రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, డిసెంబర్ 2017, సోమవారం

573 : రివ్యూ!





దర్శకత్వం: అలీ అబ్బాస్జాఫర్ 
తారాగణం
: సల్మాన్ఖాన్, కత్రినా కైఫ్, అనూప్రియా గోయెంకా, అంజలీ గుప్తా, నేహా హింగే, సజ్జాద్ డెల్ ప్ఫ్రూజ్, గిరీష్ కర్నాడ్, పరేష్ రావల్, కుముద్ మిశ్రా, అంగద్బేడి, నవాబ్ షా  తదితరులు
కథ: అలీ అబ్బాస్జాఫర్, నీలేశ్మిశ్రా, స్క్రీన్ ప్లే –మాటలు : అలీ అబ్బాస్ జాఫర్
సినిమాటోగ్రఫీ: మార్చిన్లస్కావీస్ , సంగీతం: విశాల్‌-శేఖర్, జులియస్పాకియమ్
బ్యానర్ : యశ్రాజ్ఫిల్మ్స్
విడుదల : 22 డిసెంబర్, 2017
***
2012 లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లతో ‘ఏక్ థా టైగర్’ (ఒక టైగర్ వుండేవాడు)
విడుదలైంది
. దీనికి ‘భజరంగీ భాయ్ జాన్’ ఫేమ్ కబీర్ ఖాన్ దర్శకుడు. ఇందులో సల్మాన్, కత్రినాలు భారత ‘రా’, పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లుగా ప్రేమలో పడి దేశం కంటే ప్రేమే ముఖ్యమని అదృశ్యమైపోతారు. ఇప్పుడు 2017 లో దీని సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ (టైగర్ బతికే వున్నాడు) లో తిరిగి వీళ్ళిద్దరూ తమ రెండు దేశాల తరపున జాయింట్ ఆపరేషన్ లో పాల్గొంటారు. దీని దర్శకుడు ‘సుల్తాన్’ ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్. రెండిటి నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్సే. మొదటిది కాల్పనిక గూఢచార కథయితే, ఈ రెండో దానికి యదార్ధ ఘటన ఆధారమన్నారు.  ఏమిటా యదార్ధ ఘటన? ఎక్కడ జరిగింది? దాన్నెలా తెరకెక్కించారు? ఒకసారి చూద్దాం...

కథ 
ప్రేమలో పడి పెళ్ళిచేసుకుని, కొడుకుని కని,  ఆస్ట్రియా లోని ఆల్ప్స్ మంచుపర్వత శ్రేణుల్లో  అజ్ఞాతంగా జీవిస్తున్న మాజీ ఇండో- పాక్ ఏజంట్లు టైగర్ అలియాస్ అవినాష్ సింగ్ రాథోడ్ (సల్మాన్),  జోయా (కత్రినా) ల కోసం ‘రా’ (రీసర్చి అండ్ ఎనాలిసిస్ వింగ్ - భారత గూఢచార సంస్థ) చీఫ్ షెనాయ్ (గిరీష్ కర్నాడ్) వెతుకుతూంటాడు. ఇరాక్ లోని టిక్రిట్  లో అబూ ఉస్మాన్ (సజ్జాద్ డెల్ ఫ్రూజ్) అనే అతను కరుడుగట్టిన  ఉగ్రవాద సంస్థ ఐఎస్సీ నాయకుడుగా ఎదిగాడు. అమెరికన్లు ఆగ్రహించి అతడి మీదా అతడి దళం మీదా వైమానిక దాడులు  జరిపితే, గాయపడి ఒక ఆస్పత్రి బస్సెక్కేశాడు. ఆ బస్సుల్లో నర్సులున్నారు. వాళ్ళని ఆస్పత్రికి తీసికెళ్ళి బందీలుగా పెట్టుకుని, సురక్షితంగా మకాం పెట్టాడు. అమెరికన్లు వెనుదీయక ఆస్పత్రి మీద దాడికీ  సిద్ధమయ్యారు. దీనికి వారంరోజులే  టైముంది. 

          దీంతో ఇండియాలో  ‘రా’ చీఫ్ షెనాయ్ అప్రమత్తమయ్యాడు. ఆ నర్సుల్లో పాతికమంది భారత నర్సులే గాక, పదిహేను మంది పాక్ నర్సులు కూడా వున్నారు. ఈ సమయంలో రాజకీయం కాక మానవత్వమే ముఖ్యమని – వాళ్ళందర్నీ ప్రాణాలతో కాపాడాలని సమాయత్తమయ్యాడు. కానీ శత్రు దుర్బేధ్యమైన టిక్రిట్ లో ప్రవేశించే సాహసం చేయగల మొనగాడెవడూ లేడు - ఒక్క టైగర్ తప్ప. ఆఘమేఘాల మీద ఆ టైగర్ని  వెతకడం ప్రారంభించాడు...ఈ నేపధ్యంలోనే   ఆల్ప్స్ లో పండంటి కాపురం చేసుకుంటున్నటైగర్ దొరుకుతాడు. నీ దుంపతెగ రారా అంటే,  కచ్చితంగా రానంటాడు. భార్య జోయా నచ్చజెప్పి పంపుతుంది.

          ‘రా’ చీఫ్ ఇచ్చే టీముని కాదని, ఒక  షార్ప్ షూటర్, ఒక టెక్కీ, ఒక బాంబ్ డిఫ్యూజర్ లతో తన సొంత టీముని ఏర్పాటు చేసుకుని బయల్దేరతాడు. ఇక టైగర్ టిక్రిట్ లోకి ఎలా ప్రవేశించాడు, అక్కడెదురైన ప్రమాదాలేమిటి, టిక్రిట్ లో  జొరబడ్డాక ఆస్పత్రిలోకి ఎలా చొరబాటు చేశాడు, ఈ ఆపరేషన్ మధ్యలో పాక్ తరపున జోయా ఎలా వచ్చి తోడ్పడింది, ఆమెతో కలిసి నర్సుల్ని టైగర్ ఎలా బంధవిముక్తుల్ని చేశాడూ అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ 
      2014 లో ఇరాక్ లో జరిగిన యదార్ధ ఘటన అన్నారు. కానీ ఘటన జరిగిన తీరు వేరు. అల్ ఖైదా తానులో ముక్క ఐసిస్ ఇరాక్ లోని టిర్కిట్ లో ఇండియన్ నర్సుల్ని బందీలుగా పట్టుకున్నది నిజం. అయితే అది డబ్బుకోసం కాదు. డబ్బుకోసం అపహరణలకి పాల్పడడం వాళ్ళ పధ్ధతి కాదు. వాళ్ళ దగ్గరే బోల్డు డబ్బుంది. తాము పబ్లిసిటీలోకి రావడానికి ఆ పనిచేశారు. నర్సులకి ఏ హానీ తలపెట్టలేదు. పైగా చాలా మర్యాదగా చూసుకున్నారు. రేపు వాళ్ళ ఇస్లామిక్ సామ్రాజ్యం ఏర్పడితే ఇండియా నుంచి చీప్ లేబర్ వాళ్ళకి అవసరం. కాబట్టి నర్సుల్ని అతిధులుగా చూసుకున్నారు. భారత ప్రభుత్వం వాళ్ళతో సంప్రదింపులు జరిపి నర్సుల్ని విడిపించుకోగల్గింది. ఇదీ నిజంగా జరిగింది.

  దీని మీద మలయాళంలో తీసిన ‘టేకాఫ్’ గత మార్చిలోనే విడుదలయింది. దీన్ని యదార్థ సంఘటనలాగే  తీశారు. కాకపోతే ఫస్టాఫ్ వరకూ అక్కడి కెళ్ళిన నర్సుల జీవితాల్లో కుటుంబపరమైన సమస్యలు చూపించారు. ఆతర్వాత ఐసిస్ పాల్పడిన అపహరణ – విడుదల వగైరా యధాతధంగా చూపించారు. అయితే నర్సుల్ని విడుదల చేయించడంలో భారత ప్రభుత్వ పాత్రకంటే అక్కడి మలయాళీ బిజినెస్ మాన్ పాత్రవుందని వార్తలొచ్చాయి. దీన్ని అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ ధృవీకరించారు కూడా. కానీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఖండించారు. ఇలాటి బందీల, లేదా సంక్షోభంలో ఇరుక్కున్న సమూహాల తరలింపు ఉదంతాల్లో అదేమిటోగానీ బిజినెస్ మాన్లే భుజానవేసుకునే వైనాలు కనపడుతున్నాయి. ‘షిండ్లర్స్ లిస్ట్’, ‘హోటల్ రువాండా’ ల తర్వాత ‘ఏర్ లిఫ్ట్’, ఇప్పుడు ‘టేకాఫ్’ అనే ఇండియన్ సినిమాలు. కువైట్ సంక్షోభంలో మలయాళీ బిజినెస్ మాన్ ని హీరోగా చూపిస్తూ ‘ఏర్ లిఫ్ట్’ తీసినట్టే, ‘టేకాఫ్’ లోనూ  మలయాళీ బిజినెస్ మాన్ నే ప్రధానపాత్రగా చూపించారు. రెండూ వివాదాస్పదమయ్యాయి. కాకపోతే మొదటి దాని విషయంలో దర్శకుడు క్షమాపణ చెప్పుకున్నాడు. 

