రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, నవంబర్ 2017, బుధవారం

541 : స్క్రీన్ ప్లే సంగతులు





          మధ్య తెలుగు తమిళ భాషల్లో స్పైడర్, లై, సింగం -3, వివేకం అనే నాల్గు పోలీస్ – స్పై ఆపరేషన్లతో కూడిన థ్రిల్లర్లు వచ్చాయి. తెలుగులో తాజాగా వచ్చిన గరుడ వేగ తో కలుపుకుంటే ఐదు. ఈ ఐదింటిలో మొదటి నాల్గూ ఆకట్టుకోలేకపోయాయి. వివేకంతో గరుడ వేగకి దగ్గరి సంబంధముంది. అయితే వివేకంలో లేని ఏకసూత్రత గరుడ వేగలో కన్పిస్తుంది. అలాగే స్పైడర్ లో లేని హీరోయిజం గరుడ వేగ లో కన్పిస్తుంది. సింగం 3 లో కన్పించే టెక్నాలజీ దుర్వినియోగం గరుడ వేగలో కన్పించదు. లైలో మిస్సయిన సెంట్రల్ పాయింటు లోపం గరుడ వేగలో వుండదు. జాతీయ అంతర్జాతీయ సమస్యలపైన ఒక హై కాన్సెప్ట్ మూవీ తీయాలంటే – సింపుల్ గా ఒక సెంట్రల్ పాయింటు, దాంతో హీరోయిజమూ దానికి ఏకసూత్రతా వుండి, టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా వుంటే చాలని ఇందుమూలంగా తెలుసుకోవచ్చు. 

         
థ్రిల్లర్ కి కథనంలో వేగం ముఖ్యమనేది తెలిసిందే. ఏక సూత్రత వల్ల ఈ వేగం  వస్తుంది. గరుడవేగ  థ్రిల్లింగ్ కథనానికి ఏకసూత్రతే ఆధారం.  అయితే ఇదీ ఓ సమస్య బారిన పడింది. ఏకసూత్రతకి  సెకండాఫ్ సిండ్రోమ్ ఎదురయింది. ఫలితంగా ఫస్టాఫ్ స్పీడుని సెకండాఫ్ అందుకోలేకపోయింది. ఇదెలాగో చూద్దాం. ఈ వారం ‘ఇత్తెఫాఖ్’  అనే హిందీ థ్రిల్లర్ విడుదలైన సందర్భంగా, నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఈ సమస్య గురించే చెప్పుకొచ్చారు. థ్రిల్లర్ జానర్ ని హాలీవుడ్ బాగా ప్రోత్సహిస్తూంటే,   బాలీవుడ్ ఎందుకని వెనుకబడి పోతోందన్న ప్రశ్నకి జోహార్ జవాబు :  మనం కథలు చెప్పే తీరే వేరు కావడం,  మనం తీసేవి మెయిన్ స్ట్రీమ్ సినిమాలు కావడం,  థ్రిల్లర్ జానర్ ని దూరం పెట్టేలా చేస్తున్నాయి. మనం పాటలూ డాన్సులూ పెడతాం. సినిమాల్ని మ్యూజిక్ తో కలిపి చూసేందుకు అలవాటు పడ్డాం. ఇది థ్రిల్లర్ తో పొసగదు. థ్రిల్లర్ కి వూపిరి సలపని స్పీడు అవసరం. కనుక మన కల్చర్లో  పాటలూ డాన్సులూ కామెడీలూ ఫ్యామిలీ డ్రామాలూ మొదలైన కమర్షియల్ హంగులు త్యాగం చేసి ఈ రియల్ ఫార్మాట్ తో థ్రిల్లర్స్ ని తీయలేం గనుక వాటిని తక్కువగా  తీస్తూంటాం. మా ఇత్తెఫాఖ్ దర్శకుడు స్క్రిప్టు రాసుకొచ్చినప్పుడు ఇంటర్వెల్ రాయలేదు. థ్రిల్లర్ కి ఇంటర్వెల్ తో వచ్చే సమస్యేమిటంటే, అది సెకండాఫ్ ని బలహీన పర్చేస్తుంది. ఇంటర్వెల్ వరకూ కథని పైపైకి తీసి కెళ్ళి టెన్షన్ తో అపుతాం, ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ అదే  ఆపిన పాయింటు నుంచి టెన్షన్ ని ఎత్తుకుని కథని ఇంకా పైపైకి తీసి కెళ్ళాల్సి వుంటుంది. ఇది చేయలేకే మన సినిమాలు చాలా వరకూ సెకండాఫ్ సిండ్రోమ్ నెదుర్కొంటున్నాయి. ఇంటర్వెల్ కారణంగానే  పదింట ఎనిమిది సినిమాల సెకండాఫులు తేలిపోతున్నాయి. ప్రపంచంలో ఏ సినిమా స్కూలు కూడా ఇంటర్వెల్ ని ఎలా హేండిల్ చేయాలో చెప్పలేవు. మనమే కథల్ని మధ్యకి ఆపి ఇంటర్వెల్ వేసుకుంటున్నాం. ఆతర్వాత ఆపిన కథని లేపలేక చేతులెత్తేస్తున్నాం...

          ఇలా జోహార్ చెప్పిందాంట్లోనే సమస్యకి సమాధానముంది. ఆయన చెప్పిన సమస్యకూడా అవగాహనా రాహిత్యంతో తెచ్చుకున్నదే. మనమే కథని మధ్యకి ఆపి ఇంటర్వెల్ వేసుకోవడం వల్ల సెకండాఫ్ సిండ్రోమ్ ఎదురవుతోందనడం పచ్చి నిజం. కథని ఆపుకుంటే ఇంతే  జరుగుతుంది. ఇంటర్వెల్ దగ్గర కథని ఆపుకోమని ఎవరన్నారు? స్క్రీన్ ప్లే పండితులెవరూ అనలేదుగా? వెళ్తున్న రైలింజన్ ని ఆపేస్తే మళ్ళీ స్పీడందు కోవడానికి రెండుమైళ్ళు లాగాలి. ఇంటర్వెల్లో కథని ఆపుకున్నా ఇంతే.  ఇంటర్వెల్లో కథని ఆపుకుని  సమస్యని మనమే  సృష్టించుకుంటున్నాం. దీనికి ప్రపంచంలో ఎక్కడైనా  పరిష్కారం ఎవరు చెప్పగలరు. మందులేని రోగం తెచ్చుకుని డాక్టర్ కోసం తిరిగితే డాక్టర్లేం చేయగలరు. ప్రయాణంలో వున్న మోటార్ బైకుని ఆపకురా బాబూ అనే అంటారు. ఆపితే స్పీడందు కోవడానికి కొంత టైము పడుతుంది. ఈ టైములో గేర్లు మార్చుకుంటూ తంటాలు పడాలి. ఆపిన కథతో ఇంటర్వెల్ తర్వాత కూడా కథని మార్చుకుంటూ తంటాలు పడాల్సిందే.

ప్రేక్షకుల్ని ఆపుదాం
       ఇంటర్వెల్లో కథని ఆపితే దానికి మందు లేదనే,  హాలీవుడ్ లో ఇంటర్వెల్లో కథని ఆపరు, ప్రేక్షకుల్ని ఆపుతారు. ఇందుకు రివర్స్ లో దాదాపు ఇండియన్ మేకర్లంతా – ఇంటర్వెల్లో కథని అపడంవల్ల, ఆతర్వాత కథని ఎత్తుకోలేక చతికిల బడతారు. కథని ఆపడం వేరు, ప్రేక్షకుల్ని ఆపడం వేరు. 

          మనం ఇంటర్వెల్లో కథని ఆపడమంటే, ఇంటర్వెల్ ని  కథన దృష్టితో  చూస్తున్నా మన్నమాట. దీంతో ఇంటర్వెల్ దగ్గర కథతో ఏవో గిమ్మిక్కులు చేసి, బ్యాంగులిచ్చి (ఇంటర్వెల్ బ్యాంగ్ - పెట్టిన టికెట్టు  చిల్లర డబ్బులకి ఇదొక అడ్డగోలు డిమాండ్ అయిపోయింది ), కథని ఆపి ఇంటర్వెల్ ఇస్తున్నాం.

          వాళ్ళు (హాలీవుడ్)  ఇంటర్వెల్ ని పాత్ర దృష్టితో చూసి, కథని ఆపకుండా, కేవలం కథనుంచి కాస్త రిలీఫ్ కోసం ప్రేక్షకుల్ని ఆపి ఇంటర్వెల్ ఇస్తారు. కథని ఆపడం వేరు, ప్రేక్షకుల్ని ఆపడం వేరు. మనలాగా ఇంటర్వెల్ ని కథన దృష్టితో చూసి, ఇంటర్వెల్ దగ్గర కథని ఆపేస్తే,  ఇంటర్వెల్ తర్వాత ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ తో సరిసమానంగా ఆపిన కథని మళ్ళీ ఎలా ఎత్తుకోవాలో అర్ధంగాక చతికిలబడుతున్నారు. ఇలాకాక ఇంటర్వెల్ ని పాత్ర దృష్టితో వాళ్ళలాగా చూసినప్పుడు, ఇంటర్వెల్ దగ్గర కూడా కథ చలనంలో వుండి, ఇంటర్వెల్ తర్వాత ఆ కథకి కొనసాగింపే వుంటుంది తప్ప, వేరే దారులు వెతుక్కోనవసరం లేదు. దీన్ని బాగా గుర్తుంచుకోవాల్సి వుంటుంది. 

          ఒకప్పుడు వాళ్ళ  సినిమాలు గంటన్నరే వుండేవి. ఈ గంటన్నర నిడివి స్క్రిప్టులో ఇంటర్వెల్ సీనంటూ ఏమీ వుండదు. కేవలం సెకండ్ యాక్ట్ లో మిడిల్ ని రెండు గా విభజించి, మధ్యకి టెన్షన్ పెంచి వదిలేస్తారు. దాన్ని బట్టి సెకండాఫ్ మిడిల్ టూ రాస్తారు. వాళ్ళ  సినిమాలకి ఇంటర్వెల్లో విశ్రాంతి అనే అక్షరాలు పడవు. ముప్పావు గంటో, ఎంతో  గడిస్తే ఆపరేటరే ఆట ఆపేసి  విశ్రాంతినిస్తాడు ప్రేక్షకులకి. అది కథకి విశ్రాంతి నివ్వడం కాదు. ఒక్కో థియేటర్లో ఒక్కో టైములో విశ్రాంతి ఇస్తూంటారు ఆపరేటర్లు.  ఇప్పటికీ ‘డంకర్క్’ లాంటి రెండు గంటల భారీ సినిమాలకి కూడా విశ్రాంతి అంటూ బ్యాంగ్ తో అక్షరాలు పడవు. ఆట నడుస్తూండగా టైము చూసుకుని,  సడెన్ గా లైట్లు వేసి ఆటాపేస్తాడు ఆపరేటర్ మహాశయుడు. వాళ్ళ  సినిమాల్లో టైటిల్స్ తో మొదలెడితే మళ్ళీ చివర్లోనే  అక్షరాలు పడతాయి - ది ఎండ్ అని. 

