రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, నవంబర్ 2017, బుధవారం

547 : సెకండాఫ్ సంగతులు!





 ప్పట్లో బ్రహ్మోత్సవం,కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, డిక్టేటర్, బ్రూస్ లీ, జ్యోతి లక్ష్మి, సైజ్ జీరో, ఆటోనగర్ సూర్య, దొంగోడు, ధమ్... ఇప్పట్లో నిన్నే కోరి, నేనే రాజు- నేనే మంత్రి, గరుడ వేగ...ఇవన్నీ సెకండాఫ్ సిండ్రోమ్ పాలబడి ప్రశ్నర్ధకమయ్యాయి. కాకపోతే చివరి మూడు మాత్రం ఏదో అదృష్టం కొద్దీ గట్టెక్కాయి. ఈ సిండ్రోమ్ ఎలా ఏర్పడుతుందో తెలిసిందే. ఫస్టాఫ్ లో  చెప్పిన పాయింటు సెకండాఫ్ లో వేరే కథగా మారిపోవడం ఎక్కువగా జరుగుతూంటుంది. అలాగే ఇంటర్వెల్ నిర్వహణ సరిగా లేకున్నా జరుగుతుంది. గరుడ వేగది ఇంటర్వెల్ సమస్యే నని గత వ్యాసంలో చెప్పుకున్నాం. ఇంటర్వెల్లో ప్రేక్షకుల్ని ఆపకుండా కథనే ఆపేశారు. లేదా ఫస్టాఫ్ లో చెప్పుకొస్తున్న టెర్రరిజం విషయం ముగించారు. ఇక్కడ్నించీ సెకండాఫ్ ఏమిటి? ఇంటర్వెల్లో ప్రేక్షకుడు ఏమాలోచిస్తాడు? ఇక పట్టుబడ్డ నిరంజన్ అయ్యర్ ని సెకండాఫ్ లో ప్రశ్నిస్తారు, అతను టెర్రర్ నెట్వర్క్ గుట్టు విప్పుతాడు, ప్రతాపరెడ్డిని ఎందుకు చంపాలనుకున్నారో చెప్తాడు, అప్పుడా మొత్తం టెర్రర్ నెట్వర్క్ ని హీరో నాశనం చేస్తాడు- ఇంతేగా?

          థ తెలిసిపోతూ ఇంటర్వెల్ కి ఇవిఆసక్తి కల్గించే అంశాల్లా లేవు. అసలిలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే - ఈ కథ టెర్రరిజం గురించి కాదు, వేరే రాజకీయ కుట్రల కథ కూడా కాదు, ఒకేవొక్క ప్లుటోనియం  మైనింగ్ మాఫియా కథ. దీన్ని ఎక్కడా బయట పెట్టకుండా సెకండాఫ్ లో ఇంకో అరగంట వరకూ దాచిపెడితే బోలెడు సస్పన్స్ ని సృష్టించ వచ్చను కున్నారు. అంటే ఎండ్ సస్పెన్స్ అన్నమాట. ఎండ్ సస్పెన్స్ అవుతుందని తెలియక చేయడమన్న మాట. అందుకని టెర్రరిజం కథలా ఫస్టాఫ్ లో పూర్తిగానూ, రాజకీయ కుట్ర కథలా సెకండాఫ్ లో కొంతవరకూ నడిపేస్తే సరిపోతుందనుకున్నారు. అదే చేశారు. కథ చెప్పకుండా కథ నడపలేరు కాబట్టి ఈ పిట్ట కథలతో కవరింగు, మభ్యపెట్టడాలు, తప్పుదోవ పట్టించడాలు,  ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడాలూ వగైరా వగైరా. కథ చెప్పడమంటే ముందు పాయింటు చెప్పడమే. పాయింటుని  దాచి కథ నడపాలనుకుంటే, ఇలా ఎండ్ సస్పన్స్ అయి  గరుడ వేగ అవుతుంది. 

          సింగం త్రీ వుంది. అందులో పాయింటు ఆస్ట్రేలియా నుంచి చట్టవ్యతిరేకంగా బయలాజికల్, ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు తెచ్చి మన దేశంలో పారబోసే కుట్ర. స్పైడర్ వుంది. అందులో మనుషుల్ని చంపి వాళ్ళ బంధువులు భోరున ఏడుస్తూంటే ఆ శబ్దాన్ని ఆనందించే సైకో కుట్ర. వివేకం వుంది. ఇందులో
 కార్పొరేట్ శక్తులు అణుశక్తితో ప్రపంచంలో భూకంపాల్ని సృష్టించి వ్యాపారం చేసుకోవాలనుకునే కుట్ర. లై వుంది. ఇందులో చాలా పూర్వం నుంచీ నేరాలు చేసి  తప్పించుకుంటున్న మాస్టర్ క్రిమినల్ ని పట్టుకునే ప్రయత్నం. ఇవేవీ ఎండ్ సస్పెన్సు లు కావు. ఇవన్నీ మనకి ముందు ఫస్టాఫ్ లో నే చెప్పేసి కథ నడుపుతారు. అయినా ఇవి ఫ్లాపయ్యాయంటే వేరే కారణాలున్నాయి : సింగం త్రీ లో పిచ్చి పిచ్చి షాట్లతో టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ తలనొప్పి తెప్పించడం, స్పైడర్ లో హీరోకన్నా విలనే హీరో అయిపోవడం, వివేకంలో ఇంటర్వెల్ నుంచి మిత్ర ద్రోహం కథగా మారిపోవడం, ఇక లై లో విలన్ ఎప్పుడో నేరాలు చేశాడని అనడమే గానీ, ఇప్పుడు కథలో ఒక్క  కుట్ర కూడా  చేయకపోవడం!

         
Caring + Story Telling x Sincerity = CONNECTION  అని ఒక ఈక్వేషన్ వుంది. గరుడ వేగలో ముఖ్యంగా చివరిదైన సిన్సియారిటీ లోపించడం వల్ల ( ఉన్నదున్నట్టు కథ చెప్పకుండా వేరే కథనాలతో మభ్యపెట్టడం) మొదటి రెండూ సాధ్యంకాక, సెకండాఫ్ ప్రేక్షకులతో కనెక్షన్ తెగిపోయింది. సెకండాఫ్ లో ఇంకొక విచిత్రమేమిటంటే,  యాక్షన్ సీన్లు మైండ్ లెస్ గా వుండడం. మైండ్ లెస్ కామెడీలకి నవ్వుకోగలం. ఇంత హెవీ యాక్షన్ మూవీలో  మైండ్ లెస్ యాక్షన్ కి కూడా నవ్వుకోవాలా?

ఇంతకీ ఏముంది సెకండాఫ్ లో?
        సెకండాఫ్ మూడు ఎపిసోడ్లుగా వుంది. రాజకీయ కుట్రని చెప్పి నిరంజన్ ని వేరే జైలుకి తరలించే మొదటి ఎపిసోడ్, హీరోతోబాటు తప్పించుకున్న నిరంజన్ ని చంపే ప్రయత్నపు రెండో ఎపిసోడ్, విలన్ షిప్ లో బయల్దేరిపోతున్నాడని అడ్డుకునే మూడో ఎపిసోడ్ .

             మొదటి ఎపిసోడ్ : ఛానెల్స్ లో ప్రతాపరెడ్డి మీద బాంబు దాడి కుట్రని భగ్నం చేశారని ప్రకటనలు. ప్రతాపరెడ్డి ని చూపిస్తే అతను ఇది రాజకీయ కుట్ర అనీ, రూలింగ్ పార్టీయే చేసిందనీ  ఆరోపిస్తూ చిందులేస్తాడు. ఇది  టీవీలో చూస్తున్న విలన్ కన్పిస్తాడు. నిరంజన్ ఇంటరాగేషన్ మొదలవుతుంది. ఒక లాయర్ వచ్చి నిరంజన్ తో డీల్ కుదుర్చుకుంటాడు. సుల్తాన్ బజార్ లో రషీద్ సుల్తాన్ అనే టెర్రర్ గ్రూపు దగ్గరికి క్రిమినల్స్ వచ్చి ఓ కవరందుకుంటారు. ఇదీ మొదటి ఎపిసోడ్. 