 ప్రస్తుత కథలో ‘ఇరాక్ లో భారత నర్సుల అపహరణ’ అనే వార్తని ఐడియాగా తీసుకుని, స్పై థ్రిల్లర్ గా యాక్షన్ కథ అల్లారు. ట్విస్టుగా పాక్ నర్సుల్ని కూడా చేర్చారు. ఇసిస్ బదులు ఐఎస్సీ అన్నారు. ఇరాక్ బదులు అబుదాభీ, మొరాకో లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఈ స్పై జానర్ కథని ‘దంగల్’ కోవలో హాస్యభరితం చేశారు. కష్టాల్లో, ప్రమాదకర పరిస్థితుల్లో, అన్నిటా  పాత్రలు ఫన్నీగా మాట్లాడి తెగ నవ్వించడమనే వినోదాత్మక విలువని చక్కగా ఉపయోగించుకున్నారు.  ఇటీవల ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియెస్ – 8’ లో హీ - మాన్ హీరోల విట్టీ డైలాగ్ పవర్ ఎలా మాస్ చేత కేరింతలు కొట్టించుకుందో,  ప్రేక్షకులతో అవే దృశ్యాలు  ప్రస్తుతం థియేటర్లలో కన్పిస్తున్నాయి. 

ఎవరెలా చేశారు
సల్మాన్ ఖాన్ ని చూపించి ఎలా చప్పట్లు కొట్టించాలో, ఎలా ఈలలు వేయించాలో ఆ విన్యాసాలన్నీ ప్రదర్శించారు. ఆ డైలగులన్నీ పలికించారు. మంచు కొండల్లో సల్మాన్ ఎంట్రీలో చెయ్యి చూపిస్తే ఈలలు, కాలు చూపిస్తే ఈలలు, తోడేళ్ళతో పోరాటం చూపిస్తే కేరింతలు – అందరూ వేటాడగలరు,  టైగర్ లా వేటాడలేరు  - అని డైలాగు కొట్టిస్తే చప్పట్లూ ఈలలూ. ఎడారిలో క్వాడ్ బైక్ మీద దూసుకొస్తూంటే, ఇరాక్ వీధుల్లో గుర్రపు స్వారీ చేస్తూంటే, ఒక పెద్ద మెషీన్ గన్ మోసుకొస్తూంటే, షర్టు విప్పి కండలు చూపిస్తే...ఒకటేమిటి, అభిమానుల్ని ఫుల్ ఖుష్ చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేశారు.  విచిత్రమేమిటంటే ఇవన్నీ పక్కా లోకల్ మాస్ గా వుంటూనే ఇంటర్నేషనల్ సినిమాలా అన్పించడం. సల్మాన్ డైలాగులు పలికే తీరువల్ల డైలాగ్ రైటర్ల పని సులువై పోతుంది - పై వాడు నిన్ను క్షమిస్తాడో లేదో, నా పని నిన్ను పై వాడి దగ్గరకి పంపించడం (పాత డైలాగే)... మన పని కేవలం నర్సుల్ని రక్షించడమే కాదు - శాంతి కోసం మనం నిలబడ్డామని ప్రపంచానికి చూపించడం కూడా... నీకు దమ్ముంటే నన్నాపి చూడరా ఉస్మాన్ (పాత మూస డైలాగు)... దేశ ప్రతిష్టకే సవాలు (టెంప్లెట్ డైలాగు)...ఇలా రాసేస్తే సరిపోతుంది, వాటి ఎఫెక్టు సంగతి సల్మాన్ చూసుకుంటాడు. అయితే చాలాసార్లు తగ్గాల్సిన చోట్ల తగ్గి, ఇతర పాత్రల బలిమికి అవకాశం కూడా ఇచ్చాడు. 

 ఈ స్పై థ్రిల్లర్ లో జోసెఫ్  క్యాంప్ బెల్ మిథికల్ స్ట్రక్చర్ తో బాటు, జేమ్స్ బానెట్ పాత్రల పొందిక కన్పిస్తాయి. ఒకప్పటి కొన్ని పాత్రలు కనుమరుగైపోయాయి. అలాటి ఒక పాత్ర హీరోయిన్ కత్రినా కైఫ్ పాత్ర. ఇది వెనుకాడే హీరోపాత్రని ముందుకు తోసే ‘థ్రెషోల్డ్ క్యారక్టర్’.  జేమ్స్ బానెట్ ప్రకారం మన మానసికలోకంలో జడప్రాయమైన అవస్థ వుంటే దాన్ని విడుదల చేసే కవాటం లాంటిది ఇది. కత్రినా పాత్ర కథలో ఈ పని చూసుకుంటుంది. ఆమె ఎంట్రీ సీను సూపర్ మార్కెట్ లో వుంటుంది. అక్కడ  జొరబడిన ముగ్గురు దొంగల్ని సీసీ కెమెరా ఒక చుట్టు  తిరిగే లోపు కొట్టి పడేస్తుంది. ‘దిసీజ్ విమెన్ ఎంపవర్ మెంట్’ అని ఓనర్ మెచ్చుకుంటుంది ( అంటే విమెన్ ఎంపవర్ మెంటుకి తన్నాలనా? తంతే తప్ప మగలోకం దారికి రాదనేమో). 

          కత్రినాకి ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ వున్నాయి. సల్మాన్ తన టీముతో అపాయంలో వుండీ స్తబ్దుగా వుంటే, హెడ్ లైట్లు పడతాయి – ఆఁ ... వచ్చేసిందిరో మీ వదిన – అంటాడు సల్మాన్. ఆమె వచ్చేసి ఫటా ఫటా లేపెస్తుంది టెర్రరిస్టుల్ని. కథంటే ఓడిడుకుల మన మానసిక స్థితే. వివిధ పరిస్థితులకి లోనయ్యే స్థితుల్ని చూపిస్తూ పాత్రలతో చక్క దిద్దుతూంటారు.

          ఈ టీముతో సంబంధం లేకుండా కత్రినా సొంతంగా వేరే  ఆపరేషన్ ఒకటి చేస్తుంది కథకి అడ్డం వస్తూ. మెడికల్ కాలేజీ అమ్మాయిల్ని చదవకుండా ఎత్తుకొచ్చి,  రేపులు  చేస్తూ చాకిరీ చేయించుకుంటూ వుంటారు ఐఎస్సీ ఉగ్రవాదులు. వాళ్ళతో సోలోగా స్వోర్డ్ ఫైట్ చేసి అమ్మాయిల్ని విడిపిస్తుంది కత్రినా. ఒకవైపు కథకి నర్సుల్ని విడిపించే పాయింటు వుండగా మళ్ళీ ఇదెందుకు సృష్టించారో అర్ధం గాదు. కత్రినా యాక్షన్ సీన్లు డబల్ ధమకాలా ప్రేక్షకుల చేత కేరింతలు పెట్టించేవే. 

    వెండి తెర మీద నుంచి ఇంకో కనుమరుగైపోయిన జేమ్స్ బానెట్ చెప్పిన పాత్ర - ట్రిక్ స్టర్. అంటే మాయగాడు. మన మనసుకి  మనతో ట్రిక్కుల్ని ప్లే చేసే గుణం వుంటుంది. ఆ మాయలో మనం పక్కదోవ పట్టిపోతాం. ఆ  కాసేపు, లేదా ఎంత కాలమైనా ఆడుకుని తిరిగి మనల్ని ట్రాకులో పెడుతుంది మన మనసు మనల్ని. ఈ పాత్రే  పరేష్ రావల్ అద్భుతంగా పోషించిన ఫిర్దోస్ అలియాస్ తోబాఁ ( అరబిక్ లోపాము). ఇతను పాతికేళ్ళ క్రితం ఇరాక్ లో స్థిరపడి యజమానులకి, అధికారులకీ తొత్తులా వుంటూ కార్మికుల మీద పడి బతుకుతూంటాడు. హీరో టీముని ముప్పు తిప్పలు పెడతాడు. చివరికి నీతి  వైపు నిల్చి సహాయపడతాడు. పరేష్ రావల్ మ్యానరిజమ్స్, మాట తీరూ, నటనా ఎంతో కన్నింగ్ గానూ ఫన్నీగానూ  వుంటాయి. ఇలాటి పాత్రనే ‘మ్యాడ్ మాక్స్ టూ’ లో బ్రూస్ స్పెన్స్ పోషించడాన్ని చూడొచ్చు. కొంచెం తేడాతో ‘మోసగాళ్ళకు మోసగాడు’ లో నాగభూషణాన్ని కూడా చూడొచ్చు. ఆరుద్ర లాంటి ఆనాటి రచయితలకి ఇది బాగా తెల్సు. 

 ఐఎస్సీ లీడర్ గా ఇరానియన్ నటుడు సజ్జాద్ డల్ఫ్రోజ్ నటించాడు. ఈ లోకంలో ఒకటే మతముంది,  మానవత్వం - అనే కలికాలంలో ప్రాక్టికల్ గా పనిచెయ్యని ఐడియాలజీతో హీరోకి పేలవమైన రొటీన్ డైలాగే  వుంటుంది. దీనికంటే కళ్ళు తెరిపించే డైలాగు సజ్జాద్ పలుకుతాడు – ఈ ఆయుధాలు, ఈ డబ్బు ఎక్కడ్నించి వస్తున్నాయి? ఉగ్రవాదం ఒక బిజినెస్, దీంట్లో లోకమంతా కలిసి వుంది – అని.  ఉగ్రవాదం అనే కాష్టంలో ఎవరి లాభం కోసం వాళ్ళు ఆజ్యం పోస్తున్నారనే అర్ధంలో. సజ్జాద్ ని ఖాకీ యూనిఫాంలో గడ్డంతో, ఎర్ర టోపీతో చూపిస్తే  కల్నల్ గడాఫీ, ఫిడెల్ కాస్ట్రో, కమ్యూనిజంలని  కలగలిపి చూపినట్టుంది. ఈ మిక్స్చర్ పోట్లంతో ఐసిస్ కి ఏమైనా మెసేజి బహుమానంగా ఇవ్వాలనుకున్నారేమో తెలీదు. 

