రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, జూన్ 2019, శనివారం

837 : రివ్యూ

   దర్శకత్వం : అలీ అబ్బాస్ జాఫర్
తారాగణం : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దిశా పాట్నీ, టబు, నోరా ఫతేహీ, జాకీ ష్రాఫ్, సోనాలీ కులకర్ణి, సునీల్ గ్రోవర్, కుముద్ మిశ్రా, ఆయేషా రజా మిశ్రా తదితరులు
రచన : అలీ అబ్బాస్ జాఫర్, వరుణ్ శర్మ, మాటలు : వరుణ్ శర్మ, సంగీతం : విశాల్ -శేఖర్, ఛాయాగ్రహణం :  మార్సిన్ లస్క వీక్
బ్యానర్స్ : రీల్ లైఫ్ ప్రొడక్షన్స్, సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, టీ సిరీస్
నిర్మాతలు : అతుల్ అగ్నిహోత్రి, అల్విరా ఖాన్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్
విడుదల : జూన్ 5, 2019

          మాస్ యాక్షన్ స్టార్ సల్మాన్ ఖాన్ మెలోడ్రామా ‘భారత్’  గా ప్రేక్షకుల ముందుకు వస్తే ఫ్యాన్స్ కి చాలా  ఇబ్బందే. సల్మాన్ నుంచి ఏమాశిస్తారో అవి లేకపోతే తీవ్ర నిరాశే. భజరంగీ భాయిజాన్, సుల్తాన్, టైగర్ జిందాహై లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లతో కొత్త తరం ప్రేక్షకుల్ని కూడా తన మాస్ బేస్ లో కలుపుకున్న సల్మాన్,  ఉన్నట్టుండి సూరజ్ బర్జాత్యా మార్కు కుటుంబ హీరోగా మారిపోవడం, మాస్ బేస్ కి దూరం జరగడం  షాక్ కొట్టే సంగతే. వయసు మీదబడుతోంటే ఖాన్ స్టార్లు ట్యూబ్ లైట్ అని ఒకరు, జీరో అని ఇంకొకరు బాలల పాత్రలేస్తున్నారు. మాస్ హీరో లుగా వుండక క్లాస్ కి పోయి ఖల్లాస్ అవుతున్నారు.     

        సల్మాన్ తో సుల్తాన్, టైగర్ జిందా హై వంటి రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, ఈసారి బరువైన ఫ్యామిలీ మెలో డ్రామాతో పీరియడ్ మూవీ తీశాడు. కొరియన్ పీరియడ్ డ్రామా ‘ఓడ్ టు మై ఫాదర్’ కి అధికారిక రిమేక్ చేసి, సల్మాన్ లోని నటుణ్ణి పరీక్షించదల్చాడు. మరి ఏడు పదుల వయసు పాత్రతో సల్మాన్ ‘భారత్’ ని వయోభారంతో కుంగదీశాడా, లేక వయసు ఓ సంఖ్య మాత్రమేనని పరుగులు తీయించాడా చూద్దాం...

కథ
      1947 దేశ విభజనప్పుడు జరిగిన మతకల్లోల్లాల్లో లాహోర్ నుంచి ఢిల్లీ పారిపోవాల్సివస్తుంది ఇంకా పదేళ్ళు నిండని భారత్ కి. తల్లితో, ఇద్దరు తోబుట్టువులతో క్రిక్కిరిసిన రైలెక్కేశాక, ఒక చెల్లెలు తప్పిపోతుంది. ఆమెని వెతకడం కోసం తండ్రి గౌతమ్ (జాకీ ష్రాఫ్) ఆగిపోతాడు. ఆగిపోతూ తల్లికీ, తోబుట్టువులకీ ఇక నువ్వే దిక్కనీ, బాగా చూసుకోవాలనీ చెప్పి, ఢిల్లీ లో మేనత్త దగ్గరికి వెళ్లి పొమ్మంటాడు. తను వాళ్ళు నడుపుతున్న రేషన్ షాపు దగ్గరికే వచ్చి కలుస్తానంటాడు. 

          ఢిల్లీ లో మేనత్త ఇంట్లో ఆశ్రయం పొందాక కుటుంబాన్ని పోషించేందుకు రకరకాల పనులు చేస్తాడు భారత్. విలాయతీ ఖాన్ అనే వాడు ఫ్రెండ్ అవుతాడు. అలా పెరిగి పెద్దయిన భారత్ (సల్మాన్ ఖాన్),  ఆ తర్వాత ఫ్రెండ్ విలాయతీ ( సునీల్ గ్రోవర్) తో కలిసి సర్కస్ కంపెనీలో చేరి డబ్బులు సంపాదిస్తాడు. గల్ఫ్ లో ఆయిల్ పడిందని కార్మికుడిగా అక్కడి కెళ్తాడు. అక్కడ తన పై అధికారిణి కుముద్ (కత్రినా కైఫ్) అభిమానాన్ని చూరగొంటాడు. ఆమె పెళ్లి చేసుకుందామంటుంది. తన కథ చెప్పుకుని, తండ్రి కిచ్చిన మాట ప్రకారం కుటుంబ బాధ్యతలు చూసుకోవడమే తన ధ్యేయమని ఆమెని తిరస్కరిస్తాడు. అక్కడ మైనింగ్ ప్రమాదంలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాడు. వీసా గడువు ముగిసిపోవడంతో ఇండియా తిరిగి వచ్చేస్తాడు. చెల్లెలి పెళ్లి చేస్తాడు. తమ్ముణ్ణి యూనివర్సిటీలో చదివిస్తాడు.

          మేనత్త చనిపోతుంది. డబ్బు అవసరముండి రేషన్ షాపు అమ్మేస్తానంటాడు మేనమామ. తండ్రి ఇక్కడికే వచ్చి కలుస్తానన్నాడు గనుక షాపు అమ్మడానికి ఒప్పుకోడు భారత్. కొత్త పని వెతుక్కుంటూ విలాయత్ తో కలిసి, నేవీ షిప్ మీద సెయిలర్ గా వెళ్తాడు. ఆ నౌక మీద ఆఫ్రికన్ సముద్రపు దొంగలు దాడి చేస్తే, వాళ్ళని అమితాబ్ బచ్చన్ పాటలతో ఎదుర్కొంటాడు. 

          మేనమామ చనిపోతాడు. ఇక షాపు తనే నడుపుకుంటూ సెటిలవుతాడు భారత్. ఇంతలో ఆర్ధిక సంస్కరణల ఫలితంగా ప్రైవేట్ టీవీ ఛానెల్స్ రావడంతో కుముద్ వెళ్లి జీ టీవీలో ప్రొడ్యూసర్ గా చేరుతుంది. భారత్ సమస్యకి ఆమె పరిష్కారం ఆలోచించి, దేశ విభజన సమయంలో ఆచూకీ లేకుండా పోయిన వాళ్ళని వెతకడానికి మేరే అప్నే అనే లైవ్ ప్రోగ్రాం ప్రారంభిస్తుంది. రెండు దేశాల్లో ఎందరో స్పందిస్తారు. కొందరు తమ బంధువుల్నికనుక్కోగలుగుతారు. మరి భారత్ కి తన తండ్రి, చెల్లెలు దొరికారా? వాళ్ళ కోసం తన నిరీక్షణ ఫలించిందా?  లేక ఆ నిరీక్షణతోనే ఏడు పదుల  వృద్ధుడై పోయాడా? ఏం జరిగింది?...ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
       చరిత్రలు, జీవిత చరిత్రలు, దేశ విభజన లాంటి సీరియస్ సినిమాల ట్రెండ్ కి ఇక ముగింపు పలకాల్సిందే, ఇంకెన్ని సార్లు రిపీట్ చేస్తూ వీటినే చూపిస్తారు. దేశభక్తి సీజన్ ప్రస్తుతానికి ముగిసిన దృష్ట్యా, ఈ సీరియస్ మూడ్ లోంచి బయటకొచ్చి ఎంటర్ టైనర్స్ కేసి దృష్టి సారించి ప్రేక్షకుల్ని వినోద పర్చాల్సిందే. ఈ రెండేళ్లలో దేశ విభజన మీద హిందీలో బేగంజాన్, మంటో, వైస్రాయ్స్ హౌస్, కళంక్, ఇప్పుడు భారత్... ఐదు సినిమాలు వచ్చాయి. గత ఏప్రెల్ లోనే విడుదలైన ‘కళంక్’ లో లాంటి దేశ విభజన దృశ్యాల్నే, నెల తిరక్కుండానే మళ్ళీ ‘భారత్’ లో చూడాల్సి వస్తోంది. 

          ఐతే భారత్  ‘ఓడ్ టు మై ఫాదర్’ అనే కొరియన్ మూవీకి అధికారిక రీమేక్. ఈ రీమేక్ చేయడం ఎలా వుందంటే, ‘అంగమలై డైరీస్’ మలయాళ  నేటివ్ కథని ‘ఫలక్ నుమా దాస్’ కింద మార్చి దోసె వేసినట్టుంది. ఫలక్ నుమా పరోటా వేయకుండా దోసె వేసి ఎంత పరాధీనంగా  చూపించారో, కొరియా వాడి కథని హిందీలో అంత పరాయీకరణ చేసి చూపించారు. ‘ఓడ్ టు మై ఫాదర్’ 1950 లో కొరియా దేశ విభజన - యుద్ధ నేపథ్యంలో జరిగే కథ. అప్పట్నించీ అరవై ఏళ్ల కాలక్రమంలో ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకి వలస వచ్చిన హీరో, దేశంలో కొన్ని కీలక పరిణామాల మధ్య ఎలా జీవన సమరం చేశాడన్న వాస్తవికతా స్పర్శ వున్న కథ.  దీన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నప్పుడు ఏ కీలక పరిణామాలతో కూడిన దేశ చరిత్రనీ మిళితం చేయకుండా, కేవలం కల్పిత కథనం చేసి సరిపుచ్చారు. 

