రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, జనవరి 2018, శుక్రవారం

588 : స్క్రీన్ ప్లే సంగతులు!



   ఈ స్పీడు యుగంలో యాంత్రికంగా బతకడం అలవాటు చేసుకున్నాడు మనిషి. తన నుంచి తానూ పూర్తిగా వేర్పడిపోతూ దిక్కు తోచని స్థితిలో పడుతున్నాడు. దారీ తెన్నూ తెలీక దొరికిన వ్యక్తిత్వ వికాస పుస్తకమల్లా చదవడం మొదలెట్టాడు. కానీ ఇవే విజయానికి సోపానాల గురించి ఏనాడో పురాణాల్లోనే, జానపద కథల్లోనే రాసిపెట్టారన్న సంగతే గుర్తించ లేకపోయాడు. ఇదీ మనిషి మానసిక దివాళాకోరుతనం. పురాణాలు ఆత్మని కడిగితే, జానపదాలు మేధస్సుని పెంచుతాయి. నిగూఢంగా వున్న మానసిక శక్తుల్ని పైకి లాగి పోరా ఆకాశమే నీ హద్దూ అనేసి బతకడాన్ని బ్యాలెన్సు చేస్తూ జీవిత ప్రాంగణంలోకి ముందుకు తోస్తాయి.

        ఈపని జానపద చలన చిత్రాల తిరుగులేని కథానాయకుడిగా టీఎల్ కాంతారావు కొన్ని వందలసార్లు చేసి వుంటారు. కాంతారావు చేసిన మేలు మనం అప్పుడు తెలుసుకోలేదు గానీ, ఇప్పుడు ఆలోచిస్తే జానపద సినిమాలతో వ్యక్తిత్వ వికాసానికి బ్రాండ్ అంబాసిడర్ కి తక్కువకాని హోదాని తనే ఆనాడే పోషించారు!

         
పని సప్తస్వరాలుతో ఇంకా పరమ నిష్ఠగా చేశారు. సినిమా మొత్తంగా ఒక సైకలాజికల్ విహార యాత్ర. ఇందులోకి ప్రవేశిస్తే మనల్ని మనం తెలుసుకోగలం. నిమిష నిమిషానికీ మన మనసు చేసే మాయ, చిత్ర విచిత్రాలూ- వీటన్నిటినీ ఒక దారిలో పెట్టి, లక్ష్యాన్ని సాధించేందుకు మనం చేసే విశ్వ ప్రయత్నాలూ- దీన్నొక కదిలే బొమ్మల పర్సనాలిటీ క్విజ్ గా నిలబెడతాయి.

         
అలాగని సప్తస్వరాలు ఏవో కత్తులు పాడుకునే సంగీత సమ్మేళన మనుకుంటే కత్తుల మీద కాలేసినట్టే. సప్త స్వరాలు కేవలం మాధుర్యాన్ని చిలికే సరిగమలే కావనీ, సప్త సముద్రాలు, సప్త గిరులు, సప్తర్షులు, సూర్యుడి సప్తమాశ్వాలూ ఇవన్నీ మానవ కోటికి మహత్తర వరాలనీ, సప్త సంఖ్యామయమైన జగత్తే మొత్తంగా సప్తస్వరాల్లో ఇమిడి వుందనీ, సప్త స్వరాలని జయించిన వాడే శారదా పీఠాన్ని అందుకోగల్గుతాడనీ సినిమా కథలోని భావం. మెంటల్ పోస్ట్ మార్టం మేడీజీ అన్నమాట.

      అంతరంగ ప్రయాణం ప్రారంభించే ముందు ఏడు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. లేకపోతే అగాథంలోకి పతనం ఖాయం. దీంతో తొలిసారిగా సినిమా నిర్మాణానికి పూనుకున్న కాంతారావు, తన ఉత్తమాభిరుచులేమిటో అడుగడుగునా దృశ్యాల్లో ప్రతిఫలించేలా చేశారు. దీని ఆర్ధిక పరాజయానికి కొన్ని రాజకీయాలు కారణమై వుండొచ్చు, కానీ విషయపరంగా దీన్ని శాశ్వత తత్వానికి ఎదురేదీ లేదు


        ‘దేవదాసు’ లాంటి భగ్న ప్రేమికుడి విషాదాంతంతో బాగా చాలా బాగా - ఏడ్పించేసి వదిలిన వేదాంతం రాఘవయ్య కి, సప్తస్వరాలుగమ్మత్తుగా భగ్నప్రేమికుడి విజయగాథ అయింది! మహా దర్శకుడి చిత్రీకరణలో పాత్రల నిమ్నోత్తమాలు, వాటి తాలూకు భావోద్వేగాలు, అభినయ విలాసాలు, అన్నీ మహోన్నతంగా ఉట్టి పడతాయి. కాంతారావు, నాగయ్య, రామకృష్ణ, ధూళిపాళ, సత్యనారాయణ, జగ్గయ్య, రాజబాబు, బాలకృష్ణ (అంజి గాడు), రాజశ్రీ, విజయలలిత, విజయనిర్మలల బారెడు తారాతోరణంతో రాఘవయ్య దర్శకత్వ లాఘవం మనల్ని కదలకుండా కట్టిపడేస్తుందంటే అతిశయోక్తి కాదు. అదే నీవంటివీ, కృష్ణయ్యా గడసరి కృష్ణయావంటి పాపులర్ గీతాలతో, నృత్యాలతో, సూటిపదాల సంభాషణలతో; రాజకోట, మాంత్రికుడి కళాత్మక సెట్స్ తో, సమ్మోహనకర ట్రిక్ ఫోటోగ్రఫీతో, కత్తి పోరాటాలతో పరిపుష్ట పంచభక్ష్య పరమాన్న విందిది. నిర్మాణ వ్యయాన్ని వేదాంతం ఆరు లక్షలకి పైగా లాగేశారని కాంతారావు వాపోయినా, వేదాంతం ఇచ్చిన విందు ముందు కాంతారావు ఖేదం బేఖాతర్ మనకి!

          విచిత్రంగా జానపదంలో పౌరాణీకాన్ని కలుపుకున్న జానర్ ప్రయోగమిది. దీంతో ఇది ఆథ్యాత్మిక యానం కోసం చేసే మనోవైజ్ఞానిక విహార యాత్రవుతోంది. హాలీవుడ్ చలన చిత్ర రాజం రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్లో ఆథ్యాత్మిక శక్తులున్న ఆర్క్ కోసం జరిపే పోరాటం ద్వారా మహా దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఏం చెప్పాలనుకున్నాడో, సరీగ్గా లోక కల్యాణాన్నే ప్రబోధిస్తోంది సప్త స్వరాలుకూడా!
***
       చరిత్రలో హిట్లర్ దురంతాలు ఒక మాయని మచ్చ. చీకటి అధ్యాయం మీద చలన చిత్రాలు అనేకం వచ్చాయి. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన షిండ్లర్స్ లిస్ట్సహా. సినిమాలు రెండు విధాలు : సమూహాల కథలు, వ్యక్తిగత మైన చిత్రణలు. అయితే యూరోపియన్ దర్శకులు తీసే ఒకటి రెండు పాత్రల వ్యక్తిగత కథలే అర్ధవంతంగా వుంటున్నాయని పరిశీలకులు అనేమాట. వ్యక్తీ, అతడి కుటుంబం- గ్రామం- గ్రామంలో కుటుంబం మీద వచ్చిపడిన నాజీ దళాలు- వాళ్ళు పెట్టే చిత్ర హింసలు, మరణాలూఇలాటి పర్సనల్ కథలతో నాటి మారణ హోమాన్ని మరింత దగ్గరగా చేసి చూపించడం యూరోపియన్ సినిమాలు చేస్తూ వచ్చాయి. అలాటి ఒక మరపురాని యూరోపియన్ సినిమానే ఇటలీకి చెందిన  'లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్అనే ప్రపంచవ్యాప్తంగా పాపులరైన మూవీ. హిట్లర్ కాలంలో యూదుల ఊచకోత పై వచ్చిన సినిమాలన్నీ విషాదభరితాలే. లక్షల మంది యూదుల్ని పొట్టన బెట్టుకున్న రక్కసి చరిత్రని వినోద భరితంగా తీసే సాహసం ఎవరైనా చేస్తారా? తీస్తే కచ్చితంగా విమర్శల పాలవడం, మనోభావాలు దెబ్బతినడం, నిషేధానికి గురికావడం వగైరా ఎన్నో ఆటంకాలు ఏర్పడ వచ్చు. దర్శకుడు వెలివేతకి కూడా గురికావచ్చు, దాడులు కూడా జరగ వచ్చు. విషాద చరిత్రని కామెడీ చేయడమంటే మాటలా? కానీ దీనికి సాహసించాడు దర్శకుడు, నటుడూ అయిన రాబర్టో బెనిగ్నీ. ప్రపంచాన్ని ఆశ్చర్య పరచాడు, ఆగ్రహపర్చలేదు. ప్రేక్షకుల్ని లోతుగా తాకాడు, రెచ్చ గొట్టలేదు. ప్రభుత్వాల్ని ఔరా అన్పించాడు, నిర్బంధాలకి గురికాలేదు. అతడి అధ్యయనానికీ,  అయిడియా చెప్పడానికి ప్రదర్శించిన సృజనాత్మకతకీ, కళాత్మకతకీ యావత్ప్రపంచం జేజేలు పలికింది.ఇంతకీ యూదుల ఊచకోత చరిత్రకి ఎలాటి చిత్రణ చేశాడు బెనిగ్నీ? అది హాస్యభరితం ఎలా అయ్యింది? ఇలా హాస్య విషాద రసాలని మేళవించే కళా ప్రక్రియని ఏమంటారు

