రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, ఫిబ్రవరి 2018, సోమవారం

607 : నోట్ - 2


       
       ష్యూ క్లోజ్ అయ్యేట్టు లేదు. వాట్సాపులు, మెసెంజరులు బిజీ అవుతున్నాయి. ఫోన్ కాల్స్ లో చెప్పిందే చెప్పి నచ్చజెప్పాల్సి వస్తోంది. ఫైనల్ గా  ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చి ఇష్యూ క్లోజ్ చెయ్యాలి. ప్రపంచం ఆగిపోదు, the show must go on! ఈ బ్లాగులో రివ్యూలు రానంత  మాత్రాన కొంపలేమీ అంటుకోవు. కానీ ఇలా రివ్యూలు మానెయ్యాల్సిన పరిస్థితిని కల్పించిన వాళ్ళెవరు?  సినిమా వాళ్ళే!  రివ్యూలు రాస్తున్నంత కాలం ఈ వ్యాసకర్త ఏనాడూ సినిమా ప్రయత్నాలు చేసిందీ లేదు. ఎందుకంటే ఒకర్ని అడుక్కోవాలంటే మనసొప్పదు. చాలా వరకూ అజ్ఞాతంగా వుంటూ రివ్యూలూ ఇతర వ్యాసాలూ రాసి అవతల పడెయ్యడమే తప్ప, వాటినుంచి  మైలేజీ ఆశించే పని కూడా పెట్టుకోలేదు. సినిమా రచయితల సంఘంలో సభ్యత్వం లేదు. క్రిటిక్ అని భావించుకోలేదు కాబట్టి ఆ సంఘాల్లోనూ సభ్యత్వం లేదు. ఏ బంధనాలూ లేని ఫ్రీ బర్డ్ లా  వుంటే, ఒకరొకరే వచ్చి పట్టుకోవడం మొదలెట్టారు. 

          ఎవరు వీళ్ళు? ఒక దర్శకుడు దశరథ్ దగ్గర్నుంచీ అమలాపురంలో ఆటో డ్రైవర్ దుర్గారావు వరకూ వున్నారు. బెల్లంపల్లిలో ఒక అనంత్ దగ్గర్నుంచీ,  విజయవాడలో ఆదిత్యా చౌదరి వరకూ వున్నారు. 1996 లో ప్రారంభించి ఆంధ్రభూమిలో రాస్తున్నప్పట్నించే మొదలయ్యింది. కేరాఫ్ ఆంధ్ర భూమికి ఉత్తరాలు రాసి మేమొచ్చేస్తున్నామని అనే వాళ్ళు. వచ్చి రివ్యూలు రాసేవాడితో ఏంచేస్తారో అర్ధమయ్యేదిగాదు. రావద్దనే చెప్పాల్సి వచ్చేది. ఇక్కడొచ్చి బాధలు పడేకంటే అక్కడే ఫాస్ట్  ఫుడ్ సెంటర్ నడుపుకుని జీవించడం బెటరని చెప్పినా వినేవాళ్ళు కాదు. దుర్గారావొక్కడే  ఆగిపోయాడు. ఇప్పటికీ ఫోన్లు చేసి సినిమాల్ని ఎనాలిసిస్ చేస్తూంటాడు. ఇలా బయటి వాళ్లెందరో వున్నారు. దర్శకుడు దశరథ్ పిలిపించుకుని స్క్రీన్ ప్లే బుక్ ప్లాన్ చేద్దామన్నారు. అది ముందుకు సాగలేదు. ఇక అసిస్టెంట్లు, అసోషియేట్లు సరేసరి. సినిమా ఫీల్డులో అమాయకులకి ఒక నమ్మకముండేది. ఆంధ్రభూమి వెన్నెల్లో రివ్యూలు రాసే వాళ్ళు గొప్ప మేధావులని. ఎంత మేధావులో రాస్తున్న వాళ్లకి పరస్పరం తెల్సు. తెలుగు సినిమాలు తీయడానికీ, రివ్యూలు రాయడానికీ పెద్దగా మేధావితనం అవసరం లేదనీ తెలుసు. కానీ అమాయకులు అలా  బిల్డప్ ఇచ్చేసి ఆంధ్రభూమి ఆఫీసుకొచ్చేసి, బయట టీస్టాల్  దగ్గర ఫ్యాన్స్ గా ప్రకటించుకునే వాళ్ళు. కొందరు కృష్ణానగర్ లో ఫ్యాన్స్ క్లబ్ పెట్టుకుంటామంటే తిట్టి పంపాల్సి వచ్చింది. ఆంధ్రభూమి సంపాదకులు ఎంవీఆర్ శాస్త్రి గారు ఈ వ్యాసకర్త ఏం రాస్తున్నా, ఎలా రాస్తున్నా  ఏమీ అనేవారు కాదు. పైగా కొన్ని రివ్యూలకి  హెడ్డింగులు మార్చి ఘాటు హెడ్డింగులు పెట్టేవారు. నిర్మొహమాటంగా రాయడం ఆయనిచ్చిన స్వేచ్ఛ వల్లే సాధ్యమైంది. ఆయన లేకపోతే ఈ వ్యాసకర్త డబ్బాలు కొడుతూ అందర్నీ సంతోష పెట్టేలా రివ్యూలు రాస్తూ బతికే వాడేమో. ఈ నిర్మాణాత్మక నిర్మోహమాటానికి నెగెటివ్ అనే పేరొచ్చింది. ఏటేటా 90 శాతం అట్టర్ ఫ్లాపులు తీస్తున్న వాళ్ళే  సినిమా ఫీల్డుకి నెగెటివ్ లు కారేమో అన్పించేది మనకి.  దర్శకుడు వీర శంకర్ వెబ్ సైట్ పెట్టి రివ్యూలు రాయిస్తున్నప్పుడు, వీడికి దర్శకత్వం ఛాన్సు రాక, రైటర్ గా అవకాశాలు దొరక్క అక్కసు తీర్చుకుంటున్నాడనీ, కృష్ణా  నగర్ చీప్ లిక్కర్ బ్యాచి అనీ బూతులతో దీవిస్తూ  కామెంట్లు పెట్టే వాళ్లు  సినిమా వా
ళ్ళే. పట్టించుకోలేదు. ఇలాటి వాళ్ళు 90 శాతం అట్టర్ ఫ్లాపులిచ్చే  ఫీల్డుకి పట్టిన అదృష్టవంతులనీ తెలుసు. ఇలా రివ్యూలు రాస్తే కాదు, ఒక సినిమా తీసి చూపించమనే వాళ్ళూ వున్నారు. వాళ్ళే  ఒక్క రివ్యూ రాసి చూపించగల్గితే,  సినిమాలు తీయడానికి వాళ్ళెంత అర్హులో తేలిపోతుంది కదా?  రివ్యూలు రాయడం చాలా ఆషామాషీ బాధ్యత లేని తనమనుకుంటున్నారు ఇప్పటికీ.

          మొత్తానికి వెన్నెల ఇంఛార్జులుగా మారుతూ వుండే చల్లా శ్రీనివాస్, అబ్దుల్, వీఎస్ ఎన్ మూర్తి ముగ్గురూ శాస్త్రి గారిచ్చిన  స్వేచ్ఛ ని అనుభవించారు. కానీ మొదట్లో వెన్నెల ఇంఛార్జిగా  వున్న అఫ్సర్ గారు ఈ వ్యాసకర్తచేత ఆదివారం ఆంధ్రభూమికి క్రైం కథలు రాయించుకునే వారు. ఒక రోజు అక్షయ్ కుమార్ నటించిన ఖిలాడీయోంకా ఖిలాడీ చూసి నవ్వొచ్చి,  రివ్యూలాంటిది రాసి అఫ్సర్ గారికి చూపిస్తే, ఆయనా నవ్వుకుని కంటిన్యూ చేయమన్నారు. ఆ నవ్వులాట వెన్నెల ద్వారా ప్రసిద్ధ రచయిత మైనంపాటి భాస్కర్ కీ చేరి ఆంధ్రభూమి గేటు బయట ఆలింగనం చేసుకున్నారు. అలా యాక్సిడెంటల్ రివ్యూ రైటర్ అయ్యాక, మొదలయ్యింది అసిస్టెంట్ల, అసోషియేట్ల రాక. ఇప్పటికొచ్చి చూసుకుంటే ఓ డెబ్బై మంది వుంటారు. 

          చల్లా శ్రీనివాస్ ఆంధ్రజ్యోతికి వెళ్ళాక అక్కడ ఆదివారం ఆంధ్ర జ్యోతి ఇంఛార్జి ఎడిటర్ కె. వసంత లక్ష్మి గారికి చెప్పి క్రైం కథలు రాయించాడు. రెండేళ్ళు రాశాక  ఆపమని చెప్పి, వసంత లక్ష్మి గారు ఒక సినిమా కాన్సెప్ట్ ఇచ్చారు. వివిధ శాఖల టెక్నీషియన్లని వారం వారం పరిచయం చెయ్యమని. అలా 45 మంది వివిధ శాఖల టెక్నీషియన్లని ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు, సాహిత్యాభిలాష గల ఛోటా కె నాయుడు,  ఇంటర్వూ రాశాక తనకి చూపించి మరీ ముద్రించాలన్నారు. రాసి చూపించాక చాలా ఫీలయ్యారు శైలికి. భుజం మీద చెయ్యేసి అటూ ఇటూ ఫిలాసఫర్ లాగా నడిచారు. అప్పటికి దశరథ్ కావాలని అడిగి రాయించుకున్న బిగ్ కమర్షియల్ స్క్రిప్టు ఈ వ్యాసకర్త దగ్గరుంది. ఇప్పుడు ఛోటా కె నాయుడు గారికి చెప్తే ఎక్కడో ఆయన సెట్ చేసేస్తారు. అయినా చెప్పలేదు.  మనం వెళ్ళింది పత్రిక తరపున ఇంటర్వ్యూ చేయడానికే గానీ, ఈ అవకాశాన్ని సొంత అవసరాలకి వాడుకోవడానికి కాదు. తిరిగి చల్లా  శ్రీనివాస్ ఆంధ్రజ్యోతికి వచ్చి క్రైం స్టోరీలు అడిగితే ప్రస్తుతం తొమ్మిది  నెలలుగా అవి రాయడం జరుగుతోంది. ఇలా అడిగితే తప్ప ఒకర్ని ఇబ్బంది  పెట్టి అడుక్కుని మరీ వెంటపడి రాసే అలవాటు లేకపోవడం చేత, సినిమా రైటర్ కాలేకపోయాడీ వ్యాసకర్త.  ఇది మంచిదే అయ్యింది కదా రివ్యూలు రాసుకుంటూ హేపీగా గడపడానికి? 