          నవలల్లో ఇంటర్వెల్ వుంటుందా? నవలల్లో ఎత్తుపల్లాలతో కూడిన కథనం ఒక ప్రయాణ మెలాగో, వాళ్ళ  స్క్రీన్ ప్లేల్లోనూ ఇంతే. ఈ ప్రయాణం మధ్యలో ఆగదు. ముగిసేదాకా కథ ప్రయాణంలోనే వుంటుంది. ప్రేక్షకులకి కాస్త రిలీఫ్ కోసం, కేంటీన్ వాళ్ళ  జీవనం కోసం దయతల్చి ఆపరేటర్ కాసేపు ఆపుకుంటాడు. వాళ్ళ  స్క్రీన్ ప్లేల్లో స్ట్రక్చర్ ప్రకారమే  ఎత్తుపల్లాలతో కూడిన సీన్లుంటాయి గానీ, వాటికీ నంబర్లు కూడా వేయరు. వాళ్ళ  స్క్రీన్ ప్లే లిటరరీ వర్క్. ఫుల్ స్టాప్, కామాలు; అక్షరాలకి నిర్ణీత పాయింటుతో ఫాంట్లు, స్పేసులు, మార్జిన్లు, మొదటిసారి పాత్ర ప్రవేశించినప్పుడు దాని పేరుకి పూర్తి కేపిటల్ లెటర్సూ...ఇలా అనేకానేక సాంకేతికాలు వొళ్ళు దగ్గర పెట్టుకుని పాటించాల్సిన  ప్యూర్ లిటరేచర్. లేకపోతే పరిశీలనార్హం కావు. వాళ్ళ  స్క్రీన్ ప్లే చదవడమంటే నవల చదవడం లాంటిదే.

          మనం కథని ఆపుకుని ఇంటర్వెల్ బ్యాంగంటూ ప్రత్యేక కసరత్తులు చేస్తాం. ఉన్న నవరసాలకి తోడూ ఇదింకో రసమైపోయింది. థియేటర్లోంచి ఎప్పటికప్పుడు సీన్ల తాలూకు లైవ్ అప్డేట్స్ తో కథని  బయటి ప్రపంచానికి అందించేసే గురుతర బాధ్యత మీదేసుకుని, ఒక రకంగా పైరసీకి పాల్పడే రివ్యూ రైటర్ కూడా, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందని చోరీ చేసిన సమాచారాన్ని బయటికి చేరవేసేస్తాడు. ఒక పూట కూడా సినిమాని బతకనీయడు. బయట స్మార్ట్  ఫోన్లు పట్టుకుని క్షణం క్షణం లైవ్ అప్డేట్స్ కోసం ప్రాణాలుగ్గ బట్టుకుని  ఎదురుచూసే ప్రేక్షకులు – ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందట్రోయ్ - అని ఎగిరి గంతేసి టకటకా అడ్వాన్స్ బుకింగులు క్లిక్స్ చేసేస్తూంటారు. వెళ్తే గానీ తెలీదు, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక ఎండమావి అనీ, తర్వాత సెకండాఫ్ అంతా గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేని ఎడారి అనీ! రివ్యూ రైటర్ ఎండమావిని స్మగ్లింగ్ చేశాడనీ!

          ఇంటర్వెల్ అంటే కథని ఆపడంగాక కేవలం ప్రేక్షకుల్ని ఆపడంగా చెప్పుకున్నాక, సిడ్ ఫీల్డ్ ఇంకేమంటాడో చూద్దాం :  “An important scene in the middle of the script, often a reversal of fortune or revelation that changes the direction of the story.” అంటాడు. అంటే, స్క్రిప్టు మధ్యలో అదృష్టం తిరగబడ్డం, లేదా కథా గమనాన్ని మార్చే కొత్త విషయమేదో బయటపడ్డం అన్నమాట. 

          దర్శకుడు, రచయిత ఫ్రాంక్ డేనియల్ కూడా ఇలా అంటాడు : “Mid-Point or a  Major Reversal of fortune, making Main Character’s task even more difficult. May be a glimpse at the actual resolution of the picture, its mirror opposite.” అంటే అదృష్టం తీవ్రస్థాయిలో తిరగబడ్డమే. పైగా గోల్ కోసం హీరో చేసే ప్రయత్నం కనా కష్టమై  పోవడం. ముగింపు అనే దర్పణంలో చూస్తే నెగెటివ్ గా ఈ తిరగబడ్డ అదృష్టం, తన్నుకొచ్చిన అదృష్టంగా పాజిటివ్ గా కన్పించడం. 

          ఇంటర్వెల్ కి మిర్రర్ ఇమేజి సూత్రమని ఒకటుంది. దీని ప్రకారం- ఇంటర్వెల్లో హీరో దెబ్బతింటే, ముగింపులో దీని ప్రతిబింబం గెలుపుగా వుంటుంది. ఇంటర్వెల్ హీరో దెబ్బ తీస్తే, ముగింపులో దీని ప్రతిబింబం ఓటమిగా వుంటుంది. ఇంటర్వెల్లో హీరో సుడిగుండంలో పడితే ముగింపులో ఒడ్డున పడతాడు. ఇంటర్వెల్లో హీరో ఒడ్డున పడితే ముగింపులో సుడిగుండంలో మునిగిపోతాడు. పరస్పర వ్యతిరేకంగా వుంటాయి ప్రతిబింబాలు.

          అంతేగానీ, ఇంటర్వెల్లో దెబ్బ తీసిన హీరో, లేదా ఒడ్డున పడ్డ హీరో, ముగింపులో గెలవడం వుండదు, ఒడ్డున పడ్డం వుండదు. అలాగే ఇంటర్వెల్లో దెబ్బతిన్న హీరో, లేదా సుడిగుండంలో పడ్డ హీరో,  ముగింపులో ఓడిపోవడం వుండదు, సుడిగుండంలో పడ్డం వుండదు.  గరుడ వేగ ఏకసూత్రతా  పాలనకి ఇక్కడే ఎదురయ్యింది సమస్య. ఇక్కడే చికిత్స జరగాలి- ఇంటర్వెల్ ఘట్టంలో.

ఇదేం టీజర్ 
       గరుడ వేగ కథా ప్రారంభం డార్జిలింగ్ లో ఒక సుదీర్ఘ యాక్షన్ ఎపిసోడ్ తో వుంటుంది.  ఒక మైనర్ పాత్ర కంప్యూటర్ / శాటిలైట్  ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఏదో డేటాని మ్యానిపులేట్ చేస్తాడు. అతణ్ణి  ముగ్గురు మోటార్ సైకిలిస్టులు వెంటాడతారు. సినిమాకి ఓపెనింగ్ ఇమేజి లేదా టీజర్ అనేది ఆ సినిమా ఏ జానర్ లో,  ఏ ఇతివృత్తమో సంకేతాలిస్తుంది. ఇక్కడ ఈ మైనర్ పాత్ర చర్యలతో ఓపెనింగ్ ఇమేజి లేదా టీజర్ చూస్తే యాక్షన్ జానర్ లో టెర్రరిజం కథలా అన్పిస్తుంది. కానీ కాదు. తప్పుదోవ పట్టించారు. ఈ తప్పుదోవ పట్టించడం ఇంటర్వెల్ పై దాకా సాగింది. కనుక ప్రారంభమే ఈ టీజర్ ఒక స్పష్టత లేకుండా మభ్య పెట్టే టీజర్ గా  ఫెయిలైంది. ఓపెనింగ్ ఇమేజిగా టెర్రరిస్టులా అన్పిస్తున్న ఈ మైనర్ పాత్రతో యాక్షన్ ఎపిసోడ్ సాగదీసి సాగదీసి, అవే పట్టుకునే  ప్రయత్నాలని రిపీట్ చేసి రిపీట్ చేసి, సుమారు పది నిమిషాల వరకూ లాగడంలో విజ్ఞత కన్పించదు. ఈ ఎపిసోడ్  హీరో మీద వుంటే ప్రేక్షకుల్లో కలిగే ఉత్సాహం వేరు.  మైనర్ పాత్రకి ఇంత మైలేజీ ఇవ్వడంలో ఔచిత్యం కన్పించదు. ఈ మైనర్ పాత్రని విలన్ వెంటాడినా యాక్షన్  ప్రాముఖ్యాన్ని సంతరించుకునేది. ఇలా సినిమాకి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీతో వుండే హీరో మీద కాకుండా, విలన్ మీద కూడా కాకుండా, కేవలం మైనర్ పాత్రలతో అంత ఖర్చుతో ఓపెనింగ్ టీజర్ కి విలువేం వుంటుంది. సీను చేసేప్పుడు మార్కెట్ యాస్పెక్ట్ ని దృష్టిలో వుంచుకోవాలిగా.

ఇలాగేనా ఈ ఫార్ములా 
           దీని తర్వాత, రాజశేఖర్ హీరో పాత్ర ప్రవేశిస్తుంది. అతను  భార్యతో కలిసి కౌన్సెలింగ్ చేసే అలీ ఆఫీసులో వుంటాడు. ఎన్ ఐ ఏ అధికారియైన భర్త ఇంటి పట్టున వుండడం లేదని ఆమె విడాకులకేసింది. కోర్టు  వీళ్ళిద్దరికీ కౌన్సెలింగ్ చేయమని అలీని నియమించింది. భర్తకున్న ఇబ్బందుల్ని ఆమె అస్సలు పట్టించుకోదు. చివరికి భర్తే లొంగి వస్తాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి సమయమంతా ఆమెకే  కేటాయిస్తానని మాటిస్తాడు.

        నిజానికి ఈ భార్యాభర్తల ట్రాకు కథకి అడ్డుపడే ట్రాకు. కారణం, ఇది జానర్ మర్యాదతో కలసిపోకుండా కామెడీగా వుండడం. వివేకంలో కూడా అజిత్ – కాజల్ భార్యాభర్తల మధ్య దృశ్యాలు అతి  మెలోడ్రామాతో, ఫాల్స్ డ్రామాతో  ఇబ్బంది పెట్టేలా వుంటాయి. పానకంలో పుడకలా ఈ దృశ్యాలు వచ్చినప్పుడల్లా తెలుగు థియేటర్లో  తమిళ ప్రేక్షకులే తల పట్టుకున్నారు. ఇది హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్న ఫార్ములా. కానీ హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో యాక్షన్ లో వుండే హీరో పాత్రకి రక్తమాంసాలు అద్దడానికి ఎమోషనల్ ట్రాక్ పెడతారు. సాధారణంగా కథల్లో ఏ హీరో పాత్రకైనా అంతర్గత (ఎమోషనల్), బహిర్గత (ఫిజికల్) యాక్షన్ లుంటాయి. బహిర్గతంగా స్టోరీ గోల్ కోసం పోరాడుతూ, అంతర్గతంగావ్యక్తిగత సమస్యని ఎదుర్కొంటాడు. ‘శివ’ లో నాగార్జునకి బయట రఘువరన్ తో పోరాటం, ఇంట్లో వదినతో ఇబ్బంది లాంటిదన్నమాట. 

