రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, జులై 2018, సోమవారం

664 : స్క్రీన్ ప్లే సంగతులు


     2000 సంవత్సరం నుంచీ తెలుగు సినిమాలు నరనరాన ఇంకిన అవే లోపాలతో అట్టర్ ఫ్లాపవుతున్నాయి. అవే పాసివ్ హీరో పాత్రలు, అవే మిడిల్ మటాషులు, అవే ఎండ్ సస్పెన్సులు, అవే సెకండాఫ్ సిండ్రోములు సింగారించుకుని, బాక్సాఫీసు చెలియలి కట్ట దగ్గర జామ్మని జలసమాధి అయిపోవడం. పదుల కోట్లు ధారబోసే పెద్ద నిర్మాణ సంస్థలు సైతం ఈ నాల్గు శనిగ్రహలేమిటో, ఇవెందుకు తమ సినిమాల్లో తిష్ట వేస్తున్నాయో పట్టించుకునే పాపాన పోవడం లేదు. అంతా ఏవో అంచనాల మీదే, వూహల మీదే, నమ్మకాల మీదే ఆధారపడి సినిమాలు తీసేయడం. శాస్త్రీయంగా ఏ ప్రాతిపదికా వుండని రాతకోతలతో - ఏం రాసుకున్నారో, ఎలా రాసుకున్నారో, ఎందుకు రాసుకున్నారో తెలియకుండా బౌండెడ్ స్క్రిప్టు అనే డెత్ వారెంట్ ఒకటి జారీ చేసుకుని కొబ్బరికాయ కొట్టేయడం!

          ‘లవర్’ లో ఒకటి కాదు ముచ్చటగా మూడు శనిగ్రహాలు కాపురం పెట్టాయి : పాసివ్ హీరో పాత్ర, మిడిల్ మటాష్, ఎండ్ సస్పెన్స్ అన్నవి. సినిమాకి పెట్టిన పెట్టుబడితో ఈ మూడూ ఆడిన చెలగాటం సహజంగానే ఫ్లాపు అనే పదార్ధాన్ని పుట్టించింది.  ఫ్లాపవుతున్న సినిమాలు ఎందుకు ఫ్లాపవుతున్నాయో విశ్లేషించుకోక కొత్త ఫ్లాపిస్టులుగా తయారవుతున్నారు. ఫ్లాపిస్టులకేం ఎరుక మన చెలగాటమని శనిగ్రహాలు ఇంకా చెలరేగిపోతున్నాయి. ఇప్పుడీ మూడు శనిగ్రహాలూ కూడబలుక్కుని ఎక్కడెక్కడ ఎలా చెలరేగి, హాట్ హాట్ విడుదలని హాంఫట్ చేశాయో చూద్దాం ...

బిగినింగ్ కథ
       రాజ్ (హీరో) బైక్ పక్కన పెట్టుకుని కొండ ప్రాంతంలో కూర్చుని వుంటాడు. తను అనాధ అయినట్టూ, తను ప్రేమిస్తున్న అమ్మాయి మీద ఎవరో ఎటాక్ చేసినట్టూ తల్చుకుని, అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఆర్నెల్లు వెనక్కి వెళ్ళాలంటాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. అక్కడ సంపత్ అనే విలన్, అతడి అనుచరుడు జగ్గూ పరిచయమవుతారు. జగ్గూ ని అన్నలా భావించి అతడింట్లోనే వుంటాడు రాజ్. వదిన, ఆమె చిన్న కూతురూ వుంటారు.

          రాజ్ కస్టమైజ్డ్ బైక్ బిల్డర్ గా జీవనోపాధి పొందుతూంటాడు. మెయిన్ విలన్ ఓపెన్ అవుతాడు. ఇతను అరుదైన వ్యాధితో బాధపడుతూంటాడు. అవయవ మార్పిడికి మనిషి కోసం వెతుకుతూంటాడు. హీరో ఫ్రెండ్స్ నల్గురున్నట్టు ఓపెనవుతారు. వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ హీరో పాట వేసుకుంటాడు. పాట తర్వాత ఇంకో విలన్ జెపితో తగాదా వచ్చి గాయపడతాడు. హాస్పిటల్లో చేరి,  అక్కడ నర్సు  చైత్రని చూసి ప్రేమలో పడతాడు. ఆమె పడదు. ఆమె వెంట పడుతూంటాడు. ఓ పాటేసుకుంటాడు.

          చైత్రకి హాస్పిటల్లో ఏదో గూడుపుఠానీ జరుగుతోందని అనుమానంవచ్చి డాక్టర్లని అడుగుతుంది. వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. డాక్టర్ కి మెయిన్ విలన్ అనుచరుడు అజయ్ నుంచి కాల్ వస్తుంది. త్వరలో మ్యాచింగ్ మనిషిని అప్పగిస్తానంటాడు డాక్టర్. రాజ్ మళ్ళీ తన ప్రేమ వ్యవహారం కొనసాగిస్తాడు. ఓ దిక్కులేని పేషంట్ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేరతాడు. ఆపరేషన్ చేయాలంటే ష్యూరిటీ పెట్టేవాళ్ళు లేక కంగారుపడుతుంది చైత్ర. సంతకం పెట్టేందుకు రాజ్ ముందుకొచ్చి ఆమె మనసుని గెలుచుకుంటాడు. ఆమె ప్రేమలో పడి అతడితో పాటేసుకుంటుంది. 

          పాట తర్వాత, లక్ష్మి అనే పిల్ల పేషంట్ కనపడక కంగారు పడుతుంది చైత్ర. ఒక స్లో పాయిజన్ ఇంజెక్షన్ దొరికి డాక్టర్లని అడుగుతుంది. వాళ్ళు సీరియస్ అవుతారు. చైత్ర పారిపోతుంది. పారిపోయిన చైత్ర రాజ్ తో కొండ ప్రాంతంలో కూర్చుని వుంటుంది. గ్యాంగ్ వచ్చి ఎటాక్ చేస్తారు. రాజ్ పోరాడి వాళ్ళని తరిమేస్తాడు. ఇప్పుడు మళ్ళీ బిగినింగ్ మొదటి సీనుకొచ్చి, అలా కొండప్రాంతంలో కూర్చున్న రాజ్,  ఎవరు ఎటాక్ చేశారు? అని మళ్ళీ ప్రశ్నించుకుంటాడు. ఇంటర్వెల్ పడతుతుంది.

       సెకండాఫ్ మొదలవుతుంది. రాజ్, చైత్ర వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ చేస్తారు. చూస్తాంలే అంటారు పోలీసులు. అన్న జగ్గూకి విషయం తెలిసి, చైత్రని దూరంగా పంపించెయ్యమంటాడు. మలయాళీ అయిన చైత్రతో రాజ్ కేరళ వెళ్ళిపోతాడు. అక్కడ ఆమె తల్లి వుంటుంది. ఇద్దరి ప్రేమాయణం మళ్ళీ మొదలవుతుంది. రేపు ఓనం పండగ వుందని చెప్తుంది చైత్ర. ఇద్దరూ ఓనం పండక్కి గ్రూప్ సాంగ్ వేసుకుంటారు. అచ్చిబుచ్చి ప్రేమలు  కంటిన్యూ చేస్తారు. 

          అటు డాక్టర్లూ మెయిన్ విలన్ సీరియస్ అవుతారు. చైత్ర ఎక్కడుందో పట్టుకోవాలని హడావిడీ చేస్తారు. ఇటు చైత్ర తల్లి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. చైత్ర తిప్పికొడుతుంది. అప్పుడు రాజ్ మీద ప్రేమ బయట పెట్టుకుంటుంది. మీ సంగతి తెలుసుకోవాలనే ఉత్తుత్తి పెళ్ళిచూపులతో నాటకమాడానని సంతోషపడుతుంది తల్లి. అయితే రాజ్ కుటుంబాన్ని పిలిపించి ఎంగేజ్ మెంట్ కానిద్దామంటుంది. 

          అటు జగ్గూ మీద గ్యాంగ్ ఎటాక్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ విలన్ తొత్తుగా జగ్గూ బాస్ సంపత్ రివీలవుతాడు. చైత్ర ఎక్కడుందో చెప్పమంటాడు. చెప్పకుండా కేరళ వెళ్ళిపోతాడు జగ్గూ. కుటుంబంతో నిశ్చితార్ధాని కొచ్చిన జగ్గూ, రాజ్ తో మాట్లాడాలని రాజ్ పిలిపిస్తాడు. కానీ మాట్లాడడు. నిశ్చితార్ధం అయ్యాక తిరిగి వెళ్ళిపోతూ,  స్టేషన్లో ఆగిపోయి చైత్రకి కాల్ చేసి పిలిపించుకుంటాడు. లక్ష్మిని ఎక్కడ దాచావో చెప్పేస్తే మనకి ప్రమాదం తప్పుతుందంటాడు. ఆమె చెప్పదు. ఇంతలో మెయిన్ విలన్ అనుచరుడు అజయ్ గ్యాంగ్ తో వచ్చేసి జగ్గూని చంపేసి చైత్రని ఎత్తుకుపోతాడు. చైత్రకి కాల్ చేస్తూంటే రెస్పాన్స్ రాకపోవడంతో, వెతుక్కుంటూ వచ్చి చచ్చి పడున్న జగ్గూని చూస్తాడు రాజ్.

