రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, మార్చి 2019, శుక్రవారం

801 : రివ్యూ





దర్శకత్వం : అనురాగ్ సింగ్
తారాగణం : అక్షయ్ కుమార్, పరిణీతీ చోప్రా, సుమీత్ సింగ్ బస్రా, రాకేష్ శర్మ, మీర్ సర్వర్, అశ్వథ్ భట్, రామ్ అవానా తదితరులు
రచన : అనురాగ్ సింగ్, గిరీష్ కొహ్లీ, సంగీతం : తనిష్ బాగ్చీ, చిరంతన్ భట్ తదితరులు, ఛాయగ్రహణం : అన్శుల్ చోబే
బ్యానర్ : ధర్మా, అజూరే, కేప్ ఆఫ్ గుడ్, జీ స్టూడియోస్
నిర్మాతలు : కరణ్ జోహార్,  అరుణా భాటియా తదితరులు 
***         చారిత్రక సినిమాల సీజన్ లో మరుగున పడిపోయిన చరిత్రలు వెలుగు చూస్తున్నా యి. మనం మర్చిపోయి, బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పటికీ స్మరించుకుంటూ వార్షికోత్సవం జరుపుకుంటున్న సిక్కు పోరాట యోధుల ఆత్మబలిదానాన్ని ఎట్టకేలకు కరణ్ జోహార్ తెరకె క్కించాడు. హవల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలో 21 మందితో కూడిన సిక్కు రెజిమెంట్, ఆఫ్ఘన్ దురాక్రమణాన్ని ఎదుర్కొన్న చారిత్రక పోరాట ఘట్టం అక్షయ్ కుమార్ హీరోగా ‘కేసరి’ టైటిల్ తో విడుదలైంది. ఇదెలా వుందో చూద్దాం...

కథ 
      ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో రాక్షస భర్తని వదిలి పారిపోతున్న ఒకామెని వెంటాడి వస్తూంటారు ముల్లా మనుషులు. ఇటు సరిహద్దులో గులిస్తాన్ పోస్టు నుంచి ఇది చూస్తున్న హవల్దార్ ఇషార్ సింగ్ (అక్షయ్ కుమార్) వెంటనే ఆమెని కాపాడడానికి సిద్ధమవుతాడు. అటు వెళ్ళ వద్దని బ్రిటిష్ లెఫ్టినెంట్ లారెన్స్ (ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్) వారిస్తున్నా వినకుండా వెళ్లి మూకని చంపి, ఆమెకి శిరచ్ఛేదం గాకుండా కాపాడి తీసుకొచ్చేస్తాడు. దీంతో ఆఫ్ఘన్ ముల్లా సైదుల్లా (రాకేష్ చతుర్వేదీ ఓం) కక్ష గడతాడు. సైన్యాన్ని రెచ్చగొట్టి గులిస్తాన్ పోస్టు మీద జిహాద్ జరపాలంటాడు. పఠాన్ సైనిక నాయకులు ఖాన్ మసూద్ (మీర్ సర్వర్), గుల్ బాద్షా ఖాన్ (అశ్వథ్ భట్) లు గిరిజన దండునేసుకుని కోట మీద భీకర దాడి జరుపుతారు. ఇషార్ సింగ్ తన పటాలంతో ఈ దాడిని విజయవంతంగా తిప్పి కొడతాడు. దీంతో దీనికంతటికీ నువ్వే కారణమని ఇషార్ సింగ్ ని బదిలీ చేసేస్తాడు లెఫ్టినెంట్ లారెన్స్. సుదూరంగా వున్న సరగర్హీ ఆర్మీ పోస్టు (కోట) కి వెళ్లి బాధ్యతలు తీసుకుంటాడు ఇషార్ సింగ్. అక్కడ 36 వ సిక్కు రెజిమెంటుకి చెందిన 21 మంది సైనికులు పనీ పాటా లేక కోళ్ళ పందాలు ఆడుకుంటూ వుంటారు. ఎవరికీ సైనికుల లక్షణాలుండవు. వాళ్ళకి క్రమశిక్షణ నేర్పి సైనికులుగా తీర్చిదిద్దుతాడు.   

          ఇక ఇప్పుడు ఆఫ్ఘన్ పఠాన్లు, ముల్లా,  పదివేల మంది గిరిజనులతో సరగర్హీ మీదికే భారీఎత్తున దాడికొస్తారు. సరగర్హీ తో బాటు గులిస్తాన్, లొకార్ట్ కోటల్ని కూడా ముట్టడించే పెద్ద పథకంతో వస్తారు. 21 మంది సైనికులతో వున్న ఇషార్ సింగ్ ఈ పది వేల మందిని ఎలా ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
       ఇప్పటి పాకిస్తాన్లోని సరగర్హీలో 1897 సెప్టెంబర్ 12 న, 21 మంది సిక్కు- 10 వేల మంది ఆఫ్ఘన్ దళాల మధ్య 30 గంటలపాటు జరిగిన భీకర పోరాట వాస్తవ గాథ ఇది. వెనక్కి వచ్చేయమని బ్రిటిష్ అధికారులు ఆదేశాలిచ్చినా, ఆ పిరికిపంద చర్యకి మనస్కరించక, 30 గంటల పాటు చివరి శ్వాసవరకూ పోరాడి,180 మందిని హతమార్చి చనిపోయారు సిక్కు దళం. ఈ చరిత్రకి కల్పనని జోడించి తీసినప్పుడు దారితప్పి పోయారు. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అమరులైన వాళ్లకి నివాళిగా అంటూ ప్రారంభించే ఈ పోరాటం, మత ప్రతిష్ట కోసం చేసే వ్యక్తిగత పోరాటమన్నట్టుగా సాగుతుంది. దీనికి వ్యతిరేకంగా అటు ఆఫ్గన్ ఫైపు జిహాద్ అంటూ మతప్రాతిపదికన రెచ్చ గొడుతున్న ముల్లాని నిలదీస్తాడు పఠాన్ సైనిక నాయకుడు - భూభాగాల కోసం జరిగే యుద్ధంలో మతాన్నెందుకు లాగుతావని.  
  
           ఇటు ఇషార్ సింగ్ వేరే రంగుతో వున్నపగిడీ (తలపాగా) తీసేసి, కేసరి (కాషాయ రంగు) పగిడీ ధరించి పోరాటం చేయడంతో, ఈ కాల్పనిక చరిత్ర ఎన్నికల ప్రచార సాధనంగా మారిపోయింది - ఇవ్వాళ నా పగిడీ రంగు కేసరి, ఇవ్వాళ నా పారే రక్తం రంగు కేసరి, ఇవ్వాళ నేనిచ్చే సమాధానం రంగూ కేసరీ అంటూ. అటు ముల్లా ప్రభావంతో  ఆఫ్ఘన్లు కూడా మతం కోసమే రాక్షన కాండ ప్రారంభిస్తారు. ఇషార్ సింగ్ పోరాటంలో వీరమరణం పొందాక పఠాన్ నాయకుడు అంటాడు -  ఇతను నేలకొరిగాడని పగిడీ తీసి నేలమీద పారెయ్యకండని. ఇతడి మతాన్ని అగౌరవపర్చ కూడదన్న ఉద్దేశంతో. 

        దళంలో చివరి సైనికుడు చనిపోతూ, తమ మరణాన్ని పోరాట స్ఫూర్తిగా పెట్టుకున్న స్వాతంత్ర్య పోరాటంలో చనిపోయిన తన లాంటి వీరులకి నివాళిగా అర్పించక, నానక్ కీర్తనలు పాడి మరణిస్తాడు. ఇలా నిమిషానికో రకం సంకేతాలతో, సందేశాలతో సాగుతుందీ కాల్పనిక చరిత్ర చిత్రణ. లాజికల్ గా స్వాతంత్ర్య పోరాటంలో నేలకొరిగిన వీరులకి నివాళిగా సైనిక తత్వంతో  ప్రారంభించే పోరాటం, దారితప్పి జింగోయిజంగా మారిపోవడం కన్పిస్తుంది.

          సర్జికల్ స్ట్రయిక్  మీద తీసిన ‘యురీ’ లో సైనిక తత్వం తప్ప మతభక్తి, దేశభక్తి - వాటి జింగోయిజపు నినాదాలూ వుండవు. ఈ సరగర్హీ పోరాట గాథ,  ‘21 సర్ఫరోష్ - సరగర్హీ 1897’ అని  గత సంవత్సరం జింగోయిజం లేని పంజాబీ టీవీ సీరియల్ గా వచ్చింది. అన్ని మతాల వాళ్ళూ వుండే సైన్యానికి మతం వుంటుందా. 

          ఏవో రాజకీయ ఉద్దేశాలతో కల్పితాలు చేసి ‘కేసరి’ ని తీసినప్పుడు ఇంకోటి కూడా చేసి వుండాల్సింది. పోరాటం మధ్యలో చర్చల సందర్భం వస్తుంది. బలగం చాలని ఇషార్ సింగ్ ని లొంగిపొమ్మంటారు అవతలి పక్షం వాళ్ళు. అప్పుడు ఇషార్ సింగ్, ‘మీరు మత పోరాటంగా మార్చేశారు. మేమూ అలాగే మార్చాం. ఇది పోరాటంలో అకృత్యాలకి దారి తీస్తోంది. మత అల్లర్లుగా మారిపోయింది. ఇది చూసి ఇరువైపులా ప్రజలు మతోన్మాదులవుతున్నారు. ఇది మంచిది కాదు. మతం జగడం తేలేది కాదు. టైం వేస్టు. మీరు మతాన్ని పక్కనబెట్టి భూభాగం కోసం మాత్రమే పోరాడతామంటే మేమూ అలాగే పాయింటు మీద పోరాడతాం. ముందు ఇది తేలాలి. ఇది తేల్చడానికే ఇక ముందు చర్చలుంటాయి. తేలేదాకా కాల్పుల విరమణనే’ అని కూడా కల్పన చేసివుంటే కాంటెంపరరీగా ఇంకా బావుండేది. 
ఎవరెలా చేశారు 
     సూపర్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటన ఈ వయోలెంట్ పోరాట గాథకి హైలైట్. అన్యాయాన్ని, అవమానాన్నిసహించని ముక్కుసూటి వ్యవసాయదారుడైన తను సైనికుడయ్యాక అదే సంకల్పంతో కొనసాగుతూ ఆకర్షిస్తాడు. వూళ్ళో తల్లీ, భార్యా -  వాళ్ళతో అనుబంధమూ ఇవన్నీ సున్నితంగా ప్రదర్శిస్తాడు. క్రమశిక్షణ లేని దళాన్ని తీర్చిదిడ్డంలో జరిగే హాస్య ప్రహసనాల్లో మాత్రం సీరియస్ గా వుంటాడు. లెఫ్టినెంట్ తనని బదిలీ చేస్తూ అవమానించడంతో తనకి జ్ఞానోదయమైన భావాన్ని పటిష్టంగా ప్రదర్శిస్తాడు. మీరు బానిసలనీ,ఇక్కడి మట్టిలో పిరికిపందలే పుడతారనీ లెఫ్టినెంట్ అవమానించడాన్ని సీరియస్ గా పట్టించుకుని ఫీల్ ని పుట్టిస్తాడు. దేనికి మనం ప్రాణాల్ని త్యాగం చేయాలి? బ్రిటిష్ వాళ్ళ కోసమా? జీతాల కోసమా? యూనిఫామ్స్  కోసమా? - అని కేసరీ పగిడీ ధరించి వచ్చి, మన పోరాటం, ప్రాణత్యాగం స్వాతంత్ర్య పోరాటంలో అమరుల కోసమని అంటాడు. కానీ కేసరీ పగిడీతో మతప్రతిష్ట ఫీలై పోరాడతాడు. 

