రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, జూన్ 2019, శనివారం


నోట్ : ఈ వారం విడుదలైన ‘కిల్లర్’ స్క్రీన్ ప్లే సంగతులు
వచ్చే వారం ఇద్దాం. స్క్రీన్ ప్లే సంగతుల కోసం సస్పన్స్
మొత్తం ఇప్పుడే రివీల్ చేస్తే, చూడాలనుకున్న ప్రేక్షకులకి
స్పాయిలర్ గా హాని చేస్తుంది.



7, జూన్ 2019, శుక్రవారం



నోట్ : రివ్యూలు యూఎస్ లో అప్ లోడ్ అవ్వాలి. 
టైం జోన్ తేడాల వల్ల ఆలస్యమవుతోంది. 
ఈ సమస్య త్వరలో పరిష్కారమవుతుంది.

5, జూన్ 2019, బుధవారం

836 : టిప్స్


      85. తెలుగులో క్రౌడ్ ఫండింగ్ తో తీసినవే రెండు. ఇవి ఏమయ్యాయో తెలిసిందే. కమర్షియల్ సినిమాలకి భిన్నంగా ఏదో ప్రయోగాలు చేద్దామనుకుని,  క్రౌడ్ ఫండింగ్ తో ఏం తీసినా,  ఏ సొంత క్రియేటివ్ కోర్కెలు తీర్చుకున్నా,  మళ్ళీ వాటిని విడుదల చేయాల్సింది వ్యాపారులే. ఎన్నో  కమర్షియల్ సినిమాల విడుదలలకే దిక్కులేదు, కమర్షియలేతర సమాంతర సినిమాల మొహం ఏ వ్యాపారి చూస్తాడు. వచ్చిన చిక్కేమిటంటే,  వస్తున్న కొత్త తరం బిజినెస్ సైడే చూడరు. కమర్షియల్ సినిమాల్ని విమర్శిస్తూ వాటికంటే మెరుగైన తమ టాలెంటేదో చూపించాలనుకుంటారు. అమాంతం వెళ్లి వరల్డ్ సినిమాల మోజుతో ఇండీ మూవీస్ తీసి పడేస్తారు. అవి కమర్షియల్ మూవీస్ లాగే వుంటాయి. మైండ్ మీద స్టార్ సినిమాల ప్రభావం స్వారీ చేస్తూంటే ఇంతే. ఏ బడ్జెట్ కథ ఆలోచించాలన్నా, ఏ జానర్ కథ ఆలోచించాలన్నా తాము చూసిన స్టార్ సినిమాల్లో నటనలు, డైలాగులు, కామెడీలు, మ్యానరిజమ్స్, పాటలు, ఫైట్లు, టేకింగ్, ఎడిటింగ్, బిజిఎం, కలర్ థీమ్స్...ఇవే మెదుల్తూంటాయి. ఇక యాభై కోట్ల స్టార్ సినిమాని కోటి రూపాయల ఫుట్ పాత్ సినిమాలా తీసి పడెయ్యడం.
          86. సబ్ టైటిల్స్ తో వున్న సినిమాల్ని చూస్తూంటే ఎంత బాగా డైలాగులు రాస్తున్నారో అర్ధమవుతుంది. నటుడు పది మాటల్లో చెప్పే డైలాగు, సబ్ టైటిల్స్ లో ఒకే లైనుగా వచ్చేస్తుంది. డైలాగ్ రైటర్ రాసిన పెద్ద డైలాగుని సబ్ టైటిల్స్ రైటర్ ఒక్క లైనులో చెప్పేస్తున్నప్పుడు, డైలాగ్ రైటర్ దేనికి? పేరాలకి పేరాలు డైలాగులు రాసి లెంత్ పెంచెయ్యడం, దాంతో షూటింగులో, డబ్బింగులో ఖర్చు పెంచెయ్యడం...
          87. అసలు సౌండ్ ని మ్యూట్ చేసి సినిమాల్ని చూస్తే  డైలాగులు ఎక్కడెక్కడ అవసరం లేదో తెలిసిపోతుంది. సౌండ్ లేక పోయినా సన్నివేశంలో ఏం జరుగుతోందో  అర్ధమైపోతూంటే డైలాగుల అవసరమే లేదు.
          88. స్క్రీన్ ప్లేలో కథ ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ వన్ లో పుడుతుందని తెలిసిందే. దీనికి ముందు బిగినింగ్ విభాగంలో వుండేదంతా కథ కాదనీ, ప్లాట్ పాయింట్ వన్ లో పుట్టబోయేది మాత్రమే కథ అనీ, అంతవరకూ బిగినింగ్ విభాగంలో చూపించేదంతా ఆ పుట్టబోయే కథకి కేవలం ఉపోద్ఘాతమేననీ కూడా తెలిసిందే. ఇదంతా మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకోవడమంటే, ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా ఉపోద్ఘాతం వచ్చేసి కథని కలుషితం చేసేసే ప్రమాదముంటుంది గనుక.
          89. ఎన్ని లొకేషన్స్ లో తీశామని కాదు పబ్లిసిటీ, కంటెంట్ ఏమిటన్నది డిమాండ్. ఐదు లొకేషన్స్ లో, ఆరుగురు ఆర్టిస్టులతో, డెబ్బై లక్షలతో కంటెంట్ ఆధారిత కమర్షియల్ ని పాతిక రోజుల్లో తీసి కూడా కమ్మగా కోటి రూపాయలు జేబులో వేసుకుని నిద్రపోవచ్చు. కంటెంట్ ఏమిటన్నది, అది కాగితం మీద ఎలా వున్నదీ బాక్సాఫీసు చేసే తనిఖీ. తేడాగా వుందా చించి అవతల పారేస్తుంది. 
        90. చాలా కామన్ సెన్స్ ఐడియాని ప్లాన్ చేసుకోకపోతే సినిమా ఫ్లాపే. ఈ బేసిక్స్ ని ఎవ్వరూ ఛాలెంజి చేయలేరు. ఐడియాని ప్లాన్ చేసుకోక పోతే సినిమా అట్టర్ ఫ్లాపే. ఇంకో మాటే లేదు. క్రియేటివ్ స్కూల్లోంచి  స్ట్రక్చర్ స్కూల్లోకి వచ్చినప్పుడే హిట్ ఫ్లాపులు అర్ధమవుతాయి. అంతవరకూ చీకట్లో బాణాలేయడమే. సొంత వైద్యంలాంటి క్రియేటివ్ స్కూళ్ళే  సినిమాల్ని చూడలేకుండా చేస్తున్నాయి. క్రియేటివ్ స్కూలు గుండు గుత్త ధోరణిలో వుంటుంది. స్ట్రక్చర్ స్కూల్లో స్టెప్ బై స్టెప్ అప్రోచ్ వుంటుంది. ముందు ఐడియా మూల్యాంకన వుంటుంది. ఈ ఐడియాకి మార్కెట్ యాస్పెక్ట్ వుందా? ఇందులో యూత్ అప్పీల్ ననుసరించి రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్, లేదా రెండూ ప్లే అవుతున్నాయా? ఇప్పటి యూత్ కి సినిమాల మార్కెట్ యాస్పెక్ట్ ఇదే. హుషారులో ఎకనమిక్స్ చక్కగా ప్లే అయింది. జేబునిండా డబ్బు, చేతినిండా అమ్మాయీ, వీటికోసం పాట్లు - ఇవే తెర మీద చూడాలని కోరుకుంటారు ఈ కాలం కుర్రకారు.  తర్వాత ఐడియాకి స్ట్రక్చర్ వుందా? ఇది పనికొచ్చే కథేనా, లేక పనికిరాని గాథా? ఇందులో ప్లాట్ పాయింట్ వన్ కి యూత్ అప్పీల్ వుందా? ...ఇలా స్టెప్ బై స్టెప్ బేరీజు వేసినప్పుడు ఐడియా దశలోనే సినిమా భవితవ్యం తేలిపోతుంది. సినిమా మొత్తం తీసి, విడుదల చేసి, అది ఫ్లాపయ్యాక గానీ తీసింది ఫ్లాప్ కథ అని తెలియకపోవడం అంతా ఏదో సామెత చెప్పినట్టు వుంటుంది. 

సికిందర్



3, జూన్ 2019, సోమవారం

835 : ఇండీ సంగతులు

    ‘అంగమలై డైరీస్’ ని అంగమలై పట్టణపు కథగా అంగమలైలో ఎందుకు తీయాలి? ఎందుకంటే ఆ దర్శకుడు, ఆ రచయిత ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి. దర్శకుడు లిజో జోస్ పెలిసరీ అక్కడికి 14 కిలోమీటర్ల దూరంలో చలకుడిలో నివసిస్తే, రచయిత వినోద్ చంబన్ జోస్ అంగమలై లోనే నివసించాడు. అంగమలై వాళ్లకి కొట్టిన పిండి. అక్కడి లోకల్ కల్చర్, జీవితం, మనుషుల తీరుతెన్నులు క్షుణ్ణంగా తెలుసు. క్రైస్తవులు ప్రధానంగా వుండే ఆ పట్టణంలో ఎటు చూసినా క్రైస్తవ సంస్కృతే కన్పిస్తుంది. అయినంత మాత్రానా క్రైస్తవ సంస్కృతితో తమకి తెలిసిన నేటివిటీ దొరికిందని అంగమలై లొకేషన్ గా ముఠా తగాదాల కథ చెప్పాలా? కానేకాదు. క్రైస్తవ సంస్కృతితో బాటు అంగమలై పోర్క్ వ్యాపారానికి పెట్టింది పేరు. అక్కడి ప్రజలు ఇష్టపడి రోజూ తినే ఆహారం పోర్క్ మాంసాహారం. నాలుగున్నర కోట్ల టర్నోవర్ తో అతి పెద్ద వ్యాపారంగా ఎందరికో జీవనోపాధి కల్పిస్తోంది. సీమపందుల పెంపకం, అమ్మకం పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రేక్షకులకి అర్ధ మవడానికి సినిమాలో పోర్క్ డిపో అతని చేత ఇదంతా చెప్పించి, కథకి కేంద్రబిందువుగా  ఎస్టాబ్లిష్ చేశారు. ఇలా ముఠా తగాదాలకి అంగమలై అంతర్భాగమైన పోర్క్ బిజినెస్ ని నేపధ్యంగా తీసుకుని వాస్తవికతని, విశ్వసనీయతని సమకూర్చారు. 

         
ఇందులో నటించిన 86 మందీ కొత్త వాళ్ళు స్థానికులే. ఈ వూరు మనుషులెలా వుంటారో  వీళ్ళూ అలా వుంటూ నటించలేదు, ప్రవర్తించారు. వాళ్ళ వేష భాషలు, హాస్యం, స్థానికత అక్కడివే, సినిమా కోసం మార్చుకోలేదు. క్రిస్టియన్ ఫ్లేవర్ తో మ్యూజిక్ అక్కడిదే. గోవా నేపధ్యంలో కొంకణీ సినిమాల క్రిస్టియన్ ఫ్లేవర్ ఎలావుంటుందో, అంగమలైలో అది సరీగ్గా కుదిరింది. ఒక ప్రాంత నేటివిటీని సజీవ ప్రపంచంగా మన కళ్ళ ముందు ప్రతిష్టించాలంటే, మైక్రో లెవెల్లో చూపించాలి. ఓవరాల్ గా కెమెరా పాన్ చేసి ఇది ఫలానా ప్రాంతమంటే సరిపోదు. ప్రేమమ్, ఆర్డినరీ, అనార్కలీ వంటి మలయాళ సినిమాల్లో లొకేషన్స్ స్టూడెంట్స్ బస్సులు కట్టుకుని వెళ్లి విహరించే టూరిస్టు కేంద్రాలయ్యాయంటే, వాటిని మైక్రో లెవెల్లో చూపించడం వల్లే. అంగమలై పట్టణపు మైక్రో లెవెల్ చిత్రీకరణ కూడా చూస్తే, మనకి కూడా అక్కడికి వెళ్లి తిరిగి రావాలన్పిస్తుంది- పోర్క్ తినడానికి కాదు. మోనార్క్ లా ఫోటోలు దిగి రావడానికి... 




          హీరో గ్రూపు పోర్క్ ఇరవై రూపాయలు తక్కువకి అమ్ముతున్నారని, డిపో గ్రూపు అభ్యంతరం చెప్పడంతో మొదలయ్యే ఘర్షణలు... డిపో గ్రూపు విసిరిన బాంబు వల్ల హీరో పోర్క్ షాపు ధ్వంసమవడం, హీరో విసిరిన బాంబు వల్ల ఎదుటి గ్రూపులో ఒకడు చనిపోవడం, అది హత్య కేసుగా హీరో మెడకి చుట్టుకోవడం, అందులోంచి బయటపడేందుకు అవసరమైన ముప్ఫై లక్షల కోసం ప్రయత్నించడం...ఇలా అతి సాధారణంగా, బలహీనంగా వుంటుంది కథ. దీన్ని బలమైన కమర్షియల్ కథగా మార్చకుండా, రియలిస్టిక్ ధోరణులతో ఇండీ ఫిలిం (ఇండిపెండెంట్ సినిమా అనే సమాంతర సినిమా) గా తీశారు. సమాంతర సినిమా ఎప్పుడూ కమర్షియల్ ధోరణులతో  వుండదు. సమాంతర సినిమాలుగా మొదటి తరంలో ఆర్ట్ సినిమాలు, కొత్త రూపంగా కమర్షియల్ - ఆర్ట్ కలగలిసిన క్రాసోవర్ సినిమాలు, వీటి  కొనసాగింపుగా వరల్డ్ మూవీస్ అనుకరణలు వచ్చి, చివరిగా ఇండీ ఫిలిం దగ్గరాగింది ప్రస్తుతం సమాంతర సినిమా ప్రస్థానం. 


