రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, ఆగస్టు 2018, ఆదివారం

673 : స్ట్రక్చర్ అప్డేట్స్


       సినిమా పాత్ర కథని పట్టుకుని ప్రయాణిస్తుందా, లేక కథని పుట్టిస్తూ ప్రయాణిస్తుందా? మొదటిది జరిగితే నష్టమేమిటి? రెండోది జరిగితే లాభమేమిటి? రెండోది జరిగితే  ‘గోల్డ్’  లాంటి లాభం. మొదటిది జరిగితే ‘శ్రీనివాస కళ్యాణం’ లాంటి నష్టం. ఇవాళ్ళ ఇది కొత్తగా చెప్పుకునే విషయం కాదు. చాలా పాత విషయమే. సినిమా కథ పాత్రని పట్టుకుని ప్రయాణిస్తే పాత్ర యాక్టివ్ గా వుంటుంది, ఆ యాక్టివ్ పాత్ర కథని ముందుకు నడుపుతుంది. సినిమా పాత్రే కథని పట్టుకుని ప్రయాణిస్తే పాసివ్ పాత్రవుతుంది, ఆ పాసివ్ పాత్ర కథని కూల్చేస్తుంది. నూటికి తొంభై సార్లు ఏం జరుగుతోందంటే, రెండున్నర గంటల పాత్రని ఆలోచించకుండా, కేవలం రెండున్నర గంటల కథని ఆలోచించడం వల్ల పాసివ్ పాత్రలు పుట్టి, 90 శాతం సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.
          ‘గోల్డ్’ లో పక్కకి తొలగకుండా పూర్తిగా రెండున్నర గంటల పాత్రని ఆలోచించారు. అందుకని ప్రేక్షకులు పాత్రని పట్టుకుని ప్రయాణిస్తూ, అది పుట్టిస్తున్నకథని అనుభవించే అదృష్టానికి నోచుకుంటున్నారు. పాత్ర కథని పుట్టించక పోతే, కథని కథకుడి పెంపుడు కుక్కలు కూడా అనుభవించ లేవు. దొంగలు పడ్డా మాకేంటని కునుకు తీసి, కథకుడి ఇంటిని దొంగల పాల్జేసి కక్ష తీర్చుకుంటాయి. కథకుడు సినిమా కథ రాయడం మొదలెట్టినప్పుడు ఈ కనీస జ్ఞానం లేకపోతే, నీరో చక్రవర్తి అవుతాడు. తను రాసి పక్కన పడేస్తున్న ఒక్కో పేజీ మీద లక్షో, కొన్ని లక్షలో బడ్జెట్ భస్మీపటలమవడానికి సిద్ధమవుతోంటే, తన లోకంలో తాను వీరోచితంగా రాసుకుంటూ భావప్రాప్తి పొందుతూంటాడు. ఇతడి ముందు నీరో చక్రవర్తి అట్టర్ ఫ్లాపవుతాడు. ఫిడేలు పడేసి పెన్ను అడుక్కుంటాడు. 

          పాత్ర కథనెలా పుట్టిస్తుందంటే, పాత్రకో అవసరం (గోల్) వుంటుంది, ఆ అవసరాన్ని పొందేందుకు కథని పుట్టిస్తూంటాడు. పాత్ర లేకుండా ‘అవసరం’ వుండదు. ఏ కథైనా పుట్టేది పాత్ర ‘అవసరం’ తోనే. అవసరమే కథకి పుట్టిల్లు. అక్కడ్నించీ కథని అత్తారింటికి పంపడమే పాత్ర చేసే పని, చింతామణి దగ్గరికి కాదు. పాత్రని పక్కన బెట్టి కథకుడు అవసరాన్ని వూహించ గలడా? తన కథైతే వూహించగలడు. అప్పుడు తన ‘అవసరం’ పాత్ర ‘అవసరం’ గా కల్పించి, పాత్ర చేతిలో కథని పెట్టడు. తన జీవితంలో ఆ ‘అవసరం’ తో అయిన అనుభవాలే పాత్ర అనుభవాలుగా నమ్మిస్తూ చిత్రించుకు పోతాడు. తన ఆనుభవాలతో పాత్రని నడిపిస్తాడు. కానీ జీవితం అచ్చంగా సినిమాకి తర్జుమా అవాలంటే అది ఆర్ట్ సినిమా అవుతుందని అర్ధం జేసుకోడు. ఫిడేలు రైటర్నే అవ్వాలనుకుంటాడు. పెన్ను కోసం నీరో చక్రవర్తి వచ్చినా తనే హీరో ఐపోవాలనుకుంటాడు. పెన్ను పెట్టి ఫటేల్మని ఫిడేలుని చీరేస్తాడు!
***
        ‘గోల్డ్’ లో ముఖ్యంగా గమనించాల్సింది,  గోల్ (అవసరం) అనే పాత్ర పరికరం అప్డేట్ అయిన విధం. ఏ సినిమా చూసినా, ‘పాత్ర గోల్ - దానికోసం సంఘర్షణ – విజయం’ – అనే బ్రాకెట్లోనే వుంటాయనేది తెలిసిందే. అయితే ఇదొక టెంప్లెట్ బారిన పడి మొనాటనీ వచ్చేసింది. మొదటి అరగంట కథలో గోల్ ఏర్పడడం, తర్వాత గంట కథలో గోల్ కోసం సంఘర్షించి ఓ పరిష్కార మార్గాన్ని కనుక్కోవడం, దాంతో చివరి అరగంటలో గోల్ ని సాధించుకోవడం. ఇదే టెంప్లెట్ లో, అందులో ఇవే యాక్ట్ బ్రేక్స్ ప్లేస్ మెంట్స్ తో సినిమాలు వస్తూంటాయి. వీటికి రివ్యూలు రాయాలన్నా థ్రిల్ వుండదు, యాంత్రికమే. ఈ బ్రాకెట్ ని బ్రేక్ చేయకూడదా? బ్రాకెట్ ని బ్రేక్ చేయడమంటే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ని బ్రేక్ చేయడం కాదు. త్రీ యాక్ట్ స్ట్రక్చర్ త్రీ యాక్ట్ స్ట్రక్చరే కమర్షియల్ సినిమాలకి. దీన్ని కాదనుకున్న వాళ్ళు నాన్ కమర్షియల్ యూరోపియన్ సినిమాలు తీసుకోవచ్చు. 

          హాలీవుడ్ లో పూర్వం అరిస్టాటిల్ నాటక నమూనాతో ప్రారంభించుకుని, తర్వాత జోసెఫ్ క్యాంప్ బెల్ పురాణ కథల నమూనా కొచ్చి, దీని తర్వాత సిడ్ ఫీల్డ్ ఆధునిక  నమూనా స్వీకరించారన్నసంగతి తెలిసిందే. సుమారు మూడు దశాబ్దాలుగా సిడ్ ఫీల్డ్ నమూనాతోనే హాలీవుడ్ సినిమా లొస్తున్నాయి. హాలీవుడ్ ని అనుసరించే ఇతర దేశాల కమర్షియల్ సినిమాలు సైతం ఈ బ్రాకెట్లోకే వచ్చేశాయి. ఇన్నేళ్ళుగా ఈ బ్రాకెట్లో సినిమాలు చూసి చూసి విసుగేయడం లేదూ?

          తప్పకుండా విసుగేస్తోంది. రివ్యూ రైటర్ అనే శాల్తీ, గోల్ ఎప్పుడొస్తుందాని టైము చూసుకుంటూ – అరగంటకి రాకపోతే ఇంకా ఎదురు చూస్తూ, ఇంటర్వెల్ కొస్తే అసంతృప్తి చెందుతూ, ఇంటర్వెల్ తర్వాత వస్తే మటాష్ అనుకుంటూ గడపాల్సి వస్తోంది.  గోల్ అరగంటకే ఎందుకు రావాలి? ఇంటర్వెల్ కి వస్తే ఫస్టాఫ్ డొల్లగా మారుతుంది గనుక. ఇంటర్వెల్ తర్వాత వస్తే మిడిల్ మటాష్ అవుతుంది గనుక. అయినా సరే, గోల్ అరగంటకే ఎందుకు రావాలి?

          గోల్ అరగంటకి రావాల్సిందే! అది స్ట్రక్చర్. వీలయితే అరగంట లోపు పావుగంటకే రావొచ్చు, నష్టం లేదు. స్ట్రక్చర్ ని బ్రేక్ చేయలేరు. స్ట్రక్చర్ లోపల టెంప్లెట్ గా మార్చుకున్న క్రియేటివిటీని బ్రేక్ చేయాలి.  క్రియేటివిటీ మన ఇష్టం, స్ట్రక్చర్ ఎవడబ్బ సొత్తూ కాదు.  అరిస్టాటిల్, జోసెఫ్ క్యాంప్ బెల్ ల నమూనాలని ఆధునిక కాలానికి తగ్గట్టూ సరళీకరించి,  సిడ్ ఫీల్డ్ ఇచ్చిన నమూనా శాశ్వతం. ఇంతకంటే సరళీకరణ ఇక కుదరదు. ఉన్నతీ కరించడం కూడా కుదరదు. కుదిరేది దీని లోపల కథతో క్రియేటివిటీ ని ఇన్నోవేట్ చేసుకోవడమే, అప్డేట్ చేసుకోవడమే. అప్పుడే స్ట్రక్చర్ లోపల మొనాటనీ బ్రేక్ అవుతుంది. ఫ్రెష్ సినిమాలొస్తాయి.

***
        అరగంట లోనో, అంతకి మునుపో గోల్ వస్తే అది టెంప్లెట్ బారిన పడకుండా ఎలా మేనేజ్ చేయాలి? ఒక్కటే మార్గం : దాని కోసం మొదలయ్యే  ప్రత్యక్ష సంఘర్షణని ఆలస్యం చేయడం. గోల్ ఒక ప్రొడక్టు అనుకుంటే, సంఘర్షణ దాన్నుంచి వచ్చే బై ప్రొడక్టు. దీన్నాలస్యం చేయాలి. ముందు శోభనం జరిపించెయ్యాలి, సంసారం పిల్లాపీచూ తర్వాతెప్పుడో! వాటి కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేట్టు చేయాలి. ‘గోల్డ్’ లో ఇదే చేశారు. ఒలింపిక్స్ పోటీలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూసేట్టు చేశారు. క్రియేటివిటీ అంటే ప్రేక్షకులతో ఆడుకోవడమే (నరకం చూపించే ఆట కాదు).  
       
          మామూలుగా టెంప్లెట్ లో ఎలా వుంటుందంటే, హీరోకి గోల్ ఏర్పడిన వెంటనే ప్రత్యర్ధితో, లేదా వ్యతిరేక పరిస్థితులతో ప్రత్యక్ష పోరాటం మొదలైపోతుంది. దీన్నాలస్యం చేయాలి. ‘గోల్డ్’ లో ఇదే చేశారు. కానీ గోల్ ని ఆలస్యం చేయలేదు. ఆట ప్రారంభమైన పది నిమిషాల్లోనే గోల్ ని ఏర్పాటు చేసేశారు. ఇందులో హీరో గోల్,  1948 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే. అంటే తనకి సవాలు విసురుతున్న అంశం ఒలింపిక్స్. అలాగని ఈ గోల్ ఏర్పడిన వెంటనే ఒలింపిక్స్  కూడా ప్రారంభమై పోరాటం మొదలు కాలేదు. ఈ ప్రత్యక్ష పోరాటాన్ని క్లయిమాక్స్ కి జరిపేశారు. 

