రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, జనవరి 2019, బుధవారం

725 : రివ్యూ


దర్శకత్వం : విజయ్ రాత్నాకర్ గుట్టే
తారాగణం : అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నా, సుజాన్ బెర్నెర్ట్, ఆహ్నా కుమ్రా, అర్జున్ మాథుర్ తదితరులు
రచన : విజయ్ రాత్నాకర్ గుట్టే, మాయాంక్ తివారీ, కార్ల్ డన్, ఆదిత్యా సిన్హా, సంగీతం : సుదీప్ రాయ్, సాధూ తివారీ, ఛాయాగ్రహణం : సచిన్ కృష్ణ్
బ్యానర్ : రుద్రా ప్రొడక్షన్స్, బొహ్రా బ్రదర్స్, పెన్ ఇండియా లిమిటెడ్
నిర్మాతలు : సునీల్ బొహ్రా, ధవల్ గడా
విడుదల : జనవరి 11, 2019

***
          దేళ్ళపాటు దేశాన్ని ఏకధాటిగా పాలించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పాలనా తీరు మీద తీసిన బయోపిక్ వివాదాస్పదమవక ముందే దీనికాధారమని  చెప్పుకున్న పుస్తకం వివాదాస్పదమైంది (ఆధారమని చెప్పుకోవడం పూర్తి నిజం కాదు). అది నైతికతకి సంబంధించి. ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గర నాలుగేళ్ళు  మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ బారు, మన్మోహన్ సింగ్ పనితీరునే, బలహీనతలనే బయటపెడుతూ పుస్తకం రాయడం విశ్వాసఘాతంగా విమర్శలొచ్చాయి. ఈ విషయంలో మాత్రం సంజయ బారులోని మీడియా సలహాదారు పక్కకెళ్ళి, పూర్వాశ్రమంలోని  ప్రొఫెషనల్ జర్నలిస్టు బయటికొచ్చాడు. తీరా చూస్తే పుస్తకంలో జనాలకి తెలియని కొత్త విషయాలు లేవు, సినిమాలోనూ లేవు. అంతా సద్దుమణిగింది. కాకపోతే అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆజమాయిషీలో మన్మోహన్ ఎలా ఫీలయ్యేవారో మనం ప్రత్యక్షంగా చూడలేదు. అమూర్తంగా వుండిపోయిన ఆ భావోద్వేగాల్ని ఈ సినిమా దృశ్యరూపంలో పెట్టి ఆ లోటు తీర్చిందంతే. అయ్యోపాపం అన్పించేలా, గుండెలు కలుక్కుమనేలా మాజీ ప్రధాని పరిస్థితిని కళ్ళకి కట్టిన అనుపమ్ ఖేర్ కూడా, ఈ చారిత్రక అవసరాన్ని తీర్చారు. 

          
విచిత్రమేమిటంటే, కొందరు ప్రధానుల్ని చూస్తే కోపం వస్తుంది. మన్మోహన్ ఒక్కరినే చూస్తే అయ్యో పాపం అన్పిస్తుంది. అయ్యో పాపం అనుకుంటూనే పదేళ్ళు గడిపాం.  ఇందులో నాల్గేళ్ళ కాలాన్ని  సంజయ బారు ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ గా తన జ్ఞాపకాలు రాస్తే, ఇదే టైటిల్ తో బయోపిక్ తెరకెక్కింది. ఓ కొత్త దర్శకుడి చేతిలో ఇదెలా తెరకెక్కిందో చూసే ముందు, ఓసారి ఈ కొత్త దర్శకుడు విజయ రత్నాకర్ గుట్టే ఘనమైన బయోపిక్ కూడా చూద్దాం. ఇతను గత ఆగస్టులో నకిలీ పత్రాలతో పాల్పడిన రూ 34 కోట్ల జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ స్కాము కేసులో అరెస్టయ్యాడు. మహారాష్ట్ర నేత అయిన ఇతడి తండ్రి, వేలాది రైతుల పేర నకిలీ పత్రాలు సృష్టించి -  బ్యాంకులనుంచి రూ 5400 కోట్ల రుణాలు కాజేసిన కేసులో నిందితుడు. బిజెపి తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఇతడి తల్లి మొన్నే  జనవరి 13 న ఇతడి తండ్రి మీదా, మరో ఆరుగురు కుటుంబ సభ్యుల మీదా ఆస్తికోసం హింసిస్తున్నారని కేసు పెట్టింది. థ్రిల్లింగ్ బయోపిక్. ఇలాటి తన స్మెలింగ్ చేతులు మహానుభావుడి మీద వేశాడు.

కథ 
      2004 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ఘనవిజయం సాధించిన దృశ్యాలతో మొదలవుతుంది. అయితే ప్రధానిగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశీయత కారణంగా గద్దెనెక్క లేని పరిస్థితి. బిజెపి నేతలు సుష్మా స్వరాజ్, ఉమాభారతిలు, శివసేన బాల్ థాక్రే తదితరులు సోనియాని తస్మాత్  జాగ్రత్తంటూ ప్రసంగాలు చేస్తారు. కాంగ్రెస్ క్యాడర్ మాత్రం సోనియమ్మే రావాలని ఆందోళనలు చేస్తారు. సోనియా దీర్ఘంగా ఆలోచించి ఆర్ధికవేత్త, ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రీ అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుని ప్రతిపాదించడంతో కాంగ్రెస్ బడా నేతల్లో కలవరం పుడుతుంది. అక్కడేవున్న ప్రణబ్ ముఖర్జీ ముఖం వివర్ణమవుతుంది – ఒకప్పుడు తన జ్యూనియర్ అదృష్ట జాతకుడయ్యాడని. మొత్తానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం. ప్రధానిగా మన్మోహన్ కార్యాలయంలోకి తన స్టయిల్లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు, చిన్నప్పటి ముచ్చట గుర్తుకొస్తుంది. తండ్రి తనని స్కూల్లో చేర్పిస్తూ పేరు చెప్పినప్పుడు- ఏం పేరూ అంటాడు మాస్టారు. ఏదోవొకటి రాసుకోండి, వీడేమైనా ప్రధాన మంత్రి అవుతాడా –అని తండ్రి అంటాడు. ఇలా ఆల్రెడీ ప్రధాని సీటు రిజర్వ్ అయిపోయిన ముచ్చట ప్రణబ్ ముఖర్జీకి తెలీక ఆ వివర్ణ ముఖారవిందమేమో.

          ఈ క్రమంలో ప్రభుత్వం మీద తన పట్టు వుండాలని సోనియా గాంధీ, జాతీయ సలహా మండలిని ఏర్పాటు చేయడం మన్మోహన్ సింగ్ ని చికాకు పెడుతుంది. మేనిఫెస్టో హామీల అమలుకి జాతీయ సలహా మండలి అంటే రెండో అధికార కేంద్రమే. దీనికి తను తలొగ్గి పనిచేయాలి. పైగా సోనియా దూతగా  పులోక్ చటర్జీ (బాబీ పర్వేజ్) అనే బ్యూరోక్రాట్ నియమితుడై, యూపీఏ ప్రభుత్వపు కనీస ఉమ్మడి కార్యక్రమం అమలు తీరుని పర్యవేక్షించడానికి రావడం చిర్రెత్తిస్తుంది. ఇంకా సోనియా రాజకీయ కార్యదర్శి రూపంలో అహ్మద్ పటేల్ (విపిన్ శర్మ) ప్రధాన మంత్రి కార్యాలయంలో హల్చల్ చేయడం మన్మోహన్ ని ఇబ్బంది పెట్టేస్తుంది. ఇలా పార్టీ వ్యక్తులు రెండో అధికార  కేంద్రంగా ప్రధానమంత్రి కార్యాలయంలో పెత్తనం చేస్తూంటే, చాటుగా తన మీద జోకులేస్తూంటే, మన్మోహన్ కిక ప్రధానిగా తన స్థానం అర్ధమైపోతుంది.

          ఈ దశలో బిజినెస్ స్టాండర్డ్ పత్రికా సంపాదకుడైన సంజయ బారు (అక్షయ్ ఖన్నా) ని పిలిపించుకుని మీడియా సలహాదారుగా నియమించుకుంటారు సింగ్. వీళ్ళది 30 ఏళ్ల గురు శిష్య సంబంధం. డాక్టర్ సాబ్ ని తిరగేసి మడతేసి చదివేయగలడు బారు. పాలనానుభవం లేని మన్మోహన్ కి చిట్కాలు నేర్పుతూంటాడు. మహాభారతంలో రెండు కుటుంబాలున్నాయని మన్మోహన్ అంటే, కాదు దేశంలో ఒకే కుటుంబం వుందని తను అంటాడు. ఇతడి మీద పీతూరీలు సోనియాకి యమ స్పీడుగా అందుతూంటాయి. ఐతే  అహ్మద్ పటేల్ ని కూడా యమ స్పీడుగా నియంత్రించగల మంత్రాంగం తెలిసిన వాడు బారు. 

          రెండో అధికార కేంద్రం నుంచి మన్మోహన్ ఇబ్బందులెదుర్కొంటూనే ఆర్థిక విధానాల రూపకల్పనల్లో పైచేయి సాధిస్తారు. అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తన మానసిక పుత్రికైతే, ఈ క్రెడిట్ కూడా తనకి దక్కనివ్వదు రెండో అధికార కేంద్రం. ఇక కీలక అణు ఒప్పందం ఘట్టం ఎదురయ్యేసరికి తన తడాఖా చూపిస్తారు ప్రధాని. యూపీఏకి మద్దతిస్తున్న వామపక్షాలు అమెరికాతో ఈ అణు ఒప్పందానికి వ్యతిరేకంగా వున్నాయి. మన్మోహన్ గనుక వెనుకడుగేయక పోతే మద్దతు ఉపసంహరించుకుంటారు. సోనియా వెనుకడుగేయమనే వొత్తిడి చేస్తూంటే, మన్మోహన్ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఈ దెబ్బకి వామపక్షాలు పోయినా, సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ దేవుడు పంపిన దూతలా దిగుతారు. ఇలా మొదటి పాలనా కాలం (2004 – 09) మన్మోహన విజయంతో ముగుస్తుంది.

          రెండో పాలానా కాలానికి (2009-14) సంజయ బారు వుండరు. బారు మీద  మీడియాలో ఉద్దేశపూర్వక వ్యతిరేక కథనాలు ప్లాంట్ చేస్తూంటే, ఒకసారి వెళ్లి మేడమ్ ని కలవమని మన్మోహన్ చెప్తారు. నేను చెంచాగిరీ చేసే పార్టీ లీడర్ని కాను, మొండి పట్టుదలకి పోయే జర్నలిస్టునని రాజీనామా చేసి వెళ్ళిపోతారు బారు. 

          రెండో పాలనాకాలం మన్మోహన్ కి తెలియకుండా అవినీతితో పాపపంకిలమై పోతుంది.  ఇప్పుడు రాజీనామా చేయాలనుకోరు. చేస్తే దాని పరిణామాలు పార్టీ మీదా, పార్టీతో తన మీదా ఎలా వుంటాయో తెలుసు. ఈ అడకత్తెరలో పోకచెక్క నరకం అనుభవిస్తూనే రాజీ పడిపోతారు. దేశానికి నేనేమని చెప్పాలని అంటే, మీరు చెప్పక్కర్లేదు, పార్టీ చెప్తుందని సోనియా అనడం. కపిల్ సిబల్ ని దింపి 2జి, కోల్ గేట్ వగైరా స్కాముల్ని తిమ్మిని బొమ్మిని చేయడం.

          ఇక తను మూడోసారి ప్రధానిగా వుండనని ఎన్నికల ప్రచారం నుంచి      తప్పుకుంటారు మన్మోహన్. బిజెపి రికార్డు స్థాయిలో విజయం సాధిస్తుంది. రెండో పాలనా కాలానికి తను అపజయ బాధ మిగుల్చుకుని మౌనంగా నిష్క్రమిస్తారు మన్మోహన్.