            గత సంవత్సరం పంజాబీలో ‘సజ్జన్ సింగ్ రంగ్రూత్’ అనే మూవీ విడుదలైంది. ఈ చారిత్రక కథలో సజ్జన్ సింగ్ అనే సిపాయి మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరపున జర్మన్లతో పోరాడి వీరమరణం పొందుతాడు. యుద్ధంలో పాల్గొంటున్నప్పుడు అతడి అంతర్మథనం ఒక్కటే - ఈ యుద్ధం గెలిస్తే ప్రతిఫలంగా బ్రిటిష్ ప్రభుత్వం భారత్ కి స్వాతంత్ర్యమిస్తుందా అన్నదే. మనల్నికబళించి పాలిస్తున్న ఇంగ్లీషు దొరల కోసం ప్రాణత్యాగం చేయడం అవసరమా అన్న ప్రశ్నని ప్రశ్నలాగే మిగిల్చి అమరుడవుతాడు. అంతేగానీ మతావేశం పూని పోరాడడు. 


          అక్షయ్ కుమార్ చివర ఒంటరిగా మిగిలి వేల మందితో చేసే పోరాటం నాటి ఇషార్ సింగ్ వీరపరాక్రమాన్ని కళ్ళకి కట్టినట్టు వుంటుంది. అయినంత మాత్రానా ఇషార్ సింగ్ మూర్తిమత్వాన్ని అల్లూరి సీతారామ రాజు మూర్తిమత్వాన్ని ప్రేక్షకుల్లో కృష్ణ ప్రతిష్టించినట్టుగా ప్రతిష్టించడంలో విఫలమయ్యాడు అక్షయ్. కనీసం చివరి డైలాగులైనా లేకుండా కన్ను మూస్తాడు. ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఇషార్ సింగ్ ని ప్రతిష్టించలేక పోవడానికి కారణం పాత్ర చిత్రణే అలా వుండడం. కాషాయీకరణ జరగడం. అల్లూరిని ప్రజలు ఎంత దైవంలా కొలిచి పాటలు పాడినట్టు సినిమాటిక్ గా చిత్రీకరించినా, అల్లూరి అలా ఫీలై పోరాటం చేయడు. ఒక విప్లవకారుడి స్పష్టతతోనే పోరాడతాడు. అక్షయ్ ఇషార్ సింగ్ పాత్రకి సైనిక స్ఫూర్తి కొరవడింది. లేకపోతే అతనెంత గొప్ప సైనికుడో మర్చిపోలేని ముద్రవేసేవాడు. 

          ఇషార్ భార్య జీవనీ కౌర్ పాత్రలో పరిణీతీ చోప్రాది పరిమిత పాత్ర. ఆమె అప్పుడప్పుడు మాత్రమే కన్పిస్తుంది. ఆమె పూర్వమెప్పుడో చనిపోయిందని చరిత్ర చెప్తోంది. అందుకే చివర్లో ఇషార్  మరణించినప్పుడు సమూహంలో నిలబడి చూస్తూంటుందే గానీ దగ్గరికి రాదు. ఆమె ఆత్మరూపం. అంతవరకూ ఆమెతో మనం చూసిన సన్నివేశాలన్నీ ఇషార్ వూహల్లో ఆమె ఆత్మరూపం. మంచి క్రియేటివ్ అయిడియాతో ఈ చిత్రణ. 

       దళంలో ప్రతీ ఒక్కరూ ఫస్టాఫ్ లో వాళ్ళ వెర్రితనాలతో  కామెడీలు చేస్తారు. కోడి పందాలతో మొదలయ్యే వీళ్ళ కామెడీ సీక్వెన్స్ - ఆ కోడి పుంజుల ముందే తాము కోళ్ళుగా పోట్లాడుకునే శిక్షగా, ఆ తర్వాత ఆ కోడి పుంజుల్ని కూరొండేసుకున్నందుకు, అన్నపానీయాలు లేని రెండు వారాల కఠిన శిక్షగా అనుభవించే దాకా నవ్విస్తూ సాగుతుంది.  

          ఇషార్ దళంలో పఠాన్ వంటవాడుగా పొట్టి బ్రహ్మామిశ్రా వుంటాడు. పోరాటం జరుగుతున్నప్పుడు, ‘నేను పఠాన్ ని కాబట్టి పఠాన్లతో పోరాడలేననా?’ అని ఇషార్ ని ప్రశ్నిస్తాడు. ‘నువ్వు ఎవరు గాయపడితే వాళ్లకి మంచి నీళ్ళు అందించు’ అంటాడు ఇషార్. ‘శత్రువులకి మంచి నీళ్ళిచ్చి నేను బ్రతికించను’ అంటాడు. శత్రువుని చంపితే శత్రువే చస్తాడు, మంచి నీళ్లిస్తే శత్రుత్వం నశిస్తుందంటాడు ఇషార్ సింగ్. గాయపడ్డ శత్రువులకి మంచి నీళ్ళిస్తూంటే చంపేస్తాడు ముల్లా.

          అల్లా కోసమని మధ్యలో దూరే ముల్లా సైదుల్లాగా రాకేష్ చతుర్వేదీ ఓం ఎక్సెలెంట్ గా నటిస్తాడు. ముల్లాగిరీని డిప్లమటిక్ గా పోషిస్తాడు. పఠాన్ సైనిక నాయకులుగా మీర్ సర్వర్, అశ్వథ్ భట్ లు ఆఫ్ఘనీ రూపురేఖలతో పర్ఫెక్ట్ గా వుంటారు. దళంలో వార్తాహరుడుగా వుండే పిరికివాడైన గురుముఖ్ సింగ్ పాత్రలో సుమీత్ సింగ్ బస్రా చివరి సన్నివేశాల్లో హైలైట్ అవుతాడు. నిజానికి ఇతడితో ఓ క్లయిమాక్స్, అక్షయ్ తో ఓ క్లయిమాక్స్ అన్నట్టుంటుంది సినిమా. 

చివరికేమిటి
      దర్శకుడు అనురాగ్ సింగ్ కేవలం 80 కోట్లతో ఇంత భారీ పోరాట యాక్షన్ తీయడం రికార్డే. సెకండాఫ్ గంటన్నర పాటూ ఏకబిగి, సుదీర్ఘ పోరాట దృశ్యాలు కాలీన స్పృహతో వాస్తవ దృశ్యాలన్పించేలాగే తీశాడు. చరిత్రని ఎంత కల్పితం చేసినా కృతకమైన డిజైనర్ చరిత్రలా చిత్రీకరించలేదు. ఎక్కాడా గ్రాఫిక్స్ వున్నట్టే అన్పించదు. పైగా వాడిన ఆయుధాలు ఆ కాలంలో ఏవైతే వుండేవో అవే సింగిల్ లోడెడ్ తుపాకులు, తూటాలు, మామూలు కత్తులు, తల్వార్లు, నాటు బాంబులు మాత్రమే చూపించాడు. ‘పద్మావతి’ లో లాగా, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లో లాగా చిత్ర విచిత్ర నమ్మశక్యంగాని టెక్నాలజీలతో డిజైనర్ ఆయుధాలూ, వాహనాలూ, వీటితో సర్కస్ ప్రదర్శన చేస్తున్నట్టు డిజైనర్ పోరాట దృశ్యాలూ లేకుండా, పక్కా నేటివ్, సహజ మాస్ లుక్ తో దృశ్యాల్ని సృష్టించి ఆ కాలంలోకి తీసికెళ్ళాడు. అక్షయ్ కుమార్ దుర్బిణీని తుపాకీకి కట్టి టెలిస్కోపిక్ రైఫిల్ గా మార్చుకోవడంలో కూడా డిజైనర్ లుక్  వుండదు. ఇక ఆఫ్ఘన్ వైపు ముగ్గురు నాయకుల గుర్రాలు తప్ప ఇంకే గుర్రాలూ ఏనుగులూ, మోటారు వాహనాలూ వుండవు. వేలమంది కాలినడకనే వస్తారు. లారెన్స్ ఉడ్ వర్డ్, పర్వేజ్ షేక్ లు సృష్టించిన అద్భుత యాక్షన్ కొరియోగ్రఫీలో కూడా నమ్మశక్యంగాని విన్యాసాల్లేవు. 

          మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ లలోని అనంతమైన ఎడారిమయమైన కొండ ప్రాంతాల్లో లొకేషన్స్ ఒకెత్తు. పీరియడ్ లుక్ రావడానికి చేసిన డీఐ కూడా, దానికి తగ్గ కాస్ట్యూమ్స్ కలర్స్ కూడా కూల్ గా వుంటాయి. సుబ్రతా చక్రవర్తి, అమిత్ రేల ప్రొడక్షన్ డిజైనింగ్, అన్శుల్ చోబే కెమెరా వర్క్ చాలా గొప్ప కళాత్మకతలు.

          ఆరుగురు సంగీత దర్శకుల పాటలు అక్కడక్కడా నేపథ్యంలో బిట్ సాంగ్స్ గా వుంటాయి గానీ, రాజూ సింగ్ ఇచ్చిన నేపథ్య సంగీతం మాత్రం కట్టి పడేస్తుంది. 

          ఒక్కటే సమస్య. జింగోయిజం. రాజకీయ కేసరీయం. ఎన్నికల కంగాళీయం. ఆగస్టు పదిహేనున విడుదల చేయమని అక్షయ్ కుమార్ అంటే, అప్పుడెవరూ చూడరని ఇప్పుడే విడుదల చేయడం. ప్రేక్షకులు షహీద్ హవల్దార్ ఇషార్ సింగ్ చరిత్ర చూడాలంటే కూడా ఫలానా ఒక ఇలాటి టైంలోనే చూడాలన్న మాట. ప్రతీ యేటా లండన్లోని ఆర్మరీ హౌస్ లో బ్రిటిష్ ఆర్మీ నాటి సరగర్హీ సిక్కు అమర సైనికులకి శ్రద్ధాంజలి ఘటిస్తూనే వుంటుంది. 1897 లోనే ఈ పోరాట యోధులకి బ్రిటన్ అత్యున్నత ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని ప్రకటించింది. విక్టోరియా రాణి వేనోళ్ళ కొనియాడింది. ఇండియాలో ఈ దళం గుర్తే లేదు. ఎన్నికలప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించాలి...

