రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, డిసెంబర్ 2017, శనివారం

572 : రివ్యూ!



ర్శత్వం:  విక్రమ్ కె.కుమార్
తారాగణం :  అఖిల్ అక్కినేని,  ళ్యాణీ ప్రియర్శన్, రమ్య కృష్ణ, జగపతి బాబు,  అజయ్,
అనీష్ కురువిల్లా, సత్య కృష్ణ, వెన్నెలకిషోర్, అజయ్, కృష్ణుడు దితరులు 
రచన : విక్రం కుమార్ – పాండే, సంగీతం :  అనూప్ రూబెన్స్,   ఛాయాగ్రణం:  
పి.ఎస్‌.వినోద్
నిర్మాత‌: అక్కినేని నాగార్జున 
బ్యానర్స్  :  అన్నపూర్ణ స్టూడియోస్, నం 
విడుదల : డిసెంబర్ 22, 2017

***
          క్కినేని కుటుంబం - విక్రం కుమార్ మళ్ళీ కలిశారు. ‘మనం’ చివర్లో విక్రం కుమార్ కొసమెరుపుగా పరిచయం చేసిన అక్కినేని కొత్త వారసుడు అఖిల్ తో తొలిప్రయత్నం ‘అఖిల్’ అనేది తేలిపోయాక, ఇప్పుడు  తిరిగి తనే పరిచయం చేస్తూ  ‘హలో’ తీశారు. నాగచైతన్య కూడా యాక్షన్ (జోష్) తో ప్రవేశించి బాగుపడింది లేదు. అఖిల్ ఇప్పుడు పునః ప్రవేశం చేస్తూ రోమాన్స్ కి దిగడం ఎంతవరకు చెల్లింది? నిర్మాతగా నాగార్జున, దర్శకుడుగా విక్రం కుమార్ ల కృషి ఎంతవరకు సఫలమయ్యింది? ఒకసారి చూద్దాం....

కథ 
      హైదరాబాద్ లో అవినాష్ (అఖిల్) – ప్రియ (ల్యాణీ ప్రియర్శన్) లు చిన్నప్పుడు విడిపోతారు. చిన్నప్పుడు వీధి బాలుడిగా అవినాష్ వాయించే ఏక్ తారా ధ్వనులు  గొప్పింటి  బాలికగా  ప్రియ బాగా ఇష్టపడుతుంది. ఆమె కుటుంబం ఢిల్లీకి వెళ్లి పోతున్నప్పుడు నోటు మీద ఆమె ఫోన్ నెంబర్ రాసిస్తే ఆ నోటు పిల్ల దొంగ కొట్టేస్తాడు. అతన్నుంచి ఒక్క ఫోన్ కాల్ కోసం  ఆమె పద్నాల్గేళ్ళూ  ఎదురు చూస్తుంది.  ఆమె ఢిల్లీ వెళ్ళిపోయిందని తెలీని అవినాష్, ఫోన్ నెంబర్ పోగొట్టుకుని,  ప్రతిరోజూ  ఆమె వచ్చే జంక్షన్ కి  వెళ్లి చూస్తూంటాడు. 

          ఇప్పుడు ఢిల్లీలో వున్న ఆమె కుటుంబం అమెరికాకి తరలిపోయేందుకు సిద్ధమవుతూంటుంది.  ఇక చివరి ఆశగా హైదరాబాద్ వెళ్లి వస్తానని బయల్దేరి వస్తుంది ఇప్పుడు ఎదిగిన ప్రియ. ఇలా వచ్చిన ఈమె ఒక మ్యూజిక్ షోలో వయోలిన్ వాయిస్తోంటే, ఒక క్యాబ్ డ్రైవర్ నుంచి అవినాష్ కి రాంగ్ కాల్ వస్తుంది. వింటూంటే బ్యాక్ గ్రౌండ్ లో వయోలిన్ విన్పిస్తుంది. అది చిన్నప్పుడు తను ప్రియకి విన్పించిన బాణీయే...ఆ స్థలం వివరాలు క్యాబ్ డ్రైవర్ని అడిగి తెలుసుకుంటూంటే,  అదే చిన్నప్పటి దొంగ ఆ సెల్ ఫోన్ కొట్టేసి పారిపోతాడు. ఆ క్యాబ్ డ్రైవర్ నెంబర్ కోసం ఆ దొంగోడి వెంట పడతాడు అవినాష్... అలా  ఆ  సెల్  ఫోన్ రకరకాల చేతులు మారి అవినాష్ దక్కిందా, దానికోసం అవినాష్ ఏం సాహసాలు చేశాడు, ఏ గ్యాంగుని ఎదుర్కొన్నాడు, చివరికి ప్రియని ఎలా కలుసుకోగలిగాడు - అన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ
      విన్ స్టన్ చర్చిలే  చెప్పాడు – ఆధునికత అనే గొర్రెల మందని సాంప్రదాయపు పాత ములు గర్రతో పొడుస్తూ వుంటేనే, ఆ ఆధునికత అనే గొర్రెల మంద చెల్లాచెదురై పోకుండా వుంటుందనీ.  ఈ కథ విషయంలో ఇది నిజమైంది. రోమాంటిక్ డ్రామా జానర్ లో ఈ ప్రేమకథ పురాతన కథనే ఆధునికంగా చెప్పారు. చిన్నప్పటి ప్రేమికులు విడిపోయారు, పెద్దయ్యాక మళ్ళీ కలుసుకున్నారనే పాతనే కొత్తగా చెప్పారు. కొత్తగా చెబున్నప్పుడు పాత సాంప్రదాయాల మీద ఆధారపడ్డారు. పాత సాంప్రదాయాల పునాది మీద కొత్త విన్యాసాలు చేశారు. అందుకని మూలంలో ఇలా బలంగా వున్న ఈ కథావస్తువు యూత్ అప్పీల్ కి కొదవలేకుండా కొత్త పుంతలు తొక్కడానికి కావాల్సిన  స్వేచ్ఛంతా తీసుకుంది. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింటు. 
      
         తెలుగులో రోమాంటిక్ కామెడీలంటూ చాలా లపాకీ కథలు వచ్చి వెళ్ళిపోతున్నాయి. అవి నిజానికి యూత్ అప్పీల్ కి వ్యతిరేకమైన ఏడ్పించే  రోమాంటిక్ డ్రామాలు. అంటే పాతకాలపు వీణ కథలు. పాతని అదే  పాతలాగా కాపీ చేసి భ్రష్టు పట్టించే ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు, ఇంకా చేస్తూనే వుంటారు. 

          ప్రస్తుత విడిపోయే ప్రేమికుల రోమాంటిక్ డ్రామాని, యూత్ అప్పీల్ కి వ్యతిరేకమైన ఏడ్పించే వీణ కథగా  చేయకపోవడమే వూరట. ఈ వూరట వారం వారం ఎంతో కొంత లపాకీ కథలకి అలవాటు పడిన ఆకతాయి ప్రియులకి ఖచ్చితంగా వెటకారంగా వుంటుంది. వాళ్ళ తప్పు కాదు. అభిరుచులు అపచారాలైపోతున్నాయి. వాళ్ళని పక్కన పెడదాం. ఇలా కొత్తా పాతల మేలు కలయికతో ఒక ‘వయోలిన్’ కథగా తయారు చేశారు. గిటార్ కథలుగా  తీయాల్సిన రోమాంటిక్ కామెడీలే  పాత వీణ కథలై పోతూంటే, వీణ కథగా  వుండే రోమాంటిక్ డ్రామాని ఆధునీకీకరించి, ‘వయోలిన్’ కథగా మార్చడం గొప్ప విశేషమే. ఇది కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింటు. 

          విధి ఈ కథలో విలన్ పాత్ర వహిస్తుంది. ప్రేమ కోసం విధిని జయించే ప్రయత్నమే ఈ ప్రేమకథ. కర్మలతో విధిని ఎదుర్కోవచ్చనే చిన్న మెసేజ్ ఇస్తుంది. ఇది పూర్తిగా చకచక సాగే సంఘటనలతో అద్భుత రసప్రధానంగా సాగే కథ. కథకి అతికే రస పోషణతో,  ఏకసూత్రత పాటించే నిర్మలమైన కథలు తెలుగులో రావడంలేదు, రావు కూడా. తమిళులు వచ్చి చూపించి పోవాల్సిందే.

ఎవరెలా చేశారు
        1995 లో ఇంకా పారాడే పాపయిగా వున్నప్పుడు ‘సిసింద్రీ’ లో సోలో బేబీగా నటించి హిట్ కొట్టిన అక్కినేని అఖిల్, తీరా పెదబాబు అయ్యాక తొలి ప్రయత్నంగా 2015 లో ‘అఖిల్’ అనే యాక్షన్ మూవీతో దెబ్బతినిపోయాడు. యాక్షన్ మూవీ చేయలేక దెబ్బతినలేదు, యాక్షన్ మూవీ బాగాలేక దెబ్బతిన్నాడు. ఇప్పుడు మలిప్రయత్నంలో ఒడ్డున పడ్డాడు.
 ‘యే మాయ చేశావే’ లో నాగచైతన్య అక్కినేని లాగా అఖిల్ అక్కినేని తాజా పిల్లవాయువుల్ని మోసుకొచ్చాడు ఈ ప్రేమకథకి. సున్నిత ప్రేమకథకి వూపిరులూదాడు. సునాయాసంగా, సింపుల్ గా, భావోద్వేగ భరితం చేశాడు. నటనలో ఇప్పుడు బాగా ఇంప్రూవయాడు. రాకుమారుడిలాంటి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో వెండి తెర మీద దివ్యంగా వెలుగులు నింపేశాడు. ఇప్పుడు కూడా తెలుగు భగ్నప్రేమికుడి పాత్రలు వెక్కి వెక్కి ఏడుస్తూంటాయి. ఎందుకో తెలీదు. యాసిడ్ బాటిల్ దొరకడం లేదనా?  అఖిల్ అయితే  ఏమాత్రం ఏడవలేదు. చిట్టచివరికి ప్రేక్షకులకే తను రక్తికట్టించే డ్రామాకి ఎలాగూ కళ్ళు చెమరుస్తాయి... 

