ అని పిలిచే పిచ్చి భార్యతో కామెడీ. 

        జంధ్యాల మాటలు బావున్నాయి. ఆయన చాలా ఆణిముత్యాలే అందించారు : జమీందార్ల ఇంటి గోడలే కాదు, గుండె గోడలు కూడా అతి మందంగా వుంటాయి...మీ మమత నన్ను చావనివ్వదు, నా మనసు నన్ను బతక నివ్వదు... గొప్పింట్లో పుట్టడం గొప్ప కాదు, పుట్టి గొప్ప మనసు పెంచుకోవడం గొప్పతనం... మనిషికి రీజన్ పెరిగి సీజన్ పోయింది...పిల్లల్ని కనడం గురించి మీ అమ్మకే నువ్వు చెప్తావటే?...

        పాటలు ఆత్రేయ రాశారు. వీటిలో జయప్రద మీద ‘ప్రియుడా పరాకా’ బాగా హిట్టయింది. ‘వయసు కోతి వంటిది’ అనే కృష్ణం రాజు- జయప్రదల మీద యుగళ గీతం లో అశ్లీలం ఎక్కువైంది – ‘తొలిరేయి నీ చేయి తెలియకనే ఎక్కడో తగిలెను...నీకు గిలిగింత అక్కడనే అప్పుడే తెలిసెను...’ అంటూ. కేవీ మహదేవన్ స్వరాలు కూర్చారు.ఎ. వెంకట్ ఛాయాగ్రహణం, కేఏ మార్తాండ్ కూర్పు అందించారు. నిర్మాణ విలువలు డి. రామానాయుడు స్థాయిలో వున్నాయి.

        టీవీ సీరియల్స్ వచ్చి కుటుంబ సినిమాల్ని మింగేశాయి. దాంతో కుటుంబ సినిమాలు మాఫియా యాక్షన్, లేదా ఫ్యాక్షన్ కలిసిన కథలుగా మారిపోయాయి. నేటికీ ఒక ‘అగ్నిపూలు’ లాగా కుటుంబ సంబంధాల మీద కుటుంబ సినిమాలు రాకపోవడం ఒక విచారకర సన్నివేశం.

 
సికిందర్

(పాలపిట్ట - జులై 2020 సంచిక)