రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, అక్టోబర్ 2018, సోమవారం

696 : స్క్రీన్ ప్లే సంగతులు


4
          దొంగరాముడులో నేటి అట్టర్ ఫ్లాప్ స్క్రిప్టుల్లో  రిపీటవుతున్నతప్పుల్లో ఓ మూడు తప్పులకి తరుణోపాయముంది. మిడ్ ఫ్రాక్చర్లు, సెకండాఫ్ సిండ్రోములు, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ లనే మూడు చీడపురుగులు మాంచి మాంచి స్టార్ కాస్ట్ వున్న సినిమాలని సైతం ఎలా దొలిచేసి డొల్లగా మారుస్తున్నాయో ఆయా సినిమాలు విడుదలైనప్పుడల్లా చెప్పుకుంటూ వచ్చాం. కానీ విరుగుడుకి స్ట్రక్చర్ నే ఆశ్రయించాం. ఇలాటి చీడ పట్టిన స్క్రిప్టుల్లో స్ట్రక్చర్ ప్రకారం కథ ఏకశిలా సదృశంగా వుండాల్సిందేనని నివారణ చెప్పుకున్నాం. ఐతే ప్రతీ చీడకీ స్ట్రక్చర్ తోనే చికిత్స వుండక్కర్లేదని దొంగరాముడు చెప్తోంది. శాశ్వతమైన స్ట్రక్చర్ లోపల చలనశీలమైన కథనంతో పాల్పడే క్రియేటివిటీలు అనేకం. ఈ క్రియేటివిటీలు వికటించడం వల్లే చీడలు పట్టి పల్లారుస్తున్నాయి. క్రియేటివిటీలు వికటించకుండా వుండాలంటే ముందు స్ట్రక్చర్ తెలిసి వుండాలి. దురదృష్టవశాత్తూ ఈ శతాబ్దం అరంభంనుంచీ - అంటే 2000 నుంచీ వస్తున్నఅత్యధిక శాతం మంది దర్శకులు / రచయితలు స్ట్రక్చరాశ్యులు కాలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళ కేవల క్రియేటివిటీలు వికటాట్ట హాసం చేస్తూ ఫ్లాపుల బాట పడుతున్నాయి. దొంగరాముడు స్ట్రక్చర్ లో వుంటూనే  క్రియేటివ్ విన్యాసాలు విభిన్నంగా చేస్తోంది. అందువల్ల స్ట్రక్చర్ సహిత క్రియేటివ్ విన్యాసాల్లో కూడా చీడపీడలకి నివారణోపాయాలు కన్పిస్తున్నాయి. ఇవేమిటో తర్వాత చూద్దాం. ముందు మిడిల్ - 2 ఎలా వుందో పరిశీలిద్దాం...

         
 వ్యాసంలో వివరించుకున్న  మిడిల్ -1 ముగింపులో,  మళ్ళీ దొంగరాముడు చట్టానికి దొరికిపోయే విషాదాన్ని చూశాం. ఇప్పుడు మిడిల్ – 2, అంటే ఇంటర్వెల్ తర్వాత కథ కొస్తే, ఈ విషాదాన్ని ఏకరువు పెట్టే పాటతో మొదలవుతుంది. దొంగరాముడు జైల్లో వుంటాడు, చెల్లెలు లక్ష్మి అనాధాశ్రమం నుంచి సర్దుకుని వెళ్ళిపోతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసి విఫలమవుతుంది. వాహనం కోసం రోడ్డు మీద నిలబడి ఎదురు చూస్తూంటే, వేశ్య అనుకుని ఒకడు బేరమాడబోతాడు. పరుగెత్తుకుని పోయి వర్షంలో షెడ్డు కింద నిలబడితే, వీధి రౌడీ బాబుల్ గాడు కన్నేస్తాడు.

          బాబుల్ గాడు బలవంతం చేస్తూంటే, సీత వచ్చి కాపాడి లక్ష్మిని తనింటికి తీసి కెళ్తుంది. లక్ష్మికి జ్వరం పట్టుకుంటే వెళ్లి డాక్టర్ మోహన్రావుని (జగ్గయ్య ఎంట్రీ) తీసుకొచ్చి చూపిస్తుంది. అటు జైల్లో వున్న రాముడుకి లక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్టు కలొచ్చి వణికిపోతాడు. ఇటు సీత, లక్ష్మీ వెళ్లి డాక్టర్ మోహన్రావుని కలుస్తారు. మోహన్రావుకి జబ్బుతో తీసుకుంటున్న తల్లి వుంటుంది, భార్య చనిపోయిన లాయర్ అన్న వుంటాడు, అతడి చిన్న పిల్ల లిద్దరుంటారు. మోహన్రావు తల్లికి చికిత్స చేస్తూంటే, లక్ష్మి చొరవ తీసుకుని సపర్యలు చేస్తూంటుంది. అమ్మకి తగ్గేదాకా ఇక్కడే వుంటానని మోహన్రావుకి  చెప్తుంది. 

         వంటింట్లో తిన్నది అరక్క వంటవాడు, డ్రైవర్ కొట్టుకు చస్తూంటే మోహన్రావు అన్న వాళ్లిద్దర్నీ వెళ్లగొట్టేస్తాడు. దీంతో వంట బాధ్యత లక్ష్మి తీసుకుంటుంది. పిల్లల్ని తయారు చేసి స్కూలుకి పంపుతుంది. ఇలా రోజులు గడుస్తూండగా, ఒక రోజు మోహన్రావు ఫోటో ముందు లక్ష్మి పూలు పెడుతూంటే, వచ్చి చూసి సరస సంభాషణ చేస్తాడు మోహన్రావు. ఆమె తలలో పువ్వు పెడతాడు. 

          జైలు నుంచి రాముడు విడుదలవుతాడు. అతను అనాధాశ్రమానికి వెళ్తే ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్తాడు వాచ్ మన్. ఇక చచ్చి పోయిందని నమ్మేసి సీత ఇంటికెళ్తాడు. పోపో, నీతో మాట్లాడను - అనేస్తుంది సీత. చేసిన తప్పులకి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చానని అంటాడు. తన తప్పుల ఫలితంగా లక్ష్మి ఆత్మహత్య చేసుకుందనీ, తనే పొట్టనబెట్టుకున్నాననీ అంటాడు – నన్ను నమ్ముకున్నోళ్ళందరి గొంతులు కోయమని దేవుడు నా మొహాన రాసి పెట్టాడు, ఈ పాపిష్టి వాడి నీడ తగిల్తే పచ్చి గడ్డి కూడా భగ్గుమంటుంది – అని వాపోతాడు. చెల్లెలి కోసం ఏ పరిస్థితుల్లో ఆనాడు రాంబాబులా నటించి మోసం చేయాల్సి
వచ్చిందో చెప్పేసి వెళ్లిపోతూంటాడు. సీత ఆపుతుంది. 

         
ఇటు వడ్డీ వ్యాపారి భద్రయ్యకి డాక్టర్ మోహన్రావుని అల్లుడిగా చేసుకోవాలనుంటుంది. ఈ విషయమే వచ్చి మోహన్రావు అన్న దగ్గర కదుపుతాడు. లక్ష కట్నం అడుగుతాడు మోహన్రావు అన్న. కళ్ళు తేలేస్తాడు భద్రయ్య. రాముడు రోడ్డు మీద నడుచుకుంటూ పోతూంటే, కారు పంక్చరై నిలబడి వుంటాడు మోహన్రావు. రాముడు టైరు మార్చేసి మోహన్రావుని  కార్లో కూర్చోబెట్టుకుని నడుపుకుంటూ ఇంటికి చేరేస్తాడు. అక్కడే కారు డ్రైవర్ గా జాయినై పోతాడు.

          మోహన్రావు అన్న భద్రయ్య తెచ్చిన సంబంధం గురించి మోహన్రావుకి చెప్తాడు. మోహన్రావు లక్ష్మినే  చేసుకుంటానంటాడు. దాంతో అన్నతో తేడా వస్తుంది. తల్లి వచ్చి లక్ష్మి మంచిదని మోహన్రావునే సమర్ధిస్తుంది. లక్ష్మి పిల్లల్ని స్కూలుకి తయారుచేస్తూ పాట పాడుతూంటే, బయట రాముడు విని గొంతు గుర్తు పడతాడు. లక్ష్మి చనిపోలేదనీ, ఇక్కడే వుందనీ తెలుసుకుని ఆనందిస్తాడు. 

      ఇంతలో పిల్లాడు సోఫా ఎక్కితే సోఫా మీదున్న వాచీ జారి అటు కింద పడిపోతుంది. లక్ష్మి పిల్లలతో బయటికి వచ్చి కారు దగ్గరున్న రాముణ్ణి చూసి మాటరాక నిలబడి పోతుంది. ఆమెనీ పిల్లల్నీ తీసుకుని కారులో స్కూలుకి బయల్దేరతాడు. స్కూలు దగ్గర ఆమెకి చెప్తాడు – తాము అన్నా చెల్లెళ్ళన్న సంగతి ఇంట్లో తెలియ నివ్వద్దని, ఇప్పుడే తను వెళ్లిపోతాననీ. మోహన్రావు దగ్గరి కెళ్ళి ఉద్యోగం మానేస్తానంటాడు. ఇంతలో వాచీ కనపడక మోహన్రావు అన్న కంగారుపడుతూంటాడు. అప్పుడే భద్రయ్య వచ్చి రాముణ్ణి చూసి చిందులేస్తాడు. తనింట్లో దొంగతనం చేసి జైలు కెళ్ళింది వీడేనని చెప్పేస్తాడు. వాచీ దొంగతనం రాముడి మీద పడుతుంది. మోహన్రావు అన్న పోలీసుల్ని పిలవమంటాడు. మోహన్రావు ఆపి, ఇందుకేనా ఉద్యోగం మానేస్తానన్నావని రాముణ్ణి వెళ్ళగొట్టేస్తాడు. లక్ష్మి ఏమీ చేయలేక తల్లడిల్లుతుంది. 

          రాముడు వెళ్ళిపోయి బాబుల్ గాడి గానా బజానాలో కూర్చుంటాడు. సరైన చోటుకే వచ్చావనీ, తన ముఠాలో చేరిపొమ్మనీ అంటాడు బాబుల్ గాడు. ఇది సీత చూస్తుంది. అవతల లక్ష్మితో మోహన్రావు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు. లక్ష్మికి మంచి నగ కొనివ్వాలనుకుంటాడు రాముడు. సీతతో షాపు కెళ్తాడు. వంద రూపాయల నగ కొనాలంటే చాలా కష్టపడాలని, రకరకాల పనులు చేసి ఆ వందా సంపాదించి నగ కొంటాడు. 

          గుడి దగ్గర భద్రయ్య సీతతో రాముడి చెల్లెలు లక్ష్మిని చూసి అర్ధమైపోయి, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానని ఒంటి కాలిమీద లేస్తాడు. సీత వచ్చి రాముడికి ఈ సంగతి చెప్తుంది. రాముడు కత్తి తీసుకుని బయల్దేరుతాడు. లక్ష్మి గురించి నోరు విప్పితే పొడిచి పారేస్తానని భద్రయ్యని హెచ్చరిస్తాడు. చెల్లెలి పెళ్ళయేదాకా యిల్లు కదలకుండా ఇక్కడే కాపలా వుంటానంటాడు. భద్రయ్య కిక్కురుమనకుండా పడుంటాడు. 

          రాత్రి వరకూ కాపలా కాసిన రాముడికి, లక్ష్మికి నగ ఇవ్వాలన్న విషయం గుర్తుకొస్తుంది. భద్రయ్య ఇంటి ముందు తనలాగే కన్పించే దిష్టి బొమ్మ పెట్టి వెళ్తాడు. పెళ్ళిలో రహస్యంగా లక్ష్మికి నగ పెట్టి దీవిస్తాడు. భద్రయ్య వుండబట్టలేక బయటికి వచ్చి, దిష్టి బొమ్మని రాముడే అనుకుని బ్యారుమని ఇంట్లో కెళ్ళి పడుకుంటాడు. అటు పెళ్ళిలో రాముడు షేర్వానీ, చుడీదార్ వేసుకుని జడ్జిలా నటిస్తూ వచ్చి, గతంలో తనని పట్టుకున్న పోలీసు అధికారి పక్కనే కూర్చుంటాడు. పెళ్లి పీటల మీద లక్ష్మి ఇది చూసి ఆనందిస్తుంది. 

          అటు భద్రయ్య మళ్ళీ వుండబట్టలేక బయటికొచ్చి, అప్పుడది దిష్టి బొమ్మని తెలుసుకుని చీల్చి చెండాడుతూంటే, వెనుక నుంచి బాబుల్ గాడు ఇంట్లోకి దూరుతాడు. దర్జాగా ఇనప్పెట్టె ఖాళీ చేస్తూంటే వచ్చేసి మీద పడతాడు భద్రయ్య. ఆ పెనుగులాటలో భద్రయ్య వీపులో బాబుల్ గాడి కత్తి కసిక్కున దిగుతుంది. 

          ఇక కొనప్రాణాలతో వున్న భద్రయ్య తనని పొడిచింది రాముడేనని చెప్పి చనిపోతాడు. అదే సమయంలో మళ్ళీ కాపలా కొచ్చిన రాముడు, ఇది చూసి పారిపోతూంటే పోలీసులు వెంటాడి పట్టుకుంటారు. రాముడి మీద భద్రయ్య హత్య కేసు పెట్టి అరెస్టు చే స్తారు.
***
        ఇదీ మిడిల్ – 2 లో విషయం, దాని కథనం. మిడిల్ -2 ఇంటర్వెల్ తర్వాత సాగే మిడిల్ విభాగపు మలి కథనమేనని తెలిసిందే. ఇప్పుడు చూస్తే, బిగినింగ్ విభాగపు ముగింపులో  చిన్నరాముడు దొంగగా బాల నేరస్థుల కేంద్రాని కెళ్ళడాన్ని చూశాం. దీని తర్వాత మిడిల్ -1 ముగింపు చూస్తే, పెద్ద రాముడు మళ్ళీ దొంగగా జైలుకెళ్లడాన్ని చూశాం. ఇప్పుడు మిడిల్ – 2 కి ముగింపుగా కూడా రాముడు హత్య కేసులో అరెస్టవడాన్నే  చూస్తున్నాం. 

          స్ట్రక్చర్ పరంగా ఇవి మొదటిది ప్లాట్ పాయింట్ -1 గా, రెండోది మిడ్ పాయింట్ (ఇంటర్వెల్) గా, మూడోది ప్లాట్ పాయింట్ – 2 గా ఏర్పాటవడాన్ని గమనించ వచ్చు. ఒకే రకమైన మలుపులతో మూడు మూలస్థంభాలు. ఇవి రిపిటీషన్ గానే అన్పిస్తాయి. మూడు సార్లు కథ అరెస్టవడం దగ్గరే ముగింపుకొచ్చి, మళ్ళీ కొత్తగా మొదలవుతున్నట్టే వుంటుంది. దీంతో ఇవి మూడు క్లయిమాక్సులన్న పేరు కూడా వచ్చింది. మూడు కాదు, నాల్గు క్లయిమాక్సులున్నాయి, తర్వాత వచ్చే అసలు ముగింపుతో కలుపుకుంటే. ఐతే ఇవి అలాటి కథాపరమైన క్లయిమాక్సులేనా? కాదు. ఇవి నిజానికి అంకాల (యాక్ట్స్)పరమైన క్లయిమాక్సులు. మొదటి అంకం బిగినింగ్, రెండో అంకం మిడిల్, మూడో అంకం వచ్చేసి ఎండ్ గా చెప్పుకున్నప్పుడు  – ఇవి అంకాల పరమైన క్లయిమాక్సులే అవుతాయి తప్ప, కథాపరమైన క్లయిమాక్సులు కావు. కథాపరమైన క్లయిమాక్సు లెలా వుంటాయో తర్వాత చూద్దాం. అంటే మొదటి అంకానికి ప్లాట్ పాయింట్ -1 క్లయిమాక్స్ అనీ, రెండో అంకానికి ప్లాట్ పాయింట్ -2 క్లయిమాక్స్ అనీ,  అలాగే మూడో అంకానికి ముగింపు క్లయిమాక్స్ అనీ టెక్నికల్ గా చెప్తారు. వాడుకలో ప్లాట్ పాయింట్స్ అనే మాట్లాడుకుంటారు. 