          ‘మెకన్నాస్ గోల్డ్’ లో గోల్డ్ కోసం పోతే క్లయిమాక్స్ లో భూకంపం వస్తుంది. ఇది బిగ్ ఈవెంట్. ఒక ‘స్టార్ వార్స్’  సీక్వెల్ లో బిగ్ ఈవెంట్ క్లయిమాక్స్ లో డెత్ స్టార్ ని నాశనం చేయడం. వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’ లో బిగ్ ఈవెంట్  చివర్లో వచ్చే ‘బలపం పట్టి భామ వొడిలో’ పాట. రిపీట్ ఆడియెన్స్ ఈ పాట చూసేసి వెళ్ళిపోయే వాళ్ళు. అలాగే ‘గోల్డ్’ లో బిగ్ ఈవెంట్ వచ్చేసి క్లయిమాక్స్ లో వచ్చే ఒలింపిక్స్ గేమ్! 

           
రెండు గంటల 50 నిమిషాల నిడివి గల ‘గోల్డ్’ లో చివరి అరగంటకే ఒలింపిక్స్ గేమ్స్ తో క్లయిమాక్స్ వస్తుంది. అంతవరకూ దాని కోసం ఎదురు చూసేలా చేస్తారు. రెండు గంటలకి పైగా ఎదురు చూసేలా చేయడమంటే చాలా రిస్కు తీసుకోవడమే. అంత సేపూ ఏమేం చూపిస్తూ ప్రేక్షకుల్ని కూర్చోబెట్టాలి? భరిస్తారా, గొడవ చేస్తారా? 

       ఆట ప్రారంభమైన పది నిమిషాల్లోనే, 1936 జర్మనీ ఒలింపిక్స్ గోల్డ్ గెలిచినప్పుడు, ఆ గెలుపు క్రెడిట్ బ్రిటిష్ పాలకులు వాళ్ళ ఖాతాలో వేసుకున్నప్పుడు, హీరో అక్షయ్ కుమార్ కి రగిలిపోయి గోల్ ఏర్పడుతుంది. ఇక వచ్చే ఒలింపిక్స్ లో స్వతంత్ర ఇండియాకి గోల్డ్ సాధించాలని. దీంతో స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగం ముగుస్తుంది. 

          ఈ గోల్ తో వెంటనే సమస్యతో సంఘర్షణకి దిగాడా? లేదు, ఇదే క్రియేటివిటీ లోని బ్యూటీ. ఈ గోల్నే గనుక రొటీన్ టెంప్లెట్ లో పెడితే ఇలా వుంటుంది – హీరో బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడానికి వెంటనే  స్వాతంత్ర్య పోరాటంలోకి దూకుతాడు. ఈ మిడిల్ విభాగమంతా గాంధీ నెహ్రూ మొదలైన నాయకుల వెంట వుండి పోరాడుతూ, లాఠీ దెబ్బలు, తూటా దెబ్బలూ తింటూ, గొప్ప దేశ భక్తిని రగిలిస్తాడు. తట్టుకోలేక స్వాతంత్ర్య మిచ్చేసి బ్రిటిష్ వాళ్ళు విమానాలెక్కగానే - ఇంకా అయిపోలేదురా – వస్తా, మీ ఇంటికే వస్తా, నా ఒక వైపే చూశారు, రెండో వైపు చూడలేదు, మీ ఇంటికొచ్చి చూపిస్తా- ఒలింపిక్ గోల్డ్ కొట్టు కెళ్ళిపోతా – అని మృదుమధురమైన భాషలో హెచ్చరించి, మిడిల్ విభాగాన్ని ముగిస్తాడు.  

          ఇక ఎండ్ విభాగంలో టీముకి ట్రైనింగు ఇప్పించుకుని లండన్ బయల్దేరతాడు. అక్కడ ఒలింపిక్స్ లో బ్రిటిషర్లని ఓడించి, గోల్డ్ ని కైవసం చేసుకుని గోల్ పూర్తి చేసుకుంటాడు.

          ఇలావుంటుంది, గోల్ తో వెంటనే సంఘర్షణ ప్రారంభిస్తే. స్వాతంత్ర్య పోరాటమంతా జొరబడి జానర్ మర్యాద దెబ్బతినిపోతుంది. ఈ కథ హాకీ క్రీడ గురించే గానీ ఫ్రీడం ఫైట్ గురించి కాదు. దాన్ని చొరబెట్టి కలుషితం చేయడం కాదు. ఒక గోల్ పెట్టుకుని దాన్నే గుర్తు చేస్తూ, సీను తర్వాత సీను దానికోసం సంఘర్షణే  చివరంటా చూపిస్తూ పోతూంటే, కథనం ఫ్లాట్ గా మారుతున్న, ముందేం జరుగుతుందో తెలిసిపోతున్న, పాత్ర తెగ బోరు కొడుతున్న, ఒకేలాంటి సినిమాలొస్తున్నాయి. టెంప్లెట్ తో వచ్చిన సమస్యే ఇది.  

        తాజాగా విడుదలైన జాన్ అబ్రహాం ‘సత్యమేవ జయతే’ చూస్తే కూడా ఇది బాగా అర్ధమవుతుంది. అతడికి యాంగ్రీ యంగ్ మాన్ గా అవినీతి పోలీసుల్ని అంతమొందించడం గోల్. చివరి దాకా ఈ గోల్ తో సాగే కథని నిలబెట్టడానికి, ఆ గోల్ తాలూకు యాక్షన్ ని అత్యంత హింసాత్మకంగా, జుగుప్సాకరంగా చూపించాల్సి వచ్చింది. గోల్ ఏమిటో తెలిసిపోయాక, ఇంకేం జరుగుతుందో తెలిసిపోయాక మిగిలేది మొనాటనీయే కాబట్టి- దీన్ని కప్పి పెట్టడానికి,  అత్యంత వయొలెంట్ యాక్షన్ గా మార్చి, దృష్టి మరల్చాల్సి వచ్చింది.

          ‘గోల్డ్’ లో గోల్ తాలూకు యాక్షన్ ని – అంటే ఒలింపిక్స్ అనే బిగ్ ఈవెంట్ ని పక్కకు పెట్టేశారు. జర్మనీలో గెలిచి వచ్చాక హీరో స్వాతంత్ర్యం కోసం ఎదురు చూస్తూంటాడు. ఇక స్వాతంత్ర్యం దగ్గర పడుతూ, 1948 ఒలింపిక్ ప్రకటన వెలువడగానే టీము అన్వేషణలో బయల్దేరతాడు. ఫస్టాఫ్ అంతా అతడి కుటుంబం గురించి, కొందరు టీం మెంబర్ల కథల గురించి, అవి హీరో ప్రయత్నాలని ప్రభావితం చేయడం గురించి, చివరికి అంతా రెడీ అనుకున్నాక, దేశ విభజన జరిగి టీము ముక్కలవడం గురించీ! ఇది ఇంటర్వెల్ పాయింట్.  

          బాగానే వుంది, మరి ఇక్కడ్నుంచీ ఎలా? మళ్ళీ ఇంకో టీము వెతుక్కోవాలా? ఇది మళ్ళీ ఫస్టాఫ్ కథలాగే వుండదా? ఉంటుంది, కాకపోతే ఫస్టాఫ్ కథకంటే కష్టాల - టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ - తీవ్రత ఎక్కువుంటుంది. ఈ టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ఎలా పెరుగుతూ పోతుంది? కథని (యాక్టివ్) పాత్ర నడిపితేనే పెరుగుతూ పోతుంది. ఇక్కడే అక్షయ్ కుమార్ పాత్రని వ్యూహాత్మకంగా నడిపారు. ఎలాగైతే  ‘భలే భలే మగాడివోయ్’ లో నాని పాత్ర కథలో పది నిమిషాల కో బ్యాంగ్ చొప్పున ఇచ్చుకుంటూ స్ట్రక్చర్ నే ఎగేసుకుంటూ వెళ్ళిపోతుందో,  అలా అక్షయ్ పాత్ర కథకున్న ఏకరూప ఫస్టాఫ్ – సెకెండాఫ్ అనే బోరు ఎక్కడా కలక్కుండా, జోడు గుర్రాల్లా వురికించే సన్నివేశాలు సృష్టించుకుంటూ సాగిపోతుంది. ఏ సినిమా కథయినా ప్రధాన పాత్రని పట్టుకుని కథకుడు ప్రయాణిస్తేనే కరెక్టుగా వస్తుంది. ఎందుకంటే కథంటే ప్రధాన పాత్రే. ఇంకెక్కడో వేరేగా వుండదు. ఇలా కాకుండా, కథకుడే తోచిన కథని ప్రధాన పాత్రకి పూస్తూ పోతూంటే, పోతూనే వుంటాడు అట్టర్ ఫ్లాప్ గోతి లోకి. గోతిలో పడ్డాక గానీ పెన్ను పడేసి ఫిడేలు అందుకోడు – అప్పుడు ఫిడేలు రైటర్. మళ్ళీ అదొక భయానక పుట్టుక. 

      ఈ సుదీర్ఘంగా సాగే మిడిల్ విభాగంలో పలక శుభ్రంగా తుడిచేసి కొత్త వ్రాత రాశారు. బిగినింగ్ విభాగంలో జర్మనీలో హీరో గెలిచాక, ఆ బ్రిటిషీయుల ఛాయలు మిడిల్లో ఎక్కడా పడనివ్వకుండా, పలక శుభ్రంగా తుడిచేశారు. ఆ క్లీన్ స్లేట్ మీద ఫ్రెష్ గా మిడిల్ రాసుకొచ్చారు. టీముల ఏర్పాటుకోసం హీరో చేస్తున్న ప్రయత్నాలకి బ్రిటిష్ పాత్రలు  జొరబడి గండి కొట్టడం ఎక్కడా వుండదు. ఎందుకు వుండదంటే, ఏర్పాటు చేసిన గోల్ తో వెంటనే సంఘర్షణలోకి స్క్రీన్ ప్లే వెళ్ళడం లేదు కాబట్టి. అదంతా ఎండ్ విభాగానికి జరిపేశారు కాబట్టి. బ్రిటిష్ పాత్రలు కూడా కన్పించవు మిడిల్లో. స్ట్రక్చర్లో ఒక కొత్త క్రియేటివిటీకి సమకట్టినప్పుడు దానికి కట్టుబడి వుండాల్సిందే. నిగ్రహం తప్పో, అభద్రతతోనో ఆ సమకట్టిన క్రియేటివిటీని అక్కడక్కడైనా చెరచడం చేస్తే, ఉద్దేశమే ఉల్ఫా అయిపోతుంది. 

          సారాంశ మేమిటంటే, స్ట్రక్చర్ లో గోల్ తో గల క్రియేటివ్ మొనాటనీని బ్రేక్ చేయడానికి, గోల్ నుంచి సంఘర్షణని విడదీసేయాలి…గోల్ నుంచి సంఘర్షణని విడదీసేయాలి
గోల్ నుంచి సంఘర్షణని విడదీసేయాలి మిడిల్లో ఆ గోల్ తాలూకు సన్నివేశాలే నడపాలి. కొన్ని తెలుగు సినిమాల్లో ఎలా వుంటుందంటే,  గోల్ ని ఏర్పాటు చేశాక,  దాన్ని పక్కన పెట్టేసి, ఇంకేవో గోల్ తో సంబంధంలేని కామెడీ కాలక్షేపాలు చేసుకుపోతారు. చిట్టచివర్లో ఎక్కడో గోల్ గుర్తొచ్చినట్టు ఉలిక్కి పడి కళ్ళు తెర్చి, కాసేపు ఆ గోల్ ని చికెన్ ఫ్రై చేసుకుని ముగించేస్తారు. సినిమా విడుదలయ్యాక ఖాళీ జేబులతో చికెన్ ఫ్రై కోసం తిరుగుతూంటారు. అది గోల్ ని చికెన్ ఫ్రై చేస్తే చికెన్లు పెట్టే శాపం. గోల్ గోల్డెన్ ఎగ్స్ పెట్టాలంటే ఇలాకాదు. 