          ఇలాటి వాణ్ణి  అసిస్టెంట్లు, అసోషియేట్లు ముగ్గులోకి లాగడం  మొదలెట్టారు. వాళ్ళ కథలకోసం ఏళ్లతరబడి ఎంతో సమయం, శక్తీ కరిగిపోయేది.  కానీ ఏదీ వృధా పోదు – 
nothing goes waste  in God’s grand economy .  ప్రతీ ఒక్కరూ ఎదగాలని  స్ట్రగుల్ చేస్తూంటారు.  ఎవర్నీ చిన్న చూపు చూడలేం, ఎదుగుదల వైపు మనం వుండక తప్పదు. నమ్మి వచ్చిన వాళ్లకి సాయపడాలి. అపాత్ర దానమనేది ఒక నమ్మకం మాత్రమే –nothing goes waste  in God’s grand economy అనేదే సత్యం. చేజారిన నీళ్ళు కూడా నేలని తడుపుతాయి. అక్కడో మొక్కో సూక్ష్మ జీవులో బతుకుతాయి. ఏదీ వృధా పోదు. 

          ప్రతీ ఏటా 70 మంది కొత్త దర్శకులు వస్తే డెబ్బై మందీ అట్టర్ ఫ్లాపవుతున్నారు. వాళ్ళల్లో ఒకరో ఇద్దరో ఈ వ్యాసకర్తతో సంబంధమున్న వాళ్ళే. తీరా సమయం వచ్చేసరికి వాళ్ళేదో రాసుకుని, తీసుకుని,  వాళ్ళ దారిని వాళ్ళు వెతుక్కుని వెళ్ళిపోతున్న వాళ్ళే. ఇది తప్పేం కాదు. మనసుకి నచ్చినట్టు  చెయ్యాలి. ఎక్కువమంది అవకాశాల కోసం ఇప్పటికీ స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళే వున్నారు. ఎప్పుడూ కాంటాక్టులో  వుంటూ,  అవసరమైతే కొత్తవి రాయించుకుంటూ కొన్నేళ్లుగా మిత్రులైపోయి వున్నారు. ఇలా వివిధ దశల్లోనో  (వన్ లైన్ ఆర్డరో, ట్రీట్ మెంటో,  డైలాగ్ వెర్షనో), మొత్తంగానో,  మూడు డజన్ల స్క్రిప్టులు రాసి,  ఒక్కటీ తెరకెక్కకుండా తిరుగుతున్న రైటర్ కాని  రైటర్ ఎవరైనా ప్రపంచంలో వున్నాడంటే,  అది ఈ వ్యాసకర్తేనని ఇప్పటికీ జోకులేసుకోవాల్సి వస్తోంది. మనం సాధించిన రికార్డు ఇదే! 

          టాప్ స్టార్ కి స్క్రిప్టు రాసి, కొన్నేళ్ళు చూసి చూసి,  అపాయింట్ మెంట్ కి కూడా మనమే పూనుకుని ఏర్పాట్లు చేస్తే, ఆ అసోషియేట్ అప్పుడే డాక్టర్ దాసరి నారాయణ రావు గారిలా ఎక్స్ ప్రెషనిచ్చి అపాయింట్ మెంటే లేకుండా చేసుకుంటే ఏం చేయగలం. ఇలాటి మన డొమైన్ కాని పన్లు కూడా చేయాల్సి వచ్చేది. ఒక పేరున్న కో డైరెక్టర్ ఏరికోరి స్క్రిప్టు రాయించుకుని, తీరా ఇంకో సినిమాకి కో డైరెక్టర్ గానే జంప్ అయిపోతే ఏం చేయగలం. దశాబ్డంన్నర కాలంగా ఇలాటి ఫన్నీ సీన్లు ఎన్నో. 

          ఈ కాలంలో వేరే దర్శకుల ఓ నాల్గు సినిమాలు చేయకపోలేదు. వాటిలో రెండిటికి పే రేసుకోలేదు. ఒకదానికి మారు పేరు వేశాం. ఇంకోదానికి వద్దన్నా పేరేసేశారు. ఒక సినిమా చేస్తే మళ్ళీ చేస్తామో లేదో నమ్మకమే లేనప్పుడు, పేరేసుకోకుండా వుంటే రివ్యూ రైటర్ గా  కొనసాగ వచ్చన్న ముందు చూపుతోనే తప్ప మరొకటి కాదు. పేరేసిన సినిమా ఒక్క రోజే ఆడడంతో ఎవరి దృష్టిలో పడలేదు. చాలా హేపీ అన్పించింది. కానీ అప్పటికే యూసుఫ్ గూడా సెంటర్లో పోస్టర్ మీద పేరు చూశామని ఎవరో చెప్పనే చెప్పేశారు. విషయమేమిటంటే,  బతుకమ్మ అప్పట్నించీ సీనియర్ దర్శకుడు టి. ప్రభాకర్ గారంటే  గౌరవముంది. విభేదించి వెళ్ళిపోయినా ఫీలవకుండా మళ్ళీ పిలిపించుకుంటారు. ఆయన ఒక లిమిట్ లో ఆలోచిస్తారు. మనం ఇంకెక్కువ ఆలోచిస్తాం. కాబట్టి ఆయన లిమిట్ లో తీసే సినిమాలకి వర్క్ చేసి పే రేసుకోకుండా వుంటే చాలనుకుంటాం. ప్రస్తుతం ఆయన బిత్తిరి సత్తితో చేస్తున్న ‘తుపాకీ రాముడు’కి కూడా పిలిపించుకుని వర్క్ చేయించుకున్నారు. ఇలా పేరేసుకోకుండా వర్క్ చేసినా, బయట వేరే సినిమాలకి రివ్యూలనేవి రాయకూడదు. ఈ మానసిక సంఘర్షణ వుంటూనే వుంది.

          ఇప్పుడు పదేళ్లో ఐదేళ్లో స్ట్రగుల్ చేసి, క్రియేటివిటీ పరంగా ఈ వ్యాసకర్తతో ఒకే వేవ్ లెంత్ తో వుంటూ వస్తున్న నమ్మిన  మిత్రులకి  రాసిచ్చాంగా  పొమ్మనలేం. ఇంకా వాళ్ళతో పూర్తి స్థాయిలో రాసి, చివరంటా అందుబాటులో వుండాలి. మరో ఇద్దరో ముగ్గురో  మంచి గాలప్ మీద  వచ్చేస్తున్నారు. రేపో ఎల్లుండో ఫైనల్ గా వచ్చి పడతారు అనేట్టున్నారు. ఇలాంటప్పుడు ఇది పూర్తి స్థాయి వృత్తి అయిపోతుంది. రివ్యూలు ఇక ప్రవృత్తి కూడా కాదు. మానెయ్యాలి. ఇంత ఎథిక్స్ ఆలోచిస్తే ఎలా అని కొందరు అంటున్నారు. రివ్యూలు రాయాల్సిందే అంటున్నారు. ఇలా సినిమా వాళ్ళే  అనడం విచిత్రం, ఇతర పాఠకులు సరే. ఇదిక కుదరదని అంటున్నాం. ఇలాటి తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోక తప్ప లేదు. ఇటు వైపు లాగిందే సినిమా వాళ్ళు. ఇది గమనించాలి. 

          రివ్యూలు లేకపోయినా బ్లాగులో ఇతర పనికొచ్చే ఆర్టికల్స్ కొనసాగుతాయి. స్క్రీన్ ప్లేకి సంబందించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు  ప్రత్యక్ష మవుతాయి. ఇప్పుడు స్వీయానుభవం లోంచి రాసేవి కూడా కొన్ని జత కలుస్తాయి.ఇంతేకాకుండా ఎప్పట్లానే అసోషియేట్లకి అందుబాటులో వుండడం జరుగుతుంది. సేవలు యధావిధిగా కొనసాగుతాయి. అవన్నీ కథల గురించే. నిర్మాతలకి డబ్బులొచ్చే కమర్షియల్ కథల గురించి. వీటికి సంబంధించిన రీసెర్చ్ ఎప్పుడూ వుంటుంది. హాలీవుడ్డే  టాలీవుడ్ కి ఆదర్శం. వేరే  డబ్బులు రాని వరల్డ్ మూవీస్ బాపతు కథలు కాదు, షార్ట్ ఫిలిమ్స్  బాపతు కథలు కాదు. వీటికి దూరం.

-సికిందర్
         



         

.
 
         




18, ఫిబ్రవరి 2018, ఆదివారం

606 : విజ్ఞప్తి

డియర్ రీడర్స్! 
          కపైన  బ్లాగులో సినిమా రివ్యూలు వెలువడే అవకాశం లేదు. రాసిన స్క్రిప్టుల్లో రెండు నిర్మాణ దశకి చేరుకుంటుంన్నందున, ఇక రివ్యూలు రాయకూడదని నిర్ణయించాం. ఇతర శీర్షికలు, స్క్రీన్ ప్లే ఆర్టికల్స్  వెలువడుతాయి. బ్లాగుని పర్సనల్ వెబ్ సైటుగా మార్చే ప్రయత్నాల్లో వున్నాం. బ్లాగులోని కంటెంట్ అంతా వెబ్ సైటుకి బదిలీ అవుతుంది. అప్పుడు ఆయా విభాగాలని సెర్చి చేయడం సులభతరమవుతుంది.
          ఇంతకాలం రివ్యూలని ఆదరించిన, వ్యతిరేకించిన పాఠకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
సికిందర్
         (ps : డిసపాయింట్ అవాల్సిన అవసరం లేదు, స్క్రీన్ ప్లేకి సంబంధించిన ఆర్టికల్స్ యధావిధిగా కొనసాగుతాయి. రివ్యూల్లో ఏముంటుంది ఇంకా కొత్తగా తెలుసుకోవడానికి – ఎంత సేపూ తెలిసిన తప్పొప్పులే రాయడం, వాటినే తెలుసుకోవడం. రివ్యూలని ఫాలో అయిన వారికి, ఇకపైన చూసే సినిమాల స్ట్రక్చర్ లోటు పాట్లు ఇట్టే  తెలిసిపోతూ వుంటాయి. వచ్చిన రివ్యూలు కూడా రిఫరెన్సులుగా వుంటాయి. ఒక అనివార్య పరిస్థితి లోంచి నిర్ణయం తీసుకుని రివ్యూలని ఆపివేయాల్సి వస్తోంది )

16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

605 : రివ్యూ!



