రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, జులై 2020, మంగళవారం

959 : రివ్యూ



రచన, దర్శకత్వం : అన్వితా దత్తా
తారాగణం: తృప్తీ దిమ్రీ, అవినాష్ తివారీ, పావలీ దామ్, రాహుల్ బోస్, పరమబ్రత ఛటర్జీ
సంగీతం: అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ దివాన్
బ్యానర్: క్లీన్ స్లేట్ ఫిలిమ్స్
నిర్మాతలు: అనూష్కా శర్మ, కర్ణేష్ శర్మ
విడుదల: నెట్ ఫ్లిక్స్


      ‘ఎన్ హెచ్ -10’, ‘పరీ’ వంటి సినిమాలు, ‘పాతాళ్ లోక్’ వంటి వెబ్ సిరీస్ నిర్మించిన బాలీవుడ్ స్టార్ అనూష్కా శర్మ, తాజాగా ‘బుల్బుల్’ అనే సూపర్ నేచురల్ హార్రర్ తో ఓటీటీ ప్రవేశం చేసింది. నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. రచయిత్రి అన్వితా దత్ దర్శకురాలిగా పరిచయమైంది. 19 వ శతాబ్దపు నేపథ్యంతో ‘డ్రాక్యులా’ ని తలపించే ఫీల్ తో, సంజయ్ లీలా భన్సాలీ లాంటి దృశ్య వైభవంతో, పిశాచ కథని కవితాత్మకంగా తెరకెక్కించింది. ‘పోస్టర్ బాయ్స్’, ‘లైలా మజ్నూ’ అనే రెండు సినిమాల హీరోయిన్ తృప్తీ ధిమ్రీ టైటిల్ పాత్ర నటించింది. రాహుల్ బోస్ ద్విపాత్రాభినయం చేశాడు. అమిత్ త్రివేదీ సంగీతం చేశాడు. ఇలా ఓ జమీందారీ కుటుంబంలో అంతఃపురపు కుట్రల్ని వెల్లడించే ఈ కథేమిటో ఒకసారి చూద్దాం... 

కథ
     1880 లో బెంగాల్లో ఐదేళ్ళ బుల్బుల్  కి పెళ్ళవుతుంది. తన తోటి బాలుడు సత్యతో పెళ్లి చేస్తున్నారని అనుకుంటే, సత్య అన్న ఇంద్రనీల్ (రాహుల్ బోస్) తో పెళ్లయి పోతుంది. ఐదేళ్ళ బుల్బుల్ ని పెళ్ళిచేసుకున్న పెద్ద జమీందారు ఠాకూర్ ఇంద్రనీల్ కి తనలాగే వున్న కవల సోదరుడు మహేంద్ర (రాహుల్ బోస్) వుంటాడు. ఇతడికి మతిస్థిమితం వుండదు. ఇంకో ఏడేళ్ళ తమ్ముడు, బుల్బుల్ తో కలిసి ఆడుకున్న సత్య వుంటాడు. ఇరవై ఏళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు లండన్లో చదువు పూర్తి చేసుకున్న సత్య (అవినాష్ తివారీ) తిరిగొస్తాడు. వచ్చేసరికి చాలా మార్పులు జరిగివుంటాయి. పెద్దన్న ఇంద్రనీల్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు, చిన్నన్న చనిపోయాడు. చిన్న వదిన బినోదిని (పావలీ దామ్) వితంతువుగా శిరోముండనం చేయించుకుని తెల్ల చీరలో వుంది. పెద్దన్న భార్య బుల్బుల్ (తృప్తీ ధిమ్రీ) దొరసానిలా జమీందారీ బాధ్యతలు చేపట్టింది.  

        బుల్బుల్ కి చిన్నప్పుడు సత్యతో పెళ్లి కాలేదన్న బాధ వుంటుంది. సత్య ఆమెని వదినలాగే చూస్తూంటాడు. అయితే చుట్టు పక్కల ఒక పిశాచి సంచరిస్తోందనీ, అది మనుషుల్ని చంపేస్తోందనీ అందరూ అంటూంటే వింటాడు. చిన్నన్న మహేంద్రని కూడా పిశాచి చంపేసిందని అంటారు. ఇలా వుండగా ఇప్పుడు అడవిలో వేట కెళ్తే తన కళ్ళ ముందే పోలీసు కొత్వాల్ శవవుతాడు. దీంతో ఈ చావుల రహస్యం తెలుసుకోవాలని నిశ్చయించుకుంటాడు సత్య.

        ఈ చావులు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా పిశాచి చంపుతోందా? ఎందుకు చంపుతోంది? చిన్నన్నని పిశాచియే చంపిందా? పెద్దన్న ఎక్కడికెళ్ళి పోయాడు? ఈ మొత్తం పరిణామాల్లో డాక్టర్ సుదీప్ (పరమబ్రత ఛటర్జీ) పాత్రేమిటి? ఇదీ మిగతా కథ.

నటనలు- సాంకేతికాలు
     నటిగా తృప్తీ ధిమ్రీ హైలైట్ అయిన సినిమా ఇది. తియ్యగా నవ్వుతూ, ఇంకా తియ్య తియ్యగా మాట్లాడుతూ, స్నేహభావంతో మెలగుతూ, హవేలీ బాధ్యతలు చూసుకునే యువ జమీందారిణీగా ఒక చెరగని ముద్ర వేస్తుంది. అంతఃపుర రహస్యాలుంటాయి. అవి బాధైనా, మరోటైనా భరించే జమీందారిణీ హూందాతనంతో వుండే పాత్రగా అర్ధంజేసుకుని ఒదిగిపోయింది. చిన్న వయసులో (26 ఏళ్ళు), రెండు సినిమాల అనుభవంతో, ఈ బరువైన క్లిష్ట పాత్ర పోషించే అవకాశం రావడం ఆమెకి గొప్ప.  

        రాహుల్ బోస్ అన్నదమ్ముల ద్విపాత్రాభినయం చేశాడు. గృహ హింస వెలగబెట్టే మగ రాయుళ్ళ పాత్రలు. ఒకటి మతి చెడిన తమ్ముడి పాత్ర. చాలా శాంతంగా, తక్కువ  మాట్లాడే పాత్రలు. చేపట్టేవి క్రూరమైన చర్యలు. అనుభవించేది దారుణమైన శిక్షలు. ఈ డార్క్ షేడ్ పాత్రల్లో రాహుల్ బోస్ ఒకలాటి మత్తైన వాతావరాణాన్ని క్రియేట్ చేస్తాడు నటనతో.  

        వితంతువు బినోదినిగా పావలీ దామ్, ఆ నాటి వితంతువుల జీవితాలకి అద్దం పడుతుంది. డాక్టర్ సుదీప్ గా పరమబ్రత ఛటర్జీ ఇంకో ఫర్వాలేదనిపించే నటన. ఇక హీరోగా అవినాష్ త్రివేదీ లోకల్ షెర్లాక్ హోమ్స్ గా ఆసక్తి కల్గిస్తాడు. ఇంగ్లీషు ప్రభావంతో అతడి లుక్స్, మాటలు ప్రత్యేకంగా వుంటాయి. 

        నటీనటులందరూ 1880 -1900 నాటి మనుషుల పోకడలతో, ముఖ్యంగా నాటి బెంగాలీ నేటివిటీతో, భాషతో, దృశ్యపరమైన సౌందర్యాన్నిపరిపుష్టం చేశారు. హవేలీ వైభవం, వర్ణ చిత్రాలు, పట్టు పరదాలు, వస్త్రా లంకరణ, వస్తు సామగ్రి, గుడ్డి నూనె దీపాల నుంచీ కాలక్రమంలో విద్యుత్ దీపాల కాంతులూ, గుర్రబ్బగ్గీలూ, ఇవన్నీ క్లాసిక్ వాతావరణాన్ని సృష్టిస్తూ ఆ కాలం లోకి లాక్కెళతాయి. 

        రిచ్ కలర్స్, లైటింగ్ స్కీమ్, పిశాచి దాడి చేసేప్పుడు దృశ్యాలకి వాడిన కాషాయ కలర్స్ హార్రర్ ని కూడా ఒక దృశ్య కావ్యంలా మారుస్తాయి. కాషాయం ఎందుకంటే పిశాచి కాళికా దేవీ అని నమ్ముతారు అక్కడి ప్రజలు. పిశాచి వయొలెంట్ జస్టిస్ కి పాల్పడుతోంది. మేల్ వయొలెన్స్ కి వయొలెంట్ జస్టిస్సే సమాధానం అన్నట్టు వుంటుంది. 

        లైటింగ్ ఎఫెక్ట్స్ గురించి కూడా చెప్పుకోవాలి. సత్యజిత్ రే తీసిన ‘దేవి’ పోస్టర్ కి ప్రభావితుడై ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ సృష్టించానన్నాడు కెమెరా మాన్ సిద్ధార్థ్ దివాన్. అమిత్ త్రివేదీ సంగీతం స్వరాలు సుతిమెత్తగా పలుకుతాయి. ఎడిటింగ్ కొంతవరకు కథకి ఉత్తేజం తీసుకొచ్చేలా వుంది. ఎడిటింగ్ కి కథ తోడ్పడకపోతే ఎడిటింగ్ కూడా బోరే కొడుతుంది. కొన్ని చోట్ల ఎడిటర్ రామేశ్వర్ భగత్, ఏ షాట్ ముందు వేసి ఏ షాట్ వెనుక వేస్తే కిక్ వుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. 

        దర్శకురాలిగా తొలి ప్రయత్నంతో ఇంత విజువల్ అద్భుతాన్ని సృష్టించింది అన్వితా దత్తా. ఇంత దర్శకత్వం ఏ దర్శకులూ చేయరు బహుశా. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలకి బీభత్స సూపర్ నేచురల్ వెర్షన్ ని సృష్టించి పెట్టినట్టుంది తను. 

కథాకథనాలు
    19 వ శతాబ్దం, ఇంకా ఆ పూర్వపు కాలాల హార్రర్ కథల్ని గోథిక్ హార్రర్ జానర్ అంటారు. ‘ఫ్రాంకెస్టీన్’, ‘డ్రాక్యులా’ వంటి ప్రసిద్ధ నవలలు వచ్చాయి. ఇవొక ఫాంటసికల్ వాతవరణ నేపథ్యంతో వుంటాయి. ‘బుల్బుల్’ కథ ఈ కోవకే చెందింది. ఈ కథ రబీంద్ర నాథ్ టాగూర్ నవలిక ప్రభావంతో రాశానంది దర్శకురాలు. 1901 లో టాగూర్ రాసిన ‘నష్టనిర్’ (చెదిరిన గూడు) నవలిక లోని పాత్రల్ని హార్రర్ లోకి మార్చి తీశానంది. గృహ హింస ఆనాడు ఎంతుందో ఈనాడూ అంతే వుందంది. నవలికలో వున్న పాత్రలు టాగూర్ నిజ జీవితంలో అన్న దమ్ముల పాత్రలే. బినోదిని పేరుతో పాత్రకూడా నవలికలో వుంది. ఈ నవలిక ఆధారంగా సత్యజిత్ రే ‘చారులత’ తీశారు. 


        దర్శకురాలు అన్విత గీత రచయిత్రిగా బాలీవుడ్ పాటలు రాసింది. మాటల రచయిత్రిగా దోస్తానా, కంబఖ్త్ ఇష్క్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, క్వీన్ వంటి 27 సినిమాలకి రాసింది. ఈ రెండు వృత్తులూ ఓకే. కథా రచయిత్రిగా వచ్చేసరికి విఫలమైంది. దర్శకురాలిగా ఎంతో అద్భుతం చేసింది. లేని కథని అద్భుతంగా తీసినంత మాత్రాన ఫలితాలు అద్భుతంగా వుండవు. అద్భుతమైన పాత్రల్ని తీర్చిదిద్దింది. వాటికి కథే లేదు. ఐతే తనేం కథ చేస్తోందో అది మాత్రం తెలుసని చెప్పింది. రెగ్యులర్ గా తీసే ఎవరు చేశారు? -  అనే మర్డర్ ఇన్వెస్టిగేషన్ గాక, ఎలా చేశారు?- అన్న యాక్షన్ కే పరిమితం చేసినట్టు చెప్పింది. ఇదెంతో రిలీఫ్ నిచ్చే మాట. మర్డర్ ఇన్వెస్టిగేషన్, హంతకుణ్ణి పట్టుకోవడాలు వగైరా ఇంకా ఎవరిక్కావాలి? హంతకుడు ఎలా హత్య చేశాడు, ఎందుకు చేశాడనే ఆసక్తి చుట్టూ కథ వుంటే చాలు. పట్టుకుంటే ఎంత, పట్టుకోకపోతే ఎంత - నేటి శిక్షలు పడే ప్రహసనాలూ కాలయాపనలూ చూస్తున్నాక.