సికిందర్
Watched at Prasads,
7.30 pm, 21 March, 2019

Ps : సరగర్హీ పోరాట కారణం సినిమాలో చూపించినట్టు ఇషార్ సింగ్ ఆఫ్ఘన్ స్త్రీని రక్షించడం కాదు. ఖైబర్ పాస్ కి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వంతో తేడాలొచ్చి దాడులు చేశారు ఆఫ్ఘన్లు.


19, మార్చి 2019, మంగళవారం

800 : వెబ్ సిరీస్ సంగతులు


Q : నాకు కామెడీ వెబ్ సిరీస్ దర్శకత్వం అవకాశం వచ్చింది. ఇందుకు నేను కామెడీ షుగర్ కోటింగ్ నిస్తూ క్యాంప్ బెల్ ‘హీరోస్ జర్నీ’ ఫాలో అవచ్చా? క్యాంప్ బెల్ స్ట్రక్చర్ యూట్యూబ్ లో వుంది. వెబ్ సిరీస్ పది ఎపిసోడ్లు వుంటుంది. నిడివి ఐదు నుంచి 10 నిమిషాలు. ప్రతీ ఎపిసోడ్ ముగింపులో ఒక ట్విస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అది తర్వాతి ఎపిసోడ్ కి లీడ్ అవుతుంది. ఇలా చివరి ఎపిసోడ్ లో హీరో గోల్ సాధించే వరకూ ట్విస్టులుంటాయి. ఇలా వెబ్ సిరీస్ సీరియల్ కథ ఎపిసోడిక్ విరామాలతో వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారా?
హరీష్, అసిస్టెంట్ డైరెక్టర్
A :  కంగ్రాట్స్, ఇలా ముందుకు వెళ్తున్నందుకు. ఐతే వెబ్ సిరీస్ రచన సినిమా రచన ఒకటి కాదు. జోసెఫ్ క్యాంప్ బెల్ స్ట్రక్చర్ అనేది సినిమాల వరకే. అది కూడా ఒకప్పటి సినిమాలకే. గత 30 ఏళ్లుగా హాలీవుడ్ సిడ్ ఫీల్డ్ ని అనుసరిస్తోంది. పురాణాల ఆధారంగా క్యాంప్ బెల్ స్ట్రక్చర్ లో 10 ప్లాట్ పాయింట్స్ వుంటాయి. దీని వల్ల కథ భారంగా, నిదానంగా సాగుతుంది. ఒకప్పటి కళాఖండాలకిది సరిపోయింది. సిడ్ ఫీల్ట్ ఈ ప్లాట్ పాయింట్స్ ని ఐదుకి కుదించి (మూడు ప్లాట్ పాయింట్స్, రెండు పించ్ పాయింట్లు) వేగం పెంచాడు. సిడ్ ఫీల్డ్ ని అనుసరిస్తూ వచ్చిన జేమ్స్ కెమెరాన్ ఇటీవల ‘అలీటా’ కి,  క్యాంప్ బెల్ ‘హీరోస్ జర్నీ’ స్ట్రక్చర్ అనుసరిస్తే ఏమైందో తెలిసిందే. ఈ బ్లాగులోనే వివరించాం. 

          అలాగని వెబ్ సిరీస్ కి సిడ్ ఫీల్డ్ పారడైం పనికొస్తుందని కాదు. సినిమాకి పనికొచ్చేదేదీ వెబ్ సిరీస్ కి పనికి రాదు. సినిమా కథ బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలతో కూడిన త్రీ యాక్ట్స్ లో వుంటుంది. దీన్ని పది ఎపిసోడ్ల వెబ్ సిరీక్ కి వర్తింపజేస్తే, బిగినింగ్ ఓ రెండు ఎపిసోడ్లు, మిడిల్ ఓ ఆరు ఎపిసోడ్లు, ఎండ్ ఓ రెండు ఎపిసోడ్లుగా చేసుకోవాల్సి వస్తుంది. అంటే మొదటి రెండు ఎపిసోడ్లూ బిగినింగ్ బిజినెస్ అయిన పాత్రల పరిచయం, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా చేసి, ముగింపులో ప్లాట్ పాయింట్ వన్ కి తెచ్చి గోల్ ని ఏర్పాటు చేయాలన్న మాట. దీని తర్వాత మిడిల్ ఆరు ఎపిసోడ్స్ లో ఆ గోల్ కోసం సంఘర్షణ చూపించుకొస్తూ, మిడిల్ ఆరవ ఎపిసోడ్ ముగింపులో ప్లాట్ పాయింట్ టూ ఏర్పాటు చేయాలన్న మాట. అప్పుడు చివరి రెండు ఎండ్ ఎపిసోడ్స్ లో వెబ్ సిరీస్ కి ముగింపు నిచ్చుకోవాల్సి వస్తుంది. ఇదంతా సిల్లీగా వుంటుంది.  

          అంటే  మొదటి రెండు వారాలు పాత్రల పరిచయం, సమస్యకి దారితీసే పరిస్థితులే చూపిస్తూ కూర్చోవాలి. గోల్ ఏర్పాటు అంటే కథా ప్రారంభమే కాబట్టి, కథేమిటో రెండో వారంలో గానీ చెప్పలేం. అప్పటి వరకూ ప్రేక్షకులుంటారా? అలాగే చివరి రెండు వారాలు ముగింపు చూపిస్తూ కూర్చోవాలి.  వెబ్ సిరీస్ కి రెండు వారాల పాటు ముగింపు అంటే, రెండు భాగాల ఎన్టీఆర్ బయోపిక్ లాంటిదే. ఇక మధ్యలో మిడిల్ ఆరు వారాలూ గోల్ కోసం సంఘర్షణ చూపిస్తూ కూర్చోవడమే. ఒకే గోల్ ని వారాల పాటు చూపిస్తూ కూర్చుంటే బోరు కొట్టక మానదు. ఎప్పుడో రెండో వారంలో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పాటు చేసిన గోల్ ని, ఐదో వారం కల్లా ప్రేక్షకులు మర్చిపోవచ్చు కూడా. ఆ మిడిల్ సంఘర్షణ చూస్తూ, ఇంతకీ దేని కోసమబ్బా ఈ సంఘర్షణా అని బుర్ర గోక్కోవాల్సిందే. ఆ పై వారం కట్ చేసి పారేసి, పక్క వెబ్ సిరీస్ కి జంపై పోవడమే. వెబ్ సిరీస్ బిజినెస్ కూడా టీఆర్పీ బిజినెస్సే నని మరువకూడదు. 

          గతవారమే ఒక దర్శకుడితో వెబ్ సిరీస్ ప్రస్తావన వచ్చినప్పుడు, స్మార్ట్ ఫోన్ కుర్రాడు వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ ని ఐదు నిమిషాలకి మించి చూడడని తేల్చేశారు. స్మార్ట్ ఫోన్ లో ఏదైనా చకచకా అయిపోవాలి, ఎక్కువసేపు చూసే ఏకాగ్రత వుండదన్నారు. టీవీ సీరియల్స్ ప్రేక్షకులు వేరు, వెబ్ సిరీస్ చూసే ప్రేక్షకులు వేరన్నారు. ఇరవై నిమిషాలు - అరగంట నిడివి వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ చూడడం కష్టమన్నారు. 

          ఇదొక అభిప్రాయం. అయితే ఇప్పుడు తీస్తున్న వెబ్ సిరీస్ అరగంట నిడివిగలవే. ఈ నిడివి కారణంగా సహజంగానే వీటి కథన వేగం తక్కువ. మీది పది నిమిషాలలోపే  అన్నారు కాబట్టి కథన వేగం ఎక్కువ. మంచి వ్యూస్ స్కోర్ చేయవచ్చు. ఐతే దీని స్ట్రక్చర్ ఎట్లా? పైన చెప్పుకున్నట్టు వారాలకి వారాలు త్రీయాక్ట్స్ లో చూపిస్తూ ప్రేక్షకుల్ని కోల్పోవాలా?

          దీనికి PCR మెథడ్ అని వుంది. మీరు స్ట్రక్చర్ స్కూలే కాబట్టి మీకిది నచ్చవచ్చు.  వెబ్ సిరీస్ స్ట్రక్చర్ కి PCR మెథడ్ లో ఆలోచించండి. ప్రొఫెసర్ జే మొరార్టీ దీన్ని1970 లలో టీవీ లో కామెడీ సిరీస్ రాస్తున్నప్పుడు రూపొందించాడు. ఈ మెథడ్ లో నేరుగా మొదటి ఎపిసోడ్ ని ప్లాట్ పాయింట్ వన్ తో ప్రారంభించడమే. 

          ప్లాట్ పాయింట్ వన్ తోనే ప్రారంభం. అంటే నేరుగా సమస్య చూపించేయడం. పాత్రల పరిచయాలు, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా వంటి ఉపోద్ఘాతాలుండవు. పాత్రని నేరుగా సమస్యలో పెట్టి, ఆ పాత్ర లేమిటో వాళ్ళ మాటల్లోనే ఇక్కడే చెప్పేయాలి. హీరో అలసి సొలసి ఆర్ధరాత్రి తూలుతూ ఫ్లాట్ కొచ్చాడనుకుందాం. డోర్ తీసుకుని లోపలికెళ్తే లోపల ఎవడో పడుకుని వుంటాడు. వీడెవడో తెలీదు, ఎలా లోపలి కొచ్చాడో తెలీదు. ఇదీ సమస్య. వెంటనే సమస్యలోకి వెళ్ళిపోవడం. ప్లాట్ పాయింట్ వన్ ని తెచ్చి పడెయ్యడం. . PCR లో P, అంటే Problem వెంటనే ఎస్టాబ్లిష్ అవడం. 

          ఇప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్ధం. వచ్చిన వాడు ఎవరనేది చెప్పడు. ఈ ఫ్లాట్ తనదేనంటాడు...ఇలా ప్రాబ్లం పెద్దదై పోతుంది. ఇది PCR లో C, అంటే Complication. 

          చివరికి ఈ మొదటి ఎపిసోడ్ లో హీరోకి ఈ ప్రాబ్లంకి ఒక పరిష్కారం దొరుకుతుంది. దీన్నిగోల్ అనొచ్చు. ఆ పరిష్కారమార్గంతో వచ్చిన వాణ్ణి చిత్తు చేసే గోల్ తో పైచేయి సాధిస్తాడు. PCR లో ఇది R, అంటే  Resolution. ఇప్పుడు PCR =  Problem + Complication + Resolution, దట్సాల్. 

