రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, జనవరి 2018, గురువారం

587 ; రివ్యూ!

ర్శత్వం: శ్రీరంజని
తారాగణం :  రాజ్ రుణ్, చిత్రా శుక్లా, సితార, ప్రియర్శి దితరులు
సంగీతం :  శ్రీచరణ్ పాకాల,  ఛాయాగ్రణం: ఎల్‌.కె.విజయ్
బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్
విడుదల : జనవరి 14, 2018

***
        రోమాంటిక్ సినిమాల హీరోగా రాజ్ తరుణ్ యువ ప్రేక్షకులకి ఒక క్రేజ్ మొదటి మూడు సినిమాలతో. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావా, కుమారి 21 ఎఫ్ వంటి మూడు రోమాంటిక్కుల తర్వాత రూటు మార్చి మాస్ యాక్షన్ హీరోయిజానికి దిగడంతో, యువప్రేక్షకులు తగ్గిపోయి ఓపెనింగ్స్ లేకుండాపోయాయి. సీతమ్మ అందాలు –రామయ్య సిత్రాలు, ఈడో రకం – ఆడో రకం, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు అనే మాస్ యాక్షన్లతో ఒరిజినల్ ఇమేజిని కోల్పోయాడు. ఈ ప్రభావం మధ్యలో వచ్చిన నాన్నా నేనూ నాబాయ్ ఫ్రెండ్స్ అనే రోమాంటిక్ మీద కూడా పడింది. మళ్ళీ ఇప్పడు తాజాగా ‘రంగులరాట్నం’ అనే రోమాంటిక్ తో వచ్చినా పండక్కి కూడా యువప్రేక్షకుల్లో కదలిక లేదు. అన్నపూర్ణ బ్యానర్, శ్రీరంజని అనే తమిళ కొత్త దర్శకురాలు అనే ఆకర్షణీయ హంగులు సమకూరినా ప్రయోజనం కన్పించడం లేదు. ఇంత మాత్రాన తను పనికిరాకుండా పోయాడని కాదు. యూత్ అప్పీల్ దేనికుంటుందో ఆ సినిమాలు చేస్తే తప్పకుండా పనికొస్తాడు. మొహమాటాలకి యూత్ అప్పీల్ వుండని సినిమాలు నటిస్తే ఎన్నటికీ పూర్వ ప్రాభవం తిరిగి రాదు. ఇప్పుడు ‘రంగులరాట్నం’ కూడా  ఇంకెందుకని కాసుల రాట్నం కాలేక పోయిందో ఈ కింద చూసుకుంటూ వెళ్దాం... 

కథ 
       విష్ణు (రాజ్ తరుణ్) ఓ ఉద్యోగం చేస్తూ తల్లి (సితార)తో వుంటాడు. అతడికి పెళ్లి సంబంధాలు చూస్తూంటుంది తల్లి. ఓ పెళ్ళిలో కీర్తి (చిత్రా శుక్లా) ని చూసి ఇష్టపడతాడు. తల్లికి కూడా ఈమె నచ్చుతుంది. ఇంతలో గుండె పోటుతో చనిపోతుంది. తల్లి మరణంతో విష్ణు విషాదంలో పడిపోతాడు. కీర్తి అతడికి దగ్గరై అతడి ఆలనాపాలనా చూసుకోవడం మొదలెడుతుంది. ఆమె చెప్పే జాగ్రత్తలు, తీసుకునే అతిజగ్రత్తలూ అతణ్ణి విసిగిస్తాయి. దీంతో దూరమైపోతాడు. తర్వాత ఆమెని అపార్ధం చేసుకున్నానని తెలుసుకుని తిరిగి దగ్గరవుతాడు. ఇదీ కథ.

ఎలావుంది కథ 
      ఈ ప్రేమకథ రోమాంటిక్ డ్రామా జానర్ లోకొస్తుంది. తమిళ దర్శకురాలు శ్రీరంజని తొలి ప్రయత్నంగా తెలుగులో అడుగుపెట్టి కెరీర్ ని ప్రారంభిస్తోంది. ఈ నడుస్తున్న శతాబ్దంలో తెలుగులో దర్శకురాళ్ళు కొందరు వచ్చారు. వాళ్ళు తమ స్త్రీ దృక్కోణంలో కథల్ని, పాత్రల్ని చూపించకుండా, పురుష పంథాలోనే పురుషులు తీసినట్టు సినిమాలు తీసేసి తమ జెండర్ అస్తిత్వాన్ని పురుషస్వామ్యానికి తాకట్టు పెట్టేస్తున్నారు. కొందరైతే మాస్ యాక్షన్లు అంటూ మోజు పెంచుకుని బోల్తా కొడుతున్నారు. ప్రేమకథలు, సామాజిక కథలు ఏ కథలు చూసినా పురుష వాసనలతోనే వండి వారుస్తున్నారు. వివాహ భోజనంబులనేవి మాస్ రేంజిలో పురుషులు పాల్పడే  గారడీ వంటకాలు. స్త్రీలు ఇంటి వంట చేసుకోవాలి. దర్శకురాళ్ళు కూడా ప్రేక్షకులకి ఇంటి వంట నోచుకోకుండా  చేయడం దారుణం. స్త్రీ స్పర్శ గల సృజనాత్మకత తెలుగు దర్శకురాళ్ళనుంచి రాకపోవడం చాలా వింత. ఇందుకేనేమో మీడియా మిత్రులు ‘మహిళా దర్శకురాలు’ అని తెగ రాసేస్తూంటారు. ‘మగ దర్శకురాలు’ కూడా వుంటారనేమో. అప్పుడు దర్శకుడు ‘పురుష దర్శకురాలు’ అవుతాడా? దర్శకురాలు మహిళే. అమాయకురాలు మహిళే. మహిళా అమాయకురాలనీ వుండదు. దర్శకురాల్లోనే నూటికి నూరుపాళ్ళూ మూర్తీభవించిన మహిళామణియే ఖచ్చితంగా కొలువుదీరి వుంటుంది. మగవాడు వుండడు. మగ దర్శకురాలుండదు దరిద్రంగా. శ్రీరంజని ‘మహిళా దర్శకురా’లని అన్ని రకాల మీడియాల్లో అందరూ హోరెత్తించుకోవడం అయింది. ఇక రేపు ఇంకొకర్ని  ‘మహిళా నటి’ అని దుమారం రేపడానికి సర్వసన్నద్ధులవుతారు బహుశా ఇప్పట్నించే. డిజిటల్ పలకలతో భాషా స్పృహ ఏముంటుంది. అ ఆలు కూడా రానవసరం లేదు. 