మిడిల్ కథ 
      చనిపోయిన అన్న చితికి నిప్పెట్టి చైత్రని వెతుక్కుంటూ ఓ శాడ్ సాంగ్ వేసుకుంటాడు రాజ్. తిరిగి వూరి కొచ్చేసి గల్లీగల్లీలు గాలిస్తూంటాడు. ఓ గల్లీలో ఒకడు దొరుకుతాడు. వాణ్ణి కొడితే ఇంకొకడి గురించి చెప్తాడు. వాణ్ణి కొడితే మెయిన్ విలన్ గురించి అంతా చెప్పేస్తాడు. మెయిన్ విలన్ కి లివర్ వ్యాధి. అరుదైన బ్లడ్ గ్రూపు. ఆ బ్లడ్ గ్రూపున్న పిల్ల లక్ష్మి దొరికింది. ఆమెని ఇంజెక్షన్ల ద్వారా నెమ్మదిగా బ్రెయిన్ డెడ్ అయ్యేలా చేసి, లివర్ తస్కరించాలని ప్లాను. ఇది విని మెయిన్ విలన్ ఆచూకీ చెప్పమంటాడు రాజ్.
ఎండ్ కథ
          విలన్లు లక్ష్మి కోసం చిత్రని  చిత్రవధ చేస్తూంటారు.  రాజ్ చైత్రని విడిపించుకుని, మెయిన్ విలన్, అతడి అనుచరుడు అజయ్ లు ప్రయాణిస్తున్న కారుని రిమోట్ కంట్రోల్ చేసి ప్రమాదం జరిగేలా చూస్తాడు. వెంటనే ఎండ్ టైటిల్స్ పడతాయి.
***
         స్థూలంగా ఇది పూరీ జగన్నాథ్ టెంప్లెట్టే. కాకపోతే పూరీ జగన్నాథ్ పాల్పడని అనౌచిత్యాలకి దీని కథకుడు అత్యుత్సాహంతో పాల్పడ్డాడు : పాసివ్ హీరో పాత్ర, మిడిల్ మటాష్ కథనం,  ఎండ్ సస్పెన్స్ హంగు. అయితే దీన్ని సరిదిద్దితే ఈ కథ బాగుపడుతుందా అన్న ప్రశ్న కూడా తలెత్తదు. ఎందుకంటే ఇలాటి కథకి ఇప్పుడు మార్కెట్ యాస్పెక్ట్ లేదు. ట్విట్టర్ లో ప్రేక్షకుల కామెంట్స్ చూస్తే, ఇంకా ఎన్నిసార్లు తీస్తార్రా ఈ కథలూ, కొంచెమైనా మారండ్రా బాబూ, కొత్తగా ఆలోచించండి...అంటూ వాపోతున్నారు యూత్. 

          కాబట్టి ఇలా విశ్లేషించడం కథని బాగుపర్చే దృష్టితో కాదు. పనికిరాని కథని ఏం బాగుపరుస్తాం. అసలే పనికిరాని కథని ఇంకెంత పనికిరాకుండా దారుణంగా తీశారో తెలుసుకోవడానికే ఇది.  కథకుడి మీద  తెలుగు సినిమాల ప్రభావం చాలా వున్నట్టుంది. వాటిలోని సీన్లని కాపీ చేసి, దిల్ రాజుకి సమర్పించుకోకుండా వుండలేకపోయాడు. వేరే నిర్మాత తీసిన సినిమాలోని సంగతులు తన చేత ఖర్చు పెట్టించి తన ఖాతాలోనే వేసినట్టు దిల్ రాజుకి  కూడా తెలియక పోయుండొచ్చు. 

          గుణశేఖర్ తీసిన ‘అర్జున్’ లో మహేష్ బాబు వర్షంలో కత్తి పట్టుకుని కూర్చునే ఓపెనింగ్ ఇమేజిని ఎంచక్కా కాపీచేసి కథకుడు తన కథలో కొండల మధ్య హీరోని కూర్చోబెట్టి పెట్టేశాడు. అక్కడ్నుంచి  ‘అర్జున్’ లో లాగే ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించి, హీరోయిన్ తో కథ చెప్పుకొస్తూ, ఆమె మీద ఎటాక్ చేసిన గ్యాంగ్ తో తలపడేట్టు చేసి, ‘అర్జున్’ లోలాగే ప్రారంభ సీను కొచ్చాడు. అక్కడ ఇంటర్వెల్ వేశాడు. ఇంకా కథకి మూలబిందువైన అరుదైన బ్లడ్ గ్రూపు పాయింటు గోపీచంద్ నటించిన ‘ఒక్కడున్నాడు’ లోంచి మనసుపడి స్వీకరించాడు. ఇలా మనసు పడి స్వీకరించకుండా స్వీకరించినట్టయిన పని కూడా ఒకటి జరిగిపోయింది పనిలోపనిగా. మనుసు పడి స్వీకరించిన వాటిని పూరీ టెంప్లెట్ లోనే  కొనసాగిస్తే పోయేది - ఇంకేదో క్రియేటివిటీ చూపబోయే సరికి అదికాస్తా మళ్ళీ మహేష్ బాబు నటించిన ‘బాబీ’ లోకి తిరగబెట్టింది. అందుకే ఫ్లాపు ఖాయమైపోయింది ‘బాబీ’ లాగే. స్ట్రక్చర్ పట్టని క్రియేటివిటీతో ఎంత కళా పోసనో!

       స్ట్రక్చర్ లో పైన చెప్పుకున్న బిగినింగ్ కథ చూస్తే, అరగంట ముప్పావుగంటలో ముగియాల్సిన బిగినింగ్, ఇంటర్వెల్ కూడా దాటేసి  సెకండాఫ్ లోకి జొరబడి,  గంటన్నర దాకా సాగింది. మొత్తం రెండు గంటల సినిమాలో బిగినింగే గంటన్నర! బిగినింగే గంటన్నర! బిగినింగే గంటన్నర! ఇలా ఇప్పుడు గానీ ప్లాట్ పాయింట్ వన్ రాలేదు. ఇక మిడిల్ కి ఎనిమిదే నిమిషాలు! ఎండ్ పదిహేను నిమిషాలుండొచ్చు... 

          రెండు గంటల సినిమాలో బిగినింగ్, ఎండ్ లు అరగంట చొప్పున వుండి, మిడిల్ గంట పాటు సుదీర్ఘంగా వుండాల్సింది పోయి, మిడిలే పూర్తిగా మటాష్ అయిపోయింది. అంటే గుండె కాయ గల్లంతన్న మాట. అంటే కథే లేదన్న మాట. గంటన్నర దాకా సాగదీసిన దంతా కథే అనుకున్నట్టుంది కథకుడు. అది కథ కాదనీ, తర్వాత మొదలవబోయే మిడిల్ కి కేవలం సన్నాహమన్న బేసిక్స్ ని తెలుసుకోలేక పోయాడు. ప్లాట్ పాయింట్ వన్ ఎక్కడ రావాలో అసలేమీ తెలియకుండా పోయాడు. 

          నిజానికి ప్లాట్ పాయింట్ వన్ అనేది, అంటే కథకి ప్రధాన మలుపు, అంటే హీరోకి ఒక లక్ష్యం అంటూ ఏర్పడి దాని కోసం పోరాడే ఘట్టం, ఫస్టాఫ్ ఫ్లాష్ బ్యాక్ పూర్తయాక ఇంటర్వెల్లో రావాలి ఈ కథకి. కానీ ఇక్కడ కూడా ఎవరీ ఎటాక్ చేశారు? అని ప్రశ్న వేసుకుని ఇంటర్వెల్ వేసుకున్నాడు. దీంతో ఏమైనా లాభం చేకూరిందా? ఈ ప్రశ్నతో ఫస్టాఫ్ మొదలెట్టినప్పుడు కథలో ఏ స్థితి వుందో,  ఇంటర్వెల్లో మళ్ళీ అదే స్థితిలో ఎక్కడేసిన గొంగళిలా వుంది. అంటే ఏమాత్రం టెన్షన్ ఆర్క్, క్యారెక్టర్ ఆర్క్ అనేవి ఏర్పడకుండా చప్పగా వుందన్న మాట. 

          సరే, ఎవరీ ఎటాక్ చేశారు? అన్న ప్రశ్నతో సమాధానం వెతుక్కునే ప్రయత్నం చేశాడా? అదీ చెయ్యక అన్న చెప్పాడని హీరోయిన్ ని తీసుకుని కేరళ వెళ్ళిపోయాడు. అంటే మాట వరసకి ఇంటర్వెల్ ప్లాట్ పాయింట్ వన్ అనుకుంటే, దాన్ని పరిహసించి పలాయనం చిత్తగించాడు. ప్లాట్ పాయింట్ వన్ అనేది కథ పుట్టే మలుపే కాదు, అది హీరోకి పర్సనల్ టర్నింగ్ పాయింటు కూడా. అక్కడ కథలో పుట్టిన సమస్యని సాధించే లక్ష్యం ఏర్పర్చు కోకుండా కథలోంచి పారిపోలేడు. పారిపోతే పాసివ్ పాత్ర అయినట్టే.

       అలాగే అయ్యాడు, మళ్ళీ కేరళలో ప్రేమలు వెలగబెడుతూ వుండిపోయాడు. బ్యాక్ డ్రాప్ లో విలన్లతో పుట్టిన సమస్య పట్టకుండా వుండిపోయాడు. ఎవరీ ఎటాక్ చేశారన్న ప్రశ్నని హీరోయిన్నే అడిగితే సరిపోతుంది. ఆమె డాక్టర్లతో జరిగిందంతా చేప్పేసేది. కానీ ఆమెని అడగడు, ఆమె చెప్పదు. అలా వుంది అతడి తెలివి. అలా వుంది ప్రేమలో ఆమె నిజాయితీ. మహేష్ బాబు నటించిన ‘బాబీ’ లో మాహేష్ బాబు, ఆరతీ అగర్వాల్ ల మాఫియా తండ్రులిద్దరూ నగరాన్ని అట్టుడికిస్తూంటారు. కాల్పులతో, పేలుళ్లతో జనం అల్లాడి పోతూంటారు. అయినా అదే నగరంలో ఇదేమీ పట్టకుండా ఇద్దరూ ప్రేమ సన్నివేశాల్లో వుంటారు. ప్రేమించుకుంటూనే వుంటారు. చుట్టూ బ్యాక్ డ్రాప్ లో అసలేమీ జరగడంలేదన్న ప్రపంచంలోనే వుంటారు. ఈ బ్యాక్ డ్రాప్ తో మహేష్ బాబుకి సంపర్కమే వుండదు. ఇలాగే  బ్యాక్ డ్రాప్ లో విలన్ల కుట్రతో సంబంధమే లేదన్నట్టుగా ‘లవర్’ హీరో కూడా వుండి  పోతాడు. ఇదంతా ఇంకా బిగినింగ్ విభాగంగానే సాగుతూంటుంది సెండాఫ్ లో కూడా. చివరికి విలన్లు అన్నని చంపి హీరోయిన్ని ఎత్తుకుపోయినప్పుడు గానీ, అసలు విషయం తెలిసిరాదు హీరోకి. 