          ఈ ద్వంద్వాల పోషణతో పాత్రకో వ్యక్తిత్వం వస్తుంది. దాంతో సానుభూతి పొందుతుంది. అప్పుడే పాత్రని మనం పట్టించుకోగల్గుతాం. ఇలాకాకుండా, బహిర్గత సమస్యకున్న గాఢత్వం అంతర్గత సమస్యకి లేకుండా కామెడీ గా, వెటకారంగా  వుంటే, ఇదిగో ఇలా రాజశేఖర్ – పూజా పాత్రల గొడవలా జానర్ మర్యాదని దెబ్బతీస్తుంది. ఈ పాత్రల్ని మనం పట్టించుకోం. ఇలాటి సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకుల్ని కూడా ఆకర్షించాలన్న ఆదుర్దా కొద్దీ ఇలా జానర్ ని కిచిడీ చేస్తారేమో. మన మెయిన్ స్ట్రీమ్ సినిమాలిలా వుంటాయి కాబట్టే థ్రిల్లర్లు తీయలేమని  సరీగ్గానే చెప్పాడు జోహార్. హాలీవుడ్ యాక్షన్ హీరోల పాత్రలు కుటుంబంకోసం ప్రాణాలిస్తాయి. అలాటి గొప్ప పాత్రలున్న సినిమాలు  కొన్ని – డై హార్డ్ (బ్రూస్ విల్లీస్), కమెండో(ష్వార్జ్ నెగ్గర్), ట్రూ లైస్ (ష్వార్జ్ నెగ్గర్), టేకెన్ (లియాం నీసన్), లాక్ స్టాక్ అండ్ టూ స్మోకింగ్ బ్యారెల్స్ (జేసన్ ఫ్లెమింగ్) మొదలైనవి. రక్త మాంసాలతో వాళ్ళ  ద్వంద్వాల పోషణ వేరు.

          అసలు మన సినిమాల్లో హీరోకి అప్పుడే పెళ్ళీ పిల్లలూ అనే గొడవ బాక్సాఫీసు అప్పీల్ కాదనే  భయం వుండనే వుంది. హాలీవుడ్ వేరు. మన హీరో రోమాన్సు వెలగబెట్టాలి. పూర్వం ఇలాటి ఆపరేషన్స్ తో కూడిన  సినిమాల్లో హీరోయిన్ ని ప్రేమించే హీరోకి రోమాన్సే వుండేది. ఇది అప్పటి జేమ్స్ బాండ్ పాత్రనుంచి దిగుమతి అయింది. జేమ్స్ బాండ్ హీరోయిన్లతో ఆడుకునే అతిపెద్ద రోమాంటిక్ క్యారెక్టర్. ఇదే మనకి సరిపోతుంది- బాక్సాఫీస్ అప్పీల్ కీ, యూత్ అప్పీల్ కీ. హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో వుండే ఫ్యామిలీ హీరోని దిగుమతి చేసుకుని పరువుతీయడంకాదు. వాళ్ళు యాక్షన్ పాత్రకి ఏ ఉద్దేశంతో ఫ్యామిలీ బాండింగ్ పెడతారో అర్ధం జేసుచేసుకోవాలి. శివ, అంకుశం చూసినా అర్ధమవుతుంది.  

          ఇక ఈ భార్యాభర్తల మధ్య భార్య ప్రోత్సహించే భావి భర్త పాత్రలో అవసరాల శ్రీనివాస్ వస్తాడు. ఈ ముగ్గురి మధ్య ఇంకో  కామెడీ. కానీ భర్త జాబ్ కి రిజైన్ చేసి తనని బాగా చూసుకుంటానని మాటిచ్చాక  భార్యకి ఇంకో ఆలోచనెందుకు? వీళ్ళ మధ్య ఇంకా ఓ ఐదేళ్ళ కొడుకు! భార్యతో భర్తకి ఈ గొడవ ఎప్పుడు సద్దుమణిగింది? రొటీన్ పాత ఫార్ములాగా క్లయిమాక్స్ లో విలన్ భార్యని ఎత్తుకెళ్ళి బంధించినప్పుడు ఆమె పీచమణిగింది! క్లయిమాక్స్ యాక్షన్ దృశ్యాల మధ్య ఈ భార్యాభర్తల కామెడీ గొడవతో ఇది కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని చిన్న ఆశ కథకుడికి. ఇంకేం, ఫ్యామిలీ వుంది, చైల్డ్ సెంటిమెంట్ వుంది, కామెడీ వుంది, యాక్షన్ వుంది, ధాబా సాంగ్ తో, వేశ్యల కోలాహలంతో  మాస్ కూడా వుంది....జోహార్ భయపడే వన్నీ వున్నాయి ఈ మేజర్ థ్రిల్లర్ లో – ఒక్క అవసరమైన రోమాన్సు తప్ప!

ఇలాగేనా విజువల్ మీడియా 
      హీరోకి భార్యతో కౌన్సెలింగ్ సీను అయిపోయాక యాక్షన్ లోకి దిగుతుంది కథ. హీరో కారుకి ఒక చిన్న యాక్సిడెంట్ తో ప్రారంభమయ్యే యాక్షన్ ఎపిసోడ్లు, ఓపెనింగ్ టీజర్ తో అభిప్రాయం కల్గించినట్టు, టెర్రరిజం కథలానే అన్పిస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ముస్లిం ఉగ్రవాద పాత్రలే.  కానీ ఇది ఉగ్రవాద కథ కాదు, మైనింగ్ మాఫియా కథ. ఇది సెకండాఫ్ లో మనకి తెలుస్తుంది. ఆ మాఫియాకి వేరే సాఫిస్టికేటెడ్ గ్యాంగ్ వుంటారు. ఆ మాఫియా ఫస్టాఫ్ లో చేపట్టిన కుట్రకి ఆ గ్యాంగునే ఉపయోగించుకోవాలి. ఉగ్రవాద పాత్ర లెందు కొస్తాయి. మాఫియా  కథల్లో ఉగ్రవాదులు, ఉగ్రవాద కథలో మఫియాలూ వుంటారా? బాలీవుడ్ లో ఇలా జానర్ మర్యాద తప్పి తీశారా? అసలు ఫస్టాఫ్ అంతా ఇది టెర్రరిజం కథ అని ప్రేక్షకులకి అన్పించాలని దర్శకుడు భావించడం లోని ఉద్దేశం ఏమిటి? 

          ఒకటే కారణం. చెప్పాలనుకున్న మైనింగ్ మాఫియా కథని ఎండ్ సస్పెన్స్ కథగా చెప్పడం. సెకండాఫ్ లో ఆ మైనర్ పాత్ర ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడే  కథలోని సెంట్రల్ పాయింటు రివీల్ అవుతుంది. అంతవరకూ ఇది మైనింగ్ మాఫియా కథ అని ఆడియెన్స్ పసిగట్టకుండా సస్పెన్స్ లో వుంచాలనుకున్నారు. దీంతో మూడు జరిగాయి : కథ ఎండ్ సస్పెన్స్ బారిన పడ్డం, దీంతో విజువల్ మీడియా బేసిక్ రూలు చెడడం, ఫస్టాఫ్ లో మాఫియా పాత్రల బదులు అసహజంగా ఉగ్రవాద పాత్రల్ని చూపించడం. దీంతో ఆ మత వర్గం మీద ఏదైనా కోపం వుంటే అది కూడా తీర్చుకోవడానికి పనికొచ్చింది - ఉగ్రవాదుల్ని  వ్యానులో పడేసి టోకున కాల్చి చంపేసి ఓల్డ్ సిటీలో!  తెలియక చాలా అర్ధాలు వచ్చేలా చేసుకున్నాడు కథకుడు. 

          విజువల్ మీడియా అయిన సినిమాకి, సినిమా కొచ్చి కథని దాచకూడదన్న బేసిక్ రూలుంది. మహా అయితే ఇంటర్వెల్ దాకా దాచుకోవచ్చు. సెకండాఫ్ మధ్య వరకో, ఇంకా చివరి దాకో దాస్తామంటే విజువల్ మీడియాకి వర్కౌట్ కాదు. ఎండ్ సస్పెన్స్ పనికి రాదు. దీని గురించి ఇదివరకే చాలాసార్లు వివరించుకున్నాం. 

          ఇక ఉగ్రవాదులు ఎందుకు బాంబు దాడి చేస్తున్నారనేదానికి ఇంకో  మసిపూసి  ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించారు. ఓల్డ్ సిటీలో ప్రతాపరెడ్డి అనే రాజకీయనాయకుడు ర్యాలీ నిర్వహిస్తున్నాడు. అతణ్ణి టార్గెట్ చేశారు ఉగ్రవాదులు. ఎందుకు? ఎందుకనే దానికి జెండాలు చూపించారు. అవి కాషాయానికీ  ఎరుపుకీ మధ్య వుంటాయి. అంటే పూర్తిగా ఇక్కడ మత కోణాన్ని చూపించి ఉగ్రవాద పాత్రల్ని  జస్టిఫై చేశారన్న మాట, మభ్య పెట్టారన్న మాట. 

          సెకండాఫ్ లో ప్రారంభమయ్యే కథలోకి వెళ్తే,  ఫస్టాఫ్ లో మభ్య పెట్టిందంతా తెలుస్తుంది. మైనింగ్ మాఫియా అనుయాయుల్లో ప్రతాపరెడ్డి కూడా ఒకడు. అతడితో తేడా వచ్చి
చంపాలనుకుంటే ఇంటికెళ్ళి ఓ గుండు పేలిస్తే చాలు. మాఫియా కథలో మతకోణంలో ఉగ్రవాదులతో  బాంబు దాడి హంగామా అంతా  ఎందుకు? అప్పుడు ఫస్టాఫ్ లో చూపించిన కథంతా డొల్ల అన్నట్టే కదా? కథని సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ దగ్గర్నుంచి పెట్టుకుంటే సరిపోతుంది కదా? ఓ గంట నిడివితో తీస్తే సరిపోయే కథని, బోలెడు బడ్జెట్ ధారబోసి రెండుగంటల పైగా తీయాల్సిన అవసరం తప్పుతుంది కదా? మూలంలోకి వెళ్తే ఈ నిజాలే వుంటాయి.  

         సినిమాని సినిమాలాగా చూడాలనడం అర్ధంలేని మాట. సినిమాని సినిమాలాగా చూడ్డమంటే ఏంటో ఎవరూ చెప్పలేరు పైగా. సినిమాకి మూలమయ్యే కథని కూడా కథలాగా చూడకూడదనేనా? మరెందుకు  నూటికి తొంభై సినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి?  కథ కథలాగా లేకపోవడం వల్లేనా? లేకపోతే మరెందుకు? కథని కూడా కథలాగా చూడకూడదా?  మేస్త్రీ అడ్డగోలుగా కట్టేసిపోతే ఆ ఇంటిని ఇల్లులాగా చూడవచ్చా? సినిమాలెలా తీసి చూపించినా కళ్ళప్పగించి  చూసెయ్యాలా? సినిమా నిరక్షరాస్యులమని అన్పించుకుని తిరగడం గొప్ప నాగరికతేమో! 


      
         ఒకటే వుంది -  అన్ని కళా ప్రక్రియల్లో మాస్ మీడియా ఆయిన సినిమాలకి సృజనాత్మక స్వేచ్చ తీసుకునే వీలెక్కువ. అలాగని మాసే కదాని నేలవిడిచి సాము చేస్తే చేసుకోవచ్చు. కానీ ఆ లాజిక్ ని ఎగేయడానిక్కూడా హద్దులున్నాయి. అలాగే  అసలుకే మభ్యపెట్టి ఎస్కేప్ అవచ్చులే అనుకుంటే బ్యాడ్ టేస్టు అవుతుంది. మాఫియా కథని సస్పెన్సులో వుంచాలని టెర్రరిజం కథలా నమ్మిస్తూ  నడపడం ఇలాంటిదే. 