          మరి ఎపిసోడ్ చివర ట్విస్ట్? ఆ వచ్చిన వాడు చిత్తవడం ట్విస్టు అవదు. ఆ చిత్తయ్యాక, అంటే Resolution పూర్తయ్యాక, రివర్స్ లో ఇంకోటి జరిగి ఇంకో ప్రాబ్లం అక్కడే పుట్టడమే ట్విస్టు. రెండో ఎపిసోడ్ కి మీరన్నట్టు లీడ్. సినిమాలో హీరో చంపేస్తే విలన్ చచ్చిపోవడం ఎండ్. కానీ చచ్చిన వాడు లేచి కూర్చుంటే ట్విస్ట్. వెబ్ సిరీస్ లో చచ్చిందనుకున్న ప్రాబ్లం లేచి కూర్చుంటుంది.
          ఈ ట్విస్టు ఎపిసోడ్ ముగింపు. హీరో ప్రాబ్లం సాల్వ్ చేశాననుకుంటే అది కాస్తా ఇంకో ప్రాబ్లంగా తిరగబెట్టడం ట్విస్ట్. ఈ ట్విస్టు తర్వాతి ఎపిసోడ్ కి ప్రారంభం. అంటే P. దీంతో C, దీనికి R. ఈ R కి  మళ్ళీ ట్విస్టుతో ఎపిసోడ్ ఎండ్. మళ్ళీ తర్వాతి ఎపిసోడ్ కి ఈ ట్విస్టు P... ఇలా రిపీటవుతూనే వుంటుంది చైన్ రియాక్షన్ లా చివరి ఎపిసోడ్ వరకూ. 

          PCR తో లాభాలేమిటంటే, మొదటి ఎపిసోడ్ లోనే కథేమిటో తెలిసిపోతుంది. ఇక ప్రేక్షకులు పారిపోరు. అంతే కాదు, ప్రాబ్లం ఏమిటో, గోల్ ఏమిటో కూడా తెలిసిపోతాయి. ఇక ప్రతీ ఎపిసోడ్ కి ఒక కొత్త ప్రాబ్లం, ఆ ప్రాబ్లంతో ఫ్రెష్ గా కొత్త గోల్... ప్రాబ్లం మారుతూంటే గోల్ ఫ్రెషప్ అవుతూనే వుంటుంది ప్రతీ ఎపిసోడ్ కీ.  త్రీ యాక్ట్ లోలాగా ఒకే గోల్ ని చివరి దాకా ఈడ్చుకుపోవడనే సమస్య వుండదు. ఇక ప్రేక్షకులు మర్చిపోయే సమస్యా వుండదు. ‘టీఆర్పీ’ ని కోల్పోయే ప్రమాదమూ వుండదు. మొదటి ఎపిసోడ్ లో చూపించే గోల్ మాస్టర్ గోల్ అవుతుంది. అంటే వచ్చిన వాణ్ణి ఫ్లాట్ లోంచి వెళ్ళ గొట్టడం మాస్టర్ గోల్. ఈ మాస్టర్ గోల్ కి తర్వాతి ఎనిమిది ఎపిసోడ్స్ లో పుట్టే ఒక్కో ప్రాబ్లం ని సాల్వ్ చేసేందుకు అక్కడికక్కడే పుట్టేవి మినీ గోల్స్. చివరి ఎపిసోడ్ లో మాత్రం మాస్టర్ గోల్ కే రిజల్ట్ చెప్పాలి. హీరో వాణ్ణి ఫ్లాట్ లోంచి వెళ్ళగొట్టాడా లేదా? 

          సినిమా కథకే ఒకే సమస్య, దాన్ని సాధించే ఒకే గోల్, ఆ గోల్ కి, లేదా సమస్యకి ఒకే ముగింపూ వుంటాయి. పైన చెప్పుకున్న ఎపిసోడిక్ కథనాలతో గోల్స్  మారిపోతూంటే అది సినిమాలా వుండదు. విడివిడి సమస్యలు చూపిస్తున్న డాక్యుమెంటరీలా వుంటుంది. ఇందుకే టైగర్ హరిశ్చంద్ర, ఆటోనగర్ సూర్య లాంటివి ఇలాటి కథనాలు చేసి ఫ్లాపయ్యాయి. విచిత్రమేమిటంటే క్యాంప్ బెల్ ని చదువుకుని ‘ప్రస్థానం’ తీసిన దర్శకుడు దేవకట్టా, ‘ఆటోనగర్ సూర్య’కి సినిమా మాధ్యమానికి వ్యతిరేకమైన ఎపిసోడిక్ కథనం చేయడం!  

          చివర్న మీరడిగింది - ఎపిసోడిక్ విరామాలతో వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారా? – అంటే ఎపిసోడిక్ విరామాలెక్కడున్నాయి? ప్రతీ ఎపిసోడ్ ముగింపూ ఇంకో ఎపిసోడ్ కి ప్రారంభమే కదా? 

          ఇక ఒక్కో ఎపిసోడ్  క్లిక్ అవాలంటే చివర ట్విస్టు అవసరమే. ఐతే ప్రతీ ఎపిసోడుకిచ్చే  ట్విస్టు, వెనక ఎపిసోడ్ కి మించిన స్థాయిలో వుండాలి. పది ఎపిసోడ్లుంటే పది మెట్లు ఒక్కో తీవ్రతతో ఎక్కుతూ పైపైకి పోతూండాలి ట్విస్టులు - ఒకదాన్ని మించొకటి. అప్పుడే వెబ్ సిరీస్ నిలబడుతుంది. ఈ ట్విస్టుల్ని క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ అంటారు. ఈ మూమెంట్స్ ని ఎప్పుడూ సాగదీయకూడదు. సాగదీస్తే వీగిపోతుంది. సడెన్ జర్క్ ఇచ్చి ముగించెయ్యాలి. 

          క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ కథల్లో, నవలల్లో ఎక్కువుంటాయి. ముగింపు ట్విస్టులకి మాస్టర్ రైటర్ ఓ హెన్రీ కథలు చదువుకోవచ్చు. వాటిలోంచి మీ ఎపిసోడ్స్ కి భిన్నమైన ఐడియాలు రావచ్చు. అలాగే కొన్ని నవలల్లోంచి తీసిన 12 రకాల ట్విస్టులున్నాయి. ఈ లింక్ క్లిక్ చేసి స్టడీ చేయండి ఏదీ చదవకుండా, చూడకుండా సొంత ఆలోచనలతో కథలు ఎప్పుడూ రాయకూడదు. ఎందరెందరో పోటీ పడుతున్న మీడియాలో నిలదొక్కుకోవాలన్నా, ముందుండాలన్నా చేస్తున్న కథలకి అవసరమైన రీసెర్చి చేసి కొత్తకొత్త ఆలోచనలు చేయాల్సిందే. ఇకపోతే, పదినిమిషాల లోపు వెబ్ సిరీస్ ఎపిసోడ్ శాంపిల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

          ఇక మీ ఎపిసోడ్స్ కథ గురించి ఇక్కడ చర్చిండం బాగోదు. ఫోన్ చేయండి. స్ట్రక్చర్ గురించి చాలావరకూ మీకు ఫోన్లోనే వివరించాం మెసెంజర్ లో మీ ప్రశ్న చూసి. అయినా నల్గురికీ ఉపయోగపడుతుందని బ్లాగులో రాయమంటే రాశాం.

సికిందర్


18, మార్చి 2019, సోమవారం

799 : సందేహాలు - సమాధానాలు



Q : 118’ సస్పెన్స్ థ్రిల్లర్  స్ర్కీన్ ప్లే సంగతులు  రాస్తారా? ఈ మధ్య మీరు తెలుగు సినిమాలకు స్క్రీన్ ప్లే సంగతులు రాయడం లేదు. చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి. వాటిని అసలు పట్టించుకోవడం లేదు. చిన్న సినిమాల పరిస్థితి బాగా లేదు కదా? అవి తీస్తున్న కొత్తవాళ్ళ కోసమైనా చిన్న సినిమాల స్క్రీన్ ప్లే సంగతులు రాయవచ్చు కదా?
పేర్లు వెల్లడించ వద్దన్న దర్శకుడు, రచయితతో బాటు, సంజీవ్ అసిస్టెంట్ డైరెక్టర్
A : 118, బద్లా లాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ని థియేటర్లో చూసి స్క్రీన్ ప్లే సంగతులు రాయడం సాధ్యం కాదు. ఇవి డైలాగ్ కనెక్షన్స్ తో, ఎన్నో క్లూస్ కనెక్షన్స్ తో, వాటి లాజికల్ డ్రైవ్ తో సాగిపోయే ఇన్వెస్టిగేషన్ కథలు. వీటిని చాలా సార్లు ఆపి చూస్తూ రాయాలి. అందుకని ‘118’ అమెజాన్ లో విడుదలయ్యాక రాద్దాం. ఇక తెలుగు సినిమాలకి  స్క్రీన్ ప్లే సంగతులు రాయడం లేదనే విషయం. రాయడానికి వీటిలో కొత్త విషయాలుండడం లేదు. అవే టెంప్లెట్ సినిమాలు, అవే కథలు. ఇంకా పాత సినిమాలు బెటర్. నేర్చుకోవాల్సిందంతా వీటిలోనే వుందన్పిస్తోంది. దొంగ రాముడు, మనసే మందిరం, వివాహ బంధం...నాటి దర్శకులు, రచయితలూ నేర్చుకోవడానికి భావితరాల కిచ్చినట్టు, నేటి కథ - మాటలు -స్క్రీన్ ప్లే - దర్శకత్వం అన్నీ తామే అయి కూడా మేకర్లు ఏమిస్తున్నారు. వాళ్ళే ఒకర్నొకరు అనుకరిస్తూ టెంప్లెట్ సినిమాలే తీస్తున్నారు. వీళ్ళని ఫాలో అయ్యే అసిస్టెంట్లు వీళ్ళనుంచి కొత్తగా ఏం నేర్చుకుంటారు. 

          గత Q&A లో సీన్ ఎలా రాయాలో ‘జస్టిస్ చౌదరి’ ఉదాహరణగా విశ్లేషిస్తే విశేష స్పందన వచ్చింది. ఎన్నడూ లేనన్ని రికార్డు స్థాయి హిట్స్ వచ్చాయి. వందల్లో వుండే హిట్స్, ఆ రోజు వేలల్లో వచ్చాయి. ఎందరో సీన్ ఎలా రాయాలో ఇప్పుడు తమకు కొత్తగా తెలిసిందని ఎక్సైట్ అయ్యారు. నిజానికి సీన్ స్ట్రక్చర్ కి ఉదాహరణ కోసం ఇప్పటి సినిమాలేమున్నాయని చూస్తే కన్పించలేదు. పాత సినిమాల్లోకి వెళ్లి చూస్తే,  చూసిన మొట్ట మొదటి ‘జస్టిస్ చౌదరి’ లోనే కన్పించింది. కానీ పాత సినిమా ఉదాహరణ ఇస్తే కొత్త జనరేషన్ కేం నచ్చుతుందని కూడా అన్పించింది. అయినా తప్పక రాయాల్సి వచ్చింది. దీనికే కొత్త జనరేషన్ ఎక్సైటయి పోయారు. తీసుసుకోవాల్సింది పాత సినిమాల్లో వుంటే తీసు కోవడానికి అభ్యంతరం లేదన్న మాట!  