రచనదర్శకత్వం : మంజుల ఘట్టమనేని 
తారాగణం : సందీప్కిషన్, అమైరా దస్తూర్,  బేబీ జాహ్నవి, త్రిధా చౌదరి, అదిత్అరుణ్,  ప్రియదర్శి, నాజర్ తదితరులు 
సంగీతం: రధన్, ఛాయాగ్రహణం : రవీ యాదవ్
బ్యానర్స్: ఆనంది ఆర్ట్స్, ఇందిరా ప్రొడక్షన్స్
నిర్మాత: పి.కిరణ్, సంజయ్స్వరూప్
విడుదల : ఫిబ్రవరి 16, 2018
          టి, నిర్మాత మంజుల దర్శత్వంలో కూడా తానేమిటో నిరూపించుకోవాలని ‘మనసుకు నచ్చింది’ తో ముందుకు వచ్చారు. డెబ్భై శాతం ప్రేమ సినిమాలతో నిండిపోయిన తెలుగు మార్కెట్లో తానేం  విభిన్న ప్రేమ సినిమాని అందిస్తున్నారా అని ఆశతో ఎదురు చూశారు అభిమానులు. ఆకర్షణీయమైన  తారాగణం,  నిపుణులైన సాంకేతికులు, ప్రముఖ నిర్మాణ సంస్థలూ సమకూరి ఆమె అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఎలా వచ్చారో చూద్దాం...

కథ
          బావా మరదళ్ళయిన సూరజ్ (సందీప్ కిషన్),  నిత్య (అమైరా దస్తూర్) లకి పెళ్ళిచేస్తూంటాడు తాత (నాజర్). పెళ్లి ఇష్టంలేని ఇద్దరూ మేం ఎవర్ని చేసుకోవాలో మేమే చూసుకుంటామని పెళ్లి పీటల మీంచి పారిపోతారు. గోవాలో బస చేస్తారు. నిత్య ప్రకృతి  ప్రేమికురాలు, సూరజ్  ఫోటో గ్రాఫర్. వీళ్ళిద్దరికీ అక్కడ నిక్కీ (త్రిదా చౌదరి) అభి (అదిత్ అరుణ్) అనే ఇద్దరు పరిచయమవుతారు. సూరజ్ నిక్కీ తో ప్రేమలో పడతాడు, నిత్య అభితో ప్రేమలో పడుతుంది. కానీ తనకి సూరజ్ తోనే ప్రేమ వుందని గుర్తిస్తుంది. ఈ విషయం సూరజ్ కెలా చెప్పాలో తెలీక క్షోభిస్తుంది. నిత్యకి ఈ క్షోభ  ఎలా తీరింది? ఆమె మనసు సూరజ్ అర్ధం జేసుకున్నాడా? ఇద్దరికీ పెళ్లి ఎలా జరిగింది? ... అన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ
          మనసుకి నచ్చింది చేస్తే ఏమైనా సాధిస్తామని చెప్పే కథ.  జానర్ వచ్చేసి రోమాంటిక్ డ్రామా. మార్కెట్ యాస్పెక్ట్  వచ్చేసి సున్నా. క్రియేటివ్ యాస్పెక్ట్ వచ్చేసి రొటీన్ ముక్కోణ ప్రేమ. మనసుకి నచ్చింది చేస్తే ఏమైనా సాధిస్తామన్న ప్రకారం మొదటి సగంలో సూరజ్ ఫోటోగ్రఫీకి వర్తింపజేసి చూపించినంత వరకూ బలంగానే వుంది.  రెండో సగంలో ఫ్లేటు ఫిరాయించి ప్రేమకి అన్వయించడంతో కథ ఏకసూత్రత దెబ్బతినిపోయింది. ఎత్తుకున్న కథకీ నడిపి ముగించిన కథకీ సంబంధం లేకుండాపోయింది. మార్కెట్ యాస్పెక్ట్ కి యూత్ అప్పీల్ కూడా ఏమీ లేదు. కథలో ప్రకృతిని భాగం చేసి పదేపదే ఫిలాసఫీ చెప్తూ పోవడంలో కథకురాలి నాలెడ్జిని రుద్దడమే వుంది తప్ప కమర్షియల్ విలువల పట్టింపు లేదు. రోమాంటిక్ కామెడీలుగా నడుస్తూ రోమాంటిక్ డ్రామాలుగా మారిపోయే తెలుగు ప్రేమ సినిమాల మధ్య ఈ కథ ఇప్పుడు మార్కెట్ లేని  పూర్తి స్థాయి రోమాంటిక్ డ్రామా. క్రియేటివ్ యాస్పెక్ట్ లో చూసినా మాసిపోయిన అదే ముక్కోణ ప్రేమ డ్రామా. 2000 లనుంచీ చూసి చూసి వున్న  ‘నువ్వేకావాలి’ టైపు వడ్డన.  ఇంకా బావామరదళ్ళ కథ చూపించే బడాయి. ఫీల్డులో పాతుకుపోయి వున్న నిర్మాతలే,  దర్శకురాలే,  ఎవరో కొత్త వాళ్ళన్నట్టు మార్కెట్ అవగాహన లేకుండా ఇలా సినిమాలు తీస్తారా అనేది మిలియన్ రూకల ప్రశ్న.

ఎవరెలా చేశారు
          సందీప్ కిషన్ తో కలిసి అమైరా, త్రిధా, జాహ్నవీలు నటించారు. నిజానికిది బ్యూటిఫుల్ కాంబినేషన్. పాత్రలు లవబుల్ గావున్నాయి. ప్లేనే ఎలాగో వుంది. ఫస్టాఫ్ లో సందీప్ పాత్ర ప్రయాణం  ఫోటోగ్రఫీకి సంబంధించినంతవరకూ ఎంతోకొంత అర్ధవంతంగా,  యాక్టివ్ గా వున్నాయి. కనుక నటన కూడా బెటర్ అన్పించుకుంది. అతను నటించలేక కాదు, పాత్ర బావుండాలి. ఫోటోగ్రాఫర్ గా అతడి ఇగో దెబ్బతిన్నప్పుడు రేగే భావోద్వేగ ప్రదర్శన దీనికి నిదర్శనం. కానీ ఇలా నిలబెట్టుకున్న పాత్ర ఇటు వృత్తిరీత్యా, అటు ప్రేమ రీత్యా సస్పెన్స్ ని పోషించుకుంటూ ఇంటర్వెల్ కి చేరాక, అక్కడి మలుపుతో కుదేలైపోయింది. ఎప్పుడైతే ఇంటర్వెల్ లో రెండో హీరోయిన్ తో ఇది ముక్కోణ ప్రేమ అన్నారో అక్కడ్నించీ సందీప్ పాత్రా,  దాని కథా దిగజారిపోయాయి. సెకండాఫ్ సహన పరీక్ష పెట్టడంతోనే సరిపోయింది. చివరికి ప్రేమలో ఏం చేయాలో కూడా తెలీక వెక్కి వెక్కి ఏడ్చి, రోమాంటిక్ డ్రామా మూస టెంప్లెట్  ప్రకారం పెద్ద వయసు పాత్ర (తాత ) ని ఆశ్రయించే పాసివ్ పాత్రగా మారిపోయింది. ఎలా మొదలైన పాత్ర ఎలా ముగిసింది! ఇలాటి పాత్రలో యూత్ తనని ఎందుకు చూడాలి? 

          అమైరా దస్తూర్ వండర్ఫుల్ నటి, ఫస్టాఫ్ వరకే. వొళ్ళంతా కళ్ళు చేసుకుని దిగ్భ్రమతో ప్రకృతిని చూసే, ఆరాధించే, ప్రకృతిలోనే గడిపే, ప్రకృతినే ప్రేమించి, అది చెప్పే వూసులు వినే, ఆ వూసుల్లోంచి జీవించడం నేర్చుకునే, ధ్యానమూ యోగా నేర్పే  ఫ్రెష్ క్యారక్టర్. ఈ పాత్ర ప్రయాణం ఎటువైపనేది ఒక సస్పెన్స్ పోషణ ఫస్టాఫ్ వరకే. కచ్చితంగా దర్శకురాలు తనదైన స్త్రీ దృక్కోణంలో పాత్రలకి ప్రకృతిని ఆపాదించి నడిపిస్తున్నదల్లా, ఇంటర్వెల్ రాగానే మేల్ డైరెక్టర్ ల మూసలో పడే సహజ బుద్ధినే ప్రదర్శించుకుంది కొందరు  దర్శకురాళ్ళ లాగే. ఒక దర్శకురాలిగా తీస్తున్నప్పుడు కూడా స్త్రీ స్పర్శతో  సినిమాలు వుండకపోతే ఇక తీయడమెందుకు?  ఇంటర్వెల్ దగ్గర్నుంచీ దర్శకురాలు మంజుల మంజులమైన తన అనుసృజనని వదులుకుని, తనతో బాటు అమైరా పాత్రనీ తీసికెళ్ళి మేల్   డైరెక్టర్ల మొరటు ముక్కోణ ప్రేమ డొమైన్ లో పడేశారు! 

          డిటో త్రిధా చౌదరి. ఫస్టాఫ్ మజా, సెకండాఫ్ సఫా. సఫా కాకుండా మంజుల కుమార్తె జాహ్నవియే చక్కగా మిగిలింది. ఆమె మాట తీరు, నటనలో వేగం ఇవే ఆద్యంతం ఈ సినిమా చూడగల్గేట్టు మిగిలాయి. హీరో ఫ్రెండ్ గా ప్రియదర్శి యాడ్ ఫిలిమ్స్ మేనేజర్ గా సీరియస్ పాత్రలోనే వుంటాడు. యాడ్ కంపెనీ హెడ్ గా సంజయ్ స్వరూప్ ది స్వల్ప పాత్ర, తాతగా నాజర్ దీ స్వల్ప పాత్రే. 

          రవీ యాదవ్ ప్రకృతి దృశ్యాల చిత్రీకరణ క్వాలిటీతో కూడుకుని వుంది. గోవా లొకేషన్స్ ని కొత్తగా చూపించారు. ఈ విజువల్స్ కి రాధన్ సంగీతం, పాటలు ఓ మోస్తరుగా వున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. ఇక ఫిలాసఫికల్ గా ప్రకృతి గురించి అన్నేసి మాటలు రాయడం సాయి మాధవ్  బుర్రాకి అనవసర ప్రయాసే. ప్రకృతిని చూపిస్తూ దాని గురించే చెప్పడంతో ఫీల్ పోవడమేగాక, ఫాలో కాలేని  ఫైలాసఫీతో ఇబ్బంది వచ్చింది. దీనికి ప్రారంభంలో చెప్పిన మహేష్ బాబు వాయిసోవర్ చాలు. ఇక మిగతా మాటలు ఫర్వా  లేదనిపించే స్థాయిలోనే రాశారు ఫస్టాఫ్ లో. సెకండాఫ్ లో పాత కథకి ఎంత డైలాగులు రాసినా లభంలేకుండా పోయింది. 


