రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, ఆగస్టు 2018, బుధవారం

670 : స్క్రీన్ ప్లే సంగతులు


       ‘సంజు’ ఫస్టాఫ్ డ్రగ్స్ కథలో (ఫ్లాష్ బ్యాక్ -1) డ్రగ్స్ మరిగిన సంజు పరిస్థితి తండ్రికి తెలియడం (ప్లాట్ పాయింట్ వన్) వరకూ చెప్పుకున్నాం. ఇక్కడ కొడుకుని సంస్కరించే బాధ్యతతో  గోల్ ఏర్పాటైంది. ఇలా మిడిల్ ప్రారంభమై, కొడుకుని సంస్కరించే తాలూకు సంఘర్షణ పుట్టింది. ఇప్పుడు మత్తులో రెండ్రోజులుగా నిద్రలో వున్నసంజుని గమనిస్తాడు తండ్రి. ఒకవైపు తల్లి క్యాన్సర్ ముదిరి హాస్పిటల్లో వుంది, మరోవైపు నటించిన మొదటి సినిమా ‘రాకీ’ విడుదల కాబోతోంది. నిద్ర లేచిన సంజుకి ఇవి గుర్తు చేస్తాడు తండ్రి. నీ సినిమా డిస్ట్రిబ్యూటర్ కి చూపిస్తే చించేశావని అన్నారు వాళ్ళు – అని వూరడిస్తాడు. ట్రీట్ మెంట్ కోసం వెళ్దామని సున్నితంగా అంటాడు. సంజు విపరీతంగా భయపడిపోయి బాత్రూంలో దాక్కుని అరుస్తాడు. హాస్పిటల్లో నిస్త్రాణగా పడున్న తల్లి దగ్గరే గడుపుతాడు. అక్కడ కూడా డ్రగ్స్ మత్తులో వుంటాడు. ఇంకా వుండలేక తల్లి ఎదుటే కొకైన్ షాట్ ఇంజెక్ట్ చేసుకుంటాడు. తల్లి అతడి తల నిమిరి చివరి శ్వాస విడుస్తుంది. పిచ్చివాడై పోతాడు. తను పోయినా ‘రాకీ’ ప్రీమియర్ షో అగకూడదన్న తల్లి చివరి కోరిక మేరకు షో ఏర్పాటవుతుంది. ఆ షో చూడలేక బయటి కొచ్చేసి ఏడుస్తాడు.

        క ట్రీట్ మెంట్ కి ఒప్పుకుని  తండ్రితో అమెరికా వెళ్తాడు. ఆ కేంద్రంలో చేరి తట్టుకోలేకపోతాడు. డ్రగ్స్ తీసుకోకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తో విపరీతంగా బాధపడి అక్కడ్నుంచి పారిపోతాడు. కానీ డ్రగ్స్ కొనాలంటే చేతిలో డబ్బు లేదు. రెండు వేల మైళ్ళ దూరంలో ఫ్రెండ్ కమలేష్ వుంటాడు. అక్కడికెళ్ళాలన్నా డబ్బు లేదు. రోడ్డు పక్కన పడుకుంటే ఎవరో పెట్టిన ఆహారం తిని అడుక్కోవడం మొదలెడతాడు. అడుక్కున్న డబ్బుతో బస్సెక్కి ఫ్రెండ్ దగ్గరి కెళ్తాడు. అక్కడే తండ్రి వుండేసరికి కంగారు పడతాడు. ఇక వీడు మారడని తండ్రికి అనిపిస్తుంది. ఒక్క పెగ్గు తాగేసి వెళ్లిపోతానంటాడు సంజు. కడుపులో ఏదో వొక మందు పడకపోతే బతికే పరిస్థితి లేదు. పెగ్గులు పోస్తాడు తండ్రి. ఒక్క గుక్కలో లేపి పారేస్తాడు సంజు. అప్పుడు తల్లి ఒక టేపు ఇచ్చిపోయిందని చెప్తాడు తండ్రి. అది విన్పిస్తాడు. అందులో తల్లి మాటలకి విచలితుడవుతాడు సంజు. ఆమెకీ తండ్రికీ ఇష్టమైన పాట పాడి విన్పిస్తాడు తండ్రి – రుక్ జానా నహీఁ తూ కహీఁ హార్ కే...(పడిపోయానని నీ ప్రయాణం ఆపకు)...దీంతో సంజుకి ఎక్కడలేని బలం వస్తుంది. 

          దీంతో  మిడిల్ విభాగం ముగుస్తుంది. అంటే ప్లాట్ పాయింట్ టూ ఏర్పడిందన్న మాట.
          ప్లాట్ పాయింట్ వన్ దగ్గర్నుంచీ, ప్లాట్ పాయింట్ టూ వరకూ ఈ మిడిల్ విభాగంలో ప్రధాన పాత్ర సంజు తండ్రి అని చెప్పుకున్నాం. కాబట్టి సంజుని బాగుపర్చాలన్న గోల్ అతడికుంది. సంజుతో ఈ గోల్ తాలూకు ప్రయత్నం కావచ్చు, సంఘర్షణ కావచ్చు, ఇదంతా పై సీన్లలో కన్పిస్తుంది. 

          మిడిల్ సంఘర్షణ ముగిసే చోటు ప్లాట్ పాయింట్ టూ కాబట్టి, అక్కడ ఆ సంఘర్షణకో పరిష్కార మార్గం తోచడం కాబట్టి,  ఆ పరిష్కార మార్గమిక్కడ తండ్రి సంజుకి తల్లి మాటలతో కూడిన టేపు విన్పించడంగా వుంది. దీంతో సంజుకి కనువిప్పయ్యింది. ఇదీ ప్లాట్ పాయింట్ టూ.

          ఇక ఇక్కడ్నించీ వచ్చే సీన్లు ఎండ్ విభాగం. సంజు వెళ్ళిపోయి మళ్ళీ ఆ కేంద్రంలో చేరిపోయి బాగుపడతాడు. తిరిగి ముంబాయి కొచ్చాక, ఇక్కడి ఫ్రెండ్ మిస్త్రీ కలుస్తాడు డ్రగ్స్ తో. మిస్త్రీ ఇచ్చిన పాకెట్ కాకుండా మిస్త్రీ దగ్గరున్న పాకెట్ లాక్కుంటాడు సంజు. అది నోట్లో వేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. అది గ్లూకోస్ పొడి. అంటే మిస్త్రీ గ్లూకోజ్ పొడి తిని నమ్మిస్తూ, ఇంతకాలం సంజుకి డ్రగ్స్ అమ్ముకుని బానిసని చేసి, తను బాగుపడ్డాడన్న మాట. వాణ్ణి  ఎడాపెడా కొట్టి తరిమేస్తాడు. ఇది తండ్రి చూసి సంతృప్తి చెందుతాడు. దీంతో ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఈ డ్రగ్స్ ఎపిసోడ్ ముగుస్తుంది. 