          కాకపోతే సినిమా హిట్టయ్యింది. ఇందుకు అనుసరించిన విధానం ప్రేక్షకులని ఆలోచించనివ్వకుండా, ఫస్టాఫ్ లో ఓ ఐదు భారీ యాక్షన్ ఎపిసోడ్లని ఒకదాని వెంటొకటి శరవేగంగా నడపడం; టెన్షన్ ని పెంచుతూ కళ్ళప్పగించి చూసేలా చేయడం. ఐతే ఇంటర్వెల్ దగ్గర దొరికిపోయారు. ఇంకెంత మాత్రం మాయ చేయలేకుండా సంకెళ్ళు వేసుకున్నారు. 

          ఫస్టాఫ్ లో అసలు కథ దాచి ఇంకేదో కథతో మభ్యపెడుతున్నామని తెలియనివ్వ
కుండా చేయడానికి ఏకదాటి యాక్షన్ ఎపిసోడ్లు వేశారు.  మారుతీ దర్శకత్వంలో నానీ నటించిన ‘భలే భలే మగాడివోయ్’ లో పాత్ర  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని ఎగేస్తూ సాగిపోతుంది. అది పెద్ద హిట్టయ్యింది. దీని రహస్యం ప్రతీ పది నిమిషాలకోసారి నాని పాత్ర బ్యాంగు లిస్తూ పోవడం. ఎడ్డీ మర్ఫీ తో ‘బేవర్లీ హిల్స్ కాప్’  సిరీస్ సినిమాలు తీసిన నిర్మాత ఫువాద్ సయీద్,  ఆ సినిమాల్లో పది నిమిషాలకో బ్యాంగ్ వుండాలని పెట్టించేవాడు. అయితే కథ స్ట్రక్చర్ లోనే వుండేది.  నాని పాత్ర మాత్రం స్ట్రక్చర్ నే ఎగేస్తూ బ్యాంగులతో సక్సెస్ అయిపోయింది.

          అలాగని  సెకండాఫ్ లో అసలు కథని దాచడం కోసం ఫస్టాఫ్ లో వేరే ఫాల్స్ స్టోరీతో మభ్యపెట్ట డాలు గానీ, తప్పుదోవ పట్టించడాలూ గానీ  చేయలేదు. మొదలెట్టిన కథే ఓపెన్ గా సాంతం సాగుతుంది. గరుడవేగ ఫాస్ట్ యాక్షన్ తో ఎంత హిట్టయినా కథతో నిజాయితీ లేదు. పరిశుభ్రమైన కథనివ్వలేదు.

ఇంకా బిగినింగేనా 
        ఫస్టాఫ్ లో యాక్షన్ లోకి దిగుతూ, హీరో కారుకి ప్రమాదవశాత్తూ చిన్న యాక్సిడెంట్ చేసిన దుండగుల కోసం హీరో తన బృందంతో చేసే వేట ఎపిసోడ్ – ఒకణ్ణి అనుకోకుండా చంపెయ్యడంతో ముగుస్తుంది. అప్పుడొక ఎన్క్రిప్ట్ చేసిన సీక్రెట్ కోడ్ దొరుకుతుంది. దాన్ని హ్యాక్ చేస్తే  చార్మినార్ దగ్గర ప్లాన్ చేసిన బాంబు దాడి పథకం తెలుస్తుంది. సమయం మూడు గంటలే వుంది. ఈలోగా ఆ టెర్రరిస్టుల్ని కనిపెట్టి బాంబు దాడిని ఆపాలి, ప్రతాపరెడ్డిని కాపాడాలి. ఈ ఆపరేషన్ సమయం ముంచుకొస్తూ రకరకాల మలుపులు తిరుగుతూ ఉద్విగ్నభరితంగా  సాగుతుంది.  చివరి క్షణాల్లో  బాంబు ఎక్కడుందో కనుగొని. ఆ సమీపంలో టెర్రరిస్టుల్ని పట్టుకుని కాల్చిచంపేస్తారు. ఆ సందోహంలోంచి  పారిపోతూ కన్పిస్తాడు – సినిమా ప్రారంభంలో ఓపెనింగ్ టీజర్ లో కన్పించిన మైనర్ పాత్ర. అతణ్ణి ఛేజ్ చేసిచేసి హీరో పట్టుకోవడంతో-  ఒక విజయంతో ప్రేక్షకుల హర్షాధ్వానాల మధ్య ఇంటర్వెల్ పడుతుంది.

          ఇంతవరకూ ఇదంతా బిగినింగ్ విభాగమే. ఈ బిగినింగ్ కూడా ఇంటర్వెల్ కి పూర్తి  కాలేదు. ఎందుకంటే, కథేమిటో ఇప్పటికీ తెలీదు మనకీ, హీరోకీ. హీరో ఇంకా కథలోకి  ప్రవేశించనే లేదు. అంటే ఇంకా సెకండాఫ్ లో ఎక్కడో ఈ బిగినింగ్ ముగిసి, అప్పుడు కథేమిటో తెలిసి, ఆ హీరో చేపట్టాల్సిన అసలు సమస్యేమిటో  తెలిసి, గోల్ ఏర్పడితే గానీ ప్లాట్ పాయింట్ వన్ అనేది రాదన్నమాట. ఎప్పుడో ఫస్టాఫ్ లో అరగంట ముప్పావుగంట లోగా రావాల్సిన ప్లాట్ పాయింట్ వన్,  సాగదీసిన ఉపోద్ఘాతం (బిగినింగ్) వల్ల స్థానభ్రంశం చెందిందన్న మాట. స్ట్రక్చర్ చెదిరిపోయిందన్న మాట. మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయిందన్న మాట. అంతే గాకుండా, ఇదంతా ఎందుకు జరుగుతోందో హీరోకి కూడా తెలియకుండా మాఫియా కుట్ర ని దాచి పెట్టడం వల్ల,  ఎండ్ సస్పెన్స్ బాపతు విజువల్ మీడియాకి పనికి రాని కథగా తయారయ్యిందన్న మాట.

          ఫస్టాఫ్ స్ట్రక్చర్ లో వుండాల్సినవి :
          బిగినింగ్ విభాగం : 1. ఇతివృత్త పరిచయం, 2. పాత్రల పరిచయం, 3. సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, 4. సమస్య ఏర్పాటు (గోల్) తో ప్లాట్ పాయింట్ వన్ రావడం.
          మిడిల్ వన్ విభాగం : 1. గోల్ కోసం సమస్యతో సంఘర్షణ, 2. వ్యతిరేక శక్తులతో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే, 3. పించ్ వన్ ఏర్పాటు : ఇంటర్వెల్ కి దారి తీసే మలుపు, 4. ఇంటర్వెల్ లో పరిస్థితి మరింత విషమించడం.
          ఇంకా వీటన్నిటి ఆధారంగా 1. ఎత్తు పల్లాల క్యారక్టర్ ఆర్క్ ఏర్పడడం, 2. దీంతో టైం అండ్ టెన్షన్ చాపం ఏర్పడ్డం.  

          ఈ మొత్తం 10 ఎలిమెంట్సూ లేవు. ఫస్టాఫ్ లో బిగినింగ్ విభాగం ఒకటే వుంది, అదికూడా స్పీల్ బెర్గ్ చెప్పినట్టు ఎంతకీ ముగియని బిగినింగ్. ఈ కాలంలో కథ చెప్పడం మర్చిపోవడం వల్ల బిగినింగే, అదికూడా ఎంతకీ ముగియని బిగినింగే కథ అనుకుంటున్నారని ఛలోక్తి విసిరాడు స్పీల్ బెర్గ్.

          ఈ బిగినింగ్ లో కూడా ఇతివృత్త మేమిటో చెప్పకుండా, ఉగ్రవాద కలరిచ్చి మభ్య పెట్టారు. పాత్రల పరిచయ విషయాని కొస్తే ఇటు వైపు హీరోతప్ప, అటు వైపు విలన్ ఉనికి ఏదీ? ఆటకి సిద్ధం చేసే బలాబలాల సమీకరణ ఏదీ? ఇతివృత్తాన్నే సెకండాఫ్ లో ఓపెన్ చేయడానికి దాచి పెట్టాక, ఇక దాని తాలూకు  సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన కూడా లేదు. సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనే లేకపోయాక ఆ సమస్యా స్థాపనే లేదు, గోల్ లేదు, దీంతో ప్లాట్ పాయింట్ వన్ తో బిగినింగ్ ముగిసిందీ లేదు. ఇక మిడిల్ వన్ ఎక్కడ్నించి వస్తుంది ఫస్టాఫ్ లో? 

          క్యారక్టర్ ఆర్క్, టైం అండ్ టెన్షన్ ఎలాగూ వుంటాయి- ఎందుకంటే ఫస్టాఫ్ లో చూపిస్తున్నది ఫాల్స్ స్టోరీ అయినా, దాని తాలూకు థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ వున్నాయి కాబట్టి- మనంకూడా ఫాల్స్ అని తెలీక ఫాల్సుగా థ్రిల్లవుతూంటాం. ఫూల్స్ అవుతాం. 

          ఈ మొత్తం ఫస్టాఫ్ ఆటలో హీరో అరటి పండు అయిపోయాడు. ఎన్ ఐ ఏ ఆఫీసరుగా అతడికేమీ తెలీదు. ఏది ఎందుకు జరుగుతోందో ఏమీ తెలీదు. ప్రతీసారీ ఏదో జరుగుతూంటే దాన్ని పట్టుకుని యాక్షన్లోకి దిగుతున్నాడు – సరే, ఇలా చేసినా కూడా ఆ మైనింగ్ మాఫియా ఎవరో, వాళ్ళ కుట్రేమిటో ఇంటర్వెల్లో నైనా షాకింగ్ గా తనే తెలుసుకుని, ప్రేక్షకులకి కూడా ఓ షాకిచ్చి వుంటే,  కథ అక్కడే ప్రారంభమై పోయేది. గోల్ ఏర్పడేది. కనీసం ఆ ఇంటర్వెల్ కైనా ప్లాట్ పాయిట్ వన్ తో బిగినింగ్ ముగిసేది!

          ఇలా చేయలేదు సరికదా, అసలు తను పాల్గొంటున్న కథేమిటో
తనకే తెలీని అమాయకత్వంతో హీరో వుంటూ, ఇంటర్వెల్లో తను పట్టుకున్న నిరంజన్ అనే ఆ మైనర్ పాత్ర ఆపైన సెకండాఫ్ లో చెప్తేనే గానీ తెలుసుకోడు  హీరో!