చివరి కేమిటి 
          ఏ దర్శకులైనా  సరీగ్గా రాయలేకపోతే తీయలేరు. రాత దగ్గరే వుంటుంది తలరాత. ప్రాక్టికల్ గా చెప్పాలంటే దర్శకులు రాయకూడదు, తీయడం మీద దృష్టి పెట్టి రాయించుకోవాలి. అప్పుడే కథ, పాత్రచిత్రణలు, స్క్రీన్ ప్లే – వీటికి సంబంధించిన రీసెర్చి పూర్తి స్థాయిలో సాధ్యమవుతాయి. ఫైనల్ అవుట్ పుట్ పరిపూర్ణంగా వికాసం చెందే అవకాశముంటుంది. తమకే తెలీని లోతుపాతులు బయటపడతాయి. దర్శకులే రాస్తూ కూర్చుంటే,  వాళ్ళకుండే వివిధ వొత్తిళ్ళతో ఏ దశలోనూ రచన సమగ్ర రూపం సంతరించుకోదు. లోపాల పుట్టగానే మిగిలిపోతుంది. 90 శాతం ఫ్లాపుల ప్రధాన కారణమిదే. 

          దర్శకురాలు మంజుల సమస్య ఇదే. ఆమె చెప్పి రాయించుకుని వుంటే ఇంత ఆత్మాశ్రయ ధోరణిలో స్క్రిప్టు వుండేది కాదు స్వగతం చెప్పుకుంటున్నట్టు. ధోరణి కవితాత్మకమే, కానీ అదెలా చెప్పాలో తెలియలేదు. మణిరత్నం ప్రకృతిని వాడుకునే విధానం చూస్తే, ఆయన పాత్రల చేత భాష్యం చెప్పించడు, కామెంటరీలు చెప్పించడు- ప్రకృతే దాని చర్యలతో మాట్లాడుతున్నట్టు  చూపిస్తాడు, చెప్పడు ( ‘show, don’t tell’ సూత్రం). తాజా ‘చెలియా’ లో కూడా వొళ్ళు గగుర్పొడిచే మంచు తూఫాను నేపధ్యంలో ప్రేమికుల వాగ్యుద్ధం ఎన్నటికీ మర్చిపోలేని విధంగా చిత్రీకరించాడు. 

          మంజుల కూడా ప్రకృతితో అలజడి సృష్టించారు. సెలయేళ్ళు, జలపాతాలు, సముద్రాలు, వర్షం- వాటర్ వాటర్ ఎవ్విరీ వేర్ అన్నట్టుగా జల నేపధ్యం సృష్టించారు ప్రతీ కీలక సన్నివేశానికీ. అయితే వాటికి హీరోయిన్ పాత్ర ఫీలవ్వాలేగానీ,  ఆమే పక్క పాత్రలకి వాటి ప్రశస్తి జీవితాలకి అన్వయించి నూరిపోస్తే అభాసు అవుతుంది. ప్రకృతిని ప్రేక్షకులు ఫీలై అర్ధం చేసుకునే సబ్ టెక్స్ట్ గా వదిలెయ్యక – మంజుల తనకెంతో తెలుసన్న ధోరణిలో కామెంటరీలు చెప్పించారు. దీంతో విజువల్ పోయెట్రీ అంతా చెడి, సోదిలా మారింది. సోది ఎందుకంటే, అంత చెప్పడానికి ఆ లేత హీరోయిన్ పాత్ర జీవితానుభవమెంత. అంత జీవితానుభావమే వుంటే,  అలా పారిపోయి ఎందుకొస్తుంది. అంత మెచ్యూరిటీయే వుంటే, ఆ మెచ్యూరిటీతో పెద్దల్ని ఎందుకు ఒప్పించ లేకపోయింది. అంత యోగా  బోధిస్తూ తనెందుకు ఆరోగ్యకరంగా లేదు. అంత ధ్యానం నేర్పిస్తూ తనెందుకు సమస్యకి పరిష్కారం కనుగొనలేక సెకండాఫ్ అంతా ఏడుస్తూ కూర్చుంది. మెచ్యూరిటీ అంతా ప్రకృతికే వుంటుంది. మెచ్యురిటీ లేని పారిపోయి వచ్చిన పాత్రలు అందులో భాగమై నేర్చుకుంటాయి మేడం, నేర్పవు. పాత్రలు ఎదగడం నేర్చుకుంటాయి, ఎదిగిన పాత్రలతో కథ వుండదు. వుంటే కథకాదు. 

          ఫస్టాఫ్ స్ట్రక్చర్ లో వుంది. ముప్పావుగంటలో సందీప్ పాత్రతో ప్లాట్ పాయింట్ వన్ సంఘటన బలమైన చిత్రీకరణ. ఫోటోగ్రాఫర్ గా అసమర్ధుడని అతను పొందే అవమానంతో రెబెల్ అయ్యే దృశ్య చిత్రీకరణ అద్భుతం. ఇలాటి బలమైన సంఘటనలతో ప్లాట్ పాయింట్ వన్ మలుపులు  సృష్టించడం సర్వసాధారణంగా తెలుగు సినిమాల్లో కనిపించదిప్పుడు. దీంతో అతను ఫోటోగ్రాఫర్ గా నిరూపించుకోవాలని సమకడ్తాడు. ప్రకృతిలో ఒక బాలిక (జాహ్నవి), ఆ బాలిక సీతాకోక చిలుక అబ్సెషన్, దాన్ని అతడికి అంటించడం, దాంతో అతను ప్రకృతిలో భాగమై, లీనమై- తనేం చేయాలో, ఎలా చేయాలో , హోరెత్తే జలపాతం దగ్గర  రియలైజేషన్ కొచ్చే మలుపు అంతా ఒక టెర్రిఫిక్ టేకింగ్. అద్భుత ఛాయాచిత్రాలు సృష్టించి సమాధానం చెప్తాడు. నిజానికి హీరోయిన్ వెంట వుండి  ప్రకృతి గురించి ఆమె పెట్టిన సొదకి  బోరు కొట్టించుకున్న తనే, ఇప్పుడా ప్రకృతితో బాగుపడ్డాడు. ఈ సైకో థెరఫీ కథనానికి మంచి డైనమిక్స్ గా  కుదిరింది. ఇక తనకి ప్రేమ చెప్తాడని ఆశిస్తుంది హీరోయిన్. అంతా సస్పెన్స్. జలపాతం దగ్గరికి రమ్మంటాడు. ఏం చెప్తాడు? ప్రేమ చెప్తాడా, లేక ప్రేమ తిరస్కరించి ఫోటోగ్రఫీ అంటాడా అని తీవ్ర ఉత్కంఠ. ప్రేమ చెప్పకూడదు, ప్లాట్ పాయింట్ వన్ ప్రేమ మీద లేదు. ఫోటోగ్రఫీ మీద వుంది. కాబట్టి ప్రేమ చెప్పడు, ఫోటోగ్రఫీ అంటాడేమో - తనొక స్పిరిచ్యువల్ అనుభవాన్ని పొందాక ప్రేమ ఎంత, కేవలం  నాన్సెన్స్. అంతకంతకీ సస్పెన్స్ తో చంపే ట్రాక్ ఇది ఇంటర్వెల్ ముందు. 

          అప్పుడు జలపాతం దగ్గరికి ఆమె వచ్చేసరికి - సెకండ్ హీరోయిన్ ని హగ్ చేసుకుంటూ మొత్తం చెడగొడతాడు హీరో. ఇక ప్లాట్ పాయింట్ వన్ ప్రకారం కథలేదు! వుండదు, నడవదు! ప్రేమలో రెండో హీరోయిన్ తో తుస్సుమనే ఇంటర్వెల్ - అంత సస్పెన్స్ సృష్టించీ!!

          ఇక స్ట్రక్చర్ లేదు, సెకండాఫ్ లో ప్రకృతి లేదు, హీరో ఫోటోగ్రఫీ గోల్ లేదు. మూడు పాత్రల మధ్య చూసి చూసి విసిగిన అదే ముక్కోణ ప్రేమ గోల!
          మంజులకి ఇంకా ఇలాటి కథ మార్కెట్ లో పోతుందని ఎలా అన్పించిందో తెలీదు. తను ఆలశ్యంగా వచ్చారు.  పదేళ్ళ క్రితం వచ్చి వుంటే వర్కౌట్ అయ్యేదేమో. ఇప్పుడు ప్రేక్షకులు చాలా ముందు కెళ్ళి పోయారు. 

          నీతి : ఈ రోమాంటిక్ డ్రామాలతో అసమర్ధ పాత్రలు సృష్టించి ఏం చెప్పదల్చుకున్నారు?  కమిటయ్యే ఆలోచన లేకపోయినా ప్రేమస్నేహాలు చేస్తూ తిరిగి,  తీరా చెప్పమంటే నువ్వు కాదు అదీ (వాడూ) అని ఇంకో శాల్తీని చూపించడమా? దాంతో అదీ సాధ్యం చేసుకోలేక ఏడ్చి,  మొదటి ఆప్షన్ కే సెటిలవడమా? 

          ప్రాక్టికల్ గా వ్యవహరించే  పాత్రలు కమిట్ మెంట్ గురించి ఆలోచిస్తాయి. ఇప్పుడు కమిటయ్యే పరిస్థితుల్లేకపోతే, ఎఫైర్స్ కి దూరంగా వుంటాయి. కమిటయ్యాయంటే ఇక బ్యాండ్ బాజా బారాత్ లే - ఇంకా ఎఫైర్స్ తో కాలం  గడపడం వుండదు. ప్రేమ కమిట్ మెంట్ కాదు, పెళ్లిని కలుపుకున్న ప్రేమే కమిట్ మెంట్ అన్నట్టు వుంటాయి రియలిస్టిక్ పాత్రలు. కమిటయ్యామా, బ్యాండ్ బాజా బారాత్ లే, పిచ్చి ప్రేమలు కాదు.


సికిందర్


14, ఫిబ్రవరి 2018, బుధవారం

604 : ఇంటర్వ్యూ!


        జి. ధనుంజయన్ తమిళ మలయాళ హిందీ సినిమా రంగాల్లో పేరున్న నిర్మాతగా, కాలమిస్టుగా క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు. నిర్మాతగా సంకట్ సిటీ (2009), కందెం కథలై (2009),  ముగమూడి ( 2012), అంజాన్ (2014),  ఇరుది సుత్రు (2016) వంటి సినిమాలు నిర్మించారు. కాలమిస్టుగా గలాటా సినిమా, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా మొదలైన పత్రికల్లో విస్తృతంగా సినిమా రంగానికి సంబంధించి వ్యాసాలు రాస్తున్నారు. మంచి స్క్రిప్తులు రాయడం,  నిర్మాతల్ని పొందడం, మార్కెట్ ని అవగాహన చేసుకోవడం, ఫైనాన్స్, ట్రెండ్స్, జానర్స్ వంటి అనేక అంశాల పైన విశేషంగా రాశారు. గత డిసెంబరులో తను రాసిన వ్యాసాలని  ‘ది ఆర్ట్ అండ్ బిజినెస్ అఫ్ సినిమా’ పేరుతో  గ్రంథంగా  వెలువరించారు. ఈ నేపధ్యంలో ఒక మీడియా సంస్థకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ పాఠాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాం...
మీరు నిర్మాతగా వుంటూ కాలమిస్టుగా ఎలా మారారు?
         