          ఈ మొదటి ఎపిసోడ్ తోనే, అసలు  సెకండాఫ్ మొదటి దృశ్యంతోనే,  ఏక సూత్రత అనే త్రాసు అమాంతం తలకిందులైపోయింది.  తూకం వేసేవాడు త్రాసు ముల్లు  దగ్గర వేలు పెట్టి తూకాన్ని ఏమారిస్తే దండి కొట్టాడు అంటారు. గరుడ వేగ లో గండి కొట్టుకున్నారు. అసలు ఏక సూత్రత అంటే ఏమిటి? మొదలెట్టిన పాయింటుతో అదే కథ చివరంటా చెప్పడం మాత్రమే కాదు, ఆ కథని ఆశ్రయించి వుండే సమస్త  హంగులూ అదే ఫీల్ ని ప్రకటించడం కూడా.  ఏక సూత్రత కింద జానర్ మర్యాద వుంటుంది. జానర్ మర్యాద కింద దాన్ని గౌరవిస్తూ ఇతర హంగులన్నీ వుంటాయి. ఏ జానర్ మర్యాదని అనుసరిస్తూ కథ చెప్తున్నారో,  అదే జానర్ మర్యాదని ఆద్యంతం ప్రదర్శించడం జానర్ మర్యాదని గౌరవించడమవుతుంది. 2015 లో తెలుగులో జానర్ మర్యాదని చివరంటా కాపాడుకున్న సినిమాలే హిట్టయ్యాయని బాగా గమనించాలి. అంటే  రసానుభూతి అనే ఎలిమెంట్ ని ప్రేక్షకులు ఫీలవడం మొదలెట్టారన్న మాట. ‘ముత్యాలముగ్గు’  కథలో విషాదమున్నా దాన్ని వినోదమనే షుగర్ కోటింగిచ్చి అద్భుత రసప్రధానంగా చూపించుకొచ్చారు. ఈ రసానుభూతి ఎక్కడా చెడకుండా చూశారు. ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’  మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. దీని జానర్ మర్యాద ఏదైతే వుందో  – వయసు మళ్ళిన ప్రేమల లెవెల్ - దాన్ని ముగింపు వరకూ కాపాడేరు.

          గరుడవేగ ఫస్టాఫ్ కథని ఎంత ఏమార్చినా, చూపించుకొస్తున్నది సీరియస్ యాక్షన్/ అడ్వెంచర్ జానర్. సీరియస్ యాక్షన్ / అడ్వెంచర్  జానర్ కి అద్భుత రసమే వుంటుంది. అలాగే దీన్ని అద్భుత రస ప్రధానంగా బాగానే చిత్రీకరించారు. అలా సీరియస్ యాక్షన్ డిమాండ్ చేసే ప్రకారం  – పాత్రల తీరుతెన్నులు, సంభాషణలు, పాల్పడే చర్యల మెకానిజం, నేపధ్య వాతావరణ సృష్టి వగైరాలతో మొత్తం స్టయిలిష్, మోడర్నిటీలతో కూడిన సెటప్ అంతా,  ఏకసూత్రతంతా,  సెకండాఫ్ మొదలయ్యేసరికి మాయమైపోయింది.

          ముందు మోడర్నిటీ స్థానే పాత మూస ఎలా మొదలవుతుందంటే, చానెళ్ళ ప్రసారాలతో.  సెకండాఫ్ ఒపెనవగానే థియేటర్  స్క్రీన్నిండా  రొడ్డ కొట్టుడుగా చానెళ్ళ  స్క్రీన్స్  వేసేసి, కథా ప్రపంచంలోని  దృశ్య శబ్ద సౌందర్యాల్ని  చెడగొట్టి, లౌడ్ స్పీకర్లు పెట్టినట్టు,  రంగంలోవున్న యాంకర్ల చేత నాటుగా వార్తల్ని చదివించే  అనాలోచిత పధ్ధతి ఇక్కడా ఎదురవుతుంది. ఆ వార్తలు కథలోని పాత్రలుగాక, ప్రేక్షకులు విని తీరాలన్నట్టు (టార్చర్ అనుభవించాలన్నట్టు) దృశ్య శబ్ద కాలుష్యాలతో నిండి వుంటుంది. ప్రతీ సినిమాలో ఇదే భరించలేని చీప్ తంతు తప్ప, ఇది కళ కాదని కళ్ళు తెరిచేది వుండదు. కళ అదేదో పెద్ద మాట కాదు. బీ గ్రేడ్ చిత్రీకరణలే ఏ గ్రేడ్ లో వుండకూడదన్న కామన్ సెన్స్ మాట. ఒకసారి రాం గోపాల్ వర్మ ‘సర్కార్ త్రీ’ లో టీవీ న్యూస్ ని ఎలా చూపించారో, ఎంత అర్ధవంతంగా కథా ప్రపంచంలోని పాత్రలకి తెలిసేట్టు మాత్రమే చూపించి, ఆ దృశ్య శబ్ద మర్యాదలతో ఎంత అందంగా మనం కూడా ఆ పాత్రలతో బాటు లీనమై ఫీలయ్యేట్టు చేశారో తెలుసుకోవడం మంచిది. 

          ఎలక్ట్రానిక్ మీడియా కంటే ప్రింట్  మీడియా చాలా పెద్ద ఇండస్ట్రీ. సినిమాల్లో 
దీని ఉనికే లేకుండా  పోయింది. మాటాడితే కుర్ర రిపోర్టరీమణులు మైకులుపట్టులుని పోలోమని వచ్చేసి నాన్సెనికల్ ప్రశ్నలేయడం, సినిమా చూస్తున్న ప్రేక్షకుల వైపు తిరిగి నీచంగా రిపోర్టు చేయడం ప్రతీ సినిమాలో వున్నట్టే ఇక్కడా నిండిపోయింది.  ఎప్పుడైతే  సెకండాఫ్ లో టెర్రరిజం కూడా పోయి, రాజకీయ కోణం ఓపెన్ చేశారో- ఇక చీదరగా రిపోర్టరీమణులు రక్కడం మొదలెడతారు. వీళ్ళ రక్కుడు రెండో ఎపిసోడ్ వరకూ వుంటుంది.  ఈ యాంకర్లతో  / రిపోర్టరీమణులతో కథ చెప్పించడమేమిటో అర్ధంగాదు. పాత్రల ద్వారా సహజంగా కథ తెలియజేయాలంటే కష్ట పడాలి - దీనికి షార్ట్ కట్  ఛానెళ్ళతో వాయింపులు. ఇలా బి గ్రేడ్ చిత్రీకరణలకి ఏ గ్రేడ్ జీతాలు తీసుకోవడం.

(మిగతా రేపు)
-సికిందర్ 




















13, నవంబర్ 2017, సోమవారం

545 : సెకండాఫ్ సంగతులు!




