రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, నవంబర్ 2017, శుక్రవారం

548 : రైటర్స్ కార్నర్







        హాఫ్ గర్ల్ ఫ్రెండ్,  నూర్, కభీ కభీ ఆల్వేస్, మేరే డాడీకీ మారుతీ, బ్యాంక్ చోర్ లాంటి సినిమాలతో రచయిత్రిగా ముందుకు దూసు కెళ్తున్న ఇషితా మొయిత్రా సంభాషణల రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె రాసే సంభాషణలకి చిన్నప్పట్నుంచీ తెలియకుండానే ఆమెకి ప్రిపరేషన్ వుంది. ఇప్పటి ట్రెండ్ కి అనుకూలంగా రాయడానికి ఆ ప్రిపరేషనే పనికొచ్చింది. ఇంతేగాక వివిధ జానర్ మర్యాదల్ని  కూడా దృష్టిలో పెట్టుకుని ఆ ప్రకారం డైలాగులు రాయడంలో ఆరితేరారు. ఆమె ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో వృత్తి సంబంధమైన ఆసక్తికర అంశాలెన్నో కూడా ప్రస్తావించారు. అవేమిటో చూద్దాం...

మీ నేపధ్యం గురించి చెప్పండి.  మీరెలా రంగంలోకి వచ్చారు? మీరు దేశంలో వివిధ ప్రాంతాల్లో నివసించిన అనుభవం మీ డైలాగ్ రైటింగ్ మీద ఏమైనా ప్రభావం చూపిందం
టారా?
          తప్పకుండా ప్రభావం వుంది. పది వేర్వేరు ప్రాంతాల్లో పది స్కూళ్ళలో  చదివాన్నేను. వివిధ భాషల్ని ఇట్టే  పట్టేయడం చిన్నప్పుడే అలవాటయ్యింది. పట్టేసుకుని అలాగే మాట్లాడేదాన్ని. ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికల్లా నేను డైలాగ్ రైటర్ ని అవడానికే ఈ ప్రిపరేషన్ అంతా అని నాకు అన్పించింది.  అమృత్ సర్ లో వున్నప్పుడు పంజాబీ చదవడం, రాయడం నేర్చేసుకున్నాను. సిక్కింలో వున్నప్పుడు అక్కడ నేపాలీ ఎలా మాట్లాడతారో  అది పట్టేసుకున్నాను. మనం ఎక్కడి కెళ్ళినా అక్కడ మాట్లాడే స్థానిక భాష ఒకటుంటుంది. హిందీకి చాలా మాండలికాలున్నాయి. అవి దాదాపు నాకు తెలుసు. ఇక మా ఆయన సింధీ కావడంతో అదీ వచ్చేసింది. ఇవన్నీ కలిసి నన్ను మాటల రచయిత్రిని చేశాయను కుంటున్నాను. రాసే డైలాగులు చెక్కినట్టు వుండ కూడదని  నా అభిప్రాయం. యాదాలాపంగా వచ్చేయాలి. మనుషులు యదాలాపంగానే మాట్లాడతారని గమనించాను.
రచయితలకి ఇప్పుడు గతంలో కంటే అవకాశాలు పెరిగాయని అంటున్నారు. రచనా రంగంలోకి రావాలంటే ఇప్పుడు తగిన సమయం అంటారా? సినిమాలు,  టీవీ,  వెబ్ సిరీస్, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ...ఇన్ని ముఖాలుగా విస్తరించింది రచనారంగం.
          కచ్చితంగా ఇది మంచి కాలం. ముందు ఇంకా చాలా మంచి కాలం వుంటుంది. అవకాశాలు బాగా పెరుగుతాయి. ఎన్నెన్నో రకాల కథలు కావాలిప్పుడు. టీవీలో చూస్తే ఫాంటసీలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రకాంత, నాగిన్ లాంటి ఫాంటసీలు రాయడానికి ఫాంటసీ రచయితలు కావాలి. టీవీలు ఇప్పుడు విభిన్న కథలకి వేదిక లవుతున్నాయి. అవి రాసేవాళ్ళు కావాలి. ఒకప్పుడు పాకిస్తాన్ టీవీల్లో ప్రసారమైన పది ఎపిసోడ్ల మినీ సిరీస్ కథలు ఇప్పుడు వెబ్ సిరీస్ కి స్ఫూర్తి నిచ్చాయి. సినిమాల విషయాని కొస్తే దంగల్, బాహుబలి లాంటి మెగా మూవీస్ దేశం బయట అనువాదాలతో మార్కెట్ ని విస్తరించుకుంటూ,  ఆయా భాషల రచయితలకి అవకాశాలు కల్పిస్తున్నాయి. కనుక ఇప్పుడున్నది మంచికాలమే, రచయితలవడానికి మంచి సమయం.

సినిమాల్లో రచయితలకి తగిన విలువా గౌరవం వుండవనీ,  పారితోషికాలు కూడా తక్కువేననీ ఎప్పట్నించో వింటున్న మాట. గత కొన్ని సంవత్సరాలుగా ఇది బాగా చర్చ కొస్తోంది. ఇప్పుడు పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందంటారా?
          సినిమాల్లోకి నేనొచ్చినప్పుడు నాకో అభిప్రాయముండేది. స్క్రిప్టు కూడా వుండదనీ, షూటింగ్ చేసుకుంటూ రాసుకుంటారనీ... కానీ చూస్తే అలా లేదు. నేను పని చేసిన సినిమాలకి షూటింగ్ డ్రాఫ్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్ళలేదు. బయటి వాళ్ళు అనుకున్నట్టు గాక ఇక్కడంతా పద్ధతిగానే వుంది. రచయితల్ని చిన్న చూపు చూడ్డం లేదు. కార్పొరేట్ సంస్థలు వచ్చాక రచయితలకి అన్నీ మంచి సౌకర్యాలే లభిస్తున్నాయి డబ్బు సహా. పాత బ్యానర్లు కూడా కార్పొరేట్ సంస్కృతిని అవలంబిస్తున్నాయి. కాబట్టి అంతా ప్రొఫెషనల్ గానే వుంది. రచయితల్నే కాదు, టెక్నీషియన్లని కూడా గౌరవంగా చూస్తున్నారు. పైగా మాకు చాలా స్ట్రాంగ్ రైటర్స్ అసోసియేషన్ వుంది. ఇప్పుడిప్పుడే లీగల్ టీం కూడా ఏర్పాటయ్యింది. కాబట్టి రచయితలు  తమ కాంట్రాక్టులకి ఫ్రీ రీడింగ్ తో బాటు, ఇంకేవైనా  సమస్యలు వస్తే ఉచితంగా లీగల్ టీం సాయం పొందవచ్చు.
మీరొకసారి అన్నారు - మీరు వచ్చినప్పుడు దాదాపు రచయిత్రులు లేరని.  ఇప్పుడు యాభై శాతం కన్పిస్తున్నారు. ఇది నిజమేనా?
          నిజమే. నేను వచ్చినప్పుడు శివానీ భతీజా వున్నారు. ఫనా, మైనేమ్ ఈజ్ ఖాన్ రాశారు. ఆవిడ పెద్ద రచయిత్రి. ఆవిడ తప్ప మిగిలిన వాళ్ళు రచయితలే కన్పించేవారు. దర్శకురాళ్ళు కూడా అప్పుడు ఇద్దరే - ఫరా ఖాన్, రీమా కాగ్తీ.  రాన్రాను ఈ దశాబ్ద కాలంలో ఎలా జరిగిందో, విరివిగా రచయిత్రులొచ్చేశారు. ఒక బిగ్ మూవీకీ స్క్రీన్ ప్లేకి ఒకరు, డైలాగ్స్ కి ఒకరుంటే, వాళ్ళల్లో ఒకరు రచయిత్రి వుంటున్నారు. ఇందుకే అనుకుంటా, ఇప్పుడు విమెన్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. ఒక స్త్రీగా నాకొచ్చే మొట్ట మొదటి ఆలోచన - హీరోయిన్ ఓరియెంటెడ్ కథ రాయాలనే.
రచయిత్రుల్ని సీరియస్ గా తీసుకోరని మీకెప్పుడైనా అన్పించిందా? ఒక సక్సెస్ ఇస్తే అన్నీ చక్కబడతాయని అన్పించలేదా?
          జండర్ ని బట్టి ట్రీట్ చేస్తారనుకోను. మేం రచయిత్రులమే రావడం సరైన టైంలో వచ్చాం. కాలం మారుతున్న తరుణంలో వచ్చాం. మేం  లేడీస్ సినిమాటోగ్రాఫర్స్ గా వెళ్తే ఒకప్పుడు సమస్య లొచ్చేవి. ఎందుకంటే సాంప్రదాయపరంగా కొన్ని పనులు పురుషులకే పరిమితమయ్యాయి. ఇప్పుడలా లేదు. జండర్ గోడ తొలిగిపోయి ఎందరో కెమెరా వుమన్ లున్నారు. అసలు రైటింగ్ నే  ఆడవాళ్ళ పనిగా అంటగట్టినట్టు నా అనుమానం. చాలామంది అంటారు - రైటింగ్ మే ఆప్ కో కోనే మే బైఠ్ కర్ చుప్ చాప్ కామ్ కర్నాహై ( చప్పుడు చేయకుండా మూల కూర్చుని చేసుకునే పని రాసుకునే పని) కాబట్టి అది మా లేడీస్ కి కరెక్ట్ అనుకుంటారు. లడ్కియాఁ శాంత్ హోతీ హై – ( అమ్మాయిలు శాంతంగా వుంటారు) అని ఇంకో అభిప్రాయం.  కాబట్టి కుదురుగా కూర్చుని రాసుకుంటారనుకుంటారు. కాబట్టి రైటర్స్ గా  మాకు సమస్యలు ఎదురు కావు. ఐతే సక్సెస్ ఇస్తేనే వర్క్ వుంటుందనేది కూడా నిజం.

