రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, ఏప్రిల్ 2018, గురువారం

638 ; స్ట్రక్చర్


        స్ట్రక్చర్ ఎనిమిదవ భాగం సైడ్ బార్ లో పోస్ట్ చేశాం, ఇమేజి  మీద క్లిక్ చేసి పిడిఎఫ్  పొందవచ్చు. ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’  అథ్యాయాలు రాయడం పూర్తి చేసి చాలా కాలం అయింది. పుస్తకం వేసే ప్రశ్న వొకటి అప్పుడప్పుడు ఎదురవుతోంది. దీనికింకా టైము పడుతుంది. మరికొన్ని అనుబంధ అథ్యాయాలు చేర్చాల్సి వుంది. ఇది ఈ సంవత్సరంలో పూర్తయ్యే సూచనలు కన్పించడం లేదు. ఎవరైనా స్క్రీన్ ప్లే చేసుకోవడానికి అందుబాటులో స్ట్రక్చర్ అథ్యాయాలు మాత్రమే పూర్తయ్యాయి. అవే మీకిప్పుడు పిడిఎఫ్ ప్రతుల రూపంలో అందుతున్నాయి. చాలామంది కోరిక మేరకు ఇలా అందించడం జరుగుతోంది. స్ట్రక్చర్ అథ్యాయాలకి యాక్టివ్ – పాసివ్, మిడిల్ మటాష్, సెకండాఫ్ సిండ్రోం, ఎండ్ సస్పెన్స్, కథ –గాథ వంటి నానా రుగ్మతల బాగోతాలు కూడా అనుబంధంగా చేరిస్తే పుస్తకం సింగిల్ విండో స్కీము లాగా,  అన్నీ ఒకేచోట లభించు దస్త్రమవుతుంది. ఒకప్పుడు ఒక్కో రుగ్మత మీద ఒక్కో పుస్తకమనుకున్నాం. అంత వ్యాపారీ కరణ అవసరం లేదనిపించింది.

           
లోగా పుస్తకం వచ్చే వరకూ ఎదురు చూడకుండా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. గత సంవత్సరం ‘అమ్మమ్మగారిల్లు’ దర్శకుడు సుందర్ సూర్య ఆఫీసుకి పిలిపించుకుని ఒక సర్ప్రైజ్  చేశారు. ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాసాలన్నీ డౌన్లోడ్ చేసుకుని స్పైరల్ బైండ్ చేశారు. ఆ కాపీ చూపించి ఈ వ్యాసకర్త గర్వపడేలా చేశారు. ఇలా మరికొందరి ప్రయత్నాలు దృష్టికొచ్చాయి. గతనెల తాజాగా పరిచయమైన రాకేష్ అనే అసోషియేట్, బ్యాగులో దాచుకుని తెచ్చుకుని పుస్తకం చేతిలో పెట్టారు. ఈయన ఒకడుగు ముందుకేసి, డౌన్ లోడ్ చేసుకున్న పేజీలని ఏకంగా బుక్ లాగా తయారు చేయించుకున్నారు. పైన కనిపించే ఇమేజి అదే. ఇవన్నీ చూస్తూంటే, ఇప్పుడు స్ట్రక్చర్ వ్యాసాల్నిజాతీయం కూడా చేస్తూంటే (ఎప్పటికప్పుడు రాస్తున్నప్పుడే జాతీయమైపోయాయి), ఇంకా పుస్తకం వేయడం అవసరమా అనే బ్రిలియంట్ ఐడియా వస్తోంది.

          ‘స్ట్రక్చర్ ఎనిమిదవ భాగం’  కాస్త కష్టమైనదే. కథంటే మిడిలే కాబట్టి,  దాని సన్నాహాలు మొదలెట్టడానికి కొంత నేపధ్యం తెలుసుకోవడం అవసరం. ఈ నేపధ్యం హిట్టయిన సినిమాల్లో వుంటున్నదే. దీని వెనుక సైన్స్ ఏమిటో తెలుసుకోబోతే మాత్రం క్లిష్టంగానే అనిపిస్తుంది. దీన్ని సాధ్యమైనంత సరళీకరించి చెప్పడానికే  ప్రయత్నించాం.   నిజానికి 2016 లో స్ట్రక్చర్ లో ఈ మిడిల్ మీద వ్యాసాలు రాయబోయినప్పుడు ప్రతిష్టంభన ఏర్పడింది. మూడు నాలుగు నెలలు రాయకుండా ఒక అన్వేషణలో పడాల్సి వచ్చింది. ఈ అన్వేషణ ఫలిస్తేనే  రాయగల్గే పరిస్థితి. లేకపోతే  మొత్తంగానే ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాసాలని అర్ధాంతరంగా ఆపేయాల్సిన వాతావరణం. 

          స్ట్రక్చర్ అంటే బిగినింగ్ మిడిల్ ఎండ్ బిజినెస్సుల్ని చెప్పేసి వూరుకోవచ్చు.  కానీ పరిస్థితుల్ని చూస్తూ కూడా ఇలా చేయలేం. పరిస్థితి ఏమిటంటే, ఒక కథ ఒకరు అనుకున్నాక, దాని మీద చర్చల్లో కొందరి చేతులు పడతాయి. అప్పుడు కథ అనుకున్న దానికన్నా బెటర్ గా వస్తే మంచిదే. అలా జరగడం లేదు. పది శాతం లోపే విజయాలుంటున్నాయి. కథకుడు ఒకవేళ బెటర్ గా రాసుకున్నా చర్చల్లో దిగజారిపోతున్నాయి. ఇదీ సమస్య. 