      ఇక్కడ నటుడిగా సరే, బెనిగ్నీది నిరుపమాన పాత్ర పోషణ. దర్శకుడిగా అతడి పరిపక్వత గురించే చెప్పుకోవాలి. ఎక్కడా కామెడీ వల్ల విమర్శకి తావులేని సన్నివేశ కల్పనా, భావోద్వేగాలూ, సున్నితపు హాస్యమూ బ్యాలెన్స్ చేసి ఎవరూ వేలెత్తి చూపని నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఇలాటి హాస్య- విషాద రసాలని మేళవించే ప్రక్రియని రసనఅన్నారు మహాకవి శ్రీశ్రీ. నాజీ రక్కసి అకృత్యాలపై   వచ్చిన అన్ని సినిమాల్లో కెల్లా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ఎందుకు ప్రత్యేకంగా నిల్చిందంటే, రసనప్రక్రియ వల్లే. నాజీల దుష్క్రుత్యాలకి ఇలాటి సృష్టి ఇంకెవరూ చేయలేరు, చేయబోరు కూడా- చేస్తే అది లైఫ్ ఏజ్ బ్యూటిఫుల్కి నకలు అవుతుంది. నిమిషం కూడా ప్రేక్షక లోకం ముందు నిలబడదు.

 ***
     పోకూరి బాబూరావు నిర్మించిన ‘ఎర్రమందారం’ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కొక పాఠం. ఈ కథలో సినిమా బండి రాముడుగా రాజేంద్రప్రసాద్ ప్రవేశించి, ఊరి దొర చేతిలో కీలుబొమ్మయ్యే దళిత సర్పంచ్ గా స్థిర పడి, తిరగబడి, చివరికి చచ్చి పోతాడు. పంచాయితీ రాజ్ వ్యవస్థలో రిజర్వేషన్ల ప్రహసనానికి పాత్ర, సినిమా మచ్చు తునకలు.
          
         ట్రాజడీల్లో పాత్రల మనస్తత్వాల పైన ముగింపులు  ఆధార పడతాయి. మనుషులు మారాలిలో శోభన్ బాబు పాత్ర మరణం, కేవలం శారద పాత్ర మానసిక స్థితి వల్ల  మరో విషాదాంతానికి దారి తీస్తుంది. అదే ఎర్రమందారంలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర మరణంయమున  పాత్ర మానసిక బలం వల్ల  విజయానికి దారితీస్తుంది!  వైఫల్య సాఫల్యాలు రెండూ వాటి నేపధ్య బలాలతో సినిమా విజయానికి తోడ్పడతాయి. చాలినంత నేపధ్య బలం లేకపోతే   సినిమాలూ నిలబడలేని ముగింపులు ఎదురవుతాయి. 

         
ఇందులో స్క్రీన్ ప్లే పరిభాషలో చెప్పుకోవాలంటే, యమునది డెడ్ హ్యాండ్- ఆఫ్ పాత్ర. కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్ర తాత్కాలికంగా కనుమరుగై, దాని ఆశయ సాధన కోసం ఇంకో పాత్ర కథని కొంతవరకు ముందుకు నడిపించి, తిరిగి ప్రధాన పాత్ర ప్రవేశించగానే ఆశయాన్ని లేదా  విజయ పతాకాన్ని ప్రధాన పాత్రకి అప్పగించి తప్పుకుంటుంది. ఇది హ్యాండ్ ఆఫ్ పాత్ర.  ఇలాకాక ప్రధాన పాత్రే మధ్యలో మరణిస్తే, చివరంటా దాని ఆశయాన్ని ముందుకు నడిపించే డెడ్ హ్యాండ్-  ఆఫ్ పాత్ర యమున పోషించిన పాత్ర లాంటిది. ఇంతకీ కథ ఏ పాత్రది అన్న ప్రశ్న వేస్తే, బాబూరావే ఈ ఇంటర్వ్యూలో  చెప్పినట్టు ఏ పాత్రదీ కాదుఅదొక కథ అంతే! 

         
ఎర్ర మందారంస్క్రిప్టు ఎలా తయారయ్యింది? ఇటీవల  ‘యజ్ఞం’, ‘రణం’, ‘ఒంటరిలాంటి భారీ సినిమాలు నిర్మించిన పోకూరి బాబూరావు అప్పట్లో నేటిభారతం’, ‘రేపటి పౌరులు’, ‘దేశంలో దొంగలు పడ్డారువంటి హిట్స్ కూడా నిర్మించి వున్నారు. ఒకరోజు ఆంధ్ర జ్యోతి’  దీపావళి ప్రత్యేక సంచికలో ఎంవిఎస్ హరనాథ రావు రాసిన లేడి చంపిన పులి నెత్తురుకథ చదివి ఇన్స్ పైర్ అయ్యారు బాబూరావు. 

         
దీన్ని సినిమాగా తీద్దామంటే, దీనికి  సరిపడా సినిమా లక్షణాల్లేవని తోసిపుచ్చారు హరనాథ రావే. బాబూరావు పట్టుబట్టడంతో ఇక తప్పదనుకుని ఆయనతో కలిసి కూర్చుని ఒక ఔట్  లైన్ తయారు చేశారు హరనాథ రావు. అది బాబూరావుకు నచ్చింది. కానీ హరనాథ రావుకి సంతృప్తి కలగలేదు. కథలో లైఫ్ మిస్ అయినట్టు వుందని, డాక్యుమెంటరీలా వుందనీ చెప్పి ఇంకో పది  రోజులు టైం తీసుకున్నారు. అప్పుడొచ్చి పూర్తిగా మార్చేసిన కొత్త ఔట్ లైన్ విన్పించారు. 

         
ఇంతకీ పత్రికలో వచ్చిన అసలు ఒరిజినల్ కథేమిటి? ఊరి దొర చేతిలో భర్తని పోగొట్టుకున్నయువతి,   దొర మీద పగదీర్చుకోవడం అచ్చులో వచ్చిన  స్టోరీ లైన్. ఇందులో పూర్వం జరిగిన భర్త హత్య గురించి రేఖా మాత్రమైన ప్రస్తావనే తప్ప, కథగా వుండదు. పూర్తి కథ ఆమె పరంగా నడిచేదే. దళితవాడ నుంచి పెట్రేగిన స్త్రీ కథ. కథలో దొర ఆమెని అనిభవిస్తాడు కూడా. కొడుకు ఆమెకి సాయంగా వున్నా, దొర హత్యలో పాలుపంచుకోడు.