          ఉదాహరణ చెప్పుకుంటే ‘శివ’ బిగినింగ్ కథనం సాగి సాగి, నాగార్జున సైకిల్ చైనుతో జేడీని కొట్టడంతో క్లయిమాక్స్ కి వస్తుంది. ఇది బిగినింగ్ కి క్లయిమాక్స్, అంటే ప్లాట్ పాయింట్ -1. అదన్న మాట. ఇలాగే దొంగరాముడులో చిన్న రాముడు రెండ్రూపాయలు కొట్టేసి బాలనేరస్థుల కేంద్రంలో పడ్డం ఆ బిగినింగ్ విభాగపు క్లయిమాక్స్. తర్వాత పెద్ద రాముడు చెల్లెలి కోసం దొంగతనం చేసి జైలుకెళ్ళడం మిడిల్ -1 క్లయిమాక్స్, అలాగే చేయని హత్యకి రాముడు అరెస్టవడం మిడిల్ – 2 క్లయిమాక్స్ అయ్యాయి. కాబట్టి ఇవి విడివిడి కథలు, వాటి విడివిడి క్లయిమాక్సులూ కావు. కథ ఒక్కటే వుంది, చెల్లెలి కోసం తాపత్రయం గురించి. ఇదే పాయింటు అంకాల్లో ఎడతెగకుండా ప్రవహిస్తోంది. ఎత్తుకున్న పాయింటు అంకాల్లో ఎడతెగకుండా ప్రవహిస్తూంటే అది కథాపరమైన పాయింటు అవుతుంది. ఈ కథాపరమైన పాయింటు అంకాల పరంగా చిన్నచిన్న క్లయిమాక్సులు ఏర్పాటు చేసుకుంటూ సాగుతుంది. చిట్టచివరికి మొత్తం కాన్సెప్ట్ కీ ముగింపుగా గ్రాండ్ షోడవున్ గా శుభం వేస్తుంది. ఈ శుభంకల్లా కాన్సెప్ట్ లో వుండే కథనపరమైనవే గాక, పాత్ర చిత్రణ పరమైన అన్ని సెటప్స్ కొలిక్కి వస్తూ పేఆఫ్ అయిపోతాయి. ఇదీ అంకాల పరమైన, కథాపరమైన క్లయిమాక్సుల సంగతి. 

         అయితే  దొంగరాముడు కథలో అంకాల పరమైన మూడు క్లయిమాక్సులు ఒకేలా వున్నా, అవి తీవ్రత పెంచుకుంటూ వున్నాయి. ముందు చిన్న రాముడుగా చిన్న దొంగతనం చేసి బాల కేంద్రానికే వెళ్ళాడు, తర్వాత పెద్ద దొంగతనంతో నేరం పెరిగి జైలుకెళ్ళాడు, ఆతర్వాత చేయని హత్య కేసులో నేరం ఇంకా పెరిగి అరెస్టయాడు. ఈ తీవ్రతల స్థాయులు క్యారెక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) ని ఏర్పరుస్తున్నాయి. అంటే ఈ క్లయిమాక్సులు పాత్ర చిత్రణకీ పనికొచ్చాయి. అలాటిలాటి పాత్ర చిత్రణా కాదు, పరివర్తనే ధ్యేయంగా సాగే పాత్రచిత్రణ. ఇలాకాక, జడప్రాయమైన పాత్రగా వుండిపోతే, ఎన్ని అంకాల క్లయిమా క్సులున్నా పాత్రలో మార్పు రాదు. క్యారెక్టర్ ఆర్క్ ని ఏర్పర్చదు. ఇప్పటి సినిమాల్లో లాగా, ఆవారా హీరో పాత్ర వుందనుకుందాం. ఈ పాత్ర నేరాలు చేసి పదేపదే అరెస్టయ్యే మలుపులెన్ని వస్తున్నా, ఏ మలుపూ ఆ పాత్ర ఉన్నతీకరణకి దోహదం చేయకపోతే సినిమా ఎలా వుంటుందో, ఈ ఉత్తుత్తి క్లయిమాక్సులు చూస్తూ కూర్చున్న ప్రేక్షకుల మానసికారోగ్య మెలా వుంటుందో వూహించుకోవచ్చు. ఇవి పాత్రని వదిలేసిన క్లయిమాక్సులు. ఎలాగూ మన హీరోల పాత్రలు ఆవారా అనాధ పాత్రలే కదా. 
***
       ఇలాకాక దొంగరాముడులో పాత్రని అంటి పెట్టుకునే అంక క్లయిమాక్సులు కన్పిస్తాయి. ఇందుకే ప్రతీ క్లయిమాక్సూ అక్కడితో కథని తెంపెయ్యకుండా కొత్తాసక్తిని రేపుతోంది. ఇదంతా చేయి తిరిగిన క్రియేటివ్ స్పర్శ. స్ట్రక్చర్ తోనే. ఈ స్ట్రక్చర్ సహిత క్రియేటివ్ అభివ్యక్తితో ఇప్పుడే జానర్ కథైనా చేసుకోవచ్చు. స్ట్రక్చర్ ని పట్టించుకుంటేనే. స్ట్రక్చర్ మాత్రమే  సినిమాకి వ్యాపారాన్నిస్తుంది, మిగతా క్రియేటివిటీలన్నీ స్ట్రక్చర్ కి చేసే షోకులే.

       ఇప్పుడు ఈ వ్యాసం మొదట్లో చెప్పుకున్న స్క్రీన్ ప్లేకి పట్టే చీడల విషయానికొద్దాం. ఇవి చీడలని తెలియక సినిమాలు తీస్తే ఫ్లాపవుతున్నాయి. 2000 నుంచీ ముందు ఓ మూడు చీడలు పుట్టుకొచ్చాయి – మిడిల్ మటాషులు, ఎండ్ సస్పెన్సులు, పాసివ్ పాత్రలూ. తర్వాత ఇంకొన్ని కొత్త చీడలు వచ్చి చేరాయి : మిడ్ ఫ్రాక్చర్లు, సెకెండాఫ్ సిండ్రోములు, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్కులు. ఉన్న వైరస్ లకి తోడు ఎబోలా, హంటా, జికా అంటూ కొత్తకొత్త వైరసులు సెలబ్రిటీలైనట్టు.

          కానీ దొంగరాముడులో రిపీటయ్యే అవే అంక క్లయిమాక్సులతో ఎంత కథ నడిపినా, 1. ఇంటర్వెల్లో కథ తెగి స్క్రీన్ ప్లే మిడ్ ఫ్రాక్చర్ కాలేదు, 2. ఇంటర్వెల్ కల్లా కథ ముగిసిపోయి సెకండాఫ్ సిండ్రోమ్ ఏర్పడలేదు, 3. అంకాలు వేటికవి విడివిడి మినీ కథలై స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బారిన పడలేదు. అసలీ మూడు చీడలేమిటో, ఎలా గుర్తుపట్టాలో ఈ కింద చూద్దాం...
***
       ఒక సినిమా ఏదో ఒక చీడ పట్టి వుంటుంది. రెండు మూడు చీడలు పట్టి భయపెట్టడం చాలా అరుదు. మిడ్ ఫ్రాక్చర్ కి రభస, జ్యోతి లక్ష్మి, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి కొన్నిటిని, సెకెండాఫ్ సిండ్రోమ్ కి ఊసరవెల్లి, అశోక్, బ్రహ్మోత్సవం లాంటి కొన్నిటిని, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ కి ఆటోనగర్ సూర్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సిటిజన్ లాంటి కొన్నిటినీ చెప్పుకోవచ్చు. అయితే రికార్డులన్నీ బద్దలు కొడుతూ ఈ మూడు చీడలూ పట్టింది ఒకటుంది – అదే ‘సైజ్ జీరో’ అనే కొవ్వెక్కిన స్క్రీన్ ప్లే. 

          స్పెషల్ బాడీతో అనూష్కా నటించిన ‘సైజ్ జీరో’ చీడ పీడలకి మంచి నిలవనీడ. దీని సృష్టికర్తలకి చేతులెత్తి నమస్కరించాలి. ఇందులో హీరోయిన్ అనూష్కా సమస్య లావు తగ్గాలని. ఎలా తగ్గుతుంది, మిడ్ ఫ్రాక్చర్, సెకెండాఫ్ సిండ్రోమ్, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్కుటమారాలతో స్క్రిప్టే కొవ్వెక్కిపోతే? కొవ్వెక్కిన స్క్రిప్టు బాక్సీఫీసు దివ్వెల్ని వెలిగిస్తుందా? మార్నింగ్ షోకే కొవ్వు చూసి కెవ్వుమన్నారు ప్రేక్షకులు. ఆఖరికి సినిమా ముగింపులో అనూష్కా కూడా కొవ్వు తగ్గని అదే సైజుతో పహిల్వాన్ లా మిగిలింది!  చీడలంటించుకున్నాక స్క్రిప్టుకి చీరలు బావుండవు. 

          ఇందులో మిడ్ ఫ్రాక్చర్ ఇలా వుంటుంది :
లావు తగ్గాలని ఇంటర్వెల్ దగ్గర ప్లాట్ పాయింట్ -1 తో వేసే గోల్ అక్కడితోనే ఆగిపోతుంది. సెకండాఫ్ ప్రారంభం కాగానే వేరే కథ మొదలెడతారు. అంటే ఫస్టాఫ్ లో ఎత్తుకున్న కథా దాని పాయింటూ సఫా. ఇక రెండో సినిమా షురూ. 

         
సెకెండాఫ్ సిండ్రోమ్ ఇలా వుంటుంది : ఇంటర్వెల్లో ప్లాట్ పాయింట్ -1 వేసి లావు తగ్గే పాయింటు వేశాక, దాన్నెలా కొనసాగించాలో తెలీనట్టు, ఇంటర్వెల్ తర్వాత దాన్నొదిలేసి,  క్లినిక్ అక్రమాల పాయింటు నెత్తుకుంటారు. ఇంటి దగ్గర తల్లిగారు పెళ్లి కోసం లావు తగ్గమంటే, ఆ తల్లీనీ పెళ్ళీనీ వదిలేసి క్లినిక్ అక్రమాలంటూ వూరు మీద పడేశారు. ఉన్న పాయింటుతో సెకెండాఫ్ ఏం చేయాలో తెలీక, వేరే పాయింటుతో ప్లేటు ఫిరాయిస్తే, ఇలా సెకెండాఫ్ సిండ్రోమ్ లో- సుడిగుండంలో పడుతుంది సినిమా. 

         
ఇక స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ఇలా వుంటుంది : సెకెండాఫ్ లో క్లినిక్ మీద పోరాటంతో మొదలెట్టి,  ఫ్రెండ్ కోసం ఫండ్ రైజింగ్ ఎపిసోడుగా, ప్రజలకి అవగాహన కోసం స్పోర్ట్స్ ఈవెంట్ ఎపిసోడుగా ... ఇలా తోచిన పాయింటల్లా ఎత్తుకుంటూ ఎపిసోడ్లమయంగా చెప్పుకుంటూ పోయి, డాక్యుమెంటరీలకి పనికొచ్చే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బారిన పడేశారు. ఒకటేదో సమస్యని  ఎత్తుకోవడం, దాన్ని పరిష్కరించడం, ముగించడం; మళ్ళీ ఇంకో సమస్యేదో ఎత్తుకోవడం, దాన్ని పరిష్కరించడం, ముగించడం... ఇలా కొన్ని ఎపిసోడ్లుగా చూపించడానికి - సినిమా మినీ కథల సంపుటి కాదు. ఒకే పెద్ద కథ. దానికొకటే పాయింటు. దాంతోనే సంఘర్షణా, దానికే పరిష్కారమూ.
  ***
           దొంగరాముడు ఒకే తానుగా వున్న కథ మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తున్నా, ఎపిసోడిక్ కథనం బారిన పడలేదు. ఇంటర్వెల్లో కథ తెగి మిడ్ ఫ్రాక్చర్ అవలేదు. ఇంటర్వెల్ తర్వాత ఉన్న పాయింటుని వదిలేసి ఇంకో పాయింటునెత్తుకుని సెకండాఫ్ సిండ్రోంలోకి జారుకోలేదు.  ఏమిటి కారణం? కారణమేమిటంటే ఒకే కథ, ఆ కథ చివరంటా అన్ని అంకాల్లో అంతర్లీనంగా కొనసాగుతున్న ఒకే పాయింటు - చెల్లెలి కోసం తాపత్రయం. పాయింటు తెగకపోతే ఏదీ తెగదు. ఇంతకంటే మూలసూత్రం లేదు దొంగ రాముడులో. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ మూడు చీడలకి అతీతంగా వుంటాయి రాసుకునే కథలు.  
                                                   
             ఇక దొంగరాముడు మిడిల్ - 2 ని పరిశీలిస్తే,  మిడిల్ - 1 లో చూసిన యాక్షన్ రియాక్షన్లతో కూడిన డైనమిక్సే కొనసాగుతాయి. ఈసారి డైనమిక్స్ సంక్షోభాన్ని- సంఘర్షణనీ పెంచుతూ ప్లాట్ పాయింట్ - 2 కేసి సాగుతాయి. ఇదంతా ఈ వ్యాస ప్రారంభంలో రెండో పేరా నుంచీ వున్న కథా సంగ్రహంలో స్టెప్ బై స్టెప్ కనిపెట్టొచ్చు. డైనమిక్స్ ఎలా వుంటాయో గత వ్యాసంలో మిడిల్ -1 కథా సంగ్రహం ఆధారంగా చెప్పుకున్నాం. ఆ విధానాన్నే ఇక్కడ అప్లయి చేసి చూస్తే అర్ధమైపోతుంది. పాత్రగా దొంగరాముడి డైనమిక్స్ కి పరాకాష్ఠ - పెళ్ళిలో జడ్జి వేషంలో రావడం! దొంగ పోలీసుగా కాదు, జడ్జిగా రావడం! జడ్జిగా వచ్చి గతంలో తనని పట్టుకున్న పోలీసు పక్కనే కూర్చోవడం! ఇలాటి ఎక్స్ ట్రీం ద్వంద్వాలే సీన్లని హుషారెక్కిస్తాయి. ఎలా వచ్చాడు? పెళ్ళికి జడ్జిని పిలిచివుంటే, ఆ జడ్జిని పిలిచిన మోహన్రావు అన్న, ఒక లాయర్ గా ఇతను జడ్జి కాదే అనుకోడా? ఇలాటి  ప్రశ్నలు అబ్సర్డ్  కామెడీకి చెల్లవు. అబ్సర్డ్ – అసంబద్ధ కామెడీ ఇలాగే వుంటుంది. అయితే దీనికి మూలంలో లాజిక్ వుండాలి. లేకపోతే అబ్సర్డ్ కామెడీ విఫలమవుతుంది. రాముడుకి దొంగోడనే ముద్ర లాజికల్ గా వుంది. ఈ మూలంలోంచి అతను ఎక్స్ ట్రీం కెళ్ళి జడ్జిగా సీనుని ఆపరేట్ చేశాడు. దొంగోడు కాకుండా మంచోడై వుంటే సీనుకి అర్ధముండదు. మూలంలో లాజిక్ వుంటే ఎంత అసంబద్ధ కామెడీనైనా లాగించెయ్యొచ్చని అరిస్టాటిల్ చెప్పాడు. అప్పుడు  ‘పట్నంలో జడ్జి ఎవరో ఎవరికీ తెలీదా’ అన్న లాజిక్ ని వదిలేస్తారు ప్రేక్షకులు. ఒకటి వదిలేయాలంటే ఇంకోదాంతో కాంపెన్సేట్ చేయాలి. 