        అయితే తను తెలుసుకోని దేమిటంటే, సినిమాని అడ్డంగా కుప్ప కూల్చే ఎండ్ సస్పెన్స్ అనే మాయదారి జాతికి చెందిన కథ ఇదని. దీంతో ఈ గంటన్నర సినిమా కూడా వృధా అయిపోయింది. గంటన్నరలో గంటా 10 నిమిషాల వరకూ కథ అంతుబట్టక, అసలు కథే అర్ధం గాక, పట్టపగలు కూడా నిద్ర ముంచుకొచ్చే పరిస్థితి. ఆ తర్వాతి ఇరవై నిమిషాల్లోనే ఫ్లాష్ బ్యాకుల వల్ల కథ తెలిసి ముగింపు కొస్తుంది. బుల్బుల్ కి అసలేం జరిగిందో ఈ ఇరవై నిమిషాల్లోనే తెలిసి -తెలిశాక ఇంకేం జరుగుతుందో తెలిసిపోయి- చప్పగా ముగుస్తుంది. 

        మరి ఫస్టాఫ్ అంతా ఏముంది? బుల్బుల్ చిన్నతనంలో పెళ్లి, తర్వాత ఇరవై ఏళ్ళు టైం లాప్స్ తో సత్య ఇంటికి రావడం, అన్నలేమయ్యారో ఆ ఫ్లాష్ బ్యాకులు అసంపూర్ణంగా తెలుసుకోవడం, చావుల దర్యాప్తు చేయడం, ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రధాన పాత్ర బుల్బుల్ జమీందారిణీగా ఏమీ చెయ్యకుండా నవ్వులు చిందిస్తూ వుండడం, ఎంతకీ కథనం ముందుకు కదలక పోవడం, విషయం తెలియక పోవడం, ఇంతే. మూసి పెట్టిన విషయం తో ఎండ్ సస్పెన్స్ పెట్టే సహన పరీక్ష ఇలా వుంటుందని ఈ సినిమాతో వెయ్యో సారి రుజువైంది. 

        అనుమానిత పాత్ర లేకపోవడం ఈ ఎండ్ సస్పెన్స్ లో కూడా ఒక లోపం. బుల్బుల్ ని అనుమానిత పాత్రగా ఎస్టాబ్లిష్ చేసివుంటే కథలో చాలా సమస్యలు తీరేవి. మాటలు కవితాత్మకంగా రాసినట్టు, కథకూడా కవిత రాసినట్టు రాయడం వల్ల వచ్చిన సమస్య ఇది. గృహ హింస తాలూకు రెండు దృశ్యాలు వయొలెంట్ గా వుంటే సరిపోలేదు. ఆ గాభరా, సస్పెన్స్ మిగతా కథలో కూడా వుండాలి. కథేమిటో ఓపెనై పాత్ర సమస్యేమిటో తెలియాలి. సమస్యేమిటంటే- అటు బుల్బుల్, ఇటు సత్య ఏదీ ప్రధాన పాత్ర కాకుండా పోయాయి. టాగూర్ నవలిక, దాంతో సత్యజిత్ సినిమా సామాజికాలు కాబట్టి సరిపోయాయి. వాటిని హార్రర్ గా మార్చాలంటే అసలు  స్క్రీన్ ప్లే అనేది స్ట్రక్చర్ లో వుండడం అవసరం.  

        ఈ కథలో మోస్ట్ టెర్రిఫిక్ డైలాగు, బుల్బుల్ తో బినోదిని ‘చుప్ రహెనా’ (సైలెంట్ గా  వుండిపో) అనడం. అలాగని కథ కూడా సైలెంట్ గా వుండిపోతే ఎలా?  

సికిందర్


17, జులై 2020, శుక్రవారం

958 : రివ్యూ



‘లా’ (కన్నడ)
రచన, దర్శకత్వం: రఘు సమర్థ్
తారాగణం: రాగిణీ ప్రజ్వల్, హేబ్బాలే కృష్ణ, రాజేష్ నటరంగ, అచ్యుత్ కుమార్, ముఖ్యమంత్రి చంద్రు, లిఖిత్ కుర్బా, ఇమ్రాన్ పాషా, మధు హెగ్డే తదితరులు
సంగీతం: వైభవ్ వాసుకి, ఛాయాగ్రహణం: సుగ్నన
నిర్మాతలు: అశ్వనీ పునీత్, రాజ్ కుమార్
విడుదల: అమెజాన్


        తొలి కన్నడ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ‘లా’ ఈ రోజు అమెజాన్ లో విడుదలయ్యింది. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ బ్యానర్ రూపొందించడంతో దీనికి మంచి హైప్ వచ్చింది. దర్శకుడు రఘు సమర్థ్ కి రెండో సినిమా. హీరోయిన్ రాగిణీ ప్రజ్వల్ కి తొలి సినిమా. తొలి సినిమా రెగ్యులర్ ప్రేమ సినిమాగా వుండకూడదని టాలెంట్ ని పరీక్షించే ఈ పాత్ర  ఒప్పుకున్నట్టు చెప్పుకుంది. ఈ సినిమా రెగ్యులర్ లీగల్ డ్రామాగా తీయలేదని దర్శకుడు కూడా చెప్పుకున్నాడు. అయితే ఇటీవల తమిళంలో ఓటీటీలో విడుదలైన జ్యోతిక నటించిన ‘పొన్మంగళ్ వందాళ్’ కూడా ఇలాటి లీగల్  డ్రామానే. ఇలాటి హీరోయిన్ పాత్రే. రేప్ బాధితురాలు తన కేసుని తను వాదించుకునే లాయర్ పాత్ర. ఈ కన్నడ క్రియేటివిటీ ఫ్లాపయిన జ్యోతిక క్రియేటివికి ఎంత భిన్నంగా వుంది? ఇది క్రియేటివిటీయేనా, లేక క్రిమి కీటకమా ఓసారి చూద్దాం...

కథ
    నందిని (రాగిణీ ప్రజ్వల్) లా గ్రాడ్యుయేట్. ఓ రాత్రి గ్యాంగ్ రేప్ కి గురవుతుంది. పోలీస్ స్టేషన్ కెళ్తే హేళన చేస్తారు. మూడు నెలలు గడిచిపోతాయి. ఆమె తనకి జరిగింది సోషల్ మీడియలో వైరల్ చేసేసరికి ఆందోళనలు చెలరేగుతాయి. దీంతో పోలీస్ కమీషనర్ కేసుని సీఐడీ ఇన్స్ పెక్టర్ పార్థ సారథి బ్రహ్మ (హేబ్బాలే కృష్ణ) కి అప్పగిస్తాడు. పార్థ సారథి బ్రహ్మ ఇన్వెస్టిగేట్ చేసి ముగ్గుర్ని (లిఖిత్ కుర్బా, ఇమ్రాన్ పాషా, మధు హెగ్డే) అరెస్ట్ చేసి కేసు పెడతాడు. నందిని ఈ కేసుని తను వాదిస్తానంటుంది. నిందితుల డిఫెన్స్ న్యాయవాదిగా శ్యాం ప్రసాద్ (రాజేష్ నటరంగ) వస్తాడు. న్యాయం కోసం అతడితో తలపడుతుంది నందిని. ఇందులో విజయం సాధించిందా? ఆమె విజయాన్ని ఇన్స్ పెక్టర్ బ్రహ్మ ఎందుకు అడ్డుకోబోయాడు? ఆమె దాచిన అసలు నిజం ఏమిటి? ఈ నిజం బయట పడితే ఏం చేసింది? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి. 

నటనలు-సాంకేతికాలు
    కొత్త హీరోయిన్ రాగిణీ ప్రజ్వల్ తొలి సినిమాకి ఎంపిక చేసుకున్న పాత్ర మంచిదే. కానీ తనకి నటించడం రాక, దర్శకుడికి సినిమా తీయడం రాక చేసిన ప్రయత్నం విఫలమైంది. ప్రారంభం నుంచీ ఎక్కడా రేప్ బాధితురాలిగా కన్పించదు. పోగొట్టుకుంది పర్సు అయినట్టు, పోతే పోయిందన్నట్టు మేకప్ చెదరకుండా తిరుగుతూంటుంది. బీఆర్ చోప్రా తీసిన ‘ఇన్సాఫ్ కా తరాజూ’ (1980) లో జీనత్ అమన్ ని చూస్తే రేప్ బాధితురాలంటే ఏమిటో తెలిసేది రాగిణికి. ఇక లాయర్ గా కూడా నవ్వొచ్చే విధంగా వుంది. చివర్లో అసలు నిజంతో క్లయిమాక్స్ లో నటన జలపాతం దగ్గర అరణ్య రోదనగానే మిగిలింది. ఎంత అరిచి ఏడుద్దామన్నా ఎమోషనే రావడం లేదు. ఎందుకైనా మంచిదని దర్శకుడు లాంగ్ షాట్ వేశాడు. సంగీత దర్శకుడు పీలగా విన్పించిన సంగీతం నుంచి మాత్రం మనకి రక్షణ లేదు. హీరోయిన్ని ఆచి తూచి ఎంపిక చేసుకున్నానని దర్శకుడనడమంటే ఇదేనేమో. ఇందులో ఏం ఆచి వుందో, ఏం తూచి వుందో అర్ధంగాదు. 


        హీరోయిన్ తండ్రి పాత్రలో అవినాష్, ఇన్స్ పెక్టర్ పాత్రలో హేబ్బాలే కృష్ణ, డిఫెన్స్ లాయర్ పాత్రలో రాజేష్ నటరంగ సమర్ధులైన సీనియర్ నటులు. కానీ కథ, సన్నివేశాలు తోడ్పడలేదు. అవినాష్ పోలీస్ స్టేషన్ లో రేప్ బాధితురాలైన కూతురి దగ్గరి కొచ్చి, ‘చట్టం తో ఏమీ తేలదమ్మా, జరిగింది మర్చి పో’ అనేసి లైట్ తీసుకుని కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయే పాత్ర. ఎక్కడా అతను జరిగిందానికి ఏ మాత్రం ఫీలవడు ఎవర్ గ్రీన్ గ్లామర్ గర్ల్ కూతురిలాగే. వీళ్ళని చూస్తే రేప్ మీదే మనకి జాలి పుడుతుంది. 

        ఇక జడ్జి సిద్ధ లింగయ్య పాత్ర వున్నాడు ముఖ్యమంత్రి చంద్రు అనే నటుడు. ఇతను కామెడీ జడ్జి. దర్శకుడికి కథలో ఎంటర్ టైన్మెంట్ తగ్గిందన్న బాధతో సీరియస్ కేసు వాదనల్లో జడ్జి కామెడీలు చూపించాడు. జడ్జికి తోడు బంట్రోతు. మధ్యలో జడ్జి గయ్యాళి పెళ్ళాం నుంచి ఫోను రావడం. బెంబేలెత్తి పోయి జడ్జి హనుమాన్ చాలీసా వేసుకోవడం. ఏం సినిమా తీసి అమెజాన్ కిచ్చాడో దర్శకుడికే తెలియాలి. 

         ‘పొన్మంగళ్ వందాళ్’ లో గోవింద్ వసంత అనే సంగీత దర్శకుడి లాగే ఇక్కడ కూడా వైభవ్ వాసుకి అనే సంగీత దర్శకుడు, పరికరాలే లేనట్టు వీలయినంత పేలవంగా సంగీత సృష్టి గావించాడు. కెమెరా మాన్ సుగ్నన అనే ఒకతను మాత్రమే అప్పగించిన బాధ్యతకి కాస్త న్యాయం చేసినట్టు కనబడతాడు. సినిమా నిడివి రెండు గంటలే అయినా రెండు యుగాల్లా వుంటుంది. 

