రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, ఆగస్టు 2019, శుక్రవారం

863 : స్క్రీన్ ప్లే సంగతులు


        ‘రణరంగం’ కథ పలచగా వున్నట్టు తెలుసనీ, స్క్రీన్ ప్లే ఆకర్షించడం వల్ల నటించాననీ డిఫరెంట్ స్టార్ శర్వానంద్ ఉద్ఘాటన. కథే లేనప్పుడు పలుచగా వుండేదేమిటి?  ‘బ్రోచేవారెవరురా’ లో కథ వుండీ పలుచగా కథనం చేసినందువల్ల ప్రేక్షకులకి నచ్చిందేమో. కాస్సేపు గతం, కాసేపు వర్తమానం వాయిదాలుగా  చూపించుకుంటూ పోయినంత మాత్రాన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే అవుతుందా?  ‘కంచె’ లో కాసేపు గతం, కాసేపు వర్తమానం రిపీటవుతూ పోయినా, వాటిలో కథంటూ వుంది కాబట్టి ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే అయివుండొచ్చు. ప్రయోగాలు చేసేప్పుడు సొంత నాలెడ్జికి ఫలించిన ప్రయోగాల అవగాహన జతపడక పోతే  బాక్సాఫీసు దగ్గర ఏమంత బావుండదేమో. 

         
సిడ్ ఫీల్డ్ అంటాడు - చెప్పడానికి విషయం లేనప్పుడు ఫ్లాష్ బ్యాకులు వేస్తారని.  ‘రణరంగం’ దర్శకుడు సుధీర్ వర్మ ప్రామిజింగ్ క్రియేటివ్ పరికల్పన తొలి ప్రయత్నం ‘స్వామిరారా’ హిట్ తోనే ఆగిపోయింది. ‘స్వామిరారా’ లో క్వెంటిన్ టరాంటినో శైలిని తెలుగూకరించి విజయం సాధించాడు. ఈ పట్టుబడ్డ టరాంటినో శైలిని తర్వాత ‘దోచేయ్’, ‘కేశవ’ లతో విడనాడి చుక్కానిలేని నావ అయ్యాడు. శైలిని ఏర్పర్చుకోకపోతే చెప్పే విషయం అదుపులో వుండదు. ‘దోచేయ్’ ఏదో మూస మేకింగ్, ‘కేశవ’ ఇంకేదో లూజ్ మేకింగ్. రెండూ ఉల్టాపల్టా. ఇప్పుడు ‘రణరంగం’ స్టయిలిష్ మేకింగ్ తో పల్టీ. రేపు ఇంకేదో కల్తీ. టరాంటినో మేకింగ్ ఇక చేతికందేలా లేదు. దర్శకుడికి తనదంటూ శైలి లేకపోతే విశ్వసనీయత కష్టం. తెగిన గాలి పటానికి కంటెంట్ వుండదు. 

         కంటెంట్ లేనప్పుడే అటు మార్చి ఇటు మార్చి ఫ్లాష్ బ్యాకులతో కవర్ చేద్దామనుకుంటారని లెక్కలేనన్ని స్క్రిప్టులు చదివిన సిడ్ ఫీల్డ్ ఉద్ఘోష. ‘రణరంగం’లో పది నిమిషాలు వర్తమానం, పది నిమిషాలు గతం... మళ్ళీ పది నిముషాలు వర్తమానం, పది నిమిషాలు గతం... ఇలా పునరావృతమయ్యే సమాంతర వృత్తాంతం (పారలల్ నేరేషన్) తో కథేదో చెప్పాలనుకున్నారు. అదేం కథో తెలీదు. కానీ ఈ అన్ని పదినిమిషాల గతాల్నీ ఒకచోట చేర్చి, ఫ్యాక్షన్ సినిమాల్లో చూపించే విధంగా ఒకే ఫ్లాష్ బ్యాకుగా చూస్తే, ఇందులో విషయమేమీ లేదనీ, దీనికీ వర్తమాన ‘కథ’ కీ సంబంధమే లేదనీ తేలిపోతుంది. ఫ్యాక్షన్ సినిమాల్లోనే కాదు, ఫ్లాష్ బ్యాక్ వున్న ఏ సినిమాలోనైనా అది వర్తమానంతో, అంటే ప్రధాన కథతో కనెక్ట్ అయి వుంటుంది. 

          నిజానికి ఫ్లాష్ బ్యాకు కథ అన్పించుకోదు. ప్రధాన కథే కథ. ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రధాన కథకి సంబంధించిన పూర్వకథ. ఈ పూర్వకథ లేదా ఫ్లాష్ బ్యాక్, ప్రధాన కథకి అవసరమైన సమాచారాన్నందించే వనరు - సోర్స్ - మాత్రమేనని ఫ్లాష్ బ్యాకు నిర్వచనం. ఇంతకిమించి దానికే ప్రాధాన్యం లేదు. ప్రధాన కథ లేకపోతే ఫ్లాష్ బ్యాక్ లేదు. ప్రధాన కథ ట్రిగ్గర్ చేస్తేనే ఫ్లాష్ బ్యాక్ పుడుతుంది. ఉదాహరణకి వారణాసిలో టాక్సీ నడుపుకుంటూ జీవనం గడుపుకుంటున్న హీరోతో కొంత కథ నడిచాక, ఓ కొత్తవ్యక్తి అతణ్ణి గుర్తుపట్టి, ఆశ్చర్యంతో,  ‘బాబూ నువ్విక్కడున్నావా?’ అన్నాడునుకుందాం. అప్పుడా బాబు ఇక్కడెందుకున్నాడో తగు సమాచారం మనకందించేందుకు ఎక్కడో వూళ్ళో హీరోని ఇంకోలా చూపిస్తూ ఫ్లాష్ బ్యాక్, అంటే పూర్వ కథ దర్శకుడి పాయింటాఫ్ వ్యూలో మొదలవుతుంది. ‘బాబూ నువ్విక్కడున్నావా?’ అన్న ట్రిగ్గర్ (ప్రేరక) డైలాగు లేకపోతే ఈ ఫ్లాష్ బ్యాక్ పుట్టదు. 