          అంటే ఇక్కడ ఇప్పుడు కథ ప్రారంభమయ్యిందన్న మాట! గంటన్నరకి!  ఇంతసేపూ ప్రేక్షకులు తలపట్టుక్కూర్చోవాలన్న మాట. ఆకలికి ఇడ్లీ పెట్టకుండా ఎంతసేపూ చట్నీయే గుమ్మరిస్తున్నాడు కథకుడనే వంటకాడు నాకమని. ఇలా హీరోకి ఎప్పుడైతే ఇక్కడ విషయం తెలిసిందో, తెలిసి ఇప్పుడేం చేయాలన్న గోల్ ఏర్పడిందో – అప్పుడేర్పడిందన్న మాట ప్లాట్ పాయింట్ వన్!  ఈ ప్లాట్ పాయింట్ దగ్గర గోల్ తో మిడిల్ ల్లోకి ఎంటరయ్యాడు. అన్నకి కర్మకాండ చేశాడు, విషాద గీతం వేసుకుంటూ హీరోయిన్ని వెతికాడు, దుండగుల్ని పట్టుకున్నాడు. అప్పడు తెలుసుకున్నాడు విలన్ల కుట్రేమితో. ఇది ప్లాట్ పాయింట్ టూ! ఇంతే, మిడిల్ ఎనిమిది నిమిషాల్లో ముగిసిపోయి మిడిల్ మటాషై పోయింది. ఇంతకంటే అన్యాయం వుంటుందా ఏ సినిమాకైనా? వంద రూపాయల టికెట్ కి ఎనిమిది నిమిషాల కథే  చూపిస్తారా?  

          ఈ మిడిల్ చివర్లో కుట్ర చెప్పించేదాకా మనకికూడా ఇంతసేపూ తెలీదు. ఎండ్ సస్పెన్స్ గా ఇప్పుడే రివీలవుతుంది. అంటే కుట్ర  వివరాలు తెలియకుండా, ఏం కథ చూస్తున్నామో తెలియకుండా, ఏది ఎందుకు జరుగుతోంతో అర్ధంగాక ఇన్వాల్ కాలేకా,  మనం అసహనానికి గురవుతూ సినిమా చూడాలన్న మాట. 

          దీంతో అయిపోలేదు. ఇంకా ఇలాగే తీస్తూంటారు. ఇలాగే వస్తూంటాయి సినిమాలు. ఇలాగే సమాధి అవుతూంటాయి. దీన్నాపలేరు, ఆపడం తెలీదు, తెలుసుకోవాలనీ వుండదు. 

సికిందర్

21, జులై 2018, శనివారం

663 - రివ్యూ


రచన -  దర్శకత్వం: శశాంక్‌ ఖైతాన్
తారాగణం : జాహ్నవీ కపూర్ఇషాన్‌ ఖట్టర్‌‌అశుతోష్‌ రాణాఅంకిత్‌ బిష్ట్ఆదిత్య కుమార్తదితరులు
సంగీతం
: అజయ్‌-అతుల్, ఛాయాగ్రహణం : విష్ణూ  రావ్
బ్యానర్స్ 
: జీ స్టూడియోస్ధర్మ ప్రొడక్షన్స్
నిర్మాతలు
: కరణ్‌ జోహార్అపూర్వ మెహతా
విడుదల
 తేదీజులై 20, 2018
***

          వెలుగు జిలుగుల అట్టహాసపు బాలీవుడ్  ప్రాంతీయ సినిమాల్ని ఎందుకు రీమేక్ చేస్తుందో అర్ధంగాని పరిస్థితి. ప్రాంతీయ సినిమాల్లో ఏంతో కొంత అస్తిత్వాల్ని నిలుపుకుంటున్నవి మరాఠీ నుంచి వస్తున్నవే. ఇతర ప్రాంతీయ సినిమాలు వాటి అస్తిత్వాల్ని ఏనాడో వదులుకుని, బాలీవుడ్ కి నకళ్ళుగా, ఫక్తు కాలక్షేప సినిమాలుగా మారిపోయాయి. మరాఠీ నుంచి ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయిన ‘ది కోర్ట్’ ని బాలీవుడ్ గనుక రీమేక్ చేస్తే ఎలా వుండేది? అలాగే తయారైంది మరాఠీ ‘సైరాట్’ ని ఇప్పుడు ‘ధడక్’ (గుండె లయ) గా రీమేక్ చేస్తే కూడా. అణగారిన వర్గాల కథలతో సినిమాలు తీసే జోలికి బాలీవుడ్ ఎప్పుడు పోయింది గనుక? అలాటి రికార్డే లేదు. ఒకవేళ వామపక్ష భావాల ప్రకాష్ ఝా అంతటి వాడు,  రిజర్వేషన్ల సమస్య మీద ‘ఆరక్షణ్’ తీస్తే కూడా, సగం నుంచి ప్లేటు ఫిరాయించి కార్పొరేట్ కాలేజీల వేరే కథగా మార్చేసుకుని రక్షణ పొందాడు.  ఇందులో దళితుడి వేషం వేసిన నవాబు స్టార్ సైఫలీ ఖాన్,  ఆ పాత్రలో ఎబ్బెట్టుగా కన్పించి నవ్వులపాలయ్యాడు. 

          ప్పుడు దళిత – ఉన్నత కుల సంఘర్షణాత్మక ప్రేమ కథలో శ్రీదేవి వారసురాలిగా, గ్లామర్ తారగా రంగప్రవేశం చేస్తున్న జాహ్నవీ కపూర్ ది కూడా డిటో సైఫలీ ఖాన్ పరిస్థితే- కాకపోతే దళిత పాత్ర పోషించలేదు. అయినా ఈకథలో తనలాటి రూపవతికి, లావణ్యవతికి స్థానంలేదు. వేరే తియ్యటి స్వప్నలోకాల,  అభూతకల్పనల రోమాంటిక్ కథ తీసుకుని,  రాకుమారిలా యూత్ ని గిలిగింతలు పెట్టాల్సిన పని. తన మార్కెట్ అక్కడుంది, ఇక్కడ కాదు. 

     2015 లో గ్లామర్ తార అనూష్కా శర్మ నిర్మించి నటించిన, సంచలన  ‘ఎన్ హెచ్ – 10’,   హర్యానాలో ఆనర్ కిల్లింగ్స్ కి సంబంధించిన  కథ. దీంట్లో కులాల ప్రసక్తి రాలేదు. కానీ ‘సైరాట్’ అనే స్పష్టమైన కులవివక్షా కథాసంవిధానంలో బాలీవుడ్ హీరోహీరోయిన్లు కుదరరు గాక కుదరరు. దర్శకుడు శశాంక్ ఖైతాన్ కూడా న్యాయం చేయలేడు గాక చేయలేడు. సైరాట్ దర్శకుడు నాగరాజ్ పోపట్ రావ్ మంజులే దళితుడు. కాబట్టి ఆ జీవితాలు, పరిస్థితులు అనుభవ పూర్వకంగా అతడికి తెలుసు. కనుక పరిపూర్ణంగా ఆ నేపధ్యంలో మహారాష్ట్ర గ్రామీణ వాతావరణాన్ని సృష్టించగలిగాడు. అక్కడి మనుషుల్ని అచ్చంగా అలాగే చూపించాడు. మత్స్య కారుడి కొడుకుగా గ్లామర్ లేని కొత్త హీరోని చూపించాడు. స్థానిక రాజకీయ నాయకుడి కుమార్తెగా అంతగా గ్లామర్ లేని కొత్త హీరోయిన్ ని చూపించాడు. పల్లెటూరి మనుషులు ఎలావుంటారో అలాగే ఏ షోకులు చేయకుండా చిత్రించాడు. అదొక వాస్తవిక కథాచిత్రం. ఇదే బాలీవుడ్ లో రాజ్ కపూర్ ‘బాబీ’  తీస్తే, మత్స్య కారుడుగా క్రిస్టియన్ పాత్రని చూపించి,  అందులో ప్రేమ్ నాథ్ ని నటింప జేశాడు. హీరోయిన్ గా పరిచయమైన, బికినీలో కవ్వించిన డింపుల్ కపాడియా అతడి కూతురు. అదంతా బాలీవుడ్ గ్లామరస్ రిచ్ రోమాంటిక్ డ్రామా వ్యవహారం. ఇక్కడ కుల ప్రసక్తి వుండదు. రెగ్యులర్ బాలీవుడ్ ధనిక పేదా తేడాలే వుంటాయి. 

          ఇలాటి  వ్యవహారమే ‘ధడక్’ ది కూడా.  జైపూర్ లో రిచ్ రాజవంశ కుటుంబం, అందులో ఖరీదైన హీరోయిన్, ఇంకో  పక్క హోటల్ నడుపుకునే వాడి సాధారణ కొడుకు హీరో. కులాల ప్రస్తావనని కన్వీనియెంట్ గా దాటవేస్తూ- ధనిక - పేద అలవాటయిన, బాక్సాఫీసుకి సేఫ్ గా ఫీలయ్యే, రెగ్యులర్ బాలీవుడ్ ఫార్ములా ప్రేమ కథగా ముస్తాబు చేశారు. ‘సైరాట్’  లో కన్పించే పచ్చి రాజకీయ, సాంఘిక పెత్తనాల విత్తనాలు నాటడానికి బాగా భయపడ్డారు. 

          పార్థవి (జాహ్నవి)  జైపూర్ రాజరికపు వంశంలో గారాల కూతురు. జైపూర్లోనే హోటల్ నడుపుకునే వాడి కొడుకు మధుకర్ (
ఇషాన్ఖట్టర్‌‌). ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇది పార్థవి తండ్రికి తెలిసిపోయి ఇద్దర్నీ విడదీసి,  మధుకర్ ని పోలీసుల చేత కొట్టిస్తాడు.  తప్పించుకుని ఇద్దరూ కోల్ కత పారిపోతారు. అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వుంటారు. చీటికీ మాటికీ గొడవలు కూడా మొదలవుతాయి. పార్థవి ఇంటికి వెళ్లి పోడానికి కూడా సిద్ధపడుతుంది. తర్వాత మనసు మార్చుకుంటుంది. పెళ్ళిచేసుకుంటారు. కొడుకుని కంటారు. అప్పుడు జరుగుతుంది అనుకోని సంఘటన...

