రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, జులై 2018, శనివారం

663 - రివ్యూ


రచన -  దర్శకత్వం: శశాంక్‌ ఖైతాన్
తారాగణం : జాహ్నవీ కపూర్ఇషాన్‌ ఖట్టర్‌‌అశుతోష్‌ రాణాఅంకిత్‌ బిష్ట్ఆదిత్య కుమార్తదితరులు
సంగీతం
: అజయ్‌-అతుల్, ఛాయాగ్రహణం : విష్ణూ  రావ్
బ్యానర్స్ 
: జీ స్టూడియోస్ధర్మ ప్రొడక్షన్స్
నిర్మాతలు
: కరణ్‌ జోహార్అపూర్వ మెహతా
విడుదల
 తేదీజులై 20, 2018
***

          వెలుగు జిలుగుల అట్టహాసపు బాలీవుడ్  ప్రాంతీయ సినిమాల్ని ఎందుకు రీమేక్ చేస్తుందో అర్ధంగాని పరిస్థితి. ప్రాంతీయ సినిమాల్లో ఏంతో కొంత అస్తిత్వాల్ని నిలుపుకుంటున్నవి మరాఠీ నుంచి వస్తున్నవే. ఇతర ప్రాంతీయ సినిమాలు వాటి అస్తిత్వాల్ని ఏనాడో వదులుకుని, బాలీవుడ్ కి నకళ్ళుగా, ఫక్తు కాలక్షేప సినిమాలుగా మారిపోయాయి. మరాఠీ నుంచి ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయిన ‘ది కోర్ట్’ ని బాలీవుడ్ గనుక రీమేక్ చేస్తే ఎలా వుండేది? అలాగే తయారైంది మరాఠీ ‘సైరాట్’ ని ఇప్పుడు ‘ధడక్’ (గుండె లయ) గా రీమేక్ చేస్తే కూడా. అణగారిన వర్గాల కథలతో సినిమాలు తీసే జోలికి బాలీవుడ్ ఎప్పుడు పోయింది గనుక? అలాటి రికార్డే లేదు. ఒకవేళ వామపక్ష భావాల ప్రకాష్ ఝా అంతటి వాడు,  రిజర్వేషన్ల సమస్య మీద ‘ఆరక్షణ్’ తీస్తే కూడా, సగం నుంచి ప్లేటు ఫిరాయించి కార్పొరేట్ కాలేజీల వేరే కథగా మార్చేసుకుని రక్షణ పొందాడు.  ఇందులో దళితుడి వేషం వేసిన నవాబు స్టార్ సైఫలీ ఖాన్,  ఆ పాత్రలో ఎబ్బెట్టుగా కన్పించి నవ్వులపాలయ్యాడు. 

          ప్పుడు దళిత – ఉన్నత కుల సంఘర్షణాత్మక ప్రేమ కథలో శ్రీదేవి వారసురాలిగా, గ్లామర్ తారగా రంగప్రవేశం చేస్తున్న జాహ్నవీ కపూర్ ది కూడా డిటో సైఫలీ ఖాన్ పరిస్థితే- కాకపోతే దళిత పాత్ర పోషించలేదు. అయినా ఈకథలో తనలాటి రూపవతికి, లావణ్యవతికి స్థానంలేదు. వేరే తియ్యటి స్వప్నలోకాల,  అభూతకల్పనల రోమాంటిక్ కథ తీసుకుని,  రాకుమారిలా యూత్ ని గిలిగింతలు పెట్టాల్సిన పని. తన మార్కెట్ అక్కడుంది, ఇక్కడ కాదు. 

     2015 లో గ్లామర్ తార అనూష్కా శర్మ నిర్మించి నటించిన, సంచలన  ‘ఎన్ హెచ్ – 10’,   హర్యానాలో ఆనర్ కిల్లింగ్స్ కి సంబంధించిన  కథ. దీంట్లో కులాల ప్రసక్తి రాలేదు. కానీ ‘సైరాట్’ అనే స్పష్టమైన కులవివక్షా కథాసంవిధానంలో బాలీవుడ్ హీరోహీరోయిన్లు కుదరరు గాక కుదరరు. దర్శకుడు శశాంక్ ఖైతాన్ కూడా న్యాయం చేయలేడు గాక చేయలేడు. సైరాట్ దర్శకుడు నాగరాజ్ పోపట్ రావ్ మంజులే దళితుడు. కాబట్టి ఆ జీవితాలు, పరిస్థితులు అనుభవ పూర్వకంగా అతడికి తెలుసు. కనుక పరిపూర్ణంగా ఆ నేపధ్యంలో మహారాష్ట్ర గ్రామీణ వాతావరణాన్ని సృష్టించగలిగాడు. అక్కడి మనుషుల్ని అచ్చంగా అలాగే చూపించాడు. మత్స్య కారుడి కొడుకుగా గ్లామర్ లేని కొత్త హీరోని చూపించాడు. స్థానిక రాజకీయ నాయకుడి కుమార్తెగా అంతగా గ్లామర్ లేని కొత్త హీరోయిన్ ని చూపించాడు. పల్లెటూరి మనుషులు ఎలావుంటారో అలాగే ఏ షోకులు చేయకుండా చిత్రించాడు. అదొక వాస్తవిక కథాచిత్రం. ఇదే బాలీవుడ్ లో రాజ్ కపూర్ ‘బాబీ’  తీస్తే, మత్స్య కారుడుగా క్రిస్టియన్ పాత్రని చూపించి,  అందులో ప్రేమ్ నాథ్ ని నటింప జేశాడు. హీరోయిన్ గా పరిచయమైన, బికినీలో కవ్వించిన డింపుల్ కపాడియా అతడి కూతురు. అదంతా బాలీవుడ్ గ్లామరస్ రిచ్ రోమాంటిక్ డ్రామా వ్యవహారం. ఇక్కడ కుల ప్రసక్తి వుండదు. రెగ్యులర్ బాలీవుడ్ ధనిక పేదా తేడాలే వుంటాయి. 

          ఇలాటి  వ్యవహారమే ‘ధడక్’ ది కూడా.  జైపూర్ లో రిచ్ రాజవంశ కుటుంబం, అందులో ఖరీదైన హీరోయిన్, ఇంకో  పక్క హోటల్ నడుపుకునే వాడి సాధారణ కొడుకు హీరో. కులాల ప్రస్తావనని కన్వీనియెంట్ గా దాటవేస్తూ- ధనిక - పేద అలవాటయిన, బాక్సాఫీసుకి సేఫ్ గా ఫీలయ్యే, రెగ్యులర్ బాలీవుడ్ ఫార్ములా ప్రేమ కథగా ముస్తాబు చేశారు. ‘సైరాట్’  లో కన్పించే పచ్చి రాజకీయ, సాంఘిక పెత్తనాల విత్తనాలు నాటడానికి బాగా భయపడ్డారు. 

          పార్థవి (జాహ్నవి)  జైపూర్ రాజరికపు వంశంలో గారాల కూతురు. జైపూర్లోనే హోటల్ నడుపుకునే వాడి కొడుకు మధుకర్ (
ఇషాన్ఖట్టర్‌‌). ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇది పార్థవి తండ్రికి తెలిసిపోయి ఇద్దర్నీ విడదీసి,  మధుకర్ ని పోలీసుల చేత కొట్టిస్తాడు.  తప్పించుకుని ఇద్దరూ కోల్ కత పారిపోతారు. అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వుంటారు. చీటికీ మాటికీ గొడవలు కూడా మొదలవుతాయి. పార్థవి ఇంటికి వెళ్లి పోడానికి కూడా సిద్ధపడుతుంది. తర్వాత మనసు మార్చుకుంటుంది. పెళ్ళిచేసుకుంటారు. కొడుకుని కంటారు. అప్పుడు జరుగుతుంది అనుకోని సంఘటన...

      ఇలా ఈ కథలో ఒరిజినల్లో వున్న చాలా సీన్లు తొలగించారు. ఒరిజినల్ రెండు గంటల 45 నిమిషాలుంటే, రీమేక్ ని రెండు గంటలకి కుదించారు. ఒరిజినల్ కి ప్రాణమైన కుల నేపధ్య వాతావరణం, దాని తాలూకు సమస్యలూ పూర్తిగా తొలగించేశారు. దీంతో సరైన రెగ్యులర్ ప్రేమ కథైనా కాలేక, సామాజిక రుగ్మతల్ని కడిగేసే వాస్తవిక కథా కాలేక రెంటికి చెడ్డ రేవడి అయింది. 

          మరొక పెద్ద తప్పిద మేమిటంటే, ముగింపుని మార్చెయ్యడం! జాహ్నవి పాత్రని అంత ట్రాజడీతో ముగించలేక, మొదటి సినిమా కాబట్టి ఆమెకి మినహాయింపు నిచ్చి, ప్రేక్షకుల్ని సంతోష పెట్టాలనుకున్నట్టుంది- దీంతో మొత్తం ‘సైరాటే’ నే  తీసి అవతలకి గిరవాటేసినట్టయింది. ‘సైరాట్’ ముగింపు కోపం తెప్పిస్తూ ప్రచండ బలంగా వుంటే, ‘ధడక్’ అయ్యో పాపమని తేలిపోతుంది.

          స్టార్లతో అట్టహాసపు గ్లామర్ ప్రేమ సినిమాలతో హంగామా చేసే నిర్మాత కరణ్ జోహార్,  తనవి కాని చెప్పుల్లో కాళ్ళు దూర్చి, ఛీఛీ అని బూట్లు వెతుక్కున్నట్టుంది. ప్రాంతీయ చెప్పుల కథలు ఏమర్ధమవుతాయి బాలీవుడ్ కి...