కథా కథనాలు
    కథకి అయిడియా మంచిదే. ఆచరణలో చెదిరి పోయింది. ముగింపులో హీరోయిన్ మోటివేషన్ కి ఇచ్చిన కారణంతో దీన్నొక బలమైన ఎమోషనల్ లీగల్ యాక్షన్ డ్రామా చేయొచ్చు. తన అయిడియాలో వున్న బలం, లోతు పాతులు తనకే తెలియక పోతే ఎలా? ఈ అయిడియాలో హీరోయిన్ తన శీలంతో తనే ప్రయోగం చేయడమనే రాడికల్ తెగింపు వుంది. ఈ పాయింటుని  హైలైట్ చేసి మార్కెట్ యాస్పెక్ట్ ని పట్టుకోవాలనుకోలేదు దర్శకుడు. మొద్దుబారి
పోయిన వ్యవస్థని లేపడానికి శీలాలతో ఇలాటి ప్రయోగాలు  తప్పవా అన్న సామాజిక ప్రశ్న ఈ కథలో వుంటే, ఏవో కామెడీలు చేస్తూ వుండిపోయాడు దర్శకుడు. చట్టంతో మగాడు ఈజీగా ఆడుకోగలడు. ఆడది ఆడుకోవాలంటే ఇక శీలాల్ని పణంగా పెట్టాలేమో. 

        ఇలాటి కథలో కూడా దర్శకుడికి ఎంటర్ టైన్మెంట్ తగ్గుతోందన్న వర్రీ తీవ్రంగా వున్నట్టుంది. రేప్ బాధితురాలైన హీరోయిన్ కి కామెడీ ఫ్లాష్ బ్యాకులు. అల్లరి చేష్టలు. కథలో జరిగిన విషయానికీ ఈ ఫ్లాష్ బ్యాకులకీ సంబంధమేమిటో, వీటినెలా ఎంజాయ్ చేయాలో అర్ధంగాదు. ఫస్టాఫ్ లో నాల్గు సార్లు ఈ కామెడీ ఫ్లాష్ బ్యాకులేస్తాడు. ప్రతీ రాత్రీ తనకి జరిగిందే గుర్తుకొస్తూ నిద్రపట్టడం లేదని హీరోయిన్ డైలాగు. ఎప్పుడు గుర్తొచ్చింది, ఎప్పుడు నిద్ర పట్టలేదు సీన్లే చూపించలేదు. పోయింది పర్సే కదా అన్నట్టు జాలీగా తిరుగుతూంటే. 

        ‘పొన్మంగళ్ వందాళ్’, ‘లా’ రెండూ దాదాపు కథ లొకటే. తీసి ఫ్లాప్ చేసుకున్న విధం ఒకటే. క్రియేటివిటీకి రెండు తరాలు వెనకున్నాయీ సినిమాలు. కథ పక్కనబెట్టి, కనీసం ఇప్పుడు సినిమా ఇలా తీయరన్న ఆలోచన కూడా లేకపోతే ఎలా?

సికిందర్  


15, జులై 2020, బుధవారం

957 : రివ్యూ



‘కాక్ టైల్’ (తమిళం)
రచన, దర్శకత్వం: ఆర్ ఏ విజయ మురుగన్
తారాగణం: యోగిబాబు, రేష్మీ గోపీనాథ్, మిథున్ మహేశ్వరన్, బాలా, కవిన్, సాయాజీ షిండే తదితరులు
సంగీతం: సాయి భాస్కర్, ఛాయాగ్రహణం: ఆర్ జే రవీన్
నిర్మాత: పిజి ముత్తయ్య, ఎం. దీపా
విడుదల: జీ5

***
        మిళంలో పొన్మంగళ్ వందాళ్, పెంగ్విన్ అనే రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ డైరెక్ట్ ఓటీటీ విడుదలల తర్వాత, కమెడియన్ యోగిబాబుతో  ‘కాక్ టైల్’ విడుదలైంది. ఇది కూడా మొదటి రెండిటిలాగే కొత్త దర్శకుల సినిమాల జాబితాలో ఓటీటీ కొచ్చి ఔటై పోయింది. కొత్త దర్శకుడు విజయ మురుగన్ అట్టర్ ఫ్లాప్ చేయడంలో కొత్త పుంతలు తొక్కాడు. కొత్త దర్శకుడికి ఇంత పాత కాలపు చీకేసిన సినిమా తీయాలన్న బ్రహ్మాండమైన అయిడియా ఎలా వచ్చిందో తెలీదు. కమెడియన్ గా తమిళంలో ఇప్పుడు డిమాండ్ లో వున్న యోగిబాబుని బలవంతంగా వాడుకుని, బలవంతంగా నవ్వించాలని విశ్వప్రయత్నం చేశాడు. యోగిబాబు షూటింగులో డైలాగులు చెప్పలేదనీ, డబ్బింగులోనే చెప్పాడనీ తెర వెనుక సంగతులు. ఇందుకేనేమో ఫేసు ఒకలాగా, డైలాగులు ఇంకోలాగా పలికాయి. మనవి ఫూల్స్ అయిన ఫేసులయ్యాయి. ఈ ఫూలిష్ కథేమిటో చూద్దాం...
కథ
      450 ఏళ్ల చోళుల కాలం నాటి పురాతన మురుగన్ దైవ విగ్రహం మ్యూజియం నుంచి చోరీ అవుతుంది. ఇన్స్ పెక్టర్ రాజమాణిక్యం (సాయాజీ షిండే) కేసు టేకప్ చేస్తాడు. అలాటి నకిలీ విగ్రహం మీడియాకి చూపించి, విగ్రహాన్నిసాధించామని మీడియాకి చెప్తాడు. దీని వల్ల అసలు విగ్రహాన్ని చోరీ చేసిన దొంగలు తమ దగ్గరున్నది నకిలీ విగ్రహమనుకుని అమ్మేయడానికి ప్రయత్నిస్తారనీ, అప్పుడు పట్టుకోవచ్చనీ ప్లాను. 

     యోగిబాబు జంతువుల సెలూన్ నడుపుతూంటాడు. అతడికి మిథున్ మహేశ్వరన్, బాలా, కవిన్ ఫ్రెండ్స్ గా వుంటారు. మిథున్ మహేశ్వరన్ ఇన్స్ పెక్టర్ రాజమాణిక్యం కూతురు రేష్మీ గోపీనాథ్ ని ప్రేమిస్తూంటాడు. ఒక రోజు నల్గురూ తాగి పార్టీ చేసుకుని పడుకుంటే తెల్లారి అమ్మాయి శవం వుంటుంది. ఈ శవం ఎలా వచ్చిందో, ఈ అమ్మాయి ఎవరో తెలీక భయపడతారు.

        ఒకవైపు విగ్రహాన్ని అమ్మేద్దామని ప్రయత్నిస్తూ దొంగలు, ఇంకోవైపు శవాన్ని వదిలించు కోవాలని ఈ నల్గురూ. ఈ రెండు గ్రూపులు ఎక్కడ ఎదురెదురయ్యాయి? ఎదురైతే ఏం జరిగింది? ఇన్స్ పెక్టర్ రాజమాణిక్యం ప్లాను పారిందా? విగ్రహం దొరికిందా? శవం కేసులోంచి నల్గురూ ఎలా బయట పడ్డారు? ఇదీ మిగతా కథ. 

నటనలు - సాంకేతికాలు
      ముందుగానే చెప్పుకున్నట్టు యోగిబాబు ఫేసొకటి డైలాగొకటిగా నటించిన ఫూలిష్ పాత్ర. కలవని ఫేసూ డైలాగులతో బ్యాడ్ కాక్ టైల్. రజనీకాంత్ ‘దర్బార్’ లో తను చాలా నయం. ఇప్పుడు ఈ సినిమాతో హీరోగా శ్రద్ధగానీ ఆసక్తిగానీ లేనట్టు  నటించాడు మాస్ కూడా చూడలేని నటన. ఒక్క డైలాగూ నవ్వు పుట్టించదు. పైగా అర్ధం పర్ధం లేని మైండ్ లెస్ కామెడీ సీన్లు కావడంతో అట్టర్ ఫ్లాపయ్యాడు. 

     బక్కగా వుండే టీవీ కమెడియన్ బాలాది భరించలేని చీప్ కామెడీ. ఓవరాక్షన్ కూడా. మిథున్ మహేశ్వరన్ కి కామెడీ రాదు, సాయాజీ షిండేకి ఈ సినిమా ఎలా పోయినా పట్టింపు లేదు. హీరోయిన్ రేష్మీ గోపీనాథ్ ఎప్పుడు కనిపిస్తుందో తెలీదు. కన్పించినప్పుడు ఎందుకీ రోమాంటిక్ సీన్లు అన్నట్టు ఆమెకే చీదర. పోతే ఇంకో స్టార్ కూడా వుంది. టైటిల్ కోసం పట్టుకొచ్చిన పక్షి. కాక్ టైల్ అనే ఆస్ట్రేలియా పక్షి. ఇది పైన కూర్చుని యోగిబాబుని చూస్తూ వుంటుంది తప్ప వీళ్ళ సంగతేమిటో చూద్దామనుకోదు. కాక్ టైల్స్ చిలకల్లా మాట్లాడతాయి. అలా కూడా మాట్లాడించాలనుకోడు దర్శకుడు. ఈ ఆస్ట్రేలియన్ పక్షిని cockatiel అంటారు.  

        వీలయినంత పాత కాలపు దర్శకత్వం చేశాడు కొత్త దర్శకుడు. సాంకేతిక  విలువలకి విలువలేదు. రైటింగ్ లో గానీ, టేకింగ్ లో గానీ కొత్తదనం లేదు. ఉన్న రెండు పాటలు నీరసం. 

కథా కథనాలు
      పాత కాలపు అరిగిపోయిన కామెడీ కథ. విగ్రహం దొంగలు -శవంతో ఫ్రెండ్స్  అన్న డై నమిక్స్ వున్న కథని అర్ధంపర్ధం లేని కామెడీలతో చుట్టేశాడు. విగ్రహం కథ మళ్ళీ క్లయిమాక్స్ లో తప్ప గుర్తుకు రాదు. శవంతో కథతో సస్పెన్స్, థ్రిల్స్ వుండవు. గతంలో మైండ్ లెస్ కామెడీలు చాలా వచ్చాయి. రోహిత్ శెట్టి తీసిన ‘గోల్ మాల్’ సిరీస్ సహా. అవి లాజిక్ ని వదిలేసి నవ్వించడంలో సక్సెస్ అయ్యాయి. ‘కాక్ టైల్’ లో లాజిక్ లేదు, నవ్వులేదు.

-సికిందర్ 
Rv at telugurajyam.com

13, జులై 2020, సోమవారం

956 : రివ్యూ



రచన, దర్శకత్వం : మహమ్మద్ ముస్తఫా
తారాగణం: అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యీవ్, జేమ్స్ ఎలియా, నిషా సరంగ్  తదితరులు
సంగీతం: సుశిన్ శ్యాం, ఛాయాగ్రహణం: జిమ్షి ఖాలిద్
నిర్మాత: విష్ణు వేణు

***
      లయాళం నుంచి కొత్త దర్శకుడు ఇంకో లాక్ డౌన్ బాధితుడయ్యాడు. తీసిన మొదటి సినిమా విడుదల కాగానే లాక్ డౌన్ తో థియేటర్లు మూతబడ్డాయి. అనేక సినిమాల్లో నటుడుగా అనుభవం గడించిన మహమ్మద్ ముస్తఫా, దర్శకుడుగా మలయాళ సినిమాలకి ప్రాణమైన నేటివిటీని ప్రధానంగా చేసుకుని తీసిన ‘కప్పెలా’ (చిన్నచర్చి), ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ రాబడుతోంది. సృజనాత్మక స్వేచ్ఛ లేని అవే ఫార్ములా టెంప్లెట్ సినిమాలకి దూరంగా, వాస్తవంగా జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో యూత్ సినిమాలు తీస్తున్న మలయాళ దర్శకుల కోవలో, ముస్తఫా కూడా ఒక రియలిస్టిక్ ఫిక్షన్ తీశాడు. అయితే అంతర్లీనంగా ఒక తిరోగమన భావజాలాన్ని షుగర్ కోటింగ్ వేసి తెలియకుండా అందించాడు. అదేమిటో చూద్దాం...