          గోల్ నుంచి సంఘర్షణని విడదీసి, తర్వాత ఉపయోగంలోకి తెచ్చుకోవాలంటే ఏమిటి? ఆ సంఘర్షణని మొదలెట్టే సన్నివేశాలని తీసికెళ్ళి సంఘర్షణకి కలిపి సంఘర్షణని ప్రారంభించడమే. ‘గోల్డ్’ మిడిల్లో వున్నది సంఘర్షణని  మొదలెట్టడానికి కావలసిన ఇంధనం సమకూర్చుకున్న సన్నివేశాల సృష్టే!  ఏర్పాటయిన గోల్ కీ, సంఘర్షణ మొదలవడానికీ మధ్య వున్న స్పేస్ ని, సంఘర్షణకి సన్నద్ధం చేసే సన్నివేశాల కల్పనకి సద్వినియోగం చేసుకోవడమే. ప్రత్యక్షంగా ‘గోల్డ్’ ని చూసి ఆలోచిస్తే ఇది బాగా అర్ధమవుతుంది.
***
     ‘గోల్డ్’ లాగే గోల్ తో క్రియేటివిటీ కనబర్చే మూవీ ‘సంజు’. ఇక్కడ గోల్ రివర్సల్ జరుగుతుంది. అంటే కథ నడిపిస్తున్న హీరో కాస్తా డీలాపడిపోయి పాసివ్ గా మారిపోతాడు. కానీ కథ నడిపిస్తున్నంత సేపూ హీరోకి ఏ గోల్ ఏర్పడుతుందన్న ఆసక్తి క్రియేట్ అవుతుంది. తీరా చూస్తే గోల్ హీరోకి ఏర్పడదు. గోల్ రివర్సల్ ఎదురవుతుంది. అనూహ్యంగా గోల్ అతడి తండ్రికి ఏర్పడుతుంది. ఎందుకంటే డ్రగ్స్ కి బానిసై, ప్రేమలో విఫలమై హీరో అశక్తుడై పోయాడు. అందుకని హీరోని బాగు పర్చే గోల్ తో, కథని ముందుకు నడిపే యాక్టివ్ పాత్రగా, తండ్రి ప్రవేశించాడు.

          ఇది కూడా గోల్ తో వుండే మొనాటనీని ఛేదిస్తోంది. షానన్ అనే రచయిత ఏమంటాడంటే... ‘1 – గోల్’ లేదా లీనియర్ ప్లాట్ తో వస్తున్న సినిమాలు కథ తెలిసిపోతూ ఫ్లాట్ గా, ఏ మాత్రం ఆసక్తి రేకెత్తించని విధంగా వస్తున్నాయి. హీరోకి ఒకే గోల్ వుంటుంది, దానికోసమే సినిమా అంతా పాటుబడుతూ వుంటాడు. అదే కథ విసుగ్గా నడుస్తూ వుంటుంది. అయితే ఇంకో సినేరియాలో అప్పుడప్పుడు ‘2 – గోల్’ ప్లాట్ తో సినిమాలు కూడా వస్తున్నాయి. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన రెండు సినిమాలే వున్నాయి. ‘ఈటీ’ లో హీరోకి గ్రహాంతర జీవిని తనతోనే వుంచుకోవాలన్న గోల్ వుంటుంది. కానీ సెకండాఫ్ లో ఈ గోల్ మారిపోతుంది. గ్రహాంతర జీవి తిరిగి దాని గ్రహానికి వెళ్ళిపోయేందుకు సాయపడే  గోల్  ఏర్పడుతుంది. ‘జురాసిక్ పార్క్’ లో కూడా, హీరోకి పార్క్ ని సురక్షితంగా వుంచాలన్న గోల్ వుంటుంది. ఎప్పుడయితే డినోసారస్ లు అదుపు తప్పుతున్నాయన్న సూచనలం|దుతాయో, అప్పుడిక పార్క్ ఓనర్ పిల్లల సంరక్షణే గోల్ గా మారిపోతుంది...

         
గోల్ రివర్సల్ కి ఇంకో ఉదాహరణ చెప్పాడు షానన్. రెండు జెట్ విమానాలు చెరో గమ్యం వైపు దూసుకు పోతూంటాయి. మధ్యలో గుద్దుకుని పేలిపోతాయి. ఇక రెండు గమ్యాలూ క్యాన్సిల్ అయిపోయి, మూడో గమ్యం మొదలవుతుంది...

         దీన్నిలా కూడా చెప్పొచ్చు : హీరో ఒక గోల్ తో వెళ్తున్నాడు. అట్నుంచి హీరోయిన్ ఇంకో గోల్ తో వస్తోంది. ఇద్దరి కార్లూ పంజా గుట్ట సెంటర్లో గట్టిగా గుద్దుకుని పెద్ద ప్రమాదం జరిగింది. దాంతో ఇద్దరి గోల్సూ దుర్గం చెర్వులో పడి, ఇద్దరికీ కలిపి ఇంకో ఉమ్మడి గోల్ పుట్టుకొచ్చింది...


          ఇవీ గోల్ రివర్సల్ కి కొన్ని ఉదాహరణలు. ఒకే గోల్ ని సినిమా అంతా సింగిల్ ట్రాక్ మీద ఈడుస్తూ హీరోకే రోత పుట్టించేకన్నా, ఇలాటి 2 – గోల్ ప్లాట్స్ సృష్టించి, మొదటి గోల్ ని క్యాన్సిల్ చేసి, ఫ్రెష్ గా రెండో గోల్ ని ప్రారంభిస్తే మొనాటనీ పోతుంది. 

          ఇదిప్పుడు ఎందుకు అత్యవసరమో ఇంకో కారణం కూడా చెప్పుకుంటే, ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ అనేది పది సెకన్లకి పడి పోయిందని ఏనాడో సిడ్ ఫీల్డ్ చెప్పాడు. అంటే ఒక విషయం మీద పది సెకన్లకి మించి దృష్టిని పెట్టి చూడలేక పోతున్నారు ఆధునిక జీవన వేగం పెరిగిపోవడం వల్ల. అందుకే కథనంలో వేగమే కాదు, కదిలిపోయే దృశ్యాల్లో వేగం, గ్రాఫిక్స్ తో హంగామా ఇత్యాది టెక్నిక్స్ వాడాల్సి వస్తోంది.

         ఈ అటెన్షన్ స్పాన్ పరిధిలోకి  స్టోరీ గోల్ ని కూడా తీసుకొచ్చుకుని చూసినప్పుడు, ఒకే గోల్ తో రెండు గంటల కథ ఎంత బోరు కొడుతుంది... కనుక గోల్ తో రకరకాల క్రియేటివిటీలు అత్యవసరమే కావొచ్చు.

17, ఆగస్టు 2018, శుక్రవారం

విదేశీ పాఠక వర్గంలో కొత్తగా నెదర్లాండ్స్, పోర్చుగల్, రష్యా, ఖతర్, 
ఐర్లాండ్ దేశాల నుంచి పాఠకులు చేరుతున్నారు.
అందరికీ కృతజ్ఞతలు!
***

స్ట్రక్చర్ అప్డేట్స్ :


16, ఆగస్టు 2018, గురువారం

672 : రివ్యూ!





దర్శకత్వం : రీమా కాగ్తీ
తారాగణం : అక్షయ్ కుమార్, మౌనీరాయ్, కునాల్ కపూర్, సన్నీ కౌశల్, అమిత్ సాథ్, వినీత్ కుమార్ సింగ్, నికితా దత్తా తదితరులు
కథ : రీమా కాగ్తీ, రాజేష్ దేవరాజ్, స్క్రీన్ ప్లే : రాజేష్ దేవరాజ్, మాటలు : జావేద్ అఖ్తర్,సంగీతం : ఆర్కో ప్రావో ముఖర్జీ, తనిష్క్ బాగ్చీ, నేపథ్య సంగీతం : సచిన్ – జిగర్, ఛాయాగ్రహణం : అల్వరో గుట్రేజ్
బ్యానర్ : ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : రీతేష్ శిధ్వానీ, ఫర్హాన్ అఖ్తర్
విడుదల : ఆగస్టు15, 2018

***
          క్షయ్ కుమార్ స్పోర్ట్స్ డ్రామాల్లో ‘బ్రదర్స్’ తర్వాత  ‘గోల్డ్’ బాక్సాఫీసు గోల్ కొట్టేందుకు సిద్ధమై వచ్చింది. ‘బ్రదర్స్’ లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ని పరిచయంచేస్తే, ‘గోల్డ్’ లో 1948 నాటి ఇండియన్ హాకీ టీం లండన్లో సాధించిన ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సువర్ణాధ్యాయ ఘట్టాన్ని పరిచయం చేశాడు. బాలీవుడ్ లో దీపామెహతా (1947 –ఎర్త్, వాటర్), మేఘనా గుల్జార్ (రాజీ) ల తర్వాత పీరియడ్ మూవీస్ తీసిన దర్శకురాళ్ళ జాబితాలో ఇప్పుడు రీమా కాగ్తీ చేరిపోయింది. బిగ్ కాన్వాస్ మీద బృహత్ ప్రాజెక్టులుగా మేల్ డైరెక్టర్స్ మాత్రమే తీస్తూ వచ్చిన పీరియడ్ మూవీస్ సెగ్మెంట్ లో, వాళ్ళకే మాత్రం తీసిపోకుండా పాదం మోపింది. ఒక యదార్థ ఘట్టంతో భారీ కమర్షియల్ ప్రయోగం చేసింది. ఇదెలా వుందో ఒకసారి చూద్దాం...

కథ
          1936 లో జర్మనీలోని బెర్లిన్ ఒలింపిక్స్ లో బ్రిటిషిండియా హాకీ టీముకి జ్యూనియర్ మేనేజర్ గా వున్న తపన్ దాస్ (అక్షయ్ కుమార్), అడాల్ఫ్ హిట్లర్ సమక్షంలో జర్మనీని చిత్తుగా ఓడించి గోల్డ్ మెడల్ సాధిస్తాడు. అయితే ఇండియా ఇంకా బ్రిటిష్ పాలనలోనే వుంది గనుక బ్రిటిష్ పతాక మెగరేసి, బ్రిటిష్ జాతీయ గీతం పాడేసరికి వొళ్ళు మండిపోతుంది తపన్ కి. అప్పుడే గట్టి ప్రతిన బూనుతాడు. ఇక ఎట్టి పరిస్థితిలో స్వతంత్ర భారత్ ని ఒలింపిక్స్ లోకి నడిపించి గోల్డ్ మెడల్ కొట్టాలన్న ధ్యేయంతో వుంటాడు. అయితే ఆ స్వాతంత్ర్యమూ, ఒలింపిక్సూ రావడం లేటవుతూంటాయి. హిట్లర్ వెలగబెట్టిన రెండో ప్రపంచ యుద్ధంతో 1940, 44లలో జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదా పడతాయి.1945 లో యుద్ధం ముగిశాక, 1946 లో ఒలింపిక్స్ గురించి ప్రకటన వస్తుంది.1948 లో లండన్లో నిర్వహిస్తామని. ఈ మధ్య కాలమంతా మనసు విరిగిన తపన్ తాగుడికి బానిసవుతాడు. చివరికి 1947 లో అతను ఎదురుచూసిన స్వాతంత్య్రం లభిస్తుంది. అయితే దీనికి ముందే హాకీ ఫెడరేషన్ ని కదిలించి ఆటగాళ్ళని వెతికి వెతికి కష్టపడి టీముని తయారు చేసుకుంటాడు. ఇంతలో స్వాతంత్ర్యం లభించి, దేశ విభజన పరిణామాల్లో టీము మూడు ముక్కలవుతుంది. తపన్ తీవ్ర సంక్షోభంలో పడిపోతాడు. ఇప్పుడేం చేయాలి? కొత్త టీముకి ఫెడరేషన్ సహకరించడం లేదు. సొంత డబ్బులు పెట్టుకుని కొత్త టీముని  తానే తయారు చేసుకోవాలా? ఏం చేసి గోల్డ్ కొట్టాలి?