అక్షయ్ ఖన్నాతో దర్శకుడు
 ఎలావుంది కథ         కథలా లేదు, ఇదే సమస్య. చాలా విషయాలున్నాయి. విషయాలన్నీ కథగా లేవు. ఇది కథలా కాకుండా, డాక్యుమెంటరీలా, న్యూస్ బులెటిన్ లా సాగుతూనే వుంటుంది. ఎంతకీ కథ మొదలవదు. ‘బాహుబలి’ గానీ, ‘ఎన్టీఆర్ బయోపిక్’ గానీ మొదటి భాగాలు ఉపోద్ఘాతాలు మాత్రమే. కథలు కావు. కథలు రెండో భాగంలో మొదలవుతాయి. ‘బాహుబలి’ మొదటి భాగం కథలేని ఉపోద్ఘాతమైనా తట్టుకుందంటే దాని వ్యవహారం వేరు, మేకింగ్ వేరు. ‘ఎన్టీఆర్ బయోపిక్’ ని రెండు భాగాలుగా కాకుండా, ఒకే మూవీగా కథే చెప్పేసి వుంటే ఫలితాలు వేరేగా వుండేవి. కథకీ ఉపోద్ఘాతానికీ, కథకీ గాథకీ తేడాల పట్ల అప్రమత్తంగా లేకపోతే ఇలాగే వుంటుంది. అయితే మన్మోహన్ బయోపిక్ రెండు భాగాలుగా తీయాలనుకున్నది కాదు. అలాంటప్పుడు తీసిన ఒక్కదాన్నీ కథగా తీయక, దర్శకుడితో బాటు మరో ముగ్గురు రచయితలూ ఉపోద్ఘాతంలా రాస్తూ తీస్తూ కూర్చోవడంతో, ఇదొక సినిమానే కాకుండా పోయింది. న్యూస్ బులెటిన్ లా తయారయ్యింది. 


        ఇది బయోపిక్ అనుకుంటే దీని ఉద్దేశం మన్మోహన్ కి క్లీన్ చిట్ నిస్తూ సోనియాని వేరేగా చూపించడమని తెలిసిపోతూనే వుంటుంది. రెండు పాలనా కాలాల్లోనూ సోనియా పోషించిన తెరవెనుక పాత్ర దేశానికి తెలిసిన విషయమే. ఇప్పుడీ ఎన్నికల సమయంలో ఈ బయోపిక్ తో ఏవైనా రాజకీయ ఉద్దేశాలుంటే, ఈ కాలం చెల్లిన పాత విషయాలతో అవి నెరవేరవు. ఇక మొన్నటి  దాకా రాహుల్ గాంధీని అన్ ఫిట్ అంటూ వచ్చారు. అంతకంటే అన్ ఫిట్ గా రాజకీయంగా మన్మోహన్ వున్నట్టు చిత్రించారు. దీనికి సోనియా బాధ్యత లేదు. స్వాభావికంగా ఆయనంతే. ఆయన సమర్ధుడైన బ్యూరోక్రాట్ మాత్రమే. కానీ ఆ సమర్ధతనైనా ప్రదర్శించుకోలేని అశక్తత  సోనియా వల్లే ఎదురైంది. ఇవన్నీ ఎవరు కేర్ చేస్తారు ఈ డాక్యుమెంటరీ లేదా న్యూస్ బులెటిన్ 
చూస్తూ.

        కేర్ చేసే ప్రక్రియ వేరే వుంది. అదేమిటో చివర చూద్దాం. అయితే ఈ బయోపిక్ వల్ల నెరవేరే ప్రయోజనం ఏమైనా వుంటే ఇదొక్కటే – హైకమాండ్ వల్ల మన్మోహన్ పడ్డ అవమానాలకి ఆయన మనోభావాలు అప్పుడెలా వుండేవో, ఎలా లోలోపల అణుచుకుంటూ వ్యధననుభవించి వుంటారో మనం ప్రత్యక్షంగా చూసి వుండే అవకాశం లేదు. చూడాలన్పించే ప్రేక్షకులకి ఈ బయోపిక్ తో  ఆ కోరిక నెరవేర వచ్చు. ఆయా సమయాల్లో మన్మోహన్ ఈ బయోపిక్ లో చూపించిన విధంగానే బాధపడ్డారని నిర్ధారణగా చెప్పలేం. కానీ సన్నివేశాల పరంగా వీలైనంత లాజికల్ గా కల్పన చేసి  ప్రేక్షకుల ముందుంచారు. అనేక చోట్ల కళ్ళు చెమర్చేలా ఆయనలోని మనకి తెలియని వ్యక్తిగత కోణాన్ని ఆవిష్కరించారు. బయోపిక్ లో ఇతర విషయాలన్నీ తెలిసిన పాత వాటికే రీప్లే, ఇదొక్కటే కొత్తగా తెలిసే విషయం. వ్యక్తిగా మన్మోహన్ అంతరంగ చిత్రణ. దీనికే మనం ప్రభావితం అవుతాం.

ఎవరెలా చేశారు 
     మాజీ ప్రధాని భౌతిక అనుకరణే గాక, మానసిక లోకాన్నీ అనుపమ్ ఖేర్ నిరుపమానంగా కళ్ళకి కట్టారు. మన్మోహన్ మాటలకి తగ్గట్టుగా ముఖంలో భావాలుండవు. ఎప్పుడూ ఒకేలా వుంటుంది ఆయన వదనం. ఇందువల్ల అనుపమ్ ఖేర్ కి ఎక్స్ ప్రెషన్స్ తో బాధ తప్పినా, సమయోచితంగా పలికే మాటలతోనే భావోద్వేగాల్ని అందించాల్సిన భారం మీద పడింది. ఈ కష్టాన్ని కష్టపడి మోశారు. భౌతిక అనుకరణలో మన్మోహనే అన్పించారు. మన్మోహన్ మార్కు నడక మాత్రం సూపర్ ఇమిటేషన్. ఒక విషయంలో మాత్రం మన్మోహన్ చాలా నిష్కర్షగా వుంటారని చూపించారు. తనని కలవడానికి ఏ పని మీద ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా నసగకుండా, ఒక్క క్షణంలో రెండు ముక్కల్లో తేల్చేసి చేతులు జోడిస్తారు. ఆ వ్యక్తి ఇక గబుక్కున లేచెళ్ళిపోవడమే. మన్మోహన్ ఒక్క క్షణంలో రెండు ముక్కల్లో తేల్చేశాక మళ్ళీ మారు మాట్లాడానికి వుండదు.  ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కి కూడా ఇదే పరిస్థితి.  ఇలా వచ్చి కూర్చుని సమస్య చెప్పుకున్నారో లేదో, మన్మోహన్ నుంచి ఒక్క క్షణంలో రెండు ముక్కల్లో తేల్చివేత ప్లస్ నమస్కారం ఎదురయ్యేసరికి - అలా లేచెళ్ళిపోతారు అయోమయంగా. మన్మోహన్ అలా దండం పెట్టడం వెనుక – పైన హైకమాండ్ వుంది, నన్నొదిలెయ్యండ్రా బాబూ అన్న అర్ధముందేమో స్పష్టత లేదు. ఈ సన్నివేశాల్లో అనుపమ్ ఖేర్ బెస్ట్ అనిపించారు.

          అణు ఒప్పందం అంశంలో రాజీనామాకి సిద్ధపడినప్పుడు సోనియాతో సన్నివేశంలో బ్యాలెన్సుడుగా కన్పించే తనే, రెండోసారి ఎన్నికలప్పుడు తను ప్రచార సారధ్యం వహిస్తానంటూ మొండితనం ప్రదర్శించే ఘట్టంలో ఖేర్ మెరుస్తారు. మన్మోహన్ ఎంత చిన్న పిల్లవాడంటే – మీరిలా రాజ్యసభ సభ్యుడిగా పరోక్షంగా వుండి పోవడం కాదు, ముందుకొచ్చి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని పార్టీని గెలిపించాలి, పార్టీలో మీకు ప్రత్యాన్మాయం లేదు – అని సంజయ బారు నూరిపోస్తే గానీ మన్మోహన్ కి ఇగో తన్నుకు రాదు. ఈ ఇగో ప్రదర్శనే సోనియాతో మొండితనం. కానీ ఎన్నికలు గెలిచి రెండోసారి ప్రధాని అయ్యాక, గెలుపు క్రెడిట్ ఆయనది కాదని పార్టీ అన్నప్పుడు- మన్మోహన్ మౌన ఆక్రందనని నటించిన ఖేర్ అద్భుతం. ఒక్క అణు ఒప్పందం విషయంలో హీరో తప్ప, మిగతా అన్ని విషయాల్లో మన్మోహన్ ని జీరో చేసే స్వపక్ష రాజకీయంతో మన్మోహన్ పూర్తిగా పాసివ్ పాత్రే. ఇలాటి సజీవ వెరైటీ పాసివ్ పాత్ర ఇంకే కాల్పనిక కథల్లోనూ కన్పించదు. ఈ వెరైటీ పాసివ్ పాత్రని అనుపమ్ ఖేర్ అర్ధవంతంగా పోషించారు.  

        ఆనుపమ్ ఖేర్ వెరైటీ పాసివ్ పాత్రయితే, సంజయబారుగా నటించిన అక్షయ్ ఖన్నా పక్కా చలాకీ యాక్టివ్ పాత్ర. సున్నిత హాస్యంతో సన్నివేశాల్లో హుషారు నింపేది తనే. అనుపమ్ ఖేర్ ని కంటికి రెప్పలా కాపాడే, పాపాయిలా ట్రీట్ చేస్తూ గుడ్ డాడీతనాన్ని ప్రదర్శించే,  శిష్యపరమాణువుగా ఖన్నా ఎక్సెలెంట్. మన్మోహన్ – సంజయ బారుల కెమిస్ట్రీ ఇలా వుండేదా అనేలా పాత్రచిత్రణ సాగింది. మన్మోహన్ ని ఆటలు పట్టిస్తూ గట్టిగా నవ్వే వ్యక్తి బారు ఒక్కడే అన్నట్టు వుంటుంది. అణు ఒప్పందం సందర్భంగా మన్మోహన్ (ఖేర్), బారు (ఖన్నా) ని పిల్చి- నువ్వెళ్ళి అమెరికా రాయబారితో ఏం మంతనా లాడేవ్? కే సెరాసెరా అంటూ ఏదో  కోడ్ లాంగ్వేజీ వాడేవట, ఏంటది? – అని బుంగమూతి పెట్టినప్పుడు-  బారు (ఖన్నా) పడీ పడీ నవ్వి- కే సెరా సెరా అంటే జరిగేది జరుగుతుందని అర్ధమండీ, అది హిచ్ కాక్ సినిమాలో పాట – అనగానే, మన్మోహన్ సతీమణి ఆ పాటందుకుని పాడేస్తే – మన్మోహన్ అమాయకత్వం బయటపడడం.  ఇలాటి కొంటెతనంతో వుంటుంది ఖన్నా పాత్ర, నటనా. ఇంకా ఈ పాత్రలో నటనా పరంగా ఫోర్త్ వాల్ ని ఛేదించి – ప్రేక్షకులవైపు తిరిగి కామెంట్లు విసిరే, ప్రేక్షకులకి వివరించే వ్యాఖ్యాతగా కూడా వుంటాడు. అయితే ముగింపుగా చివరి షాట్ లో మన్మోహన్ భవనంలోకి వెళ్తూంటారు. వెనుకనుంచి అక్షయ్ ఖన్నా ‘డాక్టర్ సాబ్’  అని పిలుస్తాడు. ఆయనకి వినపడక వెళ్ళిపోతూంటారు. మళ్ళీ పిలుస్తాడు. వినపడదు. ఇక ‘డాక్టర్ సాబ్!’ అని గట్టిగా అరుస్తాడు. ఇది బాగాలేదు. పెద్దాయన్ని అరుపులు అరిచి పిలవడం బాగా లేదు. బాధతో నిష్క్రమిస్తున్న పెద్దమనిషిని గద్దించడం అస్సలు బాగాలేదు. వినపడకపోతే దగ్గరికెళ్ళి మాట్లాడ వచ్చు. ఈ ముగింపు షాట్ చాలా బ్యాడ్ టేస్టు. 

           అయితే మన్మోహన్ ఈ బాధామయ నిష్క్రమణని చూపించిన విధానం కూడా ఆయన మనోవిశ్లేషణా యుక్తంగా లేక డొల్లగా వుంది. సినిమా పాత్ర ముగింపులో ఏదో నేర్చుకున్న సెన్స్ తోనే  వుంటుంది. ఇక్కడలా లేదు. సంజయ బారు ప్రకారం, మన్మోహన్ సింగ్ తన కింద జరుగుతున్న అవినీతిని చూసీ చూడనట్టు వుండడానికి హైకమాండ్ కారణం కాదు. ఆయన వ్యక్తిగత కారణమే వుంది. బ్యూరోక్రాట్ గా వున్నప్పుడు తను అవినీతి అంటని ఉన్నతాధికారిగా తనని తానూ కాపాడుకునే ఒక సిద్ధాంత నిష్ఠకి కట్టుబడే వారు. అదే సమయంలో ఆ సిద్ధాంతపు నిష్ఠని ఇతరుల మీద రుద్దకూడదని అనుకునే వారు. బ్యూరోక్రాట్ గా పనికొచ్చిన ఆ సిద్ధాంత నిష్ఠ, ప్రధాన మంత్రిగా పనికి రాదని తెలుసుకోలేక పోయారు. ఇప్పుడు కూడా బ్యూరోక్రాట్ గానే భావించుకోవడం వల్ల,  తన సిద్ధాంతపు నిష్ఠని ఇతరుమీదా అమలుచేయాలన్న ఆలోచన రాలేదు. వచ్చి వుంటే స్కాములు జరిగుండేవి కావేమో. జరిగిపోయాక రాజీనామా కూడా చేయలేని పరిణామాల్లో చిక్కుకున్నారు. తను మొదటిసారి మాత్రమే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. రెండోసారి కాదు. రెండోసారి యూపీఏని తనే అధికారంలోకి తెచ్చారు. తనే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అలాటిది తన ఈ కష్టార్జితం కేవలం తన సైకాలజీ వల్ల వృధా పోయిందన్నఎరుకతో, ఎవేర్నెస్ తో, ఒక పశ్చాత్తాపంతో  ముగించి వుంటే, మన్మోహన్ ఎంతో ఉన్నతంగా కన్పించేవారు. హైకమాండ్ నే దోషిగా నిలబెట్టాలన్న రాజకీయ ఉద్దేశాలుంటే ఇప్పుడున్న ముగింపు ఇంతే. 