           ఇండీ ఫీలిం దర్శకుడు ఫీలయ్యి ఇండిపెండెంట్ గా ఇష్టమొచ్చినట్టు తీసుకునే వేదిక. దీన్ని కమర్షియల్ సినిమాల ‘క్యాలిక్యులేటర్’ తో చూసి ఇందులో ఇది లేదు, అది లేదంటే కుదరదు. స్క్రీన్ ప్లే గురించి మాట్లాడడం అసలే కుదరదు. ఎలా చూపించిన కథ అలా చూడాల్సిందే. విమర్శకి తావులేదు. కానీ ఇండీ ఫిలిం జానర్ మర్యాదలు తెలియకుండా, ఏ కొంచెం కమర్షియల్ కథనం చేసినా, ఫార్ములా చిత్రణలు చేసినా, కృత్రిమ పాత్రల్ని చూపించినా, ఆ దర్శకుడే దెబ్బతింటాడు. అప్పుడది ఇండీ ఫిలిం కాక, దేనికీ చెందని అనాధ అవుతుంది.

టెక్నిక్కే వేరు
      టెక్నికల్ గా కూడా కమర్షియల్ పంథా వుండదు. కమర్షియల్ సినిమా షాట్స్, టేకింగ్స్, లైటింగ్, టింట్స్ వగైరా వాడరు. దృశ్యాలు సహజంగా, కూల్ గా వుంటాయి. యాక్షన్ సీన్లు, ఛేజింగులు, ఫైటింగులు కూడా కమర్షియల్ సినిమాల టైపులో వుండవు. నిజ జీవితంలో మన కళ్ళ ముందు ఎలా జరుగుతాయో అలా యాదృచ్ఛికంగా జరిగిపోతాయి. ఇక హింస వుంటే దానికి యాంటీగా నేపధ్యంలో హార్ష్ గా వుండని మృదువైన వాతావరణం కల్పించడంతో ఆ హింస కూడా కళాత్మకమై పోతుంది. ‘అంగమలై డైరీస్’ లో లైట్స్ వాడలేదు. సహజ వెలుతురులోనే షూట్ చేశారు. అవన్నీ రియల్ లొకేషన్సే. మార్కెట్, కాలనీలు, పోర్క్ ప్రాంగణాలు వగైరా. షూటింగ్ లో లైటింగ్ యూనిట్ లేదు. జిబ్, ట్రాక్స్, ట్రాలీలు ఏవీ లేవు. ఎక్కువగా హేండ్ హెల్డ్ కెమెరాలతోనే షూట్ చేశారు. క్లయిమాక్స్ ఫైటింగ్ టేకింగ్ కి అంతర్జాతీయంగా పేరొచ్చింది. వెయ్యి మందితో, అదీ రాత్రిపూట, ఎక్కడా కట్ లేకుండా, కెమెరాని మూవ్ చేస్తూ, సింగిల్ టేక్ లో 12 నిమిషాల యాక్షన్ సీనంతా తీశారు.

          ఇలా మేకింగ్ లో ఈ ఎఫెక్ట్స్ అన్నీ వ్యూహాత్మకంగా ఏర్చికూర్చి – పొందుపర్చడంతో  ఈ ఇండీ ఫిలిం ఇండీ ఫిలిమ్స్ లో మేటిగా తయారయ్యింది. బాక్సాఫీసు సక్సెస్ కూడా చవిచూసింది. రెండున్నర కోట్ల బడ్జెట్ కి 20 కోట్లు వసూలు చేసింది. జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. ఒకటి రెండు అంతర్జాతీయ ఇండీ ఫిలిమ్స్ ఫెస్టివల్స్ కి కూడా వెళ్ళింది. కొంత మంది దీన్ని క్లాసిక్ కల్ట్ అని కూడా అంటున్నారు. 

          ఇక తెలుగుకి వద్దాం. తెలుగులో ఎప్పుడో గానీ ఇండీ ఫిలిం రాదు. వస్తే చీప్ గా  తీసిన కమర్షియల్ సినిమాల్లాగా వుంటాయి. ఇండీ ఫిలిం క్రాఫ్ట్ ఏ మాత్రం వుండదు. మైక్రో లెవెల్ చిత్రీకరణతో, పర్సనల్ గా అనుభవించిన జీవితంలోంచి ఆ దర్శకుడి వాయిస్ లా వుండవు. ఇక జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందడం, అమెరికన్ మీడియాలో కూడా రివ్యూలకి నోచుకోవడం, ఫెస్టివల్స్ కి వెళ్ళడం, కల్ట్ క్లాసిక్ అన్పించుకోవడం లాంటివి అస్సలు వూహించలేం. 

రీమేకా?! 
      అలాటిది ఒక ఇండీ ఫిలింని రిమేక్ చేస్తే? ఈ ప్రశ్న షార్ట్ ఫిలింని రిమేక్ చేస్తే?  అన్నట్టుంటుంది. షార్ట్ ఫిలిమ్స్ లాగే ఇండీ ఫిలిమ్స్ పర్సనల్ డైరీలు. కాకపోతే పొడిగించిన పర్సనల్ డైరీలు. అవి కమర్షియల్ సినిమాలు కావు - కొనుక్కొ చ్చుకుని గబగబా రిమేక్ చేసుకుని, చకచకా కరెన్సీ లెక్కెట్టుకుందా
మనుకోవడానికి. ఆ దర్శకుడి పర్సనల్ డైరీ అతను ఫీలైన సాంస్కృతిక కళాభివ్యక్తి. దాన్ని తెచ్చుకుని ఇంకో దర్శకుడు రిమేక్ చేయడమేమిటి? చేతనైతే దాని స్ఫూర్తితో తాను ఇంకోటి ఫీలై తన డైరీ లాగా ఏదైనా తీసుకోవాలి.

          అస్సాంలో మార్షల్ ఆర్ట్స్ అక్కడి జీవితంలో ఒక భాగం, సంస్కృతి. చిన్నప్పట్నించే ఆడా మగా పిల్లలు నేర్చుకుంటారు. ఈ సంస్కృతి తెలిసిన కుర్రాడు కేన్నీ డియోరీ బాసుమటారీ అనే వాడు, తన ఈ సాంస్కృతిక కళాభివ్యక్తితో సినిమా తీసేద్దామనుకున్నాడు. తన దగ్గరున్న35 వేలతో కెమెరా కొనుక్కుని, వాళ్ళమ్మ దగ్గర బంగారం కుదువ బెట్టి, లక్షరూపాయలతో ‘లోకల్ కుంగ్ ఫూ’ అనే ఇండీ ఫిలిం తీసేశాడు. తెలుగులో లక్షరూపాయలు, ఇంకా వీలయితే ఆ పైన పెట్టుబడితో ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఆలోచించడం దగ్గరే  వుండి పోతునప్పుడు, తను ఏకంగా లక్షతో ఇండీ ఫిలిమే తీసి చూపెట్టాడు. యూట్యూబ్ లో ట్రైలర్ పెడితే పీవీఆర్ సంస్థ చూసి డీల్ కుదుర్చుకుని, దేశంలో  ప్రధాన నగరాల్లో రోజూ ఒక ఆట చొప్పున విడుదల చేసింది. 26 లక్షలు వచ్చాయి. ఆరు లక్షలు ప్రమోషనల్ ఖర్చులు తీసేసి, పది లక్షలు ఈ కొత్త ఇండీ దర్శకుడు కేన్నీ కిచ్చింది. అస్సాం యూత్ లో ఇదొక కల్ట్ ఫిలింగా  నమోదైంది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వ అవార్డుతో బాటు, మరికొన్ని అవార్డులు వచ్చాయి. అస్సాం యూత్ లో కెన్నీ సెలెబ్రిటీ అయిపోయాడు. వెంటనే ‘లోకల్ కుంగ్ ఫూ -2’ ని ప్రకటించి, 15 లక్షలు క్రౌడ్ ఫండింగ్ కెళ్తే, 30 లక్షలు వచ్చిపడ్డాయి! నేరుగా కుంభ స్థలాన్ని కొట్టలేరు. తన ఆట స్థలంలో తను ఫ్రెష్ గా ఆడుకుంటే కుబేరులే దిగివస్తారు. తన ఆట స్థలంలో కేన్నీ ఫ్రెష్ గా ఆడుకున్నాడు, పీవీఆర్ వచ్చి ఉద్ధరించింది. 

       సాంస్కృతిక కళాభివ్యక్తియే, ఇంకాస్త ఇన్నోసెన్సే ఇండీ ఫిలిమ్స్ కి  ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకెళ్ళే  ప్రధాన ముడి సరుకులుగా వుంటాయి. అలాంటిది ‘అంగమలై డైరీస్’ సాంస్కృతిక (పోర్క్ బిజినెస్) కళాభివ్యక్తినీ, అందులోని ఇన్నోసెన్స్ నీ, తెలుగులోకి రొడ్ద కొట్టుడు వూర మాస్ ఫలక్ నుమా దాస్ గా మార్చి పారేస్తే సరిపోతుందా? ‘ఫలక్ నుమా దాస్’ అని టైటిల్ పెట్టడంలోనే అర్ధమవుతోంది - ‘అంగమలై డైరీస్’ ని వూర మాస్ గా అర్ధం జేసుకుని రీమేక్ చేశారని. గతంలో తమిళంలో ‘నేరం’ అనే ఇండీ ఫిలింని అది ఇండీ ఫిలిం అని తెలీక, కమర్షియల్ తెలుగులో సందీప్ కిషన్ తో ‘రన్’ గా రీమేక్ చేశారు. కమర్షియల్ ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇందులో విలన్ ఉత్తుత్తిగానే ఒక ఆటో గుద్దుకుని కథ మధ్యలోనే ఠపీమని చచ్చిపోతాడు. ఇది డార్క్ కామెడీ. ఇండీ ఫిలింకి చెల్లుబాటయ్యే డార్క్ కామెడీ. కమర్షియల్ సినిమా కథకి ఓ పద్ధతీ పాడూ వుంటాయి. ఇండీకి వుండనవసరం లేదు. ఇది తెలీక ఇండీ ‘నేరం’ ని కమర్షియల్  ‘నేరం’ అనుకుని, బేరమాడుకుని, ‘రన్’ గా రీమేక్ చేస్తే ప్రేక్షకులు ఒకటే రన్!  ఇదే తమిళ ఇండీ ‘నేరం’ ని అదే దర్శకుడు మలయాళంలో రీమేక్ చేస్తే హిట్టయ్యింది! ఎవడి సొంత కవిత్వం వాడే చెప్పగలడు. ఇప్పుడింకో జోకేమిటంటే, ‘అంగమలై డైరీస్’ ని హిందీలో రీమేక్ చేయడానికి బాలీవుడ్ దొరలు వచ్చారట! ఒక స్థానిక సాంస్కృతిక సన్నివేశాన్ని ఇంకో స్థానిక సన్నివేశంలో పెట్టి ఎలా చూపిస్తారో ఏమిటో. అంగమలై పట్టణపు సంస్కృతితో  ‘అంగమలై డైరీస్’ ని అక్కడి ‘కట్టా లోకల్’ గా, అంటే పక్కా లోకల్ గా ఆ దర్శకుడు ఇండీ ఫిలింగా తీసుకుని సక్సెస్ అయితే, దాన్ని తెలుగులో ‘పక్కా మాస్’ గా తీసి అట్టర్ ఫ్లాపయ్యారు. 

మాస్ మసాలా!
     టేకింగ్ అంతా కమర్షియల్ మాస్ టేకింగే, రియలిస్టిక్ ఫీల్ ఎక్కడా వుండదు. బీజిఎమ్ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) లో థీమ్, లోకల్ కల్చర్ కన్పించవు. రెగ్యులర్ యాక్షన్ మూవీ మ్యూజిక్కే. ముఠాల పాత్రలు,  పాత్రధారుల తీరుతెన్నులు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలన్నిట్లో ఒకేలా వుండే రౌడీ గెటప్సే. అవే జుట్లు, గడ్డాలు, మాసిన జీన్స్, టీస్. ఒరిజినల్ లో (అంగమలై డైరీస్ లో) లాగా 86 మంది ఫలక్ నుమా వాసులు ఎవరూ లేరు. ఫలక్ నుమా లోకి దిగుమతైన రెగ్యులర్ తెలుగు సినిమా మాస్ మొహాలే ఇవి. ఒరిజినల్ లో ఒకరిద్దరు తప్ప,  షేవ్ చేసుకునే నీటుగా వుంటారు. రౌడీ లుక్స్ వుండవు. ఇక హీరో ఆంటోనీ వర్ఘీస్ మొహంలో ఇన్నోసెన్సే వుంటుంది. బియ్యే తప్పి కేబుల్ టీవీ బిజినెస్ చేస్తూంటాడు. తల్లి వుంది. చెల్లెలి పెళ్లి చేయాలి. అందుకని పోర్క్ బిజినెస్ కూడా చేద్దామని ఫ్రెండ్స్ తో ఎంటర్ అవుతారు. అతడి లవ్ ట్రాక్ లో ఇద్దరు అమ్మాయిలుంటారు. మొదటి అమ్మాయి పెళ్లి చేసుకుని సింగపూర్ వెళ్ళిపోతుంది. రెండో అమ్మాయి జర్మనీలో నర్సు. ఈమెని పెళ్లి చేసుకుని జర్మనీలో సెటిల్ అవుదామనుకుంటాడు. ఇది కూడా జరక్క ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.  సింగపూర్, జర్మనీలతో తెలుగులో ఈ ట్రాక్ ఫలక్ నుమా నేటివిటీకి కృత్రిమంగా వుంటుంది. ఇక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇంకా సినిమాటిక్. 