          యాక్షన్ సైడు - ఇంకో ఫ్రెష్ నెస్. ఈ యాక్షన్ – ఛేజ్ సీన్సు  తెలుగుకి  కొత్త. మెట్రో ట్రైన్ లో యాక్షన్ సీన్లు ఇదే మొదటిది తెలుగు సినిమాకి. నీటుగా క్లాసుగా వుండే ఈ యాక్షన్ సీన్స్ ని సమకూర్చిన హాలీవుడ్ యాక్షన్ కొరియో గ్రాఫర్ బాబ్  బ్రౌన్ సౌజన్యం అఖిల్ కి ఒక ప్లస్.  అఖిల్ లోని లేతదనాన్ని దృష్టిలో పెట్టుకునేమో   ఇలాటి యాక్షన్ ని  సమకూర్చాడు బ్రౌన్. ఏ కోశానా మాస్ వాసన వేయకపోవడం ఇంకో  వూరట. 

          కొత్త హీరోయిన్
ళ్యాణీ ప్రియర్శన్ లేత ప్రేమకథకి పూతరేకులా వుంది.  ఎప్పుడూ సినిమాల్లో హీరోయిన్లు ఫస్టాఫ్ లో యమ వూపేసి, సెకండాఫ్ లో ఐపు లేకుండా జంప్ అయి పోతారు. అలాటిది  తను సెకండాఫ్ లోనే పనిపెట్టుకోవడం సెకండాఫ్ ని కూడా చూసేలా చేస్తుంది. హీరోకున్నంత పాత్ర చిత్రణ లేకపోయినా ( హీరో పాయింటాఫ్ వ్యూ కథ కాబట్టి), ఒక పరితపించే ప్రేమికగా మరీ మెలోడ్రామా లేకుండా సింపుల్ గా నటించుకొచ్చింది. 

          ఇంకో రెండు ఫ్రెష్ క్యారక్టర్లు జగపతి బాబు, రమ్యకృష్ణలవి. పేరెంటింగ్ అనే దాన్ని వీళ్ళు సెన్సి బుల్ గా పోషిస్తారు. హీరోతో విధివశాత్తూ ఆంటీ అంకుల్స్  గా బంధం ఏర్పడి,  అది అమ్మా నాన్నా లనే పిలుపుగా మారాలని తపించే పిల్లల్లేని భార్యాభర్తలుగా వీళ్ళిద్దరి నటన ఒక ప్రత్యేకాకర్షణ. ఇక బాల నటులిద్దరూ తమ అరగంట నిడివి చందమామ కథలాంటి విషయంతో  ఆకట్టుకుంటారు. విలన్ గా అజయ్ కి ఒక కామిక్ ముగింపు వుంటుంది. 

          పాటలు సరే, యాక్షన్ సీన్స్ కి అనూప్ రూబెన్స్ ఒకే థీమ్ మ్యూజిక్ ని రిపీట్ చేయడం  డిఫరెంట్ పంథా. ఇంతవరకు ఇలాటిది చూడలేదు.  ‘డంకర్క్’ ని గుర్తుకు తెస్తుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ లో కొన్ని చోట్ల ఇన్సర్ట్ చేసిన కొన్ని షాట్లు కథనానికి వూపు తెచ్చే విధంగా వున్నాయి.
పి.ఎస్‌.వినోద్ కెమెరా వర్క్ ఫాంటసీ లుక్ తో వుంది. 

చివరికేమిటి
       చాలా లాజిక్కులు ఎగేసి పాత కథనే కొత్తగా చెప్పారు. అయితే ఈ ప్రేమ కథకి ఫెయిరీ టేల్ లుక్ తీసుకురావడంతో లాజిక్కులతో తీసుకున్న సృజనాత్మక స్వేచ్ఛ కూడా స్వీట్ గానే వుంటుంది. ఉదాహరణకి – హీరో సెల్ ఫోన్ పోతే వచ్చిన చివరి కాల్ నంబర్ కోసం పరుగెత్తి, ప్రాణాలకి తెగించి పోరాడి,  ఆ సెల్ ఫోన్నే సాధించాల్సిన అవసరం లేదు. సులభంగా  ఆ నెంబర్ తెలుసుకునే మార్గాలున్నాయి. ఏమో ఇలా కూడా జరగవచ్చనే suspension of disbelief  ని కాసేపు భరించి చూడాల్సిందే – ఆ పరమైన యాక్షన్ ఎపిసోడ్స్ మొత్తాన్నీ. 

          ఇలాటి ప్లాట్ పాయింట్ వన్లు ‘జవాన్’ లోనూ, ‘ఎంసీఏ’ లోనూ చూడలేదా? చూశాం. కానీ మాట్లాడుకోలేదు. ‘జవాన్’ లో అదేదో రక్షణాయుధం కోసం మాఫియా హీరో కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తూంటే, ఆ రక్షణ శాఖలోనే పనిచేసే హీరో అధికారులకి చెప్పాలి కదా? చెబితే తను కుటుంబాన్ని కాపాడుకోవడమనే హీరోయిజం వుండదుగా? ‘ఎంసీఏ’ లో ఆర్టీవో అయిన వదిన మీదికి మాఫియా దాడికొస్తే,  ఆమె పోలీసుఅకి చెప్పొచ్చు గా? చెబితే ఆమెని కాపాడుకునే హీరోయిజం హీరోకి వుండదుగా?  తేడా ఏమిటంటే, విక్రం కుమార్ ఈ లోపాన్ని ఫెయిరీ టేల్  ఫార్మాట్ తో చెల్లిపోయేలా కవర్ చేసుకున్నాడు. 

          మరొకటేమిటంటే,  ప్రజల దగ్గర సెల్ ఫోన్లు కొట్టేసి భారీ ఎత్తున బయటి రాష్ట్రానికి కంటెయినర్ లో, అదీ ఫైరింగ్ స్క్వాడ్ నిచ్చి  తరలించే మాఫియాని కూడా వాస్తవంలో ఎక్కడా చూడం. దీన్ని కూడా ప్రేమకథ లాగే ఫాంటసీలా  తీసుకోవాలన్నట్టుంది దర్శకుడి ఉద్దేశం. నగరంలో వందల వేల  సెల్ ఫోన్లు జనం దగ్గర కొట్టేస్తూంటే, అదో సంచలనం అవుతుంది నిజానికి. వెంటనే జెండా ఎత్తేస్తారు దొంగలు. పెద్ద పెద్ద గోడున్లు పెట్టి పర్మనెంట్ పరిశ్రమలా చేయరు దందాని. 

          విధి చుట్టూ కథ కాబట్టి అనేక కాకతాళీయాలున్నాయి. క్యాబ్ వాలా హీరోకి రాంగ్ కాల్ చేయడం, చిన్నప్పుడు హీరోయిన్  నెంబర్ రాసిచ్చిన నోట్ పదిహేనేళ్ళ తర్వాత  హీరోకి దొరకడం, చిన్నప్పుడు ఆ నోటు కోసం దొంగని వెంటాడుతున్నప్పుడు  హీరో రమ్య కృష్ణ కారుకింద  పడి ఆమె ఇంట్లో సభ్యుడిగా మారడం, మళ్ళీ పెద్దయ్యాక ఆమెని కారు ప్రమాదం నుంచి తప్పించడం, చిన్నప్పుడు నోటు కొట్టేసిన దొంగే పెద్దయ్యాక మళ్ళీ హీరోయిన్తో కలపగల హీరో  సెల్ ఫోన్ ని కొట్టేయడం...ఇంకా, హీరో కోసం హైదరాబాద్ వచ్చిన హీరోయిన్ హీరోని వెతకాలంటే,  చిన్నప్పుడు తాము కలుసుకునే పానీ పూరీ బండి వాడి కోసం వెతుక్కోవాలి నిజానికి. ఎక్కడో మ్యూజిక్ ఫెస్టివల్ లో వయోలిన్ వాయిస్తే ఎక్కడ వింటాడు హీరో?  ఆ పానీ పూరీ వాణ్ణి తర్వాతెప్పుడో కాకతాళీయంగా చూస్తుంది. ఇన్ని కాకతాళీయాలున్నా ఇవి అతిగా అన్పించవు. పైగా ఎక్కడికక్కడ డ్రామాని సృష్టించే, మెలోడ్రామాని అనుభవించేలా చేసే,  కథనాన్ని కొత్తగా మార్చేసే డైనమిక్స్ గా వుంటాయి. విధిని ఆధారంగా చేసుకున్న ఈ కథా ప్రారంభంలోనే దర్శకుడే క్వాంటం ఫిజిక్స్ థియరీ చెప్తాడు నాగార్జున వాయిసోవర్ తో – మనందరం కంటికి కన్పించని సన్నటి దారాలతో అల్లుకుని వున్నామని. అందుకే ఇలాటి కాకతాళీయాలు. నియర్ మిస్సులు. సింక్రో డెస్టినీ  తాలూకు చిత్రణలు. 

       హీరో హీరోయిన్లు కలవడానికి ఏ సోషల్ మీడియా పనికిరాదా? ఇతనో ఆమెనో వైరల్ అయ్యేలా ఒక్క వీడియో  పోస్ట్ చేస్తే  సరిపోయే దానికి,  ఈ సెల్ ఫోన్ గొడవంతా  అవసరమా – ఆమె హైదరాబాద్ వచ్చ్ వయోలిన్ వాయించుకోవడం అవసరమా అంటే,  అదంతే.  ఫెయిరీ టేల్ అనే షరతులు వర్తిస్తున్నాయి కాబట్టి. అన్ని అసంగతాల్నీ జయించడానికి చిత్రీకరణపరంగా, సంగీతపరంగా, కళాదర్శకత్వం పరంగా సమ్మోహనపరుస్తూనే, కృతకం కాని, ఎక్కడికక్కడ కథనంలోంచి సహేతుకంగా ఉట్టి పడే సహజ అనుభూతుల్నీ, భావోద్వేగాల్నీ అస్త్రాలుగా చేసుకున్నారు. 