సికిందర్
         


Friends! Back to business.

19, జులై 2018, గురువారం

662- స్క్రీన్ ప్లే సంగతులు



    హీరోలకు ఎంత వారసత్వపు  నేపధ్య బలమున్నా, అదే వారసత్వపు నిర్మాణ శైలుల్లో సినిమాల్ని కొనసాగించలేరు. కాలాన్ని బట్టి మారాలి. రాజ్ కపూర్ తన కుమారుడు  రిషీ కపూర్ ని హీరోగా పరిచయం చేస్తూ తన కాలం నాటి కథా కథనాలతో, పాత్రలతో ‘బాబీ’ తీయలేదు. కాలానికి తగ్గ ట్రెండ్ సెట్టర్ ‘బాబీ’ ని తీసి చరిత్ర సృష్టించాడు. కొత్తగా పరిచయమయ్యే హీరోలు యువతని ఉర్రూతలూగిస్తూ రంగప్రవేశం చేయాల్సిందే. కానీ మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, ఈ తరం యువకుడు, తన మామ గారు ఎప్పుడో నటించిన లాంటి, ఇప్పుడు కాలం చెల్లిన పాత వ్యవహారంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఎవర్ని ఆకట్టుకో గలిగాడు? ఎవర్నీ లేదు!      
 
         
పురాతనాన్ని  రీసైక్లింగ్ చేసిన వ్యవహారంతో  కొత్త దర్శకుడు కూడా దెబ్బతినిపోయాడు. ఏడాదికి 70 మంది కొత్త దర్శకులు వస్తూంటే, ఒకరో ఇద్దరో తప్ప,  అందరూ అట్టర్ ఫ్లాపై తిరిగి వెళ్ళిపోతున్నసాంప్రదాయాన్ని ఈ కొత్త దర్శకుడు కూడా తుచ తప్పకుండా పాటించాడు. కొత్త దర్శకులు ఎందుకు ఫ్లాపవుతున్నారో విశ్లేషించుకోకుండా,  మళ్ళీ ఇంకో  కొత్త దర్శకుడు అవే పోకడలతో అలాగే దర్శన మిస్తూంటే – ఫ్లాపుల చరిత్రకి అంతెక్కడ వుంటుంది. 

          ప్రస్తుత సినిమా సమస్యేమిటంటే, షరామామూలుగా స్క్రీన్ ప్లే భ్రష్టత్వం.  పాత కథకి తోడు స్క్రీన్ ప్లే సర్వ భ్రష్టత్వం సంపూర్ణ దివాలాకోరు తనానికి దారితీసింది. ఈ స్క్రీన్ ప్లేలో పలాయనవాదం ఎంతగా వుందంటే, కథ చెప్పడానికి దర్శకుడు ససేమిరా ఇష్టపడడం లేదు. చివరి పది నిమిషాలకి కథని పరిమితం చేసి, మిగతా గంటా యాభై  నిమిషాల కాలమంతా టైం పాస్ చేశాడు. చివరి పది నిమిషాల కథకి ఈ గంటా యాభై నిమిషాల టైం పాస్ ని చేర్చడానికి రకరకాల వంకర్లు తిప్పాడు. గమ్యానికి ఎలా చేరామన్నది కాదు, చేరామా లేదా అన్నదే ముఖ్యమనే - ఎండ్ జస్టిఫైస్ ది మీన్స్ మైండ్ సెట్ తో – సహనపరీక్షకి గురిచేసే మేకింగ్ ని రుద్దాడు.

స్థూలంగా కథ 
         ముందు స్థూలంగా కథ చెప్పుకుంటే, ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేసే శ్రీనివాసరావు కొడుకు రామ్. చిన్నప్పట్నుంచీ కొడుకుకేం కావాలన్నా సమకూరుస్తూ, కోరిన చదువుకూడా అప్పు చేసి చదివించాడు.  కానీ రామ్ కి ఉద్యోగం రావడం లేదు. దీంతో నేస్తాలనేసుకుని చెడ  తిరుగుళ్ళు మొదలెట్టాడు. ఇలాకాదని,  నేస్తాలతో కలిసి ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ పెట్టాడు. ఇది వికటించి పోలీస్ స్టేషన్లో పడ్డాడు. తండ్రి విడిపించు కొస్తూంటే యాక్సిడెంట్ అయి గుండె పోటుకి గురయ్యాడు. అప్పుడు తండ్రి మిత్రుడు ఒకాయన తండ్రి గురించి ఒక విషయం  చెప్పాడు. కుటుంబ బాధ్యతల కోసం అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ కావాలన్న తన కలల్ని చంపేసుకున్నాడని.  


             
దీంతో రామ్ మారడానికి ప్రయత్నించాడు. ఇందులో భాగంగా మళ్ళీ ఈవెంట్ మేనేజ్ మెంట్ చేపట్టి, ప్రేమించిన చైత్ర సహకారంతో ఆమె బాస్ కుటుంబానికి పరిచయమయ్యాడు. ఆ కుటుంబంలో వున్న సమస్యని పరిష్కరించి, ప్రతిఫలంగా ఒక ఈవెంట్ మేనేజి మెంట్ ప్రోగ్రాం పొందాడు. పనిలో పనిగా ఆ బాస్ తన కొడుక్కి రామ్ చెల్లెలితో పెళ్లి కూడా జరిపించాడు.  చివరికి రామ్ తండ్రికి కెమెరా కొనిచ్చి ప్రపంచ యాత్ర తిప్పాడు. అక్కడ తీసిన ఫోటోలని పోటీలకి పంపి,  తండ్రి అవార్డు అందుకునేలా చేశాడు. దీంతో పిల్లలు కూడా తమ పేరెంట్స్ కి కోరికలుంటాయని గుర్తించాలని చెప్పి, ప్రయోజకుడైన రామ్ ని తండ్రి ఆలింగనం చేసుకున్నాడు. 

స్క్రీన్ ప్లే సంగతులు 
         ఈ కథకి మార్కెట్ యాస్పెక్ట్ వుందా అంటే వుంది. మంచి మార్కెట్ యాస్పెక్ట్  వుంది. అయితే కథని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోకుండా, పాత మూస ధోరణిలో సంసార కథగా మార్చేయడంతో మార్కెట్ యాస్పెక్ట్ గల్లంతై పోయింది. ఈ కథ సెంట్రల్ ఐడియా ఏమిటంటే,  గొప్ప ఫోటోగ్రాఫర్ కావాలన్న తండ్రి కలని కొడుకు నెరవేర్చడం. వాడవాడలా సెల్ ఫోన్లతో ఫోటోలు తీసే అదృష్టానికి  నోచుకుంటున్న ప్రజలందర్నీ ఆకట్టుకునే ఫోటోగ్రఫీ సెంట్రల్ ఐడియా, ప్రధానాకర్షణ కావాలి ఈ సినిమాకి నిజానికి. కాబట్టి కాన్సెప్ట్ పరంగా మార్కెట్ యాస్పెక్ట్ పుష్కలంగా వుంది. ఇవ్వాళ్టి  మార్కెట్  యాస్పెక్ట్ లో ప్రధానంగా సినిమా ప్రేక్షకులు యువతే. ఐతే ఇందులో అమ్మాయిల్లేరు. ఎంతో క్రేజ్ వున్న హీరోల  సినిమాలకి తప్ప అమ్మాయిలు రావడం లేదు. వాళ్ళతో ఓపెనింగ్స్ ఉండడంలేదు. కాబట్టి జనరల్ గా ‘యువతలో సగం’ సినిమా ప్రేక్షకులుగా లేరు. చిరంజీవి అల్లుడు హీరో అయ్యాడని యువతలో భాగమైన  అమ్మాయిలు కాదుకదా,  అబ్బాయిలు కూడా కానరావడం లేదంటే,  దీని మార్కెట్ యాస్పెక్ట్ ఏ పాటిదో అర్ధం జేసుకోవచ్చు. 

          యువతని దృష్టిలో పెట్టుకుని ఇవాళ్టి మార్కెట్ యాస్పెక్ట్  రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్, అంతే. ఇంకే కబుర్లు చెబుతూ సినిమాలు తీసినా ఇంతే సంగతులు. తెర మీద అమ్మాయి కనపడాలి, లేదా పుష్కలంగా ధనార్జన కనపడాలి. వీటితో ముడిపడి వుంటే ఏ కథైనా ఓకే. ఫోటోగ్రఫీ కథకి ఇది వర్కౌట్ అవుతుంది. 

           క్రియేటివ్ యాస్పెక్ట్ కొస్తే,  ఇంత మంచి మార్కెట్  యాస్పెక్ట్ వున్న సెంట్రల్ ఐడియాతో సమకాలీన కథని వూహించలేక, పురాతన  కుటుంబ కథని అల్లేశారు. ఎప్పుడు తీసినా కుటుంబ కథలు అవే ముప్ఫై ఏళ్ల నాటి కథల్లాగే వుండాలన్న పద్ధతిలో ఇంకా తీస్తున్నారు. ఇలాటి కుటుంబ  సినిమాలు  ఎప్పుడో టీవీ సీరియల్స్ దెబ్బకి అయిపులేకుండా పోయాయి. 