          కొరియన్ ఒరిజినల్ లో హీరో మళ్ళీ ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని చూడలేదు గానీ, వియత్నాం యుద్ధంలో పాల్గొనడానికి వెళ్తాడు. కానీ ‘భారత్’  హీరో పాకిస్థాన్ తో 1965 లో, 1971లో రెండు సార్లు యుద్ధాన్ని చూసే వుండాలి. అప్పుడు 1947 లో పాకిస్థాన్ లో తప్పిపోయిన తన తండ్రీ చెల్లెలు గుర్తుకొచ్చి డిస్టర్బ్ అయిపోవాలి. వాళ్ళ కోసం ఏదో ఒకటి  చేయాలి. ఇలా జరగదు. 1964 లో సర్కస్ కళాకారుడుగా ఎంజాయ చేస్తూంటాడు. ’70 లలో గల్ఫ్ వెళ్ళిపోతాడు. 1947 లో తను ఎదుర్కొన్న దేశ విభజన లాంటి దృశ్యాలే, 1971 యుద్దంలో తూర్పు పాకిస్తాన్ (యుద్ధంతో బంగ్లా దేశ్ అయింది) నుంచి వలసవచ్చిన లక్షలాది మంది శరణార్ధులతో కన్పిస్తూంటే దీని ప్రస్తావనే వుండదు. ఇలా కాలక్రమంలో 1965,71 రెండు యుద్ధాల వూసే లేకుండా కథని, పాత్రని చూపడంతో ఈ దేశ విభజన - ఆత్మీయుల కలయిక కథ అంత నమ్మశక్యంగా లేదు. ఇంకా 1975 - 77 మధ్య ఎమర్జెన్సీ కాలపు గడ్డు పరిస్థితి కూడా లేదు. ఇక 1962 చైనా యుద్ధంతో ఈ పాత్రకి సంబంధం లేదనుకున్నా, పాత్రకి సంబంధం వుండే 1999 కార్గిల్ వార్ కూడా జరిగింది. ఇది కూడా పత్తా లేదు. భారత్ కథ 1947 – 2010 మధ్య జరిగినట్టు చూపించారు. ఈ 63 ఏళ్ల కాలంలో కథని, పాత్రని ప్రభావితం చేసిన చారిత్రక ఘటన ఏమిటయ్యా అంటే, 1991  ఆర్ధిక సంస్కరణలు, దాంతో టీవీ ఛానెల్ ప్రోగ్రాం! 

       కొరియన్ వొరిజినల్ ముగింపు కూడా చారిత్రక సన్నివేశమే. 1950 కొరియా దేశ విభజనప్పుడు తప్పిపోయిన, లేదా విడిపోయిన కోటి కుటుంబాలని కలపడం కోసం 1983 లో దక్షిణ కొరియా ప్రభుత్వం నిర్వహించిన బృహత్తర టీవీ కార్యక్రమం వాస్తవం, చారిత్రకం. మనదేశంలో ఇలా బంధువుల్ని కలిపే చారిత్రక  సంఘటన లేనే లేదు. కొరియన్ ఒరిజినల్లో వున్న దాన్నే  యధాతధంగా పెట్టేసి మనల్ని నమ్మ మన్నారు. దీనికి చారిత్రక టచ్ ఇద్దామనుకుని, ఇంకో పని చేశారు. 1991 లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణలతో దేశంలో టీవీ చానెల్స్ వెల్లివిరిశాయని, వాటిలో ఒకటైన జీటీవీ ‘మేరే అప్నే’ పేరుతో ఈ ప్రోగ్రాం నిర్వహించిందనీ కల్పన చేశారు. ఆర్ధిక సంస్కరణలు ఒక్కటే వాస్తవం.

          కోట్లు పెట్టి కొరియన్ మూవీ రిమేక్ హక్కులు పొంది - దాంతో ఇలాటి కృత్రిమ కథ చేసేకన్నా, కొరియన్ వొరిజినల్లోంచి ‘దేశ విభజన, తండ్రీ కూతుళ్ళ అదృశ్యం’ అనే బేసిక్ లైను మాత్రమే స్పూర్తిగా తీసుకుని, ఆ 63 ఏళ్ల కథని మన దేశకాలమాన పరిస్థితులతో జోడించి చెప్పివుంటే ఇదొక బలమైన భావోద్వేగపు గాథ అయ్యేది. చరిత్ర రీలు నడుస్తూంటే దాంతో సమరం చేసే పాత్ర సజీవ యానం అయ్యేది. తన కుంటుంబాన్ని విడదీసిన విభజన మీద కసితో యుద్ధంలో కూడా పాల్గొని, పాకిస్థాన్లోకి జొరబడి, తండ్రినీ చెల్లెల్నీ వెతుక్కుంటే, అప్పుడిది కార్యాచరణలో వున్న కథయ్యేది. ఇంతకీ ఈ కథ కథేనా? కాదు, గాథ! కమర్షియాలిటీని పూర్తిగా త్యాగం చేస్తూ కమర్షియల్ స్టార్ సల్మాన్ పెట్టిన బాధ! మొదటిరోజు రికార్డు కలెక్షన్లు వచ్చాయి, అది వేరు. 

 ఎవరెలా చేశారు 
      సినిమా ప్రారంభమే 70 ఏళ్ల వృద్ధుడిగా కన్పిస్తాడు సల్మాన్. భారంగా జీవితాన్ని మోస్తున్నట్టు వుంటాడు. వృద్ధాప్యం తాలూకు ఎక్స్ ప్రెషన్స్ మొహంలో బాగా పలుకుతాయి. అయితే శారీరకంగా ఆ వృద్ధాప్యం కన్పించదు. ఇదొక్కటే లోపం. శారీరకంగా మనకి తెలిసిన హీ మాన్ సల్మాన్ లాగే వుంటాడు. ‘భారతీయుడు’ లో కమల్ హాసన్ వృద్ధ పాత్రలో వృద్ధాప్యాన్ని నమ్మించినట్టు నమ్మించలేకపోయాడు సల్మాన్. గొంతులో కూడా మార్పు వుండదు. ఇక యువ పాత్రలో హీరోయిజం వుండదు. కుటుంబ భారాన్ని మోస్తున్న ఓ సగటు యువకుడి పాత్ర ఇది. ఈ పాత్రలో కూడా ఫన్ వుండదు. పక్క పాత్ర స్నేహితుడిగా నటించిన సునీల్ గ్రోవర్ వల్లే కాస్త ఎంటర్ టైన్మెంట్ వుంటుంది. యువ - వృద్ధాప్య రెండు పాత్రల్లోనూ సల్మాన్ ది స్లో నటన. ఇక పెళ్ళికి దూరంగా వుండే పాత్ర కాబట్టి కత్రినాతో రోమాన్స్ కూడా వుండదు. వృద్ధాప్యంలో ఇద్దరిదీ భారమైన జీవితమే. ‘నా జుట్టులో, గడ్డంలో ఎన్ని తెల్ల వెంట్రుక లున్నాయో, అంతకంటే రంగులమయంగా నా జీవితం వుండేది’ అన్న సల్మాన్ డైలాగు ప్రకారం అంత కలర్ఫుల్ గా వుండదు యంగ్ సల్మాన్ పాత్ర.

          కత్రినా కైఫ్ పాత్ర కమర్షియల్ పాత్రలా కాక, ఆర్ట్ మూవీ పాత్రలానూ కాక, రెండూ అన్నట్టు వుంటుంది. గెటప్ కూడా రెండిటిలాగే వుంటుంది. చీర కట్టుకుని, చింపిరి జుట్టులా అన్పించే హేర్ స్టయిల్ తో గమ్మత్తుగా వుంటుంది. వృద్ధాప్యంలో కాస్త నెరిసిన జుట్టు. ఎలాటి కృత్రిమత్వం లేని సహజ నటన. సూటిగా మాట్లాడేసే తత్వం. స్టేజి మీద అందరి ముందూ ‘నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని సల్మాన్ తో చెప్పేస్తుంది. సల్మాన్ తన ఇంటి  బాధ్యతల వల్ల తిరస్కరించాక, ‘నువ్వు పూర్తి చెయ్యలేని స్వప్నాల్ని ఎప్పుడూ ఎవ్వరికీ నువ్వు చూపించకు’ అని కఠినంగా అనేస్తుంది (‘మహర్షి’ లో మహేష్ బాబుతో పూజా హెగ్డే కూడా ఈ మాట అనాల్సింది. కానీ తెలుగు హీరోయిన్ కొన్ని మాటలు అనకూడదు). 

       హస్యంకోసం సునీల్ గ్రోవర్ వున్నాడు. తండ్రి పాత్రలో జాకీ ష్రాఫ్ లాహోర్ రైల్వే స్టేషన్ సీను వరకే పరిమితమయ్యే పాత్ర. ఇక తప్పిపోయిన చెల్లెలుగా దర్శన మిచ్చే టబూది కన్నీళ్లు తెప్పించే రెండు సీన్ల పాత్ర.
          పాటలు వస్తూంటాయి గానీ, అవి అంత గొప్పవేం కావు. టెక్నికల్ గా పీరియడ్ లుక్ బావుంది గల్ఫ్ లొకేషన్స్ సహా. 


చివరికేమిటి 
       రెగ్యులర్ సల్మాన్ మూవీలా ఎంటర్ టైనర్ దృష్టితో చూడకూడదు. ఫ్యామిలీ డ్రామా కోసం కూడా చూడకూడదు. సల్మాన్ తో ఈ కథ ఫ్యామిలీ గురించే అయినా, ఫ్యామిలీని చూపించడం పెద్దగా ఏమీ వుండదు. ఫ్యామిలీని పోషించడానికి, ఫ్యామిలీకి ఎవేగా, తను ఏమేం ఉద్యోగాలు చేశాడో ఆ పోర్ట్ ఫోలియో తెలుసుకోవడం కోసమే చూడాలి. తెలుసుకుని ఆ పోర్ట్ ఫోలియో ప్రకారం ఇంకా ఉద్యోగాలేమైనా వుంటే సల్మాన్ కిచ్చి సహకరించాలి. 

          ఓడ మీద ఆఫ్రికన్ సముద్రపు దొంగలు దాడి చేసినప్పుడు అమితాబ్ అభిమానులైన ఆ దొంగలు,  ‘మేరే పాస్ పైసా హై, బంగ్లా హై, గాడీ హై, నౌకర్ హై, బ్యాంక్ బ్యాలెన్స్ హై...’ అన్నప్పుడు సల్మాన్,  ‘మేరే పాస్ పోర్ట్ ఫోలియో హై’ అంటాడేమో నని ఎదురు చూస్తాం. సల్మాన్ ఉద్యోగ సద్యోగ పర్వంలో కాస్త కామెడీ ఏమైనా వుంటే పక్క పాత్రల వల్లే, లేకపోతే ఫ్రెండ్ సునీల్ గ్రోవర్ వల్లే.  

          ఇక యాక్షన్ విషయానికొస్తే, విలన్స్ లేకపోతే యాక్షన్  ఏముంటుంది. అందుకని ఒక సీన్లో సముద్రపు దొంగలతో యాక్షన్ సీను, చమురుబావి ప్రమాదంలో ఇంకో యాక్షన్ సీను చూపిస్తూ యాక్షన్ హడావిడీ చేశారు. ఇవి ప్రధాన కథతో సంబంధం లేనివి. ప్రధాన కథ తాలూకు యాక్షన్ సీన్స్ రావాలంటే సల్మాన్ ‘తండ్రీ - చెల్లెలు - మిస్సింగ్’ అనే ప్రధాన కథలోకి రావాలి. ఇది వదిలేసి ఎంతసేపూ అప్పుడెప్పుడో తండ్రి చెప్పాడని ఏళ్ళకి ఏళ్ళు కుటుంబం కోసం ఉద్యోగాలు చేసే ఉప కథలతోనే సరిపోయింది. మధ్యమధ్యలో తండ్రినీ చెల్లెల్నీ ఫ్లాష్ కట్స్ తో గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనైనా మళ్ళీ మామూలే. 