         
చిన్న కథని సినిమాకి తీసుకునే సరికి భర్త పాత్రని పెంచుతూ  రిజర్వేషన్ల అంశం జోడించి, దొర చేతిలో అతను హతమయ్యేందుకు అవసరమైన నేపధ్య బలమంతా కల్పించారు. కథానాయికని దొర అనుభవించే ఘట్టం తొలగించి, సినిమా కాబట్టి హీరోయిన్ పాత్ర పావిత్ర్యాన్ని కాపాడుతూ, అదే సమయంలో కమర్షియాలిటీ కోసం కొడుకు పాత్రని దొర హత్య కి తగు విధంగా యాక్టివేట్ చేశారు. ఇలా మారిపోయిన కొత్త  ఔట్ లైన్ బాబూరావుకి ఇంకా బాగా నచ్చి, మరో రచయిత సంజీవితో సీనిక్ ఆర్డర్,  ట్రీట్ మెంట్ వగైరా కానిచ్చారు. ఫైనల్ గా హరనాథ రావు డైలాగ్ వెర్షన్ రాశారు. ఇందులో ఆయన సోదరుడు, రచయిత మరుధూరి రాజా స్వల్ప పాత్ర పోషించారు. స్క్రీన్ ప్లే క్రెడిట్ బాబు రావు సంజీవీలు తీసుకుంటే, కథ -మాటలు హరనాథ రావు వేసుకున్నారు. 

         
స్క్రిప్టు దర్శకుడు ముత్యాల సుబ్బారావు చేతిలో ఎలా తెరకెక్కిందంటే, ఆయన లెఫ్ట్ కి ఎక్కువ ప్రాధాన్య మిచ్చినట్టు కన్పిస్తుంది. ముఖ్యంగా  రాత్రి పూట లాంతరు పట్టుకుని భర్త కోసం యమున వెతికే దృశ్యాల్లోని  మైన్యూట్ డిటైల్స్ అన్నీ, అచ్చం స్క్రీన్ ప్లేలో రాసిన వర్ణనలతోనే చిత్రీకరించడంతో, అదంతా ఒక సినిమా చూస్తున్నట్టు వుండదు, సినిమాని చదువుతున్నట్టు వుంటుంది.  అదీ సుబ్బయ్య టాలెంట్. దీనికి ఆర్.  రామారావు కెమెరా వర్క్ క్లాసిక్ టచ్ ఇచ్చింది.  

         
సాధారణంగా సినిమాల్లో విలన్ ఎంట్రీ ని అతను కన్పించగానే,  ప్రత్యక్షంగా అక్కడికక్కడే ఏదో దారుణానికి పాల్పడ్డంగా   చూపిస్తూంటారు. కానీ ఎర్ర మందారంస్క్రీన్ ప్లేలో విలన్ అయిన దొరని చూపించకుండానే అనుచరుల చేత అతడి దాష్టీకాన్ని చూపిస్తూ- చెప్పుల దండతో  గుడి పూజారిని ఊరేగించే దృశ్యంతో ఇలాటి కర్కోటకుడు విలన్ అంటూ  పరోక్షంగా తెలియజేయడం  ఎంతో రిలీఫ్ నిస్తుంది రొటీన్ మూస నుంచి మనకి!  విలన్ పాత్ర పరిచయం ఇలా ఎంత హాయిగా అన్పించిందో బాబూ రావుకి చెపితే, ఆయన హాయిగా చిరునవ్వు నవ్వేసి  వూరుకున్నారు.



సికిందర్ 

18, జనవరి 2018, గురువారం

587 ; రివ్యూ!

ర్శత్వం: శ్రీరంజని
తారాగణం :  రాజ్ రుణ్, చిత్రా శుక్లా, సితార, ప్రియర్శి దితరులు
సంగీతం :  శ్రీచరణ్ పాకాల,  ఛాయాగ్రణం: ఎల్‌.కె.విజయ్
బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్
విడుదల : జనవరి 14, 2018

***
        రోమాంటిక్ సినిమాల హీరోగా రాజ్ తరుణ్ యువ ప్రేక్షకులకి ఒక క్రేజ్ మొదటి మూడు సినిమాలతో. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావా, కుమారి 21 ఎఫ్ వంటి మూడు రోమాంటిక్కుల తర్వాత రూటు మార్చి మాస్ యాక్షన్ హీరోయిజానికి దిగడంతో, యువప్రేక్షకులు తగ్గిపోయి ఓపెనింగ్స్ లేకుండాపోయాయి. సీతమ్మ అందాలు –రామయ్య సిత్రాలు, ఈడో రకం – ఆడో రకం, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు అనే మాస్ యాక్షన్లతో ఒరిజినల్ ఇమేజిని కోల్పోయాడు. ఈ ప్రభావం మధ్యలో వచ్చిన నాన్నా నేనూ నాబాయ్ ఫ్రెండ్స్ అనే రోమాంటిక్ మీద కూడా పడింది. మళ్ళీ ఇప్పడు తాజాగా ‘రంగులరాట్నం’ అనే రోమాంటిక్ తో వచ్చినా పండక్కి కూడా యువప్రేక్షకుల్లో కదలిక లేదు. అన్నపూర్ణ బ్యానర్, శ్రీరంజని అనే తమిళ కొత్త దర్శకురాలు అనే ఆకర్షణీయ హంగులు సమకూరినా ప్రయోజనం కన్పించడం లేదు. ఇంత మాత్రాన తను పనికిరాకుండా పోయాడని కాదు. యూత్ అప్పీల్ దేనికుంటుందో ఆ సినిమాలు చేస్తే తప్పకుండా పనికొస్తాడు. మొహమాటాలకి యూత్ అప్పీల్ వుండని సినిమాలు నటిస్తే ఎన్నటికీ పూర్వ ప్రాభవం తిరిగి రాదు. ఇప్పుడు ‘రంగులరాట్నం’ కూడా  ఇంకెందుకని కాసుల రాట్నం కాలేక పోయిందో ఈ కింద చూసుకుంటూ వెళ్దాం... 

కథ 
       విష్ణు (రాజ్ తరుణ్) ఓ ఉద్యోగం చేస్తూ తల్లి (సితార)తో వుంటాడు. అతడికి పెళ్లి సంబంధాలు చూస్తూంటుంది తల్లి. ఓ పెళ్ళిలో కీర్తి (చిత్రా శుక్లా) ని చూసి ఇష్టపడతాడు. తల్లికి కూడా ఈమె నచ్చుతుంది. ఇంతలో గుండె పోటుతో చనిపోతుంది. తల్లి మరణంతో విష్ణు విషాదంలో పడిపోతాడు. కీర్తి అతడికి దగ్గరై అతడి ఆలనాపాలనా చూసుకోవడం మొదలెడుతుంది. ఆమె చెప్పే జాగ్రత్తలు, తీసుకునే అతిజగ్రత్తలూ అతణ్ణి విసిగిస్తాయి. దీంతో దూరమైపోతాడు. తర్వాత ఆమెని అపార్ధం చేసుకున్నానని తెలుసుకుని తిరిగి దగ్గరవుతాడు. ఇదీ కథ.