          స్ట్రక్చర్ కొస్తే, క్రియేటివ్ స్కూలు కన్పిస్తుంది. ఇందువల్ల కథకి, పాత్రలకి ఒక చట్రం కన్పించదు. స్ట్రక్చర్ స్కూలు స్క్రీన్ ప్లే కున్నట్టు ప్లాట్ పాయింట్స్ వుండవు. కథని ఒకే పెద్ద ఫ్లాష్ బ్యాక్ లో చెప్పాలన్న సృజనాత్మకత వరకూ బాగానే వుంది. కానీ ఆ ఫ్లాష్ బ్యాకులో  విషయాన్ని సర్దుబాటు చేసిన తీరు దిశా దిక్కూ లేకుండా వుంది. 

          తండ్రీ కొడుకులు బైక్ మీద పోతూండగా వాళ్ళ గురించి ఒక వాయిసోవర్ లో చెబుతూ ఫ్లాష్ బ్యాక్  ప్రారంభమవుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ఉస్సూరంటూ చిన్నప్పటి కథ చెప్పడం దగ్గర్నుంచీ ఇంకా అదే పాత పద్ధతిలో స్పూన్ ఫీడింగ్ చేసస్తూ ప్రారంభమవుతుంది. పుట్టిన కొడుకు ఇంజనీరింగ్ పూర్తి  చేసే వరకూ ఇది కొనసాగుతుంది. ఇందులో తండ్రీ కొడుకుల అనుబంధం ఏమిటంటే, కొడుకు భవిష్యత్తు గురించి తండ్రి కష్టపడడం. అలాటి కొడుకు తీరా  ఉద్యోగం దొరక్క ఆవారాగా కామెడీలు చేస్తూ తిరగడం ప్రారంభిస్తాడు. ఎదురింట్లో దిగిన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈవెంట్ మేనేజి మెంట్ పెట్టి, ఒక పొరపాటు జరిగి పోలీస్ స్టేషన్లో పడతాడు. తండ్రి విడిపించుకొస్తూ గుండె పోటుకి గురై హాస్పిటల్లో పడతాడు. ఇదీ ఫస్టాఫ్ కథ. 

          స్క్రీన్ ప్లే పరంగా ఇది బిగినింగ్ విభాగమనుకుంటే,  దీని ముగింపు ఇంటర్వెల్లో గుండె పోటు సీనుతో వచ్చిందన్న మాట. అంటే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడాలన్న మాట. కానీ ఏర్పడదు. ప్లాట్ పాయింట్ వన్ అంటే  అక్కడెదురైన సమస్యతో హీరోకి ఒక లక్ష్యం ఏర్పడాలి. కానీ ఇంటర్వెల్ లో కూడా హీరో ఏం చేస్తాడో, కథేమిటో తేలదు. 

          ఇంటర్వెల్ తర్వాత హాస్పిటల్ సీను వస్తుంది. తండ్రి హాస్పిటల్లో వుండగా, ఆయన మిత్రుడు హీరోకి తండ్రి గురించిన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఇందులో తండ్రికి గొప్ప ఫోటోగ్రాఫర్ కావాలని కోరిక. నేషనల్ జాగ్రఫిక్ లో ఫోటోలు కూడా ఎంపికై జాబ్  వస్తుంది. ఉన్న ఉద్యోగం వదిలేసి వెళ్ళడానికి సిద్ధం కూడా అవుతాడు. అంతలో బైక్ మీద కొడుకుని తీసుకుని భార్యతో పోతూ యాక్సిడెంట్ చేస్తాడు. ప్రాణాపాయ స్థితిలో  వున్న కొడుకు వైద్యం కోసమే లక్షలు అప్పు చేయాల్సివస్తుంది. దీంతో ఫోటోగ్రఫీ కలలు  కల్లలవుతాయి. సాధారణ ఉద్యోగిగానే ఉక్కు ఫ్యాక్టరీలో ఉండిపోతాడు. 

          అంటే,  చిన్నప్పుడు తన ప్రాణాలు కాపాడడానికి తండ్రి చేసుకున్న త్యాగం గురించి తెలుసుకున్న హీరో, ఇప్పటికైనా తండ్రికి కుటుంబ బాధ్యతలు వదిలించి,  ఫోటోగ్రఫీ కలని నెరవేర్చేందుకు ఒక లక్ష్యంతో కంకణ బద్ధుడవుతాడని ఆశిస్తాం. ఇదేం జరగదు.

          మళ్ళీ ఈవెంట్ మేనేజి మెంట్ లో పడతాడు. దీనికోసం హీరోయిన్ తో ఆమె బాస్ ని పడతాడు. ఆ బాస్ ఇంట్లో కొడుకుతో వున్న సమస్యని కిడ్నాప్ డ్రామా అడి పరిష్కరిస్తాడు. దీంతో అదే బాస్ తన చిన్న కొడుక్కి హీరో చెల్లెలితో పెళ్లి జరిపించేస్తాడు. దీని తర్వాత హీరో తండ్రికి కెమెరా కొని ప్రపంచం తిప్పడం, ఆ ఫోటోలు పోటీలో గెలవడం వగైరా జరిగిపోయి ముగిసిపోతుంది కథ. 

          ప్లాట్ పాయింట్ వన్ లేకపోవడం వల్ల హీరోకి సంఘర్షణ అంటూ, తద్వారా కథ పుట్టడమంటూ జరక్కుండా పోయింది. దీంతో ప్లాట్ పాయింట్ టూ కూడా ఏర్పడక ముగింపు చప్పగా తేలిపోయింది. ఉన్న విషయంలో కూడా మలుపులు, సన్నివేశాలు అన్నీ పాత  ఎన్నో సినిమాల్లో వచ్చినవే. వాటిని టెంప్లెట్స్ గా పెట్టేసుకుని విషయాన్ని నింపేశాడు. తండ్రికి ఫోటోగ్రఫీ కల అనే సెంట్రల్ ఐడియా జోలికి అసలే వెళ్ళకుండా, పైపైన ఉత్తుత్తిగా ఆ కోరిక కొడుకు తీర్చినట్టు చూపించేసి వదిలించుకున్నాడు. 

          కొత్త హీరోతో యూత్ ని ఆకర్షించే అంశం ఒక్కటీ లేదు. కానీ సెంట్రల్ పాయింటులో గొప్ప యూత్ అప్పీల్ వుంది. తండ్రిని ఇప్పటి కాలానికి తగ్గ ఫోటోగ్రాఫర్ ని చేసేందుకు తండ్రితో కలిసి హీరో చేసే విన్యాసాలు, సాహసాలు, వీరోచిత కృత్యాలూ వగైరా ఫన్నీగా, హాస్య భరితంగా, కొత్త కథగా  చూపించాల్సింది పోయి – ఏ ప్రేక్షకులకీ పట్టని పాత సంసారాల  ఏడ్పుల  కథలో హీరోని కుదేసి కుదేలు చేసేశాడు దర్శకుడు.

పాత్రచిత్రణ  
       కొడుకు పాత్ర ఎంత బలహీనమో, తండ్రి పాత్ర అంతే బలహీనం. కొడుకు మీద పెట్టిన శ్రద్ధ కూతురి మీద ఎందుకో పెట్టడు. కొడుకు చదువు, కొడుకు బాగు, అంతవరకే. పిల్లలిద్దర్నీ సమానంగా చూసే పద్ధతే లేదు. పిచ్చి పిల్ల ఏం  చదివిందో, ఆమెతో ఎప్పుడూ పెళ్లి చేసి పంపించెయ్యాలన్న గోలే. ఆమెని కూడా బాగా చదివించి వుంటే కొడుకుని తలదన్నేసి పోయేది.

          కొడుకు ఏదో తప్పు చేశాడని పోలీస్ స్టేషన్లో విడిపించుకొస్తాడు. కోపంతో వుంటాడు. నిజానికి అది తప్పేం కాదు. ఈవెంట్ మేనేజి మెంట్ లో తెలియక జరిగిన ఒక పొరపాటువల్ల ఒకడు గాయపడ్డాడు, అంతే. ఇక నుంచి ఇలా జరక్కుండా చూసుకోమంటే సరిపోతుంది. కానీ కొడుకేదో ఘోర నేరం చేసి పోలీస్ స్టేషన్ కెక్కించాడన్న ద్వేషం ఎందుకో అర్ధం గాదు. ఈ కోపంతో కొడుకుని బైక్ ఎక్కించుకుని పోతున్న వాడల్లా గుండె పోటుతో పడిపోతాడు. అప్పుడు కొడుకు ఒక అంబులెన్స్ ని ఆపుతాడు. ఆ అంబులెన్స్ లో ఇదివరకు నాటకమాడి నేస్తాలతో ఉచితంగా ప్రయాణం చేశాడు. దీని మీద ఆ డ్రైవర్ ఫైర్ అయి, ఇప్పుడు కూడా తండ్రితో నాటక కమాడుతున్నావని తిట్టి ఎక్కించుకోకుండా వెళ్ళిపోతాడు. దీంతో తండ్రికి కొడుకు మీద ఇంకింత మండిపోతుంది అంబులెన్స్ తో హీరో ఆడిన నాటకానికి. కానీ అదంతా గతం. ఇప్పుడు బాగుపడి ఈవెంట్ మేనేజి మెంట్ పెట్టుకున్నాడుగా?  ఇంకెందుకు అసహ్యం?

