రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, జూన్ 2020, గురువారం

ప్రకటన




 క్విజ్ ఫ్లాప్!
నిన్నటి స్ట్రక్చరాస్యతా క్విజ్ ఫ్లాపైంది.
ఎవరూ ఆసక్తి చూపలేదు. ముగ్గురు మాత్రమే స్పందించారు.
వారికి వ్యక్తిగతంగా సమాధానాలిచ్చాం.
***

3, జూన్ 2020, బుధవారం

950 : రివ్యూ!


      నూట యాభై ఏళ్ల క్రితం కేరళలోని పాలక్కడ్ లో ఒక అమ్మవారి జాతరలో భాగంగా కుమ్మట్టి కాళి అనే పౌరాణిక ప్రదర్శన పుట్టింది. పాలక్కడ్ తో బాటు, త్రిసూర్, మలబార్ లలో ఓనం పండగప్పుడు ఈ జాతర జరుగుతుంది. ఈ పౌరాణికం శివుడికీ అర్జునుడికీ మధ్య సన్నివేశం... మారువేషంలో  వున్నశివుడి పాశుపతాస్త్రం కోసం అర్జునుడి పోరాటం... అది మనస్సు నుంచి, నేత్రాల నుంచి, వాక్కు నుంచీ వెలువడే అత్యంత విధ్వంసకర అస్త్రం. దాన్ని సమవుజ్జీ కాని శత్రువుపై ప్రయోగించరాదు, అలాగే యోగ్యులు కాని యోధులు వాడరాదు. ‘అయ్యప్పనుం కోషియం’ ప్రారంభ దృశ్యంగా ఈ ప్రదర్శన జరుగుతోంది...పాశుపతాస్త్రం అర్జునుడి వశమైంది శివుడి ఔదార్యంతో చివరికి. 

       
గో కూడా భయంకర పాశుపతాస్త్రం. ఇగోలతో ఇద్దరు వ్యక్తుల మధ్య వైషమ్యాలు ఎవరికీ గెలుపు నివ్వవు, ఓటమినీ ఇవ్వవు. నిరంతర విధ్వంసంతో ఇద్దరూ అంతమైపోవడమే. అతను బలమైన రాజకీయ సంబంధాలున్న మాజీ ఆర్మీ హవల్దార్. ఇతను సామాన్య పోలీస్ ఎస్సై. సామాన్యుడితో ఇగో ఏమిటని బలవంతుండు అనుకోవడం లేదు. బలవంతుడితో ఇగో ఎందుకని సామాన్యుడూ అనుకోవడం లేదు. ఇద్దరూ బాహాబాహీకి దిగారు, ఒక ముగింపులేని పోరాటానికి తెరలేపారు. 



        అతను ఊటీలో సినిమా షూటింగు జరుపుకుంటున్న మిత్రుడైన ఒక దర్శకుడు అడిగితే, పూటుగా తాగి, పెట్టె నిండా మద్యం బాటిళ్ళు కార్లో పెట్టుకుని బయల్దేరాడు. మద్యనిషేధం అమల్లో వున్న అట్టప్పడి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పోలీస్- ఎక్సైజ్ జాయింట్ ఆపరేషన్లో దొరికిపోయాడు. దొరికిపోవడమే గాక నానా గలభా చేసి ఎక్సైజ్ అధికారిని కొట్టాడు. అతణ్ణి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించాడు ఎస్సై అయ్యప్పన్ నాయర్. పేరడిగితే కోషీ జాన్ అని చెప్పాడు. ఫోన్ చెక్ చేస్తే సీఎం పినరయి విజయన్, మాజీ సీఎం ఊమెన్ చాండీలతోబాటు, ఇంకొందరు నాయకులు, జర్నలిస్టుల ఫోన్ నెంబర్లూ వున్నాయి. కంగారుపడి పై అధికారికి ఫోన్ చేసి చెప్పాడు అయ్యప్పన్. అతణ్ణి డీసెంట్ గా ట్రీట్ చేసి, కేసు బుక్ చేసి కోర్టుకి హాజరు పర్చమన్నాడు పై అధికారి. ఇక తన అరెస్టు, కోర్టు, జైలూ తప్పవని గ్రహించిన కోషీ, తెలివిగా నాటకమాడేడు. తనకి మద్యం కావాలనీ, మద్యం లేకపోతే హెల్త్ ప్రాబ్లమనీ చెప్పి నమ్మించి, సీజ్ చేసిన లిక్కర్ లోంచి కొంత పోయించుకుని తాగాడు. ఇదంతా ఫోన్ లో రికార్డు చేశాడు. ఉదయం కోర్టుకీ, అట్నుంచి అటే జైలుకీ వెళ్ళాక, బెయిలు మీద విడుదలై వచ్చి, ఫోన్లో రికార్డు చేసిన వీడియోని ఛానెల్లో బట్టబయలు చేశాడు. 

          దీంతో మద్యం కేసులో అరెస్టయిన నిందితుడికి మద్యం పోసిన ఇంకో నిందితుడిగా మారి, సస్పెండ్ అయిపోయాడు ఎస్సై అయ్యప్పన్ నాయర్, లేడీ కానిస్టేబుల్ సహా. ఇక కోషీ - అయ్యప్పన్ ల రగడ, రచ్చ, కచ్చ మొదలైపోయాయి. తనని సస్పెండ్ చేయించినందుకు కోషీ ముందే కోషీ అనుచరుణ్ణి విపరీతంగా కొట్టాడు అయ్యప్పన్. దీంతో కోషీ తండ్రి కురియన్ జాన్ కోషీకి అంగరక్షకులుగా కొందరు వృత్తి నేరస్థుల్ని పంపాడు. కురియన్ జాన్ కూడా బలమైన రాజకీయ సంబంధాలున్న మాజీ ఆర్మీ హవల్దార్. అతను విపరీతంగా ఇగోకి పోయి అయ్యప్పన్ భార్య అరెస్టుకి పావులు కదిపాడు. అయ్యప్పన్ ఆదివాసీ మావోయిస్టు కార్యకర్త అయిన కణ్ణమ్మని పెళ్లి చేసుకున్నాడు. అయ్యప్పన్ అంతు చూడాలని కోషీ అట్టప్పడిలోనే లాడ్జిలో మకాం వేశాడు. అయ్యప్పన్ జేసీబీ పెట్టి కోషి కార్యాలయాన్ని కూల్చేశాడు. కోషి తను కూడా జేసీబీ పెట్టి అయ్యప్పన్ ఇంటిని కూల్చేశాడు. కోషీ ఇల్లు కూల్చేస్తే కోషీ కారుని పేల్చేశాడు అయ్యప్పన్. ఇలా దాడికి ప్రతి దాడి చేసుకుంటూ పోలీసుల్ని పరుగులు పెట్టించారు. తన వ్యవహారంలో తండ్రి అనవసరంగా జోక్యం చేసుకుని ఇబ్బందిలో పడేస్తున్నాడని, అతణ్ణి అరెస్ట్ చేయించేశాడు కోషీ. 

         ఇలా మరెన్నో సంఘటనలు జరిగి, ఇక ఫైనల్ గా చావో రేవో  తేల్చుకోవా లనుకున్నారు.  సరిహద్దు దాటి తమిళనాడులో కొట్టుకునే కార్యక్రమం పెట్టుకుంటే, కేరళ పోలీసులు అడ్డు రారనుకున్నారు. అలా తమిళనాడు మార్కెట్ లో కొట్టుకోసాగారు. తమిళ పోలీసులతోబాటు కేరళ పోలీసులు కూడా వచ్చేసి  అయ్యప్పన్ కోషీని చంపకుండా ఆపబోయారు. అయ్యప్పన్ ఆగేటట్టు లేడు. అయ్యప్పన్ మీద సస్పెన్షన్ ఎత్తేశారని సీఐ చెప్పడంతో, అయ్యప్పన్ శాంతించి కోషీని వదిలేశాడు. ఇక కోషీ సొంతూరు కట్టపణకే ట్రాన్స్ ఫర్ చేయించుకుని, కొత్త ఎస్సైగా కోషీని పరిచయం చేసుకుని, కరచాలనం చేశాడు అయ్యప్పన్.