          ‘అంగమలై డైరీస్’ ప్రారంభంలో పోర్క్ స్టాల్స్ ని ఎక్కువగా చూపిస్తూ కథా నే పధ్యాన్ని పరిచయం చేస్తూంటారు. తెలుగులో ఫలక్ నుమా దేనికి ప్రసిద్దో చూపించలేక పోయారు. ఫలక్ నుమా దాటి సీటీ అంతా రౌండేశారు. మదీనా దగ్గర నాయబ్ హోటల్లో పాయా, షాదాబ్ హోటల్లో బిర్యానీ అంటూ, ఇంకా ఇతర చోట్లలో  ఫేమస్ అడ్డాలు చూపించుకుంటూ పోయారు. అసలు ఫలక్ నుమా ప్యాలెస్ ని చూపించడానికి కథ ప్రకారం వీలు పడలేదు. ఈ కథాకాలం 2005. అయినా ఇప్పుడు ఫలక్ నుమా ప్యాలెస్ అప్పటి ఫలక్ నుమా ప్యాలెస్ కాదు. మధ్యలో 2010 లో తాజ్ ఫైవ్ స్టార్ హోటల్ గా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు చూపెట్ట లేరు. ఎక్కడో మదీనా దాకా వెళ్ళకుండా, ఫలక్ నుమా లోనే రెండు పెద్ద ఇరానీ రెస్టారెంట్స్ వున్నాయి. ఇంకా చిన్న చమన్, మహంకాళీ గుడిలతో బాటు ఇంజన్ బౌలీ, ఆలియా బాద్ వంటి ఫేమస్ సెంటర్స్, రైల్వే స్టేషన్ వున్నాయి. మదీనా దగ్గర నాయబ్, షాదాబ్ హోటల్స్  అంటూ చూపెట్టారే గానీ,  కథా కాలం ప్రకారం అప్పట్లో మదీనా హోటల్ కూడా వుంది. మదీనా చాయ్ వుంది. ఫలక్ నుమా దాస్ ని ఎలా చూపెట్టారంటే, హైదరాబాద్ మొత్తం ఒకే నేటివిటీ అన్నట్టు చూపెట్టారు. 

          కానీ ఆబిడ్స్ నేటివిటీ జూబిలీ హిల్స్ లో వుండదు. అల్వాల్ నేటివిటీ చిక్కడపల్లిలో వుండదు. ఇలా ఫలక్ నుమా నేటివిటీ అంటూ వుంటే దానికో ఫీల్ తో దాని నేటివిటీయే  వుంది. ఓల్డ్ సిటీ నేపధ్యంగా హైదరాబాదీ కామెడీ - యాక్షన్ సినిమాలు వస్తూంటాయి. ఇవి ఇటు మహారాష్ట్ర, కర్ణాటక సరిహాద్దు జిల్లాల్లో వరకూ పాపులర్. వాటిలో వుండే ఓల్డ్ సిటీ సంస్కృతి, భాష, జోకులు ఏవైతే వుంటాయో అది పక్కా నేటివిటీ. అందుకే క్రేజ్. 

          ఇక హీరో తను ప్రేమిస్తున్న అమ్మాయిని ఒక స్టూడెంట్ టీజ్ చేశాడని కొట్టడానికి వెళ్ళే కాలేజీ ఎక్కడో ఉస్మానియా యూనివర్సిటీ. ఫలక్ నుమాలోనే కాలేజీలున్నాయి. కాకుండా కమర్షియల్ సినిమాల్లో బిల్డప్ లాగా, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనం కావాల్సి వచ్చింది. ఇక ప్రతీవారం ఎక్కడెక్కడి గ్యాంగ్స్ చేరి మాట్లాడుకుంటాయని ఒక బార్ సెట్ చేశారు. ఫలక్ నుమాలో ఇది నిజం కాదు. అప్పట్లో దర్బార్ ఒక్క చోటే జరిగేది. చార్మినార్ పక్క రోడ్డులో ఒక హోటల్లో. అర్ధ రాత్రి దాటాక షట్టర్స్ వేసి లోపల లోన్ మాఫియా దర్బార్ పెట్టి, బాకీదార్లని చావగొడుతోంటే భయంకరమైన అరుపులు రోడ్డంతా విన్పించేవి. పోలీసులు చూసీ చూడనట్టు వెళ్లి పోయేవాళ్ళు. ఆప్పట్లో ఓల్డ్ సిటీలో లోన్ మాఫియానే పెచ్చరిల్లింది. ఇదేం లేకుండా ఓ బార్ సెట్ వేసి ముచ్చట్లు చూపించారు. 

సాంస్కృతిక నేపధ్యం లేదా?
      ఇంతకీ ఫలక్ నుమా సంస్కృతి ఏమిటి? హైదరాబాద్ హిందూ ముస్లిం సంస్కృతి, బిర్యానీ సంస్కృతి.  మలయాళంలో ఆ క్రైస్తవ సంస్కృతి, పోర్క్ ప్రశస్తి ఆ ఇండీ ఫిలింకి ఆత్మలా వుంటాయి. బ్యాక్ డ్రాప్ లో ఈ సోల్ ని బలంగా ఫీలయ్యేట్టు చేశాడు దర్శకుడు. ఇందుకే ఈ బలహీన కథ కూర్చోబెట్ట గల్గింది ప్రేక్షకుల్ని. తెలుగులో ఇలా లేదు. హిందూ ముస్లిం సంస్కృతి, బిర్యానీ ప్రశస్తి ఎక్కడా ఎస్టాబ్లిష్ కాకుండా, గ్యాంగ్ వార్స్ తో ఈ మటన్ కథ కమర్షియల్ పంథాలో పైపైన వుండిపోయింది. 

          ఐతే అంగమలై పోర్క్ వ్యాపారానికి ప్రసిద్ది. దీన్ని మొదటి సారిగా ప్రపంచ దృష్టికి తెస్తూ దీని నేపధ్యంలో కథ నడిపాడు దర్శకుడు. దీంతో కథే కొత్తగా మారిపోయింది. హైదరాబాద్ బిర్యానీతో  ఈ నావెల్టీ లేదు. హైదరాబాద్ బిర్యానీకి ప్రసిద్ధి అని ఎప్పుడో తెలిసిన పాత మాటే. ఇంకా కొత్తగా చెప్పడానికీ, చూపించడానికీ ఏమీ వుండదు. కాబట్టి బిర్యానీ చుట్టూ కథగా మార్చి చూపించినా ఇక వర్కౌట్ కాదు. ఏం చేయాలో అర్ధం గాక మటన్ కొట్టు పెట్టారు. అంగమలై లో పోర్కే ప్రధాన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారంలోకి హీరో వెళ్ళడం సహజ ప్రక్రియ. ఫలక్ నుమా లో ఏ సహజ ప్రక్రియ హీరోని మటన్ వైపు లాగింది? అంగమలై హీరో చిన్నప్పట్నుంచీ సీమ పందుల్నీ, పోర్క్ దుకాణాల్నీ చూస్తూ పెరిగాడు. ఇంట్లో అదే తిన్నాడు. చిన్నప్పుడు హీరో ఇంట్లో మదర్ పోర్క్ వండుతూంటేనే సీను ఓపెనవుతుంది. అదే వడ్డిస్తుంది. ఫలక్ నుమా హీరోకి ఇవన్నీ ఎక్కడున్నాయి మటన్ వ్యాపారమనే సహజ ఐడియా రావడానికి. ఎక్కడో మూసీ దగ్గర జియా గూడలో గొర్రెల కబేళాలో గొర్రెలు కొని తెచ్చుకుని మటన్ కొట్టే అనుభవమెక్కడిది? ఇదంతా కమర్షియల్ సినిమా చిత్రణ కింద మారిపోయింది లాజిక్ లేకుండా.  

          ‘అంగమలై డైరీస్’ ని ఉద్దేశ పూర్వకంగానే తెలుగు ప్రేక్షకులకోసం మాస్ కమర్షియల్ గా మార్చి వుంటే అదీ వర్కౌట్ అవదు. ఇందులో వున్న బలహీన కంటెంట్, ఇండీ ఫిలింకి సూటయ్యేదే గానీ కమర్షియల్ సినిమా స్థాయికి కాదు. దర్శకుడు విశ్వక్సేన్ ఇంకేదో తనకి తెలిసిన నేటివిటీతో తనదైన సెన్సిబుల్ ఇండీ ఫిలిం తీయాల్సింది, లేదంటే ఇంకో కథతో నేటివిటీ లేని మాస్ తీసుకోవాల్సింది. ‘అంగమలై డైరీస్’ తో బ్యాడ్ జడ్జిమెంట్. 

సికిందర్
telugurajyam.com

1, జూన్ 2019, శనివారం

834 : స్క్రీన్ ప్లే సంగతులు


     చివరికి మంగళ సూత్రంతో కూడా ట్విస్టులు. ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ తో అమ్మ మంగళ సూత్రమని చెప్పి, సెకండ్ ఫ్లాష్ బ్యాక్ తో మేనత్త మంగళ సూత్రమని ట్విస్ట్ ఇచ్చారు. కథనంలో తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాకుల్ని దృష్టిలో పెట్టుకుని కథనాన్ని వివరించు కుంటున్నప్పుడు, ఆ ఫ్లాష్ బ్యాకుల్లో కొన్ని పాయింట్స్ కథనంతో మ్యచ్ కావడంలేదని గమనించాం. మంగళ సూత్రం మిస్ మ్యాచ్ కూడా వున్న విషయం ముందే తెలిసినప్పటికీ, దీన్ని కూడా కలిపి వివరిస్తూ పోతే హెవీ అవుతుందనీ, విశ్లేషణ కన్ఫ్యూజింగ్ గా  వుంటుందని, ఆపి చివర్లో చెపుదామని అనుకున్నాం. ఇంకోటేమిటంటే ఫ్లాష్ బ్యాకుల్లో మిగతా పాయింటుల్లాగా ఇది కూడా కేవలం ఒక పాయింటు కాదు. ప్లాట్ డివైస్. కథలో ప్రాధాన్యమున్న మంగళ సూత్రం, ప్లాట్ పాయింట్ వన్ నుంచీ ప్లాట్ డివైస్ గా ప్లే అవుతూ పోయింది. సీత దాంతోనే భూటాన్ పోయింది. దాంతోనే పెళ్లి నాటక మాడింది. దాంతోనే ఇంకేదో చేసింది... అమ్మ మంగళ సూత్రానికి మేనత్త మంగళ సూత్రమని ట్విస్టిచ్చాక, అమ్మ మంగళ సూత్రమేమైనట్టు? దీనికి ట్విస్టు కుదర్లేదేమో గానీ, మేనత్త మంగళ సూత్రానికింకో ట్విస్టిచ్చారు. ముగింపులో ఈ లక్షల విలువైన  మంగళ సూత్రం కూడా వుండదు, పసుపు తాడు కడతాడు! శవ్వ! శవ్వ! (కోట శ్రీనివాస రావు).
         గత వ్యాసం ప్లాట్ పాయింట్ టూ వరకూ వచ్చాం. దీని గురించి చూద్దాం. లాయర్ సీతకి రెండో ఫ్లాష్ బ్యాక్ తో వాస్తవాలు చెప్పాక, సీత రియాక్షన్ తో ప్లాట్ పాయింట్ టూ ఏర్పడింది. మేనత్త  ఇచ్చిన వంద గ్రాముల బంగారానికి వడ్డీ కట్టి చెప్తే ఇచ్చి పారేస్తానంది ఇప్పుడు కూడా అదే తల పొగరుతో సీత. కానీ ఇప్పుడు మంగళ సూత్రం మేనత్తదని లాయర్ చెప్పాక, ఆ మంగళ సూత్రాన్ని కూడా వాపసు చేయాలి నిజానికి సీత. అలా చేయదు. ఇక - మా అమ్మదని  చెప్పి ఇప్పుడు మనత్తదని అంటావేంటి? -  అని కూడా లాయర్ని ప్రశ్నించదు.  


        ‘మీ అమ్మగారైన శ్రీమతి స్వరాజ్యం గారు సుమంగళిగా స్వర్గస్థులైన కారణంగా, హిందూ సాంప్రదాయం ప్రకారం, ఆవిడ మంగళ సూత్రం కూతురికి గానీ కోడలికి గానీ చెందుతుంది. నువ్వు వారికి ఒక్కగానొక్క సంతానం గాబట్టి, ఆ మంగళ సూత్రాన్ని నీకు రాశారు’ అని అప్పుడు సీత తండ్రి రాసిన వీలునామా చదివాడు లాయర్ ప్లాట్ పాయింట్ వన్ సీనులో. ఇప్పుడు ప్లాట్ పాయింట్ టూ సీనులో -  మీ అమ్మది కాదు, మేనత్తదని అంటున్నాడు...