కథ
     రాహుల్  గాంధీ ఎంపీగా ప్రకాశిస్తున్న వాయనాడ్ నియోజక వర్గం పూవరన్మాల కొండ ప్రాంతం గ్రామంలో వర్ఘీస్ (జేమ్స్ ఎలియా) వ్యవసాయం చేస్తాడు. మేరీ (నిషా సరంగ్) బట్టలు కుడుతుంది. వీళ్ళ పెద్ద కూతురు జెస్సీ (అన్నా బెన్) ఇంటర్ తో చదువాపేసి ఇంటి పట్టున వుంటుంది. చిన్న కూతురు స్కూలుకి పోతూంటుంది. కూతుళ్ళ పట్ల వర్ఘీస్ చాలా కఠినంగా  వుంటాడు. చిన్న కూతురు ఒకబ్బాయి సైకిలెక్కి స్కూలు నుంచి రావడం చూసి వెంటాడి బాగా కొడతాడు. కూతుళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఓ కన్నేసి వుంచుతాడు. ఇలాటి పరిస్థితుల్లో తల్లి కోసం ఒక కాల్ చేస్తుంది జెస్సీ. అది రాంగ్ నెంబర్ వెళ్లి ఇంకో వూళ్ళో వుం టున్న విష్ణు (రోషన్ మాథ్యీవ్) అనే ఆటో డ్రైవర్ కి చేరుతుంది. సారీ చెప్పి కట్ చేస్తుంది. అతను వూరుకోకుండా కాల్స్ చేస్తూంటాడు. మొదట వ్యతిరేకించినా క్రమంగా అతడికి దగ్గరవుతుంది. ప్రేమిస్తుంది ఫోన్లోనే.

        గ్రామంలో బెన్నీ (సుధి కొప్పా) అనే ఫ్యాన్సీ డ్రెస్సుల షాపతను జెస్సీని ప్రేమిస్తూంటాడు. తల్లి దండ్రులకి చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేయించుకుంటాడు. జెస్సీ ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళ ముందు నిలబెడతారు ఆమె తల్లిదండ్రులు. వాళ్లకి పెట్టిన ఫలహారం, టీలు చూసి - వీళ్ళకి బతకడమే చేతకావడం లేదని బెన్నీని తీసుకుని వెళ్ళిపోతుంది అతడి తల్లి.

        ఈ విషయం ఫోన్లో విష్ణుకి చెప్తుంది జెస్సీ. అతను స్పందించడు. అటు బెన్నీ డబ్బుకంటే గుణం చూడాలని తల్లి మీద చిందులేసి మొత్తానికి తల్లిని ఒప్పిస్తాడు. జెస్సీ తల్లిదండ్రులు సంతోషించి ఎంగేజి మెంటుకి బంధువుల్ని పిలిచేందుకు వూరెళ్తారు. ఈ అవకాశంతో జెస్సీ విష్ణుకి ఫోన్ చేసి, ఇక తాము పెళ్లి చేసుకోక తప్పదని అతనుంటున్న వూరు కోళికోడ్ కి వెళ్ళిపోతుంది. ఒకర్నొకరు గుర్తు పట్టే పరిస్థితి లేక బస్టాండ్ లో కలుసుకుందా మనుకుంటారు. బస్టాండ్ లో ఎవరో గొడవ పడుతూంటే ఆ గొడవలో ఫోన్ పోగొట్టుకుంటాడు విష్ణు. ఆ ఫోన్ రోయ్ ( శ్రీనాథ్ భాసి) అనే రౌడీలా వున్న అతడికి దొరుకుతుంది. ఫోన్ చేసి అతనే విష్ణు అనుకుని వెళ్లి కలుస్తుంది జెస్సీ.

        కలిస్తే ఏం జరిగింది? రోయ్ ఏం చేశాడు? తను విష్ణు కాదని చెప్పాడా? విష్ణు ఎక్కడున్నాడు? అతడికి జెస్సీ దొరికిందా? అసలు రోయ్ ఉద్దేశమేమిటి? ఈ ఇద్దరి మధ్య జెస్సీ ఏమైంది? ఇదీ మిగతా కథ. 

నటనలు -సాంకేతికాలు
      జెస్సీగా నటించిన అన్నా బెన్ కుంబళంగి నైట్స్, హెలెన్ అనే తొలి  రెండు విజయాలతో వుంది. ప్రస్తుత పాత్రలో సగటు అమ్మాయిగా ఒక పాసివ్ పాత్ర పోషించింది. ఇలాటి కోరికలు చంపుకుని జీవించే సగటు అమ్మాయిలు నిజ జీవితంలో వుండరని కాదు, బోలెడు మంది వుంటారు. ఆ పాసివ్ జీవితాల్ని యాక్టివ్ గా మార్చి చూపించక పోతే సినిమా అవదు. ఇలాటి అమ్మాయిలు ఎక్కడెక్కడున్నారో వాళ్ళ మీద ఒక డాక్యుమెంటరీ తీయవచ్చు, సినిమా కాదు. ఈ పాత్రలో అన్నా బెన్ విష్ణు దగ్గరికి వెళ్ళిపోయే తెగువ చూపించి ప్రోగ్రెసివ్ గా కన్పిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలే. తనకి లభించిన, ఈ ఉన్న సగటు అమ్మాయి పాత్ర ఎలా నటించిందంటే చక్కగా నటించింది. భావాలు విస్తారంగా పలికే మొహమామెది. 

      ఆటో డ్రైవర్ విష్ణుగా నటించిన రోషన్ మాథ్యీవ్ నాటక రంగంలో కూడా పేరున్న వాడు. సాఫ్ట్ గా కన్పించే తను నెగెటివ్ పాత్రగా రివీల్ అవడం, రఫ్ గా కన్పించే శ్రీనాథ్ భాసి పాజిటివ్ పాత్రగా రివీల్ అవడమనే డైనమిక్స్ కథా పరంగా బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే ఈ ఇద్దరితో పాటు జెస్సీ తండ్రి పాత్ర జేమ్స్ ఎలియా స్త్రీ పాత్రల్ని అణిచేసే మేల్ ఇగోతో వుండడం గమనించ వచ్చు. పెళ్లి చూపుల కొచ్చే బెన్నీ పాత్రది కూడా ఇదే ధోరణి. 

        కొండలూ లోయలతో లొకేషన్స్, ఆ లొకేషన్స్ మధ్య ఇళ్ళూ బావున్నాయి. మలయాళ సినిమాల్లో నేటివ్ లొకేషన్స్  హార్ష్ కలర్స్ కాకుండా కూల్ గా డీఐ చేయడం వల్ల ఆ ఫీల్ వస్తోంది. కోళికోడ్ టౌను సినిమాటోగ్రఫీ కూడా నేటివిటీ తప్పిపోలేదు. ఇంతే సాఫ్ట్ గా నేపథ్య సంగీతం, రెండు పాటలూ వున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ బడ్జెట్ ని కంట్రోలు చేస్తూ కూడా నాణ్యతతో వుంది. 

        తెలుగు సినిమాల్లో లాగా కామెడీ మలయాళం సినిమాల్లో తప్పనిసరి కాదు. కామెడీ అంటే నాటకీయత. నాటకీయతకి దూరంగా సహజత్వంతో తీస్తున్న ఇలాటి సినిమాలు మలయాళ ప్రేక్షకులు అలవాటు పడ్డారు. ఒకప్పుడు ప్రియదర్శన్ తీసిన కామెడీ సినిమాల్లాంటివి కూడా ఇప్పుడు రావడం లేదు. కొత్త దర్శకులతో మలయాళం సినిమా ఎదుగుతోంది. 

కథాకథనాలు
     దర్శకుడు కోళికోడ్ లో ఒక సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడొక అమ్మాయి ఎవరికోసమో వెతుక్కుంటూ కన్పించింది. అడిగితే  తనూ ఒకతనూ ఫేస్బుక్ లో  పరిచయమయ్యామని, తీరా కలుసుకుందామని వస్తే అతను రాలేదనీ వాపోయింది. దీన్ని కథగా చేసి ఈ సినిమా తీశానన్నాడు దర్శకుడు. కొత్త దర్శకుడు తీసినట్టుగా మాత్రం లేదు. నటనలు గానీ, టెక్నికల్ గా గానీ అనుభవమున్నవాడు తీసినట్టుంది. మంచి సమర్ధులైన టెక్నీషియన్స్ ని నియమించుకున్నానన్నాడు. 


        అయితే ఫేస్బుక్ ప్రియుడ్ని వెతుక్కుంటూ కన్పించిన అమ్మాయితో కలిగిన సానుభూతి, సినిమా తీసేసరికి అలాటి హీరోయిన్ పాత్రని అణిచేసే ధోరణిలోనే  తయారయ్యింది. జెస్సీకి ఇంట్లోగానీ బయటగానీ భావస్వాతంత్ర్యం లేదు. బెన్నీఅనే వాడు ఏక పక్షంగా ప్రేమించుకుని పెళ్లి చూపులు పెట్టుకుంటాడు. జెస్సీకి ఇష్టమా కాదా తెలుసుకోకుండా ఆమె పేరెంట్స్ సంబంధం ఒప్పేసుకుంటారు. ఆమె తండ్రి కూతుళ్ళ పట్ల ఎంత కఠినంగా వుంటాడో చిన్న కూతుర్ని చావబాదుతున్నప్పుడు చూస్తే చాలు. వాళ్ళ మీద నిఘా కూడా పైగా. తండ్రిగా కూతుళ్ళని సంరక్షించుకోవడం వేరు, సంరక్షణ పేరుతో పురుషాధిక్యం ప్రదర్శించడం వేరు. పెళ్లి విషయంలో బెన్నీది కూడా తల్లి మీద పురుషాధిక్యమే. ఇక విష్ణు అయితే జేస్సీని వల్లో వేసుకుని అమ్మేసే దుర్మార్గం. పరాయి అమ్మాయి జేస్సీని కాపాడుతూ రోయ్ మంచి మగాడే గానీ, తను ప్రేమిస్తున్న టీచర్ అమ్మాయితో పురుషాహంకారమే. ఈమె నా ఆస్తి అన్నట్టు ఇగోయే తప్ప, ఈమె నా సమస్తం అన్న ప్రేమే వుండదు. పాఠాలు చెప్పే ఆ టీచరమ్మ పాపం అణిగిమణిగి వుంటుంది. 

        నూట పది నిమిషాల నిడివిలో ఫస్టాఫ్ ఏమీ జరగదు- విష్ణుని కలుసుకోవడానికి  జెస్సీ బస్సెక్కి కోళికోడ్ వెళ్ళడం తప్ప. సెకండాఫ్ లో రోయ్ పాత్ర ప్రవేశంతోనే అసలు కథ మొదలవుతుంది. ఈ అసలు కథ చివరి పదిహేను నిమిషాలు తప్పించి ఒక సస్పెన్సుతో నడుస్తుంది. చివరి పదిహేను నిమిషాల్లో ముగింపు కొచ్చేసరికి రోమాంటిక్ డ్రామాగా చప్పగా ముగుస్తుంది. అంటే పెద్దలు చూసిన సంబంధమే తప్ప నీకంటూ నీ ఇష్టాలతో పనిలేదన్న పురుషాధిక్య భావజాలం ఉట్టి పడే సీన్లతో ముగుస్తుంది. చివరికి ఆమె ఫ్రెండ్ కూడా ఆమెకి  భావ స్వాతంత్ర్యమివ్వని మోరల్ పోలిసింగ్ తో మాట్లాడుతుంది. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి నువ్వెందుకు ఇరుక్కుంటావ్, ఇంటికెళ్ళి పొమ్మంటుంది. 

        ఇది అమాయక అమ్మాయిల్ని మోటివేట్ చేసే సినిమాయే అయితే, అమ్మాయిల స్మగ్లర్ల గురించి తనే పోలీసులకి సమాచారమిచ్చి సాటి అమ్మాయిల్ని కాపాడాలి ఒక కథానాయిక పాత్రగా. ఇది చెయ్యక, ప్రేమించిన వాడితో మోసపోయి, ఇంకేం చేయాలన్పించక ఇంటి ముఖం పట్టి, అదే బెన్నీ కన్పించి ముసిముసి నవ్వులు నవ్వితే, పెళ్ళికి తలూపడం తిరోగమనమే తప్ప అభ్యుదయం కాదు.