          కాబట్టి పూర్తిగా ఇది పాసివ్ పాత్రయింది. భీకర యాక్షన్ చేసినంత మాత్రాన యాక్టివ్ పాత్రై పోడు. పాసివ్ - రియాక్టివ్ పాత్రవుతాడు. తనకేదో జరిగితేనే రియాక్టై తిప్పి కొడుతూ వుండేవాడు పాసివ్ – రియాక్టివ్. ఎందుకు జరుగుతోందో తెలుసుకుని, ఆ విలన్ కి తనే జరిపించే వాడు యాక్టివ్ క్యారక్టర్. అలా యుద్ధాన్ని మొదలెట్టే వాడు అసలైన హీరోయిజం గల హీరో. 

          ఈ ఫస్టాఫ్ లో చూపించిన కథాకమామీషంతా ఎలా చూపించినా అలాగే ఓకే అనేసు కుందాం కాసేపు మాస్ మెంటాలిటీతో. సర్లే,  ఇంతోటి ప్రేక్షకులకి ఇంతకంటే అద్భుత బొమ్మ చూపించే  మేధోమధన చాకిరీ అంతా ఎందుకు - ఏదో ఇంత సద్ది పడేస్తే సద్దుమణిగిపోతుంది కదా వాళ్ళ ఆకలను కుంటే – ఇది కూడా రైటే! కమర్షియల్ సినిమా అంటేనే అంత. ప్రేమలో- యుద్ధంలో- కమర్షియల్ సినిమాల్లో ఏదైనా రైటే కదా! కానీ, అలా రైట్ అనుకుని చూపిస్తూ పోయిందే ఆ తర్వాత ముందుకు సెకండాఫ్ లోకి వెళ్ళనివ్వని  అడ్డుకట్ట వేసేస్తే అప్పుడేమిటి? సెకండాఫ్ అంతా రాంగుల రంగేళీయేనా? 

          ఫస్టాఫ్ అంతా ఏకసూత్రతతో లోపాలన్నీ కప్పిపుచ్చుతూ (అవి లోపాలని కథకుడికి తెలుసో లేదో) యమ ఫాస్టుగా నడిపి శభాష్ అన్పించుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ వారెవ్వా అన్పించారు. తర్వాతేమిటి? ఆ పట్టు విడవని యాక్షన్ అనే ఏకసూత్రత అంతా  ఏమైంది? సెకండాఫ్ లో అదే  ఫాస్టు కథనం ఎందుకు లేదు? ఏదేదోగా ఎందుకు మారిపోయి చతికిలబడింది కథ? ఇది తెలుసుకోవడానికి మొహమాటపడకుండా  ఇంటర్వెల్ ఘట్టాన్ని పోస్టు మార్టం చేయాలి. 

ఇంటర్వెల్ ఇరకాటం 
     ఇంటర్వెల్లో  కథని ఆపకుండా ప్రేక్షకుల్ని ఆపాలని పైన చెప్పుకున్నాం. చాలా పూర్వం ఇంటర్వెల్ తో సమస్య వస్తే, ఇదే పని చేశాం ( ఆ కథ తెరకెక్కలేదు వేరేసంగతి). లేత హీరో విలన్ తాలూకు ఇద్దర్ని లేపేసి, పారిపోయి వచ్చి ఫ్రెండ్స్ రూమ్ లో దాక్కుంటాడు. ఈ లేత హీరో ముదరడానికి సెకండాఫ్ లో ఇంకా టైముంది. అలా దాక్కుని బాస్ కి కాల్ చేస్తాడు. బాస్ వస్తున్నానంటాడు. హీరోకి ధైర్యం వస్తుంది. ఎదుటి బాస్ అయిన విలన్ కూడా బయల్దేరి వస్తూంటాడు. ఇప్పుడేం చేయాలి? బాస్ లిద్దరికీ బయటే ఘర్షణ  పెట్టి హీరోని తప్పించాలా? బాస్ వచ్చాడన్న ధైర్యంతో వున్న హీరో, ఫ్రెండ్స్ తో కలిసి  విలన్ తో కలబడాలా? విలన్ పారిపోవాలా? ఇలా ఒక విజయంతో ఇంటర్వెల్ వేయాలా?

          ఇదే...ఇంటర్వెల్లో ఇలా పైచేయి   చూపిస్తేనే  కథాగిపోతుంది. దీనికి సెకండాఫ్ లో అతుకులేసి మళ్ళీ ఇద్దరు బాస్ ల మధ్య అదే ఆధిపత్యపు కథని పునఃప్రారంభించాల్సి వస్తుంది. ఎన్నిసార్లు ప్రారంభిస్తాం. ప్రారంభించడం బిగినింగ్ లోనే  జరిగిపోయింది. మళ్ళీ మిడిల్ టూలో ప్రారంభించడమేమిటి?  అప్పుడది మిడిల్ టూ ఎలా అవుతుంది - మళ్ళీ  బిగినింగే అవుతుంది. కథ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది. 

          కాబట్టి ఈ  ఇంటర్వెల్ క్యాన్సిల్ అయింది. నడుస్తున్న మిడిల్ వన్ నుంచి ఇంటర్వెల్ తర్వాత,  కథ మళ్ళీ బిగినింగ్ లో పడకుండా,  మిడిల్ టూలోనే పడి అలాగే కంటిన్యూ అవాలంటే, చలనంలో వుండాలంటే,  ఏం చేయాలి? 

          ఒకటే చేశాం. వస్తానన్న బాస్ బయల్దేరి వస్తున్నట్టు ఆడియెన్స్ కి చూపించాం. ఎదుటి బాస్ కూడా తన హాకీ స్టిక్స్ గ్యాంగ్ తో భీకరంగా బయల్దేరి వస్తున్నట్టు ఆడియెన్స్ కి మాత్రమే చూపించాం. రూమ్ లో హీరో అండ్ ఫ్రెండ్స్ ఉద్రిక్తత చూపించాం. విలన్ కూడా బయల్దేరి వస్తున్నట్టు వీళ్ళకి తెలీదు. కానీ రాకుండా ఆగడని గట్టి నమ్మకం. బాస్ ముందే రావాలని కోరుకుంటారు. అంతలో తలుపు కొట్టిన చప్పుడవుతుంది. ఎవరు? ఎవరో తెలీదు. పలకరు. తలుపు మాత్రం కొడుతూంటారు. బాసా, విలనా? తీయాలా, వద్దా? తలుపు మోగిపోతూంటుంది. ఏమైతే అయిందని వెళ్లి గడియ తీసేస్తాడు హీరో. తీసి మెల్లగా తలుపు తెరుస్తూంటే... ఇంటర్వెల్ పడుతుంది. 

          దీంతో కథ ఆగిందా? ఇంటర్వెల్లో కథని ఆపినట్టుందా, ప్రేక్షకుల్ని ఆపినట్టుందా? సీన్ మాత్రమే మధ్యలో ఆగింది. సీనస్ ఇంటరప్టస్ టెక్నిక్ తో. ఈ సీన్లో ఏం జరుగుతుందో పూర్తిగా చూపించకుండా, ప్రేక్షకుల్ని కాస్తాగమన్నాం,  ఉత్కంఠకి లోనుజేస్తూ. తలుపు తీస్తే అవతల ఎవరొచ్చారనేది సస్పెన్స్. 

          దీని లాభం : మిడిల్ వన్ కథ సాఫీగా మిడిల్ టూ లోకి ప్రయాణిస్తుంది, తెగిపోదు. ఇంటర్వెల్ తర్వాత మధ్యలో ఆపిన ఇంటర్వెల్ సీనుని రీప్లే చేసి, పూర్తిగా చూపిస్తే,  అప్పుడా వచ్చిన పాత్రతో కథ కొనసాగుతుంది.

గరుడ కథన దృష్టి 
     ఈ వ్యాస ప్రారంభంలో ఇంటర్వెల్ ని కథన దృష్టితో చూస్తే కథాగిపోతుందనీ, అదే పాత్ర దృష్టితో చూస్తే  ప్రేక్షకుల్ని ఆపినట్టు అవుతుందనీ చెప్పుకున్నాం. ఇప్పుడు పై ఇంటర్వెల్ ని కథన దృష్టితో చూస్తే ఎలా వుంటుంది? ముందుగా కథన దృష్టి అంటే ఏమిటో తెలుసుకో
వాలి. కథన దృష్టి పాత్రని విడిచి కథనం చేసుకుంటుంది. ఎలా చేసుకుంటుంది? కథకుడు చేస్తాడు. కథకుడు కథన దృష్టితో కథనం  చేస్తే పాసివ్ పాత్ర తయారవుతుంది, పాత్రే కథనం చేసుకుంటే యాక్టివ్ పాత్ర తయారవుతుందని  చాలా సార్లు చెప్పుకున్నాం.

          కథకుడు కథనం చేయడం, లేదా కథకుడే  కథని నడపడం ఎలా జరుగుతుంది? ఎలాగంటే, సీనులో ప్రధాన పాత్ర వుంటే, ఆ ప్రధాన పాత్రని వదిలేసి, ఆ సీనులోకి వచ్చే ఇతర పాత్రలు ఏమేం చేయగలవని, వాటి దృష్టి కోణం లోంచి, వాటి అవసరాల్నుంచీ  ఆలోచించి ఆలోచించీ హమ్మయ్యా అని సీన్ని నడిపిస్తే అప్పుడది కథకుడు కథని నడపడం, లేదా కథనం చేయడం  అవుతుంది. సింపుల్ గా చెప్పుకుంటే, ఇతర పాత్రల్ని పోగేసి వాటి గురించి  ఆలోచిస్తే కథకుడు కథ నడపడం, లేదా కథన దృష్టి అవడం జరుగుతుంది. 

          పై ఇంటర్వెల్ సీనులో, హీరో దాక్కున్న రూము దగ్గరికి బాస్ లిద్దర్నీ రప్పించి, వాళ్ళ అవసరాల కొద్దీ  ఘర్షణ  జరిపించడం ఇలాటిదే. ఆ  ఘర్షణలో హీరో జొరబడ్డం కూడా ఈజీ అయిపోతుంది. బాస్ అండ చూసుకుని విలన్ తో తలబడి, అతణ్ణీ అతడి గ్యాంగ్ నీ  తరిమికొట్టి - ఓ పంచ్ డైలాగు కొట్టొచ్చు. దాంతో అది ఇంటర్వెల్ బ్యాంగ్! 

          ఇంకేముంది,  హీరో విజయం చూపించేశాక? ఇంకా సెకండాఫ్ లో చెప్పడానికి కథేముంది?  మళ్ళీ విలన్ చేత గిల్లించి కథని ఎత్తుకోవాలిగా కృత్రిమంగా?

          ఇప్పుడు గరుడ వేగలో ఇంటర్వెల్ సీనుకొద్దాం. సినిమా ప్రారంభంలో ఓపెనింగ్ తీజర్ లో చూపించిన ‘దుష్ట’ మైనర్ పాత్రని అదే బాంబు దాడి పథకం ఎపిసోడ్ లో హీరో వెంటాడి వెంటాడి చాలా థ్రిల్లింగ్ గా పట్టేసుకుంటాడు. ఇంటర్వెల్. ఇక్కడ కథన దృష్టి ఎలా పనిచేసింది? హీరో బాంబు సమస్యని ఎదుర్కొంటున్న ఘట్టంలో,  కథకుడు ఇతర పాత్రల్ని రప్పిస్తూ తనే కథ నడిపాడు. ఆ ఇతర పాత్రల్లో ఆ మైనర్ పాత్ర, అతడి ఇద్దరు అనుచరులెవరో వుంటారు. వీళ్లిక్కడ వుండాల్సిన అవసరం లేదు. అదే మాఫియా బాంబు దాడి ప్లాన్ చేసిన చోట, అదేసమయంలో అక్కడికే మైనర్ క్యారక్టర్ ని పిలిపించుకుని డేటా తాలూకు బేరసారాలు ఎలా చేసుకుంటారు. కానీ అలా వచ్చి హీరోకి దొరికిపోవాలని కథకుడు ఆలోచించాడు. అలాగే దొరికిపోయాడు.  హీరో విజయంతో ఇక ఇంటర్వెల్ వేసేశారు. హీరో విజయం చూపించేశాక కథాగి పోయింది, లేదా అయిపోయింది. ఏకసూత్రత కూడా తెగిపోయింది.

