రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, డిసెంబర్ 2019, బుధవారం

900 : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు


        మింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులకి సంబంధించి స్ట్రక్చర్ వ్యాసం సాంప్రదాయ దృశ్యం’ తర్వాత ఇప్పుడు ‘ఆధునిక దృశ్యం’ ఎలా వుంటుందో చూద్దాం. సాంప్రదాయ కథలు, ఆధునిక కథలు ... సాంప్రదాయ కథలు ఓల్డ్ స్కూల్ డ్రామాలుగా వుండొచ్చు గానీ, ఆధునిక కథలు రియలిస్టిక్ కథలుగా వుంటేనే యూత్ కి కనెక్ట్ అయ్యేది. సినిమా మార్కెట్ ప్రధానంగా యూత్ దే. ఈ యూత్ కాలేజీ, ఆ పైన జాబ్ మార్కెట్లోకి ప్రవేశించిన ఏజి గ్రూప్ యూతే తప్ప; హైస్కూల్, అంతకి తక్కువ టీన్ - ప్రీటీన్ పిల్లకాయలు కాదు. మేమిలాటి పిల్లకాయలుగా వున్నప్పుడే పైసలెత్తుకు పోయి శుభ్రంగా సినిమాలు చూసేసే వాళ్ళం - తెలుగు, హిందీ, ఇంగ్లీషు, అప్పుడప్పుడు అరవ సినిమాలూ వదిలిపెట్టకుండా. వారానికో రోజు స్కూలు పిల్లలకోసం కన్సెషన్ షోలు వేస్తే థియేటర్ నిండా పిల్లలే. అవి పిల్లల సినిమాలు కూడా కావు, ప్రదర్శించే రెగ్యులర్ సినిమాలే వారానికో రోజు స్కూలు పిల్లలకి. అలా అన్ని జానర్ల సినిమాలూ పిల్లకాయలప్పుడే అలవాటయ్యాయి. ఏ జానరూ కాని అజానరీయ అమర్యాదకర లపాకీ సినిమా లొచ్చినా అవీ అడ్డంగా ఆరగించడమే. అంత విశేష ‘జ్ఞాన సంపద’ సొంతమన్నమాట. సినిమాలు చూసి అట్ట ముక్కల కిరీటాలు పెట్టుకుని, కర్రల్ని కత్తులుగా చేసుకుని, గడ్డి మేటుల్లో ఫైటింగు దృశ్యాలు కూడా రక్తి కట్టించే వాళ్ళం. ఇంకా చెప్పాలంటే బజార్లలో ఫిలిం ముక్కలు అమ్మేవాళ్ళు. అట్ట పెట్టెలకి రంధ్రం చేసి, అందులో బల్బు పెట్టి, ఎదురుగా భూతద్దం పెట్టి, ఫిలిం ముక్కల్ని గోడల మీద ‘సినిమాలు’ గా బ్రైట్ గా ఫోకస్ చేసే టెక్నాలజీని కూడా వాడేశాం. ఎనిమిదో తరగతప్పుడే యాక్షన్ తో కూడిన ఏవో పిచ్చి పిచ్చి నాటకాలు రాయడం, బొమ్మల కథలు వేయడం వగైరా కార్యకలాపాలు అదనంగా నిర్వహించాం. ఎన్ని సినిమాలు చూసే వాళ్ళమో, అంత సాహిత్యమూ చదివే వాళ్ళం. ఈ పరిస్థితి మారింది. థియేటర్ల బుకింగ్స్ దగ్గర పిల్లలు కన్పించడం లేదు. పట్టణాల్లో, పల్లెటూళ్ళల్లో కూడా. వాళ్ళు వస్తే గిస్తే ఎప్పుడో పేరెంట్స్ తో తప్ప రావడం లేదు.  

       
కాబట్టి ఒకప్పటి లాగా ఏది పడితే అది, ఎలా బడితే అలా తీసి చూపించేందుకు ప్రేక్షక లోకంలో మాలాగా అమాయక - వెర్రి మాలోకం బాలలోకం లేదిప్పుడు. కాలేజీ ఈడు నుంచే ప్రేక్షక వర్గం ప్రారంభమవుతోంది. ఈ వయసుకి కాలీన స్పృహ వుంటుంది. గ్లోబల్ గా చూస్తున్న ఆధునికత, వాస్తవికత, వర్తమాన స్పృహలతో ఒక యూత్ అప్పీల్ ని డెవలప్ చేసుకుంటారు. ఈ వయసు నుంచీ ఇలా ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన కాలేజీ - జాబ్ మార్కెట్ యూత్ వరకే రెగ్యులర్ ప్రేక్షక లోకంగా లెక్కేసుకోవాలి. మళ్ళీ ఈ యువ ప్రేక్షకుల్లో యువకులే తప్ప యువతులు సినిమాలకి రాని పరిస్థితి కూడా వుంది. ఎప్పుడో ఎంతో టాక్ వస్తే తప్ప చిన్న హీరోల సినిమాలకి యువతులు వచ్చే పరిస్థితి లేదు. పిల్లలూ కట్, యువతులూ కట్. మిగిలింది కొత్త మీసాల మస్తీ యూతే. పెద్ద స్టార్ సినిమాలకి ఎలాగూ కుటుంబాలు సహా అందరూ తరలి వస్తారు. ఒకవేళ యువ ప్రేక్షకుల్లో యువతుల్నీ లెక్కేసుకున్నా ‘వెంకీ మామ’ లాంటి దాన్లో వెంకటేష్, నాగ చైత్యనలని యూత్ అప్పీల్ లేని ఓల్డ్ స్కూల్ డ్రామాతో చూపించలేరు. రియలిస్టిక్ గా రావాల్సిందే. పెద్ద హీరోల మూస సినిమాలకి టీఆర్పీరాక, యాడ్స్ కూడా తగ్గిపోతున్నాయని, అందుకని ఇకపైన భారీ మొత్తాలు వెచ్చించి వీటి శాటిలైట్ హక్కులు కొనేది లేదని చెప్పే స్థితికి ఛానెల్స్ కూడా వచ్చేశాయి. ఇక ప్రేమ సినిమాలే తీసినప్పుడు అవెంత యూత్ అప్పీల్ తో రియలిస్టిక్ గా వుండాలి? వర్తమాన కాలం ప్రతిబింబిస్తేనే యూత్ అప్పీల్. ఇక ఆధునిక ‘కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ తీస్తే ఇంకెంత రియలిస్టిక్ గా, వర్తమాన యూత్ జీవితం ప్రతిబింబిస్తూ వుండాలి?

విశాలి కథ
        కనుక కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ ఆధునిక దృశ్యం చూసినప్పుడు, ఇది కూడా త్రీయాక్ట్ స్ట్రక్చర్ లోనే వుంటుంది. కాకపోతే విషయం విధిగా ఈ కాలపు పోకడలకి సంబంధించి వుంటుంది. రిపీట్ - విషయం విధిగా ఈ కాలపు పోకడలకి సంబంధించే  వుంటుంది. మూస లవ్వు స్టోరీ తీసి కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే నవ్విపోతారు. ఆధునిక కమింగ్ ఆఫ్ ఏజ్ కి ఉదాహరణ -  విశాలి అనే టీనేజర్ వుందనుకుందాం, ఆమెకి పద్నాల్గేళ్ళు. స్కూల్లో పదో తరగతి చదువుకుంటోంది. చదువు తప్ప ఆమెకేమీ తెలీదు. ఆమె పుట్టిన రోజుకి పేరెంట్స్ ఒక లాప్ టాప్ కొనిచ్చారు. అప్పుడామె చాలా తెలుసుకోవడం మొదలెట్టింది. ఇక ఏదో స్వతంత్రం, ఏదో వ్యక్తిత్వం తనకొచ్చేసినట్టూ, తను ఎదిగిపోయినట్టూ ఫీలింగ్ వచ్చేసింది. అలా ఆన్ లైన్లో ఆమెకి విద్యుత్ పరిచయమయ్యాడు. వెంటనే కనెక్ట్ అయిపోయింది. చాలా ఆశ్చర్యమేసింది. తానింతవరకూ అబ్బాయిలవైపు చూడాలంటేనే, వాళ్లతో మాట్లాడాలంటేనే బిడియపడి దూరంగా వుండేది. అబ్బాయిలెవరూ తనకి స్నేహితులుగా లేరు. అలాటిది ఆన్ లైన్లో ఇంత చొరవ వచ్చేసింది. 


        విద్యుత్ తనకి పదహారేళ్ళని చాటింగ్ లో చెప్పాడు. విశాలికి ఉత్సాహమొచ్చింది. తోచిన కబుర్లాడింది. క్రమంగా చాటింగ్ నుంచి నేరుగా మొబైల్ మెసేజిలకి కమ్యూనికేషన్ మారింది. అప్పుడతను తనకి ఇరవై ఏళ్లని చెప్పాడు. ఏం ఫర్వాలేదనుకుంది. మళ్ళీ పాతికేళ్ళని మెసేజి కొట్టాడు. నో ప్రాబ్లమనుకుంది. ఒకబ్బాయితో ఇలా కమ్యూనికేట్ అవడమే గొప్పనుకుంది. అంతేకాదు, తనలో ఇంకేదో ఫీలింగ్స్ మొదలవడం గమనించింది. ఆ ఫీలింగ్స్ ప్రేమనుకుంది. 

        అలా రెండు నెలలు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ తో గడిపాక, కలుద్దామన్నాడు. మాల్ లో కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. విశాలి మాల్ కెళ్ళి అతడితో ముఖాముఖీ భేటీ కోసం వెయిట్ చేస్తోంది. అతనొచ్చాడు. చూసి షాకైంది. ముప్పై ఏళ్ళు పైనే వుంటాడు. అఫెండ్ అయింది. అతను అద్భుతంగా మాటాడి ఆమెని ఆకట్టుకుని హోటల్ గదికి తీసికెళ్ళాడు. ఆమె కోసం కొనితెచ్చిన డ్రెస్సూ, లోదుస్తులూ ఆమెకి తొడిగిస్తూ ఫోటోలు తీశాడు. ఆమెని కిస్ చేయబోతూంటే ఆగమంది. ఆగకుండా ఆమెని బెడ్ మీదికి లాగి  మీద పడ్డాడు...(ప్లాట్ పాయింట్ వన్)


       ఇప్పుడు వర్క్ షీట్ చూద్దాం : ఇది బిగినింగ్ విభాగపు కథనం. ఇందులో బిగినింగ్ విభాగపు ప్రత్యేక బిజినెస్ అంతా వుంది నాల్గు టూల్స్ తో. 1. కథానేపథ్యపు ఏర్పాటు : టీనేజర్ విశాలికి ఆ వయసులో అపరిచితుడితో రిలేషన్ షిప్ అనే తొందరపాటు నిర్ణయం తీసుకున్న అప్రియ వాతావరణం, 2. పాత్రల పరిచయం : స్కూల్లో చదువుతున్న విశాలితో బాటు, మధ్య తరగతికి చెందిన ఆమె తల్లిదండ్రులు, విద్యుత్ అనే ఇంకా వివరాలు తెలీని ఆగంతకుడులతో, ఈ బిగినింగ్ విభాగాన్ని నడిపేందుకు అవసరమైన పాత్రల పరిచయం, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన : అంతవరకూ అబ్బాయిలంటే బెరుకు వున్న విశాలికి, పేరెంట్స్ లాప్ టాప్ కొనివ్వడంతో అపరిచితుడితో ఉత్సాహపడి ప్రేమలో పడ్డం, అతను తడవకో వయసు చెబుతూ మభ్యపెడుతున్నా ఆంతర్యం గ్రహించక పోవడం, ఆన్ లైన్ వల్ల తానెంతో స్వతంత్రంగా ఎదిగిపోయినట్టు భావించుకుని, తల్లిదండ్రులనుంచి ప్రైవసీని మెయింటెయిన్ చేయడం, అతను కలుద్దామంటే గుడ్డిగా వెళ్లి కలుసుకోవడం, తన కంటే చాలా పెద్దవాడైన అతణ్ణి చూసి షాకవడం, అతడి తియ్యటి మాటలకి పడిపోయి హోటల్ కెళ్ళి పోవడం, 4. సమస్య ఏర్పాటు (ప్లాట్ పాయింట్ -1) : అతడి మీద ప్రేమ పెరిగిపోయి హోటల్ గది కెళ్ళి పోయిన ఆమె, తన దుస్తులు మారుస్తున్నా, తనని ఫోటోలు తీస్తున్నా, అప్రమత్తం కాక అతడి కుట్రకి బలై పోవడం. 