          బెటర్ గా రాసుకున్న కథ చర్చల్లో దిగజారినా ఏ మేరకు దిగజారనీయ వచ్చు? పూర్తిగా దిగజారిపోకుండా ఎలా ఆపవచ్చు? 2007  లో జేమ్స్ బానెట్  పుస్తకంలో దీనికి సమాధానం దొరికింది. కథని గొప్ప కథల్లో వుండే లాగా, కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లే దృష్టితో చూసి కథకుడు రాసుకుంటే, చర్చల్లో ఆ గొప్ప కథ ఒక మంచి కథ స్థాయికి మాత్రమే దిగజారవచ్చనీ, అంతకంటే దిగజార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదనీ అవగాహన కుదిరింది. దీని మీద అప్పట్లో ఒక వ్యాసం రాశాం. దాన్ని ముందు పెట్టుకుని ఆలోచిస్తూంటే, ఈ కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లేని బాగానే  నిర్వహించవచ్చు. అంత మాత్రానా ఆ ప్లే భద్రంగా వుంటుందని నమ్మక మేమిటి? 

          దీంతో ఈ వ్యాసకర్తకి పూర్వానుభవముంది.  ఈ వ్యాసకర్త చూద్దామని స్క్రిప్టు అంతా జేమ్స్ బానెట్  స్టయిల్లో గొప్ప కథగా రాసిస్తే, ఆ దర్శకుడు అందులో వున్న కాన్షస్ మైండ్ ని మాత్రమే పెట్టుకుని స్క్రిప్టు మార్చేశాడు. సబ్ కాన్షస్ మైండ్ ని అక్కడ పని చేసిన ఇంకో రచయిత ఎత్తుకెళ్ళి ఇంకో సినిమాకి అమ్మేశాడు. బొత్తిగా భయభక్తులనేవి లేకుండా పోయాయి. 

          విచిత్రమేమిటంటే, ఎత్తుకెళ్ళిన ‘సబ్ కాన్షస్’ ముక్క తో తీసిన కామెడీ హిట్టయింది. ఇటు ‘కాన్షస్’ ముక్క తో తీసిన కామెడీ అట్టర్ ఫ్లాపయ్యింది.

          ఇక లాభం లేదని,  కాన్షస్ - సబ్ కాన్షస్ రెంటికీ కలిపి తాళి కట్టించేస్తే ఒక చోట పడుంటాయని, ఎవరో కన్ను కొడితే జంప్ అవకుండా ఒకే సినిమా ఆఫీసులో కలిసి కాపురం చేసుకుంటాయని, ఒక ఆలోచన చేశాం. కాన్షస్ - సబ్ కాన్షస్ లకి కలిపి ఒక లాక్ వేయాలి. ఏమిటా లాక్? ఎలా ఎక్కడ వేయాలి? ఇది తెలుసుకోవడానికే నెలలు పట్టింది. పట్టుబట్టి హిట్టయిన తెలుగు హిందీ హాలీవుడ్ సినిమాలు చూస్తూంటే మెల్లమెల్లగా అర్ధమైంది. ఆల్రెడీ ఈ లాక్స్ వుంటున్నాయి కొన్ని హిట్టయిన సినిమాల్లో. అవి తెలియకుండా పడిపోతున్నాయి. అందుకే ఆ కథలు అంతకన్నా దిగజారలేదు. ఆ లాక్స్  ఎలా పడ్డాయి, పడ్డ లాక్స్  కథ దిగజారిపోకుండా ఎలా పనిచేశాయి - తెలుసుకోవడం  ఇక సులభమైపోయింది.

          కథకుడు గొప్ప కథల నిర్మాణంతో తన కథని నిర్మించుకుని లాక్ వేసేస్తే, ఆ గొప్ప కథ చర్చల్లో ఎంత దిగజారినా,  ఓ మంచి కథ స్థాయిలో ఆగిపోతుందే తప్ప, చెడ్డ కథగా పతనమవడం ఎట్టి పరిస్థితిలో జరగదు. తను వేసిన లాక్ అంత పని చేస్తుందన్న మాట. ఇదెవరికో వ్యతిరేకంగా కథకులకి నేర్పుతున్న కుట్ర కాదు. ఉమ్మడిగా సినిమాల బాగుకి పనికొచ్చే ముక్క మాత్రమే. 

          ఎనిమిదవ భాగం విషయం సంక్లిష్ట మైనా,  సాధ్యమైనంత సులభ శైలిలో చెప్పడానికి ప్రయత్నించాం, చదవండి.  


సికిందర్


         
         
         

         






18, ఏప్రిల్ 2018, బుధవారం

637 : సందేహాలు -సమాధానాలు!



Q :       హిందీ రచయిత, దర్శకుడు సాకేత్ చౌదరి ఇంటర్వ్యూ చదివాను. ‘హిందీ మీడియం’  సినిమాలో విద్యా హక్కు చట్టం అనే సందేశాన్ని హాస్యాన్ని జోడించి చెప్పామన్నారు సాకేత్ గారు. 'చావుకు గాని సెక్స్ కు గాని హాస్యాన్ని జోడిస్తే దాని తీవ్రతను కోల్పోతుంది' అని మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు ఏదో నవలలో రాసినట్టు గుర్తు. ఏదైనా సీరియస్ గా చెప్పాల్సిన విషయాన్ని కామెడీ గా చెప్తే నాకు చాలా కోపం వస్తుంది. సినిమా ద్వారా మనం చెప్పాల్సిన సందేశాన్ని చాలా ఇంటెన్సిటీతో, సీరియస్ గా చెప్పాలనేదే నా స్ట్రాంగ్ బిలీఫ్. ఇది తప్పురా బాబు అని కొరడా పట్టుకుని చెప్తున్నా జనం పట్టించుకోవట్లేదు. అలాటిది కామెడీ గా చెప్తే వింటారా?
అజయ్ (మారుపేరు),  దర్శకుడు