ఎలావుంది కథ 
      1948 లో స్వతంత్ర భారత్ అందుకున్న మొదటి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ - అదీ లండన్లో బ్రిటిష్ గడ్డ మీద బ్రిటిష్ టీముని ఓడించి సాధించిన స్వర్ణపతకం వరకూ యదార్థ ఘట్టమే. దీన్ని స్పూర్తిగా తీసుకుని కథ అల్లేశారు. ఈ కథలో అన్నీ కల్పిత పాత్రలే, కల్పిత సంఘటనలే, కల్పిత థ్రిల్స్ - డ్రామాలే. ఇలా చేయవచ్చా అంటే ఏమో - అక్షయ్ కుమారే నటించిన ‘ఏర్ లిఫ్ట్’ (2015) లో కువైట్ యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ఘటనని కూడా ఫిక్షన్ చేసి ప్రభుత్వ వర్గాల నుంచే విమర్శలెదుర్కొన్నారు. 

          ‘గోల్డ్’ లో కేవలం రెండే పాత్రలకి యదార్థంలో మూలాలు కన్పిస్తాయి. కథలో సృష్టించిన కెప్టెన్ ఇంతియాజ్ అలీ షా, ప్లేయర్ హిమ్మత్ సింగ్ పాత్రలు. మొదటి దానికి హాకీ స్టార్ కేశవ్ దత్ ఆధారం.1947 లో దేశవిభజన నేపధ్యంలో జరిగిన మత హింసలో లాహోర్ కి చెందిన కేశవ్ దత్ ఇరుక్కుంటే, టీం సభ్యుడు షారుఖ్ తన ఇంట్లోదాచి పెట్టాడు. ఇంటి మీద దాడి జరిగే సరికి రైలెక్కించి ఢిల్లీ పంపించేశాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 1948 లో రెండు దేశాల తరపున టీం మెంబర్లుగా లండన్ ఒలింపిక్స్ లో కలుసుకున్నారు.


హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ 
        కథలో ఇప్పుడు జాయింట్ మేనేజర్ గా వున్న తపన్ దాస్ (అక్షయ్ కుమార్), టీం కెప్టెన్ గా ఇంతియాజ్ అలీ షా పాత్రని ఎంపిక చేస్తాడు. టీములో ఇంకొందరు ముస్లిములుంటారు. మత హింస జరిగినప్పుడు అమృత్ సర్ లో వున్న ఇంతియాజ్ ని చంపడానికి వెంట బడతారు. తపన్, మరో ఇద్దరు టీం మెంబర్లు కాపాడతారు. అప్పుడు ఇంతియాజ్ - నా లాహోర్ ఇప్పుడు ఈ దేశంలో లేదు, నేనిక్కడి వాసిని కాను - అంటాడు. అతణ్ణి బాధాకరంగా లాహోర్ రైలెక్కిస్తారు. అతను పాక్ కి నాయకత్వం వహిస్తూ లండన్ ఒలింపిక్స్ కొస్తాడు. ఇక్కడ – విద్యాబాలన్ నటించిన ‘బేగం జాన్’ (2017) ఛాయలు కన్పిస్తాయి. ఈ కల్పిత కథలో దేశ విభజన రేఖ గీసే ఇద్దరు స్నేహితులైన హిందూ ముస్లిం రెవిన్యూ అధికారులు, విభజన రేఖ కిరువైపులా చేరిపోయిన తమ స్వస్థలాల ఖర్మాన స్నేహితులుగా తామూ విడిపోవాల్సి వస్తుంది. 

          రెండో పాత్ర పంజాబుకి చెందిన హిమ్మత్ సింగ్. దీనికి ఆధారం ఇప్పటికీ జీవించి వున్న హాకీ లెజెండ్ బల్బీర్  సింగ్. ఈయన ఒకటి కాదు,  మూడు సార్లు ఒలింపిక్స్  గోల్డ్ మెడల్ ఛాంపియన్ గా వినుతి కెక్కారు. అయితే వాస్తవంగా లండన్ ఒలింపిక్స్ లో బల్బీర్ సింగ్ రెండు కీలక గోల్స్ కొట్టి 4-0 స్కోరుతో బ్రిటన్ ని ఓడించారు. కథలో హిమ్మత్ సింగ్ రెండు కీలక గోల్స్ కొట్టి, 3 - 1 స్కోరుగా చూపించారు. టీం మెంబర్ తో హిమ్మత్ తాగి ఘర్షణ పడ్డం, బహిష్కరణకి గురికావడం, అప్పుడు ఇండియా ఒకే గోల్ కొట్టి ఓడిపోయే ప్రమాదంలో పడినప్పుడు, అతనే గత్యంతరమై పిలిస్తే వచ్చి రెండు గోల్స్ కొట్టి టీముకి గోల్డ్ మెడల్ సాధించి పెట్టడం ఈ డ్రామా అంతా కల్పితం. ఈ డ్రామా కోసం, అతడి (బల్బీర్?) హీరోయిజం కోసం, టీము మొదట ఒకే గోల్ కొట్టి చేతులెత్తేసినట్టు చూపించారు.

1948  ‘గోల్డ్’ హీరోలు 
      నిజానికి దేశం ముక్కలైనప్పుడు ఇండో – పాక్ జాయింట్ టీముగా లండన్ ఒలింపిక్స్ కి పంపాలన్న ఆలోచన వచ్చింది. దేశవిభజనతో చాలా మంది ముస్లిం ప్లేయర్స్ ని ఇండియన్ టీము కోల్పోయింది. అయితే తర్వాత ఈ ఆలోచన విరమించుకున్నారు. కథలో మాత్రం తపన్ దాస్ టీములో కెప్టెన్ ఇంతియాజ్ సహా మరికొన్ని ముస్లిం పాత్రలుంటాయి. దేశవిభజన తర్వాత కొత్త టీములో వీళ్ళెవరూ వుండరు. అయితే వాస్తవంలో  గోల్డ్ మెడల్ కొట్టిన టీములో ఎనిమింది మంది క్రిస్టియన్లు, ఇద్దరు ముస్లిములు వున్నారు. కథలో వీళ్ళు కన్పించరు. క్రిస్టియన్లు ఆస్ట్రేలియా వెళ్లిపోయినట్టు, ముస్లిములు పాకిస్తాన్ వెళ్ళిపోయినట్టు  విచిత్రంగా చెప్తారు! 

          పైన చెప్పుకున్న అప్పుడప్పుడే స్వాతంత్ర్యం లభించిన నేపధ్యంలో ఇండో – పాక్ సమిష్టి టీముని లండన్ ఒలింపిక్స్ కి పంపాలని యదార్ధంగా చేసిన ఆలోచనలాంటిది, ఏకంగా కార్యరూపంలో పూర్తి స్థాయిలో, బంపర్ గా సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జిందాహై’ (2017) లో దర్శనమిస్తుంది. కాకపోతే క్రీడల ఖాతాలో కాకుండా  యుద్ధ ఖాతాలో వేశారు. ఇందులో, సిరియాలో ఐసిస్ పనిబట్టడానికి ఇండియన్ ‘రా’ ఏజెంట్ టీము వెళ్తే, ఇదే పని మీద పాక్ ఐఎస్ఐ టీం కూడా వస్తుంది. కాసేపు ఆధిపత్యపు పోరులాడుకుని, రాజీపడి, కలిసి ఐసిస్ ని ఖతం చేస్తారు. అప్పుడు ఒకే వాహనానికి తమ రెండు దేశాల జెండాలు రెపరెప లాడించుకుంటూ బయల్దేరతారు. నవ్వొచ్చే వ్యవహారం.

          ఇక తపన్ దాస్ పాత్ర. వాస్తవంలో ఏసీ ఛటర్జీ అనే అతను టీం మేనేజర్ గా వున్నాడు. ఆయనకి తపన్ దాస్ పాత్ర కథంతా లేదు. 1936 లో జర్మనీ గోల్డ్ గెలవడం దగ్గర్నుంచీ,1948 లో లండన్ గోల్డ్ వరకూ తపన్ దాస్ స్ట్రగుల్ అంతా సినిమా కష్టాలే. 

      కథకి అపూర్వ దేశభక్తిని జోడించారు. తెలుగు సినిమాల్లో పిచ్చి పిచ్చి కథలకి దేశభక్తిని జోడించినట్టుగాక, నమ్మదగ్గ దేశభక్తిని ఎంతో ఫీలయ్యేలా కల్పించారు. ఆనాటి దేశభక్తికి ఆలంబన స్వరాజ్య కాంక్ష. దేశభక్తి గురించి మాట్లాడే, నినదించే అర్హత, ఆనాడు బ్రిటిష్ పాలనలో మగ్గిన, లాఠీ దెబ్బలుతిన్న ప్రజా సమూహాలకే వుంటుందేమో. ఆ వేడిలో ఈ కథ నడవబట్టి దేశభక్తి అంత మౌలికంగా హైలైట్ అయింది. 

          ఇందులో జావేద్ అఖ్తర్ రాసిన అనేక బలమైన డైలాగుల్లో ఒక  డైలాగు- ‘మీరు మీమీ రాష్ట్ర్రాల్ని చూసుకోండి, నగరాల్ని చూసుకోండి,  వీధుల్ని చూసుకోండి, మీమీ అహంకారాలనీ, ఇగోల్నీ చూసుకోండి... నేను ఇండియాని చూస్తా!’ అని. స్వాతంత్ర్యం తర్వాత కొత్త టీం మెంబర్లు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలుగా, భాషలుగా విడిపోయి గ్రూపులు కట్టి కొట్టుకుంటే, అక్షయ్ కుమార్ కొట్టే పవర్ఫుల్ దేశభక్తి డైలాగు. 

           కేవలం ‘1948 ఒలింపిక్స్ గోల్డ్’ అనే యదార్థ పాయింటుని తీసుకుని, దాని చుట్టూ సినిమా కథ అల్లేసి, శక్తివంతంగా ప్రేక్షకుల ముందుంచారు.

ఎవరెలా చేశారు
     అక్షయ్ కుమార్ ది బెంగాలీ బాబు పాత్ర. దోవతీ కట్టుకునే వుంటాడు. విచారం కలిగితే తాగేస్తాడు. హుషారొస్తే తాగి చిందులేస్తాడు. రెండు సార్లు ఆఫీసర్ల మధ్య తాగి అల్లరల్లరి పాటలు పాడతాడు. ఇది కలెక్షన్లు రాబట్టాల్సిన సినిమా అని దర్శకురాలికి తెల్సు. నిజజీవితంలో ఒక ధ్యేయం కోసం పోరాడిన వ్యక్తుల్ని పాత్రలుగా చేసి సినిమాలు తీస్తే అవి  త్రెడ్ తెగకుండా పవర్ఫుల్ గా ధ్యేయం కోసం ముందుకు దూసుకెళ్తూ వుంటాయి. అదే ఇతర సినిమాల్లో హీరోగారి గోల్ ఏమవుతుందో ఏమో, పాసివ్ పరమానందయ్యలాగా మారిపోయి హీరోనే అన్పించుకోడు. 