          ఐతే శ్రీరంజని ఇప్పుడు – దర్శకురాలిగా మేల్ టెండెన్సీని పూసుకోకుండా తనదైన జెండర్ ప్రధానమైన దృక్పథంతో కథ తీసుకొచ్చింది. ఒక యువకుడికి ఇటు తల్లితో, అటు ప్రేయసితో వుండే అనుబంధాన్ని అతడి దృక్కోణంలోంచి కాకుండా,  ఆ తల్లీ ప్రేయసుల దృక్కోణంలో చూపాలనుకుంది. అంటే ఇది కథానాయకుడి కథ కాదు, రెండు స్త్రీపాత్రల కథ. వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ విజయం. ఐడియా వరకూ ఈ ఆలోచన  ఆశాజనకంగా కనిపిస్తుంది. ఐడియాని అమల్లో పెట్టేసరికి జనరంజకం కాలేకపోయింది సహజంగానే. స్త్రీ పాత్రల్ని సమర్ధవంతంగా చిత్రించడంలో దర్శకులకి దర్శకురాళ్ళు సాటి రారు. ‘ఫిల్హాల్’ తీసిన మేఘనా గుల్జార్ కూడా. దర్శకుడు సులభంగా స్త్రీ పాత్రలోకి పరకాయప్రవేశం చేసేసి సబ్జెక్టివ్ గా చూస్తాడు, దర్శకురాలు పైపైనే ఆబ్జెక్టివ్ గా చూసి సగటు స్త్రీ అన్పించుకుంటుంది  – స్త్రీకి స్త్రీయే శత్రువనే టాక్ ని నిజం చేస్తున్నట్టు స్త్రీ పాత్రల్ని కిల్ చేస్తుంది. శ్రీ రంజనికూడా ఐడియా విషయంలో చూపినంత జెండర్ దృక్పథాన్ని స్త్రీ పాత్రల విషయానికొచ్చేసరికి వదిలేసింది. దీంతో కొడుకు - తల్లి
- ప్రేయసుల  ముక్కోణం తన జెండర్ దృక్కోణం లేకుండా పోయి, అభాసు అయింది.  ఆమె ఈ రెండో పార్శ్వాన్ని కూడా సగటు స్త్రీ సిండ్రోమ్ లోంచి ఇవతలకొచ్చి జయించగలిగితే, త్వరత్వరగా ఎదగ గల్గుతుంది. దర్శకుల దగ్గర అసిస్టెంట్లుగా చేరకుండా, ప్రూవ్ చేసుకున్న దర్శకురాళ్ళ దగ్గర చేరితే వ్యక్తిత్వమున్న స్త్రీత్వం వచ్చే అవకాశముంది సృజనాత్మకతకి. 

ఎవరెలా చేశారు 
       రాజ్ తరుణ్ కథకాని కథలో నటించడం వల్ల ఈసారి ఆకట్టుకోడు.  పేలవమైన పాత్ర, పేలవమైన సీన్లు అతణ్ణి ఆశక్తుణ్ణి చేశాయి. గోల్ లేని పాసివ్ పాత్రే, ఎందుకంటే ఇది కథానాయకుడి కథ కాదు కాబట్టి.  తల్లిగా నటించిన సితార, ప్రేయసిగా నటించిన హీరోయిన్ చిత్రా శుక్లా ఇద్దరి  కథానాయికల కథ కాబట్టి. రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సిషన్ పొందే పాత్రగా వుండాల్సింది, రొటీన్ లవర్ బాయ్ లక్షణాలతో తప్పుడు పాత్ర చిత్రణ పాలబడ్డంతో - చూసే ప్రేక్షకులకి విసుగు పుట్టించేలా తయారయ్యాడు. రొటీన్ లవర్ బాయ్ అయినప్పుడు గోల్ వుంటుందనీ, గోల్ కోసం సంఘర్షిస్తాడనీ ఎదురు చూస్తారు ప్రేక్షకులు. అంటే కథకి ఇతనే కథానాయకుడనుకునే పరిస్థితి ప్రేక్షకుల కొచ్చింది. అసలు చూపించాల్సిన తల్లీ ప్రేయసుల కథానాయికల పాత్రల్ని (ప్రధాన పాత్రల్ని) వాటి గోల్స్  కోసం ప్రయత్నిస్తున్నట్టు, బలంగా చూపించక పోవడం వల్ల ఈ పరిస్థితేర్పడింది. రాజ్ తరుణ్ నటన యూత్ అప్పీల్ కి,  బాక్సాఫీసు అప్పీల్ కీ దూరంగా  పేలవంగా తయారవడానికి ఇంతకంటే వేరే కారణం లేదు. పాత్ర డీఎన్ఏ ని బట్టి నటనతో ఆకట్టుకోవడం,  ఆకట్టుకోక పోవడం వుంటాయి. రాజ్ తరుణ్ ఆకట్టుకోవాలంటే ఈ పాత్రకి ట్రాన్సిషన్ పొందే పాత్రగా ఇన్నర్  ఇంజనీరింగ్ అవసరం. 

          సితార నటించిన తల్లిపాత్ర కొడుకుని కంటి రెప్పలా చూసుకుంటూ, పెళ్లి చేయాలనీ ప్రయత్నించే పాత్ర. ఫస్టాఫ్ లో ఈమె అర్ధాంతర చావు ఇంకో పేలవమైన మలుపు. మొదటి  ప్రధాన పాత్రగా తను ఏమీ చేయకుండా చనిపోవడం నిరర్ధక పాత్రగా మార్చేసింది. కనీసం చివరి కోరిక, మాటా గీటా ఏమీ వుండవు. ఇది రొటీన్ ఫార్ములాయే అనుకుంటే, ఈమె ఉన్నట్టుండి చనిపోగానే సుదీర్ఘ ఆలాపనతో సృష్టించిన మేలో డ్రామా కూడా పాతదే. పైగా సన్నివేశ బలం లేదు. కనీసం జీవించినంత కాలం ఆమె కొడుకు మీద చూపిన బలమైన ప్రభావం, వేసిన ముద్రా ఏమీ లేవు. అంత కంటి రెప్పలా  చూసుకునే తల్లి ప్రభావం కొడుకు మీద ఏమీ వుండకపోవడం పాత్రచిత్రణ అవదు. ఆమె మరణం అతడి జీవితాన్ని మార్చెయ్యలేదు. అలాగే ఏడుస్తూ వుంటాడు. ఏడుస్తూ వుండడం కథ అవదుగా? ఏం చేయాలో అది చేయడం కథవుతుంది. ఇలాటి పరిస్థితుల్లో ఇలాటి యూత్ కి అది ఇన్ స్పైర్ చేసే కథలా వుంటుంది. ఇందువల్ల బాక్సా ఫీసు అప్పీల్ వస్తుంది. ఏ సీనుకా సీను ఎంతవరకూ ప్రేక్షకులకి అమ్మగలమని ఆలోచించకుండా గుండుగుత్తగా తీసేసి, ఫైనల్ సీనే  రిజల్ట్ నిస్తుందిలే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఈ సినిమాకి ఇదే జరిగింది – చిట్ట చివర ఫైనల్ సీనులో మాత్రమే రిజల్టు చూసుకుని, మొత్తం సినిమా బాగా వచ్చిందని  సంబరపడే తంతు. షూటింగులో ప్రతీ నిమిషం విలువైనదని తాపత్రయపడ్డం టోటల్ పిక్చర్ కాదు.  తీసిన సీన్లు తెర మీద ఒక్కోటి బాక్సాఫీసు నుంచి జారిపోకుండా కూడా చూసుకోవాలి. షూటింగులో ప్రతి నిమిషం కరిగిపోయే ప్రతీ రూపాయీ, తెర మీద ప్రతీ నిమిషం బాక్సాఫీసు నుంచి జారిపోకుండా చూడ్డమే టోటల్ పిక్చర్ చూడ్డం అన్పించుకుంటుంది. ఈ టోటల్ పిక్చర్ రాస్తున్నప్పుడే చూసుకుంటూ వుండాలి. 

        తమిళ దర్శకురాలి తల్లి పాత్ర చిత్రణ బహుశా తమిళనాడులో జయలలిత నుంచి స్ఫూర్తి పొందింది. తనే లేకుండా పోయాకా ఏదెలా పోతే నాకేమని జయలలిత ఒకప్పుడన్న మాటలే నిజం చేసి వెళ్ళిపోయింది. ఓ రాజకీయ వారసత్వ ప్రకటన లేదు, ఆస్తిపాస్తులకి వీలునామా లేదు. రెండూ కుక్కలు చింపిన విస్తరి అయ్యాయి. దర్శకురాలి పాత్ర తల్లి కూడా ఇలాగే వెళ్ళిపోయింది కథని దిక్కూ మొక్కూ లేకుండా చేసేసి. 