 A :   సినిమా అంటే వినోదమే కదా? వినోదంతో బాటు ఇతర రస ప్రధాన సినిమాలు ఒకప్పుడు ఆడాయి. ఆ రోజుల్లో ‘ఈ చదువులు మాకొద్దు’ అని సీరియస్ గా తీస్తే  చూశారు. ‘చదువు – సంస్కారం’ అని కూడా సీరియస్ గానే తీస్తే చూశారు. అదే ‘ఆకలి రాజ్యం’ నిరుద్యోగ  సమస్యని  వినోదాత్మకంగా తీస్తే చూశారు. ‘ముత్యాల ముగ్గు’ కుటుంబ కథలో తలెత్తే సమస్యలో వుండేది పుట్టెడు శోక రసమే. దాన్ని అలాగే తీస్తే ఎవరూ చూసేవాళ్ళు కాదు. ఆ సమస్యని అద్భుత రసంతో  వినోదాత్మకంగా చూపించడంతో విరగబడి చూశారు.


      ఈ శతాబ్దం యూత్ సినిమాల ట్రెండ్ తో ఆరంభమయ్యింది. ఇది మలి వ్యాపార యుగం. యుగ లక్షణాలకి తగ్గట్టే వినోద సాధనాల రూపురేఖలు మారిపోయాయి. సినిమాలు కేవలం ఒక్క హాస్య రసాన్నే ఒలికిస్తూ ఎంటర్ టైనర్స్ గా మారిపోయాయి. సీరియస్ సినిమాలకి స్థానం లేకుండా పోయింది. కానీ సీరియస్ విషయాలని వినోదాత్మకంగా చెప్పడం ఇప్పుడూ వుంది. ఈ తరం ప్రేక్షకులు చిన్న పిల్లల్లాంటి వాళ్ళు. వాళ్లకి వినోదమే కావాలి. చిన్న పిల్లలకి ఆటలే కావాలన్నట్టు. పిల్లల్ని వెళ్లి వ్యాయామం చెయ్ అంటే చెయ్యరు. ఆడుకోండి పొమ్మంటే వెళ్లి ఆడుకుంటారు. అందుకని జేమ్స్ బానెట్  ‘ది షుగర్ కోట్’ అనే చాప్టర్ లో ఇలా చెప్పాడు – క్రీడలన్నీ పైకి వినోదాలే అయినా, అంతర్లీనంగా అవి వ్యాయామాలు. మానవజాతి వ్యాయామానికి వినోదమనే షుగర్ కోటింగ్ ఇచ్చి క్రీడల్ని సృష్టించింది. కుర్రాణ్ణి నిలబెట్టి బస్కీలు తీయిస్తే తీయడు. వామ్మో నొప్పీ అని ఏడుస్తాడు. అదే పోయి ఆడుకోమంటే భలేగా ఆడుకుని వస్తాడు. అప్పుడు వాడికి ఆ డుకున్నానన్న ఆనందం వుంటుంది, లోపల వాడికి తెలీకుండా మనకి కావాల్సిన శారీరక సౌష్టవంతో చక్కగానూ వుంటాడు. సినిమాల్లో చెప్పాల్సిన సీరియస్ విషయాల పట్ల కూడా ఇంతే. సీరియస్ విషయాలకి ఎంటర్ టైన్మెంట్ అనే షుగర్ కోటింగివ్వడం.

       నేటి తరం ప్రేక్షకులకి ఇదే మందు. కాబట్టే ‘దంగల్’ లాంటి సీరియస్ క్రీడా చిత్రం అంతటి  హాస్య రస ప్రధానంగా వుంది. తరాల అంతరాల్ని,  పేరెంట్స్ అంటే పిల్లల కన్నెర్రనీ  ఎంత హాస్యాయుతంగా పరిష్కరించారు. 



          ‘హిందీ మీడియం’ కూడా ఇంతే. ఇది వ్యవస్థ మీద సెటైర్. సెటైర్ అంటే సున్నిత ధిక్కారమే. ఇందులో పైకి కన్పించే కామెడీలో అంతర్లీనంగా ఏ సంఘర్షణ వుందో తెలిసిపోతూనే వుంటుంది. కాకపోతే సమస్యకి పరిష్కారం దగ్గర తేలిపోయింది. చదువులెలా వుండాలో చెప్పే సినిమాలు కూడా ఆ దర్శకులు లేదా  కథకులు చదువుకోలేదని నిరూపిస్తున్నాయి. 

          మీరు చెప్పిన మల్లాది గారి అభిప్రాయం ఆయన ఏ సందర్భంలో అన్నారో తెలీదు. ఎందరో బామ్మల చావుల్ని కామెడీగా చూపించిన సినిమాలున్నాయి. అలాగే ఎందరో  విలన్లు కామెడీగా చచ్చిన సినిమాలున్నాయి. కథని ప్రభావితం చేసే చావులైతే  సీరియస్ గానే చూపించాలి. ఇంతవరకూ నిజం. ఇక సెక్స్ తో కామోద్రేకాలని రెచ్చగొట్టాలనుకున్నప్పుడు హాట్ హాట్ గానే చూపించాలి. హాస్యం చేస్తే రస భంగమవుతుంది. అయితే సెక్స్ ని కామెడీ చేసిన సినిమాలెన్ని లేవు. స్క్రూ బాల్ కామెడీలు అవేగా. మల్లాది గారి ‘తేనెటీగ’ ఏమిటి? 