 ప్రధాన కథతో ఉత్కంఠ
      ఫ్లాష్ బ్యాక్ ముగియడంతో మళ్ళీ ప్రధాన కథలోకి – అంటే సంజు ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం ప్రారంభించిన సీనుకొస్తాం. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ విన్న రచయిత్రి సంజు కథ రాయడానికి ఒప్పుకుంటుంది. ఈ ప్రధాన కథ మరి కొంచెం మందుకు సాగుతుంది. ప్రధాన కథ ప్రారంభంలో ఈ రచయిత్రిని మిస్త్రీ కలిసి, సంజు కథ రాయవద్దంటాడు. ఎందుకు రాయవద్దన్నాడో  ఫ్లాష్ బ్యాక్ అంతా విన్న రచయిత్రికి ఇప్పుడు తెలిసిపోయి, అతడికి ఫోన్ చేసి చెప్పేస్తుంది. తన బండారం తెలిసిపోయిందన్న దుగ్ధతో మిస్త్రీ, అసలు సంజుకి కమలేష్ ఇరవై ఏళ్లుగా ఎందుకు దూరమయ్యాడో కూడా తెలుసుకోమని రెచ్చగొడతాడు. రచయిత్రి  అమెరికా వెళ్లి కమలేష్ ని కలుసుకుంటుంది. అతను సంజు మీద ద్వేషంతో వుంటాడు. సంజు మేలుకోరి తను డ్రగ్స్ బారి నుంచి కాపాడేందుకు సహకరిస్తే, సంజు ఇంకో దారుణానికి ఒడిగట్టాడని అంటాడు కమలేష్. 1993 ముంబాయి పేలుళ్ళ అప్పుడు ఆర్డీఎక్స్ పేలుడు పదార్ధాలున్న ట్రక్కుని ఇంట్లో పెట్టుకున్నాడని అంటాడు కమలేష్. ఇదెవరు చెప్పారంటే,సంజు తండ్రే చెప్పాడని షాకిస్తాడు కమలేష్. దీంతో ఇంటర్వెల్.

***
ఎపిసోడిక్ కథనం 
       ఇలా ఫస్టాఫ్ లో డ్రగ్స్ ఎపిసోడ్ తర్వాత, తిరిగి ప్రారంభమైన ప్రధానకథకి, సెకండాఫ్ లో ప్రారంభమవబోయే గన్స్ ఎపిసోడ్ తో లీడ్ ఇచ్చారు ఇంటర్వెల్ తో. ఫస్టాఫ్ లో ఒకటి, సెకండాఫ్ లో ఇంకొకటి, రెండు విడివిడి ఎపిసోడ్లని కలిపి వుంచే విధానం. cliff hanger moment. ఆర్డీ ఎక్స్ ట్రక్కు సంజు ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పించి, సెకండాఫ్ ఎపిసోడ్ పట్ల ఆసక్తి రేపి విశ్రాంతి నివ్వడం.

          ఎపిసోడిక్ కథనాలతో సినిమాలెప్పుడూ గల్లంతే అవుతున్నాయి. కారణం, ఎపిసోడ్ లన్నీ ఒకే కథగా కాక, విడివిడి కథలుగా వుండడం. విడివిడి కథలు సినిమా అవదు, టీవీ షో అవచ్చు. సినిమా స్క్రీన్ ప్లే అంటేనే ఒక బిగినింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ అంటూ వుంటూ, ఒకే కథగా వుండడం. టీవీ ఎపిసోడ్లకీ బిగినింగ్, మిడిల్, ఎండ్ లుంటాయిఅయితే అవి ఎపిసోడ్ కా ఎపిసోడుగా వుంటాయి. సమస్యసంఘర్షణ - పరిష్కారం అనే పద్ధతిలో ఒక్కో ఎపిసోడ్ నడిచి, ఎపిసోడ్ కా ఎపిసోడ్ వాటి కథ ముగిసి పోతూంటుంది.  సినిమా స్క్రీన్ ప్లే అలాకాదు. ఒకే ఏక మొత్తం కథకి, ఒకే ప్రధాన సమస్యా, దాంతో సంఘర్షణా, దానికొక పరిష్కారమూ వుంటాయి. టీవీ ఎపిసోడ్లు కథల సంపుటి అయితే, సినిమా స్క్రీన్ ప్లే ఒకే నవల.

డ్రగ్స్ ఎపిసోడ్ కి తండ్రి పాత్ర సారధి 
         ఇలా విడివిడి ఎపిసోడ్లమయంగా సాగే కథనంతోనే 2003 లో టైగర్ హరిశ్చంద్ర  ప్రసాద్ఫ్లాపయ్యింది. 2014 లో తమిళ డబ్బింగ్ సిటిజన్ఫ్లాపయ్యింది. ఎంతో అనుభవజ్ఞుడైన స్టీవెన్ స్పీల్బెర్గ్ కూడా ఎపిసోడిక్ కథనానికి పాల్పడ్డంతో, 2001 లో తీసిన వార్ హార్స్ఫ్లాపయ్యింది. ఇక  2014 లో ‘ఆటోనగర్ సూర్య’ సరేసరి. 

         
కథ మీద కాక,  సీన్ల మీదా  సీక్వెన్సుల మీదా దృష్టి పెట్టడం వల్ల ఇలా జరుగుతుంది. దీన్నే స్టార్ట్ అండ్ స్టాప్ (ఎస్ ఎస్) టెక్నిక్ లేదా కథనం అంటారు. అంటే ఒక పాయింటుతో ఎపిసోడ్ ప్రారంభమై, ఆ పాయింటు గురించి చెప్పడం పూర్తవగానే, ఆ ఎపిసోడ్ స్టాప్ అయి, ఇంకో పాయింటుతో ఇంకో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక్కో పాయింటుతో స్టార్ట్ అవుతూ, స్టాప్ అవుతూ – ఎక్కడపడితే అక్కడాగే పల్లె వెలుగు బస్సులా సాగుతూంటుంది మనం చూస్తున్న సినిమా. దీన్ని సినిమా అనుకుని వెళ్ళామా ఎపిసోడ్లకి చచ్చామే. హైదరాబాదుకే పోతోంది కదాని పల్లెవెలుగు బస్సెక్కినట్టు.

          ఉదాహరణకి ‘ఆటోనగర్ సూర్య’ (2014) లో ఇలా వుంటుంది... దీంట్లో ఒక ప్రధాన సమస్య దాంతో సంక్షోభం అనే కథా నడక వుండదు. ఎన్నో సమస్యలు, ఎన్నో సంక్షోభాలు, ఎన్నో ముగింపులూ!   డీజిల్ కారు తయారు చేస్తే, దాంతో ప్రత్యర్ధుల సంఘర్షణ, దానికో ముగింపు; తర్వాత బ్యాటరీ కారు తయారు చేస్తే, దాంతో ప్రత్యర్ధుల సంఘర్షణ, దానికో ముగింపు; మళ్ళీ తర్వాత కొచ్చిన్ ప్రయాణం కడితే, అక్కడ సంఘర్షణ, దానికో ముగింపూ; ఇంకాతర్వాత, యూనియన్ లో సభ్యత్వ సమస్యతో ఇంకో  సంఘర్షణా దానికో ముగింపూ; మళ్ళీ తర్వాత వాహనాల వేలం పాట సమస్య, దాంతో సంఘర్షణా, దానికో ముగింపూ...ఇలా ఎపిసోడ్ల సోడా బుడ్లు ఎడాపెడా పేలుతూంతాయి మనల్ని పారిపొమ్మంటూ!