          ఇంకొక్క ఆర్టిస్టు మాత్రమే ఈ బయోపిక్ లో ఆకట్టుకుంటారు. ఆమె మన్మోహన్ సతీమణి గురు శరణ్ కౌర్ గా నటించిన దివ్యా సేథ్ షా. సోనియాగాంధీగా నటించిన జర్మన్ నటి సుజాన్ బెర్నెర్ట్ పర్లేదు. సోనియా గాంధీ హిందీ మాడ్యులేషన్ కి డబ్బింగ్ ఆర్టిస్టు ఇంకా బెటర్. రాహుల్ గాంధీగా అర్జున్ మాథుర్ కుదర్లేదు. సీన్లు మూడే వుంటాయి. ప్రియాంకా గాంధీగా ఆహ్నా కుమ్రా ఓ మోస్తరు. ఇంకా పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ, పి. చిదంబరం, గులాం నబీ ఆజాద్, శివరాజ్ పాటిల్, కపిల్ సిబల్, అహ్మద్ పటేల్, అర్జున్ సింగ్, నట్వర్ సింగ్, అటల్ బిహారీ వాజ్ పేయీ, ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా, ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, నవీన్ పట్నాయక్, సీతారాం ఏచూరీ, ప్రకాష్ కారత్, నాటి అమెరికా  అధ్యక్షుడు జార్జి బుష్, నాటి పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ మొదలైన నాయకులుగా;  జేఎన్ దీక్షిత్, ఎంకే నారాయణన్, బ్రజేష్ మిశ్రా మొదలైన బ్యూరోక్రాట్లుగా; ఎన్. రామ్, వీర్ సింఘ్వీ, అర్నాబ్ గోస్వామి మొదలైన పాత్రికేయులుగా  కొత్త కొత్త  నటులు కనిపిస్తారు. వీళ్ళతో వుండేవి ఒక సీను, లేదా ఒక షాట్ మాత్రమే. కానీ దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకి వేసిన జ్యూనియర్ నటుడు ఘోరమైన విగ్గు పెట్టుకుని, కింది దాకా లేని ప్యాంటు వేసుకుని జోకర్ లా వున్నాడు.   

          బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ నీటుగా వున్నాయి. ప్రధాన మంత్రి కార్యాలయం సహా ఇతర లొకేషన్స్ అన్నీ రిచ్ గా వున్నాయి. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలుని ఓ మాదిరి సెట్ వేసి మేనేజి చేశారు. ఈ బయోపిక్ ని గంటా 50 నిమిషాల్లో ముగించారు. 

          ఏ మాటకామాటే చెప్పుకుంటే, కొత్త దర్శకుడికి ఎంత థ్రిల్లింగ్ బయోపిక్ వున్నా అవినీతికి సినిమా రంగంలో వెలివేత లేదు. మీటూకి తక్షణ బహిష్కారమే. ఇప్పుడు కొత్తగా మీటూ దెబ్బకి రాజ్ కుమార్ హిరానీ చేతిలో వున్న ప్రాజెక్టు కోల్పోయి కూర్చున్నాడు. మన్మోహన్ బయోపిక్ దర్శకుడికి  తన అవినీతితో ఇది ఎదురు కాలేదు. తను అవినీతిలో ఎంత రాణించినా, దర్శకత్వంతో నటింపజేసుకోవడం, సీన్లు తీయడం మాత్రం క్లాసుగానే  కానిచ్చాడు. ఒక్క సబ్జెక్టు తయారు చేసుకునే విషయంలోనే విఫలమయ్యాడు. అయితే, అవినీతి కుటుంబం నుంచి వచ్చిన వాడే, ఇంకో రాజకీయ కుటుంబం అవినీతికి పాల్పడిందని సినిమా తీయడమే కొసమెరుపు.

చివరికేమిటి 
       బయోపిక్ ని సినిమాలా తీయకుండా ఓ డాక్యుమెంటరీలా, న్యూస్ బులెటిన్ లా తీశాడు. ఇప్పుడు దేశంలో బయోపిక్ ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇంతే జోరుగా చాలా మంది నష్టపోతారు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు కొత్తగా వచ్చిన బయోపిక్ అనే దృశ్యమాధ్యమంతో పరిచయం, అనుభవం లేనట్టుంది. బయోపిక్ స్క్రీన్ ప్లే కూడా మామూలు సినిమా స్క్రీన్ ప్లేలానే వుంటుందని తెలీనట్టుంది. తీస్తున్న బయోపిక్స్ లో కథకీ ఉపోద్ఘాతానికీ, కథకీ డాక్యుమెంటరీకి, కథకీ న్యూస్ బులెటిన్ కీ తేడాలు తెలీక ఏదో తీసేస్తున్నారు. ఈ సీజన్లో రాజ్ కుమార్ హిరానీ ఒక్కడే సంజయ్ దత్ జీవితం మీద ‘సంజు’ అనే బలమైన బయోపిక్ ని సినిమాలాగా తీసి 600 కోట్లు ఆర్జించాడు. సినిమాని సినిమాలాగా చూడాలని దబాయిస్తూంటారు. ముందు సినిమాని సినిమాలాగా తీయాలని మాత్రం బుర్రకెక్కదు. 

          సినిమా కోసం బయోపిక్ నైనా సినిమా కథగానే తీయకపోవడం ఇక్కడ జరుగుతున్న పొరపాటు. బయోపిక్ తో సినిమా అనే ప్రక్రియ ఒక్కటే సక్సెస్ అవుతుంది. డాక్యుమెంటరీలూ, న్యూస్ బులెటిన్ల ప్రసారాలూ కాదు. సినిమా అంటే కథ, కథ, కథే
 తప్ప, మరోటి కాదు! కథే కూర్చోబెడుతుంది, కథనే కేర్ చేస్తారు ప్రేక్షకులు. 

          మన్మోహన్ బయోపిక్ కి తీసుకున్న సంజయ బారు పుస్తకంలో ‘సినిమా’ లో చూపించిన మన్మోహన్ బయోపిక్ అంతా లేదు. సంజయ బారు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ దగ్గర పనిచేసిన కాలానికే (2004 – 2008) పుస్తకం పరిమితమైంది. మన్మోహన్ రెండో పదవీకాలంలో జరిగిన అవినీతి గురించి పుస్తకం చివరి మాటగా కొంత  ప్రస్తావించి వదిలేశారు, అంతే. 


        మన్మోహన్ అణు ఒప్పందంతో సాధించిన పై చేయితో ఇంటర్వెల్ వేసి ఫస్టాఫ్ ముగించారు. ఇంతవరకే పుస్తకం. దీని తర్వాత సెకండాఫ్ పుస్తకం కాని దర్శకుడి మస్తకం. సెకండాఫ్ లో చూపించిన వాటితో పుస్తకానికి సంబంధం లేదు. అయినా పుస్తకం ఆధారంగానే మొత్తం బయోపిక్ తీసినట్టు ప్రచారం చేసుకున్నారు. పైగా సంజయ బారు పాత్రని సెకండాఫ్ లో పొడిగిస్తూ కల్పన చేశారు. 

          సెకండాఫ్ లో మన్మోహన్ మళ్ళీ ప్రధాని అయ్యాక చూపించినవి దర్శకుడు అక్కడా ఇక్కడా సేకరించిన మీడియాలో వచ్చిన విడివిడి వార్తలే. ముగింపుగా వచ్చే అవినీతి స్కాము దృశ్యాలు కూడా వార్తా సేకరణనలే. ఫస్టాఫ్ కి ముగింపుగా  అణు ఒప్పందంతో విజయం, సెకండాఫ్ ముగింపుగా అనినీతి తో పరాజయంగా పెట్టుకుని, ఇదే గొప్ప స్క్రీన్ ప్లే డిజైన్ అనీ, దీంతో మన్మోహన్ బయోపిక్ కి సమగ్రత వచ్చేసిందనీ అభిప్రాయపడ్డాడు యాక్సిడెంటల్ దర్శకుడు. రాజకీయ ఉద్దేశాలతో తీసే సినిమాలేవీ సక్కదనంతో వుండవు. చెత్తంతా పేరుకుంటుంది. రాజకీయ ఉద్దేశాలకి వున్న మీడియా వెరైటీలు చాలవన్నట్టు సినిమాల మీద పడడం. 

          సంజయ బారు పుస్తకం ఒక పాయింటుతో సాగే రాజకీయ డ్రామా కాదు. ప్రధాని రోజువారీ కార్యకలాపాల్లో చోటు చేసుకున్న వివిధ ఘట్టాల వృత్తాంతం, వాటి వెనుక తనకి తెలిసిన నిజానిజాలు. బయోపిక్ తీస్తూ పుస్తకంలోని ఈ తోచిన ఘట్టాలు పేర్చుకుంటూ పోయారు. ఒకదానితో వొకటి సంబంధం లేని చిరు చిరు ఘట్టాలు. కారబ్బూందీ పొట్లాలు. ఓడిశా సీఎం ఆర్ధిక సాయం అడగడానికి వచ్చి వెళ్ళడం, పాక్ ప్రధానితో మన్మోహన్ రెండు ముక్కలు కాశ్మీర్ గురించి మాట్లాడడం, చంద్రఖర్రావ్ (కేసీఆర్) తెలంగాణా గురించి మీతో ఏమన్నారని ఒక నాయకుడు మన్మోహన్ ని అడగడం...ఇలా మన్మోహన్ తో పుస్తకంలో నచ్చిన బిట్లు ఏరుకుని వేసుకుంటూ పోయాడు. వీటి పూర్వాపరాలేమిటో తెలియజేయకుండా. వీటికి కథతో సంబంధమేమిటో అర్ధంగాకుండా. నట్వర్ సింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ సూట్ లోకి వెళ్ళబోతూ ఆగిపోతారు. షాట్ కట్ అయిపోతుంది. ఎందుకు ఆగిపోయారో చెప్పడు.  మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మన్మోహన్ ఆర్డినెన్స్ పత్రాలు చించెయ్యగానే కట్, అర్నాబ్ గోస్వామీ రాహుల్ ని ఇంటర్వూ చేసిన ఘట్టంలో అర్నాబ్ ఒక ప్రశ్నేదో అడగ్గానే కట్...బిట్టు బిట్టుకీ కట్ కట్టులు. ఏదో కాస్త పొడుగ్గా జరగాలి కాబట్టి ఇంటర్వెల్ ముందు అణు ఒప్పందం గురించిన కాస్త డ్రామా, ముగింపులో అవినీతి గురించిన ఇంకాస్తా డ్రామా. 

      ఈ నానాజాతి సమితి బిట్లలో మళ్ళీ ఎక్కడా రాని వ్యక్తుల్ని  ఘనంగా పరిచయం చేయడం – బ్యూరోక్రాట్లు పులోక్ ఛటర్జీ, ఎంకే నారాయణన్, జేఎన్ దీక్షిత్... జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్ పరిచయం కాగానే, ప్రేక్షకుల వైపు తిరిగి – మీ మీద ఫైలుంది అంటారు. వామ్మో ఈయనేదో చేస్తాడనుకుంటాం. మనిషి మళ్ళీ కన్పించకుండా మాయం. ఇలా పే ఆఫ్ కాని బిల్డప్పులే. ఇలా వివిధ వార్తల నానాజాతి సమితిలా వుంటుంది స్క్రీన్ ప్లే అనే పదార్ధం. 

          బయోపిక్ స్క్రీన్ ప్లేకి  ఎప్పుడో ‘గాంధీ’ తీసిన రిచర్డ్ అటెన్ బరో ఒక మార్గం వేశాడు. ఇటీవల 2012 లో స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన ‘లింకన్’ వుంది. ఇంకా చాలామంది తీసిన చాలా బయోపిక్ లు వున్నాయి. బయోపిక్ అంటే మామూలు సినిమా కథలాగే ఆ వ్యక్తి పాత్ర,  అది ఎదుర్కొనే సమస్య, కనుగొనే పరిష్కారం, చివర విజయమో అపజయమో, ఇంతే.