     సినిమా హిట్ అన్పించుకున్నాక తప్పుబట్టడాని కేముంటుంది, ఏమీ వుండదు. అందులో వున్న అన్ని లోపాలూ ఉల్లంఘనలూ సమస్తం ఇన్ స్టంట్ ఒప్పులైపోతాయి. సినిమా స్కూళ్ళు, స్క్రీన్ ప్లే పుస్తకాలు అనవసరాలై పోతాయి. అయితే ఈ విజయానికి  ఇన్స్పైర్ అయి, ఇంకెవరైనా దీన్నే ఫాలో అయిపోవచ్చు. ఇలాగే  ఎలాపడితే అలా తీసెయ్యొచ్చు,  అది కూడా హిట్టవచ్చు. అది పూర్తిగా చీకట్లో రాయి విసరడం. ఎందుకంటే, ఎలా పడితే అలా తీయడానికి రూల్స్ ఏమీ వుండవు. ఎవరికెలా తోస్తే అలా తీసేయడమే. కనిపిస్తున్న విజయమే గైడ్ బుక్. రూల్స్ ని బ్రేక్ చేయడం కూడా రెండు విధాలా వుంటుంది.  రూల్స్ ఏమిటో తెలుసుకుని బ్రేక్ చేయడం, రూల్స్ పట్టకుండా ఏదో చేసుకుపోవడం. కొందరికి రూల్స్ అంటేనే ఇగో వచ్చేస్తుంది, నా సినిమాకి ఎవరో రూల్స్ చెప్పడమేమిటని. ఆ రూల్స్ అనేవి విజయవంతమైన సినిమాల్లోంచి ఏర్పడినవైతేనేం, వాటి గొప్ప మాకెందుకని. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా తాము 10 శాతం  విజయాల బ్రాకెట్ కి చెందిన వైట్ కాలర్ వాళ్ళమనుకుంటారు. తీరా చూస్తే  90 శాతం బ్లూ కాలర్ ఫ్లాపుల మార్కెట్ లో వుంటారు. 90 అనేదే వాస్తవం, 10 అనేది వొఠ్ఠి మిధ్య! గాఠ్ఠి మిధ్య!! ఎంతటి వాడైనా 90 కే భయపడాలి, భయపడి నేర్చుకోవాలి, నేర్చుకుంటూ చావాల్సిందే. కంపెనీలకి ఆర్ అండ్ డీ వున్నట్టు, కళాకారులకి అలాటిది వుండాల్సిందే! కళాకారుడి కొవ్వు ఎంతంటే,  కంపెనీలు సెల్ ఫోన్లు తయారు చేస్తూంటే, కళాకారుడు టెలిఫోన్లు తయారు చేస్తూంటాడు. గ్రాంఫోన్లు కూడా తయారు చేస్తాడు. మార్కెట్ కి పనికి రాకపోయినా వాడి క్రియేటివిటీ వాడికద్భుతమే!

         
కాబట్టి రూల్స్ తెలియకుండా ఎలాపడితే అలా తీయాలన్నా  అసలా తప్పులెలా వుంటాయి, అవి తప్పులెందుకవుతాయి, ఉల్లంఘనలెలా వుంటాయి, అవి ఉల్లంఘనలెలా అవుతాయి, మనం ఏ బాపతు అకృత్యాలకి  పాల్పడ వచ్చు తెలియాలి. వూరికే చీకట్లో రాయి విసిరి చూద్దామనుకోకుండా, ఏ వంకరలో రాయి విసిరితే తగులుతుందో తెలుసుకుంటే  ఇలాటి విజయాల్ని సులభతరం చెయ్యొచ్చు.  


          గత వ్యాసంలో ఏ రూల్స్ కీ అందని ఫస్టాఫ్ సంగతులు చూశాం. ఇప్పుడు ఫస్టాఫ్ కి సెకండాఫ్ పూర్తి భిన్నం. ఫస్టాఫ్ లో  మోడర్నిజమైనా వుంది, ట్రెండీ నెస్ అయినా  వుంది. సెకండాఫ్ లో ఈ రెండూ మాయమై ఇంకెలా  వుందో తెలుసుకుందాం 
 



రేపు!

12, నవంబర్ 2017, ఆదివారం

544 : రివ్యూ!



ర్శత్వం: అజయ్ ఆండ్రూస్
తారాగ
ణం: మంచు నోజ్, అనీషా అంబ్రోస్, పోసాని, అజయ్ ఆండ్రూస్, జెన్నీఫర్, సుహాసిని,  మిలింద్ గునాజీ దితరులు
స్క్రీన్ ప్లే : గోపీమోహన్, ఛాయాగ్రణం: వి.కె. రామరాజు, సంగీతం :  శివ నందిగామ
బ్యానర్ : పద్మ ఫిలింస్ ఇండియా ప్రై.లి., ఎన్‌..సి
నిర్మాతలు: ఎస్‌.ఎన్‌.రెడ్డి, క్ష్మీకాంత్
విడుదల : నవంబర్ 10, 2017
***
         
2010  లో ‘బిందాస్’  అనే వొక విజయం తర్వాత ఆ సంవత్సరంలోని  చివరి రెండంకెలు హైలైట్ చేస్తూ 10 సినిమాలతో  దెబ్బతిన్న మంచు మనోజ్, ఈ మూస మాస్ నుంచి కాస్త తప్పుకుని ఒక మంచి ప్రయతం చేద్దామనుకున్నట్టుంది. మంచి ప్రయత్నం  కోసం దేశమో, రాష్ట్రమో,  ఇంకేదో సామాజికమో ఎత్తుకుంటే ఎలివేట్ అవుతాననుకుని, శ్రీలంక శరణార్ధుల సమస్య వైపు మొగ్గాడు. మహేష్ బాబు వెళ్లి రాజస్థాన్ నీటి సమస్య తీర్చినా (ఖలేజా – కలేజా అంటే సరిపోతుంది), రవితేజ వెళ్లి బీహార్ లో ఇంకేదో వాళ్ళ గొడవ  ఎత్తుకున్నా (కిక్ -2) సాధ్యం కాని మంచి ప్రయత్నం తనవల్ల అవుతుందనుకుని మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ కి శ్రీకారం చుట్టాడు. గూఢచారి ఏ దేశమో వెళ్లి మన దేశం కోసం గూడుపుఠానీ  నడిపినా  అదొక అందం, బాక్సాఫీసుకి మందం. గూఢచారి కానివాడు పరదేశంలో మనది కాని స్థానిక సమస్యలు తీర్చాలనుకుంటే, బాక్సాఫీసుకి ఆ ఇన్ పుట్ అర్ధంగాక  అవుట్ పుట్ ఇస్తుందా? ఇది చూద్దాం...

 కథ 
      సూర్య (మనోజ్) ఇండియాలో వొక శ్రీలంక శరణార్ధ సంతతి. యూనివర్శిటీలో చదువుతూంటాడు. ఒక మంత్రి కొడుకు, వాడి స్నేహితులూ కలిసి యూనివర్సిటీలో ముగ్గురు  విద్యార్ధినుల మీద అత్యాచారం చేయబోతే ఇద్దరు విద్యార్ధినులు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక విద్యార్థిని పారిపోతూంటే ఆమెని కూడా చంపి ఆత్మహత్యగా  చిత్రిస్తారు. ఈ కేసుని వ్యక్తిగత సమస్యలతో చేసుకున్న ఆత్మహత్యలుగా మార్చెయ్యడంతో సూర్య తిరగబడతాడు. చనిపోయిన విద్యార్ధినుల్లో  ఇద్దరు శ్రీలంక శరణార్ధులుంటారు. సూర్య ఉద్యమించడంతో విద్యార్ధులంతా మద్దతుగా ఆందోళనకి దిగుతారు. దీంతో సూర్యని డ్రగ్ కేసులో ఇరికించి హింసిస్తారు పోలీసులు. ఒక మంచి కానిస్టేబుల్ (పోసాని) చిత్రహింసల్ని అడ్డుకుని సూర్య గురించి అడిగి తెలుసుకుంటాడు. అప్పుడు సూర్య శ్రీలంకలో తమిళుల మీద జరిగిన దమనకాండ చెప్పుకొస్తాడు. 