         సినిమా ద్వారా చెప్పాల్సిన సందేశాన్ని చాలా ఇంటెన్సిటీతో, సీరియస్ గా చెప్పాలన్న మీ స్ట్రాంగ్ బిలీఫ్ ని ఎవరూ కాదనలేరు.  కానీ ద్వంద్వాల పోషణతో  ‘దంగల్’, ‘హిందీ మీడియం’, ఇంకా ‘మై మేరీ పత్నీ ఔర్ వో’ లాంటి సందేశాత్మక వినోదాలు తీయడమే చాలా కష్టం. తీయడం ఎంత కష్టమో,  మెప్పించి కాసులు పండించుకోవడం అంత  సులభం. ‘మై మేరీ పత్నీ ఔర్ వో’ లో పొట్టి రాజ్ పల్ యాదవ్ కి పొడుగు భార్యతో వుండే ఆత్మ న్యూన్యతా భావం, దాంతో సమస్యలు తెచ్చుకుని  పడే బాధా తీయాలంటే కష్టమైన పనే. ఆ  నవ్విస్తూ ఏడ్పించడమనే  ద్వంద్వాల పోషణే దాని ఘన విజయానికి కారణమైంది. పాత్ర ఏదో సమస్య పెట్టుకుని లోలోపల కుమిలిపోవడం దాని బాధ, ఆ బాధలోంచి బయటపడేదుకు పాల్పడే చర్యలు ప్రేక్షకులకి హాస్య వినోదం.  ‘జో సమ్ బడీ’ లో పిరికివాడైన టిమ్ అలెన్, తన కూతురి ముందు ఒక బలవంతుడు తనని కొట్టాడని, తనూ  బలవంతుడై కూతురి ముందే వాణ్ణి కొట్టాలని చేసే ప్రయత్నాలు ఆ పాత్రకి సీరియస్, ప్రేక్షకులకి నవ్వులు. ఇంత సింపుల్ ఎంటర్ టైనర్ లో ఎంత బలమైన సందేశం, నీతీ వుంటాయో మాటల్లో చెప్పలేం. ఇది ఎన్నోభాషల్లో డబ్బింగ్ అయి ఆడింది. మీరన్నట్టు కొరడా పట్టుకుని సందేశాలూ నీతులూ చెపితే వినకపోవచ్చు గానీ, కథనంలో వాటిని అంతర్లీనం చేసి ఫన్నీగా చెప్తే అంగీకరిస్తారు ప్రేక్షకులు. కానీ ఈ ఇచ్చే సందేశాలతో ప్రేక్షకులు మారాలనుకోవడం అత్యాశే. అయినా స్ట్రాంగ్ బిలీఫ్ తో ఎవరైనా సీరియస్ సినిమాలు తీస్తే మంచిదే. ఒక రకం సినిమాల వొరవడిలో కొట్టుకుపోతున్న ప్రేక్షకులకి అప్పుడప్పుడు కొరడా చరుపు లాంటి సినిమాలవసరమే.

Q :   స్ట్రక్చర్ ఆర్టికల్స్ కి  థాంక్స్. చదివిన ప్రతిసారీ ఓ కొత్త విషయాన్ని నేర్పుతున్నాయి. నా ప్రశ్న ఏమిటంటే, క్యారెక్టర్ ఆర్క్ అంటే  ఏమిటి? స్క్రీన్ ప్లే లో ఆర్క్ తప్పని సరా?  చాలా కమర్షియల్ సినిమాల్లో ఎలా మొదలైన పాత్రలు అలాగే ముగుస్తాయి కదా ?
అనిల్ (మారుపేరు) అసోషియేట్

A :    చాలా కమర్షియల్ సినిమాల్లో ఎలా మొదలైన పాత్రలు అలాగే ముగియ కూడదనేగా స్ట్రక్చర్ వ్యాసాలు. ఆ కమర్షియల్ సినిమాలన్నీ హిట్టవుతున్నాయా? పది శాతం కూడా హిట్లు వుండడం లేదు. హాలీవుడ్ లో యాభై శాతం హిట్లు ఎలా వుంటున్నాయి?  అక్కడ స్ట్రక్చర్ వద్దంటే తంతారు. ఆ స్ట్రక్చర్ తో హిట్టయ్యే హాలీవుడ్ సినిమాలని తెలుగులో కాపీ కొట్టాలంటే మాత్రం స్ట్రక్చర్ వద్దంటారు. ఏళ్ల తరబడి ఈ వ్యాసకర్త స్ట్రక్చర్ గురించి రాయగా రాయగా చివరికి కనువిప్పయిందేమిటంటే, తెలుగు సినిమాలు పూర్తిగా క్రియేటివ్ కాసారాలు. 90 కాదు, నూటికి నూరు ఫ్లాపైనా ఆ కాసారాల్లోనే కాపురాలుంటాయి తప్ప అది దాటి బయటికి రావు. మీ లాంటి కొందరు స్ట్రక్చర్ పట్ల ఆసక్తితో వున్నారు. స్ట్రక్చర్ అంటే తెలియని నిర్మాతలు మీ స్ట్రక్చర్ లో వేళ్ళు పెట్టి వాళ్ళ కన్ను వాళ్ళు పొడుచుకున్నా మీకే చాలా నష్టం. ఇంతా చేసీ మీరు ఏడాదికి 70 మంది కంపల్సరీ కొత్త ఫ్లాపు డైరెక్టర్ల  జాబితాలో చేరిపోయి, మళ్ళీ ఇప్పుడు చేస్తున్న స్ట్రగులే  చేస్తూ వుండి పోతారు ఇంకో అవకాశం కోసం. స్ట్రక్చర్ వ్యాసాలు ఎంత చదివినా, క్యారెక్టర్ ఆర్క్ ఎంత నేర్చుకున్నా - ముందు మీరు తేల్చు కోవాల్సింది,  స్క్రిప్టుతో మీకుండే స్వేచ్ఛ ఎంతన్నది. స్వేచ్ఛ అనుమానాస్పదమనిపిస్తే, స్ట్రక్చర్ నేర్చుకోవడం మానెయ్యండి. క్రియేటివ్ స్కూల్లో ఆ నిర్మాత, లేదా హీరో కెలాకావాలో అలా చేసేసి చేతులు దులుపుకోండి. 90 శాతం ఫ్లాపుల ప్రవాహం ప్రళయంగా మారిన నేటి పరిస్థితుల్లో ఎదురీదాలనుకోకుండా, అందరితో పాటూ ఆ మునకల్ని మీరూ ఎంజాయ్ చేయండి. సబ్కే సాథ్ సబ్కా వినాశ్, ఇంతే అనుకోండి. 