        దీన్నెలా అర్ధం జేసుకోవాలి. అమ్మదని వీలునామా చదివిన లాయరే ఇప్పుడు మేనత్తదని ఎలా అంటున్నాడు. మేనత్త మంగళ సూత్రం గురించే తండ్రి అలా రాశాడా? మరి అమ్మ మంగళ సూత్రమేమైంది? మేనత్త మంగళ సూత్రమైతే అమ్మదని ఎలా రాశాడు. మేనత్త మంగళ సూత్రమైతే తన కూతురికి చెందాలని తనెలా రాస్తాడు. తన చెల్లెలు (సీత మేనత్త) వల్ల కలసివచ్చిన సంపదకి మేనల్లుడ్నే వారసుడిగా తను నిర్ణయించాక, ఆ సంపద  పుట్టడానికి మూలమైన చెల్లెలి మంగళ సూత్రాన్ని కూడా మేనల్లుడికే రాయాలి. ఎవరి కిచ్చుకుంటాడో ఇచ్చుకుంటాడు మేనల్లుడు. తనెవరు కూతురికి రాయడానికి? పైగా చెల్లెలు ఇంకా చాలా బంగారం వొలిచి ఇచ్చింది. అదేమైంది? ఇకపోతే, కూతురు మేనల్లుడ్ని చేసుకుంటేనే అతడికి చెందుతున్న 5 వేల కోట్ల ఆస్తికి అర్హురాలవుతుందని తనెలా రాస్తాడు. స్వార్ధం కాదా? చెల్లెలి వల్ల కలిగిన సంపదని ముట్టుకోలేదని అంత నిస్వార్ధంగా చెప్పిన తను, మేనేజర్ గా భావించుకుని బతికిన తను- కూతురికి మేనల్లుడితో పెళ్లి లింకు పెట్టి ఆ సంపదతో స్వార్ధానికి పోవడం లేదా? ఇదేం గొప్ప తండ్రి పాత్ర? అసలు గందరగోళంగా వున్న వీలునామా వ్యవహారం దృష్ట్యా, ఏం గోల్ మాల్ చేశాడో విచారణ జరిపించాలి. అమ్మ మంగళ సూత్రం, మేనత్తిచ్చిన ఇంకా బంగారం ఏమయ్యాయి? చాలా గూడుపుఠానీ వుంది. 

        ఇదే ఫ్లాష్ బ్యాక్ సీనులో, చెల్లెలి సంపద మనం అనుభవించడానికి వీల్లేదని భార్య వొంటి మీది నగలు తీసేసుకుంటాడు ఇదే సీత తండ్రి. ఆ భార్య కోపంతో కూతురి వొంటిమీది నగలు కూడా తీసేయబోతూంటే -  మేనల్లుడ్ని చూపించి, కూతురు మేనల్లుడికి చెందుతుందని, కాబట్టి మేనల్లుడికి చెందింది కూతురికీ చెందుతుందనీ అనేస్తాడు! అంటే అప్పట్నించే చెల్లెలి సంపదతో స్వార్ధానికి పోయాడన్నమాట? నీ కూతురు నా కొడుకుని చేసుకోవాలని చెల్లెలేమీ మాట తీసుకోలేదే? 

      మరొక విషయమేమిటంటే, ఈ ఫ్లాష్ బ్యాక్ సీనంతా సీత వుండగానే, ఆమె సాక్షిగానే జరుగుతుంది. తండ్రి ఏమంటున్నాడో, తల్లి ఏమంటున్నదో అక్కడే వుండి వింటూంటుంది. ఆమే ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లో వున్నాక, ఇక లాయర్ ఈ ఫ్లాష్ చెప్పే అవసరమే లేదు. ‘నీకంతా తెల్సు, ఒకసారి గుర్తు చేసుకోమ్మా’ అంటే ఆమె పాయింటాఫ్ వ్యూలో ఈ ఫ్లాష్ బ్యాక్ రన్ అవడం న్యాయం. గతాన్ని ఆమే గుర్తు చేసుకుంటే -ఎక్కడో కలుక్కు మని, ఆమెలో మార్పు రావడానికి ఈ ఫ్లాష్ బ్యాక్ దోహద పడేది. అప్పుడు ప్లాట్ పాయింట్ టూ కి న్యాయం జరిగేది. లాయర్ పాయింటాఫ్ వ్యూలో కాక, సీత పాయింటాఫ్ వ్యూలో వుండాల్సిన ఫ్లాష్ బ్యాక్ ఇది. 

        ఇంకోటేమిటంటే, ఈ ఫ్లాష్ బ్యాక్ లో వుంటూ అంతా చూస్తూ, వింటూ వున్న సీతకి - పెద్దయాక ప్రదర్శిస్తున్న బుద్ధులు వచ్చే అవకాశమే లేదు. ఇది వీడి పెళ్ళాం, వీడి బంగారం వేసుకునే హక్కు దీనికుంది- అని తండ్రి అంత స్పష్టంగా అనేశాక ఇంకేం కావాలి పిచ్చి పిల్లకి. అసలు పిల్లల ముందు ఈ విషయాలు మాట్లాడడం నాన్సెన్స్. ప్రేక్షకులకి తెలియడం కోసం మాట్లాడుతున్నాడు. ప్రేక్షకులకి తెలియడం కోసం మాట్లడడానికి బెటర్ ఆప్షన్స్ వున్నాయి. 

        సీత నుంచి రామ్ విడిపోయి భూటాన్ వెళ్ళిపోయి ఇరవై ఏళ్లయింది. ఆస్తి అతనిదే నని చిన్నప్పుడే సీతకి తెలుసు. పెళ్లి చేసుకోవడానికి పేచీ ఏమిటో అర్ధంగాదు. ఇక సీత తల్లి, రామ్ ని చిత్రహింసలు పెట్టడం గురించి...ఆస్తికి వీడు వారసుడు, వీడికి మన కూతురు పెళ్ళాం -  అని భర్త చెప్పాక వాణ్ణి కాల్చి వాతలు పెట్టడమేమిటి? అనుభవిస్తున్న ఆస్తి వాడిదని తెలిసినందుకా? రేపు కూతురు అనుభవించ కూడదా? బికారికిచ్చి చేస్తుందా?

        పాత్రతో కథ గాక, కథతో పాత్రని ఆలోచిస్తే ఇలాగే వుంటుంది. కథతో పాత్రని ఆలోచిస్తే ఇతర మాధ్యమాల్లో చెల్ల వచ్చు. కానీ కథతో పాత్రని సినిమాకి ఆలోచిస్తే కోట్లు మునుగుతాయి. సినిమాకి ఎట్టి పరిస్థితిలో పాత్రతో కథని ఆలోచించాల్సిందే. ఈ కథతో పాత్ర విధానమే సీత పాత్రని చాలా డ్యామేజీ చేస్తూ వచ్చింది మొదట్నించీ. ఈ ఫ్లాష్ బ్యాక్ తెలిశాక కూడా సీతలో మార్పు రాదు. చనిపోయిన మేనత్త పట్ల ఏ మాత్రం కనికరం వుండదు. వంద గ్రాముల బంగారమని మాట్లాడుతుంది. పాత్రలో మార్పు తేవడం కోసం గాకపోతే కథలో ఫ్లాష్ బ్యాక్ ఎందుకుంటుంది? అదీ ప్లాట్ పాయింట్ టూ అనే కథకి రెండో మూలస్థంభమయిన మలుపు దగ్గర? ప్లాట్ పాయింట్ టూ అంటేనే పాత్రకి రియలైజేషన్ ఘట్టం కాదా? రియలైజ్ అయి, ఆ రియలైజేషన్ లోంచి తనకి పరిష్కార మార్గం గోచరమై, కథని ముగించడానికి ముందుకి  తీసికెళ్ళడం కాదా? ఇలా వుండవా కథలు? 

        ఇక సీత పాత్ర కథకుడి చేతిలో పూర్తిగా పతనమై సర్వనాశనమవడానికి - శవ్వ! శవ్వ! అన్పించడానికి - ఈ ప్లాట్ పాయింట్ టూ సీను లోంచి ఆమె బయటికి ఒకటే పరుగు తీయడంతో బీజం పడుతుంది...ఆ పరుగు కథకి ఫైనల్ మరణ శాసనం రాసేసింది... 

     ఎండ్ విభాగం కథనం :  వాళ్ళమ్మ ఇచ్చిన వంద గ్రాముల బంగారానికి వడ్డీ కట్టి చెప్పండి, ఇచ్చి పారేస్తాను -  అన్న తర్వాత, రూప వచ్చి చెప్తుంది, అవతల రామ్ నెవరో కొడుతున్నారని. వెంటనే కంగారుగా పరుగు దీస్తుంది సీత. రామ్ ని చంపాలన్న ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చంపే కార్యక్రమం మొదలయింది. వాళ్ళని కొట్టి ఎదుర్కోమని అరుస్తుంది. శాంతి వచనాలు పలుకుతాడు. తనే  ఫైటింగ్ కి దిగుతుంది. ఫైటింగ్ లో ప్రమాదంలో పడడంతో రామ్ కాపాడి తను మొదలెడతాడు ఫైటింగ్. ఇది చూస్తున్న ఎమ్మెల్యే రామ్  మీద కాల్పులు జరిపి లాక్కెళ్ళి పోతాడు.

        సీతని రప్పించడానికి గాయపడిన రామ్ ని తన ఇంట్లో పడేసి కూర్చుంటాడు. అనుకున్నట్టుగానే వచ్చేస్తుంది సీత. ట్విస్ట్. రామ్ పరిస్థితికి చలించి వెంటనే హాస్పిటల్ కి తీసికెళ్ళాలని ఒకటే బతిలాడుకుంటుంది. ముందు తనతో పడుకోవాలంటాడు. పడుకుంటుంది. ట్విస్ట్. రామ్ లేచి ఎమ్మెల్యేని తన్ని  సీతతో పారిపోతాడు. ట్విస్ట్. పారిపోతూ సీత రాం కి సరెండర్ అయిపోతుంది. ఏడ్చేస్తూ మనం ఒకటవుదామంటుంది. ట్విస్ట్.   

        కారులో పారిపోతున్న వాళ్ళని వెనక నుంచి వచ్చి డాష్ ఇస్తాడు ఎమ్మెల్యే. ట్విస్ట్. పెద్ద ప్రమాదం జరిగి తలో దిక్కు పడతారు. భూటాన్ సన్యాసులు రామ్ నెత్తుకెళ్ళి పోతారు. ట్విస్ట్. కళ్ళు తెర్చి విషయం తెలుసుకున్న సీత భూటాన్ వెళ్ళిపోతుంది. ట్విస్ట్. అక్కడ రామ్ ఫోటోకి దండ వేసి వుంటుంది. ట్విస్ట్. చనిపోయాడని అంటాడు గురువు. ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ట్విస్ట్. బయట వున్న రామ్ వచ్చేస్తూంటే ఫోటోకి దండ తీసేస్తారు సన్యాసులు. ట్విస్ట్. రామ్ మానసిక శక్తులకి సీత వచ్చినట్టు తెలుస్తుంది. ట్విస్ట్. ఆమెని కలవాలని మారాం చేస్తాడు. వదిలేస్తారు. సీత కోసం పరుగెత్తడం మొదలెడతాడు రామ్. కారులో వెళ్ళిపోతున్న సీత మానసిక శక్తులకి రామ్ బతికే వున్నాడని తెలుస్తుంది. ట్విస్ట్. పరుగెత్తుకొస్తున్న రామ్ ని చూసి కారు దిగి వాటేసుకుంటుంది. పసుపు తాడు కట్టేస్తాడు. ట్విస్ట్.

        ఎమ్మెల్యే వచ్చేసి అగ్రిమెంట్ చూపిస్తాడు. ట్విస్ట్. అగ్రిమెంట్ ని పాటించాలి కదాని సీతని ఇచ్చేస్తాడు రామ్. ట్విస్ట్. సీతని ఎమ్మెల్యే కారులో తీసుకుపోతూంటే, రామ్ వచ్చేసి వీల్లేదంటాడు. ట్విస్ట్. ఆమె నా భార్య కదా అంటాడు. ఎమ్మెల్యేని లాగి ఎటాక్ చేస్తాడు. ఎమ్మెల్యేకి గుండు తగుల్తుంది. చూస్తే ఆ గుండు పేల్చింది మండోదరి, అంటే ఎమ్మెల్యే భార్య. ట్విస్ట్. ట్విస్ట్. ట్విస్టుల మీద ట్విస్టులు. ఆరగంట సేపు సాగే ఈ ముగింపులో కూడా  ట్విస్టులాష్టమి.  

        “చిమ్మ చీకటిని తరిమి కొట్టడానికి ఒక చిన్న దీపమైనా కావాలి
        చెడు నిండిన లోకం ప్రక్షాళన కోసం ఒక్క మంచి వాడైనా కావాలి”
        - అన్న కొటేషనుతో సుఖాంతం!

       క్లయిమాక్స్ కుదరడం లేదంటే దాని లోపం ప్లాట్ పాయింట్ వన్ లో వున్నట్టని సామాన్య సూత్రం. ప్లాట్ పాయింట్ వన్ లో ఏం లోపం జరిగిందో దాన్ని మరమ్మత్తు చేస్తే క్లయిమాక్స్ సరిగ్గా కుదురుతుంది. ప్లాట్ పాయింట్ వన్ ఎంత ఫేక్ గా వుందో చూశాం. దాని ఎఫెక్ట్ ఇప్పుడు కథ అనుభవిస్తోంది. కథని ఎలా ముగించాలో అర్ధంగానట్టు ట్విస్టుల మీద ట్విస్టులు. ఈ అరగంట ఎండ్ విభాగంలో ఆరుసార్లు ముగిస్తూ మళ్ళీ ట్విస్టు లిచ్చి పొడిగించుకుంటూ పోయారు. లాజిక్ గీజిక్ మంట గలిసి,  సహనానికి పరీక్ష మొదలై పోయింది ఈ ముగింపుతో. కథ పట్టుకు ప్రయాణిస్తే కుక్క తోకట్టుకుని గోదారీది నట్టే. పాత్రని పట్టుకుని ప్రయాణిస్తే నక్క తోక తొక్కి వచ్చినట్టే. 