          కొత్తగా విడుదలయ్యే తెలుగు సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు రాయబోతే సవాలక్ష లోపాలుంటున్నాయి. తీస్తున్న సినిమాలు 90 శాతం అట్టర్ ఫ్లాపులు. ఎందుకు ఫ్లాపయ్యాయో వీటి లోపాలు రాయడమే పనిగా మారింది. దీనికంటే అర్ధవంతమైన సినిమాలకి -  అవి పాతవైనా - రాయడం బెటరన్పిస్తోంది. ఓ సినిమా ఫ్లాపయితే ఎందుకు ఫ్లాపయ్యిందో మేం తెలుసుకోవాలి కదా, ఇది తెలుసుకోవడానికి బ్లాగుని విజిట్ చేస్తున్నాం కదా అనే వాళ్ళూ వున్నారు. తప్పదంటే అప్పుడప్పుడు ఈ పని కూడా చేద్దాం. అసలే ఫ్లాపయిన సినిమాలని వదిలెయ్యక, ఇంకా తప్పులు రాసి పీడించడం ఎందుకనే పాయింటు కూడా ఒకటుంది. 

          ఇక వారంవారం విడుదలై వెళ్లి పోతున్న చిన్న చిన్న సినిమాల సంగతి. వీటిలో కొన్నిటికి రివ్యూలు రాస్తూనే వున్నాం. స్క్రీన్ ప్లే సంగతులంటే వాటి స్థాయికి ఎక్కువ. మీరడిగారు కాబట్టి ఒకటి రెండు రాసి చూద్దాం. అప్పుడు పరిస్థితిలో మార్పు వస్తుందా? ఏమీ రాదు. ఈ చిన్న నిర్మాతలు, దర్శకులు ఇకంతే! 

Q : ‘కథ ఎలా చెప్పాలన్న దానికి మీరిచ్చిన వ్యాసం అద్భుతంగా వుంది. మా లాంటి వాళ్ళెందరికో ఉపయోగపడుతుంది. అయితే మల్టీ స్టారర్ కథ ఎలా చెప్పాలో వివరించలేదు.
శ్రీను ఆర్, అసిస్టెంట్ డైరెక్టర్ 
A :   మల్టీ స్టారర్ తీసే స్థాయికి వెళ్ళేటప్పటికి కథలు చెప్పడం ఎలాగూ వచ్చేస్తుంది. ఇప్పట్నుంచే ఎందుకు. ఇప్పుడేం తీసే అవకాశాలొస్తాయో అంతవరకూ తెలుసుకుంటే చాలు. ఐతే చిన్న హీరోలు ఇద్దరు ముగ్గుర్ని కలిపి తీసే ‘మినీ స్టారర్స్’ అవకాశముండొచ్చు. వీటికి కథలో ప్రధానపాత్రని దృష్టిలో పెట్టుకునే చెప్పాలి. ‘హేపీడేస్’ లో నల్గురు హీరోలున్నా అది వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రగా నడిచే కథే. కనుక ముందు ఆ మెయిన్ హీరోకి చెప్పాలి. చెప్పేటప్పుడు అతనే ప్రధాన పాత్రగా త్రీ పిల్లర్స్ ఆధారంగా చెప్పాలి, మిగిలిన హీరోల పాత్రల్ని కూడా కలిపి. మిగిలిన హీరోలకి చెప్పినప్పుడు ఫలానా అతను మెయిన్ హీరో, మీమీ క్యారెక్టర్స్ ఇవీ అని చెప్పొచ్చు. కథ గురించి అయిడియా ఇస్తే సరిపోతుంది. ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్ అయితే ఎవరికీ కథ కూడా చెప్పరు. నీ క్యారెక్టర్ ఇదీ, నీ క్యారెక్టర్ ఇదీ...వచ్చి చేసుకోండని చెప్పేస్తారు. 

Q :  నేనొక స్క్రిప్టు రాశాను. ఎవర్ని అడిగినా తీసుకోవడం లేదు. ఇంకా రాయాల్సిన అయిడియాలున్నాయి. కానీ చూస్తే ఎవరూ తీసుకోని పరిస్థితి వుంది. నేను రైటర్ గా ఎలా ముందు కెళ్ళాలి?
జే ఎం ఆర్ రచయిత
A :   అది కిందటి శతాబ్దం సంగతి. ఈ శతాబ్దంలో స్క్రిప్టు రాసుకుంటే దర్శకుడు అయిపోవడమే. ఇతరుల స్క్రిప్టుతో దర్శకత్వం వహించాడనికెవరూ సిద్ధంగా లేరు. ఎవరి స్క్రిప్టు వాళ్ళదే. కాబట్టి రాసుకుంటే తీసుకోవడమే. లేదంటే దర్శకుల దగ్గర రైటర్ గా చేరడమే. ఇండిపెండెంట్ రైటర్ కాన్సెప్ట్ ఇక లేదు. ఐతే గియితే పెద్ద సినిమాలకి డైలాగు రచయితలవుతారేమో. డైలాగ్ రైటర్ గా కృషి చేసుకుంటే ఆ స్థాయికి వెళ్ళొచ్చు. 
సికిందర్



17, మార్చి 2019, ఆదివారం

798 : ‘పాలపిట్ట’ తాజా ఆర్టికల్, విస్మృత సినిమాలు - 5


      ఒకప్పుడు బెంగాలీ సినిమాలు, సాహిత్యం విరివిగా తెలుగు సినిమాలకి ఆధారమయ్యాయి. 1950 లలో తెలుగు నిర్మాతలు, దర్శకులు ఒక కొత్త ట్రెండ్ ప్రారంభించారు.  తెలుగు, ఆంగ్ల, బెంగాలీ భాషల నవలలు, కథలు, నాటకాలూ తెలుగు సినిమాలుగా తెరకెక్కించే కొత్త సృజనాత్మక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. దీనికి బీజం 1945 లో బిఎన్ రెడ్డి వేశారు. జీన్ ఫిలిప్ రామ్యూ రాసిన 18 వ శతాబ్దపు ‘పిగ్మాలియన్’ అనే ఆంగ్ల నాటకాన్ని భానుమతి - నాగయ్యలతో ‘స్వర్గ సీమ’ గా తీశారు. తర్వాత 1949 లో షేక్స్ పియర్ నాటకం ‘కింగ్ లియర్’  ఆధారంగా శివరావు కస్తూరి, శ్రీరంజని లతో కెవి రెడ్డి ‘గుణసుందరి కథ’ తీశారు. 1950 లలో ఇవి ఒక ఒరవడికి నాంది అయ్యాయి. ఆంగ్ల సాహిత్యంతో  పడిన అడుగు తెలుగు, బెంగాలీ సాహిత్యాలకీ బాట వేసింది. ముఖ్యంగా బెంగాలీ సాహిత్యం తెలుగు సినిమాలకి కొత్త వ్యాపార వస్తువుగా దొరికింది.  దేవదాసు, అర్ధాంగి, చరణడాసి వంటి విజయవంతమైన సినిమాలుగా తీశారు. 

         
దిలా వుండగా, బెంగాలీ సినిమాలని  రీమేక్ చేసే ఇంకో ఒరవడి కూడా ప్రారంభించారు. దేవాంతకుడు, చివరకు మిగిలేది, వివాహబంధం మొదలైనవి. ఇలా 1980 ల వరకూ అడపాదడపా  బెంగాలీ సినిమాలని రీమేక్ చేస్తూ వచ్చినా  ఏదీ విజయం సాధించలేదు – 1977 లో ఎన్టీఆర్, వాణిశ్రీలు నటించిన  ‘ఎదురీత’ తప్ప. 1964 లో తీసిన ‘వివాహబంధం’ అపజయం పాలవడానికి కారణం, తెలుగులో కొచ్చేటప్పటికి ఆ కాలానికి కథాకథనాలు పాతవై పోవడం కావొచ్చు. 

          1960 లనుంచి తెలుగు సినిమాల్లో కమర్షియల్ విలువలతో వ్యాపార యుగం ప్రారంభమయ్యింది. నటనలు, పాటలు, కథాకథనాలూ వేగం పుంజుకున్నాయి. 1964 లో ‘వివాహబంధం’ విడుదలయ్యే నాటికి  గుండమ్మ కథ, రాముడు -భీముడు, మూగమనసులు, మంచి మనసులు, ఆరాధన, దాగుడు మూతలు, మంచి మనిషి వంటి కమర్షియల్ వినోదాత్మక సాంఘికాలెన్నో ప్రేక్షకులకి కొత్త రుచులు పంచి పెట్టాయి. ఇలాంటప్పుడు చివరకు మిగిలేది, మనసే మందిరం, వివాహబంధం లాంటి విషాదగాథలు ఎందరికి నచ్చుతాయి.  

          ఇంత మాత్రాన ‘వివాహబంధం’ మంచి సినిమా కాదా అంటే మంచి సినిమానే. లేకపోతే  భానుమతి ఎందుకు నటించి, నిర్మిస్తారు. బెంగాలీలో హిట్టయిన ‘సాత్ పాకే బంధా’ కి రీమేక్. ఆశుతోష్ ముఖోపధ్యాయ్ రాసిన నవల ఆధారం. ఈయన ఇంకో నవల ఆధారంగా బెంగాలీలో తయారైన ‘దీప్ జ్వెలే జాయ్’ ని తెలుగులో ‘చివరకు మిగిలేది’ గా రీమేక్ చేశారు. తెలుగులో ‘వివాహబంధం’ గా రీమేక్ చేసిన  ‘సాత్ పాకే బంధా’,  1974 లో హిందీలో విజయానంద్, జయాబాధురీలతో ‘కోరాకాగజ్’ గా రీమేక్ చేశారు. ఇది పెద్ద హిట్టయ్యింది.  

          ‘వివాహబంధం’ ని భరణీ పిక్చర్స్ బ్యానర్ పై పిఎస్ రామకృష్ణ నిర్మించి దర్శకత్వం వహించారు. ఎన్టీ రామారావు, భానుమతీ రామకృష్ణ, చిత్తూరు వి నాగయ్య, సూర్యకాంతం, ప్రభాకర రెడ్డి, పద్మనాభం, హేమలత, వాసంతి తదితరులు నటించారు. ఎంబి శ్రీనివాసన్ సంగీతం సమకూర్చారు. ఛాయాగ్రహణం అన్నయ్య,  మాటలు అట్లూరి పిచ్చేశ్వర్రావు, పాటలు సి నారాయణ రెడ్డి. 