       కొన్ని సినిమాల్లో అకస్మాత్తుగా పాత్రలు మాయమవుతూంటాయి. ఆ మధ్య ఒక సినిమాలోంచి హీరోయిన్ వెళ్ళిపోతే డూప్ ని పెట్టి అన్నీ వెనుకనుంచి షాట్లే తీశారు. మరి సూర్యకాంతంతో ఏమయ్యిందో ఆమె ధరించిన భద్రయ్య భార్య పాత్ర సడెన్ గా అదృశ్యమైపోతుంది. రాముడు కత్తితో భద్రయ్యని హెచ్చరిస్తున్నప్పుడు లోపలినుంచి ఆమె వాయిస్ విన్పిస్తుంది. ఏదో సర్ది చెప్పేస్తాడు భద్రయ్య, ఆ తర్వాత బాబుల్ గాడొచ్చి దాడి చేస్తున్నప్పుడూ, భద్రయ్య చనిపోయి పోలీసులొచ్చినప్పుడూ, ఇంకా తర్వాతెక్కడా ఆమె కన్పించదు కూతురూ కొడుకు సహా! ఇది లాజిక్ కి అడ్డం పడేదే. 

          1940 లలో ప్రారంభమైన హాలీవుడ్ ఫిలిం నోయర్ జానర్ డిటెక్టివ్ సినిమాల్లో ఒక సీనుని దాని తర్వాతి సీనుతో లింక్ చేస్తూ గమ్మతైన షాట్లేస్తారు. దీంతో అది మొదటి సీను తాలూకు ఇంకో షాట్ అనుకునే ప్రేక్షకులు కాస్తా, రెండో సీను చూసి ఫూల్స్ అవుతారు.  దొంగరాముడులో ఇలాగే ఒకచోట వుంది. డాక్టర్ మోహన్రావ్ డ్రైవర్ గా కొత్తగా చేరిన రాముడు, కారు తుడుస్తూంటే పనివాడు వచ్చి తొంగి చూస్తాడు. ఈ పనివాడు రాముణ్ణి దొంగరాముడుగా గుర్తు పట్టేశాడన్పించి - దీని పరిణామాల గురించి ఇంకెటో పోతుంది మన మైండ్. అంతలో ఈ సీను కట్ అయి ఇంకో సీను వస్తుంది. ఇక్కడ ఇంట్లో పెళ్లి మాటలు మాట్లాడుకుంటూ వుంటారు. అప్పుడు మళ్ళీ పనివాడు తొంగి చూస్తున్న షాట్ పడుతుంది. అప్పుడర్ధమవుతుంది మనమెంత ఫూలయ్యామో. పనివాడు తొంగి చూస్తోంది ఇంట్లోకన్న మాట, బయట రాముణ్ణి కాదు! ఇది ప్రేక్షకుల్నికంగారు పెట్టే డైనమిక్స్. జస్ట్ క్రియేటివ్ ఎగ్జీబరెన్స్! 



          రూపాయి రూపాయీ కూడేసి సినిమా తీస్తే ప్రేక్షకులు అచేతనంగా కూర్చుండిపోయి సినిమా చూడడం కాకుండా, క్షణంక్షణం స్పందిస్తూ బిజీగా చూసేలా చేయకపోతే – ఆ క్షణ క్షణానికీ పెట్టే ప్రతీ రూపాయీ దండగైనట్టే. పెట్టుబడికి పెట్టే ప్రతీ రూపాయీ ప్రేక్షకుల అటెన్షన్ ని వసూలు చేయాలి, ప్రేక్షకులు పైసా వసూల్ అనుకునే సంగతి తర్వాత! ఇంకో చోట – మళ్ళీ ఫిలిం నోయర్ సినిమాల్లో లాగే – నడుస్తున్నసీను దేనికి దారితీస్తుందో సూచనలిచ్చే బ్యాక్ గ్రౌండ్ విశేషముంటుంది. రాముడు చలాకీగా నడుచుకుంటూ వస్తూంటాడు. కారు టైరు పంక్చరై మోహన్రావు నిలబడి వుంటాడు. ఈ సీనులో ఏం జరుగుతుందో పైన మిడిల్ - 2 కథా సంగ్రహంలో చెప్పుకున్నాం. ఇది రాముడు, మోహన్రావు పరస్పరం పరిచయమయ్యే సీను. ఈ పరిచయం తర్వాత వీళ్ళ సంబంధం ఎలా వుండబోతోందో సంకేతాలిస్తూ వెనుక ఒక దృశ్యం కన్పిస్తుంది. ముందుగా వీళ్లిద్దరున్న ఫ్రేములో చెరో పక్క రెండు వృక్షాలుంటాయి. ఇప్పుడేగా వీళ్ళిద్దరూ పరిచయమయ్యారు, అందుకే ఇలా విడివిడిగా వృక్షాలు. ఈ ఫ్రేము నుంచి అవతలికి మన దృష్టి సారిస్తే, దూరంగా ఒకే చోట రెండు తాటి చెట్లుంటాయి : ఒకటి పొడవైనది, ఇంకోటి పొట్టిది. బ్యాక్ గ్రౌండ్ లో ఇంకేమీ వుండదు ఆకాశం తప్ప. అంటే వీళ్ళిద్దరూ యజమానీ పనివాడుగా ఒకటవుతారన్నమాట!

          కథనమంటే కార్యాకారణ (కాజ్ అండ్ ఎఫెక్ట్) సంఘటనల సమాహారమే కాబట్టీ- అందునా మిడ్ పాయింట్ సహా ప్లాట్ పాయింట్స్ రెండూ సంఘటనలతో కథని మలుపు తిప్పే థ్రిల్లింగ్ విజువల్ నేరేషన్ తో వుండాలి కాబట్టీ – దొంగరాముడు ఈ మూడు ఘట్టాలనీ థ్రిల్లింగ్ సంఘటనలతోనే చూపించారు. ప్లాట్ పాయింట్ -1 లో బాల రాముడు దొంగతనం చేసి పోలీసులకి దొరికిపోయే ఛేజింగ్ సీను, మిడ్ పాయింట్ లో రాముడు రాంబాబుగా నటించి పోలీసులకి దొరికిపోయే సస్పెన్స్ సీను, తర్వాత ఇప్పుడు ప్లాట్ పాయింట్ -2 లో, హత్యకేసులో మళ్ళీ పోలీసులతో ఛేజింగ్ సీను. ఆ మూడూ విజువల్ గా వున్నాయి. మాటలతో వెర్బల్ గా వుంటే మిగతా సీన్లకీ ఈ కీలక సీన్లకీ తేడా వుండక గంపగుత్త బేరంలా వుంటాయి. మాంచి చెత్తబుట్ట సినిమాని ఉత్పత్తి చేస్తాయి. ఈ మూడు కీలక సీన్లూ థ్రిల్లింగ్ సంఘటనలతో విజువల్ గా ప్రేక్షకుల మనస్సుల్లో ముద్రించుకోవాల్సిందే. సినిమాల్లో చూపిస్తున్నట్టు, ప్రేమికులు కేవలం మాటామాటా అనుకుని విడి పోవడం - విజువల్ మీడియా అయిన సినిమా ప్లాట్ పాయింట్ కాదు. దాన్ని నవలగా రాసుకుని అచ్చేసుకుని, పడక్కుర్చీలో మేనువాల్చి చక్కగా చదువుకుని ఆనందించ వచ్చు. భూతద్దం పెట్టి రకరకాల సైజుల్లో మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు – సినిమాల వైపు మాత్రం రాకుండా. 

          ప్లాట్ పాయింట్ - 2 అనేది కథ నడిపే పాత్ర అధఃపాతాళంలోకి జారిపోయే ఘట్టం కాబట్టి, రాముడి జీవితం పరాకాష్ఠకెళ్ళి హత్య కేసుతో పూర్తిగా సర్వనాశనమయ్యాడు. ఇక ఇందులోంచి ఫీనిక్స్ పక్షిలా పైకి లేవడం ఎండ్ విభాగానికి బదిలీ అయ్యే బిజినెస్.

***
           ఎండ్ విభాగం బిజినెస్ – సీత గబగబా వస్తూంటే బాబుల్ గాడు పూటుగా తాగి, జోరుగా డబ్బులు ఖర్చు పెడుతూ కనపడతాడు. వీడికింత డబ్బెక్కడిదా అని చూసి, వీడి సంగతి చూడాలని తన హొయలతో ట్రాప్ చేసి వాడింటికి తీసికెళ్తుంది. రావోయి మా ఇంటికీ పాటేసుకుని, వాడికి అర కోడి కూర తినిపించకుండానే ఉతికి ఆరేస్తుంది. వాడు భద్రయ్యని చంపి దోచుకున్న సొమ్మంతా తీసి చూపించి, ఆమెని తన దాన్నిగా చేసుకుందామని ఎరేస్తాడు. ఆ సొమ్ములు లాక్కుని వాణ్ణి తన్నడంలో బిజీ అయిపోతుంది
 .
            పోలీస్ స్టేషన్లో రాముణ్ణి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూంటారు. హత్య జరిగిన సమయంలో తను పెళ్ళిలో ఈ పోలీసు అధికారి పక్కనే జడ్జి వేషంలో వున్నానని చెప్పుకోలేని పరిస్థితి రాముడిది.

          అటు ఇంట్లో సోఫా కింద పడ్డ వాచీ దొరుకుతుంది. దీంతో మోహన్రావు, అతడి అన్న రాముడి మీద నేరం మోపినందుకు బాధపడతారు. ఇంతలో పనివాడొచ్చి రాముడు భద్రయ్యని చంపి అరెస్టయ్యాడని అంటాడు. అన్నదమ్ములకి నోట మాటరాదు. ఇక లక్ష్మి అగలేకపోతుంది. బయట పడిపోతుంది. లక్ష్మి ఎవరో తెలిసి విస్తుపోతారు వాళ్ళు. తనని  క్షమించమని కాళ్ళ మీద పడుతుంది. కానీ తన అన్నఈ హత్య చేయలేదనీ, సాక్ష్యం చెప్తాననీ ప్రాధేయపడుతుంది. 

          పోలీస్ స్టేషన్లో లక్ష్మి అన్నకి ఎలిబీ ఇచ్చేస్తుంది – హత్య జరిగిన సమయంలో అతను జడ్జి వేషంలో పెళ్ళికి వచ్చాడని. పోలీసు అధికారి ఠారెత్తిపోతాడు. ఇంతలో బాబుల్ గాణ్ణి పోలీసులకి పట్టించిన సీత ఆ దొంగ సొత్తుతో పోలీస్ స్టేషన్ కొస్తుంది...

          ఇదంతా సంఘటనలతో జరిగిందే, మాటలతో అపార్ధాలు తొలగించుకుని కాదు. అయితే హీరో పాత్రయిన రాముడు అంతవరకూ యాక్టివ్ పాత్రగా వుంటూ, తీరా అరెస్టయ్యా క ముగింపు వరకూ ఏమీ చెయ్యని పాసివ్ పాత్రగానే వుండిపోయాడు. ఈ ఉచ్చులోంచి తనని లక్ష్మీ సీతలే కాపాడారు. ఎందుకంటే ఆ రోజుల్లో యాక్టివ్ పాసివ్ తేడాల్లేవు. ఎలా వున్నా చూసే వాళ్ళు. ఈ మలి స్వర్ణ యుగం తర్వాత, వ్యాపారయుగంలో హీరోయిజాల స్వరం పెరిగి, అన్నీ హీరోగారే ఒంటి చేత్తో చేసేసే ఘనకార్యాల కథలు రావడం మొదలెట్టాయి.  

          సైకలాజికల్ గా చూస్తే, ఇక్కడ ఇగో మెచ్యూర్డ్ ఇగోగా మారని ముగింపు కొచ్చింది కథ. మిడిల్ – 2 లో మెచ్యూర్డ్ ఇగోగా మారే ప్రక్రియలోనే వుంది రాముడి పాత్ర. ఈ ప్రయత్నాన్ని ఎండ్ విభాగంలో లక్ష్మీ సీతల పాత్రలు హైజాక్ చేసి వాళ్ళే అతణ్ణి మెచ్యూర్డ్ ఇగోగా మార్చేశారు. నీతి ఏమిటంటే, చిన్నప్పటి తెలియని వయసే కావొచ్చు- ఒకసారి పోలీసు రికార్డుల కెక్కితే, చెయ్యని నేరాలు కూడా మీదపడి మర్యాద చేస్తాయి.

(సమాప్తం)

సికిందర్ 


19, అక్టోబర్ 2018, శుక్రవారం

695 : స్క్రీన్ ప్లే సంగతులు


3
      దొంగ రాముడులో  చిన్న దొంగ రాముడు తల్లికి మందుల కోసం దొంగగా పట్టుబడి, తల్లి మరణించి, చెల్లెలు ఆనాథ అవడం ప్లాట్ పాయింట్ వన్ మలుపుగా చూశాం. దీని తర్వాత కథ, అంటే  మిడిల్ ప్రారంభమవుతుంది. ఈ మిడిల్లో చిన్న దొంగ రాముణ్ణి బాలనేరస్థుల కేంద్రంలో వేస్తారు. దీనికి మ్యాచింగ్ సీనుగా అటు చెల్లెలు లక్ష్మిని అనాధాశ్రమంలో చేర్పిస్తారు. వెంటనే దీని తర్వాతి సీనులో అనాధాశ్రమం నుంచి కాలేజీకి బయల్దేరుతున్న లక్ష్మి (జమున ఎంట్రీ) ని చూపిస్తారు. ఆ వెంటనే అటు బాలనేరస్థుల కేంద్రంలో కారు తుడుస్తున్న దొంగరాముణ్ణి (అక్కినేని నాగేశ్వరరావు ఎంట్రీ) చూపిస్తారు. ఈ మ్యాచ్ కట్స్ తో టైం లాప్స్ చూపించేస్తారు. అంతేగానీ కాల చక్రం గిర్రున తిరిగినట్టు ఎలాటి ఆప్టికల్స్ లేవు. తర్వాత్తర్వాత ఆప్టికల్స్ తో ఎడిటింగ్ కాలుష్యమయమవుతూ ఆఖరికి ఏమైందంటే, ఇప్పుడు ఆప్టికల్స్ అంటేనే  చిరాకుపడే పరిస్థితి ప్రేక్షకులకి కూడా వచ్చిందని ఇటీవల ఒక ఎడిటర్ చెప్పారు. దృశ్యాలు శుభ్రంగా, సహజంగా వుండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారనీ, నటుల వోద్వేగాల్ని ఎడిటింగ్ తో డిస్టర్బ్ చేయకుండా, పదేసి షాట్లు వేయకుండా- ఒక్క స్టడీ షాట్ తో ఏకాగ్రతని పెంచేలా వుంటే ప్రేక్షకులకి నచ్చుతోందని చెప్పుకొచ్చారు. అరవింద సమేతలో దీన్నే ఎక్కువ వర్కౌట్ చేశారు. గత కొంత కాలంగా తెలుగు సినిమాల్లో చూస్తే కొత్త ట్రెండ్ గా వచ్చిన స్ప్లిట్ స్క్రీ న్, స్పీడ్ రాంప్స్, షిఫ్ట్  వైప్స్.... వంటి అనుభూతుల్ని ఊడ్చేసే అనేకానేక చీపురు కట్ట టెక్నాలజీలు ఏమీ కనిపించడం లేదు. 