          బయోపిక్ అంటే పుట్టిందగ్గర్నుంచీ చచ్చిందాకా ఆ వ్యక్తి జీవితాన్ని పూసగుచ్చినట్టు చూపించడం కాదు. ఆ వ్యక్తి జీవితాన్ని మార్చిన ఒకే ఒక్క మలుపు, లేదా ఒక లక్ష్యం కోసం ఆ వ్యక్తి ఎదుర్కొన్న సమస్య మాత్రమే సినిమాకి బయోపిక్ అవుతుంది. మహాత్మా గాంధీ లక్ష్యం స్వాతంత్ర్య సముపార్జన. దీనికి ప్రేరణ 1) దక్షిణాఫ్రికా రైల్లో జరిగిన అవమానం, అప్పుడు 2) సహాయ నిరాకరణోద్యమం, 3) క్విట్ ఇండియా - స్వాతంత్ర్య సిద్ధి, 4) మతకల్లోలాలు – మరణం. ఇంతే, శాఖోపశాఖలుగా విస్తరించిన మహాత్ముడి జీవితంలో ఈ నాల్గే ఘట్టాల్ని స్క్రీన్ ప్లే కి ఫౌండేషన్ గా తీసుకుని, అజరామరమైన చలనచిత్రరాజాన్ని ప్రపంచానికందించాడు అటెన్ బరో. అంతేగానీ మహాత్ముడు ఎలా సత్యనిష్టుడో చిన్నప్పటి సీన్లేద్దాం, కుటుంబం సీన్లేద్దాం, ఆ బిట్లు వేద్దాం, ఈ బిట్లు తెచ్చి వేద్దామని కలగాపులగం చేయలేదు. మహాత్ముడి వ్యక్తిగత జీవితమే చూపించాలంటే,  ఆ పాయింటుతో అది వేరే బయోపిక్ అవుతుంది. ‘గాంధీ మై ఫాదర్’ అనీ గాంధీ మీద కోపం వచ్చేలా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ తీయనే తీశాడు. 

      ఇలాగే స్పీల్ బెర్గ్ ‘లింకన్’ తీసినప్పుడు సినిమా కథగానే తీశాడు. వెండితెర వున్నది కథల కోసం తప్ప, గాథలతో, ఉపోద్ఘాతాలతో, డాక్యుమెంటరీలతో, న్యూస్ బులెటిన్ లతో, బుర్రలేని కాకమ్మ కబుర్లతో గలీజు చేయడానికి కాదు. వెయ్యి మంది చూస్తూ కూర్చునే హాల్లో వేళాకోళం వేషాలు కాదు. టికెట్లతో తిక్క వేషాలు కాదు. ‘లింకన్’ తీసినప్పుడు స్పీల్ బెర్గ్ అమెరికా పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ జీవితాన్నంతా కామెంటరీ చేస్తూ తీయలేదు. ఆయన జీవితంలోని ఒక ప్రధాన ఘట్టం – అగ్నిపరీక్ష లాంటిది – 13 వ రాజ్యాంగ సవరణ గురించిన రాజకీయ డ్రామాని మాత్రమే స్క్రిప్టు చేశాడు. ఈ డ్రామాలో లింకన్ పాత్ర, 13 వ రాజ్యాంగ సవరణ అనే సమస్య, దీనికోసం సంఘర్షణ, విజయం, ఇంతే వున్నాయి. ఎందరో రచయితలు లింకన్ జీవితాన్ని పుట్టిన దగ్గర్నుంచీ ఎపిసోడ్లు రాసుకొస్తే (మన యాక్సిడెంటల్ దర్శకుడిలాగే )వాటిని పక్కన పడేశాడు. ఈ బయోపిక్ కి డొరిస్ కీర్న్స్ గుడ్విన్ రాసిన పుస్తకం ఆధారం. 500 పేజీల ఈ లింకన్ జీవిత చరిత్రలో స్పీల్ బెర్గ్ కేవలం నాలుగు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు. కసరత్తు చేస్తే కుదరదన్పించింది. రెండు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు. ఈ రెండు నెలల కాలంలో చోటు చేసుకున్న 13 వ రాజ్యాంగ సవరణ పరిణామాలతో బయోపిక్ తీసి పెద్ద విజయం సాధించాడు ( బడ్జెట్ 65 మిలియన్ డాలర్లు,  బిజినెస్ 275 మిలియన్ డాలర్లు).

          1970 లలో ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ని ముంచిన వాటర్ గేట్ కుంభకోణాన్ని కూపీలాగి పుస్తకం రాశారు ఇద్దరు జర్నలిస్టులు. ‘ఆల్ ది ప్రెసిడెంట్స్ మెన్’ అన్న పుస్తకం టైటిల్ తోనే గొప్ప సినిమా తీశారు. పుస్తకాన్ని స్క్రీన్ ప్లేగా మార్చే బాధ్యత హాలీవుడ్ లో ఆచార్యుడు లాంటి రైటర్ విలియం గోల్డ్ మాన్ తీసుకున్నాడు. అప్పటికే ఒక ఆస్కార్ అవార్డు తన ఖాతాలో వుంది. పుస్తకంలోని రెండో భాగాన్నితీసి అవతల పడేసి మొదటి భాగంతోనే స్క్రీన్ ప్లే రాశాడు. పుస్తకం రాసిన జర్నలిస్టులిద్దరు గోలగోల చేశారు. ఒక జర్నలిస్టు గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఇంకో స్క్రీన్ ప్లే కూడా రాశాడు. స్క్రీన్ రైటింగ్ అంటే జర్నలిజం కాదన్నాడు గోల్డ్ మాన్. స్క్రీన్ మీద జర్నలిజాన్ని చూడరన్నాడు. బిగ్ స్టార్ రాబర్ట్ రెడ్ ఫోర్డ్, దర్శకుడు అలన్ పకూలా కంగారు పడి స్క్రీన్ ప్లే తీసుకుని నెలరోజులు అజ్ఞాతంలో కెళ్ళి పోయారు. దాంతో కుస్తీ పట్టారు. ఇలా కాదు, అలా వుండాలి...అలా కాదు, ఇలా చేద్దాం...రెండో భాగాన్ని ఇలా కలుపుదాం, కాదు అలా కలుపుదామని జుట్లు పీక్కుని పీక్కునీ ఏమీ చేయలేక పెద్దాయనే కరెక్ట్ అని, పెద్దాయన రాసిన శిలాశాసనాన్నే సినిమా తీశారు. ఎక్కడికో వెళ్ళిపోయి చరిత్ర కెక్కింది. ఎన్నో ఆస్కార్ అవార్డు లొచ్చి పడ్డాయి. ఆ స్టార్ కీ, దర్శకుడికీ కాక, పెద్దాయనకే ఇంకోటి పడింది. ఆల్ ది గోల్డ్ మాన్స్ మెన్. 

          మన్మోహన్ బయోపిక్  సగం బారు పుస్తకం, సగం దర్శకుడి మస్తకంగా వుందని చెప్పుకున్నాం. ఆయన పుస్తకంలోని అణు ఒప్పందాన్ని (మొదటి పాలనా కాలం) ఫ్లాష్ బ్యాకుగా పెట్టుకుని, తన మస్తకంలోని అవినీతి స్కాముల్ని (రెండో పాలనా కాలం) కథగా చేసుకుంటే సరిపోయేది. రెండో పాలనా కాలంతో కథ ప్రారంభించి, మధ్యలో మొదటి పాలనా కాలపు ఫ్లాష్ బ్యాక్ పూర్తి చేసి- రెండో పాలనా కాలంతో కథ ముగించేస్తే ఏ గొడవా లేకుండా పోయేది. 


        అంటే అవినీతికి సంబంధించిన పరిణామాలతో మన్మోహన్ ఉక్కిరిబిక్కిరవుతున్నప్పుడు- అణు ఒప్పందంతో తన విజయానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకోవడం - ఆ జ్ఞాపకాల్లోంచి బయట పడ్డాక -  అవినీతి కథతో  అలాటి విజయాన్ని చవిచూడలేక ఓడిపోవడమనే ముగింపు అన్నమాట.

          మొదటి పాలనాకాలంతో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో  మొదట రెండో అధికార కేంద్రంతో సంఘర్షణ చూపించి, తర్వాత  అణుఒప్పందం చుట్టూ డ్రామా నడిపితే సరిపోతుంది. మిగతా నానాజాతి సమితి న్యూస్ రీల్ బిట్లన్నీ తీసి విలియం గోల్డ్ మాన్ లా అవతల పారేసినా అడిగే వాళ్ళుండరు. బారు పుస్తంలో రెండో అధికార కేంద్రంతో, అణుఒప్పందంతో వున్న మెటీరియల్ తప్ప మిగాతా ఏవీ బయోపిక్ కి పనికిరావు. పుస్తకంలో రెండో అధికార కేంద్రానికి సంబంధించి చాలా సమాచారముంది.  కేబినేట్ లో మంత్రులు తామే ప్రధాని అన్నట్టు వ్యవహరించడం, ఏకే ఆంటోనీ విదేశీ వ్యవహారాల నుంచీ రక్షణ వ్యవహారాల దాకా దేనితోనూ మన్మోహన్ తో ఏకీభవించక పోవడం, తన జ్యూనియర్ ప్రమోటయ్యాడని ప్రణబ్ ముఖర్జీ మన్మోహన్ ని లక్ష్య పెట్టకపోవడం, విదేశాంగ మంత్రిగా వాషింగ్టన్ వెళ్లి జార్జి బుష్ నీ, కండెలెజ్జా రైస్ నీ కలిసివచ్చాక ఆ సమావేశాన్ని మన్మోహన్ కి రిపోర్టు చేయకుండా మూడు రోజులు తప్పించుకోవడం...ఇలా చాలా వున్నాయి.    
  
          మన్మోహన్ మొదటి పాలనా కాలంలో అణు ఒప్పందం విజయం ప్రధానమైనదే. ఆ కాలంలో ఇంకా విజయాలున్నాయి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో బాటు, ఆర్టీఐ చట్టం, ఆధార్ కార్డు చట్టం, గ్రామీణ హెల్త్ మిషన్ ప్రాజెక్టు మొదలైనవి. వీటిని కూడా భాగం చేయాలి. 

          అప్పుడు మన్మోహన్ బయోపిక్- అవినీతి సమస్య, దాంతో సంఘర్షణ, పరాజయం అనే ప్రధాన కథగా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తో వుంటూ – ఇందులో ఫ్లాష్ బ్యాకుగా అణు ఒప్పందపు విజయం వుండి - ఇబ్బంది పెట్టకుండా అర్ధవంతంగా సాగిపోయేది.

సికిందర్
https://telugurajyam.com/



8, జనవరి 2019, మంగళవారం

724 : విస్మృత సినిమాలు - 'పాలపిట్ట' ఆర్టికల్


    తెలుగు ప్రేక్షకుల సినిమాభిరుచి అప్పుడూ ఇప్పుడూ ఒకే తరహాలో తీర్చిదిద్దుకు న్నట్టుంది. సినిమాలు పక్కా వినోదాత్మకంగా వుండాలన్నదే మెజారిటీ వర్గం ప్రేక్షకులు శిలాశాసనం రాసుకున్న ఏకైక అభిరుచేమో. స్టాంపు వేసిన ఈ అభిరుచి ప్రకారం సినిమాలు వుండకపోతే  విషయం లేని సినిమాల కింద మరణశాసనం రాసేస్తారు. బలమైన కథ వుందంటే, ఇక విషయం లేనట్టేనని తీర్పు ఇచ్చేస్తారు. ఈ వర్గం ప్రేక్షకులు కాలగర్భంలో కలిపేసిన సినిమాలన్నీ విస్మృత సినిమాలు కావు. తగిన కథాబలమూ, కథా ప్రయోజనమూ వుండి, వాళ్ళ అభిరుచికి దూరంగా వుండిపోయినవే విస్మృత సినిమాలన్పించుకుంటాయి. వాళ్ళ దృష్టిలో వీటికి వినోదాత్మక విలువ వుండదు. వినోదాత్మక విలువలు లేని సినిమాలు ఇతర భాషల్లో హిట్టయి చరిత్రలో నిల్చిపోతే, అవే తెలుగులో పునర్నిర్మించినప్పుడు ఫ్లాపయి పౌరసత్వాన్ని కోల్పోతాయి. ఇలాటిదే ఇంకో విస్మృత సినిమా ‘మనసే మందిరం’. ఇది తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో హిట్టయి, విచిత్రంగా తెలుగులో టైటిల్ మాత్రమే పాపులరైంది. 