         
కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ మూవీ లక్షణాల ప్రకారం, ఇందులో విశాలి పాత్ర పరిచయ ప్రక్రియలో, జీవితం పట్ల ఆమె అస్థిర టీనేజీ మనస్తత్వ చిత్రణ ఈ బిగినింగ్ విభాగంలో జరగాలి. జానర్ మర్యాదలననుసారం పాత్ర మానసికంగా అస్తిరత్వం లోంచి స్థిరత్వం లోకి చేసే టీనేజీ కథా ప్రయాణానికి బీజాలు ఈ బిగినింగ్ విభాగంలోనే పడతాయి. ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? ఉన్నదాన్లోంచి స్వేచ్ఛ కోరుకోవడంతో వస్తుంది. అస్థిరత్వానికి మూలం స్వేచ్ఛా కాంక్ష. స్వేచ్ఛా కాంక్ష ఎందుకు రగుల్కొంటుంది? వయసొచ్చింది కాబట్టి ఉన్నట్టుండి అవసరాలు పెరిగిపోయాయని భావించుకోవడం వల్ల. ఇదంతా విశాలి పాత్ర పరిచయంలో జరిగాయి. 

        ఇప్పుడు సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన మొదలు పెడుతున్నప్పుడు, పైన స్థాపించిన మానసిక స్థితితో ముందుకెళ్లాలి. ముందు కెళ్ళి నప్పుడు మానసిక ప్రపంచానికి భౌతిక ప్రపంచం చెక్ పెడుతూండాలి. ఎందుకు చెక్ పెట్టాలి? అజ్ఞానాన్ని, అపరిపక్వతని భౌతిక ప్రపంచం తిరస్కరిస్తుంది కాబట్టి. ఇంటర్వూలో వంకర సమాధానాలు చెప్తే లేచెళ్లి పొమ్మంటాడు ఆఫీసర్. మానసిక ప్రపంచం స్పిరిచ్యువల్, భౌతిక ప్రపంచం మెటీరియల్. మెటీరియల్ గా ఏదైనా ఉనికిలోకి రావాలంటే ఆలోచన నిర్దుష్టంగా వుండాలి. 

        కనుక విశాలితో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన పై చట్రంలో జరగాలి. జరిగింది కూడా. తను లోపల అనుకుంటున్న దానికీ బయట జరుగుతున్న దానికీ పొంతన లేదు. లోపల ప్రేమ అనుకుంటోంది, బయట కుట్ర జరుగుతోంది. ఒక్కో అడుగూ కుట్ర కేసే వేస్తోంది. మొదటి సారిగా అతణ్ణి చూసినప్పుడు, అతడి అసలు వయసు ముప్పై అని తెలిసినప్పుడు, భౌతిక ప్రపంచం అర్ధమై, ఆ భౌతిక ప్రపంచం తిరస్కరించడం మొదలెట్టింది వయోభేదం రూపంలో. అస్థిర మనస్తత్వ పరిణామం. ఉత్తుత్తి జీవిత లక్ష్యపు  ప్రమాదం. ఆ వయసులో ఆమెది ప్రేమే అయితే ఇలా చెయ్యదు. ఆ వయసులో వుండేది ఆకర్షణే కాబట్టి ఇలా చేసేసుకుంటూ వెళ్లి పోయింది. ఆకర్షణని ప్రేమనుకుంది. భౌతిక ప్రపంచం తిరస్కరించినా ఆ ఆకర్షణ వికర్షణగా మారకుండా అపరిపక్వ ప్రేమే అడ్డుపడింది. అందుకని అతడి వల్లో పూర్తిగా పడిపోయింది. ఇలా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన కొలిక్కిచ్చి,  కన్యాత్వాన్ని పోగొట్టుకోవడంతో సమస్య ఏర్పాటయింది ప్లాట్ పాయింట్ వన్ లో. 

           ఇలా సమస్య కూడా ఏర్పాటయ్యాక, తర్వాత వచ్చే టూల్ ‘గోల్’ ఏర్పాటు గురించి. ఇప్పుడు విశాలి గోల్ ఏమిటి? ఇది మానభంగం అనుకునే వయసు కాదు, అతడి ప్రేమే అనుకునే వయసు. అందుకని ఈ ‘ప్రేమ’ ని కొనసాగించడమే ఆమె గోల్. 

        ఎప్పుడైనా కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్లో పాత్ర గోల్ మూర్ఖంగానే వుంటుంది. ఆ వయసులో జీవితమంటే ఏమిటో తెలీదు కాబట్టి. ఇలాటి సాంప్రదాయ కథలో కూడా హీరో గోల్ మూర్ఖంగానే వున్నట్టు గత వ్యాసంలో గమనించాం. పొరపాటున కూడా పాజిటివ్ గోల్ ఇవ్వకూడదు. అస్థిరత్వం లోంచి స్థిరత్వం వైపుకి అపరిపక్వ పాత్ర ప్రయాణం కాబట్టి.

        మరి ఈ బలహీన గోల్ కాని గోల్ ఎలిమెంట్స్ ఏమిటి? 1. కోరిక : విశాలి కోరిక ఇక పెళ్లి చేసుకుంటాడనే కావొచ్చు. 2. పణం : కన్యాత్వాన్ని పణంగా పెట్టేసింది, అది రమ్మన్నా తిరిగిరాదు, ఎట్టి పరిస్థితిలో అతడితో పెళ్లి జరగాల్సిందే. 3. పరిణామాల హెచ్చరిక : ప్రెగ్నెన్సీ ప్రమాదం పొంచి వుంది. 4. ఎమోషన్ : ఒకవైపు కన్యాత్వాన్ని పోగొట్టుకుని, ఇంకోవైపు పెళ్లవుతుందో లేదోనన్న సందిగ్ధావస్థ. దీన్నెలా హేండిల్ చేస్తుందో తెలీదు. పైగా పద్నాల్గేళ్ళకే పెళ్ళేమిటి? రెండింతల పైగా వయసున్న వాడితో? 

        ఇలా బిగినింగ్ బిజినెస్ లో నాల్గు టూల్స్ ని, నాల్గు గోల్ ఎలిమెంట్స్ నీ  సెట్ చేసుకున్నాక ముందు మిడిల్ కథేమిటో చూద్దాం...

సికిందర్

16, డిసెంబర్ 2019, సోమవారం


                                                            వివరణ
        ఈ బ్లాగు సినిమా విశ్లేషణల కోసమేనా, లేక స్క్రిప్టుల బాగోగులకి సంబంధించి సలహా సంప్రదింపులకి ఏమైనా అవకాశాలున్నాయా అని వస్తున్న సందేహాల నివృత్తికి ఈ వివరణ. బ్లాగులో సినిమా సంబంధమైన విశ్లేషణలు, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాలు రావడంతో బాటు, స్క్రిప్టు కన్సల్టెన్సీ కూడా ఎప్పట్నుంచో నడుస్తోంది. కాకపోతే బ్లాగులో బహిరంగంగా ప్రకటించలేదు. తమ స్క్రిప్టులకి సంబంధించి ఎలాటి సందేహాలకైనా, పరిష్కారాలకైనా కింద ఇచ్చిన నెంబరు, లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
సికిందర్
9247347511
msikander35@gmail.com  

14, డిసెంబర్ 2019, శనివారం

899 :రివ్యూ పాయింట్



        తెలుగు సినిమాలు ఇంకా అవే బిగినింగ్ ఆర్భాటాలుగానే నిర్మాణ మవుతున్నాయి. ఆర్భాటంగా బిగినింగ్ తప్ప ఆ తర్వాత ఏమీ వుండని అదే పాత పరిస్థితి / తప్పు ఇంకా  కొనసాగుతోంది. స్క్రీన్ ప్లే పరిభాషలో తెలుగు సినిమాలంటే కేవలం బిగినింగే అన్నట్టు తయారయ్యింది. బిగినింగ్ తర్వాత వుండాల్సిన మిడిల్ మాయమైపోయింది. ఆ బిగినింగ్ కూడా ఇంటర్వెల్ దాకా సాగదీసి వుంటుంది- ఆ తర్వాత మిడిల్ తో నడవాల్సిన సెకండాఫ్ డొల్లేనని ఇక సగటు ప్రేక్షకులకి కూడా అర్ధమైపోతోంది. ఇదిప్పుడు రాంగోపాల్ వర్మ, వెంకటేష్ ల సినిమాలకి కూడా ఎగబ్రాకింది. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, వెంకీ మామా ఈవారం తాజాగా ఈ లిస్టులో చేరికలు. ఈ లిస్టు గత పదిహేనేళ్ళుగా వుంది. పదిహేనేళ్ళ క్రితమే ‘ఇంటర్వెల్ అనే చౌరాస్తా నుంచి ఎటు వైపు?’ అని ‘ఆంధ్రభూమి’ లో రాశాం. ఇలా రాసేవాళ్ళకీ, సినిమాలు తీసే వాళ్ళకీ ఒక గ్యాప్ ఎందుకనో వుంటుంది. తీసే వాళ్ళకి పత్రికల విశ్లేషణలు పట్టవు. పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. సినిమాలు ఫ్లాపయ్యాక కూడా అవే తప్పులతో మరిన్ని ఫ్లాపులు అలాగే తీస్తూ పోతారు. లిస్టు పెంచేస్తూంటారు. దీంతో నిర్మాతలు బలి. అటు చెన్నైలో తమిళ నిర్మాతలకి ఇప్పుడిప్పుడే స్పృహ వస్తోంది. స్క్రీన్ ప్లే నాలెడ్జి తమకి కూడా అవసరమన్న అవగాహనకొస్తున్నారు. దర్శకుడెవరైనా, రైటరెవరైనా లెక్కలోకి తీసుకోకుండా, స్వయంగా నిర్మాతలు స్టోరీ డిపార్ట్ మెంట్స్ పెట్టుకుని వాళ్ళ స్క్రిప్టుల్ని కఠిన పరీక్షలకి గురిచేస్తున్నారు (దీనిపై వ్యాసం ఈ వారం చూద్దాం). 

       
లా ఎంత కాలం? పది కోట్లు పెట్టినా సెకండాఫ్ లేని సగం సినిమాయే చేతికొస్తున్నాక ఇక సెకండాఫ్ తీయడం దేనికి? ఇలాగే గంటన్నర ఇంటర్వెల్ దాకానే పెట్టేసుకుని, ఆ గంటన్నర పాటు టెంప్లెట్ ప్రేమలు, కామెడీలు, ఓ మూడు టెంప్లెట్ పాటలూ, ఫైట్లూ పెట్టుకుని, ఇంటర్వెల్ రాగానే కథ ప్రారంభించడానికి ఓ టెంప్లెట్ విలన్ని ఎంటర్ చేసి - ప్రేక్షకులారా ఇంతవరకే మాకు చాతనయింది, ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ కథ మీరే వూహించుకోండి, వెళ్ళిపోండి - అని శుభం వేసేస్తే సరిపోతుందిగా?  

