రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, సెప్టెంబర్ 2017, బుధవారం

518 : స్పెషల్ ఆర్టికల్



         
      స్టార్ మూవీస్ ఎలా రాయాలి, ఎలా తీయాలి అన్న టాపిక్ కి సంబంధించి హాలీవుడ్ నుంచితెలుసుకోవడానికి చాలా సమాచారముంది. కొత్తవాళ్ళు ఇది తెలుసుకుని కథలల్లు కోవడం, దర్శకత్వాలు ప్రయత్నించడం చేయకపోవడం మంచిది. దీనికంటే ముందు  చిన్నసినిమాలపై శ్రద్ధ పెట్టి రాసుకోవడమో, తీసుకోవడమో చేయడమే మంచిది. అప్పుడు కూడా ఒక చిన్నసినిమాతో వచ్చిన అవకాశం అప్పుడే స్టార్ సినిమాలకి సోపానమను కోకపోతే ఇంకా మంచిది. ఏడాదికి 60, 70  చిన్న సినిమాలు తీసే కొత్త వాళ్ళు దాదాపు అందరూ అట్టర్ ఫ్లాప్ అవుతున్నప్పుడు,  చిన్న సినిమా అవకాశం వెంటనే స్టార్ సినిమాలకి సర్టిఫి  కేట్ అనుకోవడం అవివేకం. ఒకవేళ ఒకటీ అరా చిన్న సినిమాలతో హిట్టయినా వెంటనే స్టార్ మూవీ కథ పట్టుకుని స్టార్ల చుట్టూ తిరగడం టైం వేస్టు వ్యవహారం. అలా రెండు మూడేళ్ళు ప్రయత్నించి మళ్ళీ చిన్న బడ్జెట్ సినిమాలు తీసుకుంటున్న వాళ్లేవున్నారు.  వృధా చేసుకున్న రెండు మూడేళ్ళ కాలంలో రెండు మూడు చిన్న సినిమాలు తీసుకుంటూ మార్కెట్ లో లైవ్ గా వుండవచ్చు.  ఒకప్పుడు వారపత్రికల్లో సీరియల్స్ రాసిన రచయితలు  ఏకకాలంలో రెండు మూడు పత్రికలకి రాసేవాళ్ళు. తమ పేరు నిత్యం సర్క్యులేషన్ లో వుండేట్టు చూసుకోవడానికి అలా చేసేవాళ్ళు. పేరు జనం నోళ్ళల్లో నానడం ముఖ్యం. ఒక చిన్న సినిమాతో సక్సెస్ అయి పెద్ద సినిమాల వెంటబడి రెండు మూడేళ్ళు కన్పించకుండా పోతే ప్రేక్షకులు మర్చిపోతారు. ఫ్లాపయిన కొత్త దర్శకుడు కన్పించకుండా పోతాడు, సక్సెస్ అయిన కొత్త దర్శకుడూ కన్పించకుండా పోతాడు - తేడా ఏముంది?  


          స్టార్ మూవీస్ తో పది మందికే అవకాశాలుంటాయి. అవి దాదాపు  రెగ్యులర్ టాప్ దర్శకులకే వుంటాయి. కింది స్థాయిలో 90 శాతం అవకాశాలుంటాయి. స్టార్ సినిమాలు పది విడుదలైతే చిన్న సినిమాలు 90 విడుదలవుతాయి. అవకాశాలెక్కువ వుండే 90 మీద దృష్టి పెట్టి క్వాలిటీ సినిమాలు తీసుకుంటూ సర్క్యులేషన్ లో వుండే అవకాశాన్ని ఎందుకు కాలదన్నుకోవాలి?  స్టార్ మూవీస్ కి పోటీలెక్కువ. స్మాల్ మూవీస్ కి పోటీయే లేదు దాదాపు అన్ని స్మాల్ మూవీస్ అట్టర్ ఫ్లాపవుతున్నాక. ఇక్కడ కాస్త క్వాలిటీతో తీసిన వాడు సులభంగా కింగ్ అయిపోతాడు. కింగ్ చిన్న సినిమాలతో కొన్నాళ్ళు నలిగితే గానీ స్టార్ మూవీస్ తీసే సూపర్ కింగ్ కాలేడు. వూహించుకున్నత సులభం కాదు, ఒక సినిమా అనుభవంతో స్టార్ మూవీస్  తీయగలమనుకోవడం



         
ఇక కొత్తగా స్క్రీన్ ప్లే నేర్చుకునే రైటర్స్ సంగతి. వీళ్ళు కూడా  కథంటే మహేష్ బాబు, ఎన్టీఆర్ లెవెల్ కథే అనుకుని - నీటి పిట్టలు తటాకంలో  డింకీలు కొట్టడాన్ని మించిపోయి స్కూబా డైవింగులు కొడుతున్నారు. నేల మీద పడి గాయాలు చేసుకుంటున్నారు. అందరి దృష్టీ స్టార్స్ మీదే. బిగ్ స్టార్స్ కాకపోతే నాని, శర్వానంద్, నిఖిల్, సందీప్ కిషన్, రాజ్ తరుణ్, ఇప్పుడు దేవరకొండ విజయ్ లాంటి జ్యూనియర్ స్టార్స్ కి తక్కువ కాకుండా కథలు రాయాలనుకోవడం.  అసలు రైటర్స్  స్టార్స్ కి కథలివ్వడం జరుగుతోందావాళ్ళు దర్శకుల దర్బారుల్లో  ఆస్థాన కవులవుతున్నాక? ఇది ఆలోచించాలికథలిచ్చే రైటర్స్ అనే జాతి ఎప్పుడో అంతరించిపోయింది. కథలు దర్శకులే ఇచ్చుకుంటారు. కాబట్టి స్క్రీన్ ప్లే నేర్చుకునే రైటర్స్ తమ కథలు తెరకెక్కాలనుకుంటే, తాము దర్శకులు కూడా కాగలిగితేనేబీటెక్ చేశాక శాపో శాపమో చేసుకుంటేనే జాబ్ అన్నట్టు, స్థాయి రైటర్స్ కథలివ్వాలన్నా దర్శకులుగా మారాల్సిందే

         
కాబట్టి ఒక గోల్ లేకుండా స్క్రీప్లేలూ గట్రా నేర్చుకోవద్దు. రైటింగ్ నేర్చుకునే వాళ్ళు ఇవ్వాళ మూడు రకాలు. దర్శకుడు కాగోరి రైటింగ్ నేర్చుకునే వాళ్ళు; దర్శకుల దగ్గర, సీనియర్ రైటర్స్ దగ్గర చేరడానికి నేర్చుకునేవాళ్ళు, కేవలం డైలాగ్ రైటర్స్ గా కొనసాగాలనుకుని నేర్చుకునే వాళ్ళు. మూడూ కూడా చిన్న సినిమాలతో మొదలెట్టుకోవాల్సిందే. అప్పుడే స్టార్ డైరెక్టర్ దగ్గర, స్టార్ రైటర్ దగ్గర చేరిపోవడం అస్సలు కుదరదు. ఇలా తిరిగి టైం వేస్ట్ చేసుకుంటున్న వాళ్ళు చాలా
మంది
వున్నారు. స్క్రీన్ ప్లే నేర్చుకుంటూ ఒక చిన్న స్క్రిప్టు రాయలేని వాళ్ళు స్టార్ మూవీస్ డైనమిక్స్ ని ఏం అర్ధం జేసుకుంటారు. స్టార్ మూవీస్ చూసేసి వూహించుకున్నంత సులభం కాదు  రాయడం - అవి టెంప్లెట్ మూవీస్ అయినా సరే. కాబట్టి ముందు కలలు గనడం మానెయ్యాలి. కలలు గంటూ ఫీల్డుకి రావొచ్చు. వచ్చాక కలలుండవు, వాస్తవాలు అర్ధంజేసుకోవాలి.