          చిన్నప్పటి వయోలిన్, నోటు, చేతి గాజు అనే మూడు ప్లాట్ డివైసులు మళ్ళీ ఇద్దర్నీ కలపడానికి చివర్లో పాత్ర వహిస్తాయి. ప్లాట్ డివైసులు ఎంతైనా చైతన్యం తీసుకొస్తాయి దృశ్యాల్లో. ఇదంతా పాత మెలోడ్రామానే. ఇలాటి చిన్నప్పటి కథలకి మన్మోహన్ దేశాయ్ మాస్టర్. ఇదంతా ఈ తరహా మేకింగ్ కి సరిపోయింది. అలాగే  ‘మనం’ లో గడియార స్థంభం అనే కథా స్థలి వున్నట్టే, ఇక్కడా ట్రాఫిక్ సిగ్నలనే కథా స్థలి వుంది. విధి, కాలం, స్థలాలు, కాకతాళీయాలు దర్శకుడి అభిమాన సబ్జెక్టులుగా వున్నట్టున్నాయి ‘మనం’ దగ్గర్నుంచీ. 

          హీరో మొదటి పాట అంతా చరణం చరణానికీ మారే వివిధ చిన్న పిల్లలతో వుంటుంది. ఇదొక పజిల్  మనకి. హలో ఎక్కడున్నా హలో, ఏమయ్యావ్ హలో... అంటూ  టీనేజి అమ్మాయిలతో పాటేసుకుని గిచ్చి గిచ్చి నానా రచ్చ చేస్తాడు మన ఏ తెలుగు స్టార్ అయినా. లేకపోతే అది టూరిజంలాంటి స్టారిజం కాదనుకుంటాడు. ఇలాకాక,  చినబాబు అఖిల్ చిన్నపిల్లలతో పాడుకుంటాడేమిటని మనకి పజిల్ లా వుంటుంది. . ఫ్లాష్ బ్యాక్ లో  తెలుస్తుంది దీని అంతరార్ధం,  చిన్నప్పుడు తెలిసిన హీరోయిన్ కథతో... అందుకని చిన్నపిల్లల్లోనే వెతుక్కుంటున్నాడు ఇప్పుడు హీరోయిన్ని. ఇలా ఆమెకి హీరో ఎంత బలంగా, ఏ మూలాల్నుంచి  కమిట్ అయివున్నాడో ఈ పాటలోనే మనస్తత్వం బయటపడే గొప్ప చిత్రణ అనుకోవాలిది. ఇదే పాటలో ఒక షాట్  లో చెరో వైపు రెండు దీపాలు మసగ్గా వెలుగుతూంటాయి. ఇవి సోల్ మేట్స్ కి ప్రతీకాలంకారాలన్న మాట. 

          ఇక వీధి బాలుడు పాటగాడుగానూ, గొప్పింటి బాలిక ప్రేమలో పడేది గానూ ఎప్పుడో ‘డిస్కో డాన్సర్’ కాలంలోనే  చూశాం. అందులో మనోడు ‘గోరోకీ నా కాలోకీ దునియా హై దిల్ వాలోకీ’ అని పాడితే, ఇందులో మనోడు – ‘హోగయాహై  తుజ్కో తో ప్యార్ సజనా (దిల్ వాలే దుల్హనియా లేజాయింగే) వాయిస్తాడు. ఇదంతా పాత మూస వాసనేయదా? వేయదు. ఇప్పటి కాలానికి తగ్గట్టు చూపించే విధానంలో చూపిస్తే చాలా నాస్టాల్జియా! అతీతమైన క్రియేటివ్ పరిజ్ఞానం  లేకుండా పాతా కొత్తా కళల్ని ఫ్యూజన్ చేయలేరు.       

          ఇక చాలా చోట్ల బోరు కొట్టే రొటీన్ దృశ్యాల్ని నివారించడానికి క్లోజప్స్ తో క్లుప్తతని పాటించారు. రెండు ప్యాకెట్ల మీద  క్లోజప్స్ లో బార్ కోడ్స్ ని స్కాన్ చేస్తూంటే ఏమిటా అని ఆసక్తిగా చూస్తాం. కట్ చేస్తే హీరో, రమ్య కృష్ణ రోడ్డు మీద నడుస్తూ ఫోన్లో మాట్లాడుతూంటారు షాపింగ్ పూర్తయ్యిందని!  షాపింగ్ సీనుని షాపులో సోదిలా చూపిస్తూ మనల్ని పాసివ్ గా, బోరు కొట్టేలా చూసేలా చేయకుండా,  కేవలం బార్ కోడ్స్ స్కానింగ్స్ క్లోజప్స్ తో అటెన్షన్ లోకి తీసుకొచ్చి- యాక్టివ్ వ్యూవింగ్ ఎక్స్ పీరియెన్స్ ని పంచారు (తెలుగులో దీన్నేమంటారో తర్వాత ఆలోచిద్దాం). 

          ఐతే ఈ సభ్యత గల చిత్రీకరణల్లో ఒక అసభ్యత కూడా వుంది. హీరో సిగరెట్లు కాల్చ వద్దన్నప్పుడు, జగపతి బాబు తాగుతున్న సిగరెట్ ని కారులోంచి బయటికి విసిరేయడం లాంటిది. ఆ సిగరెట్ తో బాటు కారులో వున్న  మరిన్ని ప్యాకెట్ లని బయట సిటీ నడి రోడ్డు మీదికి విసిరేయడం లాంటిది. ఆయన  ఎంచక్కా కారు దిగి వెళ్లి, ఆ కార్యక్రమం డస్ట్ బిన్ లో కానిచ్చి వచ్చి వుంటే పాత్ర చాలా ఉన్నతంగా అన్పించేది. సీను దానికదే ఎడ్యుకేటివ్ గా వుండేది సివిక్ సెన్సుతో. జగపతిది మొరటు పాత్రేం కాదు సిగరెట్లు అలా పారేయడానికి,  హూందాతనం గల పాత్రే. 

ఇంతకీ స్క్రీన్ ప్లే సంగతులేమిటి?    
        ఈ స్క్రీన్ ప్లేలో హీరో సెల్ ఫోన్ని పోగొట్టుకోవడం వరకూ బిగినింగ్, దాన్ని దొరికించుకుని విలన్ తో తలపడి బందీ అవడం వరకూ మిడిల్, సెల్ ఫోన్ తో తప్పించుకుని హీరోయిన్ కి కాల్ చేసి ఎట్టకేలకు కలుసుకోగల్గడం ఎండ్ -  ఇదే ప్రధాన కథ. చాలా పొట్టి కథ. మిగిలినదంతా రెండు ఫ్లాష్ బ్యాకుల సుదీర్ఘ అంతర్గత కథ. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన కాదు. 

          ప్రధాన కథలో సెల్ ఫోన్ని పోగొట్టుకునే సంఘటన ప్లాట్ పాయింట్ వన్, సెల్ ఫోన్ని దొరికించుకోవడం మిడ్ పాయింట్ (ఇంటర్వెల్), హీరోయిన్ చేతి గాజు హీరో చేతిలో చితికిపోవడం ప్లాట్ పాయింట్ టూ.

          మొదటి పది నిమిషాల్లోనే ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. మిడ్ పాయింట్ గంటకల్లా వచ్చేస్తుంది. సెకండాఫ్ మరోగంట వుంటుంది. మొత్తం కలిపి రెండు గంటల నిడివి. కానీ ఎంతో చూసినట్టు వుంటుంది.

          ఇటీవల ‘మళ్ళీరావా’ లో ప్రధాన కథని మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకుల రెండు కాలాల అంతర్గత కథలతో,  హీరోహీరోయిన్ల దృక్కోణాలు  కలిపేస్తూ, చైతన్య స్రవంతి ( స్ట్రీమ్  ఆఫ్ కాన్షస్ నెస్) శిల్పంతో చూపించారు. ఇదంతా ప్రధాన కథని గుర్తుపట్టకుండా గజిబిజి చేసింది. చైతన్య స్రవంతి శిల్పం సాహిత్యంలోనే తప్ప (నవీన్ ‘అంపశయ్య’) హాలీవుడ్ కమర్షియల్ సినిమాలకి ఎవరూ వాడలేదు. కేవలం జర్మన్ ఎక్స్ ప్రెషనిస్టు కళని హాలీవుడ్ లో ఫిలిం నోయర్, నియో నోయర్ థ్రిల్లర్స్ కి విజయంతంగా మల్చుకున్నారు. చైతన్య స్రవంతి శిల్పాన్ని రష్యన్, జర్మన్, ఫ్రాన్స్ వంటి  దేశాల్లోకమర్షియలేతర సినిమాలకి వాడుతున్నారు. ఆ ‘వరల్డ్ సినిమాలు’  ప్రపంచమంతా ఆడవు. మాస్ మీడియా సెక్షన్ కావు. వరల్డ్ సినిమా పండితులది, కమర్షియల్ సినిమా పామరులది. ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ లో కూడా వరల్డ్ సినిమా టెక్నిక్ వాడి విఫలమయ్యారు. కమర్షియల్ సినిమాల ప్రపంచంలో వుండే వాళ్ళు వరల్డ్ సినిమాలు చూడ వద్దనేది ఇందుకే. ఆ మాటకొస్తే కమర్షియల్ సినిమాలకి రివ్యూలు రాసే వాళ్ళు కూడా వరల్డ్ సినిమాలు చూడకూడదు. భావకవిత్వాన్ని విప్లవ కవిత్వ దృష్టితో చూసినట్టు వుంటుంది. 

           ‘హలో’ లో ఇలా కాకుండా చూపించే పిల్లల కథంతా ఒకే ఫ్లాష్ బ్యాక్ గా చూపించేశారు. ఈ ఫ్లాష్ బ్యాక్ కి ప్రేరణ సంఘటనే. ప్రధాన కథగానీ, అంతర్గత కథగానీ సంఘటనలతోనే నడపడ మనేది, సంఘటనల ద్వారానే విషయాన్ని తెలియజెప్పడ మన్నది  విజువల్ మీడియా అయిన సినిమా సూత్రమే. ఇదిక్కడ పూర్తిగా కన్పిస్తుంది. 

          హీరో సెల్ ఫోన్ని దొంగోడు కొట్టేయడం ప్లాట్ పాయిట్ వన్ అని చెప్పుకున్నాం. ఆ సెల్ ఫోన్ కోసం దొంగోడ్ని వెంటాడి పట్టుకుంటే, వాడు చిన్నప్పటి  తెలిసిన దొంగే కావడం,  దాంతో  హీరోకి గతం గుర్తుకు రావడం,  ఫ్లాష్ బ్యాక్ మొదలవడం జరగిపోతాయి. చిన్నప్పటి దొంగోడ్ని చూస్తే  ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు రావడమెందుకు? ఎందుకంటే,  అప్పట్లో చిన్న హీరోయిన్ ఫోన్ నెంబర్ రాసిచ్చిన నోటుని వీడే కొట్టేశాడు. అప్పుడూ వీడే, ఇప్పుడూ వీడే. ఇలా ఇది ఫ్లాష్ బ్యాకుతో కనెక్షన్ ని ఏర్పాటు చేసింది.  