        రెండూ సెకండాఫ్ సిండ్రోములే. అమ్మరాజ్యం ఫస్టాఫ్ లో ఎన్నికల్లో వెలుగు దేశం బాబు ఓడిపోయి, ఆర్సీపీ జగన్నాథ రెడ్డి అధికారంలోకి వస్తాడు. బాబు ఓర్వలేకపోతాడు. ఎలాగైనా జగన్నాథ రెడ్డికి అప్రతిష్ట తేచ్చి గద్దెదింపాలని బాబు, అతడి కుమారుడు చినబాబూ అనుకుంటారు. ఇంతలో తన పార్టీలో ముఖ్యుడైన దయనేని రమ హత్య జరిగిపోతుంది. దీంతో సీఎం జగన్నాథ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేసే పరిస్థితి వస్తుంది. దయనేని రమని ఎవరు చంపారు ఏమిటనేది సెకండాఫ్ కథ.

        షరా మామూలుగా ఇంటర్వెల్లోనే కథ ప్రారంభం కావాలి కాబట్టి, ఆ హత్యవరకూ ఫస్టాఫ్ స్పేస్ ఫిల్లర్ క్యారక్టర్స్ ఏవేవో వచ్చేస్తాయి. ప్రణయ్ కళ్యాణ్, పిపి జాన్ ల కామెడీలు, చినబాబు మీద సెటైర్లు నిండిపోతాయి. హత్య తర్వాత సెకండాఫ్ లో ఇవే అర్ధంలేని సెటైర్లు, కామెడీలు. అసలు కథ హత్య జరిగిన నేపథ్యంలో జగన్నాథ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకి వెళ్ళడం, ఎన్నికల్లో గెలవడం, ఇంతే. సెకండాఫ్ లో ఏదేదో కామెడీలతో కథ జోలికే పోలేదు. 

        విడుదలకి ముందు ఈ కథలో పాయింటు విన్నప్పుడు వైరల్ అయ్యే మార్కెట్ యాస్పెక్ట్ తో వుందన్పించింది. తీరా చూస్తే వీగిపోయింది. జగన్నాథ రెడ్డిని దించడానికి దయనేని రమని చంపే ప్లానుతో రమకి కంగారు పుట్టించడం పాయింటు అని తెలిసినప్పుడు - ఇదేదో బాగానే వుందనిపించింది. మనుగడలో వుండే పాయింటు. రమని చంపేస్తే అక్కడితో ఈ పాయింటు అంతమైపోతుంది, ఇక కథేమీ వుండదు, ఎవరు చంపారన్న పనికిరాని సస్పెన్సు తప్ప. కానీ సినిమాలో ఇదే జరిగింది. రమని చంపేశారు, కథనీ చంపేశారు, సెకండాఫ్ నీ  చంపేశారు, మొత్తం సినిమానే చంపేశారు.


        ఈ కథ ప్రకారం బాబు, చినబాబులు విలన్లు అనుకుంటే, జగన్నాథరెడ్డి హీరో. ఈ హీరోని రమని చంపడం ద్వారా ఇరికించాలని విలన్ల ప్లాను లేదా కథకి పాయింటు. అప్పుడు ఆత్మ రక్షణలో పడ్డ హీరో రమని చంపకుండా చూడడం, ఆ తాలూకు స్ట్రగుల్ చేయడం మనుగడలో వుండే పాయింటు. చంపాలని విలన్లు, ఆపాలని హీరో. ఇప్పుడేం జరుగుతుందన్నది మిగతా పొలిటికల్ థ్రిల్లర్.
There is no terror in the bang, only in the anticipation of it ―Alfred Hitchcock కొటేషన్ కి మించిన దిక్సూచి లేనే లేదు. ఇంటర్వెల్ అనే చౌరాస్తాలో కన్పించే గైడ్ పోస్ట్. కానీ ఇంటర్వెల్లోనే రమని హరీ మన్పిస్తే సినిమా హరిలో రంగ హరీ, వర్మగారి పని సరి!

        ఈ మధ్య విఫలమవుతున్న రాజకీయ సినిమాలు చూస్తూంటే ఒక్కటే గుర్తుకొస్తూంటుంది - కోడి రామకృష్ణ ‘భారత్ బంద్’.దీన్ని గైడ్ లా పెట్టుకుని ఎన్ని రాజకీయ సినిమా లైనా విజయవంతంగా తీయవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి.

        ఇక వెంకీమామ కూడా ఇంటర్వెల్లో ప్లేటు ఫిరాయింపే. ఆ ప్లేటు కాశ్మీర్ లో సర్జికల్ స్ట్ర యిక్ అంటూ ఎగిరే పళ్ళంలా వెళ్లి ఎక్కడో పడింది. వూళ్ళో వెంకీ, కార్తీక్ మేనమామ. కార్తీక్ జాతక రీత్యా వెంకీకి ప్రాణగండం. ఇద్దరూ కలిసి వుండే కామెడీలు చేసుకుంటారు ఫస్టాఫ్ లో. వెన్నెలని వెంకీతో కలపాలని కార్తీక్ కామెడీ, హారికని కార్తీక్ తో కలపాలని వెంకీ కామెడీ. ఇంతలో కార్తీక్ కన్పించకుండా పోతాడు. ఎందుకు పోయాడు? తనవల్ల మేనమామ వెంకీకి ప్రాణ గండం వుంది గనుక. ఎక్కడికి పోయాడు? సైన్యంలో కలిసిపోయాడు. వెంకీ ఏం చేశాడు? వెతుక్కుంటూ పోయాడు. అప్పుడు ఇద్దరూ కలిసి ఏం చేశారు? సర్జికల్ స్ట్రయిక్ ని వీలైనంత అపహాస్యం చేసి సెకండాఫ్ ని అర్ధంలేని మిడిల్ గా చేశారు. 


        పాయింటేమిటి? కార్తీక్ కి తనవల్ల మేనమామకి జాతకరీత్యా ప్రాణగండం. ఇక్కడ మెయిన్ క్యారక్టర్ ఎవరు? కార్తీకే. ఒక పాత్రకి దానివల్ల ఇతరులకి ప్రాణగండముంటే ఆ కథ ఎవరిదవుతుంది? ఆ పాత్రదే అవుతుంది. ఎలా? ఇక్కడ తన వల్ల మేనమామకి ప్రాణ గండాన్ని నివారించే, వీలయితే తన ప్రాణాల్నే ఇచ్చే పాత్ర తనే గనుక. ఈ గోల్ తో, దీని తాలూకు సంఘర్షణతో, పరిష్కారాన్ని తనే కనుక్కోవాలి గనుక. కనుక్కున్నా కనుక్కోలేకపోయినా స్ట్రగుల్ తనదే, కథ తనదే. తన జాతకం వల్ల పుట్టిన తన కథ. కనుక్కుంటే డూయర్ పాత్ర, కనుక్కోలేకపోతే, మేనమామే కనుక్కుంటే బీయర్ పాత్ర. ఈ ఓటమి ఫర్వాలేదు, మేనమామ ముందు ఓటమి ఫర్వాలేదు. ఎదుటి పాత్రయిన మేనమామ విలన్ పాత్ర కాదు, తను పాసివ్ క్యారక్టర్ అవడానికి.   
       
       కానీ వెంకీ, కార్తీక్ పాత్రలు సినిమాలో రివర్స్ అయ్యాయి. వెంకీ ప్రధాన పాత్ర అయిపోయాడు, జాతక సమస్య వున్న కార్తీక్ ప్రాధాన్యంలేని సహాయ పాత్రయి పోయాడు! కథతో ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా వుంటుందా? ఈ కథకి చాలా మందే రచయితలున్నట్టు వినికిడి. 

         ఈ కథకి మోరల్ ప్రేమీజ్ ని నిర్ధారించుకుని దాని ప్రకారం కథ చేసుకోలేకపోయారు. మామా అల్లుళ్ళ మధ్య జాతక రీత్యా ఏర్పడ్డ సమస్యకి కొనసాగింపు కథ స్వాభావికంగా ‘త్యాగం’ అనే మోరల్ ప్రేమీజ్ (నైతిక ఆవరణ) లోకి దానికదే వచ్చేస్తుంది. సన్నిహితంగా వుండే వివిధ పాత్రల మధ్య త్యాగాల కథలతో సినిమాలెన్నో వచ్చాయిగా? వాటి లోంచే ఈ కథ తీసుకుని పాయింటుని విరిచి విన్యాసాలు చేస్తే కొత్త కథయి పోతుందా? త్యాగమనే విలువ యూనివర్సల్ నీతి. దీన్ని విరిస్తే, లేదా దీన్నుంచి పలాయనం చిత్తగిస్తే ఇంతే సంగతులు చిత్తగించవలెను.

సికిందర్


        

11, డిసెంబర్ 2019, బుధవారం

898 : రైటర్స్ కార్నర్


       రాయడానికి రైటర్స్ కెన్నో పాట్లూ, అలవాట్లు. కథ మొదలు పెట్టడానికో ప్రేరణ, మొదలెట్టిన కథ రాస్తూ పోవడానికి మూడ్, వీటికోసం రకరకాల పద్ధతులు. విజయేంద్ర ప్రసాద్ కథ మొదలెట్టే ముందు ‘షోలే’ విధిగా చూస్తారు. పూరీ జగన్నాథ్ కథ రాయడానికి బ్యాంకాక్ దాకా వెళతారు. చెళియన్ రాయాలనుకున్నప్పుడు రాసేస్తారు...మరి అటు కొత్తగా వస్తున్న హిందీ రైటర్స్ అలవాట్లేమిటి? వాళ్ళెలా రాస్తారు? ఇది చూద్దాం. పోతే, రాయలేక పోవడానికి వంకలు చెప్పే వాళ్ళుంటారు. అవి చాలా వరకూ ఇంటి పనులతో వుంటాయి. ఆర్ధిక సమస్యలతో వుంటాయి. ఇలాటి వాళ్ళు నెట్వర్కింగ్ చేస్తూ తిరగనక్కర్లేదు. ఇతరుల సమయమూ శ్రమా వృధా. సినిమాల్లో అన్నిటినీ బ్యాలెన్సు చేయలేమనీ, సినిమాల్లోకి రావాలనుకుంటే అన్నీ వదిలేసి రావాలనీ అంటాడు సెల్వ రాఘవన్. కరుణానిధి తీరికలేని రాజకీయాల్లో వుంటూ కూడా సమయం తీసి 64 సినిమాలకి ఎలా రాశారో ఆలోచించాలి. నిజమైన రచయిత రాయడానికి కండిషన్స్ అప్లయి చేసుకోడు, బేషరతుగా వుంటాడు మిన్ను విరిగి మీద పడ్డా. ఇక విషయాని కొద్దాం...
        