ఎలావుంది కథ
      కోషీ పాత్ర పోషించిన నటుడు, నిర్మాత, దర్శకుడు, పంపిణీ దారుడు, గాయకుడూ అయిన - నూరు సినిమాలూ నటించిన- పృథ్వీరాజ్ సుకుమారన్ కి, అయ్యప్పన్ పాత్ర నటించిన శతాధిక చిత్రాల నటుడు బిజూ మీనన్ కీ మలయాళంలో విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఏ ఒక్కర్ని తక్కువ చేసి చూపించినా ఆ అభిమానులతో సమస్య లొస్తాయి. అందుకని ఎవరి గెలుపూ, ఎవరి ఓటమీ లేని, ఇదమిత్థమైన ఒక ముగింపూ లేని కథగా ఇది తెరకెక్కింది. దీంతో నటులుగా వాళ్ళ ఇమేజులకి న్యాయం జరిగిందేమో గానీ, కథకి న్యాయం జరగలేదు. కథ ప్రకారం వాళ్ళ ఇగోలతో వాళ్ళే తేల్చుకోకుండా, మధ్యలో పై అధికారుల జోక్యంతో శాంతించడం పాత్రౌచిత్యాల్ని దెబ్బ తీసింది. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవల్ని పై అధికారులూ నాయకులూ కల్పించుకుని ఎప్పుడో ఆపి వుండొచ్చు. సహజంగా ఇదే జరుగుతుంది. మొదట్నుంచీ జరిగేవన్నీ జరగనిచ్చి, చిట్టచివరికి మధ్యలో దూరి కథని ఆపారు అధికారులు. కథ ఆగింది కానీ ముగియలేదు. పాపులర్ నటుల ఇమేజుల్ని కాపాడేందుకు కథతో ఇలా చేయాల్సి వచ్చింది దర్శకుడికి. 


        దీన్ని బాలకృష్ణ - రానా, లేదా రవితేజ - రానా లతో తెలుగులో రీమేక్ గురించి వార్తలొస్తున్నాయి. సీనియర్ బాలకృష్ణకీ, జూనియర్ అయిన రానాకీ, కోషీ - బిజూ మీనన్ లకి లాగా సమాన ఇమేజులు, ఫ్యాన్ బేస్ లు లేవు. అలాగే సీనియర్ రవితేజకీ, జూనియర్ అయిన రానాకీ సమాన ఇమేజులు, ఫ్యాన్ బేస్ లూ లేవు. ఈ కథని వీళ్ళ కాంబినేషన్స్ లో తీస్తే ముగింపుతో ఇబ్బంది పడాల్సిన అవసరముండదు. మలయాళంలో లాగా కాకుండా సీనియర్ కే విజయాన్ని చేకూర్చి కథ ముగించెయ్యొచ్చు. కాకుండా మలయాళంలో లాగా అక్కడి పరిస్థితుల్ని బట్టి కథతో రాజీ పడినట్టు, ఎవరి విజయమూ ఎవరి ఓటమీ లేకుండా సీనియర్ జూనియర్లని కలిపి తీస్తే ఎబ్బెట్టుగా వుండొచ్చు. మలయాళంలో అది ఇమేజులు నిర్ణయించిన కథ. ఇలా ఇమేజులు నిర్ణయించిన కథే చేయాలనుకుంటే బాలకృష్ణ - రవితేజ సీనియర్ లిద్దరి కాంబినేషన్ని ఆలోచించాలి.   
     
        టిమ్ అలెన్ నటించిన ‘జో సమ్ బడీ’ (2001) లో బలహీనుడైన టిమ్ ని, బలవంతుడైన పాట్రిక్ వర్బర్టర్, కూతురి ముందే కొడతాడు. దీంతో చాలా అవమానపడి, ఇగో పెంచుకుని, బలవంతుడైన పాట్రిక్ ని, తన కూతురి ముందే ఎలాగైనా కొట్టాలని కష్టపడి బలవంతుడుగా మారతాడు టిమ్. ఇక పాట్రిక్ ని పబ్లిక్ గా కొడతానని ప్రకటించి, ప్రేక్షకుల మధ్య బరిలోకి దూకుతాడు. కానీ పాట్రిక్ ని కొట్ట లేకపోతాడు. కారణం? కొడితే తన ఇగో మాత్రమే సంతృప్తి పడుతుంది. కానీ ఇప్పుడు కొట్టగల్గీ తనని కొట్టిన పాట్రిక్ ని కొట్టకుండా క్షమించేస్తే, మనిషిగా తను ఇంకో మెట్టు పైనుంటాడు. తన ఇగో మెచ్యూర్డ్ ఇగోగా ఎదుగుతుంది... ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చి చూపేదే కదా మంచి కథ. ఈ నిర్ణయంతో ఈ కథ ముగింపులో టిమ్ అందరి దృష్టిలో ఉన్నతుడిగా ప్రకాశిస్తాడు. 

        కోషీ, అయ్యప్పన్ ల సమస్య సమాన ఇగోలు. ఎవరూ తగ్గి ఒకర్ని క్షమించేసి, కథ ముగించేసే పరిస్థితి లేదు. నటుల ఇమేజుల సమస్య వుంది. లేదా ఇద్దరూ గెలవలేమని కామన్ సెన్సు తో సంఘర్షణని విరమించాలంటే కూడా అందుకూ సమాన ఇగోలు ఒప్పుకోవు. పాశుపతాస్త్ర మన్నాక వినాశమే తప్ప శాంతి, సంధి వుండవు. అంటే రణంలో ఇద్దరూ మరణించాలి. ఇందుకూ ఇమేజులు ఒప్పుకోవు. మరెలా అంటే, ఇంతే. సమవుజ్జీల కథని ఎక్కడో ఒక చోట ఆపెయ్యాలి, ముగించడం సాధ్యం కాదు. ఇలా ఇది ఆలోచించడానికి ఒప్పుకోని ఎమోషనల్ ప్రేక్షకుల వల్ల హిట్టయ్యిందనుకోవాలి.

ఎవరెలా చేశారు
      ఈ సినిమాకి ఎవరు హీరో, ఎవరు విలన్ అంటే, ఇద్దరూ హీరోలే, ఇద్దరూ విలన్లే. ఒకరు హీరోగా, ఒకరు విలన్ గా లేరు. ఇద్దరూ ఇగో అనే ఇన్ స్టింక్ట్ కి రెండు ముఖాలే. ఇద్దరూ ఇక్కడ ఇగోలతో బ్యాడ్ పనులే చేస్తున్నారు కాబట్టి ఇద్దరూ విలన్లే. యాంటీ క్యారక్టర్లే. అయితే ఇగోని ప్లే చేయడానికి కోషీకున్నంత క్యారక్టర్ బేస్ అయ్యప్పన్ కి లేదు. కోషీ పాత్రలో సుకుమారన్ చాలా కూల్ గా, సెటిల్డ్ గా వుంటాడు. మనసులో ఏమాలోచిస్తున్నాడో అంతుపట్టకుండా వుంటాడు. ఆలోచనలు రేకెత్తించే ముఖభావాలతో, శరీర భాషతో ఇంప్రెస్ చేస్తాడు. తను కేసులో ఇరుక్కుంటున్నానని గ్రహించి, మాయోపాయంగా అయ్యప్పన్ చేతే మద్యం పోయించుకుని తాగి, అతణ్ణి ఇరికించే ఎత్తుగడతో సుకుమారన్ కోషీ పాత్ర ఇగోకి అర్ధముంది. అది ఆ పాత్ర అవసరం కూడా. పోలీసు అయివుండీ కోషి ఎత్తుగడకి పడిపోయిన అయ్యప్పన్ తన ఫూలిష్ నెస్ కి సిగ్గుపడకుండా, కోషీ మీద పగ పెంచుకునే ఇగోకి మాత్రం జస్టిఫికేషన్ లేదు. అది స్వయంకృతాపరాధం. తను చేసుకున్న కర్మ. అనుభవించాల్సిందే. సవరించుకోవాల్సిన తన అసమర్ధతని అలాగే వదిలేసి, పగతో రగిలిపోవడం పాత్ర డొల్ల తనాన్నిపట్టిస్తుంది. 