నేనేదైనా సమస్యని ఎదుర్కొన్నప్పుడల్లా దాని గురించి రాసుకోవడం అలవాటు. నిర్మాతగా  అలా రాసుకున్న నా అనుభవాలు, చేసిన పొరపాట్లు షేర్ చేసుకుంటే ఇతరులకి ఉపయోగ పడొచ్చన్న ఉద్దేశంతో పత్రికలకి పంపసాగాను. వుంటున్న రంగం గురించే రాస్తున్నాను కాబట్టి పెద్దగా శ్రమ అనిపించదు. సమయం లేకపోవడమంటూ వుండదు. 
          చాలా మంది కొత్తగా వచ్చే నిర్మాతల్ని కలుస్తూంటాను. వాళ్ళు తాము ఎదుర్కొన్న కష్టాల గురింఛి చెప్పుకుపోతూంటారు. డబ్బెలా నష్టపోయిందీ, కథల విషయంలో ఎలా పొరపాట్లు చేసిందీ చెప్తూంటారు. 2017 లో చాలా మంది కొత్తవాళ్ళు దర్శకులయ్యారు. మొత్తం 160 మంది దర్శకులుగా కొత్తగా పరిచయమైతే, వాళ్ళల్లో ఏడుగురు మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగతా 153 మంది సంగతేమిటి? వాళ్లకి మళ్ళీ అవకాశాలు రావడం కల్ల.  2017 లోనే కొత్తగా వచ్చిన నిర్మాతలు 160 సినిమాలు నిర్మించారు. ముగ్గురే సక్సెస్ కాగల్గారు. ఏ అనుభవమూ, విషయ పరిజ్ఞానమూ అవసరం లేకుండా ప్రవేశించగల్గే రంగం సినిమా రంగమొక్కటే. కొత్తగా వస్తున్న నిర్మాతల ధోరణి  ఎలా వుంటోందంటే - బాగా డబ్బుండి, కొన్నిసినిమాలు చూసి వుంటే చాలు,  సినిమాలు నిర్మించెయ్య వచ్చను కుంటున్నారు. ఇదే నిర్మాతలకి క్వాలిఫికేషన్ అనుకుంటున్నారు.
మీరు రాసిన ఒక వ్యాసంలో, తమిళ సినిమా రంగంలో దర్శకులు తాము సవ్య సాచులుగా ఫీలవుతారని రాశారు. దీన్ని వివరిస్తారా?
          వాళ్ళొక్కరే కథ, మాటలు, స్క్రీన్ ప్లే,  దర్శకత్వం అంతా చేసేయ వచ్చనుకుంటారు.  ఈ మోజులో సినిమా నిర్మాణం ఒక సమిష్టి సృజనాత్మక ప్రక్రియ కాకుండా పోయింది. ఇది కె.  బాలచందర్, భాగ్య రాజాలతో ప్రారంభమైంది. దాంతో ఇక ప్రతి వొక్కరూ భాగ్యరాజాలూ, లేదా టి. రాజేందర్ లూ  అయిపోవాలని ఆలోచించడం మొదలెట్టారు. క్రెడిట్స్ అన్నీ తమకే వుండాలి, పేరంతా తమకే రావాలి. మహేంద్రన్ లాంటి ఏ కొద్ది మందో ఇతరుల కథలు తీసుకుని  సినిమాలు తీశారు. ఇప్పుడు దర్శకులు తామే కథ రాసుకుని,  తామే స్క్రీన్ ప్లే రాసుకుని, తామే మాటలు రాసుకుని,  దర్శకత్వం వహించాలని మోజు పెంచుకున్నారు. కొందరైతే కెమెరా కూడా తామే, ఎడిటింగ్ కూడా తామే అయిపోయారు. దీని వల్ల శాఖలు ఒక్కచోటే కేంద్రీకృతమవుతాయి. దీంతో పనిభారం పెరుగుతుంది. పనిభారం పెరిగితే ఒక్కోశాఖమీద పెట్టాల్సిన దృష్టి నంతా పెట్టలేరు. కథ మీద పెట్టాల్సిన దృష్టి నంతా కథ మీద పెట్టలేరు, స్క్రీన్ ప్లే మీద చేయాల్సిన ఆలోచనంతా స్క్రీన్ ప్లే మీద చెయ్యలేరు, అలాగే మాటల  మీద వెచ్చించాల్సిన సమయం మాటల మీదా  వెచ్చించ లేరు. కథ రాసుకునేప్పటికే క్రియేటివిటీ అంతా తోడేసినట్టవుతుంది. స్క్రీన్ ప్లేకి క్రియేటివ్ వూట వూరదు. మాటలకొచ్చేటప్పటికి  పూర్తిగా ఎండిపోయి వుంటుంది. ఇది తెలుసుకోరు. ఈ పనులన్నీ అసిస్టెంట్స్ ని కూర్చోబెట్టుకునే చేస్తూంటారు. ఆ అసిస్టెంట్స్  ప్రతీ దానికీ గ్రేట్ సర్! గ్రేట్ సర్! అని వంత పాడుతూంటారు. మొత్తం సమస్యంతా ఈ ఆల్ రౌండర్ దర్శకులతోనే వస్తోంది. వీళ్ళ వల్లే ఇన్ని ఫ్లాపులు వస్తున్నాయి.
స్టారు సినిమా కన్నా ఎక్కువ కాదని మీరన్నారు?
          పూర్తిగా  నిజం. స్టార్ అనే అతను ఓపెనింగ్ కలెక్షన్స్ ని రాబట్ట గలడు. ఆ తర్వాత సినిమాలో దమ్ముంటేనే కలెక్షన్సు వస్తాయి. మొదటి ఆట పూర్తయ్యాక ఆ సినిమా కథ, దాని మెరిట్ ఇవి మాత్రమే  సినిమా జాతకాన్ని నిర్ణయిస్తాయి. కొన్ని సార్లు స్క్రిప్టుని స్టార్ కనుగుణంగా మార్చాల్సి వస్తుంది నిజమే. అది మంచిది కూడా. అయితే ముందుగా ఆ స్క్రిప్టు దానికది బావుండాలి.  వున్నప్పుడు స్టార్ కోసం కొంత క్వాలిటీ తగ్గినా  సోల్ దెబ్బ తినకుండా వుంటుంది. ఇక ఒక స్టార్ కోసమే అని స్క్రిప్టు రాయడం ఎవరికీ సాధ్యం కాదు, ఆది వర్కౌట్ కాదు కూడా.  
పాజిటివ్ మెసేజి ఇవ్వడం తమిళ సినిమాలకి ఒక ప్రత్యేకతగా భాసిస్తోంది. ఎందువల్ల? ‘యాంగ్రీ యంగ్ మాన్ - ఎవర్ గ్రీన్ తమిళ సినిమా జానర్’  అని మీరొక వ్యాసం కూడా రాశారు. 
          ప్రజల కంటే స్టార్ పై స్థాయిలో వుండాలన్న అవసరంలోంచి మెసేజిల ట్రెండ్ ప్రారంభమయింది. బిగ్ స్టార్ గా ఒకరున్నప్పుడు, కొన్ని ఉన్నత విలువల్ని సినిమాల్లో ప్రకటించే అవకాశం లభిస్తుంది. ఒక స్థాయికి వచ్చిన హీరో లందరూ సినిమాల ద్వారా ఏదోవొకటి తాము చెప్పాలనే విశ్వసిస్తారు. ఇప్పుడున్న పాపులర్ హీరోలు రాజకీయ ఆకాంక్షలతో వున్నారు కూడా.
          మెసేజి సినిమాల ఆద్యుడు ఎమ్జీఆర్. వినోదాత్మక సినిమాల్లో  మెసేజిలిచ్చే ట్రెండ్ ని ఆయనే ప్రారంభించారు. ఎమ్జీఆర్ కి నటన ఒక్కటే ముఖ్యంకాదు, ఆ వినోదంతో బాటు సందేశం కూడా  అందించాలన్నదే ఆయన  నమ్మిన సూత్రం. ఇందులో ఆయన  సక్సెస్ అయ్యారు. కాబట్టి రజనీకాంత్ ఫాలో అవుతున్నారు. రజనికాంత్ ఫాలో  అవుతున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ  ఫాలో అవుతున్నారు.
          యాంగ్రీ యంగ్  మాన్ జానర్ తమిళంలో 1950 లనుంచీ వుంది. అప్పట్లో సమాజంలో అణచివేతని, దానిపట్ల ప్రజల ఆగ్రహాన్నీఅప్పటి  సినిమాలు ప్రతిబింబించాయి. అప్పుడప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ఇక  అస్పృశ్యతా భావం, బాల్యవివాహాలూ లాంటి అనాచారాలు పోవాలనే ప్రజలు కోరుకున్నారు. అలా సమాజాన్ని సంస్కరించే యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలో అప్పట్లో శివాజీ గణేశన్ నటించిందే ‘పరాశక్తి’.

         
ఇవ్వాళ చూస్తే, రాజకీయాల పట్ల చాలా ఆగ్రహం నెలకొని వుంది. గత ఏడాది కాలంగా తమిళ నాడు రాజకీయాలు బాగా భ్రష్టుపట్టాయని  ప్రజలు కోపంగా వున్నారు. ఈ వాతావరణంలో  కొత్త నాయకులు వచ్చి చక్కదిద్దాలన్న కోరికతో వున్నారు. ఇందుకే యాంగ్రీ యంగ్ మాన్ ఇంకా సజీవంగా వున్నాడు.
తమిళ సినిమా రంగం ఎందుకని అస్తవ్యస్తంగా వుంది? ప్రత్యేకించి సినిమాల విడుదల తేదీల విషయంలో?
         
ఐకమత్యం లేకపోవడమే కారణం. ప్రొఫెషనలిజం అసలే లేదు. లేకపోతే ఆరు సినిమాలు ఒకే రోజు ఎందుకు విడుదల చేస్తారు? అవన్నీ ఎవరు చూస్తారు? మార్కెట్ పై అవగాహన లేకుండా విడుదల తేదీల్ని నిర్ణయించేస్తున్నారు. థియేటర్ లు దొరుకుతాయా  లేదా అని  నిర్మాత లెవరూ కేర్ చేయడం లేదు. అందుకే కష్టాల పాలవుతున్నారు. పెద్ద సినిమాలు 90 శాతం ఫ్లాపవడం, చిన్న సినిమాలు 95 శాతం ఫ్లాపవడం ఒక పారంపర్య సాంప్రదాయంగా మారింది. కేవలం ప్రొఫెషనలిజం లోపించడమే దీనికంతటికీ కారణం.
ఇవ్వాళ తమిళ సినిమా మార్కెట్ ఎంత? 
          ఇవ్వాళ తమిళ సినిమాలు 35 దేశాల వరకూ విస్తరించాయి. అంటే పెద్ద మార్కెట్ నే కలిగి వుందని చెప్పొచ్చు. అయితే ఇది పెద్ద సినిమాలకి మాత్రమే. చిన్న సినిమాలకి విదేశీ మార్కెట్ లేదు. అవి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా చేరుతున్నాయి.
తెలుగు -  తమిళ ద్విభాషా చిత్రాల ఫార్ములాతో బాగానే సినిమాలు వస్తున్నా
యేమో?