          ఈ మొదటి ఫ్లాష్ బ్యాకులో చిన్నప్పటి హీరో హీరోయిన్లని చూస్తాం. ఇందులో ప్రధానకథకి అవసరమైన ప్లాట్ డివైసుల్ని ఉత్పత్తి  చేశారు. వాళ్ళిద్దరి అనుబంధం, చేతి గాజు, నోటు, వయోలిన్ బాణీ, దొంగోడు, పానీ పూరీ వాడు, హీరో ని పెంచుకున్న తల్లిదండ్రులూ వగైరా.   ఈ ఫ్లాష్ బ్యాక్ 25 నిమిషాల పాటు సాగుతూ సాగుతూ, నవంబర్ 14 న మిస్సయిన వాళ్ళకోసం బాలల చలన చిత్రం ప్రదర్శిస్తున్నట్టు వుంటుంది. ‘మళ్ళీ రావా’ కూడా డిటో. రెండు బాలల చలన చిత్రాలు. 

          ఇప్పుడు అఖిల్ పునరాగమన ప్రయత్నం ఎలా వుందో చూడ్డానికి పోయే ప్రేక్షకులకి, వున్న గంట ఫస్టాఫ్ లో అరగంట బాలలే కన్పిస్తారు. ఈ అరగంట లోనే రెండు పాటలు కూడా వేసుకుంటారు! చినబాబు మీద పాటలకోసం ఎదురు చూసేవాళ్ళకి బుల్లిబాబు మీద పాటలు దర్శకుడి బడాయే. ఈ బాలల కథ పూర్తవగానే ఇదే ఫ్లాష్ బ్యాక్ జగపతి-రమ్యకృష్ణ
ల పేరెంటింగ్ కథగా మారి సాగుతుంది. 

          ఫ్లాష్ బ్యాక్ పూర్తవగానే దొంగోడ్ని పట్టుకోవడం దగ్గరాగిన మిడిల్ తిరిగి అందుకుంటుంది. వాడితో గోడౌన్ కెళ్ళడం, ఫైట్ చేయడం, కంటెయినర్ ని ఛేజ్ చేయడం, సెల్ ఫోన్ని దొరికించుకోవడం,  దీంతో ఇంటర్వెల్ రావడం పూర్తవుతాయి. ఈ ఇంటర్వెల్ సీనుకి బ్యాంగ్ వుండదు. హాలీవుడ్ టైపు లో కథని మధ్యకి ఆపారంతే. 

          ఇంటర్వెల్ తర్వాత మిడిల్ టూ ప్రారంభం. సెల్ ఫోన్ మాఫియా గా అజయ్ పాత్ర పరిచయమవడం, హీరోని వెతికి పట్టుకోవడం, ఫైట్, హీరోని స్పృహ తప్పేలా కొట్టి పడెయ్యడం, దీంతో మిడిల్ టూ కి బ్రేక్. 

          ఈ కొట్టి పడెయ్యడమనే చర్యే  రెండో ఫ్లాష్ బ్యాక్ ని ప్రేరేపిస్తుంది. రెండో ఫ్లాష్ బ్యాక్ లో ఏముంది? హైదరాబాద్ వచ్చిన హీరోయిన్ తో తన హీరోయినే అని తెలీనక సాగే కథ. దీన్ని హీరోని కొట్టి పడెయ్యమనే చర్య ఎలా ప్రేరేపిస్తుంది? తల మీద దెబ్బ పడగానే ఇప్పుడామే  గుర్తొస్తుంది గనుక. 

          ఈ రెండో ఫ్లాష్ బ్యాక్ లో ఆమెతో తనకి నియర్ మిస్సులు జరుగుతాయి. తెలియకుండానే ఆమె వున్న కారు టైరు మార్చడం, రమ్యకృష్ణ బ్యాగులో డిమాండ్ రింగు పడెయ్యడం లాంటి సంఘటనలు ఇద్దర్నీ సన్నిహితం చేస్తాయి. దీని తర్వాత రమ్యకృష్ణ హీరో ని చేసుకోమని హీరోయిన్ని అడగడం, ఆమె హర్ట్ అవడం జరిగి, హీరో తనకా ఉద్దేశం లేదని క్లియర్ చేయడం, హీరోయిన్ ఫ్రెండ్ పెళ్లి సంబరం, అక్కడ హీరోయిన్  చేతి గాజు హీరో వల్ల విరగడం  మొదలైనవి  జరుగుతాయి. 

           ఆ చేతి గాజు విరిగితే హీరోయిన్ ఎందుకంత బాధ పడుతోందో హీరో అడుగుతాడేమో ననీ, అడిగేస్తే ఆమె చెప్పేస్తే కథ ముగిసిపోతుందనీ  మనం కంగారు పడతాం. అలా జరగదు. మనకి తెలిసిపోయిన నిజం వాళ్ళిద్దరూ తెలుసుకోరు. ఇదీ పాత్రలతో మన కేర్పడుతున్న సస్పెన్స్. ఈ మొత్తం రోమాంటిక్ డ్రామానీ ఇలా సస్పెన్సే కట్టి పడేస్తూంటుంది. 

          ఇక హీరో స్పృహలోకి రావడంతో రెండో ఫ్లాష్ బ్యాక్ ముగిసి, బ్రేక్ ఇచ్చిన మిడిల్ టూ తిరిగి ప్రారంభమవుతుంది. బందీగా వున్న హీరో విలన్ సహా మొత్తం గ్యాంగుని చిత్తు చేసి సెల్ ఫోన్ తో పారిపోతాడు. ఇది ప్లాట్ పాయింట్ టూ. దీంతో మిడిల్ టూ ముగుస్తుంది. ప్లాట్ పాయింట్ టూ అంటే సమస్యకి – దాని తాలూకు సంఘర్షణకి -  పరిష్కార మార్గం చూపే మలుపే కాబట్టి - ఫైనల్ గా సమస్యని పరిష్కరించే సెల్ ఫోన్ చేజిక్కించుకుని హీరో పారిపోతున్నాడు. 

          ఇప్పుడు ఈ ఎండ్  విభాగంలో మళ్ళీ సినిమా మొదట్లో చూపిన క్యాబ్ వాలాకి కాల్ చేస్తాడు. మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న ప్రదేశం తెలుసుకుని అక్కడి కెళ్ళిపోతాడు. వయోలిన్ మీద ఆ బాణీ వినపడిం దంటే,  అది తన చిన్ననాటి హీరోయినే అనీ, ఆమె ఇక్కడే వుంటుందనీ పాత ఫార్ములాతో కూడిన నమ్మకం హీరోకి. మనమైతే చిన్నప్పుడు ఏం విన్నామో ఎప్పుడో మర్చిపోయి ఇంకేదో దానిమీది కెళ్ళిపోతాం. చిన్నప్పటి పోరీ పోరడూ ఛత్తేరి అనుకుంటాం. హీరో హీరోయిన్లు ఈ బాణీని విడిపోయిన పద్నాల్గేళ్ళనాడే సోషల్ మీడియాలో వాయించి పరివ్యాప్తం చేసుకుని వుంటే ఆనాడే  కలుసుకునే వాళ్ళేమో. 

          ఇదంతా కాదు, దర్శకుడికి పరీక్ష- ఇంత ఉద్వేగభరిత డ్రామా నడిపాక,  వాళ్ళిద్దరూ గుర్తు పట్టుకుంటే సీనేమి టన్నది. ఆ పతాక సన్నివేశాన్ని ఎలా చూపిస్తాడన్నది. కలిసే తిరిగారు, కానీ తెలియక తిరిగారు, ఇప్పుడు తెలిసిపోతే ఎలావుంటుంది పరిస్థితి? దీన్ని చూపించడమే దర్శకుడికి పరీక్ష. 

          ఇక్కడే హీరోకి ఆ నెంబరున్న నోటు దొరకడం- [ప్రకృతి (సబ్ కాన్షస్ మైండ్)ఇంతే, మనం ప్రయత్నం చేస్తే అదే వెతికి పట్టుకొచ్చి ఆఫర్ చేస్తుంది, నీకు టైం రాలేదని మాయం చేసేది కూడా అదే] -  దానిమీద నెంబర్ తో చిట్టచివరికి కాల్  చేయడం,  అక్కడే వున్న హీరోయిన్ దాన్ని రిసీవ్ చేసుకోడం...ఆ తర్వాత ...ఇక తెరపై చూడాల్సిందే. 

          ఈ పొట్టి ప్రధాన కథ చూస్తే ఇది ఒక రోజులోనే జరిగే కథ. అలాగని టైం లాక్ లేదు. ఫలానా ఇన్ని గంటల్లోనే సెల్ ఫోన్ని సాధించుకోవాలనే షరతు లేదు. ఇందువల్ల ఒక ఫ్రేములో మనల్ని కట్టేసిన ఇరుకు ఫీల్ కాం. ఒకరోజులో జరుగుతున్న కథ అనీ, ఒక రోజులోనే ముగుస్తుందనీ చెప్పకుండా ఆప్షన్ లాక్ తో నడపడం వల్ల మనం ఫ్రీగా ఫీలై ఎంజాయ్ చేయగల్గుతాం.