           ఇక్కడ గమనించాల్సింది ఇంకోటేమిటంటే, ఈ తండ్రి చిన్నప్పుడే కొడుకుని ఇదే బైక్ మీద ఎక్కించుకుని యాక్సిడెంట్ చేసి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాడు. ఇప్పుడు పెద్దయ్యాక కొడుకుని ఎక్కించుకుని రెండోసారీ యాక్సిడెంట్ చేశాడు. కాకపోతే తనకి గుండెపోటు వచ్చి ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. ఇది చెల్లుకి చెల్లు కదా? ఇంకేమిటి? ఇంకా చెప్పుకోవడానికి, ఇంత సినిమా తీయడానికీ కథ వుంటుందా? తీయాల్సిన అసలు కథ తీయకుండా ఏదో తీస్తే ఇంతకన్నా ఏం జరుగుతుంది?

 సికిందర్  


(తెలుగు రాజ్యం డాట్ కాం సౌజన్యంతో)

         
         


10, జులై 2018, మంగళవారం

661 : స్క్రీన్ ప్లే సంగతులు - 2


        స్టాఫ్ ప్రధాన కథ -1 : ఆత్మ కథ రాయించుకున్న సంజు ఆ పుస్తకంలో మహాత్మా గాంధీతో తనని పోలుస్తూ రాసినందుకు రచయితని హేళన చేసి పంపించేస్తాడు. అంతలో సుప్రీం కోర్టులో తీర్పు వెలువడుతుంది. 2006 లో టాడా కోర్టు సంజుకి విధించిన ఐదేళ్ళ కారాగార శిక్ష ని సుప్రీంకోర్టు ఖరారు చేస్తూ, నెల రోజుల్లోగా లొంగిపోవాలని ఉత్తర్వు లిస్తుంది. దీంతో సంజు నీరుగారి పోతాడు. ఈ వార్త టీవీలో వస్తూంటే పిల్లలు చూస్తారు. దీంతో జైలుకెళ్ళే తన వల్ల పిల్లల జీవితాలు  పాడవకూడదని ఆత్మహత్య చేసుకోబోతాడు. భార్య మాన్యత అడ్డుకుని పిల్లలు ఎదుర్కొనే సమస్య ఇలా తీరదని, వేరే రచయిత చేత ఆత్మ కథ రాయించి నిజాలు వెల్లడించాల్సిందేనని అంటుంది. దీనికి లండన్ రచయిత్రి విన్నీ డయాజ్ ని పిలిపిస్తారు.ఆమె సంజు జీవితం చూసి రాయనని అనేస్తుంది. కానీ రాస్తున్నట్టు పేపర్లో వార్త వస్తుంది. అది బిల్డర్ మిస్త్రీ చూసి, విన్నీని కలుసుకుంటాడు. సంజు ఆత్మకథ రాయవద్దంటూ హెచ్చరిస్తాడు. ఇతనిలా ఎందుకంటున్నాడని విన్నీ సంజుని అడిగితే, ఒకప్పటి తన మిత్రుడు మిస్త్రీ తో తన కథ చెప్పడం మొదలెడతాడు సంజు.

          పాయింట్ : మొదటిసారి రాయించిన ఆత్మ కథతో స్క్రీన్ ప్లే ప్రారంభం బోలుగా అన్పిస్తుంది. ఆ పూట సుప్రీం కోర్టుతీర్పు వెలువడబోతోంది. అలాంటప్పుడు దేశమంతా దీని మీదే దృష్టిపెడుతుంది సహజంగా. ఛానెళ్ళు కూడా సుప్రీం కోర్టు దగ్గర మకాం వేసి వుంటాయి. కనుక ఒకవైపు తన జీవితాన్ని మార్చేసే అంతిమ తీర్పు వెలువడుతూంటే, సంజు ప్రాణాలుగ్గట్టుకుని టీవీకి అతుక్కుపోవాలి నిజానికి. ఇలా కాక,  రాయించిన ఆత్మకథే దో పట్టుకుని కామెడీతో కాలక్షేపం చేయడం కాదు. అలా గనుక ఆత్మకథ  రాయించాలనుకుంటే, తీర్పు వచ్చేదాకా ఆగి, తీర్పుని బట్టి రాయించుకోవాలి. సినిమాలో ఈ సీన్ ఎలా వుంటుందంటే, ఆ పూట అంత ప్రధాన తీర్పు, అదీ సుప్రీం కోర్టు నుంచి  రాబోతోందని పాత్రలు వేటికీ తెలియనట్టే వుంటుంది! 

     స్క్రీన్ ప్లే ఆదిలోనే ఇంత పెద్ద గోతి. ఇలా పేలవమైన ప్రారంభంతో కాకుండా,  సుప్రీం కోర్టు తీర్పు వెలువడుతున్న సందర్భంగా హడావిడీ, ఆందోళనలతో ప్రారంభించి వుంటే టేకాఫ్ బలంగా, సస్పెన్స్ తో  వుండేది. ఆ తీర్పు పిల్లలు వినడం, సంజు ఖిన్నుడై ఆత్మ హత్య చేసుకోబోవడం, అప్పుడు భార్య ఆపి – ఆత్మకథ రాయించడాని ప్రేరేపించడం జరిగివుంటే అర్ధవంతంగా వుండేది.

       బయోపిక్స్ ని పాత్ర స్వగతంతో ప్రారంభించడం కాలం చెల్లిపోయిన బలహీన కథనం. ‘ఇది నా జీవితం...నేనిలా వున్నాను...నాకేం జరిగిందంటే...’ అనేలాంటి స్వగతంతో ‘సంజు’ ని ప్రారంభించడం ఇలాటి కథనమే. బయోపిక్స్ ప్రారంభం కూడా సంఘటనతోనే వుండాలి. ఇక్కడ సుప్రీం కోర్టు తీర్పు ఒక  బలమైన సంఘటన. ఈ బలమైన సంఘటనతో ప్రారంభించి వుంటే, అందుకోవడం అందుకోవడమే కథనం మంచి డైనమిక్స్ తో – విజువల్ నేరేషన్ తో ఆసక్తికరంగా వుండేది. ఇప్పటికీ చాలా మంది అర్ధం జేసుకోనిదేమిటంటే, సినిమా మాధ్యమానికి సీనంటే, కథనమంటే, సంఘటనలే నని! సంఘటనల ద్వారా కథ చెప్పాలని! 

          ఇక్కడ ఇంకొకటి చెప్పుకోక తప్పదు. ఎప్పట్నించో సినిమాల్లో అలవాటైపోయిన ఒక ఫార్ములా చిత్రణ ఇంకా ఇక్కడ కూడా దర్శనమిస్తుంది : ఆత్మకథ రాసిన రచయిత త్రిపాఠీని కామెడీ పేరుతో నానా మాటలని,  అతడి బూటు తోనే అతణ్ణి తరిమితరిమి కొట్టబోవడం చీప్  టేస్టే. అదే ఆ రచయిత ఏ ఖాన్ సాబో అయితే, మర్యాదగా కూర్చోబెట్టుకుని, అలా కాదు ఇలాగని చర్చ చేస్తారు.  అప్పుడా ఖాన్ సాబు, తన పాండిత్యంతో అందరినోళ్ళూ మూయించేసి వహ్వా లందుకుంటాడు. పాన్ ఉమ్మేసి పోతాడు. ఇదికూడా హిందీ సినిమాల ఫార్ములానే. త్రిపాఠీల్ని తక్కువ చేయడం, ఖాన్ సాబుల్ని ఎక్కువ చేయడం. 

          సరే, ఇదలా వుంచితే, ఆత్మ కథ రాయడానికి విన్నీ అనే లండన్ రచయిత్రి వస్తుంది. ఆమె - నీ భార్యతో కాక ఇంకెంత మందితో పడుకున్నావని నేరుగా భార్య ముందే అడిగేస్తుంది. భార్య కళ్ళు తిప్పుతూ భర్త కేసి చూస్తుంది. సంజు లెక్కలేసుకుని 308 మంది అంటాడు. భార్య ఇంకో క్లోజప్ ఇస్తుంది- అయ్యో అలాగా అన్నట్టు. ఇక విన్నీ మెప్పుదలగా చిన్న స్మైల్ ఇస్తుంది. అతను దాచకుండా చెప్పేసినందుకు మెచ్చుకుని, ఇక ఇతను నిజాలే చెప్తాడనీ, తను ఆత్మకథ రాయవచ్చనీ నిర్ధారణ చేసుకుందన్న మాట. అంతేగానీ, లైంగికంగా అంత మంది అమ్మాయిల్ని వల్లో వేసుకున్న అతడి క్యారెక్టర్ పట్ల భార్యకి గానీ, ఆ రచయిత్రికి గానీ ఏ అభ్యంతరమూ లేదన్న మాట. ఈ సీన్లో భార్య పాత్ర నిజజీవిత పాత్ర. ఆమెకున్న పరిస్థితులేవో  మనకి తెలీదు. కానీ రచయిత్రి పాత్ర కల్పిత పాత్ర. కల్పిత పాత్రని కూడా బలహీనంగా  చూపించడమెందుకు? 

          ఇలా ఫస్టాఫ్ లో ప్రధాన కథ మొదటి భాగాన్ని పరిచయం చేస్తూ, ఫ్లాష్ బ్యాక్ ని ప్రేరేపించే  సంజు ఫ్రెండ్ మిస్త్రీ ద్వారా,  ఫ్లాష్ బ్యాక్ కి తెరతీశారు.