         
మిళ మాతృక నుంచి ఈ రీమేకులన్నీ జరిగాయి. వినోదాత్మక విలువలు లేని, పూర్తి శోక రసమయమైన ఈ మాతృకని, ఎలా ఇన్ని భాషల్లో రీమేక్ చేయడానికి సాహసించారనేది జవాబు దొరకని ప్రశ్న. బహుశా కథని నమ్మడం వల్ల, కథకిచ్చిన ముగింపుకి దాసోహమై పోవడం వల్ల. ఇంతకంటే కారణాలు కన్పించవు. అదింకా 1960 ల నాటి కాలం. ట్రాజడీలని ఆదరిస్తున్న ట్రెండ్. ఈ ట్రెండ్ లో సి.వి. శ్రీధర్ అనే నిర్మాత, దర్శకుడు, రచయిత ‘నెంజిల్ ఒరు ఆలయం’ అనే విషాదాంత ప్రేమాయణం తీశాడు. సి.వి. శ్రీధర్ ( చిత్తమూర్ విజయ రాఘవులు రెడ్డియార్ శ్రీధర్, 1933 – 2008) తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంచి పేరున్నదర్శకుడు.1954 లో 21 వ యేట దర్శకుడైన శ్రీధర్, 1991 వరకూ 37 ఏళ్ల సుదీర్ఘ వృత్తి జీవితంలో 66 సినిమాలు తీశాడు. వీటిలో 47 తమిళం, 10 తెలుగు, 9 హిందీ వున్నాయి. ఎమ్జీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, రాజ్ కపూర్, రాజేంద్రకుమార్, రాజ్ కుమార్, అశోక్ కుమార్, కిషోర్ కుమార్, శశికపూర్, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, శత్రుఘ్న సిన్హా, అక్కినేని నాగేశ్వరరావు, మీనాకుమారి, వైజయంతీ మాలా, రాజశ్రీ, హేమమాలిని, ముంతాజ్, సావిత్రి, కృష్ణకుమారి, బి. సరోజా దేవి, దేవిక...ఇలా కనువిందు చేసే అగ్ర తారాతోరణంతో ఆయన సినిమాలు కళకళ లాడేయి. 

         ఐతే 1962 లో రాసి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘మనసే మందిరం’ మాతృక ‘నెంజిల్ ఒరు ఆలయం’ మహోజ్వల చిత్రరాజం నాటికి అతడేమీ వయసుమీరిన అనుభవశాలి కాదు. అప్పటికింకా 29 ఏళ్ళే! దీనికి పాపులర్ హీరోని తీసుకోక కన్నడ, తమిళ హీరో కళ్యాణ్ కుమార్ ని తీసుకున్నాడు. దేవిక కథానాయిక. ఆర్. ముత్తు రామన్ సహాయపాత్ర. ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతం, ఏ. విన్సెంట్ ఛాయాగ్రహణం. విలువలు గుర్తించిన మనుషులు స్వార్ధానికి పోరనీ, విలువల కోసం త్యాగాలు చేస్తారనీ, ప్రాణత్యాగానికి సైతం వెరవరనీ నీతిని ప్రకటిస్తూ ఇది సంచలన విజయం సాధించడమే గాక, ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు కూడా పొందింది.

          వెంటనే 1963 లో హిందీలో రీమేక్ చేశాడు. అప్పుడు బొటాబొటీ ముప్ఫై
ఏళ్ళే!  రాజేంద్ర కుమార్, మీనా కుమారి, రాజ్ కుమార్ లాంటి ఉద్దండులతో  ‘దిల్ యేక్ మందిర్’. తీశాడు. శంకర్ – జైకిషన్ సంగీతం, ఏ. విన్సెంట్ ఛాయాగ్రహణం. ఇది 175 రోజులు ఆడి భారీ విజయం సాధించింది (అప్పట్లో కోటీ పది లక్షలు). ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. రాజ్ కుమార్ కి ఫిలిం ఫేర్ సహాయ పాత్రధారి  అవార్డు లభించింది. 1966 లో తెలుగులో ‘మనసే మందిరం’ గా ఇంకో రీమేక్ చేశాడు. అప్పుడు 33 ఏళ్ళు! అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య నటీనటులు. ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతం, బాలు ఛాయాగ్రహణం.  

          1976 లో మలయాళంలో ‘హృదయం ఒరు క్షేత్రం’ గా, 1977 లో కన్నడలో ‘కుంకుమ రక్షే’ గా అక్కడి నిర్మాతలు, దర్శకులు రీమేక్స్ చేశారు. ఇలా మాతృకతో కలుపుకుని మొత్తం ఐదు సినిమాలయ్యాయి. తెలుగులో తప్ప అన్నీ హిట్టయ్యాయి. ఒక్క   శ్రీధర్ తీసిన తమిళ, హిందీ, తెలుగు రీమేకులు తెలుపు – నలుపులో అయితే; మలయాళ, కన్నడ రీమేకులు రంగుల్లో తీశారు. హాలీవుడ్ నుంచి జగ్ ముంద్రా దీన్ని ఇంగ్లీషులో రీమేక్ చేయాలనీ కూడా విఫలయత్నం చేశాడు.

జరిగేదంతా లోపలే 
      ‘మనసేమందిరం’ తెలుగు రీమేక్ లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్యలతో బాటు, గుమ్మడి, నాగభూషణం, రేలంగి, చలం, శాంతా కుమారిలు నటించారు. సంభాషణలు, పాటలు ఆచార్య ఆత్రేయ రాశారు. ఒక పాట కార్తీక్ రాశారు. ఘంటసాల, పి. సుశీల, ఎల్లారీశ్వరి, పిబి శ్రీనివాస్ లు గానం చేశారు. ‘అల్లారు ముద్దు కదే అపరంజి ముద్ద కదే’ (పి. సుశీల), ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు’ (పిబి శ్రీనివాస్) పాటలు రెండూ ఇప్పటికీ హిట్టేనని తెలిసిందే. 

          మాతృకతో బాటు రీమేకులన్నీ పూర్తిగా హాస్పిటల్లో తీసినవే. ఒక ప్రేమ సన్నివేశం, హిందీలో ఒక పాట తప్ప, హాస్పిటల్ దాటి బయటికి రాని ఇండోర్ కథా కథనాలతో తీశారు. మొదటి సీనుతో హస్పిటల్లోకి వెళ్ళే కెమెరా, చివరి సీనులో మాత్రమే హాస్పిటల్ దాటి బయటి దృశ్యాని కొస్తుంది. ఈ రెండున్నర గంటల ఇండోర్ డ్రామా 30 రోజుల్లో తీశారు. తెలుగులో సారధి స్టూడియోలో తీశారు. పాటల విషయాని కొస్తే, హిందీలో ఎక్కువ హిట్టయిన వెంటాడే పాటలున్నాయి : ‘యహా కోయీ నహీ తేరే మేరే సివా’ (రఫీ), ‘హమ్ తేరే ప్యార్ మే సారా ఆలమ్’ (లత), ‘యాద్ న జాయే భీతే దినోకీ (రఫీ), రుక్ జా రాత్ ఠెహర్ జారే చందా’ (లత),  ‘దిల్ యేక్ మందిర్ హై’ (రఫీ, సుమన్ కళ్యాణ్ పూర్).

రెండు వారాల కథ 
      10 వ తేదీన క్యాలెండర్లో కాగితం చినగడంతో ప్రారంభమయ్యే కథ, క్యాలెండర్లో 24 వ తేదీతో ముగుస్తుంది. ఇది టైం లాక్ కథా సంవిధానం. డాక్టర్ రఘు (అక్కినేని నాగేశ్వర రావు) ఆపరేషన్ కి ప్రకటించే రెండు వారాల గడువులోపల జరిగే సంఘటనల సమాహారమే ఈ కథ. ఈ టైంలాక్ చేయడంవల్ల, డెడ్ లైన్ సమీపిస్తున్న కొద్దీ ఏం జరగబోతోందన్న సస్పెన్స్ వెంటాడుతూంటుంది. డాక్టర్ రఘు చేతిలో ఆపరేషన్ సక్సెస్సా, ఫెయిలా? ఉత్కంఠ రేపే ఈ సస్పెన్స్ తో కూడిన కథనం ప్రతీదృశ్యాన్నీ విడువకుండా చూసేలా చేస్తుంది.   క్యాలెండర్లో లెక్కపెట్టి ఒక్కో తేదీ మారుతూంటే, ఆపరేషన్ ఫెయిలయ్యే ముందస్తు సూచనలే, పరిణామాలే (కుక్క ఏడ్పు, బాలిక మరణం లాంటివి) ఆందోళన పరుస్తూంటాయి. ఆపరేషన్ ఫెయిలయితే డాక్టర్ రఘు తీవ్ర ప్రమాదంలో పడిపోయే గండం పొంచి వుంటుంది. అప్పుడతను జీవించినా మరణించినట్టే లెక్క. ‘ఉత్తమురాలైన తల్లికి పుట్టిన కొడుకు’ గా విశ్వసనీయత కోల్పోయి పతనమై పోతాడు. అయినా ఈ భారీ మూల్యం చెల్లించుకునే రిస్కుకే  సిద్ధపడతాడు. ఇలా కథలో ఒక పాత్రగా క్యాలెండర్ అనే ప్లాట్ డివైస్, కథనంలో సస్పెన్స్ అనే ఎలిమెంట్, క్యారెక్టర్ కి అధిక రిస్కుతో కూడిన గోల్ – ఈ మూడూ బలమైన ప్రధాన పనిముట్లుగా కుదిరి, ఈ ప్రేమకథ స్క్రీన్ ప్లేతో ఎప్పుడో అరవై ఏళ్ల నాడే, నూతన దృక్పథంతో  అత్యత్భుత కథన చాతుర్యాన్ని కనబర్చాడు యంగ్ శ్రీధర్. ఇందుకే జగ్ ముంద్రా ఇంగ్లీషులో రీమేక్ చేయాలనుకుని వుంటాడు.  

          హాస్పిటల్లో నవంబర్ తొమ్మిదవ తేదీ క్యాలెండర్ కాగితం చించి రోజు ప్రారంభిస్తాడు డాక్టర్ రఘు (ఏఎన్నార్). తల్లి (శాంత కుమారి) వచ్చి,  ఇంటికి రాకుండా హాస్పిటల్లోనే వుండిపోతున్నావు, ఒకసారి ఇంటికి రమ్మని ప్రాధేయపడుతుంది. తనకి హస్పిటలే జీవితమంటాడు. హాస్పిటల్ కి సీత (సావిత్రి) వస్తుంది. ఆమెని చూసి ఖిన్నుడవుతాడు రఘు. ఆమె కూడా అతణ్ణి చూసి కంగారు పడుతుంది. ఇద్దరూ గతంలో ప్రేమికులు. ఆమె కూడా భర్త వుంటాడు. అతడి ముందు బయటపడకుండా జాగ్రత్తపడతారు. భర్త రాము (జగ్గయ్య) కి క్యాన్సర్ వుందనీ, చికిత్స కోసం తీసుకు వచ్చాననీ అంటుంది. 

          డాక్టర్ రఘు వైద్య విద్య కోసం విదేశాల కెళ్ళినప్పుడు, తను ప్రేమిస్తున్న సీతకి ధనికుడైన రాముతో బలవంతపు పెళ్లి చేసేస్తాడు ఆమె తండ్రి. ఇది తెలుసుకున్న రఘు మానసికంగా దెబ్బతిని, ఇక పెళ్ళే చేసుకోనని, హాస్పిటల్ కి అంకితమై పోతాడు. 

          ఇప్పుడామె భర్తకి క్యాన్సర్. ఆమె సందిగ్ధంలో పడుతుంది. ఈ హాస్పిటల్ రఘుదని తెలీక వచ్చేసింది. ఇప్పుడు భర్తని ఇతడి చేతిలో పెడితే నయం చేస్తాడా, కక్ష తీర్చుకుంటాడా? రెండు వారాల్లో ఆపరేషన్ చేయకపోతే బతకడని రఘు అనేస్తాడు. ఆమె భర్తని కాపాడాలనే తప్ప అతడి మనసులో ఇంకే ఉద్దేశాలూ వుండవు. రాముకి వీళ్ళిద్దరి ప్రేమ గురించి తెలిసిపోతుంది. అతను అర్ధం జేసుకుని, ఆపరేషన్ లో తను మరణిస్తే, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని తీర్మానిస్తాడు. సీతకి ఇది జీర్ణంకాక రామూని బతికించుకోవాలని తీవ్ర సంఘర్షణ ప్రారంభిస్తుంది. రాము మాటలతో రఘు ధైర్యం కోల్పోతాడు. ఆపరేషన్ ఏ మాత్రం విఫలమైనా అది సీత తన సొంతమవుతుందన్న ఆశతోనే చేశాడని అందరూ అనుకుంటారు. ఇది భరించలేడు. దీంతో ఆపరేషన్ మీది బెంగతో నిద్రాహారాలు మాని, సర్జరీ శాస్త్రాలన్నీ తిరగేస్తూ పిచ్చివాడై పోతాడు. చివరికి ఆపరేషన్ రోజు రానే వస్తుంది. ఆపరేషన్ సక్సెస్ చేసి కుప్పకూలి మరణిస్తాడు డాక్టర్ రఘు.