     ఇక రోమాన్స్ విషయాని కొస్తే, ఇది డ్రీం సాంగ్స్ లోనే వుంటుంది. వాస్తవంలో వుండదు. ముందు ఒకటి రెండు రోమాంటిక్ చేష్టలతో కత్రినాని ఆకట్టుకున్నా, తీరా ఆమె పెళ్ళనేసరికి కుటుంబ బాధ్యతలంటూ తప్పుకుంటాడు. తండ్రి లేని కుటుంబాన్ని పోషించుకునే హీరోల సినిమాలు బోలెడు వచ్చాయి. పాత కాలపు సినిమాలు. భారత్ కథా కాలంకూడా పాతదే కాబట్టి దీన్నిలా సరిపెట్టుకోవాలనేమో. అయితే ‘కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి’ అంటూ సినిమా సాంతం రికార్డు వెయ్యడం సల్మాన్ పాత్రని సిల్లీగా మార్చేసింది.

          పెళ్లి చేసుకోరా అంటే కుటుంబాన్ని చూసుకోవాలంటాడు. ప్రేమించిందాన్ని తనలాగే  సింగిల్ గా వుంచేస్తాడు. సరే, పెళ్లి లేకపోతే కలిసి వుందామని, లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనీ తనే అంటుంది. ఆ కాలంలో ఈ మాట, ఈ కాన్సెప్ట్ ఎక్కడివో కూడా  అర్ధంగాదు. అలా సల్మాన్ పాత్రకి డెబ్బై ఏళ్ళు వచ్చేవరకూ కలిసే వుంటారు. అంటే సల్మాన్ మనస్తత్వానికి అమలిన శృంగారమా, లేక కత్రినా కైఫియత్తులకి మలినమైన సంబంధమా? స్పష్టత లేదు. ముగింపులో ముసలితనంలో పెళ్లి చేసుకుంటారు. కొరియన్ ఒరిజినల్లో ముందుగానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనిపారేస్తాడు. కుటుంబ పోషణకి ఏమీ అడ్డురావు. 

          ఎమోషనల్ గా ఆకట్టుకోవాలని తీసే ‘గాథలతో’ కూడిన సినిమాల్లో లాజిక్ వుండదు. మస్తిష్కం మూటగట్టి పక్కన బెట్టి, హృదయాల్ని పొదివి పట్టుకుని వీటిని చూడాలి. కన్నీళ్లు కార్చెయ్యాలి.  లేకపోతే  పాకిస్థాన్ లో వుండిపోయిన సల్మాన్ తండ్రి జాకీష్రాఫ్ పాత్ర, ఢిల్లీలో తన చెల్లెలు (సల్మాన్ మేనత్త) వుంటోందని తెలిసీ, ఆ అడ్రసుకి ఒక్క ఉత్తరం ముక్కా రాయకపోవడమేమిటి? అక్కడికి వచ్చే ప్రయత్నం చేయకపోవడమేమిటి?  దేశ విభజనతో ఆ టైముకి వచ్చిన వాళ్ళని లోపలేసుకుని, ఇంకా వస్తున్న వాళ్ళని పోండ్రా అని వెళ్ళగొట్టేసి సరిహద్దు మూసేశారా? 

          పైగా ఆ సమయంలోజాకీ ష్రాఫ్ ని భద్రతా దళాల యూనిఫాంలో చూపిస్తారు. అతడికెంత సేపు ఇండియా రావడానికి. పసి కొడుకు మీద కుటుంబ భారం వేయకుండా, ఉద్యోగంలో వున్న తను జీతం పంపవచ్చుగా? సల్మాన్ అయినా లాహోర్ లో తండ్రికి ఒక్క ఉత్తరమైనా రాసే ప్రయత్నం చెయ్యడు. రెండు దేశాలమధ్య కమ్యూనికేషన్స్ కూడా లేవా? అంత నిర్దయగా ప్రవర్తించాయా ప్రభుత్వాలు విభజన బాధితులతో? షాపు దగ్గరికి తండ్రి వస్తాడని 70 ఏళ్ళూ ఎదురు చూసే సల్మాన్ పాత్ర లాంటిది పాసివ్ గా గాథల్లోనే వుంటుంది, సహేతుకమైన కథల్లో కాదు. 

          సల్మాన్ తల్లి (సోనాలీ కులకర్ణి) కొడుకు పెట్టే తిండి కోసం పడి వుంటోందా? భర్త కోసం, రెండో కూతురి కోసం ఎంత తల్లడిల్లుతోందో కొడుకు ఆలోచించక్కర్లేదా? వాళ్ళని తెచ్చి కలపడం ప్రథమ కర్తవ్యంగా ఫీలవకపోతే ఇదేం కొడుకు గాథ, ఫ్యామిలీ డ్రామా? 

         విడిపోయిన కుటుంబం తిరిగి కలుసుకోవడం కాన్సెప్ట్ గోల్. కలపడానికి హీరో ప్రయత్నించడం స్టోరీ గోల్. కానీ సల్మాన్ స్టోరీ గోల్ ని వదిలేసి, స్టోరీ గోల్ తో సంబంధంలేని ఏవో ఉద్యోగాలు చేసుకుంటూ వుండిపోతే, చివరికి కత్రినా కైఫ్ టీవీ లైవ్ ప్రోగ్రాంతో తనే కాన్సెప్ట్ గోల్ ని పూర్తి చేయాల్సి వస్తుంది. మొదట్లో దేశవిభజనతో కుటుంబం విడిపోవడమ నే ఒక సీను పెట్టుకుని, చివర్లో కలవడమనే రెండో సీను పెట్టుకుని,  ఈ రెండు ముక్కల మధ్యా వీటితో కలవని కథనం నడిపేశారు. కథగా ఏమీ జరగని ఈ కథనం రానురాను కృశించిపోతూ సహన పరీక్ష పెట్టేస్తుంది.

          హిందీలోనూ తెలుగులోనూ ఫార్ములా కమర్షియల్స్ కి కాలం చెల్లిందని, ఇంకేదో  డిఫరెంట్ ఫీల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది కాస్తా కమర్షియల్ సినిమాల్లోంచి కథల్ని వెళ్ళ గొట్టేసి, చప్పిడి  గాథలకి ద్వారాలు తెరుస్తోంది.

సికిందర్





నోట్ : ఈ వారం విడుదలైన ‘కిల్లర్’ స్క్రీన్ ప్లే సంగతులు
వచ్చే వారం ఇద్దాం. స్క్రీన్ ప్లే సంగతుల కోసం సస్పన్స్
మొత్తం ఇప్పుడే రివీల్ చేస్తే, చూడాలనుకున్న ప్రేక్షకులకి
స్పాయిలర్ గా హాని చేస్తుంది.



7, జూన్ 2019, శుక్రవారం



నోట్ : రివ్యూలు యూఎస్ లో అప్ లోడ్ అవ్వాలి. 
టైం జోన్ తేడాల వల్ల ఆలస్యమవుతోంది. 
ఈ సమస్య త్వరలో పరిష్కారమవుతుంది.