డైలాగ్ రైటర్ కి కొన్ని పరిమితులుంటాయి. ఇచ్చిన స్క్రీన్ ప్లే లో  సెట్ చేసిన సీన్లకి డైలాగులు రాయాలి. ఇది మీ స్వేచ్ఛకేమైనా అడ్డా?
          నిజానికి డైలాగ్ రైటర్స్ కి స్క్రీన్ ప్లే మీద కొంత అధికారముంటుంది. కొన్ని మార్పు చేర్పులు మేం చేయక తప్పదు. వృత్తిలో భాగమే అది. చాలా ఛాలెంజింగ్ గా వుంటుంది. ఎక్సయిటింగ్ గా కూడా వుంటుంది. ఆ కొత్త కథా ప్రపంచాల్లోకి నేనెళ్ళి, అక్కడి పాత్రల్లో నేనొక దాన్నయి, అవెలా మాటాడితే నప్పుతుందో ఆలోచించడం ఎక్సయిటింగ్. అలా ఆ ప్రపంచాల్ని నేను ఓన్ చేసుకున్న
ప్పుడు అవి నా  సీన్లయి పోతాయి. కొంత అధికారం వచ్చేస్తుంది. ఇక ఏ జానర్ కా జానర్ ని దృష్టిలో పెట్టుకుని రాయాలి. నూర్ లాంటి ఓ జీవిత పార్శ్వం కావొచ్చు, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ లాంటి మెయిన్ స్ట్రీమ్ డ్రామా కావొచ్చు. దేనికదిగా ఫ్లేవర్ తో సంభాషణలు రాయాలి. ఇదొక ఛాలెంజి.
మీకిచ్చిన కథ తీరు ఎప్పుడైనా మీకు నచ్చక పోవడం జరిగిందా? అంతకంటే బాగా రాయవచ్చని అన్పించిందా?
          డైలాగ్ రైటర్ గా పూర్తీ స్క్రీన్ ప్లే అందుకుంటాను. దాన్ని చదివి చేపట్టాలా వద్దా నిర్ణయించుకుంటాను.  ఆకట్టుకోకపోతే డైలాగులు రాయను.
నూర్ లో శతాబ్దాల ఆక్రోశాన్ని మీ డైలాగులు అత్భుతంగా  వ్యక్తపర్చాయి. కానీ సెకండాఫ్ లో కొచ్చేసరికి లేనిపోని సామాజిక సందేశాలతో దారి తప్పినట్టుంది కథ. మీరెంత బాగా డైలాగులు రాసినా ఇతర కారణాల వల్ల సినిమా ఫ్లాప్ అయితే  మీకేమనిపిస్తుంది?
          కొన్నిసార్లు ఎం జరుగుతుందో చెప్పడం కష్టం. సినిమా నిర్మాణంలో నిమగ్నమై వున్న వాళ్ళు నిష్పాక్షికతని కోల్పోతారు.  ఎక్కడ తప్పు చేశారో విడుదలయ్యాక గానీ తెలుసుకోలేరు. అప్పుడు కూడా తప్పు ఒప్పుకోరు. సినిమా ఎలా వున్నా ణా దైలగులకి త్విత్తర్ లో మెసేజి లొస్తు న్నాయి ఇప్పటికీ.
మీరిక పూర్తి స్థాయి స్క్రీన్ ప్లే రైటర్ అవాలనుకోవడం లేదా?  స్క్రీన్ ప్లే, డైలాగులు రెండూ ఇలాగే కొనసాగించాలనుకుంటున్నారా?
          రెండూ చేస్తేనే కథని ఓన్ చేసుకోగలుగుతాను. బ్యాంక్ చోర్ కి స్క్రీన్ ప్లే రైటర్ గా  కూడా పేరు  పడింది. ఆ దర్శకుడూ నేనూ డైలాగుల్ని వర్కౌట్ చేస్తున్నప్పుడు అక్కడక్కడా స్క్రీన్ ప్లేమార్చాల్సి
వచ్చింది.  డైలాగ్ రైటింగ్ స్వతంత్ర జాబ్ కాదు. కతతోనూ ఆ తర్వాత స్క్రీన్ ప్లేతోనూ ముడుపడి వుండే పని.
డైలాగ్ రైటింగ్ గురించి వున్న అపోహలేమిటి?
          గటు ప్రేక్షకులు డైలాగులే స్క్రీన్ ప్లే అనుకుంటారు.  స్క్రీన్ ప్లేనే కథనుకుంటారు. కన్వ్యూజ్ అయిపోతారు. కొందరు నన్నిలా అడిగారు – హాఫ్  గర్ల్ ఫ్రెండ్ చేతన్ భగత్ రాశారు, ఇక మీరు చేసిందేమిటని. చేతన్ భగత్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ నవల రాస్తే ఇక మేం చేసేదేమీ వుండదా సినిమాకి? నవ్వి వూరుకున్నాను.
మీరు సినిమాలతో బాటు టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇలాగే ఇవన్నీ కలిపి చేయడం మీకెలా అన్పిస్తోంది?
          మొదట్లో కచ్చితంగా ఏ గోల్ తో వుండాలో తెలిసేది కాదు. మేరీ డాడ్ కీ మారుతీ మూవీకి రాశాక సినిమాలే నా కెరీర్ అవాలని నిశ్చయాని కొచ్చేశాను. నిజానికి నేను మెయిన్ స్ట్రీమ్  సినిమా లవర్ని. అందుకే ఇక్కడున్నాను. జామియా ఇస్లామియా యూనివర్శిటీ లో జర్నలిజం చేశాను. దాంతో న్యూస్ చానెల్ కెళ్ళవచ్చు. డాక్యుమెంటరీలు తీసి జాతీయ అవార్డులు అందుకోవచ్చు. నా ఫ్రెండ్స్ ఇదే చేస్తున్నారు.  కానీ నాకు కమర్షియల్ హిందీ సినిమాలే ప్రాణం. సినిమాలే గోల్ గా పెట్టుకున్నాను. ఓం శాంతి ఓం ఉదయం ఏడుంపావు ఆటకే  వెళ్లిపోయానంటే నా పిచ్చేమిటో మీకర్ధమవుతుంది. అలాటి సినిమాలే నాకిష్టం. ఎంటర్ టెయిన్మెంట్ తప్ప. పెద్ద పెద్ద సామాజిక సందేశాలు వుండకూడదు. రోజులలాగే వున్నాయి మరి – పాప్ కార్న్ ఖావో, కాఫీ పియో, పిక్చర్ దేఖో!
ఇప్పుడు  డైలాగ్స్ పరంగా మార్పేమైనా వచ్చిందా? మీరెలాటి డిమాండ్స్ ఎదుర్కొం
టున్నారు. ఇప్పుడు నాటకీయత తగ్గి సహజత్వం కోరుకుంటున్నారా నిర్మాటలు?
          మేకప్ చేసుకోవడం ఎలాగో డైలాగులు రాయడం అలాగ. మనం మేకప్ వేసుకుంటే మేకప్ వేసుకున్నట్టు వుండకూడదు కదా. అది రియల్ గా అన్పించదు, పైగా బోరు కొడుతుంది. డైలాగులు కూడా ప్రేక్షకులు రియల్ గా  ఫీలవ్వాలి, వాటికి  గ్రామర్ వుండవసరం లేదు.  నూర్,  హాల్ఫ్ గర్ల్ ఫ్రెండ్ రెండిటికీ వేర్వేరుగా రాశాను. హాల్స్ గర్ల్ ఫ్రెండ్ కి హై పిచ్ డైలాగులవసరం దాని జానర్ ని బట్టి. ఆ డైలాగుల్లో జీవితం తొంగి చూడనవసరం లేదు. సాంప్రదాయ సంభాషణలు అవసరం లేదు.  ఫిర్ భి తుమ్ కో చాహూంగా అంటూ పాట వుండనవసరం లేదు. నూర్ లో ఫ్రెండ్స్ మాట్లాడుకునేవి సహజమైన మాటలే. డైలాగుల్లా వుండవు. ఏ మూవీకా మూవీ టోన్ ని దృష్టిలో పెట్టుకుని రాయాల్సి వుంటుంది.
          (ఇషితా రాసిన కొన్ని డైలాగులు : చీజేఁ ఐసీ టూట్ తీ హై కీ ఉన్ కా దూబారా జుడ్నా పాసిబుల్ నహీ హోతా, సిర్ఫ్ దరాయేఁ రహె జాతీ హై – కొన్ని ఎలా విరిగి పోతాయంటే అవి తిరిగి అతుక్కోవడం సాధ్యం కాదు, పగుళ్ళు అలాగే  వుండిపోతాయి – ‘హాల్ఫ్ గర్ల్ ఫ్రెండ్’
          అగర్ యూ  ప్లేయింగ్ మే బి యూ లూసింగ్... మగర్ అగర్ యూ రన్నింగ్ అవే, తో యూ పక్కా లూసింగ్ – నువ్వాడితే ఆటలో ఓడిపోవచ్చు, కానీ పారిపోతే పక్కగా ఓడిపోతావ్- ‘హాల్స్ గర్ల్ ఫ్రెండ్’
            హమారీ లైఫ్ బస్ యహీ బన్ కే రహే గయీ హై...ఏక్ ఎస్సెమ్మెస్ జోక్, యా ఫిర్ ఏక్  స్టేటస్ అప్డేట్ – జీవితం ఇలా తయారైపోయింది- ఒక ఎస్సెమ్మెస్ జోకు,  లేదా ఒక స్టేటస్ అప్డేట్ – ‘ఆల్వేస్ కభీ కభీ’
          ముంబాయి యూ ఆర్ కిల్లింగ్ మీ...తూ భీ అందర్సే ఖోక్లీ ...మై భీ – ముంబాయ్!  చంపేస్తున్నావ్ నన్ను...నువ్వూ లోపల డొల్ల...నేనూ డొల్ల – ‘నూర్’
         