          పెళ్ళంటూ చేసుకున్నాక  ఏవో వెలుపలి కారణాలు చీలికలు తెస్తే చిట్లి పోయేంత బలహీనమైనదా ఆ బంధం?  మరెందుకు విడిపోతారు ? దీనికి జవాబులు  వెతుకుదాం...

          చంద్రశేఖర్ (ఎన్టీ రామారావు) ఓ మూడొందల జీతంతో లెక్చరర్. అదే కాలేజీలో అప్పారావు (చిత్తూరు వి నాగయ్య) ప్రిన్సిపాల్. చంద్రశేఖర్ కి చిన్నప్పట్నుంచీ పెంచిన పిన్ని (హేమలత) వుంటుంది. మధ్యతరగతి జీవితం. అప్పారావుకి మాణిక్యాంబ (సూర్యకాంతం) అనే భార్య, భారతి (భానుమతి), అరుణ (వాసంతి) అనే ఇద్దరు కుమార్తెలు, రఘు (ప్రభాకర రెడ్డి)  అనే కుమారుడూ వుంటారు. సోదరుడి కుమారుడు కాంతారావు (పద్మనాభం) పడి వేలాడుతూ వుంటాడు. అప్పారావుది సంపన్న కుటుంబం. కానీ డొక్కు కారు వుంటుంది.

          ఓ రోజు ఆ  కారెక్కకుండా బస్సులో వస్తూంటే చంద్రశేఖర్ పరిచయమవుతాడు భారతికి. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అప్పారావుకి తెలిసి సంతోషిస్తాడు. భార్యకి చెప్తే ఆమె ఇంతెత్తున లేస్తుంది. అతడి అంతస్తేమిటని ప్రశ్నిస్తుంది. తమ హోదాకి తగ్గ సంబంధమే చేయాలంటుంది. వినకుండా పెళ్లి చేసేస్తాడు అప్పారావు. ఇది మనసులో పెట్టుకుంటుంది మాణిక్యాంబ. 

          చంద్రశేఖర్ భార్యగా సామాన్య ఇంట్లోకి ప్రవేశిస్తుంది భారతి. పిన్నితో కూడా కలిసిపోయి సుఖంగా వుంటుంది. యాత్రలకి వెళ్ళొస్తారు. వస్తూ చాలా బహుమతులు తెస్తారు. దీంతో మండిపడుతుంది మాణిక్యాంబ. మూడొందల జీతగాడు అల్లుడు ఇవన్నీ తెచ్చి పంచడం భరించలేక పోతుంది. కించపరుస్తూనే మెత్తగా పొదుపు గురించి బోధిస్తుంది. “ఇవన్నీ ఎందుకు? చేతిలో డబ్బుంటే మంచి నీళ్ళలా ఖర్చు పెట్టేస్తుంది. నువ్వైనా పట్టించుకోక పోతే ఎలా? ఆదాయాన్ని బట్టి ఖర్చుపెట్టుకోవాలి” అంటుంది. “ఆదాయం తక్కువైనంత మాత్రానా ఆప్యాయతలు తగ్గుతాయా?”  అంటాడు. “ఎందుకు తగ్గుతాయి, ఇల్లుమాత్రం గుల్లవుతుంది” అంటుంది. సీరియస్ అయిపోయి లేచి వెళ్ళిపోతాడు. 

           
ఇలా ఆమెకెంత ఆత్మాభిమానమో, అతడికీ అంతే ఆత్మాభిమానం. దీంతో ఆమె అంటే ఇక కూల్చలేని అడ్డుగోడ కట్టుకుని, నత్త గుల్లలా ముడుచుకు పోతాడు.

          ఆమె ఏం చేసినా పుండు మీద కారం జల్లినట్టే వుంటుంది.  ఏదో వొక వంకతో అతన్నీ, కూతుర్నీ పిలిపించుకుంటూ వుంటుంది. ఒకసారి ఢిల్లీ నుంచి బంధు వులొచ్చారని పిలిస్తే వెళ్తాడు భారతిని తీసుకుని. ఆ బంధువు - ఇంగ్లాండ్ ఎప్పుడు వెళ్తున్నారు? మీరు రాసిన పుస్తకానికి పతకం వచ్చిందటగా? ప్రమోషన్ కూడా వచ్చిందట? – అంటూంటే చంద్రశేఖర్ కి తర్వాత అర్ధమవుతుంది, అత్తగారే ప్రతిష్ట కోసం అల్లుణ్ణి ఇలా గొప్పగా చిత్రించుకుందని. దీంతో మరింత అవమానం ఫీలయ్యి వెళ్ళిపోతాడు. ఎంత సేపూ తనది దిగువ స్థాయి అనుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న ఆమె తీరుని నిరసించడం మొదలెడతాడు.   

          ఆమె వూరుకోదు. కూతురితో ఫోన్లో మాట్లాడుకోవాలని ఇంటి ముందు టెలిఫోన్ స్థంభం పెట్టించి కనెక్షన్ ఇప్పిస్తుంది. దీంతో చంద్రశేఖర్ ఆగ్రహం పతాక స్థాయికి చేరుతుంది. భారతీనే నానా మాటలంటాడు. భారతి తల్లిని నానా మాటలంటుంది. మాణిక్యాంబ ఇంకింత రెచ్చిపోయి – “ముష్టి మూడొందల జీతానికే మురిసిపోతే అయిపోయిందా? నూతిలో కప్పలా ఎంత కాలం బతుకుతాడు? శ్రమపడాలి, పైకి రావాలి!”  అని క్లాసు పీకేస్తుంది. ఇంకోసారి అల్లుడితోనే  నేరుగా అనేస్తుంది – “ఫలానా వారి అల్లుడు అన్పించుకోవడం కాదు గొప్ప. ఫలానా వారి అత్తగారు వస్తే నేను గర్వ పడేలా వుండాలి నీ హోదా, అదీ గొప్పంటే!”  అని. 

         
ఇలా పరిస్థితి ఎక్కడికో వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరి మధ్యా నలిగిపోతూంటుంది భారతి. అత్తాఅల్లుళ్ళ ఆత్మాభిమానాల సమస్య కాస్తా, భార్యా భర్తల మధ్య సూటిపోటి మాటల వాగ్యుద్ధంగా మారిపోయి విడిపోతారు.

ఎవరి కథ?
        నందమూరి తారక రామారావు కొత్త గెటప్ లో కనిపిస్తారు. ఈ గెటప్ తో పాత్ర వయసుకి మించిన రూపంలో కన్పిస్తారు. ధోవతీ కుర్తా వేసుకుని, కళ్ళద్దాలు పెట్టుకుని, బరువు కూడా పెరిగి పెద్ద మనిషిలా వుంటారు. యూత్ అప్పీల్ లేని ఈ గెటప్ మనకి ఇబ్బందిగానే వుంటుంది. ఇది బెంగాలీ ఒరిజినల్ లోని బెంగాలీ బాబు గెటప్పే. పదేళ్ళ తర్వాత తీసిన హిందీ ‘కోరా కాగజ్’ లో లెక్చరర్ పాత్ర ప్రొఫెసర్ పాత్రగా మారి, ఆధునిక దుస్తుల్లో యూత్ అప్పీల్ తో వుంటాడు విజయానంద్.

          ఎన్టీఆర్ పాత్ర స్వభావం నెగెటివ్ గానే వుంటుంది. ఇలాటి మనుషులుంటారు. నిజానికి ఆత్మాభిమానం నెగెటివ్ లక్షణం కాదు. కానీ పాత్ర స్వభావం పైన చూస్తే ఆత్మాభిమానం, లోన చూస్తే సంకుచితత్వం అన్నట్టుంటుంది. ఆయన సూర్యకాంతంతో రియాక్ట్ అయ్యేది ఫక్తు ఆత్మాభిమానంతోనే. కానీ జీవించేది మాత్రం ఆత్మాభిమానంతో కాదు. సంకుచితత్వంతో, మార్పు కోరని అదే నూతిలో కప్ప జీవితం. ఈ నూతిలో కప్ప జీవితపు ఛాయలు ఆయన మోహంలో ప్రకటిస్తూంటారు. ఆ మోహంలో సంతోషం వుండదు, సుఖం వుండదు. ఆశలుండవు, ఆశయాలుండవు. బెంగాలీ రచయిత భలే పాత్రని సృష్టించాడు. మాటంటే ఆత్మాభిమానం తన్నుకొస్తుంది, చూస్తే ఆ ఆత్మాభిమానంతో మానసికంగా, ఆర్ధికంగా ఎదిగేది లేదు. 

          సూర్యకాంతం గయ్యాళి అత్తేంకాదు, ఆర్ధికం నేర్చిన వ్యవహార్త. ఎదుటి వాళ్ళు కూడా పైకి రావాలనే ఆమె గొడవ. అయితే నోటి దూలవల్ల చెడగొట్టుకుంటుంది. “నా ఇల్లు బంగారం గానూ”  అనేది ఆమె ఊతపదం. చివరికి విసిగిపోయిన కూతురు, “నీ ఇల్లు బంగారం కాదు. అంతస్తుల్ని గురించి, అభిమానాల్ని గురించీ నీ అభిప్రాయాలు మారనంత వరకూ నీ ఇల్లు బంగారం కాదు!” అని అరుపులు అరిస్తేగానీ కళ్ళు తెరవదు. 

          సూర్యకాంతం ఓ విధంగా ‘విలన్’ పాత్రే అయినా విలన్ పాత్రలా అన్పించదు. ఆమెతో  ఈ పాత్రలో మంచితనమే కన్పిస్తుంది. ఈ పాత్రని ఎంజాయ్ చేయగలమే తప్ప ద్వేషించలేం. ఆమె డైలాగ్ డెలివరీ గానీ, ఆ డైలాగ్ డెలివరీలో సెలయేటి ప్రవాహంలా సాగిపోయే భాష గానీ ఇప్పటి సినిమాల్లో చూడం.

          ఇక తల్లికీ భర్తకీ మధ్య నలిగిపోయే పాత్రలో భానుమతి రానురాను పాత్ర డెప్త్ పెరుగుతున్నకొద్దీ దృష్టిని తన మీదికి తిప్పుకుంటుంది. సెంట్రల్ పాత్ర తనదే అయిపోవడం వల్ల. నిజానికి ఒరిజినల్ బెంగాలీ గానీ,  హిందీ రిమేక్ గానీ,  హీరో కథగా వుండవు. హీరోయిన్ కథగానే వుంటాయి. కథా ప్రారంభం కూడా హీరోయిన్ తోనే వుంటుంది. బెంగాలీలో సుచిత్రా సేన్ గానీ, హిందీలో జయబాధురీ గానీ గతాన్ని తలచుకోవడంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అంటే భర్త నుంచి విడిపోయి దూరంగా టీచర్ గా జీవిస్తున్నప్పుడు, గతం గుర్తు కొచ్చి ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. అప్పుడు మొదట్నుంచీ కథ. 