విశిష్ట కథనం, పాత్రచిత్రణలు 
       పైన చెప్పుకున్నట్టు ఈ కథనానికి సస్పెన్స్ ప్రాణమై నిల్చింది. ఇప్పటి తెలుగు సినిమా ప్రేమ కథల్లో, కుటుంబ కథల్లో సస్పెన్స్ అనే ఎలిమెంటే వుండడం లేదు. అదేదో మిస్టరీ, క్రైం, యాక్షన్ కథల వ్యహారమనుకునే దురవగాహనతో వుంటున్నారు. పైగా గత రెండు దశాబ్దాలుగా తెలుగులో అవే రోమాంటిక్ కామెడీలూ, లేదంటే అవే మాస్ యాక్షన్లూ మాత్రమే చూస్తూ పెరిగిన కొత్తతరం దర్శకులు ఇంకో కళాప్రక్రియని  వూహించలేక పోతున్నారు. ఎప్పుడైనా కుటుంబ కథ తీస్తే ఆ పాత్రల జీవితాల్లో థ్రిల్లే వుండదు, సస్పెన్సే వుండదు. పాసివ్ పాత్రలతో చప్పగా పాసివ్ కథనాలు చేసి చేతులు దులుపు కుంటున్నారు.

          ‘మనసే మందిరం’ ముఖ్య పాత్రలు మూడూ పాసివ్ పాత్రలు కాదు. ఈ కథ ట్రాజడీయే అయినా తలరాతని విధికే వదిలేసి ఏడుస్తూ కూర్చునే పాసివ్ పాత్రలు కావు. తలరాతని మార్చుకోవడానికి పరిస్థితులతో సంఘర్షించే, లక్ష్యమున్న యాక్టివ్ పాత్రలు. డాక్టర్ రఘు పాత్రలో ఏఎన్నార్ కి ఆపరేషన్ విజయవంతం చేయాలన్న లక్ష్యం, దాంతో సంఘర్షణ;  సీత పాత్రలో సావిత్రికి మృత్యు ముఖం లోంచి భర్తని కాపాడుకోవాలన్న లక్ష్యం, దాని తాలూకు సంఘర్షణ; క్యాన్సర్ రోగి రాము పాత్రలో జగ్గయ్యకి వాళ్ళిద్దర్నీ కలపాలన్న లక్ష్యం, దీని తాలూకు సంఘర్షణ. లక్ష్యం మాటల్లో వుంటే చాలదు, అది చర్యల్లో విజువల్ గా కన్పించాలి. జగ్గయ్య వాళ్ళిద్దరికీ కలిపి వీలునామా కూడా రాసేసి లక్ష్య శుద్ధిని చాటుకుంటాడు. 

          ఈ కథనంలో ఆలస్యం చేయకుండా రెండో సీన్లోనే కథ ప్రారంభించేస్తాడు దర్శకుడు. మొదటి సీనులో తల్లి వచ్చి, ఇంటికి రమ్మని ఏఎన్నార్ తో చెప్పి వెళ్ళాక,  రెండో సీన్లోనే సావిత్రి జగ్గయ్యతో వచ్చేస్తుంది. జగ్గయ్యకి క్యాన్సర్. ఏఎన్నార్ కి ఎదుట వున్న సావిత్రితో పాత జ్ఞాపకాల తూఫాను, సావిత్రికి ఏఎన్నార్ మీద అనుమానం, వ్యతిరేకత. ఇలా కథకి ప్రధాన పాత్ర ఏఎన్నార్ అయితే, వ్యతిరేకించే ఎదుటి పాత్రగా సావిత్రి, వీళ్ళిద్దరి మధ్య గార్డియన్ పాత్రగా జగ్గయ్య. ఇలా బలాబలాల సమీకరణ పూర్తయ్యింది ఇక సంఘర్షణ అనే కథనరంగానికి. 

          ఈ రెండో సీన్లోనే ఎక్స్ రే చూస్తున్నప్పుడు, ఏఎన్నార్ కి సావిత్రితో గతం తాలూకు ఒక దృశ్యం మెదులుతుంది. వీళ్ళిద్దరూ పూర్వ  ప్రేమికులని దృశ్యపరంగా క్లుప్తంగా చెప్పడం. ఈ సంక్షిప్త దృశ్యంలో పెళ్లెప్పుడని సావిత్రితో ఏఎన్నార్ అంటాడు. తండ్రితో మాట్లాడతానని ఆమె చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంతకి మించి వీళ్ళిద్దరి పూర్వ ప్రేమ సన్నివేశాలు కథనంలో మరెక్కడా రావు. హాలీవుడ్ స్క్రీన్ ప్లే సూత్రమొకటుంది :  కథనంలో డిమాండ్ ని సృష్టించు, సరఫరాని ఆపెయ్యి అని. 

          ఇలా ఈ వొక సీనులో వాళ్ళ ప్రేమని అరకొరగా చూపించేసి, మనకి పూర్తిగా చూడాలన్పించే డిమాండ్ ని సృష్టించాడు దర్శకుడు. కానీ మరెక్కడా ఏఎన్నార్ – సావిత్రి హిట్ రోమాంటిక్ జంటతో మనకి చూడాలన్పించే ఆ పూర్తి  ప్రేమ తాలూకు నులి వెచ్చని సన్నివేశాలని సరఫరా చేసి,  డిమాండ్ ని తీర్చే పాపాన పోడు దర్శకుడు. కవితాత్మకంగా వూహకే వదిలేశాడు. దీంతో ఈ కథన భంగం (సీనస్ ఇంటరప్టస్) ఒక తియ్యటి బాధలా మిగిలిపోతుంది మనకి. ఇలాటి తియ్యటి బాధల్ని సృష్టించడం గొప్ప దర్శకుల వల్లే అవుతుంది. సినిమా ద్వితీయార్ధంలో ఒక చోట సావిత్రే తానెందుకు జగ్గయ్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మాటల్లో చెప్తుంది. ఇప్పుడు కూడా ఫ్లాష్ బ్యాక్ వేయలేదు. ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రధాన కథకి అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే. అది కథవదు. కనుక మాటల్లో చెప్పేస్తే సరిపోతుంది. దాన్నే ఫ్లాష్ బ్యాకువేసి చూపిస్తూ పోతే,  అది ప్రధాన కథ స్క్రీన్ టైముని తినేసి, అదే ప్రధాన కథ అన్నట్టుగా తయారవుతుంది. 

       ఒకసారి ఇప్పుడొస్తున్న దర్శకుల సినిమాల సరళిలో ఈ కథనాన్ని పెట్టి చూస్తే, తమాషాగా ఇలా వుంటుంది – సావిత్రి జగ్గయ్యతో వచ్చి క్యాన్సర్ అని ఏఎన్నార్ తో చెప్తుంది. ఏఎన్నార్ ఎక్స్ రే చూస్తూ సావిత్రిని వూహించుకుంటాడు. అంతే,  ఫ్లాష్ బ్యాక్ తన్నుకొచ్చేస్తుంది. కాలేజీలో వాళ్ళిద్దరి చదువులు, ప్రేమలు, వాళ్ళిద్దరి కుటుంబ పరిస్థితులు, యుగళ గీతాలు, విద్య కోసం ఏఎన్నార్ విదేశీ యానం, సావిత్రి కి తండ్రి వల్ల జగ్గయ్యతో బలవంతపు పరిణయం, ఏఎన్నార్ స్వదేశాగమనం, ఇక ప్రేమంతా మంటగలిసిందని వైద్య సేవల్లో కలిసిపోవడం. 

          ఇలా రొడ్డకొట్టుడు ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యే సరికి ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇక్కడ్నుంచి జగ్గయ్య ఆపరేషన్ గురించిన అసలు కథ. ఏ కథైనా ఈ చట్రంలోనే వేసి రంగులరాట్నం తిప్పడం. రెండు మాటల్లో చెప్తే పోయే పాత పురాణాన్ని సగం సినిమా ఫ్లాష్ బ్యాకుగా వేసి, అది కూడా  ప్రధాన కథే అన్నట్టుగా విన్యాసాలు చేయడం. ఒకే సినిమాలో రెండు ప్రధాన కథలుండవన్న ఇంగిత జ్ఞానంలేక. ఉన్న ప్రధాన కథ లోతుపాతుల్లోకి వెళ్ళడం తెలీక, ఎత్తుకున్న ప్రధాన కథ నడపడమూ తెలీకా, ఇలా ఇంటర్వెల్ వరకూ వృధా కాలక్షేపం చేయడం. కథని వీలయినంత తక్కువ స్క్రీన్ టైముకి కుదిస్తూ, సెకండాఫ్ లో ఏదో కథ చెప్పేసి, బయటికి దూకెయ్యడం. ఆ వికృత సినిమాల్ని ప్రేక్షకుల చేతిలో పెట్టడం. 

          కానీ శ్రీధర్ ప్రధాన కథ రెండో సీన్లో వెంటనే ప్రారంభమయింది మొదలు, చివరంటా రెండున్నర గంటలూ  ఎడతెగని బిగితో ఆద్యంతం జ్వలిస్తూ సాగుతుంది ఫ్లాష్ బ్యాక్ ని ఎగేస్తూ. ఇందులో ఏఎన్నార్ – సావిత్రిల పూర్వ ప్రేమ కథని నామమాత్రం చేయడంలో ఇంకో ఉద్దేశం కూడా వుండొచ్చు. దర్శకుడు దీన్ని పూర్తి స్థాయి సస్పెన్స్ కథగా చెప్పాలనుకున్నాడు. పూర్వ ప్రేమ తాలూకు ఏ మాత్రం ఫ్లాష్ బ్యాక్ వేసినా, నడుస్తున్న ప్రధాన కథ తాలూకు సస్పెన్స్ ధార చెదిరిపోతుంది. కథనిండా మేట వేసిన శోక రసాన్ని మరిపించడానికి సస్పెన్స్ అనే షుగర్ కోటింగ్ ఇచ్చాడు – ‘ముత్యాల ముగ్గు’ లో బాపు - రమణలు కథా మూలంలో వున్న శోక రసాన్ని మరిపించే, అద్భుత రసపు షుగర్ కోటింగుతో హుషారైన కథ చెప్పినట్టు. శ్రీధర్ కూడా ఈ షుగర్ కోటింగ్ ని కాపాడుకునే కథనమే చేశాడు సస్పెన్సు అనే ఏకసూత్రతని కాపాడుకుంటూ.

రెండు విడతల సస్పెన్స్ 
       రెండో సీన్లోనే జగ్గయ్యకి ఆపరేషన్ అనీ, అది రెండు వారాల్లోననీ ఒక టైం లాక్ తో సమస్య నేర్పాటు చేశాక, నడిపే కథనంలో సస్పెన్సు రెండు విడతలుగా కన్పిస్తుంది. ఇప్పుడు చెప్పిన ఆపరేషన్, దీని తాలూకు పరిణామాలతో కూడిన సస్పెన్సుతో ఏర్పడే సెన్సాఫ్ డేంజర్ ని ఇప్పట్నుంచే ఫీలవ్వం మనం. ఇది మొదలవడానికింకా టైముంది. దీనికంటే ముందు ఇంకో సెన్సాఫ్ డేంజర్ ప్రారంభించిన కథలోనే తోస్తోంది మనకి. అది ఏఎన్నార్ - సావిత్రిలు జగ్గయ్య ముందు దాచిపెడుతున్న పూర్వ ప్రేమాయణం. ఇది బయటపడే ప్రమాదం పొంచి వుంది. ఇలా ప్రస్తుతం ఈ సెన్సాఫ్ డేంజర్ ని మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడేంటి? ఎప్పుడో జరిగే ఆపరేషన్ సంగతి సరే, ఇప్పుడున్న వీళ్ళ రహస్యం మాటేమిటి? దాచి పెడుతున్నది బయట పడక తప్పదు. అప్పుడేం జరుగుతుంది? ఇది ముందు తేల్చడం ఈ కథ ముందుకు సాగడానికి అవసరం. కాబట్టి అనివార్యంగా ముందు చేపట్టాల్సిన కథనం దీనికి సంబంధించిందే అయింది. 