         
నేపధ్యంలో స్టార్ మూవీస్ రాయడమెలా అనే వ్యాసం అవసరమా అన్పించింది. అనవసరంగా కొత్త వాళ్లకి పెద్ద ఆశలు  కల్పించి చెడగొట్టినట్టవుతుందనే ఉద్దేశంతో శీర్షిక ప్రకటించి రెండు మూడు నెలలవుతున్నా వ్యాసం రాయలేదు. అనాలోచితంగా శీర్షిక  ప్రకటించడం పొరపాటే. పోనీ కొత్తవాళ్లకి కాకపోయినా ఇతరులకి ఉపయోగపడవచ్చులే అనుకున్నా- ఇతరులెవరు? 1. టాప్ దర్శకులు, రచయితలు, 2. మీడియం దర్శకులు, రచయితలు, 3. చిన్న చిన్న దర్శకులు, రచయితలు

         
పై  మూడు బ్రాకెట్స్ లో మొదటి రెండు బ్రాకెట్లలో వుంటున్న  వాళ్లకి తెలుసుకునేంత తీరికా ఓపికా లేక డీఫాల్టు మెకానిజంతో సాగిపోతూంటారు కాబట్టి అవసరం లేదు. మూడో  బ్రాకెట్లో వుండే  వాళ్ళకి స్టార్స్ తో అవకాశాలే రావు కాబట్టి తెలుసుకోవడం శుద్ధ దండగ. మరి ఎవరికోసం వ్యాసం

         
కాలక్షేపంకోసం. ఇంతకి మించి దీనికే  ప్రాధాన్యమూ లేదు. దృష్టితోనే చూడాలి. కొత్త వాళ్ళు సరదాగా చదివేసి అవతల పడెయ్యాలేగానీ ఇదే అవకాశమనుకుని స్టార్ మూవీస్ మీద పడిపోవద్దు. కొత్త వాళ్ళు కొందరు మరీమరీ అడుగుతూంటేనే తప్పక వ్యాసం రాయాల్సి వచ్చింది. షరతులు వర్తిస్తాయ్. పైదంతా చదువుకుని  ముందు చిన్న సినిమాలకి కట్టుబడి వుంటేనే వ్యాసం చదవాలి.

(వ్యాసం శనివారం
-
సికిందర్











17, సెప్టెంబర్ 2017, ఆదివారం

517 : నాటి సినిమా!



       1969 మహాత్మా గాంధీ శత జయంతి సంవత్సరం.
          ఉపన్యాసాల టపాసులు విరివిగా పేల్చుకున్న దేశం.
          ఆ టపటపలు , ఢమఢమలు సద్దుమణిగిన తర్వాత ఎప్పటిలా తిరిగి రొటీన్ రాజకీయ వేషాలు - రేపిన గాంధీజీ  ఆశయాల ఆశలు, చేసిన గాంధీజీ  మరో ప్రపంచపు బాసలూ హుళక్కి అయి, నేటికి దిగ్విజయంగా 40 ఏళ్ళు. గాంధీ మహాత్ముడు చనిపోయింది 1948 లో కాదు.
          రాజకీయం మారకుండా రాజ్యం మారదు. రామరాజ్యం రాదు. దీన్ని సినిమా దృశ్యమానం చేసినప్పుడు, ఒక ‘మరోప్రపంచం’  వెలుస్తుంది. గాంధీజీ కలలుగన్న మరో ప్రపంచాన్ని చూపిస్తుంది. గాంధీయిజాన్ని రాజకీయం సొమ్ము చేసుకుందే గానీ, సినిమాలు కాదు. ఒక దశలో వెండితెర మీద గాంధీ పాత్ర అలా కన్పించి ఓ సందేశమిస్తే ఘోల్లున నవ్వడం నేర్చుకున్నారు ప్రేక్షకులు. అదే ప్రేక్షకులు పూర్తి స్థాయి గాంధీ జీవితాన్ని ఆటెన్  బరో చూపిస్తే కళ్ళకద్దుకున్నారు భక్తిభావంతో. వాళ్లకి గాంధీజీ నిండు జీవితమే రీలు పడాలి, ఓ సందేశం తో సరిపెడితే కాదు. ఇందుకే అక్కినేని, ఆదుర్తిలు చేతులు కాల్చుకున్నారు ‘మరోప్రపంచం’ తీసి. 

          రాజకీయమేకాదు, 1970 ల నాటికి గాంధీయిజం పట్ల కూడా ప్రేక్షకులకి ఆసక్తి సన్నగిల్లిందనడానికి ఈ సినిమా పరాజయ గాథే  నిదర్శనం. 

         జాతిపిత నూరవ జయంతిని పురస్కరించుకుని ఆయన స్వాప్నిక సందేశంతో 1970 లో ‘మరో ప్రపంచం’ అనే ఆఫ్ బీట్ సినిమాని అక్కినేని, సావిత్రి, జమున, గుమ్మడి లాంటి పాపులర్ తారలతో నిర్మించి, ‘అసంతృప్తితో, అశాంతితో, అదేమిటో అర్ధం కాని ఆవేదనతో, అనుక్షణం మధనపడే విద్యార్ధులందరికీ’ ఏంతో ఆప్యాయంగా అందిస్తే, ఆ విద్యార్థులే  పట్టించుకోలేదు. లక్ష్యిత ప్రేక్షకులే లెక్కచేయనప్పుడు అసలు ప్రీ పొడక్షనే వృధా అన్పిస్తుంది. 

          ఇది ఆనాటి స్టూడెంట్స్ బ్యాడ్ లక్కే. స్టూడెంట్స్ అన్నాక ఫ్యూచరిస్టిక్ సినిమాలు కూడా చూసి మేధస్సు పెంచుకోవాలి. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఈ సినిమా చూస్తే, ఇది కాలజ్ఞానం కూడా చెబుతూ, నాస్టర్ డామిజాన్ని ప్రదర్శించడాన్ని తెలిసి, నిటారుగా నిక్క బొడుచుకుంటాయ్ మన వెంట్రుకలు! 

          దటీజ్ ఆదుర్తి సుబ్బారావ్!
        సాహిత్యానికి కొడవటిగంటి కుటుంబ రావెలాగో, సినిమాలకి ఆదుర్తి సుబ్బారావలాగ. తెలుగుదనం, దానికి అభ్యుదయం, వీటిని అరటి పండు  వొలిచి చేతిలో పెట్టినంత లొట్ట లేసుకునేంత స్పష్టత, సరళత్వం... ఇద్దరూ కూడబలుక్కుని పంపకాలు జరుపుకున్నట్టు కన్పిస్తారు  ఒకరి సినిమాలూ ఇంకొకరి సాహిత్యమూ చూస్తే.

          మూగమనసులు, మంచిమనసులు, తేనెమనసులు, సుమంగళి, ఇద్దరు మిత్రులు, డాక్టర్ చక్రవవర్తీ ...లాంటి ఎన్నెన్నో చక్కరకేళులతో ఆదుర్తి సుమధుర సంగీతాల చిత్రావళి.  జానర్ సెట్టర్ కూడా తను. మూగమనసులు లాంటి పునర్జన్మల సినిమాలు ఎప్పుడు ఎవరు తీసినా బాక్సాఫీసుకి మాలిమి కావడం ఆయనేసిన  బాటే. 1968-75 మధ్య ఏడేళ్ళ కాలంలో మిలన్, జీత్,  ఇన్సాఫ్, రఖ్ వాలా, మస్తానా లాంటి పది వరకూ హిందీలో బిగ్ స్టార్స్ తో సూపర్ హిట్స్ కూడా ఇచ్చిన షాన్ దార్ దర్శకుడాయన. జీవితంలో ఎక్కడా ఆయన పరేషాన్ గా కన్పించలేదు. 

          ‘మరోప్రపంచం’ కి  ముందు 1967 లో ‘సుడిగుండాలు’ తో మొదటిసారి దిగ్విజయంగా చేతులు కాల్చుకోవడం అయింది. అయితే 1965 లో ‘తేనెమనసులు’ తో కృష్ణ సహా అందరూ కొత్త వాళ్ళతో చేసిన మొట్ట మొదటి ప్రయోగం సూపర్ హిట్టయింది. ఐతే  1970 లో సూపర్ తారలతో ‘మరోప్రపంచం’  పరాజయం తర్వాత ఆదుర్తి ప్రయోగాల ఆర్తి  పరిసమాప్తి అయింది. ఇందులో గాంధీజీ ప్రవచిత మరోప్రపంచం రాలేదు సరికదా, డబ్బెట్టి కొందామన్నా బియ్యపు గింజ జాడ లేకపోయేసరికి,  విసిగిన ముసలవ్వ పాత్రలో జమున అంటుంది చివరికి – ‘ప్రళయం ఎప్పుడొస్తుంది నాయనా?’ అని. గ్రేట్ సెటైర్. ఇప్పుడు  అదే ప్రళయం గురించిన ‘2012 యుగాంతం’ సినిమానే తెగ ఆడిస్తున్నారు తమకిక భవిష్యత్తు లేదని డిసైడ్ అయిపోయిన ప్రజలు!