          హీరోయిన్ తో ఒకే సీనుంటుంది. హీరోయిన్లో కోడల్ని చూసుకుని మురిసిపోతుంది. హీరోయిన్ వెళ్లిపోతూంటే ఆగమంటుంది. ఆగి ఏంటన్నట్టు చూస్తుంది హీరోయిన్. ఏం లేదంటుంది. హీరోయిన్ వెళ్ళిపోతుంది. అంటే, ఇక్కడ తల్లి చేత ఏం చెప్పించాలో కథకురాలికి తెలియలేదనుకోవాలా? లేక ఆ అవసరాన్ని గుర్తించలేదా? సీను ముగింపులో ఫిల్లర్ కోసం  హీరోయిన్ని ఆగమని చెప్పి, ఏమీ లేదని చెప్పి పంపించేసిందా? చనిపోబోయే పాత్ర తర్వాత కథ నడపబోయే రెండో ప్రధాన పాత్రకి ఏమీ చెప్పదా? ఇలా పొందిక లేకుండా పాత్రచిత్రణలు, సీన్లు ఏ ముక్కకా ముక్కగా వచ్చిపోతూంటాయి. 

          క్యారక్టర్ ఆర్టిస్టులందరూ మంచి నటులే. పాత్రల  అంతర్నిర్మాణాల్ని బట్టి వాళ్ళ నటనలుం టాయి. అందుచేత పాత్ర చిత్రణ ఇలా వున్నాక సితార బాగా నటించ లేదనుకోవడం సబబుకాదు. 

          రెండో ప్రధాన పాత్రలో హీరోయిన్ చిత్రా శుక్లాది పక్కదోవ పట్టిన పాత్ర. ఆమె చూడ్డానికి హోమ్లీగానే వుంది. పాత్ర ప్రవర్తనతో ఇబ్బంది వచ్చింది. పాత్ర ఏ కోవలో వుండాలో ఆ కోవలో వుండుంటే ఆమె నటనతో సెకండాఫ్ ని రంగులరాట్నం చేసేది. ప్రేమించిన వాడి తల్లి చనిపోయింది. బాధలో వున్నాడు. బాధలో వున్నవాడి బాధ దూరం చెయ్యాలా లేక టార్చర్ పెట్టాలా? రెండోదే చేసింది. ప్రేమలో పొసెసివ్  నెస్ వేరు. ప్రేమించిన వాడు ఎక్కడ తనక్కాకుండా పోతాడోననే భయంతో జలగలా పట్టుకుని వుండడం. ప్రేమించిన వాడు చిన్నపిల్లాడై పోయాడని ఆదుపాజ్ఞల్లో వుంచుకుని జాగ్రత్తలు చెప్పడం వేరు. ఇక్కడ తల్లిపోయిన హీరోతో హీరోయిన్ చేసిందిదే. తల్లి కూడా పెట్టని బాధలు పెడుతుంది తన అతిజాగ్రతా ప్రవర్తనా నియమావళితో. దీంతో స్వేచ్ఛ కోల్పోయి ఇంకింత పిచ్చివాడవుతాడు. ఛీ కొడతాడు, దూరమవుతాడు. ఇంకింత బాధలో పడిపోతాడు. ఈ కథలో సమస్య అతను, పరిష్కారం తను (హీరోయిన్) అయినప్పుడు, దీనికి విరుద్ధంగా తనే సమస్యలా ఎలా తయారవుతుంది? ఇది తప్పుడు పాత్రచిత్రణ, తప్పుడు కథనం, పాత్రకి తప్పుడు గోల్ అవుతాయిగా? 

          హాలీవుడ్ లో ఇలాటి కథలు సైకో థెరఫీలా వుంటాయి. సైకోల్ని తయారు చేసేలా వుండవు. హీరోయిన్ ఇలా చేయడానికి కారణం చెపుతూ ఒక ఫ్లాష్ బ్యాక్ వేశారు. ఇందులో చిన్నప్పుడు తండ్రి చనిపోయిన సీను చూస్తుంది (ఫస్టాఫ్ లో హీరో మదర్ మరణం తర్వాత మళ్ళీ ఇక్కడ హీరోయిన్ ఫాదర్ మరణమనే రిపీట్ సీను, రిపీట్ ఆలాపన) దీంతో రేపు ఇంకెవరైనా తన వాళ్ళనుకున్న వాళ్ళు ఇలాగే దూరమవుతారనే భయంతో ఈ  అతిజాగ్రతా తత్త్వం అలవడిందట. ఇది తప్పు. 

          హీరోయిన్ ఇంతగా ప్రేమించినవాడి క్షేమం కోరుకోవడానికి ఆమెకో కారణం వుండాలన్నట్టు ఈ ఫ్లాష్ బ్యాక్ వేయడం, ఆ కారణమేదో  చూపడం  సరికాదు. ప్రియురాలు  ప్రేమించినవాడి క్షేమం కోరుకోవడానికి ప్రేమ తప్ప ఇంకే కారణం వెతుక్కుంటుంది? ప్రేమ కారణం కాకపోవడంతో హీరోయిన్ పాత్ర లేకిగా తయారయ్యింది. సన్నివేశాల్లోంచి ప్రేమ ఔటై అపరిపక్వత రాజ్యమేలింది. మరింత విషాదంగా, బోరుగా  తయారయ్యింది. ఈ కథలో తల్లి చనిపోవడం వరకే విషాదం. ఆ తర్వాత వుండాల్సిన కథనం, డైనమిక్స్  ఆ విషాదం లోంచి బయట పడ్డం గురించి. తల్లిని మించిన ప్రేమతో తల్లిని మరిపించి వుంటే రెండో ప్రధాన పాత్రగా హీరోయిన్ ఈ గోల్ పెట్టుకుని సాధించేది.  తల్లి మరణం ఏ వయసులో వున్నా మగవాడిని ఎక్కువ దెబ్బ తీస్తుంది. ఓ పట్టాన కోలుకోలేడు, నిజమే. కానీ ఆమె ఎక్కడికీ పోలేదు- తన రక్తంలోనే, జీన్స్ లోనే అనుక్షణం శాశ్వతంగా వుంది. ఇలాటి ఒక గోల్ తో హీరోయిన్ స్టాండ్ తీసుకుని అతడికి ఎవేర్ నెస్ కల్గించి వుంటే, ఆమెలోనే అతను తల్లిని చూసుకోవచ్చు. ఆమె రోమాన్సులోనే  అంతర్లీనంగా తల్లి ప్రేమే కన్పించి ప్లాట్ పాయింట్ వన్ కి పరిష్కారం దొరకవచ్చు. 

          రెండు స్త్రీ పాత్రల పరమార్ధమిదే. కానీ రెండూ ఇది గుర్తించకుండా గోల్స్ లేని పాత్రలుగా వృధా అయ్యాయి. చిట్ట చివరికి హీరో ఫైనల్ సీన్లో వెనకటి సీన్లు నెమరేసుకుని,  తల్లితో హీరోయిన్ని పోల్చుకుని, అవునుకదా – మదర్ సెంటిమెంటుతోనే హీరోయిన్ అలా  ప్రవర్తించింది కదాని తప్పు తెలుసుకుంటాడు. జడ్జి మెంట్ కరెక్టే, జడ్జిమెంట్ కి దారితీసిన హీరోయిన్ తీరే  వెగటు. చూపించాల్సిన బూతంతా చూపించేసి, చివర్లో నీతి చెప్పి బయట పడినట్టు వుంది. 

          ప్రియదర్శి కమెడియన్ పాత్ర సోసోగా వుంది. ఇంకా చెప్పుకోదగ్గ పాత్రల్లేవు. సంగీతం, కెమెరా, ప్రొడక్షన్ విలువలు వగైరా నిర్మాతగా నాగార్జున రేంజిలో లేవు. 