          ఆర్ట్ ఆఫ్ నెగోషియేషన్ లో సమస్యల్ని డీల్ చేసే విధానముంటుంది. ప్రతీ సమస్యా ఓ గతంతో ముడిపడి వుంటుంది. ఆ గతాన్ని సరిచేస్తే సమస్య  పరిష్కారమైపోతుంది. పాలకులు సరి చేయరు. వాళ్లకి కాష్ఠం రగులుతూ వుండాలి. రచయితలు సరి చేయాల్సి వుంటుంది. రచయితలు కూడా పాలకుల పాలెగాళ్ళయితే చెయ్యరు. అది వేరే సంగతి. ఆపరేషన్ సమస్యతో ఏఎన్నార్, సావిత్రిల పరస్పర భయసందేహాలు తీరి పరిష్కారమవాలంటే, వాళ్ళ గత సంబంధాన్ని తేల్చెయ్యాలి. అంటే గార్డియన్ పాత్రగా వున్న జగ్గయ్యకి ఈ వ్యవహారం తెలిసిపోయి, అతనో నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఆపరేషన్ తో సమస్య పరిష్కారమవుతుంది. అంటే కథనం జగ్గయ్యకి తెలిసే ముందు, తెలిసిన తర్వాతా అనే ద్విముఖాలుగా వుండాలి. తెలిసేముందు రిలేషన్ షిప్ తో ఒక సస్పెన్స్, తెలిశాక ఆపరేషన్ తో ఇంకో సస్పెన్స్. ఇలా రెండు విడతల సస్పెస్ తో కథాపథకం. ఈ స్పష్టత, ఈ విభజన, ఈ ప్లానింగ్ లేకపోతే  ఏం కథ చేస్తున్నామో జుట్టు పీక్కున్నా అర్ధంగాదు. స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ మాటల్లో సినిమా కథంటే సైకో థెరఫీయే.

తొలి విడత సస్పెన్స్ 
        రెండు వారాల్లో ఆపరేషన్ చేయాలనీ నిర్ణయించాక,  జగ్గయ్య హాస్పిటల్లో అడ్మిటవుతాడు. సావిత్రి కూడా అక్కడే వుండిపోతుంది, బట్టలూ అవీ తెప్పించుకుని. ఏఎన్నార్ నివాసం ఎలాగూ అక్కడే. ఒక రాత్రి పూట సావిత్రితో దిగిన పాత  ఫోటో చూసుకుంటూ పాటలోకెళ్ళి పోతాడు. ఆ పాటలో సుమంగళిగా ఆమె సుఖాన్నే కోరుకుంటాడు. పాట పూర్తయ్యాక జగ్గయ్య వచ్చేస్తాడు. కంగారుపడి ఫోటోని పత్రికలో దాచేస్తాడు ఏఎన్నార్. చదువు కోవడానికి ఏమైనా పుస్తకాలుంటే ఇమ్మని పత్రిక తీసేసుకుంటాడు జగ్గయ్య. ఏఎన్నార్ గుండె ఢామ్మంటుంది. ఏం చేసే లోగా పత్రికతో వెళ్ళిపోతాడు జగ్గయ్య. పత్రిక తిరగేస్తోంటే ఆ ఫోటో జారి కింద పడుతుంది. ఇది చూసి సావిత్రి గుండె ఢామ్మంటుంది.  ఎలాగో జగ్గయ్యని లోపలికి పంపి ఆ ఫోటో తీసెయ్యబోతే, ఏఎన్నార్ తీసుకుని వెళ్ళిపోతూంటాడు గబగబా.

          ఈ గండం గడిచాక మరో గండం ఎదురవుతుంది. ఏఎన్నార్ తల్లి హాస్పిటల్ కొస్తుంది. ఆమె కొడుకు జీవితం గురించి సావిత్రి, జగ్గయ్యల ముందు వాపోతుంది, “ఎవరో ఒకమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి ఇంకొకర్ని పెళ్లి చేసుకుందట. దాంతో వాడి మనసు విరిగిపోయి పెళ్ళే చేసుకోలేదు” అని.

          ఇక్కడున్న సావిత్రియే కొడుకు ప్రేమించినమ్మాయని ఆమెకి తెలీదు. ఇదెక్కడ బయటపడుతుందోనని సావిత్రికి ఒకటే ఆందోళన. జగ్గయ్య అంతా విని నిర్వేదంగా, “ఈ రోజుల్లో ప్రేమించడం సరదా అయిపోయింది. దీనివల్ల ఎందరి జీవితాలు ఎలా నాశనమవుతున్నాయో ఎవ్వరూ వూహించడం లేదు. నేనూ సీతా మీ అబ్బాయికి నచ్చజెప్పి ఎలాగైనా పెళ్ళికి ఒప్పిస్తాం” అంటాడు. 

          ఆమె వెళ్ళిపోయాక సావిత్రితో అంటాడు, “చూశావా సీతా, ఒక పురుషుడికి ఒక స్త్రీ చేసిన ద్రోహం. ప్రేమించింది ఒకర్ని, పెళ్ళాడింది ఒకర్ని. ఆ అమ్మాయి ఎంత మోసగత్తె అయి వుండాలి. నా బాధంతా పాపం ఆ డాక్టర్ గురించే. ఇంత చదువూ తెలివీ వుండి కూడా ప్రేమంటే ఒక ఆట వస్తువుగా భావించే ఆడదాన్ని నమ్మి ఎలా మోసపోయాడో చూశావా?”

          సావిత్రికి గుండె పగిలిపోతూంటుంది తనని ఇంతింత మాటలంటూంటే, “ ఏమో ఆ అమ్మాయి మంచిది కాదని ఎలా అనగలం?”  అనేస్తుంది. అందుకు జగ్గయ్య, “మంచిదెలా అవుతుంది సీతా? ఆమె నిజంగా డాక్టర్ని ప్రేమించి వుంటే, తర్వాత ఆ భర్తకి మనసెలా ఇవ్వగలుగుతుంది? ఒకవేళ భర్త పట్ల నిజాయితీగా వుంటే, డాక్టర్ తో ఆమె ప్రేమంతా నాటకమే కదా?” అని.  ఆమె తట్టుకోలేక భోరుమంటుంది.

         ఇక్కడ కథాపరమైన తొలి విడత సస్పెన్స్ నిర్వహణతో బాటు, పాత్రచిత్రణల వికాసం కూడా వుంది. ఏఎన్నార్ తల్లి రాకతో జగ్గయ్యకి ఏఎన్నార్ విషయం తెలిసి అతడి పెళ్లి ఆలోచన స్ఫురించింది. ఇది మున్ముందు కథలో ఏఎన్నార్ కి పెళ్లి అనే చర్య తీసుకోవడానికి దారి తీస్తుంది. రెండోది, సావిత్రికి తన రహస్యం ఎక్కడ బయట పడుతుందోనన్న భయాందోళనలతో బాటు, పైకి చెప్పుకోలేని తన నిర్దోషిత్వం గురించిన భావోద్వేగాలు అనుభవించడం. తను మోసగత్తె కాదని ఎలా చెప్పుకోవాలి? అసలేం జరిగిందో ఎలా చెప్పుకుంటుంది? చెప్పుకోవడానికి మొహం చెల్లకే ఏఎన్నార్ తో ఇంతకాలం చెప్పలేదు. ఇప్పుడు కథాపరమైన మొదటి విడత సస్పెన్సుకి తోడు అసలు గతంలో ఏం జరిగి ఏఎన్నార్ నుంచి సావిత్రి విడిపోయిందన్న అనుబంధ సస్పెన్సుని ప్రేక్షకుల మీద రుద్దాడు దర్శకుడు. ఇప్పుడు మనకి వాళ్ళ రోమాంటిక్ గతం తెలుసుకోవాలన్న డిమాండ్ పక్కకి వెళ్ళిపోయి, ఆ ట్రాజిక్ గతమేంటో తెలుసుకోవాలన్న డిమాండ్ పెరిగిపోయింది. దీన్నె ప్పుడు సరఫరా చేస్తాడు దర్శకుడు? ఇది అనుబంధ సస్పెన్స్. 

          దీంతో అయిపోలేదు. సావిత్రీ ఏఎన్నార్ లకి జగ్గయ్యతో ఇంకో గండం. సావిత్రి ముందు ఏఎన్నార్ కి కౌన్సెలింగ్ చేస్తాడు జగ్గయ్య. ఏఎన్నార్ పాత ప్రేమని తోడుతాడు. ఆ ప్రియురాలిని నిందిస్తాడు. ఈ ప్రేమలు ఒట్టి కబుర్లనీ, బతకడానికి తెలియని వాళ్ళే వీటిని పట్టుకుని ప్రాకులాడతారనీ, దీన్నుంచి తేరుకుని పెళ్లి చేసుకుని తల్లిని సంతోష పెట్టమనీ అంటాడు.

          తర్వాత ఏఎన్నార్ సావిత్రిని ఏకాంతంలో కలిసి మాట్లాడుతూండడంతో వినేస్తాడు జగ్గయ్య. ఈ సందర్భంగా సీత అంటుంది, “నా భర్త నన్ను ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాడు. ఒకనాడు మీరు ప్రేమించిన అమ్మాయి నేనేనని తెలిస్తే వారి హృదయం బద్దలై పోతుంది. అందువల్ల ఏర్పడే విపరీత పరిణామాలకు మీరు కారణం కాకూడదనే నా కోరిక”  అని. 


      ఏఎన్నార్ మాటిస్తాడు, అసలు తను తెలిసినట్టు కూడా ప్రవర్తించనంటాడు. అయితే ఒక్క సందేహం తీర్చి మనశ్శాంతి కల్గించమంటాడు. ఇందుకామె, “డాక్టర్, మీకు కొంచెమైనా మనశ్శాంతి కల్గించడం నాకు చేతనైతే నేను చేసిన పాపానికి అదే ప్రాయశ్చిత్తం, చెప్పండి?”  అంటుంది.  అసలెందుకు విడిపోయావని అడుగుతాడు. 

          ఆమె చెప్పుకొస్తుంది. ఆమె తండ్రి బ్యాంకు క్యాషియర్. యాభై వేలు పోయిన నేరం మీద పడింది. బ్యాంక్ డైరెక్టర్ ని కలిసి చెప్పుకుంటే, జైలుకెళ్ళకుండా  వుండాలంటే తన కొడుక్కి కూతుర్నివ్వా లన్నాడు డైరెక్టర్. కూతురికి చెప్పుకుంటే, తను ఏఎన్నార్ ని  ప్రేమించానని చెప్పుకుని ససేమిరా అంది. “నీ సుఖం కోసం జైలు పాలవ్వాలా నేనూ? ఈ ఇంటికోసం ప్రేమని త్యాగం చేయలేవా?’ అని నిలదీశాడు తండ్రి. తను జైలుకెళ్తే తల్లి గుండాగి చస్తుందని కూడా అన్నాడు. ఇక విధిలేక జగ్గయ్యని చేసుకుంది. చేసుకున్నాక తెలిసింది అతడికి క్యాన్సర్ అని. జగ్గయ్య తండ్రి ఇది దాచిపెట్టి తనకి తాళి కట్టించాడని అర్ధమైంది...

          ఇలా  సావిత్రి చెప్పేసరికి ఏఎన్నార్ ఆమె పరిస్థితికి కదిలిపోతాడు. అటు చాటుగా వుండి  వింటున్న జగ్గయ్య ఛాతీ పట్టుకుని ఉక్కిబిక్కిరైపోతాడు. అసలే గుండెకి ముదిరిన క్యాన్సర్. అందులో ఇలాటి అగ్నిపర్వతం బద్ధలవడం... దీంతో ఏఎన్నార్ – సావిత్రిల తాలూకు రహస్యం కొలిక్కి వచ్చింది. ఇప్పుడు బంతి జగ్గయ్య కోర్టులో పడింది. మనకీ గతం తాలూకు అనుబంధ సస్పన్స్ తీరిపోయింది.  

          సావిత్రి ఇలా చెప్పేసి ఆగదు. ఆ ఫోటో ఇచ్చెయ్యమంటుంది. అదొక్కటే తను సాంత్వన పొందడానికి మిగిలిన ఆధారమంటాడతను. ప్రేమని మర్చిపోలేనంటాడు. మానవ జీవిత పరమార్ధం వలచి విలపించడం కాదంటుంది. అతడి వృత్తి, పేరు ప్రతిష్టలు తన మూలంగా నాశనమై, తానో సమాజ ద్రోహిగా నిలబడ లేనంటుంది. ఇక మర్చి పొమ్మంటుంది. చేసేది లేక ఫోటో చించేస్తాడు. 