          ఇలా ఎపిసోడ్ల సోడా బుడ్డి కథనాలతోనే ఇంకా
2003 లో టైగర్ హరిశంద్ర ప్రసాద్ఫ్లాపయ్యింది. 2014 లో తమిళ డబ్బింగ్ సిటిజన్ఫ్లాపయ్యింది. ఎంతో అనుభవజ్ఞుడైన స్టీవెన్ స్పీల్బెర్గ్ కూడా ఎపిసోడిక్ స్ట్రక్చర్ కి పాల్పడ్డం తో 2001 లో వార్ హార్స్ఫ్లాపయ్యింది.

గన్స్ ఎపిసోడ్ కి తండ్రి పాత్ర సారధి 
       ఈ బాపతు కథనం సినిమాలకి కాకుండా టీవీకీ, డాక్యుమెంటరీలకీ పనికొస్తుంది. పొరపాటున సినిమాల్లో పెట్టుకుంటే ఆరేడు ఎపిసోడ్లు వుండొచ్చు. కనీసం రెండు ఎపిసోడ్లు గడిస్తే గానీ ఇది ఎస్ఎస్ టెక్నిక్ అనీ, మనం బుక్కై పోయామనీ తెలుసుకోలేం. ఫస్టాఫ్ ప్రారంభమైనప్పుడు, ఓహో ఈ పాయింటుతో వెంటనే కథ ప్రారంభమైందని సంతోషిస్తాం. అది పుటుక్కున ముగిసిపోవడంతో, ఇదేమిటా అని చూస్తూంటాం. అప్పుడు ఇంకో పాయింటు ప్రారంభం కావడంతో, ఓహో ఇదన్నమాట అసలు కథనుకుని,  ఆసక్తిగా చూస్తూంటాం. అది కూడా పుసుక్కున ముగిసిపోవడంతో, అది కూడా ఇంటర్వెల్ లోపే కావడంతో, అప్పుడుగానీ అర్ధం కాదు – అడ్డదిడ్డంగా ఎపిసోడిక్ కథనాలకి బుక్కై పోయామని!

          వీటికి కనీసం ఇంటర్వెల్లో సెకండాఫ్ కి లీడ్ కూడా వుండదు.
There will be no hook at the mid - point to sustain the audiences interest anymore  - అన్నమాట. ఇక సెకండాఫ్ కోసం దేని గురించి కూర్చోవాలి? 

          ‘సంజు’ ఇలా కాదు. దీని ఎపిసోడ్లకి అపూర్వ లంకె పడింది. రెండు ఫ్లాష్ బ్యాక్  ఎపిసోడ్లని కలిపివుంచే ప్రధాన కథ తాలూకు ట్విస్టుతో ఇంటర్వెల్ మెలికపడింది
- cliff hanger moment. రెండూ విడివిడి ఎపిసోడ్లే అయినా, రెండిట్నీ నడిపే సారధి ఒకే పాత్ర- తండ్రి పాత్ర అవడంతో కథ తెగిపోయినట్టు వుండదు. ఈ రెండు ఎపిసోడ్స్ ని (ఫ్లాష్ బ్యాక్స్ ని) ప్రేరేపించేది ప్రధాన కథే కాబట్టి, ఇంకో డైమెన్షన్ లో ప్రధాన కథేమవుతుందన్న ఉత్కంఠ ఎలాగూ పనిచేస్తుంది. ఇలా 1. ఒక ఎపిసోడ్ నుంచి ఇంకో ఎపిసోడ్ కెళ్ళేందుకు ప్రధాన కథలో ఇంటర్వెల్ ట్విస్టు, 2. రెండు ఎపిసోడ్లనీ నడిపే సారధిగా తండ్రి పాత్ర సంఘర్షణ, 3. ప్రధాన కథతో ఉత్కంఠ – అనే మూడు డైమెన్షన్ లతో స్క్రీన్ ప్లే చెదిరిపోకుండా, ఫ్రాక్చర్ అవకుండా దిట్టంగా నిలబడింది.


సికిందర్



       రెండ్రోజులు ఆడే సినిమాకి రెండేళ్ళు రాసుకుంటూ కూర్చోనవసరం లేదు. రెండేళ్ళ పాటు రాసి రాసి, గీసి గీసి తీసిన సినిమా రెండ్రోజులాడక పోతే అ బాధ వర్ణనాతీతంగానే వుంటుంది. అది అర్ధం లేని బాధ. రెండేళ్ళు రాసి రాసి తీసిన సినిమా రెండ్రోజులు ఎందుకాడలేదో అర్ధంగాక పోతే ఆది అర్ధంపర్ధం లేని బాధే. రెండేళ్ళూ రాస్తున్నారంటే  ఏం రాస్తున్నారో, ఎందుకు రాస్తున్నారో, ఎలా రాస్తున్నారో తెలీని గుడ్డెద్దు చేలో పడ్డ చందం చమత్కృతి. రెండున్నర గంటల విస్తారమైన కథా సాగు భూమిలో రెండెకరాలు కూడా తెలీకపోతే దుక్కి దున్నడం దరిద్రమే. తన పొలం తనకే తెలీని కథారైతు నాగలిపట్టి దున్నితే రెండేళ్ళు కాదు, ఆరేళ్ళు కూడా పడుతుంది. ముందు పొలం తెలుసుకో, దాంట్లో ట్రాక్టర్ పెట్టి దున్ను....అప్పుడు ఎటూ రెండ్రోజులాడే సినిమా రెండ్రోజుల్లోనే రాసేయ్యొచ్చు. ఎలా? ఇదెలా?  ముందు సర్వే చేసి నీ పొలం హద్దులు, దిక్కులు తెలుసుకో. అప్పుడు ట్రాక్టర్ దాని పని అదే చేసుకుపోతుంది... I have to work from an outline. Every time I have not worked from an outline, I have been completely burned – Tony Gillory, Bourne Identity series screen writer. కానీ హద్దులు, దిక్కులు తెలుసుకోవడమంటే నే చిరాకు కదా, మరెలా? ఎంత జుట్టు పీక్కున్నా నాల్గు పేజీల్లో కథని సమగ్ర దర్శనం చేసుకోవడమే చేతగాదు కదా, మరెలా? నాగలి నాగయ్యల్ని ట్రాక్టర్ ఎక్కమంటే ఎలా? ఎలా? ఎలా?...


పొద్దున్నే పాత పాట!