        ఇంతకీ సీత ప్లాట్ పాయింట్ టూలో ఫ్లాష్ బ్యాక్ తెలిసింతర్వాత, తనలో ఏ మార్పూ ప్రదర్శించక, రామ్ ని కొడుతున్నారని తెలియగానే ఎందుకు పరుగెత్తుకుని పోయినట్టు? రామ్ ని కొడుతూంటే అది చూసి ఆమెలో మార్పు వచ్చినట్టు చిత్రించారు. ఆమెలో మార్పు తేవడానికి ఈ సంఘటనా? అదీ ప్లాట్ పాయింట్ టూ తర్వాత? ఫ్లాష్ బ్యాక్ కే ఏ మానవత్వమూ మేల్కొనని ఆమె, రామ్ కొడుతూంటే మారిపోతుందా? మారిపోతే, మూలంలో మారాల్సిన విషయంలో- తండ్రితో, మేనత్తతో- ఇన్నర్ గా మారకుండా, ఇలా ఔటర్ గా మారిపోతే చాలా? ఔటర్ గా మారడమంటే ఆస్తి కోసమేనా? రామ్ ని కొట్టి చంపేస్తే, వాడితో పెళ్ళీ, దాంతో ఆస్తీ వుండవని అలా పరిగెట్టిందా? మరెందుకు పరిగెట్టింది?

        ఆమె ఈ పరుగు పాత్ర పతనానికీ, సర్వ నాశనానికీ దారి తీశాయి. ఫ్లాష్ బ్యాక్ తో మార్పు వచ్చి పరుగెత్తి వుంటే వేరే అర్ధాలు వచ్చేవి కావు. ఇందుకే ప్లాట్ పాయింట్ టూలో పాత్ర మారాలానేది. మారకుండా పరుగెత్తితే ఇలాగే ఆస్తి పోతోందన్న ఆదుర్దా కొద్దీ పరుగెట్టిందన్న అర్ధం వస్తుంది! వాడెలా పోతే నాకెందుకని గత సీన్లలో అన్న తనే, ఇప్పుడు వాడికోసం పరుగెడుతోందంటే ఇంకెందుకు? ప్రేమ పెంచుకుందనా? 

        ఇక సీత పాత్ర లేదు. చచ్చిపోయింది. ఇక్కడ్నించీ ఏం చూపించినా చూడనవసరం లేదు. ఇన్నర్ గా మారకుండా ఇప్పుడు ఔటర్ గా రామ్ గురించి మార్పు ప్రదర్శిస్తోందంటే, ఇది కూడా నిజం కాదు. ఆస్తి కోసం నటన! 

        ఇక్కడ ఇంకో గమ్మత్తు వుంది. ఎమ్మెల్యే రామ్ ని గాయపర్చి తీసి కెళ్ళిపోయాక, ఎమ్మెల్యేతో ఆ పూట సహజీవనానికి లొంగిపోయింది!! రామ్ లేచి అది జరక్కుండా చూశాడు, వేరే సంగతి. కానీ లొంగింది ఎమ్మెల్యే బెదిరింపులకి. అప్పుడు రామ్ నెలా పెళ్ళిచేసుకోవాలనుకుంది? ఆస్తి ఎలా వస్తుందనుకుంది? అవన్నీ వదులుకుంటూ బలి పీఠం ఎక్కిందా తన పాపాలకి? లేక జాలి పడి  రామే పెళ్లి చేసుకుంటాడనుకుందా? అంత దిగజారిందా? ఈ సన్నివేశం లో ఆమె ఎమోషనల్ మజిలీ, లేదా మానసిక స్థితి ఏమిటి? మానసిక స్థితిని వివరించని సన్నివేశ మెలా వుంటుంది? సన్నివేశాన్ని పాత్ర మీద రుద్దడమేనా?
        ఈ సీతకి వేరే రావణుడెవరూ లేరు, వున్నది ఒక్కడే కథకుడు!
        “చిమ్మ చీకటిని తరిమి కొట్టడానికి ఒక చిన్న దీపమైనా కావాలి
         చెడు నిండిన లోకం ప్రక్షాళన కోసం ఒక్క మంచి వాడైనా కావాలి”... ఏ చిమ్మ చీకటి? ఎవరా మంచోడు? 

(అయిపోయింది)

సికిందర్ 


30, మే 2019, గురువారం

833 : స్క్రీన్ ప్లే సంగతులు


     ఇంటర్వెల్ లో సీతా విజయం చూశాం. గుళ్ళో పెళ్లి చేసుకుంటానని రామ్ ని మాయ చేసి సంతకం పెట్టించుకుని వెళ్ళిపోవడం చూశాం. అయితే ఇది తాత్కాలిక విజయమేనని వూహించగలం. సెకండాఫ్ లో మళ్ళీ ఏవో అడ్డంకులొస్తాయని కూడా వూహించగలం. కానీ సీత ఇది తన పూర్తి విజయమని తనే ఫీలవుతోంది. అందువల్ల ఇది సీత తనకై తాను ఫీలవుతున్న ఇంటర్వెల్ బ్యాంగే తప్ప, ఆమె ప్రేక్షకుల కిచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ ఏమీ కాదు. ఆమెకి రివర్స్ అయితే అది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఇంటర్వెల్ బ్యాంగ్ అయ్యే అవకాశముంది. పాత్రకి రివర్స్ అవడమే సరైన ఇంటర్వెల్ అంటాడు సిడ్ ఫీల్డ్. లేదా పాత్ర దాని ప్రయాణంలో కొత్త విషయమేదో కనుగొనడం మంచి ఇంటర్వెల్ అంటాడు. ఇక ఫస్టాఫ్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పాత్ర ఏం గోల్ పెట్టుకుందో, సెకండాఫ్ ప్లాట్ పాయింట్ టూలో ఆ గోల్ వల్ల ఏం నేర్చుకుందో తెలిస్తే తప్ప ఇంటర్వెల్ ని వూహించలేమంటాడు స్టోరీ ఎనలిస్టు కరెల్ సెగర్స్ కూడా. ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ రెండిటినీ కలిపి వుంచే హుక్ లాంటిది ఇంటర్వెల్ అని కూడా అంటాడు సిడ్ ఫీల్డ్...

         సీత ప్లాట్ పాయింట్ వన్ లో ఐదువేల కోట్ల రామ్ ఆస్తికి స్కెచ్ వేసిందని తెలిసిందే. ఇక సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ దగ్గర, రాబోయే రామ్ ఫ్లాష్ బ్యాక్ ద్వారా, ఆమెలో పరివర్తన ఏమీ రాలేదని తెలుసుకోబోతున్నాం. 


       అంటే ఆమె ప్లాట్ పాయింట్ వన్ దగ్గరి తన స్కెచ్ ఎంత తప్పో, ప్లాట్ పాయింట్ టూ లో ఫ్లాష్ బ్యాక్ ద్వారా నిజాలు తెలిసినా తెలుసుకోవడం లేదన్న మాట.  పైగా ఇదే తలపొగరుతో - వాళ్ళమ్మ ఇచ్చిన వంద గ్రాముల బంగారానికి వడ్డీ కట్టి చెప్పండి, ఇచ్చి పారేస్తాను - అంటుంది. 

       
ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఆమె నెగెటివ్ వైఖరి, ప్లాట్ పాయింట్ టూ దగ్గర పాజిటివ్ వైఖరిగా మారనప్పుడు కథకీ పాత్రకీ అర్ధం వుంటుందా? అందుకని అర్ధవంతమైన కథకోసం, పాత్రకోసం, ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఆమె వైఖరిని పాజిటివ్ గా మారిస్తే-    

       అప్పుడు ప్లాట్ పాయింట్ వన్ దగ్గర నెగెటివ్ వైఖరికీ, ప్లాట్ పాయింట్ టూ దగ్గర  ఆమె పాజిటివ్ వైఖరికీ నడుమ  వచ్చే ఇంటర్వెల్లో, ఆమెని అరెస్ట్ చేయడం ఒక ఆప్షన్. 

       
ఇలా ఆమెకి రివర్స్ అవడమే సరైన ఇంటర్వెల్. పోలీసులు వస్తున్నారని బుకాయించి ఏడ్చి, రామ్ చేత సంతకం పెట్టించుకుంటే - ఆ బుకాయింపే నిజమై పోలీసులు వూడి పడడం ఇంటర్వెల్ కి బలం. ఇంటర్వెల్ తర్వాతి సీన్లో బ్యాంకులో జరిగేదిదే. ఇంటర్వెల్లో అన్ని స్క్రిప్టింగ్ అవసరాల్ని తీరుస్తూ జరగాల్సిన అరెస్టుని, ఇంటర్వెల్ తర్వాత బ్యాంకు సీన్లో పెట్టుకున్నారు. బ్యాంకు సీను బాగాలేదు.

     మిడిల్ -2 కథనం : గుడి దగ్గర రౌడీలు మంగళ సూత్రం కోసం రామ్ ని ఇంకా కొడుతూంటారు. ప్లీజ్ నేను పెళ్లి చేసుకోవాలి వదలండని ఏడుస్తూంటాడు. అటు సీత డ్రెస్ మార్చుకుంటూ వాడెలా పోతే నాకెందుకని బ్యాంకు కెళ్తుంది. బ్యాంకు మేనేజర్ - మీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ గా వున్నాయి, ఆ డబ్బు ట్రాన్స్ ఫర్ చేసేస్తానంటాడు. పేరడుగుతాడు. ఎన్నిసార్లు చెప్పాలని పేరు చెప్తుంది. ఐడీ కార్డు తీసుకుని చూసి, పి. సీతా మహాలక్ష్మి కాదు, ఎం. సీతామహా లక్ష్మి అని వుంటే ఎమౌంటు ట్రాన్స్ ఫర్ చేయాలని మీ ఫాదర్ వీలునామా రాశారంటాడు. మధురవాడ సీతామహా లక్ష్మి, వైఫాఫ్ మధురవాడ సీతా  మహా లక్ష్మి అని వుండాలంటాడు. దీంతో అతడి మీద అరిచి గొడవ చేస్తూంటే, ఎమ్మెల్యే ఇచ్చిన సమాచారంతో  పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారు. 

        పోలీస్ స్టేషన్లో రామ్ వచ్చి పోలీసు చట్టాలు వల్లెవేసి ఫైట్ చేసి సీతని విడిపించుకు వెళ్తాడు. రామ్ కి దెబ్బలు తగిలాయి మందు పూయమని రూప అంటే వాడు నన్ను ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని కసురుతుంది. సీత కో అసిస్టెంట్ వుంటాడు. రిజిస్టర్డ్ మ్యరేజికి ఏర్పాట్లు చేయమని అతడికి చెప్తుంది. ఆ సర్టి ఫికేట్ బ్యాంకులో చూపించి డబ్బు ట్రాన్స్ ఫర్ చేయించుకుంటానంటుంది. సీఐ పట్టుకోవడానికొస్తే పారిపోతుంది. పరారీలో వుంటూ బెయిల్ కోసం అప్లై చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆమె కోర్టు కెళ్ళకుండా పట్టుకోమంటాడు. అప్పటికే ఆమె కోర్టులో వుంటుంది. ఎమ్మెల్యే తన లాయర్ని పంపించి సీత లాయర్ని బెదిరిస్తే సీత లాయర్ తప్పుకుంటాడు. ఇంకే లాయర్ ఒప్పుకోడు. రామ్ ముందుకొస్తాడు వాదించడానికి. పదిన్నర అవడంతో తీ కావాలని మారాం చేయడంతో అభాసు అవుతుంది. సీత అతణ్ణి బహిరంగంగా బాగా దూషిస్తుంది. వేరే లాయర్ వాదించి జడ్జి వేసిన రెండేళ్ళ శిక్షని ఏడాదికి తగ్గిస్తానంటుంది. ఇంతలో రామ్ వచ్చేసి - నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్ యాక్ట్ 1881 సెక్షన్ 130 ని ప్రస్తావించి వాదిస్తాడు. జడ్జి అరెస్టు వారెంట్ చెల్లదని కేసు కొట్టేస్తాడు. 