          కథనంలోఈ తొలి  విడత సస్పెన్స్ విభాగంలో, రాబోయే మలి విడత సస్పన్స్ విభాగపు కథనానికి అడ్డు పడకుండా కొన్నిసమస్యల్ని పరిష్కరిస్తున్నాడు దర్శకుడు. ప్రేమని అతను మర్చిపోకపోతే చేయబోయే ఆపరేషన్ కి అది అడ్డుపడుతుంది. కానీ చేయబోయే ఆపరేషన్ కి జగ్గయ్య ప్రకటించే నిర్ణయం అడ్డుపడబోతోంది. అందువల్ల రెండు కారణాలు అడ్డుపడితే గజిబిజి అవుతుందని, మొదటి కారణమైన ప్రేమ ని క్లియర్ చేసేశాడు దర్శకుడు. ఇప్పుడు వీళ్ళ పూర్వ ప్రేమ తెలిసిపోయిన నేపధ్యంలో, జగ్గయ్య ఏం నిర్ణయం తీసుకుంటాడనే మలి విడత సస్పెన్స్ తో కథనం మొదలు.
  జగ్గయ్యకి తెలియక ముందు కథనం పూర్తయి, తెలిసింతర్వాత కథనం ఇక మొదలవుతోంది.

మలి విడత సస్పెన్స్ 
       “డాక్టర్ మీరు నాకో సహాయం చేయాలి. ఆపరేషన్ చేస్తే నేను బతుకుతానంటారా? నేను పిరికి వాణ్ణి కాను, మీ మనసులో వున్న నిజాన్ని ధైర్యంగా చెప్పండి. చచ్చిపోతానని నేను భయపడ్డం లేదు. నేను బ్రతికి సాధించేది లేదు. ఇంతవరకూ నా జీవితంలో నాకెలాటి కొరతా కలగలేదు. ఐశ్వర్యం లోపుట్టాను, అల్లారు ముద్దుగా పెరిగాను. ఆనందంగా జీవించాను. అందం, గుణం వున్న పిల్లనే చేసుకున్నాను. ఈ క్షణం వరకూ ఆమెకే లోటూ రానివ్వకుండా ప్రాణప్రదంగా చూసుకుంటున్నాను. అన్నివిధాలా అందరికీ అసూయ కల్గించే జీవితాన్ని నేననుభవించాను...”
          “ఇక ముందు కూడా మీకిలాగే జరుగుతుంది”
          “మీరు చెప్తున్నది జ్యోతిషం, నేను చెప్తున్నది నిజం... మీరొక వాగ్దానం చెయ్యాలి. నేను చనిపోతే ఆమెకి మళ్ళీ పెళ్లి జరిపించే బాధ్యత మీది...”

          ఏఎన్నార్ నెత్తిన పిడుగులు పడతాయి. ససేమిరా అంటాడు జగ్గయ్య. సరే, ఆమె అంగీకరిస్తే తన వాగ్దానం తప్పక నేరవేరుస్తానంటాడు ఏఎన్నార్. ఇక్కడ జగ్గయ్య వ్యూహాత్మకంగా నేరుగా ఆమెని పెళ్లి చేసుకోమనడం లేదు. సావిత్రితో కూడా ఇలాగే వ్యూహాత్మకంగా అంటాడు. నేరుగా చెప్పేసి షాకివ్వదల్చుకోలేదు. ఇప్పుడు సావిత్రి, ఏ ఎన్నార్ లకి జగ్గయ్య చావుబతుకుల సమస్య ముఖ్యమైపోతుంది. పూలూ పసుపూ తెప్పించుకుని సుమంగళిలా అలంకరించుకుని పూజలు చేస్తుంది. ఇంతలో ఓ ఐదేళ్ళ బాలికకి ఏఎన్నార్ చేసిన ఆపరేషన్ విఫలమై చనిపోతుంది. దీంతో సావిత్రికి ఏఎన్నార్ సామర్ధ్యం మీద నమ్మకం పోతుంది. జగ్గయ్యని ఇక్కడ్నించి తీసికెళ్ళి పోతానంటుంది. 

          “డాక్టర్, ఏదైనా జరిగితే మీరు కారణం కాకూడదని నా కోరిక. మీరు నా హృదయంలో శాశ్వతంగా వుండాలంటే నా భర్త ఇక్కడ చచ్చిపోకూడదు. నన్ను ప్రేమించి విఫలమయ్యారని మీరు కక్ష సాధించారని నేనేనాడూ అనుకోకూడదు”

          జగ్గయ్యకి కూడా చెప్పేస్తుంది ఇక్కడ్నుంచి వెళ్ళిపోదామని. ఏఎన్నార్ ని అవమానించడం తగదంటాడు అతను. దీంతో ఉద్రిక్తత సడలుతుంది. మళ్ళీ పెట్రేగుతుంది. ఈసారి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని జగ్గయ్య నేరుగా చివరి కోరిక వెల్లడించడంతో. ఇద్దర్నీ ఏడ్పిస్తాడు. ఇద్దరూ నిరసిస్తారు. అయినా చేసేది చేసుకుపోతాడు జగ్గయ్య. లాయర్ ని పిలిపించుకుని ఇద్దరికీ తన ఆస్తి వీలునామా రాసేస్తాడు. ఇక లాభం లేక సావిత్రి తన నిర్ణయం తానూ తీసుకుంటుంది. 

          సరీగ్గా రెండు వారాల గడువు పూర్తయి ఆపరేషన్ మొదలవుతూంటే, గదిలో కెళ్ళి తలుపులు బిడాయించుకుంటుంది. ఏఎన్నార్ చేతిలో భర్త మరణ వార్త వింటే, అదే క్షణం తన చావూ జరిగిపోవాలని గదిలో వుండి పోతుంది.

          ఏఎన్నార్ పరిస్థితి కొన్ని రోజుల ముందునుంచే దారుణంగా వుంటుంది. ఆపరేషన్ చేయగలుగుతాడా అన్న గొప్ప ఆత్మనూన్యతా భావానికి లోనవుతాడు. ఒక ఉత్తమురాలైన తల్లికి పుట్టిన కొడుకుగా నీతో ఎలాటి స్వార్ధానికీ పోనని అన్నా కూడా ఆమె నమ్మదు. కన్న తల్లిని సాక్ష్యంగా చేసి చెప్పడం కన్నా ఉత్కృష్ట  నివేదన ఇంకేం వుంటుంది. ఆమె నమ్మదు. ఆమె పరిస్థితులు ఆమెకున్నాయి. ఆమె కూడా నమ్మనప్పుడు డాక్టర్ గా తన సామర్ధ్యం పట్ల ఆత్మవిశ్వాసం పూర్తిగా కరిగిపోతుంది. తిండి మానేసి, నిద్ర మానేసి, శస్త్ర చికిత్స పుస్తకాలు చదివేస్తూంటాడు.  ఎలాగైనా ఆపరేషన్ సక్సెస్ చేసి తన నిజాయితీ నిరూపించుకోవాలి...

          నిరూపించుకుంటాడు. కానీ అది యాంటీ క్లయిమాక్స్ కి దారి తీస్తుంది. జగ్గయ్యకి ఆపరేషన్ సక్సెస్ అయిందని తలుపు కొట్టి కొట్టి సావిత్రిని పిల్చి, ఆమె తలుపు తీశాక శుభవార్త చెప్పేసి కుప్పకూలి మరణించి పోతాడు.      

లోటు తీర్చే ప్రయత్నాలు 
       సంక్లిష్ట కథా కథనాలు, సంక్లిష్ట పాత్ర చిత్రణలు. 29 ఏళ్ల శ్రీధర్ విరచిత విన్యాసాలు. నటత్రయం అభినయ వైశిష్ట్యాలు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్యల గురించి చెప్పుకోవాలంటే వాక్యాలందవు. చూసి తరించాల్సిందే. ఏ వొకరి ముఖంలోనూ సంతోషం పలకని గూడు కట్టిన విషాదమే. అభిమాన తారలు ఇంత విషాదంతో వుండిపోతే ప్రేక్షకులకి ఇబ్బందే. అక్కినేని ఎక్స్ రే చూస్తూ తలచుకున్నప్పుడు సావిత్రితో ఒక సంక్షిప్త ప్రేమ సన్నివేశం తప్ప,  ఇంకే రిలీఫ్ కూడా వుండదు. ఫోటో చూస్తూ పాడుకున్నప్పుడు కూడా వాళ్ళ గతం తాలూకు రోమాంటిక్ మాంటేజీలు పడవు. దీనికి భిన్నంగా హిందీ రీమేక్ లో వుంది. రాజేంద్రకుమార్ ఎక్స్ రే చూస్తున్నప్పుడు మీనా కుమారితో పాటలోకి వెళ్ళిపోతాడు (తేరే మేరే సివా యహా కోయీ నహీ). ఇది సినిమాకి మాంచి యూత్ అప్పీల్ ని సరఫరా చేస్తుంది. తర్వాత ఫోటో చూస్తూ పాడుకున్నప్పుడు (యాద్ న జాయే భీతే దినోకీ) విరివిగా వచ్చే వాళ్ళ పూర్వ ప్రేమ తాలూకు మాంటేజీలు మరోసారి యూత్ అప్పీల్ కి న్యాయం చేస్తాయి. ముందంతా విషాదమే చూపిస్తున్నప్పుడు ప్రారంభంలో ఈ మాత్రమైనా వినోదపర్చాలి. తమిళ మాతృక తర్వాత హిందీ రీమేక్ అయింది. దీని తర్వాత తెలుగు రీమేక్. కానీ ఎందుకనో అప్డేట్ చేసిన హిందీ రీమేక్ ని తెలుగుకి అనుసరించలేదు. తమిళ మాతృకనే ఫాలో అయ్యారు.  హిందీలో పత్రికలోంచి ఫోటో బయటపడే సీన్లో థ్రిల్, సస్పెన్సుల పోషణ  భలే వుంటుంది. బ్లాక్ అండ్ వైట్ వెలుగు నీడలతో ఛాయాగ్రహణం కూడా ఉన్నత ప్రమాణాలతో వుంటుంది. ఇక అన్నిపాటలూ ప్రజాదరణ పొందాయి. తెలుగులో రెండే (అపరంజి బొమ్మ, తలచినదే) హిట్టయ్యాయి. ఈ విషాద కథ హిందీలో మ్యూజికల్ హిట్టయితే, తెలుగులో అది కూడా కాలేదు.  మూడు సార్లు తీసిందే తీస్తూ అలసిపోయి వుంటాడు శ్రీధర్. 

          కథ పూర్తి విషాదం కాబట్టి కామెడీ ట్రాకు పెట్టారు. చలం – గిరిజ – రేలంగిలు వేసుకునే కామెడీ వేషాలు కథతో సంబంధం లేకుండా హాస్పిటల్లో ఓ పక్క వచ్చి పోతూంటాయి. వినోదం లేని లోటు ఇలా తీర్చినట్టున్నాడు. కానీ వినోదం ప్రధాన పాత్రలతో కూడా కాస్త వుండాలి. ఇక హాస్పిటల్లో కొందరి పేషంట్లతో సబ్ ప్లాట్స్ (ఉపకథలు) వుంటాయి. ఇవి ప్రధాన కథలో సంఘర్షిస్తున్న ఏఎన్నార్, సావిత్రి, జగ్గయ్య పాత్రల ప్రవర్తనల్ని నియంత్రించే దిశగా వుంటాయి. సబ్ ప్లాట్స్ లో ఉత్పన్నమయ్యే అర్థాలు మెయిన్ ప్లాట్స్ లో ప్రతిఫలిస్తూంటాయి. ఇలా ఇన్ని పొరలుగా కథ వున్నప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అనే ఇంకో పొర కల్పిస్తే ఎక్కువైపోయే మాట నిజమే. అందుకని ఫ్లాష్ బ్యాక్ ని పరిహరించడం మేలే చేసింది. 

            దర్శకుడితో బాటు తెరవెనుక ఆత్రేయ గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన మాటల మాంత్రికుడు కాదు. మాయ చేయడు. జీవితాలు పలికే పలుకులనే నిరాడంబరంగా స్వచ్ఛంగా పలికిస్తాడు. సంభాషణల బలం ఈ ట్రాజడీకి  ప్రధాన ఆకర్షణ. 

          ఐతే ఈ కథలో దర్శకుడు కూడా జవాబు చెప్పలేని ప్రశ్న వొకటుంది. ఈ ప్రశ్న వేస్తే  కథేమవుతుందో, పాత్రలేమై పోతాయో తెలీదు. సినిమా కూడా వుండే అవకాశమందో లేదో తెలీదు. కానీ మన బుద్ధికి ఇలా తోస్తుంది : జగ్గయ్య తాను చనిపోతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలన్నాడు. చనిపోకపోతే? ముగ్గురూ ఇలాగే సిగపట్లు పడుతూ వుండిపోతారా ముగింపు లేకుండా? దేవుడు జోక్యం చేసుకుని ఏఎన్నార్ ని తప్పించడం జగ్గయ్య అదృష్టమే!

సికిందర్