          లేదు. ‘స్పైడర్’ తో చేదు అనుభవమే ఎదురయింది. నిర్మాతలెవరూ ఇక ద్విభాషా చిత్రాల ఆలోచన చేయడం లేదు. ప్రయోగాత్మకంగా ప్రారంభించారు., ప్రయోజనం లేదని విరమించుకున్నారు.
మీరు ఫ్లెక్సీ టికెట్ ప్రైసింగ్ విధానం రావాలని రాశారు. అంటే ఏమిటి?
         
ఫ్లెక్సీ టికెట్ ప్రైసింగ్ విధానం అమలుపరచాలని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. మార్నింగ్ షోలకి తక్కువ టికెట్ ధరలు, వారాంతపు షోలకి ఎక్కువ టికెట్ ధరలు. అలాగే చిన్నసినిమాలకి తక్కువ టికెట్ ధరలు, పెద్ద సినిమాలకి అధిక టికెట్ ధరలు ... ఇలా చేయడంవల్ల,  చిన్నా పెద్దా సినిమాలన్నిటికీ మంచి రెవెన్యూ వచ్చే అవకాశముంటుంది. ముఖ్యంగా చిన్న సినిమాలు బాగా ఆడతాయి.
మీరు అమ్ముడుపోని సినిమాల మీదొక వ్యాసం రాశారు. దీని గురించి చెప్పండి.  
          సినిమాల కొనుగోళ్ళ విషయానికొస్తే శాటిలైట్ నెట్వర్కుల నిర్వాహకులు సెలెక్టివ్ గా వుంటున్నారు. పెద్ద హీరోల సినిమాలైతేనే  కొనుగోలు చేస్తున్నారు. చిన్న చిన్న సినిమాలని పట్టించుకోవడం లేదు. ఏదో వొక రేటుకైనా  వాటిని కొనడం లేదు. ఇక నిర్మాతలు తప్పని సరై డిజిటల్ ఆప్షన్స్ వంక చూడాల్సి వస్తోంది.
బాక్సాఫీసు ఫిగర్స్ ని ఓవర్ రిపోర్టింగ్ చేసే ధోరణి ప్రబలిపోయింది. థియేటర్లకి కంప్యూట రైజుడు బిల్లింగ్ విధానం లేదు. దీంతో ఎదురవుతున్న సవాళ్లేమిటి?
          థియేటర్ల యాజమాన్యాలు నిజమైన కలెక్షన్స్ ని వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. ఇలా ఎల్లకాలం ఫిగర్స్ ని దాచిపెట్ట లేరు, అవునా? ఈ పరిస్థితి తప్పక మారుతుందని నేను నమ్ముతున్నాను.
***


11, ఫిబ్రవరి 2018, ఆదివారం

603 : క్రియేటివిటీ సంగతులు!


స్ట్రక్చర్ ని  కాస్సేపు పక్కన పెడదాం, అసలు ఈ క్రియేటివిటీ ఏంటో చూద్దాం. తెలుగు సినిమా అనేది క్రియేటివ్ ఆలోచనల పరంగా ఇంకా సంధి కాలంలోనే కొట్టు మిట్టాడుతోంది. గడిచిపోయిన తొలి వ్యాపార యుగం దాటిరావడానికి మొరాయిస్తోంది. తొలిస్వర్ణయుగం (1931 - 51), మలిస్వర్ణ యుగం (1951 -71) ముగిసిపోయి,  తొలి వ్యాపార యుగం (1971 – 2001) కూడా గడిచి పోయి రెండు దశాబ్దాలు కావొస్తున్నా ఇంకా 1971 – 2001 నాటి తొలి వ్యాపార యుగం దగ్గరే తచ్చాడుతోంది తెలుగు సినిమా క్రియేటివిటీ. నేటివిటీ పేర, ప్రేక్షకుల భావోద్వేగాల పేరా ఆ సంధి కాలంలోనే అవాస్తవిక, కృత్రిమ సర్కస్సులు చేస్తోంది. దాంతో చేదు అనుభవాలు చవి చూస్తోంది. నేటివిటీలు మారిపోతున్నాయి, సంస్కృతులు సన్నగిల్లుతున్నాయి,ఇంటర్నెట్ జీవితాల
వుతున్నాయి, భావోద్వేగాలూ అందుకనుగుణమైన  సంగతులు పట్టుకుని కొత్త పుంతలు తొక్కు
తున్నాయి. తరాల అంతరాలు చెరిగిపోయాయి. ఇంటర్నెట్  కలిపేస్తున్న జీవితాల్లో అన్ని వయసుల వారూ కలిసిమెలిసి  సాగుతున్నారు. పరస్పర ఫిర్యాదులు లేవు, జనరేషన్ గ్యాప్ సంఘర్షణల్లేవు. అయినా ఇంకా  అదే ముప్పై ఏళ్ళనాటి పాతకాలం మూస క్రియేషన్లతో  సినిమాలు చుట్టేస్తున్నారు. ఈ మూసతో అనుసంధానం కాలేక మలి వ్యాపార యుగపు ప్రేక్షకులు  గోలెడుతున్నారు. యుగ ధర్మాల్ని క్రోడీకరించుకుని దిశా నిర్దేశం చేయాల్సిన గొప్ప గొప్ప సీనియర్లు, అనుభవజ్ఞులు సైతం  సంధికాలంలోనే గడ్డ కట్టిన క్రియేటివిటీతో  అక్కడే  ఇరుక్కుపోయారు. సినిమా క్రియేటివిటీ వ్యాపారంతో  కూడుకున్నదని తెలిసికూడా కాలం చెల్లిపోయిన పాత ఫ్యాషన్ చొక్కాలు సినిమాలకి ధరింప జేస్తున్నారు.  తొలి వ్యాపార యుగం దాని కాలజ్ఞానంతో ఎంత విజయవంతమో, మలి వ్యాపార యుగాన్ని  అజ్ఞానంతో అంత దివాలా కోరుతనంగా తయారు చేస్తున్నారు  – నిత్యం  90 శాతం ఫ్లాపుల పుణ్యంతో ఇంకా ఇంకా. సింపుల్ గా చెప్పాలంటే , శుభ్రంగా  వ్యాపారం మర్చిపోయారు! 

         
కల్చర్ తాజా బాధితురాలు ‘గాయత్రి’. దీనికి సంధి కాలపు మార్కెటబిలిటీ లేని క్రియేటివిటీ తప్ప స్ట్రక్చర్ పట్టలేదు. స్ట్రక్చర్ లో ఆలోచిస్తే,  కూతురి అన్వేషణలో వున్న శివాజీ (బిగినింగ్),  తీరా కన్పించిన కూతురు దుర్మార్గుడని తిరస్కరించాక (మిడిల్) - ఆమె అపార్ధం తొలగించడానికి స్ట్రగుల్ చేస్తూంటే, పటేల్ ఇచ్చిన ఆఫర్ తో అతని బదులు తను జైలుకెళ్ళి ఇరుక్కుని,  కూతురి  అపార్ధం తొలగడంతో ( ఎండ్) -   ఆమెతో కలిసి పటేల్ అంతు చూశాడు – అనే క్రమంలో వుండాలల్సిన  కథ. 

          ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ ఇలా కూతురితో తలెత్తిన సమస్యా,  దాని పరిష్కారమూ  అన్న రెండు మూల స్తంభాలాధారంగా వున్నప్పుడే, ఈ కథకి స్క్రీన్ ప్లే అనే సౌధం నిలబడగల్గేది. 

          కానీ ఈ స్క్రీన్ ప్లేకి మొదటి మూలస్తంభమే వుంది, రెండోది కన్పించడంలేదు. శివాజీ యాక్టివ్ పాత్రగా లేడు, పాసివ్ గా కన్పిస్తున్నాడు. ఏది ప్రధాన కథో తెలియడం లేదు, గాయత్రీతో  -  పటేల్ తో రెండు వేర్వేరు కథల్లాగా అన్పిస్తున్నాయి. ఏది ప్రధాన జానరో, ఏది దాని తాలూకు సబ్ జానరో తెలియడంలేదు, రెండూ కలిసి పోయి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.
ఫ్యామిలీ డ్రామానో, ఫ్యామిలీ థ్రిల్లరో అర్ధం గావడం లేదు.  గాయత్రితో ఫ్యామిలీ డ్రామాగా వుంటూ,  ఒక్కసారిగా  పటేల్ రాకతో ఫ్యామిలీ థ్రిల్లర్ గా మారిపోయి,  సెకండాఫ్ సిండ్రోంలో పడిపోతోంది.  ఇలా సెకండాఫ్ లో కథ ప్లేటు ఫిరాయించి వేరే కథలుగా మారిపోయిన సెకండాఫ్ సిండ్రోములు - సర్దార్ గబ్బర్ సింగ్, దొంగోడు, ధమ్, తేరేనామ్, హవా, జ్యోతిలక్ష్మి, సైజ్ జీరో వగైరా వగైరా  ఎన్నో అట్టర్ ఫ్లాపుల జాబితాలో చేరిపోతోంది ‘గాయత్రి’ కూడా. క్రియేటివ్ యాస్పెక్ట్ రీత్యా స్ట్రక్చర్ పరిస్థితి ఇదీ.