      ఇలా ఈ కథలో ఒరిజినల్లో వున్న చాలా సీన్లు తొలగించారు. ఒరిజినల్ రెండు గంటల 45 నిమిషాలుంటే, రీమేక్ ని రెండు గంటలకి కుదించారు. ఒరిజినల్ కి ప్రాణమైన కుల నేపధ్య వాతావరణం, దాని తాలూకు సమస్యలూ పూర్తిగా తొలగించేశారు. దీంతో సరైన రెగ్యులర్ ప్రేమ కథైనా కాలేక, సామాజిక రుగ్మతల్ని కడిగేసే వాస్తవిక కథా కాలేక రెంటికి చెడ్డ రేవడి అయింది. 

          మరొక పెద్ద తప్పిద మేమిటంటే, ముగింపుని మార్చెయ్యడం! జాహ్నవి పాత్రని అంత ట్రాజడీతో ముగించలేక, మొదటి సినిమా కాబట్టి ఆమెకి మినహాయింపు నిచ్చి, ప్రేక్షకుల్ని సంతోష పెట్టాలనుకున్నట్టుంది- దీంతో మొత్తం ‘సైరాటే’ నే  తీసి అవతలకి గిరవాటేసినట్టయింది. ‘సైరాట్’ ముగింపు కోపం తెప్పిస్తూ ప్రచండ బలంగా వుంటే, ‘ధడక్’ అయ్యో పాపమని తేలిపోతుంది.

          స్టార్లతో అట్టహాసపు గ్లామర్ ప్రేమ సినిమాలతో హంగామా చేసే నిర్మాత కరణ్ జోహార్,  తనవి కాని చెప్పుల్లో కాళ్ళు దూర్చి, ఛీఛీ అని బూట్లు వెతుక్కున్నట్టుంది. ప్రాంతీయ చెప్పుల కథలు ఏమర్ధమవుతాయి బాలీవుడ్ కి...

సికిందర్
         


Friends! Back to business.

19, జులై 2018, గురువారం

662- స్క్రీన్ ప్లే సంగతులు



    హీరోలకు ఎంత వారసత్వపు  నేపధ్య బలమున్నా, అదే వారసత్వపు నిర్మాణ శైలుల్లో సినిమాల్ని కొనసాగించలేరు. కాలాన్ని బట్టి మారాలి. రాజ్ కపూర్ తన కుమారుడు  రిషీ కపూర్ ని హీరోగా పరిచయం చేస్తూ తన కాలం నాటి కథా కథనాలతో, పాత్రలతో ‘బాబీ’ తీయలేదు. కాలానికి తగ్గ ట్రెండ్ సెట్టర్ ‘బాబీ’ ని తీసి చరిత్ర సృష్టించాడు. కొత్తగా పరిచయమయ్యే హీరోలు యువతని ఉర్రూతలూగిస్తూ రంగప్రవేశం చేయాల్సిందే. కానీ మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, ఈ తరం యువకుడు, తన మామ గారు ఎప్పుడో నటించిన లాంటి, ఇప్పుడు కాలం చెల్లిన పాత వ్యవహారంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఎవర్ని ఆకట్టుకో గలిగాడు? ఎవర్నీ లేదు!      
 
         
పురాతనాన్ని  రీసైక్లింగ్ చేసిన వ్యవహారంతో  కొత్త దర్శకుడు కూడా దెబ్బతినిపోయాడు. ఏడాదికి 70 మంది కొత్త దర్శకులు వస్తూంటే, ఒకరో ఇద్దరో తప్ప,  అందరూ అట్టర్ ఫ్లాపై తిరిగి వెళ్ళిపోతున్నసాంప్రదాయాన్ని ఈ కొత్త దర్శకుడు కూడా తుచ తప్పకుండా పాటించాడు. కొత్త దర్శకులు ఎందుకు ఫ్లాపవుతున్నారో విశ్లేషించుకోకుండా,  మళ్ళీ ఇంకో  కొత్త దర్శకుడు అవే పోకడలతో అలాగే దర్శన మిస్తూంటే – ఫ్లాపుల చరిత్రకి అంతెక్కడ వుంటుంది. 

          ప్రస్తుత సినిమా సమస్యేమిటంటే, షరామామూలుగా స్క్రీన్ ప్లే భ్రష్టత్వం.  పాత కథకి తోడు స్క్రీన్ ప్లే సర్వ భ్రష్టత్వం సంపూర్ణ దివాలాకోరు తనానికి దారితీసింది. ఈ స్క్రీన్ ప్లేలో పలాయనవాదం ఎంతగా వుందంటే, కథ చెప్పడానికి దర్శకుడు ససేమిరా ఇష్టపడడం లేదు. చివరి పది నిమిషాలకి కథని పరిమితం చేసి, మిగతా గంటా యాభై  నిమిషాల కాలమంతా టైం పాస్ చేశాడు. చివరి పది నిమిషాల కథకి ఈ గంటా యాభై నిమిషాల టైం పాస్ ని చేర్చడానికి రకరకాల వంకర్లు తిప్పాడు. గమ్యానికి ఎలా చేరామన్నది కాదు, చేరామా లేదా అన్నదే ముఖ్యమనే - ఎండ్ జస్టిఫైస్ ది మీన్స్ మైండ్ సెట్ తో – సహనపరీక్షకి గురిచేసే మేకింగ్ ని రుద్దాడు.

స్థూలంగా కథ 
         ముందు స్థూలంగా కథ చెప్పుకుంటే, ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేసే శ్రీనివాసరావు కొడుకు రామ్. చిన్నప్పట్నుంచీ కొడుకుకేం కావాలన్నా సమకూరుస్తూ, కోరిన చదువుకూడా అప్పు చేసి చదివించాడు.  కానీ రామ్ కి ఉద్యోగం రావడం లేదు. దీంతో నేస్తాలనేసుకుని చెడ  తిరుగుళ్ళు మొదలెట్టాడు. ఇలాకాదని,  నేస్తాలతో కలిసి ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ పెట్టాడు. ఇది వికటించి పోలీస్ స్టేషన్లో పడ్డాడు. తండ్రి విడిపించు కొస్తూంటే యాక్సిడెంట్ అయి గుండె పోటుకి గురయ్యాడు. అప్పుడు తండ్రి మిత్రుడు ఒకాయన తండ్రి గురించి ఒక విషయం  చెప్పాడు. కుటుంబ బాధ్యతల కోసం అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ కావాలన్న తన కలల్ని చంపేసుకున్నాడని.  


             
దీంతో రామ్ మారడానికి ప్రయత్నించాడు. ఇందులో భాగంగా మళ్ళీ ఈవెంట్ మేనేజ్ మెంట్ చేపట్టి, ప్రేమించిన చైత్ర సహకారంతో ఆమె బాస్ కుటుంబానికి పరిచయమయ్యాడు. ఆ కుటుంబంలో వున్న సమస్యని పరిష్కరించి, ప్రతిఫలంగా ఒక ఈవెంట్ మేనేజి మెంట్ ప్రోగ్రాం పొందాడు. పనిలో పనిగా ఆ బాస్ తన కొడుక్కి రామ్ చెల్లెలితో పెళ్లి కూడా జరిపించాడు.  చివరికి రామ్ తండ్రికి కెమెరా కొనిచ్చి ప్రపంచ యాత్ర తిప్పాడు. అక్కడ తీసిన ఫోటోలని పోటీలకి పంపి,  తండ్రి అవార్డు అందుకునేలా చేశాడు. దీంతో పిల్లలు కూడా తమ పేరెంట్స్ కి కోరికలుంటాయని గుర్తించాలని చెప్పి, ప్రయోజకుడైన రామ్ ని తండ్రి ఆలింగనం చేసుకున్నాడు. 

స్క్రీన్ ప్లే సంగతులు 
         ఈ కథకి మార్కెట్ యాస్పెక్ట్ వుందా అంటే వుంది. మంచి మార్కెట్ యాస్పెక్ట్  వుంది. అయితే కథని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోకుండా, పాత మూస ధోరణిలో సంసార కథగా మార్చేయడంతో మార్కెట్ యాస్పెక్ట్ గల్లంతై పోయింది. ఈ కథ సెంట్రల్ ఐడియా ఏమిటంటే,  గొప్ప ఫోటోగ్రాఫర్ కావాలన్న తండ్రి కలని కొడుకు నెరవేర్చడం. వాడవాడలా సెల్ ఫోన్లతో ఫోటోలు తీసే అదృష్టానికి  నోచుకుంటున్న ప్రజలందర్నీ ఆకట్టుకునే ఫోటోగ్రఫీ సెంట్రల్ ఐడియా, ప్రధానాకర్షణ కావాలి ఈ సినిమాకి నిజానికి. కాబట్టి కాన్సెప్ట్ పరంగా మార్కెట్ యాస్పెక్ట్ పుష్కలంగా వుంది. ఇవ్వాళ్టి  మార్కెట్  యాస్పెక్ట్ లో ప్రధానంగా సినిమా ప్రేక్షకులు యువతే. ఐతే ఇందులో అమ్మాయిల్లేరు. ఎంతో క్రేజ్ వున్న హీరోల  సినిమాలకి తప్ప అమ్మాయిలు రావడం లేదు. వాళ్ళతో ఓపెనింగ్స్ ఉండడంలేదు. కాబట్టి జనరల్ గా ‘యువతలో సగం’ సినిమా ప్రేక్షకులుగా లేరు. చిరంజీవి అల్లుడు హీరో అయ్యాడని యువతలో భాగమైన  అమ్మాయిలు కాదుకదా,  అబ్బాయిలు కూడా కానరావడం లేదంటే,  దీని మార్కెట్ యాస్పెక్ట్ ఏ పాటిదో అర్ధం జేసుకోవచ్చు. 