          ఇద్దరి మధ్య ఒక డీల్ జరిగి, ఆ డీల్ లో కోషీ మోసం చేస్తే అయ్యప్పన్ కి అన్యాయం జరిగిందనుకోవచ్చు. బాధితుడని సానుభూతి కలగవచ్చు. అప్పుడతడి ఇగోకీ పగకీ అర్ధముండొచ్చు. కోషీ అడిగిందే తడవుగా నట్టనడి పోలీస్ స్టేషన్ లో, సీజ్ చేసిన లిక్కర్నే సీలు విప్పి కోషికి పోస్తూ, అతడి కెమెరా రికార్డింగు కే దొరికిపోతే ఇంకెక్కడి బాధితుడు, ఇంకెక్కడి సానుభూతి. కనీసం అతణ్ణి కోర్టుకి రిమాండ్ చేస్తున్నప్పుడైనా, ఫోన్ ని సీజ్ చేసి రికార్డులో చూపించాలి కదా? ఇవేమీ చేయకుండా చేతులారా ఇరుక్కుని కోషీ మీద చెలరేగి పోవడంలో అర్ధం లేదు. ఇలా చేసి తన మీద కోషీ ఎప్పుడో గెలిచేశాడు. తను చేస్తున్నది న్యాయమైన కోషీ టాలెంటుతో కూడిన అతడి గెలుపుని, టాలెంటు లేని తను అక్రమంగా లాక్కోవాలనుకోవడమే. కోషీ కున్నంత క్యారక్టర్ బేస్ తనకి లేకపోవడం ఇందుకే. 

       అయితే కోషీ కూడా ‘నువ్వు మందు పోయడం నీ తెలివితక్కువతనం, నేను నమ్మక ద్రోహమే చేస్తానని తెలుసుకోకపోవడం నీ మూర్ఖత్వం.  నీ తెలివి తక్కువతనానికీ, మూర్ఖత్వానికీ నన్ను బాధ్యుడ్ని చెయ్యకు. నిన్ను కరెక్ట్ చేసుకో, వెళ్ళు’ అని అనాలి. కానీ ఈ పాయింటు గ్రహించి అనడు. ఇక చివరికి అయ్యప్పన్ సస్పెన్షన్ ఎత్తేశారనగానే కోషీతో పగా ప్రతీకారం మర్చిపోయి ఆనందభరితు డవడం పాత్రని మరీ దిగజార్చింది. తనకి ఉద్యోగం తిరిగొస్తే, ఉద్యోగం పోగొట్టిన కోషీతో ఇగో వుండదా? మరి సస్పెన్షన్ ఎత్తి వేయించుకునే ప్రయత్నాలేవో చేసుకోక ఎందుకు కోషీ వెంట పడ్డాడు? 


        ఈ పాత్రలో బిజూ మీనన్ ది ఆవేశపూరిత నటన. పాత్రచిత్రణ లోపాలతో నిమిత్తం లేకుండా నటనలకి ఆవార్డులూ వచ్చేస్తాయి. లోపాలతో బిజూ మీనన్, బలమైన మోటివ్ తో సుకుమారన్ ల మధ్య ప్రత్యర్ధులుగా కెమిస్ట్రీ మాత్రం చెప్పుకోదగ్గదే. వీళ్ళిద్దరి భార్యల పాత్రల్లో నటించిన అన్న రాజన్, గౌరీ నందాల పాత్రలు బలహీనమైనవి. సుకుమారన్ అన్న రాజన్ ని కొట్టే సీను అభ్యంతరకరంగా వుంటుంది. పలుకుబడిగల కుటుంబంలో భార్య పరిస్థితి ఇలా వుంటే, సామాన్య కుటుంబంలో ఆదివాసీ భార్యగా వామ పక్ష మూలాలుండీ గౌరీదీ ప్రాబల్యం లేని పాత్ర. 
          

         ఇక లేడీ కానిస్టేబుల్ పాత్ర. కోషీకి మద్యం పోయడంలో సహకరించి సస్పెండ్ అయిన లేడీ కానిస్టేబుల్ కూడా కోషీని ఏహ్యభావంతో నీచంగా చూడడం దేనికి? అతనేం తప్పు చేశాడు. అతడికి కులుకుతూ ఆనందంగా, చట్టవ్యతిరేకంగా మందు పోసి, నీచానికి పాల్పడింది తనే కదా?  సుకుమారన్ తండ్రిగా అతిక్రియాశీలత్వంతో సమస్యని జటిలం చేసే పాత్రలో సీనియర్ నటుడు రంజిత్ కన్పిస్తాడు. ఇంకా పోలీసు పాత్రలూ, అనుచరుల పాత్రలూ చాలా వున్నాయి.   

చివరికేమిటి
     కృత్రిమత్వం, ఫార్ములా, మూస అనేవాటికి దూరంగా కేరళ గ్రామీణ నేటివిటీ కోసం కృషి చేశాడు దర్శకుడు సాచీ. ఈ హాట్ కథకి కూల్ కలర్స్ వాడి నేత్రానందం కల్గించాడు. పాటలు లేవు. నేపథ్య సంగీతం మాత్రం ట్రైబల్ ట్యూన్స్ కుదరక కుదేలయింది. మాటలు సింథటిక్, డిజైనర్, మూస, పంచ్, టెంప్లెట్ ధోరణుల నుంచి రిలీఫ్ గా, మనుషులు మాట్లాడుకున్నట్టు వున్నాయి. ఫైట్లు మనుషులు పోరాడుకున్నట్టున్నాయి. దాదాపు మూడు గంటల నిడివే ఈ స్వల్ప కథకి, అత్యల్ప కాన్ఫ్లిక్ట్ కీ బాగా ఎక్కువ. ఒక దశ కొచ్చేటప్పటికి చిన్న విషయానికి ఇంత సాగదీయడం అనవసర మన్పిస్తుంది. నాయకులూ ఉన్నతాధికార్లూ ఇద్దర్నీ కూర్చోబెట్టి క్లాసు తీసుకుంటే, ఎప్పుడో ముగిసిపోయే గొడవ. కథకి పాశుపతాస్త్రంతో పోలిక వర్కౌట్ కాని పరిస్థితి ఇంకో పక్క. ఇంతకి ముందు చెప్పుకున్నట్టు ఎమోషనల్ ప్రేక్షకులతో బాటు, ఇద్దరు నటుల ఫ్యాన్స్ తో దీనికింత టాక్ వచ్చి వుంటుంది.  