―2―
మార్కెట్ యాస్పెక్ట్  కొద్దాం. ఇక మోహన్ బాబు యువతరం ప్రేక్షకుల్లో పాగా వేయాలనుకుంటే, వాళ్ళ అభిరుచులకి తగ్గట్టుగా తన పాత్రల తీరుతెన్నుల్ని  మార్చుకోవాల్సిందే. ఇవాళ్ళ సినిమాలు  ప్రధానంగా యూత్ కోసం, తర్వాత మిగిలితే వాళ్ళ అమ్మా బాబుల కోసం. సీనియర్ మోహన్ బాబు అయినా రంగంలో వుండాలంటే యూత్ కోసమే వుండాలి తప్ప, వాళ్ళ అమ్మా బాబుల్ని రంజింప జేస్తానంటే అమ్మాబాబులు ఆల్రెడీ అలసిపోయారు. ఇవాళ్ళ తెలుగు సినిమాలకి యూత్ అప్పీల్  గా మిగిలిన  అంశాలు రెండే రెండు - ఎకనమిక్స్, రోమాంటిక్స్. మోహన్ బాబు మొదటిది ప్రతిబింబించేలా మొదటి పాత్ర పోషణ చేశారు. డబ్బుకోసం ఇతరుల బదులు జైలు కెళ్ళడం. అయితే ఆ ఎకనమిక్స్ తో ఎక్కడా ఆకట్టుకోలేదు. డబ్బు నెక్కడా చూపించలేదు. మాటల్లో తప్ప విజువల్ ప్రెజెన్స్ లేదు. ఆ డబ్బుతో విలాసవంతమైన ఎదుగుదల లేదు. అది నెగెటివ్ షేడ్ అవుతుందని అభ్యంతరం చెప్పదల్చుకుంటే, అసలలా చట్టాన్ని ఏమారుస్తూ ఒకరి బదులు జైలు కెళ్ళడమే పెద్ద నేరం. ఆ డబ్బుతో అనాధ పిల్లల్ని పోషించడం ఇంకా తప్పు. 

          రెండోది, ఈ వుండీ లేని ఎకనమిక్స్ తో యూత్ అప్పీల్ కి,  అనాధాశ్రమం నడపడమనే ఏ మాత్రం పొంతన లేని సంధి కాలపు పాత సుత్తి వ్యవహారం తోడయ్యింది. దీంతో మోహన్ బాబు మొదటి పాత్ర యూత్ అప్పీల్ కి పూర్తిగా దూరమైపోయింది. యూత్ కి కనెక్ట్ కాకుండా పోయారు. మోహన్ బాబు ఇంకా మధ్య వయస్కులైన తన పాత అభిమానుల కోసమో, మరెవరి కోసమో ఆ కాలపు పాత్ర చిత్రణ చేసుకుంటానంటే కుదిరే పరిస్థితి లేదు. వర్గాల కతీతంగా  ప్రేక్షకులందరి అప్పీలూ ఇవాళ్ళ  ఈ రెండిటికే - ఎకనమిక్స్, రోమాంటిక్స్. 

          ఎకనమిక్స్, రోమాంటిక్స్.
          ఎకనమిక్స్, రోమాంటిక్స్.
          ఎకనమిక్స్, రోమాంటిక్స్.
          ఎంటర్ టైన్మెంట్, ఎంటర్ టైన్మెంట్, ఎంటర్ టైన్మెంట్ – ఇదే మలి వ్యాపార యుగపు సినిమా స్టయిల్.

―3―
పోనీ రోమాంటిక్స్ చూద్దామన్నా, దీని జాడ ఎక్కడా కనబడదు. యువ గాయత్రి పాత్రతో కూడా. మోహన్ బాబు మొదటి పాత్ర శివాజీకి యుక్త వయసు వెర్షన్ పోషించిన విష్ణుతో కూడా రోమాన్స్ కన్పించదు, ఏదో కాసేపు ఫ్లాష్ బ్యాకులో శ్రియతో పాత తరహా ప్రేమ తప్ప. యూత్ అప్పీల్ కి వీలుండే గాయత్రికి ప్రేమాయణం లేకుండానే డ్రైగా చూపించడం మార్కెట్ యాస్పెక్ట్ అయిన రోమాంటిక్స్ కి విరుద్ధం. ఇలా మార్కెట్ యాస్పెక్ట్ కి  వుండాల్సిన ఎకనమిక్స్ లేదు, రోమాంటిక్స్ లేదు. మార్కెట్లో యువ ప్రేక్షకులు -  యువ ప్రేక్షకులు అంటూంటారే గానీ ఎవరా యువప్రేక్షకులు? వాళ్ళల్లో అమ్మాయిల్లేరు. చాలా వరకూ అబ్బాయిలే యువప్రేక్షకులుగా పోషిస్తున్నారు సినిమాల్ని. అమ్మాయిల్ని ఆకట్టుకునే పాత్ర చిత్రణలు లేకపోవడం అమ్మాయిలు దూరమవడానికి కారణం. కాబట్టి ‘గాయత్రి’ అని టైటిల్ పెట్టుకున్నప్పటికీ  అమ్మాయిలు డుమ్మా కొట్టడానికి కారణమిదే. కనీసం - ‘గాయత్రి’ క్యారక్టర్ యూత్ అప్పీల్ తో వుందని, ఆమె యూత్ ఫుల్ రోమాంటిక్స్ కి మోహన్ బాబు చేసే డిగ్నిఫైడ్ హెల్ప్ ‘పింక్’ లో అమితాబ్ లాగా ఏంతో అప్డేట్ అయి  వుందనీ, మౌత్ టాక్ వచ్చేలా సినిమా ధోరణి వుంటేగా!

―4―
          ఫ్యామిలీ డ్రామాలు నేటి దైనందిన  జీవితాల్లో  ఎదురవుతున్న సమస్యలతో (ఎకనమిక్స్, లేదా రోమాంటిక్స్) ఎంతో పకడ్బందీగా, ఆధునికంగా  తీస్తే తప్ప ఈ రోజుల్లో పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కథని ఎకనమిక్స్ తోనో, రోమాంటిక్స్ తోనో ముడి పెట్టి ఫ్యామిలీ థ్రిల్లర్ జానర్ ప్రధాన కథగా చేసి చూపించాల్సి వుంటుంది. అంటే శివాజీకి కూతురు కన్పించడం లేదన్న ధ్యాస తప్ప, దాంతో కూతురికోసం సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్లేవర్ తో తీవ్ర ప్రయత్నాలు తప్ప, ఇంకో వ్యాపకం వుండడానికి కుదరదు. ఉపాధి కోసం స్టేజి నటుడి టాలెంట్ ని నేరస్థులకి డబుల్ గా వ్యవహరిస్తూ జైలుకెళ్ళి వస్తూండే బిజినెస్ గా వుంటే వుండొచ్చు. కూతరు కన్పించడం ప్లాట్ పాయింట్ వన్ గా వుంటూ, ఆమె తిరస్కరించడంతో మిడిల్ సంఘర్షణగా కొనసాగుతూ,  మధ్యలో విలన్ గాయత్రీ పటేల్ పరిచయంతో, సంఘర్షణ కూతురి ఆర్గ్యుమెంట్ నేపధ్యంలో నైతిక విలువల ప్రశ్నగా మారుతూ, చివరికి జైలు కెళ్ళి పటేల్ తో మోసపోయి, కూతురి ఆర్గ్యుమెంటే నెగ్గి తను తలొగ్గి,  ప్లాట్ పాయింట్ టూ కొచ్చి, ఇక కూతురితో కలిసి పటేల్ ని ఎదుర్కొనే ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా ముగియాలి. ఇందులో ఫ్యామిలీ డ్రామా వుంటే అంతర్లీనంగా ఎలాగూ వుంటుంది. దానికోసం తహతహలాడుతూ కథనే ఫ్యామిలీ డ్రామాగా మార్చేయ నవసరం లేదు.


―5―
          కూతురి ఆర్గ్యుమెంట్ నేపధ్యంలో నైతిక విలువల ప్రశ్న అంటే ఏమిటి? కథంటే ఆర్గ్యుమెంట్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. రెండు పాత్రల మధ్య తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ సహిత  కథనమనీ, చివరికి ఆ ఆర్గ్యుమెంట్ తాలూకు జడ్జి మెంట్ తో ముగింపనీ. ఇది ఏ కథయినా డిమాండ్ చేసే దాని ప్రాథమిక హక్కు. దీన్ని కాదనడానికి వీల్లేదు. 

         గాయత్రి ఆర్గ్యుమెంట్ ఏమిటి? పుట్టగానే తన తండ్రి శివాజీ తాగుడు కోసం వెయ్యి రూపాయలకి తనని అమ్మే ప్రయత్నం చేశాడని కదా? ఇదామె అపార్ధమే కావొచ్చు. కానీ ఆమె పుట్టక ముందు నుంచీ తను చేస్తున్న పనేమిటి? తన నాటక కళని తప్పుడు విధానంలో జీవిక కోసం వాడుకుంటూ - చట్టాన్ని ఏమారుస్తూ -  ఆయా నేరస్థుల రూపంలో వాళ్ళ బదులు తను జైలు కెళ్ళి వస్తున్నాడు. ఒక క్రిమినల్ గా రూపాంతరం చెందాడు. అదామె అపార్ధమైతే, ఇది తన నైతిక విలువల ప్రశ్న. దీనికేం సమాధానం చెప్తాడు కూతురికి? ఈ అనైతిక ప్రవర్తన ఆమె చేసుకున్నఅపార్ధాన్ని పూర్తిగా బలపర్చేట్టు లేదా? ఇది కాదా ఫ్యామిలీ డ్రామా అంటే? తప్పిపోయిన కూతురు దొరికి, ఆ తండ్రీ కూతుళ్ళు కన్నీళ్లు కార్చే  పై పై ఉపరితల  మెలో డ్రామాయేనా ఇంకా తెలుగు సినిమా మార్కు ఫ్యామిలీ డ్రామా అంటే?  పాత్రల లోలోపలి కుళ్ళు అలాగే మిగిలిపోతూ? ఈ హిపోక్రసీకే  - ఫాల్స్ డ్రామాకే ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారా?

―6―
        అనాధ పిల్లల సంరక్షణతో, జైలుకి రాకపోకలతో, ఇంకొన్ని మంచి పనులతో  శివాజీని చూపించుకొస్తూ, ఒకచోట అనుకోకుండా కూతురు గాయత్రితో సంఘటన సృష్టించారు. తండ్రీ కూతుళ్ళమని వాళ్ళిద్దరికీ తెలియని డ్రామా బావుంది. దుండగుల బారి నుంచి ఆమెని కాపాడేస్తాడు. ఆమె సెల్ ఫోన్ కింద పడిపోయి వుంటుంది. తీసి ఆమె కివ్వబోయేంతలో ఆమె ఆటోలో వెళ్లిపోతూంటుంది. ఇంటికొచ్చి ఛార్జింగ్ పెడతాడు. సెల్ ఛార్జి అయ్యాక స్క్రీన్ వెలుగుతుంది. అప్పుడా స్క్రీన్ సేవర్ గా ఆమె తల్లి ఫొటో డిస్ ప్లే అవుతుంది. ఆ తల్లి (శ్రియ) శివాజీ భార్యే! ఇదెంతో కదలించే  మంచి మెలో డ్రామాగా వుంటుంది (ఇది తప్ప ఈ ఫ్యామిలీ డ్రామాగా తీసిన సినిమాలో ఇంకొక్క కదిలించే సన్నివేశం కూడా లేదు). 