సికిందర్
rev. at telugurajyam.com



9, జులై 2020, గురువారం

955 : రివ్యూ


‘ఘూమ్ కేతు’
రచన - దర్శకత్వం : పుష్పేంద్ర నాథ్ మిశ్రా
తారాగణం: నవాజుద్దీన్ సిద్దిఖీ, రాగిణీ ఖన్నా, అనురాగ్ కశ్యప్, రఘువీర్ యాదవ్, ఇళా అరుణ్ తదితరులు
సంగీతం : స్నేహా ఖన్వాల్కర్. ఛాయాగ్రహణం : సత్య రాయ్ నాగ్ పల్
నిర్మాత : అనురాగ్ కశ్యప్, వికాస్ బహల్
***
      నురాగ్ కశ్యప్ లాంటి టాప్ దర్శకుడు నిర్మించిన సినిమా ఆరేళ్ళూ విడుదలకి నోచుకోక పోవడం వింతే. ఆరేళ్ళ నాడే ఇలా పురాతన కాలపు సినిమాలా తీసి కామెడీకి శ్రద్ధాంజలి ఘటిస్తే అది సినిమాకీ శ్రద్ధాంజలి ఘటించడమే అయింది. డిస్ట్రిబ్యూటర్లు కరోనా డెత్ అనుకుని పారిపోవడమే అయింది. ఇప్పుడు ‘జీ5’ ముందుకు వచ్చి స్ట్రీమింగ్ చేస్తే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సుదీర్ఘ అనుభవమున్న యాడ్ ఫిలిం మేకర్, టీవీ డైరెక్టర్ పుష్పేంద్ర నాథ్ మిశ్రా దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఈయన ప్రస్తుతం వెబ్ సిరీస్ కొచ్చాడు. ప్రస్తుతం ఈయన తీస్తున్న ‘తాజ్ మహల్ 1989’ అనే రిలేషన్ షిప్స్ తో కూడిన కథతో వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో పాపులర్ అవుతోంది.

       
వాజుద్దీన్ సిద్దిఖీ, అనురాగ్ కశ్యప్ లతో బాటు అతిధి పాత్రల్లో అమితాబ్ బచ్చన్, రణవీర్ సింగ్, సోనాక్షీ సిన్హా, చిత్రాంగద సింగ్, దర్శకుడు నిఖిల్ అద్వానీ లతో ఇంత స్టార్ ఎట్రాక్షన్ వున్నా, ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేదంటే దీని కామెడీ వ్యవహారం ఏ స్థాయిలో వుందో అర్ధం జేసుకోవచ్చు. ఉన్న గంటా 40 నిమిషాల నిడివికి కూడా నిలబడని కామెడీ పేరుతో ఏదో కథ!

కథ
     ఘూమ్ కేతు (నవాజుద్దీన్) తాజాగా జానకీ దేవి (రాగిణీ ఖన్నా) ని పెళ్లి చేసుకుని ఉత్తరప్రదేశ్ లో వుంటాడు. మనసు బాలీవుడ్ వైపు లాగుతూంటుంది. కిరాణా షాపు నడిపే తండ్రి దద్దూ (రఘువీర్ యాదవ్) నీకు సినిమా లేంట్రా అని చెడా మాడా తిడుతూంటాడు. తను బాలీవుడ్ రైటర్ అవ్వాల్సిందే నని పట్టుబట్టి కూర్చుంటాడు ఘూమ్ కేతు. కిరాణా లెక్కలు రాసినంత మాత్రాన, నీ పెళ్లి పత్రికల మీద పేర్లు రాసినంత మాత్రానా బాలీవుడ్ రైటర్ అయిపోతా వట్రా అని ధూంధాం చేస్తాడు పరమ కోపిష్టి దద్దూ. ఘూమ్ కేతుకి మేనత్త (ఇళా అరుణ్) సపోర్టు బాగా వుంటుంది. తల్లిలేదు, తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో ఇంకో పెళ్లి కాని  పెదనాన్న వుంటాడు. ఘూమ్ కేతు ఇలా కాదని ఒక ‘గిలిగింతలు’ అనే హాస్య పత్రికలో చేరడానికి పోతాడు. ఆ ఎడిటర్, నువ్వు పత్రికల్లో రాయడానికి పనికిరావని- సినిమా రైటర్ గా పని కొస్తావని- తను రాసిన ‘30 రోజుల్లో బాలీవుడ్ రైటర్ అవడమెలా?’ అన్న బుక్ ఇచ్చి ఆశీర్వదిస్తాడు. 

       ఆ బుక్ పట్టుకుని ముంబాయి పారిపోతాడు ఘూమ్ కేతు. పెళ్ళయిన పదిరోజుల్లో పారిపోవడం చూసి దద్దూ పోలీస్ కంప్లెయింట్ ఇస్తాడు. వాడి  ఫోటో ఇమ్మంటే ఫ్యామిలీ ఫోటో ఆల్బం తీసుకుని పారిపోయాడంటాడు. ఫోటో లేకుండా పోలీసులు ముంబాయి పోలీసులకి సమాచారం అందిస్తారు. ఫోటో లేని మిస్సింగ్ కేసు ఇన్స్ పెక్టర్ దద్లానీ (అనురాగ్ కశ్యప్) ముందుకొస్తుంది. 30 రోజుల్లో ఈ కేసు సాల్వ్ చేయకపోతే, మంచి నీళ్ళు కూడా పుట్టని చోట ట్రాన్స్ ఫర్ అయిపోతావని పై అధికారి నుంచి వార్నింగ్ వస్తుంది. 

        పోలీసులకి ఫోటో దొరక్కుండా ఇన్స్ పెక్టర్ దద్లానీ పై పోర్షన్లోనే మకాం వేసిన  ఘూమ్ కేతు జోరుగా మూడు స్క్రిప్టులు రాస్తూంటాడు. షారుఖ్ ఖాన్ ని టార్గెట్ గా  పెట్టుకుంటాడు. ఓ దొంగ ఆ స్క్రిప్టులు ఎత్తుకుపోవడంతో పోలీస్ స్టేషన్ కెళ్ళి ఇన్స్ పెక్టర్ దద్లానీకే కంప్లెయింట్ ఇస్తాడు. ఇప్పుడేం జరిగింది? దద్లానీ ఘూమ్ కేతుని పట్టుకున్నాడా? ఘూమ్ కేతు బాలీవుడ్ రైటర్ అయ్యాడా? ఇద్దరిలో ఎవరి ఆశయం నెరవేరింది? ఇదీ మిగతా కథ. 

నటనలు - సాంకేతికాలు 
      1970 మోడల్ గెటప్ తో, డ్రెస్సులతో నవాజుద్దీన్ అవుట్ డేటెడ్ గా వుంటే కామెడీగా వుంటుందనుకున్నట్టుంది. ఇది బెడిసి కొట్టింది. నవ్వుకాదు కదా నీరసం వచ్చేస్తుంది. ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ లో ఇర్ఫాన్ ఖాన్ ఇప్పటి ఫ్యాషన్ తో రంగు రంగుల డ్రెస్సు లేసుకుంటే మాంచి కిక్ తో నవ్వొచ్చే సందర్భం. నవాజుద్దీన్ ఘూమ్ కేతు పాత్ర కూడా కాలం చెల్లిన పురాతన సినిమా పాత్ర. ఇలా కూడా నటించడానికీ, ఏదో నవ్వించడా నికీ తగిన స్పేస్ కూడా లేదు. అతడి స్పేస్ ని ఇతర పురాతన పాత్రలు మింగేస్తూంటాయి. బాలీవుడ్ లో రైటర్ గా ఎపిసోడ్స్ కూడా పెద్దగా ఏమీ వుండవు. మధ్యలోనే అతను విరమించుకుని వెనక్కి రావడంతో, మొదట్లో ఆసక్తి రేకెత్తించిన రైటర్ పాత్ర ముగిసిపోయి తేలిపోతాడు. నవాజుద్దీన్ ఈ సినిమా చేయడం బ్యాడ్ జడ్జిమెంట్. 

        ఇన్స్ పెక్టర్ గా అనురాగ్ కశ్యప్ ఇంకో బలహీన కామెడీ పాత్ర. ఇందులో తనుకూడా చేయగల్గిందేమీ లేదు. వూళ్ళో ఘూమ్ కేతు ఇంటిదగ్గర పాత్రలన్నీ ఓవరాక్షన్ కామెడీ. వీళ్ళంతా సినిమాకి చేయాల్సిన హాని అంతా చేసేస్తారు. అతిధి పాత్రల్లో కన్పించే అమితాబ్ బచ్చన్, రణవీర్ సింగ్, సోనాక్షి సిన్హా తదితరులు వాళ్ళ వాళ్ళ సినిమా షూటింగుల్లో సంక్షిప్తంగా కన్పిస్తారు. సంక్షిప్తంగా కన్పించినా, చివర్లో అమితాబ్ పాత్ర కథని మలుపు తిప్పే పాత్ర. ఈ అవుట్ డేటెడ్ సినిమాకి అమితాబ్ వల్ల చివరి పది నిమిషాలే కాస్త హుషారు పుడుతుంది.  

        సాంకేతికంగా యాడ్ ఫిలిం మేకర్ గా కొన్ని క్రియేటివిటీలు చూపించాడు దర్శకుడు. అట్టహాసంగా సెట్ వేసి సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ చేయడం, నవాజుద్దీన్ వూహించుకుని రాస్తున్న మూడు కథల్ని విజువలైజ్ చేసి చూపించడం మొదలైనవి. 16 ఎంఎం బ్లాక్ అండ్ వైట్ లో చార్లీ చాప్లిన్ టైపు మూకీ సీన్లు వేసి వ్యంగ్యం చేయాలనుకున్న క్రియేటివ్ ప్రయత్నం కూడా రాణించలేదు. ఇవి పాత కాలం ప్రేక్షకులకి తప్ప నేటి యువ ప్రేక్షకులకి ఎక్కవు. ఇక సంగీతం, ఛాయాగ్రహణం పేలవంగానే వున్నాయి. నిర్మాణ విలువలకి స్థానం లేదు. తక్కువ బడ్జెట్ లో లాగించేశారు.  

కథాకథనాలు 
     2007 లో కమెడియన్ వినయ్ పాఠక్, రజత్ కపూర్ లతో వచ్చిన సూపర్ హిట్ ‘భేజా ఫ్రై’ తో పోలిస్తే ‘ఘూమ్ కేతు’ కథ ఓ కామెడీ కథే కాదు. ‘భేజా ఫ్రై’ లో వినయ్ పాఠక్ బాలీవుడ్ సింగర్ నవ్వాలని పల్లెటూరు నుంచి వచ్చి, ఆడియో కంపెనీ బాస్ రజత్ కపూర్ ఇంట్లో తిష్టవేసి, తన సంగీత రాగాలతో బుర్ర తినేస్తాడు. చాలా అమాయక క్యారక్టర్. తనేం చేస్తున్నాడో తెలుసుకోకుండా ఆడియో బాస్ కీ, అతడి భార్యకీ తంపులు పెట్టి కాపురం గుల్ల చేస్తాడు. ఇదొక విజయవంతమైన న్యూ ఏజ్ కామెడీ. ‘ఘూమ్ కేతు’ లో నవాజుద్దీన్ కి బాలీవుడ్ లో రైటర్ అయ్యే ప్రయత్నాలతో తగిన సీన్లే వుండవు. ఈ సీన్ల మధ్య వూళ్ళో వున్న ఓల్డ్ ఫ్యామిలీ గొడవల కామెడీలు మాటి మాటికీ వస్తూంటాయి. ఇవే ఎక్కువ భాగం ఆక్రమిస్తూ కథకి అడ్డు పడుతూంటాయి.

        పైగా దర్శకుడు ‘ఫోర్త్ వాల్’ టెక్నిక్ ప్రదర్శించడం ఒకటి. అంటే పాత్ర ప్రేక్షకుల వైపు చూస్తూ కథని, పాత్రల్ని వివరించడం. ఇది ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ లో అక్షయ్ ఖన్నా మీద బాగా వర్కౌట్ అయింది. ‘ఘూమ్ కేతు’ లో ఫ్యామిలీ గొడవల్ని చూపించడానికే ఈ టెక్నిక్ ని సాకుగా వాడుకున్నాడు దర్శకుడు. రైటర్ నవ్వాలని ముంబాయి వెళ్ళిపోయిన నవాజుద్దీన్ ఆ ప్రయత్నాలేవో చేసుకోకుండా, ఎప్పుడు చూసినా ఇంకా ఎక్కడో వూళ్ళో వదిలేసి వచ్చిన ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకుంటూ -  మా నాన్న ఇలా చేశాడు, పిన్ని ఇలా చేసింది, మేనత్త ఇలా చేసింది, కొత్త భార్యతో ఇలా జరిగిందీ అని ప్రేక్షకులకి చెబుతూ పిచ్చి కామెడీ సీన్లేసు కోవడమేమిటో? ఈ కథ ఫ్యామిలీ గొడవల గురించా, బాలీవుడ్ ప్రయత్నాల గురించా?