        ‘రణరంగం’ లో ఈ ట్రిగ్గర్ డైలాగు ఎలావుందంటే, హీరోని హీనంగా తయారుచేసేలా వుంది. ఈ ట్రిగ్గర్ డైలాగు ప్రత్యర్ధి ఉపయోగిస్తాడు. హీరో తన ప్రతిపాదన ఒప్పుకోకపోతే, పాత జీవితంలో ఎక్కడున్నాడో అక్కడుంటాడని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ప్రత్యర్ధి. దీంతో ఇప్పుడు అత్యంత రిచ్ డాన్ గా స్పెయిన్ లో వుంటున్న హీరో, వెంటనే తన పాయింటాఫ్ వ్యూలో వూళ్ళో తన పాత రౌడీ జీవితాన్ని ఫ్లాష్ బ్యాక్ రూపంలో తల్చుకోవడం మొదలెడతాడు. ఇదెలా వుందంటే, ప్రత్యర్థి ఇచ్చిన వార్నింగ్ దెబ్బకి, నిజంగానే తాను అలా అయిపోతాడా అని పాత జీవితాన్ని తల్చుకున్నట్టు వుంది. అంటే ప్రత్యర్ధి డైలాగు కాక, ఆ డైలాగువల్ల పుట్టిన భయం, ఆందోళనేదో ఫ్లాష్ బ్యాక్ ని ట్రిగ్గర్ చేసినట్టు వుంది - అతడి దైన్యాన్నివెల్లడిస్తూ.  హీరో పాయింటాఫ్ వ్యూ కాక, దర్శకుడి పాయింటాఫ్ వ్యూలో చూపిస్తే అసందర్భం అవుతుంది. ఎందుకంటే, అప్పుడు చూపించాల్సింది ఆ ప్రత్యర్థి డైలాగుకి హీరో రియాక్షనే తప్ప, హీరో ఫ్లాష్ బ్యాక్ కాదు. 

          హీరో పాత్రని డ్యామేజీ చేసే, విక్టిమ్ గా మార్చేసే ట్రిగ్గర్ డైలాగు ఇది. హీరోని అంత  పవర్ఫుల్ డాన్ గా చూపిస్తున్నప్పుడు, ఎవడో వచ్చి ప్రతిపాదన ఒప్పుకోక పోతే ప్రత్యర్థిలా మారిపోతూ, బెదిరించే ధైర్యం చేశాడంటే, వాడి దృష్టిలో హీరో ఏమీ కానట్టే. కథకుడు తను సృష్టించిన హీరో పాత్రని తనే పలచన చేసుకుంటే ప్రేక్షకులెలా గౌరవిస్తారు.

          అలా అంత పెద్ద డాన్ ని ఎవరూ బెదిరించరు. వినకపోతే కూల్ గా వెళ్ళిపోయి చేసేది చేస్తారు. ఒకవేళ అలా బెదిరిస్తే, హీరో పాత్రచిత్రణ కాపాడాలంటే, ‘ఏంట్రా నువ్వు నా పాత జీవితంలోకి నన్ను నెట్టేసేది?’ అని లేచి రెండు వాయిస్తాడు. అంతేగానీ విక్టిమ్ లా మారిపోయి, నిజంగా అలా అయిపోతానేమో నన్నట్టు, పాత రౌడీ జీవితాన్ని పదేపదే (సినిమా చివరి వరకూ) తల్చుకుంటూ కూర్చోడు. 

          కాబట్టి ఈ సీను మొత్తమే తప్పు. దీంతో  హీరో తల్చుకుని తల్చుకుని తల్చుకునేలా పాత జీవితపు మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు సినిమా చివరంటా వేయడం ఘోరమైన స్క్రీన్ ప్లే. తన పాత్రని ఇంత దిగజారుస్తున్నా కూడా ఈ  తప్పుడు ఫ్లాష్ బ్యాకుల స్క్రీన్ ప్లే శర్వానంద్ ని బాగా ఆకర్షించింది.

క్లుప్తంగా ఫ్లాష్ బ్యాక్ : 
     1990 లలో వైజాగ్ లో దేవా (శర్వానంద్) నేస్తాలతో కలిసి సినిమా టికెట్ల బ్లాక్ దందా చేస్తూంటాడు. ఒక కాలేజీ కెళ్ళే మధ్యతరగతి అమ్మాయి (కళ్యాణీ ప్రియదర్శన్) ని ప్రేమిస్తాడు. కొంతకాలం గడిచాక అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం మద్య నిషేధం విధించడంతో  ఒరిస్సానుంచి మద్యం స్మగ్లింగ్ చేసి అమ్ముతూంటాడు. ఇదే దందాలో వున్న ఎమ్మెల్యే సింహాచలం (మురళీ శర్మ) తో గొడవలొస్తాయి. పరస్పరం దాడులు చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి మధ్య నిషేధం ఎత్తేసి వేలం పాటలు పెట్టడంతో దేవాయే పైచేయి సాధిస్తాడు. కళ్యాణిని పెళ్లి చేసుకుని బిడ్డని కంటాడు. పగబట్టిన సింహాచలం కళ్యాణిని చంపించేస్తాడు. దేవా సింహాచలాన్నీ అతడి వర్గాన్ని చంపేస్తాడు.

         
ఈ ఫ్లాష్ బ్యాక్ లో హీరో కార్యకలాపాలు ప్రేక్షకులకెలా అన్పించాయో గానీ, ఈ వ్యాసకర్తకి అఫెన్సివ్ గా వున్నాయి సెన్సిటివ్ విషయాన్ని సెన్సిటివ్ గా చూడ్డం వల్ల. ఔను, మద్యనిషేధం సెన్సిటివ్ విషయం. ఇక్కడ మద్య నిషేధంతో కథకి  మోరల్ ప్రెమీజ్ (నైతిక ఆవరణ) అంటూ ఒకటి ఏర్పడింది. దీంతో హీరోకి సర్కిల్ ఆఫ్ బీయింగ్ (అస్తిత్వ వలయం) ఏర్పడాలి. మొదటిది పట్టించుకోకపోవడం వల్ల రెండోది లేదు. ఫలితంగా నైతిక విలువలు, బాధ్యత, నిబద్ధత, ఒక అర్ధవంతమైన నేపథ్యమూ లేని హీరోగా ఫ్లాష్ బ్యాక్ ఏర్పడింది. 

          ఇందులో చూపించిన మద్యనిషేధపు నేపథ్యం కల్పన కాదు. కల్పన అయివుంటే దాంతో హీరో ఏమైనా చేసుకోవచ్చు. ఇలాగే మద్యం స్మగ్లింగ్ చేసి కోట్లు సంపాదించుకోవచ్చు. అయినా హీరో కాబట్టి మోరల్ ప్రెమీజ్ ని తప్పించుకోలేడు. చివరికి ఆ అవినీతికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ‘దీవార్’ లో అమితాబ్ బచ్చన్ డాక్ యార్డ్ లో కూలీగా మొదలై అతి పెద్ద స్మగ్లర్ గా ఎదుగుతాడు. అతణ్ణి శిక్షించే శక్తిగా తమ్ముడి పాత్రలో శశికపూర్ పోలీసు అధికారిగా వెంటాడతాడు. ఈ కథ కల్పనే అయినా మోరల్ ప్రెమీజ్ కి న్యాయం జరిగింది. 