          ఈ ప్రధాన కథ మొదటి భాగంలో సీన్లలో కథ అల్లిక గురించి తెలుసుకోవాలి. తెలుగు సినిమాల్లో ఇప్పుడు సీన్లలో కథ అల్లిక వుండడం లేదు. సీన్లలో కథ కనపడదు. విడి విడి పది సీన్లు కలిపి అతుకులేస్తే – అప్పుడుగానీ – ఎప్పుడో గానీ -  అవన్నీ కలిపి చూసుకుంటే గానీ కనపడదు కథ! 

          ఒకప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాలు చూసి, ‘భలేగా కుట్టాడ్రా’ అని చెప్పుకునే వాళ్ళట. కుట్టడమేంట్రా అని ఆలోచించి, వాళ్ళు ఎడిటింగ్ గురించి అలా మాట్లాడుకుంటున్నారని సినిమా వాళ్ళు అనుకునే వాళ్లట. ఇవ్వాళ ఎడిటింగ్ కాదు, దేనిగురించీ మాట్లాడుకునే పరిజ్ఞానం లేదు - స్టార్స్  చేసే కామెడీల గురించి తప్ప.

          ఇప్పుడా కుట్టుపని కాస్తా సీన్లు రాసేప్పుడు
చేస్తున్నారు. విషయం  ఒక సీనులో ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనకి దూరంగా, పది సీన్లు రాసుకుంటే గానీ కథకుడికి అంతుపట్టని కథలు తయారవుతున్నాయి. 

        పైన చెప్పుకున్న ‘సంజు’ లో ప్రారంభ దృశ్యాన్నే తీసుకుంటే,  తెలుగులో ఇలా ముక్కలు ముక్కలు చేసి కలిపి కుడతారేమో :  ‘సంజు’ స్వగతం - కట్. బాత్రూం  సంజు ఆత్మకథ పుస్తకం చదవడం -  కట్, రచయితతో కామెడీ – కట్.  సుప్రీం కోర్టు తీర్పు – కట్. పిల్లల పరిస్థితి – కట్. ఇలా దేనికది విడివిడి  సీన్లుగా తప్ప వూహించలేరు. వీటిన్నిటినీ  కలిపి కుట్లేసేస్తే అది రచనై పోతుంది. సినిమా కుంటి నడక నడుస్తోందన్న జ్ఞానం అసలే వుండదు.  

           ‘సంజు’ సీన్లలో కథని అల్లడం ఎలా వుంటుందంటే, ఒకే సీన్లో కథకి అవసరమున్న రెండు లేదా మూడు అంశాలు చెప్పేసి, ఎక్కడి కక్కడ కథని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవడం. (ఇదే పద్ధతి కొరియన్ ‘ది క్లాసిక్’ లో  కూడా వుంటుంది)

          స్వగతం కాడ్నించీ పిల్లలు టీవీలో చూసే దాకా ‘సంజు’ లో ఒకే సమయంలో జరిగే ఒకటే సీను అదంతా! పై ఐదు అంశాలూ ఒకే సీనులో అల్లేసి,  ఇక ఇంకో ఆత్మకథా గ్రంథ రచనకి శ్రీకారం చుట్టేశారు. ఒక్క సీనుతో కథ ఎంత ముందు కెళ్ళిపోయింది!  ఇలాటి సీన్లే మరి కొన్ని వున్నాయి.

***
      ఫ్లాష్ బ్యాక్ -1: సంజుని హీరోగా పరిచయం చేస్తూ ‘రాకీ’  తీస్తూంటాడు తండ్రి సునీల్ దత్. పాట తీస్తూంటే  పక్క నుంచి సంజుకి సిగరెట్ అందిస్తూంటాడు ఫ్రెండ్ మిస్త్రీ. సునీల్ దత్ వాసన పసిగట్టి మందలిస్తాడు – దురలవాట్లని కెమెరా క్షమించదంటాడు. ఇలా తండ్రి నల్గురి ముందు చిన్నబుచ్చినందుకు సంజు నొచ్చుకుంటే, ఆ బాధ తీర్చడానికి బార్ కి తీసుకుపోతాడు మిస్త్రీ. 

          అక్కడ మద్యం, మాదక ద్రవ్యం రుచి చూపిస్తాడు. దీంతో క్రమంగా డ్రగ్స్ బానిసైపోతాడు సంజు. ఒక పక్క తల్లి నర్గీస్ క్యాన్సర్ తో వుంటుంది. మరో పక్క ప్రేమించిన రూబీతో సమస్య వుంటుంది. తల్లిని తీసుకుని చికిత్స కోసం  అమెరికా వెళ్తారు. అక్కడుండే ఇంకో ఫ్రెండ్ కమలేష్ తో కలిసి తిరిగి,  వద్దన్నా డ్రగ్స్ సేవిస్తూంటాడు సంజు. తల్లికి నయమై తీసుకొచ్చేస్తారు. వచ్చాక చూస్తే, రూబీకి  వేరే సంబంధం నిశ్చయం చేస్తాడు ఆమె తండ్రి. తట్టుకోలేక కమలేష్ ని పిలిపించుకుంటాడు సంజు.  ఇంతలో రూబీ తండ్రి చనిపోతాడు. ఇక ఎలాగో రూబీ సంజుని చేసుకునేలా  ఒప్పిస్తాడు కమలేష్.  తీరా ఆమె కలవడానికొచ్చే సరికి డ్రగ్స్ కొడుతూంటాడు సంజు. ఆమె దూషించి వెళ్ళిపోతుంది. దీంతో సంజు పరిస్థితి దారుణంగా తయారవుతుంది. 

          ఇక చేసేది లేక, సునీల్ దత్ కి అంతా చెప్పేసి, సంజుని కాపాడుడుకోమని ప్రాధేయప డతాడు కమలేష్. అప్పుడు  సంజు డ్రగ్స్ మరిగాడన్న సంగతి కొత్తగా తెలుస్తుంది సునీల్ దత్ కి.

          పాయింట్ :  ఇక్కడ కూడా పాట షూటింగు జరిగే మొదటి సీనులోనే, టైం వేస్ట్ చేయకుండా, డ్రగ్స్ తో వుండగల ఈ ఫస్టాఫ్ ఎపిసోడ్ పాయింటంతా చెప్పేశారు. ఈ ఒక్క సీనులో కథని ముందుకి పరుగెత్తించే మూడు విషయాలు చెప్పేశారు : హీరోగా సంజు పరిచయ సినిమా షూటింగు, అందులో సిగరెట్ అందించే ఫ్రెండ్ మిస్త్రీ వున్నాడనీ,  అది చూసి తండ్రి  సునీల్ దత్ సంజుని మందలించడంతో  ఇద్దరి మధ్యా పాయింటు ఎస్టాబ్లిష్ అయిందనీ. ఒక్క సీనులో చాలా కథ చెప్పేశారు. సీను అల్లిక అంటే ఇదీ. పైగా ఫ్లాష్ బ్యాక్ లో ఈ మొదటి సీనులోనే ఈ ఎపిసోడ్ కథకి ముడి కూడా వేసేశారు. ఏమిటది? తండ్రి సిగరెట్లు తాగ వద్దంటున్నాడు. సంజు ఇప్పుడేం చేస్తాడు? ఇది ఆసక్తి రేపే ప్రశ్న. కథపట్ల కుతూహలం రేకెత్తించే పాయింటు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో కథని ముడేయడం అంటే ఏమిటో తెలియడం లేదు!  చైతన్యవంతంగా కథనం ఎలా నడపాలో తెలీదు. 

          దీన్తర్వాత,  డైనమిక్స్ ఎలా వున్నాయంటే, తండ్రి వద్దన్న పనే సంజు చేస్తున్నాడు. అంటే రెండు పరస్పర విరుద్ధ, సంఘర్షించుకునే పాత్రలు ఏర్పాటవుతున్నాయన్న మాట. కథనంలో ఇంతలోనే ఎంత  ట్విస్టు!  పైగా కథని ఇంకో లెవెల్ పైకి తీసి కెళ్తూ పెగ్గు కూడా కొట్టేశాడు సంజు. అప్పుడే ఇంకో లెవెల్ కి కూడా తీసి కెళ్తూ,  డ్రగ్స్ కి కూడా బోణీ కొట్టేస్తూ కథనంలో కంగారు పుట్టించాడు. అదంతా పది సీన్లు కాదు! ఒకేవొక్క  బార్ సీన్లో కథని ఇంత ముందుకు తీసికెళ్తూ అల్లేశారు.     
  
          వెనుకడ్డ జాతి ఏమంటుందంటే -  ఠాట్, ఒక్క సీన్లోనే సిగరెట్, మద్యం,  డ్రగ్స్ దాకా వెళ్లి పోతాడా? ఆడియెన్స్ నవ్వుతారు. సిగరెట్ తో ఆపుదాం. హీరోయిన్ తో లవ్ చూపుదాం. లవ్ తర్వాత మద్యం వేద్దాం. హీరోయిన్ తో పాట తర్వాత డ్రగ్స్ వేద్దాం... ఇలా స్టెప్ బై స్టెప్ వేస్తే ఆడియెన్స్ నవ్వరు – అని. ఇలా వెనకబడ్డ జాతి చేసే ఆధునిక సినిమా నిర్ణయాలకి,  అనాగరిక ప్రేక్షకుల్ని వెతికి వెతికి థియేటర్లకి తోలుకు రావాలి. 