      ఇంకా ఇందులో నూరవ గాంధీజీ పుట్టిన రోజుకి అట్టహాసంగా సభలు జరుపుకుంటూ, ఇలా రెచ్చ గొడతారు నాయకులు –‘ మేం గాంధీ పేరు తగిలించుకుని ఆయన రుణం తీర్చుకుంటున్నాం. నా పేరు ఉగ్ర నరసింహ గాంధీ, మరి మీరో? మీరెలా తీర్చుకుంటారు గాంధీ గారి రుణం? ఈ హైదరాబాద్ – సికిందరాబాద్ జంట నగరాల్ని ఒక్కటి చేసి గాంధీ బాద్ గా మార్చాలని ఉద్యమించండి! పోరాడి మీ ప్రాణాలను త్యాగం చేయండి ప్రజలారా!’ ...ఇలా దేశవ్యాప్తంగా నాయకుల ప్రసంగాల తర్వాత ఒక షాట్ వేస్తాడు దర్శకుడు. అది ఆకాశంలో కావుకావుమనే కాకుల గోల. 

          అప్పుడు పేటలో కుటుంబాల్ని చూపిస్తాడు. అప్పటికే అరడజనేసి మంది పిల్లల మంద వున్నా, ఇంకా దారిద్ర్య ఆహ్వాన కేంద్రాలుగా పడగ్గదుల్ని చేసుకుని కులికే మూర్ఖ శిఖామణుల్ని చూపిస్తాడు. మరోపక్క పేదరికంలో వొళ్ళమ్ముకున్న  పాపానికి పుట్టుకొచ్చే అక్రమ సంతతి శ్రేణుల్నీ చూపిస్తాడు. ఈ పిల్ల జాతి మొత్తాన్నీ ఓ రాత్రి దొంగ లెత్తుకుపోతారు. 

     ఈ కేసుల దర్యాప్తుకి ఐజీ (గుమ్మడి వెంకటేశ్వరరావు ) రంగంలోకి దిగుతాడు. ఇంకా లోతైన దర్యాప్తుకి ఢిల్లీ నుంచి సీఐడీ  రవీంద్రనాథ్ (అక్కినేని నాగేశ్వరరావు)  దిగుతాడు. రకరకాల మారువేషాలతో ఇతను చేస్తున్న దర్యాప్తు వివరాల్ని రహస్యంగా ఫోటోలు తీసి ఓ పత్రిక్కి పంపుతూంటుంది  ఐజీ కూతురు సంధ్య (సలీమా). వాటిని  ప్రచురిస్తూ ఐజీకీ, సీఐడీ కీ షాకిస్తూంటాడు ఎడిటర్ - కం - పబ్లిషర్ (విజయ్ చందర్).
 
            వెళ్లి వెళ్లి దర్యాప్తు  ఓ రహస్య స్థావరానికి చేరుతుంది. అక్కడుంటారు వందలమంది మాయమైపోయిన పిల్లలు. వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? సకల సౌకర్యాలతో మరో ప్రపంచాన్ని  అనుభవిస్తున్నారు. చిరిగిన విస్తరి మెతుకులతో, అతుకుల బొంత బతుకులతో, పేదల కోసం ధనికులు కట్టిన మహా మంచి ప్రపంచం (శ్రీశ్రీ పాట) కి సుదూరంగా మెరుగైన జీవన ప్రమాణాలతో, పాపాలు శాపాలు లేని సుఖవంతమైన రామరాజ్యాన్ని నిర్మించుకుంటున్నారక్కడ. దీని వెనుక సంధ్య, ఎడిటర్,  పెద్ద గాంధీ (మాడా) తోబాటు మరో ముగ్గురున్నారు. వీళ్ళ దూరదృష్టికి ప్రభావితుడై తన పిల్లల్ని కూడా వీళ్ళ పరం జే స్తాడు రవీంద్ర నాథ్. కానీ ఈ మారు ప్రపంచాన్ని మామూలు  ప్రపంచంలోని రాజ్యాంగం, చట్టాలూ ఒప్పుకోవు. అందుకని రవీంద్రనాథ్  సహా అందరూ దోషులుగా నిలబడతారు.

          కాలం కంటే ముందు తీసి, సామాజికాంశాల మీద ముందస్తు కామెంట్స్ చేసిన ఈ ప్రయోగం నాటి ప్రేక్షకుల ఆలోచనా స్థాయికి మించిపోయింది  కావొచ్చు. పైగా గాంధీయిజం తెలియాలంటే,  ఆ యిజం పుట్టిన కాలమాన పరిస్థితుల అనుభవం లేకా కావొచ్చు. సినిమాల్లో ప్రేక్షకుల ఆసక్తికి ముందుగా తెర మీద పాత్రలు పడే స్ట్రగుల్  కన్పించాలి. తమ కళ్ళముందు ప్రత్యక్షంగా వున్న సమస్యలతో స్ట్రగుల్ చూపించి, ఆ పైన  పరిష్కార మార్గంగా ఏ ఊహా జగత్తుని  సృష్టించి చూపించినా దాన్ని ఆశ్వాదించగల మూడ్ లోకి నిఖార్సుగా వెళ్ళిపోగలరు ప్రేక్షకులు. ‘మరో ప్రపంచం’ లో ఈ  మొదటిదే  మిస్సయి, కేవలం బాలల  కాల్పనిక జగత్తే తెరకెక్కడంతో ప్రేక్షకుల తల దిమ్మెక్కి వుంటుంది. కథా పరంగా ఆఫ్ బీట్ పిక్చర్లు అరుదుగా స్ట్రక్చర్ లో వుంటాయి. పైగా తక్కువ మందిని ఆకర్షిస్తాయి.  

       ఇందులో అపహరణకి గురయిన పిల్లలు బెగ్గింగ్ గ్యాంగ్ పాలబడి ‘స్లమ్  డాగ్ మిలియనీర్’  పద్ధతిలో కళ్ళ పీకివేత  ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. ఇప్పుడు కొన్ని హాస్టల్స్ మెస్సుల్లో కన్పిస్తున్న  స్టూడెంట్స్ కుల వివక్షావస్థని కూడా ఈ సినిమాలో చూస్తాం. ముందు జరిగేది పేపర్లో వచ్చేసే ‘అంతిమ పోరాటం’  తరహా సీనిక్ ఆర్డర్ ని కూడా అప్పుడే చూస్తాం. పిల్లల్ని పరాయి దేశాలకి తరలించి అక్కడ్నించి  మన మీదికే  విరోధులుగా ప్రయోగిస్తారేమో - అన్న ఒక పాత్ర అనే మాటతో... నేటి జిహదిస్టులు కళ్ళకి కడతారు. ఓ మాట అందిందే తడవు, అది పట్టుకుని ఫ్లాష్ బ్యాకుల్లో  కెళ్ళిపోయి తనివిదీరా సావిత్రి వేసే జంధ్యాల బ్రాండ్ ‘సుత్తి’ ని కూడా అప్పట్లోనే ఇందులో చూడొచ్చు. పారిపోతున్న దొంగనుకుని ‘పెద్ద గాంధీ’ లాంటి ప్రయోజకుణ్ణి జనం పట్టుకుని చితకబాది,  చంపేసే అమానుష దృశ్యాలెన్నో ఇప్పుడు మనం చూస్తున్నాం. అలాగే  “ఉపన్యాసాలలో తప్ప ఆంతరంగిక సంభాషణల్లో దేశం, ప్రజలూ  అన్న మాటలు ఒక్కసారైనా అనే నాయకుడు ఒక్కడైనా వున్నాడేమో గుండెల మీద చేయి వేసుకుని చెప్పమనండి”  అన్న అక్కినేని డైలాగు ఇప్పటి రాజకీయాల్లో చూస్తున్నదే. ఇలా వీలైనన్ని అంశాల మీద భవిష్య వాణి ఆనాడే ప్రకటించేసిందీ ఆదుర్తి సృష్టి. 