ఇస్ సాల్ మై సీధీ సావిత్రీ సే తేడీ సావిత్రీ బనూంగీ - ఈ సంవత్సరం నేను మంచ
మ్మాయి నుంచి చెడ్డమ్మాయి నవుతా – ‘నూర్’ )

ఇంకేవైనా మీకు లక్ష్యాలున్నాయా
          కచ్చితంగా ఏవీ లేవు. రాతపనే హాయిగా వుంది. ఆనందాన్నిస్తోంది, జీవితంలో అన్నీ ఇస్తోంది - యూరోపియన్ హాలిడేస్ సహా. కాకపోతే డెవలప్ అవుతూ వుండాలి, డిఫరెంట్ గా రాస్తూ వుండాలి. లేకపోతే  నాకే బోరు కొట్టొచ్చు ఈ వృత్తి.
డైలాగ్ క్రెడిట్స్ అంటూ మన దగ్గరే ఇస్తారు. గ్లోబల్ గా రైటర్లకి స్క్రీన్ ప్లే అనే ఇస్తారు. మన విధానం ఓకేనా?
          మనం  ఓరల్ గా కథలుచేప్పుకునే సంస్కృతి నుంచి వచ్చాం. రాసే ముందు కథలు నోటితో చెప్పుకుంటాం.  రామాయణమైనా సరే మౌఖికంగా ప్రచారమయ్యాకే రాతలో కొచ్చింది. కాబట్టి వాక్కుకి  చాలా విలువ వుంది. ఇంకా మనకి సాంగ్సూ డాన్సులూ అంటూ చాలా వుంటాయి. కాబట్టి మనకి డైలాగ్ రైటర్ అనే వాడు ప్రత్యేకంగా పుట్టాడు. నాకైతే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రెండూ వేర్వేరు వృత్తు లన్పిస్తాయి. ఒకటి కుడి రెక్కయితే, మరోటి ఎడం రెక్క. మొత్తం కథా ప్రపంచానికి స్క్రీన్ ప్లే ఒక చదరంగం లాంటిది. ఎప్పుడే పావు కదపాలి, ఎలా ఆడాలి ఇదంతా ఒక ప్రహేళికలా వుంటుంది. డైలాగులు అలాకాదు, అవి సహజాతం నుంచి పలుకుతాయి. మన  సహజాతం నుంచి వచ్చిన డైలాగుల్ని అదే పనిగా దిద్దితే అవి చెడి పోతాయి. స్క్రీన్ ప్లేని తగినంత దిద్దకపోతే అదీ చెడ్డగా వస్తుంది. కాబట్టి రెండూ వేర్వేరు జాబ్స్. అందుకే స్క్రీన్ ప్లే మాత్రమే రాయడంలో రాణించిన వాళ్ళుంటారు, డైలాగులు మాత్రమే రాయడంలో ఆరితేరిన వాళ్ళుంటారు.
          ఇంకోటేమిటంటే,  స్క్రీన్ ప్లేని ఇంగ్లీషులో రాస్తారు. డైలాగులు హిందీలో రాసుకుంటారు. అందువల్లే  స్క్రీన్ ప్లే రాసే వాళ్ళు  నల్గురుంటారు. ఆ ఇంగ్లీషు స్క్రీన్ ప్లేకి హిందీ డైలాగులు రాయడానికి ఒక్కరే వుంటారు. డైలాగులకి ఎక్కువ మంది వుంటే క్యారక్టర్స్ ఒక విధానంలో మాటాడవు. క్యారక్టర్స్  ఒక విధానంలో మాట్లాడాలంటే ఒకరే డైలాగ్ రైటర్ వుండాలి. స్క్రీన్ ప్లే కి అలాకాదు, దానికి ఎందరున్నా వాళ్ళందరి ఇన్ పుట్స్ పనికొచ్చేవే.
 రివ్యూ రైటర్ల మీద మీ అభిప్రాయమేమిటి? రివ్యూలు చదువుతూంటారా?
         