          ఇక హీరో టీం మెంబర్లుగా కుముద్ మిశ్రా, అంగద్ బేడీ, నవాబ్ షా కన్పిస్తారు. పాకిస్తాన్ ఐఎస్సై టీం లీడర్ గా సుదీప్ కన్పిస్తాడు. ఈ రెండు టీముల్లో  తెలిసిన క్రేజీ స్టార్లుంటే ఇంకా మజా వచ్చేది. ఐఎస్సై  టీములో తర్వాత మాజీ ఏజెంట్ కత్రినా వచ్చి కలుస్తుంది.  ఇరు దేశాల నర్సులు బందీలై వున్నా, రెండు దేశాల టీములు కలిసి పనిచేయడం అంత వాస్తవికంగా అన్పించదు. శాంతి కోసం పనిచేద్దాం రమ్మంటే పాక్ వచ్చే అవకాశంలేదు. తమ నర్సులకోసం పాక్ ఆపరేషన్ నిర్వహించే అవసరమే రాకపోవచ్చు. ఐసిస్ కి కాశ్మీర్ లోకి ఆహ్వానం పలుకుతున్న పాక్ తో  - ఐసిస్ భాయ్ భాయే కాబట్టి – మీరు పట్టుకున్న వాళ్ళల్లో మా అమ్మాయిలున్నార్రా బాబూ వదిలిపెట్టండంటే సరిపోతుంది. కానీ సినిమాలో ఉగ్రవాది ఒక పాక్ నర్సుని కాల్చేసినట్టు చూపించారు. 

గూఢచార సినిమా అనగానే దేశభక్తి ధారాళంగా ప్రవహించేలా చిత్రీకరిస్తారు ( దేశాన్ని రక్షించే సైన్యం ఎక్కడో సైలెంట్ గా వుంటుంది - మిగతా అన్ని రంగాలూ వర్గాలూ దేశభక్తిని పులుముకుని, ఫ్రీగా దేశభక్తిని అనుభవిస్తూ  చిందులేస్తూంటాయి). హాలీవుడ్ సినిమాల్లో ఈ జానరేతర దేశభక్తి ఎలిమెంట్ కన్పించదు. ఇండో- పాక్ టీములు వాళ్ళ వాళ్ళ జెండాలు దాచుకుని తెచ్చుకోవడం, స్నేహపూర్వకంగా ఎవరి దేశభక్తిని వాళ్ళు ప్రదర్శించుకోవడం, చివరికి ఇండియా మెంబరు చనిపోతూ పాక్ మెంబర్ కి తన జెండా ఇచ్చి మోయించడం...ఆఖరికి  శుభం సీనులో నర్సులున్న బస్సుకి రెండు దేశాల జెండాలూ  రెపరెప లాడడం సిల్లీగానే వుంటుంది. నర్సులు భుక్తి కోసం వెళ్ళారా, లేక దేశభక్తితో దేశం కోసం వెళ్ళారా? 

          దేశభక్తి కాకుండా,  ఇలాంటప్పుడు వాస్తవంగా ఏం జరుగవచ్చో అది చూపిస్తే ఈ స్పై జానర్ మర్యాద నిలబడేది. ‘రా’ ఏజెంట్ నేతృత్వంలో ఐఎస్సై ఏజెంట్లు పనిచేయడం వింతే. నిజానికి వాళ్ళు కలవకుండా సపరేట్ ఆపరేషన్ నిర్వహించి,  క్రెడిట్ తాము కొట్టెయ్యాలని ‘రా’ ఏజెంట్లకి అడ్డుతగులుతూండాలి. వాళ్ళ మీద హత్యాప్రయత్నాలు కూడా చెయ్యాలి. వాళ్ళ తీరు వల్ల నర్సుల ప్రాణాలకే ఎసరు రావాలి. హీరోకి అటు ఐఎస్సీతో బహిర్గతంగా ఫిజికల్ యాక్షనే కాకుండా, ఇటు ఐఎస్సై ఏజెంట్లతో అంతర్గతంగా ఎమోషనల్ యాక్షన్ కూడా వుండాల్సింది. అప్పుడే పాత్రకి ద్వంద్వాలేర్పడి పాత్రచిత్రణ కరెక్టుగా వుండి, మరింత ఎఫెక్టివ్ గా మారే   అవకాశంవుండేది. ఇది లేకపోవడంతో ఫ్లాట్ గా,  ఏకోన్ముఖంగా యాక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది హీరో పాత్ర. ఈ ద్వంద్వాలుంటే హీరో భార్యగా,  ఐఎస్సై ఏజెంటుగా హీరోయిన్ పాత్ర కూడా మానసిక సంఘర్షణకి లోనై, ద్వంద్వాలు ఏర్పాటై ఎంతో రక్తికట్టించేది. చివరికి సమన్వయ కర్త తనే అయ్యేది - పైన చెప్పుకున్నట్టు ఒక  థ్రెషోల్డ్ పాత్రగా. పాత్ర స్వభావాన్ని మొదట్లో చూపించి తర్వాత మర్చిపోతే ఎట్లా? ఒకే ఆపరేషన్  గురించి రెండు దేశాల ఏజెంట్లు ఘర్షణపడే  ఎజెండా అవసరం ఈ కథకి. దీంట్లోకి దేశభక్తి  కోణం రానవసరం లేదు. కథలో దాని పాత్ర సబ్ టెక్స్ట్ గా మాత్రమే, ఆ ఫీల్ ని ఆడియెన్సు చూసుకుంటారు.  

          నర్సు పాత్రల్లో
అనూప్రియా గోయెంకా, అంజలీ గుప్తా, నేహా హింగేలు ప్రధానంగా కన్పిస్తారు. ‘రా’ చీఫ్ గా  గిరీష్ కర్నాడ్ ఆదేశాలిస్తూ వుండే పాత్ర. మేకింగ్ ఉన్నత ప్రమాణాలతో వుంది (నూట  యాభై కోట్లు అంటున్నారు, యశ్ రాజ్ ఫిలిమ్స్ కి ఇదే తొలి ఖరీదైన ప్రొడక్షనట). పోలెండ్ ఛాయాగ్రాహకుడు మార్చిన్లస్కావీస్ కెమెరా వర్క్ ఒక కళా ప్రయోగం. దీనికి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ టామ్ స్టూథర్స్ సమకూర్చిన యాక్షన్ దృశ్యాలు స్టన్నింగ్ గా వున్నాయి. నిడివి రెండు గంటలా 40 నిమిషాలనేది ఎక్కువే. 

చివరికేమిటి 
హాస్యం ఈ స్పై థ్రిల్లర్ని అపహాస్యం పాలుకాకుండా కాపాడింది. హాస్యం లేకుండా సీరియస్ మూడ్ లో చూడాలంటే భరించే కాలం కాదిది. ఈ రోజుల్లో – పెరిగిపోతున్న వివిధ దృశ్య మాధ్యమాలతో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో - సినిమాలకి  ఏదో ఒక యూనిక్ సెల్లింగ్ పాయింటు (యూఎస్పీ) వుండాల్సిందే. ఆ యూఎస్పీని ప్రధానంగా చేసుకుని సినిమాలు తీసి  ప్రేక్షకుల్ని ఆకర్షించాల్సిందే. ఆ యూఎస్పీయే ఈ స్పై థ్రిల్లర్ కి హాస్యమనే షుగర్ కోటింగ్.  సినిమాలంటే కేవలం క్రియేటివ్ యాస్పెక్ట్ తో తీసేది కాదు, మార్కెట్ యాస్పెక్ట్ నికూడా కలుపుకోకపోతే తీసి దండగ. టాలీవుడ్ లో ఈ మార్కెట్ యాస్పెక్ట్ ఇంకా అలవడాల్సి వుంది. వుంటే లో కేటగిరీలో కాలం చెల్లిన పద్ధతిలో వుండకుండా హిందీ, హాలీవుడ్ సినిమాలు చూసి  అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం చాలా వుంది.  

          ‘దంగల్’ లాంటి సీరియస్ కాన్సెప్ట్ ని  హాస్యయుతమైన పాత్రలతో వినోదాత్మకం చేయపోతే వెంటనే ఫ్లాపయ్యేది. ఆ పాత్రలుకూడా ఎవరికీ గుర్తుండేవి కాదు. పాత్రలు కామెడీ చేయడం పాత పధ్ధతి, హాస్యంగా మాట్లాడ్డం ఇప్పటి పధ్ధతి. కథలు సీరియస్ గానే వుంటాయి, పాత్రలు ఛలోక్తుతో రియాక్ట్ అవుతూంటాయి. కష్టాల్ని,  పనిని ఆటలాగా తీసుకోవడమే వీటి కార్యాచరణ. ఇలా ఇవి మనల్ని ఎలా జీవించాలో కూడా నేర్పుతాయి. 

          ప్రస్తుత స్పై థ్రిల్లర్ లో పాత్ర చావుతప్పి కన్ను లొట్టబోయి బయట పడి - యమ రాజ్ టచ్ కర్కే  నికల్ గయా ( యముడు టచ్ చేసి వెళ్ళిపోయాడు) - అంటే అంత సీరియస్ సీనులో ప్రేక్షకులు ఘోల్లున నవ్వకుండా వుంటారా? ఎంట్రీ సీన్లో సల్మాన్ కొడుకుతో తోడేళ్ళతో తలపడే యాక్షన్ ఎపిసోడ్ ఎంత గుర్పాటు కల్గిస్తుందో, ఫన్నీ డైలాగులతో అంత రిలీఫ్ నిస్తూంటుంది – ఇంజెక్షన్ ఇస్తూ డాక్టర్ కబుర్లలో పెట్టినట్టు. ఈ ఎపిసోడ్ లో కొడుకు భయపడిపోయి కేకలు పెట్టేట్టుగా, సల్మాన్ వాణ్ణి కాపాడేట్టుగా  – పిచ్చిగా ఫాదర్ సెంటి మెంటు,  చైల్డ్ సెంటిమెంటు అంటూ  వెలగబెట్టకుండా - చైల్డ్ ఎంపవర్ మెంట్ ని చూపించడం బావుంటుంది ఇద్దరి ఫన్నీ డైలాగ్స్ తో. తను తోడేళ్ళ గుంపుని  ఎదుర్కొంటూనే,  వాడికి తప్పించుకునే  కళలు నేర్పుతూంటాడు. తప్పించుకుంటున్న వాడి వెంట తోడేళ్ళు పడ్డా కేకలు వేయడు. ఈ ఎపిసోడ్ లో సల్మాన్ ఒక్క తోడేలుని కూడా చంపకుండా, మీద పడేటప్పుడు పక్కకి తప్పుకోవడం, వాటిని పక్క దోవ పట్టించడం లాంటి ట్రిక్కులు ప్లే చేస్తాడు. హాస్యాన్ని యూఎస్పీ అస్త్రం చేసుకుని ప్రయోగించడమే దీని ఘన విజయానికి కారణం. 