5, జూన్ 2019, బుధవారం

836 : టిప్స్


      85. తెలుగులో క్రౌడ్ ఫండింగ్ తో తీసినవే రెండు. ఇవి ఏమయ్యాయో తెలిసిందే. కమర్షియల్ సినిమాలకి భిన్నంగా ఏదో ప్రయోగాలు చేద్దామనుకుని,  క్రౌడ్ ఫండింగ్ తో ఏం తీసినా,  ఏ సొంత క్రియేటివ్ కోర్కెలు తీర్చుకున్నా,  మళ్ళీ వాటిని విడుదల చేయాల్సింది వ్యాపారులే. ఎన్నో  కమర్షియల్ సినిమాల విడుదలలకే దిక్కులేదు, కమర్షియలేతర సమాంతర సినిమాల మొహం ఏ వ్యాపారి చూస్తాడు. వచ్చిన చిక్కేమిటంటే,  వస్తున్న కొత్త తరం బిజినెస్ సైడే చూడరు. కమర్షియల్ సినిమాల్ని విమర్శిస్తూ వాటికంటే మెరుగైన తమ టాలెంటేదో చూపించాలనుకుంటారు. అమాంతం వెళ్లి వరల్డ్ సినిమాల మోజుతో ఇండీ మూవీస్ తీసి పడేస్తారు. అవి కమర్షియల్ మూవీస్ లాగే వుంటాయి. మైండ్ మీద స్టార్ సినిమాల ప్రభావం స్వారీ చేస్తూంటే ఇంతే. ఏ బడ్జెట్ కథ ఆలోచించాలన్నా, ఏ జానర్ కథ ఆలోచించాలన్నా తాము చూసిన స్టార్ సినిమాల్లో నటనలు, డైలాగులు, కామెడీలు, మ్యానరిజమ్స్, పాటలు, ఫైట్లు, టేకింగ్, ఎడిటింగ్, బిజిఎం, కలర్ థీమ్స్...ఇవే మెదుల్తూంటాయి. ఇక యాభై కోట్ల స్టార్ సినిమాని కోటి రూపాయల ఫుట్ పాత్ సినిమాలా తీసి పడెయ్యడం.
          86. సబ్ టైటిల్స్ తో వున్న సినిమాల్ని చూస్తూంటే ఎంత బాగా డైలాగులు రాస్తున్నారో అర్ధమవుతుంది. నటుడు పది మాటల్లో చెప్పే డైలాగు, సబ్ టైటిల్స్ లో ఒకే లైనుగా వచ్చేస్తుంది. డైలాగ్ రైటర్ రాసిన పెద్ద డైలాగుని సబ్ టైటిల్స్ రైటర్ ఒక్క లైనులో చెప్పేస్తున్నప్పుడు, డైలాగ్ రైటర్ దేనికి? పేరాలకి పేరాలు డైలాగులు రాసి లెంత్ పెంచెయ్యడం, దాంతో షూటింగులో, డబ్బింగులో ఖర్చు పెంచెయ్యడం...
          87. అసలు సౌండ్ ని మ్యూట్ చేసి సినిమాల్ని చూస్తే  డైలాగులు ఎక్కడెక్కడ అవసరం లేదో తెలిసిపోతుంది. సౌండ్ లేక పోయినా సన్నివేశంలో ఏం జరుగుతోందో  అర్ధమైపోతూంటే డైలాగుల అవసరమే లేదు.
          88. స్క్రీన్ ప్లేలో కథ ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ వన్ లో పుడుతుందని తెలిసిందే. దీనికి ముందు బిగినింగ్ విభాగంలో వుండేదంతా కథ కాదనీ, ప్లాట్ పాయింట్ వన్ లో పుట్టబోయేది మాత్రమే కథ అనీ, అంతవరకూ బిగినింగ్ విభాగంలో చూపించేదంతా ఆ పుట్టబోయే కథకి కేవలం ఉపోద్ఘాతమేననీ కూడా తెలిసిందే. ఇదంతా మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకోవడమంటే, ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా ఉపోద్ఘాతం వచ్చేసి కథని కలుషితం చేసేసే ప్రమాదముంటుంది గనుక.
          89. ఎన్ని లొకేషన్స్ లో తీశామని కాదు పబ్లిసిటీ, కంటెంట్ ఏమిటన్నది డిమాండ్. ఐదు లొకేషన్స్ లో, ఆరుగురు ఆర్టిస్టులతో, డెబ్బై లక్షలతో కంటెంట్ ఆధారిత కమర్షియల్ ని పాతిక రోజుల్లో తీసి కూడా కమ్మగా కోటి రూపాయలు జేబులో వేసుకుని నిద్రపోవచ్చు. కంటెంట్ ఏమిటన్నది, అది కాగితం మీద ఎలా వున్నదీ బాక్సాఫీసు చేసే తనిఖీ. తేడాగా వుందా చించి అవతల పారేస్తుంది. 
        90. చాలా కామన్ సెన్స్ ఐడియాని ప్లాన్ చేసుకోకపోతే సినిమా ఫ్లాపే. ఈ బేసిక్స్ ని ఎవ్వరూ ఛాలెంజి చేయలేరు. ఐడియాని ప్లాన్ చేసుకోక పోతే సినిమా అట్టర్ ఫ్లాపే. ఇంకో మాటే లేదు. క్రియేటివ్ స్కూల్లోంచి  స్ట్రక్చర్ స్కూల్లోకి వచ్చినప్పుడే హిట్ ఫ్లాపులు అర్ధమవుతాయి. అంతవరకూ చీకట్లో బాణాలేయడమే. సొంత వైద్యంలాంటి క్రియేటివ్ స్కూళ్ళే  సినిమాల్ని చూడలేకుండా చేస్తున్నాయి. క్రియేటివ్ స్కూలు గుండు గుత్త ధోరణిలో వుంటుంది. స్ట్రక్చర్ స్కూల్లో స్టెప్ బై స్టెప్ అప్రోచ్ వుంటుంది. ముందు ఐడియా మూల్యాంకన వుంటుంది. ఈ ఐడియాకి మార్కెట్ యాస్పెక్ట్ వుందా? ఇందులో యూత్ అప్పీల్ ననుసరించి రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్, లేదా రెండూ ప్లే అవుతున్నాయా? ఇప్పటి యూత్ కి సినిమాల మార్కెట్ యాస్పెక్ట్ ఇదే. హుషారులో ఎకనమిక్స్ చక్కగా ప్లే అయింది. జేబునిండా డబ్బు, చేతినిండా అమ్మాయీ, వీటికోసం పాట్లు - ఇవే తెర మీద చూడాలని కోరుకుంటారు ఈ కాలం కుర్రకారు.  తర్వాత ఐడియాకి స్ట్రక్చర్ వుందా? ఇది పనికొచ్చే కథేనా, లేక పనికిరాని గాథా? ఇందులో ప్లాట్ పాయింట్ వన్ కి యూత్ అప్పీల్ వుందా? ...ఇలా స్టెప్ బై స్టెప్ బేరీజు వేసినప్పుడు ఐడియా దశలోనే సినిమా భవితవ్యం తేలిపోతుంది. సినిమా మొత్తం తీసి, విడుదల చేసి, అది ఫ్లాపయ్యాక గానీ తీసింది ఫ్లాప్ కథ అని తెలియకపోవడం అంతా ఏదో సామెత చెప్పినట్టు వుంటుంది. 

సికిందర్



3, జూన్ 2019, సోమవారం

835 : ఇండీ సంగతులు

    ‘అంగమలై డైరీస్’ ని అంగమలై పట్టణపు కథగా అంగమలైలో ఎందుకు తీయాలి? ఎందుకంటే ఆ దర్శకుడు, ఆ రచయిత ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి. దర్శకుడు లిజో జోస్ పెలిసరీ అక్కడికి 14 కిలోమీటర్ల దూరంలో చలకుడిలో నివసిస్తే, రచయిత వినోద్ చంబన్ జోస్ అంగమలై లోనే నివసించాడు. అంగమలై వాళ్లకి కొట్టిన పిండి. అక్కడి లోకల్ కల్చర్, జీవితం, మనుషుల తీరుతెన్నులు క్షుణ్ణంగా తెలుసు. క్రైస్తవులు ప్రధానంగా వుండే ఆ పట్టణంలో ఎటు చూసినా క్రైస్తవ సంస్కృతే కన్పిస్తుంది. అయినంత మాత్రానా క్రైస్తవ సంస్కృతితో తమకి తెలిసిన నేటివిటీ దొరికిందని అంగమలై లొకేషన్ గా ముఠా తగాదాల కథ చెప్పాలా? కానేకాదు. క్రైస్తవ సంస్కృతితో బాటు అంగమలై పోర్క్ వ్యాపారానికి పెట్టింది పేరు. అక్కడి ప్రజలు ఇష్టపడి రోజూ తినే ఆహారం పోర్క్ మాంసాహారం. నాలుగున్నర కోట్ల టర్నోవర్ తో అతి పెద్ద వ్యాపారంగా ఎందరికో జీవనోపాధి కల్పిస్తోంది. సీమపందుల పెంపకం, అమ్మకం పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రేక్షకులకి అర్ధ మవడానికి సినిమాలో పోర్క్ డిపో అతని చేత ఇదంతా చెప్పించి, కథకి కేంద్రబిందువుగా  ఎస్టాబ్లిష్ చేశారు. ఇలా ముఠా తగాదాలకి అంగమలై అంతర్భాగమైన పోర్క్ బిజినెస్ ని నేపధ్యంగా తీసుకుని వాస్తవికతని, విశ్వసనీయతని సమకూర్చారు. 

         
ఇందులో నటించిన 86 మందీ కొత్త వాళ్ళు స్థానికులే. ఈ వూరు మనుషులెలా వుంటారో  వీళ్ళూ అలా వుంటూ నటించలేదు, ప్రవర్తించారు. వాళ్ళ వేష భాషలు, హాస్యం, స్థానికత అక్కడివే, సినిమా కోసం మార్చుకోలేదు. క్రిస్టియన్ ఫ్లేవర్ తో మ్యూజిక్ అక్కడిదే. గోవా నేపధ్యంలో కొంకణీ సినిమాల క్రిస్టియన్ ఫ్లేవర్ ఎలావుంటుందో, అంగమలైలో అది సరీగ్గా కుదిరింది. ఒక ప్రాంత నేటివిటీని సజీవ ప్రపంచంగా మన కళ్ళ ముందు ప్రతిష్టించాలంటే, మైక్రో లెవెల్లో చూపించాలి. ఓవరాల్ గా కెమెరా పాన్ చేసి ఇది ఫలానా ప్రాంతమంటే సరిపోదు. ప్రేమమ్, ఆర్డినరీ, అనార్కలీ వంటి మలయాళ సినిమాల్లో లొకేషన్స్ స్టూడెంట్స్ బస్సులు కట్టుకుని వెళ్లి విహరించే టూరిస్టు కేంద్రాలయ్యాయంటే, వాటిని మైక్రో లెవెల్లో చూపించడం వల్లే. అంగమలై పట్టణపు మైక్రో లెవెల్ చిత్రీకరణ కూడా చూస్తే, మనకి కూడా అక్కడికి వెళ్లి తిరిగి రావాలన్పిస్తుంది- పోర్క్ తినడానికి కాదు. మోనార్క్ లా ఫోటోలు దిగి రావడానికి... 




          హీరో గ్రూపు పోర్క్ ఇరవై రూపాయలు తక్కువకి అమ్ముతున్నారని, డిపో గ్రూపు అభ్యంతరం చెప్పడంతో మొదలయ్యే ఘర్షణలు... డిపో గ్రూపు విసిరిన బాంబు వల్ల హీరో పోర్క్ షాపు ధ్వంసమవడం, హీరో విసిరిన బాంబు వల్ల ఎదుటి గ్రూపులో ఒకడు చనిపోవడం, అది హత్య కేసుగా హీరో మెడకి చుట్టుకోవడం, అందులోంచి బయటపడేందుకు అవసరమైన ముప్ఫై లక్షల కోసం ప్రయత్నించడం...ఇలా అతి సాధారణంగా, బలహీనంగా వుంటుంది కథ. దీన్ని బలమైన కమర్షియల్ కథగా మార్చకుండా, రియలిస్టిక్ ధోరణులతో ఇండీ ఫిలిం (ఇండిపెండెంట్ సినిమా అనే సమాంతర సినిమా) గా తీశారు. సమాంతర సినిమా ఎప్పుడూ కమర్షియల్ ధోరణులతో  వుండదు. సమాంతర సినిమాలుగా మొదటి తరంలో ఆర్ట్ సినిమాలు, కొత్త రూపంగా కమర్షియల్ - ఆర్ట్ కలగలిసిన క్రాసోవర్ సినిమాలు, వీటి  కొనసాగింపుగా వరల్డ్ మూవీస్ అనుకరణలు వచ్చి, చివరిగా ఇండీ ఫిలిం దగ్గరాగింది ప్రస్తుతం సమాంతర సినిమా ప్రస్థానం. 


           ఇండీ ఫీలిం దర్శకుడు ఫీలయ్యి ఇండిపెండెంట్ గా ఇష్టమొచ్చినట్టు తీసుకునే వేదిక. దీన్ని కమర్షియల్ సినిమాల ‘క్యాలిక్యులేటర్’ తో చూసి ఇందులో ఇది లేదు, అది లేదంటే కుదరదు. స్క్రీన్ ప్లే గురించి మాట్లాడడం అసలే కుదరదు. ఎలా చూపించిన కథ అలా చూడాల్సిందే. విమర్శకి తావులేదు. కానీ ఇండీ ఫిలిం జానర్ మర్యాదలు తెలియకుండా, ఏ కొంచెం కమర్షియల్ కథనం చేసినా, ఫార్ములా చిత్రణలు చేసినా, కృత్రిమ పాత్రల్ని చూపించినా, ఆ దర్శకుడే దెబ్బతింటాడు. అప్పుడది ఇండీ ఫిలిం కాక, దేనికీ చెందని అనాధ అవుతుంది.