     క్యారెక్టర్ ఆర్క్ గురించి ఈబ్లాగులో పక్కన సైడ్ బార్ లో కన్పిస్తున్న ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాస గుచ్ఛంలో ‘శివ’ బిగినింగ్ విభాగం స్ట్రక్చర్ ని చదవండి. పాత్ర సమస్యతో సంఘర్షిస్తున్నప్పుడు పడుతూ లేస్తూ పోతూంటుంది. ఈ ఎత్తుపల్లాల ప్రయాణం ఒక ఆర్క్ (చాపం) ని ఏర్పరుస్తుంది. దీన్నే క్యారెక్టర్ ఆర్క్ లేదా పాత్రోచిత చాపం అంటారు. పాత్ర ఎన్ని సార్లు పడింది, ఎన్ని సార్లు లేచిందనే దాని మీద కథనంలో వేగం ఆధారపడుతుంది. మిడిల్ విభాగంలో ఈ ఉత్థాన పతనాలు ఎంత త్వరత్వరగా  జరుగుతూంటే కథనంలో అంత వేగం వస్తుంది. పాత్ర ఒకసారి లేచి పడిపోయాక అలాగే పడుంటే అది పాసివ్ పాత్ర కిందికి దారి తీస్తుంది.  క్రియేటివ్ స్కూలు సినిమాల్లో మీరన్నట్టు,  ఎలా మొదలైన పాత్ర అలాగే ముగుస్తున్నాయంటే అవి అసంపూర్ణ పాత్ర చిత్రణలు. ఇవి ప్రేక్షకుల హృదయాంతరాళ అంచుల్ని కూడా తాకవు. 

          స్ట్రక్చర్ స్కూలు ఏం చెప్తుందంటే,  పాత్ర అనేది మన ఇగో. కథ అనేది ఆ ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చే సాధనం. కథ అనేది ఆ హీరో (ఇగో) అనుభవం. ఆ అనుభవం లోంచి ఆ హీరో (ఇగో)  ఏమీ నేర్చుకోలేదంటే ఏమీ మారనట్టే. ఇందుకే మీరన్నట్టు ఎలా మొదలైన పాత్రలు అలా డొల్లగా ముగుస్తున్నాయి. స్ట్రక్చర్ కథనానికి వాడే ప్రతీ పరికరానికీ ఒక అర్ధం చెప్తుంది, దాని అవసరం ఏమిటో చెప్తుంది. క్రియేటివ్ స్కూల్లో కష్టం. 

సికిందర్

13, ఏప్రిల్ 2018, శుక్రవారం

636 : స్పెషల్ ఆర్టికల్






      వైజాగ్ సముద్ర మార్గాన టెర్రరిస్టులు వచ్చారనీ, అక్కడి ఎమ్మెల్యే వాళ్ళని  దాచి బాంబు దాడుల పథకం వేశాడనీ ఒకాయన స్క్రిప్టు రాస్తాడు. ఇంకో ఆయన హోంమంత్రి టెర్రరిస్టు లతో కుమ్మక్కై నగరంలో బాంబు దాడుల కుట్ర పన్నాడనీ సినిమా తీయబోతాడు. మరొకాయన జిష్ణు అనే హీరో పాత్రని  టెర్రరిస్టుగా  పోలీసు పట్టుకోవడాన్ని సినిమాగా తీసేస్తాడు. మరింకో ఆయన కువైట్ సంక్షోభంలో విదేశాంగ శాఖ చేసిందేమీ లేదనీ,  అంతా తమ హీరోనే భుజాన్నేసుకుని  అక్కడి భారతీయులని స్వదేశానికి స్వయంగా తరిలించాడనీ సినిమా తీసేసి చూపించేస్తాడు. తాజాగా మరొకాయన యురేనియం కార్పొరేషన్ అధికారులు పచ్చి దేశద్రోహులనీ, వాళ్ళందర్నీ హీరో పట్టుకున్నాడనీ చిత్రీకరణ చేస్తాడు. తాజాగా మరింకో ఆయన భారత విదేశాంగ విధానాన్ని పాకిస్తాన్ కి పాదాక్రాంతం చేసేసి తరించే చిత్రణతో ముందుకు రాబోతాడు...


          సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో ప్రభుత్వ వ్యవస్థల్ని కించపర్చే అత్యుత్సాహానికి పోయి ప్రస్తుతానికి ఇద్దరు  దొరికిపోయారు. కువైట్ సంక్షోభం మీదఏర్ లిఫ్ట్ అనే హిందీ సినిమా తీసిన వాళ్ళు, యురేనియం కార్పొరేషన్ లో అవినీతి అంటూగరుడ వేగ అనే తెలుగు సినిమా తీసిన వాళ్ళూ ఆ ఇద్దరు.  ఏర్ లిఫ్ట్మీద ఆనాటి విదేశాంగ శాఖాధికారులు, ఎయిరిండియా పైలట్లూ ధ్వజమెత్తి దర్శకుణ్ణి న్యూస్ ఛానెల్ కి లాగి క్షమాపణ కూడా చెప్పించారు. ‘గరుడ వేగ మీద యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారులు ఇప్పుడు కోర్టు కెక్కారు. దీంతో  ఈ సినిమా శాటిలైట్ హక్కులకీ, రీమేక్ హక్కులకీ భంగం కలిగేలా కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. 

         
ఏర్ లిఫ్ట్తో విదేశాంగ శాఖ పరువు తీస్తే, ‘గరుడవేగతో యుసీఐఎల్ అధికారుల్ని దేశద్రోహులుగా చిత్రించారు (‘ఏర్ లిఫ్ట్వివాదం మీద వ్యాసం కోసం, ఈ వ్యాసం చివర లింక్ ని క్లిక్ చేయండి). కడప జిల్లాలోని తుమ్మలపల్లి గనుల్లోంచి యురేనియం, ప్లుటోనియం, థోరియంలని తవ్వి తీసి,  కృష్ణపట్నంలో నౌకల ద్వారా ఉత్తర కొరియాకి స్మగ్లింగ్ చేసి అమ్ముకుంటున్నట్టు సినిమాలో చూపించారు. ఈ దేశద్రోహుల్లో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర  హోంమంత్రి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖాధికారులు, యురేనియం కార్పొరేషన్ ఛైర్మన్, ఉన్నతాధికారులూ వున్నట్టు చిత్రీకరించారు. హీరో గారేమో గొప్ప ఎన్ఐఏ అసిస్టెంట్ కమిషనర్ (ఈ సినిమాలో ఆఖరికి ఎన్ ఐ ఏ చీఫ్ ని సైతం దేశద్రోహుల్లో కలిపేశారు – పాసివ్ క్యారెక్టర్ హీరో గారొక్కరే సచ్ఛీలుడు!) గా వీళ్ళందర్నీ పట్టుకుని దేశభక్తుడై పోతాడు. 

          దేనికైనా ఒక హద్దుంటుంది. దేశ ద్రోహుల్ని చూపించాలంటే ఇంకా విలన్ పాత్రలు చాలా వున్నాయి. ఏకంగా ప్రధాన మంత్రి ప్రత్యక్ష ఆజమాయిషీ కింద నడిచే అణుశక్తి శాఖ అనుబంధ సంస్థ అయిన యుసిఐఎల్ ని దేశద్రోహుల అడ్డాగా చూపించడానికి చాలా మతి చెడి వుండాలి. దేశప్రతిష్ట, దేశభద్రత వంటి సున్నిత అంశాల పట్ల ఎడ్యుకేటెడ్స్ అయివుండీ, సృజనాత్మక  స్వేచ్ఛ పేరుతో కామన్ సెన్స్ లేకుండా రొడ్డకొట్టుడు చిత్రణలు చేస్తే, తర్వాత నిప్పుతొక్కిన కోతుల్లా క్యారు క్యారు మనాల్సి వస్తుంది.  దేశప్రతిష్ట, దేశభద్రత వంటివి నిప్పులాంటివి. వాటితో ఆడుకుంటే వొళ్ళు కాలిపోతుంది. యుసిఐఎల్ లో కుంభకోణాలు జరగ లేదని కాదు. సిబ్బంది నియామకాల్లోనో, యంత్ర పరికరాల కాంట్రాక్టుల్లోనో అంతర్గత స్కాములు చేసుకుంటున్నారు. అది వేరు. కానీ ఏకంగా దేశానికే ద్రోహం తలపెట్టే దుష్టాలోచనలు మాత్రం చేయలేదు. అలాటి దుష్టాలోచనలు ఇలాటి సినిమాలు తీసేవాళ్ళకే వస్తాయి. 



       ఎందుకొస్తాయంటే,  ఇక దుష్ట పాత్రల్ని చూపించడానికి రాజకీయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, పోలీసు వ్యవస్థలో భాగమైన  సిబిఐ శాఖా పనిబట్టి – పనిబట్టి బోరు కొట్టేసింది. ఇక  కొత్తవి కావాలి, కొత్త విలన్లు కావాలి. అందుకని రక్షణ శాఖ కిందికి వచ్చే శాఖల పని కూడా బట్టాలి. ఇంకా మాటాడితే టెర్రరిస్టులని పట్టుకునే ఎన్ఐఏ శాఖ, విదేశాల్లో గూఢచార కార్యకలాపాలు సాగించే ‘రా’ (రీసెర్చి అండ్ ఎనాలిసిస్ వింగ్) శాఖని కూడా దేశద్రోహులుగా విలన్ల కింద వాడేసుకోవాలి. ఇది కూడా బోరుకొడితే,  త్రివిధ దళాల మీద కూడా పడి,  అడ్డంగా విలన్లుగా చీరేసి వాడేసుకుని పారెయ్యాలి! 