సికిందర్

        సైడ్ లైట్స్ : 1939 లో ‘పాశుపతాస్త్రం’ అనే సినిమా తీశారు. దర్శకుడు కచ్చర్ల కోట రంగారావు. షూటింగ్ విశాఖ పట్టణం లోని ఆంద్ర సినీ టోన్ స్టూడియోలో జరిగింది. షూటింగ్ చివరి దశలో వుంది. స్టూడియో పార్టనర్స్ కి ఏవో ఇగో లొచ్చి ఒక పార్టనర్ షూటింగు జరుగుతూండగానే తన వాటా కింద ఇచ్చిన లైట్లూ ఇతర పరికరాలూ లాక్కెళ్ళి పోయాడు. స్టూడియో మూతబడింది. సినిమా ఎలాగో పూర్తయ్యింది. కానీ ‘పాశుపతాస్త్రం’ షూటింగు జరుగుతూండగానే ఇగోలనే పాశుపతాస్త్రాలు పైకి తీసి ‘కేరళ కుమ్మట్టి కాళి’ ఆడిన పార్టనర్స్ ఏం సాధించారు. ‘పాశుపతాస్త్రం’ సినిమాకేం కాలేదు, స్టూడియోనే ఇవ్వాళ వైజాగ్ కి సినిమా లైట్ హౌస్ కాకుండా, ఎవరికీ గుర్తుకూడా లేకుండా పోయింది.

       
స్ట్రక్చరాస్యులకో  చిన్న పరీక్ష : పైన మూడో పేరా నుంచీ 5 వ పేరా వరకూ ఇచ్చిన కథా సంగ్రహంలో ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ ఎక్కడున్నాయో గుర్తించగలరా? గుర్తిస్తే మాకు రాసి పంపి మీ స్ట్రక్చరాస్యతని నిరూపించుకోండి.




1, జూన్ 2020, సోమవారం

ప్రకటన


డియర్ రీడర్స్,
‘ప్లేలన్నీ ఎలా ప్లే చేస్తాయి?’ నాల్గు వ్యాసాల లింకులు ఈ కింద ఇస్తున్నాం.
సద్వినియోగం చేసుకోగలరు.


949 : సందేహాలు -సమాధానాలు


Q:  పిరియాడిక్ కథలు (1970, 80 ప్రాంతాల్లో జరిగే రంగస్థలం’ లాంటివి ) రాయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా? అప్పటి పరిస్థితులు, సమస్యలు సహజంగానే ఇప్పుడు ఉండవు కాబట్టి సమకాలీనత లోపిస్తుంది కదా, దాన్నుంచి బయటపడడం ఎలా? సమకాలీనత కచ్చితంగా ఉండాలా? లేకపోయినా డ్రామాతో నిలబెట్టొచ్చారంగస్థలం’ లాగే?  మహానటి’, జెర్సీ’ సినిమాల్లో ప్రాసంగికతను తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలను వివరించగలరు. అలాగే ఒక పాత్ర జీవితం నుంచి మరొక పాత్ర ఇన్ స్పైర్ అయ్యే తీన్ మార్’ లాంటి స్క్రీన్ ప్లే లు చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు. రిఫరన్స్ సినిమాలు కూడా ప్రస్తావించగలరు?
అశోక్, ఏడీ 

A:  ఒక కవి అన్నట్టు ఇప్పుడు కాలం కరోనా పూర్వంగా, కరోనా శకంగా రెండు ముక్కలైంది. ఈ లెక్కన ఇప్పుడు కరోనా శకంలో వున్నామని అనుకోవాలి. కూలీనుంచీ కుబేరుడి వరకూ, సూది నుంచీ విమానం వరకూ అందరూ, అన్ని రంగాలూ ఆర్ధికంగా ఛిన్నాభిన్నమైన గడ్డు కాలం. ఈ విధ్వంసం లోంచి పునర్నిర్మాణ కాలమిది. ఈ కాలంలో కళ్ళు మూసుకుని ఇంకా కరోనా పూర్వపు అవే కథలు అలాగే తీస్తూ కూర్చోవడం సాధ్యమవుతుందా? ఒకతను ఒక బ్యాంకు అవినీతి కథ పట్టుకొచ్చాడు. ఇప్పుడు బ్యాంకులకి ఎగనామం పెట్టి విదేశాలకి ఉడాయించే కథలకి ఆడియెన్స్ కనెక్ట్ అవుతారా? ఎవడి జేబుల్లోనూ డబ్బే లేదు, ప్రభుత్వాల దగ్గరా లేదు, ఇంకా అవే పాత అవినీతి కథలేమిటి? ప్రేక్షకుల జేబుల్లో డబ్బులు పెట్టే కథలు కావాలి. డబ్బుల కోసం పాట్లు కావాలి. 

        పీరియాడిక్ సినిమాలూ ఇంతే. ఇప్పుడు బ్రతుకులెలా అని ఆలోచిస్తూంటే ఎప్పటివో పీరియాడిక్ కథల సినిమాలకి మార్కెట్ వుంటుందా అనేది వేసుకోవాల్సిన ప్రశ్న. 2008 ఆర్ధిక మాంద్యంలో హాలీవుడ్ కుప్పతెప్పలుగా రోమాంటిక్ కామెడీలు తీస్తూ ఆర్ధిక బాధల్ని మరిపించే ప్రయత్నం చేసింది. మార్కెట్ యాస్పెక్ట్ హాలీవుడ్ కి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. ఇప్పుడు కరోనా కాలపు కొత్త ఆర్ధిక, జీవన పరిస్థితులు బాక్సాఫీసుని నిర్ణయిస్తాయి. ఏం సినిమాలు తీయాలో ఎవరికీ తెలియడం లేదు. ఒకటి మాత్రం నిశ్చింతగా తీసుకోవచ్చు : ఎంటర్ టైనర్స్. పలాయన వాద కాలక్షేప ఎంటర్ టైనర్లు. 1896 లో నిమాల్ని కనిపెట్టిన లూమియర్ బ్రదర్స్ కీ, ఆ తర్వాత వచ్చిన నిర్మాతలకీ ఏం తీయాలో తెలియదు. ఎంటర్ టైనర్లే తీసుకుంటూ పోయారు. కాలప్రవాహంలో ఎందరెందరో నిర్మాతలు కలుస్తూ, కాలాన్నిబట్టి సినిమాల్ని శాఖోప శాఖల జానర్లుగా విస్తరింప జేస్తూ, 124 ఏళ్లలో ఇప్పుడు కరోనా నాటికి - ఒక మహావృక్షాన్ని నిలబెట్టారు. అది కుప్ప కూలింది అందరి జీవితాలతో బాటు. ఇప్పుడు నిలబెట్టాలంటే ఏ మందులు వేయాలో, ఏ కాయలు కాయించాలో ఎవరికీ తెలియడం లేదు. జీవితాలు అర్ధమైతే తప్ప సినిమా ఆర్ధిక శాస్త్రం పట్టుబడేలా లేదు. మళ్ళీ 1896 నుంచీ ప్రారంభమవడం తప్పదేమో. సినిమాలిప్పుడు తిరిగి 1896 కే చేరుకున్నట్టు. కాబట్టి బ్యాక్ టు ది ఎంటర్ టైనర్స్. 

        ఇక మీరడిగిన చివరి రెండు ప్రశ్నలకి వివరణ ఇక్కడ సాధ్యం కాదు. మీరడిగిన ప్రశ్నలు నల్గురికి ఉపయోగ పడేవే. వీటికి ప్రత్యేక ఆర్టికల్స్ అవసరం. ప్రయత్నం చేద్దాం.