          అక్షయ్ కుమార్ ప్రారంభంలో జర్మనీలో గోల్డ్ గెలిచి పొందిన పరాభవంతో, ఇక ఫ్రీ ఇండియాగా గోల్డ్ కొట్టాలన్న బలమైన గోల్ ఏర్పర్చుకుంది లగాయతూ అదే సంకల్ప బలంతో ఎడతెగని యాక్షన్ లో వుంటాడు. రెండు గంటల 50 నిమిషాల నిడివిగల సినిమాలో, చివరి అరగంట తప్ప, మిగతా స్క్రీన్ టైమంతా తన టీం ఏర్పాటు కోసం తన స్ట్రగుల్ గురించే నడిచే సుదీర్ఘ కథలో, ఎక్కడా బలహీనపడనీయకుండా భగభగ మండిస్తూంటాడు పాత్రని. చివరి అరగంటకి గానీ అసలు షో – లండన్ లో ఒలింపిక్ హోరాహోరీ ప్రారంభం కాదు. అప్పుడుండే నటన పరాకాష్ట. 

        ఇంటర్వెల్ కొచ్చేసరికి ఫస్టాఫ్ లో అప్పటివరకూ టీంని పోగేసి ట్రైనింగ్ కూడా ఇప్పించాక, దేశ విభజనతో ఆ చేసుకుంటూ వచ్చిన ఏర్పాట్లన్నీ వృధా అయిపోతాయి. అప్పుడు అక్షయ్ పరిస్థితి ఘోరంగా వుంటుంది. ఈ సీనుని కూడా అపూర్వంగా నిలబెట్టాడు.  తనకి రోమాంటిక్ యాంగిల్ లేకపోలేదు. అయినా ఇది పాత్ర మౌలిక ప్రయాణానికి అడ్డుపడదు. చిర్రుబుర్రులాడే బెంగాలీ భార్య మనోబినా (మౌనీరాయ్) తో చాలా తంటాలు పడుతూ కామెడీలు చేస్తాడు. పిడికిట్లో ఇమిడేంత సన్నగా వుండే హీరోయిన్ మౌనీరాయ్ ఎక్కడా నవ్వదు.

          హాకీ ప్లేయర్స్ ముఖ్య పాత్రల్లో సామ్రాట్ గా కునాల్ కపూర్, రఘువీర్ ప్రతాప్ సింగ్ గా అమిత్ సాద్, ఇంతియాజ్ అలీ షాగా వినీత్ కుమార్ సింగ్, హిమ్మత్ సింగ్ గా సన్నీ కుశాల్ కనిపిస్తారు. సీనియర్ నటుడు దలీప్ తహిల్ హాకీ ఫెడెరేషన్ బాస్ గా కనిపిస్తాడు. 

          ఈ పీరియడ్ మూవీకి ఆనాటి నేపధ్య వాతావరణ కల్పన, స్టేడియాలు సహా రకరకాల ఇతర కట్టడాలు వగైరాల్ని పకడ్బందీగా ఆ కాలాన్ని తలపించేట్టు పునఃసృష్టి చేశారు. లండన్ స్టేడియంలో హోరాహోరీ ఆట- మధ్యలో వర్షం మొదలై ఆ సస్పన్స్ డ్రామా – థ్రిల్లింగ్ గా చిత్రీకరించారు. టీంకి ‘తురప్ ఇక్కా’ (తురుపు ముక్క) అయిన హిమ్మత్ సింగ్ రెండో గోల్ కొట్టే షాట్స్ ని స్లోమోషన్ లో తీయడం డ్రామాని పతాక స్థాయికి చేర్చింది. 

     ‘దంగల్’ అయినా మరొకటైనా బాలీవుడ్ సీరియస్ సినిమాల్లో హాస్యం వొలికే డైలాగులు తప్పకుండా  వుండేట్టు చూసుకుంటున్నారు. పదేళ్ళ తర్వాత ఇప్పుడు డైలాగులు రాసిన జావేద్ అఖ్తర్, హాస్యంతో బాటు మిగతా భావోద్వేగాల డైలాగుల సంగతి చూసుకున్నారు (హమారా సర్ పర్ బ్రిటిష్ ఫ్లాగ్ ఫడ్ ఫడాకే హమ్ సబ్ కో మానో యహీ బోల్ రహా థా – యూ ఆర్ నాట్ ఫ్రీ!)

          క్రీడని, దేశభక్తిని దర్శకురాలి దృక్కోణంలో చూడ్డమే ఒక కొత్త అనుభవం – అందునా పీరియడ్ మూవీగా. ఇండియాని చూడాలంటే మల్టీ ప్లెక్సులకి వెళ్తే కాదు, హైదరాబాద్ అబిడ్స్ లో రామకృష్ణ సింగిల్ స్క్రీన్ థియేటర్లకి వెళ్ళాలి. అన్ని జాతులు ఇక్కడ చేరతాయి, బాల్కనీ నుంచీ బెంచి దాకా. అందరి ప్రతిస్పందనలు ఒకేసారి తెలుస్తాయి. క్రిక్కిరిసి కూర్చుని ఊపిరి బిగబట్టుకుని ఆటంతా చూశాక, ముగింపులో లేచి నిలబడి జై భారత్ నినాదాలు చేసి వెళ్లారు. ఇదీ నిజమైన ఇండియా అంటే!

సికిందర్

10, ఆగస్టు 2018, శుక్రవారం

671 : స్క్రీన్ ప్లే సంగతులు




       నిర్మాతలు పెట్టుబడి కథ మీద పెట్టాలా, పాయింటు మీద పెట్టాలా? హాలీవుడ్ లో సెన్సేషనల్ పాయింటు మీదే పెడతారు, కథ మీద కాదు. మార్కెట్ లో అమ్ముడుబోయే పాయింటునే కొంటారు, దాన్నే ప్రేక్షకులకి అట్టహాసంగా అలంకరించి అమ్ముతారు. ముందు కాన్ఫ్లిక్ట్ (పాయింట్) ఏమిటాని అడుగుతారు, అందులో కలెక్షన్స్ కన్పిస్తూంటే అప్పుడు కథేమిటో చూస్తారు. ‘హీరోకి కోటి రూపాయల లాటరీ తగిల్తే టికెట్ చించి పారేశాడు సర్!’  అని రచయిత క్రేజీగా పాయింటు చెప్పాడనుకుందాం, ‘కోటి రూపాయలు తగిల్తే చించి పారేశాడా? భలే వుందే, స్క్రిప్టు పంపు!’ అంటాడు ఎగ్జిక్యూటివ్ వెంటనే. ‘లవర్స్ చిన్నమాట తేడా వచ్చి విడిపోయారు సర్’ అని రచయిత టాలీవుడ్ తమాషా చెప్పాడనుకుందాం, ‘బొంద కాదూ, అందులో డాలర్స్ ఎక్కడ కనబడి చస్తున్నాయ్?’ అని సినిమా ఫీల్డుకి కొత్త పిచ్చోడిలా వున్నాడని, అసమర్ధుడని విరక్తిగా చూస్తాడు ఎగ్జిక్యూటివ్. అక్కడ కథంటే బిజినెస్సే. బిజినెస్ ఆలోచించే వాడే ప్రొఫెషనల్ రచయితా, దర్శకుడూ. ఏవో కవిత్వాలూ క్రియేటివిటీలూ తర్వాత. ముందు బిజినెస్ ఆలోచిస్తారు. రచయితలు ఏ కాన్ఫ్లిక్ట్ కి బిజినెస్ వుంటుందా ఆలోచిస్తూనే, పరిశోధిస్తూనే నెలలు గడిపేస్తారు. రచయితలూ పాయింటుని అమ్ముతారు, నిర్మాతలూ పాయింటునే కొంటారు. పాయింటుకుండే ప్రాముఖ్యం అంతటిది. దీన్నే ప్లాట్ పాయింట్ ఏమిటి, లేదా వాట్ ఇఫ్ (ఇలా జరిగితే?) ఫ్యాక్టర్ ఏమిటని కూడా టెక్నికల్ గా అడుగుతారు. రచయితల తరపున ఏజెంట్లు పిచింగ్ చేసినా పాయింటునే మార్కెటింగ్ చేస్తారు. అంతేగానీ ఈ రచయిత దగ్గర మంచి కథ వుందని ఎక్కడా సిల్లీగా చెప్పరు. అలా చెప్తే ప్రొఫెషన్ తెలియని వ్యక్తి అయిపోతారు. కథెవరిక్కావాలి? కథలూ, స్క్రీన్ ప్లేలూ, మాటలూ మురిపాలూ తర్వాత. ముందు కథకి పాయింటు విలువ తెలియని వాడు, హాలీవుడ్ బిజినెస్ మోడల్ తెలియని వాడు, ఏం రాసినా ర్యాగ్ పికర్ కూడా అవతల పారేస్తాడు.

        ‘శ్రీనివాస కళ్యాణం’ తో ఇదే జరిగింది. అనేక సినిమాల్లో జరుగుతోంది. పాయింటుని అమ్మాలనుకోకపోవడం. పాయింటు విలువని గుర్తించాలనుకోక పోవడం. కథ సంగతి తర్వాత, ముందుగా ఒక ఆకర్షణీయమైన, అర్ధవంతమైన, బలమైన పాయింటని ప్రేక్షకుల ముందు, వంద రూపాయల టికెట్టుకి సరిపడా అమ్మకానికి పెట్టాలనుకోకపోవడం. పాయింటు అంటే ఐడియానే. ఏ ఐడియా కమర్షియల్ గా భిన్నంగా వుంటుందాని ఆలోచించకపోవడం. ఐడియా దగ్గర్నుంచీ రాయలేక పోవడం. మూడంకాలతో పటిష్టంగా ఐడియాని నిర్మించుకోవాలనుకోక  పోవడం. మధించాలనుకోక పోవడం. ఎంత కాలమైనా సరే, స్ట్రక్చర్ లో ఐడియా కుదిరే వరకూ ఐడియా మీదే పని చేయాలనుకోక పోవడం. ఐడియా రీసెర్చిని కోరితే, ఆ రీసెర్చి క్షుణ్ణంగా చేయాలనుకోక పోవడం. కొత్త ఐడియా అని చెప్పి ప్రేక్షకులకి తప్పుడు సమాచారమివ్వకూడదనుకోక పోవడం. లోపభూయిష్ట ఐడియాకి స్క్రిప్టు రాసేసి, నిర్మాతల చేత పెట్టుబడులు పెట్టించకూడదనుకోక పోవడం.

     కథకి పాయింటు, కాన్ఫ్లిక్ట్, వాటిఫ్ ఫ్యాక్టర్, సమస్యా ఇవన్నీ ఒకటే. ఐడియాకి పర్యాయ పదాలే. ఇది ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పాటవుతుంది. అక్కడే కథని పుట్టించి, మొదటి మూల స్థంభాన్ని నిర్మిస్తుంది. రెండో మూల స్థంభం ప్లాట్ పాయిట్ టూ దగ్గర సమస్యకి పరిష్కార మార్గంగా ఏర్పాటవుతుంది. స్క్రీన్ ప్లే అనే చలనచిత్ర సౌధం ఈ రెండు మూల స్థంభాల మీదే నిలబడుతుంది. మొదటి మూల స్థంభం బలంగా లేకపోతే, రెండో మూల స్థంభం కూడా బలంగా వుండదు. అంటే క్లయిమాక్స్ హాస్యాస్పదంగా మారుతుంది. మొత్తం స్క్రీన్ ప్లే సౌధం కుప్పకూలుతుంది. 