6, ఆగస్టు 2018, సోమవారం

669 : స్పెషల్ ఆర్టికల్



          72వ స్వాతంత్ర్య దినోత్సవం ఒక కొత్త చరిత్రని మోసుకొస్తోంది. అంతగా ఎవరికీ తెలియని చారిత్రక ఘట్టం. అది వెండితెర మీద విశాలంగా ఆవిష్కృతమవబోతోంది. ఆగస్టు పదిహేను బుధవారం ఉదయం అక్షయ్ కుమార్ గోల్డ్ మెడల్ తెచ్చి ప్రదర్శించబోతున్నాడు.  ఒలింపిక్స్ గోల్డ్ మెడల్. విజేతల్ని లెజెండ్స్ గా మార్చిన గోల్డ్ మెడల్. హాకీనీ, దేశభక్తినీ, అక్షయ్ బ్రాండ్ వేల్యూనీ కలగలిపి ‘గోల్డ్’ అనే బయోపిక్ కాని బయోపిక్ థియేటర్లని అలంకరించబోతోంది. జెండా పండగతో కలిపి ప్రేక్షకులు జల్సా చేసుకోవడానికి నర్తించబోతోంది.  పదేళ్ళ క్రితం 2009 లో ఇలాటివే రెండు పండగలు ఒకేరోజు సందడి చేశాయి. ఒకవైపు శివరాత్రి, మరోవైపు ఎఆర్ రెహమాన్ కి ఆస్కార్ అవార్డు. అంతే, ఆ రోజంతా శివోహం రావాలతో, జైహో రాగాలతో మార్మోగింది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ లో రెహమాన్ స్వరకల్పన చేసిన ‘జైహో’ గీతానికి ఆస్కార్ అవార్డు.

         
ప్పుడు పంద్రాగస్టు నాడు అక్షయ్ కుమార్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్. ఇప్పటికే ట్రైలర్ వైరల్ అయింది. భారత హాకీ జట్టు లండన్లో సవాలు విసిరిన ఘనచరిత్ర. ‘లగాన్’ లో దాస్య విముక్తి పొందని జాతి, క్రికెట్లో ఆంగ్లేయుల్ని బలాదూరు చేసిన చరిత్ర కాల్పనికమైతే, ఇది కాల్పనిక చరిత్ర. ఇక్కడ అపుడప్పుడే దాస్య శృంఖలాలు తెంచుకున్న జాతి కథే. కాకపోతే తెల్లవాడి సొంత గడ్డ మీదే కళ్ళుతిరిగేలా గోల్ కొట్టి రావడం హాకీ స్టిక్స్ తో.

          అక్షయ్ కుమార్, కుణాల్ కపూర్, వినీత్ కుమార్ సింగ్, అమిత్ సాథ్, అబ్దుల్ అమీన్, సన్నీ కౌశల్, మౌనీ రాయ్, నిఖితా దత్తా తదితర నటీనట శ్రేణి ఈ స్పోర్ట్స్ డ్రామాకి లీడర్స్. రీమా కాగ్తీ దర్శకురాలు. ఇంత భారీ పీరియడ్ డ్రామాని భుజాన కెత్తుకున్న నారీ మణి రీమా కాగ్తీ ఎవరంటే, ‘హనీ మూన్ ట్రావెల్స్’, ‘తలాష్’ అనే రెండు పరాజయం పాలైన సినిమాలు తీసిన దర్శకురాలే. ఈసారి విజయ  ప్రయత్నంతో ముందడుగేస్తోంది. అక్షయ్ తొలిసారిగా బెంగాలీగా కన్పిస్తాడు. నిరాశానిస్పృహలతో కుంగిన స్వదేశీ హాకీ టీంని భుజం తట్టి, విజయపథం వైపు నడిపిస్తాడు. స్వాతంత్ర్య సమర నేపధ్యంలో 1936  - 48 మధ్య కాలంలో టీం ఎదుర్కొన్న కష్టనష్టాలు, చిట్టచివరికి సుదూర కల - ఒలింపిక్స్ గోల్డ్ నిజం చేసుకునే అపూర్వ ఘట్టానికి దారితీయడం. అప్పటి విజేతలెవరి కథా కాదిది. అన్నీ కల్పిత పాత్రలే. లండన్లో జరిగిన 14 వ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడ మొక్కటే యదార్థ సంఘటన. కల్పిత కథలతో స్పోర్ట్స్ మూవీస్ ఇటీవలి కాలంలో కొన్ని వచ్చాయి. చక్ దే ఇండియా, దంగల్ వంటివి. కల్పితమైనా బయోపిక్స్ అయినా పరాజయాల పాలు కాలేదు. విజేతల కథలు చెప్పే సినిమాలకి పరాజయాలుండవు. క్రీడలు కాకుండా ఇతర కథలతో తీసే స్టార్ మూవీస్ కి జయమో పరాజయమో చెప్పలేం. ఆ పాత్రలు  స్పోర్ట్స్ మూవీస్ లో వుండేలాంటి గెలుపు గుర్రాల పాత్ర చిత్రణలతో వుండవు. స్టార్ మూవీస్ లో పాత్రలు బోరు కొడతాయోమో గానీ, స్పోర్ట్స్ మూవీస్ పాత్రలు క్షణం క్షణం ఉత్తేజాన్ని నింపుతాయి వెండితెర మీద. 

          బాలీవుడ్ లో మసాలా హీరో సినిమాల కాలం తీరింది. ఇక కమర్షియల్ సినిమాలని పునర్నిర్వచించుకోవాలి. నియో కమర్షియల్స్ ని కనిపెట్టాలి. ఇందులో భాగంగానే జరుగుతున్న ప్రయత్నం బయోపిక్స్ తీయడం, లేదంటే పీరియడ్ కథలు తీయడం. ఇవి పోటీలు పడి తెరకెక్కుతున్నాయి. అయితే అదే పనిగా చరిత్రలూ పీరియడ్ లూ చూపిస్తూంటే కూడా బోరు కొడుతుంది ప్రేక్షకులకి. ఈ ట్రెండ్ కి ఆయుష్షు తక్కువే. ఉన్న టైంలో సొమ్ము చేసుకోవడమే. వయసైపోతున్న ఇప్పుడున్న సీనియర్ స్టార్స్ కి ఇదే చివరి అవకాశం. ఇటు రజనీ, కమల్ లని చూసినా ఇదే పరిస్థితి. వీళ్ళకి రాజకీయాలైనా వున్నాయి, బాలీవుడ్ సీనియర్ స్టార్స్ కి అవీ లేవు. 


          ‘రోబో – 2’  టీజర్ లాంచింగ్ మీట్ లో సల్మాన్ ఖాన్ ఈ నిజమే చెప్పాడు. తాము  ఒకే రకమైన సినిమాలు చేసీ చేసీ ఘనీభవించుకు పోయామనీ, ఇలాకాక అక్షయ కుమార్ కొత్త ప్రయోగాలు చేసుకుంటూ విస్తరిస్తున్నాడనీ. 