Q: మే 20 న Q & A లో ఒక ప్రశ్నకు మీరిచ్చిన సమాధానం పెద్ద హోం వర్క్ ఇచ్చింది. పది రకాల స్క్రీన్ ప్లే లు అన్నారు కద. అవేంటి వెతికి, రకం సినిమాలు వెతకడం చాలా పని. తెలుగు సినిమాలు ఏడాదికి వంద వస్తాయి కద. అన్నీ ఒకే తరహా నెరేషన్. ఒకటి రెండు కొత్త రకం ఉంటాయి. అవే గొప్ప సినిమాలు మనకు. ఇంక సర్క్యులర్ నేరేషన్ తో సినిమాలు ఎపుడొస్తాయో. చిన్న సందేహం. కథ చెప్పే విభిన్న పద్ధతుల్లో హైపర్ లింక్  ఒకటి. ఇది మల్టిపుల్ నెరేషన్. ఉదాహరణగా సత్యజిత్ రేకాంచన్ జంగ’,  తెలుగు వేదం’,  తమిళ్ ‘సూపర్ డీలక్స్’  ఇచ్చారు. ఐతే తరహాలో రెండు, మూడు వేరు వేరు కథలతో మొదలుపెట్టి ఒకచోట ముడివేస్తారు. ఇవి వేరువేరు కథలకు ఒకే ముగింపు తప్ప, కథలు చెప్పే పద్ధతి లీనియర్ గానే ఉంటుంది కద? ఫెబులా, రోషోమన్ లలాగా హైపర్ లింక్ స్పెషల్ టెక్నిక్ ఎలా ఔతుంది? ఆదివారం సందేహం కింద తీర్చగలరు.
చందు తులసి, కథా రచయిత

A: హైపర్ లింక్ అంటే కేవలం ముగింపులోనే కథలన్నిటికీ లింకు పెట్టి ముగించడం కాదు. కథనంలోనూ వాటికి లింకులుంటాయి. ఒక కథలో ఒకరికి జరిగే ఓ సంఘటన ప్రభావం, ఇంకో కథలో ఇంకొకరి మీద వుంటుంది. ఇలా మనుషులంగా మనం ఎక్కడెక్కడో ఎవరెవరితోనో కనెక్ట్ అయి వుంటామన్న ఫీల్ ని కల్గిస్తుంది. అంతేగానీ విడివిడి కథలకి మాత్రమే చివర్లో ఒక ముగింపుతో లింకుపెట్టడం కాదు. కింద ఇచ్చిన రెండు లింకులు క్లిక్ చేసి, 10 రకాల ప్లేలు తెలుసుకోవచ్చు. 

Q: ‘అయ్యప్పనుం కోషియం’ రివ్యూ కోసం ఎదురు చూస్తున్నాం. మలయాళం సినిమాలు ఒక క్రేజ్ గా ఎందుకుంటున్నాయి? వాటిని రీమేక్స్ చేయడం కూడా జరుగుతోంది.
ఆది, ఏడీ 

A: రివ్యూ రెండు రోజుల్లో వస్తుంది. మలయాళం సినిమాలు అక్కడి మట్టి కథలు చెప్తాయి. అందుకని కమర్షియల్ మూస ఫార్ములాలకి భిన్నంగా అన్పిస్తాయి. మట్టి కథలకి మొహం వాచి వున్న ప్రేక్షకులకి ఇవే గిట్టుబాటు అవుతాయి. అక్కడి మట్టి కథల్ని ఇక్కడి మట్టి కథలుగా రీమేక్ చేస్తే చేయవచ్చు. తేడా ప్రేక్షకులకే తెలుస్తుంది. ఎక్కడిదో మట్టి ఎందుకు, ఇక్కడ మట్టి లేదా? ఇక్కడి మట్టిలో బాక్సాఫీసు కన్పించడం లేదా? లేక మట్టిని పిసికి బొమ్మెలా తయారు చేయాలో తెలీడం లేదా? ముందు పిసకడం నేర్చుకోవాలి. చేతులకి మట్టి అంటకుండా మీసం తిప్పితే లాభం లేదు.

సికిందర్
లింక్స్ : పది నమూనాలు-1
పది నమూనాలు-2 


30, మే 2020, శనివారం

948 : 'పాలపిట్ట' ఆర్టికల్, విస్మృత సినిమాలు


       కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సామాజిక సినిమాల్లో ‘అదిగో అల్లదిగో’ ఎవరి దృష్టిలో పడకుండా కనుమరుగై పోయింది. 1984లో ‘మంగమ్మగారి మనవడు’ అనే సంచలన హిట్ కంటే ముందు తీసిన ఈ సామాజికంలో చంద్రమోహన్, సుహాసిని, గుమ్మడి, నూతన్ ప్రసాద్, పిఎల్ నారాయణ, రాళ్ళపల్లి మొదలైన వారితో కూడిన ప్రముఖ తారాగణమే వుంది. ఆత్రేయ పాటలున్నాయి, ఎంవీఎస్ హరనాథరావు మాటలున్నాయి, కన్నప్ప ఛాయాగ్రహణమూ వుంది. సాంప్రదాయ వాదం, హేతు వాదం కలబడితే మధ్యలో దుష్టశక్తులు జొరబడతాయని సందేశమిచ్చే ఆసక్తికర కథావస్తువూ వుంది. 

       
యినా ఆ కాలంలో ఎందుకనో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ కాలంలో ఇది జియోలో  స్ట్రీమింగ్ అవుతోంది. ఓ యాభై వేల వ్యూస్ తో యూట్యూబ్ లో ఎలాగూ  చాలాకాలంగా వుంది. 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు దీన్ని చూస్తే, నిత్యసత్యమే కన్పిస్తుంది. ఈ కాలానికి కూడా పనికొచ్చే ముక్క. సాంప్రదాయ వాదాన్ని ఆధ్యాత్మిక వ్యాపకాలకి పరిమితం చేసుకోవాలే తప్ప, అంధవిశ్వాసంగా మార్చుకుంటే లేని పోని సామాజిక అనర్ధాలకి సాంప్రదాయ వాదులు మూలమవుతారన్న హెచ్చరిక ఇందులో వుంది. సాంప్రదాయ వాదుల అంధవిశ్వాసాల చుట్టూ చేరి మూఢభక్తులు, మూఢ భక్తుల మనోభావాలతో ఆడుకుని అందలా లెక్కే రాజకీయ శక్తులు, రాజకీయ శక్తుల్ని మూఢ భక్తిలోకి లాగి బాముకునే దొంగ బాబాలు, మళ్ళీ ఆ దొంగ బాబాలకి నిలువు దోపిడీలిచ్చుకుంటూ సాష్టాంగపడే అదే జనాలూ... ఇలా వొక విషవలయాన్ని సృష్టించి పెట్టేస్తారన్న అర్ధం వచ్చేలా కోడి రామకృష్ణ సోషల్ కామెంట్ చేశారు. సాంప్రదాయ వాదం ఆధ్యాత్మికాన్ని దాటి నప్పుడే హేతువాదం ప్రశ్నిస్తుంది. సాంప్రదాయ వాది పాత్రలో గుమ్మడి మానవవాదాన్ని మర్చిపోతే, కొడుకు పాత్రలో చంద్రమోహన్ పాల్పడే ఓ చర్యే దీనికంతటికీ దారి తీస్తుంది. కంఠ శోష తప్ప, సాంప్రదాయం - హేతువాదం ఏదీ గెలవదు, ఓడిపోదు. యుగాలుగా తెగని పంచాయితీ. సందట్లో సడేమియాలకి చేతినిండా పని. 

కథ చూద్దాం
        శివానంద శాస్త్రి అలియాస్ శివానంద్ (చంద్రమోహన్) ఎరువుల ఆఫీసర్ గా ఆ గ్రామాని కొస్తాడు. సహజనటి జయసుధ వీరాభిమానిగా అమ్మాయిల్నేసుకుని అల్లరిగా తిరిగే రాజేశ్వరి (సుహాసిని) కంటపడి అల్లరవుతాడు. ఈ అల్లరి ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. సుహాసిని తల్లి మరియా క్రైస్తవురాలు. ఈ కారణంగా రాజేశ్వరికి పెళ్లి సమస్య వుంటుంది. తండ్రి సంగీతరావు (పిఎల్ నారాయణ) వ్యవసాయ దారుడు. శివానంద్ వీళ్ళ ఇంటికి స్నానానికి వచ్చినప్పుడు ఈ విషయాలు తెలుసుకుంటాడు.  