          లాజిక్కా? సినిమాకి లాజిక్కేంటి?  దేశభద్రత కదా? దేశభద్రతేంటి? దేశప్రతిష్ట కదా? దేశ ప్రతిష్టేంటి? ఇలాగైతే సినిమాలు తీయలేం, సినిమాలు తీయడం పరువు తీయడమెలా అవుతుంది?  సరే, వ్యవస్థల గురించి ప్రేక్షకులకి తప్పుడు సమాచార మివ్వడం కాదా, ఇదే నిజమని ప్రేక్షకులు నమ్మేయొచ్చు కదా? ఏంటి తప్పుడు సమాచారం, సినిమాని సినిమాలాగే చూడాలి ! అదేంటి, కథని కథలా చూడాలికదా? కథెవడిక్కావాలి, ఓన్లీ బిగ్ నేమ్స్ తో అన్నీఓకే అయిపోతాయి – ఎవడూ నోరెత్తడు! 

          కాబట్టి టెంప్లెట్ కథల్లో కరివేపాకులా వాడేసుకోవడానికి  ఈ ప్రతిష్టాత్మక వ్యవస్థలు కావాలి. ఈ వ్యవస్థల పేర్లు  చెప్పుకుంటే బోలెడు మైలేజీ కూడా వస్తుంది. రక్షణ శాఖ కింది కొచ్చే హైదరాబాద్ డీఆర్ డీఓ,  పక్క దేశాన్ని గడగడ లాడించే బ్రహ్మాండమైన ఒక క్షిపణి తయారు చేసినట్టూ, దాన్ని ఢిల్లీ చేరవేయడానికి లారీలో వేసి తరలించినట్టూ చూపిస్తారు. ఆ లారీ డుక్కుడుక్కు మంటూ రోజులతరబడి ఢిల్లీ పోతూనే వుంటుంది. ఎందుకలా అంటే, విద్రోహులు దాడి చేసి దోచుకోగల్గాలిగా? అప్పుడు హీరోగారు వూడిపడి గొప్ప దేశభక్తితో దాన్ని కాపాడి సన్మానం పొందాలిగా?  అందుకని వైమానిక దళం విమానంలో దాన్ని తరలించరాదు. అది పూర్తిగా సృజనాత్మక స్వేచ్ఛకి వ్యతిరేకం. 

          ఇలా వ్యవస్థల ప్రతిష్టని దెబ్బతీయడం ఒకటైతే, విదేశీ శక్తులతో కుమ్మక్కైనట్టు చూపడం ఇంకోటి. ఇక్కడ కూడా విదేశీ శక్తులూ అంతర్గత శక్తులూ ఒకటే అనుకుంటారు. అందుకని ఒక  ఎమ్మెల్యే టెర్రరిస్టులతో చేతులు కలిపి బాంబు దాడులు జరిపినట్టు  స్క్రిప్టు రాసేస్తా డొకాయన. ఇంకో హోం మంత్రి కూడా ఇదే పని చేసినట్టు సినిమా తీయబోతాడొకాయన.  రాజకీయ నాయకుల్ని విలన్లుగా చూపడం ఓకే. కానీ ఎవరు ఎవరితో కుమ్మక్కవుతారనే కామన్ సెన్స్ వుండాలి. రాజకీయ నాయకులు మాఫియాలతో చేతులు కలపవచ్చు ఆర్ధిక ప్రయోజనాల కోసం. టెర్రరిస్టులతో చేతులు కలిపి దేశద్రోహం చేసే దాకా పోరు. టెర్రరిస్టులతో ఏ ఆర్ధిక ప్రయోజనాలు కూడా నేరవేరవు. ఒక హోం మంత్రిని ముఖ్యమంత్రిగా చేయడానికి కిరాయి గూండాల్లాగా బాంబులు పేల్చడానికి టెర్రరిస్టులు కూడా రారు. టెర్రరిజం కథలు వేరు, రాజకీయ కథలు వేరు. అందులోని  విలన్లని ఇందులోకీ,  ఇందులోని  విలన్లని అందులోకీ వేసేసి గిలక్కొట్టి చూపించేస్తే ఐపోదు. 

          ఇలాటిదే ఒక కథతో ఒక బిజెపి నాయకుడు వచ్చారు. అది రాజకీయ నాయకులు టెర్రరిస్టులతో కుమ్మక్కవడం గురించి. ఏ కాశ్మీర్ లోనో  వేర్పాటు వాదులెవరికో టెర్రరిస్టులతో సంబంధాలుండొచ్చేమో గానీ, అందరూ అలా వుంటారని కన్విన్స్ చేయలేమని చెప్పాడీ వ్యాసకర్త. రాజకీయ నాయకులు అవినీతి పరులు కావొచ్చేమో గానీ, దేశం మీద దాడులు జరిపించే దేశద్రోహులు అయివుండరనీ, ఆర్ధిక ప్రయోజనాల కోసం మాఫియాలతో చేతులు కలప వచ్చనీ, ఆ మాఫియాలు కూడా సమాజ ద్రోహులుగా వుంటారు గానీ,  దేశానికే హాని తలపెట్టే శక్తులతో చేతులు కలపరనీ ... ఇలా క్లాసిఫై చేసి చెప్పేసరికి ఆయన ఆలోచనలో పడి కన్విన్స్ అయ్యారు. కానీ ముందే ఫిక్స్ అయిపోయిన కథలోంచి బయటికి రాలేకపోయారు. రెండు నెలలు ఎటూ తేలక  స్క్రిప్టు పని 

ఆగిపోయింది. 