        కానీ శర్వా పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో మద్యనిషేధం అంశం కల్పితం కాదు,  మనందరికీ తెలిసిన చారిత్రక ఘట్టం. ఎన్టీఆర్ సౌజన్యం. అప్పట్లో సారాయికి వ్యతిరేకంగా స్త్రీలు చేపట్టిన ఉద్యమం1992 లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మద్యనిషేధం విధించడానికి దారితీసింది. అంటే మోరల్ ప్రెమీజ్ మరింత బలంగా వుంది. దీన్ని పట్టించుకోకుండా, సమాజ శ్రేయస్సు కోసం ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని హేళన చేస్తున్నట్టు శర్వా పాత్ర చిత్రణ వుంటే ఎట్లా?  అంతవరకూ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముకునే వృత్తిలో వున్న వాడు, మద్యనిషేధం విధించగానే ఒరిస్సానుంచి మద్యం స్మగ్లింగ్ చేసి అమ్ముకోవడం మొదలెడతాడు. అంటే మగాళ్ళతో తాగించి ఆడవాళ్ళ బతుకులతో చెలగాట మాడినట్టు అర్ధం. మద్యనిషేధాన్ని తూట్లు పొడిచాడని అర్ధం. ఇప్పుడెలా వుంది పాత్ర? హీరో పాత్రేనా?  పోనీ ఈ మోరల్ ప్రెమీజ్ నైనా పట్టించుకున్నారా, ఇందుకు మూల్యం చెల్లించుకున్నాడా అంటే, అదీ లేదు. 

          అతను స్పెయిన్ లో రిచ్ డాన్ గా తిష్ట వేయడానికి ఈ మూలలున్నాయి. దీని
మోరల్ ప్రెమీజ్ ని పట్టించుకో లేదు సరే, సర్కిల్ ఆఫ్ బీయింగ్ కూడా ఆలోచించలేదు. సర్కిల్ ఆఫ్ బీయింగ్ లేకపోతే ఫ్లాష్ బ్యాక్ ఎందుకు? పైగా సినిమా సాంతం మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులెందుకు? అసలుండాల్సిన మోరల్ ప్రెమీజ్, సర్కిల్ ఆఫ్ బీయింగ్ లేకపోయాక ఈ పది నిమిషాలకో ఫ్లాష్ బ్యాకుల మోత ఎందుకు?

          ఫ్లాష్ బ్యాక్ లో విలన్ చివరికి హీరో భార్యని చంపాడు కదా, ఈ విషాద నేపథ్యమే సర్కిల్ ఆఫ్ బీయింగ్ అనుకోవాలనా? విలన్ హీరో భార్య (హీరోయిన్ని) ని చంపడం హీరో తప్పే అన్పించేలా చిత్రణ వుంది. ఈ లవ్ ట్రాక్ ఆషామాషీగా వుంది. ఒక పరువుగల మధ్యతరగతి కుటుంబానికి చెందిన టీనేజీలో వున్న కాలేజీ అమ్మాయి, చదువులేని బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్ముకునే హీరోతో ప్రేమలో పడుతుంది. మద్యనిషేధంతో అతను మద్యం స్మగ్లింగ్ చేస్తూ లాకప్ లో పడ్డా కూడా కామెడీగా తీసుకుంటుంది. ఇతన్ని పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధపడితే, తండ్రి మందలించినట్టు మందలించి నీ నిర్ణయం నువ్వు తీసుకోమంటాడు. ఒక క్రిమినల్ అల్లుడు కావడాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. ఇంతవరకు హీరోయిన్ నిర్వాకం. 

       ఇక హీరో నిర్వాకం చూస్తే, ఒక వైపు సింహాచలం అనే పోటీ మద్యం స్మగ్లర్ తో వైరముంటే, శత్రువులుగా పరస్పరం దాడులు చేసుకుంటూ వుంటే, ఈ వాతావరణంలోకి -ప్రమాదంలోకి హీరోయిన్ ని లాగి పెళ్లి చేసుకుంటాడు. ఆమెకి భద్రత కూడా కల్పించకుండా విలన్ చంపడానికా అన్నట్టు వీలుగా ఒంటరిగా ఆమెని కారులో పంపుతాడు. ఆ విలన్ కారుని పేల్చేసి కూర్చుంటాడు. ఇందులో విలన్ తప్పేముంది, హీరో మీద సానుభూతి కలగడానికి? ఈ హీరో స్వయంకృతాపరాధ విషాద గీతికతో సర్కిల్ ఆఫ్ బీయింగ్ ఎలా ఏర్పడుతుంది? మద్యనిషేధానికి వ్యతిరేకంగా పనిచేసిన తప్పిదముండగా, దాని ఫలితంగా భార్య చనిపోవడమెలా సానుభూతి కారకమవుతుంది? చేసుకున్నవారికి చేసుకున్నంత. 

          సర్కిల్ ఆఫ్ బీయింగ్, మోరల్ ప్రెమీజ్ వగైరా హీరో బాధ్యత ఫీలయితే ఏర్పడతాయి. తను మద్యం స్మగ్లింగ్ చేయకుండా, ప్రజానీకం వైపు, మద్యనిషేధం వైపు వుండి సింహాచలం స్మగ్లింగ్ ని అడ్డుకుంటూ వుంటే, ఆ పోరాటంలో భార్యని కోల్పోతే, అవి బలమైన సర్కిల్ ఆఫ్ బీయింగ్, మోరల్ ప్రెమీజ్ అవుతాయి. మద్యనిషేధం కోసం త్యాగాలు చేసిన నేపథ్యంతో, ఎమోషన్స్ తో ఫ్లాష్ బ్యాక్ ముగిస్తే, అప్పుడు ప్రధాన కథ కొచ్చేసరికి అతణ్ణి సానుభూతితోనే కాదు, ఎన్నదగిన పాత్రగా కూడా చూడగలం.

(ప్రధాన కథ సంగతులు రేపు)
 సికిందర్
telugurajyam.com

21, ఆగస్టు 2019, బుధవారం

862 : సందేహాలు - సమాధానాలు



Q :  బహిర్ముఖంగా తల్లిని ఎదుర్కొంటున్న వాడు, తల్లిని అనారోగ్యం పాల్జేశానన్న చింతతో తనకి తనే ప్రత్యర్ధి అయి, తనతో తానే అంతర్ముఖీనంగా సంఘర్షించడం మొదలెడతాడు. ఇలాటి పాత్ర వరల్డ్ మూవీస్ లో, ఆర్టు మూవీస్ లో, గాథల్లో వుంటుంది.కమర్షియల్ మూవీస్ లో కాదుఅని మన్మథుడు - 2  స్క్రీన్ ప్లే సంగతులులో రాశారు.  మీరన్నట్టు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్  ఎక్కువగా ఆర్ట్ సినీమాలలోనే చూస్తాము.  కానీ తెలుగు సినిమాలలో ఖుషీ, మన్మధుడు -1, అర్జున్ రెడ్డి, ఇవన్నీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ తో నడిచిన సినిమాలే కదా...మరి అవి బాగా ఆడాయి కదా? ఎందువల్ల? క్యారక్టర్ డ్రివెన్ స్టోరీస్ ముఖ్యంగా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ మీదే ఆధారపడి వుంటాయి కదా, మరి వాటి సంగతి ఏంటి? అవి తెలుగులో ఆడే అవకాశం లేదంటారా
పేరు రాయలేదు