          యువతని దృష్టిలో పెట్టుకుని ఇవాళ్టి మార్కెట్ యాస్పెక్ట్  రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్, అంతే. ఇంకే కబుర్లు చెబుతూ సినిమాలు తీసినా ఇంతే సంగతులు. తెర మీద అమ్మాయి కనపడాలి, లేదా పుష్కలంగా ధనార్జన కనపడాలి. వీటితో ముడిపడి వుంటే ఏ కథైనా ఓకే. ఫోటోగ్రఫీ కథకి ఇది వర్కౌట్ అవుతుంది. 

           క్రియేటివ్ యాస్పెక్ట్ కొస్తే,  ఇంత మంచి మార్కెట్  యాస్పెక్ట్ వున్న సెంట్రల్ ఐడియాతో సమకాలీన కథని వూహించలేక, పురాతన  కుటుంబ కథని అల్లేశారు. ఎప్పుడు తీసినా కుటుంబ కథలు అవే ముప్ఫై ఏళ్ల నాటి కథల్లాగే వుండాలన్న పద్ధతిలో ఇంకా తీస్తున్నారు. ఇలాటి కుటుంబ  సినిమాలు  ఎప్పుడో టీవీ సీరియల్స్ దెబ్బకి అయిపులేకుండా పోయాయి. 

          స్ట్రక్చర్ కొస్తే, క్రియేటివ్ స్కూలు కన్పిస్తుంది. ఇందువల్ల కథకి, పాత్రలకి ఒక చట్రం కన్పించదు. స్ట్రక్చర్ స్కూలు స్క్రీన్ ప్లే కున్నట్టు ప్లాట్ పాయింట్స్ వుండవు. కథని ఒకే పెద్ద ఫ్లాష్ బ్యాక్ లో చెప్పాలన్న సృజనాత్మకత వరకూ బాగానే వుంది. కానీ ఆ ఫ్లాష్ బ్యాకులో  విషయాన్ని సర్దుబాటు చేసిన తీరు దిశా దిక్కూ లేకుండా వుంది. 

          తండ్రీ కొడుకులు బైక్ మీద పోతూండగా వాళ్ళ గురించి ఒక వాయిసోవర్ లో చెబుతూ ఫ్లాష్ బ్యాక్  ప్రారంభమవుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ఉస్సూరంటూ చిన్నప్పటి కథ చెప్పడం దగ్గర్నుంచీ ఇంకా అదే పాత పద్ధతిలో స్పూన్ ఫీడింగ్ చేసస్తూ ప్రారంభమవుతుంది. పుట్టిన కొడుకు ఇంజనీరింగ్ పూర్తి  చేసే వరకూ ఇది కొనసాగుతుంది. ఇందులో తండ్రీ కొడుకుల అనుబంధం ఏమిటంటే, కొడుకు భవిష్యత్తు గురించి తండ్రి కష్టపడడం. అలాటి కొడుకు తీరా  ఉద్యోగం దొరక్క ఆవారాగా కామెడీలు చేస్తూ తిరగడం ప్రారంభిస్తాడు. ఎదురింట్లో దిగిన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈవెంట్ మేనేజి మెంట్ పెట్టి, ఒక పొరపాటు జరిగి పోలీస్ స్టేషన్లో పడతాడు. తండ్రి విడిపించుకొస్తూ గుండె పోటుకి గురై హాస్పిటల్లో పడతాడు. ఇదీ ఫస్టాఫ్ కథ. 

          స్క్రీన్ ప్లే పరంగా ఇది బిగినింగ్ విభాగమనుకుంటే,  దీని ముగింపు ఇంటర్వెల్లో గుండె పోటు సీనుతో వచ్చిందన్న మాట. అంటే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడాలన్న మాట. కానీ ఏర్పడదు. ప్లాట్ పాయింట్ వన్ అంటే  అక్కడెదురైన సమస్యతో హీరోకి ఒక లక్ష్యం ఏర్పడాలి. కానీ ఇంటర్వెల్ లో కూడా హీరో ఏం చేస్తాడో, కథేమిటో తేలదు. 

          ఇంటర్వెల్ తర్వాత హాస్పిటల్ సీను వస్తుంది. తండ్రి హాస్పిటల్లో వుండగా, ఆయన మిత్రుడు హీరోకి తండ్రి గురించిన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఇందులో తండ్రికి గొప్ప ఫోటోగ్రాఫర్ కావాలని కోరిక. నేషనల్ జాగ్రఫిక్ లో ఫోటోలు కూడా ఎంపికై జాబ్  వస్తుంది. ఉన్న ఉద్యోగం వదిలేసి వెళ్ళడానికి సిద్ధం కూడా అవుతాడు. అంతలో బైక్ మీద కొడుకుని తీసుకుని భార్యతో పోతూ యాక్సిడెంట్ చేస్తాడు. ప్రాణాపాయ స్థితిలో  వున్న కొడుకు వైద్యం కోసమే లక్షలు అప్పు చేయాల్సివస్తుంది. దీంతో ఫోటోగ్రఫీ కలలు  కల్లలవుతాయి. సాధారణ ఉద్యోగిగానే ఉక్కు ఫ్యాక్టరీలో ఉండిపోతాడు. 

          అంటే,  చిన్నప్పుడు తన ప్రాణాలు కాపాడడానికి తండ్రి చేసుకున్న త్యాగం గురించి తెలుసుకున్న హీరో, ఇప్పటికైనా తండ్రికి కుటుంబ బాధ్యతలు వదిలించి,  ఫోటోగ్రఫీ కలని నెరవేర్చేందుకు ఒక లక్ష్యంతో కంకణ బద్ధుడవుతాడని ఆశిస్తాం. ఇదేం జరగదు.

          మళ్ళీ ఈవెంట్ మేనేజి మెంట్ లో పడతాడు. దీనికోసం హీరోయిన్ తో ఆమె బాస్ ని పడతాడు. ఆ బాస్ ఇంట్లో కొడుకుతో వున్న సమస్యని కిడ్నాప్ డ్రామా అడి పరిష్కరిస్తాడు. దీంతో అదే బాస్ తన చిన్న కొడుక్కి హీరో చెల్లెలితో పెళ్లి జరిపించేస్తాడు. దీని తర్వాత హీరో తండ్రికి కెమెరా కొని ప్రపంచం తిప్పడం, ఆ ఫోటోలు పోటీలో గెలవడం వగైరా జరిగిపోయి ముగిసిపోతుంది కథ. 

          ప్లాట్ పాయింట్ వన్ లేకపోవడం వల్ల హీరోకి సంఘర్షణ అంటూ, తద్వారా కథ పుట్టడమంటూ జరక్కుండా పోయింది. దీంతో ప్లాట్ పాయింట్ టూ కూడా ఏర్పడక ముగింపు చప్పగా తేలిపోయింది. ఉన్న విషయంలో కూడా మలుపులు, సన్నివేశాలు అన్నీ పాత  ఎన్నో సినిమాల్లో వచ్చినవే. వాటిని టెంప్లెట్స్ గా పెట్టేసుకుని విషయాన్ని నింపేశాడు. తండ్రికి ఫోటోగ్రఫీ కల అనే సెంట్రల్ ఐడియా జోలికి అసలే వెళ్ళకుండా, పైపైన ఉత్తుత్తిగా ఆ కోరిక కొడుకు తీర్చినట్టు చూపించేసి వదిలించుకున్నాడు. 

          కొత్త హీరోతో యూత్ ని ఆకర్షించే అంశం ఒక్కటీ లేదు. కానీ సెంట్రల్ పాయింటులో గొప్ప యూత్ అప్పీల్ వుంది. తండ్రిని ఇప్పటి కాలానికి తగ్గ ఫోటోగ్రాఫర్ ని చేసేందుకు తండ్రితో కలిసి హీరో చేసే విన్యాసాలు, సాహసాలు, వీరోచిత కృత్యాలూ వగైరా ఫన్నీగా, హాస్య భరితంగా, కొత్త కథగా  చూపించాల్సింది పోయి – ఏ ప్రేక్షకులకీ పట్టని పాత సంసారాల  ఏడ్పుల  కథలో హీరోని కుదేసి కుదేలు చేసేశాడు దర్శకుడు.

పాత్రచిత్రణ  
       కొడుకు పాత్ర ఎంత బలహీనమో, తండ్రి పాత్ర అంతే బలహీనం. కొడుకు మీద పెట్టిన శ్రద్ధ కూతురి మీద ఎందుకో పెట్టడు. కొడుకు చదువు, కొడుకు బాగు, అంతవరకే. పిల్లలిద్దర్నీ సమానంగా చూసే పద్ధతే లేదు. పిచ్చి పిల్ల ఏం  చదివిందో, ఆమెతో ఎప్పుడూ పెళ్లి చేసి పంపించెయ్యాలన్న గోలే. ఆమెని కూడా బాగా చదివించి వుంటే కొడుకుని తలదన్నేసి పోయేది.

          కొడుకు ఏదో తప్పు చేశాడని పోలీస్ స్టేషన్లో విడిపించుకొస్తాడు. కోపంతో వుంటాడు. నిజానికి అది తప్పేం కాదు. ఈవెంట్ మేనేజి మెంట్ లో తెలియక జరిగిన ఒక పొరపాటువల్ల ఒకడు గాయపడ్డాడు, అంతే. ఇక నుంచి ఇలా జరక్కుండా చూసుకోమంటే సరిపోతుంది. కానీ కొడుకేదో ఘోర నేరం చేసి పోలీస్ స్టేషన్ కెక్కించాడన్న ద్వేషం ఎందుకో అర్ధం గాదు. ఈ కోపంతో కొడుకుని బైక్ ఎక్కించుకుని పోతున్న వాడల్లా గుండె పోటుతో పడిపోతాడు. అప్పుడు కొడుకు ఒక అంబులెన్స్ ని ఆపుతాడు. ఆ అంబులెన్స్ లో ఇదివరకు నాటకమాడి నేస్తాలతో ఉచితంగా ప్రయాణం చేశాడు. దీని మీద ఆ డ్రైవర్ ఫైర్ అయి, ఇప్పుడు కూడా తండ్రితో నాటక కమాడుతున్నావని తిట్టి ఎక్కించుకోకుండా వెళ్ళిపోతాడు. దీంతో తండ్రికి కొడుకు మీద ఇంకింత మండిపోతుంది అంబులెన్స్ తో హీరో ఆడిన నాటకానికి. కానీ అదంతా గతం. ఇప్పుడు బాగుపడి ఈవెంట్ మేనేజి మెంట్ పెట్టుకున్నాడుగా?  ఇంకెందుకు అసహ్యం?