        ‘అసలే మీరు అగ్రకులం. మా యింటికి స్నానికి రావడం...’ అంటూ సంగీతరావు సంకోచిస్తే, ‘ఈ రోజుల్లో కులాలేంటండీ మనిషి గ్రహాల్లో తిరుగుతూంటేనూ...’ అని కొట్టి పారేస్తాడు శివానంద్. ‘ఈనాటికీ మావూరు అగ్రహారంలో ఇంకో కులం వాడు కాలు పెడితే కాలు విరగ్గొడతారు’ అని సంగీతరావు పరిస్థితి చెప్తాడు. ఈ పరిస్థితిని కళ్ళతో చూస్తాడు శివానంద్. ఒక దళిత పిల్లాడు అగ్రహారంలోకి అడుగుపెట్టాడని ఎడాపెడా కొట్టేస్తూంటాడు పూజారి. దీనిమీద శివానంద్ తిరగబడతాడు, ‘అగ్రహారాలు ఆకాశం నుంచి వూడి పడ్డాయా? మీ చెప్పులు కుట్టే దెవరురా? మీ బట్టలు ఉతికే దెవరురా? మీరు తినే తిండి పండించే దెవరురా? వీటన్నిటికీ పనికొచ్చే మనుషులు ఇక్కడికి రావడానికి పనికిరారా? ఈ హరిజనులతో ఇప్పుడే ఆలయంలో ప్రవేశిస్తాను’  అని మొత్తం దళితులందరితోఆలయంలో కెళ్ళి పోతాడు. బ్రాహ్మణ వర్గం హాహాకారాలు చేస్తారు.

        ‘ఏది మతం, ఏది కులం’ అని పాడుతూ కోవెల కులం, ప్రమిదల కులం, పూజ పువ్వుల కులం, విబూధి కులం, పుట్టించినవాడి కులం, గిట్టే మట్టికి కులం అడుగుతాడు. ఇలా వున్న శివానంద్ వ్యవహారం, వీరంగం, వేరే గ్రామంలో వుంటున్న తండ్రికి తెలిసిపోతుంది. తండ్రి గౌరీనాథ శాస్త్రి (గుమ్మడి) రాజరాజేశ్వరీ దేవిని ఉపాసిస్తాడు. ప్రతీ శుక్రవారం దేవిని పూజించి, పేటికలోని తాళపత్ర  గ్రంథంలో ఖాళీగా వున్నఒక రాగిరేకుని తీసి ఆసక్తిగా చూస్తాడు. అదయ్యాక, ఇంటిముందు వరస కట్టిన గ్రామ ప్రజలకి విబూధి, తీర్థం ప్రసాదంగా పెడతాడు. వాటితో రోగాలు నయమవుతూంటాయి.

        ఆ తాళపత్ర గ్రంథం పూర్వీకుల నుంచి సంక్రమించింది. అందులో ఖాళీగా వున్న రాగి రేకుకి ఒక విశిష్టత వుంటుంది. దాని మీద దేవి ప్రపంచంలో ఎప్పుడు సాక్షాత్కరిస్తుందో స్వహస్తాలతో లిఖిస్తుందని తాత ముత్తాతల కాలం నుంచీ నమ్ముతూ వస్తున్నారు. దేవీ  సాక్షాత్కారమే పాపపంకిలమైన ఈ ప్రపంచానికి మోక్షదాయకమని నమ్ముతూ వున్నారు. ఆ దేవీ దర్శనం కోసం తాత ముత్తాతలు ఎదురు చూశారు. ఇప్పుడు గౌరీనాథ శాస్త్రి హారతులిస్తూ ఆహ్వానిస్తున్నాడు. 

        తన తర్వాత దేవిని ఆహ్వానించేదెవరా అని ఆలోచించకుండా, కొడుకుని కోరిన ఉద్యోగం ఎరువుల కంపెనీలో చేసుకోనిచ్చి, భార్య కాత్యాయినితో  హాయిగా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇలా సుఖంగా గడిచిపోతున్న జీవితానికి ఉన్నట్టుండి కొడుకు కొరివి దెయ్యంలా తయారయ్యాడు. 

        అవధాని వచ్చి చెప్తాడు, ‘మీ కొడుకు శివానంద శాస్త్రి అగ్రహారంలో బ్రహ్మణ్యంపై తిరగబడి హరిజన ప్రవేశం కల్పించాడు. వర్ణసంకరానికి పుట్టిన పిల్లతో ప్రేమలో పడ్డాడు’ అని. దీంతో గౌరీ పునాదులు కదిలిపోతాయి. కోడలికి అన్నిఅర్హతలూ వున్నాయంటూ చల్లగా వచ్చి చెప్తాడు శివానంద్. ‘ఆ కులహీనురాలికి తాళి కట్టావో, ఈ యజ్ఞోపవీతంతో వురేసుకుంటా!’ అని బెదిరిస్తాడు గౌరీ. ‘మీ మూర్ఖత్వానికి మూఢాచారాల కోసం ఆ అమ్మాయిని బలి చెయ్యాలా?’ అని ఎదురుతిరుగుతాడు శివానంద్. చెంప ఛెళ్ళుమన్పిస్తాడు గౌరీ. శివానంద్ కోపంతో వెళ్ళిపోయి, రాజేశ్వరి నేస్తాలడిగితే జంధ్యం తీసిచ్చేస్తాడు. ఆ జంధ్యానికి పసుపు కొమ్ము కట్టి, తాళిగా మార్చి పెళ్లి జరిపించేస్తారు నేస్తాలు. 

        ఇక మీ ఇంటి కెళ్దామంటుంది రాజేశ్వరి. ‘అక్కడికా? తుఫానులో సముద్ర స్నానం చేసినట్టుంటుంది’ అని వద్దంటాడు. ‘ఆ ఇంటి కోడలిగా నేనొప్పించుకుంటాగా’ అని తీసికెళ్తుంది. వీళ్ళని చూసి మండిపడ్డ  గౌరీ, ఇంటిని రెండు ముక్కలు చేసి ఒక ముక్కలో పడుండమంటాడు. ఒక ముక్కలో పక్కమీద కాపురం పెడతారు. ఓ తెల్లారే తులసి కోటకి ముగ్గు పెట్టలేదేమని భార్యనడుగుతాడు గౌరీ. బయట వున్నానని అంటుంది. ఇది విన్న రాజేశ్వరి వచ్చి ముగ్గు పెట్టేస్తుంది. ఇది చూసి మౌనంగా వెళ్ళిపోతాడు గౌరీ. మామగారు కరిగిపోయారు, ఇక మనదే విజయమని శివానంద్ కి చెప్పుకుని ఆనందిస్తుంది సుహాసిని. గబగబా నీళ్ళు తెచ్చి గుమ్మరించి ముగ్గు కడిగి పారేస్తాడు గౌరీ. 

        ఇంకో రోజు తన పుట్టిన రోజని పళ్ళూ పలహారం తీసుకొచ్చి, దీవించదీమంటాడు శివానంద్. తీసి ఇంటవతల విసిరేస్తాడు గౌరీ. సుహాసిని నెల తప్పుతుంది. నెలలు నిండాక తీసికెళ్దామని వస్తారు తల్లిదండ్రులు మరియా, సంగీత రావులు. రెండు బిందెల్లో సూడిదలు తీసుకుని వస్తారు. గౌరీ ఆగ్రహించి, పంచ పాతక జలం తెమ్మంటాడు భార్యని. ఆ జలాన్ని బిందెల మీద పోసి, బిందెల్ని ఎత్తి బయటికి విసిరి పారేస్తాడు. ఆవు పంచకంతో ఇల్లు శుద్ధి చేయమంటాడు. దిగ్భ్రాంతి చెందుతారు సుహాసిని తల్లిదండ్రులు. తల కొట్టేసినట్టవుతుంది శివానంద్ కి.