          కథల్లో బలాబలాల సమీకరణ అని వుంటుంది. ఒక వైపు మంచిని, మరోవైపు చెడునీ మొహరించాలి. మంచి వాడైన  హీరో,  చెడ్డ వాడైన విలన్ మనుషులతో కూడా లాలూచీ పడి పోరాడుతున్నట్టు చూపిస్తే అది మంచీ చెడుల సమరం అవదు. పైగా ఆ విలన్ దృష్టిలో హీరో బలహీనుడై పోతాడు. మన దేశానికీ,  శత్రు దేశానికీ పోరాటం వచ్చినప్పుడు, మన దేశం పూర్తిగా గుడ్, శత్రుదేశం వెరీ బ్యాడ్ అనే చెప్పాలి. మన దేశపు వ్యవస్థల్ని అలా గొప్పగా చిత్రించాలి. 

          ఇంకో స్క్రిప్టు ఈ మధ్య తగిలింది. ఇందులో రక్షణ మంత్రి పాకిస్తాన్ కి చర్చలకి వెళ్తున్నట్టు వుంది. రక్షణ మంత్రి ఎలా వెళ్తాడు, విదేశాంగ మంత్రి వెళ్తాడు గానీ... విదేశాంగ మంత్రి కూడా ఎందుకు వెళ్తాడు, రెండు దేశాల మధ్య అధికారుల స్థాయి చర్చలు జరుగుతాయి గానీ...అలా కూడా ఎందుకు చేస్తారు, పాకిస్తాన్ తో చర్చల్లేవ్ పొమ్మని మన ప్రభుత్వం అంటూంటే....నిజంగా కాశ్మీర్ లో పరిస్థితి చూస్తూ ఇలాటి ఆలోచనలు కథకులెలా చేస్తారు?  కానీ ఇలాగే చేయడానికి ఫిక్స్ అయిపోయారు. భారత్ వెళ్ళి పాకిస్తాన్ లో వాలిపోయి - చెప్పండి సార్ చెప్పండి - అంటూ గులామై పోవడం! 

          ఇలాటి వాటికి  సెన్సార్ వాళ్ళు బ్రహ్మాండంగా సర్టిఫికేట్ ఇచ్చేయడం. తాంబూలా లిచ్చేశాం తన్నుకోమనడం. వ్యవస్థల్ని బాధితులుగా తయారు చేసి వదలడం. ఆ బాధిత వ్యవస్థలు ఛానెళ్ళకో, కోర్టులకో  ఎక్కి పోరాడాల్సి రావడం. ఒక్క ఫాల్స్ సినిమాతీసి కాల రెగరెయ్యడం కోసం పనిమాలా వ్యవస్థల్ని పాడుగా చూపించడం, తమ వ్యవస్థ ఏంతో  బాగున్నట్టు! 

           ఈ దుందుడుకుతనానికి అడ్డుకట్ట పడి, వొళ్ళు దగ్గర బెట్టుకుని సినిమాలు తీయడానికి ‘గరుడవేగ’ లాంటి షాకులవసరమే. 



.



         












635 : స్పెషల్ ఆర్టికల్




గరుడవేగ టీమ్కి షాక్ ఇచ్చిన కోర్టు! 
Updated : 12-Apr-2018 : 19:16
      రాజశేఖర్ హీరోగా నటించిన పీఎస్వీ గరుడవేగ’ చిత్రం చాలా కాలం తర్వాత రాజశేఖర్కి హిట్ని అందించిన విషయం తెలిసిందే. అయితే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్లపరంగా మాత్రం సినిమా ఆకట్టుకోలేకపోయింది. అయితేనేం శాటిలైట్, డబ్బింగ్, రీమేక్ హక్కులకు భారీ రేటు రావడంతో చిత్రం సేఫ్ ప్రాజెక్ట్గానే బయటపడింది. అయితే ఊహించని విధంగా ఇప్పుడు చిత్రానికి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. గరుడవేగ’ చిత్రాన్ని టీవీల్లో గానీ, యూట్యూబ్, సోషల్మీడియాల్లో గానీ ప్రదర్శించరాదని హైదరాబాద్సిటీ సివిల్కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

విషయంలోకి వస్తే, మా సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా సినిమా ఉందని యురేనియం కార్పొరేషన్ఆఫ్ఇండియా, సిటీ సివిల్కోర్టులో పిటిషన్దాఖలు చేసింది. పిటిషన్పై విచారణ చేపట్టిన సివిల్జడ్జి కె.కిరణ్కుమార్  పిటిషనర్తరపు న్యాయవాది వాదనను విన్న అనంతరం తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్మీట్లు వంటివి జరపకూడదంటూ   మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. చిత్రం మొత్తం యురేనియం కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం నేపథ్యంలో ఉందని, ఉన్నతాధికారులు కుంభకోణంలో భాగస్వాములైనట్లు చిత్రంలో చూపించారని, కుంభకోణాన్ని ఎన్ఐఏ అసిస్టెంట్ కమీషనర్ పాత్రలో హీరో రాజశేఖర్ వెలికితీసినట్లుగా చూపించారని పిటిషనర్ న్యాయవాది తన వాదనని వినిపించారు.

కేసుపై తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసినట్లుగా జడ్జి తీర్పునిచ్చారు. అయితే సడెన్గా జరిగిన పరిణామంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సినిమా విడుదలై, థియేటర్లలో నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇటువంటి ఉత్తర్వులు రావడంతో చిత్ర యూనిట్ అయోమయానికి గురవుతోంది.
(ఆంధ్రజ్యోతి, 12.4.17) 
***
స్పెషల్ ఆర్టికల్ రేపు!