టెక్నిక్కే వేరు
      టెక్నికల్ గా కూడా కమర్షియల్ పంథా వుండదు. కమర్షియల్ సినిమా షాట్స్, టేకింగ్స్, లైటింగ్, టింట్స్ వగైరా వాడరు. దృశ్యాలు సహజంగా, కూల్ గా వుంటాయి. యాక్షన్ సీన్లు, ఛేజింగులు, ఫైటింగులు కూడా కమర్షియల్ సినిమాల టైపులో వుండవు. నిజ జీవితంలో మన కళ్ళ ముందు ఎలా జరుగుతాయో అలా యాదృచ్ఛికంగా జరిగిపోతాయి. ఇక హింస వుంటే దానికి యాంటీగా నేపధ్యంలో హార్ష్ గా వుండని మృదువైన వాతావరణం కల్పించడంతో ఆ హింస కూడా కళాత్మకమై పోతుంది. ‘అంగమలై డైరీస్’ లో లైట్స్ వాడలేదు. సహజ వెలుతురులోనే షూట్ చేశారు. అవన్నీ రియల్ లొకేషన్సే. మార్కెట్, కాలనీలు, పోర్క్ ప్రాంగణాలు వగైరా. షూటింగ్ లో లైటింగ్ యూనిట్ లేదు. జిబ్, ట్రాక్స్, ట్రాలీలు ఏవీ లేవు. ఎక్కువగా హేండ్ హెల్డ్ కెమెరాలతోనే షూట్ చేశారు. క్లయిమాక్స్ ఫైటింగ్ టేకింగ్ కి అంతర్జాతీయంగా పేరొచ్చింది. వెయ్యి మందితో, అదీ రాత్రిపూట, ఎక్కడా కట్ లేకుండా, కెమెరాని మూవ్ చేస్తూ, సింగిల్ టేక్ లో 12 నిమిషాల యాక్షన్ సీనంతా తీశారు.

          ఇలా మేకింగ్ లో ఈ ఎఫెక్ట్స్ అన్నీ వ్యూహాత్మకంగా ఏర్చికూర్చి – పొందుపర్చడంతో  ఈ ఇండీ ఫిలిం ఇండీ ఫిలిమ్స్ లో మేటిగా తయారయ్యింది. బాక్సాఫీసు సక్సెస్ కూడా చవిచూసింది. రెండున్నర కోట్ల బడ్జెట్ కి 20 కోట్లు వసూలు చేసింది. జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. ఒకటి రెండు అంతర్జాతీయ ఇండీ ఫిలిమ్స్ ఫెస్టివల్స్ కి కూడా వెళ్ళింది. కొంత మంది దీన్ని క్లాసిక్ కల్ట్ అని కూడా అంటున్నారు. 

          ఇక తెలుగుకి వద్దాం. తెలుగులో ఎప్పుడో గానీ ఇండీ ఫిలిం రాదు. వస్తే చీప్ గా  తీసిన కమర్షియల్ సినిమాల్లాగా వుంటాయి. ఇండీ ఫిలిం క్రాఫ్ట్ ఏ మాత్రం వుండదు. మైక్రో లెవెల్ చిత్రీకరణతో, పర్సనల్ గా అనుభవించిన జీవితంలోంచి ఆ దర్శకుడి వాయిస్ లా వుండవు. ఇక జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందడం, అమెరికన్ మీడియాలో కూడా రివ్యూలకి నోచుకోవడం, ఫెస్టివల్స్ కి వెళ్ళడం, కల్ట్ క్లాసిక్ అన్పించుకోవడం లాంటివి అస్సలు వూహించలేం. 

రీమేకా?! 
      అలాటిది ఒక ఇండీ ఫిలింని రిమేక్ చేస్తే? ఈ ప్రశ్న షార్ట్ ఫిలింని రిమేక్ చేస్తే?  అన్నట్టుంటుంది. షార్ట్ ఫిలిమ్స్ లాగే ఇండీ ఫిలిమ్స్ పర్సనల్ డైరీలు. కాకపోతే పొడిగించిన పర్సనల్ డైరీలు. అవి కమర్షియల్ సినిమాలు కావు - కొనుక్కొ చ్చుకుని గబగబా రిమేక్ చేసుకుని, చకచకా కరెన్సీ లెక్కెట్టుకుందా
మనుకోవడానికి. ఆ దర్శకుడి పర్సనల్ డైరీ అతను ఫీలైన సాంస్కృతిక కళాభివ్యక్తి. దాన్ని తెచ్చుకుని ఇంకో దర్శకుడు రిమేక్ చేయడమేమిటి? చేతనైతే దాని స్ఫూర్తితో తాను ఇంకోటి ఫీలై తన డైరీ లాగా ఏదైనా తీసుకోవాలి.

          అస్సాంలో మార్షల్ ఆర్ట్స్ అక్కడి జీవితంలో ఒక భాగం, సంస్కృతి. చిన్నప్పట్నించే ఆడా మగా పిల్లలు నేర్చుకుంటారు. ఈ సంస్కృతి తెలిసిన కుర్రాడు కేన్నీ డియోరీ బాసుమటారీ అనే వాడు, తన ఈ సాంస్కృతిక కళాభివ్యక్తితో సినిమా తీసేద్దామనుకున్నాడు. తన దగ్గరున్న35 వేలతో కెమెరా కొనుక్కుని, వాళ్ళమ్మ దగ్గర బంగారం కుదువ బెట్టి, లక్షరూపాయలతో ‘లోకల్ కుంగ్ ఫూ’ అనే ఇండీ ఫిలిం తీసేశాడు. తెలుగులో లక్షరూపాయలు, ఇంకా వీలయితే ఆ పైన పెట్టుబడితో ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఆలోచించడం దగ్గరే  వుండి పోతునప్పుడు, తను ఏకంగా లక్షతో ఇండీ ఫిలిమే తీసి చూపెట్టాడు. యూట్యూబ్ లో ట్రైలర్ పెడితే పీవీఆర్ సంస్థ చూసి డీల్ కుదుర్చుకుని, దేశంలో  ప్రధాన నగరాల్లో రోజూ ఒక ఆట చొప్పున విడుదల చేసింది. 26 లక్షలు వచ్చాయి. ఆరు లక్షలు ప్రమోషనల్ ఖర్చులు తీసేసి, పది లక్షలు ఈ కొత్త ఇండీ దర్శకుడు కేన్నీ కిచ్చింది. అస్సాం యూత్ లో ఇదొక కల్ట్ ఫిలింగా  నమోదైంది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వ అవార్డుతో బాటు, మరికొన్ని అవార్డులు వచ్చాయి. అస్సాం యూత్ లో కెన్నీ సెలెబ్రిటీ అయిపోయాడు. వెంటనే ‘లోకల్ కుంగ్ ఫూ -2’ ని ప్రకటించి, 15 లక్షలు క్రౌడ్ ఫండింగ్ కెళ్తే, 30 లక్షలు వచ్చిపడ్డాయి! నేరుగా కుంభ స్థలాన్ని కొట్టలేరు. తన ఆట స్థలంలో తను ఫ్రెష్ గా ఆడుకుంటే కుబేరులే దిగివస్తారు. తన ఆట స్థలంలో కేన్నీ ఫ్రెష్ గా ఆడుకున్నాడు, పీవీఆర్ వచ్చి ఉద్ధరించింది. 

       సాంస్కృతిక కళాభివ్యక్తియే, ఇంకాస్త ఇన్నోసెన్సే ఇండీ ఫిలిమ్స్ కి  ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకెళ్ళే  ప్రధాన ముడి సరుకులుగా వుంటాయి. అలాంటిది ‘అంగమలై డైరీస్’ సాంస్కృతిక (పోర్క్ బిజినెస్) కళాభివ్యక్తినీ, అందులోని ఇన్నోసెన్స్ నీ, తెలుగులోకి రొడ్ద కొట్టుడు వూర మాస్ ఫలక్ నుమా దాస్ గా మార్చి పారేస్తే సరిపోతుందా? ‘ఫలక్ నుమా దాస్’ అని టైటిల్ పెట్టడంలోనే అర్ధమవుతోంది - ‘అంగమలై డైరీస్’ ని వూర మాస్ గా అర్ధం జేసుకుని రీమేక్ చేశారని. గతంలో తమిళంలో ‘నేరం’ అనే ఇండీ ఫిలింని అది ఇండీ ఫిలిం అని తెలీక, కమర్షియల్ తెలుగులో సందీప్ కిషన్ తో ‘రన్’ గా రీమేక్ చేశారు. కమర్షియల్ ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇందులో విలన్ ఉత్తుత్తిగానే ఒక ఆటో గుద్దుకుని కథ మధ్యలోనే ఠపీమని చచ్చిపోతాడు. ఇది డార్క్ కామెడీ. ఇండీ ఫిలింకి చెల్లుబాటయ్యే డార్క్ కామెడీ. కమర్షియల్ సినిమా కథకి ఓ పద్ధతీ పాడూ వుంటాయి. ఇండీకి వుండనవసరం లేదు. ఇది తెలీక ఇండీ ‘నేరం’ ని కమర్షియల్  ‘నేరం’ అనుకుని, బేరమాడుకుని, ‘రన్’ గా రీమేక్ చేస్తే ప్రేక్షకులు ఒకటే రన్!  ఇదే తమిళ ఇండీ ‘నేరం’ ని అదే దర్శకుడు మలయాళంలో రీమేక్ చేస్తే హిట్టయ్యింది! ఎవడి సొంత కవిత్వం వాడే చెప్పగలడు. ఇప్పుడింకో జోకేమిటంటే, ‘అంగమలై డైరీస్’ ని హిందీలో రీమేక్ చేయడానికి బాలీవుడ్ దొరలు వచ్చారట! ఒక స్థానిక సాంస్కృతిక సన్నివేశాన్ని ఇంకో స్థానిక సన్నివేశంలో పెట్టి ఎలా చూపిస్తారో ఏమిటో. అంగమలై పట్టణపు సంస్కృతితో  ‘అంగమలై డైరీస్’ ని అక్కడి ‘కట్టా లోకల్’ గా, అంటే పక్కా లోకల్ గా ఆ దర్శకుడు ఇండీ ఫిలింగా తీసుకుని సక్సెస్ అయితే, దాన్ని తెలుగులో ‘పక్కా మాస్’ గా తీసి అట్టర్ ఫ్లాపయ్యారు. 