          ఈ బార్ సీను తర్వాత ఏం చేయాలి? ఈ ఫ్లాష్ బ్యాక్ - 1 లో ప్రారంభమైన ఈ కథనాన్ని చూస్తూంటే,  ఇది త్రీ యాక్ట్ స్ట్రక్చర్లో బిగినింగ్ విభాగపు బిజినెస్ అని సులభంగా అర్ధమయ్యే వుంటుంది. కాబట్టి బిగినింగ్ విభాగంలో ఇప్పుడు అర్జెంటుగా జరగాల్సిన పాత్రల పరిచయాలు ఇంకేం మిగిలున్నాయి? తల్లి వుంది, ప్రేయసి వుంది. ఐతే ఇప్పుడు తల్లితో సీను వేయాలా బార్ సీను తర్వాత? మార్కెట్ యాస్పెక్ట్ కి ముందు యూత్ అప్పీల్ కావాలి. అంటే ప్రేయసితో సీనేయాలి.
       
        ఎంత మదర్ సెంటిమెంటైనా శివాలెత్తిపోకుండా తల్లి పాత్రని కాసేపు అపుకోవాలి. సినిమా పెన్ను మొదటి ధర్మం ప్రేమకవిత్వం రాయడమే. 

          బార్ నుంచి నేరుగా అర్ధరాత్రి రూబీ ఇంటికెళ్ళి పోతాడు. ఇక్కడ రూబీ, ఆమె తల్లీ ఎదురుగా వుంటే, వాళ్ళని చూస్తూ డబుల్ మీనింగుల కామెడీ చేస్తాడు. నిజానికి వాళ్ళ వెనకాలున్న మందు బాటిల్స్ నుద్దేశించి ఈ కామెడీ. చాలా పాతకాలపు బూతు, ముతక  కామెడీ  ఇది.  ఇదంతా ఒకే  రోజు జరుగుతున్న కథగా చూపించారు. ఉదయం పాట షూటింగుతో మొదలెట్టి, రాత్రి బార్ సీను, అర్ధరాత్రి రూబీతో సీను వరకూ. గొడవ వదిలిపోయింది. లేకపోతే  కొన్ని రోజుల వారీగా జరుగుతున్నట్టు ఈ సీన్లు చూపిస్తే, ఇవి బిగినింగ్ విభాగానికి చెందాల్సిన  సీన్లు అన్పించుకోవు. తీరుబడిగా విడివిడి రోజుల కథని చూపించుకునే బిజినెస్ అంతా మిడిల్ విభాగానిది. మిడిల్ బిజినెస్ కోసం కథలో ఏర్పాటయ్యే సమస్యని అందించే బిగినింగ్ బిజినెస్ లో, సంక్షిప్తంగానే వుంటుంది స్థలకాలాల ఐక్యతతో కూడిన కథనం. 

          ఇదే పద్ధతి ఈ బిగినింగ్ బిజినెస్ తర్వాతి  సీన్లలో కూడా వుంటుంది. తెల్లారి ఫ్రెష్ గా తల్లికి క్యాన్సర్ అని చెప్పి, ఆమెని యూఎస్ కి తీసికెళ్ళాలనడం కూడా అదే సీనులో చెప్పేసి,  యూఎస్ కి మార్చేశారు కథని. యూఎస్ లో ఇంకా ఉధృతం చేశారు సంజు డ్రగ్స్ అలవాటుని. ఇక్కడే రెండో మిత్రుడు కమలేష్ ని పరిచయం చేశారు. తల్లికి నయమై తీసుకురావడం, ఇక్కడ ప్రేయసి రూబీతో చెడడం వగైరా జరుగుతాయి. కమలేష్ వచ్చి,  రూబీకి చూసిన వేరే సంబంధం అతణ్ణి బకరా చేసే సీనుకూడా చాలా పాత మూసే. రూబీతో చెడే సరికి, ఈ బిగినింగ్ బిజినెస్ పతాక స్థాయికి చేరుకుంటుంది.

          ఇక  క్షీణించిన సంజు స్థితికి చలించి తండ్రి సునీల్ దత్ కి చెప్పేస్తాడు కమలేష్. డ్రగ్స్ బారి నుంచి కాపాడుకోమంటాడు. సంజు డ్రగ్స్ బానిసని ఇప్పుడే తెలుస్తుంది సునీల్ దత్ కి. దీంతో బిగినింగ్ విభాగం పూర్తవుతుంది.
***
      ఈ బిగినింగ్ విభాగంలో డ్రగ్స్ అని తెలుపుతూ  కథా నేపథ్యపు ఏర్పాటు, తగిన పాత్రల పరిచయం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా ఏ విధంగా జరిగాయో పైన గమనించాం. సంజు గురించి కమలేష్  సునీల్ దత్ కి చెప్పేయడంతో సమస్య ఏర్పాటయింది. అంటే ప్లాట్ పాయింట్ వన్ అన్నమాట. ఎవరి మీద? సునీల్ దత్ మీద! బంతి సునీల్ దత్ కోర్టులో పడింది. సంజు కోర్టులో కాదు. ఆత్మ కథకి కథానాయకుడితనే కాబట్టి, సమస్య ఇతనే ఎదుర్కొంటాడనీ, ప్లాట్ పాయింట్ వన్ ఇతడి మీదే వుంటుందనీ ఎదురు చూడడం సహజం.

          కానీ ఇది విజేత ఆత్మ కథ కాదని ఇదివరకే చెప్పుకున్నాం. పరాజితుడి ఆత్మకథ. అంటే పాసివ్ పాత్ర. అంటే ట్రాజడీ. వీడికి స్వయంగా సమస్యల్ని అధిగమించాలని ఎందుకుంటుంది? కథానాయకుడుగా వీడు కథనెందుకు నడుపుతాడు?  కథే, లేదా ఇంకో పాత్రే వీడిని నడుపుతుంది. మీ ఖర్మంటూ కథ మీదా, ఇతర పాత్రల మీదా పడి బతికేస్తూంటాడు. 

          కాబట్టి, లక్కీగా సంజయ్ దత్ జీవితంలో సునీల్ దత్ అనే తండ్రి వుండి, ఆయన బాధ్యత తీసుకోవడంతో సంజయ్ దత్ డ్రగ్స్ కి సంబంధించి బాగుపడ్డాడు. ఇది జీవితం. సినిమాల కొచ్చేసరికి ఒక్కోసారి జీవితమెలా వుంటుందో అంతుబట్టక, వూహించి సృష్టించుకునే పాత్రలతో కొత్తదనం లేక, మూస ఫార్ములా చిత్రణలు విసుగెత్తిస్తాయి... కొడుకు వ్యసన పరుడు. తండ్రి అందుకు వ్యతిరేకి. ఇద్దరిమధ్య కొట్లాటలు. చివరి కెప్పుడో కొడుకు తానే తప్పు తెలుసుకుని, తండ్రి కాళ్ళ మీదపడి, ప్రయోజకుడన్పించుకోవడం. తండ్రి దీవించడం. ఇక్కడ తండ్రి పీకేదేం వుండదు. కొంపలంటుకుపోయాయని ఇల్లెక్కి ఒకటే కూయడం తప్ప. ఇలా పుడుతూంటాయి వూహించుకునే కథలు. 

          జీవితంలో ఇలా వుండకపోవచ్చు. సంజు – సునీల్ దత్ ల తండ్రీ కొడుకుల సంబంధమే తార్కాణం. చెడిపోయిన కొడుకు బాధ్యత తండ్రి తీసుకున్నాడు. ఇది వూహించని కథయ్యింది. అంతే అనూహ్యంగా ప్లాట్ పాయింట్ వన్ లో- అన్ని అంచనాలనీ తలకిందులు చేసేస్తూ - ఆ తండ్రే కథానాయకుడయ్యాడు. ఆయనకే సమస్యా, దాన్ని సాధించాలన్న  లక్ష్యమూ ఏర్పడ్డాయి. జీవితం కల్పనని ఇలా వెక్కిరిస్తుంది. పోవోయ్, ప్లాట్ పాయింట్ వన్ అంటే ఎప్పుడూ హీరోకేనా? ఇలాగే రాసుకుంటూ ఇంకెన్ని సార్లు తీసి విసిగిస్తావు? నీ బోడి కల్పనా నువ్వూ - అని నవ్వేస్తుంది. 

          అంటే బాగా దురలవాటు చేసుకున్నవరల్డ్మూవీసు, ఆచారంగా అతిగా అలవాటు చేసుకున్న  కొరియన్, హాలీవుడ్ మూవీసు చూస్తూనే,  చిరంజీవి- బాలకృష్ణ - నాగార్జున –వెంకటేష్ ల  పాత మూవీసు బాగా రీ పాలిషింగు చేస్తూ సినిమాలు తీస్తూనే, కాస్త అప్పుడప్పుడు జీవిత చరిత్రలు కూడా చదువుకుంటే, స్క్రీన్ ప్లేల్లో అనూహ్య కోణాలు ఇలా బయటపడే అవకాశాలుంటాయన్న మాట! 

        మొత్తంగా ‘సంజు’ ఒక గాథే అయితే, ఈ గాథలో ఏర్పడ్డ రెండు జీవిత ఘట్టాలు (డ్రగ్స్, గన్స్) కథలు కావడం ఇంకో ప్రయోగం. ఈ ప్రయోగం కావాలని చేయలేదు. జీవితమే తెచ్చి పడేసింది. కొత్తగా కమర్షియల్ సినిమాకి కుదిరిన జీవితం. 