చివరికేమిటి 
       ఐడియా కిచ్చిన కథనమలా వుంటే, కథనానికిచ్చిన స్ట్రక్చర్ మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే. సెల్వరాఘవన్ అసిస్టెంట్ గా దర్శకురాలు నేర్చుకున్నదేమిటో అర్ధంగాని పరిస్థితి. ఐడియా ఒక్కటే గొప్పది. ఇద్దరు అతివలు ఒక మగాణ్ణి హేండిల్ చేసే ఐడియా. ఈ ఐడియా విస్తరణ, పాత్ర చిత్రణలు టోటల్ ఫెయిల్యూర్. కథనంలో కొత్త సీన్లు కూడా కనపడవు. ఉదయం హీరో ముసుగు తన్ని నిద్రపోతూంటే తల్లి వచ్చి కొట్టి తిట్టి లేపే సీను, హీరోయిన్ పరిచయం కాక ముందు ఒక వెకిలిదానితో పెళ్లి చూపులు, ఆ పెళ్లి చూపుల్లో పర్సనల్ గా వెళ్లి మాట్లాడుకునే సబ్ సీను, అరగంట దాకా ఎంట్రీ ఇవ్వని హీరోయిన్ని ఓ పెళ్ళిలో చూసి హీరో మనసు పారేసుకునే సీను...ఇలా అరిగిపోయిన టెంప్లెట్ సీన్లే వాడేసింది కొత్త దర్శకురాలు కొత్త సీన్లేమీ ఇవ్వకుండా. 

          ఫస్టాఫ్ అంతా తల్లితో ఒక సీను,  హీరోయిన్ తో ఒక సీను, ప్రియదర్శితో ఒక సీను   వంతు లేసుకుని పూరీ జగన్నాథ్ ఆచారంగా రిపీటవుతూంటాయి. ఇవన్నీ నిస్సారమమైనవే. నిజానికి హీరోయిన్ వచ్చే ముందు అరగంటవరకూ తల్లితో బలమైన ఒక కాంట్రాస్ట్ ఏర్పాటు చేసి, హీరోయిన్ ఎంట్రీతో హీరోకి కొత్త లోకమనట్టుగా గేరు మార్చి ఛేంజోవర్  తీసుకుంటూ- మదర్ కీ హీరోయిన్ కీ  మధ్య  హీరో జీవితాన్ని ఎస్టాబ్లిష్ చేసే కథనాన్ని వాడుతూ పోవాలి. మదర్ – హీరోయిన్ వీళ్ళిద్దరే ప్రధాన పాత్రలన్నట్టుగా చెప్పేయాలి. హీరో కథానాయకుడు కాదని స్పష్టం చేసెయ్యాలి. ఇవేమీ చేయకుండా మదర్ తో అనుబంధాన్నీ, అటు హీరోయిన్ తో రోమాన్స్ నీ పండించకుండా చప్పగా, ప్లాట్ డైనమిక్స్ లేకుండా, సడెన్ గా ఇంటర్వెల్ ముందు మదర్ ని చంపేసి,  ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటు చేశారు. దీనికీ అర్ధంపర్ధం లేదు. 

          ఒక ప్రధాన పాత్ర చనిపోతే వేరే పాత్ర రెండో ప్రధాన పాత్రవుతుంది. మదర్ చనిపోతే హీరోయిన్ రెండో ప్రధాన పాత్రగా కథని చేతిలోకి తీసుకుంది. కానీ మొదటి ప్రధాన పాత్రగా ఫస్టాఫ్ లో మదర్ చేతిలోకి తీసుకున్న కథేమీ లేదు. ‘మనుషులు మారాలి’ లో గానీ, ‘ఎర్రమందారం’ లో గానీ మొదటి ప్రధాన పాత్రలుగా శోభన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ లు చనిపోతే, వీళ్ళ గోల్స్ ని అంది పుచ్చుకుని శారద పాత్ర, యమున పాత్ర  రెండో ప్రధాన పాత్ర పాత్రలుగా కథనందుకుంటాయి. ఇలా ఇవి
హ్యాండ్ ఆఫ్ పాత్రలుగా మొదటి ప్రధాన పాత్రల ఆశయాల్ని  సాధిస్తాయి. ఇదేమీ కాకుండా మదర్, హీరోయిన్ల పాత్రలు అర్ధరహితంగా డిటాచ్డ్ గా వుండి పోయాయి ప్రస్తుత సినిమాలో. చనిపోయిన మదర్ పాత్రకి హీరోయిన్ కి అందించడానికి ఒక ఆశయం  లేకపోవడంతో, హీరోయిన్ ఫ్లాష్ బ్యాకుతో కృత్రిమ గోల్ తవ్విపోసుకుని దాంతో సెకండాఫ్ ని కిష్కింధకాండ చేసింది. ప్రధాన పాత్రల అనుసంధానం మర్చిపోతే ఇంతే. 

          ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మదర్ మరణాన్ని సరీగ్గా చూపించి వుంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే  ప్రమాదం తప్పేది. అన్ని ఎలిమెంట్స్ తో ప్లాట్ పాయింట్ వన్ ని బలంగా ఏర్పాటు చేసి,  అక్కడే ఇక కథ హీరోయిన్ దేనని స్పష్టం చేసేసి వుంటే, ఆతర్వాత సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూగా హీరో రియలైజేషన్ కి అదే చూపించిన,  పైన చెప్పుకున్న ఫైనల్ జడ్జి మెంటు సీను పెట్టుకుంటే,  ఈ కథ స్ట్రక్చర్ లో కొచ్చేది. ఇంటర్వెల్ ముందు వరకూ బిగినింగ్, అక్కడ్నించి సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ వరకూ మిడిల్,  స్పష్టంగా వుం డాల్సిన నిడివితో వుంటూ,  ఇదొక స్క్రీన్ ప్లే అన్పించుకునేది.

          ఇలా కాకుండా ప్లాట్ పాయింట్ వన్ మదర్ మరణం దగ్గర హీరోయిన్ లేకుండా చేసి, హీరోతో ఈ కథ అతడిదేనన్న తప్పుడు అభిప్రాయం కల్గించడంతో- ఈ హీరో కథని కొత్తగా ప్రేమ కథగా చూసే  ప్రయత్నంలో ప్రేక్షకులు – ఒక మలుపు కోసం చూడ్డం మొదలెడతారు. చిట్టచివరి ఫైనల్ సీనుకి ఐదు నిమిషాల ముందు,  హీరోయిన్ తో హీరో విడిపోవడమే మలుపనుకుని భ్రమిస్తారు. ఇంతసేపూ  సహనపరీక్ష పెట్టారని తిట్టుకుంటారు. ప్రధాన మలుపు అప్పుడు రావడంతో,  అదే  ప్లాట్ పాయింట్ వన్ అయింది ప్రేమ కథకి. అప్పుడు మిడిల్ ప్రారంభమయింది ప్రేమ కథకి. ఐదు నిమిషాల్లో హీరోకి రియలైజేషన్ అవడంతో ప్లాట్ పాయింట్ టూ వచ్చేసి  అంతలోనే పిసరంత ఈ మిడిల్ కూడా  ముగిసిపోయింది. ఇలా ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయింది హీరో ప్రేమకథకి. 