          తెలుగులో భానుమతితో ఇలా వుండదు. నేరుగా బస్సు ప్రయాణంలో ఎన్టీఅర్ పరిచయంతో వర్తమానంలో ప్రేమ కథగా మొదలవుతుంది. ఇందుకే తెలుగు రీమేక్ లో ప్రధాన పాత్ర ఇటు భానుమతి కాకుండా, అటు ఎన్టీఆర్ కాకుండా అయోమయంగా  వుంటుంది కథని ఫాలో అవడానికి.  
          సినిమా కథ అనేది ప్రధాన పాత్రకి సంబంధించినదై వుండి, ఆ ప్రధాన పాత్ర దృష్టి కోణం (పాయింటాఫ్ వ్యూ) లో సాగడం ఆనవాయితీ. ఆ దృష్టికోణంలోనే  ప్రేక్షకులు కథని చూసి ఆ ప్రధాన పాత్రని పట్టుకుని ప్రయాణించగల్గుతారు. ప్రయాణించడానికి ప్రధాన పాత్ర ఆధారంగా లేనప్పుడు, ఎంత కథ చెప్పినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఆవకాశమే లేదు.

 
         బెంగాలీ వొరిజినల్ ని  హీరోయిన్ కథగానే తీశారు, హీరో కథ కాదు. దీన్ని మార్చకుండా హిందీ లోనూ హీరోయిన్ కథగానే తీశారు. హీరోయిన్ కథ కాబట్టి బెంగాలీలో అప్పటి పాపులర్ హీరోయిన్ సుచిత్రా సేన్ ని ఈ పాత్రకి ఎన్నుకున్నారు. హీరో పాత్రలో చిన్న హీరోని పెట్టుకున్నారు. హిందీలో కూడా అప్పటికి పాపులరైన జయబాధురీని హీరోయిన్ గా తీసుకున్నారు. హీరోగా అంతగా తెలియని విజయానంద్ ని తీసుకున్నారు. ఇలా పాత్రల్ని బట్టి, కథని బట్టి, ఆర్టిస్టుల్ని బ్యాలెన్స్ చేశారు. 

          తెలుగులో ఇలా చేయలేదు. ఎన్టీఆర్, భానుమతి హేమాహేమీల కాంబినేషన్ గా  చేశారు. చేసినప్పుడు కథ ప్రకారం భానుమతిని ప్రధాన పాత్ర చేయలేక, ఎన్టీఆర్ ని ప్రధాన పాత్రగా చేయడానికి కథని మార్చలేక రెండు పాత్రల కథ అన్నట్టు చేశారు. దీంతో ఓ ప్రధాన పాత్ర, అది  ఎదుర్కొనే సమస్య, దాని దృష్టి కోణం, ఆ దృష్టి కోణంలో ఫ్లాష్ బ్యాక్ తో కథా ప్రారంభమూ  అనే అర్ధవంతమైన కథా ప్రక్రియ చెదిరిపోయింది. హిందీ, బెంగాలీల్లో ప్రధాన పాత్రగా హీరోయిన్ ని ప్రవేశ పెడుతూ చాలా సస్పెన్స్ ని క్రియేట్ చేశారు. ఆమె తోనే కనీసం పదిహేను నిముషాలు టీచర్ అని పరిచయం చేసి దృశ్యాలు నడిపించారు. ఈ దృశ్యాల్లో ఈమె ఎవరు? ఎందుకు వొంటరిగా వచ్చి ఈ వూళ్ళో వుంటోంది? ఏం జరిగిందీమెకి?  అన్న ప్రశ్నలెన్నో మనల్ని వేధించేట్టు చేసి, ఆసక్తిని పెంచారు.  

          ఐతే భానుమతి ఈ పాత్ర ప్రయాణంలో ఆయా ఘట్టాల్ని అర్ధవంతంగా నటించింది. భర్తకి ఎదురుతిరిగే సన్నివేశం, తర్వాత తల్లికి ఎదురు తిరిగే సన్నివేశం, చివరికి ఆత్మత్యాగం చేసుకోబోయే సన్నివేశం - కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా - ఆమె
నటనని ఆకాశానికంటించింది. 

          తండ్రి పాత్రలో నాగయ్యకి  భార్యని కాదని కూతురి పెళ్ళిచేయడం వరకే  ప్రాధాన్యం. ఆ తర్వాత ఎందులోనూ జోక్యం చేసుకోడు, కష్టాల్లో వున్న కూతురికి సానుభూతి వ్యక్తం చేస్తూ వుండడం తప్ప. కొడుకు పాత్రలో ప్రభాకర రెడ్డికి తల్లికిలాగే అహం ఎక్కువ. చెల్లెలి చేత విడాకుల పత్రాలమీద సంతకం చేయించుకుంటాడు. కానీ ఆ తర్వాత ఆ ప్రయత్నాలు చెయ్యడు. కుటుంబంలో ఆడపిల్లకి సమస్య వస్తే మగవాళ్ళయిన తండ్రీ కొడుకులు ఇలా వుండడం కాస్త ఇబ్బందిగానే వుంటుంది మనకి. ఏ వైఖరీ తీసుకోలేక కిమ్మనకుండా వుంటారు. 

          ‘మాతం - గి మణిపూర్’ అని మొట్టమొదటి మణిపురీ సినిమా వుంది. ఇందులో ఉమ్మడి కుటుంబంలో పెద్ద కొడుకు వల్ల కోడలికి విషమ సమస్య వస్తే, ఇంటిల్లి పాదీ ఆ సమస్యని పరిష్కరించడానికి ఒకటవుతారు. ఎవర్నీ దూషించరు, కనీసం సమస్యకి కారణమైన పెద్ద కొడుకు ప్రియురాలితో కూడా. ఎవరి తోనూ సంఘర్షించరు. దీనికి జాతీయ అవార్డు లభించింది. ‘తీర్థ్ జాతర’ అనే నాటకం ఆధారంగా 1972 లో తీశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఇప్పటికీ నిలబెట్టుకుంటున్న మణిపురి ప్రజలు, కలహం వస్తే కలహాలతో పరిష్కరించుకోవాలనుకోరు. ‘వివాహబంధం’ లోనే కాదు, చాలా కుటుంబ సినిమాల్లో కలహం వస్తే తలా వొకరుగా విడిపోయి కలహించుకోవడం ఒక ఫార్ములాగా వుంటూ వస్తోంది. 

          ఇందులో పద్మనాభం కామెడీ కూడా ఆర్ధిక పరమైనదే. డబ్బు సంపాదించడానికి పూటకో ఆలోచన చేస్తాడు, ఏదీ అమలు చేయక పక్క పాత్రకి నరకం చూపిస్తూంటాడు. “ఈ రోజుల్లో లక్ష అంటే ఎంత? ఆఫ్టరాల్  రెండక్షరాలు” వంటి డైలాగులు పేలుస్తూంటాడు. 

భానుమతి పాత్రకే బలం, స్పష్టత 
     ఈ వివాహబంధపు కథ పూర్తిగా ఆర్ధికం మీద ఆధారపడింది. ఆర్ధిక ఎదుగుదల కోసం అల్లుణ్ణి  అత్త వేధించడమే ఈ డబ్బు చుట్టూ సంబంధాల కథ. అయితే ఒక అనుమానం రాకమానదు. అన్ని గొప్పలు పోయే సంపన్నురాలైన, ఆత్మాభిమానం గల అత్తగారు, కట్నం ఏమీ ఇవ్వలేదా? అల్లుడు తీసుకోలేదా? సంబంధం అనుకున్నాక వెంటనే పెళ్లి సీను చూపించేశారు తప్ప కట్నం, పెట్టిపోతలు వగైరా ఆ సంబంధమైన వ్యవహారమేమీ మాట్లాడుకున్నట్టు సీను వేయలేదు. బెంగాలీ, హిందీల్లో కూడా ఇలాగే వుంటుంది. ఈ స్పష్టత లేకపోవడం వల్ల పెళ్లి తర్వాత పాత్రల ప్రవర్తన ఒక పజిల్ లా వుంటుంది. 

          సూర్యకాంతంకి కూతుర్ని సామాన్యుడి కివ్వడం అస్సలు ఇష్టం లేదు. “నేనూ ఒకప్పుడు లెక్చరర్నే కదా, ఏం తక్కువైంది?” అని నాగయ్య అంటే, “ఏం తక్కువైందో నాకు తెల్సు. ఈ సంసారాన్ని ఈది ఈ కుటుంబాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి నేను పడ్డ పాట్లు నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెల్సు. నా బిడ్డకి కూడా ఎందుకు కష్టాలూ?” అంటుంది సూర్యకాంతం. 

          అలాటిది కూతుర్ని వైభవంగా అత్తారింటికి పంపినట్టు కన్పించదు. పంపాక కూతురు సుఖపడాలని సౌకర్యాలు కల్పించే పనిలో పడుతుంది. హిందీలో ఫ్రిజ్ కూడా పంపిస్తుంది అత్తగారు. సూర్యకాంతం అల్లుడికి పుండు మీద కారం జల్లుతున్నట్టు వాయిదాల పద్ధతిలో ఒకటొకటీ సౌకర్యాలు కల్పిస్తుంది. “నేను ఆదర్శ వివాహం చేసుకున్నాక ఇవన్నీ ఎందుకు?”  అని అల్లుడు అనడానికి అలాటి వివాహం చేసుకున్నాడన్న స్పష్టత నివ్వలేదు కథకుడు. కథలో పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యగా పాత్రల మధ్య ఒక సమస్యని  ఏర్పాటు చేసినప్పుడు, ఆ పాత్రల మధ్య పూర్వం ఏం జరిగిందో తెలియజేయకపోతే కథని ఫాలో అవడం కష్టమవుతుంది. 

          ఇలా ఎన్టీఆర్, సూర్యకాంతం పాత్రల విషయంలో ఒక స్పష్టత లేని విషయం అలా వుంచితే, భానుమతి పాత్ర ఎదురయిన సమస్యతో ఒక స్పష్టతతో, బలంగా  వుంటుంది. ముందు ఆమె తల్లితో సమస్యలు వస్తున్నాయని అస్సలు అనుకోదు. తల్లిది సానుకూల దృక్పథమే అనుకుంటుంది. అందుకని, ఒక బంధువు ముందు భర్త గురించి తల్లి లేనిపోని గొప్పలు చెప్పి భర్త మనోభావాలు దెబ్బ తీసినప్పుడు -  “మీ అమ్మగారు నిన్ను నాలాంటి సామాన్యుడి కిచ్చి పెళ్లి చేశారా అని ఆలోచిస్తున్నాను” అని అతనంటే - “మీకన్నీ రావాలనీ, మీరలా వుండాలనీ ఆవిడ ఉద్దేశం” అని నచ్చజెప్తుంది. 