          నిన్న అక్షయ్ కుమార్ చేసిన కామెంట్ కూడా అతడి ఈ పంథాని ఖాయం చేస్తోంది. తను తల్చుకుంటే ఇప్పుడు ‘రౌడీ రాథోడ్ -2’ తీసి పుష్కలంగా డబ్బు సంపాదించుకో గల ననీ, కానీ అలాటి సినిమాలపై ఆసక్తి చచ్చి పోయిందనీ స్పష్టం చేసేశాడు. 

           ప్యాడ్ మాన్, టాయిలెట్ – ఏక్ ప్రేమ్ కథా, రుస్తుం, ఏర్ లిఫ్ట్, బేబీ...ఇప్పుడు ‘గోల్డ్’... ఇదీ అక్షయ్ కుమార్ మూసని బద్దలు కొడుతున్న విధం. ఈ నేపధ్యంలో ఆగస్టు 15 న ఏ రికార్డులు బద్దలు కొడతాడో చూద్దాం!

సికిందర్
(తెలుగు రాజ్యం డాట్ కాం)

త్వరలో!


3, ఆగస్టు 2018, శుక్రవారం


ఈవారం సంగతులు
    
జులై 25 వ తేదీ నాటి ఆర్టికల్ లో స్ట్రక్చర్  అప్డేట్స్ ఇచ్చినప్పుడు అవి ఏఏ  కథలకి వర్తించవచ్చో అందులోనే వివరించాం. సర్వసాధారణంగా సినిమాలు టాలీవుడ్ లోనైనా, బాలీవుడ్ లోనైనా, హాలీవుడ్ లోనైనా రెగ్యులర్ ఓపెన్ ప్లాట్ పాయింట్ వన్ తోనే వుంటాయి. అరుదుగా వ్యాసంలో చెప్పుకున్నట్టు రెండు క్లోజుడు ప్లాట్ పాయింట్ వన్స్ తో, లేదా రివర్స్ ప్లాట్ పాయింట్ వన్ తో వుంటాయి. ఉదాత్త కథలు చెప్పాలనుకున్నప్పుడు ఇవి బాగా పనిచేస్తాయి. ఉదాత్త కథల్లో ప్రధాన పాత్ర తీరుతెన్నులు కూడా మారిపోతాయి. పాసివ్ గా కూడా వుండొచ్చు. కాబట్టి  అప్డేట్స్ తెలిశాయి కదాని దగ్గరున్న కథల్ని అనాలోచితంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే పతనం తప్పదు. ఇప్పటికే రెగ్యులర్ ప్లాట్ పాయింట్ వన్ తోనే కథల్ని బతికించుకో లేకపోతున్నారు. ఇంకా రెగ్యులర్ కథలతో ఇర్రెగ్యులర్ ప్రయోగాలు కూడా చేస్తే ఇటలీ వెళ్లి అవేవో వరల్డ్మూవీసట - అవి తీసుకుంటూ అక్కడుండాల్సిందే. 

          2. సినిమాల మార్కెట్ యాస్పెక్ట్ ప్రస్తుత కాలానికి రోమాంటిక్స్ లేదా, ఎకనమిక్స్ అని ఇటీవలి కాలంగా చెప్తూ వస్తున్నాం. ఇదింకెవరో పరిశీలకులు చెప్పింది కాదు. మనమే తీరికూర్చుని టార్గెట్ ప్రేక్షకులు - తీస్తున్న ఫ్లాపులు అనే శాంపిల్స్ ఆధారంగా ప్రతిపాదించాం. ఒప్పుకుంటే పాటించవచ్చు, లేదంటే లేదు. కెరీరిజం పొటమరించిన ఈతరం ప్రేక్షకులు పైకెన్ని చెప్పినా లోపల ఒకటే యదార్ధం : డబ్బూ రోమాన్స్ ఈ రెండే నిత్యావసరాలు. వీటితో బహుళజాతి సంస్థలు వలవేసే ఎంజాయ్ మెంట్సే సర్వస్వం. పల్లె నుంచి మహానగరం దాకా దీన్నుంచి తప్పించుకునే యూత్ లేరు. యూత్ బహుళజాతి సంస్థల గుప్పెట్లో వున్నారు. కాబట్టి ఈ రెండూ (ఎకనమిక్స్, రోమాంటిక్స్) ప్రతిఫలించే సినిమాలకి మార్కెట్ యాస్పెక్ట్ ఎక్కువ. ఇవ్వాళ సినిమా చూసే కుర్రాడు - నాకు అమ్మాయిలతో రోమాన్స్ నాకు తగ్గట్టుగా ఎక్కడ చూపించారు, నా డబ్బు (ఎకనమిక్స్) కోర్కెలు నాకు తగ్గట్టుగా ఎక్కడ తీర్చారు - అని అలిగి కూర్చుని ఫ్లాప్ చేస్తున్నాడు. ఎకనమిక్స్ అంటే బాగా రిచ్ గా చూపించాలనే లేదు, నాటి ‘ఆకలిరాజ్యం’ లో నిరుద్యోగుల బాధకూడా ఎకనమిక్స్ గురించే. ఇవ్వాళ  పింక్ స్లిప్స్ అందుకుని అవుటై పోవడం కూడా ఎకనమిక్స్ గురించే. కొలువుల్లో ఆటోమేషన్ జొరబడ్డం కూడా ఎకనమిక్స్ గురించే. కాబట్టి ఈ మార్కెట్ యాస్పెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఎంటర్ టైన్ చేస్తూనే,  బలంగా చూపించగల్గినప్పుడు సినిమాలు కాలానికి తగ్గట్టు వుండవచ్చు. 

          3. దొంగరాముడు, ఇట్సే వండర్ఫుల్ లైఫ్ స్క్రీన్ ప్లే సంగతులు పెండింగులో వున్నాయి. ఆ మాటకొస్తే మొదలెట్టిన ‘ది క్లాసిక్’, ‘సంజు’ రెండిటి స్క్రీన్ ప్లే సంగతులూ  మూలనబడి చాలా కాలమైంది. ఇవి పూర్తి చేశాకే పై రెండిటి సంగతి. 