ఇక స్పై జానర్ కథలో హీరో పాత్ర ప్రయాణం భిన్నంగా వుంటుంది. పరిష్కరించాల్సిన సమస్య అతడికి వ్యక్తి గతంగా ఎదురుకాదు. ఎక్కడో ఏదో సమస్య ముందే ఏర్పాటయి వుంటుంది. ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడో వెతికి పట్టుకొచ్చి అతణ్ణి  ఆ సమస్యలోకి తోస్తారు.  జేమ్స్ బాండ్ లాంటి స్పై జానర్ హీరో పాత్రకి సొంత బాధలుండవు. కవిలాగా ప్రపంచ బాధే  తన బాధ. ఆ ప్రపంచ బాధలు తీర్చడమే తనకొచ్చిన బాధ. ఇదంతా స్పై జానర్ కొక టెంప్లెట్. ఈ టెంప్లెట్ లోనే ఈ కథలుంటాయి. కాకపోతే స్పై సినిమాలు ఎప్పుడో గానీ రావు గనుక  ప్రేక్షకులకి అదేపనిగా విసుగు పుట్టించవు, బతికిపోతారు.  ఇలాకాక, టాలీవుడ్ సినిమాలు వారంవారం  టెంప్లెట్ అనే ఒకే టెంపుల్ లో గంట వాయించుకుంటూ బిలబిలమంటూ అలాగే వచ్చే స్తూంటే,  విసుగు సూచీ వసూళ్ళ సూచీ కంటే బాగా పై స్థాయిలోనే ఎగదన్ని వుంటోంది. మార్కెట్ యాస్పెక్ట్ అంటే మనకి అర్ధంగాని అరబ్బీ పదం కదా. అందుకే ఎవరో ఆకతాయిలు తప్ప,  ప్రేక్షకులు బతికివుండే  అవకాశం బొత్తిగా లభించడం లేదు. 

          దర్శకుడు అలీఅబ్బాస్ జాఫర్, నీలేష్ మిశ్రాలు  కలిసి ఈ కథ రాశారు. ఐదేళ్ళ క్రితం ‘ఏక్ థా టైగర్’ తర్వాత ఈ సీక్వెల్ తో నీలేష్ కిది రెండో అవకాశం. తీవ్రవాద / ఉగ్రవాద డెస్కు జర్నలిస్టుగా క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవముంది. దీనివల్ల కథ ఆపరేటింగ్ పార్టు ఆథెంటిగ్గా వచ్చింది. అబ్బాస్ సమకూర్చుకున్న స్క్రీన్ ప్లేలో జోసెప్ క్యాంప్ బెల్ మిథికల్ స్ట్రక్చర్ కన్పిస్తుంది. అంటే పురాణ కథల కథాక్రమం కనపడుతుంది (పై పటం చూడండి). ఆన్ని మతాల పురాణాల్లోంచి జోసెప్ క్యాంప్ బెల్ కనుగొన్న మిథికల్ స్ట్రక్చర్,  ‘స్టార్ వార్స్’  మొదలుకొని ఎన్నో హాలీవుడ్ సినిమాలకి ఒక గైడ్ లా వుంటోంది.

          ఈ స్ట్రక్చర్ లో పై పటంలో కన్పించే దశలన్నీ ఈ స్పై థ్రిల్లర్ లో కన్పిస్తాయి. స్ట్రక్చర్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ స్క్రీన్ ప్లే ని ఇంకా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే స్పై జానర్ కథల్లో  ప్లాట్ పాయింట్ వన్ సమస్య తలెత్తినప్పుడు రాదు, ఆ సమస్య  ని హీరో చేపట్టినప్పుడే వస్తుంది. ఐఎస్సీ నాయకుడి మీద అమెరికా వైమానిక దాడులు, అతను నర్సుల్ని బందీలుగా పట్టుకోవడం, ‘రా’ చీఫ్ కి సమాచారం తెలియడం, ఇలా  ఇది బిగినింగ్ విభాగంలో ముందే ఏర్పాటయిన సమస్యే. కానీ ఇదే  ప్లాట్ పాయింట్ వన్ మాత్రం కాదు . ఇప్పుడు హీరో ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో చూపించి,  ‘రా’  చీఫ్ వెళ్లి సమస్య చెప్పాక, నర్సుల్ని విడిపించడానికి హీరో అంగీకరించడమే ప్లాట్ పాయిట్ వన్ అవుతుంది.  బిగినింగ్ విభాగానికి ఇదే ముగింపుగా వుంటుంది.


సికిందర్
         
         
         











         




























.

23, డిసెంబర్ 2017, శనివారం

572 : రివ్యూ!



ర్శత్వం:  విక్రమ్ కె.కుమార్
తారాగణం :  అఖిల్ అక్కినేని,  ళ్యాణీ ప్రియర్శన్, రమ్య కృష్ణ, జగపతి బాబు,  అజయ్,
అనీష్ కురువిల్లా, సత్య కృష్ణ, వెన్నెలకిషోర్, అజయ్, కృష్ణుడు దితరులు 
రచన : విక్రం కుమార్ – పాండే, సంగీతం :  అనూప్ రూబెన్స్,   ఛాయాగ్రణం:  
పి.ఎస్‌.వినోద్
నిర్మాత‌: అక్కినేని నాగార్జున 
బ్యానర్స్  :  అన్నపూర్ణ స్టూడియోస్, నం 
విడుదల : డిసెంబర్ 22, 2017

***
          క్కినేని కుటుంబం - విక్రం కుమార్ మళ్ళీ కలిశారు. ‘మనం’ చివర్లో విక్రం కుమార్ కొసమెరుపుగా పరిచయం చేసిన అక్కినేని కొత్త వారసుడు అఖిల్ తో తొలిప్రయత్నం ‘అఖిల్’ అనేది తేలిపోయాక, ఇప్పుడు  తిరిగి తనే పరిచయం చేస్తూ  ‘హలో’ తీశారు. నాగచైతన్య కూడా యాక్షన్ (జోష్) తో ప్రవేశించి బాగుపడింది లేదు. అఖిల్ ఇప్పుడు పునః ప్రవేశం చేస్తూ రోమాన్స్ కి దిగడం ఎంతవరకు చెల్లింది? నిర్మాతగా నాగార్జున, దర్శకుడుగా విక్రం కుమార్ ల కృషి ఎంతవరకు సఫలమయ్యింది? ఒకసారి చూద్దాం....

కథ 
      హైదరాబాద్ లో అవినాష్ (అఖిల్) – ప్రియ (ల్యాణీ ప్రియర్శన్) లు చిన్నప్పుడు విడిపోతారు. చిన్నప్పుడు వీధి బాలుడిగా అవినాష్ వాయించే ఏక్ తారా ధ్వనులు  గొప్పింటి  బాలికగా  ప్రియ బాగా ఇష్టపడుతుంది. ఆమె కుటుంబం ఢిల్లీకి వెళ్లి పోతున్నప్పుడు నోటు మీద ఆమె ఫోన్ నెంబర్ రాసిస్తే ఆ నోటు పిల్ల దొంగ కొట్టేస్తాడు. అతన్నుంచి ఒక్క ఫోన్ కాల్ కోసం  ఆమె పద్నాల్గేళ్ళూ  ఎదురు చూస్తుంది.  ఆమె ఢిల్లీ వెళ్ళిపోయిందని తెలీని అవినాష్, ఫోన్ నెంబర్ పోగొట్టుకుని,  ప్రతిరోజూ  ఆమె వచ్చే జంక్షన్ కి  వెళ్లి చూస్తూంటాడు. 