చదువుతాను, కానీ పెద్దగా పట్టించుకోను. రివ్యూ అనేది ఒకరి అభిప్రాయం. నాకూ ఓ అభిప్రాయముంటుంది. పైగా నేను రివ్యూస్ ని కూడా రివ్యూ చేయగలను. రివ్యూలు రాసేవాళ్ళు  కొందరికి దర్శకుడో రచయితో అవాలని వుంటుంది. దాంతో తమలోని దర్శకుడు, లేదా రచయితా మైండ్ తో సినిమాలు చూస్తూంటారు. ఏమైనా అది వాళ్ళ అభిప్రాయం, నేను సీరియస్ గా తీసుకోనవసరం లేదు.


-ఏజెన్సీస్  

15, నవంబర్ 2017, బుధవారం

547 : సెకండాఫ్ సంగతులు!





 ప్పట్లో బ్రహ్మోత్సవం,కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, డిక్టేటర్, బ్రూస్ లీ, జ్యోతి లక్ష్మి, సైజ్ జీరో, ఆటోనగర్ సూర్య, దొంగోడు, ధమ్... ఇప్పట్లో నిన్నే కోరి, నేనే రాజు- నేనే మంత్రి, గరుడ వేగ...ఇవన్నీ సెకండాఫ్ సిండ్రోమ్ పాలబడి ప్రశ్నర్ధకమయ్యాయి. కాకపోతే చివరి మూడు మాత్రం ఏదో అదృష్టం కొద్దీ గట్టెక్కాయి. ఈ సిండ్రోమ్ ఎలా ఏర్పడుతుందో తెలిసిందే. ఫస్టాఫ్ లో  చెప్పిన పాయింటు సెకండాఫ్ లో వేరే కథగా మారిపోవడం ఎక్కువగా జరుగుతూంటుంది. అలాగే ఇంటర్వెల్ నిర్వహణ సరిగా లేకున్నా జరుగుతుంది. గరుడ వేగది ఇంటర్వెల్ సమస్యే నని గత వ్యాసంలో చెప్పుకున్నాం. ఇంటర్వెల్లో ప్రేక్షకుల్ని ఆపకుండా కథనే ఆపేశారు. లేదా ఫస్టాఫ్ లో చెప్పుకొస్తున్న టెర్రరిజం విషయం ముగించారు. ఇక్కడ్నించీ సెకండాఫ్ ఏమిటి? ఇంటర్వెల్లో ప్రేక్షకుడు ఏమాలోచిస్తాడు? ఇక పట్టుబడ్డ నిరంజన్ అయ్యర్ ని సెకండాఫ్ లో ప్రశ్నిస్తారు, అతను టెర్రర్ నెట్వర్క్ గుట్టు విప్పుతాడు, ప్రతాపరెడ్డిని ఎందుకు చంపాలనుకున్నారో చెప్తాడు, అప్పుడా మొత్తం టెర్రర్ నెట్వర్క్ ని హీరో నాశనం చేస్తాడు- ఇంతేగా?

          థ తెలిసిపోతూ ఇంటర్వెల్ కి ఇవిఆసక్తి కల్గించే అంశాల్లా లేవు. అసలిలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే - ఈ కథ టెర్రరిజం గురించి కాదు, వేరే రాజకీయ కుట్రల కథ కూడా కాదు, ఒకేవొక్క ప్లుటోనియం  మైనింగ్ మాఫియా కథ. దీన్ని ఎక్కడా బయట పెట్టకుండా సెకండాఫ్ లో ఇంకో అరగంట వరకూ దాచిపెడితే బోలెడు సస్పన్స్ ని సృష్టించ వచ్చను కున్నారు. అంటే ఎండ్ సస్పెన్స్ అన్నమాట. ఎండ్ సస్పెన్స్ అవుతుందని తెలియక చేయడమన్న మాట. అందుకని టెర్రరిజం కథలా ఫస్టాఫ్ లో పూర్తిగానూ, రాజకీయ కుట్ర కథలా సెకండాఫ్ లో కొంతవరకూ నడిపేస్తే సరిపోతుందనుకున్నారు. అదే చేశారు. కథ చెప్పకుండా కథ నడపలేరు కాబట్టి ఈ పిట్ట కథలతో కవరింగు, మభ్యపెట్టడాలు, తప్పుదోవ పట్టించడాలు,  ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడాలూ వగైరా వగైరా. కథ చెప్పడమంటే ముందు పాయింటు చెప్పడమే. పాయింటుని  దాచి కథ నడపాలనుకుంటే, ఇలా ఎండ్ సస్పన్స్ అయి  గరుడ వేగ అవుతుంది. 

          సింగం త్రీ వుంది. అందులో పాయింటు ఆస్ట్రేలియా నుంచి చట్టవ్యతిరేకంగా బయలాజికల్, ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు తెచ్చి మన దేశంలో పారబోసే కుట్ర. స్పైడర్ వుంది. అందులో మనుషుల్ని చంపి వాళ్ళ బంధువులు భోరున ఏడుస్తూంటే ఆ శబ్దాన్ని ఆనందించే సైకో కుట్ర. వివేకం వుంది. ఇందులో
 కార్పొరేట్ శక్తులు అణుశక్తితో ప్రపంచంలో భూకంపాల్ని సృష్టించి వ్యాపారం చేసుకోవాలనుకునే కుట్ర. లై వుంది. ఇందులో చాలా పూర్వం నుంచీ నేరాలు చేసి  తప్పించుకుంటున్న మాస్టర్ క్రిమినల్ ని పట్టుకునే ప్రయత్నం. ఇవేవీ ఎండ్ సస్పెన్సు లు కావు. ఇవన్నీ మనకి ముందు ఫస్టాఫ్ లో నే చెప్పేసి కథ నడుపుతారు. అయినా ఇవి ఫ్లాపయ్యాయంటే వేరే కారణాలున్నాయి : సింగం త్రీ లో పిచ్చి పిచ్చి షాట్లతో టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ తలనొప్పి తెప్పించడం, స్పైడర్ లో హీరోకన్నా విలనే హీరో అయిపోవడం, వివేకంలో ఇంటర్వెల్ నుంచి మిత్ర ద్రోహం కథగా మారిపోవడం, ఇక లై లో విలన్ ఎప్పుడో నేరాలు చేశాడని అనడమే గానీ, ఇప్పుడు కథలో ఒక్క  కుట్ర కూడా  చేయకపోవడం!

         
Caring + Story Telling x Sincerity = CONNECTION  అని ఒక ఈక్వేషన్ వుంది. గరుడ వేగలో ముఖ్యంగా చివరిదైన సిన్సియారిటీ లోపించడం వల్ల ( ఉన్నదున్నట్టు కథ చెప్పకుండా వేరే కథనాలతో మభ్యపెట్టడం) మొదటి రెండూ సాధ్యంకాక, సెకండాఫ్ ప్రేక్షకులతో కనెక్షన్ తెగిపోయింది. సెకండాఫ్ లో ఇంకొక విచిత్రమేమిటంటే,  యాక్షన్ సీన్లు మైండ్ లెస్ గా వుండడం. మైండ్ లెస్ కామెడీలకి నవ్వుకోగలం. ఇంత హెవీ యాక్షన్ మూవీలో  మైండ్ లెస్ యాక్షన్ కి కూడా నవ్వుకోవాలా?