        ఇంటి పనులు పూర్తి చేసుకుంటాడు. డ్రెస్సప్ అవుతాడు. పెర్ఫ్యూమ్ కొట్టుకుంటాడు. షూస్ వేసుకుంటాడు. బ్యాగు తీసుకుంటాడు. ఇంట్లోనే ఇంకో గదిలోకి వెళ్లి అఫీషియల్ గా కూర్చుని రాయడం మొదలెడతాడు. ఇతను శరత్ కటారియా (దమ్ లగాకే హైస్సా, తిత్లీ).
       యోగా కోసం పక్కన చాప పర్చుకుని కూర్చుంటాడు. బుర్ర కదలనప్పుడు యోగాసనాలు వేస్తాడు. యోగాతో కండరాలు షేపులో కొస్తాయి. థింకింగ్ బావుంటుంది. శవాసనం వేసినప్పుడు సబ్ కాన్షస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. ఇలా లేస్తూ కూర్చుంటూ రాస్తాడు. ఇంకో రచయితతో కలిసి రాయాల్సి వస్తే అతను కూర్చుని రాస్తాడు, తను ఆసనా లేస్తాడు. గదిలోనే కాదు, పార్కులో రాసినా ఇదే పధ్ధతి. ఇతను దేవాశీష్ మఖీజా (అజ్జి, భోంస్లే).
         కొత్త పెన్ను, నోట్ బుక్కు కొనుక్కుంటాడు. తేదీ వేస్తాడు, రాస్తాడు. అలా వదిలేస్తాడు. మళ్ళీ ఎప్పుడో తీసి చూస్తాడు. రాసిన తేదీని, తీసి చూస్తున్న తేదీనీ చూసుకుని ఎన్ని రోజులు గడిచిపోయాయో లెక్కేసుకుంటాడు. గిల్టీ ఫీలై గట్టిగా రాయడానికి ప్రయత్నిస్తాడు. మళ్ళీ తేదీ వేసే రాస్తాడు. మళ్ళీ వచ్చి తేదీ చూసుకుంటాడు. మెమెంటో, ఇన్సెప్షన్ ల టైపులో ఇలా ముందుకీ వెనక్కీ పోతూ రాస్తూంటాడు. రాయడం మీద సరీగ్గా శ్రద్ధ పెట్టడం లేదన్నగిల్టీ ఫీలింగ్ మాత్రం వదలదు. ఇతను వాసన్ బాలా (మర్ద్ కో దర్ద్ నహీ హోతా, రామన్ రాఘవ్ 2.0).
        ఓల్డ్ లక్నోలో, ఢిల్లీ లోని చాందినీ చౌక్ లో ప్రత్యేకమైన అత్తరు కొంటాడు. కొన్ని మూడ్స్ క్రియేట్ చేసుకోవడానికి అత్తరు వాడతాడు. ‘తుంబడ్’ కి టైటిల్ సాంగ్ రాసినప్పుడు అత్తరు సువాసనే బాగా పనిచేసింది. ఆ పాట కష్టమైన పాట. దాని శబ్ద సంక్షిప్తీకరణ కష్ట సాధ్యమైనది. విసుగేసింది. అలాంటప్పుడు ఈ అత్తరు బాగా పనిచేసింది పాట రాయడానికి. ఎండా కాలం తర్వాత తొలివాన కురిసినప్పుడు వెలువడే మట్టి వాసన లాంటి పరిమళం వెదజల్లే అత్తరు అది. దాని పేరు గిల్. అలా ఆ పాట వింటే వాన కురుస్తున్న ఫీలింగే వుంటుంది. ఒక్కోసారి పాట కుదరక పోతే బస్సెక్కి తిరుగుతాడు. మధ్యలో దిగిపోయి ఆటో లెక్కుతాడు. ఇతను గీత రచయిత రాజ శేఖర్ (తుంబడ్, తనూ  వెడ్స్ మనూ).
      కర్పూరం వెలిగిస్తుంది. టైము తెలియకుండా కర్టెన్స్ వేసేస్తుంది. ఇంకేదీ దృష్టి మళ్లించకుండా చూసుకుని, గంటలు గంటలు రాస్తూనే వుంటుంది. ఈమె జుహీ చతుర్వేది (విక్కీ డానర్, పీకూ).
    కథ రాస్తాడు. రాస్తున్నప్పుడు బ్రేక్ తీసుకుని ‘ఎటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్ మైండ్’ స్క్రీన్ ప్లే చదువుతూంటాడు. అన్నం వండుకు తింటాడు. వాకింగ్ కెళ్తాడు. ప్రేమ సన్నివేశాలు రాస్తున్నప్పుడు స్వీట్లు, ఐస్ క్రీములు బాగా తింటాడు. ఇతను వరుణ్ గ్రోవర్ (మసాన్, శాక్రేడ్ గేమ్స్).
            ఒక సీను రాస్తాడు. అది క్లోజ్ ఫ్రెండ్స్ కి విన్పిస్తాడు. తమ్ముడికీ చెల్లెలికి కూడా విన్పిస్తాడు. ‘షూట్ ఎట్ వడాలా’ లో అనిల్ కపూర్, సోనూ సూద్ తో అనే డైలాగొకటుంది – ‘పోలీస్ తూటాలో ఎంత ఐరన్ వుంటుందంటే, ఇది పెట్టి పేల్చానంటే జీవితాంతం నీకు రక్తంలో ఐరన్ లోపం రాదు’ - అని. రక్తం ఉడుకెత్తిపోయే డైలాగు. క్లోజ్ ఫ్రెండ్స్ కిది నచ్చ లేదు, చెల్లెలు బాగా లైక్ చేసింది. దీంతో ముందుకెళ్ళి పోయాడు.  ఈ డైలాగుతో ప్రోమో ఎంత హిట్టయ్యిందంటే అంత హిట్టయ్యింది. ఇతను మిలాప్ జవేరీ (మస్తీ, హౌస్ ఫుల్).
      ఇంట్లో రాస్తాడు, లేకపోతే ఆఫీసులో రాస్తాడు. ఒక్కటే నిబంధన. రాస్తున్నంత సేపూ షాషంక్ రిడెంప్షన్, కాసాబ్లాంకా, ఫారెస్ట్ గంప్, త్రిశూల్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, వేకప్ సిడ్, రంగ్ దే బసంతీ, బ్యాండ్ బాజా బారాత్ లతో బాటు, తను రాసిన హంప్టీ శర్మా కీ దుల్హనియా ప్లే అవుతూ వుండాల్సిందే. ఇంట్లోనైతే ఆన్ లైన్లో వుంటే బ్లూరేలో, లేదా డీవీడీలో ప్లే అవ్వాలి. ఆఫీసులోనైతే సెకండ్ లాప్ టాప్ లో, లేదా ఫోన్లో ప్లే అవ్వాలి. ఒకవేళ అవి చూడకపోయినా స్విచ్చాన్ చేసే పెడతాడు. ఆడియో వింటూ రాసుకుంటాడు. ఇతను శశాంక్ ఖైతాన్ (హంప్టీ శర్మా కీ దుల్హనియా, బద్రీనాథ్ కీ దుల్హనియా).
        రోజంతా రాయాల్సి వస్తే కేఫ్ కెళ్తుంది. ఇంట్లో అస్సలు రాయ బుద్ధిగాదు. రాయాలంటే కాఫీలు తాగడం అవసరం. ముంబాయి సహా గ్లోబల్ గా కాఫీ షాప్స్ లోనే కూర్చుని రాసింది. ఏ కేఫ్ పడితే ఆ కేఫ్ కెళ్ళదు. కేఫ్ ని జాగ్రత్తగా సెలెక్టు చేసుకుంటుంది. బిగ్ కెఫేలు నచ్చవు. కేఫే కాఫీ డే, స్టార్ బాక్స్ లాంటి బిగ్ చైన్స్ కెళ్ళదు. ఒక ఛార్మ్ తో, ఒక మూడ్ తో, హోమ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేసే క్యారక్టరున్న కేఫ్స్ ని సెలెక్టు చేసుకుంటుంది. ముంబాయిలోనైతే బాంద్రా లోని ది బగెల్ షాప్ లో కూర్చుని చాలా రాసింది. అలాగే వెర్సోవాలోని విండోస్ లో. ఢిల్లీ వెళ్తే ఖాన్ మార్కెట్లోని లాటిట్యూడ్ లో. 8 నుంచి 10 గంటలు అలా కూర్చుని రాస్తూనే వుంటుంది. ఈవిడ అలంకృతా శ్రీవాస్తవ్ (లిప్ స్టిక్ అండర్ మై బురఖా, మేడిన్ హెవెన్).
       మ్యూజిక్ వింటూ రాసుకుపోతాడు. రాస్తున్నప్పుడు ఆ సీనుకో ఫీల్ కోసం పాటల్ని అన్వేషిస్తాడు. పాట దొరికితే దాన్ని పదే పదే ప్లే చేస్తూ సీను రాస్తాడు. ఆ పాటలో వుండే ఫీల్ ఆ పాట జోన్లోకి తీసికెళ్ళి పోతుంది. ఆ జోన్లో వుండిపోయి రాస్తాడు. యోయోమా రాసిన ‘బాచ్ సూట్’ సాంగ్ ఒక తండ్రీ కొడుకుల సీను రాయడానికి బాగా తోడ్పడింది. ఎసి/డిసి రాసిన ‘యూ షుక్ మీ ఆల్ నైట్ లాంగ్’ పాట ఫీల్ తో ఓ ఛేజింగ్ సీనే  రాసేశాడు. ‘తఖ్త్’ క్లయిమాక్స్ సీను కార్మినా బురానా పాట ఫీల్ అనుభవించి రాసేశాడు. ఈ పాటల ఫీల్ రైటర్ సుమిత్ రాయ్ (తఖ్త్, జుబాన్).
          ఇక రోజూ రాయాలని డిసైడ్ అయిపోయాడు. అందుకు ట్విట్టర్ థ్రెడ్ ని ప్రారంభించాడు. రోజు వారీ పనుల మధ్య ఒక టార్గెట్ పెట్టుకుని అన్ని పేజీలు, అన్ని గంటలు టైపింగ్ చేసేస్తాడు. సబ్జెక్టుపై మేధోమథనంగానీ రీసెర్చి గానీ అప్పుడే చెయ్యడు. ఆ రోజు టార్గెట్ పూర్తయ్యాక ట్విట్టర్ థ్రెడ్ కి ఎటాచ్ చేసేస్తాడు. అనారోగ్యం వచ్చినా, వేడుకలున్నా, ప్రయాణాలున్నా, ఇంటి పనులున్నా పనాపకుండా పూర్తి చేస్తాడు. ఇతను షార్ట్ ఫిలిం మేకర్ సత్యాంశూ సింగ్ (తమాష్, చింటూ కా బర్త్ డే).
***
        చూశారా బాలీవుడ్ కొత్త రైటర్ల పని విధానం. ఒరిజినాలిటీని సృష్టించే ప్రయత్నం. మనమైతే ఇతర సినిమాల్లోంచి కథలూ సీన్లూ షాట్లూ, షార్ట్ ఫిల్ముల్లోంచి డైలాగులు కూడా సంగ్రహించి సినిమాలు సింగారిచే కట్ అండ్ పేస్ట్ టెక్నాలజీని వాడుతున్నాం. దాన్నే రైటింగ్, స్క్రిప్టు, సినిమా అని సంతోష పడుతున్నాం. ఎవరైనా మనల్ని చూసి నవ్వుకుంటే మనమూ నవ్వేసుకుని ఓ మందార మాలేసుకుని మస్తుగా జీవిస్తున్నాం. సినిమాలు కాదుగా తీసేది, నిర్మాతల జేబుల్లోంచి అందినన్ని కాసులు!
        
సికిందర్ 

10, డిసెంబర్ 2019, మంగళవారం

897 :


        (ఆదివారపు ‘మూవీ నోట్స్’ మంగళవారపు దర్శనం) 
        రియాన్ జాన్సన్ 2005 లో తన తొలి మూవీగా ‘బ్రిక్’ అనే ప్రప్రథమ టీనేజి నోయర్ మూవీ తీసి వార్తలకెక్కాడు. 1930 లలో డెషెల్ హెమెట్, జేమ్స్ ఎం కెయిన్ లు రాసిన హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలలతో స్ఫూర్తి పొంది, ‘ఫిలిం నోయర్’ అనే జానర్ సినిమాలు అభివృద్ధి చెందాయి. స్టార్లు, సూపర్ స్టార్లు వీటిలో నటించే వాళ్ళు. '60 లలో కలర్ సినిమాలతో ఈ జానర్ పేరు ‘నియో నోయర్’ గా మార్చారు. వీటిలో కూడా స్టార్లు, సూపర్ స్టార్లు నటించారు. 2005 లో రియాన్ జాన్సన్ వచ్చేసి, ఇదే ఒకప్పటి హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలా సాహిత్యాన్ని టీనేజి పాత్రలకి అన్వయించి, ‘బ్రిక్’ అనే మర్డర్ కథ తీసి- ‘టీనేజీ నోయర్’ అనే కొత్త జానర్ కి అంకురార్పణ చేశాడు (‘బ్రిక్’ విశ్లేషణ ఈ బ్లాగులోనే గతంలో చేస్తూ పాఠకాదరణ లేక మధ్యలో ఆపేశాం). ఆ తర్వాత లూపర్స్, స్టార్ వార్స్ - ది లాస్ట్ జేడీ తీసింతర్వాత, ఇప్పుడు తాజాగా ‘నైవ్స్ ఔట్’ తో వచ్చాడు.