          సావిత్రి, జమునలవి కీలక పాత్రలేం  కావు. సినిమా టికెట్లు తెగెందుకే వాళ్ళిద్దరూ వున్నారన్పిస్తుంది. అక్కినేని, గుమ్మడిలే రథ సారధులు. మోదుకూరి జాన్స మాటలు రాసిన ఈ వాస్తవిక కథా చిత్రంలో శ్ర్రీశ్రీ రాసిన ఒక మాత్రమే వుంది - ‘ఇదిగో ఇదిగో ప్రపంచం’ అనే పాటకి కేవీ మహదేవన్ స్వరకల్పన. అత్యధిక శాతం దృశ్యాలకి నేపధ్య సంగీతమే వుండదు. తెలుపు – నలుపులో నిర్మించిన ఈ నంది అవార్డు పొందిన చలనచిత్రానికి  కేఎస్ రామకృష్ణారావు ఛాయాగ్రహణం.

          అనేక కమర్షియల్ సినిమాలు తీసిన ఆదుర్తిలో ఒక కోణాన్ని మాత్రమే చూశాం. సమాజం పట్ల బాధ్యత కూడా ఫీలైన దర్శకుడిగా ఇంకో కోణాన్ని ఈ కళాత్మకంలో కళ్ళారా  చూడొచ్చు.


-సికిందర్
(నవంబర్ 29, 2009 – ‘సాక్షి’)



16, సెప్టెంబర్ 2017, శనివారం

516 : రివ్యూ!

రచన -  ర్శత్వం: హేష్ సూరనేని
తారాగణం : నారా రోహిత్, మితా ప్రమోద్, నాగశౌర్య, నందిత, నికెళ్ల ణి, అజయ్, ప్రభాస్ శ్రీను దితరులు
సంగీతం: ఇళరాజా, విశాల్ చంద్రశేఖర్, ఛాయాగ్రహణం : రేష్ కె రాణా
బ్యానర్ : ఆరోహి సినిమా
నిర్మాతలు: సౌందర్య ర్రా, ప్రశాంతి, బీరమ్ సుధాకర్ రెడ్డి, కృష్ణ విజయ్
విడుద : సెప్టెంబర్ 15, 2017
***
      ఇం
కో కొత్త దర్శకుడు బాక్సాఫీసు మీద బాంబులేసి చేతులు దులుపుకున్నాడు. గాయాలన్నీ నారా రోహిత్ కయ్యాయి. కొత్త దర్శకులతో ఇంకెన్ని సినిమాలు త్యాగాలు చేయాలో రోహిత్. ఇతర హీరోలకి మూస సినిమాలతో సమస్య అయితే తనకి డిఫరెంట్ సినిమాలతో సమస్య. తోటి హీరోతో మల్టీ స్టారర్ గా చేసినా తీరని సమస్య. ‘కథలో రాజకుమారి’ తో ద్రవ్యోల్బణంలా పెరిగిపోయిన సమస్య. సెన్సెక్స్ సూచీలా పెరగని సమస్య! 

          కొత్తదర్శకుడు మహేష్ సూరపనేని తనకి ఏది వుందో గుర్తించి దాన్ని చేస్తే ఇలాటి సమస్యలు రావు. టేకింగ్ టాలెంట్ ని తనకి వుంచుకుని, రైటింగ్  పవర్ ని అవుట్ సోర్సింగ్ చేస్తే పరిస్థితి బాగుపడొచ్చు. తన కథల్లో రాజకుమారిలు పారిపోకుండా వుండాలంటే పూలరధమెక్కించాలి, పాడె సిద్ధం చేస్తే కాదు. దాని వెంట ప్రేక్షకులు కూడా రారు. అవతలి భాషల్లో ప్రేమకథలు కొత్తబాట పడుతున్నాయి.  ఇలా పురాతనంగా తీసి విజయాల్ని ఆశించలేరు.

కథ 
     అర్జున్ (నారా రోహిత్) ఒక ప్రఖ్యాత సినిమా విలన్. యాభై  సినిమాలు నటించి, ఐదు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా అందుకున్న టూ ఇన్ వన్ దుష్టుడు. సినిమాల్లో ఎంత క్రూరంగా నటిస్తాడో, జీవితంలో అంతకంటే రాక్షసంగా వుంటాడు. షూటింగుల్లో దర్శకులని ముప్పు తిప్పలు పెడతాడు. తోటి నటుల్ని తీసిపారేస్తాడు. స్ట్రగుల్ చేస్తున్న నటుడు (నాగాశౌర్య) తో సరిగ్గా నటించక ఇబ్బందులు  పెడతాడు. తోటి వాళ్ళని హింసిస్తాడు. అతణ్ణి మార్చాలని ప్రయత్నిస్తూ ఇద్దరు అసిస్టెంట్లు (అజయ్, ప్రభాస్ శ్రీను) వుంటారు. విచ్చలవిడిగా జీవిస్తూంటాడు. అతడి పద్దతి చూసి గర్ల్ ఫ్రెండ్  (నందిత)  బ్రేకప్ చెప్తే భరించలేక తాగేసి యాక్సిడెంట్ చేస్తాడు. డ్రైవర్  సూర్య) కాలు పోగొట్టుకుంటాడు. దీంతో అర్జున్ పొగరంతా దిగిపోయి మంచి వాడుగా మారిపోతాడు. మంచివాడుగా మారిపోవడంతో విలన్ గా  నటించలేక పోతాడు. కెరీర్ ప్రమాదంలో పడుతుంది. కొందరి సలహాలు అడుగుతాడు. అప్పుడింకో  విలన్ సలహా ఇస్తాడు – నీ జీవితంలో నీకున్న శత్రువెవరో గుర్తించు, వాళ్ళ లైవ్ లో కి వెళ్లి వాళ్ళ సుఖ సంతోషాల్ని దూరం చెయ్ – అని.

          అలా చేసే ప్రయత్నంలో తనలో మళ్ళీ విలన్  నిద్రలేస్తాడనుకుని అలాటి శత్రువెవరా అని ఆలోచిస్తాడు అర్జున్. చిన్నప్పుడు తనతో కలిసి చదువుకున్న సీత (నమితా ప్రమోద్) జ్ఞాపకం వస్తుంది. చిన్నపుడు ఆమె తనకి చందమామ కథలో రాజకుమారిలా వుండేది. కానీ  ఆమె  చేసిన ఒక పనికి తన జీవితమే దెబ్బతింది. స్కూలూ వూరూ వదిలేసి వెళ్ళిపోవాల్సి  వచ్చింది. కాబట్టి ఆమె మీద ఇప్పుడు పగ సాధించాలని నిర్ణయించుకుంటాడు.

ఎలావుంది కథ 
      ఇదొక రోమాంటిక్ డ్రామా జానర్ కి  చెందిన ప్రేమకథ. మానసిక అసంతృప్తుల్ని తీర్చే  సైకో థెరఫీ సబ్జెక్టు గా మారాల్సిన కథ.  కథకుడుకి తన చేతిలో వున్న దాని విలువ తెలీక, ఇలా సగటు మూస రెగ్యులర్ ఫార్ములా ప్రేమ డ్రామాగా, ఏ ప్రయోజనమూ లేని  ఏడ్పుల కథగా వృధా అయింది. ప్రతీ వారం విడుదలయి వెళ్ళిపోయే  చిన్నాచితకా రోమాంటిక్ కామెడీలనే  రోమాంటిక్  డ్రామాల్లో ఇదొకటి. మార్కెట్ యాస్పెక్ట్ అనే ప్రాథమిక అర్హతని  కూడా పట్టించుకోని జ్ఞానశూన్యమైన కథ. ఇక క్రియేటివ్ యాస్పెక్ట్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ రెండూ లేకపోయాక ఇదొక సినిమాయే కాకుండా పోయింది. 