 
A :  ఏ కథయినా క్యారక్టర్ డ్రివెన్ స్టోరీగానే వుంటుంది. క్యారక్టర్ నడపక పోతే కథ ఎక్కడిది?  గాథ వుంటుంది. వరల్డ్ మూవీ వుంటుంది, ఆర్ట్ సినిమా అవుతుంది. ఆ క్యారక్టర్ పాసివ్ పాత్రవుతుంది. కాబట్టి క్యారక్టర్ డ్రివెన్ స్టోరీస్ - ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ రెండూ రెండు ధృవాలు. కలిసి వుండవు. క్యారక్టర్ డ్రివెన్ స్టోరీస్ లో ఎక్స్ టర్నల్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్టులు రెండూ వుంటాయి. అప్పుడే అది యాక్టివ్ పాత్రగా నిలబడుతుంది.

          మన్మథుడు - 2 తో మీరు పేర్కొన్న సినిమాల్ని పోల్చకూడదు.
మన్మథుడు -2  లో నాగార్జున ప్రత్యర్ధి అయిన తల్లి పాత్రతో  ఎక్స్ టర్నల్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్టులు రెండిటితో ప్రారంభమవుతాడు. ఎప్పుడైతే తన ఎత్తుగడలతో ఆమెని అనారోగ్యం పాల్జేస్తాడో - ఇక ఆ అపరాధభావంతో ఆమెతో - అంటే ఆ ప్రత్యర్ధితో - ఎక్స్ టర్నల్ కాన్ఫ్లిక్ట్ నుంచి వైదొలగి. లోలోన ఇంటర్నల్ కాన్ల్ఫిక్ట్ తో వుండి పోతాడు. కథ మధ్యలో ప్రత్యర్థి పాత్ర కనుమరుగయ్యాక ఇక నాగార్జునకి పనేముంటుంది. ఇందుకే ఆయన పాత్ర విఫలమయింది. పాత్ర విఫలమైతే కథ విఫలమైనట్టే. సింపుల్ గా చెప్పాలంటే, మన్మథుడు -2 ఫస్టాఫ్ కమర్షియల్ సినిమా, సెకండాఫ్ ఆర్టు సినిమా. మన తెలుగు సినిమాలు తెలియక కమర్షియల్ సినిమాల ముసుగేసుకుంటున్న ఆర్ట్ సినిమాలే. ఇది ఎన్నటికీ అర్ధం జేసుకోలేరు. ఇలాగే భారీగా పదుల కోట్లు బంగాళాఖాతంలో కలుస్తూంటాయి. ఈ డబ్బు అమరావతి కిచ్చినా రాజధాని తయారై  కళ్ళ ముందుంటుంది.

          మీరు పేర్కొన్న సినిమాల్లో ప్రత్యర్థి పాత్రలు మొదట్నించీ వుండవు. మొదట్నించీ ప్రత్యర్ధి పాత్ర వుండనప్పుడు, ఇలాటి రోమాంటిక్ డ్రామాలు తప్ప, ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ తో రోమాంటిక్ కామెడీలు, ఇతర కమర్షియల్ - యాక్షన్ - మాస్ - స్టార్ వగైరా సినిమాలు సక్సెస్ కావు. మీరు చెప్పినవే కాదు, చాలా పూర్వం దేవదాసు, మేఘసందేశం, సాగరసంగమం లాంటివి కూడా ప్రత్యర్థి లేని ఇంటర్నల్ కాన్ఫ్లిక్టుతో రోమాంటిక్ డ్రామాలుగా హిట్టయ్యాయి.

Q :  మీరు తెలుగు సినిమాల సక్సెస్ రేటు 10 శాతమేనని తరచూ పేర్కొంటుంటారు. ఈ అంశాన్ని నా ‘తెలుగు ఫిలిం అడాప్టేషన్స్’ పరిశోధనలో భాగంగా చేర్చాను. పూర్వం దర్శకులు సాహిత్యం నుంచి కథలు తీసుకునే వారు. ఈ తరం దర్శకులు సినిమాల నుంచి మాత్రమే రిఫరెన్సులు తీసుకుని సినిమాలు నిర్మిస్తున్నారు. ఇది నిజమేనంటారా? పోతే, 1990 లకి పూర్వం తెలుగు సినిమాల సక్సెస్ రేటు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా అధ్యయనం 1960 - 80 మధ్య కాలానికి సంబంధించినది. ఈ కాలంలోనే నవలలు ఎక్కువగా సినిమాలుగా వచ్చాయి. ఇకపోతే, మీరొక చోట ఇలా రాశారు: ‘తెలుగు సినిమాల తొలి స్వర్ణయుగమైన 1931-51 మధ్య (భక్తప్రహ్లాద నుంచీ పాతాళ భైరవిదాకా) వచ్చిన లాంటి సినిమాలు మలిస్వర్ణ యుగంలో లేవు. మలిస్వర్ణ యుగం 1951 -71 మధ్య (మల్లీశ్వరినుంచీ చెల్లెలి కాపురంవరకూ) సాగింది. మలిస్వర్ణయుగంలో వచ్చిన లాంటి సినిమాలు తర్వాత వ్యాపారయుగంలో లేవు. వ్యాపారయుగం 1971- 91 మధ్య (‘దసరాబుల్లోడు నుంచీ గ్యాంగ్ లీడర్వరకూ) కొనసాగింది. ఇంతే, మూడు యుగాల్లో సుమారు తరానికోమారు  సినిమాల తీరుతెన్నులు మారుతూ వచ్చాయి. అంటే, రెండు దశాబ్దాలకో మారు కొత్త  తరం నిర్మాతలూ దర్శకులూ వచ్చేస్తూ సినిమాల్ని కొత్తబాట పట్టించసాగారన్నమాట!' అని. ఈ సమాచారం మూలాల గురించి తెలియజేయగలరు.
దిలీప్ కుమార్, eflu 