మాస్ మసాలా!
     టేకింగ్ అంతా కమర్షియల్ మాస్ టేకింగే, రియలిస్టిక్ ఫీల్ ఎక్కడా వుండదు. బీజిఎమ్ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) లో థీమ్, లోకల్ కల్చర్ కన్పించవు. రెగ్యులర్ యాక్షన్ మూవీ మ్యూజిక్కే. ముఠాల పాత్రలు,  పాత్రధారుల తీరుతెన్నులు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలన్నిట్లో ఒకేలా వుండే రౌడీ గెటప్సే. అవే జుట్లు, గడ్డాలు, మాసిన జీన్స్, టీస్. ఒరిజినల్ లో (అంగమలై డైరీస్ లో) లాగా 86 మంది ఫలక్ నుమా వాసులు ఎవరూ లేరు. ఫలక్ నుమా లోకి దిగుమతైన రెగ్యులర్ తెలుగు సినిమా మాస్ మొహాలే ఇవి. ఒరిజినల్ లో ఒకరిద్దరు తప్ప,  షేవ్ చేసుకునే నీటుగా వుంటారు. రౌడీ లుక్స్ వుండవు. ఇక హీరో ఆంటోనీ వర్ఘీస్ మొహంలో ఇన్నోసెన్సే వుంటుంది. బియ్యే తప్పి కేబుల్ టీవీ బిజినెస్ చేస్తూంటాడు. తల్లి వుంది. చెల్లెలి పెళ్లి చేయాలి. అందుకని పోర్క్ బిజినెస్ కూడా చేద్దామని ఫ్రెండ్స్ తో ఎంటర్ అవుతారు. అతడి లవ్ ట్రాక్ లో ఇద్దరు అమ్మాయిలుంటారు. మొదటి అమ్మాయి పెళ్లి చేసుకుని సింగపూర్ వెళ్ళిపోతుంది. రెండో అమ్మాయి జర్మనీలో నర్సు. ఈమెని పెళ్లి చేసుకుని జర్మనీలో సెటిల్ అవుదామనుకుంటాడు. ఇది కూడా జరక్క ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.  సింగపూర్, జర్మనీలతో తెలుగులో ఈ ట్రాక్ ఫలక్ నుమా నేటివిటీకి కృత్రిమంగా వుంటుంది. ఇక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇంకా సినిమాటిక్. 

          ‘అంగమలై డైరీస్’ ప్రారంభంలో పోర్క్ స్టాల్స్ ని ఎక్కువగా చూపిస్తూ కథా నే పధ్యాన్ని పరిచయం చేస్తూంటారు. తెలుగులో ఫలక్ నుమా దేనికి ప్రసిద్దో చూపించలేక పోయారు. ఫలక్ నుమా దాటి సీటీ అంతా రౌండేశారు. మదీనా దగ్గర నాయబ్ హోటల్లో పాయా, షాదాబ్ హోటల్లో బిర్యానీ అంటూ, ఇంకా ఇతర చోట్లలో  ఫేమస్ అడ్డాలు చూపించుకుంటూ పోయారు. అసలు ఫలక్ నుమా ప్యాలెస్ ని చూపించడానికి కథ ప్రకారం వీలు పడలేదు. ఈ కథాకాలం 2005. అయినా ఇప్పుడు ఫలక్ నుమా ప్యాలెస్ అప్పటి ఫలక్ నుమా ప్యాలెస్ కాదు. మధ్యలో 2010 లో తాజ్ ఫైవ్ స్టార్ హోటల్ గా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు చూపెట్ట లేరు. ఎక్కడో మదీనా దాకా వెళ్ళకుండా, ఫలక్ నుమా లోనే రెండు పెద్ద ఇరానీ రెస్టారెంట్స్ వున్నాయి. ఇంకా చిన్న చమన్, మహంకాళీ గుడిలతో బాటు ఇంజన్ బౌలీ, ఆలియా బాద్ వంటి ఫేమస్ సెంటర్స్, రైల్వే స్టేషన్ వున్నాయి. మదీనా దగ్గర నాయబ్, షాదాబ్ హోటల్స్  అంటూ చూపెట్టారే గానీ,  కథా కాలం ప్రకారం అప్పట్లో మదీనా హోటల్ కూడా వుంది. మదీనా చాయ్ వుంది. ఫలక్ నుమా దాస్ ని ఎలా చూపెట్టారంటే, హైదరాబాద్ మొత్తం ఒకే నేటివిటీ అన్నట్టు చూపెట్టారు. 

          కానీ ఆబిడ్స్ నేటివిటీ జూబిలీ హిల్స్ లో వుండదు. అల్వాల్ నేటివిటీ చిక్కడపల్లిలో వుండదు. ఇలా ఫలక్ నుమా నేటివిటీ అంటూ వుంటే దానికో ఫీల్ తో దాని నేటివిటీయే  వుంది. ఓల్డ్ సిటీ నేపధ్యంగా హైదరాబాదీ కామెడీ - యాక్షన్ సినిమాలు వస్తూంటాయి. ఇవి ఇటు మహారాష్ట్ర, కర్ణాటక సరిహాద్దు జిల్లాల్లో వరకూ పాపులర్. వాటిలో వుండే ఓల్డ్ సిటీ సంస్కృతి, భాష, జోకులు ఏవైతే వుంటాయో అది పక్కా నేటివిటీ. అందుకే క్రేజ్. 

          ఇక హీరో తను ప్రేమిస్తున్న అమ్మాయిని ఒక స్టూడెంట్ టీజ్ చేశాడని కొట్టడానికి వెళ్ళే కాలేజీ ఎక్కడో ఉస్మానియా యూనివర్సిటీ. ఫలక్ నుమాలోనే కాలేజీలున్నాయి. కాకుండా కమర్షియల్ సినిమాల్లో బిల్డప్ లాగా, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనం కావాల్సి వచ్చింది. ఇక ప్రతీవారం ఎక్కడెక్కడి గ్యాంగ్స్ చేరి మాట్లాడుకుంటాయని ఒక బార్ సెట్ చేశారు. ఫలక్ నుమాలో ఇది నిజం కాదు. అప్పట్లో దర్బార్ ఒక్క చోటే జరిగేది. చార్మినార్ పక్క రోడ్డులో ఒక హోటల్లో. అర్ధ రాత్రి దాటాక షట్టర్స్ వేసి లోపల లోన్ మాఫియా దర్బార్ పెట్టి, బాకీదార్లని చావగొడుతోంటే భయంకరమైన అరుపులు రోడ్డంతా విన్పించేవి. పోలీసులు చూసీ చూడనట్టు వెళ్లి పోయేవాళ్ళు. ఆప్పట్లో ఓల్డ్ సిటీలో లోన్ మాఫియానే పెచ్చరిల్లింది. ఇదేం లేకుండా ఓ బార్ సెట్ వేసి ముచ్చట్లు చూపించారు. 

సాంస్కృతిక నేపధ్యం లేదా?
      ఇంతకీ ఫలక్ నుమా సంస్కృతి ఏమిటి? హైదరాబాద్ హిందూ ముస్లిం సంస్కృతి, బిర్యానీ సంస్కృతి.  మలయాళంలో ఆ క్రైస్తవ సంస్కృతి, పోర్క్ ప్రశస్తి ఆ ఇండీ ఫిలింకి ఆత్మలా వుంటాయి. బ్యాక్ డ్రాప్ లో ఈ సోల్ ని బలంగా ఫీలయ్యేట్టు చేశాడు దర్శకుడు. ఇందుకే ఈ బలహీన కథ కూర్చోబెట్ట గల్గింది ప్రేక్షకుల్ని. తెలుగులో ఇలా లేదు. హిందూ ముస్లిం సంస్కృతి, బిర్యానీ ప్రశస్తి ఎక్కడా ఎస్టాబ్లిష్ కాకుండా, గ్యాంగ్ వార్స్ తో ఈ మటన్ కథ కమర్షియల్ పంథాలో పైపైన వుండిపోయింది. 

          ఐతే అంగమలై పోర్క్ వ్యాపారానికి ప్రసిద్ది. దీన్ని మొదటి సారిగా ప్రపంచ దృష్టికి తెస్తూ దీని నేపధ్యంలో కథ నడిపాడు దర్శకుడు. దీంతో కథే కొత్తగా మారిపోయింది. హైదరాబాద్ బిర్యానీతో  ఈ నావెల్టీ లేదు. హైదరాబాద్ బిర్యానీకి ప్రసిద్ధి అని ఎప్పుడో తెలిసిన పాత మాటే. ఇంకా కొత్తగా చెప్పడానికీ, చూపించడానికీ ఏమీ వుండదు. కాబట్టి బిర్యానీ చుట్టూ కథగా మార్చి చూపించినా ఇక వర్కౌట్ కాదు. ఏం చేయాలో అర్ధం గాక మటన్ కొట్టు పెట్టారు. అంగమలై లో పోర్కే ప్రధాన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారంలోకి హీరో వెళ్ళడం సహజ ప్రక్రియ. ఫలక్ నుమా లో ఏ సహజ ప్రక్రియ హీరోని మటన్ వైపు లాగింది? అంగమలై హీరో చిన్నప్పట్నుంచీ సీమ పందుల్నీ, పోర్క్ దుకాణాల్నీ చూస్తూ పెరిగాడు. ఇంట్లో అదే తిన్నాడు. చిన్నప్పుడు హీరో ఇంట్లో మదర్ పోర్క్ వండుతూంటేనే సీను ఓపెనవుతుంది. అదే వడ్డిస్తుంది. ఫలక్ నుమా హీరోకి ఇవన్నీ ఎక్కడున్నాయి మటన్ వ్యాపారమనే సహజ ఐడియా రావడానికి. ఎక్కడో మూసీ దగ్గర జియా గూడలో గొర్రెల కబేళాలో గొర్రెలు కొని తెచ్చుకుని మటన్ కొట్టే అనుభవమెక్కడిది? ఇదంతా కమర్షియల్ సినిమా చిత్రణ కింద మారిపోయింది లాజిక్ లేకుండా.  

          ‘అంగమలై డైరీస్’ ని ఉద్దేశ పూర్వకంగానే తెలుగు ప్రేక్షకులకోసం మాస్ కమర్షియల్ గా మార్చి వుంటే అదీ వర్కౌట్ అవదు. ఇందులో వున్న బలహీన కంటెంట్, ఇండీ ఫిలింకి సూటయ్యేదే గానీ కమర్షియల్ సినిమా స్థాయికి కాదు. దర్శకుడు విశ్వక్సేన్ ఇంకేదో తనకి తెలిసిన నేటివిటీతో తనదైన సెన్సిబుల్ ఇండీ ఫిలిం తీయాల్సింది, లేదంటే ఇంకో కథతో నేటివిటీ లేని మాస్ తీసుకోవాల్సింది. ‘అంగమలై డైరీస్’ తో బ్యాడ్ జడ్జిమెంట్. 