          శ్రీలంకలో ఏ హక్కులూ లేక అల్లాడుతున్న  తమిళులు తిరగబడితే కాల్చి చంపుతూంటాయి ప్రభుత్వ బలగాలు. దీంతో పీటర్  (మనోజ్ -2) ఈలం పేరుతో తీవ్రవాద దళాన్ని నిర్మించి తమిళులకి ప్రత్యక దేశంకోసం అంతర్యుద్ధానికి తెరతీస్తాడు. పోరు తీవ్రమవుతుంది.  తట్టుకోలేక ఇండియాకి పారిపోతారు ఓ పదకొండుగురు తమిళులు. వాళ్లకి విక్టర్ (అజయ్ నూతక్కి) నాయకత్వం వహిస్తాడు. సముద్ర మార్గంలో బయల్దేరిన పడవ ప్రయాణం అనేక ఒడిదుడుకుల పాలవుతుంది. ఆ పడవలో ఓ పసి పిల్లాడు కూడా వుంటాడు. పది రోజులపైగా సాగే  ఈ ప్రయాణంలో ఏమేం జరిగాయన్నది, చివరికి ఎందరు మిగిలి తమిళనాడు చేరారన్నది మిగతా కథ.
ఎలావుంది కథ 


        కీ.శే. నడిగర్ తిలగం శివాజీ గణేశన్ ని స్మరించుకునేలా వుంది. ఇటు కథ కాకుండా, అటు డాక్యూడ్రామా కాకుండా ఏదోగా వుంది. 2013 లో ‘రావణ దేశం’ గా తమిళంలో తీసిన దీన్ని ఇవ్వాళ తెలుగులోకి తెచ్చి పొరపాటు చేశారులా వుంది. ఎంతో రీసెర్చి చేసిన దర్శకుడు  అజయ్ ఆ రీసెర్చి సారాన్ని  సినిమా కథగా మల్చడంలో విఫలమయ్యాడు. 2009 లో నిజంగా జరిగిన తమిళ శరణార్ధుల పలాయనం మీద ఈ కథ చేయాలనుకుంటే అది సినిమాకి పనికి రాదనే చెప్పొచ్చు. ఒక సందర్భంలో శివాజీ గణేశన్ - ఆర్టు సినిమా అంటే పడవ పోతూ వుంటుంది, పోతూనే వుంటుంది, రెండు గంటలదాకా ఇంకా పోతూనే వుంటుంది...కానీ ఏమీ జరగదు! – అని జోకేసినట్టు తయారయ్యింది ఈ కథ. 
      
          ఏది కథవుతుంది? పడవలో శరణార్ధుల కష్టాలే చెప్పాలనుకుంటే అది సర్వైవల్ జానర్ గాథవుతుంది, కథవదు. ఎందుకంటే  విషాదాంతం కాబట్టి. విజయాలు చూపిస్తేనే కథలవుతాయి. గాథ అవాలన్నా కూడా, మొదట్నుంచీ గాథే చెప్పాలి. సగంవరకూ అంతర్యుద్ధంతో యాక్షన్ జానర్ లో వైరి వర్గాల మధ్య ‘ఆర్గ్యుమెంట్’ సహిత కథ చెబుతూ, మళ్ళీ తర్వాత సగం సర్వైవల్ జానర్ లో ఉత్త ‘స్టేట్ మెంట్’ మాత్రపు  పడవ ప్రయాణ గాథ చెప్పడం రసభంగం.

          కథకి  బేస్ ఆర్గ్యుమెంట్. గాథకి బేస్ స్టేట్ మెంట్. కమర్షియల్ సినిమాకి ఉస్సూరన్పించే స్టేట్ మెంట్లిచ్చే గాథలు పనికిరావు, వేడివేడి ఆర్గ్యుమెంట్స్ సహిత కథలే  కావాలి. ఐనా పడవలో బయల్దేరిన శరణార్ధుల కష్టాలెవరిక్కావాలి. ఒకటీ అరా జరిగే ఈ ప్రమాదాలే శరణార్ధుల ప్రధాన సమస్య కాదుగా? శ్రీలంక శరణార్ధుల అసలు సమస్య స్వదేశంలో పెనం మీద మలమల మాడి, పారిపోయి తమిళనాడు  వస్తే అక్కడ పొయ్యిలోపడి -  వెరసి -  ఏ దేశం మాది? అన్న ప్రశ్నలేవనెత్తుతూ చెప్పాల్సిన కథ. 
ఎవరెలా చేశారు 
      మనోజ్ త్రిపాత్రాభినయం చేశాడు – ఒకటి స్టూడెంట్, రెండు తీవ్రవాది, మూడు స్థూలకాయం. తను షేపులోకి రాకపోతే యూత్ అప్పీల్ కష్టమవుతుందని  గుర్తిస్తే బావుంటుందేమో.  తెరమీద తనని చూస్తూంటే పాత్ర మీద కన్నా స్థూల కాయం మీదికే బాగా దృష్టిపోయేలా వుంది. రెండు పాత్రల్నీ రౌద్రంగా నటించాడు, హింసాత్మక దృశ్యాలతో. ఉక్రోషంతో డైలాగులు పలికాడు. తీవ్రవాద పాత్ర ఎల్టీ టీఈ అధిపతి  వేలుపిళ్ళై ప్రభాకరనే అని వేరే చెప్పనవసరంలేదు. మొదటి తీవ్రవాద పాత్రకి ఫస్టాఫ్ లో పోరాట దృశ్యాలతో నిడివి ఎక్కువున్నా, రెండో స్టూడెంట్ పాత్ర – ఇటు తీవ్రవాద పాత్రకీ, అటు సెకండాఫ్  పడవ ప్రయాణానికీ ఫ్లాష్ బ్యాక్స్ చెప్తూ రావడం వల్ల  నిడివి తక్కువ. ఫస్టాఫ్ పీటర్ కథ సెకండాఫ్ కొచ్చేసరికి విక్టర్ గాథగా సాగేసరికి,  మనోజ్ పాత్రల పంపకం కుదర్లేదు.

          పోసానిది అదే నటన. టీవీ రిపోర్టర్ పాత్రలో  అనీషా అంబ్రోస్ ది  సంక్షిప్త పాత్ర. విక్టర్  గా నటించిన దర్శకుడు అజయ్ కి సింహభాగం సినిమా దక్కింది. ఇది పూర్తిగా శోకపూరిత పాత్ర పడవ ప్రయాణంలో. 

          పడవలో ఇంకో పది ఆడా మగా పడుచు పాత్రలు, ముసలి పాత్రలూ, వొక పసి పాత్రా వుంటాయి. ఈ పాసిపాత్రే పెరిగి స్టూడెంట్ పాత్ర అయి ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. పడవలో ఈ పాత్రలన్నిటితో విషాదమయ వాతావరణమే వుంటుంది. దుష్ట మంత్రిగా మిలింద్ గునాజీ చాలాకాలం తర్వాత తెర మీదికొస్తే, మహిళా హక్కుల సంఘం చీఫ్ గా సుహాసిని. 

          ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ దృశ్యాలు. శ్రీలంక సైన్యానికీ, తమిళ పులులకీ మధ్య జరిగే యుద్ధ దృశ్యాలు  అత్యంత శక్తివంతంగా, అంతే వాస్తవికంగానూ, ప్రభావశీలంగానూ  వున్నాయి. ఇవన్నీ వొరిజినల్ ‘రావణ దేశం’ లోనివే. అక్కడక్కడా మనోజ్ పాల్గొన్న యాక్షన్ దృశ్యాల్ని మాత్రం రీషూట్ చేశారు. అవుట్ డోర్ లొకేషన్స్ శ్రీలంక నేటివిటీతోనే వున్నాయి. ఇక పడవ ప్రయాణపు సెకండాఫ్ ఎపిసోడ్ అంతా యధాతధంగా వొరిజినలే.  ఈ ఎపిసోడ్ చివర్లో తుఫాను వచ్చే దృశ్యాల సీజీ బీభత్సభరితంగా వుంది. కెమెరా మాన్
వి.కె. రామరాజు సముద్రంలో రిస్కు తీసుకుని చిత్రీకరణ చేశాడు. నేపధ్యసంగీతం ఫర్వాలేదు. 
 చివరికేమిటి 
     సగాలు రెండూ ఒకటైతే జగం జగమే గానీ,  ఇలాటి సగాలు ఒకటైతే కాదు. వసూళ్ళ పిల్లలు పుట్టి పారాడవు. ఫిఫ్టీ –ఫిఫ్టీ ...నీదో సగం, నాదో సగం  అని హీరో – దర్శకుడు ఫస్టాఫ్, సెకండాఫ్ లు పాడుకుని పంచుకుంటే రెండు సినిమాలవుతాయి, ఒకటి కాదు. ఒకటి కథ, రెండోది గాథ. ఇవి రెండూ ఆడా మగలైతే అలాగే కలుసుకుని డ్యూయెట్ పాడుకోవచ్చు, రెండూ మగలై ఆడదాని కోసం వెతుక్కుంటున్నాయి. వాటిని మాయం చేశాడు కథకుడు. 

          ఇందుకే ముందుగా  తట్టిన ఐడియాలో  స్ట్రక్చర్ చూసుకోవాలనేది. చూసుకోకపోతే కథ కాకుండా కొంపలు ముంచే గాథ తయారవుతుంది - లేదా ఇలా సగం కథ, సగం గాథ మాయలేడిలా ముస్తాబవుతుంది. ఇలాటి దుష్టసమాసం ఇంతవరకూ ఏ సినిమాలోనూ లేదు బహుశా. 

          ఈ కథ + గాథకి కవరింగ్ లెటర్ లా ఇంకో కథ వుంది - స్టూడెంట్ కథ. ఈ స్టూడెంట్ కథకే స్ట్రక్చర్ వుంది. విద్యార్ధినుల మరణాలపై ఉద్యమించడం,  అరెస్టయి ఎన్ కౌంటర్ ని ఎదుర్కోవడం, తప్పించుకుని విజయం సాధించడం. ఇదంతా సాగుతున్నప్పుడు అతను మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో శ్రీలంక శరణార్ధుల గురించి చెప్పుకొస్తూంటాడు – ఒక పీటర్ కథగా,  ఇంకో విక్టర్ గాథగా. ఇలా ఈ ఫ్లాష్ బ్యాక్ కే స్ట్రక్చర్ లేకుండా పోయి ఏం చెప్తున్నాడో అర్ధంగాని గందరగోళానికి దారితీసింది. 

          ఫస్టాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభించిన శ్రీలంక శరణార్ధుల కథ కథలాగే కొనసాగాలంటే, ఇంటర్వెల్ కల్లా లంక దళాలకి తట్టుకోలేక శరణార్ధులు తమిళనాడు చేరుకోవాలి. సెకండాఫ్ తమిళనాడులో ఆ శరణార్ధులు దేశంకాని దేశపు వాళ్ళుగా ఎదుర్కొనే  వివక్ష, అణిచివేతా వగైరాలతో కూడిన సంఘర్షణ చూపించి, ఈ సమస్యకి పరిష్కారం చెబుతూ ముగించాలి. అంతేగానీ శ్రీలంకలో వాళ్ళ  దైన్యం చూపించి,  పడవలో పడేసి ప్రయాణపు కష్టాలు చూపించి ముగించేస్తే అది పూర్తిగా చెప్పడం కాదు. తమిళనాడులో వాళ్ళ పరిస్థితిని కూడా చూపిస్తేనే  ప్రేక్షకులకి పూర్తి సమాచారమిచ్చి అవగాహన కల్గించినట్టు, విషయం పరిపూర్ణంగా చెప్పినట్టు. అప్పుడే ఈ  మొత్తం అర్ధవంతమైన కథ అన్పించుకుంటుంది. 

          కాందీశీకుడి రూపంలో తమిళనాడులో స్టూడెంట్ పడ్డ బాధలు చూపించాంగా అంటే, అది చూపించడం కాదు, సినిమా వీక్షణానుభవాన్ని చెరచడం. పోరాడే స్టూడెంట్ తో బాటు చనిపోయిన ఇద్దరు శరణార్ధ విద్యార్థినులది కల్పిత, కృత్రిమ, రొటీన్ సినిమాటిక్ ఫార్ములా  కథ. మిగతా కథో గాథో రియలిస్టిక్ గా చూపించుకొస్తూ,  స్టూడెంట్ కథని మూస ఫార్ములాగా ఎలా చూపిస్తారు. ఇక్కడ కావాల్సింది వీళ్ళ కథ కాదు, పడవెక్కి పారిపోయి వచ్చిన ఆ పదకొండు మంది శరణార్ధుల రియలిస్టిక్ కథ. కనుక ఈ స్టూడెంట్ కథ అనే కవరింగ్ లెటర్ అనవసరమై పోతుంది. కథ చెప్పడానికి అతి టాలెంట్  ప్రదర్శించుకోనక్కర్లేదు, టాలెంట్ సరిపోతుంది.

          సారాంశం? పడవ ప్రయాణంలో గల్లంతైన నిజ సంఘటన పై చేసిన రీసెర్చి కేవలం అంతవరకే డాక్యుమెంటరీకి పనికి వస్తుంది. దానికి అంతర్యుద్ధపు కథ, స్టూడెంట్ కథా అని  జోడించడానికి పనికిరాదు. 

          ఈ మొత్తానికి కలిపి చివర్లో స్టూడెంట్ ఇచ్చే స్పీచికి  కూడా అర్ధం లేదు. రండి, మనమంతా కలిసి జీవిద్దాం, వివక్ష వద్దు....లాంటి మాటలు ఎక్కడైనా పీడితుడు చెప్తే ఎవరైనా వింటారా, లేక పీడించే వర్గం నుంచి ఎవడైనా ఇటు స్టూడెంట్ వైపు వచ్చి కలుపుకుని అంటే, వినబుల్ గానూ చూడబుల్ గానూ వుంటుందా?

-సికిందర్
https://www.cinemabazaar.in





                   
         
         
         



10, నవంబర్ 2017, శుక్రవారం

543 : రివ్యూ!


Dear  Readers!
Yesterday  glitches in net connectivity  caused delay in publishing the review. The desktop gone bongs! The inconvenience is deeply regretted.