ఎలావుంది కథ 
      ఈ ప్రేమకథ రోమాంటిక్ డ్రామా జానర్ లోకొస్తుంది. తమిళ దర్శకురాలు శ్రీరంజని తొలి ప్రయత్నంగా తెలుగులో అడుగుపెట్టి కెరీర్ ని ప్రారంభిస్తోంది. ఈ నడుస్తున్న శతాబ్దంలో తెలుగులో దర్శకురాళ్ళు కొందరు వచ్చారు. వాళ్ళు తమ స్త్రీ దృక్కోణంలో కథల్ని, పాత్రల్ని చూపించకుండా, పురుష పంథాలోనే పురుషులు తీసినట్టు సినిమాలు తీసేసి తమ జెండర్ అస్తిత్వాన్ని పురుషస్వామ్యానికి తాకట్టు పెట్టేస్తున్నారు. కొందరైతే మాస్ యాక్షన్లు అంటూ మోజు పెంచుకుని బోల్తా కొడుతున్నారు. ప్రేమకథలు, సామాజిక కథలు ఏ కథలు చూసినా పురుష వాసనలతోనే వండి వారుస్తున్నారు. వివాహ భోజనంబులనేవి మాస్ రేంజిలో పురుషులు పాల్పడే  గారడీ వంటకాలు. స్త్రీలు ఇంటి వంట చేసుకోవాలి. దర్శకురాళ్ళు కూడా ప్రేక్షకులకి ఇంటి వంట నోచుకోకుండా  చేయడం దారుణం. స్త్రీ స్పర్శ గల సృజనాత్మకత తెలుగు దర్శకురాళ్ళనుంచి రాకపోవడం చాలా వింత. ఇందుకేనేమో మీడియా మిత్రులు ‘మహిళా దర్శకురాలు’ అని తెగ రాసేస్తూంటారు. ‘మగ దర్శకురాలు’ కూడా వుంటారనేమో. అప్పుడు దర్శకుడు ‘పురుష దర్శకురాలు’ అవుతాడా? దర్శకురాలు మహిళే. అమాయకురాలు మహిళే. మహిళా అమాయకురాలనీ వుండదు. దర్శకురాల్లోనే నూటికి నూరుపాళ్ళూ మూర్తీభవించిన మహిళామణియే ఖచ్చితంగా కొలువుదీరి వుంటుంది. మగవాడు వుండడు. మగ దర్శకురాలుండదు దరిద్రంగా. శ్రీరంజని ‘మహిళా దర్శకురా’లని అన్ని రకాల మీడియాల్లో అందరూ హోరెత్తించుకోవడం అయింది. ఇక రేపు ఇంకొకర్ని  ‘మహిళా నటి’ అని దుమారం రేపడానికి సర్వసన్నద్ధులవుతారు బహుశా ఇప్పట్నించే. డిజిటల్ పలకలతో భాషా స్పృహ ఏముంటుంది. అ ఆలు కూడా రానవసరం లేదు. 

          ఐతే శ్రీరంజని ఇప్పుడు – దర్శకురాలిగా మేల్ టెండెన్సీని పూసుకోకుండా తనదైన జెండర్ ప్రధానమైన దృక్పథంతో కథ తీసుకొచ్చింది. ఒక యువకుడికి ఇటు తల్లితో, అటు ప్రేయసితో వుండే అనుబంధాన్ని అతడి దృక్కోణంలోంచి కాకుండా,  ఆ తల్లీ ప్రేయసుల దృక్కోణంలో చూపాలనుకుంది. అంటే ఇది కథానాయకుడి కథ కాదు, రెండు స్త్రీపాత్రల కథ. వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ విజయం. ఐడియా వరకూ ఈ ఆలోచన  ఆశాజనకంగా కనిపిస్తుంది. ఐడియాని అమల్లో పెట్టేసరికి జనరంజకం కాలేకపోయింది సహజంగానే. స్త్రీ పాత్రల్ని సమర్ధవంతంగా చిత్రించడంలో దర్శకులకి దర్శకురాళ్ళు సాటి రారు. ‘ఫిల్హాల్’ తీసిన మేఘనా గుల్జార్ కూడా. దర్శకుడు సులభంగా స్త్రీ పాత్రలోకి పరకాయప్రవేశం చేసేసి సబ్జెక్టివ్ గా చూస్తాడు, దర్శకురాలు పైపైనే ఆబ్జెక్టివ్ గా చూసి సగటు స్త్రీ అన్పించుకుంటుంది  – స్త్రీకి స్త్రీయే శత్రువనే టాక్ ని నిజం చేస్తున్నట్టు స్త్రీ పాత్రల్ని కిల్ చేస్తుంది. శ్రీ రంజనికూడా ఐడియా విషయంలో చూపినంత జెండర్ దృక్పథాన్ని స్త్రీ పాత్రల విషయానికొచ్చేసరికి వదిలేసింది. దీంతో కొడుకు - తల్లి
- ప్రేయసుల  ముక్కోణం తన జెండర్ దృక్కోణం లేకుండా పోయి, అభాసు అయింది.  ఆమె ఈ రెండో పార్శ్వాన్ని కూడా సగటు స్త్రీ సిండ్రోమ్ లోంచి ఇవతలకొచ్చి జయించగలిగితే, త్వరత్వరగా ఎదగ గల్గుతుంది. దర్శకుల దగ్గర అసిస్టెంట్లుగా చేరకుండా, ప్రూవ్ చేసుకున్న దర్శకురాళ్ళ దగ్గర చేరితే వ్యక్తిత్వమున్న స్త్రీత్వం వచ్చే అవకాశముంది సృజనాత్మకతకి. 

ఎవరెలా చేశారు 
       రాజ్ తరుణ్ కథకాని కథలో నటించడం వల్ల ఈసారి ఆకట్టుకోడు.  పేలవమైన పాత్ర, పేలవమైన సీన్లు అతణ్ణి ఆశక్తుణ్ణి చేశాయి. గోల్ లేని పాసివ్ పాత్రే, ఎందుకంటే ఇది కథానాయకుడి కథ కాదు కాబట్టి.  తల్లిగా నటించిన సితార, ప్రేయసిగా నటించిన హీరోయిన్ చిత్రా శుక్లా ఇద్దరి  కథానాయికల కథ కాబట్టి. రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సిషన్ పొందే పాత్రగా వుండాల్సింది, రొటీన్ లవర్ బాయ్ లక్షణాలతో తప్పుడు పాత్ర చిత్రణ పాలబడ్డంతో - చూసే ప్రేక్షకులకి విసుగు పుట్టించేలా తయారయ్యాడు. రొటీన్ లవర్ బాయ్ అయినప్పుడు గోల్ వుంటుందనీ, గోల్ కోసం సంఘర్షిస్తాడనీ ఎదురు చూస్తారు ప్రేక్షకులు. అంటే కథకి ఇతనే కథానాయకుడనుకునే పరిస్థితి ప్రేక్షకుల కొచ్చింది. అసలు చూపించాల్సిన తల్లీ ప్రేయసుల కథానాయికల పాత్రల్ని (ప్రధాన పాత్రల్ని) వాటి గోల్స్  కోసం ప్రయత్నిస్తున్నట్టు, బలంగా చూపించక పోవడం వల్ల ఈ పరిస్థితేర్పడింది. రాజ్ తరుణ్ నటన యూత్ అప్పీల్ కి,  బాక్సాఫీసు అప్పీల్ కీ దూరంగా  పేలవంగా తయారవడానికి ఇంతకంటే వేరే కారణం లేదు. పాత్ర డీఎన్ఏ ని బట్టి నటనతో ఆకట్టుకోవడం,  ఆకట్టుకోక పోవడం వుంటాయి. రాజ్ తరుణ్ ఆకట్టుకోవాలంటే ఈ పాత్రకి ట్రాన్సిషన్ పొందే పాత్రగా ఇన్నర్  ఇంజనీరింగ్ అవసరం. 