      దొంగరాముణ్ణి చూస్తూంటే, ఆధునికత్వమనేది గొర్రెల మందలా చెల్లాచెదురైపోకుండా, పాత సాంప్రదాయమనే ములుగర్ర దారిలో పెట్టి నడిపిస్తుందన్నవిన్ స్టన్ చర్చిల్ మాటలు నిజమే నన్పిస్తుంది. ఎడిటింగ్ ఇక సాంప్రదాయ సన్నివేశం లోకొచ్చేసింది. చీపురు కట్టలకి ములుగర్రతో దిశానిర్దేశం. ఇలా సున్నితంగా మ్యాచ్ కట్స్ తో లక్ష్మి కాలేజీకి పోతున్నట్టు చూపిస్తూ, దొంగరాముడు విడుదలై వూరికి బయల్దేరుతున్నట్టూ చూపించి, టైం లాప్స్ ని ఎస్టాబ్లిష్ చేసేస్తారు. ఇక్కడొక పూడ్చకుండా వదిలేసిన గ్యాప్ వుంది. ఓ రెండ్రూపాయల చిల్లర దొంగతనానికి పాల్పడ్డ చిన్న దొంగరాముడు అక్కినేని నాగేశ్వర్రవుగా ఎంట్రీ ఇచ్చేదాకా, పది పదిహేనేళ్ళు  అక్కడే వుంచేసి శిక్షణ ఇచ్చారా అనేది. ఇప్పటికి కూడా అతడికి తల్లి మరణించిన విషయం తెలియకుండానే వుంటుంది. తను పట్టుబడ్డ క్షణాన్నే తల్లి మరణిస్తే అంత్య క్రియల కోసమైనా అతణ్ణి విడుదల చేయలేదా? ఈ కామన్ సెన్సునంతా కథాసౌలభ్యం కోసం దాటవేశారు బాగానే వుంది –అయితే, అన్నేళ్ల శిక్షణ తర్వాత కూడా ఇప్పుడు దొంగరాముడు మంచి వాడుగా మారడు. అవే చిన్నప్పటి బుద్ధులు అలాగే వుంటాయి. పైగా సిగరెట్ వూది పారేస్తూ, అవారాలా నడుస్తూ ఇంటికి బయల్దేరతాడు. ఇది బాలనేరస్థుల కేంద్రం ప్రయోజనాన్నే దెబ్బ తీస్తోంది. ఇలా కథా సౌలభ్యం కోసం పాత్ర చిత్రణ కూడా బలైంది. బాల నేరస్థుల కేంద్రంలో పడకుండా, పోలీసులకి దొరక్కుండా, చిన్నదొంగరాముడు పారిపోయి వుంటే, ఆ పోలీసుల భయంతోనే ఇంటికి రాకుండా ఎక్కడో పెరిగి వుంటే, మరిన్ని దొంగతనాలతో ముదిరిపోయి వుంటే, తల్లి గురించిన, చెల్లెలి గురించిన, లాజిక్ అడ్డు పడేది కాదు. పెద్దయ్యాక తిరిగి వచ్చి వాస్తవాలు తెలుసుకునే వాడు. 

          కృష్ణ నటించిన దొంగలకు దొంగ (ఫకీరా రీమేక్ ) లో తల్లిదండ్రులు అగ్నిప్రమాదంలో మరణించి, కొందరి వేధింపుల కారణంగా చిన్నప్పుడు పారిపోతారు అన్నదమ్ములు. వాళ్ళల్లో ఒకడు నేరస్థుడవుతాడు. ఇలా కథ (మిడిల్) మొదలవుతుంది. ఇలాగే దొంగరాముడు మారలేదనడానికి బాల నేరస్థుల కేంద్రంలో చేరిక కాకుండా, పారిపోయినట్టు చూపించి వుంటే పాత్ర చిత్రణ సహా అన్ని లాజిక్కులు పూడేవి. బాల నేరస్థుల కేంద్రంలోనే వేయాలనుకుంటే, అప్పుడు మంచివాడుగా మార్చి విడుదల చేసి, పరిస్థితుల ప్రాబల్యం వల్ల తిరిగి నేరస్థుడైనట్టు చూపిస్తే, పాత్రకి ఉత్థాన పతనాలతో కూడిన ఒక క్యారెక్టర్ ఆర్క్ ఏర్పడేది. దర్శకుడు బిల్లీ వైల్డర్ ప్లాట్ పాయింట్ వన్ విషయంలో ఎప్పుడో ఒక హెచ్చరిక చేయనే చేశాడు. ప్లాట్ పాయింట్ వన్ లో విషయం లోపభూయిష్టంగా వుంటే, సినిమా ముగింపు కూడా బలహీనంగా మారుతుందని. ఇందుకే కాబోలు దొంగరాముడులో హీరోగా  దొంగరాముడు కథ ముగించకుండా, హీరోయిన్ (సావిత్రి) క్లయిమాక్స్ ఫైట్ చేసి దొంగరాముణ్ణి విడిపించుకుని ముగిస్తుంది! 

     ఈ మధ్యే ఒక యాక్షన్ కథ క్లయిమాక్స్ లో, హీరోయిన్ని విలన్ కిడ్నాప్ చేసే అరిగిపోయిన పాత ఫార్ములా ఇంకెందుకని, దీన్ని తిరగేసి హీరోయినే విలన్ని కిడ్నాప్ చేసే ఔటాఫ్ బాక్స్ థింకింగ్ చేద్దామన్నప్పుడు – హాహాకారాలు చెలరేగాయి. మరిప్పుడు దొంగరాముడులో సావిత్రి చేసిందేమిటి? విలన్ని నాల్గు తన్నులు తన్ని నిజం కక్కించి హీరోని కాపాడ్డమేగా! తప్పో ఒప్పో పాత సినిమాల్లో కొన్ని జరిగిపోతాయి. అవి ఇన్స్ పైర్ చేస్తాయి. అసలే ఇప్పుడు కూడా సినిమాల్లో అవే పాత మూస కథలుంటే, వాటికి  కాలీన స్పృహ లేకుండా ఇంకా అవే పాత మూస కథనాలు చేయడం...క్రియేటివిటీని ఏ ఫార్ములా శాసించదు. క్రియేటివిటీ చంచలమైనది, తల్చుకుంటే అది ఫార్ములాల్నే కొత్తగా మార్చేస్తుంది.
***
      ఈ మిడిల్లో రాముడు ఇంటికొచ్చి, అమ్మ చచ్చిపోయిందని తెలుసుకుని షాకవుతాడు. చెల్లెలు లక్ష్మిని పంతులు వేరే వూళ్ళో బళ్ళో వేశాడని తెలుసుకుని వెతుక్కుంటూ అనాధాశ్రమానికి వెళ్తాడు. అక్కడ ఎవరో దుష్టుడనుకుని తరిమికొడతారు. అక్కడ్నించి ఇద్దరు పెద్దవాళ్ళతో పొడుపు కథల మాయచేసి అర్ధ రూపాయి సంపాదించుకుంటాడు. అక్కడ్నించి హోటల్ కెళ్ళి భోజనం చేసి, పావలా ఇచ్చి ముప్పావలా ఎగ్గొడతాడు. అక్కడ్నించి దొంగలెత్తుకు పోయిన ఒక పిల్లాణ్ణి కాపాడి వడ్డీ వ్యాపారి భద్రయ్య (రేలంగి) ఇంటికి చేరుస్తాడు. తన కొడుకుని కాపాడిన రాముణ్ణి భద్రయ్య పనివాడుగా పెట్టుకుంటాడు. 

          ఒక బాబుల్ గాడు (ఆర్ నాగేశ్వరరావు) అనే వీధి రౌడీ వుంటాడు. వాడు కూరగాయలమ్మే సీత (సావిత్రి) ని పెళ్లి చేసుకొమ్మని వేధిస్తూంటే, రాముడు వాణ్ణి కొట్టి ఆమెని రక్షిస్తాడు. ఈసారి లక్ష్మి (జమున) ని కలవడానికి సూటు బూటేసుకుని, బిజినెస్ మాన్ ‘రాంబాబు’ గా పేరు పెట్టుకుని నటిస్తూ అనాధాశ్రమానికి వెళ్తాడు. అక్కడ లక్ష్మి అన్నని చూసి ఆనందిస్తుంది. కొన్ని బిజినెస్ పనులు పూర్తి చేసుకుని ఆమెని తీసికెళ్తానంటాడు. ఆమె కాలేజీలో కట్టడానికి మూడు వందలు కావాలంటుంది.15 వ తేదీ కల్లా కట్టాలంటుంది.14 వ తేదీకే అందిస్తానని మాటిస్తాడు.

       రాముడు ఇటు సీతతో ప్రేమలో పడతాడు. కానీ లక్ష్మి కిస్తానన్న మూడొందల గురించే దిగులుతో వుంటాడు.  అంత డబ్బు ఎలా సంపాదించాలని సీతని అడుగుతాడు. ఏమో తనకి తెలీదంటుంది. చిలక జోస్యం చెప్పించుకుంటే – నువ్వు ఆపదలో వున్నావు, నీవల్ల నీ వాళ్లకి ఇబ్బంది కలిగే ప్రమాదముంది, కానీ నీ తెలివి తేటలుపయోగించి ధైర్యం, సాహసం ప్రదర్శిస్తే, ఆ ప్రమాదం తప్పవచ్చని జోస్యం చెప్తుంది. దీంతో ఇంకా దిగాలుగా కూర్చుంటే అంతరాత్మ పలుకుతుంది – ఒరేయ్ నీకేమైనా బుద్ధుందా? కూటికి లేదు, నీ బతుక్కి తోడు మూడొందలిస్తానని చెప్పి వచ్చావే, ఎక్కడ తేద్దామనుకున్నావ్? పైగా వెళ్ళిన వాడివి చూసిరాక నోటి కొచ్చినట్టు కూసొచ్చావ్. రేపు నువ్వు పైకం పంపకపోతే నీ చెల్లెలికి ఎంత అవమానం జరుగుతుందో తెల్సా? చూడు – అని దృశ్యం చూపిస్తుంది అంతరాత్మ – ఆ దృశ్యంలో అనాధాశ్రమం నిర్వాహకురాలు, డబ్బు తీసుకురాని అన్న ‘రాంబాబు’ గురించి పరుషంగా మాట్లాడి, ఫో ఇక్కడ్నించీ - అని లక్ష్మిని వెళ్ళగొడ్తుంది. ఈ దృశ్యానికి రాముడు బెదిరిపోయి ఎలాగైనా డబ్బు సంపాయిస్తానంటాడు అంతరాత్మతో. 

          ఇంట్లో భద్రయ్య కూతురి పెళ్ళికి దాచిన నగల్లో ఒక నెక్లెస్ కనపడక కంగారుపడతారు. భార్య (సూర్యకాంతం) దులిపిచూస్తే అది బట్టల్లోనే వుంటుంది. భర్త దగ్గర డబ్బులు లాక్కుని లెక్కబెడుతుంది. ఆరొందల రూపాయలు లెక్కబెట్టడాన్ని రాముడు ఆశగా చూస్తాడు. ఆ డబ్బు బీరువాలో పెడుతోంటే కనిపెడతాడు. అర్ధరాత్రి బీరువా తెరిచి డబ్బు తీస్తూంటే, బాబుల్ గాడు దొంగతనానికి జొరబడతాడు. రాముడు బీరువాలో  దాక్కుంటే, బాబుల్ గాడు తీసి చూసి క్యారు మంటాడు. ఇద్దరూ కూడబలుక్కుని డబ్బు చెరిసగం పంచుకుంటారు. 

          దొంగతనం గురించి తెల్లారి భద్రయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వచ్చి విచారిస్తారు. రాముడు అలాటి వాడు కాదని, సొంత బిడ్డ లాంటివాడని వెనకేసుకొస్తుంది భద్రయ్య భార్య. రాముడు డాబుగా లక్ష్మి  దగ్గరి కెళ్ళి డబ్బూ, పట్టు చీరా నగలూ ఇచ్చేస్తాడు. అనాధాశ్రమం నిర్వాహకురాలు ‘రాంబాబు’ ని వార్షికోత్సవానికి  ఆహ్వానిస్తుంది. లక్ష్మి కూడా తప్పకుండా వచ్చి తన పాటల కార్యక్రమం చూడాలని అంటుంది.

      అనాధాశ్రమం నిర్వాహకురాలు కొత్త భవనం విరాళాల కోసం భద్రయ్య ఇంటికి వస్తుంది. రాముడు గతుక్కుమని దాక్కుంటాడు. చూడకుండా పక్కనుంచి వచ్చి టీలందిస్తాడు. భద్రయ్య కూతురి పెళ్లి ప్రస్తావన తెస్తాడు. అనాధాశ్రమం నిర్వాహకురాలు ‘రాంబాబు’ గురించి గొప్పగా చెప్పి, సరేనంటే సంబంధం మాట్లాడతానంటుంది. భద్రయ్యని వార్షికోత్సవ సభకి వస్తే ‘రాంబాబు’ ని పరిచయం చేస్తానంటుంది. ఇదంతా వింటున్న రాముడు కంగారు పడిపోతాడు. ఇలాకాదని, భద్రయ్య భార్యతో సభకి వెళ్ళకుండా గడియారంలో టైము మారుస్తాడు, తేలుతో కుట్టిస్తాడు. ఇవేవీ ఫలించకపోవడంతో, వాళ్ళు సభకి వెళ్ళిపోయాక, ఇహ తప్పక సూటు బూటేసుకుని తనూ బయల్దేరతాడు. 

          సభలో భద్రయ్య పక్కన కేటాయించిన సీట్లో కూర్చోకుండా తప్పించుకు తిరుగుతూం టాడు రాముడు. ‘రాంబాబు’ ఏడని నిర్వాహకురాల్ని అడుగుతూంటాడు భద్రయ్య. స్టేజి మీద పాటల కార్యక్రమంలో వున్న లక్ష్మి ధరించిన పట్టు చీరా నగలూ గుర్తు పట్టి భద్రయ్యని ఎలర్ట్ చేస్తుంది భార్య. వెంటనే భద్రయ్య పోలీసుల్ని పిలిపిస్తాడు. పోలీసులు రాకుండా రాముడు అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. పోలీసులొచ్చి నిండు సభలో లక్ష్మిని పట్టుకుంటారు. కట్టుకున్న చీరా నగలూ చూసుకుని తనకేం తెలీదని వాపోతుంది లక్ష్మి. పోలీస్ స్టేషన్ కి పదమని పోలీసులంటూంటే, రాముడు వచ్చేసి బయటపడి పోతాడు. భద్రయ్య ఇంట్లో దొంగతనం చేసింది తనేనంటాడు. సూటూ బూటూలో వున్న రాముణ్ణి  చూసి భద్రయ్య విస్తుపోతాడు. ఇతను భద్రయ్య ఇంట్లో పనివాడని తెలిసి నిర్వాహకురాలు నివ్వెరబోతుంది. రాముడు దొంగ రాముడుగా పట్టుబడి జైలుకు పోతాడు. నిర్వాహకురాలు లక్ష్మిని దూషిస్తుంది. దొంగ రాముడు పోలీసులతో వెళ్లడాన్ని చూసిన సీత ఎవగించు కుంటుంది.

***
         ఇదీ మిడిల్ -1 లో కథ, దాని కథనం. పాత్ర మిడిల్లో పడిందంటే సంఘర్షించడమే వుంటుంది కాబట్టి పై కథనంలో సమస్యతో రాముడి సంఘర్షణంతా కనబడుతోంది. రాముడి సమస్యేమిటి? ఇది ప్లాట్ పాయింట్ వన్ లో ఏర్పాటయింది : బాలనేరస్థుల కేంద్రం నుంచి కొన్నేళ్ళ తర్వాత విడుదలై వచ్చేసరికి తల్లి చనిపోయీ, చెల్లెలు ఎక్కడుందో తెలీని పరిస్థితి నెదుర్కొన్నాడు. ఆ చెల్లెల్ని అన్వేషించి ఆమె బాగోగులు చూసుకోవడమే తన సమస్య, గోల్. చెల్లెల్ని బాగా చూసుకుంటానని చిన్నప్పుడే తల్లికి మాటిచ్చాడు. 