          కానీ ఈ కథ హీరో ప్రేమ కథ కాదు, హీరోతో ఇద్దరు అతివల ఆరాటపు కథ. ఈ కథ ఇంటర్వెల్ కి ముందే ఒక అతివ అయిన మదర్ మరణంతో ప్రారంభమయ్యింది. కానీ అక్కడ్నించీ సెకండాఫ్ లో ఫ్రెష్ గా హీరో  ప్రేమ కథ ప్రారంభమయ్యిందన్నట్టు నడపడంతో,  ఈ ప్రేమ కథకి క్లయిమాక్స్ ముందు ప్లాట్ పాయింట్ వన్ వచ్చి  సహన పరీక్ష అయింది. ఇద్దరు అతివల కథ అనే ఏకసూత్రత వదిలెయ్యడంతో స్క్రీన్ ప్లే మధ్యకి ఫ్రాక్చర్ అయింది, సెకండాఫ్ సిండ్రోమ్ లో పడింది, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయింది. ఒకటని కాదు, గందరగోళంగా ఎన్నో విప్పలేని చిక్కు ముళ్ళేసుకుంది అనుభవమున్న దర్శకుడి శిష్యురాలు. మహిళా శిష్యురాలు అని రాసుకుంటారేమో రాసుకోవచ్చు. లేడీ మహిళా స్త్రీ దర్శకురాలని కూడా నిరభ్యంతరంగా రాసుకోవచ్చు. మనకే ఇంత కన్ఫ్యూజన్ వుంటే తనేమిటో ఆమెకెంత కన్ఫ్యూజన్ వుంటుంది. ఆమె మంచి ‘మహిళా చిత్రాల దర్శకురాలు’ కావాలని కోరుకుందాం.

సికిందర్



         






         













         






















16, జనవరి 2018, మంగళవారం

586 : సందేహాలు - సమాధానాలు



‘అజ్ఞాతవాసి’  పైన పాతిక ప్రశ్న లొచ్చాయి. కథా కథనాలు, పాత్ర చిత్రణలు వగైరాల గురించి, పండగ సినిమాకి ఇంతకంటే ఎక్కువ క్వాలిటీ అవసరం లేదనడం దాని గురించి, పండగ అని చెప్పి ప్రేక్షకులు ఎలాటి సినిమానైనా చూసేస్తారనడం దాని గురించి, డబ్బు గడిస్తే కళకి దూరమవుతారనడం దాని గురించీ ... ఇలా ప్రశ్నలొచ్చాయి. కొన్ని ఘాటుగానే వచ్చాయి. విడివిడిగా వాటికి సమాధానమివ్వడంకంటే,  వచ్చిన వాటిని పై 4 వర్గాలుగా విడగొట్టి,  సమాధానమిస్తే సరిపోతుందని భావించాం. 

       మొదట కథాకథాలు, పాత్ర చిత్రణలు : స్క్రీన్ ప్లే సంగతులు అడిగారు. అవతల కోడి పందాలు జరుగుతూంటే, ఈ కథ కాపీ కథ అని ప్రపంచం మొత్తం ఇటు టర్న్ అయి కోడై కూస్తున్నాక,  ఇంకా దీన్ని విశ్లేషించుకోవడం హాస్యాస్పదం. చేసిన కాపీ చర్యని ఆమోదించి నట్టవుతుంది. అందుకనే స్క్రీన్ ప్లే సంగతులు జోలికి పోలేదు, పోదల్చుకోలేదు. అంతేగాకుండా, ఈ మధ్య టెంప్లెట్ సినిమాల స్క్రీన్ ప్లే సంగతుల జోలికి మనం పోవడం లేదు. ఏముంటుంది వాటి గురించి ఇంకా రాయడానికి. అవే రాతలు రాయడం, తెలిసిన అవే అవలక్షణాలు  పాఠకులు చదువుకోవడం అర్ధం లేని వ్యవహారం. ఒక క్రిమినల్ యాక్టివిటీ, హీరో ఫైట్, ఆ విజయంతో ఒక గ్రూప్ సాంగ్, హీరోయిన్ తో లవ్ ట్రాక్, ఇక టీజింగ్ సాంగ్, హీరోయిన్ తో లవ్ ట్రాక్ కొనసాగింపు, హీరోయిన్ లవ్ లో పడగానే ఒక డ్యూయెట్, ఇలా మూడు పాటల కోటా పూర్తయ్యాక విలన్ ఎంట్రీ, విలన్తో ఇంటర్వెల్ సీను, ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ సంగతి వదిలేసి విలన్ తో పోరాటం, బ్లాక్ కాస్ట్యూమ్స్ వేసుకుని కొండ కోనల్లో హీరోయిన్ తో ఒక మెలోడీ సాంగ్, విలన్తో పోరాటం, మరో డ్యూయెట్, విలన్ తో మళ్ళీ పోరాటం, జానపద డ్రెస్సు వేసుకుని హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్, విలన్ తో క్లయిమాక్స్....ఈ విధంగా ఒక నాటకం వేస్తున్నట్టుగా టెంప్లెట్ లో వుంటున్న అవే స్టార్ సినిమాల గురించి విశ్లేషణలు దేనికి. 

          హిట్టయినా, ఫ్లాపయినా  ఎప్పుడో ఒక ‘హలో’ లాంటి టెంప్లెట్టేతర సినిమాల గురించి మాట్లాడుకోవచ్చు. ఎంతో కొంత వాటిలో నేర్చుకోవాల్సిన కొత్త సంగతులుంటాయి. ఒకే టెంప్లెట్ లో వుండే స్టార్ సినిమాల్లోంచి ఏం నేర్చుకుంటారు రైటర్లు, డైరెక్టర్లు. అందుకే రచన, దర్శకత్వ ప్రయత్నాల్లో వుంటున్న వాళ్లకి టెంప్లెట్ సినిమాలు చూడవద్దనే ఈ వ్యాసకర్త చెప్తూం టాడు. చూసి చెడిపోవడం తప్ప ఉపయోగం లేదు. ఇలాగే  తీసే మోజుంటే చూసుకోవచ్చు.

          ఇలా కాపీ కథ ‘అజ్ఞాతవాసి’ కూడా టెంప్లెట్ సినిమానే. ఇది కాపీ చేసి వుండకపో
యినా, టెంప్లెట్ సినిమా కాబట్టి దీని స్క్రీన్ ప్లే సంగతులు అప్పుడూ అవసరముండక పోయేవి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. టాప్  దర్శకులైనంత మాత్రాన వాళ్ళ సినిమాలతో భావిదర్శకులకి మార్గదర్శకులవ్వాలని లేదు. ఇన్ స్పైర్ చేయాలనీ లేదు. ఆ రోజులెప్పుడో పోయాయి. టెంప్లెట్ డైరెక్టర్లు వర్ధమాన డైరెక్టర్లు నేర్చుకోవడానికి కొత్త విషయాలేమీ ఇవ్వరు – ఉమ్మడి మూస తప్ప, సమిష్టి వేస్ట్ తప్ప. 

          ఐతే కాపీ ఐనప్పటికీ దర్శకుడు త్రివిక్రమ్ ని సంప్రదించాలనుకున్నాడు ఈ వ్యాసకర్త. సంప్రదించి ఈ పాటి టాలీవుడ్ లోనే దొరికే  రొటీన్ పాయింటుని ఎక్కడో పరాయిదేశం నుంచి ఎందుకు స్వీకరించాల్సి  వచ్చిందో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ ఆయన గురించి  తెలిసిందే. తనేం ఏం రాస్తారో,  ఏం తీస్తారో ఎవరికీ  తెలియనివ్వరు. ఎవరైనా జోక్యం చేసుకున్నా, అలాకాదు ఇలాగని చెప్పినా సహించరు. స్టోరీ సిట్టింగ్స్, డిస్కషన్స్ ఏవీ వుండవు. తన వర్క్ గురించి ఎవర్నీ అడగనివ్వరు. కాబట్టి సంప్రదించే ప్రయత్నం వృధా అనుకుని వూరుకోవాల్సి వచ్చింది. 