         డిటెక్టివ్ పాత్రలో జేమ్స్ బాండ్ నటుడు డేనియల్ క్రేగ్ సహా అనేకమంది స్టార్స్ తో వైభవోపేతంగా తీశాడు. దీనికి స్ఫూర్తి ఆ నాటి అగథా క్రిస్టీ రాసిన మర్డర్ మిస్టరీలే. అగథా క్రిస్టీ శైలిలోనే తీశాడు. ఇదిప్పుడు హైదరాబాద్ లో హౌస్ ఫుల్స్ తో ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా దీని కళాత్మకత ప్రశంస లందుకుంటోంది. ఈ మర్డర్ మిస్టరీని హాస్య భరితంగా తీయడం ఒక మార్కెట్ యాస్పెక్ట్ అనాలి. 2017 లో అగథా క్రిస్టీ నవల ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ ఆధారంగా ఇదే టైటిల్ తో, తారాతోరణంగా మర్డర్ మిస్టరీ వచ్చిన విషయం తెలిసిందే. క్రిస్టీ మిస్టరీ కథలు ఇంగ్లాండ్ గ్రామీణ వాతావరణంలో వుంటాయి. మిస్టరీల విషయంలో ఆమె ఎన్నో మూస ఫార్ములా కథనాల్ని, ముగింపుల్నీ బ్రేక్ చేసి ఆశ్చర్య పర్చింది. అందుకే ఈమె క్వీన్ ఆఫ్ క్రైం.

        తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్స్ పేరిట తుపాకీ బదులు లపాకీ సినిమాలొస్తున్నాయి. అధ్యయనం, పరిశీలన, ఒక అభిరుచీ అంటూ లేక కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి. తెలుగు సినిమాల నాణ్యత దేశంలోనే అట్టడుగు స్థాయికి ఇటీవలి కాలంలో చేరిపోయింది. అంటే మనమేదో ఉద్ధరిస్తామని కాదు. కాలం కలిసివస్తే టేనేజీ నోయర్స్ నీ, క్రిస్టీ నవలల్నీ తెలుగులో ప్రయత్నించి చూద్దాం. ఇప్పటికీ విశేషంగా ఇండియాలో అమ్ముడుబోతున్న జేమ్స్ హేడ్లీ ఛేజ్ నవలల్ని కూడా.

       ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ పేరు ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ గా మారి రేపు 12 న విడుదలవుతోంది. ఇందులో ‘స్టార్ ఎట్రాక్షన్’ ధనుంజయ్ ప్రభునే అనే మరాఠీ. కొంత కాలం ఆటో నడిపి, ఆ తర్వాత హోటల్ నడుపుతూ వుండిన ఇతను, ఫేస్ బుక్ లో రాంగోపాల్ వర్మ దృష్టినాకర్షించి సినిమాకి అపాయింట్ అయిపోయిన సంగతి తెలిసిందే. పోలికలు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలవడమే ఈ అపాయింట్ మెంట్ కి కారణం. దర్శకత్వ శాఖలో పనిచేసిన మన పాత మరాఠీ మిత్రుడు ఘనశ్యాం సదాశివ్ ఈయనకి తెలుగు డైలాగులు తర్ఫీదు నిచ్చాడు. ప్రభునే అచ్చం చంద్రబాబు నాయుడులానే హావభావ ప్రదర్శన చేశాడు. ఈయనకి ముంబాయిలో ఆటో డ్రైవర్ల సంఘం సన్మానం చేసింది కూడా. ఈ కథకి ఒక సెంట్రల్ పాయింటు వుంది. ఇది వైరల్ అయ్యే స్థాయిలో మంచి మార్కెట్ యాస్పెక్ట్ తో వుంది. చూద్దాం ఎలా వుందో విడుదలయ్యాక.

    భాగ్యనగర వీధుల్లో, మిస్ మ్యాచ్, మథనం, వజ్రాల వేట, కలియుగ, మేరా దోస్త్, అశ్వ మేధం...ఇవన్నీ గత శుక్రవారం వేడి వేడిగా ఫ్లాపయిన ఛోటా మోటా సినిమాలు. వీటి మధ్య ‘ఆ రెక్స్ 100’ ఫేం కార్తికేయ నటించిన ‘90 ఎంఎల్’ కూడా విడుదలై ఫ్లాపయ్యింది. ఒకప్పుడు ఎ సెంటర్స్ లో విడుదలై తర్వాత బిసి సెంటర్లకి వచ్చేవి సినిమాలు. ఇప్పుడు ఛోటా మోటా సినిమాల్ని బిసి సెంటర్లలో విడుదల చేసి వూరుకుంటే ఉత్తమమేమో ఆలోచించాలి. వీలయితే సి సెంటర్లకే పరిమితం చేస్తే ఇంకా మంచిది. విడుదల, పబ్లిసిటీ ఖర్చులు తగ్గుతాయి. ఆదా అయ్యే పబ్లిసిటీ ఖర్చుని కింది సెంటర్లకే బాగా టార్గెట్ చేసి అక్కడి ప్రేక్షకుల్లో ఆసక్తిని జనరేట్ చేయవచ్చు. ఒకవేళ అదృష్టం బావుండి అక్కడ సక్సెస్ అయితే పై సెంటర్లలో విడుదల చేసుకోవచ్చు. ఎ సెంటర్స్ లో చోటా మోటా సినిమాల విడుదల ఒక దండగ వ్యవహారం. పట్టుమని పదిమంది కూడా ప్రేక్షకులు రావడం లేదు. ఇదివరకు పార్కింగ్ వాళ్ళు, కేంటీన్ల వాళ్ళు తెగతిట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఖాళీగా కూర్చుని కేంటీన్ల వాళ్ళు తిట్టుకుంటున్నారు. 

      ఇక ’90 ఎం ఎల్’ కార్తికేయ పరిస్థితి క్వార్టర్ కి చేరింది. గత ‘గుణ 369’  తోనే సబ్జెక్టు ఎంపికలో పూర్ అని తేలింది. తను కొత్తగా వచ్చి పురాతన సినిమాలు ఎందుకు చేయాల్సి వస్తోందో ఆలోచించుకోవాలి. దారుణంగా 1.5 రెంటింగ్ తో రివ్యూలొచ్చాయంటే ‘90 ఎం ఎల్’ ఎంత నకిలీ మద్యమో ముందే తెలిసిపోవాలి. ఫిట్నెస్ కి ట్రైనర్స్ ని పెట్టుకున్నట్టు, మార్కెట్ లో వున్న ట్రెండ్స్ ప్రకారం తమకే సబ్జెక్టు నప్పుతుందో, నప్పదో చెప్పే కెరీర్ ఫిట్నెస్ ట్రైనర్స్ ని హీరోలు పెట్టుకుంటే మంచిదేమో. సబ్జెక్టు ఎంపిక సబ్జెక్టివ్ గా గాక, ఆబ్జెక్టివ్ గా జరిగినప్పుడు కొంతవరకు సత్ఫలితాలుంటాయి.





     మధ్య హిందీలో వస్తున్న చరిత్ర సినిమాల వైఖరి వైకుంఠపాళిగా మారింది. అవి పామునోట్లో పడుతున్నాయి. చరిత్రని ఒక పక్షానికి పట్టం గట్టి చూపించే ఒక రొటీన్ వల్ల చరిత్ర సినిమాలు క్వాలిటీ నశించి - ఫక్తు ఎజెండాగా మారిపోయాయి. ప్రేక్షకుల ఆదరణకి దూరమైపోతున్నాయి. ఈవారం ఆశుతోష్ గోవరీ కర్ తీసిన  ‘పానిపట్’ ఇందుకు మరో ఉదాహరణ. 100 కోట్లతో తీసిన ఇంత ప్రతిష్టాత్మక చారిత్రకం, కేవలం 1.5 -2.5 రేటింగ్స్ తో బాక్సాఫీసు దగ్గర కుప్పకూలింది. మీడియాల్లో ఇండియా - పాకిస్తాన్, హిందూ - ముస్లిం వార్తలే వార్తలుగా జనాల్ని ఎక్కువ మత్తెక్కిస్తున్నాయని, చరిత్ర సినిమాలతో కూడా ఇలా మత్తెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ మహాశయుడు కూడా ‘పద్మావత్’ తో ఇదే ప్రయత్నం చేశాడు. తెలుగులో ‘జార్జి రెడ్డి’ తో కూడా ఇదే ప్రయత్నం జరిగింది. సినిమా అనే మీడియాకి పక్షపాతం వుండదు. పక్షపాతం అంటేనే నిజాల్ని దాచడం. నిజాలు ఎలా వుంటాయంటే, చరిత్రలో మతాలకోసం యుద్ధాలు జరగలేదు, అధికారాల కోసమే యుద్ధాలు జరిగాయి. హల్దీ ఘాట్ లో అక్బర్ కీ, రాణా ప్రతాప్ కీ పోరాటం జరిగినప్పుడు అక్బర్ వెళ్ళలేదు. ఆయన ముఖ్యుడు రాజా మాన్ సింగ్ వెళ్ళాడు. రాజా మాన్ సింగ్ కింద అక్బర్ సేనాపతి ముస్లిం. అటు వైపు పోరాటానికి వచ్చిన రాణా ప్రతాప్ సేనాపతి హకీమ్ ఖాన్ సూద్. ఇది మతం కోసం హిందూ ముస్లిం పోరాటమనుకోవాలా? లేక అధికారం కోసం ఇద్దరు రాజుల పోరాటమనుకోవాలా?

        ఛత్రపతి శివాజీ - అఫ్జల్ ఖాన్లు భేటీ అవాలనుకున్నప్పుడు ఇద్దరూ ఆయుధాలు వుంచుకోకూడదని నియమం పెట్టుకున్నారు. కానీ శివాజీ ముస్లిం అధికారి రుస్తుం జమాల్ అలా వెళ్ళవద్దని శివాజీని హెచ్చరించాడు. శివాజీ దర్బారులో ఎందరో ముస్లిం అధికారు లుండే వాళ్ళు. వాళ్ళల్లో ముఖ్యుడు మౌలానా హైదరాలీ. శివాజీ ముఖ్య అంగ రక్షకుడూ, ఆయన కింద అంగరక్షకులూ చాలా మంది ముస్లిములే. శివాజీ,  అఫ్జల్ ఖాన్లు కలుసుకున్నప్పుడు రుస్తుం జమాల్ హెచ్చరించినట్టే అఫ్జల్ ఖాన్ దాడి చేశాడు. అప్పుడు శివాజీ అతణ్ణి పొడిచేశాడు. అప్పుడు వెంటనే హిందువు అయిన అఫ్జల్ అధికారి శివాజీని చంపేందుకు ప్రయత్నించాడు. ఇది మతం కోసం హిందూ ముస్లిం పోరాటమను కోవాలా? లేక అధికారం కోసం ఇద్దరు రాజుల పోరాటమనుకోవాలా?  
       తన శత్రువైన అఫ్జల్ ఖాన్ సమాధిని శివాజీయే కట్టించాడు. రాయగడ్ లో శివాజీ మందిరం కట్టించి, పక్కనే మసీదు కూడా కట్టించాడు. సైన్యం దాడులకి వెళ్ళినప్పుడు బైబిల్, ఖురాన్ ల వంటి అన్యమత గ్రంథాలు దొరికితే అపవిత్రం చేయకుండా సంబంధిత బాధ్యులకి అప్పగించమని ఆదేశించే వాడు. సైన్యం సూరత్ దాడికి వెళ్ళినప్పుడు అక్కడి ఫాదర్ అంబ్రూస్ పింటో ఆశ్రమం జోలికి పోవద్దని ఆదేశించాడు. సూఫీ గురువు హజరత్ బాబాని అభిమానించి బహుమానాలు పంపేవాడు. అక్బర్ తన కోటలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఘనంగా జరిపేవాడు.   ఓ పన్ ఘట్ పే నంద్ లాల్...భక్తి గీతాలతో పరవశించేవాడు.
         త దురుపయోగం జరిగినప్పుడు చరిత్ర బాధితురాలై పోతుంది. ఈ దురుపయోగానికి సినిమాలు పాల్పడ్డమే విషాదం. కులమత సమరస్యాల ప్రకటనతో నిష్పాక్షపాతంగా వుండాల్సిన సినిమా అనే మీడియా ప్రేక్షకుల్ని ఓటర్లు గా చూడ్డం దారుణమైన విషయం. ఇందుకే కలెక్షన్లు కూడా ఆ ఓటర్ల మేరకే దారుణంగా వస్తున్నాయి.