          “నా లాంటి వాడు అల్లుడు కావడం ఆవిడ గారికి నామర్దాగా వుంది, నువ్వు నన్ను చేసుకోవడం ఆవిడకిష్టం లేదు” అని మళ్ళీ అంటే – “మీరొట్టి శాడిస్టు మనిషి!” అని నవ్వేస్తుంది . కానీ టెలిఫోన్ పెట్టిస్తున్నప్పుడు తల్లి ఇంటికొచ్చి గోడకి తగిలించిన సామాగ్రిని చూసి, “ఈ తట్ట బుట్ట పెట్టే చోటు ఇదా? తీసి అవతల పడెయ్యి!” అని భర్త ముందు కసురుకున్నప్పుడు నిర్ఘాంత పోతుంది. “తీయడానికి వీల్లేదు!” అని భర్త అరిచినప్పుడు ప్రత్యక్ష సమరం మొదలైపోతుంది. 

          అలాఅలా తన సంసారం మీద తల్లిగారి పెత్తనం బాగా పెరిగిపోతూంటే, ఇద్దరికీ నచ్చ చెప్పలేక నలిగిపోతున్న ఆమె, ఒకానొక దశలో సహనం కోల్పోయి భర్తతో అనేస్తుంది –“మగవారు మీరుండగా ఇవన్నీ ఆవిడ ఎందుకు చేయించాలని మీకు బాధగా వుంది కదూ? పెళ్లి చేసుకున్నంత మాత్రాన పుట్టింటిని పూర్తిగా మర్చిపోవాలనుందా  ఏమిటీ? ఇక నా మంచీ చెడూ అమ్మా నాన్నా ఏం చూడనే కూడదా?” అని. 

          ఇలా భర్తకీ తల్లికీ మధ్య వ్యక్తిత్వాల గొడవలు తనకీ భర్తకీ మధ్య వ్యక్తిత్వాల గొడవగా మారిపోతుంది. ఇక ఆమె అన్నకి ఫోన్ చేసి, చెల్లెల్ని తీసికెళ్ళి పొమ్మంటాడు. ఏమనాలో అర్ధంగాక పుట్టింటికి చేరుతుంది భారతి. 

          మనసుని మళ్ళించుకోవడానికి ఎమ్మే చదవడం మొదలెడుతుంది. చదువుకుని ఉద్యోగం చేస్తానంటుంది. అన్న మందలిస్తాడు. “స్త్రీ జీవితానికి అర్ధం, లక్ష్యం ఉద్యోగం చేయడం కాదు. వివాహం చేసుకోవడం” అంటాడు. అప్పటికే విడాకుల కాగితాల మీద సంతకం తీసుకున్న అతను, చెల్లెలి పెళ్లి ప్రస్తావన తెచ్చి, అక్క వుండగా చెల్లెలి పెళ్లి కష్టమని, అందుకని మళ్ళీ పెళ్లి చేసుకోమంటాడు. తల్లి కూడా సమర్ధిస్తుంది. దీంతో విరుచుకు పడుతుంది భారతి, “ మీరింత వరకూ నా మంచి కోసం చేసింది చాలు...నువ్వు మంచి అనుకున్నదే లోకం మంచి అనుకోవాలని ఎక్కడుందమ్మా? కాలం మారుతోంది. అంతస్తులు మారుతున్నాయి. అనుభావాలు మారుతున్నాయి. కానీ నీలాటి అమ్మలు మాత్రం మారడం లేదు!” అనేసి వెళ్ళిపోతుంది. 

          కాలం మారుతోంది అనే మాట అప్పటి ఈ సినిమాలో ఇంకో రెండు సార్లు వస్తుంది. బస్సులో మగవాళ్ళ సీట్లో ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు, “కాలం మారిపోతోంది. ఆడవాళ్ళ  సీట్లో ఆడవాళ్లే, మగవాళ్ళ ఆడవాళ్లే” అని ఒకసారి, చివర్లో ఎన్టీఆర్ పశ్చాత్తాప పడినప్పుడు మరోసారి. కాలం మారిందనే మాట ఇప్పటికీ వాడుతూనే వుంటారు. కానీ అరవై ఏళ్ల  క్రితమే కాలం మారిందని గమనించి సినిమాల్లో వాడేశారు. ఏ కాలంలో వాళ్ళు ఆ కాలం మారిందనే అనుకుంటారు. అయితే ఇప్పుడు చూస్తేనే, అప్పటి కాలం మారలేదనీ, ఇప్పటి కాలమే బ్రహ్మాండంగా మారిందనీ గొప్పలు పోతారు. ఇప్పటి ఈ కాలం ఇంత మారడానికి వెనకటి కాలాలే మారుతూ మెట్లు వేశాయని గుర్తించరు. 

          భారతి ఎమ్మే పాసయి, టీచరుగా ఉద్యోగమొస్తే వేరే వూరు వెళ్ళిపోతుంది. అక్కడ గతాన్ని మరచిపోవాలని చాలా ప్రయత్నిస్తుంది. ఆమెని చూసి ఒక టీచర్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టమే అన్నట్టు సంకేతాలిస్తాడు. నాల్గు దులుపుతుంది. చెల్లెలి పెళ్లి పిలుపు రావడంతో ఇక వెళ్ళక తప్పదు. వైభవంగా జరుగుతున్న ఆ పెళ్ళిలో వధూవరులు ఏడడుగులు వేస్తున్నప్పుడు తట్టుకోలేక పరిగెడుతుంది. పరుగెత్తీ పరుగెత్తీ భర్త ఇల్లు చేరుకుంటుంది. తలుపు కొట్టీ కొట్టీ  అలసి పోతుంది. ఒకావిడ తలుపు తీసి “ఎవరు కావాలి?”  అంటుంది. భారతికి అర్ధమైపోతుంది. “మీ వారున్నారా, పిలవండి” అంటుంది నిస్సహాయంగా. అప్పుడే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని జీర్ణించుకోలేక. అప్పుడు అతనొస్తాడు. అతడి పేరుకూడా చంద్రశేఖరే. లాయర్. భర్త ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడనీ, తాము ఈ ఇంట్లోకి వచ్చామనీ అతనన్నప్పుడు తేలిక పడుతుంది భారతి. ఈ సస్పెన్స్ డ్రామా గొప్పగా వుంటుంది. 

          అయితే ఇతను ఆమెని నిందిస్తాడు. భర్త పిచ్చి పట్టిన వాడిలా ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదనీ, పిన్ని కూడా ఇవన్నీ చూడలేక చనిపోయిందనీ, దీని కంతటికీ బాధ్యత భారతీదేననీ దూషిస్తాడు. భారతికిక  చచ్చిపోవాలన్పిస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక భర్త చంద్రశేఖర్ లాయర్ దగ్గరికొస్తాడు. లాయర్ జరిగింది చెప్తాడు. చంద్రశేఖర్ చలించిపోతాడు.

          “కాలం మారుతోంది. మనసుకు నచ్చినా నచ్చక పోయినా కట్టుకున్న భర్తే ప్రత్యక్ష దైవమని పూజించే రోజులు పోయాయి. పురుషులతో బాటు స్త్రీలు కూడా వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటున్నారు. విభిన్న వ్యక్తిత్వాలున్నభార్యాభర్తల మనసులు అతకడం కష్టం” అని బాధపడతాడు. 

          “తనలో ఎంత మార్పు వస్తే ఇక్కడి కొచ్చింది...మొదట్లో నేనూ నీలాగే అనుకున్నాను. ఆడవాళ్ళు మగవాళ్ళని నీడలా అనుసరిస్తే చాలనుకున్నాను. మనకిష్టమైన రూపంలో కన్పించడానికి వాళ్ళు మట్టి బొమ్మలూ, లక్క బొమ్మలూ కాదు. మనలాంటి మనుషులే...” అంటూ భారతిని వెతకడానికి పరిగెడతాడు.   సుఖాంతమవుతుంది. ఈ మొత్తం కుటుంబ డ్రామాలో నీతి ఏమిటంటే, భార్యాభర్తల మధ్య ఇంకో వ్యక్తి రూపంలో సమస్య వచ్చినప్పుడు, ఆ భార్యాభర్తలు ఒకటై తమ వైవాహిక బంధం కోసం ఆ మూడో వ్యక్తి ప్రమేయాన్నే తిప్పికొట్టాలనీ.  ఈ కథలో చంద్రశేఖర్ అత్త ప్రభావానికి లొంగిపోయి భార్య  భారతిని బాధపెట్టడం, భారతి చంద్రశేఖర్ ని బాధ పెట్టడం, ఇద్దరూ కలిసి సంసారాన్ని ముక్కలు చేసుకోవడం. అత్తగారు మాత్రం సలక్షణంగా వుండడం. ఈ దృశ్యాన్ని ట్రాన్సాక్షనల్ ఎనాలిసిస్ (టీఏ) ప్రకారం చూస్తే, అత్తగారు పేరెంట్ మెంటాలిటీతో వుంటే, భార్యాభర్తలు చైల్డ్ మెంటాలిటీతో వుండిపోయారు. ఈ రెండు మెంటాలిటీలూ లాభం లేదనీ, మనుషులు అడల్ట్ మెంటాలిటీకి ఎదిగితే సమస్యలు రావనీ టీఏ చెప్తుంది. ఇదీ విషయం. 

          పిఎస్ రామకృష్ణ దర్శకత్వం బెంగాలీ మాతృకలాగా మరీ కళాత్మకంగా లేకపోయినా,  సీదా సాదాగా బాగానే వుంటుంది. సన్నివేశాలు నడుస్తున్నప్పుడు ఉన్నట్టుండి పక్క ఆర్టిస్టుల క్లోజప్స్ వేసే చమత్కారం ఎక్కువ కన్పిస్తుంది. గ్లామరస్ గా భానుమతికి చాలా సార్లు వేశారు. మాటలు రాసిన అట్లూరి పిచ్చేశ్వరరావు “చివరకు మిగిలేది” కి రాసిన రచయితే. ఆయన దురదృష్టమేమిటంటే ఈ రెండూ అట్టర్ ఫ్లాపయ్యాయి. పాటలు రెండు సూపర్ హిట్టయ్యాయి- “నీటిలోన నింగిలోన”, “విన్నావా విన్నావా” అనే పాటలు.

సికిందర్
‘పాలపిట్ట’ సాహిత్య మాస పత్రిక
మార్చి, 2019 సంచిక