        స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్, స్ట్రక్చర్ సంబంధ సూత్రాలూ పట్టించుకోక పోవడం వల్ల ‘ఘూమ్ కేతు’ అయినా, ‘సూఫీయం సుజాతాయుమ్’ అయినా కథేమిటో అర్ధంగాని దయనీయ స్థితిలో పడి అట్టర్ ఫ్లాపయ్యాయి. నవాజుద్దీన్ 30 రోజుల్లో బాలీవుడ్ రైటర్ అవ్వాలి, అనురాగ్ కశ్యప్ 30 రోజుల్లో నవాజుద్దీన్ ని పట్టుకోవాలి. ఇదీ కథకి పాయింటు, కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు, ఈ కాన్ఫ్లిక్ట్ ఏర్పడగానే నవాజుద్దీన్ రైటర్ అయ్యే ప్రయత్నాలు మానుకుని ఊరికెళ్ళి పోతాడు. ‘సూఫీయం సుజాతాయుమ్’ లో కూడా కాన్ఫ్లిక్ట్ ఏర్పడగానే పాత్రలు  దేని దారి అది చూసుకుంటాయి. ఇవి కథలెలా అవుతాయి? వీటినెవరు చూస్తారు?

        నవాజుద్దీన్ స్క్రిప్టు పోగొట్టుకున్నాక వూళ్ళో వున్న ఫ్యామిలీ గుర్తుకొచ్చి, ఆ సెంటి మెంట్లు గొప్పగా అన్పించి ముంబాయి వదిలి ఇంటికెళ్ళి పోతాడు. అసలు ఈ పాత్రే రైటర్ పాత్రగా నమ్మశక్యంగా వుండదు. జీవితంలో ఏమీ రాయని వాడు బాలీవుడ్ రైటర్ అవ్వా లనుకోవడం ఆషామాషీగా తీసుకున్నట్టుంది దర్శకుడు. అతను రాసే కథలు కూడా ‘సవతి తల్లి’ అనీ, ‘బాత్రూం లో హత్య’ అనీ ఇలాటి చిల్లర వేషాలు.  

        నవాజుద్దీన్ స్క్రిప్టు రాసుకుంటూ ఒక చోట అనుకుంటాడు - ‘కామెడీ రాయడం సీరియస్ బిజినెస్, ప్రేక్షకులు కూడా నవ్వాలి కదా’ అని. దర్శకుడు మాత్రం దీన్ని సీరియస్ బిజినెస్ గా తీసుకోక ‘సి గ్రేడ్’ కామెడీగా చేసి వదిలాడు.

సికిందర్
(తెలుగురాజ్యం డాట్ కాం)


8, జులై 2020, బుధవారం



డియర్ రీడర్స్,
ఓటీటీలో విడుదలయ్యే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాల రివ్యూలు ఈ రోజు నుంచి ‘తెలుగు రాజ్యం డాట్ కాం
లో  పోస్ట్ అవుతాయి. ఈ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.


సూఫీయుం సుజాతాయుం మూవీ రివ్యూ



25, జూన్ 2020, గురువారం

954 : స్క్రీన్ ప్లే సంగతులు


             స్పెన్సుకి తల వుండి తోక లేకపోతే తెనాలి రామకృష్ణుడి మేక తోక పద్యంలా తికమకగా వుంటుంది. మేకని తలతో మొదలు పెట్టి మెడ, కడుపు, కాళ్ళు అంటూ తోక కొస్తాం. అంటే తల స్టార్టింగ్ పాయింట్, తోక ఎండ్ పార్టు. మేకని చూసే నార్మల్ పధ్ధతి ఇది. ఇలా తల నుంచి కాక, తోక నుంచి మొదలు పెడితే మొత్తం మేక శరీర భాగాలు తోకకి ఎండ్ పార్టులవుతాయి. అంటే తోకకి తోకలవుతాయి. తోకే లేకపోతే తల ఏమవుతుంది? స్పెన్సు కీ అదే అవుతుంది. ఇక సస్పెన్సుకి ఇద్దరు విడి విడి విలన్లుంటే తలా తోకా రెండూ వుండవు!

        మురుగ దాస్ కూడా రజనీ కాంత్ తో తలాతోకా లేని పనే చేశాడు. ‘దర్బార్’ లో ఇద్దరు విడి విడి విలన్స్ ని పెట్టాడు. రజనీ కాంత్ డ్రగ్ దందా మూలాలు వెతుకుతున్నప్పుడు, ఇతనే విలన్ అని మనం సెటిలై ఫాలో అయ్యే ఒక విలన్ తెరపైకొస్తాడు. రజనీ అతడి కొడుకు దొరికితే వాణ్ణి చంపేసి విలన్ కి షాకిస్తాడు. అప్పుడు రజనీకి తెలియని ఇంకో విలన్ వచ్చి ఉన్న విలన్ని చంపేస్తాడు. చంపడమేగాక, రజనీ మీద దాడి చేసి అతడి కూతుర్నీ చంపేస్తాడు. సెకండాఫ్ లో ఈ కొత్త విలనెవరో తెలియక రజనీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఇలా హీరోగా రజనీ ముగించాల్సిన కథలో విలన్ పాత్రని రెండో విలన్ చంపి ముగించి, సూపర్ స్టార్ గా రజనీ పాత్రకి దక్కాల్సిన క్రెడిట్, బాక్సాఫీసు అప్పీల్, ఫ్యాన్స్ చప్పట్లూ వగైరా మార్కెట్ యాస్పెక్ట్స్ ని అప్పనంగా తను కొట్టేసి సినిమాకి నష్టం చేశాడు. రజనీ పాసివ్ క్యారక్టర్ గా వెలవెల బోయాడు. ఇలా కథని రెండో విలన్ ముగించాక అతడితో ఇంకో కథ ప్రారంభమవడంతో, అసలు కథ తెగిపోతూ స్క్రీన్ ప్లే నిట్టని లువునా ఫ్రాక్చర్ అయి - సెకండాఫ్ సిండ్రోం, మిడిల్ మటాష్ వంటి అనారోగ్యాలు సినిమాకి పట్టుకున్నాయి.

       ఇద్దరు విలన్లతో ఇలావుంటే, ఇక సాహోలో లెక్కలేనంత మంది విలన్లు. వాళ్ళ లెక్కలేనన్ని విలనిజాలు. వాళ్ళందరూ ఒకే కథగా, ఒకే ఎజెండాతో వుంటే, హీరో ప్రభాస్ కి ఓ ఏకీకృత గోల్ ఏర్పడి, ఉమ్మడి శత్రువుల్ని మూకుమ్మడిగా చంపుతూ కథకో అర్థాన్నీ, బలాన్నీ సమకూర్చి పెట్టేవాడు. హాలీవుడ్ ఫాంటసీ -సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మల్టిపుల్ విలన్సే వుంటారు. ఇవి ఎక్కువగా కామిక్ బుక్స్ సిరీస్ ఆధారంగా తీసినవై వుంటాయి కాబట్టి. ఈ మల్టిపుల్ విలన్స్ ఒక సిండికేట్ గా ఏర్పడి వుంటారు. లేదా ఒక మెయిన్ విలన్ వుంటూ మిగిలిన వాళ్ళు ఆ విలన్ కి ఏజెంట్లుగా వుంటారు. వీళ్ళందరికీ హీరోతో ఒకే సమస్యతో సంబంధం - పోరాటం వుంటుంది.

        ఇప్పుడు ‘పెంగ్విన్’ తో వచ్చిన సమస్య కూడా ఇలా మల్టిపుల్ విలన్ సిండ్రోమే:
ఇద్దరు విలన్లు వుండడం. ఇద్దరు విలన్లతో కథలు నిలబడవని కాదు, ఇద్దరూ ఒకటవ కృష్ణుడు, రెండో కృష్ణుడు బాపతుగా ఒకరు పోయాక ఇంకొకరు వస్తేనే సమస్యంతా. ఇద్దరూ ఒకే గోల్ తో ఒకే సమయంలో ఒకే గ్యాంగ్ గా, సిండికేట్ గా ఆపరేట్ చేస్తే సమస్య రాదు. వాళ్ళు ఒకే కథతో ఉమ్మడి శత్రువులుగా ఒకే టార్గెట్ గా హీరోకి వుంటారు కాబట్టి. ఇలాకాక ‘పెంగ్విన్’ లోలాగా హీరోయిన్ కీర్తీ సురేష్ ని ఒక ఇబ్బంది పెట్టి తను కాదని ఒక విలన్ వెళ్ళిపోతే, ‘దర్బార్’ లో రజనీ కాంత్ లా ఆమె ఇంకో విలన్ని వెతుక్కోవడంతో -  ఈ విడివిడి విలన్ల రాక పోకలు విడివిడి కథలయ్యాయి. దీంతో ఆమూలాగ్రం ఎడతెగని ఒకే ధారగా ప్రవహించాల్సిన ఒకే కథ, మధ్యలో ఒక పాయగా విడిపోయి సస్పెన్సు, సినిమా అన్నీ వీగిపోయాయి.
2
   నెట్ లో ఒక విషయం గురించి సెర్చి చేస్తూంటే ‘జస్ట్ వాట్ కైండ్ ఆఫ్ మదర్ ఆర్యూ?’ అన్న నవల తగిలింది. బ్రిటిష్ రచయిత్రి పౌలా డాలీ తొలి థ్రిల్లర్ నవల. 2014 లో అచ్చయింది. బాగా పేరు తెచ్చి పెట్టింది. ఏమిటా అని సినాప్సిస్ చదివితే, ‘పెంగ్విన్’ పోలికలే కన్పించాయి. లీసాకి ముగ్గురు పిల్లలు. లేక్ డిస్ట్రిక్ట్ లో వుంటుంది. తన పిల్లలతో బాటు పొరిగింటి పిల్ల లుసిండాని తీసుకుని షికారు వెళ్తుంది. లుసిండా తప్పిపోతుంది. దీంతో ‘నువ్వెలాంటి తల్లివి?’ అని అందరూ నిందిస్తారు. ఆమెని బాధ్యురాల్ని చేసి వెలి వేస్తారు. ఇంతలో తన రెండో కూతురు కూడా అదృశ్య మవుతుంది. దీంతో మరింత కలకలం లేస్తుంది. ఇంతలో దయనీయ స్థితిలో లుసిండా తిరిగి వస్తుంది. ఈ స్థితికి మళ్ళీ నిందలు మోస్తుంది లీసా. ఇక అసలేం జరిగిందో తెలుసుకుని తన వల్ల జరిగిన తప్పుని సరిదిద్దడానికీ, కూతుర్ని వెతకడానికీ సమకడ్తుంది. ఈ క్రమంలో తెలుసుకుంటున్న నిజాలతో షాకింగ్ డొమెస్టిక్ డ్రామాలు, మనుషుల అసలు స్వరూపాలూ భయంకరంగా వెల్లడై, ఎడతెగని సస్పెన్స్ థ్రిల్లర్ కి దారితీస్తాయి...