సికిందర్


5, డిసెంబర్ 2019, గురువారం

896 : సందేహాలు - సమాధానాలు


Q : నాది ఒక ప్రశ్న. సైరా నరసింహా రెడ్డిసినిమా చూసిన వాళ్ళందరూ మేకింగ్ బావుంది, సీన్స్ బావున్నాయి కానీ 'కనెక్ట్' కాలేకపోయాం అంటున్నారు. మూవీతో, లేదా హీరో తో ఆడియన్ ఎప్పుడు కనెక్ట్ అవుతాడు? ఒక పాత్రని ఆడియన్ కి కనెక్ట్ చెయ్యాలంటే సీన్స్, క్యారెక్టరైజేషన్ ఎలా వుండాలి? ఎందుకు కొన్ని సినిమాల్లో హీరో పాత్రలకు త్వరగా కనెక్ట్ అవుతాం? వివరించగలరు.
ఎపి, AD
A:  సైరా’ ఆడియెన్స్ కనెక్ట్ గురించి ‘సైరా’ స్క్రీన్ ప్లే సంగతుల్లో చాలా వివరంగా ఇచ్చాం, మళ్ళీ ఒకసారి చూడగలరు. మీరు పాత్రతో కథ పుట్టిస్తారా, లేక కథతో పాత్ర పుట్టిస్తారా? ఏ కథా రచనకైనా ఇది మూల సూత్రం. చాలా మంది కథతో పాత్ర పుట్టిస్తారు. ఇదే అన్ని సమస్యలకీ మూలం. పాత్రని బట్టి కథ వుంటుందా, లేక కథని బట్టి పాత్ర వుంటుందా? ఎవరు కలం పట్టుకున్నా ఈ ప్రశ్న వేసుకోవడం ముఖ్యం. చాలా మంది కథనిబట్టి పాత్రని నడిపిస్తారు. ఇదే సమస్త సినిమా కష్టాలకీ మూలం. మీరు పాత్రతో ఎమోషన్ ఫీలవుతారా, లేక కథతో ఫీలవుతారా? కాగితాలు ముందేసుక్కూర్చున్న ప్రతీ కవి కుమారుడు లేదా కవి కుమారీ ఆలోచించాల్సిన విషయం. చాలా మంది కథతో పాత్రని తెగ ఫీలైపోబోతారు. ఇదే అన్నిబాక్సాఫీసు విలాపాలకీ మూలం.

        కథ ట్రాష్. రైటర్ రాసే కథ వొట్టి ట్రాష్. కథ పట్టుకుని కథ అల్లేవాడు కుక్క తోకట్టుకుని గోదారీదిన వాడితో సమానం. వాడి చేతిలో సినిమా కుక్కతో పాటే బంగాళాఖాతంలో హతం. రైటర్ రాసే కథ వొట్టి ట్రాష్. ఆ కథని నమ్ముకుంటే సృజనాత్మక ఆత్మహత్యే. కథతో పాత్ర పుట్టదు, పాత్రతోనే  కథ పుడుతుంది. పాత్ర అనుభవమే కథ పుట్టుకకి కారణం. పాత్ర లేకుండా అనుభవం ఆలోచిస్తారా? ఆలోచించలేరు కదా? అందుకని పాత్రతోనే అనుభవం, ఆ అనుభవంతోనే కథ. పాత్ర వివిధ పరిస్థితుల్లో ఏమనుభవిస్తోందో, ఆ అనుభవాల్లోంచి ఏం నిర్ణయాలు తీసుకుని ముందుకు పోతోందో, లేక వెనకడుగేస్తోందో తెలిపేదే కథ. ఆ అనుభవాల్లోంచి అది తీసుకునే నిర్ణయాలతో పుట్టేదే ఫీల్, ఎమోషన్, ఆడియెన్స్ కనెక్ట్  ఏదనుకుంటే అది. పాత్ర ఏమనుభవిస్తోందో తెలుసుకుంటూ పోతూంటే తీసుకునే ఆయా నిర్ణయాలని బట్టి అలాగలా కథ దానికదే పుట్టేసుకుంటూ పోతుంది. పనిగట్టుకుని పుట్టించాల్సిన పనుండదు.

        పాత్రతో కథ పుడుతూ ఆ కథని పాత్ర నడిపిస్తూంటే అది యాక్టివ్ పాత్ర. కథెప్పుడూ రైటర్ ది కాదు. పాత్ర పుట్టించి పాత్ర నడిపే కథకి రైటర్ గా తన పేరు ఫ్రీగా వేసుకోవచ్చు. అంతవరకే హక్కు. అంతకి మించి కథలో చేయి పెట్టడానికి లేదు. ఒక కథ నెలలు గడుస్తూన్నా తెమలక పోవడానికి కారణ మేమిటి? పాత్ర నడపాల్సిన కథలో తాము చేయిపెట్టి అష్టవంకర్లు తిప్పడమే. తమ ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు, ఫీలింగులు, ఎమోషన్లు కథలోకి తీసుకురావాలని విఫల యత్నాలు చేయడమే. అప్పుడా కథ పాత్రదవదు. రైటర్ దవుతుంది. అప్పుడా పాత్ర యాక్టివ్ పాత్రవదు. పాసివ్ పాత్రవుతుంది. యాక్టివ్ పాత్రెప్పుడూ తన నిర్ణయాలు తాను తీసుకుంటూ కొనసాగుతూ వ్యక్తిత్వ వికాసాన్ని ప్రకటిస్తుంది. పాసివ్ పాత్ర  రైటర్ ఆపాదించిన నిర్ణయాలతో వ్యక్తిత్వ వినాశాన్ని కొనితెచ్చుకుని కథని బలహీనం చేస్తుంది, లేదా విఫలం చేస్తుంది.

        కథ పట్టుకుని కథ ఆలోచించే రైటర్ లాజికల్ మైండ్ ని దూరం పెట్టేస్తాడు. ఎమోషనల్ మైండ్ తోనే రాస్తాడు. కథలో ఫీల్ కోసం తెగ ఫీలైపోతూ తనలోకంలో తానుండి పోతాడు. ప్రేక్షక లోకంలోకి రాడు. కానీ ఫీల్ అనేది రిలేటివ్ పదం. అది లాజిక్ మీద ఆధారపడకపోతే చాదస్తమైపోతుంది. లాజికల్ మైండ్ తో ఎమోషనల్ మైండ్ పనిచెయ్యక పోతే సగం బుర్ర పాత్ర, సగం బుర్ర కథా పుడతాయి. ఇది ‘రాజావారు రాణిగారు’ లో కూడా చూడొచ్చు.
 

        ఫైనల్ గా ఆడియెన్స్ కనెక్ట్ కి ఫార్ములా : ఒక యాక్టివ్ పాత్ర, అది లాజికల్ మైండ్ తో తన నిర్ణయాలు తను తీసుకుంటూ, అంచెలంచెలుగా కథ పుట్టిస్తూపోవడం, ఇంతే.

Q : ‘అర్జున్ సురవరం’ లో ఫస్టాఫ్ నిఖిల్ నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ల కేసులో ఇరుక్కున్న తర్వాత సెకండాఫ్ లో ఆ స్కాంని బయట పెట్టి విలన్ని పట్టుకునే కథగా వుంది. కానీ సెకండాఫ్ బాగాలేదు. ఏమీ థ్రిల్ అనిపించలేదు. సెకండాఫ్ లో జరిగిన లోపాలేమిటో  వివరిస్తే మాకు హెల్ప్ అవుతుంది.
టి. రాజు, Asso
A:  ఆ సినిమా చూడలేదు. వీకీ పీడియాలో తమిళ వోరిజినల్ కథ చదివాం. రివ్యూలు కూడా చూశాం. తమిళంలోనే సెకండాఫ్ బాగాలేదని రివ్యూలిచ్చాక తెలుగులో ఎందుకు రీమేక్ చేశారో తెలీదు. స్కాంని బయట పెట్టి విలన్ని పట్టుకునే కథల్లో ఇంకా నావెల్టీ ఎక్కడుంది? అరిగిపోయిన టెంప్లెట్. ఆ మధ్య హిందీలో ‘వై చీట్ ఇండియా’ అని వచ్చింది. ఇందులో హీరో డబ్బున్న విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని, తెలివైన పేద విద్యార్ధులకి కొంత డబ్బిచ్చి ఎంసెట్ పరీక్షలు రాయించి, డబ్బున్న విద్యార్ధుల్ని పాస్ చేయిస్తూంటాడు. ఈ కథ సెకండాఫ్ లో ఏమవుతుందంటే, అదే హీరో మాస్ కాపీయింగ్ చేయించే కథగా మారిపోతుంది. రెండూ వేర్వేరు కథలు. ఫ్లాపయింది. రెండు కథల్లో కూడా చీటింగ్ మాఫియా అయిన హీరోని పట్టుకోవడమే థీమ్. హీరోని పట్టుకుంటే మనకేంటి, పట్టుకోకపోతే మనకేంటి?

        మీరనే సినిమాలో హీరోని ఇరికించిన విలన్ ని పట్టుకున్నంత మాత్రాన మనకేంటి? హీరో దోషి అయితే ఎవరిక్కావాలి, నిర్దోషి అయితే ఎవరిక్కావాలి? ఈ కథలు పాతబడి పోయాయి. వీటికి  రివర్సల్ కావాలి. ఇరుక్కున్న హీరో ఇరుక్కోలేదనీ, బుద్ధిపూర్వకంగానే నకిలీ సర్టిఫికెట్లు కొన్నాడనీ రివర్సల్ చేస్తే కొత్త కథవుతుంది. ఇలా నకిలీ సర్టి ఫికెట్లు కొంటున్న వాళ్ళు అనేకం  వుంటున్నారు. దీని విష పరిణామాలు చూపిస్తే కథ కొత్త తావులకి విస్తరిస్తుంది. కొత్త విషయాలు చెప్తుంది. కథ వెనుక కథ చెప్తుంది. అంటే నకిలీ సర్టిఫికేట్లు కొనేవాళ్ళ నైతిక, సామాజిక స్థితి ఏ గతి పడుతుందో చెప్తుంది. ప్రాక్టికల్ కథవుతుంది. గతవారమే ఉత్తరప్రదేశ్ లో వేల మంది టీచర్లు నకిలీ సర్టి ఫికేట్లతో పనిచేస్తున్నారని బయటపడింది. ఇప్పుడు వీళ్ళ గతేమిటి? డ్రమెటిక్ క్వశ్చన్ ఇక్కడ నేరం చుట్టూ వుండాలి. నేరస్థుడ్ని పట్టుకునే దొంగా పోలీసాటతో కాదు.