          సితార నటించిన తల్లిపాత్ర కొడుకుని కంటి రెప్పలా చూసుకుంటూ, పెళ్లి చేయాలనీ ప్రయత్నించే పాత్ర. ఫస్టాఫ్ లో ఈమె అర్ధాంతర చావు ఇంకో పేలవమైన మలుపు. మొదటి  ప్రధాన పాత్రగా తను ఏమీ చేయకుండా చనిపోవడం నిరర్ధక పాత్రగా మార్చేసింది. కనీసం చివరి కోరిక, మాటా గీటా ఏమీ వుండవు. ఇది రొటీన్ ఫార్ములాయే అనుకుంటే, ఈమె ఉన్నట్టుండి చనిపోగానే సుదీర్ఘ ఆలాపనతో సృష్టించిన మేలో డ్రామా కూడా పాతదే. పైగా సన్నివేశ బలం లేదు. కనీసం జీవించినంత కాలం ఆమె కొడుకు మీద చూపిన బలమైన ప్రభావం, వేసిన ముద్రా ఏమీ లేవు. అంత కంటి రెప్పలా  చూసుకునే తల్లి ప్రభావం కొడుకు మీద ఏమీ వుండకపోవడం పాత్రచిత్రణ అవదు. ఆమె మరణం అతడి జీవితాన్ని మార్చెయ్యలేదు. అలాగే ఏడుస్తూ వుంటాడు. ఏడుస్తూ వుండడం కథ అవదుగా? ఏం చేయాలో అది చేయడం కథవుతుంది. ఇలాటి పరిస్థితుల్లో ఇలాటి యూత్ కి అది ఇన్ స్పైర్ చేసే కథలా వుంటుంది. ఇందువల్ల బాక్సా ఫీసు అప్పీల్ వస్తుంది. ఏ సీనుకా సీను ఎంతవరకూ ప్రేక్షకులకి అమ్మగలమని ఆలోచించకుండా గుండుగుత్తగా తీసేసి, ఫైనల్ సీనే  రిజల్ట్ నిస్తుందిలే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఈ సినిమాకి ఇదే జరిగింది – చిట్ట చివర ఫైనల్ సీనులో మాత్రమే రిజల్టు చూసుకుని, మొత్తం సినిమా బాగా వచ్చిందని  సంబరపడే తంతు. షూటింగులో ప్రతీ నిమిషం విలువైనదని తాపత్రయపడ్డం టోటల్ పిక్చర్ కాదు.  తీసిన సీన్లు తెర మీద ఒక్కోటి బాక్సాఫీసు నుంచి జారిపోకుండా కూడా చూసుకోవాలి. షూటింగులో ప్రతి నిమిషం కరిగిపోయే ప్రతీ రూపాయీ, తెర మీద ప్రతీ నిమిషం బాక్సాఫీసు నుంచి జారిపోకుండా చూడ్డమే టోటల్ పిక్చర్ చూడ్డం అన్పించుకుంటుంది. ఈ టోటల్ పిక్చర్ రాస్తున్నప్పుడే చూసుకుంటూ వుండాలి. 

        తమిళ దర్శకురాలి తల్లి పాత్ర చిత్రణ బహుశా తమిళనాడులో జయలలిత నుంచి స్ఫూర్తి పొందింది. తనే లేకుండా పోయాకా ఏదెలా పోతే నాకేమని జయలలిత ఒకప్పుడన్న మాటలే నిజం చేసి వెళ్ళిపోయింది. ఓ రాజకీయ వారసత్వ ప్రకటన లేదు, ఆస్తిపాస్తులకి వీలునామా లేదు. రెండూ కుక్కలు చింపిన విస్తరి అయ్యాయి. దర్శకురాలి పాత్ర తల్లి కూడా ఇలాగే వెళ్ళిపోయింది కథని దిక్కూ మొక్కూ లేకుండా చేసేసి. 

          హీరోయిన్ తో ఒకే సీనుంటుంది. హీరోయిన్లో కోడల్ని చూసుకుని మురిసిపోతుంది. హీరోయిన్ వెళ్లిపోతూంటే ఆగమంటుంది. ఆగి ఏంటన్నట్టు చూస్తుంది హీరోయిన్. ఏం లేదంటుంది. హీరోయిన్ వెళ్ళిపోతుంది. అంటే, ఇక్కడ తల్లి చేత ఏం చెప్పించాలో కథకురాలికి తెలియలేదనుకోవాలా? లేక ఆ అవసరాన్ని గుర్తించలేదా? సీను ముగింపులో ఫిల్లర్ కోసం  హీరోయిన్ని ఆగమని చెప్పి, ఏమీ లేదని చెప్పి పంపించేసిందా? చనిపోబోయే పాత్ర తర్వాత కథ నడపబోయే రెండో ప్రధాన పాత్రకి ఏమీ చెప్పదా? ఇలా పొందిక లేకుండా పాత్రచిత్రణలు, సీన్లు ఏ ముక్కకా ముక్కగా వచ్చిపోతూంటాయి. 

          క్యారక్టర్ ఆర్టిస్టులందరూ మంచి నటులే. పాత్రల  అంతర్నిర్మాణాల్ని బట్టి వాళ్ళ నటనలుం టాయి. అందుచేత పాత్ర చిత్రణ ఇలా వున్నాక సితార బాగా నటించ లేదనుకోవడం సబబుకాదు. 

          రెండో ప్రధాన పాత్రలో హీరోయిన్ చిత్రా శుక్లాది పక్కదోవ పట్టిన పాత్ర. ఆమె చూడ్డానికి హోమ్లీగానే వుంది. పాత్ర ప్రవర్తనతో ఇబ్బంది వచ్చింది. పాత్ర ఏ కోవలో వుండాలో ఆ కోవలో వుండుంటే ఆమె నటనతో సెకండాఫ్ ని రంగులరాట్నం చేసేది. ప్రేమించిన వాడి తల్లి చనిపోయింది. బాధలో వున్నాడు. బాధలో వున్నవాడి బాధ దూరం చెయ్యాలా లేక టార్చర్ పెట్టాలా? రెండోదే చేసింది. ప్రేమలో పొసెసివ్  నెస్ వేరు. ప్రేమించిన వాడు ఎక్కడ తనక్కాకుండా పోతాడోననే భయంతో జలగలా పట్టుకుని వుండడం. ప్రేమించిన వాడు చిన్నపిల్లాడై పోయాడని ఆదుపాజ్ఞల్లో వుంచుకుని జాగ్రత్తలు చెప్పడం వేరు. ఇక్కడ తల్లిపోయిన హీరోతో హీరోయిన్ చేసిందిదే. తల్లి కూడా పెట్టని బాధలు పెడుతుంది తన అతిజాగ్రతా ప్రవర్తనా నియమావళితో. దీంతో స్వేచ్ఛ కోల్పోయి ఇంకింత పిచ్చివాడవుతాడు. ఛీ కొడతాడు, దూరమవుతాడు. ఇంకింత బాధలో పడిపోతాడు. ఈ కథలో సమస్య అతను, పరిష్కారం తను (హీరోయిన్) అయినప్పుడు, దీనికి విరుద్ధంగా తనే సమస్యలా ఎలా తయారవుతుంది? ఇది తప్పుడు పాత్రచిత్రణ, తప్పుడు కథనం, పాత్రకి తప్పుడు గోల్ అవుతాయిగా? 

          హాలీవుడ్ లో ఇలాటి కథలు సైకో థెరఫీలా వుంటాయి. సైకోల్ని తయారు చేసేలా వుండవు. హీరోయిన్ ఇలా చేయడానికి కారణం చెపుతూ ఒక ఫ్లాష్ బ్యాక్ వేశారు. ఇందులో చిన్నప్పుడు తండ్రి చనిపోయిన సీను చూస్తుంది (ఫస్టాఫ్ లో హీరో మదర్ మరణం తర్వాత మళ్ళీ ఇక్కడ హీరోయిన్ ఫాదర్ మరణమనే రిపీట్ సీను, రిపీట్ ఆలాపన) దీంతో రేపు ఇంకెవరైనా తన వాళ్ళనుకున్న వాళ్ళు ఇలాగే దూరమవుతారనే భయంతో ఈ  అతిజాగ్రతా తత్త్వం అలవడిందట. ఇది తప్పు. 

          హీరోయిన్ ఇంతగా ప్రేమించినవాడి క్షేమం కోరుకోవడానికి ఆమెకో కారణం వుండాలన్నట్టు ఈ ఫ్లాష్ బ్యాక్ వేయడం, ఆ కారణమేదో  చూపడం  సరికాదు. ప్రియురాలు  ప్రేమించినవాడి క్షేమం కోరుకోవడానికి ప్రేమ తప్ప ఇంకే కారణం వెతుక్కుంటుంది? ప్రేమ కారణం కాకపోవడంతో హీరోయిన్ పాత్ర లేకిగా తయారయ్యింది. సన్నివేశాల్లోంచి ప్రేమ ఔటై అపరిపక్వత రాజ్యమేలింది. మరింత విషాదంగా, బోరుగా  తయారయ్యింది. ఈ కథలో తల్లి చనిపోవడం వరకే విషాదం. ఆ తర్వాత వుండాల్సిన కథనం, డైనమిక్స్  ఆ విషాదం లోంచి బయట పడ్డం గురించి. తల్లిని మించిన ప్రేమతో తల్లిని మరిపించి వుంటే రెండో ప్రధాన పాత్రగా హీరోయిన్ ఈ గోల్ పెట్టుకుని సాధించేది.  తల్లి మరణం ఏ వయసులో వున్నా మగవాడిని ఎక్కువ దెబ్బ తీస్తుంది. ఓ పట్టాన కోలుకోలేడు, నిజమే. కానీ ఆమె ఎక్కడికీ పోలేదు- తన రక్తంలోనే, జీన్స్ లోనే అనుక్షణం శాశ్వతంగా వుంది. ఇలాటి ఒక గోల్ తో హీరోయిన్ స్టాండ్ తీసుకుని అతడికి ఎవేర్ నెస్ కల్గించి వుంటే, ఆమెలోనే అతను తల్లిని చూసుకోవచ్చు. ఆమె రోమాన్సులోనే  అంతర్లీనంగా తల్లి ప్రేమే కన్పించి ప్లాట్ పాయింట్ వన్ కి పరిష్కారం దొరకవచ్చు. 