గరుడ పాత్ర దృష్టి
        ఇప్పుడు పాత్ర దృష్టి తో ఇంటర్వెల్ చూద్దాం. ముందు ఆ పైన చెప్పుకున్న సీన్లోకి వెళ్దాం. విలన్ మనుషులు ఇద్దర్ని చంపి వచ్చి దాక్కున్నాడు లేత హీరో. ఫోన్ చేస్తే బాస్ వచ్చేస్తున్నాడు. అట్నుంచి విలన్ కూడా వచ్చేస్తున్నాడు. పాత్ర దృష్టి వాళ్ళ గురించి ఆలోచించదు. హీరో గురించే  ఆలోచిస్తుంది. సీను హీరోది, వాళ్ళది కాదు.  సీనులో ఇరకాటం హీరోది, వాళ్ళది కాదు. సీనులోంచి బయట పడే అగత్యం హీరోది, వాళ్ళది కాదు. కథలో ప్రేక్షకులు కథానాయకుణ్ణి ఫాలో అవుతారు, వాళ్ళని కాదు. కనుక హీరో పాయింటాఫ్ వ్యూతోనే సీను నడుస్తుంది. మరొకటేమిటంటే, హీరో పాయింటాఫ్ వ్యూయే ప్రేక్షకుల పాయింటాఫ్ వ్యూ! మరి కథకుడు?  కథకుడు హీరో పాత్రలో పరకాయప్రవేశం చేసి చచ్చి తీరాలి! బయట బయట పాత్రల్ని పోగేసుకుని  చెమ్మాచెక్క చారడేసి మొగ్గా అని ఆడుకుంటే కాదు!

          కనుక కథకుడు మహాశయుడు హీరో పాత్రలోకి వెళ్లి బుద్ధిగా కూర్చుని చూస్తే  ఏం జరుగుతుంది? హీరో మానసిక స్థితిని అతడి పాయింటాఫ్ వ్యూలో చూసి తరించడం జరుగుతుంది. హీరో పాయింటాఫ్ వ్యూలో పరిస్థితి ఏమిటి? బాస్ కన్నా ముందు విలన్ వచ్చేస్తే? తను ఇప్పుడే పారిపోతే? ఆ వచ్చిన బాస్ ని విలన్ చంపేస్తే?  బాస్ ని ప్రమాదంలో పడేసి తను పారిపోవడం కరెక్టా?

          పాత్రని పరిస్థితిని అనుభవించనియ్యాలి. పాత్ర పరిస్థితిని అనుభవిస్తేనే పరిస్థితి జీవకళతో తొణికిసలాడుతుంది. అప్పుడు తలుపు కొడుతూంటే, అదెవరో చెప్పకపోతే, హీరో ఇక నిర్ణయం తీసుకోవాల్సిన క్షణాలు వచ్చేశాయి. సైకలాజికల్ ప్రాసెస్ ఇలాగే వుంటుంది. సమస్యలో వున్న మనిషి రకరకాలుగా ఆలోచిస్తాడు, సమస్య తీవ్రమయ్యేసరికి ఇక నిర్ణయం తీసుకుంటాడు, దాంతో చర్యకి పూనుకుంటాడు. హీరో బయట ఎవరున్నారో తెలియని పరిస్థితిలో ఇక తలుపు తీయడానికే నిర్ణయించుకున్నాడు. విలన్ వుంటే కాల్చేస్తాడు, బాస్ వుంటే కాపాడతాడు. జూదం, తన ప్రాణాలతో జూదమాడాలి. లేదా తలుపు తీయకుండా వుంటే,  అది బాస్ అయితే విలన్, విలన్ అయితే బాస్,  వచ్చేసి వాళ్ళిద్దరూ కాల్పులు జరుపుకుంటారు. విలన్ చస్తే మంచిదే, కానీ బాస్...అందుకని వెళ్లి తలుపు తీయడానికే నిర్ణయించుకుంటాడు హీరో. ఈ హీరో మానసిక సంఘర్షణ అంతా ప్రేక్షకులకి ఎలా తెలిసి వాళ్ళుకూడా పరిస్థితిని అనుభవిస్తారని అనొచ్చు. అక్కడున్న ఫ్రెండ్స్ తో జరిగే తర్జనభర్జన రూపంలో మానసిక స్థితి తెలుస్తుంది. ఇది పాత్ర దృష్టితో సీను డ్రైవ్ చేయడం. 

          అప్పుడు హీరో తెగించి తలుపుతీస్తూ వుంటే...ఇంటర్వెల్ పడుతుంది.
          హీరో ప్రేక్షకులకి అవతలెవరున్నదీ చూపించకుండా ఆపేశాడు. కథని ఆపలేదు. ప్రేక్షకుల్ని ఆపాడు, అంతే.
         
ఇప్పుడు గరుడ వేగ ఇంటర్వెల్ ని పాత్ర దృష్టి తో చూద్దాం. ఏం చూస్తాం...హీరోకి పరిస్థితేమిటో తెలియకుండా వుంటే?  ఏదేదో ఎందుకో జరుగుతూంటే దాన్ని పట్టుకుని పోవడమే కదా ఫస్టాఫ్ అంతా హీరో చేస్తూ వచ్చింది. ఇంటర్వెల్ కి కూడా అతగాడికి పరిస్థితే మిటో తెలీదు. చూస్తే పెద్ద ఎన్ఐఏ ఏజెంట్. తను పట్టుకున్న ఆ మైనర్  పాత్ర కూడా బాంబు దాడి గ్యాంగ్ మెంబరే  అనుకుని పట్టుకున్నట్టున్నాడు. అతను మైనింగ్ రహస్యాల్ని హ్యాక్ చేసిన నిరంజన్ అయ్యర్ అనీ తెలీదు. అన్ని తగుల్తున్న సంఘటనలకి లాగే ఇతనూ కాలికి తగిల్తే పట్టేసుకున్నాడు. హీరోకి  అసలీ కథేమిటో, ఈ కథలో తన పాత్రేమిటో తెలిస్తేగా దాని తాలూకు సైకలాజికల్ ట్రాక్ ఏర్పడేది,  తద్వారా ఒక పాయింటాఫ్ వ్యూ వుండేది? కథకుడు ఏమని పరకాయ ప్రవేశం చేసి,  పాత్ర దృష్టితో ఇంటర్వెల్ అనే బిగ్ పిక్చర్ ని చూస్తాడు? కదా? 

          అందుకని ఇలా చేద్దాం. ఇలాటి హీరోని ఓడించేద్దాం. నిరంజన్ దొరకడు – జంప్ అయిపోయి సెకండాఫ్ లోకి పారిపోతాడు. అప్పుడు కథ చలనంలో వుంటుంది, ఆగిపోదు. హీరో పట్టుకున్నట్టు గెలుపు చూపిస్తేనే కథ ఆగిపోతుంది. గెలిచాక ఇంకేముంది, మొత్తం ఫస్టాఫ్ టెన్షన్ అంతా ఫినిష్ అయిపోతుంది. ఇంటర్వెల్ కి ప్రేక్షకులు రిలాక్స్ అయిపోతారు. సెకండాఫ్ లో కథకి అతుకులేసి మళ్ళీ లేపాలి. 

          మరొక్కసారి, ఇంటర్వెల్  సూత్రాలేమిటి?
 “An important scene in the middle of the script, often a reversal of fortune or revelation that changes the direction of the story.” అని కదా చెప్పుకున్నాం పైన. అంటే, అదృష్టం తిరగబడ్డం, లేదా కథా గమనాన్ని మార్చే కొత్త విషయమేదో బయటపడ్డం అని కదా తెలుసుకున్నాం. 

          ఇంకా -  “Mid-Point or a  Major Reversal of fortune, making Main Character’s task even more difficult. May be a glimpse at the actual resolution of the picture, its mirror opposite.” అనికదా అనుకున్నాం. అంటే, అదృష్టం తీవ్రస్థాయిలో తిరగబడ్డమేననీ, పైగా గోల్ కోసం హీరో చేసే ప్రయత్నం కనా కష్టమై  పోవడమనీ,  ముగింపు అనే దర్పణంలో చూస్తే నెగెటివ్ గా ఈ తిరగబడ్డ అదృష్టం, తన్నుకొచ్చిన అదృష్టంగా పాజిటివ్ గా కన్పించడమనీ? 

          ఇంటర్వెల్ కి మిర్రర్ ఇమేజి సూత్రముందనీ, దాని  ప్రకారం- ఇంటర్వెల్లో హీరో దెబ్బతింటే, ముగింపులో దాని ప్రతిబింబం గెలుపుగా వుంటుందనీ, అదే ఇంటర్వెల్ కి హీరో దెబ్బ తీస్తే, ముగింపులో దాని ప్రతిబింబం ఓటమిగా వుంటుందనీ కదా గ్రహించాం. 

          అంటే ఇంటర్వెల్లో హీరో ఓడిపోవాలి- నిరంజన్ దొరక్కూడదు. అప్పుడు దొరికించుకుని ముగింపులో గెలుస్తాడు. మిర్రర్ ఇమేజికి న్యాయం చేస్తాడు. ఇలాకాక నిరంజన్ ని పట్టుకుని గెలిస్తే, ముగింపులో నిరంజన్ గెలిచి,  హీరో ఓడిపోవాలి. ఇది మిర్రర్ ఇమేజికి రెండో ఆప్షన్. గరుడ వేగ ఇంటర్వెల్ ప్రకారం ఇదే జరగాలి నిజానికి. 

           అందుకే  హీరోని ఇంటర్వెల్లో ఓడించేద్దాం. గెలుపుతో ఫాల్స్ బ్యాంగులు, ఫాల్స్ చప్పట్లు, సెకండాఫ్ కి ఫూలయ్యే కథనమూ వద్దు.  మరి కథాగి పోకుండా ఎలా ఓడించాలి?  
huge high – టెక్నిక్ వాడాలి. అంటే వున్న కథని నషాళానికి అంటించాలి. ఉదాహరణకి – హీరో బాస్ పాత్ర ఎన్ఐఏ చీఫ్ గా వేసిన నాజర్ వూడిపడి అయ్యర్ ని ఎత్తుకుపోవాలి.