        కీర్తి సురేష్ పాత్ర రిథమ్ కథ కూడా దీనికి దగ్గరగా వుంటుంది. కాకపోతే ఫస్టాఫ్ వరకే. నీలగిరి ఘాట్స్ లో వుండే రిథమ్ రెండేళ్ళ కొడుకు అజయ్ (ఉమర్) ని పోగొట్టుకుంటుంది. దీనికి భర్త రఘు (లింగా) ఆమెని నిందించి విడాకులు తీసుకుంటాడు. మూడేళ్ళ తర్వాత ఆమె గౌతం (రంగరాజ్) ని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఏడు నెలల గర్భవతిగా వుంటుంది. కానీ ఆరేళ్ళ క్రితం అదృశ్యమైన కొడుకు అజయ్ కోసమే తల్లడిల్లుతూ వుంటుంది. పోలీసులు ఇక చనిపోయినట్టే నని చేతులెత్తేస్తారు. ఇంతలో అనుకోకుండా ఎనిమిదేళ్ళ అజయ్ (అద్వైత్) తిరిగొస్తాడు. కానీ మానసికంగా దెబ్బ తిని వుంటాడు. ఏం జరిగిందో, తనని ఎవరు తీసికెళ్లారో డాక్టర్ డేవిడ్ (మాథి) ఎంత  ప్రయత్నించినా చెప్పడు. కొడుకుని ఇలా ఎవరు చేశారో తెలుసుకోవాలని పూనుకుంటుంది రిథమ్. ఇంతలో అంజన (ఐశ్వర్య) అనే ఇంకో అమ్మాయి అదృశ్యమవుతుంది. ఈమె జాడ కూడా దొరకదు. ఇంతేగాక ఇంటికి తిరిగొచ్చిన అజయ్ కోసం కిడ్నాపర్ మళ్ళీ ప్రయత్నిస్తూంటాడు. ఇతను చార్లీ చాప్లిన్ మాస్కులో వుంటాడు. ఎవరితను? ఎందుకు చిన్న పిల్లల్ని అపహరిస్తున్నాడు? మళ్ళీ ఇప్పుడు రిథమ్ కొడుకుని కాపాడుకుంటూ కిడ్నాపర్ ని పట్టుకో గల్గిందా? అంజన ఏమైంది? రిథమ్ తెలుసుకున్న అసలు నిజమేంటి? ఇదీ మిగతా కథ.
3
     రాట్ససన్, అంజాం పాథిరా, ఫోరెన్సిక్, సైకో, పొన్మంగళ్ వందాళ్, ఇప్పుడు పెంగ్విన్ ...ఇలా వరుసగా సీరియల్ కిల్లర్ సినిమాలు తమిళ మలయాళాల నుంచి వస్తున్నాయి.  వీటిలో రాట్ససన్, పొన్మంగళ్ వందాళ్, పెంగ్విన్ మూడూ చిన్న పిల్లల కిల్లర్స్ కథలతో వచ్చాయి. అయితే ‘పెంగ్విన్’ తో సమస్య ఏమిటంటే, దీన్ని ఒక విలన్ తో సీరియల్ కిల్లర్ కథలా నడిపించి చీట్ చేయడం. ఒక విలన్ తో సీరియల్ కిల్లర్ కథలా నడిపిస్తూ దాన్ని క్యాన్సిల్ చేసి, ఇంకో విలన్ తో రిథమ్ చిన్నప్పటి వేరే కథగా కొత్త ఖాతా తెరవడం. ఇటీవల తెలుగులో వచ్చిన ‘హిట్’ లో చిన్నప్పుడు ఇద్దరు స్నేహితురాండ్ర మధ్య జరిగే పరిణామాలతో ఎండ్ సస్పెన్స్ ఎలా వుందో చూశాం కదా? అలాటి ఎండ్ సస్పెన్స్ అన్నమాట. ఈ కాలంలో ఇంకా వద్దన్నా సినిమా కథకి ఎండ్ సస్పెన్స్ చేస్తే చేశారు, దోషి (విలన్) ఎవరో తేల్చడానికి రెండున్నర గంటలూ ఓపికని పరీక్షించి, చివరికా విలనెవరో విప్పి చెప్పే ఎండ్ సస్పెన్సేదో కథని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్తూ హై రేంజిలో బ్లాస్ట్ అయ్యేలా చూడాలిగా? ఇలా చేయడం ఎవరికైనా దాదాపూ అసాధ్యమే. అందుకే ఎండ్ సస్పెన్స్  క్లయిమాక్సులు మెట్టు దిగి నేలబారు విషయాలతో తేలిపోతున్నాయి.  

        ఇక సెకండాఫ్ లో రిథమ్ కి సీరియల్ కిల్లర్ దొరుకుతాడు. అతను డాక్టర్ డేవిడ్. చిన్న పిల్లల అవయవాల కోసం అపహరిస్తూంటాడు. ఆ శవాల మధ్య అంజన వుంటుంది. అంజనని కాపాడి డాక్టర్ ని పోలీసులకి అప్పగిస్తుంది రిథమ్. అయితే ఆమె కొడుకుని తను అపహరించ లేదంటాడు. అదెవరో నువ్వే తెలుసుకొమ్మని పరీక్ష పెడతాడు. ఇంకో అరగంటలో సెకండాఫ్ ముగుస్తుందనగా, కొలిక్కొచ్చిందనుకుంటున్న కథ కాస్తా క్యాన్సిల్ అయి, ఇంకో కథ ముందుకొస్తుంది. స్క్రీన్ ప్లే ఇలా ఫ్రాక్చర్ అయి, సెకండాఫ్ సిండ్రోంలో పడుతుంది. ఈ మొదలయ్యే రెండో కథ రిథమ్ చిన్నప్పటి కథ.

        ఐతే ఫస్టాఫ్ అంతా తెలియని విలన్ తో, ఇది మేకర్లకి ప్రియమైన పనికిరాని ఎండ్ సస్పెన్స్ కథ అని తెలిసిపోతూనే వుంటుంది. కానీ సెకండాఫ్ చివరి వరకూ ఆగకుండా, సగంలోనే ఆ విలన్ డాక్టరని తేలడంతో - హమ్మయ్యా ఎండ్ సస్పెన్స్ ప్రమాదం తప్పిందనుకుంటాం. ఇక్కడే ఈ సైకో డాక్టర్  ఫేక్ విలన్ అని తెలియడంతో, మళ్ళీ ఎండ్ సస్పెన్స్ కథే మొదలు!

        డాక్టర్ పాత్రతో ట్రాక్ ఆడియెన్స్ ని చీట్ చేయడమే. సైకో డాక్టర్ పాత్రని ఇన్వెస్టిగేషన్ లో తగిలిన ఒక తప్పుడు లీడ్ గా చూపించి వదిలెయ్యకుండా, అతడికో బ్యాక్ డ్రాప్, కథా, సుదీర్ఘ ఇంటరాగేషన్, హీరోయిన్ తో డ్రామా, బిల్డప్పులతో ఇతనే విలన్ అన్పించేలా చేశారు. ఇతను కాదంటూ డ్రామామీద నీళ్ళు చల్లారు. 

        ‘ప్రిజనర్స్’ లో ఆడపిల్లల కిడ్నాపర్ ని పట్టుకునే ప్రయత్నం చేసే పోలీసు అధికారి ఒకడ్ని ఫాలో అయి, వాడి ఇంట్లో శవాల గుట్టని చూస్తాడు. రెండు మాటల్లో వీడు కిడ్నాపర్ కాదని, వేరే సైకో అని సిబ్బందికి అప్పజెప్పేస్తాడు. ఇది ఫస్టాఫ్ ఇంటర్వెల్ ముందు వస్తుంది. ఇంకా పాకాన పడని ఇన్వెస్టిగేషన్ ప్రారంభదశలో, ఇదింకో తప్పుడు లీడ్ గా కన్విన్స్ చేస్తుంది. కానీ ‘పెంగ్విన్’ సెకండాఫ్ లో పాకాన పడ్డాక, తప్పుడు లీడే నిజమైన లీడ్ అన్పించేలా ఇంత డ్రామా చేశారు. దీంతో కథ తెగిపోయి ఇద్దరు విడి విడి విలన్లు ఏర్పడ్డారు కథా నియమాలకి విరుద్ధంగా. ఇప్పుడు సైకో డాక్టర్, చివర్లో ఫ్రెండ్ భావన. 

        దీన్ని నివారించాలంటే ఏం చేసి వుండాలి? ఒకే కన్పించని విలన్ తో ఎండ్ సస్పెన్స్ కథ ఎండ్ సస్పెన్స్ కథలా అన్పించకుండా చేసే టెక్నిక్స్ ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ నుంచీ ‘ధువా’ వరకూ వున్నాయి. ‘రాట్ససన్’ (తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’) కూడా వుంది.
చిన్నచిన్న ఆడపిల్లల్ని చంపే ఈ సైకో కిల్లర్ కథ. పూర్తిగా చూస్తేగానీ ఇది ఎండ్ సస్పెన్స్ మిస్టరీ అని తెలీకుండా గుట్టుగా వుంటుంది. ఇందులో ఫస్టాఫ్ మధ్యలోనే మధ్యలో టీచర్ పాత్ర మీదికి దృష్టి మళ్ళించి అతనే కిల్లర్ అన్నట్టుగా కథ నడుపుతారు. దీంతో విలన్ రూపంలో అతనే కన్పించి ఎలా దొరుకుతాడా అనే సీన్ టు సీన్ సస్పెన్స్ ఏర్పడుతుంది. ఇంటర్వెల్లో ఇతను కాదని తేల్చేస్తారు. మళ్ళీ కొత్త లీడ్స్ తో కొత్త ఇన్వెస్టిగేషన్. ఈ ఇన్వెస్టిగేషన్ తో చివర్లో అసలు సీరియల్ కిల్లర్ని వెల్లడి చేస్తారు. ఇప్పుడు మాత్రమే చూసిందంతా ఎండ్ సస్పెన్స్ మిస్టరీ అని తేల్చి, ఫ్లాప్ కి దొరక్కుండా బయటపడేలా చేశారు. అంటే టీచర్ రూపంలో బిల్డప్ లేని కరివేపాకు పాత్రతో ఫస్టాఫ్ ని భర్తీ చేస్తూ, కవరింగ్ లెటర్ కథనం చేశారన్న మాట. ‘పెంగ్విన్’ లో ఈ టెక్నిక్ వాడుకోక పెంగ్విన్ లని చిన్నబుచ్చారు.
4
      ఇక రెండో కథగా  మొదలయ్యే రిథమ్ చిన్నప్పటి కథ. రిథమ్ తన ఫ్రెండ్ భావన (నిత్య కృప) మీద అనుమానం వచ్చి పట్టుకుంటే, ఆమె చెప్పుకొస్తుంది చిన్నప్పటి కథ. రిథమ్ చదువులో ఫస్ట్. ఆమెతో పోలుస్తూ తనని వేధించారు పేరెంట్స్. ఆమెలా తను చదవాలి, ఆమెలా తను ఎదగాలి... ఈ టార్చర్ భరించలేక రిథమ్ మీద పగ పెంచుకుంది. తన అర్హతలతో తనకి సొంత ఐడెంటిటీ లేకుండా చేసిన రిథంకి బుద్ధి చెప్పాలనుకుని కొడుకుని కిడ్నాప్ చేసి బంధించింది. ఇలా ఈ ఆరేళ్ళూ రిథమ్ కడుపుకోత చూస్తూ ఆనందం అనుభవించింది తను. 
        ‘హిట్’ లో కూడా చిన్నప్పుడు అనాధాశ్రయంలో తన చెల్లెలి అవకాశం హీరోయిన్ కి పోవడంతో, పెద్దయ్యాక హీరోయిన్ని కిడ్నాప్ చేసి చంపుతుంది హీరోయిన్ ఫ్రెండ్. చిన్నప్పుడు విలన్ తో ఏదైనా జరిగితే, పెద్దయాక అతణ్ణి గుర్తు పట్టి రివెంజి తీర్చుకోవడం జనం మెచ్చిన ఒక బాక్సాఫీసు ఫార్ములా. చిన్నప్పుడు తోటి చిన్నపిల్ల వల్ల ఆమెకి తెలీకుండా ఏదో జరిగిపోతే, దానికి పెద్దయ్యాక పగదీర్చుకోవడం జనం మెచ్చని ఫార్ములా కాని ఫార్ములా. పిల్లలు తోటి పిల్లలతో ఇంకా అగరు. అప్పటి కప్పుడు జుట్లు పట్టుకుని కొట్టుకుంటారు. జాకెట్లు చింపేసుకుంటారు. అయిపోతుంది ఆరణాల పగ. ఆరణాల పగతో ఐదుకోట్ల మెగా సినిమా తీయనవసరం లేదు. చిన్నప్పుడు పిల్లలకి ప్రేమలు గుర్తుంటాయి గానీ, పగలు గుర్తుండవు.   
5
      అసలు రిథమ్ పాత్ర గోల్ ఏమిటి? తన కొడుకుని ఇలా ఎవరు తయారు చేశారో తెలుసుకోవాలని గోల్ పెట్టుకుంటుంది. ఇది అవసరం లేదు. ఆరేళ్లుగా పోలీసులు సహా ఎవరూ తెలుసుకోలేని విషయం ఇప్పుడనవసరం. కొడుకు తిరిగి వచ్చిందే చాలు. రెండో భర్తతో ఏడు నెలల గర్భంతో వుంది. కడుపులో బిడ్డ, దొరికిన బిడ్డ ఇద్దరూ చాలు. ముందు కొడుకు ఆరోగ్యం బాగు చేసుకుంటే అతనే తర్వాత ఎప్పుడో చెప్తాడు ఎవరు కిడ్నాప్ చేశారో. ఈ తెలుసుకునే బాధ్యత ఈ పెండింగ్ కేసులో పోలీసులకే ఎక్కువ. 