ఎవరెలా చేశారు 
      ముందుగా - కనీసం చాలామంది హీరోల్లాగా మూస ఫార్ములా పాత్రల మీద మక్కువ పెంచుకుని పీడించకుండా, సినిమాకొక  వైవిద్యభరిత పాత్రల్ని నటించే నారా రోహిత్ ని అభినందించుకోవడం మన బాధ్యత.  కొత్త దర్శకులని ప్రోత్సహిస్తున్నందుకూ, చాలా వరకూ తనే నిర్మాతగా రిస్కు చేస్తున్నందుకూ కూడా హేట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే తను చూస్తున్న కెలీడియో స్కోప్ లో  వైవిధ్యాన్నీ, కొత్తదనాన్నీ తనతోబాటు చూసి అందుకోలేక
పోతున్నారు సదరు మూస కళ్ళ దర్శకులు. స్టెతస్కోప్ పట్టుకుని పరీక్షించాల్సిన జ్వరం సినిమాలు తీసి చేతిలో పెడుతున్నారు. కొత్త పాయింట్లని కూడా పెద్ద పెద్ద మూస కళ్ళేసుకుని చూస్తున్నారు రోహిత్ ప్రోత్సహించే కొత్త ప్రయోగాల దర్శకులు కూడా. ఇదీ సమస్య.  ముందు కంటి చికిత్స జరిగితేగానీ విచికిత్స మొదలవదు. కంటి శుక్లాలన్నీ మూస బారిపోయాయి. 

          సినిమా విలన్ మళ్ళీ విలన్ గా మారే పాత్ర. విలన్ పాత్రలో నటన బాగానే వుంది, అయితే దానికి సరైన మూలాలు లేకపోవడం చేత అది బలహీనంగానే కన్పిస్తుంది. బలహీన పాత్రని రోహిత్ ఎంత నటించినా బలంగా మారదు. ఇక ఈ బలహీన దుష్ట పాత్ర మంచి పాత్రగా మారాడానికి దారి తీసిన పరిణామం కూడా తూతూ మంత్రంగానే వుండడంతో, మంచి వాడి పాత్ర మరీ నిరర్ధకమై అందులో రోహిత్ నటన బాగా బోరు కొట్టించే స్థితికి చేరింది (1999 లో అక్షయ్ కుమార్ నటించిన ఫ్లాప్  ‘జాన్వర్’ లో తెగ బోరు కొట్టించే పాత్రలాంటిదే ఈ మంచి పాత్ర). ఈ స్థితి ముగింపులో సైతం  బాగుపడలేదు. కథ ఎప్పుడూ బోరు కొట్టదు, పాత్ర బోరు కొడితేనే కథ బోరు కొడుతుంది. పాత్రని బట్టే కథ. 

          ఇక టైటిల్ రోల్ పోషించే హీరోయిన్ పాత్రలో నమితా ప్రమోద్ ఆకర్షణీయంగా వుంది. ప్లాస్టిక్ ఆకర్షణ కాకుండా. టైటిల్ కి తగ్గట్టే రాజకుమారిలా వుంది. నటన కూడా బాగానే వుంది. ఇలాటి హీరోయిన్లు మళ్ళీ ఇంకో సినిమాలో కన్పించకుండా పోతారు. లోపం వాళ్ళది కాదు, సినిమాకొక కొత్త హీరోయిన్ ని తెచ్చి పడేసి, అవతల పడేసి పోతున్న వాళ్ళది. ఐతే ముందు వొక అందమైన ప్రదేశంలో నర్సరీ నడుపుకుంటూ తన కాళ్ళ మీద నిలబడ్డ ఈ రాజకుమారి పాత్రని ఓడించి,  హీరో పాదాక్రాంత చేయడంతో ఏడ్పుల రాజకుమారి అయిపోయింది. రోమాంటిక్ డ్రామాల్లో హీరోయిన్ల పాత్రలు దద్దమ్మలు అయిపోతున్నాయి. ప్రేమలో  ఇద్దరూ సమానులనే అర్ధంలో పాత్రల్ని తీర్చిదిద్దకుండా రాజకుమారిని భ్రష్టు పట్టించారు. ఓడించడానికి వచ్చిన నెగెటివ్ పాత్ర హీరోయే ఓడిపోవాలి. ఈమెని ఓడించేసి తిరిగి విలన్ లక్షణాలు తెచ్చుకుని, సినిమాల్లో తను తిరిగి పాపులర్ అవుతాడు. ఈమె అన్నీ కోల్పోయి వెతుక్కుంటూ వెళ్లి అవార్డుల  సభలో అతడి ప్రేమ కావాలని ఏడవాలి - ఏమీటీ చిత్రణ?

          రోహిత్ పక్కన అజయ్, ప్రభాస్ శ్రీనులు సాధ్యమైనంత నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజుల్లో హీరో నవ్వించకుండా నేస్తాలతో నవ్వించి అదే కామెడీ అని సరిపెట్టేస్తే ఒప్పు కోవడంలేదు ప్రేక్షకులు. ‘మేడమీద అబ్బాయి’ లో అల్లరి నరేష్ కంటే పక్క పాత్ర హైపర్ ఆది నవ్వించడమే ఎక్కువ. 

          హీరోయిన్ తండ్రి పాత్రలో పరుచూరి వెంకటేశ్వరరావు పాత్ర ఇంటి బాధ్యత హీరోయిన్ మీదే వదిలేసి కూర్చోవడమేమిటో అర్ధంగాదు. నర్సరీ ఇబ్బందుల్లో వున్నా  ప్రేక్షక పాత్ర వహించడమే. హీరోయిన్ చెల్లెలి పాత్ర పనివాడితో లేచిపోయే పాత్ర. కథలో రాజకుమారి చుట్టూ ఇలాటి చవకబారు పాత్రలు. కనీసం తమ రాజకుమారిని  గౌరవించుకోని ఇంటి పాత్రలు. 

          నందిత ఒక సీన్లో నటించి వెళ్ళిపోతుంది- హీరోకి బ్రేకప్ చెప్పే సీను. ఇక స్ట్రగుల్ చేసే నటుడి పాత్రలో నాగశౌర్య కథకి వెలుపల వుండిపోయే పాత్ర. కనీసం రోహిత్ పాత్ర మళ్ళీ విలన్ గా మారడానికి వెళ్ళిపోయిన గ్యాప్ లో చకచకా ఎదిగి టాప్ లో వుండాల్సింది పోయి, ఇంకా  అలాగే ఊడిగం చేస్తూ వుండిపోయే ఉల్ఫా పాత్ర. 

          ఈ సినిమాకి అతి పెద్ద ఎసెట్స్ ఇళయరాజా సంగీతం,
రేష్  రాణా ఛాయాగ్రహణం అనాలి. ఈ రెండిటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఏం లాభం,  కొత్త దర్శకుడు తన కథతో, దర్శకత్వంతో సెల్ఫ్ గోల్ చేసుకుంటే?  నిత్యం అప్ డేట్ అయ్యే అద్భుతమైన టెక్నీషియన్స్ వున్నారు. అప్ డేట్ కాని దర్శకుల వల్ల వాళ్ళ నైపుణ్యం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. 

చివరికేమిటి 
       ఎలా చూసినా గజిబిజిగానే తోచే ప్రేమ డ్రామా. ఎక్కడైనా చిన్న స్పార్క్ పట్టుకుని ఫర్వాలేదులే అనుకోవడానికి వీల్లేని చిత్రణలు. హీరో సినిమా విలన్. జీవితంలో కూడా అందరికీ విలన్. ఇలాటి వాడు తాగి కారు నడిపి సొంత డ్రైవర్ కాలు పోగొట్టాడు. దాంతో  కళ్ళు తెర్చి జీవితంలో విలనీ మానేశాడు. దీని ప్రభావం సినిమాల్లో విలనీ మీద పడింది. నటన కష్టమైపోయింది. సలహా తీసుకున్నాడు-  ‘నీ జీవితంలో నీకున్న శత్రువెవరో గుర్తించు, వాళ్ళ లైఫ్ లో కెళ్లి వాళ్ళ సుఖ సంతోషాల్ని దూరం చెయ్ - ’ అని ఒక విలన్ చెప్పిన మాట పట్టుకుని చిన్నప్పుడు తనని నష్టపర్చిన హీరోయిన్ సంగతి తేల్చాలనుకున్నాడు.