        
రచన –దర్శకత్వం : మిస్కిన్
తారాగణం : విశాల్, అనూ  ఇమ్మాన్యుయేల్, అండ్రియా జెర్మియా ప్రసన్నవినయ్భాగ్యరాజ్సిమ్రాన్వినయ్ రాయ్ తదితరులు 
సంగీతంఅరోల్ కొరెల్లీ, ఛాయాగ్రహణం : కార్తీక్
బ్యానర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, నిర్మాత : విశాల్  
విడుదల : నవంబర్ 10, 2017

***
          తమిళ స్టార్ విశాల్ మాస్ సినిమాలంటూ తెలుగులో అంతరించిన అవే రక్తపాతాల యాక్షన్ సినిమాల్లో నటిస్తూ, క్రమంగా తెలుగులో ఫాలోయింగ్ కోల్పోతూ వచ్చాడు. కార్తీకున్న ఓపెనింగ్స్ కూడా తనకి రావడం తగ్గిపోయింది. అయినా వొరవడిని మార్చుకునే ఆలోచన చేయకుండా అపజయాలకి అలవాటు పడిపోయాడు. తమిళంలో తనదగ్గరికి వచ్చే దర్శకులు కూడా అదే అరవ మాస్ –కొండకచో వూరమాస్ నీ అంటగడుతూ విశాల్ వైశాల్యాన్ని కుదించి వేశారు. తను విస్తరించాలంటే అలాటి దర్శకుల్ని వదిలించుకోవాలి. ఎనిమిదేళ్లుగా విశాల్ తో పనిచేయాలని ఎదురుచూస్తున్న దర్శకుడు మిస్కిన్ బరి అవతలే వుండిపోవాల్సివచ్చింది. చివరికెలాగో  విశాల్ ని ‘తుప్పరి వాలన్’ (తెలుగు అర్ధం పత్తేదారు, ఇంగ్లీషులో డిటెక్టివ్)  కి ఒప్పించాడు. తుప్పరివాలన్ గా తనని చూసుకున్న విశాల్ కి కొత్త ఉత్సాహం వచ్చిందేమో, తనే నిర్మాణం చేపడుతూ నటించాడు. ఫలితం? సత్ఫలితమా, దుష్ఫలితమా? ఓసారి చూద్దాం...

కథ 
        ఒక పిడుగుపాటుతో ఆమె (సిమ్రాన్) భర్తనీ, కొడుకునీ కోల్పోతుంది. సినిమా కెళ్ళిన ఒక  పోలీసు అధికారి చీమ కుట్టినట్టయి తర్వాత చనిపోతాడు. నగరంలో అద్వైత భూషణ్ అలియాస్ ఆది (విశాల్) అనే ప్రైవేట్ డిటెక్టివ్ సరైన కేసులు రావడం లేదని బాధపడుతూంటాడు. వెంట ప్రసన్న అనే అసిస్టెంట్ వుంటాడు. ఒక పదేళ్ళ పిల్లవాడు వచ్చి తనకుక్క పిల్లని చంపిన వాణ్ణి  పట్టుకోవాలని బుల్లెట్ చూపించి ఏడుస్తాడు.  ఆది ఫీలై కేసు చేపడతాడు. పోలీసు వర్గాల్లో తనకున్న సంబంధాలతో ఆ బుల్లెట్ ని పరీక్షిస్తే,  అది పవర్ఫుల్ రివాల్వర్ నుంచి వెలువడిందనీ, దాంతో షూట్ చేస్తే బుల్లెట్ కుక్క పిల్ల శరీరంలోనే వుండిపోయే అవకాశం లేదనీ, అవతలకి దూసుకెళ్లి పోతుందనీ తేలుతుంది. బుల్లెట్ మీదున్న స్ట్రయేషన్స్ ని బట్టి చూస్తే  ఇది రికోషెట్ బుల్లెట్ అనీ, అంటే కుక్క పిల్లకి తగలడానికి ముందు ఏ గోడకో తగిలి, పరావర్తనం చెంది కుక్క పిల్లకి తగిలి వుండాలనీ, అందువల్ల వేగం తగ్గి కుక్కపిల్ల శరీరంలో వుండిపోయిందనీ చెప్తారు పోలీసులు. 

          అంటే ఎవరో మతి మాలిన వాడు కావాలని కుక్క పిల్లని చంపలేదనీ,  ఇంకెవరి మీదికో రివాల్వర్ ని  ప్రయోగించి వుండాలనీ అర్ధం జేసుకుని ఆది ఆ స్పాట్ లో గాలిస్తే,  ఒక వూడిపోయిన దంతం  దొరుకుంతుంది. దాంతో దర్యాప్తు చేస్తూ పోతే ఒక పుస్తకం దగ్గరికి దారి తీస్తుంది. ఆ పుస్తకం పిడిగుపాట్ల గురించి సైన్సు పుస్తకం. దరిమిలా ఇంకో ప్రమాదవశాత్తూ మరణం అది కళ్ళముందే జరుగుతుంది. ఇది ప్రమాదం కాదనీ, లాఫింగ్ గ్యాస్ తో చంపారనీ తెలుసుకుని అప్రమత్తమ వుతాడు. మొదట పిడుగుపాటుతో చనిపోయిన వ్యక్తీ, తర్వాత చీమకుట్టినట్టయి చనిపోయిన పోలీసు అధికారీ, ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో  చనిపోయిన అతనూ,  ఒకే హంతకుడు  తెలివిగా జరిపించిన మరణాలని  తేలుతుంది ఆదికి. ఎవరీ హంతకుడు? ఎందుకు చంపుతున్నాడు? ఇంకెందర్ని చంపుతాడు? వాణ్ణి ఎలా పట్టుకోవాలి? ఇవీ ఆది ముందున్న ప్రశ్నలు. 

ఎలావుంది కథ 
       అచ్చమైన డిటెక్టివ్ కథ. సర్ ఆర్ధర్ కానన్ డాయల్ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ కథలు చదివి స్ఫూర్తి పొందానని చెప్పుకున్నాడు దర్శకుడు. హీరో పాత్రని ని షెర్లాక్ హోమ్స్ ని దృష్టిలో పెట్టుకునీ, అతడి అసిస్టెంట్ పాత్రని  షెర్లాక్ నేస్తం డాక్టర్ వాట్సన్ ని దృష్టిలో పెట్టుకునీ తీర్చి దిద్దానన్నాడు. కానీ అలా అన్పించదు. పూర్తిగా ఒకప్పటి ఎడ్గార్ వాలెస్, జాన్ క్రీసీ  నవలల్లోని వాతావరణంతో, ఆ సరళిలో వుండే కథనంతో, పాత్రల చిత్రణతో కన్పిస్తుందీ కథ. అదే సమయంలో హాంకాంగ్ మూవీ ‘యాక్సిడెంట్’ (2014) లోని కథ ఇందులో కన్పిస్తుంది. అందులో ఒక గ్యాంగ్ కాంట్రాక్టు హత్యల్ని ప్రమాదాలుగానో, సహజ మరణాలుగానో సృష్టిస్తూ వుంటుంది. అందులో ఒకటి,  పిడుగుపాటుని సృష్టించి చంపడం. అయితే ఇది పూర్తిగా మాఫియా బాపతు యాక్షన్ జానర్ కథ. 

          దీన్ని ఎడ్గార్ వాలెస్, జాన్ క్రీసీ  ల సరళిలో అచ్చమైన డిటెక్టివ్ జానర్ లోకి మార్చడంలోని  దర్శకుడి సృజనాత్మకత మాత్రమే ఆకర్షిస్తుంది, కథ ఐడియాకి  హాంకాంగ్ మూవీ స్ఫూర్తి అనేది అప్రస్తుతమైపోతుంది. కథనే  వున్నదున్నట్టు, హాంకాంగ్ మూవీలోంచి సంగ్రహించి తీసి వుంటే  అదివేరు; వాలెస్, క్రీసీల డిటెక్టివ్ జానర్లోకి మార్చడం పూర్తిగా వేరు. హాలీవుడ్ లో కొన్ని ఫిలిం నోయర్, నియో నోయర్  మూవీస్ ని 1930 లనాటి డషెల్ హమెట్ హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలల ప్రభావంతో తీసినట్టు, ప్రస్తుత దర్శకుడు అలాటి సాంప్రదాయాన్ని ఫాలో అవడంతో ఇదొక విశిష్ట రూపాన్ని పొందింది. 