          కానీ ఒక సీనియర్ కో- డైరెక్టర్ చెప్పిన ప్రకారం, సర్కిల్స్ లో ఏమనుకుంటున్నారంటే, పవన్ – త్రివిక్రమ్ ఇద్దరూ పెద్ద తప్పు చేశారని. ఇప్పుడు పవన్ రాజకీయ ఆకాంక్షలతో ప్రజల్లో ఆసక్తి రేపుతున్నప్పుడు, రివర్స్ లో మళ్ళీ అవే నడుం వూపడాలు, అమ్మాయిలతో అచిబుచ్చి లాడుకోవడాలు చూపించి ఘోరమైన తప్పు చేశారని. ఇలాటి రాజకీయ ప్రవేశ సందర్భంలో ఎన్టీఆర్ ఎలాటి సినిమాలతో ప్రజల్లోకి వెళ్ళారో గుర్తు చేసుకోవాలన్నారు. 

          2. పండగ సినిమాకి ఇంతకంటే ఎక్కువ క్వాలిటీ అవసరం లేదని రివ్యూలో రాయడం గురించి : చూసిన టెంప్లెట్ సినిమాలే మళ్ళీ చూసి ప్రేక్షకులు హిట్ చేస్తున్నప్పుడు, పండగ సినిమా అదే క్వాలిటీలో వుంటే ఎందుకు చూడరు. పండగ సినిమాకి క్వాలిటీ అక్కర్లేదని పనిగట్టుకుని ఎవరూ నాసి సినిమాలు తీయరు. రొటీన్ గా తీస్తున్న సినిమాలే పండక్కీ  వస్తాయి. ఇవి ఇతర రోజుల్లో ఆడవచ్చు, ఆడకపోవచ్చు. కానీ పండగ రోజులు వేరు. పండక్కి విడుదలైన పెద్ద సినిమాలు చూడ్డం సరదా. ఆ మూడ్ లో ఇంకా ఎక్కువ మంది చూస్తారు. కాబట్టి క్వాలిటీ లేకపోయినా ఆడేస్తాయి. అయితే ‘అజ్ఞాతవాసి’  రెండో రోజుకే పడిపోయింది. ఎక్కడ? ఆన్ లైన్ బుకింగ్స్ లేని సెంటర్లలో. ఆన్ లైన్ బుకింగ్స్  వున్న సెంటర్లలో నాల్గు రోజులకి అన్ని ఆటలూ హౌస్ ఫుల్స్ అయిపోయాయి. లేని చోట్ల సినిమా దెబ్బ తింది. అయితే ఒక వూరట ఏమిటంటే, 26 వ తేదీ వరకూ కొత్త సినిమాల్లేవు. ఈ పదిరోజులు ‘అజ్ఞాతవాసి’,  ‘జై సింహా’ లే చూడాలి. ఐనప్పటికీ నష్టమే తప్పకపోవచ్చు. విషయమేమిటంటే, ‘అజ్ఞాతవాసి’ కి నూట ఇరవై కోట్ల బడ్జెట్ ఎవరు పెట్టమన్నారు. నూట యాభై కోట్లకి బయ్యర్ల మీద భారం ఎవరు వేయమన్నారు. నూట ఇరవై కోట్లతో నిజానికి ఎలాటి సినిమా అందించవచ్చు? గ్రాఫిక్స్ తో అద్భుతమైన ఫాంటసీ తీసి అలరించవచ్చు. రొటీన్ పాత మూస సినిమాకి ఇంత బడ్జెట్ దేనికి? ఇందులో సగం హీరో, దర్శకుడూ తీసుకోవడం దేనికి? వాళ్ళు పండగ చేసుకుంటే సరిపోయిందా? 

          క్వాలిటీ లేకపోయినా పండగ సినిమా అని చూస్తారు గానీ, ఓవర్ బడ్జెట్ చేసుకుంటే లేని ప్రేక్షకులు ఎక్కడ్నించి తెచ్చి బాక్సాఫీసు నింపుతారు. అత్యధిక ధరకి కొన్న ఓవర్సీస్ లో కూడా ఇంకా నాల్గు కోట్ల లోటుతో వుంది. 

          పండగ సినిమా ఎలా వున్నా అడేస్తుందని అనడం క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని అనడమే, ఓవర్ బడ్జెట్ ని కాదు. క్వాలిటీ అంతంత మాత్రంగా వున్న, ‘జైసింహా’ కి ఓవర్ బడ్జెట్ బాధ లేదు. ఇది ‘ఏ’ సెంటర్స్ లో ఆడకపోయినా బి, సి సెంటర్స్ లో ఆడేస్తోంది. 26 వరకూ దీనికి ఆడిందే ఆట.

          3. పండగ అని చెప్పి ప్రేక్షకులు ఎలాటి సినిమానైనా చూసేస్తారని రివ్యూలో రాయడం గురించి : 10 కోట్ల తెలుగు జనాభాలో 9 కోట్ల మంది అసలు సినిమాలే చూడక పోవచ్చు. మిగిలిన కోటి మందిలోనే చూసుకోవాలి. ఈ కోటిలో ఫ్లాప్ టాక్ వచ్చిందని, ఎలాపడితే అలా  తీస్తే ఎవడు చూస్తాడని 50 లక్షల మంది ఆత్మగౌరవానికి పోయి చూడకపోయినా, 50 కోట్లు కలెక్షన్లు వస్తున్నాయిగా.  అంటే మిగిలిన  50 లక్షల మంది ఆత్మగౌరవం చంపుకుని చూస్తున్నట్టేగా.
ఒక పేరు రాయని పాఠకుడు ఇలా తెలిపారు : సామాన్య జనానికి కావలసింది ఎంటర్ టైన్మెంట్. వాళ్లకి రివ్యూలతో పని లేదు. వాళ్ళు పండగ హిట్ ఇచ్చేస్తారు లెండి పవన్ కళ్యాణ్ కి –అని.

          4. డబ్బు గడిస్తే కళకి దూరమవుతారంటూ రివ్యూలో రాయడం గురించి : దీనికి అంత బాధపడిపోవడమెందుకో అర్ధం కాదు. అందరూ ఇంతేనని రాయలేదు. అందరూ వందల కోట్లు గడించిన రాజూ హిరానీలూ,  రాజమౌళీలూ కాలేరని రాశాం. వాళ్లకి డబ్బు డబ్బే, కళ కళే. డబ్బు సుఖం మరిగి ఎలా తీసినా  నడిచిపోతుందనుకోరు. ఇలా స్థితప్రజ్ఞులు కాని వాళ్ళు, స్టోరీ డిస్కషన్స్ చేస్తూంటే వచ్చే డబ్బుతో ఏ కారు కొనాలి, ఫలానా కారు బాగా లేదట, ఎవర్ని సంప్రదించాలి – లక్ష్మి (అంటే వాళ్ళావిడ) – టీవీలో వస్తున్న హోండా జాజ్ కొందామంటోందే, కొందామా? - ఇలా డిస్కషన్స్ లో అబ్సెంట్ మైండెడ్ అయిపోతూంటే ఇంకేం కళా ప్రదర్శన వుంటుంది.