          ఇలా చెల్లెలు లక్ష్మి కోసం తపిస్తున్న అన్నగా, రాముడు ఆమెకోసం చేయరాని పనులు చేశాడు. కమర్షియల్ సినిమా కథల్లో ప్రత్యర్ధి పాత్ర లేకపోతే కథలా వుండదు, గాథలా వుంటుంది. ఇది కమర్షియల్ సినిమాలకి పనికిరాదు. కమర్షియల్ సినిమా కథనేది చూసే ప్రేక్షకుల మానసిక లోకానికి నకలుగా నర్తించే కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లే అని చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రధానపాత్ర  కాన్షస్ మైండ్ (ఇగో) అయితే, ప్రత్యర్ది పాత్ర సబ్ కాన్షస్ మైండ్ (అంతరాత్మ). ఇలా అంతరాత్మతో ఇగో లడాయే ప్రేక్షకుల మానసిక లోకానికి గాలం వేసి లాక్కెళ్ళే కమర్షియల్ సినిమా కథ. ప్రేక్షకుల నాడి పట్టుకోవడమంటే ఇదే. ఈ లడాయి (ఇంటర్ ప్లే) ఆర్ట్ సినిమాల్లో, ఆర్ట్ సినిమాల్లాంటి వరల్డ్ మూవీస్ లో వుండదు. కాబట్టి వాటిలో ప్రధాన పాత్ర పాసివ్ గా వుంటుంది. ప్రధాన పాత్ర పాసివ్ గా వుంటే కమర్షియల్ సినిమాలు అట్టర్ ఫ్లాపవుతాయి. ఇది కూడా వందల సార్లు గమనించాం. కాబట్టి ప్రేక్షకుల మానసిక లోకాన్ని ప్రతిబింబించే  కాన్షస్ – సబ్ కాన్షస్ ఇంటర్ ప్లే కమర్షియల్ సినిమాలకి అత్యవసరమైంది. 

          మరి కమర్షియల్ సినిమాల్లో ప్రత్యర్ధి పాత్ర అవసరం లేని సందర్భాల్లో ఇంటర్ ప్లేని ఎలా చూపించాలి?  అప్పుడు ప్రధాన పాత్ర మనసునే ప్రత్యర్ధిగా చేసి ఇంటర్ ప్లేని చూపించాలి. ఇదే చూపిస్తున్నారు పై దొంగరాముడు మిడిల్ కథనంలో. దొంగరాముడులో ప్రత్యేకంగా ప్రత్యర్ధి పాత్ర – అంటే విలన్ లేడు. దొంగరాముడి బుద్ధే దొంగరాముడి శత్రువు. అతను తనతో తానే సంఘర్షిస్తున్నాడు. అతడి ఇగోకీ, అంతరాత్మకీ పడడం లేదు. బుద్ధి బావుంటే అంతరాత్మతో సెటిలవుతుంది. లేకపోతే  అంతరాత్మని అతలాకుతలం చేసుకుంటూ అశాంతిగా జీవితాన్ని వెళ్ళమారుస్తుంది. 

          స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో, బిగినింగ్ విభాగమంటే కాన్షస్ మైండ్ అని కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. మిడిల్ విభాగమనేది సబ్ కాన్షస్ మైండ్ అని కూడా చెప్పుకున్నాం. మన కాన్షస్ మైండ్ కి అధిపతి మన ఇగో. ఇగో పక్కా కోతి లాంటిది. దానికి క్లాస్ లక్షణాలుండవు, మాస్ లక్షణాలే. ఇలా కోతి లాంటి ఇగో మాస్ గా ఆడించినట్టూ మన కాన్షస్ మైండ్ మాస్ గా ఆడుతుంది. వెధవ పనులన్నీ చక్కగా చేసుకుంటాం. కమర్షియల్ సినిమాల్లో కాన్షస్ మైండ్ అనే బిగినింగ్ విభాగంలో,  హీరో ఆవారాగా, బేవార్సుగా, లోఫర్ గా తిరగడం ఇందుకే. కమర్షియల్ సినిమాల్లో హీరో అంటే మన ఇగోనే. ఇంతవరకూ బాగానే కనిపెట్టారు. దీని తర్వాత ఏం చేయాలో చాలా సినిమాల్లో పట్టించుకోవడం లేదు. దీని తర్వాత – అంటే కాన్షస్ మైండ్ అనే బిగినింగ్ తర్వాత - ప్లాట్ పాయింట్ వన్ దగ్గర - ఇగో తన కెదురైన సమస్యతో - దాన్ని సాధించే గోల్ తో  - వుంటుంది. సమస్యని సాధించాలంటే అంతర్మధనం జరగాల్సిందే. అంటే సబ్ కాన్షస్ మైండ్ లోకి – అంటే అంతరాత్మలోకి - దూకాల్సిందే. కానీ మన ఇగో అంతరాత్మని ఎదుర్కోవాలంటేనే భయపడుతుంది. దానికి తన కాన్షస్ మైండ్ సామ్రాజ్యమే మజాగా వుంటుంది. సమస్యలనుంచి తప్పించుకు తిరగాలనుకుంటుంది. అందుకే జీవితంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కావు. ఇలాటి బలహీనతతో రాజకీయ నాయకులుంటే దేశంలో సమస్యల్నే పరిష్కరించరు. దేశమలా దేహీ అంటూ వాళ్ళ కేసి చూస్తూ వుండాల్సిందే. వేసిన ఓట్లు వేస్తూ వుండాల్సిందే. అందుకని కమర్షియల్ సినిమాల్లో ఏం చేస్తారంటే, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, సమస్యతో నిలబడ్డ జిత్తులమారి ఇగోని – అంటే హీరోని - సబ్ కాన్షస్ మైండ్ లోకి (మిడిల్లోకి) మెడబట్టి ఒక్క నెట్టు నెట్టి పారేస్తారు.

          కమర్షియల్ సినిమాకొచ్చే ప్రేక్షకులు చాలావరకూ జీవితంలో సమస్యల నుంచి పలాయనం చిత్తగించే చిత్తంతో వుంటారు కాబట్టి - వెండి తెరమీద ఈ విన్యాసానికి వెంటనే కనెక్ట్ అవుతారు. జీవితంలో తాము చేయలేకపోతున్నది (అంతరాత్మలోకి తొంగి చూడడం) వెండితెర మీద హీరో పరంగా శుభ్రంగా కనిపిస్తూంటే వాళ్ళ ఇగో దాన్ని పట్టేసుకుంటుంది.  ఇక అంతరాత్మలో (మిడిల్లో) పడ్డ హీరో (ఇగో) అందులో వుండే సవాళ్లు, నైతిక విలువలు, జీవితసత్యాలూ, నగ్నసత్యాలూ వగైరా వగైరాలతో సంఘర్షించీ సంఘర్షించీ – ఓహో జీవితమంటే ఇదా నాయనా  - అని తెలుసుకుని ఒడ్డున పడి పునీతమవుతుంది. అంటే మెచ్యూర్డ్ ఇగోగా మరుతుంది. ఇగోని (హీరో పాత్రని) మెచ్యూర్డ్ ఇగోగా (మెచ్యూర్డ్ హీరో పాత్రగా) మార్చి చూపించేదే మంచి కమర్షియల్ సినిమా కథ. ఇగోని ఎవ్వరూ చంపుకోలేరు. దాన్ని మెచ్యూర్డ్ ఇగోగా మార్చుకుని సుఖపడగలరు  మనసుంటే. ఇదే మంచి కమర్షియల్ సినిమాలు చేసే సైకో థెరఫీ. 

          ఇదంతా కూడా ఈ బ్లాగులోనే ఆయా సందర్భాల్లో అనేక సార్లు చెప్పుకున్నదే. ఇప్పుడు చెప్పుకుంటున్న దొంగరాముడు స్క్రీన్ ప్లే సంగతులకి రిఫ్రెష్ చేయడానికే ఈ ఉటంకింపు.

***
    తన బుద్ధే తనకి బద్ధ శత్రువైనప్పుడు దొంగరాముడుకి కథలో వేరే విలన్ అక్కర్లేదు. ఆ బుద్ధితో అతడి సంఘర్షణే మిడిల్ లో కన్పించే అతడి పాట్లు. ఈ మిడిల్లో కన్పించేసీత, భద్రయ్య, అతడి భార్య, అనాధాశ్రమం నిర్వాహకురాలు, బాబుల్ గాడు, చిలక జోస్యం వాడు, పోలీసులూ...ఇంకా ప్రతీ చిన్న పాత్రా అంతరాత్మకి ఏదోవొక రూపాలే. ఇవన్నీ అతడికి ఏదోవొకటి నేర్పుతున్నాయి. నేర్చుకుంటేగా? వాటికి ఎదురీదుతున్నాడు.      
        ఇన్నర్ గా ఈ సైకో థెరఫీ నుంచి, పైకి కన్పించే కథగా చూసినప్పుడు, మిడిల్ విభాగపు బిజినెస్ కొస్తే, ఇక్కడ సంఘర్షణలో భాగంగా వచ్చే యాక్షన్ రియాక్షన్ తాలూకు డైనమిక్స్  వెనువెంటనే వుంటాయి. దీంతో కథనంలో చాలా వేగం కన్పిస్తుంది. 



          అమ్మ చచ్చిపోయిందని, చెల్లెలు ఎక్కడుందో తెలియదని షాకవడం, దీనికి యాక్షన్ గా వెతుక్కుంటూ అనాధాశ్రమంలో వున్న చెల్లెలి కోసం వెళ్తే, రియాక్షన్ గా అక్కడ వేషం చూసి అతణ్ణి వెళ్ళగొట్టడం, ముందు తినడానికి యాక్షన్ తీసుకుని డబ్బుల కోసం పొడుపు కథతో మాయ చేయడం, రియాక్షన్ గా ఆ డబ్బుతో హోటల్లో తిని సగం డబ్బు ఎగ్గొట్టడం, అక్కడ్నించి దొంగలెత్తుకు పోయిన పిల్లాణ్ణి కాపాడే యాక్షన్ తీసుకోవడం, దీనికి రియాక్షన్ గా భద్రయ్య ఇంట్లో పనివాడుగా చేరడం...

           వీధి రౌడీ బాబుల్ గాడు సీతతో అసభ్యంగా ప్రవర్తిస్తూంటే యాక్షన్ తీసుకుని బుద్ధి చెప్పడం, దీనికి రియాక్షన్ గా సీతతో ప్రేమ మొలకెత్తడం, అనాధాశ్రమంలో తన వేషం చూసి వెళ్ళగొట్టినందుకు యాక్షన్ తీసుకుని,  సూటు బూటేసుకుని బిజినెస్ మాన్ లా నటిస్తూ చెల్లెల్ని కలుసుకోవడం, దీనికి రియాక్షన్ గా ఆమె కాలేజీకి డబ్బులు కట్టే పని నెత్తిన పడ్డం...

          ఆ డబ్బెలా అని యాక్షన్ తీసుకుని చిలక జోస్యం చెప్పించుకుంటే, రియాక్షన్ గా జోస్యం ప్రమాదకరంగా వుండడం, ఇంకో రియాక్షన్ గా అంతరాత్మ గట్టి క్లాసు పీకడం, ఇక భరించలేక ఇంట్లో కెళ్తే – దీనికి రియాక్షన్ గా అక్కడ భద్రయ్య భార్య డబ్బు లెక్కెట్టడం, దీనికి యాక్షన్ గా బీరువాలో ఆ డబ్బు కొట్టేయబోతే, రియాక్షన్ గా బాబుల్ గాడు అప్పుడే తగలడ్డం, దీనికి యాక్షన్ తీసుకుని వాడికి సగం డబ్బు పంచడం...

          దీనికి రియాక్షన్ గా తెల్లారి పోలీసులొచ్చి ప్రశ్నించడం, దీనికి యాక్షన్ గా భద్రయ్య భార్య రాముణ్ణి కాపాడడం, దీనికి రియాక్షన్ గా రాముడు వెళ్లి చెల్లెలికి ఆ దొంగిలించిన డబ్బివ్వడం, దీనికి రియాక్షన్ గా అతణ్ణి వార్షికోత్సవానికి రమ్మనడం, దీనికి యాక్షన్ గా నిర్వాహకురాలు భద్రయ్య ఇంటికి రావడం, దీనికి రియాక్షన్ గా భద్రయ్య కూతురి పెళ్లి ప్రస్తావన తేవడం, దీనికి రియాక్షన్ గా నిర్వాహకురాలు దొరబాబు ‘రాంబాబు’ గురించి చెప్పడం, పరిచయం చేస్తానని సభకి రమ్మనడం...

          దీనికి యాక్షన్ గా భద్రయ్య సభకి వెళ్ళకుండా  రాముడు గడియారం టైము మార్చడం, దీనికి రియాక్షన్ గా భద్రయ్య భార్య వచ్చి మార్చిన టైము మార్చేయడం, దీనికి రియాక్షన్ గా రాముడు భద్రయ్య చొక్కాలో తేలు వేయడం, దీనికి యాక్షన్ గా తేలు కుట్టినా భద్రయ్య కేమీ కాక సభ కెళ్ళి పోవడం...

          దీనికి రియాక్షన్ గా దొరబాబులా రాముడు సభ కెళ్లడం, దీనికి యాక్షన్ గా భద్రయ్య పక్కనే తన సీటు వుండడం, రియాక్షన్ గా కనపడకుండా తప్పించుకు తిరగడం, దీనికి యాక్షన్ గా కాబోయే అల్లుడుగారు ‘రాంబాబు’ కోసం భద్రయ్య ఎదురు చూడ్డం, దీనికి రి యాక్షన్ గా భద్రయ్య భార్య రాముడి చెల్లెలు కట్టుకున్న పట్టు చీరా నగలూ గుర్తు పట్టడం, దీనికి యాక్షన్ గా భద్రయ్య పోలీసుల్ని పిలవడం, దీనికి యాక్షన్ గా రాముడు పోలీసుల్ని ఆపాలనుకోవడం, దీనికి రియాక్షన్ గా పోలీసులోచచేసి  రాముడి చెల్లెల్ని దొంగగా పట్టుకోవడం. దీనికి యాక్షన్ తీసుకుని రాముడు తనే దొంగగా లొంగిపోవడం...
***
             చెల్లెలి శ్రేయస్సు గోల్ గా రాముడు తన దొంగబుద్ధి కొద్దీ పడ్డ పాట్లే తనతో మిడిల్ సంఘర్షణ. మిడిల్ బిజినెస్ లో భాగంగా వచ్చిన యాక్షన్ రియాక్షన్లతో కథనానికి స్పీడునీ, టెంపోనీ ఇచ్చే డైనమిక్స్ ఏర్పడ్డాయి. కథనానికి డైనమిక్సే ప్రాణం. డైనమిక్స్ కి పాత్ర పాల్పడే చర్యలే ప్రాణం. పాత్ర పాల్పడే చర్యలకి సంఘటనలే ప్రాణం. పై పేరాల్లో చూసుకుంటే చకచకా అవన్నీ సంఘటనలే. సంఘటన లేనిది పాత్రలేదు. సంఘటన లేనికి కథనం లేదు. డైలాగులతో నడిపేది కథనం కాదు. సినిమా కథని  సంఘటనలతో విజువల్ గా చెప్పే నేర్పుండాలి, డైలాగులతో ఓరల్ గా కాదు. “What is character but the determination of incident? And what is incident but the illumination of character?” ― Henry James ( from Syd Field’s  ‘Screen writer’s Problem Solver ‘)


          ఇక్కడ బిగినింగ్ బాల్య కథకి ముగింపు దొంగగా అరెస్టవడమే, మిడిల్ -1 కథకీ దొంగగా అరెస్టవడమే. మిడిల్ -1 తో మళ్ళీ మొదటికొచ్చింది కథ. ఈ అరెస్ట్ అనే ఘట్టం ప్లాట్ డివైస్ గా వుంది. ప్లాట్ డివైసులు కథని ఒక్కో దిశకి తీసికెళ్ళే చోదక శక్తులుగా వుంటాయి. దీని తర్వాత మొదలయ్యే మిడిల్ - 2 ని ఈ రెండో అరెస్టు ఏ దిశగా డ్రైవ్ చేస్తుందో చూడాలి...