          ఇప్పుడు ఢిల్లీలో వున్న ఆమె కుటుంబం అమెరికాకి తరలిపోయేందుకు సిద్ధమవుతూంటుంది.  ఇక చివరి ఆశగా హైదరాబాద్ వెళ్లి వస్తానని బయల్దేరి వస్తుంది ఇప్పుడు ఎదిగిన ప్రియ. ఇలా వచ్చిన ఈమె ఒక మ్యూజిక్ షోలో వయోలిన్ వాయిస్తోంటే, ఒక క్యాబ్ డ్రైవర్ నుంచి అవినాష్ కి రాంగ్ కాల్ వస్తుంది. వింటూంటే బ్యాక్ గ్రౌండ్ లో వయోలిన్ విన్పిస్తుంది. అది చిన్నప్పుడు తను ప్రియకి విన్పించిన బాణీయే...ఆ స్థలం వివరాలు క్యాబ్ డ్రైవర్ని అడిగి తెలుసుకుంటూంటే,  అదే చిన్నప్పటి దొంగ ఆ సెల్ ఫోన్ కొట్టేసి పారిపోతాడు. ఆ క్యాబ్ డ్రైవర్ నెంబర్ కోసం ఆ దొంగోడి వెంట పడతాడు అవినాష్... అలా  ఆ  సెల్  ఫోన్ రకరకాల చేతులు మారి అవినాష్ దక్కిందా, దానికోసం అవినాష్ ఏం సాహసాలు చేశాడు, ఏ గ్యాంగుని ఎదుర్కొన్నాడు, చివరికి ప్రియని ఎలా కలుసుకోగలిగాడు - అన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ
      విన్ స్టన్ చర్చిలే  చెప్పాడు – ఆధునికత అనే గొర్రెల మందని సాంప్రదాయపు పాత ములు గర్రతో పొడుస్తూ వుంటేనే, ఆ ఆధునికత అనే గొర్రెల మంద చెల్లాచెదురై పోకుండా వుంటుందనీ.  ఈ కథ విషయంలో ఇది నిజమైంది. రోమాంటిక్ డ్రామా జానర్ లో ఈ ప్రేమకథ పురాతన కథనే ఆధునికంగా చెప్పారు. చిన్నప్పటి ప్రేమికులు విడిపోయారు, పెద్దయ్యాక మళ్ళీ కలుసుకున్నారనే పాతనే కొత్తగా చెప్పారు. కొత్తగా చెబున్నప్పుడు పాత సాంప్రదాయాల మీద ఆధారపడ్డారు. పాత సాంప్రదాయాల పునాది మీద కొత్త విన్యాసాలు చేశారు. అందుకని మూలంలో ఇలా బలంగా వున్న ఈ కథావస్తువు యూత్ అప్పీల్ కి కొదవలేకుండా కొత్త పుంతలు తొక్కడానికి కావాల్సిన  స్వేచ్ఛంతా తీసుకుంది. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింటు. 
      
         తెలుగులో రోమాంటిక్ కామెడీలంటూ చాలా లపాకీ కథలు వచ్చి వెళ్ళిపోతున్నాయి. అవి నిజానికి యూత్ అప్పీల్ కి వ్యతిరేకమైన ఏడ్పించే  రోమాంటిక్ డ్రామాలు. అంటే పాతకాలపు వీణ కథలు. పాతని అదే  పాతలాగా కాపీ చేసి భ్రష్టు పట్టించే ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు, ఇంకా చేస్తూనే వుంటారు. 

          ప్రస్తుత విడిపోయే ప్రేమికుల రోమాంటిక్ డ్రామాని, యూత్ అప్పీల్ కి వ్యతిరేకమైన ఏడ్పించే వీణ కథగా  చేయకపోవడమే వూరట. ఈ వూరట వారం వారం ఎంతో కొంత లపాకీ కథలకి అలవాటు పడిన ఆకతాయి ప్రియులకి ఖచ్చితంగా వెటకారంగా వుంటుంది. వాళ్ళ తప్పు కాదు. అభిరుచులు అపచారాలైపోతున్నాయి. వాళ్ళని పక్కన పెడదాం. ఇలా కొత్తా పాతల మేలు కలయికతో ఒక ‘వయోలిన్’ కథగా తయారు చేశారు. గిటార్ కథలుగా  తీయాల్సిన రోమాంటిక్ కామెడీలే  పాత వీణ కథలై పోతూంటే, వీణ కథగా  వుండే రోమాంటిక్ డ్రామాని ఆధునీకీకరించి, ‘వయోలిన్’ కథగా మార్చడం గొప్ప విశేషమే. ఇది కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింటు. 

          విధి ఈ కథలో విలన్ పాత్ర వహిస్తుంది. ప్రేమ కోసం విధిని జయించే ప్రయత్నమే ఈ ప్రేమకథ. కర్మలతో విధిని ఎదుర్కోవచ్చనే చిన్న మెసేజ్ ఇస్తుంది. ఇది పూర్తిగా చకచక సాగే సంఘటనలతో అద్భుత రసప్రధానంగా సాగే కథ. కథకి అతికే రస పోషణతో,  ఏకసూత్రత పాటించే నిర్మలమైన కథలు తెలుగులో రావడంలేదు, రావు కూడా. తమిళులు వచ్చి చూపించి పోవాల్సిందే.

ఎవరెలా చేశారు
        1995 లో ఇంకా పారాడే పాపయిగా వున్నప్పుడు ‘సిసింద్రీ’ లో సోలో బేబీగా నటించి హిట్ కొట్టిన అక్కినేని అఖిల్, తీరా పెదబాబు అయ్యాక తొలి ప్రయత్నంగా 2015 లో ‘అఖిల్’ అనే యాక్షన్ మూవీతో దెబ్బతినిపోయాడు. యాక్షన్ మూవీ చేయలేక దెబ్బతినలేదు, యాక్షన్ మూవీ బాగాలేక దెబ్బతిన్నాడు. ఇప్పుడు మలిప్రయత్నంలో ఒడ్డున పడ్డాడు.
 ‘యే మాయ చేశావే’ లో నాగచైతన్య అక్కినేని లాగా అఖిల్ అక్కినేని తాజా పిల్లవాయువుల్ని మోసుకొచ్చాడు ఈ ప్రేమకథకి. సున్నిత ప్రేమకథకి వూపిరులూదాడు. సునాయాసంగా, సింపుల్ గా, భావోద్వేగ భరితం చేశాడు. నటనలో ఇప్పుడు బాగా ఇంప్రూవయాడు. రాకుమారుడిలాంటి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో వెండి తెర మీద దివ్యంగా వెలుగులు నింపేశాడు. ఇప్పుడు కూడా తెలుగు భగ్నప్రేమికుడి పాత్రలు వెక్కి వెక్కి ఏడుస్తూంటాయి. ఎందుకో తెలీదు. యాసిడ్ బాటిల్ దొరకడం లేదనా?  అఖిల్ అయితే  ఏమాత్రం ఏడవలేదు. చిట్టచివరికి ప్రేక్షకులకే తను రక్తికట్టించే డ్రామాకి ఎలాగూ కళ్ళు చెమరుస్తాయి... 

          యాక్షన్ సైడు - ఇంకో ఫ్రెష్ నెస్. ఈ యాక్షన్ – ఛేజ్ సీన్సు  తెలుగుకి  కొత్త. మెట్రో ట్రైన్ లో యాక్షన్ సీన్లు ఇదే మొదటిది తెలుగు సినిమాకి. నీటుగా క్లాసుగా వుండే ఈ యాక్షన్ సీన్స్ ని సమకూర్చిన హాలీవుడ్ యాక్షన్ కొరియో గ్రాఫర్ బాబ్  బ్రౌన్ సౌజన్యం అఖిల్ కి ఒక ప్లస్.  అఖిల్ లోని లేతదనాన్ని దృష్టిలో పెట్టుకునేమో   ఇలాటి యాక్షన్ ని  సమకూర్చాడు బ్రౌన్. ఏ కోశానా మాస్ వాసన వేయకపోవడం ఇంకో  వూరట. 

          కొత్త హీరోయిన్
ళ్యాణీ ప్రియర్శన్ లేత ప్రేమకథకి పూతరేకులా వుంది.  ఎప్పుడూ సినిమాల్లో హీరోయిన్లు ఫస్టాఫ్ లో యమ వూపేసి, సెకండాఫ్ లో ఐపు లేకుండా జంప్ అయి పోతారు. అలాటిది  తను సెకండాఫ్ లోనే పనిపెట్టుకోవడం సెకండాఫ్ ని కూడా చూసేలా చేస్తుంది. హీరోకున్నంత పాత్ర చిత్రణ లేకపోయినా ( హీరో పాయింటాఫ్ వ్యూ కథ కాబట్టి), ఒక పరితపించే ప్రేమికగా మరీ మెలోడ్రామా లేకుండా సింపుల్ గా నటించుకొచ్చింది. 

          ఇంకో రెండు ఫ్రెష్ క్యారక్టర్లు జగపతి బాబు, రమ్యకృష్ణలవి. పేరెంటింగ్ అనే దాన్ని వీళ్ళు సెన్సి బుల్ గా పోషిస్తారు. హీరోతో విధివశాత్తూ ఆంటీ అంకుల్స్  గా బంధం ఏర్పడి,  అది అమ్మా నాన్నా లనే పిలుపుగా మారాలని తపించే పిల్లల్లేని భార్యాభర్తలుగా వీళ్ళిద్దరి నటన ఒక ప్రత్యేకాకర్షణ. ఇక బాల నటులిద్దరూ తమ అరగంట నిడివి చందమామ కథలాంటి విషయంతో  ఆకట్టుకుంటారు. విలన్ గా అజయ్ కి ఒక కామిక్ ముగింపు వుంటుంది. 

          పాటలు సరే, యాక్షన్ సీన్స్ కి అనూప్ రూబెన్స్ ఒకే థీమ్ మ్యూజిక్ ని రిపీట్ చేయడం  డిఫరెంట్ పంథా. ఇంతవరకు ఇలాటిది చూడలేదు.  ‘డంకర్క్’ ని గుర్తుకు తెస్తుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ లో కొన్ని చోట్ల ఇన్సర్ట్ చేసిన కొన్ని షాట్లు కథనానికి వూపు తెచ్చే విధంగా వున్నాయి.
పి.ఎస్‌.వినోద్ కెమెరా వర్క్ ఫాంటసీ లుక్ తో వుంది. 

చివరికేమిటి
       చాలా లాజిక్కులు ఎగేసి పాత కథనే కొత్తగా చెప్పారు. అయితే ఈ ప్రేమ కథకి ఫెయిరీ టేల్ లుక్ తీసుకురావడంతో లాజిక్కులతో తీసుకున్న సృజనాత్మక స్వేచ్ఛ కూడా స్వీట్ గానే వుంటుంది. ఉదాహరణకి – హీరో సెల్ ఫోన్ పోతే వచ్చిన చివరి కాల్ నంబర్ కోసం పరుగెత్తి, ప్రాణాలకి తెగించి పోరాడి,  ఆ సెల్ ఫోన్నే సాధించాల్సిన అవసరం లేదు. సులభంగా  ఆ నెంబర్ తెలుసుకునే మార్గాలున్నాయి. ఏమో ఇలా కూడా జరగవచ్చనే suspension of disbelief  ని కాసేపు భరించి చూడాల్సిందే – ఆ పరమైన యాక్షన్ ఎపిసోడ్స్ మొత్తాన్నీ. 