          ఎక్కడ చూసినా గాథలో కథలుండవు. గాథే వుంటుంది. కానీ ఇక్కడ గాథ అనేది ప్రధాన కథ వరకే. ఇందులో ఇమిడి వున్న రెండు ఫ్లాష్ బ్యాకులూ కథలే. ఇందుకే ఇవి స్ట్రక్చర్ లో వున్నాయి. ఈ రెండు ఫ్లాష్ బ్యాకులూ గాథలుగానే తీయడానికి జీవితం ఒప్పుకోకపోవచ్చు.  జీవితంలో సునీల్ దత్ అనే లక్ష్యంతో కూడిన పాత్ర వుంది కాబట్టి - ఇవి కథలు కావడం అనివార్యం. అంటే బయోపిక్స్ కే ఇలా కుదురుతుందా అని కాదు. ఫిక్షన్ కి కూడా కుదరవచ్చని ఈ బయోపిక్ డిజైన్ చెప్తోంది. వూరికే గాథలు తీసి చేతులు కాల్చుకునే కన్నా, గాథలో కథల్ని సృష్టించే చాతుర్యముంటే కమర్షియల్ సినిమాలకి కొత్త ముఖం ఏర్పడుతుంది. అయితే ముందుగా కథకీ,  గాథకీ తేడా తెలియాలి.

          సాంప్రదాయంగా, రొటీన్ గా,  హీరో మీదే ప్లాట్ పాయింట్ వన్ వుంటుందిలే అన్పింపజేస్తూ తీసికెళ్ళి తీసికెళ్ళి, సీన్ రివర్సల్ చేస్తూ, ఇంకో పాత్ర మీద ప్లాట్ పాయింట్ వన్ పెట్టేసి,  కథని అప్పగించేస్తే ఆ కిక్కే వేరు. ఇదీ రూల్స్ బ్రేక్ చేయడమంటే. అంతేగానీ అసలు రూల్సే తెలీకపోతే రూల్స్ బ్రేక్ చేసేదేమీ వుండదు, కచరా చేయడం తప్ప.

 సికిందర్

4, జులై 2018, బుధవారం

660 - స్క్రీన్ ప్లే సంగతులు -1


     సినిమాలు కమర్షియల్ విజయాలు సాధించాలంటే వాటి కథలు స్ట్రక్చర్ లో వుండాల్సిందే. ఒక్కోసారి అదేపనిగా స్ట్రక్చర్ - స్ట్రక్చర్ - స్ట్రక్చర్ అనే ఒకే చట్రం విసుగు పుట్టిస్తుంది. స్ట్రక్చర్ లోంచి బయటికొచ్చి స్వేచ్ఛగా, ఏ బంధనాలూ లేని కథా రచన చేసుకోవాలన్పిస్తుంది. కానీ ప్రేక్షకులు అన్ కాన్షస్ గా తెలివైన వాళ్ళు - బాక్సాఫీసు దగ్గర మొహమాటం లేకుండా ఢమాల్ మన్పిస్తారే ...ఎలా? ప్రేక్షకులు పోనీలే పాపమనుకుంటే ఎక్కడ పడితే అక్కడ దేశవ్యాప్తంగా థియేటర్లు వరల్డ్ మూవీస్ తో కూడా కిటకిటలాడేవి. టాలీవుడ్ లో వరల్డ్ మూవీస్ వ్యసనపరులు విరగదీసి వరల్డ్మూవీసు లాంటి మీసం లేని తెలుగు కళా ఖండాలు  తీసేసి ఎలాపడితే అలా  హిట్లు కొట్టేవాళ్ళు. రాయికేసి కొట్టినా గట్టి బ్యాంగ్ తో హిట్టయ్యేవి. కాబట్టి అంత సీనులేదు స్ట్రక్చర్ లేకపోతే. ఎక్కడెక్కడి మారుమూల ప్రాంతీయ సినిమాల ప్రేక్షకులూ, ఇప్పుడు నీ ఆర్టు సినిమాలు కాదు తండ్రీ, కాస్త పచ్చి కమర్షియల్ మూవీసు తీసి చూపిస్తావా చస్తావా అంటూంటే –ప్రాంతీయ సినిమాలు బాలీవుడ్ తోలుకప్పుకుని ప్రేక్షకుల చేతిలో  తోలుబొమ్మ లాటలైపోతూంటే – స్ట్రక్చర్ అనే తద్దినం తప్పదు గాక తప్పదు.

         
ఇందుకే ఒకరి నిజ జీవిత కథతో బయోపిక్ అయినా సరే, సినిమాగా ఆడాలంటే ఖచ్చితంగా స్ట్రక్చర్ లో పెట్టి తీరాలని ప్రతీ హాలీవుడ్ స్క్రీన్ ప్లే నిపుణుడూ హెచ్చరిస్తున్నాడు. ఇక్కడొక తేడా వుంది బయోపిక్స్ తో – విజయగాథలు, పరాజయ గాథలు అని. నిజానికి సాంకేతికంగా విజయానికి సంబంధించిన కథల్ని గాథలు అనకూడదు.  కథ అంటేనే స్ట్రక్చర్ లో వుండేది. విజయానికి సంబంధించిన కథలు స్ట్రక్చర్ లోనే వుంటాయి. స్ట్రక్చర్ లో  వుండనివి గాథలు. ఇవి పరాజయాలకి వర్తిస్తాయి. కాబట్టి అవి పరాజయ గాథలవుతాయి. విజయాలకి సంబంధించిన వాటిని సౌలభ్యంకోసం విజయగాథలనేస్తున్నాం గానీ, సాంకేతికంగా అవి కథలు. 

     కథల్లో యాక్టివ్ పాత్ర వుంటుంది. అదే దాని గోల్ కొద్దీ  ఆటోమేటిగ్గా స్ట్రక్చర్ ని ఏర్పాటు చేసేస్తుంది. ఇలా యాక్టివ్ పాత్ర తప్ప ఇంకేదీ – పాసివ్ పాత్ర సహా - స్ట్రక్చర్ ని ఏర్పాటు చేయదు గాక చేయదు.  స్ట్రక్చర్ ని ఏర్పాటు చేయకపోతే అది కథవదు, గాథవుతుంది. పైసా, మొగుడు, బ్రహ్మోత్సవం వంటివి స్ట్రక్చర్ లో లేని గాథలే. కాబట్టి అవి అంత భీకర ఫ్లాపులయ్యాయి. ప్రాథమికంగా కథకీ గాథకీ తేడా తెలుసుకోక కోట్లకి కోట్లు పెట్టి సినిమాలు తీసేస్తే – సూపర్ స్టార్లున్నా ఇంతే సంగతులు.  

          విజయంతో కూడిన బయోపిక్ కి స్ట్రక్చర్ వుండాల్సిందే. విజయం లేని ట్రాజిక్  బయోపిక్ కి స్ట్రక్చర్ లేకున్నా ఫర్వాలేదు. ఐతే అసలు బయోపిక్ అని దేన్ని అంటారు? ఇటీవల ఒకతను డైలాగ్ వెర్షన్ కూడా రాసుకుని కథ విన్పించాడు. అది కథలా లేదు. పాత్ర ఏదో సమస్యతో కష్టాలు పడుతూనే వుంది. పడీ పడీ చచ్చిపోయింది. ఇదేంటంటే, బయోపిక్ అన్నాడు. ఎవరి బయోపిక్ అంటే, తను సృష్టించిన పాత్ర బయోపిక్ అన్నాడు. బయోపిక్ అంటే నిజవ్యక్తి కథ అని కూడా తెలీని తనంతో డైలాగ్ వెర్షన్ కూడా రాసేసుకుని బయోపిక్ అని ఫిక్సయిపోయాడు. 

          నువ్వు సృష్టించిన కల్పిత పాత్రతో కథని  బయోపిక్ అనరు, దేవుడు చేసిన మనిషితో వుండే నిజ జీవిత కథని బయోపిక్ అంటారంటే, అర్ధం జేసుకునే స్థితిలో లేడు. కాబట్టి దీన్ని యాక్టివ్ పాత్రగా చేసి, లక్ష్యం ఏర్పాటు చేసి, స్ట్రక్చర్ లో పెట్టి, కథగా మార్చమంటే- ‘మీరు స్ట్రక్చర్ లోంచి బయటికి రండి’ అన్నాడు. స్ట్రక్చర్లోంచి బయటికొస్తే, ఎలా రాయాలో నేర్పుతావా అంటే సమాధానం లేదు. 

          అతను రాసుకున్నది సినిమాకి పనికిరాని గాథ. ట్రాజడీ కూడా పైగా. పాత్రకి సమస్యని పరిష్కరించుకోవాలన్న గోల్ లేదు. చావే పరిష్కారంగా పరాజయ గాథలా వుంది. ‘అల్లూరి సీతారామరాజు’ బయోపిక్ చివరికి ట్రాజడీయే అయినా, ఆయన లక్ష్యం కోసం చేసిన పోరాటంలో మరణించాడు. కాబట్టి పాసివ్ పాత్ర కాలేదు. వీరమరణంతో యాక్టివ్ పాత్రయాడు. 

          వివిధ బయోపిక్స్ ని చూసి, తామూ అలాంటిది తీయాలని ఉబలాటపడి,  తోచిన కల్పిత పాత్రొకటి సృష్టించుకుని,  బయోపిక్ గా  చెప్పుకుంటే నవ్వుతారు ప్రేక్షకులు. ట్రాజడీ గాథగా బయోపిక్  తీయాలన్నా అలాంటి నిజవ్యక్తి కథ ఎక్కడో వుండాల్సిందే. అప్పుడు ప్రేక్షకులు విజయమా, పరాజయమా పట్టించుకోరు. యాక్టివా, పాసివా చూడరు. ఆల్రెడీ ఆ వ్యక్తి  జీవితం తెలిసే  వుంటుంది కాబట్టి, బయోపిక్ ని ఆ దృష్టితోనే చూస్తారు.