A :  ఈ సమాచారం ఆయా కాలాల సినిమాలని పరిశీలించి స్వయంగా రూపొందించుకున్నది.  వెనుక చరిత్ర తెలియకపోతే  ముందు ప్రయాణం తెలియదు కాబట్టి. మీకు కావాలంటే సవివర సమాచారమిస్తాను. మీరు వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు, పరిశోధనాకాలం తొలినాటి నుంచీ వుండాలని చర్చించినట్టు గుర్తుంది. అంటే తెలుగు సినిమాలు మూకీలుగా ప్రారంభమైన 1921 నుంచీ. 1921 లో తెలుగుసినిమా పితామహుడు రఘుపతి వెంకయ్యనాయడు తొలి మూకీగా ‘భీష్మ ప్రతిజ్ఞ’ నిర్మించారు. ఇది పౌరాణిక నాటకం. కాబట్టి అడాప్టేషన్స్ అన్నవి మొదటి మూకీతో పౌరాణిక నాటకాలతోనే ప్రారంభమయ్యాయి. నడుస్తున్న నాటకాన్ని నడుస్తున్నట్టే షూట్ చేసే వాళ్ళు. తర్వాత టాకీలుగా వచ్చిన సినిమాలు 1937 వరకూ పౌరాణిక నాటకాలే. అంటే అడాప్టేషన్సే. 1936 లో మొట్ట మొదటి సారి సినిమాకి కథ ఎలా రాయాలో తెలుసుకుని, కృతివెంటి నాగేశ్వరరావు, తన సొంత నాటకాన్ని’ ప్రేమ విజయం’ అనే కాల్పనిక సాంఘీక చిత్రంగా మల్చారు. ఇలా ఇలా తెలుగు, ఇంగ్లీషు, బెంగాలీ మొదలైన భాషల నవలలూ నాటకాలూ కాలక్రమంలో ఎన్నో సినిమాలుగా వచ్చాయి మీరు తీసుకున్న 1960 - 80 కాలావధి వరకూ. మీరిదే కాలావధి తీసుకున్నా పూర్వరంగాన్ని పరిచయం చేయాల్సి వుంటుందేమో ఒకసారాలోచించండి.

          ఇక 1980- 90 లలో సక్సెస్ రేటు విషయానికొస్తే, 1980 లో 60 నిర్మిస్తే 44 హిట్టయ్యాయి. దీన్నిబట్టి వూహించుకోవచ్చు. ఇప్పుడు వస్తున్నన్ని సినిమాలు అప్పట్లో లేవు. ఇప్పుడున్నన్ని వివిధ దృశ్య మాధ్యమాలు అప్పట్లో లేవు. కొన్ని సినిమాలు 200, 500 రోజులు కూడా ఆడేవి. అప్పట్లో కాలం, క్వాలిటీ, సంఖ్యా కలిసొచ్చాయి. 2000 తర్వాత నుంచి ఏదీ కలిసిరావడం లేదు. రణరంగం, డియర్ కామ్రేడ్ లాంటి ఎండుగడ్డి స్టార్ సినిమాలు అప్పట్లో వూహించం.


          ఇక
ఈ తరం దర్శకులు నవలల్ని అడాప్ట్ చేసుకోవడానికి చేతన్ భగత్ లా తెలుగులో ఈ తరం నవలలు రాసే వాళ్ళు లేరు. రాసినా చదివే వాళ్ళు లేరు. సోషల్ మీడియా వల్ల రచనా వ్యాసంగాలు మట్టి కొట్టుకుపోయాయి. సోషల్ మీడియాలో పోస్టులే సాహిత్యసేవ అనుకుంటున్నారు. అందువల్ల ఈ తరం దర్శకులు విదేశీ సినిమాలతో హాత్ కీ సఫాయీ చేసుకుంటున్నారు. 

 
Q :   సార్, మీరు చాలా గ్రేట్ సార్. కథలు రాసేవాళ్ళకి చాలా వ్యాసాలు అందిస్తున్నారు. కన్నడ, తెలుగు సినిమా రైటర్లకి మీ వల్ల చాలా ఉపయోగం. నేను మూడు నెలలు ఫిలిం ట్రైనింగ్ పొందాను. నాకు నిర్మాతలు, లేదా దర్శకులు ఎలా దొరుకుతారో చెప్పగలరు. ఎన్. కన్నయ్య, రైటర్

A :  ఇలాటి సిల్లీ ప్రశ్నలు అడగొచ్చా?  రైటర్ గా మీరు నిర్మాతలకో, దర్శకులకో కథ లివ్వాలనుకోవడం మర్చిపోండి. కథ రాసుకుంటే దర్శకులై పోండి, లేదా దర్శకుల కథలకి అవకాశముంటే పని చేయండి. ఈ రెండూ కాదంటే, డైలాగ్ రైటర్ గా కృషి చేయండి. ముందు వ్యవస్థ ఎలా వుందో తెలుసుకుని ఫోకస్డ్ గా ప్రణాళికలేసుకోండి. రైటర్ నుంచి కథ తీసుకునే పద్ధతి గత ఇరవై ఏళ్లుగా లేదు. 

సికిందర్



19, ఆగస్టు 2019, సోమవారం

861 : రివ్యూ


        రుసగా దేశ భద్రతకి  సంబంధించిన అంశాలతో సినిమాలు నటిస్తూ వస్తున్న యాక్షన్ స్టార్ జాన్ అబ్రహాం, మరో అలాటి టాపిక్ తో ‘బాట్లా హౌస్’ నటించాడు. ఫోర్స్ - 2, పరమాణు, సత్యమేవ జయతే, రోమియో అక్బర్ వాల్టర్ ల తర్వాత, ‘బాట్లా హౌస్’ తో ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యే  ప్రయత్నం చేశాడు. ‘బాట్లా హౌస్’ దేశవ్యాప్తంగా సంచలనమైన నిజంగా జరిగిన కథ  కావడంతో దీనికెక్కువ ఆదరణ కన్పిస్తోంది. దావూద్ ఇబ్రహీంని పట్టుకునే కథతో 2013 లో  ‘డీ –డే’ అనే హిట్ రియలిస్టిక్ యాక్షన్ తీసిన ‘కల్ హో నహో’ ఫేమ్ దర్శకుడు నిఖిల్ అద్వానీ, కొంత గ్యాప్ తర్వాత  ‘బాట్లా హౌస్’ అనే మరో రియలిస్టిక్ యాక్షన్ తో వచ్చాడు. ‘పింక్’ అనే థ్రిల్లర్ తో  పేరు తెచ్చుకున్న రచయిత రీతేష్ షా, క్షుణ్ణంగా రీసెర్చి చేసి రాసిన ఈ ఎన్కౌంటర్ కథతో మరోసారి ‘పింక్’ లాంటి కోర్టు రూమ్ డ్రామాకి తెర తీశాడు. ఈ నేపథ్యంలో  ఢిల్లీలో జరిగిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్ సంఘటన ఎలా తెరానువాదమైందో చూద్దాం...
కథ
         
టీవీ న్యూస్ యాంకరైన భార్య నందిత (మృణాల్ ఠాకూర్) ఆరోపణలతో విసిగిన ఢీల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎసిపి సంజయ్ కుమార్ (జాన్ అబ్రహాం), ఆమె ఇక పుట్టింటికి వెళ్లిపోతానంటే - పోతే పో అని  ఏర్ పోర్టులో దిగబెట్టడానికి తీసుకుని బయల్దేరతాడు. కానీ తను అర్జెంటుగా బాట్లా హౌస్ ఆపరేషన్ కెళ్ళాలి. ఆమె మనసు మార్చుకుని మధ్యలో దిగిపోతుంది. తను బాట్లా హౌస్ కి చేరుకునే సరికి అక్కడ కాల్పులు జరుగుతూంటాయి. టెర్రరిస్టుల కాల్పుల్లో ఇన్స్ పెక్టర్ వర్మ (రవి కిషన్) తీవ్రంగా గాయపడతాడు. ఎసిపి సంజయ్ వెంటనే రంగంలోకి దిగి ఇద్దరు టెర్రరిస్టుల్ని హతమారుస్తాడు, మరో ఇద్దరు తప్పించుకుంటారు, ఒకడు దొరుకుతాడు.