సికిందర్

15, అక్టోబర్ 2018, సోమవారం

694 : స్క్రీన్ ప్లే సంగతులు


        ప్పుడు  సినిమాల్లో చిన్నప్పటి కథలు చూపిస్తే వస్తున్న మార్కెట్ యాస్పెక్ట్ పరమైన సమస్యలేమిటో కిందటి వ్యాసంలో చూశాం. కేవలం హీరో పాత్ర చిత్రణకి బేస్ కోసం చిన్నప్పటి కథలు చూపిస్తే అది యూత్ అప్పీల్ ని చంపేస్తోందనీ, పైగా కథగా స్క్రీన్ ప్లేలో అదే విభాగానికీ చెందని అనాధలా మిగిలిపోతోందనీ చెప్పుకున్నాం. ఇలాకాక – బాల్య కథని స్క్రీన్ ప్లేలో భాగంగా చేస్తూ, దాంతోనే బిగినింగ్ విభాగాన్ని ప్రారంభిస్తే, అప్పుడా బాల్య పాత్ర చిత్రణతోబాటు దానికో  సమస్యతో, ఆ సమస్యతో దానికో గోల్ తో,  ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే చిన్నప్పటి కథలకి ఓ అర్ధం వుంటుందనీ దొంగరాముడు ఉదాహరణగా అవగాహన కొచ్చాం. చిన్నప్పుడే పాత్రకి ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేసేస్తే ఇంకా ప్రయోజనాలేమిటంటే, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రారంభమయ్యే కథలో (మిడిల్లో ) హీరో నేరుగా ప్రవేశిస్తాడు. అక్కడ ఆల్రెడీ వున్న చిన్నప్పటి గోల్ ని చేపట్టి మిడిల్ విభాగాన్ని నేరుగా పాలిస్తాడు. ఎక్కడైనా హీరో నేరుగా మిడిల్ విభాగంలో అడుగుపెట్టి, సిద్ధంచేసి పెట్టిన కథని పాలించడం వుంటుందా? ఇలాంటప్పుడే వుంటుంది. బాల్య కథనే బిగినింగ్  విభాగంగా చూపించేస్తే ఇక హీరోకి బిగినింగ్ విభాగం చూపించాల్సిన అవసరం రా దు. స్క్రీన్ ప్లే రచనలో ఇదొక కొత్తానుభూతినిచ్చే అపూర్వ ప్రక్రియ అవుతుంది! 

         
త నెల విడుదలైన ‘ఈక్వలైజర్ - 2’ లో ఇలాటిదే చమత్కృతి గురించి చెప్పుకున్నాం : సెకెండాఫ్ ప్రారంభమైన పావుగంటలో క్లయిమాక్స్ ప్రారంభమైపోవడం! ఈ రోజుల్లో కథెవడిక్కావాలి. ఇంకా ఇప్పుడు కూడా స్క్రీన్ ప్లేలో సాంప్రదాయంగా బిగినింగ్ అరగంట – మిడిల్ (కథ) గంట – ఎండ్ ఆరగంటా అనే 25% + 50% + 25 % పంపకా లేమవసరం?  ఫస్టాఫ్ లో అరగంట వుండే బిగినింగ్ ని ముప్పావు గంటకి పెంచి, ఓ పావుగంట మాత్రమే మిడిల్ -1 తో ఇంటర్వెల్ వేసేసి, సెకండాఫ్ ప్రారంభంలో ఇంకో పావు గంట మాత్రమే మిడిల్ -2 చూపించేసి, మిగిలిన ముప్పావు గంటా క్లయిమాక్స్ (ఎండ్) కెళ్లిపోతే చాలా రొటీన్ మూస బాధలు వదుల్తాయి. మిడిల్ యాభై నుంచి పాతిక శాతానికి తగ్గిపోవడం వల్ల, పాతిక శాతం కథతో బోరు సగానికి సగం తగ్గిపోతుంది!  ‘ఈక్వలైజర్ - 2’ లో జరిగిందిదే. 

         ఇలాటిదే దొంగరాముడులో జరిగింది. చిన్నప్పటి కథని బిగినింగ్ గా వేసేస్తే, హీరోతో ఈసురోమని అదే రొటీన్ బిగినింగ్ ని మళ్ళీ మళ్ళీ చూపిస్తూ సినిమాలు తీసే అవసరమే రాదు, నేరుగా మిడిల్లో ఎంట్రీ ఇస్తాడు. లేకపోతే జరుగుతున్న దేమిటి? బిగినింగ్ విభాగాన్నిప్రారంభిస్తూ హీరో అదే ఎంట్రీ ఇచ్చి అదే ఫైట్ చేస్తాడు. అదే గ్రూప్ పాటేసుకుంటాడు. హీరోయిన్ తో అదే లవ్ ట్రాక్ ప్రారంభించి అదే కామెడీ చేస్తాడు. ఆమెతో అదే టీజింగ్ సాంగేసుకుంటాడు. అదే లవ్ ట్రాక్ కంటిన్యూ చేస్తాడు. ఆమెతో అదే డ్యూయెట్ వేసుకుంటాడు. అప్పుడు విలన్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. విలన్ తో హీరోకి గోల్ ఏర్పడుతుంది. 

          ఈ కథనంలోనే బిగినింగ్ విభాగపు బిజినెస్ అయిన – కథా నేపధ్యపు ఏర్పాటు, హీరో సహా పాత్రల పరిచయం, విలన్ తో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్యతో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటూ తాలూకు కథనమంతా వుంటుంది. ఇలాకాక దీన్ని బాల్య కథలోకి తోసేసినప్పుడు, ఇదే రొడ్డకొట్టుడు రొటీన్ నుంచి హీరో బతికి పోతాడు. తన బదులు తన చిన్నప్పటి పాత్రధారి బాల నటుడెవరో  ఇది పోషించి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో రెండో కృష్ణుడులాగా ఏంచక్కా ఫ్రెష్ గా మిడిల్లో ఎంట్రీ ఇచ్చి, బాలనటుడి గోల్ నెత్తుకుని, నేరుగా కథని ఆపరేట్ చేస్తాడు. ఈ సినేరియాలో ‘శివ’ ని వూహిస్తే – నేరుగా నాగార్జున సైకిలు చైనుతో జేడీని కొట్టే సీనుతో ఎంట్రీ ఇవ్వొచ్చు. అంతకి ముందు అరగంట బిగినింగ్ కథనమంతా  శివ బాల్యపు కథగా వుండొచ్చు.

      అయితే ఈ చిన్నప్పటి కథలు కొన్ని, చిన్నప్పుడు హీరో తన తల్లిదండ్రుల్ని విలన్ చంపడాన్ని చూడడంగానో, లేదా చిన్నప్పుడు అన్నదమ్ములు తప్పి పోవడంగానో కూడా వుంటాయి. వీటిలో చిన్నప్పుడు హీరోకి గోల్ ఏర్పడదు. అంటే కథ వుండదు. తల్లిదండ్రుల చావు చూసిన హీరోగారు పెరిగి బాగా పెద్దవాడై, ఓ పాతిక ముప్పయ్యేళ్ళూ  కామెడీలూ, హీరోయిన్ తో ప్రేమలూ గట్రా వెలగబెడుతూ జల్సాగా గడిపేశాక, అప్పుడొకానొక రోజు, తల్లిదండ్రుల్ని చంపిన విలన్ గుర్తుకొచ్చి గుండెల్లో అగ్నిపర్వతాలు ఎడాపెడా పేల్చుకుంటాడు. అంటే ఇప్పుడిన్నాళ్ళకి తీరిగ్గా నిద్రలేచి గోల్ ఏర్పర్చుకున్నాడన్న మాట.

          ఇలాగే చిన్నప్పుడు అన్నదమ్ములు తప్పిపోతే ఎవడికీ పట్టింపు (గోల్) వుండదు. పెద్దవాళ్ళై ఎప్పుడో ప్రమాదవశాత్తూ కలుసుకుంటారు. ఇక్కడ కూడా చిన్నప్పటి దృశ్యాలు బిగినింగ్ విభాగం అన్పించుకోవు. పెద్దవాళ్ళయాకే బిగినింగ్ మొదలవుతుంది.

          సిడ్ ఫీల్డ్ ప్రకారం సర్కిల్ ఆఫ్ బీయింగ్ అని ఒకటుంటుంది. అంటే,  కథకి సంబంధించి హీరోకి గతం తాలూకు ఫ్లాష్ బ్యాక్. ఇదే పాత్రని నిర్దేశిస్తుంది, ఇదే పాత్రని వెన్నాడుతుంది, ఇదే పాత్రకి బలాన్నిస్తుంది. ‘ఖైదీ’ లో చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ (సర్కిల్ ఆఫ్ బీయింగ్) ఇలాటిదే. ఇది హీరోకి బాల్యంలో ఏర్పడొచ్చు, పెద్దయ్యాకా ఏర్పడొచ్చు. ‘అంకుశం’ లో కుప్పతోట్లో ఏరుకు తిన్నబాల్యంలో ఏర్పడి – ఈ కసే పెద్దయ్యాకా వుంటుంది. పాత్రకి ఇలాటి బలాన్నిచ్చే, భగభగ మండించే ఇలాటి సర్కిల్ ఆఫ్ బీయింగ్స్ తోనైనా ఇప్పుడు బాల్య కథల్లేవు- ఏమంటే హీరోగారికి ఫలానా తిక్క ఎలా ఏర్పడిందో ప్రేక్షకులు అర్ధం జేసుకోవడానికి చిన్ననాటి సీన్లు! ఫలానా పిల్లని ఎంతగా ప్రేమించాడో ప్రేక్షకులకి తెలియడానికి చెడ్డీల నాటి  ముచ్చట్లు! పనికిమాలిన దృశ్యాలు. హీరో క్యారెక్టరైజేషన్ అనగానే బచ్చాతనంలో కెళ్ళిపోయి కథలల్లడం. మనిషికి బాల్యంలోనే నమ్మకాలేర్పడతాయా? అవే జీవితమంతా శాశ్వతంగా వుండిపోతాయా? మీసాలొచ్చాక నమ్మకాలేర్పడకూడదా? కేవలం హీరో పాత్ర చిత్రణ కోసం చైల్డ్ స్టోరీ అనేది స్క్రీన్ ప్లేకీ,  మార్కెట్ యాస్పెక్ట్ కీ పెద్ద అడ్డంకి. దొంగరాముడులో లాగా చిన్నప్పుడు పాత్ర చిత్రణతో బాటు, అప్పుడే బిగినింగ్ విభాగాన్ని కూడా ప్రారంభిస్తూ, ఆ చిన్నప్పుడే మొత్తం కథకీ  కావాల్సిన గోల్ నేర్పాటు చేస్తే ఎంతో ఉపయోగముంటుంది.  ఒక కొత్త ప్రక్రియకి నాంది అవుతుంది. ప్లాట్ పాయింట్ వన్ రానంత సేపూ కథ ఏర్పడదు. ప్లాట్ పాయింట్ వన్ లోపు బిగినింగ్ లో వుండేదంతా కథ కాదు. కేవలం ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రారంభం కాబోయే కథకి అది ఉపోద్ఘాతమే. అలాగే క్లయిమాక్స్ (ఎండ్) అంతా కూడా కథ కాదు, కథకి ఉపసంహారం మాత్రమే. ఒక్క మిడిలే కథ, మిడిల్లోనే కథ!    

        దొంగరాముడు చిన్నప్పుడు తల్లికి మందుల కోసం దొంగతనానికి పాల్పడడంతో  పోలీసులకి పట్టుబడ్డం, తల్లి మరణించడం, చెల్లెలు అనాధ అవడమనే బిగినింగ్ విభాగపు బిజినెస్ తో, చిన్నప్పుడే ప్లాట్ పాయింట్  ఏర్పడి, జీవితపు చౌరస్తాలో అప్పుడే నిలబడ్డాడని చెప్పుకున్నాం. అంటే ఇక నేరుగా గోల్ ని, కథని, ఎదిగిన దొంగరాముడుకి అందించేస్తాడన్న మాట. ఇక్కడ కేవలం హీరో పాత్రచిత్రణ కోసం బలహీనంగా వాడుకుంటున్న బాల్య పాత్రకీ, దొంగరాముడు బాల్యపాత్రకీ గమనించాల్సిన ముఖ్యమైన తేడా ఏమిటంటే – చిన్న దొంగరాముడు కథకోసం పుట్టి, ఒక గోల్ తో తన ఉనికిని, ప్రాముఖ్యాన్నీ చాటుతున్నాడు. గోల్ ని, లేదా కథని, పెద్ద దొంగరాముడికి అప్పజెప్తూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంటే డ్రమెటికా స్టోరీ రూలు ప్రకారం, హేండాఫ్ పాత్రయ్యాడన్నమాట. మనుషులు మారాలిలో శోభన్ బాబు చనిపోతూ శారదకి కథని అప్పజెప్పినట్టు, ఎర్ర మందారంలో రాజేంద్ర ప్రసాద్ చనిపోతూ యమునకి కథని అందించినట్టు. పెద్ద దొంగరాముడొచ్చేసి నేరుగా కథని పాలించడానికి కథని సిద్ధం చేసి పెట్టే పెద్దతనంతో హెండాఫ్ పాత్రయాడు చిన్నదొంగరాముడు...

సికిందర్

12, అక్టోబర్ 2018, శుక్రవారం


Dear Readers!

The daily postings of blog articles has gone off track of late, as a full time assignment, which may consume atleast two months of time, has over taken it. However  we will try hard to bring out the latest articles to you as and when possible, frequently.

***

8, అక్టోబర్ 2018, సోమవారం

693 : స్క్రీన్ ప్లే సంగతులు


        దొంగ రాముడు దొంగతనాలు అలవాటైన వృత్తి దొంగేమీ కాదు. ఎంతో తప్పనిసరై జీవితంలో రెండే సార్లు దొంగతనం చేస్తాడు. మామూలుగా చిన్నప్పట్నుంచీ కట్టుకథలు చెప్పి పబ్బం గడుపుకునే రకం. ఈ కట్టు కథలు వినేవాళ్ళ దృష్టిలో గొప్ప హీరోని చేస్తాయి. దీపావళికి టపాకాయలకి తల్లి దగ్గర అర్ధరూపాయి అడుక్కుని, దాన్ని ఐదు రూపాయలు చేసి బోల్డన్ని టపాకాయలు కొనుక్కు వస్తానని చెల్లెలికి చెప్పేసి, స్కూలెగ్గొట్టి టౌను కెళ్ళిపోతాడు. టౌనులో జూదమాడి అర్ధరూపాయిని ఐదు రూపాయలు చేసుకుని, సంచీ నిండా టపాకాయలతో సాయంత్రం ఇంటి కొచ్చేసరికి, ఇంటి దగ్గర బెత్తం పుచ్చుకుని పంతులు రెడీగా వుంటాడు. వెంటనే దొంగరాముడు తన ఎవర్రెడీ బాణం విసురుతాడు- టౌన్లో ఇళ్ళు తగలబడ్డాయనీ, మంటల్లోకి దూకి ఒక ఆవు దూడని కాపాడేననీ, దాంతో చైర్మన్ గారు బోలెడు టపాకాయలూ మిఠాయిలూ కొనిపెట్టారనీ చెప్పిపారేస్తాడు. కొడదామనుకున్న పంతులు కాస్తా వాడి హీరోయిజాన్ని నమ్మేసి విస్తుపోతాడు. 