          ఈ జరుగుతున్న అన్ని ఆపరేషన్స్ లో హీరో పట్ల నాజర్ అయిష్టంగా వుంటున్నట్టు చూపిస్తూ వచ్చిందే, అతడికి మాఫియాతో సంబంధాలున్నాయన్న సంకేతాలిస్తూ. హీరో పట్టుకోబోతున్న నిరంజన్ అయ్యర్ ని చివరి క్షణాల్లో గద్దలా వచ్చేసి వూహించని విధంగా  నాజర్ తన్నుకుపోతే ఇంటర్వెల్ అనారోగ్యమంతా తీరిపోతుంది. కథాగి పోకుండా ఇంకా పైకి లేచి, సస్పెండెడ్ యానిమేషన్ లో వుంటుంది – అప్పుడప్పడు చట్ట సభల్ని రద్దు చేయ కుండా త్రిశంకు స్థితిలో వుంచినట్టు. 

          ఇంటర్వెల్ కి రెండే రెండు, హీరో అదృష్టం తిరగబడాలి, లేదా కథా గమనాన్ని మార్చే కొత్త విషయమేదో బయటపడాలి.  ముందు కథలో ఇదే చేశాం. ఉద్రిక్త పరిస్థితిలో తలుపు తీసిన హీరోకి - సెకండాఫ్ ఓపెన్ చేస్తే- బాసూ వుండడు, విలనూ వుండడు - మూగ హీరోయిన్ వుంటుంది - కథని కొత్త మార్గం పట్టించే  సమాచారంతో.

(శనివారం సెకండాఫ్ సంగతులు)
-సికిందర్



3, నవంబర్ 2017, శుక్రవారం

540 : రివ్యూ!


రచన - దర్శత్వం :  ప్రభాకర్
తారాగణం :
 ఆది, వైభవి, రశ్మి, హిమజ, బ్రహ్మాజీ, ఘుబాబు, ఎల్బీ శ్రీరామ్, పృథ్వీ, పోసాని కృష్ణమురళి, ప్రకాష్ రెడ్డి దితరులు
థః డి.కె సంగీతం:  సాయి కార్తీక్, ఛాయాగ్రహణం :  కార్తీక్ ని
బ్యానర్ :
వీ4 మూవీస్, నిర్మాత : బన్నీ వాసు
విడుద :  వంబర్ 3, 2017
***
            దో సామెత చెప్పినట్టు అదే పనిగా దెయ్యాల జుట్టు గొరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు హాంటెడ్ ప్లేసెస్ గా మారిపోతున్నాయి. వారానికో కొత్త తెలుగు దెయ్యం ప్రేక్షకుల్ని వెతుక్కుంటూ దిగుతోంది.  తెలుగు దెయ్యపు కేకలు, తెగులుతో వున్న నటుల పకపకలూ బయట దెయ్యాలు తిరిగే సెకండ్ షో వేళల్లో కూడా గోల చేస్తున్నాయి. హార్రర్ కామెడీ చార్మినార్ సిగరెట్టంత చీపుగా మారిపోయింది. దెయ్యాలకి కమెడియన్లు తోడై థియేటర్లలో కామెడీ షోలని నిర్వహిస్తున్నారు – వాళ్ళతో వున్న టీవీ షోలు  చాలవనట్టు. జిఎస్టీ కీ ఘోస్ట్ కీ సంబంధం లేదని కూడా అనుకుంటున్నారు. జీఎస్టీ తో టికెట్ల రేట్లు అమాంతం పెరిగిపోయి ప్రేక్షకుడు సెలెక్టివ్ గా సినిమాలు చూస్తున్న పరిణామం కన్పిస్తున్నా, మళ్ళీ కొత్తగా ప్రేక్షకులని ఆకర్షించే ప్రయత్నమే లేకుండా, అదే అరిగిపోయిన దెయ్యపు సరుకు లేజీగా అందిస్తున్నారు. ఈ పనీపాటాలేని ఘోస్టుల సంగతి ఇక జీఎస్టీ యే చూసుకోవాలి.

          కొత్త వాళ్లకి అవకాశాలిచ్చి,  చిన్న బడ్జెట్ సినిమాలు తీయాలని గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు చేతులు కలిపి వీ4 మూవీస్ గా ఏర్పడ్డాయి. టీవీ రంగం నుంచి వచ్చిన ప్రభాకర్ కి దర్శకుడిగా అవకాశమిస్తూ తొలి సినిమా ప్రారంభించారు. కానీ కొత్తవాళ్ళతో ఇంకా  అరిగిపోయిన పాత మూస ఫ్లాపులు తీయడానికి ఈ మూడు పెద్ద సంస్థలే ముందుకు రానక్కరలేదు, ఈ పని చిన్న చిన్న సంస్థలు వారం వారం ఎప్పటినుంచో చేసుకుంటున్నాయి. పెద్ద సంస్థలు చిన్న బడ్జెట్లతో కొత్తని అందిస్తేనే మర్యాద.

          నెక్స్ట్ నువ్వే అంటూ దెయ్యపు కామెడీలో నటించే వంతు హీరో ఆదికి కూడా వచ్చి, ఓ పని  పూర్తయిపోయింది. ఏం మిగిలింది?  తను గనుక దీని తమిళ కాపీని చూపించమని అడిగి, దాని కొరియన్ ఒరిజినల్ నీ, ఆ కొరియన్ కి జపనీస్ అధికారిక రీమేకునీ కూడా చూపించమని అడిగి చూసి, తమిళ కాపీని పక్కన బెట్టి, ఆ  కొరియన్ – జపనీస్ లని ఉన్నదున్నట్టూ కాపీ కొట్టమని చెప్పి వుంటే, కొంత బెటరయ్యేది. ఇలాకాక తమిళ కాపీలాగే, మళ్ళీ దీన్ని అనుసరించి తీసిన కన్నడ కాపీలాగే తెలుగులో ‘రీమేక్’ చేస్తే, మిగిలిందేమిటి?

          1998 లో విడుదలైన ‘క్వయిట్ ఫ్యామిలీ’ అనే కొరియన్ దెయ్యం కామెడీలో దెయ్యం చంపుతూండగా, పులిమీద పుట్రలా ఓ కిరాయి హంతకుడు చంపడాని కొస్తాడు. ఆస్తిని కాజెయ్యడానికి బంధువొకడు పంపిన కిరాయి హంతకుడు- వాడి టార్గెట్ గా ఒకమ్మాయి. ఈ సీరియస్ సబ్ ప్లాట్ తో కథకి డెప్త్ వస్తుంది. కానీ మనకి కథకి ఇలాటి లోతుపాతులు అక్కర్లేకుండా,  ఏదో పైపైన రాసేసి, పైపైన తీసేస్తే,  చూసే వాళ్ళు పైపైన చూసేసి వెళ్ళిపోతారు. ఇంతే చాలు. 

          ‘రాజు గారి గది- 2” అనే మలయాళ రీమేకు గత నెలే వచ్చింది. అందులో  మిత్రులు ఓ రిసార్ట్స్ తీసుకుని నడుపుతూంటే, అందులో వున్న ఆడ దెయ్యం గొడవ చేస్తూంటుంది (ఆడవాళ్లే దెయ్యాలై చీకటి కూపాల్లోవుంటారా? మగవాళ్ళు స్వర్గంలో జల్సా చేస్తారా? ఎప్పుడో తిరుగుబాటు వస్తుంది ). సరీగ్గా ఇలాగే ఇప్పుడు ఈ తాజా దెయ్యంలో హీరో తెరచిన రిసార్ట్స్ లో దెయ్యం చంపు
తూంటుంది. కిరణ్ (ఆది) ఒక సీరియల్ డైరెక్టర్. సీరియల్ ఫ్లాపవడంతో ఫైనాన్సర్ (జయప్రకాష్ రెడ్డి) వెంటబడతాడు. కిరణ్ కి ఆస్తి కలిసి వస్తుంది. తన తండ్రి (పోసాని) ఓ పెద్దభవనం తనకివదిలిపో
యా
డని తెలిసి అక్కడికి వెళ్తాడు. వెంట ప్రేమిస్తున్న సీరియల్ హీరోయిన్ (వైభవి) వస్తుంది. పాడు
బడి వున్న ఆ భవనానికి కాపలాగా శరత్ (బ్రహ్మాజీ) వుంటాడు. దాన్ని బాగు చేసి రిసార్ట్స్ తెరుస్తారు (అది రిసార్స్ట్ లా వుండదు). అక్కడే శరత్ చెల్లెలు (రశ్మి) వుంటుంది. అక్కడ దిగే కస్టమర్లు చనిపోతూంటారు. భయపడి వీళ్ళు ఆ శవాల్ని పూడ్చేస్తూంటారు. దెయ్యం తమ జోలికి రాకుండా కస్టమర్లని ఎందుకు చంపుతోందంటే, వాళ్ళు పూర్వపు యజమానులు. ఇక ఇప్పటి యజమాని కిరణ్ వంతు కూడా వస్తుంది. ఈ దెయ్యం యజమానుల్ని ఎందుకు చంపుతోంది? దీన్నుంచి కిరణ్ ఎలా బయటపడ్డాడు? ... అన్నవి  తెలుసుకుని తలబాదుకోవాలంటే దీనికి  తప్పక అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. 

          పాత సినిమాల్లో డ్రామా లుంటాయి. ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు. ఇక్కడ దెయ్యంకంటే కూడా హీరోకోసం హీరోయిన్ల కయ్యాలే గయ్యీ మంటూంటాయి. వీళ్ళే దెయ్యాల్లాగా కయ్యాలు పెట్టుకుంటారు. ఫస్టాఫ్ అంతా దెయ్యం కన్పించదు, వీళ్ళే దెయ్యా ల్లాగా వుంటారు. ఇతర దృశ్యాలు కూడా ఇంకా అరవైల నాటి బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తున్నామా అన్నంత పాతబడి వుంటాయి. పూర్ రైటింగ్,  పూర్ డైరెక్షన్ దెయ్యంతో పోటీపడి  మన ప్రాణాలు తీస్తాయి. ఇంటర్వెల్ కల్లా కాలికి బుద్ధి చెప్పిన ప్రేక్షకులే  ఎక్కువ. 

          సెకండాఫ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్. అందులో దెయ్యం కథ చాలా సిల్లీగా వుంటుంది. కనిపించని దెయ్యంతో భయమే లేదు, కన్పించే నటులు చేసే కామెడీచూసి నవ్వుకోవాలని దర్శకుడి ఉద్దేశం. ఏం కామెడీ అది? అది కామెడీయా?  

           దర్శకుడవాలనుకుని  సొంతంగా కథ ఆలోచించలేని ప్రభాకర్, తమిళం నుంచి తెచ్చుకుని, అది కూడా అరిగిపోయిన దెయ్యం కామెడీని తెచ్చుకుని  చేసినట్టు, ఇంకెవరైనా కొత్త వాళ్ళు ప్రయత్నిస్తే కుదురుతుందా? కథనీ తమిళ వెర్షన్ లోనే చూసి, దర్శకత్వాన్నీ తమిళ వెర్షన్ లోనే చూసి, తెలుగులోకి కాపీ పేస్ట్ చేసే సదవకాశం ఎందరు కొత్త దర్శకులకి లభిస్తుంది?  షార్ట్ కట్స్ తో ఫలితం షార్ట్ సర్క్యూటే అవుతుంది.


-సికిందర్ 


539 : రివ్యూ!