సికిందర్  

  




28, జులై 2018, శనివారం

667 : రివ్యూ




దర్శకత్వం : తిగ్మాంశూ ధూలియా
తారాగణం : సంజయ్ దత్. జిమ్మీ షేర్గిల్. మహీ గిల్, చిత్రాంగదా సింగ్, సోహా అలీ ఖాన్, నఫీసా అలీ, జాకీర్ హుస్సేన్, కబీర్ బేడీ, దీపక్ తిజోరీ తదితరులు
రచన : సంజయ్ చౌహాన్ - తిగ్మాంశూ ధూలియా, సంగీతం : రాణా మజుందార్. ఛాయాగ్రహణం : అమలేందు చౌదరి
బ్యానర్ : జే ఏ ఆర్ పిక్చర్స్
నిర్మాత : రాహుల్ మిత్రా
విడుదల : జులై 27, 2018
***

          ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్’  - 1, 2 లు దర్శకుడు తిగ్మాంశూ ధూలియాకి మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఈ పరంపరని ఇంకా కొనసాగిస్తూ ఐదేళ్ళ తర్వాత ఇదే టైటిల్ తో ఇప్పుడు సీక్వెల్ తీశాడు. ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్ -2’ ఎక్కడైతే ముగిసిందో అక్కడ్నించి అదే ఆదిత్యా ప్రతాప్ సింగ్ కథని సీక్వెల్ గా కొనసాగించాడు. సీక్వెల్ లో ఈసారి ‘సంజు’ ఫేమ్ సంజయ్ దత్ జాయినయ్యాడు. డార్క్ మూవీ జానర్లో సంస్థానాల్లో జరిగే కుట్రలు కుహకాలని ఈసారి రష్యన్ రూలెట్ అనే మృత్యుక్రీడని జోడించి తీశాడు. అయితే ఆ మృత్యు క్రీడ ప్రేక్షకులతో ఆడుకున్నట్టయ్యింది. 

         
ప్రకాష్ ఝా రాజకీయాల్లో మహాభారతాన్ని చూపిస్తున్నానని చెప్పి,  2010 లో బోలెడు పాత్రలతో ‘రాజనీతి’ అనే బక్వాస్ చాటభారతం తీసి చంపినట్టే, ధూలియా కూడా సంస్థానం కథంటూ లెక్కలేనన్ని పాత్రలతో చావగొట్టి వదిలాడు. ఫస్టాఫ్ అంతా ఎవరెవరో పాత్రల పరిచయాలతోనే, వాళ్ళ ఉప కథలతోనే సరిపోతుంది. ఏం చూస్తున్నామో అర్ధంగాని గందరగోళం ఏర్పడుతుంది. నిద్రపోయి లేచినా వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే కథ ఎంతకీ ప్రారంభమే కాదు. ఒక సీనుకి ఇంకో సీనుకీ సంబంధమే వుండదు. అసలు ఏ సీను ఎందుకొస్తోందో అంతేబట్టదు. ఇంటర్వెల్లో లండన్ నుంచి సంజయ్ దత్ వస్తేగానీ కాస్త కదలిక రాదు. వచ్చాక సెకండాఫ్ లో వున్న కథ కూడా అంతంత మాత్రమే. కేవలం క్లయిమాక్స్ లో రష్యన్ రూలెట్ ని చూపించి థ్రిల్ చేయడానికి తప్ప, ఇంకో  సదాశయం పెట్టుకుని ఈ సీక్వెల్ తీయాలనుకున్నట్టు లేదు. పావుగంట రూలెట్ క్లయిమాక్స్ కోసం రెండుంపావు గంటల సినిమాని భరించాలి. విచిత్రమేమిటంటే,  ఇంత అవకతవక సినిమాలో క్లయిమాక్సే, దాంతో ముగింపే సీట్లకి కట్టేసి కూర్చోబెడుతుంది. 

          క్లయిమాక్స్ తప్ప సినిమాని ఏ కోశానా ఎంతగా పట్టించుకోలేదంటే, ఐదేళ్ళ తర్వాత తీసిన ఈ సీక్వెల్ కనీసం దీని ముందు భాగంలో జరిగిన కథేమిటో రీక్యాప్ కూడా వేయలేదు.  గత సీక్వెల్ చూడని ప్రేక్షకులకి, ఈ సీక్వెల్లో ఆదిత్యా ప్రతాప్ సింగ్ జైల్లో ఎందుకున్నాడో అర్ధం గాదు.  అతడి భార్య ఎమ్మెల్యే ఎప్పుడయిందో అస్సలర్ధంగాదు. 

      రష్యన్ రూలెట్ రివాల్వర్ తో ఆడే ఆట. ఐదు గ్లాసుల్లో నీరు, ఒక గ్లాసులో వోడ్కా వుంటుంది. ఏ  గ్లాసులో వోడ్కా వుందో గుర్తుపట్టి తాగని వ్యక్తి రివాల్వర్ తలకి పెట్టుకుని మీట నొక్కుకోవాలి. రివాల్వర్ లో వుండే ఆరు ఛాంబర్స్ లో ఒకటే తూటా వుంటుంది. అది ఏ ఛాంబర్లో వుందో తెలీదు. ఒకరి తర్వాత ఒకరు తలకి పెట్టుకుని మీట నొక్కుకునే క్రమంలో ఎవరి చేతిలోనో పేలవచ్చు. అప్పుడు చావడమే. ఎదుటి వాడు గెలవడమే. అమెరికాలో ప్రత్యర్దుల మధ్య మెక్సికన్ స్టాండాఫ్ ప్రతిష్టంభన కూడా ఇలాటిదే. కాకపోతే ఇద్దరి చేతుల్లో గన్స్ వుంటాయి. ఎవరు ముందు పేలిస్తే వాడు బతికి పోతాడు. 

          లండన్లో ఈ రష్యన్ రూలెట్ స్పెషలిస్టు ఉదయ్ ప్రతాప్ సింగ్ (సంజయ్ దత్). ఉత్తర ప్రదేశ్ లో ఒక సంస్థానానికి చెందిన ఇతను తల్లిదండ్రులని (నఫీసా అలీ, కబీర్ బేడీ) వదిలేసి గ్యాంగ్ స్టర్ అయ్యాడు. ఉత్తర ప్రదేశ్ లోని ఇంకో సంస్థానానికి చెందిన ఆదిత్యా ప్రతాప్ సింగ్ (జిమ్మీ షేర్గిల్) జైల్లో వుంటాడు. అతడి భార్య మాధవీ దేవి (మహీ గిల్) ఎమ్మెల్యేగా ఎంజాయ్ చేస్తూంటుంది. ఆమె కన్నీ దుష్టాలోచనలుంటాయి. రెండో భార్య  రంజన (సోహా ఆలీఖాన్) తాగుడుకి అలవాటుపడి ఆత్మహత్యా యత్నం చేస్తుంది. ఒకరోజు మాధవీ దేవి ఆమెని కాల్చి చంపి ఆత్మహత్యగా సృష్టిస్తుంది. ఇక భర్త మిగిలాడు. అతను బయటి కొస్తే తన జీవితమిలా వుండదు. మళ్ళీ బానిసలా బతకాలి. అందుకని భర్తని బెయిలు మీద విడిపించి చంపే పథకమేస్తుంది. కానీ ఈలోగా భర్తతో గర్భవతి అవుతుంది. లండన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉదయ్ ప్రతాప్ సింగ్ పరిచయంతో ఆమె పథకానికి ఒక రూపు వస్తుంది. ఏ మగాణ్ణయినా ఇట్టే బుట్టలో వేసుకోగల ఆమె ఉదయ్ ని ఆకర్షించి తన వూరు రప్పించుకుంటుంది. అక్కడ భర్తని చంపే ఆలోచన చెప్తుంది. ఆదిత్యతో ఉదయ్ కీ ఒక వైరం వుంటుంది. దాంతో అతణ్ణి రష్యన్ రూలెట్ ఆటలోకి దింపి చచ్చేలా చేయాలనుకుంటాడు. మరోవైపు అతడి పూర్వ ప్రేయసి సుహానీ (చిత్రాంగదా సింగ్) ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. 