          ఇలాటి ప్లాట్ పాయింట్ వన్లు ‘జవాన్’ లోనూ, ‘ఎంసీఏ’ లోనూ చూడలేదా? చూశాం. కానీ మాట్లాడుకోలేదు. ‘జవాన్’ లో అదేదో రక్షణాయుధం కోసం మాఫియా హీరో కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తూంటే, ఆ రక్షణ శాఖలోనే పనిచేసే హీరో అధికారులకి చెప్పాలి కదా? చెబితే తను కుటుంబాన్ని కాపాడుకోవడమనే హీరోయిజం వుండదుగా? ‘ఎంసీఏ’ లో ఆర్టీవో అయిన వదిన మీదికి మాఫియా దాడికొస్తే,  ఆమె పోలీసుఅకి చెప్పొచ్చు గా? చెబితే ఆమెని కాపాడుకునే హీరోయిజం హీరోకి వుండదుగా?  తేడా ఏమిటంటే, విక్రం కుమార్ ఈ లోపాన్ని ఫెయిరీ టేల్  ఫార్మాట్ తో చెల్లిపోయేలా కవర్ చేసుకున్నాడు. 

          మరొకటేమిటంటే,  ప్రజల దగ్గర సెల్ ఫోన్లు కొట్టేసి భారీ ఎత్తున బయటి రాష్ట్రానికి కంటెయినర్ లో, అదీ ఫైరింగ్ స్క్వాడ్ నిచ్చి  తరలించే మాఫియాని కూడా వాస్తవంలో ఎక్కడా చూడం. దీన్ని కూడా ప్రేమకథ లాగే ఫాంటసీలా  తీసుకోవాలన్నట్టుంది దర్శకుడి ఉద్దేశం. నగరంలో వందల వేల  సెల్ ఫోన్లు జనం దగ్గర కొట్టేస్తూంటే, అదో సంచలనం అవుతుంది నిజానికి. వెంటనే జెండా ఎత్తేస్తారు దొంగలు. పెద్ద పెద్ద గోడున్లు పెట్టి పర్మనెంట్ పరిశ్రమలా చేయరు దందాని. 

          విధి చుట్టూ కథ కాబట్టి అనేక కాకతాళీయాలున్నాయి. క్యాబ్ వాలా హీరోకి రాంగ్ కాల్ చేయడం, చిన్నప్పుడు హీరోయిన్  నెంబర్ రాసిచ్చిన నోట్ పదిహేనేళ్ళ తర్వాత  హీరోకి దొరకడం, చిన్నప్పుడు ఆ నోటు కోసం దొంగని వెంటాడుతున్నప్పుడు  హీరో రమ్య కృష్ణ కారుకింద  పడి ఆమె ఇంట్లో సభ్యుడిగా మారడం, మళ్ళీ పెద్దయ్యాక ఆమెని కారు ప్రమాదం నుంచి తప్పించడం, చిన్నప్పుడు నోటు కొట్టేసిన దొంగే పెద్దయ్యాక మళ్ళీ హీరోయిన్తో కలపగల హీరో  సెల్ ఫోన్ ని కొట్టేయడం...ఇంకా, హీరో కోసం హైదరాబాద్ వచ్చిన హీరోయిన్ హీరోని వెతకాలంటే,  చిన్నప్పుడు తాము కలుసుకునే పానీ పూరీ బండి వాడి కోసం వెతుక్కోవాలి నిజానికి. ఎక్కడో మ్యూజిక్ ఫెస్టివల్ లో వయోలిన్ వాయిస్తే ఎక్కడ వింటాడు హీరో?  ఆ పానీ పూరీ వాణ్ణి తర్వాతెప్పుడో కాకతాళీయంగా చూస్తుంది. ఇన్ని కాకతాళీయాలున్నా ఇవి అతిగా అన్పించవు. పైగా ఎక్కడికక్కడ డ్రామాని సృష్టించే, మెలోడ్రామాని అనుభవించేలా చేసే,  కథనాన్ని కొత్తగా మార్చేసే డైనమిక్స్ గా వుంటాయి. విధిని ఆధారంగా చేసుకున్న ఈ కథా ప్రారంభంలోనే దర్శకుడే క్వాంటం ఫిజిక్స్ థియరీ చెప్తాడు నాగార్జున వాయిసోవర్ తో – మనందరం కంటికి కన్పించని సన్నటి దారాలతో అల్లుకుని వున్నామని. అందుకే ఇలాటి కాకతాళీయాలు. నియర్ మిస్సులు. సింక్రో డెస్టినీ  తాలూకు చిత్రణలు. 

       హీరో హీరోయిన్లు కలవడానికి ఏ సోషల్ మీడియా పనికిరాదా? ఇతనో ఆమెనో వైరల్ అయ్యేలా ఒక్క వీడియో  పోస్ట్ చేస్తే  సరిపోయే దానికి,  ఈ సెల్ ఫోన్ గొడవంతా  అవసరమా – ఆమె హైదరాబాద్ వచ్చ్ వయోలిన్ వాయించుకోవడం అవసరమా అంటే,  అదంతే.  ఫెయిరీ టేల్ అనే షరతులు వర్తిస్తున్నాయి కాబట్టి. అన్ని అసంగతాల్నీ జయించడానికి చిత్రీకరణపరంగా, సంగీతపరంగా, కళాదర్శకత్వం పరంగా సమ్మోహనపరుస్తూనే, కృతకం కాని, ఎక్కడికక్కడ కథనంలోంచి సహేతుకంగా ఉట్టి పడే సహజ అనుభూతుల్నీ, భావోద్వేగాల్నీ అస్త్రాలుగా చేసుకున్నారు. 

          చిన్నప్పటి వయోలిన్, నోటు, చేతి గాజు అనే మూడు ప్లాట్ డివైసులు మళ్ళీ ఇద్దర్నీ కలపడానికి చివర్లో పాత్ర వహిస్తాయి. ప్లాట్ డివైసులు ఎంతైనా చైతన్యం తీసుకొస్తాయి దృశ్యాల్లో. ఇదంతా పాత మెలోడ్రామానే. ఇలాటి చిన్నప్పటి కథలకి మన్మోహన్ దేశాయ్ మాస్టర్. ఇదంతా ఈ తరహా మేకింగ్ కి సరిపోయింది. అలాగే  ‘మనం’ లో గడియార స్థంభం అనే కథా స్థలి వున్నట్టే, ఇక్కడా ట్రాఫిక్ సిగ్నలనే కథా స్థలి వుంది. విధి, కాలం, స్థలాలు, కాకతాళీయాలు దర్శకుడి అభిమాన సబ్జెక్టులుగా వున్నట్టున్నాయి ‘మనం’ దగ్గర్నుంచీ. 

          హీరో మొదటి పాట అంతా చరణం చరణానికీ మారే వివిధ చిన్న పిల్లలతో వుంటుంది. ఇదొక పజిల్  మనకి. హలో ఎక్కడున్నా హలో, ఏమయ్యావ్ హలో... అంటూ  టీనేజి అమ్మాయిలతో పాటేసుకుని గిచ్చి గిచ్చి నానా రచ్చ చేస్తాడు మన ఏ తెలుగు స్టార్ అయినా. లేకపోతే అది టూరిజంలాంటి స్టారిజం కాదనుకుంటాడు. ఇలాకాక,  చినబాబు అఖిల్ చిన్నపిల్లలతో పాడుకుంటాడేమిటని మనకి పజిల్ లా వుంటుంది. . ఫ్లాష్ బ్యాక్ లో  తెలుస్తుంది దీని అంతరార్ధం,  చిన్నప్పుడు తెలిసిన హీరోయిన్ కథతో... అందుకని చిన్నపిల్లల్లోనే వెతుక్కుంటున్నాడు ఇప్పుడు హీరోయిన్ని. ఇలా ఆమెకి హీరో ఎంత బలంగా, ఏ మూలాల్నుంచి  కమిట్ అయివున్నాడో ఈ పాటలోనే మనస్తత్వం బయటపడే గొప్ప చిత్రణ అనుకోవాలిది. ఇదే పాటలో ఒక షాట్  లో చెరో వైపు రెండు దీపాలు మసగ్గా వెలుగుతూంటాయి. ఇవి సోల్ మేట్స్ కి ప్రతీకాలంకారాలన్న మాట. 

          ఇక వీధి బాలుడు పాటగాడుగానూ, గొప్పింటి బాలిక ప్రేమలో పడేది గానూ ఎప్పుడో ‘డిస్కో డాన్సర్’ కాలంలోనే  చూశాం. అందులో మనోడు ‘గోరోకీ నా కాలోకీ దునియా హై దిల్ వాలోకీ’ అని పాడితే, ఇందులో మనోడు – ‘హోగయాహై  తుజ్కో తో ప్యార్ సజనా (దిల్ వాలే దుల్హనియా లేజాయింగే) వాయిస్తాడు. ఇదంతా పాత మూస వాసనేయదా? వేయదు. ఇప్పటి కాలానికి తగ్గట్టు చూపించే విధానంలో చూపిస్తే చాలా నాస్టాల్జియా! అతీతమైన క్రియేటివ్ పరిజ్ఞానం  లేకుండా పాతా కొత్తా కళల్ని ఫ్యూజన్ చేయలేరు.       