రచన – దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
తారాగణం  :
 రాజశేఖర్, పూజా కుమార్, శ్రద్ధాదాస్, సన్నీ లియోన్, అదిత్ అరుణ్, వివర్మకిషోర్, నాజర్, షాయాజీ షిండే,  పోసాని కృష్ణమురళి, అవరాల శ్రీనివాస్, అలీ, పృథ్వీ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో , నేపథ్య సంగీతం:  శ్రీచణ్ పాకాల , ఛాయాగ్రహణం : అంజి, సురేష్ ఆర్, శ్యామ్ ప్రసాద్, గీకా, బాకుర్ 
బ్యానర్ :   శివాని శివాత్మిక ఫిలింస్, జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్
నిర్మాత : ఎం.కోటేశ్వర్ రాజు 
విడుద: నవంబర్ 3, 2017 
***
        విజయాలు లేక రెండేళ్ళు విరామం తీసుకున్న రాజశేఖర్ అత్యంత భారీ యెత్తునపునరాగమన సన్నాహం చేశారు. ఒకప్పుడు మగాడుగా బాక్సాఫీసుని ఏలితే, ఇప్పుడు  సామాన్యుడుగా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికొచ్చారు. చందమామ కథలు, గుంటూరు టాకీస్ వంటి నాల్గు చిన్న తరహా సినిమాలు తీస్తూ వచ్చిన  దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా బాణీమార్చి ఏకంగా బిగ్ బడ్జెట్  యాక్షన్ హంగామాకి పాల్పడ్డారు, అది కూడా రాజశేఖర్ తో.  ఇప్పుడు ఈ ఇద్దరి పరిస్థితేమిటి? వుంటారా, పోతారా? ఇది తెలుసుకోవడానికి సినిమాలోకి వెళదాం...

కథ
 
       శేఖర్ (రాజశేఖర్) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ – ఎన్ఐఏ లో అసిస్టెంట్ కమిషనర్. తన బృందంతో కలిసి నగరంలో ఆయుధాల, మాదకద్రవ్యాల ముఠాలని ప్రక్షాళన చేసే కార్యక్రమంలో వుంటాడు. ఈ ముఠాల దగ్గర ఒక ఎన్ క్రిప్ట్ చేసిన కోడ్ దొరుకుతుంది. దాన్ని హ్యాక్ చేస్తే, మూడు గంటల వ్యవధిలో బాంబు దాడి జరగబోతోందని తెలుస్తుంది. కష్టపడి  ఆప్రాంతాన్ని కనుక్కుంటే, అక్కడ ర్యాలీ జరుపుకోవడాని కొస్తున్న ప్రతాపరెడ్డి (పోసాని) అనే రాజకీయ నాయకుణ్ణి టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ దాడి నుంచి ప్రతాపరెడ్డిని కాపాడిన శేఖర్ కి,  నిరంజన్ అనే అనుమానితుడు దొరుకుతాడు. ఈ నిరంజన్ దగ్గరే అసలు రహస్యమంతా వుంటుంది. 

          రాష్ట్రంలో బయటపడిన  ప్లుటోనియం నిల్వల్ని మైనింగ్ చేసి ఉత్తరకొరియాకి తరలించే కుట్ర చేస్తున్న మంత్రులు, అధికారులు, బ్రోకర్లూ అందరి గుట్టూ తెలుస్తుంది శేఖర్ కి. దీంతో నిరంజన్ సహా శేఖర్ ని చంపేసేందుకు వేటాడతుంది  మైనింగ్ మాఫియా. శేఖర్ కి ఇంటిదగ్గర భార్యతో సఖ్యత వుండదు. ఇటు భార్యతో సమస్య, అటు ప్రాణాల సమస్య నెదుర్కొంటూ శేఖర్,  మైనింగ్ మఫియాని ఎలా అంతమొందించాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ 

        అంతర్జాతీయ కుట్రకి సంబంధించిన  హై కాన్సెప్ట్ కథ. ఆమధ్య ‘ఘాజీ’ అనే ఇలాటిదే అంతర్జాతీయ హై కాన్సెప్ట్ కథ తెలుగులోనే వచ్చి విజయం సాధించింది. అది ఇండో - పాక్ యుద్ధనేపధ్యంలో వుంటే, ఇది అమెరికా -  ఉత్తర కొరియాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంగా వుంది. ఉత్తర కొరియాకి ఇండియా నుంచి అణుపదార్ధాన్ని సరఫరా చేస్తున్న మాఫియా ఒక మాట అంటాడు – ఈ భారీ స్మగ్లింగ్ తెలిస్తే ఐక్యరాజ్య సమితిలో ఇండియా పరిస్థితి ఎలా వుంటుందో వూహించుకోమంటాడు. ఇరాక్, ఇరాన్ లకి పట్టిన గతే ఇండియాకీ పడుతుందని బెదిరిస్తాడు. కానీ అప్పటి దాకా ఉత్తర కొరియా చేతిలో ఈ అణుపదార్ధంతో అమెరికా వుంటుందా? అణుస్మగ్లింగ్ అనే ఐడియాతో  ఈ తెలుగుకథ కొత్తగా వున్నా, దీని నిర్వహణ ద్వితీయార్ధంలో మళ్ళీ మూస వాసనేస్తుంది. మూస వాసనని అధిగమించి విజువల్ అప్పీల్ తో కొత్తగా మారిపోయిన ‘గోల్ మాల్ ఎగైన్’ ఇటీవలే చూశాం. దీన్ని ఈ కథ సాధించలేక పోయింది, ఎంతైనా తెలుగు కథే  కదా అన్నట్టు.

ఎవరెలా చేశారు 

        రాజశేఖర్ పునరాగమన నటన పాతని వదిలించుకుంది. చొక్కాచేతులు పైకి మడిచి కళ్ళెర్రజేసి, సాయికుమార్ గళంతో భీకర రావాలు చేసే మ్యాననరిజమ్స్ దేవుడి దయవల్ల ఇకలేవు. చాలా సింపుల్ గా, అంతే శక్తివంతంగా, క్యాజువల్ డైలాగులతో సహజంగా నటించారు. ఇప్పుడు ఫేసులో తాజాదనం వుట్టిపడుతూ, చూసినకొద్దీ చూడాలనిపించేలా మారిపోయి వచ్చారు. తనెప్పుడో పోలీసు పాత్రల్లో ఆరితేరిపోయారు. ఇప్పుడు విలన్ నోట ‘నువ్వొక సామాన్యుడివేరా’  అని తిట్టించుకుని సామాన్యుడి పవరేంటో స్టయిలిష్ గా చూపించారు. ఇంటి దగ్గర భార్యతో గొడవలు కథలో కావాలని జొప్పించినట్టు వుండడంతో ఆ దృశ్యాల్లో రాజశేఖర్ నటన పెద్దగా ఆకట్టుకోదు. మిగతా సన్నివేశాల్లో, యాక్షన్ దృశ్యాల్లో ఇది తనకి గుర్తుండి పోయే పునరాగమనమే తప్ప విఫలయత్నం కాదు. ఇలాగే రియలిస్టిక్ గా విభిన్న తరహా పాత్రలు పోషిస్తే మళ్ళీ తన సినిమాలు బావుంటాయి. ఒకనాడు ఇలాటిదే టెక్నికల్ థ్రిల్లర్ ‘మగాడు’ తనకెంతో ఇప్పుడు ‘గరుడవేగ’ అంత. 


       హీరోయిన్ పూజా కుమార్ భర్త తనకి సమయం  కేటాయించడం
లేదని విడాకుల దాకాపోయే చాదస్తపు పాత్ర. బిజీ పోలీస్ ఏజెంట్లకి ఇంటి దగ్గర ఇలాటి భార్యల్ని కేటాయించడం ఒక ఫార్ములాగా మారింది. ఇలాటి కథలకి హాలీవుడ్ ప్రకారం బయట ఫిజికల్ యాక్షన్ తో హీరోవుంటే,ఇంట్లో భార్యతో ఎమోషనల్ యాక్షన్ వుండాలి. ఈ ఫిజికల్ - ఎమోషనల్ యాక్షన్ల ద్వంద్వాల ఉద్దేశం అర్ధం జేసుకోకుండా పెడితే ఇదిగో ఇలాగే జానరేతరంగా పానకంలో పుడకల్లా వుంటాయి సీన్లు. క్లయిమాక్స్ యాక్షన్ సీన్ల మధ్య  ఈ సంసార గొడవల సరిత్సాగరం మరీ దెబ్బ తీసింది జానర్ మర్యాదని. 

          విలన్ గా కిషోర్ ఎఫెక్టివ్ గానే వున్నాడు గానీ, కథలోకి ద్వితీయార్ధంలో ఎప్పుడోగానీ రాడు. ఈ యాక్షన్ కథ మిస్టరీతోకూడి వుండడం వల్ల ఈ పరిస్థితి. సన్నీలియోన్ ఒక డాబా పాటలో కవ్వించి పోతుంది. హీరో హీరోయిన్ల మధ్య సమస్యకి సైకియాట్రిస్టుగా అలీకి ఒకే దృశ్యముంది. ఇంకో డాక్టర్ గా పృథ్వీ కన్పిస్తాడు. పెద్దగా హస్యమాడే పాత్రలు కావివి.  రాజకీయ నాయకుడి పాత్రలో పోసాని అర్ధాంతరంగా అంతర్ధానమవుతాడు. ఎన్ ఐ ఏ ఏజెంటుగా రవివర్మ, హ్యాకర్ గా అదిత్ అరుణ్, ఎన్ ఐ ఏ బాస్ గా నాజర్ కన్పిస్తారు. ఇక టీవీ రిపోర్టర్ గా శ్రద్ధాదాస్ కి ఏమంత పాత్రలేదు. 



      సాంకేతికంగా బాగా ఖర్చుపెట్టి తీశారు. ఇప్పుడు రాజశేఖర్ మీద పదుల కోట్ల బడ్జెట్ అంటే రిస్కే. అనుకున్న బడ్జెట్ దాటి పెరుగుతూ పోయిందని చెప్పుకుంటున్నారు. పెరిగింది వృధా కాలేదు గానీ, వసూళ్ళకి ఏటికి ఎదురీదాలి. టికెట్టు కొన్న ప్రేక్షకుడు మాత్రం ఏడ్చుకుంటూ పోడు. పైపెచ్చు రొడ్డ కొట్టుడు సినిమాల మధ్య చాలా బెటరని తలవంచుకుని పోతాడు.

      బీమ్స్ సంగీతంలో రెండే పాటలున్నాయి.
శ్రీచణ్ పాకాల  నేపధ్య సంగీతం  చాలా హైలైట్ ఈ యాక్షన్ థ్రిల్లర్ కి. ఇక ఎందరో ఛాయాగ్రాహకులు కలిసికట్టుగా ఈ యాక్షన్ హంగామాని సమున్న
తంగా దృశ్యమానం చేశారు. ఇంతవరకూ చిన్న బడ్జెట్ సినిమాలు తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఉన్నట్టుండి బిగ్ కాన్వాస్ తో, హై కాన్సెప్ట్ ని కూడా ఒంటి చేత్తో తీసి అవతల పడెయ్యగలనని ఆశ్చర్యకరంగా నిరూపించుకున్నారు.

(స్క్రీన్ ప్లే సంగతులు రేపు)

సికిందర్  
www.cinemabazaar.in
(edited typos)