ఇంతకీ ఏముంది సెకండాఫ్ లో?
        సెకండాఫ్ మూడు ఎపిసోడ్లుగా వుంది. రాజకీయ కుట్రని చెప్పి నిరంజన్ ని వేరే జైలుకి తరలించే మొదటి ఎపిసోడ్, హీరోతోబాటు తప్పించుకున్న నిరంజన్ ని చంపే ప్రయత్నపు రెండో ఎపిసోడ్, విలన్ షిప్ లో బయల్దేరిపోతున్నాడని అడ్డుకునే మూడో ఎపిసోడ్ .

             మొదటి ఎపిసోడ్ : ఛానెల్స్ లో ప్రతాపరెడ్డి మీద బాంబు దాడి కుట్రని భగ్నం చేశారని ప్రకటనలు. ప్రతాపరెడ్డి ని చూపిస్తే అతను ఇది రాజకీయ కుట్ర అనీ, రూలింగ్ పార్టీయే చేసిందనీ  ఆరోపిస్తూ చిందులేస్తాడు. ఇది  టీవీలో చూస్తున్న విలన్ కన్పిస్తాడు. నిరంజన్ ఇంటరాగేషన్ మొదలవుతుంది. ఒక లాయర్ వచ్చి నిరంజన్ తో డీల్ కుదుర్చుకుంటాడు. సుల్తాన్ బజార్ లో రషీద్ సుల్తాన్ అనే టెర్రర్ గ్రూపు దగ్గరికి క్రిమినల్స్ వచ్చి ఓ కవరందుకుంటారు. ఇదీ మొదటి ఎపిసోడ్. 

          ఈ మొదటి ఎపిసోడ్ తోనే, అసలు  సెకండాఫ్ మొదటి దృశ్యంతోనే,  ఏక సూత్రత అనే త్రాసు అమాంతం తలకిందులైపోయింది.  తూకం వేసేవాడు త్రాసు ముల్లు  దగ్గర వేలు పెట్టి తూకాన్ని ఏమారిస్తే దండి కొట్టాడు అంటారు. గరుడ వేగ లో గండి కొట్టుకున్నారు. అసలు ఏక సూత్రత అంటే ఏమిటి? మొదలెట్టిన పాయింటుతో అదే కథ చివరంటా చెప్పడం మాత్రమే కాదు, ఆ కథని ఆశ్రయించి వుండే సమస్త  హంగులూ అదే ఫీల్ ని ప్రకటించడం కూడా.  ఏక సూత్రత కింద జానర్ మర్యాద వుంటుంది. జానర్ మర్యాద కింద దాన్ని గౌరవిస్తూ ఇతర హంగులన్నీ వుంటాయి. ఏ జానర్ మర్యాదని అనుసరిస్తూ కథ చెప్తున్నారో,  అదే జానర్ మర్యాదని ఆద్యంతం ప్రదర్శించడం జానర్ మర్యాదని గౌరవించడమవుతుంది. 2015 లో తెలుగులో జానర్ మర్యాదని చివరంటా కాపాడుకున్న సినిమాలే హిట్టయ్యాయని బాగా గమనించాలి. అంటే  రసానుభూతి అనే ఎలిమెంట్ ని ప్రేక్షకులు ఫీలవడం మొదలెట్టారన్న మాట. ‘ముత్యాలముగ్గు’  కథలో విషాదమున్నా దాన్ని వినోదమనే షుగర్ కోటింగిచ్చి అద్భుత రసప్రధానంగా చూపించుకొచ్చారు. ఈ రసానుభూతి ఎక్కడా చెడకుండా చూశారు. ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’  మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. దీని జానర్ మర్యాద ఏదైతే వుందో  – వయసు మళ్ళిన ప్రేమల లెవెల్ - దాన్ని ముగింపు వరకూ కాపాడేరు.

          గరుడవేగ ఫస్టాఫ్ కథని ఎంత ఏమార్చినా, చూపించుకొస్తున్నది సీరియస్ యాక్షన్/ అడ్వెంచర్ జానర్. సీరియస్ యాక్షన్ / అడ్వెంచర్  జానర్ కి అద్భుత రసమే వుంటుంది. అలాగే దీన్ని అద్భుత రస ప్రధానంగా బాగానే చిత్రీకరించారు. అలా సీరియస్ యాక్షన్ డిమాండ్ చేసే ప్రకారం  – పాత్రల తీరుతెన్నులు, సంభాషణలు, పాల్పడే చర్యల మెకానిజం, నేపధ్య వాతావరణ సృష్టి వగైరాలతో మొత్తం స్టయిలిష్, మోడర్నిటీలతో కూడిన సెటప్ అంతా,  ఏకసూత్రతంతా,  సెకండాఫ్ మొదలయ్యేసరికి మాయమైపోయింది.

          ముందు మోడర్నిటీ స్థానే పాత మూస ఎలా మొదలవుతుందంటే, చానెళ్ళ ప్రసారాలతో.  సెకండాఫ్ ఒపెనవగానే థియేటర్  స్క్రీన్నిండా  రొడ్డ కొట్టుడుగా చానెళ్ళ  స్క్రీన్స్  వేసేసి, కథా ప్రపంచంలోని  దృశ్య శబ్ద సౌందర్యాల్ని  చెడగొట్టి, లౌడ్ స్పీకర్లు పెట్టినట్టు,  రంగంలోవున్న యాంకర్ల చేత నాటుగా వార్తల్ని చదివించే  అనాలోచిత పధ్ధతి ఇక్కడా ఎదురవుతుంది. ఆ వార్తలు కథలోని పాత్రలుగాక, ప్రేక్షకులు విని తీరాలన్నట్టు (టార్చర్ అనుభవించాలన్నట్టు) దృశ్య శబ్ద కాలుష్యాలతో నిండి వుంటుంది. ప్రతీ సినిమాలో ఇదే భరించలేని చీప్ తంతు తప్ప, ఇది కళ కాదని కళ్ళు తెరిచేది వుండదు. కళ అదేదో పెద్ద మాట కాదు. బీ గ్రేడ్ చిత్రీకరణలే ఏ గ్రేడ్ లో వుండకూడదన్న కామన్ సెన్స్ మాట. ఒకసారి రాం గోపాల్ వర్మ ‘సర్కార్ త్రీ’ లో టీవీ న్యూస్ ని ఎలా చూపించారో, ఎంత అర్ధవంతంగా కథా ప్రపంచంలోని పాత్రలకి తెలిసేట్టు మాత్రమే చూపించి, ఆ దృశ్య శబ్ద మర్యాదలతో ఎంత అందంగా మనం కూడా ఆ పాత్రలతో బాటు లీనమై ఫీలయ్యేట్టు చేశారో తెలుసుకోవడం మంచిది. 

          ఎలక్ట్రానిక్ మీడియా కంటే ప్రింట్  మీడియా చాలా పెద్ద ఇండస్ట్రీ. సినిమాల్లో 
దీని ఉనికే లేకుండా  పోయింది. మాటాడితే కుర్ర రిపోర్టరీమణులు మైకులుపట్టులుని పోలోమని వచ్చేసి నాన్సెనికల్ ప్రశ్నలేయడం, సినిమా చూస్తున్న ప్రేక్షకుల వైపు తిరిగి నీచంగా రిపోర్టు చేయడం ప్రతీ సినిమాలో వున్నట్టే ఇక్కడా నిండిపోయింది.  ఎప్పుడైతే  సెకండాఫ్ లో టెర్రరిజం కూడా పోయి, రాజకీయ కోణం ఓపెన్ చేశారో- ఇక చీదరగా రిపోర్టరీమణులు రక్కడం మొదలెడతారు. వీళ్ళ రక్కుడు రెండో ఎపిసోడ్ వరకూ వుంటుంది.  ఈ యాంకర్లతో  / రిపోర్టరీమణులతో కథ చెప్పించడమేమిటో అర్ధంగాదు. పాత్రల ద్వారా సహజంగా కథ తెలియజేయాలంటే కష్ట పడాలి - దీనికి షార్ట్ కట్  ఛానెళ్ళతో వాయింపులు. ఇలా బి గ్రేడ్ చిత్రీకరణలకి ఏ గ్రేడ్ జీతాలు తీసుకోవడం.