          ఇలా వచ్చిందే సంజయ్ దత్ ట్రాజిక్ బయోపిక్. విజయంతో కూడిన బయోపిక్స్ ని  చూస్తే, మనం కూడా అలా చేయాలని అవి స్ఫూర్తి నిస్తాయి. అపజయంతో కూడిన బయోపిక్స్ ని చూస్తే, మనమూ అలా చేయకూడదని హెచ్చరిక చేస్తాయి. 

          ఈ రెండోది చేసేదే  ‘సంజు’ ట్రాజిక్ బయోపిక్. సంజయ్ దత్ అనే బాలీవుడ్ స్టార్ గురించి తెలిసిన అసమర్ధ జీవిత కథే కాబట్టి, దీని జానర్ లక్షణం కొద్దీ (ట్రాజడీ), స్ట్రక్చర్ లో లేకపోయినా కమర్షియల్ విలువకి లోటు రాలేదు. ‘డర్టీ పిక్చర్’ కూడా తెలిసిన సిల్క్ స్మిత విషాద గాథే కాబట్టి  కమర్షియల్ గా ప్రశ్నార్ధకం కాలేదు. ఎటొచ్చీ కల్పిత  పాత్రతో ట్రాజడీలు తీస్తేనే వస్తుంది సమస్య.

***
     బయోపిక్ ఎలాటిదైనా అందులో సమస్య వర్తమానంతో కనెక్ట్  అయితే మంచిదన్నారు పండితులు. ‘సంజు’ లో ఇప్పటి రోజులతో  కనెక్ట్ అవుతున్న డ్రగ్స్ సమస్య, అక్రమాయుధాల సమస్యా వున్నాయి.  కాబట్టి మార్కెట్ యాస్పెక్ట్ కుదిరింది. ఈ మార్కెట్ యాస్పెక్ట్ వల్ల ఇంకా యూనివర్సల్ అప్పీల్ కూడా కుదిరింది. పైగా యంగ్ సంజయ్ జీవితంతో  యూత్ అప్పీల్ కూడా కుదిరింది. 

          క్రియేటివ్ యాస్పెక్ట్ కొచ్చి దీనికి స్ట్రక్చర్ లేదు, కుదరదు, అవసరం లేదు. ఎందుకంటే ఫస్టాఫ్ ఒక జీవిత ఘట్టం (డ్రగ్స్) తో, సెకండాఫ్ ఇంకో జీవిత ఘట్టం (గన్స్) తో వుంది. స్ట్రక్చర్ లో వున్న స్క్రీన్ ప్లే ఒకే ఘట్టంతో,  దాని చుట్టూ సంఘర్షణతో, ఒకే పూర్తి నిడివి కథగా వుంటుంది. ఫస్టాఫ్ ఒక కథ, సెకండాఫ్ ఇంకో కథగా వుండదు. వుంటే సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండంలో పడి గల్లంతై పోతుంది సినిమా జాతకం. ఇలాటివి చాలా చూశాం. 

          ‘సంజు’ బయోపిక్ దీనికి అతీతం. కారణాలు పైన చెప్పుకున్నవే. ఈ రెండు జీవిత ఘట్టాలకీ కవరింగ్ లెటర్ లాగా ఇంకో ఘట్టముంది : ఫైనల్ గా సంజయ్ జైలు శిక్ష అనుభవించే ఘట్టం. అంటే 80 లలో డ్రగ్స్ ఘట్టం, 90 లలో గన్స్ ఘట్టం, 2000 లలో జైలు శిక్ష ఘట్టమూ అన్న మాట. ఇలా త్రికాలాల కథగా అలంకరణ చేశారు. రెండు భూత కాలాలు, ఒక వర్తమాన కాలం. 

          ఇలా వొక ఫ్రేమింగ్ చేసుకున్న తర్వాత, కథని దేంతో  మొదలెట్టాలి? వర్తమాన కాలంతోనే మొదలెట్టాలని ఇంగిత జ్ఞానం చెప్తుంది. వర్తమానం లోంచి మొదటి ఘట్టంలోకీ,  ఆ తర్వాత  మళ్ళీ వర్తమానం లోంచి రెండో ఘట్టంలోకీ ప్రయాణించాలి. వర్తమానం రియల్ టైం అనుకుంటే,  దీని ప్రేరణతో వచ్చే రెండు ఘట్టాలూ డ్రీం టైమ్ (ఫ్లాష్ బ్యాక్స్) అవుతాయి. అంటే ఈ కథని ఫ్లాష్ బ్యాకులతో చెప్పాలన్న మాట. ఫస్టాఫ్ డ్రగ్స్ ఫ్లాష్ బ్యాక్, సెకండాఫ్ గన్స్ ఫ్లాష్ బ్యాక్ విడివిడిగా.

          వీటికి ప్రధాన పాత్ర ఎవరు? సంజునే. ప్రధానపాత్రగా అతనేం చేస్తున్నాడు? ఏమీ చేయడం లేదు, సమస్యలు సృష్టించుకుని లబోదిబో మంటున్నాడు. ఫస్టాఫ్ డ్రగ్స్ సమస్యతో, సెకండాఫ్ గన్స్ సమస్యతో. నిజ జీవితంలోనే అతను పాసివ్ పాత్ర. కాబట్టి బయోపిక్ అనే ఈ సినిమాలోనూ సమస్యలతో పోరాటం చేయలేడు. అంటే అప్పుడు ఈ ఫస్టాఫ్,  సెకండాఫ్ లని డాక్యుమెంటరీ పద్ధతిలో చెప్పాలా? డ్రగ్స్ తో ఒక కథ ముగిసి, గన్స్ తో ఇంకో కథగా వుండే ఎపిసోడిక్ స్టార్ అండ్ స్టాప్  అనే డాక్యుమెంటరీ కథనం సరిపోతుందా? ఎందుకూ, ఈ రెండిటినీ కలిపి వుంచే  రియల్ టైం  కథ వుందిగా? అందులో ఒక గోల్ వుందిగా – ఈ రెండు ఘట్టాలనీ కలిపి తన జీవితంగా పుస్తకం అచ్చేసుకోవాలని? దాంతో టెర్రరిస్టు అనే ముద్ర చెరిపేసుకోవాలనీ? అది గోల్ అవదు. కేవలం ఈ రెండు ఘట్టాలూ వెల్లడించుకోవడానికి ప్రేరేపించే వొక కారణం మాత్రమే అది. 

     మరి ఈ రెండు ఘట్టాలనీ కలిపి వుంచే ఇంకో హుక్ లేదా, ఎలిమెంట్ ఏది? సంజు జీవితంలో ఇంకెవరెవరున్నారు? ఈ రెండు ఘట్టాలనీ నడిపించే వ్యక్తులు కాక ఇంకెవరి ప్రసక్తీ  ఇక్కడ అవసరం లేదు. మొదటి ఘట్టం నడవడానికి మొదటి ఫ్రెండ్, రెండో ఘట్టం నడవడానికి రెండో ఫ్రెండ్ వున్నారు. అయినా వేర్పాటు అలాగే వుంది. అయితే సంజుకి  తండ్రి సునీల్ దత్ వున్నాడు.  ఆయనేం చేశాడు నిజ జీవితంలో? రెండు ఘట్టాల్లోనూ  సంజుని కాపాడుకోవడానికి నానా కష్టాలూ పడ్డాడు. అయితే సంజు బయోపిక్ కి ఈయనే రియల్ హీరో. సాంకేతికంగా గాడ్  ఫాదర్  క్యారెక్టర్.  గోల్ ఈయనకే వుంది. ఈయన గోల్ తో బలమైన ఎమోషనల్ త్రెడ్ ఏర్పడింది. ఈ ఏకీకృత ఎమోషనల్ ట్రేడ్ తో ప్రథమార్ధ, ద్వితీయార్ధ ఘట్టాలు రెంటికీ  ఈయన బలమైన అనుసంధాన కర్తగా ఏర్పడ్డాడు.  

          మరి ఈ మొత్తం ఈ బయోపిక్ ని ఏ ప్రధాన రసం ఆధారంగా చెప్పాలి?  ఫాదర్ సెంటి మెంట్ ఆధారంగానే. యూనివర్సల్ అప్పీల్. తండ్రీ కొడుకుల లవ్ అండ్ హెట్ రిలేషన్ షిప్. యూనివర్సల్ అప్పీల్. మరి ఉపరసాలూ? వున్నారుగా ఇద్దరు ఫ్రెండ్స్- ఒకడితో ఫస్టాఫ్ లో  బ్యాడ్ ఫ్రెండ్ షిప్, ఇంకొకడితో సెకండాఫ్ లో గుడ్ ఫ్రెండ్ షిప్. యూనివర్సల్ అప్పీల్.

          ఇప్పుడు ఈ అవుట్ లైన్ ని బద్ధకించకుండా పేజీలకి పేజీలు  సినాప్సిస్ రాసేయ్! రాసేసి? అప్పుడు ఆర్డర్ వేద్దాం. ఎప్పుడు? రేపే! ఇంతలో అంత రాయాలా? రాయకపోతే మట్టిలో కలిసిపో! స్క్రీన్ ప్లేకి షార్ట్ కట్స్ లేవు !

సికిందర్