        వీళ్ళు టెర్రరిస్టులు కాదనీ, యూనివర్సిటీ విద్యార్ధులనీ, జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అనీ ప్రజలు, విద్యార్థులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ పార్టీలూ ఆందోళన చేస్తారు. సంజయ్ ని తీవ్రంగా తూలనాడుతారు. మరోవైపు ఇన్స్ పెక్టర్ వర్మ ఆస్పత్రిలో చనిపోతాడు. ఎంక్వైరీ చేయమంటే ఎందుకు ‘ఎంగేజ్’ అయ్యారని పోలీస్ కమిషనర్ మనీష్ చౌదరి (జైవీర్) నిలదీస్తాడు. ఇన్స్ పెక్టర్ వర్మ తన ఆదేశాల్ని ఉల్లంఘించాడని అంటాడు సంజయ్. దీంతో డిపార్ట్ మెంట్లో అంతర్గత కుమ్ములాటలు ఈ బూటకపు ఎన్కౌంటర్ కి కారణమని గొడవ చేస్తుంది మీడియా కూడా. మనమీద యీ దుష్ప్రచారం ఆగాలంటే తప్పించుకున్న టెర్రరిస్టుల్ని పట్టుకోవాలంటాడు సంజయ్. మళ్ళీ ఈ ప్రయత్నం కూడా చేస్తే ప్రజలు తంతారని వారిస్తాడు కమీషనర్ చౌదరి.  సంజయ్ మానసిక క్షోభకి లోనవుతాడు. బూటకపు ఎన్కౌంటరని ప్రజల దూషణలు ఒకవైపు, సహకరించని కమీషనర్ ఇంకోవైపు, భార్యతో సమస్యలు మరోవైపు, వీటన్నిటికీ మించి చనిపోయిన టెర్రరిస్టులు తనని కాలుస్తున్నట్టు చిత్తభ్రాంతులు మరింకోవైపు...ఇన్నిటి మధ్య సంజయ్ విచలితుడవుతాడు. ఇప్పుడేం చేశాడు? వాళ్ళు బాంబులు పేల్చిన టెర్రరిస్టులేనని, జరిగింది నిజమైన ఎన్కౌంటరేనని, తను తప్పు చేయలేదని ఎలా నిరూపించాడు? ఇదీ కథ. 

      2008 సెప్టెంబర్ 13 న ఢిల్లీలో ఐదుచోట్ల బాంబు పేలుళ్లు సంభవించి ముప్పై మంది చనిపోయారు,133 మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ ఈ దాడుల వెనుక వుందని  పసిగట్టిన ఢీల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దళం ఆ టెర్రరిస్టుల్ని ఆరా తీసి, 19వ తేదీన బాట్లా హౌస్ ఫ్లాట్ మీద దాడి చేశారు. ఆ సందర్భంగా పరస్పరం జరుపుకున్న కాల్పుల్లో ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఇన్స్ పెక్టర్  మోహన్ చంద్ శర్మతో బాటు, ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారు, ఇద్దరు పారిపోయారు, ఒకడు దొరికాడు. దీనిమీద నిరసనలు పెల్లుబికాయి. విద్యార్ధుల్ని బూటకపు ఎన్కౌంటర్ లో చంపారంటూ న్యాయవిచారణ జరిపించాలన్నారు. దీన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించి, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని నివేదిక కోరింది. జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ జరిపి పోలీసులకి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో మళ్ళీ ఆందోళనలు చెలరేగాయి. అది నిజమైన ఎన్కౌంటర్ అయితే ఒక మృతుడి తల మీద నాల్గు బుల్లెట్లు ఎలా తగులుతాయని, కూర్చోబెట్టి కాల్చారని, ఇంకో మృతుడి వీపు చర్మం చిత్ర హింసలకి గురి కాకపోతే ఎలా చిట్లుతుందని, ఆ ఫ్లాట్ కి ఒకే తలుపు వుండగా, కింద ఒకే ద్వారం వుండగా ఇద్దరు ఎలా పారిపోతారనీ, అక్కడ నిజంగా టెర్రరిస్టులే దాగి వున్నారని తెలిస్తే, ఇన్స్ పెక్టర్ శర్మ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించకుండా ఎలా వెళ్ళాడని...కాబట్టి ఇది పోలీసుల అంతర్గత కుమ్ములాటల వల్ల జరిగిందనీ...ఇలా ఆరోపణలు  కురిపించాయి హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు. 2013 లో సెషన్స్ కోర్టు తీర్పు వెలువడింది. దొరికిన ఒక టెర్రరిస్టుకి శిక్ష విధించింది. దీని మీద అప్పీలు కెళ్ళారు. 


          కేసు అప్పీల్ లో వుండగా ఈ సినిమా తీసిన దర్శకుడు నిఖిల్ అద్వానీ, రచయిత రీతేష్ షాలు తమ సుదీర్ఘమైన డిస్ క్లెయిమర్ తో,  సినిమా కోసం తాము చేసిన కల్పనని, సృజనాత్మక స్వేచ్ఛని  సీరియస్ గా తీసుకోరాదన్నారు. సంఘటనకి తమదైన వెర్షన్ తో చేసిన చిత్రణలతో  ఏ అభ్యంతరమూ వుండదు. నిద్ర పుచ్చే చివరి కోర్టు దృశ్యాల తోనే సినిమాటిక్ గా అభ్యంతరముంటుంది. కోర్టులో వాదోపవాదాల మధ్య ‘మేము ఏ వాదం వైపూ లేము’ అని ఇంకో  డిస్ క్లెయిమర్ వేయడమూ అభ్యంతరమే. ఎటువైపూ లేకపోవడం వల్లే  కోర్టు దృశ్యాలు స్లీపింగ్ పిల్స్ లా వున్నాయి. అంతవరకూ హీరో చుట్టూ మాంచి ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా వున్న కథని, కోర్టుకు చేర్చడమే పొరపాటుగా వుంది. 