(మిగతా రేపు)
-సికిందర్ 




















13, నవంబర్ 2017, సోమవారం

545 : సెకండాఫ్ సంగతులు!




     సినిమా హిట్ అన్పించుకున్నాక తప్పుబట్టడాని కేముంటుంది, ఏమీ వుండదు. అందులో వున్న అన్ని లోపాలూ ఉల్లంఘనలూ సమస్తం ఇన్ స్టంట్ ఒప్పులైపోతాయి. సినిమా స్కూళ్ళు, స్క్రీన్ ప్లే పుస్తకాలు అనవసరాలై పోతాయి. అయితే ఈ విజయానికి  ఇన్స్పైర్ అయి, ఇంకెవరైనా దీన్నే ఫాలో అయిపోవచ్చు. ఇలాగే  ఎలాపడితే అలా తీసెయ్యొచ్చు,  అది కూడా హిట్టవచ్చు. అది పూర్తిగా చీకట్లో రాయి విసరడం. ఎందుకంటే, ఎలా పడితే అలా తీయడానికి రూల్స్ ఏమీ వుండవు. ఎవరికెలా తోస్తే అలా తీసేయడమే. కనిపిస్తున్న విజయమే గైడ్ బుక్. రూల్స్ ని బ్రేక్ చేయడం కూడా రెండు విధాలా వుంటుంది.  రూల్స్ ఏమిటో తెలుసుకుని బ్రేక్ చేయడం, రూల్స్ పట్టకుండా ఏదో చేసుకుపోవడం. కొందరికి రూల్స్ అంటేనే ఇగో వచ్చేస్తుంది, నా సినిమాకి ఎవరో రూల్స్ చెప్పడమేమిటని. ఆ రూల్స్ అనేవి విజయవంతమైన సినిమాల్లోంచి ఏర్పడినవైతేనేం, వాటి గొప్ప మాకెందుకని. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా తాము 10 శాతం  విజయాల బ్రాకెట్ కి చెందిన వైట్ కాలర్ వాళ్ళమనుకుంటారు. తీరా చూస్తే  90 శాతం బ్లూ కాలర్ ఫ్లాపుల మార్కెట్ లో వుంటారు. 90 అనేదే వాస్తవం, 10 అనేది వొఠ్ఠి మిధ్య! గాఠ్ఠి మిధ్య!! ఎంతటి వాడైనా 90 కే భయపడాలి, భయపడి నేర్చుకోవాలి, నేర్చుకుంటూ చావాల్సిందే. కంపెనీలకి ఆర్ అండ్ డీ వున్నట్టు, కళాకారులకి అలాటిది వుండాల్సిందే! కళాకారుడి కొవ్వు ఎంతంటే,  కంపెనీలు సెల్ ఫోన్లు తయారు చేస్తూంటే, కళాకారుడు టెలిఫోన్లు తయారు చేస్తూంటాడు. గ్రాంఫోన్లు కూడా తయారు చేస్తాడు. మార్కెట్ కి పనికి రాకపోయినా వాడి క్రియేటివిటీ వాడికద్భుతమే!

         
కాబట్టి రూల్స్ తెలియకుండా ఎలాపడితే అలా తీయాలన్నా  అసలా తప్పులెలా వుంటాయి, అవి తప్పులెందుకవుతాయి, ఉల్లంఘనలెలా వుంటాయి, అవి ఉల్లంఘనలెలా అవుతాయి, మనం ఏ బాపతు అకృత్యాలకి  పాల్పడ వచ్చు తెలియాలి. వూరికే చీకట్లో రాయి విసిరి చూద్దామనుకోకుండా, ఏ వంకరలో రాయి విసిరితే తగులుతుందో తెలుసుకుంటే  ఇలాటి విజయాల్ని సులభతరం చెయ్యొచ్చు.  


          గత వ్యాసంలో ఏ రూల్స్ కీ అందని ఫస్టాఫ్ సంగతులు చూశాం. ఇప్పుడు ఫస్టాఫ్ కి సెకండాఫ్ పూర్తి భిన్నం. ఫస్టాఫ్ లో  మోడర్నిజమైనా వుంది, ట్రెండీ నెస్ అయినా  వుంది. సెకండాఫ్ లో ఈ రెండూ మాయమై ఇంకెలా  వుందో తెలుసుకుందాం 
 



రేపు!

12, నవంబర్ 2017, ఆదివారం

544 : రివ్యూ!



ర్శత్వం: అజయ్ ఆండ్రూస్
తారాగ
ణం: మంచు నోజ్, అనీషా అంబ్రోస్, పోసాని, అజయ్ ఆండ్రూస్, జెన్నీఫర్, సుహాసిని,  మిలింద్ గునాజీ దితరులు
స్క్రీన్ ప్లే : గోపీమోహన్, ఛాయాగ్రణం: వి.కె. రామరాజు, సంగీతం :  శివ నందిగామ
బ్యానర్ : పద్మ ఫిలింస్ ఇండియా ప్రై.లి., ఎన్‌..సి
నిర్మాతలు: ఎస్‌.ఎన్‌.రెడ్డి, క్ష్మీకాంత్
విడుదల : నవంబర్ 10, 2017
***
         
2010  లో ‘బిందాస్’  అనే వొక విజయం తర్వాత ఆ సంవత్సరంలోని  చివరి రెండంకెలు హైలైట్ చేస్తూ 10 సినిమాలతో  దెబ్బతిన్న మంచు మనోజ్, ఈ మూస మాస్ నుంచి కాస్త తప్పుకుని ఒక మంచి ప్రయతం చేద్దామనుకున్నట్టుంది. మంచి ప్రయత్నం  కోసం దేశమో, రాష్ట్రమో,  ఇంకేదో సామాజికమో ఎత్తుకుంటే ఎలివేట్ అవుతాననుకుని, శ్రీలంక శరణార్ధుల సమస్య వైపు మొగ్గాడు. మహేష్ బాబు వెళ్లి రాజస్థాన్ నీటి సమస్య తీర్చినా (ఖలేజా – కలేజా అంటే సరిపోతుంది), రవితేజ వెళ్లి బీహార్ లో ఇంకేదో వాళ్ళ గొడవ  ఎత్తుకున్నా (కిక్ -2) సాధ్యం కాని మంచి ప్రయత్నం తనవల్ల అవుతుందనుకుని మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ కి శ్రీకారం చుట్టాడు. గూఢచారి ఏ దేశమో వెళ్లి మన దేశం కోసం గూడుపుఠానీ  నడిపినా  అదొక అందం, బాక్సాఫీసుకి మందం. గూఢచారి కానివాడు పరదేశంలో మనది కాని స్థానిక సమస్యలు తీర్చాలనుకుంటే, బాక్సాఫీసుకి ఆ ఇన్ పుట్ అర్ధంగాక  అవుట్ పుట్ ఇస్తుందా? ఇది చూద్దాం...