          ఇది కథకి మొదటి మలుపు. మొదటి మలుపు (ప్లాట్ పాయింట్ వన్) లో ఏర్పాటు చేసే సమస్య  సహేతుకంగా, బలంగా  లేకపోతే ఇక్కడ్నించీ ఆ కథా నడకా, ముగింపూ ఏవీ సహేతుకంగా, బలంగా  వుండవు. మొదటి మలుపే  కథకి డీఎన్ఏ. కథ బాగోగులన్నీ దీంట్లోనే వుంటాయి.

           ఎవరైనా విలన్ గా నటించాలంటే నిజజీవితంలో విలన్ గా మారాలా? విలన్స్ గా నటించేవాళ్ళు ఇలాగే చేసి విలన్స్ అయ్యారా?  మొదట్లో  సినిమాల్లో విలన్ గా, జీవితంలో కూడా విలన్ గానూ  వున్న హీరో జీవితంలో ఓడిపోయినట్టే. ఒక యాక్సిడెంట్ తో బుద్ధితెచ్చుకుని జీవితంలో మారాడు.  కానీ సినిమాల్లో విలన్ గా ఎలా విఫలమయ్యాడు? ఒకళ్ళని పీడిస్తే తప్ప విలన్ గా నటించలేని వాడు నటుడా? 

          అప్పుడు సలహా ఇచ్చిన ఇంకో విలన్, మళ్ళీ  హీరోని అదే మనో వైకల్యానికి తోసెయ్యడ మేమిటి? ఇంకెవర్నో పీడిస్తే విలన్ గా రాణిస్తావనడమేమిటి? ఈ మాట – వీడు తనకి అడ్డుండ కూడదని అన్నాడా? వీణ్ణి మనిషిగా పతనం చేసే ఉద్దేశంతో అనివుంటే మంచిదే, ఈ రంగంలో ఇది సహజం కూడా. కానీ అంత తెలివిలేదు ఈ విలన్ కి. హీరో మళ్ళీ విలన్ గా మారే  ‘మంచి’ సలహా ఇచ్చాడు. కానీ ఈ మంచి సలహా ఇవ్వడంలో వృత్తికే కళంకం తెచ్చే పోకడలు పోయాడు. శత్రువుని గుర్తించి పీడించమనకుండా - నీ గత జ్ఞాపకాల్లో నిన్ను పీడిస్తున్న సమస్య ఏదో వుండిపోయింది. దాన్ని క్లియర్ చేసుకో. దాని వల్లే జీవితంలో అందర్నీ పీడించావ్. అది చూసుకునే విలన్ గా నటించ గల్గావ్. బూటకపు పునాదుల మీద వున్నావ్. అందుకే పడిపోయావ్. ముందా మానసిక సమస్య తొలగించుకో, అప్పుడు ఒరిజినల్ టాలెంట్ తో నటుడివవుతావ్ – అని చెప్పి వుంటే మంచి సలహా అయ్యేది.

          ఆ విలన్ ఇచ్చిన చెడ్డ సలహా ప్రకారం చూసినా, హీరో తనని చిన్నప్పుడు నష్టపర్చిన హీరో
యిన్ మీదికి వెళ్లడాన్ని ఇలా చూడాలి : ఎప్పుడో చిన్నప్పుడు ఏదో చేశారని ఇప్పుడు పెద్దయ్యాక తవ్వుకుని ప్రతీకారం తీర్చుకునే మనస్తత్వం చాలా అరుదైన సైకలాజికల్ కేసుగా వుంటుంది. దీన్ని సైకలాజికల్ ట్రేడింగ్  స్టాంప్స్ అన్నారు. ఒక కేసుంది : చిన్నప్పుడు అన్నదమ్ములు బొమ్మ బస్సాట ఆడుకున్నారు. అప్పుడు అన్న బస్సు తమ్ముడి బస్సుకి తగిలి డ్యామేజీ అయింది. దీన్నితమ్ముడు మనసులో వుంచుకున్నాడు.

          అన్న నడివయసు కొచ్చి కుటుంబంతో జీవిస్తున్నాడు. ఉన్నట్టుండి ఇంటిమీద రాళ్ళు పడసాగాయి. కొన్ని రోజులు రాత్రి పూట ఎవరో రాళ్ళు వేసి పారిపోతున్నారు. ఒకరోజు అన్న వాణ్ణి పట్టుకున్నాడు. వాడు 45 ఏళ్ల తన తమ్ముడే. ఎందుకిలా చేస్తున్నావంటే, చిన్నప్పుడు నువ్వు నా బొమ్మ బస్సుని  డ్యామేజీ చేయలేదా, అందుకే ఇప్పడు నిన్ను డ్యామేజీ చేస్తున్నానన్నాడు తమ్ముడు!  ఏమనాలో తోచక, జాలిపడి ఏడ్చి, ఆ తమ్ముడికి మానసిక చికిత్స చేయించాడు అన్న. 

          ఇంతే, ఈ పరిధిలోనే వుంటుంది కథలో హీరో ప్రతీకారం కూడా – సైకలాజికల్ ట్రేడింగ్ స్టాంప్స్. ఇది అరుదైన  మనోవ్యాధి తప్ప ఇంకేం కాదు. ఈ అల్ప విషయాన్ని  కథకి మొదటి మలుపులో సమస్యగా ఏర్పాటు చేసి, భీకరంగా నడపబోతే ఇందుకే విఫలమయ్యింది. చిన్నపుడు రాజకుమారిని టీచర్ దండిస్తే, ఆ టీచర్  మీద టపాకాయలు పేల్చాడు హీరో. హీరోయే పేల్చాడని రాజకుమారి నిజం చెప్పేసింది. దీంతో స్కూలు వదిలేసి, వూరు వదిలేసి హీరో వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ ఉత్తుత్తి పగ ఇప్పుడు తీర్చుకోవడానికి వెళ్లి నానా కంగాళీ చేశాడు. చివరికి మళ్ళీ అదే  మానసిక సమస్యతో తిరిగి విలనయ్యాడు, అలాటి వాడికి హీరోయిన్ దాసోహ మయ్యింది.

          ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ (1985) కథ  చేసేది సైకో థెరఫీ అని చెప్పాడు స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్. ఇందులో హీరో (బాలనటుడు) తన తల్లిదండ్రులు ఈసురోమని గడపడం దేనికో అర్ధంగాక స్ట్రగుల్ అవుతూంటాడు. ఒక సైంటిస్టు తయారు చేసిన టైం మెషీన్లో సరదాగా ప్రయాణం చేస్తాడు. అది కాలంలో కొన్నేళ్ళు వెనక్కి వెళ్లి ఒక వూళ్ళో ఆగుతుంది. అక్కడ టీనేజి లవర్స్ గా వున్న తన తల్లిదండ్రులు కన్పిస్తారు. వాళ్ళతో చెలిమి చేస్తాడు, దగ్గర్నుంచి గమనిస్తాడు, పరీక్షిస్తాడు, పొరపచ్చాల్ని తొలగిస్తాడు. తిరిగి వర్తమానం కాలంలో ఇంటికి వస్తే, హేపీగా కన్పిస్తారు  తల్లిదండ్రులు!  

          ప్రస్తుత కథలో ఆ విలన్ పైన చెప్పుకున్న విధంగా హీరోకి - ముందు నీ మానసిక అసంతృప్తికి మూలాలు కనుక్కుని తీర్చుకో, బాగుపడతావ్ – అని మంచి సలహా ఇచ్చి  వుంటే, హీరో చిన్నప్పటి హీరోయిన్ చేష్టకి  సైకో థెరఫీ చేసుకునే లక్ష్యంతో వెళ్లి ఆమెతో బాటు, వొళ్ళు కాలిన టీచర్నీ, ఇంకా అప్పటి వాళ్ళందర్నీ కలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటే సమస్య తీరిపోతుంది. ప్రాయశ్చిత్తం ఎందుకంటే,  హీరోయిన్ తనకు చేసింది పూర్తి న్యాయం. నేరం చేసిన వాడితో ఆమె వుండదు. తను టీచర్ వొళ్ళు కాల్చి పెద్ద నేరం చేశాడు. హీరో తనలోకి తాను ప్రయాణం చేయకుండా, మళ్ళీ అదే బూటకపు పునాదుల మీద ఎదగాలనుకోవడం అజ్ఞానం.