        అయితే ఇప్పుడు పారిపోయి వచ్చిన కొడుకు కోసం అదే చాప్లిన్ మాస్కు కిడ్నాపర్ ప్రయత్నిస్తూంటాడు. ఇది రిథంకి గోల్ కావాలి. ఒక ప్రెగ్నెంట్ వుమన్ గా కొడుకుని కాపాడుకుంటూ కిడ్నాపర్ ని తెగించి పట్టుకునే గోల్ - ఈ గోల్ లో ఆపరేటివ్ ఎమోషన్ వుంటుంది. అంతేగానీ తాననుకున్నట్టు కొడుకుని ఇలా ఎవరు తయారు చేశారో తెలుసుకోవడంలో ఏ ఎమోషనూ లేదు, పైన చెప్పుకున్న కారణాల వల్ల. 

        ఇలావుంటే, అంజన అనే ఇంకో అమ్మాయి కిడ్నాప్ తో రిథంకి కనెక్షన్ లేదు. ఆమె గురించి ఫీల్ కాదు కూడా. డాక్టర్ని పట్టుకున్నాక అక్కడ కాకతాళీయంగా కన్పించిన అంజనని కాపాడుతుందంతే. ఈ కథలో అంజన పాత్ర అవసరం లేదు. 

        పైన చెప్పిన నవలలో, కథానాయిక లీసా వల్ల పొరుగింటి లుసిండా కన్పించకుండా పోతే, అందరి సూటిపోటి మాటలతో లీసా గిల్టీ ఫీలవుతుంది. ఇంతలో సొంత కూతురు కూడా కిడ్నాపై లుసిండా తిరిగొస్తుంది. ఇప్పుడు తన కూతురు మాయమవడంతో ఇక తనేం చేయాలో డిసైడ్ చేసుకుంటుంది. ఈ కిడ్నాపుల గుట్టు రట్టు చేసి, మొదటి అమ్మాయితో  తన మీద పడ్డ నింద తొలగించుకునే బలమైన ఎమోషనల్ గోల్, కూతుర్ని కనుగొనే ఫిజికల్ గోల్ రెండూ ఏర్పడ్డాయి. ఇలా ముందు పొరుగింటి అమ్మాయి కిడ్నాపై తర్వాత కూతురు కిడ్నాపవడంతో, కథ ఏకత్రాటి పైనే వుంది. ‘పెంగ్విన్’ లో సొంత కొడుకు కిడ్నాపై వచ్చాక, పొరుగు అమ్మాయి కిడ్నాప్ అవడంతో, ఈ అమ్మాయితో రిథం కేలాటి ఎమోషనల్ కనెక్షన్ లేకుండా పోయింది. ఎందుకంటే దీనికి తను బాధ్యురాలు కాదు, తననెవరూ నిందించడం లేదు కూడా. 

        ఆఫ్ కోర్స్, మొదటి భర్త నిందించాడు. ఆమె అజాగ్రత్త వల్లే కొడుకు కిడ్నాపయ్యాడని నిందించి, విడాకులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ నింద ఆరేళ్ళ పాటూ కొడుకు తనకి తాను తిరిగి వచ్చేవరకూ మోసిందే తప్ప, ఏమీ చేయలేక పోయింది. కొడుకు రావడంతో నిందా తొలగిపోయింది, మొదటి భర్తా క్షమించమన్నాడు.
6
    ఈ కథలో ‘హిడెన్ ట్రూత్’ రిథమ్ ఫ్రెండ్ భావన చిన్నప్పటి పగ. చిన్నప్పుడు భావన తన మీద పగ ఫీలయిందని రిథంకి తెలీదు. అయితే వర్తమాన కథలో కొడుకు తిరిగొచ్చాక, కొడుకుని ఇలా ఎవరు తయారు చేశారో తెలుకోవాలన్న తపన రిథమ్ కి ఆమె సబ్ కాన్షస్ పరంగా కరెక్టే. అయితే కొత్త దర్శకుడు ఇలా పలుకుతున్న ఆమె సబ్ కాన్షస్ ని పట్టుకుని, ఓపెనింగ్ ఇమేజిని కరెక్టు చేసుకోవాలని తెలుసుకోలేదు.   సినిమా ఓపెనింగ్ ఇమేజి ఎలా వుంటుందంటే, పొగమంచు... సరస్సు... ఎల్లో హుడ్ వేసుకున్న రెండేళ్ళ పిల్లాడు... వెంట కుక్క పిల్ల... ఇంతలో ఎల్లో గొడుగుతో చాప్లిన్ మాస్కు వేసుకున్న కిల్లర్... పిల్లాడి గొంతు కసక్ మని కోసి సరస్సులోకి అలా అలా మాయం...   
 
        థ్రిల్లర్ కి చాలా క్వాలిటీతో వున్న పొయెటిక్ సీన్. దర్శకుడి ఉత్తమాభిరుచి. కానీ విజువల్సే సినిమా కాదు. విజువల్స్ కి కథాత్మ జతపడాలి. ‘ఇట్’ అనే హాలీవుడ్ మూవీలో పిల్లల అపహర్త ఇలాటి ఒక మాస్కులోనే వుంటాడు. ఇది ఇన్స్ పిరేషనేమో. కానీ ఈ ఓపెనింగ్ ఇమేజికి కథతో, కాన్సెప్ట్ తో సంబంధంలేదు. పైగా ఇది రిథమ్ కనే ఓ పీడ కల మాత్రంగానే వుంటుంది. కానీ దర్శకుడు స్క్రిప్టులో సరైన దృష్టి పెడితే, ఆమె సబ్ కాన్షస్ విలువ లేని ఈ కలని ప్రసారం చేయడం కాదు, తనకే తెలియని విలువైన ఒక సమాచారం అందించడానికి ప్రయత్నిస్తూంటుంది. ఇందుకే దర్శకుడు, ఆమె కొడుకుని ఇలా ఎవరు తయారు చేశారో తెలుసుకోవాలనే గోల్ ని స్క్రిప్టులో అప్రయత్నంగా అక్షరీకరించాడు. దీనికి ఓపెనింగ్ ఇమేజి కూడా తోడైతే, ఈ గోలే బలమైన ఎమోషన్ గల ఆపరేటింగ్ గోల్ అయ్యేది. కొడుకుని ఇలా ఎవరు తయారు చేశారు? - అన్న ప్రశ్నలోనే కథాత్మతో కూడిన ఓపెనింగ్ ఇమేజి దాగి వుంది. ఆ కథాత్మ లేదా మిస్టరీ - చిన్నప్పుడు ఫ్రెండ్ భావనతో కూడిన పగ. హిడెన్ ట్రూత్. తనకి తెలీని సమాచారం. ఈ హిడెన్ ట్రూత్ ని అందించాలని ఆమె సబ్ కాన్షస్ ప్రయత్నిస్తున్నట్టయితే, అప్పుడు తదనుగుణ మైన ఓపెనింగ్ ఇమేజి వెండి తెరనలంకరించేది.

        మాస్కు కిల్లర్ తన రెండేళ్ళ కొడుకుని చంపినట్టు కల రావడం అయిపోయిన కథ. మాస్కు కిల్లర్ భావనకి సంబంధించిన అస్పష్ట మయా దృశ్యాలని ఏర్పర్చడం అవ్వాల్సిన కథ. ఓపెనింగ్ ఇమేజికి అవ్వాల్సిన కథ కావాలి, అయిపోయిన కథ కాదు. వెంటాడుతున్న ఈ అస్పష్ట ఓపెనింగ్ ఇమేజికి అర్ధమేమిటాని హిడెన్ ట్రూత్ కి దారి తీసే ఆమె అన్వేషణ కావాలి. 

        2003 లో అనురాగ్ బసు దర్శకత్వంలో మహేష్ భట్ నిర్మించిన ఫాంటసీ థ్రిల్లర్ ‘సాయా’ (నీడ) లో, హీరో జాన్ అబ్రహాం కి నీళ్ళే నీళ్ళు ఎదురవుతూంటాయి. సీలింగ్ కూడా కారిపోతూ  నీళ్ళు నిండి పోతూంటాయి. ఎందుకిలా జరుగుతోందో అర్ధం గాదు. చనిపోయిన భార్య (తారా శర్మ) ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుసుకుంటాడు. డాక్టర్ గా ఆమె ఈశాన్య రాష్ట్రంలో వైద్య బృందంలో వెళ్లినప్పుడు వరదల్లో కొట్టుకు పోయింది. మృత దేహం కూడా లభించలేదు. గర్భవతిగానే తనువు చాలించింది. ఇప్పుడు నీళ్ళు కురిపిస్తూ భార్య తనకి చెప్పాలని ప్రయత్నిస్తోందేమిటో తెలుకోవాలని ఈశాన్య రాష్ట్రానికి వెళ్తాడు. తెలుసుకుంటే ఆమె సజీవంగానే గిరిజనులకి దొరికింది. పురుడు పోయగానే చనిపోయింది. వాళ్ళే దహన సంస్కారాలు చేసి బిడ్డని పోషించుకుంటున్నారు. ఆ బిడ్డని చూసుకుంటాడు జాన్ అబ్రహాం. ఇలా బిడ్డ దగ్గరికి తనని చేరేసేందుకు సింబాలిక్ గా వరదల్ని గుర్తుచేసే జల ధారలతో తనతో సంభాషించిందన్న మాట భార్య. ఇది సింబాలిజంతో కూడిన వెంటాడే హిడెన్ ట్రూత్.
7
     దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కొత్త దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ కి అవకాశ మిచ్చి ‘పెంగ్విన్’ నిర్మించాడు. ఈశ్వర్ కార్తీక్ ఎక్కడా సినిమాలకి పని చేయలేదు. సీరియల్స్, వెబ్ సిరీస్, షార్ట్ నూవీస్ ఏవీ తీసిన అనుభవం లేదు. నాటకరంగంలో వుంటూ సినిమా కథ రాసుకొచ్చేసి ‘పెంగ్విన్’ తీసేశాడు. మేకర్ గా మంచి ప్రతిభ కనబర్చాడు. రైటర్ గా ఎందరో లాగా తప్పకుండా విఫల మవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఎంతగానంటే సెకండాఫ్ భరించలేనంత. పైన చెప్పుకున్న లోపాలతో సెకండాఫ్ నీలగిరి లోయల్లోకి వెళ్ళిపోయింది. మనమే ఎలాగో విరిగే కొమ్మ అంచు పట్టుకుని కొన ప్రాణాలతో వేలాడుతూంటాం. ఈ సాహసానికి ఇస్తే అవార్డు మనకే ఇవ్వాలి. ఫస్టాఫ్ కథా కథనాలు వాటి దృశ్యీకరణతో  క్లాస్ గా వున్నాయి. అరగంటలో ప్లాట్ పాయింట్ వన్ వచ్చే వరకూ, రిథమ్ ఫ్లాష్ బ్యాక్స్ మధ్య ప్రస్తుత జీవితం చూపిస్తూ, కొడుకు తిరిగి రావడంతో ప్లాట్ పాయింట్ వన్ వేసి, ఆమెకి గోల్ నిచ్చాడు. అదే సమయంలో మాస్క్ కిల్లర్ ని యాక్టివేట్ చేసి మిడిల్ కెళ్ళి పోయాడు. 

        అలాగే సెకండాఫ్ లో డాక్టర్ తో ఫేక్ డ్రామా ముగించి, కొత్త అన్వేషనతో ప్లాట్ పాయింట్ టూ నిచ్చాడు. కానీ ఇంటర్వెల్లో కొడుకు మీద వయోలెంట్ షాట్ వేశాక, ఇక సెకండాఫ్ అంతా షాట్స్ మిస్సవుతున్న ఫైరింగే చేసుకుంటూ వెళ్లి అమెజాన్ కప్పగించాడు. తమిళనాడులో బయ్యర్లు హేపీగానే వున్నారు, లాక్ డౌన్ పుణ్యమాని దీన్నుంచి తాము తప్పించుకున్నందుకు. 

        విజువల్ క్వాలిటీకి కెమెరా మాన్ కార్తీక్ పళని దోహదం చేశాడు. సాంప్రదాయ షాట్స్ వల్ల టేస్ట్ ఏమిటో తెలిసింది. ఎడిటింగ్ కూడా స్మూత్ ఎడిటింగే. ఎక్కడా పాప్ కార్న్ ఎడిటింగ్ చేయలేదు. స్వరాలతో సంతోష్ నారాయణ్ కూడా కథానాయిక పేరు రిథమ్ లాగే, ఒకే రిథమ్ ని మెయింటైన్ చేస్తూ క్లాస్ టచ్ నిచ్చాడు. 

        ఇక హీరోయిన్ కీర్తీ సురేష్. పూర్తి విషాద పాత్రలో, తనకున్న స్క్రీన్ ప్రెజెన్స్ తో అవార్డుకి అర్హమైనట్టు నటించింది...

సికిందర్