           ఇక్కడ గమనించాల్సింది ఇంకోటేమిటంటే, ఈ తండ్రి చిన్నప్పుడే కొడుకుని ఇదే బైక్ మీద ఎక్కించుకుని యాక్సిడెంట్ చేసి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాడు. ఇప్పుడు పెద్దయ్యాక కొడుకుని ఎక్కించుకుని రెండోసారీ యాక్సిడెంట్ చేశాడు. కాకపోతే తనకి గుండెపోటు వచ్చి ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. ఇది చెల్లుకి చెల్లు కదా? ఇంకేమిటి? ఇంకా చెప్పుకోవడానికి, ఇంత సినిమా తీయడానికీ కథ వుంటుందా? తీయాల్సిన అసలు కథ తీయకుండా ఏదో తీస్తే ఇంతకన్నా ఏం జరుగుతుంది?

 సికిందర్  


(తెలుగు రాజ్యం డాట్ కాం సౌజన్యంతో)

         
         


10, జులై 2018, మంగళవారం

661 : స్క్రీన్ ప్లే సంగతులు - 2


        స్టాఫ్ ప్రధాన కథ -1 : ఆత్మ కథ రాయించుకున్న సంజు ఆ పుస్తకంలో మహాత్మా గాంధీతో తనని పోలుస్తూ రాసినందుకు రచయితని హేళన చేసి పంపించేస్తాడు. అంతలో సుప్రీం కోర్టులో తీర్పు వెలువడుతుంది. 2006 లో టాడా కోర్టు సంజుకి విధించిన ఐదేళ్ళ కారాగార శిక్ష ని సుప్రీంకోర్టు ఖరారు చేస్తూ, నెల రోజుల్లోగా లొంగిపోవాలని ఉత్తర్వు లిస్తుంది. దీంతో సంజు నీరుగారి పోతాడు. ఈ వార్త టీవీలో వస్తూంటే పిల్లలు చూస్తారు. దీంతో జైలుకెళ్ళే తన వల్ల పిల్లల జీవితాలు  పాడవకూడదని ఆత్మహత్య చేసుకోబోతాడు. భార్య మాన్యత అడ్డుకుని పిల్లలు ఎదుర్కొనే సమస్య ఇలా తీరదని, వేరే రచయిత చేత ఆత్మ కథ రాయించి నిజాలు వెల్లడించాల్సిందేనని అంటుంది. దీనికి లండన్ రచయిత్రి విన్నీ డయాజ్ ని పిలిపిస్తారు.ఆమె సంజు జీవితం చూసి రాయనని అనేస్తుంది. కానీ రాస్తున్నట్టు పేపర్లో వార్త వస్తుంది. అది బిల్డర్ మిస్త్రీ చూసి, విన్నీని కలుసుకుంటాడు. సంజు ఆత్మకథ రాయవద్దంటూ హెచ్చరిస్తాడు. ఇతనిలా ఎందుకంటున్నాడని విన్నీ సంజుని అడిగితే, ఒకప్పటి తన మిత్రుడు మిస్త్రీ తో తన కథ చెప్పడం మొదలెడతాడు సంజు.

          పాయింట్ : మొదటిసారి రాయించిన ఆత్మ కథతో స్క్రీన్ ప్లే ప్రారంభం బోలుగా అన్పిస్తుంది. ఆ పూట సుప్రీం కోర్టుతీర్పు వెలువడబోతోంది. అలాంటప్పుడు దేశమంతా దీని మీదే దృష్టిపెడుతుంది సహజంగా. ఛానెళ్ళు కూడా సుప్రీం కోర్టు దగ్గర మకాం వేసి వుంటాయి. కనుక ఒకవైపు తన జీవితాన్ని మార్చేసే అంతిమ తీర్పు వెలువడుతూంటే, సంజు ప్రాణాలుగ్గట్టుకుని టీవీకి అతుక్కుపోవాలి నిజానికి. ఇలా కాక,  రాయించిన ఆత్మకథే దో పట్టుకుని కామెడీతో కాలక్షేపం చేయడం కాదు. అలా గనుక ఆత్మకథ  రాయించాలనుకుంటే, తీర్పు వచ్చేదాకా ఆగి, తీర్పుని బట్టి రాయించుకోవాలి. సినిమాలో ఈ సీన్ ఎలా వుంటుందంటే, ఆ పూట అంత ప్రధాన తీర్పు, అదీ సుప్రీం కోర్టు నుంచి  రాబోతోందని పాత్రలు వేటికీ తెలియనట్టే వుంటుంది! 

     స్క్రీన్ ప్లే ఆదిలోనే ఇంత పెద్ద గోతి. ఇలా పేలవమైన ప్రారంభంతో కాకుండా,  సుప్రీం కోర్టు తీర్పు వెలువడుతున్న సందర్భంగా హడావిడీ, ఆందోళనలతో ప్రారంభించి వుంటే టేకాఫ్ బలంగా, సస్పెన్స్ తో  వుండేది. ఆ తీర్పు పిల్లలు వినడం, సంజు ఖిన్నుడై ఆత్మ హత్య చేసుకోబోవడం, అప్పుడు భార్య ఆపి – ఆత్మకథ రాయించడాని ప్రేరేపించడం జరిగివుంటే అర్ధవంతంగా వుండేది.

       బయోపిక్స్ ని పాత్ర స్వగతంతో ప్రారంభించడం కాలం చెల్లిపోయిన బలహీన కథనం. ‘ఇది నా జీవితం...నేనిలా వున్నాను...నాకేం జరిగిందంటే...’ అనేలాంటి స్వగతంతో ‘సంజు’ ని ప్రారంభించడం ఇలాటి కథనమే. బయోపిక్స్ ప్రారంభం కూడా సంఘటనతోనే వుండాలి. ఇక్కడ సుప్రీం కోర్టు తీర్పు ఒక  బలమైన సంఘటన. ఈ బలమైన సంఘటనతో ప్రారంభించి వుంటే, అందుకోవడం అందుకోవడమే కథనం మంచి డైనమిక్స్ తో – విజువల్ నేరేషన్ తో ఆసక్తికరంగా వుండేది. ఇప్పటికీ చాలా మంది అర్ధం జేసుకోనిదేమిటంటే, సినిమా మాధ్యమానికి సీనంటే, కథనమంటే, సంఘటనలే నని! సంఘటనల ద్వారా కథ చెప్పాలని! 

          ఇక్కడ ఇంకొకటి చెప్పుకోక తప్పదు. ఎప్పట్నించో సినిమాల్లో అలవాటైపోయిన ఒక ఫార్ములా చిత్రణ ఇంకా ఇక్కడ కూడా దర్శనమిస్తుంది : ఆత్మకథ రాసిన రచయిత త్రిపాఠీని కామెడీ పేరుతో నానా మాటలని,  అతడి బూటు తోనే అతణ్ణి తరిమితరిమి కొట్టబోవడం చీప్  టేస్టే. అదే ఆ రచయిత ఏ ఖాన్ సాబో అయితే, మర్యాదగా కూర్చోబెట్టుకుని, అలా కాదు ఇలాగని చర్చ చేస్తారు.  అప్పుడా ఖాన్ సాబు, తన పాండిత్యంతో అందరినోళ్ళూ మూయించేసి వహ్వా లందుకుంటాడు. పాన్ ఉమ్మేసి పోతాడు. ఇదికూడా హిందీ సినిమాల ఫార్ములానే. త్రిపాఠీల్ని తక్కువ చేయడం, ఖాన్ సాబుల్ని ఎక్కువ చేయడం. 

          సరే, ఇదలా వుంచితే, ఆత్మ కథ రాయడానికి విన్నీ అనే లండన్ రచయిత్రి వస్తుంది. ఆమె - నీ భార్యతో కాక ఇంకెంత మందితో పడుకున్నావని నేరుగా భార్య ముందే అడిగేస్తుంది. భార్య కళ్ళు తిప్పుతూ భర్త కేసి చూస్తుంది. సంజు లెక్కలేసుకుని 308 మంది అంటాడు. భార్య ఇంకో క్లోజప్ ఇస్తుంది- అయ్యో అలాగా అన్నట్టు. ఇక విన్నీ మెప్పుదలగా చిన్న స్మైల్ ఇస్తుంది. అతను దాచకుండా చెప్పేసినందుకు మెచ్చుకుని, ఇక ఇతను నిజాలే చెప్తాడనీ, తను ఆత్మకథ రాయవచ్చనీ నిర్ధారణ చేసుకుందన్న మాట. అంతేగానీ, లైంగికంగా అంత మంది అమ్మాయిల్ని వల్లో వేసుకున్న అతడి క్యారెక్టర్ పట్ల భార్యకి గానీ, ఆ రచయిత్రికి గానీ ఏ అభ్యంతరమూ లేదన్న మాట. ఈ సీన్లో భార్య పాత్ర నిజజీవిత పాత్ర. ఆమెకున్న పరిస్థితులేవో  మనకి తెలీదు. కానీ రచయిత్రి పాత్ర కల్పిత పాత్ర. కల్పిత పాత్రని కూడా బలహీనంగా  చూపించడమెందుకు? 

          ఇలా ఫస్టాఫ్ లో ప్రధాన కథ మొదటి భాగాన్ని పరిచయం చేస్తూ, ఫ్లాష్ బ్యాక్ ని ప్రేరేపించే  సంజు ఫ్రెండ్ మిస్త్రీ ద్వారా,  ఫ్లాష్ బ్యాక్ కి తెరతీశారు.

          ఈ ప్రధాన కథ మొదటి భాగంలో సీన్లలో కథ అల్లిక గురించి తెలుసుకోవాలి. తెలుగు సినిమాల్లో ఇప్పుడు సీన్లలో కథ అల్లిక వుండడం లేదు. సీన్లలో కథ కనపడదు. విడి విడి పది సీన్లు కలిపి అతుకులేస్తే – అప్పుడుగానీ – ఎప్పుడో గానీ -  అవన్నీ కలిపి చూసుకుంటే గానీ కనపడదు కథ! 