         
దొంగరాముడు చెల్లెలితో కలిసి స్కూలుకెళ్తాడు. స్కూలుకొస్తే సాయంత్రం ఇంటి కెళ్ళేప్పుడు వాడి కాలికి సంకెళ్లేసి బండ కడతాడు పంతులు. ఆ బండ నెత్తిమీద మోస్తూ తిన్నగా ఇంటికే వెళ్ళాలి వాడు. అడ్డమైన తిరుగుళ్ళూ తిరగడానికి లేదు. తల్లి గుండె జబ్బు మనిషి. ఏ పనీ చేతగాదు. ఇల్లు గడవడానికి సామాన్లు అమ్మేస్తూంటుంది. ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోతుంది. డాక్టర్ అర్జెంటుగా తెమ్మని మందులు రాసిస్తాడు. ఆ మందులు కొనడానికి రెండు రూపాయలు అడుక్కుంటే, వాడి సంగతి తెలిసిన వాళ్ళెవరూ వాడి మాటలు నమ్మి సాయం చేయరు. దాంతో దొంగతనం చేసేస్తాడు. ఆ మందులతో ఇంటికి వచ్చేలోగా పోలీసులు పట్టుకుంటారు. ఇంటి దగ్గర తల్లి చనిపోతుంది. చెల్లెలు అనాధ అవుతుంది.

          ఈ బాల్య కథ సుదీర్ఘంగా 25 నిమిషాలుంటుంది. ఇందులో అన్నాచెల్లెల అనుబంధం చూపిస్తూ ఒక పాట కూడా వుంటుంది. ఈ బాల్య కథలో ముందు ముందు కథ కవసరమైన దొంగరాముడి పాత్ర తీరుతెన్నులతో పాటు, చెల్లెలి పట్ల బాధ్యత చూపించారు. ఈ బాల్య కథని ముగింపుకి తేవడానికి తల్లికి గుండె జబ్బున్నట్టు చిత్రించారు. తల్లి చనిపోవడం, మందుల కోసం దొంగతనం చేసి దొంగరాముడు పోలీసులకి చిక్కడంతో ఈ బాల్య కథ ముగుస్తుంది. ఈ ముగింపు రెండు ప్రశ్నల్ని లేవనెత్తుతుంది : తల్లి చనిపోయిందనీ, దాంతో చెల్లెలు అనాధ అయ్యిందనీ దొంగరాముడికి ఎప్పుడు తెలుస్తుంది? తెలుసుకుని ఏం  చేస్తాడు?... అన్నవి. 

          ఇందులో దొంగ రాముడు పెద్దయ్యాక ప్రేమకథకి పనికొచ్చే పునాదులెక్కడా వేయలేదు. ఓ దేవాదా ...అనే పాటతో అప్పటికే ‘దేవదాసు’ లో చిన్నప్పట్టి దేవదాసు - పార్వతిల ప్రేమ కథ, ఇదే అక్కినేని – సావిత్రిలతో తాజాగా వుండనే వుంది. మళ్ళీ దాన్నేఇక్కడా చూపించలేరు. పైగా దొంగరాముడు సినిమా ప్రేమకథ కాదనీ, అన్నా చెల్లెల ప్రేమ కథనీ ఈ బాల్య కథతో పొరపాటు లేకుండా చెప్పేశారు. కథ ఏ నేపధ్యంలో సాగుతుందో చెప్పేసి అందుకనుగుణంగా ప్రేక్షకుల్ని సిద్ధం చేసేశారు. నిజానికి స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగపు ప్రథమ కర్తవ్యం ఇదేనని స్ట్రక్చర్ గురించి అవగాహన వున్న మనకి తెలిసిందే.

          తల్లికి మందుల కోసం దొంగతనం చేయడమనే సన్నివేశం ఈ సినిమా తర్వాత కూడా ఒక ఫార్ములా టెంప్లెట్ లా గా అనేక సినిమాల్లో కొనసాగిందే. తమిళ,  హిందీ సహా. అయితే మందులు కొనడానికి ఎవరూ సాయం చేయలేదని సమాజం మీద కక్ష పెంచుకునే అవకాశం లేదు దొంగరాముడుకి. యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలు తయారుకావడానికి దీని తర్వాత ఇంకో రెండు దశాబ్దాల సమయముంది. అప్పటికి సమాజం అవినీతిమయమై హీరో నీతిపరుడయ్యాడు. కాబట్టి తిరగబడ్డం మొదలెట్టాడు. దొంగరాముడు నాటికి దొంగరాముడే అవినీతి పరుడు. అంటే యాంటీ హీరో. తన అలవాట్లతో తనకి తానే యాంటీ అయ్యాడు, ఇంకో విలన్ అవసరం లేకుండా. వూళ్ళో చెడ్డ పేరు తెచ్చుకుని నమ్మకం పోగొట్టుకున్నాడు. అందుకే మందులు కొనాలని నిజం చెప్పినా ఎవరూ నమ్మ లేదు. అంటే ఈ బాల్య కథ ముగింపు దొంగరాముడ్ని చిన్నతనంలోనే ఒక జీవితపు చౌరస్తాకి చేర్చిందన్న మాట. 

          తల్లి మరణంతో ఈ చౌరస్తాలో ఏం నేర్చుకుని ఎటు వెళ్ళాలి తను? ముందుగా అబద్ధాలతో మాయలు చేయడం మానెయ్యాలి, మంచివాడుగా పరివర్తన చెంది చెల్లెల్ని చూసుకోవాలి...పాత్ర ఈ కూడలికి చేరుకున్నాక, ఈ క్యారెక్టర్ ఆర్క్ తోనే తర్వాతి కథ ముందుకు నడవాలన్న మాట. అంటే ఏమిటర్ధం? ఈ మలుపు ఈ మొత్తం స్క్రీన్ ప్లేకే ఒక ప్లాట్ పాయింట్ వన్ అనే కదా?

***
        దొంగరాముడు స్క్రీన్ ప్లేకి కథని ప్రారంభించే విషయంలో అర్ధం జేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేమిటంటే,  ఈ చిన్నప్పటి కథని తర్వాత హీరో పెద్దయ్యాక చూపించే కేవలం పాత్రచిత్రణ కోసం ఉద్దేశించలేదు, పక్కాగా కథా ప్రారంభం కోసమే ఉపయోగించారు. గంటంపావు ఫస్టాఫ్ కథంతా నడిపే కష్టమంతా లేకుండా, ఓ అరగంట సేపు చిన్నప్పటి సోసో ముచ్చట్లతో కాలక్షేపంగా భర్తీ చేసేద్దామనుకోలేదు. అలా అనుకుని వుంటే ఇప్పుడొస్తున్న ఎన్నో సినిమాల్లాగా డొల్లగా తయారయ్యేది ఫస్టాఫ్. ఇప్పుడొస్తున్న ఇలాటి సినిమాలేమిటి? చిన్ననాటి అచ్చిబుచ్చి ముచ్చట్లతో కాలక్షేపం చేసి, తర్వాతెప్పుడో  పెద్దయ్యాక కథ ప్రారంభించి చేతులు దులుపుకోవడమేగా? 

          ఈ పరుగులెత్తే గ్లోబల్ యుగంలో కూడా హీరో లేదా హీరో హీరోయిన్ల చిన్ననాటి ముచ్చట్లతో సినిమాలు ముసలితనంగా ప్రారంభించడమే ఒక చైల్డిష్ పని. స్పూన్ ఫీడింగ్ కూడా. చైల్డ్ ఆర్టిస్టులతో ఇప్పుడింకా ఈ చిన్నప్పటి కథలు చూపించడమే ఫూలిష్ నెస్. సినిమాల్ని పోషిస్తున్న యువప్రేక్షకులు తీరిగ్గా కూర్చుని బాలనటుల్నిచూడాలనుకుంటారా, లేక స్క్రీన్ మీద వెంటనే తమ అభిమాన స్టార్స్ ని చూడాలనుకుంటారా?  ఏది యూత్ అప్పీల్? ఏది మార్కెట్ యాస్పెక్ట్? ఈ మేకింగ్ స్పృహే లేకుండా స్టార్స్ ని పక్కన పడేసి, బాల నటుల్ని ఎత్తుకుని చూపిస్తూ, బచ్కానా దృశ్యాలతో తమ తృప్తి ఏదో తాము తీర్చుకుంటున్నారు దర్శకులు. 

          ఈ తీర్చుకోవడంలో కథాపరంగా ఏ ప్రయోజనమూ వుండదు. కేవలం పాత్ర పరంగానే తృప్తి తీర్చుకోవడం. అదెలాగంటే, చిన్నప్పుడు హీరో ఇంత తెలివిమంతుడనో, లేదా చిన్నప్పట్నుంచీ హీరో ఇంత బద్ధకస్థుడనో, ఇంకా లేదా చిన్నప్పుడే ‘ప్రేమించుకున్న’ హీరోహీరోయిన్లు విడిపోయారనో ...లాంటి కేవలం క్యారెక్టర్ ని లేదా అచ్చిబుచ్చి ప్రేమల్ని ఎస్టాబ్లిష్ చేసే బాల్య చేష్టలు చూపించడం వరకే చేస్తారు. స్క్రీన్ ప్లేలో ఇది ఏ విభాగానికి చెందుతుందంటే, ఏ విభాగానికీ చెందదు. ఎందుకంటే, బిగినింగ్ విభాగానికి చెందాలంటే దీంట్లోకథా నేపధ్యపు ఏర్పాటు, పాత్రల పరిచయం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్యా స్థాపన అంటే ప్లాట్ పాయింట్ వన్ అనే నాల్గు టూల్స్ వుండాలి. తద్వారా ఆ ప్రధాన పాత్రకి ఒక గోల్ అంటూ ఏర్పడి కథా ప్రారంభమవాలి. ఇవన్నీ నేటి సినిమాల్లో చూపిస్తున్న బాల్య సంగతుల్లో వుంటున్నాయా?  

          కనుక ఈ బాల్య సంగతులిలా బిగినింగ్ విభాగపు బిజినెస్ నే ప్రదర్శించకుండా పోయాక – ఇక మిడిల్, ఎండ్ విభాగాల ప్రసక్తెక్కడిది? మరి స్క్రీన్ ప్లేలో ఈ బాల్యపు ముక్కని ఎలా పరిగణించాలి? దీన్ని జస్ట్ స్క్రీన్ ప్లేలోకి అనధికారిక చొరబాటు మాత్రంగానే పరిగణించాలి. ఈ ముక్క లేకపోయినా సినిమాకే నష్టం రాదు. ఏ రసాత్మక విలువనీ తగ్గించదు. ఎలాగంటే,  చిన్నప్పట్నించే వీడిలాటి వాడని చెప్పడానికే తప్ప ఇది పాత్రని పరిచయం చెయ్యదు. తర్వాత హీరో పెద్దయ్యాక ఇంకేదో చేస్తూ పరిచయమవుతాడు. అప్పుడే కథా నేపధ్యం ఏర్పాటవుతుంది, అప్పుడే మిగతా పాత్రలూ పరిచయమవుతాయి, అప్పుడే సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా జరుగుతుంది, అప్పుడే సమస్యా స్థాపనా జరిగి, ప్లాట్ పాయింట్ వన్ తో ఆ హీరో కి గోల్ ఏర్పడుతుంది...

          అంటే హీరో పెద్దయ్యాకే జరిగే బిజినెస్ ఇదంతా కాబట్టి స్క్రీన్ ప్లేలో ఇదే బిగినింగ్ విభాగమవుతుంది. దీనికి ముందు చూపించే  చిన్ననాటి కచాపచ్చా ముచ్చట్లన్నీ ఏ విభాగానికీ చెందని దర్శకుడి / కథకుడి ‘తుత్తి’ తో కూడిన సుత్తి అవుతాయి. ఈ సుత్తితో కూడిన తుత్తికి అరగంట, పోనీ పావుగంటా నిడిపి ప్రొడక్షన్ ఖర్చంతా బడ్జెట్లో నెత్తురు కక్కుకుని బలి అవుతుంది. ఒకప్పుడు సినిమాల్లో పిల్లల్నీ, జంతువుల్నీ చూపిస్తే పిల్లలు మారాం చేసి పేరెంట్స్ ని వెంటబెట్టుకుని పొలోమని వచ్చేవాళ్ళు. ఇప్పుడే పిల్లకాయ బాల నటులున్నారని వస్తున్నాడు? ‘హలో’ లో అరగంట సేపు అంత అత్యద్భుతంగా బుడ్డోడినీ, బుడ్డిదాన్నీ చూపించినా ఒక్క బచ్చా కూడా అమ్మా బాబుల్ని వెంటబెట్టుకుని ఎగరేసుకుంటూ రాలేదు. పైగా కుర్ర ప్రేక్షకుడేమో  – సినిమా కొస్తే నా క్రేజీ స్టార్ ని చూపించకుండా, ఈ చైల్డ్ ఆర్టిస్టుల గోలేంట్రా సత్తెకాలపు డైరెట్రుకీ అని అప్పుడే సువాసనల జెల్ పట్టించుకుని వచ్చిన జుట్టంతా పీక్కోవడమే. ‘జవాన్’ లో కూడా ఇలాటిదే తుత్తి తీర్చుకుని సినిమాని అందమైన అట్టర్ ఫ్లాప్ గా తీర్చిదిద్దుకున్నారు. ‘మళ్ళీ రావా’ లో బాల నటుడి టాలెంట్ ముందు అసలు హీరో తగ్గిపోయి, బాల నటుడికే పేరొచ్చింది. యూత్ అప్పీలా? స్టార్ తో మార్కెట్ యాస్పెక్టా? ఎవడిక్కావాలి? బచ్చా కతలతో తుత్తి తీరాలి!

***
     దొంగరాముడులో ఇలా అర్ధం లేకుండా చిన్ననాటి 25 నిమిషాల సంగతుల్ని పాత్ర ఫలానా ఇలాటిదని చూపించడనికి వాడుకోలేదు. పాత్ర తత్త్వంతో బాటు పాత్రకి చిన్నప్పుడే కథని కూడా ప్రారంభిస్తూ గోల్ ని ఏర్పాటు చేసేశారు. తల్లికి మందులకోసం దొంగగా మారి పోలీసులకి పట్టు బడడం, తల్లి చనిపోవడం, చెల్లెలు దిక్కులేనిదవడం -  ఇవన్నీ స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగపు బిజినెస్ కి తార్కాణాలే. ఈ మూడు విపరిణామాలతో దొంగరాముడు చిన్నప్పుడే జీవితపు చౌరస్తాలో నిలబడ్డాడు – ఇప్పుడేం చెయ్యాలి? అన్న ప్రశ్నతో, గోల్ తో. అందుకని ఈ చౌరస్తా ప్లాట్ పాయింట్ వన్ అయిందన్న మాట. ఈ చిన్ననాటి అధ్యాయం స్క్రీన్ ప్లేలో నేరుగా బిగినింగ్ విభాగమే కాబట్టి, దీని కథనంలో పైన చెప్పుకున్న టూల్స్ నాల్గూ కన్పిస్తున్నాయి. 