        అనిల్ కపూర్ నటించిన ‘మేరీ జంగ్’ (శోభన్ బాబుతో ‘విజృంభణ’) లో ఇంజెక్షన్ మార్పిడి హత్య కుట్రలో లేడీ డాక్టర్ ఇరుక్కుంటే, లాయరైన అనిల్ కపూర్ పని కుట్ర దారుడ్ని పట్టుకోవడం కాదు. ఆమె పేషంట్ కిచ్చిన ఇంజెక్షన్ విషపూరితం కాదని నిరూపించి ఆమెని కేసులోంచి బయటపడెయ్యడం. కుట్రదారుడ్ని పట్టుకోవడమే కథయితే పస వుండేది కాదు. సెకండాఫ్ కూడా అదే కథయి బోరు కొట్టేది. అందుకని విషపూరితం కాదని కోర్టులో నిరూపించడానికి ఆ విషపూరిత ఇంజెక్షన్ని తాగేస్తాడు. ఇదీ రివర్సల్. అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గరికి తెచ్చి కథని విరిచెయ్యడం. కొత్తదారి పట్టించడం. దీంతో ఏమవుతుందంటే సెకండాఫ్ కథ విరక్కుండా వుంటుంది. విరిచేదేదో ఫస్టాఫ్ లోనే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగేట్టు విరిచిస్తే, సెకండాఫ్ తో గొడవే వుండదు. అంటే సెకండాఫ్ సిండ్రోమ్ లో పడి సినిమా బే ఆఫ్ బెంగాల్ అవదు.

        తర్వాత ఇదే కోర్టు కేసు తదనంతర పరిణామాల్లో కుట్రదారుడు బయట పడతాడు. వాడెవడో కాదు, అనిల్ కపూర్ పాత్ర తల్లిని దూరం చేసిన వెధవే. ఇప్పుడు వాడి అంతు చూస్తాడు. ఇది గోల్ రివర్సల్. ఒక గోల్ తో బయల్దేరిన పాత్రకి అందులోంచి ఇంకో గోల్ ఎదురవడం. సాధారణంగా మొదటి గోల్ ఫిజికల్ గోల్ గా పూర్తవుతుంది. పూర్తయిన ఈ ఫిజికల్ గోల్ లోంచి ఎమోషనల్ గోల్ పుట్టుకొస్తుంది. మొదట డాక్టరమ్మని కాపాడడం అనిల్ కపూర్ ఔటర్ (ఫిజికల్) గోల్ గా వుండింది.  తర్వాత అదే గోల్ లోంచి తెలిసిపోయిన విలన్ అంతు చూడ్డం తల్లి కథతో ఇన్నర్ (ఎమోషనల్) గోల్ అయింది. స్టార్ వార్స్, కెప్టెన్ అమెరికా వంటి వాటిలో కూడా గోల్ రివర్సల్స్ చూడొచ్చు.

సికిందర్


3, డిసెంబర్ 2019, మంగళవారం

895 : రివ్యూ!


రచన -  దర్శకత్వం : కె. రవికిరణ్
తారాగణం :
 కిరణ్ అబ్బవరం, రహస్యా గోరక్, రాజ్ కుమార్, యజుర్వేద్, స్నేహ మాధురీ శర్మ, దివ్యా నర్ని తదితరులు
సంగీతం : జై క్రిష్ , ఛాయాగ్రహణం : సి. విద్యాసాగర్
నిర్మాత
: జి. మనో వికాస్
విడుదల : నవంబర్ 29, 2019
        సినిమాల్లో కెల్లా సులువైన సినిమా ప్రేమ సినిమా. తెలుగులో ఇది తీయాలంటే ఏమీ చేయనవసరం లేదు, ఉన్నదే మరోసారి శుభ్రం చేసి చూపిస్తే చాలు. చూసిందే చూసే తెలుగింటి ప్రేక్షకులు కాచుకుని వుంటారు. కాకపోతే దాని వెనుక పేరున్న నిర్మాతో, పంపిణీ దారో వుంటే ఇంకా ఆకర్షిస్తుంది. ఈ కోవలో సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేసిన ‘రాజావారు రాణిగారు’ అనే చిన్న బడ్జెట్ ప్రేమ సినిమాకి ఇలాగే హైప్ వచ్చింది. బిజినెస్ జరగని చిన్న సినిమాలకి సురేష్ ప్రొడక్షన్స్ అండగా వుంటోంది. ఇది కొత్త దర్శకుడు రవి కిరణ్, కొత్త నిర్మాత మనోవికాస్ ల అదృష్టం. ఇద్దరికీ సినిమా ఎలా ఎంత సహజంగా తీయాలో మంచి టేస్టు వుంది. కావాల్సిందల్లా ఇప్పటి ప్రేక్షకుల టేస్టుకి దగ్గరగా వుండే సమకాలీన సబ్జెక్టు. ఇది లేకపోతే లాభంలేదని బయ్యర్లకి కూడా స్పృహ వచ్చేస్తోంది. అసలే మార్కెట్ కోల్పోయిన రోమాంటిక్ కామెడీలు తప్ప మరేమీ కన్పించక ఇంకేదో కావాలని వేచి చూస్తున్నారు. వీళ్ళని దాటుకుని వచ్చేసింది ‘రాజావారు రాణిగారు’. ఇదెలా వుందో ఓసారి చూద్దాం...

కథ

       2010 గోదావరి జిల్లా రామాపురం. ఇంటర్ చదివే రాజా (కిరణ్ అబ్బవరం) రాణి (రహస్యా గోరక్) ని ప్రేమిస్తూంటాడు. ఈ విషయం ఆమెకి చెప్పలేడు. ఆమె తండ్రి రేషన్ డీలర్. తల్లి వుండదు. ఆమె సున్నితంగా, నెమ్మదిగా వుంటుంది. ఎంసెట్ పాసయి పై చదువుకి అమ్మమ్మ వాళ్ళ వూరెళ్ళి పోతుంది. దీంతో రాజా డీలా పడిపోతాడు. ఇక్కడే డిగ్రీ చదువుతూ చౌదరి (రాజ్ కుమార్), నాయుడు (యజుర్వేద్) అనే ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తూంటాడు. రాణి ఏ వూరెళ్ళిందో తెలుసుకునే ప్రయతంలో వుంటాడు. మూడున్నరేళ్ళు చూసి చూసి, తాము రాణిని రప్పిస్తే రాజా మనసులోని మాట ఆమెకి చెప్పాలని ఫ్రెండ్స్ మాట తీసుకుని, రాణి తండ్రికి యాక్సిడెంట్ జరిపిస్తారు. ఇక రాణి వచ్చేస్తుంది. వచ్చిన రాణికి రాజా మనసులో మాట చెప్పాడా? ఇంకేం అవరోధాలు వచ్చాయి? వీటిని అధిగమించడానికి ఫ్రెండ్స్ ఎలా సహాయపడ్డారు? ఇదీ మిగతా కథ.


ఎలా వుంది కథ
        రోమాంటిక్ డ్రామా జానర్. గత రెండు దశాబ్దాలుగా వస్తున్న ప్రేమ సినిమాల దర్శకులకి తెలిసింది రెండే రెండు టెంప్లెట్స్. హీరో లేదా హీరోయిన్ ప్రేమ చెప్పలేకపోవడం, లేదా ఇద్దరూ అపార్ధాలతో విడిపోవడం. వందల ప్రేమ సినిమాలు ఈ రెండే అరిగిపోయిన, మూస ఫార్ములా స్టేటస్ కి చేరిపోయిన పాయింట్లతో పదేపదే వస్తున్నాయి. హిందీలో మన్మర్జియా, బరేలీ కీ బర్ఫీ, లుక్కా చుప్పీ లాంటి ప్రేమ సినిమాలు సమకాలీన ప్రేమ జీవితాలతో యువతని ఉర్రూత లూగిస్తున్నాయి. ప్రేమ సినిమాలు ఉర్రూత లూగించడం సమకాలీనంగా, కొత్త ఐడియాలతో ఫ్రెష్ గా వున్నప్పుడే జరుగుతుంది. తాజాగా ఇదే వారం విడుదలైన ‘ఏ సాలీ ఆషికీ’  కూడా ఇలాంటిదే. 

         ‘రాజావారు రాణిగారు’ కాలీన స్పృహకి సంబంధించి ఒక సమర్ధన చేశారు థీమాటికల్ గా. ఏమంటే ఈ ప్రేమ కథని ఈ కాలంలో కాకుండా, 2010 లో జరిగినట్టుగా చూపిస్తున్నట్టు సమర్ధన కనబడుతోంది. ఈమధ్య  ‘రణరంగం’ లో 1990 ల నాటి ప్రేమ కథ ఫ్లాష్ బ్యాక్ ఇచ్చారు. ‘గద్దల కొండ గణేష్’ లో కూడా ఇదే ఇచ్చారు. ఇవి ఈ తరం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయా? పోనీ కిందటి తరం ప్రేక్షకులు వచ్చి చూశారా?

        క్వాక్ జీ యంగ్ తీసిన ‘ది క్లాసిక్’ కొరియన్ మూవీ పాత తరం తల్లి ప్రేమ కథతో, కొత్త తరం కూతురి ప్రేమ కథతో టూ ఇన్ వన్ గా వుంటుంది. తల్లీ కూతుళ్ళుగా ఒకే హీరోయిన్ నటించింది. దీన్ని రెండు తరాల ప్రేక్షకులూ ఉమ్మడిగా చూసి సక్సెస్ చేశారు (ఇదే బ్లాగులో సుదీర్ఘ విశ్లేషణ చేశాం). రెండు కాలాల ప్రేక్షకుల్ని ఆకర్షించడమన్నది ఇక్కడ మార్కెట్ యాస్పెక్ట్. మార్కెట్ యాస్పెక్ట్ పట్టించుకోకుండా క్రియేటివ్ యాస్పెక్ట్ తో ఏళ్ల తరబడి అదే సరుకు సరాఫరా చేయడం సినిమా వ్యాపారం అన్పించుకోదు. మార్కెట్ యాస్పెక్ట్ అంగీకరించి తీరాల్సిన పచ్చి వాస్తవం. క్రియేటివ్ యాస్పెక్ట్ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ వుండాల్సిన వొట్టి వూహ.    

         ప్రస్తుత ప్రేమ కథలో రాజా, పైన చెప్పకున్న రెండు పాయింట్లలో ఒక పాయింటైన ‘ప్రేమ చెప్పుకోలేక పోవడం’ అనే పాత్రచిత్రణతో, ప్రేమిస్తున్నాడని రాణీ తెలుసుకోకపోవడమనే పాత్ర చిత్రణతో - ఇద్దరి ప్రేమ కథకి ఒక ప్రతిష్టంభన ఏర్పడి, ఎటూ కదలని కథనంతో జడప్రాయంగా వుండి పోయింది. 

         కథా ప్రయోజనం విషయానికొస్తే, దశాబ్దకాలపు వెనకటి ఈ రొటీన్ రిపీట్ ఫార్ములా కథలోంచి ఈకాలం ప్రేమికులు తెలుసుకోవాల్సిందేమీ కన్పించడం లేదు. ఏళ్ల తరబడి ప్రేమని వ్యక్తం చేయలేకపోయే పాత్రతో ప్రాక్టికాలిటీ ఏముంటుంది. సినిమా అంటే ఆచరణ చూపడం. ఈ హీరోహీరోయిన్ల స్థాయి కూడా కామన్ సెన్సు లోపించి ప్రేక్షకులకంటే తక్కువ స్థాయిలో వుంది. 