        ఇక రామ్ ని చంపమని ఆదేశిస్తాడు ఎమ్మెల్యే. ఇది భూటాన్ లో మతగురువు సిక్స్త్ సెన్స్ కి అంది, రామ్ ని కాపాడమని ఇద్దరు శిష్యుల్ని పంపిస్తాడు. రామ్ మీద ఎటాక్ జరుగుతూంటే, కేసు గెలిచిన రామ్ ని చూడాలని సీత దగ్గరికి వస్తాడు ఆమె తండ్రి లాయర్. ఆమె పెడసరంగా మాట్లాడుతూంటే ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు - 

        ఫ్లాష్ బ్యాక్ : సీత తండ్రి భాగ్యరాజ్ వ్యాపారంలో పెట్టుబడి తగ్గిందని భార్యని నగలు అడుగుతాడు. ఇవ్వనంటుంది. భాగ్యరాజ్ చెల్లెలు ముందుకొచ్చి మంగళ సూత్రం సహా నగలన్నీ ఇచ్చేస్తుంది. ప్రమాదంలో భర్తతోబాటు చనిపోతుంది. మేనల్లుడు రామ్ ని తెచ్చుకుని పెంచుకుంటాడు భాగ్యరాజ్. వ్యాపారంలో బాగా కలిసి వచ్చి సంపన్నుడవుతాడు. భార్య జల్సాలు చేస్తూంటే వారిస్తాడు. ఈ సంపద ఆనాడు సాయపడ్డ తన చెల్లెలిదనీ, ఆమె వారసుడు రామ్ కే చెందుతుందనీ, తను కేవలం మేనేజర్ననీ, ‘కాబట్టి నువ్వు జీతగాడి భార్యవే’ ననీ చెప్పేస్తాడు. కోపంతో ఆమె సీత ఒంటి మీది నగలు లాగేస్తూంటే, రామ్ కి కాబోయే భార్యగా ఆమె అర్హురాలు అంటాడు. దీంతో రామ్ మీద కక్ష పెంచుకున్న భార్య, చిత్ర హింసలు పెడుతుంది. దీంతో రామ్ ని భూటాన్ మఠంలో చేర్పించేశాడు భాగ్యరాజ్ ...ఫ్లాష్ బ్యాక్ ఓవర్. 

        ఇది విని సీత నిర్లక్ష్యంగా - వాళ్ళమ్మ ఇచ్చిన వంద గ్రాముల బంగారానికి వడ్డీ కట్టి చెప్పండి, ఇచ్చి పారేస్తాను - అంటుంది. ప్లాట్ పాయింట్ టూ.

      ఈ మిడిల్ టూ కథనంలోనూ రోమాంటిక్స్ లేదు. కేవలం ఎకనమిక్స్ తో డ్రైగా సాగుతుంది. ఎకనామిక్స్ కూడా ఎలా వుందో చూస్తున్నదే. ఆమె బ్యాంకు సీను ఎంత లాజిక్ ని వదిలేద్దామనుకున్నా, సినిమాటిక్ లిబర్టీ కింద ఎంత సావధానంగా చూద్దామన్నా కుదరడం లేదు. ఒక వైపు చెక్ బౌన్స్ కేసు వుంటే ఆమెతో ఎలా వ్యవహరించాలి. ముందుగా - మీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ గా వున్నాయి, డబ్బు ట్రాన్స్ ఫర్ చేస్తానన్న మేనేజర్, ఐడీ అడిగి పేరు కరెక్ట్ గా లేదనడమేమిటి. వీలునామా తో బ్యాంకుకేం సంబంధం. అసలు రామ్ ఎక్కౌంట్ ఈ బ్రాంచి లోనే వుందా. ఎప్పుడు తెరిచాడు... చాలా శోచనీయంగా వుంది సీను. 

        మళ్ళీ ఎమ్మెల్యే ట్విస్ట్ ఇవ్వడం, సీత అరెస్ట్ అవడం, పోలీస్ స్టేషన్ కి రామ్ వచ్చి, తను ఫస్టాఫ్ లో లాయర్ దగ్గర ఒక్కసారి  ‘చదివేసిన’  లా బుక్ లో చట్టాల్ని వల్లించి, పోలీసుల్ని కొట్టి, సీతని విడిపించుకోవడం...ఇదంతా యాక్షన్ పార్టు. మళ్ళీ రిజిస్టర్ మ్యారేజి ప్లానేస్తూ ఇంకో ట్విస్టు. ఆ సర్టిఫికేట్ చూపిస్తే ఎమౌంట్ ట్రాన్స్ ఫర్ అవుతుందట. ఆమె దగ్గరున్న డాక్యుమెంట్స్ వొళ్ళు మండిన అసిస్టెంట్ కాల్చెయ్య బోతే రాం వచ్చి కాపాడతాడు. కానీరాం కి ఇప్పటికీ సేత కుట్రలు తెలియవు. 

        ఇక సీతని పట్టుకోవడానికి మళ్ళీ సీఐ హడవిడి. నిజానికి చెక్ బౌన్స్ కేసులో వారెంట్ వుండగా, పోలీస్ స్టేషన్ లో పోలీసుల్ని కొట్టి పారిపోయిన కేసు కూడా పెట్టాలి సీఐ. కోర్టులో ఈ అఫిడవిట్ వేస్తే ఆమెకిక డిఫెన్స్ వుండదు. కానీ  ఆమె బెయిల్ కి వేసిందని ఎమ్మెల్యే అంటే, సీఐ బెయిల్ని అడ్డుకోవడానికి కోర్టుకి సీత వస్తే అరెస్ట్ చేద్దామనుకుంటాడు. విచిత్ర మేమిటంటే, ఏ కింది కోర్టులో ఆమె మీద చెక్ బౌన్స్ కేసుందో,  ఆ కోర్టులోనే ముందస్తు బెయిల్ అప్లికేషన్ వేయడం. ఇది చెల్లుతుందా? ముందు కోర్టుకి లొంగిపోవాలి. ఆ తర్వాత బెయిల్ కి పెట్టుకోవాలి. లొంగిపోవడం ఇష్టం లేకపోతే, హైకోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని సేఫ్ అయిపోవాలి. 

        కానీ అదే కింది కోర్టులో జడ్జిగారు బెయిల్ అప్లికేషన్ స్వీకరించి దాని మీద కథ నడుపుతాడు. సీతకి చెక్ బౌన్స్ కేసులో ఏకంగా రెండేళ్ళు శిక్ష కూడా అప్పుడే వేసేస్తాడు. ఇక భూటాన్ రామ్ గారు వచ్చేసి అప్పుడొకే ఒక్కసారి చదివేసిన బుక్కులోంచి, లా పాయింట్లు పీకి, తన అతీత శక్తులతో ఏకే సరికి - జడ్జిగారు విపరీతంగా బాధపడిపోయి  తీర్పు మార్చుకుంటాడు. ఇక అరెస్టు లేదు గిరెస్టు లేదు పొమ్మంటాడు. మరెందుకు ఇంత  అరెస్ట్ వారెంట్ ఇచ్చి, భూటాన్ నుంచీ నాంపల్లి దాకా ఇంత కథ నడపడానికి కారకుడయ్యాడు? దర్శ
కుడు ఎలా చూపిస్తే అలా క్యాలిక్యులేటర్ (మెదడు) లేకుండా చూడాలన్నట్టుంది. 

        ఇక మరో ఫ్లాష్ బ్యాక్ తో ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో విషయం తెలిశాక కూడా సీతలో మార్పు రాలేదంటే... స్క్రీన్ ప్లే క్షమిస్తుందా? 

సికిందర్


28, మే 2019, మంగళవారం

832 : స్క్రీన్ ప్లే సంగతులు

    “నా పేరు సీత - నే గీసిందే గీత!” అని సీత ఊతపదం. కానీ ఎమ్మెల్యే పెట్టే ట్విస్టులకి తనే పరుగులు తీస్తూ వుంటుంది. ఇదలా వుంచితే, ప్లాట్ పాయింట్ వన్ లో సీత భూటాన్ బయల్దేరడం చూశాం. ఈ ప్లాట్ పాయింట్ వన్ లో కథని ప్రారంభించడానికి సీతకి సమకూరిన కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్ అనే నాల్గు గోల్ ఎలిమెంట్స్ ఎలా వున్నాయో చూద్దాం. ఈ దృశ్యంలో సీతకి మంగళ సూత్రం మాత్రమే దక్కి, ఐదు వేల కోట్లూ మంగళ హారతి అయిపోయాయి. తండ్రి ఈ ఆస్తిని భూటాన్ లో రామ్ అనే వాడికి రాసేశాడు. కథలో ఇంతవరకూ భాగ్యరాజ్ రామ్ కేమవుతాడో మనకి రివీల్ చేయలేదు. ఇప్పుడు సీత తల్లి మంగళ సూత్రమని సీతకి చెందేలా వీలునామా రాసి చనిపోవడం చూస్తే, సీతకి తండ్రి అవచ్చని ఒక అనుమానం వేస్తుంది. అప్పుడు రామ్ కేమవుతాడు తెలుగు సినిమా ప్రకారం మేనమామే అవుతాడు. ఇప్పుడు సీతారాములు బావామరదళ్ళే  అవుతారు సినిమా ప్రకారమే.


        ఇది ఆడియెన్స్ కి ఇంకా రివీల్ చేయకపోయినా ఈ సీన్లో సీతకీ, లాయర్ కీ తెల్సు. సీతకి ఇంకా చాలా తెల్సు. ఇంకా మనకి చూపెట్టని ఫ్లాష్ బ్యాక్ ప్రకారం, ఈ ఆస్తి ఆల్రెడీ ఎవరి పరమై వుందో ఆమెకి బాగా తెల్సు. తను ఏం చేస్తే ఆస్తిని అనుభవించగలదో కూడా స్పష్టంగా తెల్సు. బావ అయిన రామ్ ని చేసుకుంటేనే ఆస్తిని అనుభవించ గలదు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఇదంతా తండ్రి చెప్పేశాడు. సీత సొంతంగా ఎదగడానికి యాభై కోట్లు అడిగినప్పుడు జరిగిన విషయమిది. అప్పుడు ఆస్తి మ్యాటర్ చెప్పేసి, తన సొంత డబ్బు ఏడు కోట్లూ ప్లస్ హైదరాబాద్ లో వుండడానికి ఇల్లూ ఇచ్చేసి పంపించేశాడు మాట వినని సీతని. ఏడాదికల్లా వంద కోట్లు సంపాదించి చూపిస్తానని చెప్పేసింది. 

          ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ సీను చూసినప్పుడు, తండ్రి మరణ వార్త విని ఐదువేల కోట్లూ తనవే నని, దాంతో చందూలాల్ అప్పు ఐదు కోట్లూ తీర్చేస్తాననీ చెప్పి వచ్చింది. అలా ఎలా అనుకుని వస్తుంది - ఆస్తిని ఆమె పెళ్ళితో లింకు పెట్టి తండ్రి చెప్పేశాక? ఆస్తి రామ్ దని తెలిశాక? అసలు తండ్రి ఇచ్చిన ఇల్లే అమ్మేసి చందూలాల్ అప్పు తీర్చేయవచ్చుగా? 

          ఇంకా రివీల్ చేయని ఈ ఫ్లాష్ బ్యాక్ నేపధ్యంలో, విషయాలన్నీ తెలిసిన సీత, తండ్రి అంత్యక్రియలు పూర్తిచేసి, తండ్రి కిచ్చిన మాట గుర్తుచేసుకుని దండం పెట్టుకోవాలి (ఆమెకి  డబ్బే కావాలి, ఇలా చెయ్యదంటే కుదరదు. పాత్రకి అప్ అండ్ డౌన్స్ వుంటాయి నైతిక ప్రతిపాదికన) పెట్టుకుని, లాయర్ వీలునామా చదవబోతే, ‘అదంతా నాకు తెల్సు, మా అమ్మ మంగళ సూత్రమిలా ఇవ్వం’ డని తనే అడిగి తీసుకుని భూటాన్ బయల్దేరాలి. 

          కానీ ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో ఇలా జరగలేదు. ఇలా చేయకుండా సీత,  ఐదువేల కోట్ల ఆస్తి నీకు రాయలేదని లాయర్ అనగానే షాక్ అవుతుంది. నిజానికి ఇంకా ఫ్లాష్ బ్యాక్ తెలియని ప్రేక్షకులకి ఇలా షాక్ ఇస్తే, ప్లాట్ పాయింట్ వన్ కి బావుంటుందని కవిహృదయం కావొచ్చు. విషయం తెలీని ఆడియెన్స్ కి, విషయమంతా తెల్సిన సీతతో ఇలా నకిలీ షాక్ ఇప్పించడం. అప్పుడామె మనసులో అనుకునే వుంటుంది- నాకు లోగుట్టు తెలుసు. కానీ దర్శకుడి ఆదేశాల మేరకు ఆడియెన్స్ ని డూప్ చేయడానికి, ఆత్మ వంచన చేసుకుని నకిలీ షాక్ నటిస్తున్నానని!  అసలు తండ్రి మాట ప్రకారం రామ్ ని చేసుకుని అంత ఆస్తినీ అనుభవించెయ్యడానికి వచ్చిన అభ్యంతర మేమిటో అర్ధం గాదు. ఏ మనీ మైండెడ్ అమ్మాయైనా ఎగిరి గంతేసి పెళ్లి చేసుకుంటుంది. మనీ మైండెడ్ అమ్మాయనే కాదు, డబ్బు పిచ్చి వున్న ఎవరైనా ఛాయిస్ కోరుకోరు, ఛాన్స్ కొట్టేస్తారు. అసలీ పాత్ర క్యారెక్టర్ బయోగ్రఫీయే సరిగా లేదు. ఎప్పుడెలా తోస్తే అలా నడిపించేసినట్టుంది. 

          కథనం ఇంత గందరగోళంగా వుంటే, ఈ చిక్కులు విదదీసి వివరించడం కష్టమైపోతుంది. చదివే వాళ్ళకీ అర్ధమవడం కష్టమైపోతుంది. ‘మహర్షి’ తో కూడా ఇదే ప్రాబ్లం. 