-సికిందర్

                  
         



         



         



15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

515 : రివ్యూ!





రచన – దర్శకత్వం: కె.క్రాంతి మాధవ్
తారాగణం : సునీల్, మియాజార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని, వెన్నెలకిషోర్,  ఆశీష్ విద్యార్థి, ల్లవేణు దితరులు
సంగీతం: జిబ్రాన్,  ఛాయాగ్రహణం : సర్వేష్ మురారి
నిర్మాత : పరుచూరి కిరీటి
విడుదల : సెప్టెంబర్ 15, 2017
***
          ల్లరి నరేష్, సునీల్ లు కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తే ఇద్దరి సమస్య తీరిపోతుందేమో. కామెడీలో స్పెషలైజ్ చేసే వాళ్ళకే  హీరోలుగా మారినా కామెడీ కరుణించకపోవడం కామెడీయే. సునీల్ కి ఇది ఇంకో భంగబాటు. ఈసారి మరీ చెప్పలేనంత నగుబాటు. ఒకసారి తను నటిస్తున్న సినిమాల్ని పరిశీలించుకుంటే అన్నీ ఒకే కాలం చెల్లిన పాత మూస పద్ధతిలో వుం టున్న సంగతి తెలుస్తుంది. ఈ పనిచేయకుండా ఇంకా  ఉంగరాలు, బంగారాలూ ఇలాగే నటిస్తూపోతే ఏమీ లాభం వుండదు. ఇప్పుడు వేరే కళ్ళద్దాలతో చూడాల్సి వుంటుంది. ‘ఉంగరాల రాంబాబు’ ని కూడా చూసిన కళ్ళద్దాలు నిలువుటద్దాలైతే తప్ప పరిస్థితి బాగుపడదు. ఒకసారి ఈ నిలుటద్దంలో ఏం కన్పిస్తోందో చూద్దాం...

కథ 
      రాంబాబు (సునీల్) అనే 200 కోట్ల ఆస్తికి వారసుడు తాత (విజయకుమార్) చనిపోగానే వీధిన పడతాడు. ఏం చేయాలో తోచక బాదం బాబా (పోసాని) ని ఆశ్రయిస్తాడు. ఒక కొండ ప్రాంతంలో తను ఇచ్చే మొక్క నాటితే పోయిన ఆస్తి  తిరిగి వస్తుందని బాబా ఆశీర్వదిస్తాడు. రాంబాబు ఆ మొక్క నాటుతూంటే 200 కోట్లు విలువజేసే బంగారం పెట్టె దొరుకుతుంది. దీంతో బాబా ఠారెత్తి పోయి, రాంబాబు దగ్గర నుంచి ఆ 200 కోట్లు లాగడానికి  ఏవో  సలహాలిస్తూ లక్షలు లాగుతూంటాడు. ఇందులో భాగంగా ఉంగరాల పెట్టె ఇస్తాడు. అవి ధరిస్తే శని వదుల్తుందంటాడు. భారీగా బస్సులు కొని ట్రాన్స్ పోర్టు కంపెనీ పెట్టిన రాంబాబుకి చీకాకులు ఎదురవుతూంటే, బాబా సలహామీద ఫలానా రాశిలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. ఆమె తన ఆఫీసులోనే పనిచేసే సావిత్రి (మియా జార్జి) అని తెలుస్తుంది. సావిత్రిని  ముందు నుంచే ప్రేమిస్తూంటే పట్టించుకోని ఆమెని,  కంపెనీ పని మీద అని చెప్పి దుబాయ్ తీసికెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. ఆమె తండ్రిని ఒప్పించాలంటుంది. రాంబాబు ఆమెతో కేరళలో వాళ్ళింటికి వెళ్తాడు. కమ్యూనిస్టు నాయకుడైన ఆమె తండ్రి రంగ నాయర్ (ప్రకాష్ రాజ్) క్యాపిటలిస్టు రాంబాబుని వెంటనే తిరస్కరిస్తాడు. ఆ తర్వాత కొన్ని పరీక్షలు నెగ్గాలని ఇంట్లో చోటు కల్పిస్తాడు. ఈ పరీక్షల్లో పోటీగా రంగా అల్లుడుగా చేసుకోవాలనుకుంటున్న సుధాకర్ (వెన్నెల కిషోర్) కూడా దిగుతాడు.  ఇక ఈ పరీక్షల్లో రాంబాబు ఎలా నెగ్గి, రంగాని ప్రసన్నం చేసుకుని సావిత్రిని చేపట్టాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      బాగా అరిగిపోయిన మూస కథ. నిజానికి ఇదొక  కొత్త నేపధ్యంతో మాంచి  సెటైరికల్ కామెడీ కాగల కథ. వేసెక్టమీ అనే కొత్త నేపధ్యంతో  సెటైర్ చేస్తూ గత వారం విడుదలైన హిందీలో విజయవంతమైన  ‘పోస్టర్ బాయ్స్’ తరహాలో క్రియేటివ్ కామెడీ కాగల కథ.  మూస దృష్టి వల్ల ఎందుకూ పనికిరాకుండా పోయింది. పాయింటు కొత్తగానే  వుంది, దాని పాలనే  మూస టెంప్లెట్ సినిమాల చట్రంలో ఇరుక్కుంది. పెట్టుబడిదారీ వర్గానికి చెందిన హీరో - కమ్యూనిస్టు నాయకుడైన హీరోయిన్ తండ్రి – ఈ ఇద్దరి మధ్య  పరిష్కారం దొరకని తూర్పు పడమరల భావజాలాల సంఘర్షణ కి బదులు, కమ్యూనిస్టు తండ్రి ఇంకేవో ఫార్ములా పరీక్షలు  పెట్టడంతో – భావజాలాల నేపధ్యం బూజు పట్టిపోయింది. 

ఎవరెలా చేశారు 
     అన్నీ పాత సన్నివేశాలే కావడంతో సునీల్ కామెడీకి కొత్తగా నవ్వుపుట్టుకొచ్చే అవకాశం లేకుండాపోయింది. తను గొప్పగా వుంటుందని చేసిన కామెడీ సీన్లన్నీ పాతబడిపోయిన సీన్లే. ఎప్పుడో సత్యనారాయణ లాంటి నటులు కమెడియన్లు గా చేసినప్పుడు సీనుకో జోకర్ వేషంలో కన్పించి నవ్వించినట్టు, ఇప్పుడు సునీల్ చేయడం ఏంతో  సృజనాత్మక వెనుక బాటుతనంగా తేలింది. తను ఏం చేసినా ప్రేక్షకులు నవ్వడమే లేదు. లేచింది మహిళా లోకమని పిండి రుబ్బి పారేశారు ఎన్టీఆర్. సునీల్ రకరకాల  హీరోల బిట్ సాంగ్స్  వేసుకుంటూ ఎంత పిండి వొత్తినా,  ఎన్ని రొట్టెలు చేసినా అవుట్ డేటెడ్ గానే వేస్టయ్యింది. తను ఆల్ రౌండర్ అన్పించుకోవాలన్న కోరిక బలంగా వున్నట్టుంది సునీల్ కి. దీంతో తను నటుస్తున్నది కామెడీ కథా, కుటుంబ కథా, యాక్షన్ కథా అన్న తికమక ఏర్పడుతోంది. ఆడపిల్ల – తండ్రి సంబంధం గురించి బరువైన పాత  డైలాగులు చెప్పడం, సామ్యవాదం మీద ఉపన్యాసాలివ్వడం లాంటివి చేయడంతో ఒక పంథా లేకుండా పోయింది పాత్రకి. కనీసం తను  యాక్షన్ కామెడీలు నటించినా నటిస్తే ఫలితం వుంటుంది - కమెడియన్ అయిన తను సిక్స్ ప్యాక్ తో యాక్షన్ హీరో కావాలనుకున్నందుకు. దీన్ని కూడా అత్యాశకిపోయి ఆల్ రౌండర్ నంటూ గజిబిజి చేసుకోవడమే బాగాలేదు. 