         ఈ రూలెట్ ఆటకి సన్నాహం, అతిధుల రాక, ఆట తీరూ మాత్రం  పకడ్బందీగా వుంటాయి. కావాల్సినంత సస్పన్స్ ని సృష్టిస్తాయి. దీని  ముగింపేమిటన్నది కూడా అనూహ్యంగా వుంటుంది.  భార్య చేసిన కుట్ర ఆదిత్యకి  తెలిసిపోతుంది. అయితే అతను చంపబోతే, ఆమె తెలివిగా కడుపులో వున్న నీ బిడ్డని కూడా చంపుకుంటావని చెప్పి ప్రాణాలు దక్కించుకుంటుంది. అప్పుడతను అంటాడు – నువ్వు కన్నాక, ఆ బిడ్డ ముందు నిన్ను నించోబెట్టి కాల్చి చంపుతానని. దీనికేం మంత్రమేసిందామె?  రూలెట్ క్రీడ దాకా ఎంత అవకతవకగా సాగి నరకయాతన పెట్టినా, ఈ క్రీడతో, దీనికిచ్చిన ముగింపుతో చచ్చినట్టూ మనం ఒక సలాము చేసి రావాల్సిందే. 

          నటనలో సాహెబ్ గా జిమ్మీ షేర్గిల్ తర్వాతే గ్యాంగ్ స్టర్ గా సంజయ్ దత్. రంగులు మార్చే బీవీగా మహీ గిల్ కి అందరికంటే ఎక్కువ మార్కులివ్వచ్చు. సెక్సీ చిత్రాంగదా సింగ్ వండర్ఫుల్. 

          టెక్నికల్ గా ఉన్నతంగా వుంది. ముఖ్యంగా అమలేందు చౌదరీ ఛాయగ్రాహణం – వాడిన రంగులు, కాంతులు. మూడు పాటలూ బావున్నాయి. లొకేషన్స్, భవనాలూ, కళాదర్శకత్వం కళాత్మకతని ప్రదర్శిస్తాయి. కానీ ఇంత ఔన్నత్యంతో కూడా ఫస్టాఫ్ ని చూడలేం. ధూలియా విషయం పట్టకుండా నిర్లక్ష్యంగా తీసిన సినిమా ఇదొక్కటే.

సికిందర్
         
           


25, జులై 2018, బుధవారం

666 : స్క్రీన్ ప్లే సంగతులు


     ముందుగా స్ట్రక్చర్ అప్డేట్స్....ఏ స్క్రిప్టు లోనైనా ప్లాట్ పాయింట్ వన్ గోల్ ని ఏర్పాటు చేసే కథా ప్రారంభ ఘట్టమని తెలిసిందే. ఇక్కడ కథని ప్రారంభించడానికి బిగినింగ్ విభాగంలో చేసే సన్నాహంలో వుండే పరికరాల్లో ఒకదాన్ని గుప్తంగా వుంచేస్తే ఏం జరుగుతుంది? అంటే, సర్వసాధారణంగా బిగినింగ్ విభాగ పరికరాలైన పాత్రల పరిచయం, కథా నేపధ్యపు ఏర్పాటు, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, చివరికి సమస్యా స్థాపనా – అనే నాల్గు పరికరాలూ మనకి ప్రత్యక్షంగా తెరపై కన్పిస్తూనే వుంటాయి. వీటిని అనుసరిస్తూ ప్లాట్ పాయింట్ వన్ ని వూహిస్తాం. ఉదాహరణకి ‘శివ’ లో 1. నాగార్జున, అమల, వాళ్ళ ఫ్రెండ్స్, అన్నావదినెలూ మొదలైన కొన్ని ముఖ్య పాత్రల్ని పరిచయం చేస్తూ, 2. మాఫియా పడగ నీడలో కాలేజీ వున్నట్టు కథా నేపథ్యాన్ని ఏర్పాటు చేస్తూ, 3. జేడీ కవ్వింపులతో సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా చేసుకొస్తూ, 4. చివరికి అమలతో జేడీ మిస్ బిహేవ్ చేయగానే సైకిల్ చైను తెంపి నాగార్జున కొట్టే ఘట్టంతో సమస్య ఏర్పాటవుతుంది. ఇక  నాగార్జున మాఫియా భవానీతో అమీతుమీ తేల్చుకునే గోల్ తో కథ ప్రారంభమవుతుంది...

        ప్పుడు ఈ నాల్గు పరికరాల్లో మూడవదైన సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనని తీసేస్తే ఏమవుతుంది? జేడీ కవ్వింపులుండవు. దాంతో నాగార్జున చైనుతో కొట్టే సీను వుండదు. ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడదు. కథనెలా పుట్టించాలో అర్ధంగాదు. అంటే బిగినింగ్ విభాగంలో మొదట్నుంచీ హీరో మీద కథనం చేసుకొస్తున్నప్పుడు, దాని తాలూకు సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన కూడా చూపిస్తున్నప్పుడు, ఆ హీరోకి ఖచ్చితంగా ఆ సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన చేసి,  గోల్ ఏర్పాటు చేసి తీరాల్సిందే. మరో మార్గం లేదు. ఇలాటి ఓపెన్ ప్లాట్ పాయింట్ వన్ తోనే సర్వసాధారణంగా, రొటీన్ గా సినిమాలుంటాయి. ఇందుకే మార్పు లేని, మార్చ వీల్లేని, ఈ సార్వజనీన స్ట్రక్చర్ బోరు కొట్టే పరిస్థితి వస్తుంది. అయినా స్ట్రక్చర్ అనేది తప్పనిసరి తద్దినం. ఈ తద్దినంతో కాస్తంత క్రియేటివిటీకి పాల్పడితే, ఆటాపాటలతో తద్దినం కూడా శోభతో కళకళ లాడుతూంటుంది ఎవరేమనుకున్నా. ఎలాగంటే - 

     పైన చెప్పుకున్నట్టు, ప్లాట్ పాయింట్ వన్ దగ్గరి దాకా వెళ్లి  గోల్ ఏర్పాటు చేయకుండా, ఈ బిగినింగ్ విభాగం ప్రారంభంలోనే, హీరోకి ఒక గోల్ పెట్టేస్తే ఏమవుతుంది? అప్పుడు సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన అవసరముండదు. ఆల్రెడీ గోల్ చెప్పేశాక ఇంకా గోల్ కి (సమస్యకి) దారి తీసే పరిస్థితుల కల్పన అనవసరం. అప్పుడు సమస్య ఉరుములేని పిడుగులా, ఆకస్మికంగా, విధివశాత్తూ వచ్చి పడుతుంది. దాంతో హీరో పెట్టుకున్న గోల్,  దానికోసం చేసుకుంటున్న సన్నాహాలూ సమస్తం చెల్లాచెదురై, అనుకోని కొత్త గోల్ వచ్చి మీద పడుతుంది. ఇక్కడే ప్లాట్ పాయింట్ ఏర్పడి, మనం వూహించని  కథ మొదలవుతుంది. ఈ క్రియేటివిటీ ఎంత ఫ్రెష్ గా, రిఫ్రెష్ బటన్ నొక్కినట్టు కొత్త  వుంటుందో అర్ధమయ్యే వుంటుంది...

          ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ చక్కటి ఉదాహరణ. ఇందులో చిన్నప్పట్నుంచీ బిల్డర్ అవ్వాలన్న కలలు (గోల్) వున్న హీరో, దానికోసం ప్రణాళికలు వేసుకుని విదేశీ ప్రయాణం కట్టబోతాడు. అంతలో తండ్రి గుండె పోటుతో మరణిస్తాడు. దాంతో తండ్రి కంపెనీ  బాధ్యత (కొత్త గోల్) మీదపడి, తన కన్న కలలన్నీ(ఒరిజినల్ గోల్) కల్లలై పోతాయి. ఇలా ఊహించని కొత్త కథ పుడుతుంది.  పైగా హీరోకి కంపెనీ బాధ్యతలతో ప్రారంభమైన స్టోరీ గోల్, కల్లలైన తన కలలతో థీమాటిక్ గోల్ రెండూ ఏర్పడతాయి. ఈ రెండిటితో పడే వేదన పాత్రని ఇంకా బలంగా తయారు చేస్తుంది.

          రొటీన్ ఓపెన్ ప్లాట్ పాయింట్ వన్ వున్న కథల్లో సమస్యని ఎదుర్కొనే స్టోరీ గోల్ తో పాటు, దీని కారణంగా వ్యక్తిగతంగా నష్టం జరిగే ఎమోషనల్ గోల్ వుంటుంది. ‘శివ’లో భవానీని ఎదుర్కొనే ఫిజికల్ గోల్ వుంటూనే, ఇటు అన్నకుటుంబాన్ని కాపాడుకునే  ఎమోషనల్ గోల్ వున్నట్టూ. ఇది రొటీనే. కానీ పైన చెప్పిన థీమాటిక్  గోల్ లో అంతర్గతంగా తనతో తానే సంఘర్షించుకోవడం వుంటుంది.

     ఇప్పుడు ‘విజేత’ లో చూద్దాం. ఇందులో హీరో ఆవారాగా తిరుగుతూ హీరోయిన్ ని ప్రేమించడం కోసం తను మారి, ఈవెంట్ మేనేజి మెంట్ పెట్టి దెబ్బతింటాడు. దాంతో తండ్రికి గుండెపోటు వచ్చి పడిపోతాడు. అప్పుడు ఫోటోగ్రఫీ గురించి తండ్రి చిరకాల కోరిక తెలుసుకుంటాడు. ఇది ప్లాట్ పాయింట్ వన్. ఇందులో ఈవెంట్  మేనేజిమెంట్ అనేది రాంగ్ కథనం. తండ్రికి అణిచిపెట్టుకున్న ఫోటోగ్రఫీ కల వుందనీ ముందే చూపించడం కూడా రాంగ్ కథనమే. దీన్ని తీసేసి,  హీరోకి ఈవెంట్ మేనేజి మెంట్  గోల్ ని పెడితే ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో వున్నట్టు ప్రారంభంలోనే పెట్టాలి, ఆ వ్యాపారం నడిపించాలి. అయితే మళ్ళీ ఇది  ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో లాంటి  క్లోజుడు ప్లాట్ పాయింట్ వన్ కే దారి తీస్తుంది. ఇలా కాకుండా, ప్లాట్ పాయింట్ వన్ తో ఇంకో క్రియేటివిటీలో,  గోల్ లేకుండా అవారాగానే తిరుగుతున్న హీరోకి, ఉరుములేని పిడుగులా, ఆకస్మికంగా, విధివశాత్తూ సమస్యా - దాని తాలూకు గోల్ మీద పడతాయి. గుండెపోటు వచ్చిన తండ్రి ఫోటోగ్రఫీ గోల్ ని తన గోల్ గా తీసుకుని ముందుకు సాగుతాడు. ఇక్కడ కూడా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన అవసరముండదు. అందుకని ఈ క్లోజుడు ప్లాట్ పాయింట్ వన్ కూడా ఫ్రెష్ గా వుంటుంది. అయితే క్వాలిటీపరంగా ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ తర్వాతనే. 

       ఇప్పుడిక ‘సంజు’ చూద్దాం. ఇక్కడ డ్రగ్స్ మరిగి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఏ ఆశా (గోల్) లేకుండా తిరుగుతున్నహీరో సంగతి తండ్రికి తెలిసి ఆయన బాధ్యత (గోల్) తీసుకుంటాడు. పై మూడు ఉదాహరణల్లో కూడా చూస్తే, గోల్ హీరోకే వుంటుందన్న అంచనా మనకుంటుంది. కానీ ఇక్కడ ఆ అంచనా తప్పుతుంది. గోల్ హీరోకి కాకుండా ఇంకో పాత్ర (తండ్రి) చేతిలో పడింది. హీరో పాసిన్ గా అవుతాడు. అయినా ఇది హీరోయిజం గురించిన కథ కాదు కాబట్టి, జీవితం గురించి కాబట్టి నష్టం లేదు. అదే హీరో కథని నడిపే యాక్టివ్ పాత్రగా తండ్రి పాత్ర వుంది కాబట్టి, కమర్షియల్ యాస్పెక్ట్ కి ఢోకా లేదు. ఇక్కదేమవుతోందంటే, ప్లాట్ పాయింట్ వన్ రివర్సై పోతుంది. ఇక్కడ హీరో ప్రవర్తనతో సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన ఖచ్చితంగా వుంటుంది. కానీ సమస్య (గోల్) ఇంకో కొత్త పాత్ర ఎదుట నిలుస్తుంది. 



       అంటే రొటీన్ ‘ఓపెన్ ప్లాట్ పాయింట్ వన్’ కి ప్రత్యాన్మాయంగా రెండు విధాలైన ‘క్లోజుడు ప్లాట్ పాయింట్ వన్’ లు, ఇంకో ‘రివర్స్ ప్లాట్ పాయింట్ వన్’ లుగా మనకి   కొత్తగా స్ట్రక్చర్ అప్డేట్స్  దొరికాయన్న మాట. వీటిని ఏ జానర్ కథలకైనా అప్లయి చేసుకోవచ్చు. తద్వారా సార్వజనీన స్ట్రక్చర్ మొనాటనీ ని వదిలించ వచ్చు.

సికిందర్