        అంత కష్టపడి చివరికి తప్పించుకున్న టెర్రరిస్టుని పట్టుకున్న హీరో,  కోర్టుకి తీసికెళ్ళడ మేమిటి? ఎంత మంది మృతికి, వికలాంగులవడానికి  కారకుడయ్యాడో, ఇన్స్ పెక్టర్ కుటుంబం సహా, ఆ బాధిత కుటుంబాలందరి ముందూ హాజరుపర్చి, వాళ్ళు వేసే కఠిన ప్రశ్నలకి జవాబు చెప్పుకునేలా చేసి-  టెర్రరిజం సినిమా కథల టెంప్లెట్ ని మార్చవచ్చు కదా? అసలైన కోర్టు ఇది కదా? హీరో మతగ్రంథం చదివి వినిపిస్తే టెర్రరిస్టులు మారతారా? ఇలాటి కథల్లో ఎప్పుడూ స్టేక్ హోల్డర్లయిన వందలాది బాధిత కుటుంబాల ఉనికే లేకుండా చేయడమేమిటి?

         
దీన్నొక ఎన్కౌంటర్ ఎలా జరిగిందనే కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ కథకి పరిమితం చేశారు. కథా ప్రయోజనాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళ లేదు. కోర్టు వాదోపవాదాల్లో మొత్తం ఆ రోజు అసలేం జరిగిందీ సైంటిఫిక్ ఆధారాలతో, రెండు వైపుల నుంచీ చెప్పుకువచ్చే డ్రామా స్థాయికి కుదించారు. ఇలాటి సామాజిక నేరాల్లో జరిగిందానికి  లాజిక్కులు జోడించుకు వచ్చే, మన తార్కిక బుద్ధిని పరీక్షించే, కథ అవసరం లేదు. ఈ కథకి విశాల ప్రాతిపదికన మనలోని మానవీయ, సామాజిక కోణాలని తట్టిలేపే ఎమోషనల్ డ్రామా అవసరం. ఇది సరయిన కథా ప్రయోజనమవుతుంది. దొరికిన వాణ్ణి  సామూహిక బాధితుల కోర్టులో నిలబెట్టి, వాడు జవాబు చెప్పుకోలేని ప్రశ్నలు సంధింపజేయడం అవసరం. టెర్రరిస్టులకి ఈ కొత్త అనుభవం రుచి చూపిస్తే మత్తు వదుల్తుంది. మతగ్రంథాలు, చట్టాలు వాళ్ళ అంతరాత్మల్ని తాకలేవు. టెర్రరిస్టులు మౌలికంగా సమాజంతో తెగతెంపులు జేసుకున్నారు. వాళ్ళని అక్కడికే తెచ్చి భావజాలాన్ని చంపాల్సి వుంటుంది.

          ఈ సినిమాలో ఒకటి మాత్రం యాదృచ్ఛికంగా, తులనాత్మకంగా కళ్ళకి కడుతుంది- ఎన్కౌంటర్ ని అనుమానించి ఉద్యమించిన వాళ్ళెవరినీ అప్పటి ప్రభుత్వం జాతివ్యతిరేకులు, దేశద్రోహులు అనకపోవడం, నిర్బంధించక పోవడం. మీడియా గొంతు నొక్కకపోవడం. 

ఎవరెలా చేశారు 
     జాన్ అబ్రహాం ఈ మల్టీ డైమెన్షనల్ క్యారక్టర్ ని అజేయంగా పోషించాడు. క్యారక్టర్ని చూస్తున్నప్పుడు తనలోకి ప్రేక్షకుల దృష్టి చొచ్చుకెళ్ళేలా  చేశాడు. క్యారక్టర్ బాధ ప్రేక్షకుల బాధ అయ్యేలా చూశాడు. సినిమాల్లో అలవాటుగా చూపించే అతి కూడా చేశాడు. జాతీయ పతాకాన్ని చూడగానే దేశభక్తి పొంగుకు రావడం. జాతీయ పతాకం, దేశభక్తి తర్వాతి సంగతి. అది యుద్ధ చిత్రాల్లో సైనికులు చూసుకునే సంగతి. అంతదాకా పోనవసరం లేదు. ఇలాటి పోలీసు కథల్లో ముందు న్యాయదేవత చేతిలో త్రాసుతో వుంటుంది. ఈ కథ ఈమెతో సంబంధం. తన ఇమ్మీడియెట్ దైవం న్యాయదేవత కావాలి. 

          ఇంకో అతి ఏమిటంటే, ఎన్కౌంటర్ సమయంలో దొరికిన అనుమానితుణ్ణి ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు గ్రీన్ షర్టు వేసుకుని, మతగ్రంథంతో రెడీ అన్నట్టు తను వుండడం. అనుమానితుడు “అయోధ్య చేస్తే, గుజరాత్ చేస్తే మేం వూరుకోవాలా?” అంటాడు. అప్పుడు గ్రీన్ షర్టు వేసుకున్న అబ్రహాం, గ్రీన్ సంచీలోంచి మతగ్రంధం తీసి, కళ్ళకద్దుకుని, ముద్దాడి బాగా ఓవర్ డ్రామా చేస్తాడు. అరబ్బీ చదివి అర్ధం చెప్తాడు. తను పోషిస్తున్న ఎసిపి సంజయ్ పాత్రకి అరబ్బీ ఎలా వచ్చింది? సంస్కృతం కూడా వచ్చా? నేపాళ భాష కూడా? టెర్రరిస్టులతో ఎప్పుడూ ఇవే టెంప్లెట్ ఇంటరాగేషన్ సీన్లు. గ్రీన్ షర్టు వేసుకున్న తను అసలైనది మరిచాడు – మత గ్రంథం తెరచినప్పుడు తల మీద టోపీయో, చేతి రుమాలో వేసుకోవడం! అసలు ఏ మత గ్రంథాలనీ ఇంటరాగేషన్ చేసే, హింసించే దుర్గంధభూయిష్ట గదుల్లోకే తీసికెళ్ళరు. 

          ఈ కథకి ప్లాట్ డివైస్ గా ఇంటరాగేషన్లో వుండాల్సింది వాడు తిప్పికొట్టే అభౌతిక మతగ్రంథ సూక్తులు కాదు. వాడి బాంబు దాడుల్లో మరణించిన, వికలాంగులైన వాళ్ళ భౌతిక మైన, లౌకికమైన, హృదయవిదారక విజువల్స్. ఇవి చూపించి కదా వాడి జవాబు కోరాలి? 