సికిందర్



           
           




13, జనవరి 2018, శనివారం

585 : స్క్రీన్ ప్లే సంగతులు


  
మిళనాడు సేలంలోని మోడరన్ థియేటర్స్ లిమిటెడ్ పేరు  తెలియని వాళ్ళుండరు. దీని అధినేత రామప్ప సుందరం తండ్రి ప్రవేశ పెట్టిన  లో-బడ్జెట్ సినిమాల మేకింగ్ ని తు. . తప్పక పాటించిన వాడు.  సీనియర్ సుందరం (1907-63) రచయితల్ని సంస్థకి గొప్ప ఎస్సెట్స్ గా పరిగణించిఉద్యోగ ప్రాతిపదికన నియమిం
చుకుని
రాయించుకునే వాడు. రచయితల్లో కరుణానిధితో మొదలుకొని భారతీ దాసన్ఆశై తంబీల వరకూ ఎందరో వున్నారు. అతను తన చిన్న తరహా సినిమాలకంటూ కొన్ని నిర్దిష్ట ప్రమాణాల్ని స్థిరీకరించాడు. సూటిగా స్పష్టంగా ఉండే కథపరుగులెత్తే కథనంషార్ప్ టేకింగ్సూపర్ ఫాస్ట్ యాక్షన్ సీన్స్క్యాచీ సంగీతంనృత్యాలూ హాస్యం వగైరా. ఇలా తండ్రి సాంప్రదాయాన్నే తుదివరకూ కొనసాగించిన జూనియర్  సుందరం కూడాతనెలా సక్సెసయ్యాడో చెప్పడానికి ఎస్వీ రంగారావుని రౌడీగా చూపిస్తూ ‘మొనగాళ్ళకి మొనగాడు’, గుమ్మడి ని విలన్ గా  చేసి ‘నేనూ మనిషినే’ …రెండు విజయవంతమైన ప్రయోగాలూ  చాలు!  
           మల్లీశ్వరి చూద్దాం : మల్లీశ్వరి’ చరిత్రకి కల్పనని జోడించిన అపురూప సంగీతభరిత ప్రేమ కథగా పండిత పామరులందర్నీ అలరిస్తోంది నేటికీ. మరో కీర్తి కూడా దీని సొంతమైంది. స్క్రీన్ ప్లే పరంగా  అతికొద్ది పాత క్లాసిక్స్ లాగే ఇది కూడా ఒక పాఠ్యాంశమవుతుందని గుర్తించారు. అయితే పాఠ్యాంశాన్ని ఎవరెంత తమ తమ సినిమాల్లో వినియోగించుకున్నారో తెలీదు గానీఇప్పుడు మాత్రం సినిమాలు పూర్తిగా రూపు రేఖలు మార్చుకుంటున్న కాలంలో –కనీసం చిన్న సినిమాలకి సంబంధించి – ఒక ప్రత్యామ్నాయ స్క్రీన్ ప్లే నమూనా అవసరం ఎంతైనా వుంది. అవసరాన్ని ‘మల్లీశ్వరి’ మహాద్భుతంగా తీర్చగలదని బాక్సాఫీసుని గుద్ది మరీ చెప్పొచ్చు.

          ఓంకారలవ్ ఆజ్ కల్లండన్ డ్రీమ్స్ లాంటి హిందీ  సినిమాల్ని చూస్తే ఒక మార్పు కన్పిస్తుంది. వీటిలో గజినీవాంటెడ్ లలో లాంటి రొటీన్ మసాలా విలన్లు కన్పించరు. హిందీ మల్టీప్లెక్స్ఓవర్సీస్ ప్రేక్షకులు ఇప్పుడు సినిమాల్ని కాలక్షేప బఠానీల కన్నా తేలిగ్గా తీసుకోవడంతోపై మూడు చిత్రాల్లో కేవలం పరిస్థితులుపాత్రల మనస్తత్వాలు అనే రెండు ఎలిమెంట్స్ మాత్రమే కథలకి విలన్లుగా కన్పిస్తున్నాయి. ఇవే వాటి విజయాలకి సరిపోతున్నాయి.  

         
ఇదే ఇప్పుడు గనుక తెలుగు సినిమాల్లోనూ జరిగితేప్రేమ కథల్లో కూడా విలన్ తో పొడిపించు కోవడాలురక్తాలు పారించు కోవడాలూ ఇక వుండవు. అసలు విలన్ పాత్రే వుండదు. ‘మల్లీశ్వరి’ కొస్తే, చరిత్ర ప్రకారం రాణివాసంలో పడతులకేసి పరాయి మగాడు కన్నెత్తి చూస్తే శిరఛ్ఛేదం తప్పదు. అంటే అంటే నాగరాజు పాత్ర తల తెగిపడే పరిస్థితి అన్నమాట. ఇక్కడే స్క్రీన్ ప్లే లో విలన్ పాత్ర ఉనికిని శుభ్రంగా చేరిపేస్తోందీ సినిమా. మరి విలన్ పాత్ర లేకపోతే కథెలా నడవాలినాగరాజు ఆడిన వేళాకోళమే అతడి పాలిట విలన్ అవుతుంది ఈ కథలో. తెర మీద నడిచే సినిమా అంతా కూడా మన మానసిక ప్రపంచంలోని భావోద్వేగాల సమాహారమే అనుకుంటే – అంటే మన సబ్ కాన్షస్ మైండ్ తో కాన్షస్ మైండ్ ఆడే ఆట!  కచ్చితమైన స్క్రీన్న్ ప్లే పరిభాషలో చెప్పుకోవాలంటేసినిమా కథని సినిమాకథ అనరు. స్టోరీ మైండ్ అంటారు. దృష్టితోనే స్క్రీన్ ప్లే ని నిర్వచిస్తారు.

         
స్టోరీ మైండ్ లో నాగరాజు కాన్షస్ మైండ్ లాంటి వాడు. అంటే ఇగో అన్నమాట. తన ఇగో తన సబ్ కాన్షస్ మైండ్ తో,  లేదా అంతరంగంతో చెలగాట మాడుతుంది ఈ కథలో ఒక వేళాకోళం చేసేసి. మరి అంతరంగానికి తెర మీద కన్పించే భౌతిక రూపం ఎవరు దేవరాయాలి పాత్రే. దీంతోనే తలపడాలి తను, ఇక వేరే విలన్ అవసరం లేదు!

***
    సహజత్వానికి దగ్గరగా తీసికెళ్ళిన విషాదభరిత సినిమా ‘మనుషులు మారాలి’.  అయితే మరీ ఆర్ట్ సినిమా లాంటి సహజత్వంతో కాకకాస్త నాటకీయతచలం- కెవి చలం- రమాప్రభలతో ఇంకాస్త హాస్యం, మంచి పాటలు, ఇంకా చురకత్తి లాంటి నాగభూషణం చెణుకులతో- ఇంకా ఇతర మసాలా దినుసులూ  దట్టించిఅన్ని వర్గాల ప్రేక్షకులూ బ్రహ్మ రధం పట్టేలా తీశారు. పైగా బ్లాక్ అండ్ వైట్ లో చాలా మంచి షాట్లు తీశారు దర్శకుడు వి. మధుసూదన రావు.  ఇందులో సృజనాత్మకత ఏమిటంటే, ఒక విశిష్ట శిల్పం స్క్రీన్ ప్లే కి కన్పిస్తుంది. కథ పాత్రల చేతులు మారుతూ పోతూంటుంది. అసలు ట్రాజడీల్లో కథే పాత్రల్ని నడిపిస్తుంది. ట్రాజడీల్లో పాత్రలు గొప్ప కాదుఅవి బలిపశువులు. అప్పుడే ట్రాజడీ. కాబట్టి ట్రాజడీల్ని పాత్రలు నడపవు. కథే  పాసివ్ పాత్రల్ని నడిపిస్తుంది. ‘దేవదాసు’ తీసుకున్నా, ‘శంకరాభరణం’  తీసుకున్నా ఇంతే. అలా ‘మనుషులు మారాలి’  గుమ్మడి ట్రాకుతో ప్రారంభమౌతుంది. తర్వాత శారద తర్వాత శోభన్ఇంకా తర్వాత తిరిగి శారదఆఖరికి పిల్లలూ.. ఇలా అధ్యాయాల వారీగా అధ్యాయానికా అధ్యాయం విస్పష్ట  విభజన జరిగిన ట్రాకులతో నడుస్తుంది. ఇబ్బందిపడకుండా కథని ఫాలో అవడాన్ని సులభతరం చేసింది విధానం. కథలు చెప్పడం లో గ్రేట్ మాస్టర్లు కాలంలోనే వున్నారు.