        ‘మీ దృష్టిలో మనుషులు ఆవు పంచకం కంటే హీనమైపోయారు. కానీ మనిషికి నియమ నిష్టల కన్నా, వేద వేదాంగాల్లో పాండిత్యం కన్నా, సాటి మనిషిని అర్ధం చేసుకునే  హృదయం, సంస్కారం వుండాలని నా అనుభవం చెప్పింది... మీ ధర్మాలూ శాస్త్రాలూ నా బిడ్డని కులం లేని దానిగా నిర్ణయించవచ్చు. కానీ మీ మనస్సాక్షికి నా బిడ్డ ఒక గర్భవతి. అభం శుభం తెలీని ఆడపిల్లగా కన్పిస్తే చాలు...’ అని బాధనణుచుకుని వెళ్ళిపోతాడు సంగీత రావు. 

        మనవడు పుట్టి వచ్చేసరికి గౌరీ పరమానంద భరితుడై పోతాడు. వాడు శ్లోకాలు పఠించేసరికి దగ్గరై పోతాడు. వాడిలో తనని చూసుకుంటాడు. ఈ ఆనందం ఎంతోసేపు నిలవదు. ఓ శుక్రవారం తను ఇచ్చిన విబూధికి ఒకడు చచ్చిపోతాడు. దీంతో దారంట పోతూంటే ప్రతివాడూ మాటలే. కులం లేని కోడలి రాకతో అమ్మవారి అనుగ్రహం ఆగ్రహమైపోయిందని. సాటి బ్రాహ్మణులు కూడా ఎత్తి పొడుస్తారు. దీంతో ఇంటికొచ్చి తుఫాను రేపుతాడు, ‘ఏ క్షణంలో ఈ కులహీనురాలు అడుగుపెట్టిందో, ఆ క్షణమే మన నియమ నిష్టలన్నీ మంటగలిసి పోయాయి. శక్తి విహీనులమైపోయాం. విబూధి స్మశానంలో బూడిదైంది, తీర్ధం మురిక్కాల్వలో నీళ్ళు. దాన్ని వెళ్ళిపొమ్మని చెప్పు!’ అని వూగిపోతాడు. దేవి ముందు క్షమించమని విలపిస్తాడు. 

         రాజేశ్వరి తన తక్కువ జన్మ తల్చుకుని కుమిలిపోతుంది. ఇక లాభం లేదని శివానంద్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. రహస్యంగా పూజ గదిలో పేటిక లోంచి తాళపత్ర గ్రంథం తీస్తాడు. అందులో ఖాళీగా వున్న రాగి రేకుని తీసి ఒక పని చేస్తాడు. ఏమిటా పని? ఏం చేశాడు? ఏం చేస్తే గౌరీనాథ శాస్త్రి ప్లేటు ఫిరాయించి కోడల్ని బంగారంలా చూసుకున్నాడు? పొలోమని జనాలూ, రాజకీయ నాయకులూ, దొంగబాబాలూ వచ్చిపడి  వాళ్ళ వాళ్ళ లాభాలూ చూసుకున్నారు? ఇదంతా చివరికి ఏ పరిణామాలకి దారితీసింది?...ఇదీ మిగతా కథ.

గుమ్మడియే ప్రధానాకర్షణ  
     గౌరీనాథ శాస్త్రి పాత్రలో గుమ్మడిది శక్తివంతమైన నటన. ఆగ్రహాన్ని ప్రదర్శించడంలో తనకి తానే సాటి అనేది తెలిసిందే. సన్నివేశాల్లో తనే ప్రధానాకర్షణ. కథకి మూలస్థంభం. సాంప్రదాయం ఆచారాలూ అంటూ పట్టుబట్టే సద్బ్రాహ్మణుడి పాత్ర రొటీనే, కొత్తదేం కాదు. అయితే ఓ కాస్త వూరటకి చాపల్యానికి పోయి, చాప కిందికి నీరు తెచ్చుకోవడం కొత్త చిత్రీకరణే. పాత్రకి ఆసక్తికర మలుపు. కొడుకు శివానంద్ చేసిందేమిటి? భార్యమీద తండ్రి అభిప్రాయం మార్చాలని రాగి రేకు మీద, ‘గౌరీనాథా...తరతరాలుగా నువ్వు చేస్తున్న పూజా ఫలితంగా నీ కోడలి రూపంలో నేను నీ ఇంట వెలిశాను’ అని మాత్రమే సువర్ణా క్షరాలు లిఖించాడు. ఇది చదువుకున్న గౌరీ ఓవరాక్షన్ చేశాడు. ఇక తరతరాలుగా వస్తుందని, వచ్చి రాగి రేకు మీద తన ఆగమనం గురించి లిఖిస్తుందనీ నీరీక్షిస్తున్న దేవీయే, ఇక సాక్షాత్కరించిందని నమ్మేశాడు గౌరీ. ఆనందం పట్టలేక ఇప్పుడు దేవీ అవతారంగా మెరిసిపోతున్న కోడలు రాజేశ్వరికి సాష్టాంగ పడిపోయాడు. లెంప లేసుకున్నాడు. పశ్చాత్తాపం ప్రకటించాడు. ఆమె కేమీ అర్ధంగాక తలుపేసుకుంది. పూజా గదిలో చేయి కాల్చుకుంటే వచ్చి ఆపింది. దీంతో పరవశుడైపోయాడు, ‘తల్లీ, నీ స్పర్శతో నాలో కొత్త జీవం వచ్చింది. నా అజ్ఞానం గానీ నీవు దయామయివి...ధరిత్రిని మించిన క్షమా మయివీ ....’ అంటూ పాలాభిషేకం చేశాడు. గౌరీ ప్రవర్తన చూసిన గ్రామస్థులు, ‘పూజలో అమ్మవారు వొంటి మీదికి వచ్చి వుంటుంది’ అనుకోసాగారు.


        గుమ్మడి పాత్ర ‘శంకరాభరణం’ లో జేవీ సోమయాజులు పాత్రకి దగ్గరగా వుంటుంది. ఇద్దరూ చేసింది ఒకటే. కాకపోతే పరిస్థితులు, ఉద్దేశాలు వేరు. సోమయాజులు శంకరశాస్త్రి పాత్ర నిమ్న కులస్థురాలైన వెలయాలి కూతుర్ని చేరదీస్తాడు. నాట్యంలో ఆమెని ప్రోత్సహిస్తాడు.
ఆచార వ్యవహారాలు మనుషుల్ని సన్మార్గంలో పెట్టడానికే తప్పమనుషుల్ని కులమనే పేరుతో  విడదీయడానికి కాదు అని ప్రకటిస్తాడు. ఇందుకు కలిసి వచ్చిన పరిస్థితి, సంగీతంలోనే తను అభ్యుదయవాది కాదు, జీవన యానంలోనూ గొప్ప అభ్యుదయవాది కావడం. 

       దీనికి విరుద్ధ భావజాలంతో వున్న గుమ్మడి గౌరీనాథ శాస్త్రి పాత్ర, ‘మనిషికి నియమ నిష్టల కన్నా, వేద వేదాంగాల్లో పాండిత్యం కన్నా, సాటి మనిషిని అర్ధం చేసుకునే  హృదయం, సంస్కారం వుండాలని’ ఇంకొకరితో చెప్పించుకునే పరిస్థితి. ఇలాటి తను కులహీనురాలని ఈసడించుకున్న కోడల్ని దేవతగా చేసేశాడు. కొడుకు చేసిన పనికి అంధ విశ్వాసంతో ఈ చర్యకి పాల్పడ్డాడు. ఆధ్యాత్మిక శాస్త్రాలకి మూఢత్వం తోడయితే దేవుళ్ళు పుట్టుకొచ్చేస్తారు. కొడుకు శివానంద్ ఈ మూఢత్వాన్నే వ్యతిరేకిస్తాడు. శంకరశాస్త్రి, గౌరీనాథ శాస్త్రి పాత్రల్ని పక్కపక్కన చూసినప్పుడు, ఇద్దరూ సామాజిక భక్తి కిరువైపులా కన్పిస్తారు. 