 కథ 
      సూర్య (మనోజ్) ఇండియాలో వొక శ్రీలంక శరణార్ధ సంతతి. యూనివర్శిటీలో చదువుతూంటాడు. ఒక మంత్రి కొడుకు, వాడి స్నేహితులూ కలిసి యూనివర్సిటీలో ముగ్గురు  విద్యార్ధినుల మీద అత్యాచారం చేయబోతే ఇద్దరు విద్యార్ధినులు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక విద్యార్థిని పారిపోతూంటే ఆమెని కూడా చంపి ఆత్మహత్యగా  చిత్రిస్తారు. ఈ కేసుని వ్యక్తిగత సమస్యలతో చేసుకున్న ఆత్మహత్యలుగా మార్చెయ్యడంతో సూర్య తిరగబడతాడు. చనిపోయిన విద్యార్ధినుల్లో  ఇద్దరు శ్రీలంక శరణార్ధులుంటారు. సూర్య ఉద్యమించడంతో విద్యార్ధులంతా మద్దతుగా ఆందోళనకి దిగుతారు. దీంతో సూర్యని డ్రగ్ కేసులో ఇరికించి హింసిస్తారు పోలీసులు. ఒక మంచి కానిస్టేబుల్ (పోసాని) చిత్రహింసల్ని అడ్డుకుని సూర్య గురించి అడిగి తెలుసుకుంటాడు. అప్పుడు సూర్య శ్రీలంకలో తమిళుల మీద జరిగిన దమనకాండ చెప్పుకొస్తాడు. 

          శ్రీలంకలో ఏ హక్కులూ లేక అల్లాడుతున్న  తమిళులు తిరగబడితే కాల్చి చంపుతూంటాయి ప్రభుత్వ బలగాలు. దీంతో పీటర్  (మనోజ్ -2) ఈలం పేరుతో తీవ్రవాద దళాన్ని నిర్మించి తమిళులకి ప్రత్యక దేశంకోసం అంతర్యుద్ధానికి తెరతీస్తాడు. పోరు తీవ్రమవుతుంది.  తట్టుకోలేక ఇండియాకి పారిపోతారు ఓ పదకొండుగురు తమిళులు. వాళ్లకి విక్టర్ (అజయ్ నూతక్కి) నాయకత్వం వహిస్తాడు. సముద్ర మార్గంలో బయల్దేరిన పడవ ప్రయాణం అనేక ఒడిదుడుకుల పాలవుతుంది. ఆ పడవలో ఓ పసి పిల్లాడు కూడా వుంటాడు. పది రోజులపైగా సాగే  ఈ ప్రయాణంలో ఏమేం జరిగాయన్నది, చివరికి ఎందరు మిగిలి తమిళనాడు చేరారన్నది మిగతా కథ.
ఎలావుంది కథ 


        కీ.శే. నడిగర్ తిలగం శివాజీ గణేశన్ ని స్మరించుకునేలా వుంది. ఇటు కథ కాకుండా, అటు డాక్యూడ్రామా కాకుండా ఏదోగా వుంది. 2013 లో ‘రావణ దేశం’ గా తమిళంలో తీసిన దీన్ని ఇవ్వాళ తెలుగులోకి తెచ్చి పొరపాటు చేశారులా వుంది. ఎంతో రీసెర్చి చేసిన దర్శకుడు  అజయ్ ఆ రీసెర్చి సారాన్ని  సినిమా కథగా మల్చడంలో విఫలమయ్యాడు. 2009 లో నిజంగా జరిగిన తమిళ శరణార్ధుల పలాయనం మీద ఈ కథ చేయాలనుకుంటే అది సినిమాకి పనికి రాదనే చెప్పొచ్చు. ఒక సందర్భంలో శివాజీ గణేశన్ - ఆర్టు సినిమా అంటే పడవ పోతూ వుంటుంది, పోతూనే వుంటుంది, రెండు గంటలదాకా ఇంకా పోతూనే వుంటుంది...కానీ ఏమీ జరగదు! – అని జోకేసినట్టు తయారయ్యింది ఈ కథ. 
      
          ఏది కథవుతుంది? పడవలో శరణార్ధుల కష్టాలే చెప్పాలనుకుంటే అది సర్వైవల్ జానర్ గాథవుతుంది, కథవదు. ఎందుకంటే  విషాదాంతం కాబట్టి. విజయాలు చూపిస్తేనే కథలవుతాయి. గాథ అవాలన్నా కూడా, మొదట్నుంచీ గాథే చెప్పాలి. సగంవరకూ అంతర్యుద్ధంతో యాక్షన్ జానర్ లో వైరి వర్గాల మధ్య ‘ఆర్గ్యుమెంట్’ సహిత కథ చెబుతూ, మళ్ళీ తర్వాత సగం సర్వైవల్ జానర్ లో ఉత్త ‘స్టేట్ మెంట్’ మాత్రపు  పడవ ప్రయాణ గాథ చెప్పడం రసభంగం.

          కథకి  బేస్ ఆర్గ్యుమెంట్. గాథకి బేస్ స్టేట్ మెంట్. కమర్షియల్ సినిమాకి ఉస్సూరన్పించే స్టేట్ మెంట్లిచ్చే గాథలు పనికిరావు, వేడివేడి ఆర్గ్యుమెంట్స్ సహిత కథలే  కావాలి. ఐనా పడవలో బయల్దేరిన శరణార్ధుల కష్టాలెవరిక్కావాలి. ఒకటీ అరా జరిగే ఈ ప్రమాదాలే శరణార్ధుల ప్రధాన సమస్య కాదుగా? శ్రీలంక శరణార్ధుల అసలు సమస్య స్వదేశంలో పెనం మీద మలమల మాడి, పారిపోయి తమిళనాడు  వస్తే అక్కడ పొయ్యిలోపడి -  వెరసి -  ఏ దేశం మాది? అన్న ప్రశ్నలేవనెత్తుతూ చెప్పాల్సిన కథ. 
ఎవరెలా చేశారు 
      మనోజ్ త్రిపాత్రాభినయం చేశాడు – ఒకటి స్టూడెంట్, రెండు తీవ్రవాది, మూడు స్థూలకాయం. తను షేపులోకి రాకపోతే యూత్ అప్పీల్ కష్టమవుతుందని  గుర్తిస్తే బావుంటుందేమో.  తెరమీద తనని చూస్తూంటే పాత్ర మీద కన్నా స్థూల కాయం మీదికే బాగా దృష్టిపోయేలా వుంది. రెండు పాత్రల్నీ రౌద్రంగా నటించాడు, హింసాత్మక దృశ్యాలతో. ఉక్రోషంతో డైలాగులు పలికాడు. తీవ్రవాద పాత్ర ఎల్టీ టీఈ అధిపతి  వేలుపిళ్ళై ప్రభాకరనే అని వేరే చెప్పనవసరంలేదు. మొదటి తీవ్రవాద పాత్రకి ఫస్టాఫ్ లో పోరాట దృశ్యాలతో నిడివి ఎక్కువున్నా, రెండో స్టూడెంట్ పాత్ర – ఇటు తీవ్రవాద పాత్రకీ, అటు సెకండాఫ్  పడవ ప్రయాణానికీ ఫ్లాష్ బ్యాక్స్ చెప్తూ రావడం వల్ల  నిడివి తక్కువ. ఫస్టాఫ్ పీటర్ కథ సెకండాఫ్ కొచ్చేసరికి విక్టర్ గాథగా సాగేసరికి,  మనోజ్ పాత్రల పంపకం కుదర్లేదు.

          పోసానిది అదే నటన. టీవీ రిపోర్టర్ పాత్రలో  అనీషా అంబ్రోస్ ది  సంక్షిప్త పాత్ర. విక్టర్  గా నటించిన దర్శకుడు అజయ్ కి సింహభాగం సినిమా దక్కింది. ఇది పూర్తిగా శోకపూరిత పాత్ర పడవ ప్రయాణంలో. 