          ఇక చాలా చోట్ల బోరు కొట్టే రొటీన్ దృశ్యాల్ని నివారించడానికి క్లోజప్స్ తో క్లుప్తతని పాటించారు. రెండు ప్యాకెట్ల మీద  క్లోజప్స్ లో బార్ కోడ్స్ ని స్కాన్ చేస్తూంటే ఏమిటా అని ఆసక్తిగా చూస్తాం. కట్ చేస్తే హీరో, రమ్య కృష్ణ రోడ్డు మీద నడుస్తూ ఫోన్లో మాట్లాడుతూంటారు షాపింగ్ పూర్తయ్యిందని!  షాపింగ్ సీనుని షాపులో సోదిలా చూపిస్తూ మనల్ని పాసివ్ గా, బోరు కొట్టేలా చూసేలా చేయకుండా,  కేవలం బార్ కోడ్స్ స్కానింగ్స్ క్లోజప్స్ తో అటెన్షన్ లోకి తీసుకొచ్చి- యాక్టివ్ వ్యూవింగ్ ఎక్స్ పీరియెన్స్ ని పంచారు (తెలుగులో దీన్నేమంటారో తర్వాత ఆలోచిద్దాం). 

          ఐతే ఈ సభ్యత గల చిత్రీకరణల్లో ఒక అసభ్యత కూడా వుంది. హీరో సిగరెట్లు కాల్చ వద్దన్నప్పుడు, జగపతి బాబు తాగుతున్న సిగరెట్ ని కారులోంచి బయటికి విసిరేయడం లాంటిది. ఆ సిగరెట్ తో బాటు కారులో వున్న  మరిన్ని ప్యాకెట్ లని బయట సిటీ నడి రోడ్డు మీదికి విసిరేయడం లాంటిది. ఆయన  ఎంచక్కా కారు దిగి వెళ్లి, ఆ కార్యక్రమం డస్ట్ బిన్ లో కానిచ్చి వచ్చి వుంటే పాత్ర చాలా ఉన్నతంగా అన్పించేది. సీను దానికదే ఎడ్యుకేటివ్ గా వుండేది సివిక్ సెన్సుతో. జగపతిది మొరటు పాత్రేం కాదు సిగరెట్లు అలా పారేయడానికి,  హూందాతనం గల పాత్రే. 

ఇంతకీ స్క్రీన్ ప్లే సంగతులేమిటి?    
        ఈ స్క్రీన్ ప్లేలో హీరో సెల్ ఫోన్ని పోగొట్టుకోవడం వరకూ బిగినింగ్, దాన్ని దొరికించుకుని విలన్ తో తలపడి బందీ అవడం వరకూ మిడిల్, సెల్ ఫోన్ తో తప్పించుకుని హీరోయిన్ కి కాల్ చేసి ఎట్టకేలకు కలుసుకోగల్గడం ఎండ్ -  ఇదే ప్రధాన కథ. చాలా పొట్టి కథ. మిగిలినదంతా రెండు ఫ్లాష్ బ్యాకుల సుదీర్ఘ అంతర్గత కథ. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన కాదు. 

          ప్రధాన కథలో సెల్ ఫోన్ని పోగొట్టుకునే సంఘటన ప్లాట్ పాయింట్ వన్, సెల్ ఫోన్ని దొరికించుకోవడం మిడ్ పాయింట్ (ఇంటర్వెల్), హీరోయిన్ చేతి గాజు హీరో చేతిలో చితికిపోవడం ప్లాట్ పాయింట్ టూ.

          మొదటి పది నిమిషాల్లోనే ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. మిడ్ పాయింట్ గంటకల్లా వచ్చేస్తుంది. సెకండాఫ్ మరోగంట వుంటుంది. మొత్తం కలిపి రెండు గంటల నిడివి. కానీ ఎంతో చూసినట్టు వుంటుంది.

          ఇటీవల ‘మళ్ళీరావా’ లో ప్రధాన కథని మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకుల రెండు కాలాల అంతర్గత కథలతో,  హీరోహీరోయిన్ల దృక్కోణాలు  కలిపేస్తూ, చైతన్య స్రవంతి ( స్ట్రీమ్  ఆఫ్ కాన్షస్ నెస్) శిల్పంతో చూపించారు. ఇదంతా ప్రధాన కథని గుర్తుపట్టకుండా గజిబిజి చేసింది. చైతన్య స్రవంతి శిల్పం సాహిత్యంలోనే తప్ప (నవీన్ ‘అంపశయ్య’) హాలీవుడ్ కమర్షియల్ సినిమాలకి ఎవరూ వాడలేదు. కేవలం జర్మన్ ఎక్స్ ప్రెషనిస్టు కళని హాలీవుడ్ లో ఫిలిం నోయర్, నియో నోయర్ థ్రిల్లర్స్ కి విజయంతంగా మల్చుకున్నారు. చైతన్య స్రవంతి శిల్పాన్ని రష్యన్, జర్మన్, ఫ్రాన్స్ వంటి  దేశాల్లోకమర్షియలేతర సినిమాలకి వాడుతున్నారు. ఆ ‘వరల్డ్ సినిమాలు’  ప్రపంచమంతా ఆడవు. మాస్ మీడియా సెక్షన్ కావు. వరల్డ్ సినిమా పండితులది, కమర్షియల్ సినిమా పామరులది. ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ లో కూడా వరల్డ్ సినిమా టెక్నిక్ వాడి విఫలమయ్యారు. కమర్షియల్ సినిమాల ప్రపంచంలో వుండే వాళ్ళు వరల్డ్ సినిమాలు చూడ వద్దనేది ఇందుకే. ఆ మాటకొస్తే కమర్షియల్ సినిమాలకి రివ్యూలు రాసే వాళ్ళు కూడా వరల్డ్ సినిమాలు చూడకూడదు. భావకవిత్వాన్ని విప్లవ కవిత్వ దృష్టితో చూసినట్టు వుంటుంది. 

           ‘హలో’ లో ఇలా కాకుండా చూపించే పిల్లల కథంతా ఒకే ఫ్లాష్ బ్యాక్ గా చూపించేశారు. ఈ ఫ్లాష్ బ్యాక్ కి ప్రేరణ సంఘటనే. ప్రధాన కథగానీ, అంతర్గత కథగానీ సంఘటనలతోనే నడపడ మనేది, సంఘటనల ద్వారానే విషయాన్ని తెలియజెప్పడ మన్నది  విజువల్ మీడియా అయిన సినిమా సూత్రమే. ఇదిక్కడ పూర్తిగా కన్పిస్తుంది. 

          హీరో సెల్ ఫోన్ని దొంగోడు కొట్టేయడం ప్లాట్ పాయిట్ వన్ అని చెప్పుకున్నాం. ఆ సెల్ ఫోన్ కోసం దొంగోడ్ని వెంటాడి పట్టుకుంటే, వాడు చిన్నప్పటి  తెలిసిన దొంగే కావడం,  దాంతో  హీరోకి గతం గుర్తుకు రావడం,  ఫ్లాష్ బ్యాక్ మొదలవడం జరగిపోతాయి. చిన్నప్పటి దొంగోడ్ని చూస్తే  ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు రావడమెందుకు? ఎందుకంటే,  అప్పట్లో చిన్న హీరోయిన్ ఫోన్ నెంబర్ రాసిచ్చిన నోటుని వీడే కొట్టేశాడు. అప్పుడూ వీడే, ఇప్పుడూ వీడే. ఇలా ఇది ఫ్లాష్ బ్యాకుతో కనెక్షన్ ని ఏర్పాటు చేసింది.  

          ఈ మొదటి ఫ్లాష్ బ్యాకులో చిన్నప్పటి హీరో హీరోయిన్లని చూస్తాం. ఇందులో ప్రధానకథకి అవసరమైన ప్లాట్ డివైసుల్ని ఉత్పత్తి  చేశారు. వాళ్ళిద్దరి అనుబంధం, చేతి గాజు, నోటు, వయోలిన్ బాణీ, దొంగోడు, పానీ పూరీ వాడు, హీరో ని పెంచుకున్న తల్లిదండ్రులూ వగైరా.   ఈ ఫ్లాష్ బ్యాక్ 25 నిమిషాల పాటు సాగుతూ సాగుతూ, నవంబర్ 14 న మిస్సయిన వాళ్ళకోసం బాలల చలన చిత్రం ప్రదర్శిస్తున్నట్టు వుంటుంది. ‘మళ్ళీ రావా’ కూడా డిటో. రెండు బాలల చలన చిత్రాలు. 

          ఇప్పుడు అఖిల్ పునరాగమన ప్రయత్నం ఎలా వుందో చూడ్డానికి పోయే ప్రేక్షకులకి, వున్న గంట ఫస్టాఫ్ లో అరగంట బాలలే కన్పిస్తారు. ఈ అరగంట లోనే రెండు పాటలు కూడా వేసుకుంటారు! చినబాబు మీద పాటలకోసం ఎదురు చూసేవాళ్ళకి బుల్లిబాబు మీద పాటలు దర్శకుడి బడాయే. ఈ బాలల కథ పూర్తవగానే ఇదే ఫ్లాష్ బ్యాక్ జగపతి-రమ్యకృష్ణ
ల పేరెంటింగ్ కథగా మారి సాగుతుంది. 

          ఫ్లాష్ బ్యాక్ పూర్తవగానే దొంగోడ్ని పట్టుకోవడం దగ్గరాగిన మిడిల్ తిరిగి అందుకుంటుంది. వాడితో గోడౌన్ కెళ్ళడం, ఫైట్ చేయడం, కంటెయినర్ ని ఛేజ్ చేయడం, సెల్ ఫోన్ని దొరికించుకోవడం,  దీంతో ఇంటర్వెల్ రావడం పూర్తవుతాయి. ఈ ఇంటర్వెల్ సీనుకి బ్యాంగ్ వుండదు. హాలీవుడ్ టైపు లో కథని మధ్యకి ఆపారంతే. 