          హీరోయిన్ గ్లామర్ బొమ్మ తప్పితే పాత్ర లేదు. ఈమె అక్క పాత్రకి ఏదో  కారణం చెప్పి మూగనోము పట్టించారు సరే, తల్లి పాత్రలో నటి కూడా ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫ్రేముల్లో ఉండడమేమిటి. షాట్ పెట్టగానే ఈ తల్లీ కూతుళ్ళు పేరంటాళ్ళా వచ్చి నించుని, షాట్ పూర్తవగానే చేతులూపుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ షాట్ పెట్టగానే హాజరు. సినిమా సాంతం ఇదే రిపీటవుతూంటుంది. ఆ నటికూడా – ఏంటయ్యా నన్ను ఫోటోలు దిగడానికి పెట్టుకున్నావా – అని దర్శకుణ్ణి అడిగి వుండదు పాపం. ఈ తల్లి పాత్ర ప్రకాష్ రాజ్ పాత్రకి భార్య. ఇలా కూడా ప్రాధాన్యం లేకుండా చేశారు. ప్రకాష్ రాజ్ కూడా తన భార్య కాదన్నట్టే వుంటాడు. ఆమెతో ఒక్క డైలాగూ వుండదు. కమ్యూనిస్టు భావాలు బలంగానే వున్నాయిగానీ, కూతురు పెట్టుబడి దారీ వ్యవస్థలోనే  హీరో దగ్గర పని చేసుకుని జీవించడమేమిటి? 

          బాబాగా పోసాని షరా మామూలు నటన.  శిష్యుడుగా శీను రొటీన్. వెన్నెల కిషోర్ కి ఈసారి మూస పాత్రే. విలన్ గా ఆశీష్  విద్యార్థి ఇప్పటికీ పకడ్బందీగా వుంటాడు. కానీ విలన్ గా ఏమీ చేయకుండానే చివరికి వెళ్ళిపోతాడు తన ముఠాతో. దీంతో నిర్మాతకి క్లయిమాక్స్ పోరాటాల ఖర్చు తప్పినట్టయింది – సునీల్ కూడా పోనీలే అనుకోవడంతో. 

          సర్వేష్  మురారీ ప్రతిభనంతా చూపించుకుంటూ కెమెరా వర్క్ చేశాడు - కానీ ఏం లాభం, తనకి దీటుగా కథా కథనాలూ దర్శకత్వాలూ లేవు. జిబ్రాన్ సంగీతం డిటో. భారీగా ఖర్చు పెట్టి సినిమా తీశారు- కానీ విషయమే నాసి.

చివరికేమిటి 
        పెట్టుబడిదారీ – కమ్యూనిస్టు పాత్రల మధ్య సరికొత్తగా, స్ఫూర్తిమత్వంతో కొత్త నవ్వులు పుట్టించాల్సిన కామెడీ - ఫస్టాఫ్ టెంప్లెట్ గానూ,  సెకండాఫ్ సింగిల్ విండో  స్కీము గానూ సర్దుకుని వృధా యింది. ఫస్టాఫ్ ఒక ఫైట్, ఒక గ్రూప్ సాంగ్, హీరోయిన్ తో లవ్ ట్రాక్, ఇంకో సాంగ్, ఇంకాస్త  లవ్ ట్రాక్,  ఇంకో సాంగ్, లవ్ ఓకే, ఇక ప్రత్యర్ది పాత్ర ఎంట్రీ, ఇంటర్వెల్  లాంటి టెంప్లెట్ సినిమాలు ఎన్ని రాలేదు.  ఇక  సెకండాఫ్ లో హీరో ప్రత్యర్ధి ఇంట్లో మకాం వేసే సింగిల్ విండో స్కీముతో ఎన్ని సినిమాలు వచ్చి ఈ స్కీమే బంద్ అయిపోలేదు. అయినా ఏదో సామెత లాగా  మళ్ళీ దీన్నితీశారు. పాత దర్శకులు తమ టైం అయిపోయిందని రిటైరయ్యారు. కానీ టైం అయిపోలేదు- ఇప్పటి దర్శకుల తీరూ అలాగే వుంది. పాత దర్శకులు మళ్ళీ వచ్చేసి తమ తమ సినిమాలు నిశ్చింతగా తీసుకోవచ్చు. ఏమీ మారలేదు.

          ‘మిస్టర్’ అని ఈ మధ్యే వచ్చింది. అందులో గాంధేయ వాదుల గ్రామమని ఒక కృత్రిమత్వాన్ని సృష్టించి, ఏవో చాదస్తపు పాత్రల డ్రామాలతో బోరు కొట్టించి ఫ్లాప్ చేశారు. అక్షయ్ కుమార్ తో ‘జోకర్’  అని వచ్చింది. అందులో మొత్తం పిచ్చి వాళ్ళ గ్రామమంటూ సృష్టించి అభాసు చేసుకున్నారు. చాలా పూర్వం ‘మరో ప్రపంచం’ వచ్చింది. అందులో బాలలకంటూ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తే ఆది కూడా ఆడలేదు. విజయవంతంగా కొన్నేళ్ళ పాటు ఆడింది బహుశా  ‘రాంపూర్’  అనే  కాల్పనిక గ్రామాన్ని సృష్టించిన ‘షోలే’ ఒక్కటే. 

          మళ్ళీ ఇప్పుడు కూడా కేరళలో కమ్యూనిస్టుల  గ్రామమని సృష్టించి భంగపడ్డారు. నాటి  సోవియట్ రష్యాలో లాంటి పరిస్థితులు- సిద్ధాంతాలు – ఎవరికీ సొంతంగా ఏదీ వుండదు (వుండనివ్వదు ప్రకాష్ రాజ్ పాత్ర). ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు, ఉమ్మడి నివాసాలు, ఉమ్మడి భోజనాలు...ఒకే చోటా వండి ఇంటింటికీ పంపుతారు. సోవియెట్ లోనే ప్రజలు తిప్పికొట్టిన ఈ వ్యవస్థని ఇక్కడెవరు కోరుకుంటున్నారో గానీ, దీంతోనూ ప్రకాష్ రాజ్ పాత్రకి నిబద్ధత లేదు. పెట్టుబడిదారీ హీరో తను పెట్టే  పరీక్షల్లో నెగ్గితే కూతుర్నిచ్చేస్తాడా? ఆ వ్యవస్థని వదులుకుని రమ్మనడా? 

          హీరో తను  పెట్టుబడి దారీ వ్యవస్థా గివస్థా తెలీని అమాయకప్రాణిని అంటాడు. హీరో ఇలా తగ్గిపోతే ఇక కథలో బలాబలాల సమీకరణ ఎక్కడిది? ఇంకోటేమిటంటే,  హీరో సొంతంగా రూపాయి సంపాదించలేదు. తాత వున్నప్పుడు తేరగా అనుభవించాడు. పోగానే ఆస్తులు పోయి వీధిన పడ్డాడు. అప్పుడు దొరికిన బంగారంతో బిజినెస్ మాన్ అయిపోయాడు. ఆ బంగారం విలన్ ది. అది నాల్గు వందల కోట్లకి పెరిగింది. ఈ పరాయి సొమ్ముని చివరికి కేరళ గ్రామానికి ఎసరు పెడుతున్న ప్రభుత్వ ప్రాజెక్టు కిచ్చేసి గొప్ప సామ్య వాదంతో ‘కమ్యూనిస్టు’ అయిపోతాడు- ప్రకాష్ రాజ్ పాత్ర కి అల్లుడైపోతాడు!

          అడ్డగోలు సినిమాలు తీసేసి ఆడతాయనుకుంటే నిజంగా ఆడతాయా? ఆడుతున్నాయా? తీ స్తున్నవి అడ్డగోలు సినిమాలని ఇంకెప్పుడు తెలుస్తుంది???

-సికిందర్   
www.cinemabazaar.in