          సెకండాఫ్ లోచనిపోయే శోభన్ పాత్ర హేండాఫ్ పాత్రలా వుంటుంది. అంటేకథలో తను చేయాల్సిన కార్యం ముగించుకుని రెపరెపలాడే కథ అనే పతాకాన్నిరెండో ముఖ్య పాత్రకి అప్పగించి  తను నిష్క్రమించడ మన్నమాట. ఇలా శోభన్ నుంచి   పతాకాన్ని అందుకున్న శారద,  దాంతో ముగింపు దిశగా సాగిపోతారు. ‘రాబోయే కష్టాలకి భయపడి రావాల్సిన హక్కుల్ని వదులుకోవడం పిరికితనం’ అని శోభన్ సిద్ధాంతంసమ్మె చేస్తాడు, వాళ్ళు లాకౌట్ ప్రకటిస్తే నిరాహార దీక్ష చేస్తాడు, ప్రభుత్వమే పూనుకుని  ఫ్యాక్టరీ తెరిపిస్తూంటే నిస్సహాయుడై పోతాడు, లంచం ఎరజూపితే తిప్పికొడతాడు, రాత్రి యాజమాన్యం పంపిన గూండాల చేతిలో హతమైపోతాడు.

         
ఒక్క యంత్రాలు తెచ్చి పెట్టుకుని నాగభూషణం సృష్టించిన పరిస్థితి ఇది. యంత్రాలు మంచివేవాటితో యాజమాన్యాల వైఖరే ప్రశ్నార్ధకమవుతోంది. మహాభారతంలో దుర్యోధనుడుకర్ణుడుయుధిష్టరుడుధృతరాష్ట్రుడుఅశ్వత్థామ లాంటి వాళ్ళందరూ కలిసేవాల్ స్ట్రీట్ ని కుప్ప కూల్చిపెట్టుబడిదారీ వ్యవస్థని నేలకు దించారని ఆర్ధిక నిపుణుడుకాలమిస్టు గురుచరణ్ దాస్ ఒక  ఆర్టికల్ రాశారు. సినిమాలో కూడా నాగభూషణం దుర్యోధనుడైతేరావికొండలరావు యుధిష్టరుడుహరనాథ్ కర్ణుడు లాంటి వాళ్ళే. ముగ్గురి నిర్వాకమే కార్మికుల ప్రాణాల మీదికి తెచ్చింది- నాటికైనా సినిమా హెచ్చరికకనువిప్పు.


***
      నాటకాల రాయుడు’లో 
ఆద్యంతం నాగభూషణం చాలా యాక్టివ్ గాచలాకీగా రక్తి కట్టించే  నవ్వుల ప్రపంచంలో తీరని విషాదం కూడా వుందినాగభూషణం అతడి కుటుంబపు పరిస్థితుల అనులోమవిలోమ సంబంధంరేఖా గణితం  సినిమా కథా కథనాలకి బలమైన వెన్నెముక గా నిలుస్తాయిఎలాగంటే అతనెక్కడో మహా నగరంలో పైపైకి ఎదుగుతూ వుంటేఅటు వూళ్ళో కుటుంబం నానాటికీ దిగజారి పోతూ వుంటుందితను చాలా చాలా గొప్ప వాడైపోయేసరికి కుటుంబంలో  మరణం సంభవించిఇంకో జననం తో ముక్కలైభిక్షాటన చేసే దౌర్భాగ్యంఇప్పటి సినిమాల్లో కొరవడిన కరకు వాస్తవ జీవిత మంతా ఇందులో జడలు విప్పుకుంటుంది.   తల్లి ఆశీర్వాద బలంతోనే  తానిలా గొప్ప వాణ్ణయి పోయాననుకుని మురిసిపోతాడు. తల్లి ఎప్పుడో గతించిన విషయం కూడా తెలీదు! కుటుంబంలో పెళ్ళి శుభకార్యానికి  డబ్బెప్పుడూ నిలవదు. మొదటిసారి డబ్బు దొంగల పాలవగానేఅంతవరకూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చిన కుటుంబం ఒక్కసారి భగ్గుమనేస్తుంది. కలలో కూడా ఊహించని కటువైన మాటలు పేలతాయి వాళ్ళ మధ్య. పరస్పర దూషణలుదెప్పి పొడుపులు తనకి కూడా తగిలి కుమిలికుమిలి పోతుందా పెళ్లి కున్నఅమ్మాయి. దర్శకుడు సంజీవి దృశ్యాన్ని నాగయ్యహేమలతసత్యనారాయణఅనిత లతో అత్యంత బలంగా సృష్టించాడు. సినిమాకి ఇదే హైలైట్.

***
         ‘బందిపోటు’ కొస్తే, అనగనగా గాంధార రాజ్యంలో సత్యసేన భూపతి అనే అశక్తుడైన మహారాజు. మందారమాల అనే మహా అహంకారియైన కూతురు. శూరసింహుడనే దుష్ట సేనాపతి. ఇతను రాజుగారి బావమరిది కూడా. రాజ్యం మీదా రాజకన్య మీదా కన్నేసి రాజు గార్ని బద్నాం చేస్తూంటాడు. పంట లెత్తుకుపోవడంబల్లేలకి పసి పిల్లల్ని మిడుతల్లా గుచ్చి ఆనందించడం, ఆడవాళ్ళని చెరచడం, మగవాళ్ళని చంపడం వంటి అకృత్యాలతో రాజుకి చాలా చెడ్డ పేరు తెస్తూంటాడు.అసహాయ శూరుడనే వాడు ఇతడి లేటెస్ట్ బాధితుడు. ఇతను ముసుగు దొంగలా ఖజానాని దోచి పేదలకి పంచి పెడుతూంటాడు. కీచక రాజభటుల్ని వధిస్తూంటాడు. అవకాశంతో  శూర సింహుడు  తన దురాగతాల్ని ఇతడికే అంటగట్టి, రాజుకి ఫిర్యాదు చేస్తూంటాడు. ఒకసారి నరసింహ అనే యువ రైతు అసహాయ శూరుడ్ని అటకాయిస్తే, ఇతను తన చిన్నాన్నే అని తెలిసిపోతుంది. అటు రాజుకి కూడా రహస్యం తెలిసిపోయి, అసహాయ శూరుడ్ని విచారణకి తన ఎదుట ప్రవేశ పెట్టాల్సిందిగా అతడి అన్న ధర్మ నాయకుణ్ణి ఆదేశిస్తాడు

         ఈలోపు నిజాలు బయట పడకూడదని శూర సింహుడు అసహాయ శూరుడ్ని చంపించేస్తాడు. అఘాయిత్యానికి గుండె పగిలి చస్తాడు ధర్మనాయకుడు. కుటుంబంలో ఒకేసారి ఇలా ఉత్పాతాలకి నరసింహ ఖిన్నుడై, తేరుకుని శూర సింహుడి మీద పగబడ్తాడు.

          అరగంట లోపే సెటప్ చేసిన కథా ప్రారంభం (స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగం) చాలా పకడ్బందీ స్క్రిప్టింగ్ ప్రణాళిక అనొచ్చు. సెటప్ డైనమిక్స్ కి భాగం వరకూ కత్తిరించి రిఫరెన్స్ గా పెట్టుకోవచ్చు ఆసక్తి వున్న సినిమా రచయితలెవరైనా. చాలా అందమైన దృశ్య మాలిక ఇది. జానపద సినిమాలు ఉత్త నేలబారువి అనేవాళ్ళకి చెంప పెట్టు సృజనాత్మకత ఇది. ఇక్కడి దాకా కథని, పాత్రల్ని పరిచయం చేసిన తీరూ, మల్చిన తీరూ, సమస్యని స్థాపించి (ప్లాట్ పాయింట్ వన్) కథానాయకుడ్ని కార్యోన్ముఖుడ్ని చేసిన పద్ధతీఅదీ కేవలం అరగంట సమయంలో క్రియేటివ్ ఛాలెంజియే అనాలి మూడో తరగతి వరకే చదివిన విఠలాచార్య నుంచి!!

సికిందర్