          మొదటి మూల స్థంభం మొత్తం కథకి డీఎన్ఏ లాంటి ఐడియాని సరఫరా చేసే ప్రధాన కేంద్రం. ఇది అయోమయంగా, లోపాలమయంగా పుచ్చిపోయి వుంటే,  మిగతా వ్యవహారమంతా కూడా పుచ్చి పోతుంది. ఇందులో ఎలాంటి సందేహలవసరం లేదు. ఎంత సూపర్ స్టార్ అయినా ఏమీ చేయలేడు. ‘బ్రహ్మోత్సవం’ లో చూశాం, ఇప్పుడు ‘శ్రీనివాస కళ్యాణం’ లో చూస్తున్నాం. ఈ రెండిటి ఇంకో సమస్య ఏమిటంటే, వీటి పాయింటుల్లో అసలు యూత్ అప్పీల్ అనేదే లేకపోవడం. మార్కెట్ యాస్పెక్ట్ నే ఆలోచించకపోవడం. మొదటిది ఏదో ఏడుతరాల బంధువుల్ని వెతికే పాయింటైతే, రెండోది పెళ్లి సాంప్రదాయాలు నేర్పే పాయింటు. రెండూ యూత్ కే మాత్రం పట్టని, వాళ్ళు ఏ కోశానా కోరుకోని, వెనకటి తరం ప్రేక్షకులతో అరిగిపోయిన, ఇప్పుడు బిజినెస్ ని హుళక్కి చేసే పాయింట్లు. యూత్ అప్పీల్ లేని వయసు ముదిరిన పాయింట్లు. యూత్ కి నునులేత, కోడె గిత్తలా దూకే పాయింట్లు కావాలి. 

          ఓ పెద్ద మనిషికి ఓ కుర్రోడు పెళ్లి సాంప్రదాయాలు నేర్పడం కోడెగిత్తలా దూకే పాయింటవుతుందా? అసలిప్పుడు ఇంకా పెళ్లి సాంప్రదాయాల పాయింటుకి మార్కెట్ విలువుందా? అలాటి పెళ్లి సాంప్రదాయాల పాయింటే చెప్పాలనుకుంటే, ప్రయోగాలకి సిద్ధపడాలి. ఒక క్రేజీ ప్రాజెక్టుకి నడుం కట్టాలి. ప్రయోగాల్ని ప్రేక్షుకుల మీద రుద్దవచ్చు, కాలం చెల్లిన పాయింట్లని కాదు. కథా కాలాన్ని ఓ నలభై- యాభై ఏళ్ల వెనుక  ఏర్పాటు చేసి, అప్పట్లో పెళ్ళిళ్ళు ఎలా జరిగేవో, అప్పటి అన్ని సాంప్రదాయాలూ ఆచారాలూ సహా, అప్పటి మనుషుల ఆనందాలు సహా, ఉమ్మడి కుటుంబాలు సహా, కడు మధురంగా ఈతరం ప్రేక్షకులకి - క్రేజీ ప్రాజెక్టుగా సినిమా తీసి పరిచయం చేయవచ్చు. వీలయితే ‘సీతారాముల కళ్యాణము చూతము రారండి’ పాట కూడా అప్పట్లో పెళ్ళిళ్ళలో ఎలా మార్మోగేదో ఈతరం ప్రేక్షకులకి చూపించవచ్చు. గొప్ప నాస్టాల్జియాతో పీరియడ్ ఫిలింని (ఫిలిం లేదిప్పుడు) సృష్టించవచ్చు. అలాటి గొప్ప గొప్ప పెళ్ళిళ్ళ  వైభవాల్ని ఇప్పుడెలా కోల్పోయామో, తులనాత్మకంగా చూపిస్తూ చెబితే, యువతరం ఆలోచనలో పడవచ్చు. అప్పుడది యూత్ అప్పీలున్న, మార్కెటబిలిటీ వున్న పాయింటు అయ్యే అవకాశముంటుంది.

***
      అంతేగానీ, ఈ కాలపు పాత్రలతో, గ్లోబలైజ్డ్ అయిన యువ పాత్రలతో, ఈ కాలపు కథ చూపిస్తూ, ఒకప్పటి కాలపు గొప్పలు జొప్పిస్తే జీర్ణమై చావదు. ఏంట్రా ఈ సుత్తి అని విసుక్కుంటారు. ‘శంకరా భరణం’ శంకర శాస్త్రి పాప్ సంగీతాన్ని ద్వేషించలేదు. శాస్త్రీయ సంగీతం తెలిసిన తను పాప్ సంగీతం తనకి కరతలామలకమని, మంచినీళ్ళ ప్రాయమనీ అదే పాప్ గీతమందుకుని, గేలి చేసిన కుర్రాళ్ళ నోళ్ళు మూయిస్తాడు. ఇది నాలెడ్జి వినిమయం. శంకరశాస్త్రి తన నాలెడ్జితో తన కాలంలోనే బెల్లం కొట్టిన రాయిలా వుండిపోలేదు. కొత్త తరంతో పాత సాంప్రదాయాల వాదనలు పెట్టుకోలేదు. పాత నాలెడ్జిని కొత్త నాలెడ్జిలోకి  ప్రవహింపజేస్తూ (వినిమయం), దారీతెన్నూలేని కొత్త నాలెడ్జిని అర్ధవంతంగా మార్చాడు. కానీ ‘శ్రీనివాస కళ్యాణం’ లో నానమ్మ జయసుధ తన కాలంలో తానుండి పోయి, తన కాలపు సంస్కృతీ సంప్రదాయాల్ని ఈ కాలం మీద రుద్దాలన్నదుగ్ధతో – నాలెడ్జి వినిమయానికి దూరంగా వుండిపోయింది. డెబ్బై ఏళ్ల జీవితాన్ని చూస్తున్నానంటుంది. కానీ తన నాలెడ్జితో తనకి వూహ తెలిసిననాటి జీవితం దగ్గరే ఆగిపోయానని తెలుసుకోవడం లేదు. డెబ్బై ఏళ్ల జీవితంలో మారుతున్న అన్ని కాలాల ప్రవాహాలూ లేవా? శంకరశాస్త్రి సంధి కాలంలో ఇరుక్కోలేదు. జయసుధ గారు ఇరుక్కుపోయారు. కాలానికి హద్దుల్లేవు. ఆలోచనలకి హద్దు లేర్పరచుకుని, కాలంలో ఎక్కడో ఘనీభవించుకు పోతారు. వర్తమాన కాలాన్ని నిరసిస్తూ, వర్తమాన కాలపు కొత్త సౌఖ్యాలని అనుభవిస్తారు. 

          ఓ అపరాత్రి ఏమున్నాయా అని యూట్యూబ్ సర్ఫింగ్ చేస్తూంటే, బాలీవుడ్ గీత రచయిత జావేద్ అఖ్తర్ ప్రసంగం కన్పించింది. ఆయన పాతనీ కొత్తనీ మేళవించి చెప్తూంటే ఒకటే చప్పట్లు కొడుతున్నారు సభలో వున్న యువ ప్రేక్షకులు. ఇవాళ్టి పాట ఏమైంది, అవాళ్టి పాట ఇంకా ఎలా బతుకుతోందీ వివరిస్తూంటే, జోకులేస్తూంటే, ఘోల్లున నవ్వూలూ చప్పట్లూ. ఛానెల్స్ లో ఇండియన్ ఐడల్ లాంటి కార్యక్రమాల్లో పాడే కుర్రకారు ఎందుకు లతా, ఆశా, రఫీ, కిషోర్, ముఖేష్, మన్నాడే పాటలే పాడుతున్నారు- ఆ తర్వాతి తరం కొత్త పాటలెందుకు పాడ్డం లేదన్న ప్రశ్నకీ విశేష స్పందన. కాబట్టి కుర్రకారు పాతని  వదిలేసుకోరు. వాళ్ళకి తగిన వేదిక, అవకాశం లభిస్తే పాతనే  బైటికి తీస్తారని, దాన్ని బతికిస్తారనీ హామీ ఇచ్చారు. 

    అంతేగానీ పెద్దతరం పెత్తనం చేసి, కొత్తతరం పతనమై పోతున్నారని, పాతదాన్ని పాతరేస్తున్నారని, చించి పోగులెడుతున్నారనీ, వాళ్ళ నెత్తిన పాత అభిరుచులు రుద్దితే, తలంటు పోస్తే, వికర్షిస్తుంది కొత్త తరం. కొత్త తరానికి పాత దానితో సంబంధం వాళ్ళు నమ్మే దేవుడితో వుండే ఆత్మిక సంబంధం లాంటిది. అదెప్పుడు ఫీలవ్వాలి, ఎలా ఫీలవ్వాలి వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా నిలువునా ఆత్మ నిబిడీకృతమైన అందరిలాంటి మనుషులే, మర మనుషులు కాదు. సినిమానీ, సంగీతాన్నీ, రచననీ కనుక్కున్నది కొత్తోళ్ళు కాదు, పాతోళ్ళే. ఆ మౌలిక విలువలు తరం నుంచి తరానికి వాటికవే ప్రవహిస్తాయి. ప్రతీదీ విద్యుత్ వలయంలా సర్క్యులేట్ అయ్యేదే. వలయంలోనే ప్రకృతి తిరుగుతుంది.

***
          ఇలా ‘శ్రీనివాస కళ్యాణం’ కథలో పాత్రల మధ్య పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన సమస్యలో (పాయింటులో) ఇవన్నీ ఉపరితల సమస్యలు. ఇక సమస్యలోకి తొంగి చూస్తే చెప్పనవసరం లేదు. ఓ పల్లెటూళ్ళో సాంప్రదాయ ఉమ్మడి కుటుంబానికి చెందిన నితిన్, నగరంలో బిగ్ షాట్  ప్రకాష్ రాజ్ కూతురు రాశీ ఖన్నాని ప్రేమించి పెళ్లి ప్రతిపాదన చేస్తాడు. ప్రకాష్ రాజ్ కూతురి మాటలకి విలువిచ్చి ఒప్పుకుంటాడు. కానీ నితిన్ తో అహం అడ్డొచ్చి ఒక కండిషన్ పెడతాడు. తన పెద్దకూతురి విడాకుల కేసు తెగడం లేదు కాబట్టి, రేపొకవేళ నితిన్ తో కూడా ఇలా జరక్కుండా వుండేందుకు, వెంటనే విడాకులై పోయేందుకు, ప్రీ మారిటల్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమంటాడు. ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అమెరికాలో వుందనీ, ఈమధ్యే ఇండియా కొచ్చిందనీ అంటాడు. 

       ఇదెలా వుంటుందంటే, ఇదేదో వెర్రితలలేసిన విదేశీ విపరీత పోకడ అన్నట్టుగా నెగెటివ్ అర్ధంలో – ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అని పెద్ద పెద్ద అక్షరాలేసి, క్లోజప్ లో కంగారు పెట్టించే ప్రయత్నం చేస్తారు. ఇదే బ్రహ్మాండమైన ప్లాట్ పాయింట్ వన్ మలుపన్నట్టుగా చిత్రిస్తారు. ఈ పాయింటునే ప్రేక్షకులకి అమ్మకానికి పెట్టినట్టుగా బిల్డప్ ఇస్తారు. కథంటే ఆర్గ్యుమెంట్ కాబట్టి, ఈ పాయింటుతో పాత్రల మధ్య ఆర్గ్యుమెంట్ ని రగిలించి, వాళ్ళ తప్పొప్పుల నిగ్గు తేల్చబోతున్నట్టుగా ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తున్నట్టు - ప్రేక్షకులతో కనెక్ట్ అవబోతారు.  

          కానీ ఇలా ప్లాట్ పాయింట్ వన్ లో ఇన్ని లాభాలు చేకూరుస్తుందని సృష్టించిన సమస్యలోకి ఒకసారి తొంగి చూస్తే, అంతా డొల్ల అని తెలిసిపోతుంది.