***
   (ps : నిన్న ‘ఎంసీఏ’ చూసిం దగ్గర్నుంచీ ఒకటి వేధిస్తోంది. విలన్ తో వదినకి సమస్య వుంటే వుంది, దాన్నే ఎందుకు ప్రధాన వయొలెంట్ యాక్షన్  కథగా  చెయ్యాలి. వదినకి హీరోకీ మధ్య వున్న సమస్యని  వ్యక్తిగతంగానే తీరుస్తూ,  ప్రేక్షకులకి ఫ్యామిలీ సినిమా చూడగల్గే స్పేస్ నిస్తూ,  ప్లాట్ పాయింట్ టూ దగ్గర మాత్రమే విలన్ ని యాక్టివేట్ చేసి ఎందుకు ముగించకూడదని.  ఇలా చేయవచ్చని ఇప్పుడు  ‘హలో’ లో తేట తెల్లమైంది. ఇందులో విలన్ వున్నాడు కానీ ప్రేమ కథతో సంబంధం లేదు, సెల్ ఫోన్ తోనే సంబంధం. దీంతో మొత్తం మూడు నాల్గు సీన్లకి మించి లేవు. ప్లాట్ పాయింట్ టూ దగ్గర అతణ్ణి ఓడించి వెళ్ళిపోయాక, అక్కడే అతడి ట్రాకు ముగుస్తుంది. అక్కడ్నించీ ఎండ్ విభాగం తో మళ్ళీ మొదలయ్యే ప్రధాన కథలోకి అతను రాడు. ఇప్పుడు తొలిసారిగా ప్రధాన కథలో హీరోయిన్ వుంటుంది. ఇప్పుడు హీరోయిన్ని యేసుకు పోదామని విలన్ వచ్చాడా?  రాలేదు ( టాలీవుడ్ లోనైతే ఇందుకు తయారు). యాక్షన్ కథ యాక్షన్ కథే. ప్రేమకథతో సంబంధం లేదు. కానీ ప్రధాన కథగా వున్న ఈ పొట్టి యాక్షన్ కథే,  చివరికి సబ్ ప్లాట్ గా ముగుస్తుంది. అవును,  ప్రేమ కథకి ముందే ముగిసిపోతే విలన్తో ఇది సబ్ ప్లాటే. అంటే సబ్ ప్లాట్ గా మార్చి విలన్ కథ ముగించారు. ‘మరోచరిత్ర’ లో మనం వూహించే స్టోరీ క్లైమాక్స్ కాస్తా  రివర్స్ లో ప్లాట్ క్లయిమాక్స్ తో ముగిసినట్టు.

          ‘హలో’ లో ఈ విలన్ ముగింపు కూడా ఫన్నీగా వుంటుంది. అతణ్ణి చంపాల్సినంత సీను లేదు, ఈ ప్రేమ కథలో చావులుండ కూడదు. ‘ఎంసీఏ’ వయొలెంట్ యాక్షన్లో చంపేంత సీనున్నా చావడు. ఒకటి నిజం, ప్రేక్షకులకి ఏది ప్రధానమో తెలియకపోతే ఏదీ నిలబడదు)


సికిందర్

         


         
         
         

         
         
         
         




         
 



           






21, డిసెంబర్ 2017, గురువారం

570 : రివ్యూ!



రచన - ర్శత్వం: శ్రీరామ్ వేణు
తారాగణం: నాని, సాయిపల్లవి, భూమిక, నరేష్ విజయ్, సీనియర్ రేష్, ఆమని దితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రణం: మీర్రెడ్డి
నిర్మాతలు: దిల్రాజు, శిరీష్, క్ష్మణ్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్
విడుదల : డిసెంబర్ 21, 2017

***
        తెలుగు ప్రేక్షకులు చూసిందే చూడరా...అని  అవే రొటీన్ సినిమాలకి బానిస
లైపోయారా కొకైన్ కొట్టినట్టు? సినిమాలు
ఇలా వుంటేనే  తప్ప ఇంకోలా వుంటే కొకైన్ కిక్కు వుండదనుకుంటున్నారా? ఇతరులకి వేర్వేరు రూట్లు వుంటే,  మా రొటీన్ రూటే సపరేట్ అనుకుంటున్నారా? ఇలా మా తెలుగు వాడు అఖిల భారత స్థాయిలో  చాలా భిన్నమైనోడు – చాలా బాగా తేడా గలోడు సుమా - అని చాటాలనుకుంటున్నారా? లేక సినిమాలు స్టార్ గ్లామర్ వల్ల అవే ఆడేస్తాయనీ, వెరైటీ అంటూ పెద్దగా పనులు పెట్టుకోవద్దనీ మేకర్లు రాజ్యాంగం రాసుకున్నారా? ఆడేదే బొటాబొటీ రెండు వారాలు, ఆ బొటాబొటీ వారాల్లోనే రిటర్న్స్ చూసుకోవాలి తప్ప, రీరన్స్ కి కాలమే కాని  ఈ రోజుల్లో బొటాబొటీ సరుకు ఏదైతేనేం అనుకుంటున్నారా? తెలుగు సినిమాల షెల్ఫ్ లైఫ్ ఇక రెండు వారాలేనా? అయితే ఇలా తీయడమే కరెక్టు. ప్రేక్షకులు ఇలా చూడడమే కరెక్టు. అనవసరంగా మేకింగ్ లో వున్నప్పుడు అంచనాలు, ఎక్స్ పెక్టేషన్స్, స్టామినా అంటూ ఏవేవో గొప్ప రొటీన్ మాటలు వల్లెవేసుకుని చూడబోయే అదే రొటీన్ కోసం బాకాలూదుకోవడం వృధా. రాం గోపాల్ వర్మ అన్నట్టు,  రేపటి సినిమా థియేటర్ లో వుండదు, నెట్ ఫ్లిక్స్ లో నెట్ లో వుంటుంది. అప్పుడే అవి ఈ రోటీన్ ని బ్రేక్ చేస్తాయి. అంతవరకూ థియాట్రికల్  రిలీజులే వుండబోని ఈ అంత్యకాలంలో సినిమా లిలాగే నామమాత్రంగా వస్తూంటాయి.

నేచురల్ స్టార్ నాని ప్రేమకథల తర్వాత ఒక ఫ్యామిలీ కథకి, అందులోనూ  వదిన సెంటిమెంటుకి ఆకర్షితుడయ్యాడు. హిందీలో అలనాటి జె. ఓంప్రకాష్ ని గుర్తుకు తెస్తున్న కుటుంబ సినిమాల అగ్ర నిర్మాత దిల్ రాజు నేచురల్ స్టార్ నానితో నేచురల్ గానే కుటుంబ సినిమా తీస్తున్నామనుకున్నారు. తను మొన్ననే ‘జవాన్’ తో కూడా ఇలాగే అనుకున్నారు. ‘జవాన్’ ఫ్యామిలీ ఎలావుందో అలాగే ఇప్పుడు ‘ఎంసిఏ’ అనే ఫ్యామిలీ కూడా తీశారు. ఇదీ రొటీన్ కి రొటీన్ అంటే! రొటీన్ కే రొటీన్ ని నేర్పగల  దిల్ రాజుగారు ‘ఫిదా’ పల్లవిని కూడా రిపీట్ చేశారు. 2011 లో ‘ఓ మై ఫ్రెండ్’ తో తనే పరిచయం చేసిన దర్శకుడు వేణూ శ్రీరాం కి ఇప్పుడు రెండో అవకాశం తనే ఇచ్చారు. ఇన్ని చేశాక ఇందులో విషయమెలా వుంది?


కథ 
       నాని (నాని) ని అన్న రాజీవ్ (రాజీవ్ కనకాల) పెంచి పెద్ద చేస్తాడు. ఇద్దరి బ్రోమాన్స్ విడదీయలేని బంధం లాగా వుంటుంది. అన్నకి పెళ్ళయి వదిన జ్యోతి (భూమిక) రావడంతో నానికి అన్న దృష్టిలో ప్రాధాన్యం తగ్గిపోతుంది. దీంతో వెళ్లి బాబాయ్ (నరేష్) దగ్గరుంటాడు. ఆర్టీవో గా పనిచేసే వదినకి వరంగల్ బదిలీ అవడంతో అన్న పిల్చి వరంగల్లో వదినకి తోడుండ మంటాడు. తను ఢిల్లీకి  ట్రైనింగ్ కి వెళ్ళిపోతాడు. వదినతో వరంగల్ లో మకాం పెట్టిన నానిని ఆమె పనివాడిలా చూస్తుంది. ఇంటి పనులన్నీ చేస్తూంటాడు.అదే సమయంలో బీటెక్ చదివే పల్లవి (సాయిపల్లవి) ఇతణ్ణి  చూసి లైనేస్తుంది. ఈమె వదిన చెల్లెలని ముందు తెలీక ప్రేమలో పడతాడు నాని. ఆ తర్వాత ఇద్దరూ వదిన కళ్ళల్లో పడతారు. 

          ఇంతలో వదిన కి శివ (నరేష్
విజయ్) అనే ఒక ప్రైవేట్ బస్సుల ఓనర్ తో సమస్య వస్తుంది. చట్ట విరుద్ధంగా తిరుగుతున్న అతడి బస్సుల్ని సీజ్ చేసిన ఆమెని చంపే ప్రయత్నం చేస్తాడు. నాని అడ్డుకుంటాడు. ఇక పది  రోజుల్లో నీ వదినని చంపేస్తా కాచుకో – అంటాడు శివ. ఇప్పుడు నాని వదినని  కాపాడుకోగలిగాడా? అందుకేం చేశాడు? ... అన్నది మిగతా కథ.  

ఎలా వుంది కథ 
       పైనే చెప్పుకున్నాం. ‘జవాన్’ కూడా చూశామని చెప్పుకున్నాం. నీ కుటుంబాన్ని కాపాడుకో -  అనే విలన్ తో హోరాహోరీ. దీన్ని కుటుంబ కథ అనడానికి లేదు. ఇదో రొటీన్ యాక్షన్ కథ. పదేపదే చెప్పుకున్నట్టు, టీవీ సీరియళ్ళకి వెళ్ళిపోయిన కుటుంబ కథల్ని,  ఇక పెద్ద తెరకి తీయలేమని, ఫ్యాక్షన్ కుటుంబాల యాక్షన్ గా ఫ్యామిలీ సినిమాలు తీసే మార్గం కనిపెట్టారు. ఫ్యాక్షన్ పాత బడ్డాక  కుటుంబ కథల్ని మాఫియాలకి అప్పజెప్పారు. హింస లేకుండా కుటుంబ సినిమాలు తీయలేని నిస్సహాయత. ప్రస్తుతం కూడా ఇదే. వదినకి మాఫియాతో ప్రమాదం రావడం, హీరో ఆమెని కాపాడుకోవడం. ఈ రెండిటి మధ్య హింస. టీవీ సీరియళ్ళని తలదన్నే ఒక అచ్చమైన కుటుంబ సినిమాని కుటుంబ సినిమాల దిల్ రాజే తీయలేక వాటిని దిగజారిస్తే ఇంకెవరు బాగా తీస్తారు? ఒక అగ్ర నిర్మాతగా అగ్రతారలతో తనెలా తీస్తూంటే ఆ బాటలో ఇతరులూ అలాగే  తీస్తారు. తను ఎటువైపు  దారి తీయిస్తున్నారో దిల్ రాజు గారే ప్రశ్నించుకోవాలి. 