ఎవరెలా చేశారు 
         విశాల్ కి  పాత్ర, దీంతో నటన విభిన్నమైనవి. విచిత్రంగా బిహేవ్ చేస్తూ, ఎప్పుడేమని అరుస్తాడో,  సడెన్ గా ఎప్పుడేం చేస్తాడో అర్ధంగాని పాత్ర. మళ్ళీ తన లోకంలో తానుండిపోతూ ప్రపంచాన్ని పట్టించుకోడు. ఒకవైపు కేసుల్లేక బాధపడతాడు. మరోవైపు బ్లాంక్ చెక్ ఇస్తాను, పారిపోయిన నా కూతుర్ని వెతికి పెట్టమని ఒకడొస్తే లేచి బయటి కెళ్ళి పోతాడు. ఎందుకంటే, ఆ కూతురు ఇంటికి రాకపోతేనే స్వేచ్ఛగా వుంటుందని. మళ్ళీ పదేళ్ళ పిల్లాడు కుక్క పిల్లని చంపారని వస్తే, కరిగిపోయి కేసు తీసుకుంటాడు. ఈ కేసు రాను రాను పెద్దదైపోయి పైసా రాకపోయినా పాటుపడతాడు. 

          షెర్లాక్ హోమ్స్  కి వ్యక్తిత్వ లోపాలుండవు. అపరిమిత వూహాశక్తి గలవాడు, కుశాగ్ర బుద్ధి. ఓ చిన్న విషయం వెనుక ఏఏ కారణాలుండవచ్చో పేజీలకి పేజీలు చెప్పేస్తాడు. విశాల్ పాత్రకి షెర్లాక్ హోమ్స్ నుంచి ఈ టాలెంట్ ని  మాత్రమే తీసుకున్నారు. ఉదాహరణకి హీరోయిన్
ని చూసి - నీ పేరెంట్స్ చనిపోయారు. నువ్వు నీ మేనమామ దగ్గర వుంటున్నావు, మేనమామకి ఇస్త్రీ షాపుంది, నువ్వు వేసుకున్న డ్రెస్ నీది కాదు... ఇలా చూడగానే అనేస్తూంటాడు. ఇదే ధోరణి అనేక సందర్భాల్లో కొనసాగి పాత కాలపు డిటెక్టివ్ పాత్రల్ని గుర్తుకు తెస్తాడు. ఇంత కుశాగ్రబుద్ధి అతనెలా అయ్యాడో, అసలీ వృత్తిలోకి ఎలా వచ్చాడో పాత్ర పరిచయం వుండదు. 

        1968 లో విడుదలైన ‘ది డిటెక్టివ్’ అనే ఫ్రాంక్ సినాట్రా నటించి
న థ్రిల్లర్ లో, పాత్ర కూడా చాలా రఫ్ గానూ, పోలీసు భాష మాట్లాడుతూ మొండిగానూ వుంటుంది. కేసుతీసు
కునే వరకే సెంటిమెంటు, తర్వాత ఏ సెంటిమెం
టూ లేకుండా దర్యాప్తులో వ్యక్తులతో వ్యవహరిస్తాడు. అచ్చం ఈ కోవలోనే విశాల్ పాత్ర వుంది తప్ప, షెర్లాక్ హోమ్స్ తో సంబంధంలేదు. 

          ఒక స్టార్ కిది చిన్నస్థాయి కథ. కానీ ఒక స్టార్ చిన్న స్థాయి కథలో నటించడం వల్ల దాన్ని ఏ స్థాయికి తీసికెళ్ళ గలడో, నటుడిగా తాను కూడా స్థాయికి చేరుకోగలడో నిరూపించాడు  విశాల్.  ఇందులో మూడు యాక్షన్ సీన్లున్నాయి. పాడుబడ్డ గృహంలో రఫ్ గ్యాంగుతో, రెస్టారెంట్ లో చైనీస్ గ్యాంగ్ తో, క్లయిమాక్స్ లో విలన్ తో- ఇవన్నీకొత్తగానూ,  కళాత్మకంగానూ  వుండడం ఒక ప్రత్యేకత. అయితే డిటెక్టివ్ గా వేషధారణ సరీగ్గా కుదర్లేదు. ఐతే ఈ పాత్రతో మాస్ హీరో కాస్తా క్లాస్ హీరో అయ్యాడు. 

       కొత్త హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ ఇందులో జేబుదొంగగా నటించింది. ఆ పని మాన్పించి తన ఇంట్లో పనిమనిషిగా పెట్టుకుంటాడు హీరో. ఆమె మీద ఎప్పుడు అరుస్తాడో తెలీక భయంభయంగా గడిపే పాత్ర. చివరికి అతను ప్రేమలో పడినా, ఆ ప్రేమ ఆమెకి దక్కదు.

          డిటెక్టివ్ అసిస్టెంట్ పాత్రలో ప్రసన్న కన్పిస్తాడు. కానీ దీనికి డాక్టర్ వాట్సన్ పాత్రతో సంబంధం లేదు. విలన్ గా  నటించిన వినయ్ రాయ్ విలనీ అంతా వాలెస్, క్రీజీ ల శైలిలో వుంటుంది. డెవిల్స్ గ్యాంగ్ అనే పేరుకూడా వాలెస్, క్రీసీల నవలల్లో కన్పించే పేరులాంటిదే. ఈ గ్యాంగ్ ఇంకా సాహిత్యంలో, సినిమాల్లో మాఫియా రాక ముందటి చిత్రణ. నీటుగా, కూల్ గా వుంటూ ఎక్కువ మాట్లాడుకోరు. ఆధునిక పద్ధతుల్లో, ఒక్కోసారి సైన్సు నుపయోగించీ సైలెంట్ గా నేరాలు చేస్తూంటారు. 
\
       వినయ్ ఈ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ టెర్రిఫిక్ గా నటించాడు. అతడి అసిస్టెంట్ పాత్రలో ఆండ్రియా జెర్మియా డిటో. గ్యాంగ్ మెంబర్ గా భాగ్యరాజా ఓకే. సినిమా ప్రారంభ సీన్లో, మళ్ళీ ఫస్టాఫ్ ముగింపు సీన్లో కన్పించే సిమ్రాన్ కూడా టెర్రిఫిక్ గా వుంది. 

          కెమెరా వర్క్, బిజిఎం, సెట్స్ డిజైనింగ్, ఎన్నుకున్న లొకేషన్స్, నైట్ సీన్స్ సమస్తం కళాత్మకంగా, ఆలోచనాత్మకంగా వున్నాయి. కథకి  తగ్గ స్టయిల్ నీ, మూడ్ నీ క్రియేట్ చేయ డం వేరే కసరత్తు. దీనికి రిఫరెన్స్ అయినా వుండాలి, సొంత నైపుణ్య మైనా వుండాలి. 

చివరికేమిటి 
      ‘పిశాచి’ దర్శకుడు మిస్కిన్ ఈ ‘డిటెక్టివ్’ తీశాడు. కార్తీక్ సుబ్బరాజు లాగే తనదీ ప్రత్యేక విజన్, దానికి రిఫరెన్సులు. నిజానికి మాఫియా పాత్రలు, కథలు అలవాటయ్యాక, అంతకి ముందటి ఇంటలెక్చువల్ థ్రిల్లర్స్ ని  కోల్పోయాం. మర్డర్స్ అంటే కాల్చో, నరికో చంపే సంస్కృతిలోకి సినిమాలు మారేక, మెదడుకి పదునుబెట్టే నేరాల ప్రక్రియల్ని చిత్రీకరించడం  అరుదై పోయింది. నేర ప్రపంచం ఇంకా చాలా వుంది. సినిమాలు ఒకే  హింసని,  రక్తపాతాన్నీ  పట్టుకుని వుంటున్నాయి. డిటెక్టివ్ లో ద్విపార్శ్వ దర్శన మౌతుంది. చంపడంలో హింస వుంటే వుండొచ్చు, ఆ చంపే విధానం మీదే మన దృష్టంతా కేంద్రీకృతమవుతుంది – హింస కంటే, దాని విధానమే కట్టి పడేస్తుంది. పిడుగుపాటుని సృష్టించి చంపడం, రైసిన్ తో చీమ కుట్టినట్టు చేసి చంపడం, లాఫింగ్ గ్యాస్ తో నవ్వించీ నవ్వించీ రోడ్డు ప్రమాదం జరిపించి చంపడం లాంటి నేరాలు ఆలోచనలో పడేస్తాయి.  