          రెండు స్త్రీ పాత్రల పరమార్ధమిదే. కానీ రెండూ ఇది గుర్తించకుండా గోల్స్ లేని పాత్రలుగా వృధా అయ్యాయి. చిట్ట చివరికి హీరో ఫైనల్ సీన్లో వెనకటి సీన్లు నెమరేసుకుని,  తల్లితో హీరోయిన్ని పోల్చుకుని, అవునుకదా – మదర్ సెంటిమెంటుతోనే హీరోయిన్ అలా  ప్రవర్తించింది కదాని తప్పు తెలుసుకుంటాడు. జడ్జి మెంట్ కరెక్టే, జడ్జిమెంట్ కి దారితీసిన హీరోయిన్ తీరే  వెగటు. చూపించాల్సిన బూతంతా చూపించేసి, చివర్లో నీతి చెప్పి బయట పడినట్టు వుంది. 

          ప్రియదర్శి కమెడియన్ పాత్ర సోసోగా వుంది. ఇంకా చెప్పుకోదగ్గ పాత్రల్లేవు. సంగీతం, కెమెరా, ప్రొడక్షన్ విలువలు వగైరా నిర్మాతగా నాగార్జున రేంజిలో లేవు. 

చివరికేమిటి 
       ఐడియా కిచ్చిన కథనమలా వుంటే, కథనానికిచ్చిన స్ట్రక్చర్ మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే. సెల్వరాఘవన్ అసిస్టెంట్ గా దర్శకురాలు నేర్చుకున్నదేమిటో అర్ధంగాని పరిస్థితి. ఐడియా ఒక్కటే గొప్పది. ఇద్దరు అతివలు ఒక మగాణ్ణి హేండిల్ చేసే ఐడియా. ఈ ఐడియా విస్తరణ, పాత్ర చిత్రణలు టోటల్ ఫెయిల్యూర్. కథనంలో కొత్త సీన్లు కూడా కనపడవు. ఉదయం హీరో ముసుగు తన్ని నిద్రపోతూంటే తల్లి వచ్చి కొట్టి తిట్టి లేపే సీను, హీరోయిన్ పరిచయం కాక ముందు ఒక వెకిలిదానితో పెళ్లి చూపులు, ఆ పెళ్లి చూపుల్లో పర్సనల్ గా వెళ్లి మాట్లాడుకునే సబ్ సీను, అరగంట దాకా ఎంట్రీ ఇవ్వని హీరోయిన్ని ఓ పెళ్ళిలో చూసి హీరో మనసు పారేసుకునే సీను...ఇలా అరిగిపోయిన టెంప్లెట్ సీన్లే వాడేసింది కొత్త దర్శకురాలు కొత్త సీన్లేమీ ఇవ్వకుండా. 

          ఫస్టాఫ్ అంతా తల్లితో ఒక సీను,  హీరోయిన్ తో ఒక సీను, ప్రియదర్శితో ఒక సీను   వంతు లేసుకుని పూరీ జగన్నాథ్ ఆచారంగా రిపీటవుతూంటాయి. ఇవన్నీ నిస్సారమమైనవే. నిజానికి హీరోయిన్ వచ్చే ముందు అరగంటవరకూ తల్లితో బలమైన ఒక కాంట్రాస్ట్ ఏర్పాటు చేసి, హీరోయిన్ ఎంట్రీతో హీరోకి కొత్త లోకమనట్టుగా గేరు మార్చి ఛేంజోవర్  తీసుకుంటూ- మదర్ కీ హీరోయిన్ కీ  మధ్య  హీరో జీవితాన్ని ఎస్టాబ్లిష్ చేసే కథనాన్ని వాడుతూ పోవాలి. మదర్ – హీరోయిన్ వీళ్ళిద్దరే ప్రధాన పాత్రలన్నట్టుగా చెప్పేయాలి. హీరో కథానాయకుడు కాదని స్పష్టం చేసెయ్యాలి. ఇవేమీ చేయకుండా మదర్ తో అనుబంధాన్నీ, అటు హీరోయిన్ తో రోమాన్స్ నీ పండించకుండా చప్పగా, ప్లాట్ డైనమిక్స్ లేకుండా, సడెన్ గా ఇంటర్వెల్ ముందు మదర్ ని చంపేసి,  ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటు చేశారు. దీనికీ అర్ధంపర్ధం లేదు. 

          ఒక ప్రధాన పాత్ర చనిపోతే వేరే పాత్ర రెండో ప్రధాన పాత్రవుతుంది. మదర్ చనిపోతే హీరోయిన్ రెండో ప్రధాన పాత్రగా కథని చేతిలోకి తీసుకుంది. కానీ మొదటి ప్రధాన పాత్రగా ఫస్టాఫ్ లో మదర్ చేతిలోకి తీసుకున్న కథేమీ లేదు. ‘మనుషులు మారాలి’ లో గానీ, ‘ఎర్రమందారం’ లో గానీ మొదటి ప్రధాన పాత్రలుగా శోభన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ లు చనిపోతే, వీళ్ళ గోల్స్ ని అంది పుచ్చుకుని శారద పాత్ర, యమున పాత్ర  రెండో ప్రధాన పాత్ర పాత్రలుగా కథనందుకుంటాయి. ఇలా ఇవి
హ్యాండ్ ఆఫ్ పాత్రలుగా మొదటి ప్రధాన పాత్రల ఆశయాల్ని  సాధిస్తాయి. ఇదేమీ కాకుండా మదర్, హీరోయిన్ల పాత్రలు అర్ధరహితంగా డిటాచ్డ్ గా వుండి పోయాయి ప్రస్తుత సినిమాలో. చనిపోయిన మదర్ పాత్రకి హీరోయిన్ కి అందించడానికి ఒక ఆశయం  లేకపోవడంతో, హీరోయిన్ ఫ్లాష్ బ్యాకుతో కృత్రిమ గోల్ తవ్విపోసుకుని దాంతో సెకండాఫ్ ని కిష్కింధకాండ చేసింది. ప్రధాన పాత్రల అనుసంధానం మర్చిపోతే ఇంతే. 

          ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మదర్ మరణాన్ని సరీగ్గా చూపించి వుంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే  ప్రమాదం తప్పేది. అన్ని ఎలిమెంట్స్ తో ప్లాట్ పాయింట్ వన్ ని బలంగా ఏర్పాటు చేసి,  అక్కడే ఇక కథ హీరోయిన్ దేనని స్పష్టం చేసేసి వుంటే, ఆతర్వాత సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూగా హీరో రియలైజేషన్ కి అదే చూపించిన,  పైన చెప్పుకున్న ఫైనల్ జడ్జి మెంటు సీను పెట్టుకుంటే,  ఈ కథ స్ట్రక్చర్ లో కొచ్చేది. ఇంటర్వెల్ ముందు వరకూ బిగినింగ్, అక్కడ్నించి సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ వరకూ మిడిల్,  స్పష్టంగా వుం డాల్సిన నిడివితో వుంటూ,  ఇదొక స్క్రీన్ ప్లే అన్పించుకునేది.