ఎవరెలా చేశారు 
      నేచురల్ స్టార్ నాని గురించి ఇవ్వాళ్ళ కొత్తగా చెప్పుకోవా
ల్సిందేమీ లేదు. చెప్పాల్సింది  కాస్త ఆలోచించి సినిమాల్ని ఎంచుకో
మనే. ఒక ఫస్టాఫ్ ఫ్యామిలీ కథ సెకండాఫ్ హింసతో యాక్షన్ కథలా మారిపోవడం ఎలా నేచురల్ అవుతుంది. నేచురల్ అవకపోతే తనెలా నేచురల్ అవుతాడు. చూసే ప్రేక్షకుల నేచరే ఇంతనుకుంటే చెప్పేదేమీ లేదు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఫస్టాఫ్ లోనే తను నేచురల్. వదినతో, హీరోయిన్ తో సీన్లు లాగించడం వరకూ ఓకే. కానీ వదినతో వున్న ఉద్రిక్తత భావోద్వేగాల పరంగానే,  కుటుంబ డ్రామాతోనే చల్లబడాల్నింది పోయి, ఎవరో విలన్ వచ్చి అలజడి సృష్టిస్తే – ఈ అవకాశంతో పరిష్కరించుకోవడమనే పాసివ్ పాత్రోచిత కృత్రిమ కథాకథనాలే అతకలేదు. విలన్ వచ్చి వుండకపోతే నాని పాత్ర ఏం చేసి వుండేది? ఇదీ వేసుకోవాల్సిన అసలు ప్రశ్న, చేయాల్సిన  అసలు చిత్రణ. 

          ‘ఫిదా’తో తెలిసిన హీరోయినే కావడంతో ఆమెతో నాని ఫన్నీ సీన్లకి మంచి రెస్పాన్సే  వచ్చింది ప్రేక్షకుల్లోంచి. పాటలతోనూ హుషారిక్కించగల్గాడు తను. సెకండాఫ్ లోనే  విలన్తో కథగా మారడంతో సీరియస్ యాక్షన్లోకి వెళ్ళిపోయాడు తను. ఆ పరంగా ఫైట్లు వచ్చినప్పుడే ప్రేక్షకుల్లో స్పందన. విలన్ మరీ టీనేజర్ లా వుండడంతో అతడితో తన సీన్లకి ఏ మాత్రం మజా లేదు ప్రేక్షకులకి. ఫ్యామిలీ వైపు ప్రత్యర్ధి వదిన అంత  వెయిట్ కూడా లేదు విలన్ కి.  నానికిది ఓ అంతంత మాత్రపు పాత్రే తప్ప ఎంతో వూహించుకున్నంత  మాత్రంది కాదు. పైగా మిడిల్ క్లాస్ అబ్బాయి అనడమేగానీ, ఆ మనస్తత్వం ఏమిటో చూపించే సీన్లు లేవు. ఎప్పుడో విలన్తో మిడిల్ క్లాస్ వాళ్ళం ఇలా వుంటాం, అలా వుంటామని చెప్తే సరిపోదు- అది విజువల్  గా సీన్లు వేసి బిహేవియర్ ద్వారా చూపించాలి. 

          ‘ఫిదా’ పల్లవి ఎంట్రీ సీన్లో ఎందుకని క్లోజప్స్  లేవో తర్వాత అర్ధమవుతుంది మనకి.  క్లోజప్స్ లో ఆమె ‘ఫిదా’లో వున్నంత అందంగా లేదెందుకనో. అందం సంగతలా వుంచితే నటనకి పెట్టింది పేరు. కానీ నటించడానికి పాత్రే సరిగా లేదు. సెకండాఫ్ లో పూరీ జగన్నాథ్ టెంప్లెట్ లో లాగా పాటలకే పరిమిత మయింది. అయితే స్లిమ్ బాడీ తో పాటల్లో ఆమె ఇచ్చిన  ఝట్కాలు,  కాటికి కాళ్ళు జాపుకున్నోణ్ణి కూడా లేపి కూర్చోబెడతాయి. ఝట్కా రాణి తో  జట్కా ఎక్కినంత కిక్కు- బసంతి తో వీరూకి లాగా. 

          చాలా కాలం తర్వాత సీనియర్ పాత్రలో భూమిక చక్కగా వుంది. పాత్రకి తగ్గ ఈమె సున్నితత్వాన్ని సరిగ్గా మల్చుకోలేకపోయాడు దర్శకుడు. యాక్షన్ హింసతో కలిపేసి ఏదోగా మార్చేశాడు. ఇతర పాత్రల్లో హీరో ఫ్రెండ్స్ లో ఒకడిగా  ప్రియదర్శి పరిమితంగా కన్పించి, పరిమిత కామెడీ చేస్తాడు. మార్కెట్ సీన్లో వెన్నెల కిషోర్ మంచి కామెడీ చేస్తాడు. బాబాయ్ పాత్రలో పోసాని తన రొటీన్ ట్రేడ్ మార్కు నటనని పక్కన బెట్టి బుద్ధిగా కన్పిస్తాడు. నరేష్ ఓ మాదిరి. రాజీవ్ కనకాల ఇంకో  మాదిరి. ఇంకేదో  మాదిరిగా కన్పించే వాడే టీనేజర్ లా  వుండే విలన్ నరేష్ విజయ్. సెకండాఫే బలహీనమనుకుంటే ఈ టీనేజర్ విలన్తో ఇంకా బలహీనం. సో చైల్డిష్. 

          దేవీశ్రీ ప్రసాద్ మొత్తం మీద క్యాచీ ట్యూన్లతో అలరించగల్గాడు. రెండు వారాలే జీవిత కాలం వుంటున్న సినిమాలకి ఇంకంటే సంగీతం అక్కర్లేదు. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణంలో వరంగల్ దృశ్యాలు పెద్దగా హైలైట్ కావు. వరంగల్ జీవితాన్ని గానీ, ప్రత్యేకతని గానీ పట్టుకోలేదు. ఆ తీసిన గుర్తింపు లేని లొకేషన్స్ వరంగల్ లో తీయకపోయినా తేడా రాదు. 

చివరికేమిటి 
       టెంప్లెట్ సినిమా కేరాఫ్ పూరీ జగన్నాథ్. శ్రీను వైట్ల దెబ్బతిని వదిలేసిన సింగిల్ విండో స్కీముని తెలీక  ఇంకా కొందరు తెచ్చుకుని వాడుతున్నట్టు, పూరీజగన్నాథ్ వదిలేయడానికి ప్రయత్నిస్తున్న టెంప్లెట్ ని మరికొందరు ఇలా వాడేస్తున్నారు. గత సంవత్సరం నుంచీ పెద్ద హీరోలతో సైతం తీస్తున్న టెంప్లెట్ సినిమాలన్నీ ఫ్లాపవుతున్నా,  మళ్ళీ దీన్నీ  తీశారంటే ఆ ప్లాప్స్ కి కారణం తెలీకే తీశారనుకోవాలి. హిట్స్ కి ఫ్లాప్స్ కి కారణాలు తెలుసుకునేంత తీరుబడి ఎవరికుంటుంది. ఒకవేళ తెలుసుకున్నా మౌలిక కారణాలు తెలీకుండానే వుండిపోతారు. ఆ మౌలిక కారణాలే తాము తీసే వాటిలో కూడా చేరిపోతాయి. ఇందుకే మౌలిక కారణాలు తెలుసుకోలేక పోయిన ఇన్ని టెంప్లెట్ సినిమాలు వరసబెట్టి ఫ్లాపవడం. 

          ఫస్టాఫ్ లో ఖాళీగా తిరిగే హీరో, వదినతో వరంగల్లో మకాం, హీరోయిన్తో ప్రేమ, ఇవన్నీ బాగానే వుంటాయి. ఒక సాధారణ మధ్యతరగతి జీవితంలోకి కల్లోలం (ప్లాట్ పాయింట్ వన్) ఎలా వస్తుందా ఆని గట్టి ప్రశ్న  తగుల్తూంటుంది  మనకి. అస్సలు వూహించలేకుండా వుంటాం. ఏర్పాటు చేసిన ఈ బిగినింగ్ విభాగంలోని సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనలో  వదిన – హీరో ఈ ఇద్దరే ప్రత్యర్ధులుగా కన్పిస్తారు. అందుకని, వదిన హీరోని ఎలా ఇరకాటంలో పెట్టి, లేదా హీరోవల్ల ఏ పొరపాటు జరిగి కల్లోలం పుడుతుందా అని ఎదురు చూస్తూంటాం. పాయింటు ఏదో బలంగానే వుంటుందనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఫాలోయింగ్ వున్న నాని హీరో. కుటుంబ సమస్య తుఫాను రేపేలా వుండాలి. కానీ రెండో పాట అయ్యేసరికి ఉస్సూరంటుంది ప్రాణం. విలన్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో ఇది టెంప్లెట్ అని అర్ధమైపోయి పాత క్లాసు పాఠాలే దిల్ రాజు గారు మనకి చెప్పబోతున్నారని తెలిసిపోతుంది. 

          వదినా మరుదుల మధ్య టెన్షన్ ని డెవలప్ చేస్తూంటే బయటినుంచి ఈ మాఫియా విలనెవడు పానకంలో పుడకలా? ఇక్కడ రసభంగమైంది. టెక్నికల్ గా  చెప్పాలంటే, సినిమాలకి పని చెయ్యని  స్టార్ట్ అండ్ స్టాప్ కథనం పాలబడింది. ఇక మొత్తం కథ ఇక్కడే అర్ధమైపోతుంది. ఈ మాఫియాతో వదినకి ముప్పు వస్తుందనీ, హీరో ఆ ముప్పు తొలగించి ఆమెకి దగ్గరవుతాడనీ. అనుకున్నట్టే ఇంటర్వెల్లో విలన్ వదినని చంపబోతే హీరో వచ్చేస్తాడు. ఫైట్ చేసి విలన్ ని అవతల పడేస్తాడు. అయినా ఈ ఇంటర్వెల్లో ప్లాట్ పాయింట్ వన్ రాలేదు. ఎందుకంటే ఇదిక మనం ఆశించిన వదిన - హీరోల మధ్య కథగా కాక, పరమ రొటీన్ టెంప్లెట్ లో హీరో - విలన్ ల మధ్య కథగా రంగు మార్చు కుంటున్నాక, ఈ ఇద్దరి మధ్య పాయింటేమిటో చెప్పకుండా విశ్రాంతికి  తెర దించారు. 