          తను చంపిన ఇద్దరు టెర్రరిస్టులు భూతాలై తనని కాలుస్తున్నట్టు చిత్తభ్రాంతులతో అబ్రహాం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ పేషంట్ కూడా అవుతాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. తను చూసే విజువల్స్ లో ఆ భూతాల వెనుక ముస్లిం సమూహాలే వుంటాయి హాహాకారాలు చేస్తూ. పదే పదే ఇది రిపీటవుతుంది. తనని దూషిస్తూ ఆందోళన చేస్తున్న సమూహాల్లో అన్ని వర్గాల వాళ్ళూ వున్నారు. ఒక వర్గమే మత ఫీలింగుతో తన మీదికి వస్తున్నట్టు సెలెక్టివ్ గా మార్క్ చేసుకుని చిత్తభ్రాంతులకి లోనవడమెందుకు? దర్శకుడూ రచయితా నిష్పక్షపాత ధోరణి నుంచి అక్కడక్కడా పక్కకెళ్ళి పోతూంటారు.

        భార్యతో ఆ గొడవేమిటో అర్ధమేగాదు. సినిమా మొదటి దృశ్యమే భార్య సణుగుడుతో ప్రారంభమవుతుంది. ఈ మొదటి షాట్ ని బ్లర్ చేసి చూపించడం, గొడవేమిటో దర్శకుడికి స్పష్టత లేదనేమో. ఈ గొడవైనప్పుడల్లా బ్లర్ చేసి చూపిస్తే సరిపోయేది. ఇక ఇది బూటకపు ఎన్కౌంటర్ కాదని నిరూపించే అంశానికి సంబంధించి-  తప్పించుకున్నటెర్రరిస్టు వేటలో  పాత్రచిత్రణకి, నటనకి, సంఘర్షణకి అబ్రహాం ఏ - వన్ యాక్టర్. కమీషనర్ నుంచీ హోంమంత్రి (చిదంబరం?) వరకూ ఎవరి ఆమోదంలేని ఆపరేషన్ కి తెగించడం, దెబ్బతినడం, తెగించడం చీవాట్లు తినడం...ఇలా సానుభూతి ఎక్కువ పొందుతాడు. చివరికి కోర్టు దృశ్యాలు మళ్ళీ మైనస్. 

          భార్య పాత్రలో నటి మృణాల్ ఠాకూర్ కి మంచి ఫేసు, ఎక్స్ ప్రెషన్స్ వున్నాయి. ఆమెకి వ్యక్తిగతంగా భర్తతో, న్యూస్ యాంకర్ గా వృత్తిగతంగా ఛానెల్ నిర్వాహకులతో పాత్రచిత్రణ సరీగా లేదు. భర్తతో గొడవేమిటో అర్ధమేగాదు. ఇక భర్త నకిలీ ఎన్కౌంటర్ చేశాడని విమర్శిస్తూ న్యూస్ కవర్ చేస్తున్న ఛానెల్ నిర్వాహకులు, ఆమెని సెలవు మీద వెళ్ళ మంటారు. ఆమె ప్రతిఘటిస్తుం ది. తర్వాతేం చేస్తుందో కొనసాగింపు లేదు. భర్తతో వుంటుంది. 

         
భోజ్ పురీ స్టార్ రవికిషన్ ది సంక్షిప్త ఇన్స్ పెక్టర్ పాత్ర. ఎన్కౌంటర్ లో వెంటనే చనిపోతాడు. తర్వాత అబ్రహాం జ్ఞాపకాల్లో మాంటేజెస్ లో కన్పిస్తాడు. చివర కోర్టు దృశ్యాల్లో సస్పెన్స్ రివీలవుతున్నప్పుడు అసలెలా చనిపోయిందీ తిరిగి మాంటేజెస్ లో వస్తాడు. జడ్జిగా నటించిన ఉత్కర్ష్ రాయ్, కమీషనర్ గా నటించిన జైవీర్, డిఫెన్స్ లాయర్ గా నటించిన రాజేష్ శర్మ, తప్పించుకున్న టెర్రరిస్టుగా నటించిన సాహిదుర్ రెహ్మాన్ వాళ్ళ లుక్స్ తో, నిజ జీవితంలో ఆ పాత్రల్ని చూస్తున్నట్టే వుంటారు. అబ్రహాం ఇంటరాగేట్ చేసే అనుమానిత టెర్రరిస్టుగా అలోక్ పాండే ఇంకో ఎట్రాక్షన్.

          ఇక ఉత్తర ప్రదేశ్ లో దాక్కున్న టెర్రరిస్టు ప్రియురాలిగా, రష్యన్ డాన్సర్ గా నోరా ఫతేహీతో ఒక  ఐటెం పాట మాస్ కోసం. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో వుంది, సందేహం లేదు. నటింపజేసుకోవడంలో, దృశ్య చిత్రీకరణల్లో నిఖిల్ అద్వానీ ఉత్తమ అభిరుచిని కనబర్చాడు. 

చివరికేమిటి 
      చివర్లో కోర్టు దృశ్యాలు తప్పిస్తే,  త్రీయాక్ట్స్ లో వున్న స్క్రీన్ ప్లే మల్టీ డైమెన్షనల్ క్యారక్టర్ తో సూటి కథగా సాగుతుంది. తొలి ముప్పావుగంటలో బిగినింగ్ ని ముగించి, న్యాయ విచారణ డిమాండ్ కి హీరో అప్రమత్తమై, గోల్ తీసుకోవడం చూపిస్తారు.ఇక్కడ ప్రారంభమయ్యే కథ తప్పించుకున్న టెర్రరిస్టు ని పట్టుకుని ఎన్కౌంటర్ ని నిరూపించే ఒకేఒక్క సూటి గీత మీద పరిగెట్టుతుంది. ఈ వేట రెండు ఎపిసోడ్లుగా వుంటుంది. మొదటి ఎపిసోడ్ ఉత్తరప్రదేశ్ లో విఫలమయ్యాక, రెండో ఎపిసోడ్ నేపాల్ సరిహద్దులో విజయవంతమవుతుంది. నేపాల్ సరిహద్దులో పట్టుకోవడాన్ని వేరే కేసులోంచి తీసుకుని వాడుకున్నట్టున్నారు. ఇండియన్ ముజాహిదీన్ ముఖ్యుడు యాసీన్ భత్కల్ ని పట్టుకుంది నేపాల్ సరిహద్దులోనే. ఇలా భారీ కథకి హాలీవుడ్ టైపులో సింపుల్ లైను, ఇంతే. ఈ రెండు యాక్షన్ ఎపిసోడ్లు చాలా బర్నింగ్ గా, థ్రిల్లింగ్ గా, ఎమోషనల్ గా వుంటాయి. చివరికి పట్టుకున్న టెర్రరిస్టుని కోర్టులో నిలబెట్టడం మాత్రం మానవీయకోణం లేని అదే పాత వ్యవహారంలా వుంది.


-సికిందర్
Watched at PVR, Moosarambagh
7 pm, 18.8.19