          ఇలా కాకుండా ప్లాట్ పాయింట్ వన్ మదర్ మరణం దగ్గర హీరోయిన్ లేకుండా చేసి, హీరోతో ఈ కథ అతడిదేనన్న తప్పుడు అభిప్రాయం కల్గించడంతో- ఈ హీరో కథని కొత్తగా ప్రేమ కథగా చూసే  ప్రయత్నంలో ప్రేక్షకులు – ఒక మలుపు కోసం చూడ్డం మొదలెడతారు. చిట్టచివరి ఫైనల్ సీనుకి ఐదు నిమిషాల ముందు,  హీరోయిన్ తో హీరో విడిపోవడమే మలుపనుకుని భ్రమిస్తారు. ఇంతసేపూ  సహనపరీక్ష పెట్టారని తిట్టుకుంటారు. ప్రధాన మలుపు అప్పుడు రావడంతో,  అదే  ప్లాట్ పాయింట్ వన్ అయింది ప్రేమ కథకి. అప్పుడు మిడిల్ ప్రారంభమయింది ప్రేమ కథకి. ఐదు నిమిషాల్లో హీరోకి రియలైజేషన్ అవడంతో ప్లాట్ పాయింట్ టూ వచ్చేసి  అంతలోనే పిసరంత ఈ మిడిల్ కూడా  ముగిసిపోయింది. ఇలా ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయింది హీరో ప్రేమకథకి. 

          కానీ ఈ కథ హీరో ప్రేమ కథ కాదు, హీరోతో ఇద్దరు అతివల ఆరాటపు కథ. ఈ కథ ఇంటర్వెల్ కి ముందే ఒక అతివ అయిన మదర్ మరణంతో ప్రారంభమయ్యింది. కానీ అక్కడ్నించీ సెకండాఫ్ లో ఫ్రెష్ గా హీరో  ప్రేమ కథ ప్రారంభమయ్యిందన్నట్టు నడపడంతో,  ఈ ప్రేమ కథకి క్లయిమాక్స్ ముందు ప్లాట్ పాయింట్ వన్ వచ్చి  సహన పరీక్ష అయింది. ఇద్దరు అతివల కథ అనే ఏకసూత్రత వదిలెయ్యడంతో స్క్రీన్ ప్లే మధ్యకి ఫ్రాక్చర్ అయింది, సెకండాఫ్ సిండ్రోమ్ లో పడింది, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయింది. ఒకటని కాదు, గందరగోళంగా ఎన్నో విప్పలేని చిక్కు ముళ్ళేసుకుంది అనుభవమున్న దర్శకుడి శిష్యురాలు. మహిళా శిష్యురాలు అని రాసుకుంటారేమో రాసుకోవచ్చు. లేడీ మహిళా స్త్రీ దర్శకురాలని కూడా నిరభ్యంతరంగా రాసుకోవచ్చు. మనకే ఇంత కన్ఫ్యూజన్ వుంటే తనేమిటో ఆమెకెంత కన్ఫ్యూజన్ వుంటుంది. ఆమె మంచి ‘మహిళా చిత్రాల దర్శకురాలు’ కావాలని కోరుకుందాం.

సికిందర్



         






         













         






















16, జనవరి 2018, మంగళవారం

586 : సందేహాలు - సమాధానాలు



‘అజ్ఞాతవాసి’  పైన పాతిక ప్రశ్న లొచ్చాయి. కథా కథనాలు, పాత్ర చిత్రణలు వగైరాల గురించి, పండగ సినిమాకి ఇంతకంటే ఎక్కువ క్వాలిటీ అవసరం లేదనడం దాని గురించి, పండగ అని చెప్పి ప్రేక్షకులు ఎలాటి సినిమానైనా చూసేస్తారనడం దాని గురించి, డబ్బు గడిస్తే కళకి దూరమవుతారనడం దాని గురించీ ... ఇలా ప్రశ్నలొచ్చాయి. కొన్ని ఘాటుగానే వచ్చాయి. విడివిడిగా వాటికి సమాధానమివ్వడంకంటే,  వచ్చిన వాటిని పై 4 వర్గాలుగా విడగొట్టి,  సమాధానమిస్తే సరిపోతుందని భావించాం. 

       మొదట కథాకథాలు, పాత్ర చిత్రణలు : స్క్రీన్ ప్లే సంగతులు అడిగారు. అవతల కోడి పందాలు జరుగుతూంటే, ఈ కథ కాపీ కథ అని ప్రపంచం మొత్తం ఇటు టర్న్ అయి కోడై కూస్తున్నాక,  ఇంకా దీన్ని విశ్లేషించుకోవడం హాస్యాస్పదం. చేసిన కాపీ చర్యని ఆమోదించి నట్టవుతుంది. అందుకనే స్క్రీన్ ప్లే సంగతులు జోలికి పోలేదు, పోదల్చుకోలేదు. అంతేగాకుండా, ఈ మధ్య టెంప్లెట్ సినిమాల స్క్రీన్ ప్లే సంగతుల జోలికి మనం పోవడం లేదు. ఏముంటుంది వాటి గురించి ఇంకా రాయడానికి. అవే రాతలు రాయడం, తెలిసిన అవే అవలక్షణాలు  పాఠకులు చదువుకోవడం అర్ధం లేని వ్యవహారం. ఒక క్రిమినల్ యాక్టివిటీ, హీరో ఫైట్, ఆ విజయంతో ఒక గ్రూప్ సాంగ్, హీరోయిన్ తో లవ్ ట్రాక్, ఇక టీజింగ్ సాంగ్, హీరోయిన్ తో లవ్ ట్రాక్ కొనసాగింపు, హీరోయిన్ లవ్ లో పడగానే ఒక డ్యూయెట్, ఇలా మూడు పాటల కోటా పూర్తయ్యాక విలన్ ఎంట్రీ, విలన్తో ఇంటర్వెల్ సీను, ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ సంగతి వదిలేసి విలన్ తో పోరాటం, బ్లాక్ కాస్ట్యూమ్స్ వేసుకుని కొండ కోనల్లో హీరోయిన్ తో ఒక మెలోడీ సాంగ్, విలన్తో పోరాటం, మరో డ్యూయెట్, విలన్ తో మళ్ళీ పోరాటం, జానపద డ్రెస్సు వేసుకుని హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్, విలన్ తో క్లయిమాక్స్....ఈ విధంగా ఒక నాటకం వేస్తున్నట్టుగా టెంప్లెట్ లో వుంటున్న అవే స్టార్ సినిమాల గురించి విశ్లేషణలు దేనికి. 

          హిట్టయినా, ఫ్లాపయినా  ఎప్పుడో ఒక ‘హలో’ లాంటి టెంప్లెట్టేతర సినిమాల గురించి మాట్లాడుకోవచ్చు. ఎంతో కొంత వాటిలో నేర్చుకోవాల్సిన కొత్త సంగతులుంటాయి. ఒకే టెంప్లెట్ లో వుండే స్టార్ సినిమాల్లోంచి ఏం నేర్చుకుంటారు రైటర్లు, డైరెక్టర్లు. అందుకే రచన, దర్శకత్వ ప్రయత్నాల్లో వుంటున్న వాళ్లకి టెంప్లెట్ సినిమాలు చూడవద్దనే ఈ వ్యాసకర్త చెప్తూం టాడు. చూసి చెడిపోవడం తప్ప ఉపయోగం లేదు. ఇలాగే  తీసే మోజుంటే చూసుకోవచ్చు.

          ఇలా కాపీ కథ ‘అజ్ఞాతవాసి’ కూడా టెంప్లెట్ సినిమానే. ఇది కాపీ చేసి వుండకపో
యినా, టెంప్లెట్ సినిమా కాబట్టి దీని స్క్రీన్ ప్లే సంగతులు అప్పుడూ అవసరముండక పోయేవి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. టాప్  దర్శకులైనంత మాత్రాన వాళ్ళ సినిమాలతో భావిదర్శకులకి మార్గదర్శకులవ్వాలని లేదు. ఇన్ స్పైర్ చేయాలనీ లేదు. ఆ రోజులెప్పుడో పోయాయి. టెంప్లెట్ డైరెక్టర్లు వర్ధమాన డైరెక్టర్లు నేర్చుకోవడానికి కొత్త విషయాలేమీ ఇవ్వరు – ఉమ్మడి మూస తప్ప, సమిష్టి వేస్ట్ తప్ప. 