          ఇంటర్వెల్ తర్వాత మిడిల్ టూ ప్రారంభం. సెల్ ఫోన్ మాఫియా గా అజయ్ పాత్ర పరిచయమవడం, హీరోని వెతికి పట్టుకోవడం, ఫైట్, హీరోని స్పృహ తప్పేలా కొట్టి పడెయ్యడం, దీంతో మిడిల్ టూ కి బ్రేక్. 

          ఈ కొట్టి పడెయ్యడమనే చర్యే  రెండో ఫ్లాష్ బ్యాక్ ని ప్రేరేపిస్తుంది. రెండో ఫ్లాష్ బ్యాక్ లో ఏముంది? హైదరాబాద్ వచ్చిన హీరోయిన్ తో తన హీరోయినే అని తెలీనక సాగే కథ. దీన్ని హీరోని కొట్టి పడెయ్యమనే చర్య ఎలా ప్రేరేపిస్తుంది? తల మీద దెబ్బ పడగానే ఇప్పుడామే  గుర్తొస్తుంది గనుక. 

          ఈ రెండో ఫ్లాష్ బ్యాక్ లో ఆమెతో తనకి నియర్ మిస్సులు జరుగుతాయి. తెలియకుండానే ఆమె వున్న కారు టైరు మార్చడం, రమ్యకృష్ణ బ్యాగులో డిమాండ్ రింగు పడెయ్యడం లాంటి సంఘటనలు ఇద్దర్నీ సన్నిహితం చేస్తాయి. దీని తర్వాత రమ్యకృష్ణ హీరో ని చేసుకోమని హీరోయిన్ని అడగడం, ఆమె హర్ట్ అవడం జరిగి, హీరో తనకా ఉద్దేశం లేదని క్లియర్ చేయడం, హీరోయిన్ ఫ్రెండ్ పెళ్లి సంబరం, అక్కడ హీరోయిన్  చేతి గాజు హీరో వల్ల విరగడం  మొదలైనవి  జరుగుతాయి. 

           ఆ చేతి గాజు విరిగితే హీరోయిన్ ఎందుకంత బాధ పడుతోందో హీరో అడుగుతాడేమో ననీ, అడిగేస్తే ఆమె చెప్పేస్తే కథ ముగిసిపోతుందనీ  మనం కంగారు పడతాం. అలా జరగదు. మనకి తెలిసిపోయిన నిజం వాళ్ళిద్దరూ తెలుసుకోరు. ఇదీ పాత్రలతో మన కేర్పడుతున్న సస్పెన్స్. ఈ మొత్తం రోమాంటిక్ డ్రామానీ ఇలా సస్పెన్సే కట్టి పడేస్తూంటుంది. 

          ఇక హీరో స్పృహలోకి రావడంతో రెండో ఫ్లాష్ బ్యాక్ ముగిసి, బ్రేక్ ఇచ్చిన మిడిల్ టూ తిరిగి ప్రారంభమవుతుంది. బందీగా వున్న హీరో విలన్ సహా మొత్తం గ్యాంగుని చిత్తు చేసి సెల్ ఫోన్ తో పారిపోతాడు. ఇది ప్లాట్ పాయింట్ టూ. దీంతో మిడిల్ టూ ముగుస్తుంది. ప్లాట్ పాయింట్ టూ అంటే సమస్యకి – దాని తాలూకు సంఘర్షణకి -  పరిష్కార మార్గం చూపే మలుపే కాబట్టి - ఫైనల్ గా సమస్యని పరిష్కరించే సెల్ ఫోన్ చేజిక్కించుకుని హీరో పారిపోతున్నాడు. 

          ఇప్పుడు ఈ ఎండ్  విభాగంలో మళ్ళీ సినిమా మొదట్లో చూపిన క్యాబ్ వాలాకి కాల్ చేస్తాడు. మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న ప్రదేశం తెలుసుకుని అక్కడి కెళ్ళిపోతాడు. వయోలిన్ మీద ఆ బాణీ వినపడిం దంటే,  అది తన చిన్ననాటి హీరోయినే అనీ, ఆమె ఇక్కడే వుంటుందనీ పాత ఫార్ములాతో కూడిన నమ్మకం హీరోకి. మనమైతే చిన్నప్పుడు ఏం విన్నామో ఎప్పుడో మర్చిపోయి ఇంకేదో దానిమీది కెళ్ళిపోతాం. చిన్నప్పటి పోరీ పోరడూ ఛత్తేరి అనుకుంటాం. హీరో హీరోయిన్లు ఈ బాణీని విడిపోయిన పద్నాల్గేళ్ళనాడే సోషల్ మీడియాలో వాయించి పరివ్యాప్తం చేసుకుని వుంటే ఆనాడే  కలుసుకునే వాళ్ళేమో. 

          ఇదంతా కాదు, దర్శకుడికి పరీక్ష- ఇంత ఉద్వేగభరిత డ్రామా నడిపాక,  వాళ్ళిద్దరూ గుర్తు పట్టుకుంటే సీనేమి టన్నది. ఆ పతాక సన్నివేశాన్ని ఎలా చూపిస్తాడన్నది. కలిసే తిరిగారు, కానీ తెలియక తిరిగారు, ఇప్పుడు తెలిసిపోతే ఎలావుంటుంది పరిస్థితి? దీన్ని చూపించడమే దర్శకుడికి పరీక్ష. 

          ఇక్కడే హీరోకి ఆ నెంబరున్న నోటు దొరకడం- [ప్రకృతి (సబ్ కాన్షస్ మైండ్)ఇంతే, మనం ప్రయత్నం చేస్తే అదే వెతికి పట్టుకొచ్చి ఆఫర్ చేస్తుంది, నీకు టైం రాలేదని మాయం చేసేది కూడా అదే] -  దానిమీద నెంబర్ తో చిట్టచివరికి కాల్  చేయడం,  అక్కడే వున్న హీరోయిన్ దాన్ని రిసీవ్ చేసుకోడం...ఆ తర్వాత ...ఇక తెరపై చూడాల్సిందే. 

          ఈ పొట్టి ప్రధాన కథ చూస్తే ఇది ఒక రోజులోనే జరిగే కథ. అలాగని టైం లాక్ లేదు. ఫలానా ఇన్ని గంటల్లోనే సెల్ ఫోన్ని సాధించుకోవాలనే షరతు లేదు. ఇందువల్ల ఒక ఫ్రేములో మనల్ని కట్టేసిన ఇరుకు ఫీల్ కాం. ఒకరోజులో జరుగుతున్న కథ అనీ, ఒక రోజులోనే ముగుస్తుందనీ చెప్పకుండా ఆప్షన్ లాక్ తో నడపడం వల్ల మనం ఫ్రీగా ఫీలై ఎంజాయ్ చేయగల్గుతాం.

***
   (ps : నిన్న ‘ఎంసీఏ’ చూసిం దగ్గర్నుంచీ ఒకటి వేధిస్తోంది. విలన్ తో వదినకి సమస్య వుంటే వుంది, దాన్నే ఎందుకు ప్రధాన వయొలెంట్ యాక్షన్  కథగా  చెయ్యాలి. వదినకి హీరోకీ మధ్య వున్న సమస్యని  వ్యక్తిగతంగానే తీరుస్తూ,  ప్రేక్షకులకి ఫ్యామిలీ సినిమా చూడగల్గే స్పేస్ నిస్తూ,  ప్లాట్ పాయింట్ టూ దగ్గర మాత్రమే విలన్ ని యాక్టివేట్ చేసి ఎందుకు ముగించకూడదని.  ఇలా చేయవచ్చని ఇప్పుడు  ‘హలో’ లో తేట తెల్లమైంది. ఇందులో విలన్ వున్నాడు కానీ ప్రేమ కథతో సంబంధం లేదు, సెల్ ఫోన్ తోనే సంబంధం. దీంతో మొత్తం మూడు నాల్గు సీన్లకి మించి లేవు. ప్లాట్ పాయింట్ టూ దగ్గర అతణ్ణి ఓడించి వెళ్ళిపోయాక, అక్కడే అతడి ట్రాకు ముగుస్తుంది. అక్కడ్నించీ ఎండ్ విభాగం తో మళ్ళీ మొదలయ్యే ప్రధాన కథలోకి అతను రాడు. ఇప్పుడు తొలిసారిగా ప్రధాన కథలో హీరోయిన్ వుంటుంది. ఇప్పుడు హీరోయిన్ని యేసుకు పోదామని విలన్ వచ్చాడా?  రాలేదు ( టాలీవుడ్ లోనైతే ఇందుకు తయారు). యాక్షన్ కథ యాక్షన్ కథే. ప్రేమకథతో సంబంధం లేదు. కానీ ప్రధాన కథగా వున్న ఈ పొట్టి యాక్షన్ కథే,  చివరికి సబ్ ప్లాట్ గా ముగుస్తుంది. అవును,  ప్రేమ కథకి ముందే ముగిసిపోతే విలన్తో ఇది సబ్ ప్లాటే. అంటే సబ్ ప్లాట్ గా మార్చి విలన్ కథ ముగించారు. ‘మరోచరిత్ర’ లో మనం వూహించే స్టోరీ క్లైమాక్స్ కాస్తా  రివర్స్ లో ప్లాట్ క్లయిమాక్స్ తో ముగిసినట్టు.

          ‘హలో’ లో ఈ విలన్ ముగింపు కూడా ఫన్నీగా వుంటుంది. అతణ్ణి చంపాల్సినంత సీను లేదు, ఈ ప్రేమ కథలో చావులుండ కూడదు. ‘ఎంసీఏ’ వయొలెంట్ యాక్షన్లో చంపేంత సీనున్నా చావడు. ఒకటి నిజం, ప్రేక్షకులకి ఏది ప్రధానమో తెలియకపోతే ఏదీ నిలబడదు)


సికిందర్