          పెళ్ళికి ముందే విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టమనడం. ఇదీ పాయింటు. ఈ సమాచారం ఎక్కడ దొరికిందో గానీ, ఈ సీనులో చెప్పినట్టుగా అమెరికాలో ఇలాటిదేమీ లేదు. ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అంటే విడాకుల పత్రాల మీద సంతకాలనే విధానం అక్కడ లేదు. ఒకవేళ విడిపోవాలనుకుంటే ఆస్తి పంపకాలేమిటి, పిల్లల పెంపకాలేమిటి మొదలైన వాటి గురించే ప్రీ మారిటల్ అగ్రిమెంట్ వుంటుంది. ఇది వధూవరులిద్దరి సమక్షంలో జరుగుతుంది. ఒకరి పరోక్షంలో థర్డ్ పార్టీ అగ్రిమెంట్ చెల్లదు. ఇదసలు ముందస్తు విడాకుల ఒప్పందం కూడా కాదు. 

          ఇక ప్రీ మారిటల్ అగ్రిమెంట్ ఈ మధ్యే అమెరికాలో చూసి ఇండియాకి వచ్చిందంటాడు ప్రకాష్ రాజ్. కానీ ఇది ఇండియాలో ఎప్పట్నించో వుంది. కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు. బోలెడు పాత కేసులు కనబడతాయి. కాబట్టి ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అర్థాన్నే మార్చేసి, ముందస్తు విడాకుల పత్రమనడం సరికాదు. అలాటి ఒప్పందాన్ని నితిన్ కూడా అంగీకరించ కూడదు. అతను సంస్కృతీ సాంప్రదాయాలకి కాణాచి అయిన నానమ్మ ప్రతినిధి.  పెళ్లిని పవిత్ర కార్యంలా భావిస్తాడు. అందులో ఇలాటి అపశకునానికి చోటివ్వకూడదు. తిప్పి కొట్టాలి. అప్పుడే పాత్ర తత్త్వమన్పించు కుంటుంది. 

          కానీ సంతకం పెట్టడానికి సిద్ధపడుతూ, తనొక కండిషన్ కూడా పెడతానంటాడు. పెళ్ళిలో ఒక తండ్రిగా సాంప్రదాయాలనుసారం ప్రకాష్ రాజ్ నడుచుకోవాలంటాడు. పెళ్లి తన వూళ్ళో ఒక ఉత్సవంలా  కొన్ని రోజుల పాటు జరుగుతుందనీ, అన్ని రోజులూ ప్రకాష్ రాజ్ అక్కడుండాలనీ అంటాడు. ప్రకాష్ రాజ్ కి అసలు సాంప్రదాయాలూ, పూజా పురస్కారాలూ, ముహూర్తాలూ అంటే వొళ్ళు మంట. టైంవేస్ట్ అనుకుంటాడు. టైంని డబ్బుతో కొలిచే మహా బిజినెస్ మాగ్నెట్. అలాటిది అతను కూడా నితిన్ కండిషన్ కి ఒప్పుకుంటాడు. 

     ఇక నితిన్ ఆ ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అనే విడాకుల కాగితాల మీద సంతకం పెట్టేస్తాడు. అన్నేసి పేజీల్లో ప్రకాష్ రాజ్ ఏమేం ఘోరాలు రాశాడో చదవకుండానే. నితిన్ తన ప్రవచిత పవిత్ర పెళ్లి క్రతువుని మర్చిపోయాడే అనుకుందాం, ఒక చదువుకున్న యూత్ ఫుల్ క్యారెక్టర్ గానైనా, కథకి హీరోగా,  అంత అమాయకంగా విడాకుల కాగితాల మీద సంతకమెలా పెడతాడు? ప్రకాష్ రాజ్ చేతిలో బలిమేక ఐపోడా? ఎప్పుడంటే అప్పుడు ప్రకాష్ రాజ్ బ్లాక్ మెయిల్ చేయడా? బ్రతుకు నరకం చేస్తూ కక్ష తీర్చుకోడా? 

          రెండోది, ఈ అగ్రిమెంట్ సంగతి కూతురికి తెలుసా అనికూడా అడగడు నితిన్. ఆమె సమక్షంలోనే సంతకం పెడతానని కూడా అనడు. ఎందుకని? ఆమెకి తెలియకుండా ఆమె కోసం ఏమైనా త్యాగాలు చేస్తున్నాడా? అలాంటిదేమీ లేదు. ఆమెని పెళ్ళాడి తీరాలన్న యావ కొద్దీ అన్నట్టే సంతకం పెట్టేస్తాడు. 

          ఇదలా వుంచితే, అసలు ప్రకాష్ రాజ్ కి నితిన్ కండిషన్ పెట్టడ మేమిటి...తన స్థాయికాని ఓ పల్లెటూరి మధ్య తరగతి ఉమ్మడి కుటుంబానికి చెందిన నితిన్ ని మాటమాత్రం అనకుండా, అంతేసి బిగ్ షాట్ అయిన ప్రకాష్ రాజ్, కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నాడంటేనే అతడి ఉన్నతాదర్శం బయట పడుతోంది. అతను ఇక్కడే చాలా కాంప్రమైజ్ అయ్యాడు. కూతురికి ఎలాటి ఉన్నత సంబంధం గురించి కలలు గన్నాడో. కామన్ గై నితిన్ కిచ్చి చేయడానికి సిద్ధపడ్డాడు. చాలా త్యాగం చేశాడు. వీటి ముందు నితిన్ సాంప్రదాయాలెంత! వాటికి  తలొగ్గాలని డిమాండ్ చేయడమేం గొప్ప? 

          ప్రకాష్ రాజ్ సంస్కారం ముందు నితిన్ ఇంటిల్లి పాదీ ప్రాకులాడే సాంప్రదాయాలు వెలవెలబోవా? ఆ మనోభావాలన్నీ క్యాన్సిల్ అయిపోవా? అంటే ఈ కథే వుండకుండా పోదా? మారు మాట్లాడకుండా ప్రకాష్ రాజ్ ఇష్టప్రకారమే పెళ్లి జరిపించుకుని వెళ్లిపోవాలి నిజానికి. ఇంకోటే మిటంటే, పెళ్లి తమ వూళ్లోనే తమ ఇంట్లోనే జరగాలంటాడు నితిన్. మగపెళ్లి వారింట పెళ్లి జరగడం ఏ సాంప్రదాయమో?

     వీళ్ళతో ఎందుకు గోల అనుకున్నాడో ఏమో ప్రకాష్ రాజ్, దానికి కూడా ఒప్పుకుని వాళ్ళింట్లోనే పెళ్లి తంతు వాళ్ళకే వదిలేసి,  ప్రేక్షకుడిలా కూర్చుంటాడు. ప్రకాష్ రాజ్ ఇంటి కొస్తే, బూట్లు తీసి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చేలా టార్చర్ పెడతారు. అప్పుడు కూడా సాంప్రదాయపు క్లాసు పీకుతారు. తర్వాత చూస్తే, తామే చెప్పులేసుకుని ఇంట్లో తిరుగుతూంటారు. ప్రకాష్ రాజ్ బంగాళా కెళ్తే, కాళ్ళు కడుక్కుని లోపలి కొస్తాం నీళ్ళి మ్మంటారు. వొళ్ళు మండి పోతూంటుంది ప్రకాష్ రాజ్ కి. 

          నిశ్చితార్ధమప్పుడు, కట్నం గిట్నం అంటూ నసుగుతారు. ప్రకాష్ రాజ్ ఓ లుక్కేసే సరికి సర్దుకుని, ఇద్దరమ్మాయిలుంటే ఒకమ్మాయి ఆస్తి మనోడిదే కదా అని జోకులేసు
కుంటారు.

***
      పాయింటు కొద్దాం. ప్రకాష్ రాజ్ కి ఇచ్చే విడాకుల పత్రాల మీద నితిన్ సంతకం పెట్టడం పాయింటు. ప్రకాష్ రాజ్ కి నితిన్ సాంప్రదాయాల కండిషన్ పెట్టడం కౌంటర్ పాయింట్. ఇది మొదటి మూలస్థంభం. ఇక్కడ కథా ప్రారంభం. మరి కథ ప్రారంభమవడానికి తగిన ఎలిమెంట్లు ఈ పాయింట్స్ లో వున్నాయా? ఇక్కడ పాయింటు భవిష్యత్తులో అమలయ్యే అవకాశమున్నది. అది ప్రకాష్ రాజ్ అస్త్రం. కౌంటర్ పాయింటు తక్షణం అమలయ్యేది. ఇది నితిన్ చేతిలో అస్త్రం. తక్షణం అమలయ్యే కౌంటర్ పాయింటుతోనే కథ నడవాలి, నడిచింది కూడా.

          అయితే మార్కెట్ యాస్పెక్ట్ లో – ఈ కౌంటర్ పాయింటు కి యూత్ అప్పీలుందా? మార్కెటబిలిటీ వుందా? దీంతో బిజినెస్ అవుతుందా? దీన్ని ప్రేక్షకులకి అమ్మగలరా? పై పేరాల్లో ముందే విశ్లేషించుకున్నట్టు - ఓ పెద్ద మనిషికి ఓ కుర్రోడు పెళ్లి సాంప్రదాయాలు నేర్పడం ఏ విధంగానూ సేఫ్ పాయింటే కాదు. ఎలా కాదో పై పేరాల్లోనే సవివరంగా చెప్పుకున్నాం. 

          ఇక క్రియేటివ్ యాస్పెక్ట్ లో చూస్తే – ఇక్కడ తటస్థించిన ప్లాట్ పాయింట్ వన్ లో, నితిన్ కౌంటర్ పాయింటు వేశాడంటే ఏమిటర్ధం? అతడికి గోల్ ఏర్పడిందని అర్ధం. తన పెళ్ళిలో ప్రకాష్ రాజ్ సాంప్రదాయబద్ధంగా నడుచునేట్టు చేసి, అతణ్ణి మార్చెయ్యడం గోల్. అప్పుడీ గోల్ సక్సెస్ అవాలంటే అందులో ఎలిమెంట్స్ ఏవేవి వుండాలి? ఈ బ్లాగులోనే అనేక సార్లు చెప్పుకున్నట్టు – 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్.

          కోరిక : గొంతెమ్మ కోరిక. న్యూసెన్స్ చేయకుండా కూతుర్నిస్తున్న ప్రకాష్ రాజ్ ఉన్నతాదర్శమే, నితిన్ ఇంకేమీ కోరకుండా చేస్తోంది. కాబట్టి ఇంకా కోరికకి స్థానం లేదు. మొదటి ఎలిమెంట్  ఆవిరై పోయింది. 

          పణం : ప్రకాష్ రాజ్ ని మార్చడానికి నితిన్ దేన్ని పణంగా పెడుతున్నాడు? జీవితాన్నా? తను నమ్మిన సాంప్రదాయాల కోసం దేన్ని పణంగా పెడుతున్నాడు? దేన్నీ  లేదు. మొదటి ఎలిమెంట్ కోరికే క్యాన్సిలై నప్పుడు, ఆ కోరికకు కారణమైన సంప్రదాయాల వాదమే అప్రసుతమైపోయింది. దీంతో పణం కూడా అప్రస్తుతమైపోయింది. రెండో ఎలిమెంట్ కూడా ఆవిరైపోయింది. 

          పరిణామాల హెచ్చరిక :  ప్రకాష్ రాజ్ తో సాంప్రదాయాల చెలగాటంలో ఉత్పన్నమయ్యే అపాయాలేమిటి? పరిణామా లేమిటి? చూసి చూసి మంట రేగిపోయి ప్రకాష్ రాజ్ విడాకుల పత్రాలు పైకి తీసి నితిన్ పీచమణుస్తాడా? అప్పుడు పెళ్ళాగి పోతుందా? పెళ్ళే జరక్కుండా ప్రకాష్ రాజ్ అస్త్రాన్నేం చేసుకుంటాడు? దాంతో అతనే అల్లరవుతాడు. ఛీత్కారాలు పొందుతాడు. కాబట్టి ఆ అస్త్రాన్ని తీయడు. కాబట్టి నితిన్ కి రానున్న పరిణామాల హెచ్చరికేమీ లేదు. మూడో ఎలిమెంట్ కూడా ఆవిరి.