          ఐతే కాపీ ఐనప్పటికీ దర్శకుడు త్రివిక్రమ్ ని సంప్రదించాలనుకున్నాడు ఈ వ్యాసకర్త. సంప్రదించి ఈ పాటి టాలీవుడ్ లోనే దొరికే  రొటీన్ పాయింటుని ఎక్కడో పరాయిదేశం నుంచి ఎందుకు స్వీకరించాల్సి  వచ్చిందో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ ఆయన గురించి  తెలిసిందే. తనేం ఏం రాస్తారో,  ఏం తీస్తారో ఎవరికీ  తెలియనివ్వరు. ఎవరైనా జోక్యం చేసుకున్నా, అలాకాదు ఇలాగని చెప్పినా సహించరు. స్టోరీ సిట్టింగ్స్, డిస్కషన్స్ ఏవీ వుండవు. తన వర్క్ గురించి ఎవర్నీ అడగనివ్వరు. కాబట్టి సంప్రదించే ప్రయత్నం వృధా అనుకుని వూరుకోవాల్సి వచ్చింది. 

          కానీ ఒక సీనియర్ కో- డైరెక్టర్ చెప్పిన ప్రకారం, సర్కిల్స్ లో ఏమనుకుంటున్నారంటే, పవన్ – త్రివిక్రమ్ ఇద్దరూ పెద్ద తప్పు చేశారని. ఇప్పుడు పవన్ రాజకీయ ఆకాంక్షలతో ప్రజల్లో ఆసక్తి రేపుతున్నప్పుడు, రివర్స్ లో మళ్ళీ అవే నడుం వూపడాలు, అమ్మాయిలతో అచిబుచ్చి లాడుకోవడాలు చూపించి ఘోరమైన తప్పు చేశారని. ఇలాటి రాజకీయ ప్రవేశ సందర్భంలో ఎన్టీఆర్ ఎలాటి సినిమాలతో ప్రజల్లోకి వెళ్ళారో గుర్తు చేసుకోవాలన్నారు. 

          2. పండగ సినిమాకి ఇంతకంటే ఎక్కువ క్వాలిటీ అవసరం లేదని రివ్యూలో రాయడం గురించి : చూసిన టెంప్లెట్ సినిమాలే మళ్ళీ చూసి ప్రేక్షకులు హిట్ చేస్తున్నప్పుడు, పండగ సినిమా అదే క్వాలిటీలో వుంటే ఎందుకు చూడరు. పండగ సినిమాకి క్వాలిటీ అక్కర్లేదని పనిగట్టుకుని ఎవరూ నాసి సినిమాలు తీయరు. రొటీన్ గా తీస్తున్న సినిమాలే పండక్కీ  వస్తాయి. ఇవి ఇతర రోజుల్లో ఆడవచ్చు, ఆడకపోవచ్చు. కానీ పండగ రోజులు వేరు. పండక్కి విడుదలైన పెద్ద సినిమాలు చూడ్డం సరదా. ఆ మూడ్ లో ఇంకా ఎక్కువ మంది చూస్తారు. కాబట్టి క్వాలిటీ లేకపోయినా ఆడేస్తాయి. అయితే ‘అజ్ఞాతవాసి’  రెండో రోజుకే పడిపోయింది. ఎక్కడ? ఆన్ లైన్ బుకింగ్స్ లేని సెంటర్లలో. ఆన్ లైన్ బుకింగ్స్  వున్న సెంటర్లలో నాల్గు రోజులకి అన్ని ఆటలూ హౌస్ ఫుల్స్ అయిపోయాయి. లేని చోట్ల సినిమా దెబ్బ తింది. అయితే ఒక వూరట ఏమిటంటే, 26 వ తేదీ వరకూ కొత్త సినిమాల్లేవు. ఈ పదిరోజులు ‘అజ్ఞాతవాసి’,  ‘జై సింహా’ లే చూడాలి. ఐనప్పటికీ నష్టమే తప్పకపోవచ్చు. విషయమేమిటంటే, ‘అజ్ఞాతవాసి’ కి నూట ఇరవై కోట్ల బడ్జెట్ ఎవరు పెట్టమన్నారు. నూట యాభై కోట్లకి బయ్యర్ల మీద భారం ఎవరు వేయమన్నారు. నూట ఇరవై కోట్లతో నిజానికి ఎలాటి సినిమా అందించవచ్చు? గ్రాఫిక్స్ తో అద్భుతమైన ఫాంటసీ తీసి అలరించవచ్చు. రొటీన్ పాత మూస సినిమాకి ఇంత బడ్జెట్ దేనికి? ఇందులో సగం హీరో, దర్శకుడూ తీసుకోవడం దేనికి? వాళ్ళు పండగ చేసుకుంటే సరిపోయిందా? 

          క్వాలిటీ లేకపోయినా పండగ సినిమా అని చూస్తారు గానీ, ఓవర్ బడ్జెట్ చేసుకుంటే లేని ప్రేక్షకులు ఎక్కడ్నించి తెచ్చి బాక్సాఫీసు నింపుతారు. అత్యధిక ధరకి కొన్న ఓవర్సీస్ లో కూడా ఇంకా నాల్గు కోట్ల లోటుతో వుంది. 

          పండగ సినిమా ఎలా వున్నా అడేస్తుందని అనడం క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని అనడమే, ఓవర్ బడ్జెట్ ని కాదు. క్వాలిటీ అంతంత మాత్రంగా వున్న, ‘జైసింహా’ కి ఓవర్ బడ్జెట్ బాధ లేదు. ఇది ‘ఏ’ సెంటర్స్ లో ఆడకపోయినా బి, సి సెంటర్స్ లో ఆడేస్తోంది. 26 వరకూ దీనికి ఆడిందే ఆట.

          3. పండగ అని చెప్పి ప్రేక్షకులు ఎలాటి సినిమానైనా చూసేస్తారని రివ్యూలో రాయడం గురించి : 10 కోట్ల తెలుగు జనాభాలో 9 కోట్ల మంది అసలు సినిమాలే చూడక పోవచ్చు. మిగిలిన కోటి మందిలోనే చూసుకోవాలి. ఈ కోటిలో ఫ్లాప్ టాక్ వచ్చిందని, ఎలాపడితే అలా  తీస్తే ఎవడు చూస్తాడని 50 లక్షల మంది ఆత్మగౌరవానికి పోయి చూడకపోయినా, 50 కోట్లు కలెక్షన్లు వస్తున్నాయిగా.  అంటే మిగిలిన  50 లక్షల మంది ఆత్మగౌరవం చంపుకుని చూస్తున్నట్టేగా.
ఒక పేరు రాయని పాఠకుడు ఇలా తెలిపారు : సామాన్య జనానికి కావలసింది ఎంటర్ టైన్మెంట్. వాళ్లకి రివ్యూలతో పని లేదు. వాళ్ళు పండగ హిట్ ఇచ్చేస్తారు లెండి పవన్ కళ్యాణ్ కి –అని.

          4. డబ్బు గడిస్తే కళకి దూరమవుతారంటూ రివ్యూలో రాయడం గురించి : దీనికి అంత బాధపడిపోవడమెందుకో అర్ధం కాదు. అందరూ ఇంతేనని రాయలేదు. అందరూ వందల కోట్లు గడించిన రాజూ హిరానీలూ,  రాజమౌళీలూ కాలేరని రాశాం. వాళ్లకి డబ్బు డబ్బే, కళ కళే. డబ్బు సుఖం మరిగి ఎలా తీసినా  నడిచిపోతుందనుకోరు. ఇలా స్థితప్రజ్ఞులు కాని వాళ్ళు, స్టోరీ డిస్కషన్స్ చేస్తూంటే వచ్చే డబ్బుతో ఏ కారు కొనాలి, ఫలానా కారు బాగా లేదట, ఎవర్ని సంప్రదించాలి – లక్ష్మి (అంటే వాళ్ళావిడ) – టీవీలో వస్తున్న హోండా జాజ్ కొందామంటోందే, కొందామా? - ఇలా డిస్కషన్స్ లో అబ్సెంట్ మైండెడ్ అయిపోతూంటే ఇంకేం కళా ప్రదర్శన వుంటుంది.


సికిందర్