          పుట్టగానే కన్పించకుండా పోయిన కూతురి కోసం తను పడుతూ వచ్చిన ఆవేదన ఇక తీరిపోయిన క్షణాలు! పట్టరాని ఆనందం. సర్వసాధారణంగా ప్లాట్ పాయింట్ ఘట్టం ఒక సీరియస్ గా తలెత్తే సమస్యతో ఉద్రిక్తంగా వుంటుంది. ఆ సీరియస్ సమస్యని సాధించే గోల్ తో పాత్ర ప్రయాణం మిడిల్లోకి సంఘర్షణాత్మకంగా వుంటుంది. కానీ ఇక్కడ పూర్తి వ్యతిరేకంగా వుంది అపూర్వంగా. ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ ఆనందభరితంగా తయారైంది. కథకి అనితరసాధ్యంగా కుదిరిన ప్లాట్ పాయింట్ వన్ మలుపు ఇది. సర్వ సాధారణంగా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర్నుంచి పాత్రకి సీరియస్ ప్రయాణంగానే వుంటుంది. ఇక్కడ దీనికి విరుద్ధంగా,  ఇక్కడ్నించీ శివాజీకి సంతోషకరమైన ప్రయాణంగా వుంది - కూతురు దొరికిందనీ, కూతుర్ని కలుసుకోబోతున్నాననీ!

          ఇంతమంచి ప్లాట్ పాయింట్ వన్ తో శివాజీ ఓ హేపీ సాంగ్ కూడా పాడుకోవడం ప్లాట్ పాయింట్ వన్ ని విజువల్ గా ఇంకెంతో ఎలివేట్ చేసింది. ప్లాట్ పాయింట్ వన్ ని అనుసరించి పాటెప్పుడూ వుండదు. ఇక్కడ ఇలా చక్కగా  కుదిరింది.  తీరా పాట తర్వాత ఆ కూతుర్ని కలుసుకోబోతూంటే, నిండు సభలో తండ్రి గురించి ఆమె చెప్పే మాటలు వింటాడు - తండ్రి ఎంత దుర్మార్గంగా తాగుడు కోసం తనని అమ్మేశాడో అని. దీంతో శివాజీ ప్రపంచం తలకిందు లవుతుంది. 

          ప్లాట్ పాయింట్ వన్ ఇలా రివర్స్ అయింది. నిజానికి హేపీ గా వున్న ప్లాట్ పాయింట్ వన్ తో,  మిడిల్ కూడా కూతురి కలయిక పరంగా హేపీగా కొనసాగుతుందనీ, సంఘర్షణకి బదులు మిడిల్ కూడా ప్రయోగాత్మకంగా ఇక్కడ హేపీగా కొనసాగబోతోందనీ అన్పించి అత్యంత  ఆసక్తి రేపుతుంది. అలా కలుసుకునీ జీవితాల్ని ఆనందమయం చేసుకున్న తండ్రీ కూతుళ్ళకి  వూహించని విపత్తు ఏదో ఎదురవుతుందనీ ఒక అభిప్రాయం కల్గుతుంది. విపత్తు లేకపోతే ఇది కథగా వుండదు, కమర్షియల్ సినిమాకి పనికి రాని గాథగానే  ముగిసే ప్రమాదముంది.

          అయితే విపత్తు కూతురి మాటల్లోంచే పుట్టింది. శివాజీలో సంఘర్షణ మొదలవుతుంది. తను తాగుడు కోసం పురిటి పిల్లని అమ్మేశాడా? ఇరవై ఏళ్ళనాటి ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఇందులో నాటక నటుడుగా ప్రేమించి పెళ్ళిచేసుకున్నగురువు కూతురు క్యాన్సర్ సోకడంతో,  శివాజీ తన నట వృత్తిని నేరప్రవృత్తిగా మార్చుకుంటాడు. వైద్యం డబ్బుల కోసం మొదటి సారిగా ఒకరిలా నటిస్తూ జైలుకెళ్ళి వస్తాడు. వస్తే భార్య చనిపోయిందని తెలుస్తుంది. ప్రసవించిన కూతుర్ని అనాధాశ్రమం వాళ్ళు తీసికెళ్ళి పోయారని అంటాడు స్నేహితుడు. తాగుబోతు అయిన స్నేహితుడు,  పుట్టిన శివాజీ కూతుర్ని వెయ్యి రూపాయలకి అమ్మేయబోతూంటే అనాధాశ్రమం వాళ్ళు  పట్టుకుని తీసికెళ్ళి పోయారు. ఇదీ విషయం.

          పెద్ద విషయం కాదు. ఆ అనాధాశ్రమం తెలుసుకుని శివాజీ వెళ్లి కూతుర్ని అప్పుడే తెచ్చుకోవచ్చు. ఈ లాజిక్ ని (కామన్ సెన్స్ ని) దాటవేశారు.

          ఈ ఫ్లాష్ బ్యాక్ కూతురు గాయత్రికి శివాజీ పంపిన డైరీలో రివీలవుతుంది. అతడి డైరీ చదువుకున్న ఆమె వెంటనే తండ్రి మీది ద్వేషం తొలగించుకుంటుంది. ఆమె పాయింటాఫ్ వ్యూలో ఒక ఫ్లాష్ కట్ పడుతుంది. అందులో పదేళ్ళ వయసున్నప్పుడు తండ్రి యేడని  అనాధాశ్రమం అతణ్ణి అడుగుతుంది. ఇంకెక్కడి తండ్రీ,  పుట్టగానే తాగుడుకోసం నిన్నమ్మేసి  పోయాడని  అసహ్యభావంతో అంటాడతను. 


           ఇక్కడ ఈ రెండూ గందరగోళంగా వున్నాయి. ఒకటి- తండ్రి పంపిన డైరీ చదవగానే ఆమె  ద్వేషమంతా తొలగిపోవడం. ఆ డైరీలో రాసిందే నిజమని ఎలా నమ్ముతుంది తను? అసలు డైరీ ఎలా రాస్తాడు? ఆ డైరీ లోనే నటుడిగా తన నేరప్రవృత్తి గురించి ఎలా బయట పెట్టుకుంటాడు? దొరికిపోడా? ఇప్పుడు కూతురికి దొరికిపోలేదా? ఒక తప్పు చేయలేదని ఆమెకి చెప్పబోతూ రెండో తప్పుతో దొరికిపోలేదా? అయినా డైరీ చదివిన కూతురుకి ఈ విషయమే పట్టదు. 

          ఇక ఇప్పుడామెకి  పదేళ్ళ వయసులో అనాధాశ్రమం అతనితో కట్ షాట్ పడుతుంది. తన తండ్రి ఏమయ్యాడని అడుగుతుంది. ఇంకెక్కడి తండ్రీ, పుట్టిన నిన్ను తాగుడికి అమ్మేయబోతే పట్టుకున్నాం – అని అసహ్య భావంతో అంటాడతను. ఒక అనాధా శ్రమం నడిపే అతను  అనాధ పిల్ల సందేహం ఇలాగే తీర్చి గాయపరుస్తాడా? జీవితాంతం బాధ పడేలా చేస్తాడా? 

          ఇలాటి అవాస్తవిక, అసహజ చిత్రణలతో, పైపై కథనాలతో చాలా బలహీనపర్చారు. 

దీన్నిసినిమాని సినిమాలాగే చూడాలన్న గొప్ప కొటేషన్ తో సమర్ధించుకో వచ్చు కథకుడు. అతడి విచక్షణకే వదిలెయ్యాలి. సినిమాని సినిమాలాగా చూడడానికి అడ్డగోలుగా రాసి పారేయ్యొచ్చు.

.         ఇలా కూతురికి అపార్ధం కల్గించడమూ (అనాధాశ్రమం అతనితో), ఆ అపార్ధాన్ని తొలగించడ మూ (తండ్రి డైరీతో) ఇలా చాలా ఆషామాషీగా చేసేశాక, ఇక మోహన్ బాబు రెండో పాత్ర గాయత్రీ  పటేల్ అనే విలన్ ఎంట్రీ. ఇక్కడ్నించీ ఫ్యామిలీ డ్రామాగా నడుస్తున్న కథ కాస్తా ఫ్యామిలీతో సంబంధంలేని వేరే థ్రిల్లర్ గా మారిపోతుంది. దీనికైతే ఏ  కామన్ సెన్సూ పట్టించుకోలేదు. పెద్ద మొత్తానికి ఆశపడి గాయత్రీ పటేల్ బదులు అతడిలా నటిస్తూ తను జైలు కెళ్తున్నప్పుడు, అసలు పటేల్ కి పడ్డ శిక్షేంటో తెలుసుకోడా? పటేల్ కి ఉరి శిక్ష పడితే, ఆ విషయం తెలుసుకోకుండా జైలుకెళ్ళి పోయి, ఉరి సమయానికి లబలబలాడడమేనా? లబలబలాడితే ఆడియెన్స్ కేంటి? అది అతడి ఖర్మ, అనుభవించాలి. ఈ అరగంట పాటు దృశ్యాల్లో ఇలాటి కామన్ సెన్సే లేని ట్విస్టు మీద ట్విస్టులెన్నో. శివాజీ తను పటేల్ కాదని చెప్పడానికి ఒక్క ఆధార్ కార్డు చాలు, కూతురితో ఒక్క బ్లడ్ టెస్టు చాలు. ఎందుకీ నసంతా,  ఏదో గొప్ప థ్రిల్లర్ లాగా ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తూ? 

          అసలు అంతకి ముందు జైలు కెళ్ళే ఒక సందర్భంలో,  శివాజీ పృథ్వీలా నటిస్తూ అతడి బదులు జైలు కెలా వెళ్తాడు? పృథ్వీ హైట్ ఎక్కడ?  తన హైట్ ఎక్కడా? పోలీసులు అంత లాలీపాప్ గాళ్ళా? కోర్టుల్ని కూడా ఇలాగే ఏమారుస్తాడు శివాజీ. తను నేరం చేస్తున్నట్టుగానే ఫీల్ కాడు. ఇరవై ఏళ్లుగా ఇలా మారువేషాలతో మోసాలు చేస్తున్నాడని యంత్రంగానికీ తెలీదు. ఇలాగే  ముగుస్తుంది కథ!

          క్రియేటివిటీని ఇంత అడ్డగోలుగా చేసుకుంటూ స్ట్రక్చర్ ని ద్వేషించడం ఎంతవరకు సబబు? ఇది బాగా ఆలోచించుకోవాలి.  స్ట్రక్చర్ లేని క్రియేటివిటీలే 90 శాతం ఫ్లాపులకి కారణం. క్రియేటివిటీ స్ట్రక్చర్ లోకొచ్చినప్పుడు ‘గాయత్రి’ లాంటివి  గాయపడవు. శివాజీకీ, గాయత్రీ పటేల్ కీ మధ్య గాయత్రులు గల్లంతవరు.
.
సికిందర్