          ఒకప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాలు చూసి, ‘భలేగా కుట్టాడ్రా’ అని చెప్పుకునే వాళ్ళట. కుట్టడమేంట్రా అని ఆలోచించి, వాళ్ళు ఎడిటింగ్ గురించి అలా మాట్లాడుకుంటున్నారని సినిమా వాళ్ళు అనుకునే వాళ్లట. ఇవ్వాళ ఎడిటింగ్ కాదు, దేనిగురించీ మాట్లాడుకునే పరిజ్ఞానం లేదు - స్టార్స్  చేసే కామెడీల గురించి తప్ప.

          ఇప్పుడా కుట్టుపని కాస్తా సీన్లు రాసేప్పుడు
చేస్తున్నారు. విషయం  ఒక సీనులో ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనకి దూరంగా, పది సీన్లు రాసుకుంటే గానీ కథకుడికి అంతుపట్టని కథలు తయారవుతున్నాయి. 

        పైన చెప్పుకున్న ‘సంజు’ లో ప్రారంభ దృశ్యాన్నే తీసుకుంటే,  తెలుగులో ఇలా ముక్కలు ముక్కలు చేసి కలిపి కుడతారేమో :  ‘సంజు’ స్వగతం - కట్. బాత్రూం  సంజు ఆత్మకథ పుస్తకం చదవడం -  కట్, రచయితతో కామెడీ – కట్.  సుప్రీం కోర్టు తీర్పు – కట్. పిల్లల పరిస్థితి – కట్. ఇలా దేనికది విడివిడి  సీన్లుగా తప్ప వూహించలేరు. వీటిన్నిటినీ  కలిపి కుట్లేసేస్తే అది రచనై పోతుంది. సినిమా కుంటి నడక నడుస్తోందన్న జ్ఞానం అసలే వుండదు.  

           ‘సంజు’ సీన్లలో కథని అల్లడం ఎలా వుంటుందంటే, ఒకే సీన్లో కథకి అవసరమున్న రెండు లేదా మూడు అంశాలు చెప్పేసి, ఎక్కడి కక్కడ కథని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవడం. (ఇదే పద్ధతి కొరియన్ ‘ది క్లాసిక్’ లో  కూడా వుంటుంది)

          స్వగతం కాడ్నించీ పిల్లలు టీవీలో చూసే దాకా ‘సంజు’ లో ఒకే సమయంలో జరిగే ఒకటే సీను అదంతా! పై ఐదు అంశాలూ ఒకే సీనులో అల్లేసి,  ఇక ఇంకో ఆత్మకథా గ్రంథ రచనకి శ్రీకారం చుట్టేశారు. ఒక్క సీనుతో కథ ఎంత ముందు కెళ్ళిపోయింది!  ఇలాటి సీన్లే మరి కొన్ని వున్నాయి.

***
      ఫ్లాష్ బ్యాక్ -1: సంజుని హీరోగా పరిచయం చేస్తూ ‘రాకీ’  తీస్తూంటాడు తండ్రి సునీల్ దత్. పాట తీస్తూంటే  పక్క నుంచి సంజుకి సిగరెట్ అందిస్తూంటాడు ఫ్రెండ్ మిస్త్రీ. సునీల్ దత్ వాసన పసిగట్టి మందలిస్తాడు – దురలవాట్లని కెమెరా క్షమించదంటాడు. ఇలా తండ్రి నల్గురి ముందు చిన్నబుచ్చినందుకు సంజు నొచ్చుకుంటే, ఆ బాధ తీర్చడానికి బార్ కి తీసుకుపోతాడు మిస్త్రీ. 

          అక్కడ మద్యం, మాదక ద్రవ్యం రుచి చూపిస్తాడు. దీంతో క్రమంగా డ్రగ్స్ బానిసైపోతాడు సంజు. ఒక పక్క తల్లి నర్గీస్ క్యాన్సర్ తో వుంటుంది. మరో పక్క ప్రేమించిన రూబీతో సమస్య వుంటుంది. తల్లిని తీసుకుని చికిత్స కోసం  అమెరికా వెళ్తారు. అక్కడుండే ఇంకో ఫ్రెండ్ కమలేష్ తో కలిసి తిరిగి,  వద్దన్నా డ్రగ్స్ సేవిస్తూంటాడు సంజు. తల్లికి నయమై తీసుకొచ్చేస్తారు. వచ్చాక చూస్తే, రూబీకి  వేరే సంబంధం నిశ్చయం చేస్తాడు ఆమె తండ్రి. తట్టుకోలేక కమలేష్ ని పిలిపించుకుంటాడు సంజు.  ఇంతలో రూబీ తండ్రి చనిపోతాడు. ఇక ఎలాగో రూబీ సంజుని చేసుకునేలా  ఒప్పిస్తాడు కమలేష్.  తీరా ఆమె కలవడానికొచ్చే సరికి డ్రగ్స్ కొడుతూంటాడు సంజు. ఆమె దూషించి వెళ్ళిపోతుంది. దీంతో సంజు పరిస్థితి దారుణంగా తయారవుతుంది. 

          ఇక చేసేది లేక, సునీల్ దత్ కి అంతా చెప్పేసి, సంజుని కాపాడుడుకోమని ప్రాధేయప డతాడు కమలేష్. అప్పుడు  సంజు డ్రగ్స్ మరిగాడన్న సంగతి కొత్తగా తెలుస్తుంది సునీల్ దత్ కి.

          పాయింట్ :  ఇక్కడ కూడా పాట షూటింగు జరిగే మొదటి సీనులోనే, టైం వేస్ట్ చేయకుండా, డ్రగ్స్ తో వుండగల ఈ ఫస్టాఫ్ ఎపిసోడ్ పాయింటంతా చెప్పేశారు. ఈ ఒక్క సీనులో కథని ముందుకి పరుగెత్తించే మూడు విషయాలు చెప్పేశారు : హీరోగా సంజు పరిచయ సినిమా షూటింగు, అందులో సిగరెట్ అందించే ఫ్రెండ్ మిస్త్రీ వున్నాడనీ,  అది చూసి తండ్రి  సునీల్ దత్ సంజుని మందలించడంతో  ఇద్దరి మధ్యా పాయింటు ఎస్టాబ్లిష్ అయిందనీ. ఒక్క సీనులో చాలా కథ చెప్పేశారు. సీను అల్లిక అంటే ఇదీ. పైగా ఫ్లాష్ బ్యాక్ లో ఈ మొదటి సీనులోనే ఈ ఎపిసోడ్ కథకి ముడి కూడా వేసేశారు. ఏమిటది? తండ్రి సిగరెట్లు తాగ వద్దంటున్నాడు. సంజు ఇప్పుడేం చేస్తాడు? ఇది ఆసక్తి రేపే ప్రశ్న. కథపట్ల కుతూహలం రేకెత్తించే పాయింటు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో కథని ముడేయడం అంటే ఏమిటో తెలియడం లేదు!  చైతన్యవంతంగా కథనం ఎలా నడపాలో తెలీదు. 

          దీన్తర్వాత,  డైనమిక్స్ ఎలా వున్నాయంటే, తండ్రి వద్దన్న పనే సంజు చేస్తున్నాడు. అంటే రెండు పరస్పర విరుద్ధ, సంఘర్షించుకునే పాత్రలు ఏర్పాటవుతున్నాయన్న మాట. కథనంలో ఇంతలోనే ఎంత  ట్విస్టు!  పైగా కథని ఇంకో లెవెల్ పైకి తీసి కెళ్తూ పెగ్గు కూడా కొట్టేశాడు సంజు. అప్పుడే ఇంకో లెవెల్ కి కూడా తీసి కెళ్తూ,  డ్రగ్స్ కి కూడా బోణీ కొట్టేస్తూ కథనంలో కంగారు పుట్టించాడు. అదంతా పది సీన్లు కాదు! ఒకేవొక్క  బార్ సీన్లో కథని ఇంత ముందుకు తీసికెళ్తూ అల్లేశారు.     
  
          వెనుకడ్డ జాతి ఏమంటుందంటే -  ఠాట్, ఒక్క సీన్లోనే సిగరెట్, మద్యం,  డ్రగ్స్ దాకా వెళ్లి పోతాడా? ఆడియెన్స్ నవ్వుతారు. సిగరెట్ తో ఆపుదాం. హీరోయిన్ తో లవ్ చూపుదాం. లవ్ తర్వాత మద్యం వేద్దాం. హీరోయిన్ తో పాట తర్వాత డ్రగ్స్ వేద్దాం... ఇలా స్టెప్ బై స్టెప్ వేస్తే ఆడియెన్స్ నవ్వరు – అని. ఇలా వెనకబడ్డ జాతి చేసే ఆధునిక సినిమా నిర్ణయాలకి,  అనాగరిక ప్రేక్షకుల్ని వెతికి వెతికి థియేటర్లకి తోలుకు రావాలి. 

          ఈ బార్ సీను తర్వాత ఏం చేయాలి? ఈ ఫ్లాష్ బ్యాక్ - 1 లో ప్రారంభమైన ఈ కథనాన్ని చూస్తూంటే,  ఇది త్రీ యాక్ట్ స్ట్రక్చర్లో బిగినింగ్ విభాగపు బిజినెస్ అని సులభంగా అర్ధమయ్యే వుంటుంది. కాబట్టి బిగినింగ్ విభాగంలో ఇప్పుడు అర్జెంటుగా జరగాల్సిన పాత్రల పరిచయాలు ఇంకేం మిగిలున్నాయి? తల్లి వుంది, ప్రేయసి వుంది. ఐతే ఇప్పుడు తల్లితో సీను వేయాలా బార్ సీను తర్వాత? మార్కెట్ యాస్పెక్ట్ కి ముందు యూత్ అప్పీల్ కావాలి. అంటే ప్రేయసితో సీనేయాలి.
       
        ఎంత మదర్ సెంటిమెంటైనా శివాలెత్తిపోకుండా తల్లి పాత్రని కాసేపు అపుకోవాలి. సినిమా పెన్ను మొదటి ధర్మం ప్రేమకవిత్వం రాయడమే. 