          పడవలో ఇంకో పది ఆడా మగా పడుచు పాత్రలు, ముసలి పాత్రలూ, వొక పసి పాత్రా వుంటాయి. ఈ పాసిపాత్రే పెరిగి స్టూడెంట్ పాత్ర అయి ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. పడవలో ఈ పాత్రలన్నిటితో విషాదమయ వాతావరణమే వుంటుంది. దుష్ట మంత్రిగా మిలింద్ గునాజీ చాలాకాలం తర్వాత తెర మీదికొస్తే, మహిళా హక్కుల సంఘం చీఫ్ గా సుహాసిని. 

          ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ దృశ్యాలు. శ్రీలంక సైన్యానికీ, తమిళ పులులకీ మధ్య జరిగే యుద్ధ దృశ్యాలు  అత్యంత శక్తివంతంగా, అంతే వాస్తవికంగానూ, ప్రభావశీలంగానూ  వున్నాయి. ఇవన్నీ వొరిజినల్ ‘రావణ దేశం’ లోనివే. అక్కడక్కడా మనోజ్ పాల్గొన్న యాక్షన్ దృశ్యాల్ని మాత్రం రీషూట్ చేశారు. అవుట్ డోర్ లొకేషన్స్ శ్రీలంక నేటివిటీతోనే వున్నాయి. ఇక పడవ ప్రయాణపు సెకండాఫ్ ఎపిసోడ్ అంతా యధాతధంగా వొరిజినలే.  ఈ ఎపిసోడ్ చివర్లో తుఫాను వచ్చే దృశ్యాల సీజీ బీభత్సభరితంగా వుంది. కెమెరా మాన్
వి.కె. రామరాజు సముద్రంలో రిస్కు తీసుకుని చిత్రీకరణ చేశాడు. నేపధ్యసంగీతం ఫర్వాలేదు. 
 చివరికేమిటి 
     సగాలు రెండూ ఒకటైతే జగం జగమే గానీ,  ఇలాటి సగాలు ఒకటైతే కాదు. వసూళ్ళ పిల్లలు పుట్టి పారాడవు. ఫిఫ్టీ –ఫిఫ్టీ ...నీదో సగం, నాదో సగం  అని హీరో – దర్శకుడు ఫస్టాఫ్, సెకండాఫ్ లు పాడుకుని పంచుకుంటే రెండు సినిమాలవుతాయి, ఒకటి కాదు. ఒకటి కథ, రెండోది గాథ. ఇవి రెండూ ఆడా మగలైతే అలాగే కలుసుకుని డ్యూయెట్ పాడుకోవచ్చు, రెండూ మగలై ఆడదాని కోసం వెతుక్కుంటున్నాయి. వాటిని మాయం చేశాడు కథకుడు. 

          ఇందుకే ముందుగా  తట్టిన ఐడియాలో  స్ట్రక్చర్ చూసుకోవాలనేది. చూసుకోకపోతే కథ కాకుండా కొంపలు ముంచే గాథ తయారవుతుంది - లేదా ఇలా సగం కథ, సగం గాథ మాయలేడిలా ముస్తాబవుతుంది. ఇలాటి దుష్టసమాసం ఇంతవరకూ ఏ సినిమాలోనూ లేదు బహుశా. 

          ఈ కథ + గాథకి కవరింగ్ లెటర్ లా ఇంకో కథ వుంది - స్టూడెంట్ కథ. ఈ స్టూడెంట్ కథకే స్ట్రక్చర్ వుంది. విద్యార్ధినుల మరణాలపై ఉద్యమించడం,  అరెస్టయి ఎన్ కౌంటర్ ని ఎదుర్కోవడం, తప్పించుకుని విజయం సాధించడం. ఇదంతా సాగుతున్నప్పుడు అతను మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో శ్రీలంక శరణార్ధుల గురించి చెప్పుకొస్తూంటాడు – ఒక పీటర్ కథగా,  ఇంకో విక్టర్ గాథగా. ఇలా ఈ ఫ్లాష్ బ్యాక్ కే స్ట్రక్చర్ లేకుండా పోయి ఏం చెప్తున్నాడో అర్ధంగాని గందరగోళానికి దారితీసింది. 

          ఫస్టాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభించిన శ్రీలంక శరణార్ధుల కథ కథలాగే కొనసాగాలంటే, ఇంటర్వెల్ కల్లా లంక దళాలకి తట్టుకోలేక శరణార్ధులు తమిళనాడు చేరుకోవాలి. సెకండాఫ్ తమిళనాడులో ఆ శరణార్ధులు దేశంకాని దేశపు వాళ్ళుగా ఎదుర్కొనే  వివక్ష, అణిచివేతా వగైరాలతో కూడిన సంఘర్షణ చూపించి, ఈ సమస్యకి పరిష్కారం చెబుతూ ముగించాలి. అంతేగానీ శ్రీలంకలో వాళ్ళ  దైన్యం చూపించి,  పడవలో పడేసి ప్రయాణపు కష్టాలు చూపించి ముగించేస్తే అది పూర్తిగా చెప్పడం కాదు. తమిళనాడులో వాళ్ళ పరిస్థితిని కూడా చూపిస్తేనే  ప్రేక్షకులకి పూర్తి సమాచారమిచ్చి అవగాహన కల్గించినట్టు, విషయం పరిపూర్ణంగా చెప్పినట్టు. అప్పుడే ఈ  మొత్తం అర్ధవంతమైన కథ అన్పించుకుంటుంది. 

          కాందీశీకుడి రూపంలో తమిళనాడులో స్టూడెంట్ పడ్డ బాధలు చూపించాంగా అంటే, అది చూపించడం కాదు, సినిమా వీక్షణానుభవాన్ని చెరచడం. పోరాడే స్టూడెంట్ తో బాటు చనిపోయిన ఇద్దరు శరణార్ధ విద్యార్థినులది కల్పిత, కృత్రిమ, రొటీన్ సినిమాటిక్ ఫార్ములా  కథ. మిగతా కథో గాథో రియలిస్టిక్ గా చూపించుకొస్తూ,  స్టూడెంట్ కథని మూస ఫార్ములాగా ఎలా చూపిస్తారు. ఇక్కడ కావాల్సింది వీళ్ళ కథ కాదు, పడవెక్కి పారిపోయి వచ్చిన ఆ పదకొండు మంది శరణార్ధుల రియలిస్టిక్ కథ. కనుక ఈ స్టూడెంట్ కథ అనే కవరింగ్ లెటర్ అనవసరమై పోతుంది. కథ చెప్పడానికి అతి టాలెంట్  ప్రదర్శించుకోనక్కర్లేదు, టాలెంట్ సరిపోతుంది.

          సారాంశం? పడవ ప్రయాణంలో గల్లంతైన నిజ సంఘటన పై చేసిన రీసెర్చి కేవలం అంతవరకే డాక్యుమెంటరీకి పనికి వస్తుంది. దానికి అంతర్యుద్ధపు కథ, స్టూడెంట్ కథా అని  జోడించడానికి పనికిరాదు. 

          ఈ మొత్తానికి కలిపి చివర్లో స్టూడెంట్ ఇచ్చే స్పీచికి  కూడా అర్ధం లేదు. రండి, మనమంతా కలిసి జీవిద్దాం, వివక్ష వద్దు....లాంటి మాటలు ఎక్కడైనా పీడితుడు చెప్తే ఎవరైనా వింటారా, లేక పీడించే వర్గం నుంచి ఎవడైనా ఇటు స్టూడెంట్ వైపు వచ్చి కలుపుకుని అంటే, వినబుల్ గానూ చూడబుల్ గానూ వుంటుందా?

-సికిందర్
https://www.cinemabazaar.in