        ఇప్పుడు సినిమాలో చూపించిన ప్రకారమే, ఈ ప్లాట్ పాయింట్ వన్ కొచ్చేసరికల్లా సీత ఎమోషనల్ మజిలీ ఏమిటి? ఆస్తి పొందుదామని వస్తే ఆస్తి ఇంకెవరికో పోయింది. ఇంతకన్నా ఎమోషనల్ సెట్ బ్యాక్ లేదు. 1. ఆమె కోరికేమిటి? చందూలాల్ అప్పుతీర్చేసి ఎమ్మెల్యేని దెబ్బ కొట్టడం. ఇది జరిగే పనేనా? దీంతో ఎమ్మెల్యే ఆగుతాడా? సమస్యకి మూలాన్ని పెకిలించి వేయక,  దాని సైడ్ ఎఫెక్ట్స్ కి చికిత్స చేయడమేమిటి? తను రాసిచ్చిన అగ్రిమెంట్ పత్రాన్నే చెల్లకుండా చేస్తే, ఎమ్మెల్యే పీడా విరగడై పోతుందిగా? అప్పుడీ చం దూలాల్ ఎవడు?  కాబట్టి ఈ ప్లాట్ పాయింట్ వన్ కథా ప్రారంభంలో,  సీత గోల్ ఎలిమెంట్స్ లో మొదటిదైన ఆమె పెట్టుకున్న కోరిక నిర్వీర్యమై పోయింది. 

          కోరికే నిర్వీర్యమై పోయాక ఇక గోల్ ఏముంటుంది? లేని గోల్ కి 2. పణంగా పెట్టాల్సిం దేముంటుంది? లేని గోల్ కి 3. పరిణామాల హెచ్చరి కేముంటుంది? గోలే లేకపోయాక  ఇక 4. ఎమోషన్ ఏముంటుంది?  కాబట్టి గోల్ ఎలిమెంట్స్ నాల్గూ లేవు, గోలే లేదు. ఇందుకే చందూలాల్ బాకీ గురించి ఈ కథ నడపకూడదని ముందు నుంచీ చెబుతున్నది. అసలీ బాకీ కథ సినిమా స్థాయి కథ కాదని కూడా చెప్తున్నది. 

          ఇప్పుడామె కల్పించుకున్న ఫిరాయింపు  గోల్ ఏమిటి? నేతలు పార్టీ ఫిరాయిస్తారు. ఇలాటి సీతలు గోల్ ఫిరాయిస్తారు. రామ్ కి రాసిన ఆస్తిని తను రాయించుకోవడమే ఇప్పుడు సీత ఫిరాయిస్తున్న గోల్. ఇదామె ఇక్కడ చెప్పదు. పైగా వాణ్ణి పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని అనేస్తుంది. అసలామె వచ్చిందే ఆస్తికోసం. దక్కింది మంగళ సూత్రం. అది తీసుకుని కోపంతో వెళ్ళిపోతుంది. ఇంత అవమానం జరిగాక మంగళ సూత్రం ఎందుకు తీసుకుంటుంది. లాయర్ మీదికే విసిరేసి వెళ్లిపోవాలి. మళ్ళీ వచ్చి తీసుకోవాలి.  అప్పుడు ‘వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి అనుకుంటున్నారేమో...నా మదర్ సెంటిమెంటుతో మాత్రమే దీన్ని తీసుకుంటున్నా’ అనేస్తే క్యారెక్టర్ బాగా అర్ధమయ్యే అవకాశముంది. క్లయిమాక్స్ దగ్గర్లో ఇంకో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. దాని ప్రకారం తల్లి బుద్ధులే తన కొచ్చాయి. ఈ జస్టిఫికేషనుతో, ఇంత అవమానం జరిగినా మళ్ళీ వచ్చి మంగళ సూత్రం తీసుకెళ్ళడానికి ఆర్ధముంటుంది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ తెలియని ప్రేక్షకుల పాయింటాఫ్ వ్యూలో - ఏదో ప్లానేస్తోంది సీత అన్నట్టు వుంటుంది. 

       ఇప్పుడు సీత కల్పించుకున్న కొత్త గోల్ ప్రకారం ఎలిమెంట్స్ చూద్దాం : 1. కోరిక వచ్చేసి, రామ్ కి రాసిన ఆస్తిని తన పేర బదలాయించుకోవడం, 2. ఈ కోరిక సాధించుకోవడానికి  సీత ‘పణం’ గా పెడుతున్నది ఏమీ లేదు. వస్తే ఆస్తి వస్తుంది, రాకపోతే పోయేదేమీ లేదు పెట్టుబడిగా పెడుతున్న శ్రమవృథా అవడం తప్పితే, 3. పరిణామాల హెచ్చరికలేమిటి? ఈ ప్రయత్నంలో తానెర్కోబోయే అత్యంత తీవ్ర పరిణామాలేవై వుండొచ్చు? చీటర్ గా అరెస్టయి జైలు కెళ్ళవచ్చు. కానీ ఇలా జరగనివ్వడు ఎమ్మెల్యే. తనకింత డబ్బొస్తోందని తెలిస్తే  ఇక సహజీవనం కాదు, ఎత్తుకెళ్ళి ఇదే మంగళ సూత్రం ఇదే తన మెళ్ళో కట్టేయ వచ్చు, 4. ఏ ఎమోషన్ తనని ఈ గోల్ కి పురిగొల్పుతోంది? ఇప్పుడు చందూలాల్ బాకీ ఒక ఎమోషనే కాదు, ఈ నడమంత్రపు సిరితో దిమ్మదిరిగే రిచ్ అయిపోతుంది తను. బాగా రిచ్ అవ్వాలన్న ఏకైక ఎమోషనే కదా తనకున్నది? 

          మరి ఈ గోల్ ఎలిమెంట్స్ ప్రకారమైనా మిడిల్ కథ నడిచిందా అంటే లేనేలేదు. గోల్ ఎలిమెంట్స్ లో కోరిక ఒక్కటి తప్ప మిగతావి కథలో లేవు. పణంగా ఒడ్డిందేమీ లేదు. పరిణామాల హెచ్చరిక ప్రకారం ఆస్తిని కొట్టేసే ప్రయత్నంలో చీటర్ గా అరెస్టయ్యే సూచనలుగానీ, ఇంత ఆస్తి కోసం ప్రయత్నిస్తోందని అసలు ఎమ్మెల్యేకి తెలియడం గానీ లేనే లేవు. ఉన్నదల్లా చందూలాల్ చెక్ బౌన్స్ కేసులోంచి బయట పడే ప్రయత్నాలతోనే కథ! ఇక ఎమోషన్ రిచ్ అవడం గురించి కాక, చెక్ బౌన్స్ కేసులోంచి బయట పడడం గురించే వుంది! 

          ఇలా కూడా ప్లాట్ పాయింట్ వన్ కి బలం లేకుండా పోయింది. అంటే ఇక ఇక్కడ్నించీ ప్రారంభమయ్యే రెండు గంటలా పది నిమిషాల సుదీర్ఘమైన కథకి బలం లేదని ముందే తెలిసిపోతోంది - ప్లాట్ పాయింట్ వన్ ఎనాలిసిస్ ద్వారా.  

         ఇక మిడిల్ - 1 కథనం :  భూటాన్ వెళ్ళిన సీతకి మఠంలో రామ్ (బెల్లంకొండ శ్రీనివాస్)  అమాయక బాలుడిలా ఎదురవుతాడు. పెద్దయాక వచ్చిన సీతని చూసి ఆనందంతో ఒక పాటేసుకుంటాడు. చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తున్న అతణ్ణి ఛీత్కరించుకుని, మంగళ సూత్రం చూపిస్తూ, ‘అసలు మా నాన్నతో నాకు గొడవేంటో తెల్సా?’ అంటుంది నేస్తం రూపతో (మిన్నారా చోప్రా). 

          ఫ్లాష్ బ్యాక్ : వైజాగ్ లో తండ్రి దగ్గరి కెళ్ళి యాభై కోట్లు అడుగుతుంది. రామ్ ని చేసుకుంటానంటే ఇస్తానంటాడు. ససేమిరా అంటుంది. ఐతే నీ దారి చూసుకోమంటాడు. సంపాదించి చూపిస్తానంటుంది. ఎంత సంపాదించి చూపిస్తావంటాడు. వంద కోట్లు అంటుంది. ఎంత కాలంలో అంటాడు. ఏడాదిలోగా అంటుంది. ఏడుకోట్లు సొంత డబ్బు చెక్కు రాసిచ్చేస్తాడు. వెళ్ళిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ ఓవర్. 

          ఇది చెప్పి రామ్ దగ్గరికెళ్ళి, ఆస్తి కోసం నిన్నుచేసుకునేది లేదని మంగళ సూత్రం మీద పడేస్తుంది. మఠం గురువుకి విషయం చెప్పేస్తుంది. అతను బయటి ప్రపంచంలో కుట్రలూ కుతంత్రాలూ తెలీని అమాయకుడమ్మా అంటాడు గురువు. వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్లిపోతుంటే ఎమ్మెల్యే కాల్ చేసి, చందూలాల్ చెక్ బౌన్స్ కేసులో అరెస్టు వారెంట్ వచ్చిందని ట్విస్ట్ ఇస్తాడు. వెనక్కి పరుగెత్తు కొచ్చి, రామ్ ని ‘కిడ్నాప్’ చేసుకు హైదరాబాద్ వచ్చేస్తుంది.

          ఇక్కడ బ్యాంక్ కెళ్ళి పోయి, రామ్ డబ్బు తనకి ట్రాన్స్ ఫర్ చేయమంటుంది. రామ్ ఎక్కౌంట్ లోనే డబ్బు లేదు, వీలునామా ప్రాసెస్ పూర్తి చేసుకుని రమ్మంటాడు మేనేజర్. లాయర్ దగ్గరికి వెళ్తుంది. ఆమెని అరెస్ట్ చేయడనికి సీఐ గాలిస్తూంటాడు. సాయంత్రం ఐదింటికల్లా చందూలాల్ డబ్బు కట్టక పోతే అరెస్ట్. నాల్గింటికే కట్టేస్తానని ఆమె ఛాలెంజ్. ఇక్కడ లాయర్ తో లీగల్ ప్రాసెస్ కుదరదు. ఇంకో లాయర్ దగ్గరికి పరుగు. అక్కడ ఆస్తి బదలాయింపు పత్రాల మీద రామ్ సంతకం పెట్టడు. పెళ్లి ప్లానేస్తుంది. గుళ్ళో పెళ్లి డ్రామా చేస్తూ, రూప చేత కాల్ చేయించుకుంటుంది పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారనీ. ఇప్పుడెలా అని ఏడ్చేస్తూంటే, సంతకం పెట్టేస్తాడు రామ్. ఇప్పుడే వచ్చేస్తానని బ్యాంకుకి జంప్ అవుతుంది. మంగళ సూత్రం పట్టుకుని ఆమెకోసం ఎదురుచూస్తున్న రామ్ మీద రౌడీలు కన్నేస్తారు.

          సీత బ్యాంకులో వుందని తెలుసుకున్న ఎమ్మెల్యే ఈ విషయం సీఐ కి చెప్తాడు. సీఐ వచ్చేస్తున్నాడని తెలుసుకున్న సీత డీలా పడిపోతుంది. అటు గుడి దగ్గర మంగళ సూత్రం కోసం రామ్ ని కొడుతూంటారు రౌడీలు. ఇంకా అటు హేపీగా వుంటాడు ఎమ్మెల్యే. ఇంటర్వెల్.

పద, సరీగ్గా ఎంట్రీ ఇవ్వు!
     సీత భూటాన్ వెళ్తే అక్కడ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ఎంట్రీ సీను, పాత్ర పరిచయం వ్యూహాత్మకంగా, యూత్ అప్పీల్ తో వుండవు. ఇరవై ఏళ్ళూ మఠంలో వున్నా, చిన్నప్పటి మానసిక స్థితిలోనే వుండిపోతాడు. చిన్న పిల్లాడిలా మారాం చేస్తాడు. అతడికి ఉదయం పదిన్నర కల్లా టీ, రెండు బటర్ బిస్కెట్లు, ఒక ఎర్ర మాత్ర, ఇంకో పచ్చ మాత్రా కావాలి. లేకపోతే ఫిట్స్ వచ్చిన వాడిలా వణికిపోతాడు. అతను ఏదైనా కోరుకుంటే దానికోసం మారాం చేసి సాధించు కుంటాడు. పదిన్నరకి ‘టీ కావాలీ!  టీ కావాలీ!!  టీ కావాలీ!!!’ అని మారాం చేస్తాడు. హైదరాబాద్ వచ్చాక లాయర్ దగ్గరి కెళ్తే  ‘బుక్ కావాలీ! బుక్ కావాలీ!! బుక్ కావాలీ!!!’ అని మారాం చేస్తాడు. ఇంకో లాయర్ దగ్గరి కెళ్తే  ‘టాయిలెట్ కావాలీ! టాయిలెట్ కావాలీ!! టాయిలెట్ కావాలీ!!!’ అని మారాం చేస్తాడు. కోర్టు కెళ్తే జడ్జి ముందు ‘టీ కావాలీ!  టీ కావాలీ!!  టీ కావాలీ!!!’ అని మారాం చేస్తాడు. 