          ఎమోషన్ : పై మూడూ లేనప్పుడు ఎమోషన్ ఎక్కడిది?
          ఇలా గోల్ ఎలిమెంట్స్ నాల్గూ లుప్తమైనప్పుడు నితిన్ చేసేదేమిటి? అందుకే ఈ ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో నిర్లిప్తంగా వుండిపోయాడు. అంటే పాసివ్ గా మారిపోయాడు. కథానాయకుడి బాధ్యత కోల్పోయాడు. మంచిదో చెడ్డదో, ఏర్పాటైన పాయింటుకి హీరో అనే వాడు బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు. తన పాయింటుని ముందుకి నడిపించే కార్యశూర్యు డవుతాడు. ఇదేమీ కన్పించదు. 

      ప్లాట్ పాయిట్ వన్ దగ్గర ఒక పాయింటుతో కథ పుట్టిందంటే, మిడిల్ ప్రారంభమైనట్టే. మిడిల్ బిజినెస్ ప్రకారం ప్రధాన పాత్ర, ప్రత్యర్ధి పాత్రల మధ్య గోల్ కోసం యాక్షన్ రియక్షన్లతో సంఘర్షణ మొదలయినట్టే. ఇంతకంటే ఇంకేమీ జరగాల్సిన అవసరం లేదు. నితిన్ కి గోలే సరిగ్గా ఏర్పాటు కానప్పుడు, ప్రకాష్ రాజ్ తో ఇంకేమని సంఘర్షిస్తాడు. ఓ రెండు చోట్ల ప్రకాష్ రాజ్ టైముకి రాకపోతే వెళ్లి ఆ అడ్డంకుల్ని క్లియర్ చేస్తాడు తప్ప. 

          ఇక మిగతా విషయాల్లో నితిన్ పరివారమే ప్రకాష్ రాజ్ ని సాంప్రదాయాల్లో కలుపుకు
పోతూంటారు. ఇలా మిడిల్ బిజినెస్ ధర్మం కూడా ఆవిరైపోతుంది. అంతా నితిన్ పరివారపు పెళ్లి పనులూ, వాటికి పేరుపేరునా సాంప్రదాయాల నామకరణాల ప్రదర్శనగా సాగిపోతుంది.
ఏది కథ? ఏది నేపధ్యం? కథకి ఏది అవసరం? నేపధ్యమా? కథానాయకుడి కర్యశూర్య
త్వమా? ఇక్కడ పెళ్లి పనుల నేపధ్యమే కథై పోయి, కథతో వుండాల్సిన కథానాయకుడు నేపధ్యంలో కెళ్ళిపోయాడు! గోల్లేని హీరో గల్లంతే కదా?
          కౌంటర్ పాయింటుతో మార్కెట్ యాస్పెక్ట్ అలా వుంటే, క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా ఇలా వుంది.
***

          ఇక విడాకుల అగ్రిమెంట్ పాయింటు గురించి. దీని మార్కెట్ యాస్పెక్ట్ ఎలా చెడిపోయిందో పైనే చెప్పుకున్నాం. ప్రేక్షకులు కన్విన్స్ అవ్వని పాయింటు. ప్రకాష్ రాజ్ రైటే, నితిన్ రాంగ్. తానేదో నమ్మే పెళ్లి పవిత్రతని పక్కన పెట్టి సంతకం పెట్టాడు. నైతికంగా దిగజారాడు. ప్రకాష్ రాజ్ హింసించి, బలవంతంగా సంతకం పెట్టించుకో లేదు. నితిన్ స్వచ్ఛందంగా సంతకం పెట్టాడు. మార్కెట్ యాస్పెక్ట్ కి చాలా బ్యాడ్. ఈ పాయింటుని ప్రేక్షకులకి అమ్మలేరు. 

          క్రియేటివ్ యాస్పెక్ట్ చూస్తే, కథలో ఈ పాయింటుకి స్థానం లేదు. ఈ అగ్రిమెంట్ సెటప్ అనేది కథలో పే ఆఫ్ అయ్యేది కాదు, అమలయ్యేదీ కాదు. పెళ్లి జరిగి, సంసారమేదో చేసుకుంటూ వుంటే, ఆ సంసారాన్ని చెడగొట్టడానికైతే పాయింటుకి స్థానం వుంటుంది. ఈ కథకి పెళ్ళే ముగింపు అయినప్పుడు, ఆ తర్వాత ప్రేక్షకుల్ని బయటికి పంపేసినప్పుడు, సంసారం కథ ఇక లేనట్టే. ఒకవేళ పెళ్లి చేసుకున్న పాత్రలు ప్రేక్షకులు వెళ్ళిపోయాక థియేటర్లో సంసారం చేసుకుంటూ వుంటే, ప్రకాష్ రాజ్ విడాకుల పత్రాలతో దుమారం రేపుతూంటే, అది ప్రేక్షకులు చూసే అవకాశం లేదు. కాబట్టి వున్నకథలో ఈ పాయింటుకి పౌరసత్వం లేదు. బంగ్లాదేశ్ పంపాల్సిందే. 

          ఇంటర్వెల్లో ఈ పాయింటుని ఏర్పాటు చేశారు. అప్పుడు ఇంటర్వెల్ తర్వాత పెళ్లి జరిగి సెకండాఫ్ కాపురం కథగా నడిస్తే, ఈ పాయింటుకి ప్లే అయ్యే అదృష్టం దక్కుతుంది. కథకావల ఎప్పుడో జరిగే అవకాశమున్న పాయింటుని సృష్టించి కథ నడడం సాధ్యం కాదు. కథకావల కాదు, కథలోనే క్లయిమాక్స్ లో పెళ్ళిపీటల మీద ఈ పాయింటే ప్లే అయింది కదా అనొచ్చు. నిజమే, అయితే ఎంత న్యాయంగా ప్లే అయిందో చూద్దాం. 

          సడెన్ గా నితిన్ కి పెళ్లి పీటల మీద అంతర్మథనం మొదలవుతుంది. తను విడాకుల పత్రాల మీద సంతకం చేశాడన్న విషయం దాచి అందరికీ ద్రోహం చేస్తున్నాడని. ఇలాటి బుద్ధితో పవిత్రమైన పెళ్లి పీటల మీద, సప్తర్షులు కొలువుదీరే కళ్యాణ మంటపంలో ఎలా పెళ్లి చేసుకోను? అని వాపోతాడు. ఒక్కో పెళ్లి మంత్రం చదువుతూ, మంత్రాలలా చెప్తూంటే,  ఇలాటి మనసుతో ఎలా తాళి కట్టను? అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. 

          ఎవరూ ఎందుకు సంతకం పెట్టావని అడగరు, అతనూ చెప్పడు. చెప్పడానికి కారణం లేదు. వుంటే చెప్పుకునేది కాదు. ఎందుకు సంతకం పెట్టి వుంటాడో పై పేరాల్లోనే చెప్పుకున్నాం. దురదృష్టమేమిటంటే, ఆ సంతకం ఎందుకు పెడుతున్నాడో అప్పుడే ఏదో విధంగా తెలియజేయలేదు కథకుడు. దాటవేశాడు. అలాంటప్పుడు పాత్ర మనసులో ఏముందో ఎవరికెలా తెలుస్తుంది? అందుకే  హీరోయిన్ని పెళ్లి చేసుకుని కులకాలన్నఏకైక యావ కొద్దీ సంతకం పెట్టాడని అనుకోవాల్సి వస్తోంది.

          చెప్పుకుంటే ఇప్పుడా యావ గురించి చెప్పుకోవాలి. అందుకే ఎవరిచేతా సంతకం ఎందుకు పెట్టావని అడిగించలేదు కథకుడు. తెలివైన వాడు. సంతకం పెడుతున్నప్పుడు గుర్తుకు రాని సత్సాంప్రదాయాలు ఇప్పుడు గుర్తొచ్చాయా? సరే, అప్పుడేదో తప్పు చేశాడు, ఇప్పుడు దిద్దుకుంటున్నాడుగా అనొచ్చు. సత్సాంప్రదాయాలు తెలియని వాడు అప్పుడు తప్పు చేయవచ్చు, ఇప్పుడు కొత్తగా తెలుసుకుని తప్పు దిద్దుకోవచ్చు. ఈ క్యారక్టరైజేషన్ బావుంటుంది. అంతేగానీ, సత్సాంప్రదాయాలకే ఒక బ్రాండ్ అంబాసిడరైన వాడు తప్పు చేస్తాడా, అదిప్పుడే తెలుసుకుని దిద్దుకుంటాడా? బ్రాండ్ అంబాసిడర్ కాదు, గ్రాండ్ మాస్టర్. ఎందుకంటే, నితిన్ పాత్ర చిత్రణ తెలియకుండా ఇలా జరిగిపోయింది.

          ఎలాగంటే, క్లయిమాక్స్ లో నితిన్ పెళ్లి మంటపంలో విడాకుల పత్రాల్నివెల్లడి చేస్తూ తన ద్రోహం గురించి ప్రాయశ్చిత్తపు డైలాగులు చెప్తూంటే, ఎలాటి సెన్స్ వెళ్తూందంటే - ఇతను సంతకం పెట్టినప్పుడే ఇదంతా ప్లాన్ చేశాడనీ, ముందైతే సంతకం పెట్టేద్దాం, పెళ్లి సమయంలో దీన్ని రట్టు చేసి ప్రకాష్ రాజ్ ని ఇరికించేద్దాం, ఇక పెళ్లి చేసుకుని అవతల పడదాం – అనుకున్నట్టుందనీ అన్పిస్తుంది. దొంగాటకమాడుతున్నాడనే సెన్సే వెళ్తుంది. అదీ మళ్ళీ తను పెళ్లి పవిత్రత గురించి అంత చెప్తున్న మంటపం దగ్గరే!  
          పాయింటు కాని పాయింట్లు పెట్టుకుంటే ఇలాగే తప్పు మీద తప్పు చేసుకు పోవాల్సి వుంటుంది. ఏదీ నమ్మదు మార్కెట్.

***
          యథా ప్లాట్ పాయింట్ వన్, తథాప్లాట్ పాయింట్ టూ – ఇవి మారని స్క్రీన్ ప్లే శాస్త్రపు శిలాక్షరాలు. ఒక సినిమా జాతకమేమిటో అడ్డాల నాడే చెప్పవచ్చు. గడ్డాలు పెంచుకుని నెలల తరబడీ రాసి రాసి, తీసి రిలీజ్ చేసుకుని చూసుకునే దాకా ఆగనవసరం లేదు. ఓ మూడు లైన్ల అయిడియా వచ్చినప్పుడే దాని మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ రెండూ క్షుణ్ణంగా ఎనాలిసిస్ చేసుకుని తెలుసుకోవచ్చు. కానీ ఎవరి కవసరం ఎనాలిసిస్ లు? వూరికే రివ్యూలు రాసుకోవడానికి అవసరం. స్క్రిప్టులు రాసే కథకుల కవసరం లేదు. వాళ్లకి ఇట్టే మ్యాజిక్కులు జరిగిపోతాయి. కథల్ని అమ్మాలి గానీ, పాయింట్లేమిటి? నాన్సెన్స్! విత్తనం లేకుండా చెట్టుని మొలిపించగలరు.

సికిందర్