          ఈ డిటెక్టివ్ కథ దాని జానర్ మర్యాదని గౌరవిస్తూ పూర్తిగా లాజిక్ కి పట్టం గడుతుంది. లాజిక్ లేని చిత్రీకరణ ఎక్కడా కన్పించదు. పూర్తిగా ప్రొఫెషనలిజంతో కూడుకుని వుంటుంది. పోలీసులు, డిటెక్టివ్ లు లాజికల్ గానే అలోచించి,  లాజికల్ గానే పని చేసుకుపోతారు. చాలా సినిమాల్లో చూపించినట్టు లాజిక్ ని ఎగేసి పనిచేస్తే ఉద్యోగాలు పోతాయి. ఈ మూవీలో ఒక్క డైలాగు మిస్ చేసుకున్నా, ఒక్క సీను సరిగా చూడకపోయినా, ఆ తర్వాత అర్ధంగాని ప్రమాదం వుంటుంది. డ్రమెటిక్ కంటిన్యుటీ కోల్పోతాం.

          ఓ పది నిమిషాల్లో పిల్లాడి కేసుతో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటు చేసేస్తారు. దీనికి ముందు హీరోకి తెలియని రెండు ప్రమాదవశాత్తూ జరిగిన మరణాల్ని చూపిస్తారు. పిల్లాడి కేసుతో హీరో మిడిల్ విభాగంలో ప్రవేశించి సమస్య (కేసు)తో సంఘర్షిస్తూ, గోల్ కోసం (కుక్కపిల్లని చంపిందెవరు?) ప్రయత్నిస్తూ ముందుకు పోతున్నప్పుడు ఒక సందేహం వస్తుంది  - ఈ కథ ఎండ్ సస్పెన్స్ కథగా మారుతుందా అని. డిటెక్టివ్ కథలు నవలా రూపంలో ఇలాగే  వుంటాయి. చిట్ట చివరికి గానీ డిటెక్టివ్ కి, పాఠకులకీ హంతకుడు తెలియడు. ఇలా సినిమాలో కొనసాగితే ప్రేక్షకులు అంత సేపూ భరించలేరు. విలన్ కీ   హీరోకీ మధ్య పోరాటం మొదలవాల్సిందే. అదీ ఇంటర్వెల్ లోపు. 

       సస్పెన్స్ లో రెండు ప్రశ్నలుంటాయి : ఎవరు? ఎందుకు? అని. ఈ రెండూ దాచిపెట్టి కథ నడిపిస్తే ఎండ్ సస్పెన్స్ అవుతుంది. అంటే ఈ ప్రశ్నలకి సమాధానాలు ఎండ్ లో మాత్రమే తెలుస్తాయన్న  మాట. అంతవరకూ పాత్రతో ఏక పక్ష కథనమే వుంటూ భరించలేరు.  ప్రస్తుత  డిటెక్టివ్ కి ఇదే జరుగుతోందా అన్నసందేహం వస్తుంది. పరిశోధన చేస్తున్నాడు. గంట గడుస్తున్నా హంతకుడెవరో, ఎందుకు చంపుతున్నాడో తెలీడం లేదు. నవలలా సినిమా వుండబోతే విశాల్ అట్టర్ ఫ్లాప్!

          కానీ అదే 60 వ నిమిషంలో, ఇంటర్వెల్ లోపు  సినిమా రూపమే అంటూ స్పష్ట మైపోతుంది. విలన్,  అతడి గ్యాంగ్ ఓపెనైపోతారు. విలన్ కరెంటు రంపంతో ఒక శవాన్ని కోస్తూంటాడు కూడా. దీంతో మనలోని సగటు ప్రేక్షకుడి బుద్ధి సంతృప్తి పడుతుంది. ఎవరు? అనేది తెలిసిపోయింది. ఇక ఎందుకు? (ఎందుకు హత్యలు చేస్తున్నాడు) అన్నది రివీల్ అవ్వాలి. దీన్ని చివరి వరకూ ఆపినా నష్టం లేదు. రెండు ప్రశ్నలూ ఆపెస్తేనే  ఎండ్ సస్పెన్స్ అవుతుంది. ఒకటి ఓపెన్ చేసేసి నడిపిస్తే సీన్ టు సీన్ సస్పెన్స్ అవుతుంది. ఈ విలన్ అప్పుడే హీరోకి తెలియాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకి తెలిస్తే, హీరో ఎలా తెలుసుకుంటాడా అన్న సస్పన్స్ తో కూడిన కథనం ముందుకు లాక్కెళ్తుంది. 

          పది నిమిషల తర్వాత,  ఇంటర్వెల్ కొచ్చేసరికి హీరో ప్రారంభంలో మొదటి రెండు మరణాల రహస్యం తెలుసుకుంటాడు. ఇదే సమయంలో విల తన పార్టనర్ మీద ఇంకో దడి జరిపిస్తాడు. ఫస్టాఫ్ లో రెండు మరణాల మిస్టరీ ఇంటర్వెల్ కల్లా తేల్చేయడం మంచి కథనం. అదే సమయంలో ఇంటర్వెల్ మళ్ళీ విలన్ చేసే ఇంకో ఎటాక్ తో కథ తెగిపోకుండా, సెకండాఫ్ కి సన్నద్ధం చేయడం. 

          సాధారణంగా ఇటువంటి సినిమాల్లో మొదటి రెండు మరణాల రహ్యసం, అ మాటకొస్తే మొత్తం కథలో జరిగిన సంఘటనల వివరణ కార్యకారణ సంబంధం సహా వివరిస్తూ ముగింపులో బోలెడు చెప్తాడు హీరో. ఇది నవలా పద్దతి. సినిమాలో మళ్ళీ ఆడియెన్స్ మొదట్నించీ అన్నీ గుర్తు చేసుకుంటూ హీరో ఇచ్చే వివరణలతో కనెక్ట్ అవడం బోరుకొట్టే బిజినెస్. అందుకని ఎప్పటికప్పుడు తేల్చెయ్యాలి. అందుకే ఫస్టాఫ్ మరణాల రహస్యాన్ని ఫస్టాఫ్ లోనే ఇంటర్వెల్ లో విప్పేశారు.

          సెకండాఫ్ కథ ఎజెండా విలన్ తన బిజినెస్ కి అడ్డుగా వున్నాడని హీరోని చంపే ప్రయత్నాలు చేయడం. హీరో తప్పించుకుంటే అసిస్టెంట్ ని, అసిస్టెంట్ బయటపడితే, హీరోయిన్ ని...ఇలా యాక్షన్ లోకి దిగుతుంది కథ. క్లయిమాక్స్ లో హీరో విలన్ల ముఖాముఖీ. ఇంతే మూడంకాల స్ట్రక్చర్.  

          అన్ని కోణాల్లో సమగ్రంగా వుండే థ్రిల్లర్స్ తీయడం అందరికీ సాధ్యం కాదు. సాధ్యమైనా కూడా ఇంకేవో చాపల్యాలతో చెడగొడతారు. ప్రొఫెషనల్ పాత్రలకి ప్రొఫెషనలిజంతో కూడిన కథ చేస్తేనే ఆ పాత్రలకీ, థ్రిల్లర్ కీ న్యాయం చేసినట్టు; తద్వారా  బాక్సాఫీసు దగ్గర బావుకున్నట్టు.

-సికిందర్