సికిందర్
telugurajyam.com

1, జూన్ 2019, శనివారం

834 : స్క్రీన్ ప్లే సంగతులు


     చివరికి మంగళ సూత్రంతో కూడా ట్విస్టులు. ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ తో అమ్మ మంగళ సూత్రమని చెప్పి, సెకండ్ ఫ్లాష్ బ్యాక్ తో మేనత్త మంగళ సూత్రమని ట్విస్ట్ ఇచ్చారు. కథనంలో తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాకుల్ని దృష్టిలో పెట్టుకుని కథనాన్ని వివరించు కుంటున్నప్పుడు, ఆ ఫ్లాష్ బ్యాకుల్లో కొన్ని పాయింట్స్ కథనంతో మ్యచ్ కావడంలేదని గమనించాం. మంగళ సూత్రం మిస్ మ్యాచ్ కూడా వున్న విషయం ముందే తెలిసినప్పటికీ, దీన్ని కూడా కలిపి వివరిస్తూ పోతే హెవీ అవుతుందనీ, విశ్లేషణ కన్ఫ్యూజింగ్ గా  వుంటుందని, ఆపి చివర్లో చెపుదామని అనుకున్నాం. ఇంకోటేమిటంటే ఫ్లాష్ బ్యాకుల్లో మిగతా పాయింటుల్లాగా ఇది కూడా కేవలం ఒక పాయింటు కాదు. ప్లాట్ డివైస్. కథలో ప్రాధాన్యమున్న మంగళ సూత్రం, ప్లాట్ పాయింట్ వన్ నుంచీ ప్లాట్ డివైస్ గా ప్లే అవుతూ పోయింది. సీత దాంతోనే భూటాన్ పోయింది. దాంతోనే పెళ్లి నాటక మాడింది. దాంతోనే ఇంకేదో చేసింది... అమ్మ మంగళ సూత్రానికి మేనత్త మంగళ సూత్రమని ట్విస్టిచ్చాక, అమ్మ మంగళ సూత్రమేమైనట్టు? దీనికి ట్విస్టు కుదర్లేదేమో గానీ, మేనత్త మంగళ సూత్రానికింకో ట్విస్టిచ్చారు. ముగింపులో ఈ లక్షల విలువైన  మంగళ సూత్రం కూడా వుండదు, పసుపు తాడు కడతాడు! శవ్వ! శవ్వ! (కోట శ్రీనివాస రావు).
         గత వ్యాసం ప్లాట్ పాయింట్ టూ వరకూ వచ్చాం. దీని గురించి చూద్దాం. లాయర్ సీతకి రెండో ఫ్లాష్ బ్యాక్ తో వాస్తవాలు చెప్పాక, సీత రియాక్షన్ తో ప్లాట్ పాయింట్ టూ ఏర్పడింది. మేనత్త  ఇచ్చిన వంద గ్రాముల బంగారానికి వడ్డీ కట్టి చెప్తే ఇచ్చి పారేస్తానంది ఇప్పుడు కూడా అదే తల పొగరుతో సీత. కానీ ఇప్పుడు మంగళ సూత్రం మేనత్తదని లాయర్ చెప్పాక, ఆ మంగళ సూత్రాన్ని కూడా వాపసు చేయాలి నిజానికి సీత. అలా చేయదు. ఇక - మా అమ్మదని  చెప్పి ఇప్పుడు మనత్తదని అంటావేంటి? -  అని కూడా లాయర్ని ప్రశ్నించదు.  


        ‘మీ అమ్మగారైన శ్రీమతి స్వరాజ్యం గారు సుమంగళిగా స్వర్గస్థులైన కారణంగా, హిందూ సాంప్రదాయం ప్రకారం, ఆవిడ మంగళ సూత్రం కూతురికి గానీ కోడలికి గానీ చెందుతుంది. నువ్వు వారికి ఒక్కగానొక్క సంతానం గాబట్టి, ఆ మంగళ సూత్రాన్ని నీకు రాశారు’ అని అప్పుడు సీత తండ్రి రాసిన వీలునామా చదివాడు లాయర్ ప్లాట్ పాయింట్ వన్ సీనులో. ఇప్పుడు ప్లాట్ పాయింట్ టూ సీనులో -  మీ అమ్మది కాదు, మేనత్తదని అంటున్నాడు...

        దీన్నెలా అర్ధం జేసుకోవాలి. అమ్మదని వీలునామా చదివిన లాయరే ఇప్పుడు మేనత్తదని ఎలా అంటున్నాడు. మేనత్త మంగళ సూత్రం గురించే తండ్రి అలా రాశాడా? మరి అమ్మ మంగళ సూత్రమేమైంది? మేనత్త మంగళ సూత్రమైతే అమ్మదని ఎలా రాశాడు. మేనత్త మంగళ సూత్రమైతే తన కూతురికి చెందాలని తనెలా రాస్తాడు. తన చెల్లెలు (సీత మేనత్త) వల్ల కలసివచ్చిన సంపదకి మేనల్లుడ్నే వారసుడిగా తను నిర్ణయించాక, ఆ సంపద  పుట్టడానికి మూలమైన చెల్లెలి మంగళ సూత్రాన్ని కూడా మేనల్లుడికే రాయాలి. ఎవరి కిచ్చుకుంటాడో ఇచ్చుకుంటాడు మేనల్లుడు. తనెవరు కూతురికి రాయడానికి? పైగా చెల్లెలు ఇంకా చాలా బంగారం వొలిచి ఇచ్చింది. అదేమైంది? ఇకపోతే, కూతురు మేనల్లుడ్ని చేసుకుంటేనే అతడికి చెందుతున్న 5 వేల కోట్ల ఆస్తికి అర్హురాలవుతుందని తనెలా రాస్తాడు. స్వార్ధం కాదా? చెల్లెలి వల్ల కలిగిన సంపదని ముట్టుకోలేదని అంత నిస్వార్ధంగా చెప్పిన తను, మేనేజర్ గా భావించుకుని బతికిన తను- కూతురికి మేనల్లుడితో పెళ్లి లింకు పెట్టి ఆ సంపదతో స్వార్ధానికి పోవడం లేదా? ఇదేం గొప్ప తండ్రి పాత్ర? అసలు గందరగోళంగా వున్న వీలునామా వ్యవహారం దృష్ట్యా, ఏం గోల్ మాల్ చేశాడో విచారణ జరిపించాలి. అమ్మ మంగళ సూత్రం, మేనత్తిచ్చిన ఇంకా బంగారం ఏమయ్యాయి? చాలా గూడుపుఠానీ వుంది. 

        ఇదే ఫ్లాష్ బ్యాక్ సీనులో, చెల్లెలి సంపద మనం అనుభవించడానికి వీల్లేదని భార్య వొంటి మీది నగలు తీసేసుకుంటాడు ఇదే సీత తండ్రి. ఆ భార్య కోపంతో కూతురి వొంటిమీది నగలు కూడా తీసేయబోతూంటే -  మేనల్లుడ్ని చూపించి, కూతురు మేనల్లుడికి చెందుతుందని, కాబట్టి మేనల్లుడికి చెందింది కూతురికీ చెందుతుందనీ అనేస్తాడు! అంటే అప్పట్నించే చెల్లెలి సంపదతో స్వార్ధానికి పోయాడన్నమాట? నీ కూతురు నా కొడుకుని చేసుకోవాలని చెల్లెలేమీ మాట తీసుకోలేదే? 

      మరొక విషయమేమిటంటే, ఈ ఫ్లాష్ బ్యాక్ సీనంతా సీత వుండగానే, ఆమె సాక్షిగానే జరుగుతుంది. తండ్రి ఏమంటున్నాడో, తల్లి ఏమంటున్నదో అక్కడే వుండి వింటూంటుంది. ఆమే ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లో వున్నాక, ఇక లాయర్ ఈ ఫ్లాష్ చెప్పే అవసరమే లేదు. ‘నీకంతా తెల్సు, ఒకసారి గుర్తు చేసుకోమ్మా’ అంటే ఆమె పాయింటాఫ్ వ్యూలో ఈ ఫ్లాష్ బ్యాక్ రన్ అవడం న్యాయం. గతాన్ని ఆమే గుర్తు చేసుకుంటే -ఎక్కడో కలుక్కు మని, ఆమెలో మార్పు రావడానికి ఈ ఫ్లాష్ బ్యాక్ దోహద పడేది. అప్పుడు ప్లాట్ పాయింట్ టూ కి న్యాయం జరిగేది. లాయర్ పాయింటాఫ్ వ్యూలో కాక, సీత పాయింటాఫ్ వ్యూలో వుండాల్సిన ఫ్లాష్ బ్యాక్ ఇది. 

        ఇంకోటేమిటంటే, ఈ ఫ్లాష్ బ్యాక్ లో వుంటూ అంతా చూస్తూ, వింటూ వున్న సీతకి - పెద్దయాక ప్రదర్శిస్తున్న బుద్ధులు వచ్చే అవకాశమే లేదు. ఇది వీడి పెళ్ళాం, వీడి బంగారం వేసుకునే హక్కు దీనికుంది- అని తండ్రి అంత స్పష్టంగా అనేశాక ఇంకేం కావాలి పిచ్చి పిల్లకి. అసలు పిల్లల ముందు ఈ విషయాలు మాట్లాడడం నాన్సెన్స్. ప్రేక్షకులకి తెలియడం కోసం మాట్లాడుతున్నాడు. ప్రేక్షకులకి తెలియడం కోసం మాట్లడడానికి బెటర్ ఆప్షన్స్ వున్నాయి. 

        సీత నుంచి రామ్ విడిపోయి భూటాన్ వెళ్ళిపోయి ఇరవై ఏళ్లయింది. ఆస్తి అతనిదే నని చిన్నప్పుడే సీతకి తెలుసు. పెళ్లి చేసుకోవడానికి పేచీ ఏమిటో అర్ధంగాదు. ఇక సీత తల్లి, రామ్ ని చిత్రహింసలు పెట్టడం గురించి...ఆస్తికి వీడు వారసుడు, వీడికి మన కూతురు పెళ్ళాం -  అని భర్త చెప్పాక వాణ్ణి కాల్చి వాతలు పెట్టడమేమిటి? అనుభవిస్తున్న ఆస్తి వాడిదని తెలిసినందుకా? రేపు కూతురు అనుభవించ కూడదా? బికారికిచ్చి చేస్తుందా?

        పాత్రతో కథ గాక, కథతో పాత్రని ఆలోచిస్తే ఇలాగే వుంటుంది. కథతో పాత్రని ఆలోచిస్తే ఇతర మాధ్యమాల్లో చెల్ల వచ్చు. కానీ కథతో పాత్రని సినిమాకి ఆలోచిస్తే కోట్లు మునుగుతాయి. సినిమాకి ఎట్టి పరిస్థితిలో పాత్రతో కథని ఆలోచించాల్సిందే. ఈ కథతో పాత్ర విధానమే సీత పాత్రని చాలా డ్యామేజీ చేస్తూ వచ్చింది మొదట్నించీ. ఈ ఫ్లాష్ బ్యాక్ తెలిశాక కూడా సీతలో మార్పు రాదు. చనిపోయిన మేనత్త పట్ల ఏ మాత్రం కనికరం వుండదు. వంద గ్రాముల బంగారమని మాట్లాడుతుంది. పాత్రలో మార్పు తేవడం కోసం గాకపోతే కథలో ఫ్లాష్ బ్యాక్ ఎందుకుంటుంది? అదీ ప్లాట్ పాయింట్ టూ అనే కథకి రెండో మూలస్థంభమయిన మలుపు దగ్గర? ప్లాట్ పాయింట్ టూ అంటేనే పాత్రకి రియలైజేషన్ ఘట్టం కాదా? రియలైజ్ అయి, ఆ రియలైజేషన్ లోంచి తనకి పరిష్కార మార్గం గోచరమై, కథని ముగించడానికి ముందుకి  తీసికెళ్ళడం కాదా? ఇలా వుండవా కథలు? 