        సుహాసిని రాజేశ్వరి పాత్ర సంక్లిష్టమైనదే. కథా ప్రారంభంలో ఆమె పాత్ర ప్రవేశం రాజరాజేశ్వరీ దేవిగా నటిస్తూ నేస్తాలకి వరాలిచ్చే అల్లరిగా వుంటుంది. జీవితంలో ఇదే నిజమై, మామగారు తనని అదే దేవతగా చేస్తాడని వూహించి వుండదు. మామగారి కులహీనురాలి ముద్రతో కించ పడుతున్న తను, ఏకాఎకీన ఆ మామ తన సింహాసనం మీదే కూర్చోబెట్టి ప్రసాదాలు ఇప్పించేసరికి, నవ్వాలో ఏడ్వాలో తెలియని స్థితి ఆమె నటనకి ఒక చేర్పు. దీన్ని వేళాకోళంగా తీసుకుని, జనాల వెర్రి తనాన్ని చూసీ, విబూధీ తీర్ధాల తోనే కాదు, నిమ్మకాయలతో కూడా నోటికొచ్చిన వైద్యం చేసి పారేసే తమాషా క్యారక్టర్ ని వినోదం పండేలా చేసింది. తను చేస్తున్నది తప్పని తెలిశాక వెనక్కి తీసుకోలేని పరిస్థితి. వెనక్కి తీసుకుంటే తండ్రి సహా అందరం దోషులుగా నిలబడతామని శివానంద్ హెచ్చరిక. చివరికి తన కొడుకే జబ్బునపడితే తన మహిమలతో బాగు చేసుకోలేక వాణ్ణి కోల్పోవాల్సిన దౌర్భాగ్యం. ఇదంతా సుహాసిని పాత్రని సంక్లిష్ట పాత్రగా మార్చడంతో బాటు, నటిగా ఆమెకో నిఘంటువు కూడా అయింది. ఈ కథకి క్రమక్రమంగా తను దేవత అయ్యేసరికి ప్రధాన పాత్ర తనే అయిపోయింది.

        చంద్రమోహన్ శివానంద్ పాత్ర ఉత్ప్రేరక పాత్ర. రాగిరేకు మీద అలా రాయడంతో అతనే ఈ కథని ప్రధాన మలుపుతిప్పి సుహాసిని పాత్ర చేతిలో పెట్టేశాడు. పరిణామాలు చూస్తూ బెంబేలెత్తి పోయాడు. తన అభ్యుదయం, తండ్రి సాంప్రదాయం తగాదా పడితే మధ్యలో భార్య అమ్మవారై పోయి జీవితం తిరునాళ్ళయి పోవడమేమిటో అర్ధంగాక జుట్టు పీక్కునే పరిస్థితి. చివరికి వెర్రి జనం తననే చంపడానికి వెంటపడడం...ఆ రోజుల్లో ఇలాటి ఎమోషనల్ పాత్రలు పోషిస్తున్న చంద్రమోహన్ కి ఈ పాత్ర కష్టమేం కాదు. 

అర్ధవంతమైన కథనం  
       కథనంలో ఏఒక్క సీనూ అనవసరంగా వుండదు. అరగంటలో ప్రధాన మలుపుకొ చ్చి కథ ప్రారంభమైపోతూ, ప్రతీసీనూ ఇంకో సీనుగా మలుపు తీసుకునే పాయింటుతోనే వుంటుంది. పాయింటు నుంచి పాయింటు గా సాగే ఈ కథనంతో కథ చిక్కనవుతూ వుంటుంది. కథ పెద్దదవుతూ కూడా వుంటుంది. రాజేశ్వరి అభిమాన నటి జయసుధ కూడా వచ్చేసి ఆశీర్వాదం పొంది, లక్ష రూపాయలు విరాళం కూడా ఇచ్చేస్తుంది. రాజేశ్వరి దేవతగా వెలసిన విషయం రాజకీయ పార్టీలకీ తెలిసిపోతుంది. కండువా పార్టీ నాయకుడు కొండలరావు వచ్చేసి కండువా పర్చి ఆశీర్వదించమంటాడు. ఆశీర్వదిస్తూంటే ఆమె పాద ముద్రలు కండువా మీద పడతాయి. అంతే, ఆ పాదముద్రలు ప్రచారం చేసుకుంటూ పాదముద్రల గుర్తుకే ఓటెయ్యాలంటాడు. జనం శివాలెత్తి ఆ పాదముద్రలకే ఓట్లు గుద్ది అతణ్ణి సీఎంని చేసి పారేస్తారు! 


        ఇక సీఎం కొండలరావు రాజేశ్వరికి ఆశ్రమం కట్టించేస్తాడు. తిరునాళ్ళు జరిపించేస్తాడు. ఇదంతా గమనిస్తున్న, 33 సార్లు జైలునుంచి తప్పించుకొచ్చిన దొంగబాబా (నూతన్ ప్రసాద్), వచ్చేసి రాజేశ్వరిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తాడు, ‘నేను నందీశ్వరుడ్ననీ, నీకోసం నీతో పాటు నేనూ పుట్టానని భక్తులకి చెప్పు. నా వ్యాపారం చేసుకుంటాను. నీ కలెక్షన్ కేం అడ్డు రాను’ అని బేరం పెడతాడు.

        ఈ బ్లాక్ మెయిల్ ఆశ్రమాన్ని కబ్జా చేసేదాకా పోతుంది. అమ్మవారు సజీవ సమాధికి సిద్ధమయ్యారని ప్రకటించి జనాల్ని రెచ్చగొడతాడు. ఇప్పుడు రాజేశ్వరి అసలైన సంక్షోభంలో పడుతుంది. దీంతో అంతిమ నిర్ణయం ఏం తీసుకుందన్నది ముగింపు. 

        ఇందులో కథకి సంబంధం లేకుండా వచ్చిపోయే హాస్య పాత్ర వుంటుంది. రాళ్ళపల్లి పోషించిన హేతువాది డాక్టర్ తేయాకు పాత్ర. అతడికి విప్లవ కారుంటుంది, విప్లవ పనిమనిషుంటాడు, విప్లవ కుక్క వుంటుంది. కానీ విప్లవ భార్య వుండదు. ఆమె పిల్లల కోసం రావి చెట్టు చుట్టూ తిరుగుతూంటుంది. 

        కోడి రామకృష్ణ ఒక సామాజిక. రాజకీయ వ్యాఖ్యానం చేశారు ఈ ప్రయత్నం ద్వారా. సమస్యలకి మూలం ఎక్కడుందో ఆరోపించకుండా ఆలోచనాత్మకంగా అందించే సృజనాత్మకతని ప్రదర్శించారు. ప్రతివొక్కరూ ఇది తెలుసుకో గల్గితే కోడి రామకృష్ణ ముక్తాయించినట్టు, ఆచారాలు చేసే దేవుడు కాదు మనకి కావాల్సింది, మనసుతో మనుగడ చేసే మనిషి కోసం అదిగో అల్లదిగో... ఆ దిశగా సాగుదామని కోరుకుంటాం.

సికిందర్

 (‘పాలపిట్ట’ సాహిత్య మాస పత్రిక మే ’20 సంచిక నుంచి)