          చాలా అద్బుతమైన ప్రక్రియని ఆనాడు చేపట్టారు కేవీ  - డీవీ - దుక్కిపాటి  త్రయం. హీరోకి చిన్నప్పుడు పాత్రచిత్రణతో బాటు, చిన్నప్పుడే కథని కూడా అందించేశారు. దీంతో ఇది పరిపూర్ణ బాల్య కథయ్యింది. ఇప్పుడెలా చేస్తున్నారు? కేవలం చిన్నప్పుడు పాత్ర లక్షణాలు చూపించి, కథనివ్వకుండా అసంపూర్ణ బాల్య కథ చేస్తున్నారు. కేవలం పాత్ర ఎలాటిదో చెప్పడానికి చిన్నప్పటి సీన్లు వేసి ప్రేక్షకులకి స్పూన్ ఫీడింగ్ చేయనవసరం లేదు. చిన్నప్పటి కథనం తీసి పారేసి నేరుగా స్టార్ ని ఆ లక్షణాలతో చూపించేసి, ఇతను చిన్నప్పట్నుబంచీ ఇంతేనని ఒక్కమాటలో చెప్పేస్తే సరిపోతుంది. 

          ఈ ప్రక్రియ దొంగరాముడి చిన్నప్పటి పాత్రతోనే చేశారు!
          పంతులు దొంగరాముడ్నిదండిస్తూ, ‘ఏరా బుద్దొచ్చిందా? చెట్లెక్కి కోతి కొమ్మచ్చి లాడతావా? బళ్ళో పిల్లల్ని అందర్నీ కొడతావా? తోటలో దొంగతనాలు చేస్తావా? రోజూ బళ్ళో కొస్తావా?’ అని పంతులుతో చెప్పించేయడంతో దొంగరాముడు చిన్నప్పుడు ఎలాటివాడో సీన్లు వేసే అవసరమే రాలేదు. వాడి ఈ లక్షణాలతో కూడిన రెండు సీన్లని – సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన - కోసమే ప్రయోజనకరంగా వేశారు. 

          ఇలా దొంగరాముడి స్క్రీన్ ప్లే  ఏకంగా చిన్ననాటి కథతోనే బిగినింగ్ విభాగంగా మొదలయ్యింది. ఇది విషాదంగా ముగిసి, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడిపోయింది ఒక గోల్ తో. ఇక పెద్దవాడుగా ఎంటరయ్యే దొంగరాముడికి, కథ నడపడానికి ఆల్రెడీ ఏర్పాటైన చిన్ననాటి గోలే అంది వచ్చింది. కనుక, అతడి ఎంట్రీతో ఇక మిడిల్ విభాగం ప్రారంభమైపోతుందన్న మాట! ఎంత సమయం ఆదా, ఎంత బడ్జెట్ ఆదా! అసలు హీరో ఎంట్రీతో ఏకంగా మిడిల్ విభాగం ప్రారంభమైపోయే సినిమా ఇంకేదైనా వుందా? ఇకముందు వుండడానికి ఇదేమైనా  స్ఫూర్తి అవుతుందా?

సికిందర్ 

3, అక్టోబర్ 2018, బుధవారం

692 : స్క్రీన్ ప్లే సంగతులు


          తెలుగు సినిమా మలిస్వర్ణ యుగంలో పాతాళభైరవి తర్వాత దొంగరాముడు పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో బోధనాంశంగా స్థానం సంపాదించుకుంది. సినిమా విడుదలై అరవై యేళ్ళు దాటింది. ఈ అరవై ఏళ్ళ కాలంలో సినిమా ధోరణులు ఆరు సార్లు మారుతూ వచ్చాయి. పదేళ్లకో ధోరణి (ట్రెండ్) మారిపోతూ వుంటుంది. తొలిస్వర్ణ యుగమైనా (1931-51), మలిస్వర్ణ యుగమైనా (1951- 71) అప్పట్లో సినిమాలు పూర్తిగా వ్యాపారాత్మకం కాలేదు. దేశస్వాతంత్ర్యానికి పూర్వం రెండు దశాబ్దాలు, స్వాతంత్ర్యానికి తర్వాత ఇంకో రెండు దశాబ్దాలుగా అటూ ఇటూ సాగిన ఈ రెండు స్వర్ణ యుగాలూ, విలువలకి పట్టం గట్టాయంటే  అప్పటి దేశకాల పరిస్థితులు అలాటివి. దేశభక్తి ముందు అవినీతి రాజకీయాల్లేవు, స్వార్ధపూరిత జీవితాలు లేవు. దేశంలో మొట్ట మొదటి స్కామ్1980 లలోనే బోఫోర్స్ తో ప్రారంభమైంది. అలా జీవితాల్లో విలువలు తరిగి పోవడంతో,  తొలివ్యాపార యుగపు (1971 – 2000) సినిమాల్లో కూడా విలువలకి స్థానం లేకుండా పోయింది. ఇక 2000 నుంచి ప్రారంభమైన మలి (కల్తీ) వ్యాపార యుగం గురించి చెప్పనవసరం లేదు. ఇవి కూడా విలువలే, కాకపోతే లపాకీ విలువలు. 

          యితే విలువలు ఎలాటివైనా వాటిని చిత్రించేందుకు కొన్ని ప్రమాణాలు వుంటాయి. ప్రమాణాలకి కూడా విలువలు తీసేస్తే?  అప్పుడు మలి (కల్తీ) వ్యాపార యుగమైనా వ్యాపారంలా వుండదు. 90 శాతం అట్టర్ ఫ్లాపులతో పాపంలా పెరుగుతుంది. 

          నాటి మలిస్వర్ణ యుగం సమాజంలో విలువలు - సినిమా నిర్మాణంలో ప్రమాణాలూ అనే జోడుగుర్రాల స్వారీగా సాగినట్టు కనబడుతుంది చరిత్ర చూస్తే. సమాజ విలువల్ని కాపాడుతూనే; రచనలో, దర్శకత్వంలో, నటనల్లో ప్రమాణాలు నెలకొల్పడం. పాతాళ భైరవి, మిస్సమ్మ, మల్లీశ్వరి, మాయాబజార్, దేవదాసుల నుంచి మొదలుకొంటే; మూగమనసులు, మోసగాళ్ళకు మోసగాడు, సాక్షి, మరో ప్రపంచం, సుడి గుండాలు వరకూ ఈ ప్రమాణాలు - ఇప్పుడు మాయమైపోయిన ఎన్నో వైవిధ్యభరిత జానర్లని కూడా అందించాయి. తొలి స్వర్ణయుగపు ప్రతీకలైన భక్తీ, పౌరాణిక, చారిత్రాత్మక, సామాజిక, కుటుంబ జానర్లని కొనసాగిస్తూనే; విప్లవ, హాస్య, ప్రేమ, వాస్తవిక, గూఢచారి, కౌబాయ్, హార్రర్, క్రైం థ్రిల్లర్ మొదలైన ఇతర జానర్లెన్నోమలి స్వర్ణయుగంలో ప్రవేశ పెట్టినవే. అంతే కాదు, సార్వజనీన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లేలు పరిఢవిల్లింది కూడా ఈ కాలంలోనే. స్ట్రక్చర్ ని నిలుపుకుంటూనే స్ట్రక్చర్ లోపల విభిన్న క్రియేటివిటీలు, తత్సంబంధ టెక్నిక్కులు, ఫార్ములాలూ కనిపెట్టింది కూడా ఈ కాలంలోనే. ఊత పదాలు సహా ఐటెం సాంగుల్ని పరిచయం చేసింది కూడా ఈ మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే ఊతపదాలు ప్రతినాయక పాత్రలకి రాశారు. పాతాళభైరవి ఎస్వీ రంగారావు నోట ‘సాహసం శాయరా డింభకా’, దొంగ రాముడులో ఆర్ నాగేశ్వరరావు చేత ‘బాబుల్ గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి’  లాంటివి. పాతాళభైరవిలో ‘వగలోయ్ వగలు’  అనే పాట ఐటెం సాంగే. ఐతే ఈ పాటని కథలో వుంచుతూ, కథని మలుపు తిప్పే ఘట్టంగా చిత్రించారు. యాభయ్యేళ్ళ తర్వాత ప్రారంభమైన ఇదే ఐటెం సాంగుల ట్రెండులో కథతో సంబంధంలేని కరివేపాకు పాటలయ్యాయి. ఇక లో - బడ్జెట్ లో సాక్షి, సుడిగుండాలు, మరోప్రపంచం లాంటి వాస్తవిక ప్రయోగాత్మక సినిమాలని తీయడాన్ని ప్రారంభించింది కూడా మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే చివరి అంకంలో. 

        మలి స్వర్ణ యుగంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, కథల్ని తేటగా, నునులేతగా, సహజత్వంతో కూడుకున్న నిరాడంబర కథనాలుగా చూపించే వారు. డైలాగుల మోత, మెలో డ్రామా వుండేవి  కాదు. ఇదంతా తర్వాత తొలివ్యాపార యుగంలో హీరోయిజాల, వూర హీరోయిజాల కొత్త ట్రెండ్ లో  తిరగబడింది. వాస్తవికత, సహజత్వాలనేవి జవసత్వాలు చాలించి కూర్చున్నాయి. ఒవరాక్షన్లు, అతి డైలాగులు, రక్త స్నానాలు, బూతు జలకాలూ, మెలో డ్రామాలు, నాటకీయతలూ, అమల్లోకి వచ్చాయి. మలి (కల్తీ) వ్యాపార యుగంలోనూ గత నాల్గైదు ఏళ్ల క్రితం వరకూ ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి ఇప్పుడు కాస్త మారుతోంది. అంటే నాటి మలి స్వర్ణయుగంలోకి ప్రయాణం కడుతోంది. అప్పటి సహజత్వాలు, అప్పటి వాస్తవికతలు, అప్పటి తక్కువ సంభాషణలు, అప్పటి తేటదనాలే కాకుండా, అప్పటి ప్రయోగాత్మక ప్రయత్నాలూ ఇప్పుడు కనబడుతున్నాయి. అయితే ఈ ప్యాకేజీలో ఒకటే లోపం – మలిస్వర్ణ యుగపు కథ చెప్పే టెక్నిక్, అప్పటి డైనమిక్స్ మచ్చుకైనా కానరాకపోవడం. అసలు కథనాల్లో డైనమిక్స్ అంటే ఏమిటో, అవెలా ఏర్పడతాయో, వాటి ప్రయోజనాలేమిటో అసలే అర్ధంజేసుకోలేక పోవడం.  

          దొంగరాముడు మలిస్వర్ణ యుగపు 1955 లో విడుదలైంది. ఇప్పుడు చరిత్ర పునరావృతమవుతున్నట్టు, లపాకీ విలువల మలి (కల్తీ) వ్యాపార యుగం, తెలియకుండానే నాటి మలిస్వర్ణ యుగపు సొగసులు అద్దుకుంటున్నఈ చారిత్రక మలుపులో -  సృజనాత్మకతా పరంగా దొంగరాముడ్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరముందని పక్కాగా తేలింది. ఈ కల్తీ యుగం తర్వాత మిగిలేది యుగాంతమేనేమో తెలీదు. ‘మేరా నామ్ జోకర్’ లో రాజ్ కపూర్ పాడినట్టు - ఈ సర్కస్ మూడు గంటల షో...మొదటి గంట బాల్యం, రెండో గంట యౌవనం, మూడో గంట వృద్ధాప్యం...ఆ తర్వాత – ఖాళీ ఖాళీ కుర్చీలే, పిచ్చుకలెగిరి పోయిన గూళ్ళే... లాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకోకూడదంటే, ఇంకా ముసలి సినిమాలు రాయకుండా తీయకుండా వుండాలంటే - కుర్చీలు ఖాళీ అయిపోకుండా వుండాలంటే – పరవళ్ళు తొక్కిన మలిస్వర్ణ యుగంతో గుణాత్మకంగా బంధుత్వాన్ని కలుపుకోవాల్సిందే.

***
       దొంగ రాముడులో డైనమిక్స్ ఎక్కువ. కథ నిదానంగా దాని సమయం తీసుకుంటూ సాగినా, దృశ్యాల్లో కన్పించే డైనమిక్స్ ఎక్కువ. హీరో చిన్నప్పటి కథ పూర్తవడానికి 25 నిమిషాలు పడుతుంది. అప్పుడు మాత్రమే ఎదిగిన హీరోగా దొంగరాముడు (అక్కినేని నా గేశ్వర రావు) కనిపిస్తాడు. ఆ తర్వాత ఇంకో 15 నిమిషాలకి గానీ హీరోయిన్ సీత (సావిత్రి) కన్పించదు. ఆ తర్వాత 5 నిమిషాలకి గానీ ఇంకో ముఖ్యపాత్ర దొంగరాముడి చెల్లెలు లక్ష్మి (జమున) తెరపైకి రాదు. అంటే నాగేశ్వరరావు, సావిత్రి, జమునలు వంటి ప్రముఖ తారలు ప్రేక్షకులకి తెరమీద కన్పించడానికి అరగంట నుంచీ ముప్పావు గంట సమయమూ  తీసుకుంటారన్న మాట. అప్పటికి ఆక్కినేని –సావిత్రిల సూపర్ హిట్ దేవదాసు విడుదలై రెండేళ్ళయింది. అయినప్పటికీ కూడా అంతటి పాపులర్ తారల ఇమేజిని, ఫాలోయింగ్ నీ దృష్టిలో పెట్టుకుని దొంగరాముడు కథ చేయలేదు. అప్పట్లో ఇంకా హీరోయిజాలు ప్రారంభం కాలేదు కాబట్టి, తారలు కాకుండా కథ, అది తీసుకునే సమయమే ప్రధానమైంది. తర్వాత వ్యాపార యుగం నుంచీ ప్రారంభమైన తారల గ్లామర్ హంగూ ఆర్భాటాలతో పోలిస్తే, మలిస్వర్ణ యుగంలో కన్పించేది గ్లామర్ లేని పాత్రలే. ఏవైతే 1970 లలో ఆర్టు సినిమాలంటూ రావడం ప్రారంభించాయో, వాటిలో వుండే బీదాబిక్కీ తరహా గ్లామర్ లేని సామాన్య పాత్రల్నే మలిస్వర్ణ యుగంలో సహజత్వానికి ధర్మాసనం వేస్తూ ప్రేక్షకులకి అందించారు. 

          దొంగరాముడులో ఇంకో ముఖ్య పాత్ర కన్పించదు. అది విలన్ పాత్ర. విలన్ లేకుండానే దొంగరాముడికి కష్టాలుంటాయి. అతడి చేష్టలు చాలు తనకి తానే విలన్ అవడానికి. 

          దొంగరాముడు నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు; దర్శకుడు – స్క్రీన్ ప్లే రచయిత కెవి రెడ్డి, కథ కెవి రెడ్డి, డివి నరసరాజు, దుక్కిపాటి మధుసూదన రావు; మాటలు డివి నరసరాజు, సంగీతం పెండ్యాల, ఛాయాగ్రహణం ఆడి ఎం ఇరానీ, ఇతర తారాగణం జగ్గయ్య, రేలంగి, ఆర్ నాగేశ్వరరావు, సూర్యకాంతం తదితరులు. 

          దొంగరాముడు కథ అరగంటకోసారి రిపీటవుతూ వుంటుంది. దీంతో మూడు క్లయిమాక్సులు వున్నట్టుగా అన్పిస్తుంది. భవిష్యత్తులో 1998 లో రన్ లోలా రన్ లాంటి మూడు క్లయిమాక్సుల మూవీ వస్తుందని అప్పుడే వూహించారేమో. కొన్ని అలా జరిగిపోతాయి. 

          దొంగరాముడు చిన్నప్పుడు అలా చేసి వుండకపోతే జైలుకి వెళ్ళేవాడు కాదు. విడుదలై  పెద్దోడుగా అలా చేసి వుండక పోతే మరోసారి జైలుకి వెళ్ళే వాడు కాదు. మళ్ళీ విడుదలయ్యాక అలా కూడా చేసి వుండక పోతే ఇంకోసారీ జైలుకి వెళ్ళే వాడే కాదు. మరి ఏంచేసి వుండాలి దొంగరాముడనే వాడు?



 రేపు!

సికిందర్