        ఇక సీత పాత్ర కథకుడి చేతిలో పూర్తిగా పతనమై సర్వనాశనమవడానికి - శవ్వ! శవ్వ! అన్పించడానికి - ఈ ప్లాట్ పాయింట్ టూ సీను లోంచి ఆమె బయటికి ఒకటే పరుగు తీయడంతో బీజం పడుతుంది...ఆ పరుగు కథకి ఫైనల్ మరణ శాసనం రాసేసింది... 

     ఎండ్ విభాగం కథనం :  వాళ్ళమ్మ ఇచ్చిన వంద గ్రాముల బంగారానికి వడ్డీ కట్టి చెప్పండి, ఇచ్చి పారేస్తాను -  అన్న తర్వాత, రూప వచ్చి చెప్తుంది, అవతల రామ్ నెవరో కొడుతున్నారని. వెంటనే కంగారుగా పరుగు దీస్తుంది సీత. రామ్ ని చంపాలన్న ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చంపే కార్యక్రమం మొదలయింది. వాళ్ళని కొట్టి ఎదుర్కోమని అరుస్తుంది. శాంతి వచనాలు పలుకుతాడు. తనే  ఫైటింగ్ కి దిగుతుంది. ఫైటింగ్ లో ప్రమాదంలో పడడంతో రామ్ కాపాడి తను మొదలెడతాడు ఫైటింగ్. ఇది చూస్తున్న ఎమ్మెల్యే రామ్  మీద కాల్పులు జరిపి లాక్కెళ్ళి పోతాడు.

        సీతని రప్పించడానికి గాయపడిన రామ్ ని తన ఇంట్లో పడేసి కూర్చుంటాడు. అనుకున్నట్టుగానే వచ్చేస్తుంది సీత. ట్విస్ట్. రామ్ పరిస్థితికి చలించి వెంటనే హాస్పిటల్ కి తీసికెళ్ళాలని ఒకటే బతిలాడుకుంటుంది. ముందు తనతో పడుకోవాలంటాడు. పడుకుంటుంది. ట్విస్ట్. రామ్ లేచి ఎమ్మెల్యేని తన్ని  సీతతో పారిపోతాడు. ట్విస్ట్. పారిపోతూ సీత రాం కి సరెండర్ అయిపోతుంది. ఏడ్చేస్తూ మనం ఒకటవుదామంటుంది. ట్విస్ట్.   

        కారులో పారిపోతున్న వాళ్ళని వెనక నుంచి వచ్చి డాష్ ఇస్తాడు ఎమ్మెల్యే. ట్విస్ట్. పెద్ద ప్రమాదం జరిగి తలో దిక్కు పడతారు. భూటాన్ సన్యాసులు రామ్ నెత్తుకెళ్ళి పోతారు. ట్విస్ట్. కళ్ళు తెర్చి విషయం తెలుసుకున్న సీత భూటాన్ వెళ్ళిపోతుంది. ట్విస్ట్. అక్కడ రామ్ ఫోటోకి దండ వేసి వుంటుంది. ట్విస్ట్. చనిపోయాడని అంటాడు గురువు. ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ట్విస్ట్. బయట వున్న రామ్ వచ్చేస్తూంటే ఫోటోకి దండ తీసేస్తారు సన్యాసులు. ట్విస్ట్. రామ్ మానసిక శక్తులకి సీత వచ్చినట్టు తెలుస్తుంది. ట్విస్ట్. ఆమెని కలవాలని మారాం చేస్తాడు. వదిలేస్తారు. సీత కోసం పరుగెత్తడం మొదలెడతాడు రామ్. కారులో వెళ్ళిపోతున్న సీత మానసిక శక్తులకి రామ్ బతికే వున్నాడని తెలుస్తుంది. ట్విస్ట్. పరుగెత్తుకొస్తున్న రామ్ ని చూసి కారు దిగి వాటేసుకుంటుంది. పసుపు తాడు కట్టేస్తాడు. ట్విస్ట్.

        ఎమ్మెల్యే వచ్చేసి అగ్రిమెంట్ చూపిస్తాడు. ట్విస్ట్. అగ్రిమెంట్ ని పాటించాలి కదాని సీతని ఇచ్చేస్తాడు రామ్. ట్విస్ట్. సీతని ఎమ్మెల్యే కారులో తీసుకుపోతూంటే, రామ్ వచ్చేసి వీల్లేదంటాడు. ట్విస్ట్. ఆమె నా భార్య కదా అంటాడు. ఎమ్మెల్యేని లాగి ఎటాక్ చేస్తాడు. ఎమ్మెల్యేకి గుండు తగుల్తుంది. చూస్తే ఆ గుండు పేల్చింది మండోదరి, అంటే ఎమ్మెల్యే భార్య. ట్విస్ట్. ట్విస్ట్. ట్విస్టుల మీద ట్విస్టులు. ఆరగంట సేపు సాగే ఈ ముగింపులో కూడా  ట్విస్టులాష్టమి.  

        “చిమ్మ చీకటిని తరిమి కొట్టడానికి ఒక చిన్న దీపమైనా కావాలి
        చెడు నిండిన లోకం ప్రక్షాళన కోసం ఒక్క మంచి వాడైనా కావాలి”
        - అన్న కొటేషనుతో సుఖాంతం!

       క్లయిమాక్స్ కుదరడం లేదంటే దాని లోపం ప్లాట్ పాయింట్ వన్ లో వున్నట్టని సామాన్య సూత్రం. ప్లాట్ పాయింట్ వన్ లో ఏం లోపం జరిగిందో దాన్ని మరమ్మత్తు చేస్తే క్లయిమాక్స్ సరిగ్గా కుదురుతుంది. ప్లాట్ పాయింట్ వన్ ఎంత ఫేక్ గా వుందో చూశాం. దాని ఎఫెక్ట్ ఇప్పుడు కథ అనుభవిస్తోంది. కథని ఎలా ముగించాలో అర్ధంగానట్టు ట్విస్టుల మీద ట్విస్టులు. ఈ అరగంట ఎండ్ విభాగంలో ఆరుసార్లు ముగిస్తూ మళ్ళీ ట్విస్టు లిచ్చి పొడిగించుకుంటూ పోయారు. లాజిక్ గీజిక్ మంట గలిసి,  సహనానికి పరీక్ష మొదలై పోయింది ఈ ముగింపుతో. కథ పట్టుకు ప్రయాణిస్తే కుక్క తోకట్టుకుని గోదారీది నట్టే. పాత్రని పట్టుకుని ప్రయాణిస్తే నక్క తోక తొక్కి వచ్చినట్టే. 

        ఇంతకీ సీత ప్లాట్ పాయింట్ టూలో ఫ్లాష్ బ్యాక్ తెలిసింతర్వాత, తనలో ఏ మార్పూ ప్రదర్శించక, రామ్ ని కొడుతున్నారని తెలియగానే ఎందుకు పరుగెత్తుకుని పోయినట్టు? రామ్ ని కొడుతూంటే అది చూసి ఆమెలో మార్పు వచ్చినట్టు చిత్రించారు. ఆమెలో మార్పు తేవడానికి ఈ సంఘటనా? అదీ ప్లాట్ పాయింట్ టూ తర్వాత? ఫ్లాష్ బ్యాక్ కే ఏ మానవత్వమూ మేల్కొనని ఆమె, రామ్ కొడుతూంటే మారిపోతుందా? మారిపోతే, మూలంలో మారాల్సిన విషయంలో- తండ్రితో, మేనత్తతో- ఇన్నర్ గా మారకుండా, ఇలా ఔటర్ గా మారిపోతే చాలా? ఔటర్ గా మారడమంటే ఆస్తి కోసమేనా? రామ్ ని కొట్టి చంపేస్తే, వాడితో పెళ్ళీ, దాంతో ఆస్తీ వుండవని అలా పరిగెట్టిందా? మరెందుకు పరిగెట్టింది?

        ఆమె ఈ పరుగు పాత్ర పతనానికీ, సర్వ నాశనానికీ దారి తీశాయి. ఫ్లాష్ బ్యాక్ తో మార్పు వచ్చి పరుగెత్తి వుంటే వేరే అర్ధాలు వచ్చేవి కావు. ఇందుకే ప్లాట్ పాయింట్ టూలో పాత్ర మారాలానేది. మారకుండా పరుగెత్తితే ఇలాగే ఆస్తి పోతోందన్న ఆదుర్దా కొద్దీ పరుగెట్టిందన్న అర్ధం వస్తుంది! వాడెలా పోతే నాకెందుకని గత సీన్లలో అన్న తనే, ఇప్పుడు వాడికోసం పరుగెడుతోందంటే ఇంకెందుకు? ప్రేమ పెంచుకుందనా? 

        ఇక సీత పాత్ర లేదు. చచ్చిపోయింది. ఇక్కడ్నించీ ఏం చూపించినా చూడనవసరం లేదు. ఇన్నర్ గా మారకుండా ఇప్పుడు ఔటర్ గా రామ్ గురించి మార్పు ప్రదర్శిస్తోందంటే, ఇది కూడా నిజం కాదు. ఆస్తి కోసం నటన! 

        ఇక్కడ ఇంకో గమ్మత్తు వుంది. ఎమ్మెల్యే రామ్ ని గాయపర్చి తీసి కెళ్ళిపోయాక, ఎమ్మెల్యేతో ఆ పూట సహజీవనానికి లొంగిపోయింది!! రామ్ లేచి అది జరక్కుండా చూశాడు, వేరే సంగతి. కానీ లొంగింది ఎమ్మెల్యే బెదిరింపులకి. అప్పుడు రామ్ నెలా పెళ్ళిచేసుకోవాలనుకుంది? ఆస్తి ఎలా వస్తుందనుకుంది? అవన్నీ వదులుకుంటూ బలి పీఠం ఎక్కిందా తన పాపాలకి? లేక జాలి పడి  రామే పెళ్లి చేసుకుంటాడనుకుందా? అంత దిగజారిందా? ఈ సన్నివేశం లో ఆమె ఎమోషనల్ మజిలీ, లేదా మానసిక స్థితి ఏమిటి? మానసిక స్థితిని వివరించని సన్నివేశ మెలా వుంటుంది? సన్నివేశాన్ని పాత్ర మీద రుద్దడమేనా?
        ఈ సీతకి వేరే రావణుడెవరూ లేరు, వున్నది ఒక్కడే కథకుడు!
        “చిమ్మ చీకటిని తరిమి కొట్టడానికి ఒక చిన్న దీపమైనా కావాలి
         చెడు నిండిన లోకం ప్రక్షాళన కోసం ఒక్క మంచి వాడైనా కావాలి”... ఏ చిమ్మ చీకటి? ఎవరా మంచోడు? 

(అయిపోయింది)

సికిందర్