          బార్ నుంచి నేరుగా అర్ధరాత్రి రూబీ ఇంటికెళ్ళి పోతాడు. ఇక్కడ రూబీ, ఆమె తల్లీ ఎదురుగా వుంటే, వాళ్ళని చూస్తూ డబుల్ మీనింగుల కామెడీ చేస్తాడు. నిజానికి వాళ్ళ వెనకాలున్న మందు బాటిల్స్ నుద్దేశించి ఈ కామెడీ. చాలా పాతకాలపు బూతు, ముతక  కామెడీ  ఇది.  ఇదంతా ఒకే  రోజు జరుగుతున్న కథగా చూపించారు. ఉదయం పాట షూటింగుతో మొదలెట్టి, రాత్రి బార్ సీను, అర్ధరాత్రి రూబీతో సీను వరకూ. గొడవ వదిలిపోయింది. లేకపోతే  కొన్ని రోజుల వారీగా జరుగుతున్నట్టు ఈ సీన్లు చూపిస్తే, ఇవి బిగినింగ్ విభాగానికి చెందాల్సిన  సీన్లు అన్పించుకోవు. తీరుబడిగా విడివిడి రోజుల కథని చూపించుకునే బిజినెస్ అంతా మిడిల్ విభాగానిది. మిడిల్ బిజినెస్ కోసం కథలో ఏర్పాటయ్యే సమస్యని అందించే బిగినింగ్ బిజినెస్ లో, సంక్షిప్తంగానే వుంటుంది స్థలకాలాల ఐక్యతతో కూడిన కథనం. 

          ఇదే పద్ధతి ఈ బిగినింగ్ బిజినెస్ తర్వాతి  సీన్లలో కూడా వుంటుంది. తెల్లారి ఫ్రెష్ గా తల్లికి క్యాన్సర్ అని చెప్పి, ఆమెని యూఎస్ కి తీసికెళ్ళాలనడం కూడా అదే సీనులో చెప్పేసి,  యూఎస్ కి మార్చేశారు కథని. యూఎస్ లో ఇంకా ఉధృతం చేశారు సంజు డ్రగ్స్ అలవాటుని. ఇక్కడే రెండో మిత్రుడు కమలేష్ ని పరిచయం చేశారు. తల్లికి నయమై తీసుకురావడం, ఇక్కడ ప్రేయసి రూబీతో చెడడం వగైరా జరుగుతాయి. కమలేష్ వచ్చి,  రూబీకి చూసిన వేరే సంబంధం అతణ్ణి బకరా చేసే సీనుకూడా చాలా పాత మూసే. రూబీతో చెడే సరికి, ఈ బిగినింగ్ బిజినెస్ పతాక స్థాయికి చేరుకుంటుంది.

          ఇక  క్షీణించిన సంజు స్థితికి చలించి తండ్రి సునీల్ దత్ కి చెప్పేస్తాడు కమలేష్. డ్రగ్స్ బారి నుంచి కాపాడుకోమంటాడు. సంజు డ్రగ్స్ బానిసని ఇప్పుడే తెలుస్తుంది సునీల్ దత్ కి. దీంతో బిగినింగ్ విభాగం పూర్తవుతుంది.
***
      ఈ బిగినింగ్ విభాగంలో డ్రగ్స్ అని తెలుపుతూ  కథా నేపథ్యపు ఏర్పాటు, తగిన పాత్రల పరిచయం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా ఏ విధంగా జరిగాయో పైన గమనించాం. సంజు గురించి కమలేష్  సునీల్ దత్ కి చెప్పేయడంతో సమస్య ఏర్పాటయింది. అంటే ప్లాట్ పాయింట్ వన్ అన్నమాట. ఎవరి మీద? సునీల్ దత్ మీద! బంతి సునీల్ దత్ కోర్టులో పడింది. సంజు కోర్టులో కాదు. ఆత్మ కథకి కథానాయకుడితనే కాబట్టి, సమస్య ఇతనే ఎదుర్కొంటాడనీ, ప్లాట్ పాయింట్ వన్ ఇతడి మీదే వుంటుందనీ ఎదురు చూడడం సహజం.

          కానీ ఇది విజేత ఆత్మ కథ కాదని ఇదివరకే చెప్పుకున్నాం. పరాజితుడి ఆత్మకథ. అంటే పాసివ్ పాత్ర. అంటే ట్రాజడీ. వీడికి స్వయంగా సమస్యల్ని అధిగమించాలని ఎందుకుంటుంది? కథానాయకుడుగా వీడు కథనెందుకు నడుపుతాడు?  కథే, లేదా ఇంకో పాత్రే వీడిని నడుపుతుంది. మీ ఖర్మంటూ కథ మీదా, ఇతర పాత్రల మీదా పడి బతికేస్తూంటాడు. 

          కాబట్టి, లక్కీగా సంజయ్ దత్ జీవితంలో సునీల్ దత్ అనే తండ్రి వుండి, ఆయన బాధ్యత తీసుకోవడంతో సంజయ్ దత్ డ్రగ్స్ కి సంబంధించి బాగుపడ్డాడు. ఇది జీవితం. సినిమాల కొచ్చేసరికి ఒక్కోసారి జీవితమెలా వుంటుందో అంతుబట్టక, వూహించి సృష్టించుకునే పాత్రలతో కొత్తదనం లేక, మూస ఫార్ములా చిత్రణలు విసుగెత్తిస్తాయి... కొడుకు వ్యసన పరుడు. తండ్రి అందుకు వ్యతిరేకి. ఇద్దరిమధ్య కొట్లాటలు. చివరి కెప్పుడో కొడుకు తానే తప్పు తెలుసుకుని, తండ్రి కాళ్ళ మీదపడి, ప్రయోజకుడన్పించుకోవడం. తండ్రి దీవించడం. ఇక్కడ తండ్రి పీకేదేం వుండదు. కొంపలంటుకుపోయాయని ఇల్లెక్కి ఒకటే కూయడం తప్ప. ఇలా పుడుతూంటాయి వూహించుకునే కథలు. 

          జీవితంలో ఇలా వుండకపోవచ్చు. సంజు – సునీల్ దత్ ల తండ్రీ కొడుకుల సంబంధమే తార్కాణం. చెడిపోయిన కొడుకు బాధ్యత తండ్రి తీసుకున్నాడు. ఇది వూహించని కథయ్యింది. అంతే అనూహ్యంగా ప్లాట్ పాయింట్ వన్ లో- అన్ని అంచనాలనీ తలకిందులు చేసేస్తూ - ఆ తండ్రే కథానాయకుడయ్యాడు. ఆయనకే సమస్యా, దాన్ని సాధించాలన్న  లక్ష్యమూ ఏర్పడ్డాయి. జీవితం కల్పనని ఇలా వెక్కిరిస్తుంది. పోవోయ్, ప్లాట్ పాయింట్ వన్ అంటే ఎప్పుడూ హీరోకేనా? ఇలాగే రాసుకుంటూ ఇంకెన్ని సార్లు తీసి విసిగిస్తావు? నీ బోడి కల్పనా నువ్వూ - అని నవ్వేస్తుంది. 

          అంటే బాగా దురలవాటు చేసుకున్నవరల్డ్మూవీసు, ఆచారంగా అతిగా అలవాటు చేసుకున్న  కొరియన్, హాలీవుడ్ మూవీసు చూస్తూనే,  చిరంజీవి- బాలకృష్ణ - నాగార్జున –వెంకటేష్ ల  పాత మూవీసు బాగా రీ పాలిషింగు చేస్తూ సినిమాలు తీస్తూనే, కాస్త అప్పుడప్పుడు జీవిత చరిత్రలు కూడా చదువుకుంటే, స్క్రీన్ ప్లేల్లో అనూహ్య కోణాలు ఇలా బయటపడే అవకాశాలుంటాయన్న మాట! 

        మొత్తంగా ‘సంజు’ ఒక గాథే అయితే, ఈ గాథలో ఏర్పడ్డ రెండు జీవిత ఘట్టాలు (డ్రగ్స్, గన్స్) కథలు కావడం ఇంకో ప్రయోగం. ఈ ప్రయోగం కావాలని చేయలేదు. జీవితమే తెచ్చి పడేసింది. కొత్తగా కమర్షియల్ సినిమాకి కుదిరిన జీవితం. 

          ఎక్కడ చూసినా గాథలో కథలుండవు. గాథే వుంటుంది. కానీ ఇక్కడ గాథ అనేది ప్రధాన కథ వరకే. ఇందులో ఇమిడి వున్న రెండు ఫ్లాష్ బ్యాకులూ కథలే. ఇందుకే ఇవి స్ట్రక్చర్ లో వున్నాయి. ఈ రెండు ఫ్లాష్ బ్యాకులూ గాథలుగానే తీయడానికి జీవితం ఒప్పుకోకపోవచ్చు.  జీవితంలో సునీల్ దత్ అనే లక్ష్యంతో కూడిన పాత్ర వుంది కాబట్టి - ఇవి కథలు కావడం అనివార్యం. అంటే బయోపిక్స్ కే ఇలా కుదురుతుందా అని కాదు. ఫిక్షన్ కి కూడా కుదరవచ్చని ఈ బయోపిక్ డిజైన్ చెప్తోంది. వూరికే గాథలు తీసి చేతులు కాల్చుకునే కన్నా, గాథలో కథల్ని సృష్టించే చాతుర్యముంటే కమర్షియల్ సినిమాలకి కొత్త ముఖం ఏర్పడుతుంది. అయితే ముందుగా కథకీ,  గాథకీ తేడా తెలియాలి.

          సాంప్రదాయంగా, రొటీన్ గా,  హీరో మీదే ప్లాట్ పాయింట్ వన్ వుంటుందిలే అన్పింపజేస్తూ తీసికెళ్ళి తీసికెళ్ళి, సీన్ రివర్సల్ చేస్తూ, ఇంకో పాత్ర మీద ప్లాట్ పాయింట్ వన్ పెట్టేసి,  కథని అప్పగించేస్తే ఆ కిక్కే వేరు. ఇదీ రూల్స్ బ్రేక్ చేయడమంటే. అంతేగానీ అసలు రూల్సే తెలీకపోతే రూల్స్ బ్రేక్ చేసేదేమీ వుండదు, కచరా చేయడం తప్ప.

 సికిందర్