          సెకండాఫ్ మూడో సీను తర్వాత పాయింటు వస్తుంది. పది  రోజుల్లో వదినని లేపేస్తాను కాచుకో- అని విలన్ అనడంతో. ఇదీ ప్లాట్ పాయింట్ వన్ అన్నమాట. ఇంతాలస్యంగా ఇప్పుడు వచ్చింది. ఇక్కడా బిగినింగ్ ముగిసింది సెకండాఫ్ లో. దీన్ని స్క్రీన్ ప్లే అందామా?  ఇప్పుడు ఇక్కడ కథ ప్రారంభమయ్యింది మిడిల్ తో. ఇంతవరకూ చూపించిందంతా - దాదాపు గంటన్నర సేపు -కథేమిటో తెలీని ఉపోద్ఘాతమే. ఇప్పుడు మాత్రం  కథేమిటి? వదినని చంపడానికి విలన్ ప్రయత్నాలు, హీరో ఆపడాలు. చాలా విచిత్రమైన విషయమేమిటంటే,  ‘జవాన్’ లో నైనా, ఇప్పుడు ‘ఎం సి ఏ’ లోనైనా,  విలన్ తో గొడవలకి హీరోలు తమ కుటుంబాల్ని లాగి ఎందుకు వాళ్ళని రొష్టు పెడతారనేది. రేయ్, నా కుటుంబం ఎందుకురా, నా వదినెందుకురా, నాతో తేల్చుకో రారా - అనాల్సింది పోయి – వదినని ఇరవై రోజుల్లో చంపేస్తానని విలన్ గడువు పెడితే, కాదు పది రోజులు పెట్టుకుందామని హీరో సవాలు చేయడం, వదిన పందెం కోడి అయినట్టు. పోయేది తన ప్రాణాలు కాదుగా?

          ఇలా ఒక అర్ధంలేని పాత్రచిత్రణతో నడుస్తుంది సెకండాఫ్. ఆ వదినకి పాపం చివరికి చచ్చే దాకా వస్తుంది హీరో తెలివితక్కువ పందెం  వల్ల. ఇదీ కథ, అసలు కథ ఇదీ. వదిన పాత్రతో హీరో విలన్ల చెలగాటాలు. ఇది ఫ్యామిలీ కథ ఎలా అవుతుంది?  కనీసం విలన్ కుటుంబ సభ్యుడు కూడా కాదు. ఈ టెంప్లెట్ లో విలన్ వచ్చాక రొటీన్ గానే హీరోయిన్ మాయమై పోతుంది. ఇంతా చేసి చివరికి విలన్ చావనే చావడు! 

          అతకదు. ఫ్యామిలీతో – ఫ్యామిలీలో వుండాల్సిన కష్ట సుఖాలు, కోపతాపాలు, అప్యాయతానురాగాలు, అత్మీయతానుబంధాలు, వియోగ సంయోగాలు, ఆ పరమైన భావోద్వేగాలు – వీటిన్నిటినీ పూర్వ పక్షం చేసే హింసాత్మక మాఫియా విలనీ చొరబెట్టి,  ఫ్యామిలీ కథని అతికించలేరు. తేలేది వికృత రూపంలో రొటీన్ పాత మూస ఫార్ములా యాక్షన్ కథే!


సికిందర్


         
         
         






         
         
         





         








569 : రైటర్స్ కార్నర్


(మూడో మెట్టు)
        రాసేముందు విజువలైజ్ చేసుకోవడం  నేర్చుకోవాలి. చాలామంది సినిమా రచయితలు  అయోమయంలో రాయడం ప్రారంభిస్తారు. ఎసైన్ మెంట్ మీద పనిచేస్తున్నప్పుడు మీ  చేతిలో కథంతా వుంటుంది. అందులోని ప్రధాన మలుపుల్ని, సన్నివేశాల్ని ముందుగా విజువలైజ్ చేసుకోవాలి. గుడ్డిగా రాసుకుపోతే మీకు జరిగే మేలేమీ వుండదు. సినాప్సిస్ లో విషయమంతా మీకు అర్ధమై వుండొచ్చు. కానీ రాయడానికి కూర్చున్నప్పుడు మీరు విజువల్సు గా ఆ విషయాన్ని పేపర్ మీద పెట్టాల్సుంటుంది. ఏదో బుల్లెట్ పాయింట్ డాక్యుమెంట్ లాగా రాసేస్తే కాదు. సీన్ 1 : బీచ్ పార్టీ నుంచి ఒకమ్మాయి ఒకబ్బాయి జారుకున్నారు. బట్టలు తీసేసి సముద్రంలోకి దూకారు. అమ్మాయి ఈత కొడుతూ ముందు కెళ్తోంటే,   అబ్బాయి నీటి లోపలినుంచి ఏదో తగిలి స్పృహ కోల్పోయాడు.... అని రాస్తే  అది సినిమా సినిమా స్క్రిప్టు రాయడం అవదు.  

         
సీనుని మీరు మీ మెదడులో దర్శించాలి.  అక్కడి వాతావరణ నేపధ్యం, అందులోని విశేషాలు, దాని ఫీల్ రిజిస్టర్ చేయగల్గాలి.  కనుక ఆలోచించుకుంటూ వాకింగ్ కెళ్లండి. జాగింగ్ చేయండి. బైక్ ఎక్కి బుర్రున సాగిపోండి. ఎలా ఎలా తిరిగితే మీ మెదడు సీను గురించి ఒక దారి ఏర్పర్చుకుంటుందో  అలా అలా తిరిగెయ్యండి. ఈ తిరగడం ఎక్కువచేసి,  ఏటెటో వెళ్ళిపోయి, ఏదేదో ఎంజాయ్ చేసి, అలసటతో వచ్చి పడుకునే ప్రమాదముంది. మీరు సీను గురించే తిరుగుతారు, వచ్చి సీనే రాస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దారిలో ఎవర్నీ కలవకండి, ఎవరితోనూ కబుర్లేసుకోకండి. అప్పుడు తప్పకుండా సీనుకో విజువలైజేషన్ వస్తుంది. దాంతో కూర్చుని రాయండి. ఇలా చేయకపోతే మీ మొదటి పేజీతోనే సమస్యలో పడిపోతారు. రాయడం లోకి మెదడుని  సంలీనం చేయడానికి మెదడు  కండరాల్ని ఇలా వార్మ్ అప్ చేసుకోవడం చాలా  అవసరం. అప్పుడే రైటర్స్ బ్లాక్ అనే భూతం మిమ్మల్ని పట్టి పల్లార్చదు. 

         
ఇక ఈ మూడు నెలలూ మినీ డెడ్ లైన్స్ ని మర్చిపోండి. మూడు నెలల్లో మొదటి డ్రాఫ్టు పూర్తి  చేయాలనీ కఠోర స్వీయ క్రమ శిక్షణతో ఒక  ఫైనల్ డెడ్ లైన్ అంటూ పెట్టుకున్నాక, ఇక దాని లోపల మినీ డెడ్ లైన్లు ఏవీ పెట్టుకోకండి. అంటే రోజుకిన్ని సీన్లు, లేదా వారానికిన్ని పేజీలూ అనే రూలు పెట్టుకోకండి. ఫైనల్ డెడ్  లైన్ చాలు  మిమ్మల్ని కంట్రోల్  చేసుకోవడానికి. అప్పుడు మీరు రోజుకు రెండు పేజీలే రాయవచ్చు, ఒక్కోసారి పది పేజీలూ రాసేయ్యొచ్చు. మినీ డెడ్  లైన్లు మిమ్మల్ని కంగారు పెట్టడమే కాదు, గిల్టీ కూడా ఫీలయ్యేలా చేస్తాయి. స్వీయ కఠోర క్రమ శిక్షణ అవసరమే గానీ,  అదే పనిగా కాదు. దాంతో మీరు పని రాక్షసులుగా మారిపోతే మీ ఆరోగ్యం చెడి అసలుకే ఎసరొస్తుంది. మీ మెదడు ఎంత శక్తివంతమైనదో,  అంత అద్భుతాలు చేసే ఒక అపురూప పరికరం.  డెడ్ లైన్స్ ఎలా చేరుకోవాలో దానికి బాగా తెలుసు.

కెన్ మియమోటో
(నాల్గో మెట్టు రేపు)

(టాలీవుడ్ టేక్ – ఎక్కువగా ఎలా వుంటుందంటే, మంచం మీద పొర్లాడుతూ, సిగరెట్లు పీల్చి పారేస్తూ సీను కోసం జుట్టు పీక్కుంటూంటారు. దృశ్యాత్మకంగా ఆలోచించేది వుండదు, సంభాషణాత్మకంగానే అలోచిస్తూంటారు. విజువలైజేషన్ వుంటే కదా డైలాగులు వచ్చేది. కాబట్టి రివర్స్ ప్రాసెస్ తో  మనసుని క్షోభ పెట్టుకుంటారు. తమనేదో డైలాగుల కింగ్ కావాలని జనం కోరుకుంటున్నట్టూ, సీనంటే డైలాగులే అన్నట్టూ  వుంటుంది రాసే విధానం. దీనికి కూడా గది, మంచం, లేదా కుర్చీ అనేది పెద్ద ప్రతిబంధకం. ఈ వ్యాసకర్త బైక్ వేసుకుని సిటీ వెలుపల హైవే  మీది కెళ్ళిపోయి వస్తాడు. వచ్చేసరికి చేతి వేళ్ళు జిల పుడుతూంటాయి,  కీబోర్డుతో  సరస సల్లాపం కోసం –సి.)