          ఆధ్యాత్మిక గురువు ఇలా తయారు చేసి వదిలాడు. మఠంలో చేరితే మఠం వస్త్ర ధారణలోకి మార్చెయ్యకుండా జీన్సు - టీస్ లో అలాగే వదిలేశాడు. ఇంగ్లీషు మందులతో నయం చేద్దామనుకున్నాడు. ఇరవై ఏళ్లయినా నయం చేయలేకపోయాడు. వాణ్ణి కుదేసి బౌద్ధుల హఠ యోగానే చేయిస్తే, రోగమంతా వదిలిపోయి, స్కిల్స్ డెవలప్ అవుతాయి. మానసికంగా కత్తిలా, శారీరకంగా శక్తిమాన్ లా వుంటాడు. ఈ స్కిల్స్ ప్రదర్శించలేదని కాదు. సీత ‘కిడ్నాప్’ చేసి తీసి కెళ్తున్నప్పుడు, రోడ్డు మీద అడ్డున్న కంటెయినర్ ని ఏనుగులతో కలిసి నెట్టేస్తాడు. ఎవరైనా తన మీదికొస్తే ఫైట్ చేస్తాడు. పుల్లలు కుప్పగా పడేస్తే అవెన్నున్నాయో చూసి చెప్పేస్తాడు. లా బుక్ ఒక్క లుక్కేసి, కోర్టులో కేసు కూడా వాదించి సీతని గెలిపించేస్తాడు. ఇవేవీ వార్కౌట్ కాలేదు. మరోవైపు ఫిట్స్ తో బతుకు బండి లాగిస్తాడు. మానసికంగా కిండర్ గార్టెన్ క్వాలిటీతో వుంటాడు. 

          ఈ స్కిల్స్ ఎలా డెవలప్ అయ్యాయి? ఇది చూపించలేదు. ఇందుకే హీరో ఎంట్రీ సీను స్కిల్స్ ప్రదర్శనతో పవర్ఫుల్ గా వుండాలనేది. సీత వెళ్లేసరికి కాషాయ వస్త్రధారియై బ్రహ్మాండమైన శారీరక, మానసిక శక్తుల ప్రదర్శన చేస్తూండాలనేది. ఫిట్స్ గిట్సు, కిండర్ గార్టెన్ నాన్సెన్స్ అంతా లేకుండా - సీతకి గట్టి షాకివ్వాలనేది. వీణ్ణి బుట్టలేసుకుని ఆస్తి కొట్టేద్దామని వస్తే, వీడేంటి మనకి మించి వున్నాడని ఆమెకి అన్పించాలనేది. సినిమా ప్రారంభంలో రామ్ ని మఠంలో చేర్పిస్తున్నప్పటి మిస్టీరియస్ వాతావరణం ఇలా పే ఆఫ్ కావాలనేది. ఆ ఓపెనింగ్ ఇమేజి రామ్ పాత్రకి ఇలా బదలాయింపు అయి కలవాలనేది. మఠం అనే ఆధ్యాత్మిక కేంద్రపు ఓపెనింగ్ ఇమేజి, ఇలా భౌతిక వాదపు కథకి కాంట్రాస్ట్ కావాలనేది. సీత భౌతికవాదానికి, ఆమె గోల్ కి -  మఠ వాసియైన రామ్ ఆధ్యాత్మిక వాదం ప్రతిబంధకం కావాలనేది. ఆమె గోల్ కి ఇక్కడే గట్టి బ్రేకు పడాలనేది. ఎంత గట్టి బ్రేకు (పరీక్ష) పడితే పాత్ర అంత ఆసక్తి రేపుతుందనేది. 

          ఎమ్మెల్యేని (విలన్) ని ఎదుర్కోలేక ఇక్కడికొచ్చి, అమాయకుడైన రామ్ ని మాయ చేసి బయటపడదామనుకునే పాత్ర ఓ పాత్రేనా? యాక్షన్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ని ఇలా హీరోయిన్ వెంట వుండే,  పప్పుసుద్ద పాసివ్ పాత్రలో ఎవరు చూస్తారు? ఈ పాత్ర నటించి మెప్పించడం సాధ్యం కూడా కాలేదు. సరే, ఇప్పుడిక బెల్లంకొండ శ్రీని
వాస్ ఈ అమాయక పాత్రతో ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథ అని స్పష్టమైంది.

        మిడిల్ వన్ అంటే కేవలం గోల్ కోసం సమస్యతో జరిగే సంఘర్షణ. కన్పిస్తున్న కథ ప్రకారం చందూలాల్  అప్పు తీర్చడమే గోల్. దీంతో సంఘర్షణే మిడిల్ వన్ కథాంశం. ఇప్పుడు మఠంలో రామ్ అమాయకుడిలా పరిచయమయ్యాక, సీత ఫ్లాష్ బ్యాక్ అసలు విశ్లేషణ ఒక్క ముక్కలో చూద్దాం : ‘అసలు మా నాన్నతో నాకు గొడవేంటో తెల్సా?’ అని చెప్తుంది. ఇందులో రామ్ తో పెళ్లిని తిరస్కరించడమే వుంటుంది. తనకి  డబ్బిస్తే వంద కోట్లు సంపాదించి చూపిస్తాననే వుంటుంది. మరిప్పుడు ప్రాబ్లం ఏమిటి? ఫాదర్ డబ్బిచ్చాడు. ఆ వంద కోట్లు సంపాదించే పనిమీద వుండక, వద్దనుకున్న రామ్ దగ్గరికే  ఎందుకొచ్చింది? ఇక్కడికి తన రాకనే ప్రశ్నించే ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవడంలో ఏమైనా అర్ధముందా? అర్ధం పర్ధం, సరైన ప్రణాళికా అంటూ లేని క్యారెక్టర్ వంద కోట్లు సంపాదిస్తుందా? 

          ఇక రామ్ ని ఛీకొట్టి వెళ్లిపోతూంటే, ఎమ్మెల్యే ఫోన్ చేసి చందూలాల్ కిచ్చిన చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ వారెంట్ అంటూ ఇంకో ట్విస్టు ఇస్తాడు (ఈ చందూలాల్ ఎవడండీ బాబూ, ఒకప్పటి కాబూలీ వాలాలాగా ఏనాటి పాత్ర!). అప్పుడు గబుక్కున వెనక్కొచ్చి మాయమాటలు చెప్పి రామ్ ని కిడ్నాప్ చేసి తీసి కెళ్ళి పోతుంది. ఈ పనేదో ముందే చేయవచ్చుగా?  తను పెట్టుకున్న ఆస్తి కొట్టేసే గోల్ కి, ఎంతో ప్లానింగ్ గా వచ్చి,  రామ్ అనే బచ్చాని గభాల్న ఎత్తుకెళ్ళి పోవచ్చుగా? చిన్నపిల్లల కిడ్నాపులు ఎన్ని జరగడం లేదు? ఎమ్మెల్యే ట్విస్టు ఇస్తేనే ఏం చేయాలో తెలిసివచ్చిందా? ఎందుకింత వేస్టుగా భూటాన్ దాకా వచ్చినట్టు? 


          హైదరాబాద్ వచ్చేశాక బ్యాంకెళ్ళి రామ్ ని చూపించి, ఎమౌంట్ తన ఎక్కొంట్ కి ట్రాన్స్ ఫర్ చేయమంటుంది. ‘పోవమ్మా వీడికి ఎక్కౌంటే లేదు, ముందు వీలునామా ప్రాసెస్ చేసుకుని వీడి ఎక్కౌంట్ లో డబ్బు పడ్డాక ట్రాన్స్ ఫర్ చేయించుకో ఫో!’ అని ఇంత రఫ్ గా అనకపోయినా, బాగానే అంటాడు మేనేజర్. సీతమ్మ తెలివి తేటలిలా వున్నాయి. ఐదువేల కోట్ల ఆస్తి వ్యవహారం ఇప్పటికిప్పుడు సాయంత్రం ఐదింటికల్లా తేలిపోకపోతే ఐదుకోట్ల చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అవుతుంది తను! 


          లండన్లో మాల్యా లాగా తను భూటాన్ లోనే వుంటే సరిపోయేది కదా? ‘మిస్టర్ రామ్, నాకు ఐదుకోట్లే కావాలి. వందకోట్లు సంపాదించాక నీ కిచ్చేస్తాను. నీ డాక్యుమెంట్స్  బ్యాంకులో చూపించి నాకు ష్యూరిటీ మాత్రమే ఇవ్వు  చాలు’ అంటే సమస్య చెల్లు కదా? ఆమెకి హైదరాబాద్ లో తండ్రి ఇచ్చిన ఇల్లు వుందన్న సంగతి మర్చిపోదాం విశ్లేషణా సౌలభ్యం కోసం. అలాగే తన దగ్గర డబ్బు లేనప్పుడు చందూలాల్ కి చెక్కు ఎందుకిచ్చిందని కూడా వదిలేద్దాం. అసలు తనేం చేస్తోందో తనకి తెలిస్తేగా?  పదికోట్ల స్థలం తనకుండి  కూడా ఈ పరుగులు. 


          ఎత్తుకున్న ఎకనమిక్స్ కథ కూడా ప్రాక్టికల్ గా, నాలెడ్జబుల్ గా  లేకపోతే ఎలా? అంతా మూస ఫార్ములా రొడ్డకొట్టుడేనా ఇంకా? 


          ఇక ఈమెని అరెస్ట్ చేయడానికి సీఐ తిరగడం, ఎమ్మెల్యే పెట్టిన కామెడీ గ్యాంగ్ సీత ఎక్కడి కెళ్తోందో ఫాలో అయి సమాచారమివ్వడం, ఆ సమాచారాన్ని ఎమ్మెల్యే సీఐకి   అందించడం - ఈ ఇంటలిజెన్స్ నెట్వర్క్ సీక్రెట్ గా ఓ పక్క!


          ఎమ్మెల్యే ఒక లాయర్ దగ్గరి కెళ్ళి, సీత వస్తే ఆపి వుంచమంటాడు సీఐ అరెస్ట్ చేయడానికి. ఈమాట చెప్పడానికి పెద్ద బిల్డప్ సీను, ఒక కాల్ చేస్తే పోయేదానికి. ఐదు వేల కోట్ల ఆస్తికి సీత గీత గీసిందని తెలిసి కూడా, చెక్ బౌన్సు పట్టుకుని కూర్చున్నాడు ఎమ్మెల్యే.  బిగినింగ్ విభాగంలో, డబ్బు తన దగ్గర చాలా మూల్గుతోందనీ, డబ్బు కాదు కావాల్సింది, నీతో సహజీవనమనీ అంటాడు. ఇప్పుడు సీత ఐదువేల కోట్లతో తన కంటే పవర్ఫుల్ అవుతోంటే ఇంకెక్కడి సహజీవనం! 


          ఆ లాయర్ దగ్గరికి సీత రామ్ తో వస్తే, రామ్ టాయిలెట్ కావాలంటూ మారాం చేస్తాడు. లాయర్ ఇద్దర్నీ వెళ్లగొట్టేస్తాడు. ఇంకో లాయర్ దగ్గరి కెళ్తే  బుక్ కావాలీ అంటూ మారాం చేస్తాడు. నిమిషంలో ఆ లా బుక్ లో  చట్టాలు మొత్తం చదివేసి జీర్ణం చేసుకుంటాడు. ఇక్కడ ఆస్తి బదలాయింపు పని పూర్తి చేసుకుంటుంది. ప్రభుత్వంతో పని లేకుండా లాయర్ ముద్ర కొట్టి ఆస్తులిచ్చేస్తాడా!  కానీ రామ్ సంతకం పెట్టడు. దీంతో వొళ్ళు మండిపోయిన సీత ఉత్తుత్తి పెళ్లి ప్లానేస్తుంది. ఈ ఆలోచన రావడానికామె బాత్ టబ్బులో ఐసు గడ్డల మధ్య పవళించాల్సి వచ్చింది.  భూటాన్ మంచుకొండల మధ్య ఎప్పుడో రావాల్సిన ఆలోచన. వచ్చుంటే ఇంతవరకూ రోమాంటిక్ కామెడీ వుండేది. 


          గుళ్ళో పెళ్లి డ్రామా నడిపిస్తూ ఫ్రెండ్ చేత పోలీసు లొచ్చేస్తున్నారని కాల్ చేయించుకుని, రామ్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. సంతకం పెట్టేస్తాడు. మంగళ సూత్రం అతడి చేతిలో పెట్టేసి సంతోషంగా బ్యాంకుకి జంప్ అవుతుంది



       ఈ మిడిల్ వన్ ని ఇంకా విశ్లేషిండం అవసరం లేదు. ఒక్క పూటలో ఎన్నెన్ని జరిగి పోతున్నాయి. ఎన్నెన్ని ట్విస్టులు. అప్పుడే బ్యాంకు పనులు, అప్పుడే లాయర్లతో పనులు, అప్పుడే ఆస్తి బదలాయింపులు, అప్పుడే పెళ్లి పనులు... సెకండాఫ్ లో చెక్ బౌన్సు కేసు కూడా కోర్టులో అప్పుడే గెలిచిపోతుంది సాయంత్రం ఐదింటికల్లా. ఈ మిడిల్ వన్ కథనంలో సంఘర్షణంతా సినిమాకి చాలని ఆఫ్టరాల్ చందూలాల్ చెక్ బౌన్సు కేసుతోనే. ఇదంతా తూతూ మంత్రపు కథనమే. ఐదువేల కోట్లు అనే కిల్లర్ పాయింటు మీదికి వెళ్ళకుండా, ఆమెకి అరెస్టు భయం కల్పించి లొంగ దీసుకోవాలని విలన్ ఆచితూచి కోరుకోవడం; పాత్రచిత్రణ లేక సీత, అసలు పాత్రే కాక రామ్, లేని కథలో పరుగులు పెట్టడం గంటన్నర పాటూ సాగుతూ వుండే ఆ ఫస్టాఫ్ ని  వృధా చేశాయి.  

సికిందర్