       కథా ప్రయోజనమలా వుంచి వినోదాత్మక విలువ చూసినా ఫస్టాఫ్ వరకే ఎంటర్టైనర్. సెకండాఫ్ లో కెళ్తే సీరియస్ మూడ్. రోమాంటిక్ డ్రామా కాబట్టి సీరియస్ అని సరిపెట్టుకున్నా, ఆ సీరియస్ డ్రామా కూడా చలనంలో వుండక, పైన చెప్పుకున్నట్టు జడప్రాయంగా మిగిలింది. రెండుగంటలా పది నిమిషాల తక్కువ నిడివి ఒక్కటే కాస్త ఉపశమనం.  


        కాకపోతే కథకి ఎంచుకున్న నేపధ్యం ఆకర్షణీయంగా వుంది. కథ టెంప్లెట్ లో వుండిపోయి వాస్తవికత లేకపోయినా, నేపథ్య వాతావరణం రియలిస్టిక్ గా వుంది. దీనికి విరుద్ధంగా సత్యజిత్ రే తీసిన ‘నాయక్’ రియలిస్టిక్ కథ వచ్చేసి కమర్షియల్ స్ట్రక్చర్ తో వుంటుంది. ఇందుకే ఈ ఆర్ట్ సినిమా అంత బలంగా వుంది. దర్శకుడు రవికిరణ్ గోదావరి జిల్లా గ్రామీణ వాతావరణాన్ని, మనుషుల్ని, జీవితాల్ని, భాషనీ ఎలాటి కమర్షియల్ హంగులూ కృత్రిమత్వం  లేకుండా స్పటికస్వచ్ఛతతో చూపించడం వల్ల కథేమో గానీ ఈ నేపథ్యాన్ని- రూరల్ టూరిజాన్ని అనుభవిస్తూ ఎంత సేపైనా కూర్చోవచ్చు. ఈ టూరిజంలో చూపించిన ప్రతిభ రోమాంటిసిజంలో కనబర్చలేకపోయాడు. తన టేస్టు టూరిజానికే పరిమితమైంది. 

ఎవరెలా చేశారు
        హీరో హీరోయిన్లతో బాటు ఫ్రెండ్స్ గా నటించిన వాళ్ళు కొత్త వాళ్ళే. హీరోయిన్ రహస్య ప్రారంభ దృశ్యాల్లో కాసేపు కన్పించి వూరెళ్ళి పోతుంది (కథలో). ఇక సెకండాఫ్ లోనే తిరిగి వచ్చేది. ఫస్టాఫ్ లో ఈమె లేని ముప్పావు గంటా హీరో ఒక్కడే కన్పిస్తాడు. రహస్య తక్కువ మాట్లేడే, సున్నితమైన, నెమ్మదిగల పాత్రలో నటించడానికి పెద్దగా అవకాశం రాలేదు. సీన్లలోకి రావడం, వెళ్ళడం, లేవడం, కూర్చోడం లాంటి భౌతిక కదలికలే తప్ప - కథ ప్రకారం మానసిక స్పందనలు వుండని పాత్ర కావడం చేత, ఒక షో పీస్ లా వుండిపోతుంది. చిట్ట చివర్లోనే మనసువిప్పి తన కథంతా చెప్పుకున్నప్పుడు కాస్త నటించే అవకాశం లభిస్తుంది. ఈ నటించే అవకాశం లభించినప్పుడు విచిత్రంగా భౌతిక కదలికల్లేక, మనసొక్కటే మాట్లాడుతుంది. దర్శకుడి పొరపాటువల్ల ఇక్కడ పాత్ర ప్రదర్శించాల్సిన బాడీ లాంగ్వేజీ  కొరవడింది. ఇన్నాళ్ళూ ఉగ్గబట్టుకున్న ప్రేమని వెళ్ళబోసుకుంటున్నప్పుడైనా - హగ్ చేసుకోమ్మా, కాస్త కాళ్ళూ చేతులూ ఆడించి బలంగా హగ్ చేసుకుని భారమంతా దించేసుకో - ఈ సినిమాకి ఇప్పుడైనా మాంచి కిక్ తీసుకురా! - అనాలన్పిస్తుంది. చిట్ట చివరికైనా హగ్ చేసుకోని ప్రేమికులతో సగటు ప్రేక్షకుడి కంటికి ఎలాటి ప్రేమ సినిమా! అంతసేపూ వియోగంతో చేసిన సెటప్, చివరికి సంయోగంలో సరీగ్గా పే ఆఫ్ కాలేదు. తగిన డ్రామా కొరవడిన పెళుసు ముగింపుగా తేలింది. 


        హీరో కిరణ్ అబ్బవరం ఏకపక్ష ప్రేమికుడుగా మనసు పెట్టి బాగానే నటించాడు పాత్ర ప్రకారం. ప్రేమించడమే తప్ప ఆ ప్రేమని కార్య రూపంలోకి తేలేని ఇలాటి భయస్థుడి పాత్ర గతంలో చాలా ప్రేమ సినిమాల్లో వచ్చిందే. ప్రేమించానని చెప్తే కాదంటుందేమో, కాదంటే తట్టుకోలేనెమో నన్నభయం చుట్టూ చివరంటా సాగే ఈ పాత్ర విసుగులేకుండా నటించాడు, సెకండాఫ్ వచ్చేసరికి విసుగూ తెప్పించాడు. ఇంతకీ చివర్లోనైనా ప్రేమిస్తున్నట్టు చెప్పగల్గాడా అంటే లేదు. ఆమే చెప్పుకుని ఆమే దగ్గరవ్వాలి తప్ప తను కదలడు, మెదలడు. రోమాంటిక్ పాత్ర కాకుండా రోబోలా మిగిలాడు. పాటలన్నీ తనమీదే వున్నాయి, విషాద పాటలు సహా. 

        ఫ్రెండ్స్ గా నటించిన రాజ్ కుమార్, యజుర్వేద్ లు సున్నిత హాస్యంతో సీన్లని చైతన్యవంతం చేశారు. గోదావరి జిల్లా వాళ్ళ లాగా ఆ నేటివిటీని అలాగే మెయింటెయిన్ చేశారు. మధ్యలో ట్రయాంగులర్ ఫార్ములా ప్రకారం హీరోయిన్ బావ పాత్ర రావడం, కామెడీ కుట్ర చేసి అతణ్ణి పంపడం పాత రొటీన్ వ్యవహారమే. దర్శకుడు మొహమాటం లేకుండా ఓల్డ్ స్కూల్ డ్రామాకే కట్టుబడి యూత్ లవ్ తీశాడు. 

        టెక్నికల్ గా విజువల్స్ బావున్నాయి. కెమెరా వర్క్ గోదావరి నేటివిటీకి అద్దం పట్టింది. సంగీతం కూడా బావుందిగానీ, ఈ సినిమాని మ్యూజికల్ హిట్ చేసేంత కాదు. తక్కువ పాత్రలుండడం వల్ల, ఒకే గ్రామపు లొకేషన్ కావడం వల్ల, బడ్జెట్ చాలా ఆదా అయినట్టుంది. 
 
చివరికేమిటి?
       ఈ రోమాంటిక్ డ్రామా ఇద్దరు దుండగులు ఒకడ్ని కిడ్నాప్ చేసి, వాడికి ఈ ప్రేమ కథ చెబుతున్నట్టు ప్రారంభమవుతుంది. ఈ దుండగులెవరు, కిడ్నాప్ చేసిందెవర్ని అన్నది సస్పెన్స్ గా పెట్టుకుని నడిపారు. ఈపాటి కథకి మంచి క్రియేటివిటీయే. నేరుగా ఇంటర్ క్లాస్ రూమ్ నుంచే హీరో ప్రేమని ప్రారంభించి హీరోయిన్ కి చెప్పాలనుకునే విఫల యత్నాలు చూపించారు. ఆమె పై చదువుకి వూరెళ్ళి పోగానే హీరో వూళ్లోనే దిగాలుగా గడపడాన్ని చూపడం ప్రారంభించారు. ఇక్కడ్నించీ ఫస్టాఫ్ ని హీరోయిన్ లేకుండానే లాక్కొచ్చారు. ఇలా ఆఫ్ బీట్ సినిమా ప్రయత్నం చేశారు కథనంతో. మొత్తం ప్రేమ కథతోనే  ఆఫ్ బీట్ ప్రయత్నం చేయాల్సింది చేయలేకపోయారు. ఇక మూగ ప్రేమికుడైన హీరో ఫ్లాట్ క్యారక్టరైజేషన్ లో మార్పు ఇంటర్వెల్ ముందు ఫ్రస్ట్రేషన్ తో ఇతరుల్ని కొట్టే సీన్లు పెట్టారు. కానీ హీరోయిన్ ఏ వూరెళ్ళిందో ఆ వూరెళ్ళి ప్రయత్నించేలా చేయకుండా మూడున్నరేళ్ళూ వూళ్ళోనే ఏడ్పిస్తూ వుంచేశారు. ఇలాటి పాత్ర హీరోయిన్ కుంటుంది. వెళ్ళిపోయిన నాథుడి కోసం ఎదురు చూస్తూ గడిపే పాత హీరోయిన్ పాత్ర. ఇక్కడ హీరోని ఆడదానిగా మార్చి చూపెట్టారు. 


        హీరోయిన్ పాసివ్ పాత్ర, హీరో కూడా పాసివ్ పాత్రయి పోతే ఇక కథ ఎలా నడుస్తుంది. ఇందుకే ఈ పాసివ్ పాత్రల కథని ఫ్రెండ్స్ నడపాల్సి వచ్చింది. హీరోయిన్ ని రప్పిస్తే ఆమెకి లవ్ చెప్పే దమ్ముందా అని అడిగి, దమ్ముందంటేనే, హీరోయిన్ ని రప్పిస్తారు ఫ్రెండ్స్- ఆమె తండ్రికి యాక్సిడెంట్ జరిపించి.  సెకండాఫ్ లో హీరోయిన్ వచ్చాక కూడా లవ్ చెప్పే ఆలోచన హీరో చెయ్యడు, ఫ్రెండ్స్ కూడా అడగరు. ఇంటర్వెల్ పాయింటు మర్చిపోయారు. మళ్ళీ హీరోయిన్ కి లవ్ చెప్పలేని ఫస్టాఫ్ దృశ్యాలే రిపీటవుతాయి. ఫస్టాఫ్ నుంచీ కథ ఎక్కడేసిన గొంగళే. పాత్రకి కాన్ఫ్లిక్ట్ లేక, కథలో చేసే పనిలేక, మూగగా ప్రేమిస్తూ ప్రేమిస్తూనే వుండిపోతాడు. ఈ మూగ ప్రేమని కూడా - మూడున్నరేళ్ళు వేరే వూళ్ళో వుండొచ్చిన ఆమె రిలేషన్ షిప్ స్టేటస్ ఏమిటో, ఎవర్నేనా ప్రేమించిందో ఏం పాడో -  తెలుసుకున్నాకే ప్రేమించాలో వద్దో నిర్ణయించుకోవాలన్న జ్ఞానం కూడా లేకుండా మూగ ప్రేమ - గుడ్డి ప్రేమ - చెవిటి ప్రేమగా ప్రేమిస్తూనే వుండిపోతాడు. ఇలా కథలేక సెకండాఫ్ వృధా అయింది. 

        ఇదీ ప్రేమ సినిమాల రెండు టెంప్లెట్లలో ఒక టెంప్లెట్ కథాకమామిషూ. ఇలాగే టెంప్లెట్స్ తో ప్రేమ సినిమాలు 2119 దాకా వర్ధిల్లుగాక! ఈ టెంప్లెట్ చాలా మన్నికైనది, బాంబు పెట్టి పేల్చినా చెక్కు చెదరదు.

సికిందర్