20, డిసెంబర్ 2017, బుధవారం

568 : రైటర్స్ కార్నర్




(రెండో మెట్టు)
        మయపాలన దృష్ట్యా అందరు రచయితలూ కఠినమైన స్వీయ క్రమశిక్షణ కలిగి వుండాల్సి వుంటుంది. ఇది క్రమశిక్షణతో మెలగండీ అని మొక్కుబడిగా చెప్పే మంత్రా లాంటిది కాదు. సీరియస్ గా సినిమా రచన వృత్తిగా సమకూరకూరడానికి సంసిద్ధం కావడం గురించిన స్వీయ క్రమశిక్షణ అన్నమాట. మీరొక ఏడాది పాటు స్క్రిప్టు రాస్తానంటే అది నవ్వుకోవడానికి పనికొస్తుంది. మీరింకేవో వృత్తి వ్యాపకాలు చేసుకుంటూ తీరిక దొరికినప్పుడు  రాద్దాంలే అనుకుంటే మీరు ఈ రంగానికి పనికిరారు. పత్రికలకి కథలు రాసుకోవచ్చు. మీ ఇతర వృత్తి వ్యాపకాలుంటే వుండనీయండి, రాయడానికి ప్రతిరోజూ ఒక నియమిత సమయం కేటాయించుకుని రాయగల్గినప్పుడే మీరు సినిమాలకి పనికొచ్చే స్వీయ క్రమశిక్షణతో వున్నట్టని  గుర్తుంచుకోండి.

          సినిమా రచయితకి క్రమశిక్షణ లోపిస్తే  స్వయంగా కథల్ని సృష్టించలేడు సరికదా, ఇతరుల కథలకి ఎసైన్ మెంట్లు కూడా పొందలేడు.  వెర్షన్లు రాయడానికి కూడా ఎవరూ పిలవరు. ఎక్కువ ఎసైన్ మెంట్లకి గడువు పది వారాలిస్తారు. ఇది ఫస్ట్ డ్రాఫ్ట్ పూర్తి  చేయడానికి. కొన్నిసార్లు ఇంకా తక్కువ సమయమే ఇస్తారు. మీరు గనుక ఇచ్చిన ఎసైన్ మెంటుని రెండు మూడు నెలల్లో పూర్తి చేయగల్గితే మీరు సరైన ట్రాకులో వున్నట్టని అర్ధం.  మీ భవిష్యత్తుకి మంచి బాట వేసుకుంటున్నట్టని నమ్మకం. ఫస్ట్ డ్రాఫ్ట్ తర్వాత సెకండ్ డ్రాఫ్ట్ కీ, ఫైనల్  డ్రాఫ్ట్ కీ గడువు తగ్గుతూ పోతూంటుంది. సెకండ్ కి రెండు వారాలు, ఫైనల్ కి వారమే వుంటుంది. ఇవి సైతం  గడువులోగా పూర్తి చేసి ఇస్తే మీకు తిరుగు లేనట్టే. 

          మీ సొంత స్క్రిప్టు రాసుకోవాలంటే ఒకవైపు రాసుకోండి. దాన్ని కచ్చితంగా ఓ మూడు నెలల కాలంలో మాత్రమే స్వీయ క్రమశిక్షణతో పూర్తి  చేసుకోండి. అయితే దాన్నే  పట్టుకుని వుండి పోకండి.  మీ సొంత కథ అమ్ముడుపోవాలంటే మీరు ముందు కొన్ని ఎసైన్ మెంటులు చేపట్టాల్సిందే. సమయపాలన విషయంలో ఎసైన్ మెంటులతో మీరు మన్నన పొందగల్గితే, అప్పుడు మీ సొంత కథ బయటికి తీయవచ్చు. అప్పుడు దానికుండే విలువ వేరు. ఎవరైనా మీ సొంత కథ వినడానికి ఆసక్తి అప్పుడు చూపిస్తారు. 

          మీరొక ఎసైన్ మెంటు మీద పనిచేస్తున్నారంటే దానర్ధం సినిమా నిర్మాణం ప్రారంభమైనట్టేనని గమనించండి. అది పూర్తయి విడుదల కాబోయేదేననీ నమ్మండి. ఎసైన్ మెంటు మీకు వడ్డించిన విస్తరి లాంటిది.  ఆ కథ  ఓకే అవడానికి ఆ ఒరిజినల్ రచయితో దర్శకుడో ఎన్నో కష్టాలు  పడి వుంటారు. మీరు మాత్రం ఆ కథకి ఎసైన్ మెంటు రైటర్ గా నేరుగా అవకాశం అందుకుంటారు. కాబట్టి మీ సొంత కథని ఒప్పించడానికి కష్టపడాలన్నా  మీరు విరివిగా ఎసైన్ మెంట్ల మీద పనిచేయడం అవసరం. ఇక్కడ్నించే కఠినమైన స్వీయక్రమశిక్షణని అలవర్చుకోవడం అవసరం.

కెన్ మియమోటో
(మూడో మెట్టు రేపు)  

          (టాలీవుడ్ స్వీయ క్రమశిక్షణ ఎలా మారిపోయిందంటే – ఎక్కువగా ఇలా జరుగుతుంది – దర్శకుడు రచయితలకి ఒక సీను చెప్పి రాసుకు రమ్మంటాడు. వాళ్ళల్లో ఒక రచయిత గణపతి కాంప్లెక్స్ దగ్గర కాలక్షేపం చేస్తూంటాడు. ఏమంటే మూడ్ రావడం లేదంటాడు. ఇంకో ఆయన మధురా నగర్ లో తిరుగుతూంటాడు. ఇక్కడేం చేస్తున్నావంటే, పిల్ల పరీక్షలున్నా యంటాడు. మరొకాయన మోతీ నగర్ లో తచ్చాడుతూంటాడు. ఇల్లు వెతుకుతున్నాననీ, ఇల్లు మారేక  సీను రాస్తాననీ అంటాడు. ఇలా రాయాలంటే వీళ్ళకి ఇంకేదో కావాలి. పారితోషికం ఒక్కటే సరిపోదు. మూడ్ రావాలి, పిల్ల పరీక్షలు అవ్వాలి, ఇల్లు మారాలి. ఆత్రేయ గారిలాగా  తమకూ చెల్లుతుం దనుకుంటారేమో. ముగ్గురూ పరారీలో వుంటే దర్శకుడు కంగారులో వుం టాడు. ఇంకెన్నాళ్ళు రాస్తావయ్యా అని నిర్మాత గొణుక్కుంటాడు. అప్పటికి ఏడాది కావొస్తూంటుంది  సి. )












19, డిసెంబర్ 2017, మంగళవారం

567 : రైటర్స్ కార్నర్


      సినిమా రచన అనేది కళ మాత్రమే కాదు, మేనేజిమెంట్ కూడా. సినిమా రచయితలు నేరుగా ప్రచురించడానికో, ప్రదర్శనకి పెట్టడానికో స్క్రిప్టులు రాయరు. వాటిని సినిమాలుగా తీసేందుకోసం రాస్తారు. అవి సినిమాలుగా రూపొందాలంటే పరిశ్రమలో ఎన్నో అడ్డంకుల్ని ఛేదించాల్సి వుంటుంది. అడ్డంకుల్ని ఛేదించాలంటే మీరు మీ వృత్తిని ఒక క్రమ పద్ధతిలో మేనేజి చేయాలి. మీ నుంచి ఒక అద్భుత స్క్రిప్టు వచ్చి పరిశ్రమ దృష్టి నాకర్షించాలంటే మీరు పనిచేస్తున్న విధం మార్చుకోవాలి. సినిమా రచనా వృత్తి ఒక ప్రక్రియ. మీరు అవుట్ పుట్ ఇస్తారు, ఆ అవుట్ పుట్ కి కంటెంట్ కోసం అన్వేషిస్తారు. నిరంతరం అవుట్  పుట్ ఇస్తూ వుండాలంటే, మీదగ్గరున్న అయిడియాల్ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. అంటే అయిడియా ల్ని కంటెంట్ గా మార్చుకోవాలి. మీ మనసులో ఎన్నో అయిడియాలు ముసురుకుని వుంటాయి. అవన్నీ రాయాలన్పిస్తుంది. అయితే వాటిని ఆర్గనైజ్ చేయకుండా రాయలేరు. ఏది ముందు రాయాలో తేల్చుకోలేరు. అందువల్ల స్క్రిప్టు రాయడానికి పూనుకునే ముందు ఓ నెలరోజులపాటు సమయం తీసుకుని ముందుగా ఆర్గనైజ్ చేసుకోండి. మిమ్మల్ని వేధిస్తున్న ఒక్కో అయిడియానీ కాగితం మీద  పెట్టండి. మీ మనసు తేలికవుతుంది. ఆ అయిడియాల్లో వేటికి ఎక్కువ  మార్కెట్ వుంటుందో విశ్లేషించుకోండి. వాటిని ప్రాధాన్యాల క్రమంలో నెంబర్లు వేసి పెట్టుకోండి. ఇకప్పుడు ఒక్కో అయిడియానీ డెవలప్ చేయడం మొదలెట్టండి. కొన్ని పాత్రల్ని, వాటి సంఘర్షణల్ని, బిగినింగులని, మిడిళ్ళని, ఎండ్ లని రాసుకోండి. ఈ మొత్తం కలిపి ఒక సినాప్సిస్ గా రాసుకోండి. ఒక్కో అయిడియాకి ఒక్కో సినాప్సిస్. అలాగే వాటికి  టైటిల్స్ పెట్టుకోవడం మర్చిపోకండి. టైటిల్స్ పెట్టుకున్నప్పుడే ఆ అయిడియాల మీద ప్రేమ పెరుగుతుంది. అవి వర్కింగ్ టైటిల్స్ అయినా ఫర్వాలేదు. ఇలా చేస్తే, మీకు వచ్చే రెండేళ్ళూ  ఏం రాయాలో, దేని తర్వాత ఏది రాయాలో ఒక కార్యాచరణ చేతికొస్తుంది. ఇప్పుడు మీరు ఏది రాస్తున్నారో దాని మీదే మీమనసు లగ్నమవుతుంది. వేరే అయిడియాలు వేధించి పనిని డిస్టర్బ్ చేయవు. ఏదైనా రాతలో పెట్టినప్పుడే మనసుకి రంపపు కోత తప్పుతుంది.

కెన్ మియమోటో
(రేపు రెండో మెట్టు)